మూడు రాజధానుల కేసులో సీఎం జగన్ తో పాటు ఇద్దరు మంత్రులకు హైకోర్టు నోటీసులు 

సీఎం జగన్ మూడు రాజధానుల ఆలోచన ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ ఏపీ సర్కార్ ఈ విషయంలో అడుగు ముందుకు వేయడం అటుంచి.. రోజూ తన పరువును పోగొట్టుకుంటోంది. తాజాగా మూడు రాజధానులకు సంబంధించిన కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఊహించని షాకిచ్చింది. ఈ కేసులో ఏకంగా సీఎం జగన్ తో పాటు మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది.    ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి తరలిస్తోందంటూ ఆ ప్రాంత రైతులు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక లాగా, అధికారంలోకి రాగానే మరో లాగా జగన్ మాట మార్చారని పిటిషన్ లో రైతులు పేర్కొన్నారు. దీని పై ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఇతర పార్టీలపై కూడా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇదే విషయం పై హైకోర్టులో ఇతరులు కూడా పిటిషన్లు దాఖలు చేసారు. ఈ పిటిషన్ల పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ మొత్తం పిటిషన్లన్నిటికి కలిపి ఏపీ ప్రభుత్వం కేవలం ఒక్క కౌంటర్ ను మాత్రమే దాఖలు చేయడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా ప్రతి పిటిషన్ కు ఒక కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే కేసుకు సంబంధించి టీడీపీ, బీజేపీలకు కూడా కోర్టు లీగల్ నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై సెప్టెంబర్ 21వ తేదీ వరకు స్టేటస్ కోను పొడిగిస్తున్నామని హైకోర్టు ఈ సందర్భంగా తెలిపింది. సెప్టెంబర్ 21 నుంచి ఈ పిటిషన్ పై ప్రతి రోజూ విచారణ జరుపుతామని కూడా చెప్పింది. అయితే ఈ విచారణను ప్రత్యక్షంగా నిర్వహించాలా? లేదా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించాలా? అనే విషయాన్ని తర్వాత నిర్ణయిస్తామని తెలిపింది.

మానవతావాది సర్ డోరాబ్జీ టాటా

సర్ డోరాబ్జీ టాటా ( 27 ఆగస్టు 1859 - 3 జూన్ 1932)   టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీల విస్తరణలో కీలక వ్యక్తి సర్ డోరాబ్జీ టాటా. భారతీయ పరిశ్రమ పితామహుడుగా పేరుగాంచిన తన తండ్రి ఆశయాల మేరకు  టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలను అభివృద్ధి చేశారు. పారిశ్రామిక రంగంలో చేసిన కృషికి గాను బ్రిటిష్ ప్రభుత్వం 1910లో సర్ బిరుదు ఇచ్చింది.   డోరాబ్జీ టాటా 27 ఆగస్టు 1859 న ముంబయిలో జన్మించాడు. తల్లిదండ్రులు హీరాబాయి, జమ్సెట్టీ టాటా. పెద్దకుమారుడైన డోరాబ్జీ తన ప్రాథమిక విద్యను ముంబయిలో పూర్తి చేసి 1875లో ఉన్నత విద్యకోసం ఇంగ్లాండ్ వెళ్లాడు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిధిలోని గోన్విల్లే, కైస్ కాలేజీ లో చేరాడు. ఆ తర్వాత ఇండియా తిరిగివచ్చి ముంబయిలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో డిగ్రీ పట్టా అందు కున్నాడు.   జర్నలిస్టుగా.. రచనరంగంపై ఆసక్తి, సమాకాలీన అంశాలపై అనురక్తితో జర్నలిస్ట్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. బొంబాయి గెజిట్ లో రెండు సంవత్సరాల పాటు జర్నలిస్ట్ గా పనిచేశాడు. ఆ తర్వాత 1884లో తన తండ్రి సూచనల మేరకు వ్యాపారరంగంలోకి వచ్చారు. మొదట కాటన్ పరిశ్రమ విభాగంలో చేరాడు. దేశంలో కాటన్ పరిశ్రమల ఏర్పాటు ఎక్కడ లాభసాటిగా ఉంటుందో తెలుసుకోవడానికి పాండిచ్చేరి, ఫ్రెంచ్ కాలనీ, నాగ్ పూర్ తదితర ప్రాంతాలకు వెళ్లారు.   టాటా, భాభా కుటుంబాల మధ్య బంధుత్వం వ్యాపార విస్తరణలో భాగంగా అనేక నగరాలను సందర్శించిన డోరాబ్జీ మైసూర్ పట్టణానికి వెళ్లారు. ఆ రాష్ట్ర మొదటి ఇండియన్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డాక్టర్ హోర్మస్టీ భాభాను కలిశారు. ఆ తర్వాత ఆయన ఏకైక కుమార్తె మెహర్ బాయితో డోరాబ్జీ పెండ్లి జరగడంతో టాటా, భాభా కుటుంబాల మధ్య వారధి ఏర్పడింది. ప్రముఖ శాస్త్రవేత్త హోమి జె. భాభా మెహర్ బాయి మేనల్లుడు. భాభా పరిశోధనా సంస్థలకు టాటా గ్రూప్ నిధులను కేటాయించడానికి ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న బంధుత్వమే కారణం.   తండ్రి ఆశలకు అనుగుణంగా.. భారతదేశంలో "స్వదేశీ ఉద్యమానికి  జమ్సెట్టీ టాటా ఎంతో కృషి చేశారు. దేశీయ వస్తువుల ఉత్పత్తిని ప్రోత్సహించేలా తన కాటన్ మిల్లుకు “స్వదేశీ మిల్” అని పేరు పెట్టాడు. ఆ తర్వాత ఇనుము, ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం ఎంతగానో శ్రమించారు. అయితే ఆయన కృషి ఫలించలేదు. తండ్రి ఆశయం గురించి తెలిసిన డోరాబ్జీ ఇనుము పరిశ్రమ స్థాపన కోసం ప్రయత్నాలు చేశారు. 1903లో శపూర్ జీ షక్లత్ వాలాతో కలిసి ఇనుము పరిశ్రమ ఏర్పాటుకోసం సరైన ప్రదేశం కోసం వెతికారు. ఒకవైపు ఇనుము పరిశ్రమ కోసం కృషి చేస్తున్న సమయంలోనే తండ్రి అనారోగ్యంతో మరణించారు. ఇది డోరాబ్జీని బాగా కృంగ దీసింది. అయినా పట్టువదలని విక్రమార్కుడిగా పరిశ్రమ స్థాపన కోసం పెట్టుబడులను సేకరించడానికి అనేక సంస్థలను పెట్టుబడుల కోసం సంప్రదించారు. 1906లో లండన్ సంస్థలను కూడా పెట్టుబడులు పెట్టాలని కోరారు. అయినా ఎవరూ ముందుకు రాకపోవడంతో స్వదేశీ పెట్టుబడులతోనే పరిశ్రమను స్థాపించే ప్రయత్నం చేశారు. ఆయన సంకల్పం ఫలించి మూడువారాల్లోనే పరిశ్రమ స్థాపనకు కావల్సిన పెట్టుబడులు వచ్చాయి. ప్రస్తుతం జార్ఘండ్ లో జంషేడ్ పూర్ లో ఉన్న టాటా స్టీల్ ప్లాంట్ ను సింబల్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇండియాగా మార్చే ప్రయత్నం చేశారు. 1911లో ఇక్కడి నుంచి ఇనుము ఉత్తత్పి ప్రారంభం అయ్యింది.   ఈ తర్వాత మరోసారి  1924లో పరిశ్రమ ను కొనసాగించడంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి.  డోరాబ్జీ తన ఆస్తులన్నీ పరిశ్రమలో పెట్టుబడిగా పెట్టి పరిశ్రమను నిలబెట్టారు. ఉద్యోగులకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు రాకుండా, వేతనాలు కట్ చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈనాడు ఈ పరిశ్రమలో వేలాది మంది పనిచేస్తున్నారు. స్వదేశీ ఇనుము తయారు చేయాలన్న తండ్రి ఆశయాలను డోరాబ్జీ నిజం చేశారు.   ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా.. డోరాబ్జీ టాటాకు క్రీడల పట్ల ఆసక్తి ఉండేది. టాటా గ్రూప్ సంస్థల నుంచి క్రీడాకారులను ప్రోత్సహించేవారు. అంతేకాదు భారతీయ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 1924లో ఎన్నికైయ్యారు.  పారిస్ లో జరిగిన ఒలంపిక్స్ వెళ్లేందుకు భారత బృందానికి ఆర్థిక సహాయం అందించారు.   మెహర్ బాయి మెమోరియల్ గా.. డోరాబ్జీకి భార్య అంటే చాలా ప్రేమ. 1931లో మెహర్ లుకేమియా బారిన బడి మరణించారు. వారికి పిల్లలు లేరు. భార్యపై ఉన్న ప్రేమతో లేడీ టాటా మెమోరియల్ ట్రస్ట్ ను స్థాపించారు. పరిశోధనలు, ప్రకృతి వైపరీత్యాల కోసం ఈ ట్రస్ట్ ఫండ్ ఇస్తుంది. భారతదేశంలోని అనేక విద్యాసంస్థలకు ఈ ట్రస్ట్ నుంచి నిధులు కేటాయిస్తారు. మానవాతావాదిగా, పారిశ్రామిక వేత్తగా పేరుగాంచిన డోరాబ్జీ 3 జూన్ 1932లో జర్మనీలోని బాడ్ కిస్సింగెన్‌లో మరణించాడు.

