బొమ్మ.. వామ్మో..

బొమ్మల మార్కెట్ 66వేలకోట్లపైనే..   చిన్నారుల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను పెంచుతూ మనోవికాసానికి ఉపయోగేవాటిలో బొమ్మలదే అగ్రస్థానం. ఒక్కప్పుడు మట్టితో, కర్రతో, లక్కతో బొమ్మలను తయారుచేసేవారు. కాలక్రమేణా వస్తువుల తయారీలో ప్లాస్టిక్ వచ్చి చేరడంతో వివిధ రంగుల్లో, రూపాల్లో బొమ్మలను తయారు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ బొమ్మల పరిశ్రమ టర్నోవర్ దాదాపు తొంభై బిలియన్ల యూస్ డాలర్లు. అంటే మన కరెన్సీలో 66,18,83,25,00,00 రూపాయలు అన్నమాట. వేల కోట్ల టర్నోవర్ జరుగుతుంది కాబట్టే మన ప్రధానమంత్రి నోట బొమ్మల మాట వచ్చిందన్నమాట. వామ్మో బొమ్మ అని ఇప్పుడు అనండి.   పూర్వకాలంలో మట్టిపిడతలు, కొయ్యబొమ్మలతో పిల్లలు ఆడుకునేవారు. మన దేశంలో బొమ్మల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు చాలానే ఉన్నాయి. అయితే ప్రపంచీకరణ, పారిశ్రామికరణ నేపధ్యంలో అన్ని రంగాల్లో మాదిరిగానే బొమ్మల పరిశ్రమలోనూ విప్లవాత్మక మార్పులు వచ్చి లోకల్ బొమ్మలకు గిరాకీ తగ్గిపోయింది. చిన్నారుల చేతిలో గిల్లక్కాయ కూడా ఇంపోర్ట్ చేసుకున్నదే. ఇప్పుడు కేంద్రప్రభుత్వం వోకల్ ఫర్ లోకల్ నినాదంతో తిరిగి స్థానిక ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించే పనిలో నిమగ్నమైంది. ఆటవస్తువుల తయారీలో, చవకైన వస్తువుల తయారీలో ప్రపంచ మార్కెట్ ను ఆక్రమించిన చైనాను దెబ్బకొట్టడం కూడా ఎత్తుగడే. ఏదీ ఏమైనా మన చిన్నారులకు కావల్సిన బొమ్మలను మనమే తయారుచేసుకుందాం అంటూ ప్రధాని మోడీ పిలుపు ఇవ్వడంతో ఆయారాష్ట్రాలు తమ రాష్ట్రంలో కనిపించకుండా పోయిన బొమ్మలను.. బొమ్మల పరిశ్రమలను, తయారీదారులను వెతుకుతున్నారు.   400 వందల ఎకరాల్లో.. కర్ణాటక ప్రభుత్వం దేశంలోనే మొదటి అతి పెద్ద బొమ్మల పరిశ్రమ తమ రాష్ట్రంలోని కొప్పాలలో అభివృద్ధి చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. బొమ్మల తయారీ కోసం తమ రాష్ట్రానికి ఐదువేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, దాదాపు 40వేల మందికి ఉపాధి లభిస్తుందని లెక్కలు వేస్తున్నారు. నాలుగువందల ఎకరాల్లో అత్యంత విశాలంగా పరిశ్రమను నెలకొల్పి ఆధునిక ఆటవస్తువులను తయారుచేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మానవ నాగరికతలో బొమ్మలు భారతీయ సంస్కృతిలో, సంప్రదాయంలో బొమ్మలకు విశేషస్థానం ఉంది. అనేక జానపద కథలు, ఇతిహాసాలు,పురాణాల్లో బొమ్మల ప్రస్తావన ఉంది. బొమ్మలతో కథలు చెప్పే విధానం చాలా పురాతనమైంది. చిన్నారుల్లో, సృజనాత్మక మానసిక వికాసం పెంచేలా ఈ బొమ్మలు ఉండేవి. వివిధ ఆకారాలు, సైజుల్లో బొమ్మలు తయారుచేసే వృత్తిపై ఆధారపడిన కళాకారుల కుటుంబాలు వేలసంఖ్యలో ఉన్నాయి. కలప, రాయి, బంకమట్టి, వస్త్రం, జంతువుల తోలు మొదలైన వాటిని బొమ్మల తయారీలో వాడుతారు.    బొమ్మలతో ఆడుకోవడంతో పిల్లలు మొదటి పాఠాలను నేర్చుకుంటారు.  సమాజంలోని సామాజిక-సాంస్కృతిక చరిత్రను ప్రతిబింబిస్తాయి. రాతితో చెక్కబడిన బొమ్మల నుంచి అత్యంత ఆధునిక బార్బీ బొమ్మల వరకు, మానవ నాగరికత బొమ్మలలో ప్రతిబింబిస్తుంది.   దేశం పేరుగాంచిన బొమ్మల తయారీ ప్రాంతాలు భారతదేశంలో, సింధు లోయ నాగరికత ఉన్న ప్రదేశం నుండి వెలికితీసిన తొలి బొమ్మలు ఐదువేల సంవత్సరాల నాటివి. బొమ్మల సంస్కృతి ఇప్పటికీ మనుగడలో ఉన్నా వాటి రూపురేఖలు, తయారీ విధానం, ఉపయోగించే ముడిపదార్థంలో మార్పులు వచ్చాయి. భారతదేశంలోని ప్రతి ప్రాంతానికి బొమ్మలు తయారు చేయడంలో ప్రత్యేకమైన శైలి ఉంది. ప్రతి బొమ్మకు స్వంత కథ ఉంది. బొమ్మల తయారీకి సాంప్రదాయ కేంద్రాలుగా అనేక ప్రాంతాలు పేరుగాంచాయి. తెలంగాణలోని నిర్మల్, ఆంధ్రప్రదేశ్ లోని కొండపల్లి కొయ్యబొమ్మలకు ప్రసిద్ధి. కర్ణాటకలోని చన్నపట్నం, తమిళనాడులోని తంజావూరు, అస్సాంలోని ధుబ్రీ, ఉత్తరప్రదేశ్ లోని వారణాసి వంటి బొమ్మల తయారీ కేంద్రాలు ఎన్నో ఉన్నాయి.   ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుమేరకు దేశంలోని బొమ్మల తయారీ కేంద్రాలన్నీ కళకళలాడి.. కళాకారులకు చేతినిండ పని.. చిన్నారులకు ఆరోగ్యకరమైన బొమ్మలు అందితే వోకల్ ఫర్ లోకల్ నినాదం నిజమైనట్లే..

ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ.. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం మొత్తం చెల్లించాల్సిందే!!

