తెలుగు భాషా దినోత్సవం నాడే అస్తమించిన తెలుగు భాషాభిమాని

నందమూరి హరికృష్ణ ద్వితీయ వర్ధంతి నేడు. 2018 ఆగస్టు 29న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. తెలుగు భాషని ఎంతగానో అభిమానించే హరికృష్ణ.. తెలుగు భాషా దినోత్సవం నాడే కన్నుమూయడం గమనార్హం.   నందమూరి తారక రామారావు తనయుడిగా తెలుగువారికి పరిచయమైన హరికృష్ణ.. నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు. నిస్వార్ధమైన వ్యక్తిగా, చైతన్య రథసారధిగా ప్రజల హృదయాలలో శాశ్వతస్థానాన్ని సంపాదించుకున్నారు. చేసింది తక్కువే సినిమాలే అయినప్పటికీ నటుడిగా ప్రేక్షకుల్లో బలమైన ముద్ర వేశారు.   హరికృష్ణ తెలుగు భాషని ఎంతగానో అభిమానించేవారు. తెలుగు భాషపై ఆయనకు ఎంత అభిమానం ఉందో చెప్పటానికి రాజ్యసభలో ఆయన తెలుగులో మాట్లాడిన ఒక్క సంఘటన చాలు. రాష్ట్ర విభజన సమయంలో రాజ్యసభ సాక్షిగా తెలుగులో మాట్లాడి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాటలకు పలువురు నవ్వుతున్నా.. ఏ మాత్రం వెనకడుగు వేయకుండా.. 'ఇది మా మాతృభాష.. మాతృభాషలోనే మా ఆవేదన తెలియజేస్తాం' అంటూ తెలుగులోనే తన గళాన్ని వినిపించారు. అంతేకాదు, 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని గుర్తుచేస్తూ రాజ్యసభలో తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేశారు. అంతలా తెలుగు భాషని అభిమానించే ఆయన.. తెలుగు భాషా దినోత్సవం నాడే రోడ్డు ప్రమాదంలో మరణించారు.   హరికృష్ణ ద్వితీయ వర్ధంతి సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనను గుర్తుచేసుకున్తున్నారు.

కరోనా వచ్చినా.. కళ్యాణం ఆగదు

కక్కొచ్చినా.. కళ్యాణం వచ్చినా ఆగదు అనేది నానుడి. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా దీన్ని కాస్త మార్చి కక్కోచ్చినా.. కరోనా వచ్చినా కళ్యాణం ఆగదు అని చెప్పుకోవచ్చేమో..   కరోనా కాలంలో ఖర్చులు కలిసివస్తాయని అనుకున్నారేమో తమిళనాడులో పెళ్ళిళ్లు జోరుగా సాగుతున్నాయి. ఒక్కరోజే రికార్డు స్థాయిలో రెండువందల పెళ్ళిళ్లు జరగడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. కేవలం వధువరుల సమీప బంధువులతోనే నిరాడంబరంగా పెండ్లివేడుక ముగిస్తున్నారు. తమిళనాడులోని ప్రముఖ ఆలయాల్లో శుక్రవారం ఒక రోజే రెండువందల పెళ్ళిళ్లు జరిగాయి. మధురై, కడలూరు, మురుగన్ ఆలయాల్లో 50కి పైగా పెళ్ళిళ్లు జరిగాయి.    కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్న ప్రస్తుతం సమయంలో పెళ్ళికి ఏమోచ్చింది అంత తొందర అంటూ మరికొందరు ముక్కున వేలేసుకుంటున్నారు. నిజానికి శ్రావణమాసంలో వేలాది పెళ్ళిళ్లు అయ్యేవి.. కరోనా కారణంగా చాలావరకు ఆగిపోయాయి అంటున్నారు మరికొందరు. ఏదీఏమైనా కరోనా వచ్చినా కావల్సిన కళ్యాణం కాకమానదు.

పద్మ పురస్కారాల నామినేషన్ గడువు పెంపు

భారతదేశ పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల కోసం నామినేషన్ గడువును వచ్చేనెల (సెప్టెంబర్)15వ తేదీవరకు పొడిగించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పద్మ అవార్డుల కోసం నామినేషన్ ప్రక్రియను మే ఒకటో తేదీ నుంచి ప్రారంభించారు. ఇప్పటివరకు 8,035  దరఖాస్తులు కేంద్రానికి అందాయి. వాటిలో 6,361 దరఖాస్తుల పరిశీలన కూడా పూర్తి అయ్యింది. అయితే కరోనా విపత్కర పరిస్థితి కారణంగా చాలామంది తమ నామినేషన్లు పంపించలేకపోయారని వారందరి కోసం ముగింపు తేదీని పొడిగిస్తున్నామని కేంద్ర హోంమంత్రిత్వశాఖ పేర్కోంది. ఆసక్తిగల వారు తమ నామినేషన్లు, ప్రతిపాదనలు వచ్చే నెల 15వ తేదీలోగా https://padmaawards.gov.in.కు పంపవచ్చు.   కళలు, సాహిత్యం, క్రీడలు, సామాజిక సేవ తదితర రంగాల్లో కృషి చేసిన వారికి 1954నుంచి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను అందిస్తుంది. పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పేరుతో మూడు కేటగిరిలుగా ఈ అవార్డులను అందిస్తారు. ఈ  పురస్కారాలకు ఎంపికైన వారిని ప్రతి ఏడాది రిపబ్లిక్ డే రోజు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందజేస్తారు.