రేవంత్ రెడ్డి కొత్త పార్టీ.. తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పు రానుందా?

వరుసగా రెండోసారి కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ.. వివిధ రాష్ట్రాలలో అధికారం కైవసం చేసుకుంటూ దూసుకుపోతుంటే.. దశాబ్దాలపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ మాత్రం అంతర్గత కుమ్ములాటలతో రోజురోజుకి ప్రభ కోల్పోతుంది. ముఖ్యంగా సీనియర్లు, జూనియర్ల మధ్య విభేదాలు ఆ పార్టీని బాగా దెబ్బ తీస్తున్నాయి. మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా వంటి నేతని దూరం చేసుకొని.. రాష్ట్రంలో అధికారంతో పాటు, కొంత బలాన్ని కూడా కోల్పోయింది. ఇక, రాజస్థాన్ లో కూడా కీలక నేత సచిన్ పైలట్ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఆయనని తిరిగి దారిలోకి తెచ్చుకోవడానికి కాంగ్రెస్ హైకమాండ్ నానా తంటాలు పడాల్సి వచ్చింది.   నిజానికి మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో బీజేపీని ఢీ కొట్టి కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావడంలో జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్ కీలక పాత్ర పోషించారు. అయితే యువనాయకులైన వీరిని కాదని రెండు రాష్ట్రాల్లోనూ సీనియర్లకు సీఎంలుగా అవకాశమిచ్చింది హైకమాండ్. ఈ నిర్ణయంపై సింధియా, సచిన్ వర్గాలు కొంత అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ.. సీనియర్లతో కలిసి పనిచేయడానికి అంగీకరించారు. అయితే సీనియర్లు మాత్రం వీరి మార్క్ కనిపించకుండా చేయడం, వీరి వర్గాలను ఎదగనివ్వకుండా చేయడంతో.. యువ నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఈ అంతర్గత కుమ్ములాటలతో సింధియాని కోల్పోయిన కాంగ్రెస్ సచిన్ ని మాత్రం కాపాడుకోగలిగింది.   అయితే, ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ తీరు మారట్లేదు. ఇప్పుడు ఈ సీనియర్ల, జూనియర్ల  పోరు తెలంగాణలో కూడా కాంగ్రెస్ కి ఇబ్బందికరంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కొత్త ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ తీరు పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి దక్కితే పార్టీలో కొనసాగాలని, లేదంటే ప్రాంతీయ పార్టీని స్థాపించి ముందుకు సాగాలని ఆయన ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.    రేవంత్ రెడ్డిని తెలంగాణలోని సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వి. హనుమంతరావు, జగ్గారెడ్డి వంటివాళ్లు బహిరంగంగానే రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు పీసీసీ అధ్యక్ష పదవి కోసం కోమటి రెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా పలువురు నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మాలో పీసీసీ అధ్యక్షుడు ఎవరైనా ఓకే కానీ, రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో పార్టీ పగ్గాలు అప్పగిస్తే అంగీకరించబోమని పలువురు సీనియర్లు చెబుతున్నారు.    ఒక రకంగా కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డికి అంత అనుకూల వాతావరణం లేదు. తనతో పాటు పార్టీలో చేరినవారికి కూడా తగిన ప్రాధాన్యం లేదనే ఆసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీ పెట్టి ముందుకు సాగాలనే యోచనలో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీ పెడితే ఏ విధంగా ఉంటుందనే విషయంపై ఆయన కసరత్తు ప్రారంభించారని తెలుస్తోంది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి వంటి నేతలు తగిన సహకారం అందించడానికి సుముఖంగా ఉన్నట్లు సమాచారం.    ప్రాంతీయ పార్టీ పెడితే ఎలా ఉంటుందనే విషయంపై ఇప్పటికే రేవంత్ రెడ్డి ఓ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆ సర్వే పూర్తిగా క్షేత్ర స్థాయికి వెళ్లి చేయలేదు.15 మందితో ఆ సర్వే చేయించారని సమాచారం. రేవంత్ రెడ్డి ఆలోచనకు దక్షిణ తెలంగాణ నుంచి మంచి మద్దతు లభిస్తోందని, ఉత్తర తెలంగాణ నుంచి అంతగా మద్దతు లభించడం లేదని సర్వేలో తేలినట్లు సమాచారం. గతంలో టీడీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో రేవంత్ రెడ్డికి అనుకూల వాతావరణం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నల్లగొండ, మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో అనుకూల వాతావరణం ఉందని సర్వేలో తేలినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో విస్తృత స్థాయి సర్వేకు ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. 150 మందితో సర్వే చేయించాలని, ఒక్కొక్కరికి పది మంది చొప్పున కేటాయించాలని 15 మందితో కూడిన బృందం రేవంత్ రెడ్డి ముందు ప్రతిపాదన ఉంచినట్లు తెలుస్తోంది. దానికి రేవంత్ రెడ్డి నుంచి ఆమోదం లభించాల్సి ఉందని సమాచారం.   అసలే, తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ ని కాంగ్రెస్ బలంగా ఎదుర్కోలేకపోతోంది. దానికితోడు బీజేపీ తెలంగాణలో బలపడటానికి పావులు కదుపుతోంది. ఇలాంటి సమయంలో సీనియర్లు, జూనియర్ల విభేదాలు ముదిరి రేవంత్ కాంగ్రెస్ ని వీడితే ఆ పార్టీకి మరింత దెబ్బనే చెప్పాలి. మరి కాంగ్రెస్ హైకమాండ్ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా సింధియా, సచిన్ ల వ్యవహారాలలోలాగా లేట్ గా రియాక్ట్ అవుతుందో లేక వాళ్ళలాగా రేవంత్ తిరుగుబాటు జెండా ఎగరవేయకముందే మేలుకుంటుందో చూడాలి.