జీఎస్టీ కొత్త ప్ర‌తిపాద‌న‌ల‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. జీఎస్టీ కొత్త ప్రతిపాదనలపై నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు. జీఎస్టీ నిర్ణయాలు అన్నీ ఏకగ్రీవంగా తీసుకున్నవేనని విమర్శించారు. రుణాల‌పై ఆంక్ష‌లు స‌రైందికాద‌న్న కేసీఆర్.. కేంద్రం ప్ర‌తిపాద‌న‌లు ఫెడ‌ర‌ల్ స్ఫూర్తికి వ్య‌తిరేక‌మ‌ని లేఖ‌లో పేర్కొన్నారు.    క‌రోనా కార‌ణంగా ఆదాయం ఘోరంగా ప‌డిపోయింద‌ని.. జీఎస్టీ బ‌కాయిల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కోరారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితే.. దేశాలు అభివృద్ధి చెందిన‌ట్టేన‌ని.. బ‌ల‌మైన రాష్ట్రాలు ఉంటేనే దేశంకూడా బ‌లోపేతం అవుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.    కేంద్రం రుణం తీసుకుని రాష్ర్టాల‌కు పూర్తిగా ప‌రిహారం ఇవ్వాల‌ని, ప‌రిహారం త‌గ్గించాల‌ని తీసుకున్న నిర్ణ‌యం ఉప‌సంహ‌రించుకోవాల‌ని కేసీఆర్ కోరారు. న‌ష్టం జ‌రుగుతుంద‌ని తెలిసినా తెలంగాణ ప్ర‌భుత్వం జాతీయ ప్ర‌యోజ‌నాల దృష్ట్యా జీఎస్టీ బిల్లును స‌మ‌ర్థించిందని, మొట్ట‌మొద‌లు స్పందించి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపింది త‌మ ప్ర‌భుత్వ‌మేన‌ని గుర్తు చేశారు. ప్ర‌తి రెండు నెల‌ల‌కోసారి పూర్తి జీఎస్టీ ప‌రిహారం చెల్లించే విధంగా చ‌ట్టంలో క‌చ్చితంగా నిబంధ‌న ఉన్నా.. జీఎస్టీ ప‌రిహారం చెల్లింపులో జాప్యం కొన‌సాగుతోంద‌ని అసంతృప్తి వ్య‌క్తం చేశారు. చట్ట ప్రకారం రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం మొత్తం చెల్లించాల్సిందేనని సీఎం కేసీఆర్ కోరారు.

డాక్టర్ సుధాకర్ కేసులో కుట్రకోణం.. సీబీఐ దర్యాప్తుతో ప్రభుత్వం ఇరుకున పడనుందా?

జగన్ సర్కార్ కు కోర్టుల్లో అనేక సందర్భాల్లో ఎదురు దెబ్బలు తగిలిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ప్రభుత్వం అభాసుపాలైంది. పదేపదే కోర్టుల్లో అక్షింతలు పడటంతో.. చివరికి ఆయనను ఎస్ఈసీగా నియమించక తప్పలేదు. ఓ రకంగా ఇది జగన్ సర్కార్ కి మాయని మచ్చలా మిగిలిపోతుందని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే, ఇప్పుడు తాజాగా మరో వ్యవహారం కూడా ప్రభుత్వ ప్రతిష్టని దెబ్బతీసే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.   డాక్టర్ సుధాకర్ అంశం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆసుపత్రులలో మాస్కులు లేవని, వైద్యుల రక్షణ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని డాక్టర్ సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆయనను సస్పెండ్ చేశారు. మాస్క్ లు ఇవ్వమని అడిగినందుకు సస్పెండ్ చేయడం ఏంటని విమర్శలు వ్యక్తమైనా ప్రభుత్వం లెక్క చేయలేదు. అంతేకాదు, ఆయన పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయనను నడిరోడ్డుపై ఈడ్చుకెళ్తూ విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన మానసిక స్థితి బాలేదని చెప్తూ ఆయనను మానసిక వైద్యశాలలో చేర్పించారు. సాధారణంగా ఉన్న తనకు మానసిక రోగికి ఇచ్చే మందులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు డాక్టర్ సుధాకర్‌ లేఖ కూడా రాశారు. ఈ మొత్తం వ్యవహారం హైకోర్టుకి చేరడంతో.. హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.   తాజాగా డాక్టర్ సుధాకర్ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. సుధాకర్ కేసులో కుట్రకోణం దాగి ఉందని, మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ వ్యాఖ్యానించింది. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఈ కేసుకు సంబంధించి నవంబర్ 11న పూర్తి స్థాయి నివేదికను అందించాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను నవంబర్ 16వ తేదీకి వాయిదా వేసింది.   కాగా, సుధాకర్ కేసులో కుట్రకోణం దాగి ఉందని సీబీఐ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. మాస్క్ లు అడిగిన పాపానికి సుధాకర్ ని పిచ్చి వాడిగా ముద్ర వేసారని.. మొదటి నుండి సుధాకర్ తల్లి, విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వ పెద్దలు మాత్రం ఆయన వెనుక ప్రతిపక్ష పార్టీ ఉందని, ఆయన తాగి న్యూసెన్స్ చేసారని, ఆయన పిచ్చి వాడని ఆరోపించారు. కానీ తాజాగా  సీబీఐ సుధాకర్ కేసులో కుట్రకోణం దాగి ఉందని చెప్పడం.. ప్రభుత్వ పెద్దల్ని ఇరుకున పెట్టిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారాన్ని వైద్య, దళిత సంఘాలు సీరియస్ గా తీసుకున్నాయి. ఈ కేసులోని  కుట్రకోణం బయటపడితే ప్రభుత్వ మరోసారి అభాసుపాలయ్యే అవకాశముందని అంటున్నారు. దళిత డాక్టర్ పట్ల ప్రభుత్వ వ్యవహరించిన తీరుపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశముంది.    తాజాగా ఇదే అంశంపై టీడీపీ నేత వర్ల రామయ్య ట్విట్టర్ ద్వారా స్పందించారు. డాక్టర్ సుధాకర్ ను పిచ్చివాడిగా చిత్రీకరించేందుకు కుట్ర జరుగుతోందని తాము ఎంత మొర పెట్టుకున్నా వినలేదని విమర్శించారు. ఇప్పుడు, సీబీఐ అందులో కుట్ర దాగి ఉందని హైకోర్టు కు చెప్పింది అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సీబీఐ దర్యాప్తులో జోక్యం చేసుకోకుండా అసలు ముద్దాయిలు అరెస్ట్ అయ్యేలా చూడాలని డిమాండ్ చేస్తున్నామని వర్ల రామయ్య పేర్కొన్నారు.

