తాలిబన్ల చేతికి అత్యాధునిక యూఎస్ వెపన్స్.. ప్రపంచానికి గండమేనా?
posted on Aug 17, 2021 @ 11:16AM
అప్ఘనీస్తాన్ ను ఆక్రమించుకున్న తాలిబన్లలో ప్రపంచానికి కొంత గండం రాబోతోందా? రాబోయో రోజుల్లో విధ్వంసం తప్పదా? అంటే అవుననే భయాందోళనే ప్రపంచ దేశాల నుంచి వ్యక్తమవుతోంది. తాలిబన్ల చేతికి అమెరికాకు చెందిన అత్యాధునిక ఆయుధాలు దక్కడమే ఈ ఆందోళనకు కారణం. కేవలం ఏకే 47 తుపాకులు, రాకెట్ లాంచర్లతోనే ఆఫ్ఘనిస్థాన్ ను గజగజలాడించిన చరిత్ర తాలిబన్లది. ఇప్పుడు కూడా కేవలం ఈ ఆయుధాలతోనే ఆఫ్ఘన్ ను వారు చేజిక్కించుకున్నారు. తాలిబన్లతో పోరాడలేక ఆఫ్ఘనిస్థాన్ సైనికులు చేతులెత్తేశారు. ఆయుధాలను వదిలేసి పలాయనం చిత్తగించారు. ఈ క్రమంలో అమెరికాకు చెందిన అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు తాలిబన్ల సొంతమయ్యాయి. ఇదే ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది.
గత 20 ఏళ్లలో దాదాపు 89 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు, విమానాలు, హెలికాప్టర్లు, యుద్ధ ట్యాంకులను, 11 వైమానిక స్థావరాలను ఆఫ్ఘనిస్థాన్ కు అమెరికా సమకూర్చింది. ఇవన్నీ ఇప్పుడు తాలిబన్ల వశమయ్యాయి. వీటిని ఉపయోగించడంలో ఆప్ఘన్ సైనికులకు అమెరికా పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చినప్పటికీ... తాలిబన్లతో పోరాడలేక వారు పారిపోయారు. దాంతో గత రెండు దశాబ్దాలుగా అమెరికా చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది.మెత్తం మీద 211 విమానాలు, హెలికాప్టర్లకు గాను 167 పనిచేసే స్థితిలో ఉన్నాయి. అయితే వీటిని ఎలా ఉపయోగించాలనే విషయంలో తాలిబన్లకు అవగాహన లేదు. వీటికి పైలట్లు, టెక్నీషియన్లను గుర్తించడం తాలిబన్లకు కఠినమైన పరీక్షే. అంతేకాదు వీటి విడిభాగాలను సేకరించడం కూడా చాలా కష్టమైన పనే. అయితే ఈ కష్టాలను అధిగమిస్తే మాత్రం తాలిబన్లకు ఒక అత్యాధునికమైన వైమానిక దళం ఉన్నట్టే.
తాలిబన్ల వశమైన ఆయుధ సంపత్తి వివరాలు:
ఏ-29 తేలికపాటి విమానాలు - 6
వేగంగా కదిలే బహుళ ప్రయోజన హమ్వీ వాహనాలు - 174
2.75 అంగుళాల హై ఎక్స్ ప్లోజివ్ రాకెట్లు (గగనతలం నుంచి భూతలంపై దాడికి ఉపయోగించే రాకెట్లు) - 10 వేలు
పాయింట్ 50 క్యాలిబర్ తూటాలు - 9 లక్షలు
40 ఎంఎం హై ఎక్స్ ప్లోజివ్ తూటాలు - 60 వేలు
7.62 ఎంఎం తూటాలు - 20 లక్షలు
యూహెచ్ 60 బ్లాక్ హాక్స్ హెలికాప్టర్లు - 45
ఎండీ 530 హెలికాప్టర్లు- 50
ఎంఐ 17 హెలికాప్టర్లు - 56
ఏ 29 సూపర్ తుకానో ఫైటర్లు - 23
సి 130 హెర్క్యులస్ రవాణా విమానం - 1
సీ 208 విమానం - 1
ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత అక్కడి పరిస్థితుల భయానకంగా మారాయి. ఏం జరగబోతోందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. గతంలో మాదిరి కాకుండా, మంచి పాలన అందిస్తామని తాలిబన్ నేతలు చెపుతున్నప్పటికీ... వారి మాటలను ఆఫ్ఘన్ ప్రజలు కూడా నమ్మడం లేదు. భవిష్యత్తు పట్ల వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.పరిస్థితులు ప్రమాదకరంగా ఉండటంతో... కాబూల్ లోని ఎంబసీని ఇండియా ఖాళీ చేసింది. ఈ క్రమంలో భారత్ కు చెందిన స్పెషల్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ కాబూల్ కు అత్యవసరంగా వెళ్లింది. ఈ ఫ్లైట్ ద్వారా ఆఫ్ఘన్ లోని భారత రాయబారి, ఇతర సిబ్బంది, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ట్రూపులను ఇండియాకు తీసుకొస్తున్నారు.భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... ఆఫ్ఘన్ పరిణామాలపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకెన్ తో చర్చించానని తెలిపారు. కాబూల్ ఎయిర్ పోర్టులో కార్యకలాపాలు కొనసాగాల్సిన ఆవశ్యకతను వివరించామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా చేస్తున్న కృషి చాలా గొప్పదని కితాబునిచ్చారు.