మరోసారి స్టేటస్‌ కో పొడిగింపు.. విశాఖ గెస్ట్ హౌస్ నిర్మాణంపై ధిక్కార పిటిషన్

ఏపీలో రాజధాని తరలింపు, సీఆర్డీఏ చట్టం రద్దుపై స్టేటస్‌ కోను హైకోర్టు మరోసారి పొడిగించింది. వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దుపై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగగా, స్టేటస్ కోను సెప్టెంబరు 21 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబరు 21కి వాయిదా వేసిన హైకోర్టు.. ఈ విషయంపై కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి సెప్టెంబరు 11 వరకు, అభ్యంతరాలు చెప్పేందుకు పిటిషనర్లకు సెప్టెంబరు 17 వరకు  ధర్మాసనం గడువు ఇచ్చింది.   మరోవైపు, విశాఖపట్నంలో ప్రభుత్వ గెస్ట్ హౌస్ నిర్మాణంపై హైకోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలైంది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది నితీశ్‌ గుప్తా కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ జరిగింది. విశాఖపట్నంలోని కాపులుప్పాడలో ఏపీ సర్కారు అతిథి గృహాన్ని నిర్మించనుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రపతి భవనం ఐదు ఎకరాల్లో ఉండగా.. కాపులుప్పాడులో 30 ఎకరాల్లో ప్రభుత్వ గెస్ట్ హౌస్‌ను ఎలా కడతారని నితీష్ గుప్తా ప్రశ్నించారు. ఒక వైపు హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో అమల్లో ఉన్న సమయంలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన ఎలా చేస్తారని ప్రశ్నించారు. రాజధాని తరలింపులో ఇది కూడా ఒక భాగమేనని ఆయన తెలిపారు. వాదనలు విన్న అనంతరం.. దీనిపై కూడా వచ్చేనెల 10లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.

పదిశాతం పోలీసుల్లో కరోనా

కరోనా పై పోరులో ముందువరుసలో ఉన్న వైద్యసిబ్బందిని, పోలీసులను కరోనా కలవరపెడుతోంది. లాక్ డౌన్ సమయంలో సమర్థవంతంగా పనిచేసిన తెలంగాణ రాష్ట్ర పోలీసు వ్యవస్థ లో ఇప్పుడు కరోనా భయబ్రాంతాలకు గురిచేస్తుంది. తాజా లెక్కల ప్రకారం రాష్ట్ర పోలీసు ల్లో దాదాపు పదిశాతం మంది కరోనా కోరల్లో చిక్కుకున్నారు. పోలీస్ శాఖలో ఇప్పటివరకు మొత్తం 5,684 మందికి కోరోనా వచ్చింది. వారిలో 2,384మంది కోలుకున్నారు. 3,357మందిలో చాలామంది హోంఐసోలేషన్ లో, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  ఇప్పటివరకు 44మంది పోలీసులు కరోనాతో చనిపోయారని పోలీస్ శాఖ చెప్తోంది. వీరిలో కానిస్టేబుల్ నుంచి అడిషనల్ ఎస్పీ ర్యాంక్ వరకు వివిధ స్థాయిలో పనిచేసే పోలీసులు ఉన్నారు.   హైదరాబాద్ కమిషనరేట్ లో దాదాపు 1,967మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 1,053మంది కోలుకోగా 891 చికిత్స తీసుకుంటున్నారు. 23మంది మరణించారు. ఇక జిల్లాల విషయానికి వస్తే  వరంగల్ లో 526మంది పోలీసులు కరోనా పాజిటివ్ గా నమోదు అయ్యారు. వారిలో 163మంది కోలుకున్నారు. 361మంది చికిత్స పొందుతున్నారు. ఇద్దరు పోలీసులు చనిపోయారు. కరోనా పాజిటివ్ గా నమోదు అయిన పోలీసులకు 17రోజుల సెలవుతో పాటు ఐదువేల రూపాయల ఆర్థిక సాయం పోలీసు శాఖ అందిస్తోంది. పోలీసు శాఖలోని అన్ని విభాగాలలోను కలుపుకుని మొత్తం 54 వేల మంది పోలీసులు పనిచేస్తున్నారు.   కరోనా ఫ్రంట్ వారియర్స్ గా పనిచేస్తున్న వారిలో వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, జర్నలిస్టులు ఉన్నారు. మరి వీరిలో ఎంతశాతం మంది కరోనా కోరల్లో చిక్కారో లెక్కలు తీస్తే ఎక్కువ సంఖ్యే బయటకు వస్తుందేమో ..! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరికి ప్రత్యేక సహాయం అందించాలని కోరుతున్నారు. 

కరోనా చికిత్సలో ఓజోన్.. జపాన్ లో పరిశోధనలు

ప్రపంచమంతా జరుగుతున్న పరిశోధనలకు మూలం కరోనాగా మారింది. కరోనా వైరస్ కు ఎన్ని కిరీటాలు ఉన్నాయో అంతకుమించి దాన్ని కొమ్ములు వంచడానికి ప్రపంచ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు ఒకవైపు అనేక మార్గాలను అన్వేషిస్తుంటే మరోవైపు వ్యాక్సిన్ తయారిలో తలమునకలై శ్రమిస్తున్నారు. ఇంకో వైపు  పాజిటివ్ వ్యక్తులు తర్వగా కోలుకునేలా చికిత్స అందించడంలో కొత్త విధానాలను కనుగొంటున్నారు.    తాజాగా జపాన్ శాస్త్రవేత్తలు ఓజోన్ వాయువుతో వైరస్‌కు చెక్ పెట్టవచ్చు అంటున్నారు. ఓజోన్ పొర భూమిని రక్షించినట్లే కరోనా వ్యాధి బారిన పడినవారిని త్వరగా కోలుకునేలా చేస్తుందట. ఓజోన్ వాయువును అతి తక్కువగా సాంద్రతలో ఉపయోగిస్తే  వైరస్‌ను చంపడం సాధ్యమవుతుందని జపాన్ లోని పుజిటా హెల్త్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 0.05 నుంచి 0.1 పీపీఎం స్థాయిలో ఓజోన్ వాయువును ఉపయోగించి వైరస్‌ను నిర్వీర్యం చేయవచ్చని వారి పరిశోధనల్లో వెల్లడైంది. చికిత్సలోనే కాదు ఆసుపత్రులు, పరీక్షా కేంద్రాల్లో దీనిని డిస్‌ఇన్‌పెక్టెంట్‌గా కూడా ఉపయోగించవచ్చని వారు వెల్లడించారు. ఇప్పటికే ఓజోన్ జనరేటర్లను ఏర్పాటు చేసి వైరస్ వ్యాప్తిని అరికట్టే ప్రయత్నాలు జపాన్ లో జరుగుతున్నాయి. ఓజోన్ జనరేటర్‌ ద్వారా దాదాపు 10 గంటలపాటు తక్కువ సాంద్రత కలిగిన ఓజోన్ వాయువును ఉపయోగిస్తే వైరస్ శక్తి 90 శాతం తగ్గినట్టు గుర్తించారు.   ఓజోన్ అనేక వ్యాధికారకాలను క్రియారహితం చేస్తుందని పుజిటా హెల్త్ యూనివర్సిటీ చీఫ్ సైంటిస్ట్ మురాఠా వెల్లడించారు. అధిక తేమ ఉన్న పరిస్థితుల్లోనూ ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. 