భవిష్యత్ లో భూగోళం

2030లో కృత్రిమ రక్తం ఉత్పత్తి   2040లో వాణిజ్యవనరుగా అణుశక్తి   2050లో మూన్ టూర్ ఫర్ కామన్ మ్యాన్   ప్రపంచం రేపు ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతిఒక్కరిలో ఉంటుంది. అందుకే 2050 వరకు అంటే మరో మూడుదశాబ్దాల్లో ఈ భూగోళంపై మానవ జీవితంలో వచ్చే మార్పులను ఇలా అంచనా వేస్తున్నారు. మరి ఆ మార్పులేంటో దశాబ్దాల వారీగా మనం తెలుసుకుందామా..   2030 నాటికీ అంటే రానున్న దశాబ్ద కాలంలో వచ్చే మార్పులు.. - జర్మనీ పెట్రోల్ డీజిన్ తదితర ఇంధనాలపై నడిచే కార్ల అమ్మకాన్ని పూర్తిగా నిషేధిస్తుంది. - భూమిపై అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం మారనుంది. - పక్షవాతం వచ్చిన రోగుల్లో వారి అవయవాలను మెరుగుపరచడానికి నరాలను శస్త్రచికిత్స ద్వారా సరిచేస్తారు. - మూలకణాల నుంచి అంటే స్టెమ్ సెల్స్ నుంచి ఉత్పత్తి చేయబడిన కృత్రిమ రక్తం మార్కెట్‌ లో లభిస్తోంది. - సోలార్ ప్యానల్ ధర ప్రతి వాట్ 0.5 డాలర్లు సమానంగా అవుతుంది. - ప్రపంచవ్యాప్తంగా 13,166,667 ఎలెక్ట్రిక్ వాహనాలు అమ్ముడవుతాయి. - డయాబెటిస్ టైప్ 2 ను అదుపు చేయడానికి ప్రోటీన్ ఇంజెక్షన్లను ఉపయోగిస్తారు - శాస్త్రవేత్తలు ఫ్లూ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తారు, ఇది అన్ని జాతుల నుండి రక్షిస్తుంది. - ప్రపంచ జనాభా 8,500,766,000 కు చేరుకుంటుందని అంచనా - అవయవాల తయారీలో 3డి ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తారు - వచ్చే దశాబ్దంలో అంగారక గ్రహం పైకి వెళ్లడానికి మానవాళి సిద్ధమవుతుంది   2040లో - ఫుడ్ రెప్లికేటర్లు మీ పోషక స్థాయి ప్రకారం భోజనాన్ని డిజైన్ చేస్తాయి - ప్రపంచ జనాభా 9,157,230,000 కు చేరుకుంటుంది. - ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెంది భారతదేశం అమెరికాను అధిగమిస్తుంది. - ఇంటర్నెట్ కనెక్ట్ చేయబడిన పరికరాల సంఖ్య 173,987,427,000 కి చేరుతుంది. - ప్రతి ఒక్కరికీ 19 పరికరాలు అవసరం అవుతాయి. అందుబాటులో ఉంటాయి - తూర్పు మధ్య, ఆఫ్రికా ఖండంలో కొంత భాగంలో ఉష్టోగ్రతలు విపరీతంగా పెరిగి నివసించడానికి అననుకూలమైన వాతావరణంలో ఉంటాయి. - వాతావరణ మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా సామూహిక వలసలు పెరుగుతాయి. - ప్రపంచంలోని మొట్టమొదటి స్పేస్ ఎలివేటర్ ను పూర్తి చేసే స్థాయిలో జపాన్ ఉంటుంది.   - అణుశక్తి వాణిజ్యవనరుగా మారుతుంది. - క్వాంటం కంప్యూటింగ్ చిప్స్ కారణంగా గతంలో కంటే వేగంగా యంత్రాలు పనిచేస్తాయి. - ప్రపంచవ్యాప్తంగా మహాసముద్రాల నుండి వనరులను సేకరించడం పెరుగుతుంది. - వాతావరణంలో మార్పులు, పరిమిత వనరుల కారణంగా ఆహార కొరత ఏర్పడుతుంది.  - యువతలో అల్జీమర్స్ వ్యాధి కేసులు పెరుగుతాయి. - టెలివిజన్ మాయమై ఆన్ లైన్ వీడియో, మీడియా పెరుగుతాయి. - ప్రపంచవ్యాప్తంగా పొగాకు నియంత్రిస్తారు. - నాసా జలాంతర్గామి సాటర్న్ ఉపగ్రహం టైటాన్లో గ్రహాంతర జీవుల కోసం అన్వేషిస్తుంది - స్పేస్‌ ఎక్స్  తన స్పేర్ షిప్ లో మార్స్ కు మనషులను తీసుకువెళ్లుతుంది. - మనిషి మెదడును రోబోట్ లోకి పంపించే కొత్త టెక్నాలజీ  క్లినికల్ ట్రయల్ జరుగుతాయి.   2050 - జనటిక్ ఇంజనీరింగ్ ద్వారా బిడ్డను కనాలనుకుంటే డబ్బులను చెల్లించాల్సిందే. - మానవ భావోద్వేగాలను కూడా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీకి అనుసంధానం చేయవచ్చు. - న్యూరోటెక్నాలజీని ఉపయోగించి ఇతర వ్యక్తులతో సంభాషించడానికి వీలు కలుగుతుంది. - వివిధ రకాల క్యాన్సర్‌లకు వ్యతిరేకంగా యూనివర్సల్ టీకా ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుంది. - ప్రపంచ జనాభా సుమారు 10,143,271,720కు చేరుతుంది. - 5 బిలియన్ ప్రజలు ఇప్పుడు నీటి ఎద్దడి ప్రాంతాల్లో నివసిస్తారు - ప్రపంచ జనాభాలో సగం మంది దృష్టి లోపంతో ఉంటారు.  - ప్రపంచ ఉష్ణోగ్రత సగటు 37.4 సెల్సియల్ డిగ్రీలుగా ఉంటుంది. - ధ్రువ ఎలుగుబంట్లు అంతరించిపోతాయి. - అత్యంత ఆధునికంగా పనిచేసే అవయవాలు తక్కువ ఖర్చుతో అందుబాటులోకి రావడంతో చాలామంది తమ అవయవాల స్థానంలో వాటిని ఏర్పాటుచేసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. - ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ కనెక్ట్ చేయబడిన పరికరాల 237,500,000,000 కు చేరుకుంటుంది - ప్రతి వినియోగదారుడు ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడిన 25 పరికరాలను కలిగి ఉంటారు. - ఎలక్ట్రిక్, ఆధునిక కార్లు మాత్రమే యుకె, జర్మనీ, ఇండియా, ఫ్రాన్స్, నెదర్లాండ్స్‌లో అమ్ముడవుతాయి - బహుళ అంతస్తుల హైటెక్ భవనాల సంఖ్య పెరిగి పట్టణాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయి. - మన మహాసముద్రాలలో చేపల కంటే ఎక్కువ ప్లాస్టిక్ ఉంటుంది. - సుదూర ప్లానెట్ల చిత్రాలను కూడా తీయగలిగిన అధిక రిజల్యూషన్ కెమెరాలు అందుబాటులోకి వస్తాయి. - చంద్రునికి టూర్ వెళ్లడం సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి వస్తుంది. - మార్స్ మీద శాశ్వతంగా నివాసం ఏర్పర్చుకునే వీలు కలుగుతుంది. - మన జ్ఞాపకాలను కంప్యూటర్లలోకి అప్‌లోడ్ చేయవచ్చు. వాటిని డిజిటల్‌గా సేవ్ చేయవచ్చు.

ఆ దారుణ ఘటన కారణంగానే ఐపీఎల్ కు దూరమయ్యా.. సురేష్ రైనా క్లారిటీ 

దుబాయిలో జరగనున్న ఐపీఎల్- 2020 నుంచి హఠాత్తుగా తప్పుకుని చెన్నైసూపర్‌ కింగ్స్‌ సూపర్ ప్లేయర్ సురేశ్ రైనా అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసాడు. అయితే రైనా నిర్ణయం వెనుక గల కారణాలు మాత్రం స్పష్టంగా తెలియలేదు సరికదా.. అతడు హోటల్ లో ధోనికి బాల్కనీ ఉన్న రూమ్ కేటాయించి తనకు మాత్రం మాములు రూమ్ కేటాయించడంతో అలిగి వెళ్లిపోయాడని వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా ఈ విషయం పై సురేశ్ రైనా ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.   "పంజాబ్‌లోని తమ బంధువులు ఒక భయంకర ఘటనను ఎదుర్కొన్నారని ఆ ఘటనలో తన అంకుల్‌ని కొంత మంది నరికి చంపేశారని రైనా తెలిపారు. ఈ ఘటనలో తమ ఆంటీతో పాటు మరో ఇద్దరు కజిన్‌లకు తీవ్రగాయాలయ్యాయని వారంతా ప్రాణాల కోసం ఆసుపత్రిలో పోరాడుతుండగా.. దురదృష్టవశాత్తు తన కజిన్ గత రాత్రి మృతి చెందాడని. అలాగే తన ఆంటీ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది" అని సురేశ్ రైనా పేర్కొన్నాడు. అంతే కాకుండా ఈ ఘటనకు కారకులెవరో, ఆ రాత్రి అసలు ఏం జరిగిందో ఇప్పటివరకు ఎవరికీ స్పష్టంగా తెలియదని.. ఈ మొత్తం ఘటనపై దృష్టిసారించాలని అయన పంజాబ్ పోలీసులను కోరుతున్నానన్నారు. "ఈ హేయమైన చర్యకు పాల్పడిన వారు తప్పించుకుని, మరో నేరం చేయడానికి వీల్లేదు" అంటూ పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌కు సురేశ్ రైనా తాజాగా ట్వీట్ చేశారు.