వచ్చేనెల 10న వైమానికదళంలోకి రాఫెల్ ఫైటర్ జెట్స్

అత్యంత శక్తివంతమైన ఫైటర్ జెట్ విమానాలు రాఫెల్ యుద్ధ విమానాలు ఐదు ఫ్రాన్స్ నుంచి భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ యుద్ధవిమానాలు భారత్ వైమానికదళంలోకి ఇంకా అధికారికంగా చేరలేదు. వచ్చేనెల ( సెప్టెంబర్ ) 10న అధికారికంగా వీటిని భారత వైమానిక దళంలోకి తీసుకుంటారు.   ఫ్రాన్స్ నుంచి భారత్ 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. వాటిలో మొదటి విడతగా ఐదు యుద్ధవిమానాలు జులై 29న భారత్ భూభాగంపై ల్యాండ్ అయ్యాయి. రెండో విడతగగా మరో నాలుగు యుద్ధవిమానాలు ఈ ఏడాది అక్టోబర్ నాటికి వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మరిన్ని యుద్ధవిమానాలు భారత్ చేరుకుంటాయి. భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రికత్త పరిస్థితులను ముందుగానే అంచనా వేస్తూ రాఫెల్ యుద్ధ విమానాలను భారత్ సరిహద్దుల్లోకి చేర్చాలని వైమానిక దళం ఆలోచిస్తుంది. అందుకు అనుగుణంగా రాఫెల్ యుద్ధ విమానాలను వైమానిక దళంలోకి అధికారికంగా తీసుకుంటారు. ఈ కార్యక్రమానికి ఫ్రెంచ్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ ముఖ్యఅతిధిగా హాజరు అయ్యే అవకాశాలున్నాయి.

హిట్ లిస్ట్ లో పేరు.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు భద్రత పెంపు..

తెలంగాణాలో ఉన్న ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు రాష్ట్ర ప్రభుత్వం భద్రత పెంచింది. అయన పేరు ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో ఉండడంతో ఆయనకు భద్రత పెంచుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేసారు. ఇప్పటి నుండి డిసిపి స్థాయి అధికారి ఆయన భద్రత చూసుకుంటారని కమిషనర్ తెలిపారు. అంతేకాకుండా ఇక పై నుండి బైక్ పై ప్రయానాలు మానుకోవాలని ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ను ఉపయోగించాలని కమిషనర్ రాజాసింగ్ ను కోరారు.   ఇది ఇలా ఉండగా ఈ రోజు ఉదయాన్నే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటికి పోలీసులు వచ్చి భద్రతాపరమైన చర్యలు చేపట్టారు. అయితే ఎటువంటి సమాచారం లేకుండా పొలుసులు హడావిడి చేస్తుండటంతో రాజాసింగ్ పోలీసులను వివరణ కోరగా "ఈ మధ్య కొందరు ఉగ్రవాదుల్ని నిఘా వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి. వారి దగ్గర దొరికిన హిట్ లిస్టులో మీ పేరు ఉంది. మిమ్మల్ని చంపాలని వారు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం మీకు భద్రతను పెంచింది" అని పోలీసులు చెప్పడంతో అవాక్కయిన రాజాసింగ్ "నన్ను చంపే ప్రయత్నం ఎవరు చేస్తారు.. అసలు ఆ ఉగ్రవాదులు ఎవరో చెప్పండి" అని పోలీసులను కోరారు. అయితే హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ మాత్రం ఇకపై మీరు బైక్‌పై తిరగొద్దు. ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కారులోనే వెళ్లండి అని ఎమ్మెల్యేకి సూచించారు. అయితే ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం ఇవన్నీ కాదు... అసలు నాకు ఎవరి నుంచి ప్రాణాహాని ఉందో చెప్పండి అని డిమాండ్‌ చేస్తున్నారు. ఒకవేళ మీరు చెప్పకపోయినా ఎలా తెలుసుకోవాలో నాకు తెలుసు. దీనిపై కేంద్ర హోంశాఖ కు లెటర్ రాసి నిజానిజాలు బయటకు లాగుతాను అన్నట్లుగా సమాచారం.

తెలుగు భాషా ఉద్యమ పితామహుడు

గిడుగు వెంకట రామ్మూర్తి  (29 ఆగష్టు , 1863 - 22జనవరి, 1940)   తెలుగు భాష వైభవానికి పునాదులు వేసిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి పంతులు. అందుకే ఆయనను తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడుగా పిలుస్తారు. గ్రాంథికభాషలో పండితులకు మాత్రమే అర్థం అయ్యేలా ఉన్ తెలుగు భాష మాధుర్యాన్ని ప్రజలందరికీ అందేలా కృషి చేశారు. తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చారు.    శిష్ట వ్యవహారికం పేరిట వాడుక భాషలో బోధనకు ఆయన పెద్దపీట వేశారు. తెలుగు పదాల్లోని భావాన్ని, స్పష్టతను పామరులకు సైతం అర్థమయ్యేలా తెలియజెప్పిన మహనీయుడు. తెలుగు వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. ఆయన జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం”గా నిర్వహిస్తారు.   రామ్మూర్తి శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాల పేటలో 29 ఆగస్టు1863న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వెంకమ్మ, వీర్రాజు. స్థానిక పాఠశాలలో చదువుకున్న ఆయన 1875లో తండ్రి మరణించడంతో విశాఖలోని తన మేనమామ ఇంటికి వెళ్లారు. అక్కడ హైస్కూల్లో చేరాడు. పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు తెలుసుకోవడంపై ఆయనకు ఆసక్తి.  దాంతో దేవాలయం శాసనాలను సొంతగా చదివి అర్థం చేసుకునేవారు. పదోతరగతి పూర్తి చేసిన తర్వాత ప్రైవేటు టీచర్ గా పనిచేస్తూ డిగ్రీ డిస్టింక్షన్‌లో పూర్తి చేశారు. గజపతి మహారాజు  కాలేజీలో అధ్యాపకుడిగా చేరారు. పిల్లలకు అర్థమయ్యేలా  తెలుగు భాష బోధనను రోజు మాట్లాడుకునే వ్యావహారికంలో చేయాలన్న ప్రయత్నం ఆయనది.  1907లో ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూళ్ల ఇన్‌స్పెక్టర్‌గా వచ్చిన జె.ఎ.యేట్స్ అనే బ్రిటిష్ అధికారి నుంచి రామ్మూర్తికి మద్దతు లభించింది. దాంతో అప్పటివరకు గ్రాంధికంగా ఉన్న తెలుగుభాషా బోధనను సరళతరం చేస్తూ వ్యావహారికంలో బోధన ప్రారంభించారు. రామ్మూర్తి ఆశయాన్ని గుర్తించిన శ్రీనివాస అయ్యంగార్, గురజాడ అప్పారావు, మరికొందరితో కలిసి వ్యావహారిక భాషలో బోధనోద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం 'తెలుగు' అనే పత్రికను  ప్రారంభించారు. ఈ ఉద్యమం  ప్రభావంతో అప్పటివరకు గ్రాంధిక భాషలో నిర్వహించే పరీక్షలు వ్యావహారిక భాషలోనూ రాసే వీలు కలిగింది. దాంతో స్కూలు, కాలేజీ పాఠ్యపుస్తకాలు వ్యావహారిక భాషలో విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి.   తెలుగు భాషకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా మద్రాసు ప్రభుత్వం రావు బహద్దూర్ బిరుదు తో ఆయనను సత్కరించింది. కైజర్ ఈ హింద్ బిరుదు ఆయనను వరించింది. 22జనవరి,1940న మరణించేంతవరకు తెలుగుభాషే ఊపిరిగా ఆయన జీవించాడు.

తెలంగాణలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా.. తాజాగా ఎన్ని కేసులంటే..

తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ భారీగా పెరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం రోజు రెండు వేల లోపు పాజిటివ్ కేసులు నమోదవుతుండగా తాజాగా రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 2,751 కేసులు నమోదయ్యాయని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 9 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 808కి చేరింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,20,116 కి చేరింది. అయితే నిన్న 1675 మంది కరోనా నుండి కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 89350కి చేరింది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం తెలంగాణలో 30008 యాక్టివ్ కేసులు ఉండగా వీరిలో 23049 మంది పేషెంట్లు ఇళ్లలోనే ఉంటూ ట్రీట్‌మెంట్ పొందుతున్నారు.   తెలంగాణలో నిన్న మొత్తం 62300 మందికి కరోనా టెస్టులు జరిగాయి. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 1266643కి చేరింది. అయితే మరో 1010 టెస్టుల రిపోర్టులు రావాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా GHMCలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. నిన్న కొత్తగా 432 పాజిటివ్ కేసులొచ్చాయి. అలాగే నిన్న కరీంనగర్‌లో 192, రంగారెడ్డి 185, నల్గొండ 147, ఖమ్మం 132, మేడ్చల్ మల్కాజిగిరిలో 128, నిజామాబాద్ 113, సూర్యాపేట 111, వరంగల్ అర్బన్ జిల్లాలో 101 కేసులు నమోదయ్యాయి.

భావోద్వేగాలకు అక్షరాలను జోడించే అరుదైన భాష తెలుగు

తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పతనం  తెలుసుకున్నవాళ్లకి తెలుగే ఒక మూలధనం అంటూ ఓ సినీకవి కలం నుంచి జాలువారిన అక్షరాలు తెలుగుభాష గొప్పదనాన్ని ప్రపంచ యవనికపై ఆవిష్కరించి భాషలోని మాధుర్యాన్ని నలుదిశగా చాటుతున్నాయి. తీయ్యనైన తేనెలూరే తెలుగు భాషకు గుర్తింపు తీసుకువచ్చిన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని తెలుగుభాషా దినోత్సవంగా ప్రతిఏటా నిర్వహించుకుంటున్నాం.  తెలుగుభాషలోని స్పష్టత, భావం, అక్షరాల పొందిక అన్నీ అపురూపంగా ఉంటాయి. అందుకే ఎంతో మంది కవులు తెలుగు అక్షర కుసుమాలతో మాలలల్లీ అమ్మభాషను కమ్మనైన భాషగా భావితరాలకు అందించారు. లెక్కకు మించి పదప్రయోగాలు చేస్తూ ప్రాచీన భాషను పదిలపరిచే ప్రయత్నం చేస్తున్నారు. మనసులోని భావోద్వేగాలకు అక్షరాలను జోడించే అరుదైన భాష తెలుగు మాత్రమే. తెలుగు భాష కోసం గిడుగు రామ్మూర్తి పంతులు  చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ తెలుగువెలుగులు దిశదశగా వ్యాపింపచేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.   ప్రపంచవ్యాప్తంగా పదికోట్ల మంది ప్రపంచంలో ఉన్న వేలాది భాషల్లో ప్రాచీనభాషగా గుర్తింపు పొందిన భాష మన తెలుగు. భారతదేశంలో తెలుగు మాతృభాషగా మాట్లాడేవారి సంఖ్య దాదాపు ఎనిమిది కోట్లకు పైగా ఉంది. హిందీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగు. ప్రపంచవ్యాప్తంగా పదికోట్ల మంది మాతృభాష తెలుగే. ప్రాంతీయ భాషల్లో మొదటిస్థానం, ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడే భాషలలో 15వ స్థానంలో తెలుగు ఉంది. అతి ప్రాచీనమైన భాషల్లో సంస్కృతంతో  తెలుగును కేంద్రప్రభుత్వం గుర్తించింది. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా తెలుగు భాషకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. తెలుగుభాషలోని పదాలు ఇటాలియన్ భాష మాదిరిగా ఉండటం ఇందుకు కారణం. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవదాయులచేత కొనియాడబడిన భాష తెలుగు. ప్రాచీన కాలంలోనే కాదు నేటి ఆధునిక కాలంలోనూ ఎంతో గొప్పసాహిత్యం తెలుగు భాష సొంతం. ఛందస్సు, పద్యాలు, వచన కవితలు, నాటికలు, జానపదాలు, నానీలు, హైకులు సాహిత్యంలో పలు ప్రక్రియల్లో తెలుగుభాషలోని అక్షరమాల పొందికగా వొదిగిపోతుంది.   విదేశాల్లో తెలుగు వైభవం.. తెలుగు రాష్ట్రాల్లో ఆంగ్లమాధ్యమంలో చదువులు కొనసాగించాలని ప్రభుత్వాలు ఆలోచిస్తుంటే విదేశాల్లో తెలుగువారు మాత్రం తమ పిల్లలకు వేమనశతకాల నుంచి భగవద్గీతశ్లోకాల వరకు నేర్పిస్తున్నారు. అమ్మా అన్న పిలుపులోని కమ్మదనాన్ని తెలుగుగడ్డపై మరిచిపోయి.. మమ్మీగా మారినా అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికా ఖండాల్లో స్థిరపడిన తెలుగువారు మాత్రం తమ మాతృభాషపై మమకారాన్ని వీడలేదు. అంతర్జాతీయ వేదికలపై తెలుగుభాషలో వెబ్ నార్లు నిర్వహిస్తూ అనేక సంస్థలు తెలుగుభాషను బతికిస్తున్నాయి.