సింహాచలం అప్పన్న భూముల పై పెద్దల కన్ను.. లీజుకు ఈరోజే నాంది..!

జగన్ ప్రభుత్వం ఎపి కి కొత్త రాజధానిగా విశాఖను ప్రకటించి ఆ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో.. అక్కడ ఆత్యంత ఖరీదైన సింహాచలం అప్పన్న భూముల పై కొంత మంది పెద్దలు కన్నేసినట్లుగా తెలుస్తోంది. దీంతో సింహాచలం అప్పన్న స్వామి ఆస్తులు లీజుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని కోసం ఈరోజు జరిగే ఆలయ పాలక మండలి భేటీలో నిర్ణయం తీసుకోవడానికి రంగం సిద్ధమయింది.    సింహాచలం అప్పన్న స్వామి ఆలయానికి సంబంధించిన అత్యంత ఖరీదైన భూములలో కళ్యాణ మండపాలు, భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు నగరంలోని కీలక ప్రాంతాల్లో ఉన్నాయి. తాజాగా పదహారు ఎకరాలకు పైగా ఉన్న ఆస్తులను 11 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు పాలకమండలి సిద్ధమైంది. అయితే ఇవన్నీ వాణిజ్య పరంగా ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉన్న స్థలాలు కావడంతో ఈరోజు జరిగే దేవస్థానం పాలకమండలి సమావేశ అజెండాలో ఈ అంశాన్ని చేర్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ భూములను లీజుకు ఇచ్చేందుకు వారు చూపుతున్న కారణం.. కరోనా కారణంగా ఆదాయం పడిపోయిందని.. ఆలయ నిర్వహణ చాల ఇబ్బందికరంగా మారిందని దీంతో తప్పక లీజు ద్వారా భూములు కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.    ఈ సింహాచలం అప్పన్న దేవస్థానానికి విజయనగరం పూసపాటి రాజ వంశీకులు ఇచ్చిన వేల ఎకరాల భూములు ఉన్నాయి. ప్రస్తుతం వాటి విలువ వేల కోట్లలోనే ఉంటుంది. ఈ ఆలయానికి ట్రస్టీలుగా పూసపాటి వంశీయులైన ఆనందగజపతి రాజు, అయన మరణానంతరం అశోక్ గజపతి రాజు వ్యవహరించారు. ఐతే కొద్దికాలం క్రితం ఈ ఆలాయాన్ని నిర్వహించే మాన్సాస్ ట్రస్ట్ బాధ్యతలు ఆనందగజపతి రాజు నుండి విడిపోయిన మొదటి భార్య కుమార్తె అయిన సంచయితకు అప్పగించడం పై వివాదం నెలకొంది. అప్పన్న ఆస్తుల పై కన్నేసిన కొంత మంది పెద్దలు ఈ విషయంలో కీలకంగా వ్యవహరించాయని ప్రతిపక్షలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగే అప్పన్న దేవస్థానం పాలకమండలి సమావేశం చాల కీలకంగా మారింది.

తెలంగాణ హైకోర్టులో జడ్జీలను నియమించాలి

కేంద్ర మంత్రిని కోరిన రాష్ట్ర బిజేపి   తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని కేంద్ర హోంశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను తెలంగాణ రాష్ట్ర బిజేపీ కోరింది. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి. కిషన్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు, తెలంగాణ రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ నరసింహారెడ్డి ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి వినతిపత్రం అందించారు.   రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ హైకోర్టులో 24 మంది న్యాయమూర్తుల నియామకానికి అనుమతి ఉందని, కానీ ప్రస్తుతం హైకోర్టులో 14 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారని కిషన్‌ రెడ్డి కేంద్రమంత్రికి తెలియజేశారు. తెలంగాణ హైకోర్టుకు కేటాయించిన 24 మంది న్యాయమూర్తుల సంఖ్యను 42కు పెంచి, వెంటనే న్యాయమూర్తులను నియమించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో పెండింగ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని, భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతాయని ఆయన వివరించారు. న్యాయమూర్తులు సరైన సంఖ్యలో లేకపోవడంతో కేసులు వాయిదా పడుతూ న్యాయం కోసం కోర్టుకు వచ్చేవారు అనేక సమస్యలు ఎదుర్కోంటున్నారని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ప్రస్తుతం ఉన్న సదుపాయాలు 46 నుంచి 48 మంది జడ్జీలు పనిచేయడానికి అనువుగా ఉన్నాయని గుర్తుచేశారు.   పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారానికి, న్యాయ సేవలు వేగంగా అందడానికి వీలుగా న్యాయమూర్తుల నియామకాల ప్రక్రియను త్వరగా చేపట్టాలని కోరారు.

భారత్ లో కరోనా ఉగ్ర రూపం.. నిన్న ఒక్క రోజే వెయ్యికి పైగా మృతి 

కరోనా తో ప్రపంచం మొత్తం అల్లాడుతోంది. ఇప్పటికే అమెరికా, బ్రెజిల్ లో కరోనా మరణ హోమం సృష్టించగా తాజాగా భారత్ లో నిన్న ఒక్క రోజే 1,023 మంది మృతి చెందారు. ఇక గత 24 గంటల్లో కొత్తగా 75,760 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 33,10,235 కు చేరుకోగా, మృతుల సంఖ్య 60,472కి పెరిగింది. ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 25,23,772 మంది కోలుకోగా.. 7,25,991 మంది ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.    ప్రస్తుతం మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ, కర్నాటక, యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్‌లోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఇక టెస్ట్‌ల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో 9,24,998 మంది నుండి సేకరించిన శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 3 కోట్ల 85 లక్షల 76 వేల 510 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలియచేసింది.

కేంద్ర ప్రభుత్వాన్ని ఆ విషయంలో కడిగిపారేసిన సుప్రీం కోర్టు.. 

దేశంలో లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలు తీసుకున్నరుణాలపై ఆరునెలల మారటోరియం వ్యవధిలో వడ్డీ వసూలు చేసే విషయం పై కేంద్రం తీరును తప్పుబడుతూ సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో... మార్చి నెల నుంచి ఆగస్టు వరకు రుణ చెల్లింపుదారులకు ఆర్బీఐ ఆరు నెలల మారటోరియం వసతి కల్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మారటోరియం సమయంలో కూడా రుణాలపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని ఇప్పటికే ఆర్బీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో మారటోరియం విషయంలో బ్యాంకులు తమ రుణ చెల్లింపుదారులకు కూడా క్లారిటీ ఇచ్చాయి. తాజాగా మారటోరియం సమయంలో రుణాలపై వడ్డీ వసూలు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరు పై జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. లోన్ మారటోరియానికి సంబంధించి ప్రజల బాధలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో లోన్ మారటోరియాన్ని కేవలం వ్యాపార కోణంలో మాత్రమే ఆలోచించవద్దని, ప్రజల బాధను కూడా పట్టించుకోవాలని సుప్రీం కోర్టు ఘాటుగా స్పందించింది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్(డీఎంఏ) కింద లోన్ మారటోరియం అంశంపై కేంద్రానికి అధికారాలు ఉన్నాయని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.   కరోనా నేపథ్యంలో రుణాలు చేసిన వారికీ ఆర్బీఐ ఇచ్చిన వెసులుబాటు లోన్ మారటోరియం కాలానికి వడ్డీని మాఫీ చేయవచ్చా లేదా అనే అంశంపై కేంద్రం నిర్ణీత సమయంలో సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయలేదని ఆ సందర్భంగా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మొత్తం సమస్య కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ వల్ల వచ్చిందని కోర్టు పేర్కొంది. మారటోరియం వ్యవధిలో రుణాలపై బ్యాంకులు వడ్డీని మాఫీ చేస్తాయని రుణ చెల్లింపుదారులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో ఈ విషయంలో మరి కొద్దీ రోజుల్లో కేంద్రం స్పష్టత ఇవ్వనుండటంతో రుణ చెల్లింపుదారుల్లో ఆసక్తి నెలకొంది.