కుప్పకూలే స్థితిలో దేశ ఆర్థిక వ్యవస్థ.. 1996 నుంచి చూస్తే ఇదే అతి పెద్ద పతనం

దేశ ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయిలో పతనమైంది. మోడీ సర్కార్ ఇప్పటికైనా ఆ దిశగా దృష్టి పెట్టకపోతే దేశం ఓ ఇరవై ముప్పై ఏళ్లు వెనక్కు వెళ్లిపోతోందని నిపుణులు, విపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు. భారతదేశపు వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో(ఏప్రిల్, మే, జూన్ నెలల్లో) 23.9 శాతానికి పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నమోదైన 5.2 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే రికార్డు స్థాయికి క్షీణించింది. ఈ గణాంకాలను సోమవారం అధికారికంగా విడుదల చేసిన నేషనల్‌ స్టాటిస్టికల్ ఆఫీస్‌.. కరోనా మహమ్మారి విలయం, లాక్‌డౌన్‌ లాంటి పరిణామాలు.. అప్పటికే మందగమనంలో ఉన్న ఆర్ధిక వ్యవస్థను మరింత కుంగదీశాయని పేర్కొంది. ఇక అంతకుముందు త్రైమాసికం (2020 జనవరి, ఫిబ్రవరి, మార్చి)లో జీడీపీ 3.1 శాతంగా వృద్ధి నమోదైంది. 1996 నుంచీ చూస్తే ఇదే అతి పెద్ద పతనం. తయారీ, నిర్మాణ, వాణిజ్య రంగాలు వరుసగా 39.3శాతం, 50.3 శాతం, 47 శాతం వద్ద భారీ క్షీణించాయని తెలిపింది. ప్రభుత్వ వ్యయం కూడా 10.3శాతం  పడిపోయింది. వ్యవసాయ రంగం పనితీరు 3.4 శాతం వృద్ధితో మెరుగ్గా ఉందని పేర్కొంది.   జీడీపీ ఇంతగా పతనమవుతుంటే దేశంలో ఆర్ధికమంత్రి ఉనట్టా లేనట్టా? ఉంటే ఏం చేస్తున్నట్టు? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నిర్మలా సీతారామన్ ఆర్ధికమంత్రి పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. ప్రధాని ఏం చేస్తున్నారు? దేశ ఆర్ధిక పరిస్థితిని చూస్తున్నారా? కాస్త ఆ వైపు దృష్టి పెట్టండి అంటూ ఆర్ధిక నిపుణులు, విపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు.   కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మోడీ సర్కార్ ఘోరంగా విఫలమైందని, జీడీపీ దారుణంగా పడిపోవడానికి ప్రభుత్వ అసమర్థతే కారణమని కేంద్ర మాజీ ఆర్ధికమంత్రి చిదంబరం విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితిలో ఉందన్న విషయం బహుశా ప్రధానమంత్రికి, ఆర్దికమంత్రికి తప్ప అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. "మోడీ సర్కార్ నిర్లక్ష్యానికి దేశ ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారు. ప్రభుత్వం ఇన్నాళ్లూ కథలు చెబుతూ వచ్చింది. అవన్నీ అబద్ధాలని అధికారికంగా నిరూపణైంది'' అని చిదంబరం అన్నారు.

డాక్టర్ సుధాకర్ కేసులో కుట్ర కోణం ఉంది.. హైకోర్టులో సిబిఐ

ప్రభుత్వ ఆసుపత్రులలో మాస్కులు లేవని ఆందోళన వ్యక్తం చేసిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు పలు మలుపులు తిరిగి చివరికి హైకోర్టు ఆదేశాలతో సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సంగతి తెలిసిందే.   తాజాగా సిబిఐ డాక్టర్ సుధాకర్ కేసులో కుట్ర కోణం ఉందని ఐతే దీని పై మరింత విచారణ చేయాల్సిన అవసరం ఉందని ఈ రోజు హైకోర్టుకు నివేదించింది. దీని కోసం తమకు మరో నెల సమయం ఇవ్వాలని సిబిఐ అభ్యర్ధించింది. దీనిపై సిబిఐ వాదనలు విన్న హైకోర్టు నవంబర్ 11 వరకు దీనిపై పూర్తి రిపోర్ట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా మాస్కులు అడిగిన పాపానికి తన బిడ్డను పిచ్చివాడిగా ముద్రవేసి హాస్పిటల్ లో జాయిన్ చేసారని ఆయన తల్లి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

మండలి చైర్మన్ షరీఫ్‌ కు కరోనా పాజిటివ్

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే వుంది. రోజుకు 10 వేల కేసులు నమోదవుతున్నాయి. సామాన్య ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులకు కరోనా సోకగా.. తాజాగా మండలి చైర్మన్‌ షరీఫ్‌ కు కరోనా పాజిటివ్‌ ‌గా నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు ఉండటంతో ఆయనకు పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ గా నిర్ధారణ అయిందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.   కాగా, ఏపీలో సోమవారం 10,004 మందికి పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. కొత్తగా 85 మంది కరోనా కారణంగా మృతిచెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,31,876 కు చేరగా.. మృతుల సంఖ్య 3,969 చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,00,276 యాక్టివ్ కేసులున్నాయి.

చైనా దాడిని తిప్పికొట్టి కీలక ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న ఇండియన్ ఆర్మీ