సీఎం జగన్ నియోజకవర్గంలో ఎస్సైని ఢీ కొట్టి మరీ ఈడ్చుకెళ్ళిన మద్యం అక్రమ రవాణాదారులు..

ఏపీలో మద్యం అక్రమ రవాణాదారుల దురాగతాలు నానాటికి పెరిగిపోతున్నాయి. తాజాగా సాక్షాత్తు సీఎం జగన్ సొంత నియోజకవర్గం అయిన పులివెందులలో అక్రమ మద్యం రవాణా చేస్తున్న ఓ వ్యక్తి బరితెగించాడు. ఏకంగా ఎస్సైనే వాహనంతో ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో ఎస్సైకి తృటిలో తప్పించుకుని.. మరీ నిందితుడిని అరెస్టు చేశారు. కారులో మద్యం అక్రమంగా రవాణా అవుతోందన్న సమాచారంతో ఎస్సై గోపినాథ్ రెడ్డి శుక్రవారం పులివెందులలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక రాఘవేంద్ర థియేటర్ సమీపంలో అటువైపుగా వెళ్తున్న ఓ కారును ఆపేందుకు ఎస్సై ప్రయత్నించారు. అయితే కారును నడుపుతున్న వ్యక్తి ..పోలీసులను చూసి వారిని భయపెట్టేందుకు కారును ముందుకు వేగంగా కదిలించారు.   దీంతో అప్రమత్తమైన ఎస్సై జారి కిందపడకుండా కారును గట్టిగా పట్టుకున్నారు. ఎస్సై కారుపై వేలాడుతుండగానే నిందితుడు దాదాపు రెండు కిలోమీటర్ల దూరం కారును పోనిచ్చాడు . ఈ క్రమంలో ఎస్సై గోపీనాథ్‌రెడ్డి చాకచక్యంగా వ్యవహరించి కారు అద్దాలను పగలగొట్టారు. ఇంతలో కారును వెంబడించిన పోలీసులు.. వాహనాన్ని అడ్డుకోవడంతో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఆ కారును, అందులోని 80 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రాణాలకు తెగించి నిందితులను పట్టుకున్న ఎస్సైపై ఉన్నతాధికారులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే సాక్షాత్తు సీఎం జగన్ సొంత నియోజకవర్గంలో ఇటువంటి ఘటన జరగడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

వైజాగ్ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ కాకుండా ఎవరూ అడ్డుకోలేరు: ఎంపీ విజయసాయిరెడ్డి 

విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ కాకుండా ఏ శక్తీ ఆపలేదని వైసీపీ రాజ్యసభసభ్యుడు విజయసాయిరెడ్డి ఈరోజు అన్నారు. ఒక పక్క హైకోర్టు, సుప్రీం కోర్టులలో మూడు రాజధానుల వ్యవహారం పై కేసులు నడుస్తుండగా.. మరోపక్క హైకోర్టు స్టేటస్ కో కొనసాగుతుండగా వైసిపి ఎంపీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతేకాకుండా రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు మూడు రాజధానులకు మద్దతు పలుకుతున్నారని అయన చెప్పారు. టీడీపీ నేత పంకచర్ల రమేశ్ బాబు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. రమేశ్ బాబును పార్టీలోకి స్వాగతిస్తున్నామని చెప్పారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ఆయన సేవలను పార్టీ వినియోగించుకుంటుందని తెలిపారు. ఇక వైసిపికి తలనొప్పిగా తయారైన ఎంపీ రఘురామకృష్ణరాజు సభ్యత్వాన్ని లోక్ సభ స్పీకర్ రద్దు చేయాలని ఆయన కోరారు. అంతేకాకుండా స్టాండింగ్ కమిటీ నుంచి కూడా తొలగించాలని కూడా అయన విజ్ఞప్తి చేశారు.

విశాఖ గెస్ట్ హౌస్ పై కేంద్ర మంత్రికి ఫిర్యాదు.. డైలీ బేసిస్ లో వైసిపికి షాకులిస్తున్న రఘురామ