అంబటి రాంబాబుకు సొంత పార్టీ కేడర్ షాక్..

వైసిపి సీనియర్ నేత సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు గట్టి షాక్ తగిలింది. అయితే ఈ షాక్ ఇచ్చింది ప్రతిపక్షం అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇంతకూ అంబటి షాక్ ఇచ్చింది మరెవరో కాదు.. అయన నియోజకవర్గానికి చెందిన సొంత పార్టీ కార్యకర్తలే. సాక్షాత్తు వైసీపీ కార్యకర్తలే తమ ఎమ్మెల్యే మీద హైకోర్టులో పిటిషన్ వేయించారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారంటూ హైకోర్టులో వారు పిల్ దాఖలు చేశారు.    సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని రాజుపాలెం మండలం నెమలిపురి, కొండమోడులో ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. అయితే ఈ పిల్‌ను హైకోర్టు న్యాయవాది నాగ రఘు వైసీపీ కార్యకర్తల తరఫున దాఖలు చేయడం సంచలనంగా మారింది. ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నట్లు కలెక్టర్‌, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం జగన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వైసీపీ కార్యకర్తలు ఈ పిటిషన్‌లో ఆరోపించారు. ఈ అక్రమ మైనింగ్ పై ఇప్పటికే స్ధానిక మైనింగ్‌ అధికారులు విచారణ జరిపారని కూడా ఆ పిటిషన్‌లో వారు పేర్కొన్నారు.    అయితే, అధికార పార్టీకి చెందిన వారే పిటిషన్ వేస్తె అది ప్రజాప్రయోజన వ్యాజ్యం ఎలా అవుతుందని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారం పై వెంటనే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తరువాత కేసు విచారణను వచ్చే నెలకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి ప్రకటించారు.

కౌలు చెల్లించాలని కోరిన అమరావతి రైతులను అరెస్టు చేయటం దుర్మార్గం

కౌలు చెల్లించాలని కోరుతూ విజయవాడ సీఆర్‌డీఏ కార్యాలయ ముట్టడికి రాజధాని రైతులు, మహిళలు బయల్దేరగా పోలీసులు అరెస్ట్ చేశారు. తమకు కౌలు డబ్బులు ఇస్తామని చెప్పి 3 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం మాట నిలబెట్టుకోక పోవడంపై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కౌలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.    సీఆర్‌డీఏ కార్యాలయం ముట్టడికి వస్తున్న రైతులను, మహిళలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. కరకట్ట, మంగళగిరి మీదుగా విజయవాడకు వచ్చే మార్గాల్లో రైతుల్ని పోలీసులు అడ్డుకున్నారు. మహిళలు అని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించారన్నవిమర్శలు వినిపిస్తున్నాయి. రైతులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీని పోలీసులు అరెస్ట్ చేశారు. రైతులకు మద్దతుగా వచ్చిన సీపీఎం మధు, బాబూరావులను కూడా పోలీసులు అడ్డుకున్నారు.   కౌలు చెల్లించాలని కోరిన అమరావతి రైతులను అరెస్టు చేయటం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. అమరావతి రైతులకు కౌలు చెల్లిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ.. సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు రైతులపై పోలీసులతో ఉక్కుపాదం మోపుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. తక్షణమే అరెస్ట్ చేసిన అమరావతి రైతులను విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.    మరోవైపు, ఆరు నెలలుగా అమరావతి పెన్షన్ ప్రభుత్వం చెల్లించకపోవడంతో పాటు, ఈ సంవత్సరం వార్షిక కౌలు కూడా చెల్లించకపోవడంతో.. అమరావతి రైతులు, రైతు కూలీలు చేపట్టిన బిక్షాటన కార్యక్రమాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు. వెంకటపాలెం చలివేంద్రం చెక్ పోస్ట్ వద్ద డీఎస్పీ బృందం, దళిత జేఏసీ అమరావతి నాయకులను రైతులను అడ్డుకోవడం జరిగింది. దళిత రైతులు, రైతు కూలీలు వచ్చిపోయే ప్రయాణికులను భిక్షాటన చేస్తూ.. ప్రభుత్వాన్ని నమ్మి భూమి ఇచ్చి  దగాపడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమరావతి పెన్షన్ చెల్లించక నడిరోడ్డున పడ్డాము. మాకు పూట గడవడమే కష్టంగా ఉంది. ఆకలి పస్తులతో జీవనం సాగిస్తున్నాం, కావున దయచేసి ధర్మం చేయండి అని వారు భిక్షాటన చేయడం జరిగింది.

రాజీనామా చేస్తే జరిగేది అదే.. ఒళ్లు దగ్గర పెట్టుకోండి: రఘురామకృష్ణరాజు

జగన్ సర్కార్ పై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విరుచుకుపడ్డారు. ఏపీలో 50 శాతం ప్రజలు జగన్‌ ప్రభుత్వాన్ని కోరుకోలేదని గుర్తుంచుకోవాలి అన్నారు.    డాక్టర్ రమేష్‌ ను వేధిస్తున్న తీరు బాధాకరమని చెప్పారు. డాక్టర్‌ రమేష్‌ ను అరెస్ట్‌ చేస్తామని వేధించి అవమానించామని ప్రభుత్వ పెద్దలు అనుకుంటున్నారు. కానీ అవమానం జరిగింది డాక్టర్‌ రమేష్‌ కు కాదు.. వైద్య వృత్తికి అవమానం చేస్తున్నారని అన్నారు. పవిత్రమైన వృత్తిలో ఉన్నవారిపై కులం పేరుతో కక్ష కట్టడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు.    ఎంతో అనుభవం ఉన్న రామచంద్రమూర్తి సలహాదారు పదవికి రాజీనామా చేయడం దురదృష్టకరమని అన్నారు. జగన్‌ ప్రభుత్వానికి ఇబ్బడిముబ్బడిగా సలహాదారులున్నారు అని గుర్తుచేసిన ఆయన.. చేయడానికి పనిలేదని రామచంద్రమూర్తి రాజీనామా చేసినట్టున్నారని ఎద్దేవా చేశారు. మిగతావారి విషయంలో జగన్‌ ఇప్పటికైనా నిర్ణయం తీసుకుంటే.. ప్రభుత్వ సొమ్మును ఆదా చేసినవారు అవుతారని సూచించారు.   శిరోముండనం కేసుపై లేటుగానైనా లేటెస్టుగా సీఎం జగన్ స్పందించినందుకు ధన్యావాదాలని అని ఎద్దేవా చేశారు. ఎంత ముఖ్యమైనవారున్నా వదిలిపెట్టేదిలేదని సీఎం అంటున్నారు. సీఎంకి సమీపబంధువు, పార్టీలోని అతిముఖ్యుడు ఈ ఘటనలో కీలకంగా ఉన్నారని తెలిసింది. వారిపై చర్యలు తీసుకుంటేనే సీఎం చెబుతున్న మాటలు, చేతల్లో చూపుతున్నారన్న పేరు వస్తుందని హితవు పలికారు.   ప్రభుత్వం తాము ఇచ్చిన భూములకు కౌలు చెల్లించలేదని అమరావతి రైతులు నిరసన చేపడితే.. వారిపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని దుయ్యబట్టారు. కౌలు చెల్లించడానికి డబ్బు లేనప్పుడు.. మూడు రాజధానులు అవసరమా? అని ఎద్దేవా చేశారు.    ఇక రాజీనామా డిమాండ్‌ పై కూడా రఘురామ కృష్ణరాజు ఘాటుగా స్పందించారు. తప్పులు జరుగుతున్నాయి సరిదిద్దుకోవాలని ప్రభుత్వానికి చెబితే నన్ను రాజీనామా చేయాలంటారా? అని ప్రశ్నించారు. రాజీనామా చేస్తే ఏమవుతుంది.. మూడు రెట్లు ఎక్కువ మెజార్టీతో గెలుస్తా అన్నారు. అయినా పెయిడ్‌ ఆర్టిస్టుల డిమాండ్లను నేను పట్టించుకోను. వైసీపీ దుర్మార్గాలను, లోపాలను ఎత్తిచూపితే భరించలేకపోతున్నారు అని మండిపడ్డారు.   బెదిరింపులకు ఎవరూ భయపడొద్దని రఘురామరాజు అన్నారు. పీపీఈ కిట్లు లేవని ఎప్పుడో కామెంట్ చేస్తే డాక్టర్ గంగాధర్ లాంటి ప్రముఖ వైద్యులకు ఇప్పుడు సెక్షన్ 41 కింద నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. వైఎస్‌ కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తిగా, మృధుభాషిగా డాక్టర్ గంగాధర్‌ కు పేరుందని ఆయన అన్నారు. ఓ దళిత యువకుడు మద్యంపై మాట్లాడితే.. ఆ వ్యక్తిని వైసీపీ కార్యకర్తలు చంపుతామని బెదిరించారని, దీంతో ఆ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది అన్నారు. "ప్రాణాలు తీసుకోవడం బాధాకరం. దయచేసి అందరూ ధైర్యంగా ఉండండి. ఎవర్నీ ఎవరూ ఏమీ చేయలేరు. నాకూ బెదిరింపులు వస్తున్నాయి. ధైర్యంగా ఎదుర్కొంటే ఏమీ కాదు.’’అని చెప్పారు. తనను బెదిరించాలనుకుంటున్న వాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకుని మసలితే మంచిదని రఘురామరాజు హితవు పలికారు.