తూర్పు లద్దాఖ్‌లో చైనా మరోసారి దుస్సాహసానికి పాల్పడింది. శనివారం అర్ధరాత్రి - ఆదివారం తెల్లవారుజాము మధ్యలో ప్యాంగ్యాంగ్ సరస్సు దక్షిణ తీరంలో భారత భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నాలు చైనా ఆర్మీ చేసింది. జూన్‌ 15న గల్వాన్‌ లోయ వద్ద రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ తర్వాత ఎల్‌ఏసీ వెంట యథాతథస్థితిని కొనసాగించాలంటూ కమాండర్‌ స్థాయి చర్చలలో కుదిరిన ఒప్పందాలను చైనా తాజా ఘటనతో ఉల్లంఘించింది. అంతేకాకుండా ఏకపక్షంగా సరిహద్దులను మార్చేందుకు ప్రయత్నం చేస్తూ ఒకపక్క నిర్మాణ సామగ్రితో పాటు క్షిపణి వ్యవస్థను కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి తరలిచింది. ఇప్పటి వరకు ఉత్తర తీరంలోని భారత భూభాగంపై కన్నేసిన చైనా ఇపుడు దక్షిణం వైపు రావడం ఇదే తొలిసారి. అయితే చైనా కుతంత్రాన్ని పసిగట్టిన భారత సైన్యం చైనా ఆర్మీ చర్యలను దీటుగా తిప్పికొట్టింది. సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణాలతోపాటు మిసైల్ క్షేత్రాల ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న చైనా ఇప్పుడు పాంగాంగ్‌ వద్ద సరిహద్దులను మార్చే ప్రయత్నాన్ని భారత్‌ సీరియ్‌సగా తీసుకుంది.   చైనాతో సరిహద్దుల్లో మళ్ళీ ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ముందుకు దూసుకొచ్చిన చైనా సైనికులను వెనక్కు తరిమేసి భారత జవాన్లు కీలకమైన ఓ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారని తెలుస్తోంది. పాంగ్యాంగ్ సరస్సుకు సమీపంలోని ఒక ఎత్తయిన ప్రాంతాన్ని చైనా ఆర్మీ నుండి భారత జవాన్లు స్వాధీనం చేసుకున్నారని మన సైనిక వర్గాలు వెల్లడించాయి. తాజా ఘటనతో ఆ ప్రాంతంలో భారత్ దే పై చేయి అయిందని సమాచారం. ఈ ప్రాంతంలో విధుల్లో ఉన్న స్పెషల్ ఆపరేషన్ బెటాలియన్ చైనాను అడ్డుకుంది. సరస్సు దక్షిణ భాగంలోని తౌకుంగ్ ప్రాంతంలో ఎత్తయిన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ ప్రాంతంలో ఇది ఒక కీలక ప్రాంతం. ఇక్కడి నుంచి సరస్సు పశ్చిమ ప్రాంతాన్నంతా నియంత్రించడమే కాకుండా సరస్సు చుట్టుపక్కల ప్రాంతాలపైనా నిఘా పెట్టవచ్చు. అయితే తాజా ఘటనలో ఇరు సైన్యాల మధ్య ఎలాంటి ఘర్షణ జరగలేదని భారత సైన్యం అధికార ప్రతినిధి కల్నల్‌ అమన్‌ ఆనంద్‌ తెలిపారు. ఓ వైపు చర్చలు జరుగుతుండగా, భారత సైన్యం, నిబంధనలను ఉల్లంఘిస్తోందని చైనా కమాండర్ ఆరోపించగా, భారత్ మాత్రం వాటిని కొట్టిపారేసింది. చైనా ఆర్మీ రెచ్చగొడుతూ మన భూభాగం లోకి చొరబడుతూ వస్తున్నారని, భారత ఆర్మీ దాన్ని తిప్పికొడుతోంది భారత సైన్యాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

కరోనా లక్షణాలు లేని వారి వల్లే

రోజురోజుకు విజృంభిస్తున్న కోవిద్ 19 వైరస్ వ్యాప్తి వల్ల కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇందుకు కారణాలు అన్వేషిస్తున్న వైద్యబృందం, పరిశోధకులు సరికొత్త విషయాలను వెల్లడిస్తున్నారు. వైద్యపరీక్షల సంఖ్య పెంచడంతో బయటకు వచ్చిన అంశాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.   తెలంగాణలో కరోనా పాజిటివ్ గా  నమోదు అయినవారిలో 69శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని వైద్యాధికారులు వెల్లడించారు. కేవలం 31శాతం మందిలో మాత్రమే కరోనా లక్షణాలు కనిపించాయంటున్నారు. అయితే లక్షణాలు లేనంత మాత్రాన వారి నుంచి ఇతరులకు వైరస్ సోకదు అని కచ్ఛితంగా చెప్పలేమని అంటున్నారు. లక్షణాలు కనిపించని వారి వల్ల కూడా వైరస్ వ్యాపిస్తోందని స్పష్టం చేశారు. లక్షణాలు లేని వారు తమకు తెలియకుండానే కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని వైద్యాధికారుల బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఒకే కుటుంబంలో ఎక్కువ మంది కరోనా బారిన పడుతుండడానికి ఇదే కారణమన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,24,963 మంది కరోనా బారినపడగా వారిలో 86,225 మందిలో ఎటువంటి లక్షణాలు లేవని వెల్లడించారు.   తెలంగాణలో  ప్రస్తుతం 31,299 యాక్టివ్ కేసులుంటే అందులో 24,216 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు. మిగతావారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

భారత్ బయోటెక్ 'కోవాగ్జిన్' సురక్షితం.. వచ్చేసిన మొదటి దశ ట్రయల్స్ రిజల్ట్స్ 

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు పూర్తీ స్వదేశీ పరిజ్ఞానంతో హైదరాబాద్ లోని భారత్ బయోటెక్, ఐసీఎంఆర్, పుణె వైరాలజీ ల్యాబ్ లు కలిసి తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ "కోవాగ్జిన్" పూర్తిగా సురక్షితమైందని తాజాగా వెల్లడైంది. ఈ వ్యాక్సిన్ తో చేసిన మొదటి దశ ట్రయల్స్ పూర్తైన సందర్భంగా ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లూ కనిపించలేదని అధికారులు వెల్లడించారు.   ప్రస్తుతం మనదేశంలో మూడు వ్యాక్సిన్ లకు సంబంధించిన ట్రయల్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. వీటిలో ఒకటి భారత్ బయోటెక్ వ్యాక్సిన్, మరొకటి జైడస్ కాడిలా వ్యాక్సిన్ కాగా ఇక మూడోది ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన వ్యాక్సిన్ కు సంబంధించిన ట్రయల్స్ ప్రస్తుతం మనదేశంలో జరుగుతున్నాయి. అయితే భారత్ బయోటిక్ వ్యాక్సిన్, ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ప్రస్తుతం రెండు, మూడవ దశ ట్రయల్స్ లో ఉన్నాయి.    భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తొ దేశంలోని వివిధ ప్రాంతాల్లో చేస్తున్న పరిశోధనల పై తాజాగా రిపోర్టులు వస్తున్నాయి. అయితే ఈ ట్రయల్స్ నిర్వహించిన అన్ని ప్రాంతాల నుండి కూడా పూర్తిగా పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. అంతేకాకుండా ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆ వలంటీర్ల పై జరిపిన పరీక్షల్లో తేలిందని వైద్యాధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ఇదే విషయమై కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ నిన్న మాట్లాడుతూ డిసెంబర్ లోగా వ్యాక్సిన్ విడుదలవుతుందని, ట్రయల్స్ విజయవంతంగా జరుగుతున్నాయని ప్రకటించడం గమనార్హం.

మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు..!!

మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్‌ ముప్పాళ్ల లక్ష్మణరావు పోలీసుల ముందు లొంగిపోయారని తెలుస్తోంది. 70 ఏళ్లు దాటిన గణపతి పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని సమాచారం. ఆ కారణం చేతనే ఆయన లొంగిపోయారని తెలుస్తోంది.   తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా సారంగాపూర్‌కు చెందిన గణపతి దాదాపు మూడు దశాబ్దాల పాటు నక్సల్‌ కార్యకలాపాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. సుదీర్ఘ కాలం పాటు మావోయిస్టు కేంద్రకమిటీ కార్యదర్శిగా పనిచేసిన గణపతి.. 2018 చివరిలో ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు. కాగా, దేశంలోనే మోస్ట్‌ వాంటెడ్‌ వ్యక్తిగా జాతీయ పరిశోధన సంస్థ(ఎన్‌ఐఏ) ఆయనను ప్రకటించి, ఆయనను పట్టిచ్చిన వారికి 15 లక్షల రూపాయల రివార్డ్ ని ప్రకటించింది. మొత్తంగా ఆయనపై 36 లక్షల రివార్డ్ ఉండటం గమనార్హం.    వయోభారం, అనారోగ్యం కారణంగా కేంద్రకమిటీ కార్యదర్శి బాధ్యతల నుంచి 2018లో వైదొలిగిన గణపతి.. ఇప్పుడు పూర్తిగా లొంగిపోయినట్టు తెలుస్తోంది. ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడం, ఇప్పటికే పలువురు నేతలు లొంగిపోవడం, మావోయిస్టు పార్టీ ప్రభావం కూడా రోజురోజుకి తగ్గిపోతుండం.. వంటి కారణాల చేత గణపతి లొంగిపోయారని సమాచారం. ఆయన లొంగుబాటు మావోయిస్టు పార్టీకి తీరని దెబ్బ అని, ఆయన బాటలోనే మరికొందరు నడిచే అవకాశముందని తెలుస్తోంది. 

సంక్షోభ పరిష్కర్త.. భారత రాజకీయాల్లో భీష్మాచార్యులు

విపక్షాలను సైతం మెప్పించిన నేత   ప్రణబ్ ముఖర్జీ (11 డిసెంబర్ 1935 - 31 ఆగస్టు 2020)   మాజీ రాష్ట్రపతి, సీనియర్ కాంగ్రెస్ నేత ప్రణబ్ ముఖర్జీ మరణం దేశ రాజకీయాలకు తీరనిలోటు. అర శతాబ్దం పైగా దేశరాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన ఆయన మూడు దశాబ్దాలకు పైగా నెహ్రు కుటుంబానికి సన్నిహితంగా ఉన్నారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అనేక కీలకపదవులను ఆయన నిర్వహించారు. పార్టీలో అంతర్గత సంక్షోభాలు తలెత్తినప్పుడు వాటిని చాకచక్యంతో ఆయన సరిదిద్దేవారు. అందుకు ఆయనను సంక్షోభ పరిష్కర్త, భీష్మాచార్య అంటూ నాయకులు ప్రేమగా పిలుచుకునేవారు. ఆయన సేవలను కాంగ్రెస్ నేతలే కాదు దేశప్రజలంతా గుర్తుంచుకుంటారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం నియమించిన కమిటీకి ఆయన నేతృత్వం వహించారు. తెలుగు రాష్ట్రల విభజనలోనూ కీలకపాత్ర పోషించారు.   ప్రణబ్ ముఖర్జీ 11 డిసెంబర్ 1935లో పశ్చిమబెంగాల్ లోని మిరాఠీ గ్రామంలో జన్మించారు. ఆయన తల్లి రాజ్యలక్ష్మి ముఖర్జీ, తండ్రి కమద కింకర ముఖర్జీ దేశ స్వాతంత్య్రపోరాటంలో కీలకపాత్ర పోషించారు. ఆయన 1952 నుంచి 1964 వరకు పశ్చిమబెంగాల్ శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యులుగా ఉన్నారు.   ప్రణబ్ ముఖర్జీ కలకత్తా విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రంలో, చరిత్రలో ఎం.ఎ, ఆ తర్వాత ఎల్ఎల్ బి  పూర్తిచేశారు. కలకత్తాలోని డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో యుసిడిగా ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత అధ్యాపకునిగా పనిచేశారు. అంతేకాదు రాజకీయాలకు రాకముందు దేషెర్ దక్ పత్రికలో జర్నలిస్టుగా పనిచేశారు.   1969లోరాజకీయాల్లోకి.. తండ్రి నుంచి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుండా స్వతంత్య్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. 1969లో మిడ్నాపూర్ ఉపఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి చివరి వరకు పార్టీకి విధేయుడిగా ఉన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి నమ్మిన బంటుగా పార్టీలో పేరు తెచ్చుకున్న ఆయన 34ఏండ్ల వయసులోనే రాజ్యసభకు ఎన్నికైయ్యారు. ఆ తర్వాత 1973లో కేంద్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1975,1981,1993,1999లో వరుసగా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 1991లో ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ గా పని చేసిన ప్రణబ్ ముఖర్జీ  పార్టీకి అండగా ఉన్నారు. 1998లో సోనియా పార్టీ అధ్యక్షురాలు కావడంలోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు.   2004లో తొలిసారి.. అనేక సార్లు రాజ్యసభకు నామినేట్ చేయబడిన ప్రణబ్ ముఖర్జీ 2004లో తొలిసారి లోక్ సభకు ఎన్నికయ్యారు. 2004 నుంచి 2012 వరకు యూపీఏ ప్రభుత్వంలో నెంబర్ 2గా గుర్తింపు పొందారు. కేంద్రంలో కీలకమైన రక్షణ, విదేశాంగ, ఆర్థిక, వాణిజ్య శాఖలు నిర్వహించిన ప్రణబ్.. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థికమంత్రిగా గుర్తింపు పొందారు. పార్టీలకు అతీతంగా రాజకీయ వర్గాల్లో ప్రణబ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. మేధావిగా, సంక్షోభ పరిష్కర్తగా ఆయనకెవరూ సాటి రారని విపక్ష నేతలు సైతం ఆయన సేవలను కొనియాడతారు.   13వ రాష్ట్రపతిగా.. 2012లో జరిగిన  రాష్ట్రపతి ఎన్నికల్లో 70 శాతం ఓట్లను పొంది ప్రత్యర్థి పి.ఎ.సంగ్మాను ఓడించారు. భారత దేశ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ ఎన్నికయ్యారు. 25 జూలై 2017న రాష్ట్రపతిగా పదవీకాలం ముగిసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనూ ఆయన కీలకపాత్ర పోషించారు. అయితే తిరిగి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ సూచించినా ఆయన  ఆరోగ్య సమస్యలరీత్యా రాజకీయాల నుండి పదవీ విరమణ చేయాలని భావించారు. పార్టీకి పెద్దదిక్కుగా ఉంటూ సూచనలు ఇవ్వాలని అధిష్టానం కోరడంతో ఆయన పార్టీలోనే కొనసాగారు. చివరివరకు కాంగ్రెస్ పార్టీ నేతగానే ఉన్నారు.

రేపటి నుంచి విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు

మూడో తరగతి నుంచి ఇంటర్ వరకు తరగతులు   ఒక్కో క్లాస్ వ్యవధి అరగంటకు మించకుండా   దూరదర్శన్ , టీశాట్ ల ద్వారా విద్యార్థులందరికీ అందుబాటులో   కరోనా కారణంగా జూన్ లో ప్రారంభం కావల్సిన విద్యాసంవత్సరం సెప్టెంబర్ నుంచైనా ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆన్ లైన్ లోనే క్లాసులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటికే అనేక ప్రైవేట్ స్కూళ్లు ఆన్ లైన్ క్లాసులను నిర్వహిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూడా ఆన్ లైన్ క్లాసులు రేపటి(సెప్టెంబర్ 1) నుంచి ప్రారంభిస్తున్నారు.    మూడో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు దూరదర్శన్, టీశాట్ ద్వారా డిజిటల్ తరగతులను నిర్వహిస్తారు. ఈ మేరకు టైమ్ టేబుల్ ను కూడా విడుదల చేశారు. 3వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్లాసులను నిర్వహిస్తారు. అయితే ఒక్కో క్లాసు వ్యవధి అరగంట ఉండాలని నిబంధనలు విధించారు. ఇక ఇంటర్ విద్యార్థులకు ఉదయం 8 గంటల నుంచి 10.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తరగతులను నిర్వహిస్తారు.    కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు నష్టపోకుండా ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నామని టీచర్లు, తల్లిదండ్రులు విద్యార్థులు క్లాసులు వినేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ సూచించింది.