విశాఖలోని కాపులుప్పాడ లో ఎపి ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రభుత్వ గెస్ట్‌ హౌస్‌ పై  వైసిపి ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర పర్యాటక శాఖమంత్రికి  ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైకోర్టు వద్దని చెప్పినా లెక్క చేయకుండా 30 ఎకరాల గ్రేహౌండ్స్ భూమిని గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం కలెక్టర్ కు అప్పగించడం కోర్టులను అపహాస్యం చేయడం కాదా అని అయన ప్రశ్నించారు. ఆవ భూములపై హైకోర్టు విచారణను తాను స్వాగతిస్తున్నానన్నారు. అవినీతి చోటుచేసుకున్న ఆవ భూముల కేసును సీబీఐ విచారణ చేస్తుందని కూడా ఆశిస్తున్నానని ఆయన అన్నారు. ఈ విషయంలో సీఎం జగన్‌ తన పారదర్శకత నిరూపించుకోవాలని అయన అన్నారు. ఈ సందర్బంగా మాటల్లోనే కాదు.. చేతల్లో కూడా సూపర్‌ అని.. సీఎం జగన్‌ నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తణుకు, ఆచంటలో జరిగిన అవినీతితో జరిగిన రూ.500 కోట్ల నష్టానికి బాధ్యులెవరని సీఎంను తాను ప్రశ్నిస్తున్నానని రఘురామరాజు అన్నారు.    తాజాగా అంబటి కృష్ణారెడ్డికి కేబినెట్‌ హోదా కల్పించారని అయితే కులాన్ని బట్టి పోస్టు కాకుండా.. అర్హతలను బట్టి పోస్టులు ఉండాలని అయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలా పోస్టింగులు ఇచ్చి జగన్ తన పేరు చెడకొట్టుకుంటున్నారని ఆయన అన్నారు. సీఎం జగన్ తన సలహాదారులను తగ్గిస్తే మంచిదని ప్రజలు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా రఘురామరాజు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇసుక కొరత ఇలాగే కొనసాగితే బిల్డర్లు ఆత్మహత్య చేసుకోవడమేనని, భవన కార్మికులను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. "పెయిడ్‌ ఆర్టికల్స్‌ నిజం కావు, అలాగే మన పేపర్‌లో వచ్చేవన్నీకూడా నిజం కావు, అయితే మీరు అన్ని సమస్యలను పరిష్కరించగలరన్న నమ్మకముందని" రఘురామ రాజు వ్యాఖ్యానించారు.    నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణం రాజు ఢిల్లీలో ఉండి ఇలా డైలీ ఎదో ఒక అంశం తీసుకుని వైసిపి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుండటంతో అటు అధికారపక్షం ఎం చేయాలో తెలీక తలపట్టుకుంటుంటే మరో పక్క ప్రతిపక్షాలకు కూడా పెద్దగా పని లేకుండా పోతోంది.

సీఎం కార్యక్రమంలో నిబంధనలు గాలికొదిలేసిన నాయకులు!!

కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలో తమను మించిన వారు లేరని, ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే గొప్పగా ఈ రోగాన్ని నిరోధించడంలో అన్ని రాష్ట్రాలకన్నా ముందుందని గొప్పలు పలికే రాష్ట్ర ప్రభుత్వం, ఈ రోజు స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన కార్యక్రమాన్ని చూస్తే ఈ కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతున్నదో అర్ధమవుతుంది.   వైఎస్సాఆర్ వేదాద్రి ఎత్తిపోతల పధకానికి ఆన్లైన్ లో స్వయానా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు రిమోట్ ద్వారా శంఖుస్థాపన చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్, జగ్గయ్యపేట ఎమ్యెల్యే సామినేని ఉదయభానుతో సహా వాసిరెడ్డి పద్మ తదితరులు హాజరవ్వడం జరిగింది. అయితే కార్యక్రమానికి హాజరైన వారిలో ఎవ్వరుకూడా మాస్కులు సరిగా ధరించినట్లు దాఖలాలు కనబడనేలేదు.    కొందరైతే, అసలు మాస్క్లలు  లేకుండానే దీనికి హాజరైనట్లు ప్రత్యక్షగానే కనబడుతోంది. ఇక, సామజిక దూరం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.     మాస్కులు దర్కించకుండా, సామజిక దూరం పాటించకుండా వినాయక వుత్సవాలనుగాని, పెళ్ళిళ్ళను గాని మరె ఇతర కార్యక్రమాలు చేపట్టడానికి వీలులేదని, ఆలా జరిగితే దానికి తగిన మూల్యం చెల్లించవలసి వస్తుందని చెప్పే ప్రభుత్వమే చివరకు వాటిని ధిక్కరించి అధికారిక కార్యక్రమాలను చేప్పట్టడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అధికార పార్టీ నాయకులు దీనికి ఏమి సమాధానం చెబుతారో వేచి చూడాలి.     మాస్కు ధరించలేదని అనేక మంది సామాన్యమానవులకు పెనాల్టీలు విధించిన ప్రభుత్వం, స్వయంగా అధికార కార్యక్రమాలకే ఎలాంటి నిబంధనలు పాటించలేదంటే, రూల్స్ అనేవి కేవలం సామాన్య మానవులకేనా అనే ప్రశ్న తలెత్తక మానదు.

ఆ జీఓ.. దొడ్డి దారిన రాజధానిని తరలించడానికేనా?