కరోనా.. రెండోసారి

ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ మహమ్మారి నుంచి తప్పించుకోవడం అసాధ్యమే అవుతుంది. లాక్ డౌన్లతో ఇంటికే పరిమితమైనా వదలడం లేదు. కోట్లాది మందికి వ్యాపించి వేలాది మందిని బలితీసుకుంది. లక్షలాది మంది బతుకు జీవుడా అంటూ ఈ వ్యాధి నుంచి బయటపడుతున్నారు. అయితే ఒకసారి వచ్చిన వారికి తిరిగి రెండోసారి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలియడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది.   కొన్నిరోజుల కిందట చైనాలో కరోనా వచ్చి తగ్గిపోయిన ఒక వ్యక్తిలో  తిరిగి రెండోసారి వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న 33 ఏళ్ల వ్యక్తికి మళ్ళీ మూడు నెలల తర్వాత ఈ వైరస్ లక్షణాలు బయటపడటంతో పాటు వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా  నిర్దారించారు.   ఆ వ్యక్తికి రెండోసారి సోకినది ఐరోపాలో వ్యాపిస్తున్న మరో రకమైన కోవిద్ వైరస్ అని వైద్య పరీక్షల్లో గుర్తించారు. తాజాగా తెలంగాణలోనూ పాజిటివ్ గా నమోదైన ఒక వ్యక్తికి పూర్తిగా తగ్గిన తర్వాత మరోసారి కరోనా లక్షణాలు కనిపించాయి. ఇది అధికారికంగా ప్రపంచంలో రెండో కేసు. అయితే రెండోసారి కోవిద్ వైరస్‌ బారిన పడుతున్న కేసులు తెలంగాణలో చాలానే ఉన్నాయని వైద్యఉన్నతాధికారులు అంటున్నారు. అనునిత్యం కోవిద్ సోకిన వారితో కలిసి పనిచేసేవారికి అంటే వైద్యసిబ్బందికి రెండోసారి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.   లక్షణాల తీవ్రత ఎక్కువగా.. రెండోసారి కరోనా బారిన పడే వారిలో పాజిటివ్ కేసుల్లో బాధితులు కోలుకోవడానికి కనీసం 20 రోజులు పడుతోంది. వారిలో లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మొదటిసారి వాడిన మందుల కంటే అధికమోతాదులో మందులు వాడాల్సి వస్తుందని చెప్తున్నారు.   జాగ్రత్తగా ఉండకపోవడమే... ఒకసారి వస్తే మళ్లీ రాదు అన్న ధీమాతో చాలామంది కోలుకున్న తర్వాత మాస్క్ ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా తిరుగుతున్నారట. ఇలాంటి అజాగ్రత్తల వల్లనే రెండోసారి కరోనా బారిన పడుతున్నారని వైద్యనిపుణులు వివరిస్తున్నారు.   వైరస్ మ్యూటేషన్ వల్లే.. కోవిద్ 19 వైరస్ అనునిత్యం రూపాంతరం చెందుతూ వేరువేరు లక్షణాలను బహిర్గతం చేస్తుంది. వ్యాక్సిన్ తయారీలోనూ ఆలస్యం కావడానికి ఇదే కారణని పరిశోధకులు అంటున్నారు. ఒకసారి వచ్చిన వారిలో తిరిగి రెండోసారి వస్తుంది అంటే వైరస్ మ్యూటేషన్ వల్లనే .. దీనిపై మరిన్ని ప్రయోగాలు జరగాల్సి ఉందంటున్నారు.   ఏది ఏమైనప్పటికీ కరోనా కష్టం కాలం మరెంత కాలం అన్న విషయంలో స్పష్టత కాకముందే రెండోసారి వస్తుందన్న వార్త కలవరం కలిగిస్తోంది. మందులు, వ్యాక్సిన్లు కంటే వ్యక్తిగత జాగ్రత్తే కరోనా కట్టడికి దివ్యౌమంత్రం. మాస్క్ ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ ఆరోగ్యకరమైన నియమాలను పాటించాల్సిందే..

మహిళా సమానత్వం ఎక్కడా..!?

