పదవి ఫసక్?.. సోము వీర్రాజుకు హైకమాండ్ పిలుపు..
posted on Dec 14, 2021 @ 10:11AM
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఆ పదవి మరికొంత కాలమే అని తెలుస్తోంది. సోము వీర్రాజును ఢిల్లీకి రావాలని హైకమాండ్ పిలవడంతో ఆయన హడావుడిగా హస్తిన వెళ్లారు. దీంతో ఆయను ఊస్టింగ్ ఖాయమనే చర్చ బీజేపీలోనే జరుగుతోంది. సోము వీర్రాజు తీరుపై గుర్రుగా ఉన్న బీజేపీ పెద్దలు... అధ్యక్ష పదవి నుంచి ఆయనను తప్పించాలని దాదాపుగా డిసైడైపోయారని చెబుతున్నారు.
ఇటీవలే తిరుపతికి వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. ఏపీ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో పార్టీ పనితీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడాలని దిశానిర్దేశం చేశారు. అయితే అమిత్ షా వార్నింగ్ ఇచ్చి వెళ్లినా ఏపీ బీజేపీ పనితీరు మారకపోవడంతో సారధిని మార్చాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే సోము వీర్రాజును తక్షణం ఢిల్లీ రావాలని పార్టీ హైకమాండ్ ఆదేశించిందని అంటున్నారు.
ఏపీలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది బీజేపీ హైకమాండ్. అందులో భాగంగానే సోముకు పార్టీ పగ్గాలు అప్పగించింది. అయితే సోము వీర్రాజు మాత్రం ఏపీలో అధికారంలో ఉన్న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కంటే... ప్రతిపక్ష టీడీపీని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో చాలా సమస్యలున్నా ఏనాడు మాట్లాడలేదు. ఆలయాలపై దాడులు జరుగుతున్నా.. తీవ్రంగా స్పందించలేదు. అంతేకాదు అధికార పార్టీపై ఏదో చేయాలన్నట్లుగా కొన్ని విమర్శలు చేస్తూ... చంద్రబాబునే టార్గెట్ చేశారు. సోము వీర్రాజు తీరుపై సొంత పార్టీ నేతలే చాలా సార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఎంతసేపు మీడియా సమావేశాల్లో, ట్విట్టర్లో హడావుడి చేయటమే తప్పించి క్షేత్రస్ధాయిలో వీర్రాజు బలమైన నేతకాదని హైకమాండ్ గుర్తించిందని అంటున్నారు.
వైసీపీ ప్రభుత్వంపై ఎందుకు పోరాడలేకపోతున్నారన్న పద్దతిలో ఆయనపై బీజేపీ హైకమాండ్ ఆగ్రహంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే ఆయనకు అధికారాలు కట్ చేశారు. కోర్ కమిటీని నియమించారు. అయితే అసలు నాయకత్వమే సైలెంట్గా ఉంటూండటంతో కోర్ కమిటీ కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ఆయనపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లుగా తేలడంతోనే ఇటీవల ఆయన … ఇక రాజకీయాల్లో ఉండననే ప్రకటనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 2024 తర్వతా రాజకీయ రిటైర్మెంట్ అని ఆయన ప్రకటించుకోవడం.. పార్టీ హైకమాండ్కు ఇప్పుడు తనను పదవి నుంచి తొలగించవద్దని సంకేతాలు పంపడమేనని అంటున్నారు.
అయితే సోము వీర్రాజు పార్టీ కోసం ఏం చేశారన్న నివేదిక రెడీ చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడింది ఒక్కటంటే ఒక్కటీ కనిపించడం లేదన్న అభిప్రాయం ఢిల్లీ నేతల్లో వినిపిస్తోంది. ప్రభుత్వం మీద దూకుడుగా వెళ్తున్న సమయంలో కన్నా లక్ష్మినారాయణను తొలగించి సోము వీర్రాజుకు చాన్సిచ్చారు. కానీ పూర్తిగా వైసీపీ అనుబంధంగా మార్చేశారు. అమరావతిపై మాట్లాడిన వారిని సస్పెండ్ చేసి .. పార్టీలో చేరిన కొంత మంది నేతలను వైసీపీ తరహాలో కోవర్టులుగా చూస్తూ పార్టీని కోలుకోకుండా చేశారన్న అభిప్రాయం గట్టిగా ఉంది. అందుకే ఆయనకు ఫైనల్ క్లాస్ పీకడానికో.., పదవి నుంచి తప్పిస్తున్నామని చెప్పడానికో ఢిల్లీ పిలిపించారని భావిస్తున్నారు.