గురువారం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ అర్ధం దొడ్డి దారిన రాజధానిని తరలించడానికేనా అంటే, అవుననే సమాధానం వొస్తోందీ రాజకీయ మరియు అధికార వర్గాలనుండి.    రాష్ట్ర ప్రభుత్వం సాధారణ పరిపాల శాఖ ద్వారా నిన్న జీవో నెంబర్ 1353 ని విడుదల చేసింది. దీనీలో, విశాఖపట్నం దగ్గరలోని భీమునిపట్నం మండలంలో వున్న గ్రేహౌండ్స్ కు సంబంధించిన సర్వే నెంబర్ 386/2 లోని 300 ఎకరాలలో 30 ఎకరాలు విశాఖపట్నం జిల్లా కల్లెక్టర్ పేరుపై స్టేట్ గెస్ట్ హౌస్ కట్టడానికి ట్రాన్స్ఫర్ చెయ్యాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.  దీంతో, ముఖ్యమంత్రి జగన్ రాజధాని తరలింపుపై చర్యలు మొదలు పెట్టారని, దొడ్డిదారిన తరలింపు మొదలైనట్లేనని రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమయింది. రాజధానిపై న్యాయ వివాదం ఇప్పట్లో పరిష్కారం అయ్యే సూచనలు కనబడక పోవడంతో జగన్ ఇలా దొడ్డి దారిని ఎంచుకున్నారని, దీనిపై కూడా త్వరలో కోర్టుకు వెళ్తామని కొందరు రాజకీయ నాయకులంటున్నారు.    రాజధాని వివాదంపై రాష్ట్ర హై కోర్ట్ లో సెప్టెంబర్ 21 నుండి రోజువారీ విచారణ జరిగే అవకాశం ఉన్నప్పటికీ, వివాదం అంతటితో ఆగే అవకాశాలు లేవు. హైకోర్టులో ఒకవేళ తమకు ప్రతికూలంగా జడ్జిమెంట్ వస్తే వారు సుప్రీమ్ కోర్ట్ కు కూడా వెళ్ళే అవకాశాలే వున్నాయి కాబట్టి, ముందు అవసరమైన బిల్డింగ్లు కట్టిస్తే వెంటనే అక్కడకు తరలి పొవచ్చనే ఉద్దేశంతోనే, జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకుల భావన.    ప్రస్తుతం గెస్ట్ హౌస్ గా చెబుతున్నా, హై కోర్టుల్లో ప్రభుత్వ అనుకూల తీర్పు వచ్చిన మరుక్షణం, పిటీషర్లు సుప్రీమ్ కోర్టుకు వెళ్లబోయే ముందే ఈ గెస్ట్ హౌస్ ను సిఎం క్యాంప్ కార్యాలయంగా మార్చుకుంటే సరిపోతుందనేది ప్రభుత్వ ఆలోచనగా పరిశీలకులు భావిస్తున్నారు.    అయితే,  గెస్ట్ హౌస్ నిర్మాణంపై ఇప్పటికే ఒకరు హైకోర్టుకు వెళ్లారని, ఆ పిటిషన్ పై కౌంటర్ దాఖలుకు సెప్టెంబర్ 10 వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమయం ఇచ్చిందని కూడా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనప్పటికి, జగన్ ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా రాజధాని తరలింపులో మాత్రం వెనకడుగు వెయ్యరనేది స్పస్టమవుతున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూద్దాం ఏంముజరుగుతుందో. 

ఆ ప్రతిష్టాత్మక పథకం టీఆర్ఎస్ పరువు తీసే పథకంలా మారిపోతోందా!!

టీఆర్ఎస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం.. ఆ పార్టీ పరువు తీసే పథకంలా మారిపోతోంది. రెండున్నర లక్షల ఇండ్లు కట్టిస్తామని ప్రకటించి ఐదేండ్లు పూర్తైయినా.. అందులో ఐదు శాతం మాత్రమే పంపిణి చేశారు. ఇండ్ల నిర్మాణంలో ఆలస్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. విపక్షాలు ఉద్యమాలు కూడా చేస్తున్నాయి. ఆ సమస్యతో ఇబ్బంది పడుతున్న కేసీఆర్ ప్రభుత్వానికి మరిన్ని చిక్కులు వస్తున్నాయి. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో ప్రారంభానికి ముందే డబుల్ బెడ్ రూం ఇండ్ల స్లాబ్స్ పెచ్చులూడుతుండడం దుమారం రేపుతోంది. రామకృష్ణా పురం పంచాయతీ పరిధి హరిచంద్రపురం గ్రామం గుట్టల సమీపంలో 50 డబుల్బెడ్రూమ్ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో ఇంటికి ఐటీడీఏ రూ.5.40 లక్షలు కేటాయించింది. ఇండ్ల నిర్మాణాన్ని ఆర్వీఎం ఇంజనీరింగ్ ఆఫీసర్లకు అప్పజెప్పింది. టెండర్ పొందిన కాంట్రాక్టర్ నాణ్యతను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు పూర్తి చేశాడు. ఇండ్ల నిర్మాణం పూర్తయినా ఇంకా లబ్ధిదారులకు కేటాయించలేదు. బిల్డింగ్ స్లాబ్ మీద చేతితో తీస్తుంటే పెచ్చులూడుతోంది. లోపల అర ఇంచు మందం సిమెంట్ లేకుండా పూర్తిగా ఇసుక మాత్రమే తేలుతుంది.   స్లాబ్ పెచ్చులూడిపోయిన విజువల్స్ ను .. కొందరు యువకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి. సీఎం కేసీఆర్ పనితీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. బంగారు తెలంగాణలో ఇండ్లు ఇలాగే నిర్మిస్తారంటూ సెటైర్లు వేస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నాణ్యతపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఎలా ఉండాలంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. సర్పంచ్ తో పాటు స్థానికులు  డబుల్బెడ్రూమ్ ఇండ్ల దగ్గర ఆందోళన చేశారు. నాణ్యతా లోపంతో నిర్మించిన కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పంపిణి చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నాసిరకంగా ఉన్నాయని గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో  వరద నీరు ఇండ్లలోకి చేరింది. మరికొన్ని ప్రాంతాల్లో వర్షానికి నీరు గోడలపై కారింది. మరికొన్ని చోట్ల స్లాబు, గోడలకు పగుళ్లు వచ్చాయి.    కామేపల్లి  ఘటనతో రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇతర ఇండ్ల నాణ్యతపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు తూతూమంత్రంగా పనులు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. బిల్లులు సమయానికి రాకపోవడం కారణమంటున్నారు. బిల్లులు రాకపోవడంతో విసిగిపోతున్న కాంట్రాక్టర్లు.. నాసిరకంగా నిర్మాణాలు చేసి చేతులు దులుపుకుంటున్నారని చెబుతున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని, కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు తీసుకుంటున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కమీషన్లు ఇచ్చిన కాంట్రాక్టర్లు.. అడ్డగోలుగా ఇండ్లు నిర్మిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడుతున్నారు.