మహిళా శక్తి దేశప్రగతిలో భాగమైనప్పుడే ఆ దేశం అన్ని రంగాల్లో రాణిస్తుందని గుర్తించారు. మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచి వారి స్వశక్తిపై విశ్వాసాన్ని అభివృద్ధి పరిచేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు ఇవ్వాలని ప్రపంచదేశాలన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇవి చాలావరకు వేదికలపై ప్రసంగాలకే పరిమితం అయ్యాయి.    మహిళలకు ఓటు హక్కు కల్పిస్తూ యునైటెడ్ స్టేట్స్ రాజ్యాంగంలో 1920 పంతొమ్మిదవ సవరణ  చేసినందుకు గుర్తుగా ఆగస్టు 26 ను అమెరికాలో మహిళా సమానత్వ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 26 ఆగస్టు 1973 నుంచి ప్రపంచవ్యాప్తంగా మహిళా సమానత్వ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. స్వయం నిర్ణయాత్మక శక్తిగా మహిళలు అన్ని రంగాల్లో ముందంజ వేయాలని అనేక అంశాలతో ప్రభుత్వాలు కార్యక్రమాలు చేప్పట్టాయి. వ్యక్తిగతంగా, సామూహికంగా నైపుణ్యాలను, సామర్థ్యాలను పెంచుకుంటూ మహిళలు శక్తిగా ఎదగాలని మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు చేశారు. ఇటీవల మహిళలకు ఆస్తిహక్కు కల్పిస్తూ హిందూ వారసత్వ సవరణ చట్టం 2005 కూడా అమలు లోకి వచ్చింది.    ప్రపంచంలో అన్నిరంగాల్లో స్వశక్తితో దూసుకుపోతున్న మహిళలకు 19వ శతాబ్దం ఆరంభంలో ఓటు హక్కు కూడా లేదు. సుధీర్ఘ పోరాటంతో పౌరులుగా గుర్తింపు పొందుతూ ఓటు హక్కును సాధించుకున్నారు. మహిళలు ఓటు హక్కు పొందిన మొదటి దేశం న్యూజిలాండ్(1893) కాగా ఆ తరు వాత వరుసగా 1902లో ఆస్ట్రేలియా, 1906లో ఫిలాండ్, 1915లో డెన్మార్క్, అతిపెద్ద సోషలిస్ట్ దేశమైన రష్యా 1917లో , 1919లో జర్మనీ, అగ్రరాజ్యంగా భాసిల్లుతున్న అమెరికా 1920లో, రాచరికవ్యవస్థకు ప్రతి కగా ఉన్న ఇంగ్లాండులో 1928 సంవత్సరంలో, 1935లో ఇండియా, 1944లో ఫ్రాన్స్, 1954లో ఇటలీ దేశాల్లో మహిళలు ఓటు హక్కును సాధించుకున్నారు.    మహిళల సమానహక్కు కోసం 19 శతాబ్దంలో ప్రారంభమైన పోరాటం 21న శతాబ్దంలోనూ జరుగుతునే ఉంది. విదేశాల్లో మహిళల ఉద్యమాల ప్రభావంతోనే భారతీయ మహిళ ఉద్య - మిస్తుంది అంటూ సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. ఎందుకంటే న్యూజిలాండ్లో ఓటుహక్కు రాక ముందే, ప్రపంచదేశాలు సమాన హక్కుకోసం పోరాటం చేయక , పూర్వమే భారత మహిళలు అనేక రంగాల్లో ముందున్నారు. వేదాలు  చదివారు, పురాణాల్లో తమ ఉనికిని చాటుకున్నారు. తమ హక్కులను కాపాడుకునే ప్రయత్నాలు ఎన్నో చేశారు. వేదాలకు, సనాతన సంప్రదాయలకు పుట్టినట్లు అయిన  భారతదేశంలో పురాణాల్లో, ఇతిహాసాల్లో, రాచరిక వ్యవస్థలో ఎందరో వీరవనితల ప్రస్తావన ఉంది. చరిత్రలో ఝాన్సీ, మగువ మంచాల, త్రిలోచన పల్లవి, రుద్ర మదేవి, స్వాతంత్ర్య పోరాటంలో దుర్గాబాయ్, సరోజినీ నాయుడు ఈ కోవలోని ధీరవనితలే. అందుకే భారతీయ మహిళ తరత రాల బాధల నుంచి విముక్తి కోసమే పోరాటాలు చేస్తున్నది అనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి.   డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కృషి ఫలింతంగా భారత రాజ్యంగంలో అన్ని రకాల వివక్షలను రద్దుచేసి మహిళలకు సమానత్వాన్ని ఇచ్చారు. సమాన త్వం( నిబంధన14), వివక్షలేకుండా (నిబంధన 15(1), సమానావకాశాలు కల్పించడం(నిబంధన 16), సమానపనికి సమాన వేతనం (నిబంధన 39డి) తదితర హామీలను కల్పించారు. 1950లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు  ఓటు హక్కు కల్పించబడింది. అయినప్పటికీ  పార్లమెంట్‌లో మహిళా ప్రాతినిధ్యం విషయంలో భారతదేశం ప్రపంచంలో 20వ స్థానంలో  ఉంది.   73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలలో మూడోవంతు మహిళా రిజర్వేషన్లు ఇచ్చారు. అయినప్పటికీ  దేశాన్ని స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి ఈ నాటి వరకు మహిళలకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లేదన్న వాస్తవం అందరూ అంగీకరించాల్సిందే.    జనాభాలో సగం ఉన్న మహిళలకు కనీసం 33శాతం అయినా రిజర్వేషన్లు ఇవ్వాలని దశాబ్దాలుగా మహిళా సంఘాలు చేస్తున్న ఉద్యమాల ఫలితంగా 1996లో మహిళా రిజర్వేషన్ బిల్లు రూపొందింది. మహిళల అధికారాన్ని సహించలేని మహానేతలు చాలామంది ఈ బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకుంటునే ఉన్నారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన ప్రతిసారి ఇదిగో.. అదిగో అంటూ మహిళల బిల్లును ఊరకాయ పచ్చడిలా ఊరిస్తూ మహిళల ఓటుబ్యాంకుతో అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నారు.   మహిళా రిజర్వేషన్‌కు సంబంధించిన బిల్లుకు 2014లోనే రాజ్యసభ ఆమోదం తెలిపినా, లోక్‌సభ ఆమోదం పొందలేదు. దేశ జనాభాలో 50శాతం ఉన్న మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంలో మన నేతలు ఇంకా మీనమేషాలు లెక్కస్తున్నారు. మహిళా రిజిర్వేషన్ బిల్లు ఆమోదించే ఆనవాళ్లు కనిపించడం లేదు. కార్మిక శక్తిగా, ఓటు బ్యాంకు గానే మహిళలను చూస్తున్నారు.  దేశానికి స్వ తంత్రం వచ్చి 74 సంవత్సరాలు అవుతున్నా మహిళలు ఇంకా వెనుకబడే ఉన్నారు.    ఆర్థిక, రాజకీయ, సామాజిక అన్ని రంగాల్లో నేటికి వివక్షకు గురవుతున్న మహిళ సమాన హక్కులతో పాటు జీవించే హక్కు కోసం పోరాటం సాగిస్తున్నది.    పురుషాధిక్యత, నిరక్ష్యరాస్యత, లైంగిక దాడులు, వేధింపులు నేడు మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. ఈ సమస్యల సాధన కోసం ప్రతి మహిళ ఉద్యమిం చాల్సి ఉంది.  మహిళల జీవితాలను బలి తీసుకుంటున్న దురాగాతాలను ఎదిరించేందుకు మరో ఉద్యమం రావాలి. లింగవివక్ష లేకుండా అందరికీ సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో సమాన అవకాశాలు రావాలి. అప్పుడే మహిళ సమానత్వం అన్నది సాధ్యమవుతుంది. 

