కడప ఎస్పీని కలిసిన పీఏ కృష్ణా రెడ్డి.. వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్
posted on Dec 14, 2021 @ 10:37AM
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటికొస్తున్నాయి. ఈ కేసులో ఒకరి తర్వాత ఒకరు బయటకు వస్తూ సంచలన విషయాలు చెబుతున్నారు. తాజాగా వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి బయటికి వచ్చారు. కడప ఎస్పీ అన్బురాజన్ కలిసి తనకు తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశాడు. వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డితోపాటు బామ్మర్ధి శివప్రకాష్ రెడ్డిల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పీఏ కృష్ణారెడ్డి పేర్కొనడం సంచలనమైంది.
వైఎస్ వివేకా హత్య కేసులో కొందరు తనపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు కృష్ణా రెడ్డి. వీళ్ల వల్ల తనకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని ఎస్పీని పీఏ కోరారు. వైఎస్ వివేకా కుటుంబానికి చెందిన ముగ్గురి పేర్లు ప్రస్తావిస్తూ ఎస్పీకి పీఏ కృష్ణా రెడ్డి ఫిర్యాదు చేయడం సంచలనమైంది. వైఎస్ వివేకాకు కృష్ణారెడ్డి మంచి నమ్మకస్తుడైన పీఏగా గుర్తింపు పొందారు. 30 ఏళ్ల పాటు వివేకా వెంట ఉన్నారు. వివేకా తుదిశ్వాస విడిచేవరకూ పీఏగా కొనసాగారు. ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేయడం వెనుక ఎవరో పెద్దల హస్తం ఉందనే చర్చ సాగుతోంది.
ఇటీవలే వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన సొంత అల్లుడు కూతురు సునీత భర్త అయిన రాజశేఖర్ రెడ్డి హస్తం ఉందని పులివెందులకు చెందిన జర్నలిస్ట్ భరత్ కుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. వివేకా కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తూ అనంతపురం ఎస్పీకి యాడికి చెందిన గంగాధర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అంతేకాదు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు వ్యతిరేకంగా సాక్షం చెప్పాలని తనపై సీబీఐ ఒత్తిడి తెచ్చిందని ఆరోపించి సంచలన రేపారు గంగాధరా రెడ్డి . తాజాగా పీఏ కృష్ణారెడ్డి ముందుకు రావడంతో హత్య కేసు కొత్త మలుపు తిరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.