సుప్రీం కోర్టు ఒక్క రూపాయి జరిమానాపై స్పందించిన ప్రశాంత్ భూషణ్ 

కోర్టు ధిక్కరణ కేసులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ కు సుప్రీం కోర్టు ఈరోజు ఒక్క రూపాయి జరిమానా విధించిన సంగతి తెలిసిందే. తాజాగా కొద్దిసేపటి క్రితం ఈ తీర్పు పై స్పందించిన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఒక్క రూపాయి లాంఛన జరిమానా చెల్లించేందుకు తాను సిద్ధమేనని తెలిపారు. అయితే ఈ తీర్పుపై రివ్యూ కోరుతూ పిటిషన్ కూడా దాఖలు చేస్తానని కూడా ఆయన తెలిపారు. తనకు న్యాయవ్యవస్థ మీద అపార గౌరవం ఉందనీ.. అయితే తాను ట్వీట్లు పెట్టడం వెనుక సుప్రీంకోర్టును గానీ, న్యాయవ్యవస్థను గానీ అగౌరవపరిచే ఉద్దేశం తనకు ఎంత మాత్రం లేదని ప్రశాంత్ భూషణ్ స్పష్టం చేశారు.   సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ట్విటర్లో చేసిన ఆరోపణలపై కోర్టు ధిక్కారం కింద ప్రశాంత్ భూషణ్‌ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వచ్చేనెల 15 లోగా ఒక్క రూపాయి జరిమానా చెల్లించాలనీ.. లేని పక్షంలో మూడు నెలలు జైలు శిక్ష లేదా మూడేళ్లపాటు ప్రాక్టీస్‌పై నిషేధం తప్పదని సుప్రీంకోర్టు తన తీర్పులో హెచ్చరించింది.  

తమ వాళ్ళకే బిల్లులు క్లియర్.. వైసీపీ ప్రభుత్వం పై రఘురామకృష్ణరాజు ఫైర్ 

ఏపీలో అధికారంలో ఉన్న వైసిపికి తలనొప్పిగా తయారైన రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. తమ వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు రూ. 25 వేల కోట్ల వరకు బకాయి పడిందని అయన చెప్పారు. అయితే ఒక సామాజికవర్గానికి సంబంధించిన కాంట్రాక్టర్లకు మాత్రం డబ్బులు చెల్లించడం లేదని అయన విమర్శించారు. కనీసం ఉపాధి హామీ పనులు చేసిన వారికి కూడా డబ్బులు చెల్లించలేదని అంతేకాకుండా కేవలం తమ బంధువులైన కాంట్రాక్టర్లకు మాత్రమే బిల్లులు చెల్లిస్తున్నారని అయన చెప్పారు.   తమ పార్టీలో విలువలు అనేవి కేవలం మాటలకే పరిమితమయ్యాయని... అయితే విలువలు అనేవి చేతల్లో కూడా ఉండాలని అయన తమ పార్టీ నాయకులకు హితవు పలికారు. కాంట్రాక్టర్ల కష్టాలను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడం లేదని రఘురామరాజు అన్నారు. అంతేకాకుండా జగన్ ప్రభుత్వం కలలు కంటున్న మూడు రాజధానులు అనేది కేవలం భ్రమ మాత్రమేనని అయన ఎద్దేవా చేసారు.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూత

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూశారు. అనారోగ్యంతో ఆసుపత్రిపాలైన ఆయన చాలారోజుల పాటు కోమాలో ఉండి, కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ప్రణబ్ ముఖర్జీ కొన్నివారాల కిందట మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో కొంత కాలంగా కోమాలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ రావడంతో ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిశారు.   ప్రణబ్ ముఖర్జీ కన్నుమూసినట్లు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్వీట్ చేశారు. బరువెక్కిన హృదయంతో ఈ విషయాన్ని చెబుతున్నానని, కొద్దిసేపటి క్రితమే తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ చనిపోయినట్లు అభిజిత్ వెల్లడించారు. ఆసుపత్రి వైద్యులు శ్రమపడినా ఫలితం దక్కలేదని, దేశవ్యాప్తంగా పూజలు, ప్రార్థనలు నిర్వహించినా ఫలితం దక్కలేదని తెలిపారు. తన తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.

విధినిర్వహణలో భాగంగా 500 కిలోమీటర్లు సైకిల్ పై వెళ్లిన ఇంటెలిజెన్స్ ఆఫీసర్

నాన్సీ గ్రేస్ అగస్టా వేక్ (30 ఆగస్టు 1912- 7 ఆగస్టు 2011) పట్టుదల, విధినిర్వాహణలో అంకితభావం ఉన్నవారిని అరుదుగా చూస్తుంటాం. అలాంటి ఒక మహిళా అధికారి తాను అందజేయాల్సిన సమాచారం  అందించడానికి ఏకంగా ఐదువందల కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించడం ఆమెకు తన వృత్తి పట్ల ఉన్న అంకిత భావానికి  తార్కణం. ఆ మహిళా అధికారి నాన్సీగ్రేస్.  రెండో ప్రపంచయుద్ధ సమయంలో స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ గా బాధ్యతలు నిర్వహించి ఎన్నో మెడల్స్ అందుకున్న ధైర్యశాలి. ఆమె జీవితచరిత్రను పుస్తకరూపంలోకి ప్రముఖ రచయతలు తీసుకువచ్చారు.   న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్‌లోని రోసెనాథ్‌లో 30 ఆగస్టు 1912లో నాన్సీ జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ఎల్లావేక్, చార్లెస్ ఆగస్టన్. ఆరుగురు పిల్లల్లో చిన్నది నాన్సీ. వారి కుటుంబం ఆస్ట్రేలియా వెళ్లి ఉత్తరసిడ్నిలో స్థిరపడింది.   సిడ్నీలోని హోస్ హోల్డ్ ఆర్ట్స్ పాఠశాలలో చదువుకున్న నాన్సీ 16ఏండ్ల వయసులోనే ఇంటి నుంచి వెళ్ళిపోయి నర్సు గా చేరారు. ఆ తర్వాత న్యూయార్క్ వెళ్ళింది. అటు నుంచి లండన్ వెళ్ళి అక్కడ జర్నలిస్టుగా ట్రైనింగ్ తీసుకున్నారు. 1930లో పారిస్ లో యూరోపియన్ కరస్పాండెంట్ గా హార్ట్స్ పత్రికలో ఆమె పనిచేశారు. పత్రికల్లో వచ్చే హిట్లర్ గురించి, నాజీ ఉద్యమం గురించి చదివి స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటీవ్ లో చేరి అనేక కార్యక్రమాల్లో శిక్షణ పొందారు. 1944లో జాన్ హింద్ ఫార్మర్ గా శిక్షణ పొందిన ఆమె ప్యారాచూట్ ద్వారా ఫ్రాన్స్ లో ప్రవేశించారు.   స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ గా బాధ్యతలు స్వీకరించిన ఆమె తాను సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించడానికి ఎంతో కష్టపడేవారు. అప్పట్లో రేడియో ద్వారా మాత్రమే సమాచారాన్ని పంపించే వీలు ఉండేది. ఒకసారి దాదాపు 500కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణం చేసి తాను సేకరించిన సమాచారాన్ని లండన్ కు పంపించారు. ఇందుకోసం ఆమె 72గంటలు కష్టపడ్డారు. అమెకు కొంతమంది జర్మన్లు సహకారం అందించారు. యుద్ధం తర్వాత ఆఫీసర్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్ గా నియమించబడ్డారు. అంతేకాదు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యుఎస్, యుకె దేశాల నుంచి అవార్జులు అందుకున్నారు. ఆస్ట్రేలియన్ వార్ మెమోరియల్ మ్యూజియంలో ఆమె అందుకున్న  పతకాలన్ని భద్రపరిచారు.    ఆస్ట్రేలియా ప్రముఖ రచయిత రస్సెల్ బ్రాడ్డాన్ నాన్సీ వేక్ జీవితకథ ఆధారంగా ది స్టోరీ ఆఫా ఎ వేరీబ్రేవ్ ఉమెన్ అన్న పేరుతో పుస్తకం రాశారు. ఆమె ది వైట్ మౌస్ పేరుతో బయోగ్రఫీ రాసుకున్నారు. మరో ఆస్ట్రేలియా రచయిత పీటర్ ఫిట్జ్ సిమోన్స్ ఎ బయోగ్రఫీ ఆఫ్ అవర్ గ్రేటెస్ట్ వార్ హీరోయిన్ అన్న పేరుతో పుస్తకం రాశారు. ధైర్యశాలిగా పేరుగాంచిన నాన్సీ తన 99వ ఏటా 7 ఆగస్టు 2011లో మరణించారు.