కరోనా జాతి వైరస్ లన్నీంటికీ చెక్

వ్యాక్సిన్ రెడీ చేస్తున్న కేంబ్రిడ్జీ వర్సిటీ   కరోనా వైరస్ చాలా సాధారణంగా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది, దగ్గు లేదా ముక్కు కారడం లాంటి ప్రారంభ లక్షణాలతో దానిని గుర్తించవచ్చు. కానీ కరోనా కుటుంబానికే చెందిన సార్స్(సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్), మర్స్(మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వంటి కొన్ని వైరస్‌లు చాలా ప్రమాదకరం. వుహాన్ నుంచి వ్యాపించిన అంటువ్యాధులకు కారణమైన వైరస్‌కు 'నావెల్ కరోనా వైరస్ లేదా కోవిద్ 19 పేరు పెట్టారు. ఇది కరోనాకుటుంబానికి చెందిన కొత్త జాతి వైరస్. ఈ కొత్త జాతి వైరస్ ను అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి.  పనిలో పనిగా కరోనా జాతిలోని అన్ని వైరస్ లకు చెక్ పెట్టేందుకు కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధనలు నిర్వహిస్తోంది.   కరోనా జాతికి చెందిన అన్ని రకాల వైరస్ ల జన్యువులను ఉపయోగించి డీఐవోఎస్‌-కోవాక్స్‌2 అనే వ్యాక్సిన్‌ను ఇప్పటికే అభివృద్ధి చేశామని కేంబ్రిడ్జి పరిశోధనబృందం తెలిపింది. ఈ వ్యాక్సిన్ పై ప్రయోగాలు పూర్తి అయ్యాయని క్లినికల్‌ ట్రయల్స్‌ మాత్రమే నిర్వహించాల్సి ఉన్నదని వెల్లడించారు. ట్రయల్స్‌ విజయవంతమైన తర్వాత రోగులకు ఏ మాత్రం నొప్పి కలుగకుండా ‘స్ప్రింగ్‌ పవర్డ్‌ జెట్‌ ఇంజిక్షన్‌' (సూది లేకుండా టీకాను శరీరంలోకి ఎక్కించడం) ద్వారా వ్యాక్సిన్ ఇస్తామంటున్నారు ఈ పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ జోనథాన్ హీనే.   కరోనా వైరస్ శ్వాసవ్యవస్థపై  తీవ్ర ప్రభావం చూపిస్తుంది. 1960ల్లో ఈ వైరస్ ని కనుగొన్నారు. ఇప్పటి వరకూ  ఆరు రకాల కరోనా వైరస్‌లను గుర్తించారు. హ్యూమన్‌ కరోనావైరస్‌ 229ఈ, హ్యూమన్‌ కరోనావైరస్‌ ఓసీ 43, సివియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ (సార్స్‌-సీఓవీ), హ్యూమన్‌ కరోనావైరస్‌ ఎన్‌ఎల్‌ 63, హ్యూమన్‌ కరోనావైరస్‌ హెచ్‌కేయూ 1, మిడిల్‌ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ కరోనావైరస్‌ (మెర్స్‌-సీఓవీ).  ఇవి ఎక్కువగా పక్షులు, క్షీరదాలపై ప్రభావం చూపిస్తాయి.   అయితే కొత్తగా వచ్చిన కోవిద్ 19 వైరస్ మనుషులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వైరస్ సోకినప్పుడు తేలికపాటి లక్షణాలతో ప్రారంభమై వ్యాధి తీవ్రరూపం దాల్చి ప్రాణాంతకంగా మారుతుంది. ఈ రకమైన వైరస్ సోకిన వారిలో 10 నుంచి 20శాతం మందికి చికిత్స అవసరం అయితే రెండు నుంచి మూడు శాతం మంది మరణిస్తారు. అలాంటి కొత్త వైరస్ కొవిడ్‌-19 నిర్మాణాన్ని 3డీ కంప్యూటర్‌ మోడలింగ్‌ ద్వారా  విశ్లేషించి వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశారు. ఇప్పడు ప్రపంచమానవాళి ఎదుర్కోంటున్న సమస్యనే కాకుండా భవిష్యత్‌లో జంతువుల నుంచి మానవులకు సోకే అవకాశమున్న సార్స్‌, మెర్స్‌ వంటి కరోనా జాతి వైరస్‌ రకాలను కూడా కట్టడి చేసేలా ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశారు కేంబ్రిడ్జి పరిశోధనకులు. ఇందుకోసం కరోనా జాతి వైరస్‌ జన్యు క్రమాలను కూడా విశ్లేషించారు. సింథటిక్‌ డీఎన్‌ఏ, 3డీ కంప్యూటింగ్‌ సాంకేతికత సాయంతో అభివృద్ధి చేసిన తమ వ్యాక్సిన్‌ అన్ని రకాల కరోనా వైరస్‌లను కట్టడి చేయగలుగుతుందని ఈ పరిశోధనలో పాల్గొన్న మరో శాస్త్రవేత్త డాక్టర్‌ రెబెకా కిన్స్‌లే వెల్లడించారు. ప్రపంచ మానవళికి కరోనా వైరస్ వల్ల సంక్రమించే అంటువ్యాధుల నుంచి రక్షణ ఇచ్చే ఈ వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో ఉండేలా అత్యంత తక్కువ ధరలోనే తీసుకువస్తామంటున్నారు.

అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు

టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈఎస్ఐ స్కామ్ కేసులో రిమాండ్ లో ఉన్న ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు శుక్రవారం మంజూరు చేసింది.    ఈఎస్ఐ అవకతవకల కేసులో ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడును అరెస్టు చేశారు. గత 70 రోజులుగా ఆయన రిమాండ్ లో ఉంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రోజుల వ్యవధిలో రెండుసార్లు శస్త్రచికిత్స జరగడంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ఇటీవల ఆయన కరోనా బారిన కూడా పడ్డారు. ప్రస్తుతం ఆయన మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని  దరఖాస్తు చేయగా గతంలో న్యాయస్థానం తిరస్కరించింది. మరోసారి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అచ్చెన్నాయుడు తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.    మూడు రోజుల క్రితమే వాదనలు జరగగా.. తీర్పు ఇవాళ ఇస్తామని హైకోర్టు పేర్కొంది. కొద్ది సేపటి క్రితమే అచ్చెన్నాయుడుకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రూ. 2 లక్షలు షూరిటీ ఇవ్వాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లవద్దని, దర్యాప్తు అధికారికి అందుబాటులో ఉండాలని ఆదేశాల్లో పేర్కొంది. అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు కావడంతో ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ మంత్రి సొంత ఊళ్ళో పేకాట క్లబ్ పై పోలీసుల దాడి.. మంత్రి సోదరుడి పై కేసు