జగన్ సర్కార్ కు సుప్రీం కోర్టులో మరో ఎదురు దెబ్బ

ఎపి సర్కార్ కు మూడు రాజధానుల విషయంలో సుప్రీం కోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది. మూడు రాజధానుల చట్టం, సీఆర్డీఏ చట్టం రద్దు పై హైకోర్టు విధించిన స్టేటస్ కో ఎత్తి వేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పెటిషన్ ను కోర్టు ఈరోజు కొట్టివేసింది. హైకోర్టు ఇచిన స్టేటస్ కో ఉత్తర్వుల పై విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఇప్పటికే ఈ విష్యం పై హైకోర్టు విచారణ చేస్తున్నందున ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం వెల్లడించింది. హైకోర్టులో రేపే విచారణ ఉన్నందున సుప్రీం కోర్టు వద్దకు రావడం సరికాదని స్పష్టంచేసింది. నిర్ణీత గడువులోపు హైకోర్టులో విచారణ ముగించాలని ఏపీ ప్రభుత్వం కోరగా.. హైకోర్టుకు తాము గడువు విధించలేమని కోరుతు స్పష్టం చేసింది. అయితే హైకోర్టు ఈ కేసును త్వరగా పరిష్కరిస్తుందని తాము ఆశిస్తున్నామని ధర్మాసనం తెలిపింది.దీంతో రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల అంశం పై మళ్లీ హైకోర్టులోనే తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మీకు ఓటేసిన వారినే కాటేస్తున్నారు.. సీఎం జగన్ పై లోకేష్ ఫైర్

గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో "వైసిపికి ఓటేసిన వారినే సీఎం జగన్ కాటేస్తున్నారంటూ" టీడీపీ నేత నారా లోకేష్ ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు. "మద్యపాన నిషేధం పేరుతో వైసీపీ ప్రభుత్వం సామాన్యులను దోచుకుంటున్న తీరుని సోషల్ మీడియాలో ఎండగట్టిన దళిత యువకుడు ఓం ప్రతాప్‌ను బలితీసుకున్నారని" అయన ఆరోపించారు.   తాజాగా ఈ మేరకు ఆ యువకుడి ఫోటోలను కూడా లోకేష్ తన ట్వీట్ లో పోస్ట్ చేశారు. ఒక పక్క " చంపేస్తామంటూ వైసీపీ నేతల బెదిరింపులు.. మరో పక్క పోలీసుల వేధింపుల కారణంగానే" చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని కందూరు గ్రామానికి చెందిన ఓం ప్రతాప్ చనిపోయాడని అయన ఆరోపించారు. దళితుడైన ఓం ప్రతాప్ మృతిపై విచారణ జరిపించి.. ఈ ఘటన వెనుక ప్రమేయమున్న వైసీపీ ముఖ్య నేతలను కఠినంగా శిక్షించాలని లోకేష్ డిమాండ్ చేశారు. అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు దళితులకు లేదా.. అని అయన జగన్ సర్కార్ ను ప్రశ్నించారు. అంతేకాకుండా దళితులపై జగన్ ప్రభుత్వ దాష్టీకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

టీడీపీ నేతల గ్రానైట్‌ లీజుల రద్దు.. వైసీపీ కక్ష సాధింపు‌ రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం

అధికారంలోకి వచ్చాక పలువురు టీడీపీ నేతలను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ.. మాట వినకుంటే టీడీపీ నేతలపై ఉక్కుపాదం మోపడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు టీడీపీ నేతలను టార్గెట్‌ చేసిన వైసీపీ సర్కారు.. తాజాగా ప్రకాశం జల్లాలో టీడీపీ నేతలకు చెందిన గ్రానైట్‌ క్వారీలను మూసివేయించడం తీవ్ర కలకలం రేపుతోంది. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని లెక్కచేయకుండా గనులశాఖ ఈ క్వారీలను మూయించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.   రాష్ట్రంలో గ్రానైట్‌ క్వారీలకు ప్రకాశం జిల్లా పెట్టింది పేరు. ఇక్కడ వేల సంఖ్యలో ఉన్న గ్రానైట్‌ క్వారీల నుంచి దేశ విదేశాలకు ఎగుమతులు జరుగుతుంటాయి. అయితే, జిల్లాలో గ్రానైట్‌ వ్యాపారంలో ఉన్న రాజకీయ ప్రత్యర్థులపై కొన్ని నెలల కిందట నుంచి వేధింపుల పర్వం మొదలైందన్న ఆరోపణలు ఉన్నాయి.   వైసీపీ సర్కారు అధికారంలోకి రాగానే టీడీపీ నేతలు గొట్టిపాటి రవికుమార్, శిద్ధా రాఘవరావు, పోతుల రామారావుకు చెందిన క్వారీల్లో గ్రానైట్‌ నిక్షేపాల వెలికితీతకు పర్మిట్లు నిలిపేసారు. ఈ వేధింపులు భరించలేకే శిద్దా రాఘవరావు వైసీపీలో చేరిపోయారని చెబుతారు. అందుకుతగ్గట్టే అప్పటి నుంచి ఆయనకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆయన గ్రానైట్‌ వ్యాపారం సాఫీగా సాగుతోంది. కానీ గొట్టిపాటి, పోతులకు చెందిన క్వారీలపై మాత్రం ఒత్తిళ్లు కొనసాగుతున్నాయి. పర్మిట్ల నిలిపివేతపై హైకోర్టును ఆశ్రయించి వీరిద్దరూ అనుమతులు తెచ్చుకున్నారు. కానీ ప్రభుత్వం కాలుష్య నియంత్రణ మండలి ద్వారా నోటీసులు ఇప్పించి.. పర్మిట్లు నిలిపివేయించింది. దీన్ని కూడా హైకోర్టు తప్పుబట్టింది. వారి క్వారీల్లోని నిక్షేపాల విక్రయాలకు పర్మిట్లు ఇవ్వాలని ఆదేశించింది. అయినా వాటిని ఇప్పటివరకూ ప్రభుత్వం లెక్క చేయలేదు. దీనిపై తిరిగి హైకోర్టుకు వెళ్లేందుకు రవికుమార్‌, రామారావు సిద్ధమైనట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో చివరికి క్వారీయింగ్‌ లోపాల పేరుతో వాటిని ఏకంగా మూత వేయించింది ప్రభుత్వం.    ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతల గ్రానైట్‌ లీజులు రద్దు చేయడం వైసీపీ కక్ష సాధింపు, బ్లాక్‌ మెయిలింగ్‌ రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యమని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. పలుచోట్ల టీడీపీ నేతలపైనా, సోషల్‌ మీడియా కార్యకర్తలపైనా అక్రమ కేసులు పెడుతున్నారని, వేధింపులకి దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

స్పుత్నిక్-v వ్యాక్సిన్ పై కలిసి పని చేయబోతున్న ఇండియా, రష్యా..!

ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ ను సిద్ధం చేసినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా రష్యా వ్యాక్సిన్ "స్పుత్నిక్-v"పై భారత్ ఆసక్తి చూపడంతో రష్యా ప్రభుత్వం వెంటనే ఆ వ్యాక్సిన్ కు సంబంధించిన సమాచారాన్ని మన ప్రభుత్వం తో పంచుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు.    తాజాగా మీడియాతో మాట్లాడిన రాజేష్ భూషణ్, "స్పుత్నిక్- వ్ వ్యాక్సిన్ ప్రయోగ పరీక్షలకు సంబంధించి రష్యా భారత్ కు వివరాలు అందించింది" అని అన్నారు. ప్రస్తుతం ఆ వివరాలు పరిశీలిస్తున్నామని, అక్కడ జరుగుతున్న ఆఖరి దశ ట్రయల్స్ ఫలితాలను పరిశీలించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. అయితే దాని భద్రత, ప్రభావానికి సంబంధించి వివరాలు ఇంకా అందాల్సి ఉందని తెలుస్తోంది.   ఈ వ్యాక్సిన్ కు సంబంధించి భారత్ లోని రష్యా రాయబారి కేంద్ర బయోటెక్నాలజీ కార్యదర్శి రేణు స్వరూప్, ఐసీఎమ్ఆర్ డీజీ బలరామ భార్గవ్ తో కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా భారత్ లో వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ తో పాటు ఉత్పత్తికి అనుమతి పొందేందుకు రష్యా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ సీఈఓ కిరిల్ దిమిత్రేవ్ కూడా స్వయంగా గతంలో వెల్లడించారు.