ఏపీలో రుణంపై రణం.. రంగుల కోసమేనా! అంతా మీరే చేశారు..

అమరావతిపై పోరు సాగుతుండగానే ఆంధ్రప్రదేశ్ లో అధికార, విపక్షాల మధ్య అప్పులపై వార్ ముదురుతోంది. కేంద్రం ఇచ్చిన వెసులుబాటుతో జగన్ సర్కార్.. మరిన్ని అప్పులు తెచ్చేందుకు సిద్ధమవుతోంది. దీన్నే అస్త్రంగా తీసుకుని  టీడీపీ ఎదురు దాడి చేస్తోంది. ఏడాదిలోనే లక్ష కోట్ల రుణం తీసుకున్న వైసీపీ సర్కార్.. మరిన్ని అప్పుల కోసం ప్రయత్నించడం దారుణమంటోంది టీడీపీ. జగన్ సర్కార్ అడ్డగోలు నిర్ణయాలు, విధానాలతో ఖజానాకు చిల్లు పడి ఇప్పటికే ప్రజలపై భారం పడిందని ఆరోపిస్తోంది. లక్ష కోట్లు తెచ్చి ఎక్కడ పెట్టారో చెప్పాలంటున్న టీడీపీ.. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడానికి.. తొలగించడానికే ఖర్చు చేశారని ఆరోపిస్తోంది. ఇరిగేషన్, వ్యవసాయం వంటి ముఖ్యమైన రంగాలకు నిధులే ఇవ్వని ప్రభుత్వం.. లక్ష కోట్లు ఏం చేసిందో చెప్పాలని ప్రతిపక్షం నిలదీస్తోంది. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి తీసుకువచ్చారని, జగన్ సర్కార్ విధానాలతో ఏపీకి తీరని నష్టం జరుగుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.    2014లో రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి 90 వేల కోట్ల అప్పుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2.5 లక్షల కోట్లకు రుణం పెరిగింది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం కూడా అప్పులు చేస్తూనే ఉంది. 15 నెలల కాలంలోనే లక్ష కోట్ల రూపాయలకు పైగా అప్పు తీసుకున్నారని టీడీపీ చెబుతోంది. తాజాగా కేంద్రం ఇచ్చిన ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపు అవకాశంతో మరిన్ని అప్పులు చేసేందుకు వీలుగా చట్ట సవరణ చేసింది జగన్ సర్కార్. ఇప్పటివరకూ రాష్ట్రాలు తమ జీఎస్‌డీపీలో 3.5 శాతం మేరకు అప్పులు తెచ్చుకునేందుకు వీలుంది. కానీ కరోనా ప్రభావంతో ఆదాయం తగ్గినందున.. ఎప్‌ఆర్‌ఎం పరిమితిని పెంచుకునేందుకు కేంద్రం వీలు కల్పించింది. తాజాగా జారీ చేసిన ఆర్డినెన్స్‌ అమల్లోకి వస్తే ప్రస్తుతం ఉన్న 3.5 శాతం పరిమితి ఐదు శాతానికి పెరగబోతోంది. దీంతో ఏటా మరో రూ.20 వేల కోట్ల రూపాయలు అధికంగా అప్పులు తెచ్చుకునే అవకాశం ఏపీకి ఉండనుంది. అంటే వచ్చే నాలుగేళ్లలో మరో 80 వేల కోట్ల రుణం తీసుకోవచ్చు. ఇవి కాకుండా ఇతరత్రా మార్గాల్లోనూ ఎక్కడ అప్పు దొరికితే అక్కడ అప్పులు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇదే ఇప్పుడు ఏపీలో రాజకీయ సమరానికి కారణమైంది.    జగన్ సర్కార్ చేసిన చట్ట సవరణపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ప్రజలపై అదనపు భారం పడిందని, మరిన్ని అప్పులు చేస్తే పరిస్థితి దారుణంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విపక్ష నేతలు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం అప్పులు తెస్తే ఓకే గాని.. సొంత పబ్లిసిటీ ఈవెంట్లకు, వైసీపీ రంగులు వేయడానికి అప్పులు చేయడమేంటనీ మండిపడుతున్నాయి. అయితే వైసీపీ మాత్రం విపక్షాల ఆరోపణలను ఖండిస్తోంది. రాష్ట్ర అభివృద్ధి కోసం తమకు అందుబాటులో ఉన్న ఆప్షన్‌ను మాత్రమే వాడుకుంటున్నట్లు చెబుతోంది. అన్ని రాష్ట్రాల మాదిరే తాము ముందుకు వెళుతున్నామని, కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడిందని కవర్ చేసుకుంటుంది. బకాయిలు చెల్లించలేని స్థితిలో ఉన్న కేంద్రమే.. ఆర్థిక అవసరాల కోసం రాష్ట్రాలకు మరో రకంగా అవకాశం ఇచ్చిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. గత ఐదేండ్లలో టీడీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించడం వల్లే గడ్డు పరిస్థితి వచ్చిందని కౌంటరిస్తున్నారు. మూడున్నర లక్షల కోట్ల అప్పు చేసి.. ప్రజా ధనాన్ని దోచుకున్న టీడీపీ కూడా అప్పులపై మాట్లాడటం విడ్డూరంగా ఉందంటున్నారు వైసీపీ నేతలు. అధికార, విపక్షాల వాదనలు ఎలా ఉన్నా.. ఎడాపెడా చేస్తున్న అప్పులతో తమపై భారం పడుతుందనే ఆందోళన ఏపీ ప్రజల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వాలు అడ్డగోలు ఖర్చులు చేయకుండా నియంత్రణ పాటిస్తేనే ఆర్థిక కష్టాలనుంచి గట్టెక్కవచ్చని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.