అది ఓ ఏపీ మంత్రి స్వగ్రామం. దాని పేరు గుమ్మనూరు. ఇది కర్నూల్ జిల్లాలోని ఆలూరు నియాజకవర్గంలో ఉంది. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నది సాక్షాత్తు మంత్రి గుమ్మనూరు జయరాం. ఇక్కడ గత కొన్ని నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా పేకాట క్లబ్ నడుస్తోంది. అయితే తాజాగా కర్నూలు జిల్లా పోలీసులు ఏఎస్పీ గౌతమి ఆధ్వర్యంలో ఆ పేకాట క్లబ్ గుట్టు రట్టు చేశారు. మూడు ఆటోల్లో ఆ గ్రామానికి వెళ్లిన పోలీసులు జరిపిన ఈ దాడిలో.. డజన్లకొద్దీ కార్లు, టూవీలర్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే పేకాట క్లబ్ పై దాడి చేసిన పోలీసులపై గూండాలు ఎదురు దాడి చేసి వారు ఎక్కి వచ్చిన ఆటోలను ధ్వంసం చేశారు.   అయితే పోలీసుల పై గుండాలు దాడి చేసిన సమాచారంతో అక్కడికి మరి కొన్ని పొలిసు బలగాలు చేరుకుని లాఠీ ఛార్జ్ చేయడంతో గుండాలు పరారయ్యారు. అయితే పేకాట నిర్వహిస్తున్న షెడ్ దగ్గరలో పేకాటరాయుళ్లు మధ్యలో వదిలేసిన రూ.5.34 లక్షలు న‌గ‌దును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఆ పేకాట షెడ్ లో ఏపీలో నిషేధించిన ఖరీదైన లిక్కర్ బ్రాండ్లన్నీ దొరికాయి. ఈ లిక్కర్ ను ఇక్కడికి 35 కిలోమీటర్ల దూరంలోని కర్ణాటక లోని బళ్లారి నుండి లారీలలో తెస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ పేకాట క్లబ్ నిర్వహిస్తున్న మంత్రి జయరాం కు సోదరుడు నారాయణ పై.. అలాగే మంత్రి అనుచరులు శ్రీధర్, జగన్ లపై కూడా కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే దాడికి పాల్పడ్డ ముగ్గురు ఇంకా పరారీలో ఉన్నారని ఏఎస్పీ గౌతమి తెలిపారు.

ఆ టీడీపీ ముఖ్య నేతకు కరోనా... త్వరలో కరోనాను జయించి వస్తా అంటూ ట్వీట్

ఏపీలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. సామాన్య ప్రజల నుండి ముఖ్య నేతల వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న కూడా వైరస్ సోకుతోంది. తాజాగా, టీడీపీ నేత బుద్ధా వెంకన్న కరోనా బారిన పడ్డారు. అనుమానంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌ అని తేలడంతో వైద్యుల సూచనల మేరకు ఇంట్లోనే ఉంటూ ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. దీంతో కొన్ని రోజుల పాటు తాను రాజకీయాలకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకుంటానని కూడా ఆయన తెలిపారు.    "నాకు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండమని డాక్టర్లు సూచించారు. ఈ 14 రోజులు రాజకీయాలకు నేను దూరంగా ఉంటాను. నాకు దైవ సమానులైన మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అభిమానుల ఆశీస్సులతో కొవిడ్ ని జయించి, త్వరలోనే తిరిగి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటాను' అంటూ బుద్ధా వెంకన్న ట్వీట్ చేసారు.   ఎపుడు ఉప్పు నిప్పులాగా ట్విటర్ వేదికగా ఫైట్ చేసుకునే వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డికి కొద్దీ రోజుల క్రితం కరోనా సోకి హైదరాబాద్ లో ట్రీట్ మెంట్ తో కోలుకున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో విజయసాయి త్వరగా కోలుకోవాలని బుద్ధా వెంకన్న ట్వీట్ చేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే తాజాగా అయన ట్విట్టర్ ప్రత్యర్థి టీడీపీ నేత బుద్ధా వెంకన్న కూడా కరోనా బారిన పడ్డారు.

అండమాన్ ఆదిమవాసులను వదలని కరోనా..

ప్రపంచం మొత్తాన్ని చుట్టేసిన కరోనా మన దేశంలోను విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ అక్కడ అని తేడా లేకుండా పల్లెటూళ్లను, నగరాలను కూడా చుట్టబెడుతోంది. అయితే తాజాగా ఈ వైరస్ సుదూర అటవీ ప్రాంతం లోనూ విస్తరిస్తోంది. సామాన్య మానవులకు అందనంత దూరంలో ఉండే ఆదిమ జాతి తెగలోనూ కరోనా తన పంజా విసురుతోంది. తాజాగా అండమాన్ నికోబార్ దీవుల్లోని ఆదిమ మానవులకు కరోనా సోకిందని అక్కడి అధికారులు తెలిపారు. అక్కడి గ్రేటర్ అండమానిస్ తెగలోని 10 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.    ఈ కరోనా బాధితులంతా స్ట్రెయిట్ దీవి వాసులే. ఈ తెగలోని కొందరు రాజధాని పోర్ట్ బ్లెయిర్ వెళ్లడంతో అక్కడి అధికారులు వారికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షలలో ఆరుగురికి పాజిటివ్ గా తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వారు నివాసం ఉంటున్న స్ట్రెయిట్ దీవికి వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహించగా మరో నలుగురికి కరోనా ఉన్నట్లు తేలింది. అయితే మొత్తం కలిపి 50 మంది జనాభా ఉన్న ఆ దీవిలో ఏకంగా పది మందికి కరోనా సోకడంతో అక్కడి వారిలో ఆందోళన నెలకొంది.