రేవంత్ పాదయాత్ర.. ఉంటుందా? ఉండదా?

తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం కోసం.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తలపెట్టిన పాదయాత్రకు అడుగడుగునా అవాంతరాలు ఎదురౌతున్నాయా? ఆయన ముందుగా ప్రకటించినట్లు ఈ నెల చివరి నుంచి పాదయాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా రెడీ చేసుకున్నారు. ఎన్నికల ఏడాదిలో ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే పాదయాత్రతో ముందుకు సాగాల్సిందేనన్న కృత నిశ్చయంతో ఆయన ఉన్నా.. హై కమాండ్ నుంచి అనుమతి, రాష్ట్రంలో ఆయన వ్యతిరేకుల అడ్డంకులతో యాత్ర తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదని చెబుతున్నారు.   పాదయాత్రతో ప్రజల్లోకి వెళితే.. కాంగ్రెస్ పార్టీ కేడర్ , ద్వితీయ శ్రేణి నాయకులు, వరుస ఓటములతో డీలా పడిన క్యాడర్ లో నూతనోత్సాహం నింపాలన్నది రేవంత్ లక్ష్యంగా చెబుతున్నారు. అలాగే మరోవైపు రాజకీయంగా దూకుడు మీద ఉన్న బీజేపీకి కూడా తన పాదయాత్రతో చెక్ పెట్టాలని రేవంత్ భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ కూడా పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లడంతో... కాంగ్రెస్ హైకమాండ్ తన పాదయాత్రకు పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చని.. అనుమతి కూడా లభిస్తుందని రేవంత్ విశ్వాసంతో ఉన్నారు.   తన పాదయాత్ర ద్వారా  కాంగ్రెస్  ప్రచారం కూడా జరుగుతుందని, ప్రజల్లోకి కాంగ్రెస్ చేసిన పనులు, చేపట్టిన పథకాలు మరోసారి తీసుకెళ్ళొచ్చని రేవంత్ చెబుతున్నారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్ లో పరిస్థితులను గమనిస్తే ఆయన పాదయాత్ర మొదలు పెట్టడం, కొనసాగించడం అంత తేలిక కాదన్న భావన రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నది. రాష్ట్ర కాంగ్రెస్ లో రేవంత్ వ్యతిరేకవర్గం రేవంత్ కు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడమే ధ్యేయంగా పావులు కదుపుతోంది. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ గా మాణిక్ ఠాక్రే బాధ్యతలు చేపట్టిన తరువాత సంక్షోభ నివారణ యత్నాలు మళ్లీ మొదటి నుంచీ ప్రారంభమయ్యాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ లో అసమ్మతి నేతలను బుజ్జగించడమే లక్ష్యంగా ఠాక్రే వ్యవహరిస్తున్నారన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను జిల్లా కమిటీలనూ, తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసులను ఇసుమంతైనా ఖాతరు చేయబోనని ఠాక్రేతో సమావేశం తరువాత ప్రకటించడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చర్జ్  ఠాక్రే వస్తూనే  రాష్ట్ర పార్టీ నేతలతో వరుస సమావేశాలు జరుపుతున్నారు.     కాంగ్రెస్ పార్టీ సీనియర్లు రేవంత్ రెడ్డి పాదయాత్ర అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కొత్త ఇంఛార్జ్ ముందు ఇప్పటికే ప్రస్తావించి ఆయన  ఒక్కరే పాదయాత్ర చేస్తే ఎలా.. ఆయనకు అనుమతి ఇవ్వడం ద్వారా కొత్త పంచాయతీ సృష్టించవద్దని చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నారు. దీంతో తెలంగాణలోని పలువురు సీనియర్లు, ముఖ్యంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న నేతలంతా పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ దగ్గర ఇదే విషయాన్ని ప్రస్తావించారని అంటున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి ఇస్తే.. తాము కూడా పాదయాత్ర చేస్తామని.. తమకు కూడా అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తామొంటూ   సీనియర్ నేతలు ఇప్పటికే తమ సన్నిహితుల వద్ద చెబుతున్నారు. రేవంత్ రెడ్డికి అనుమతి ఇచ్చి.. ఇతర నేతలకు ఇవ్వకపోతే కొత్త సమస్య వస్తుందని   సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్ రావ్ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. అయితే తాను అనుకున్న విధంగానే పాదయాత్రతో ముందుకు సాగాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారని.. ఈ విషయంలో హైకమాండ్‌ను ఏదో రకంగా ఒప్పించాలని ఆయన అనుకుంటున్నట్టు సమాచారం. ఒక వేళ హై కమాండ్ అనుమతి లభించకుంటే.. అధిష్ఠానాన్ని ధిక్కరించైనా సరే పాదయాత్రతో ముందుకు సాగాలని రేవంత్ భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.  మొత్తానికి రేవంత్ రెడ్డి పాదయాత్ర వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త పంచాయతీకి కారణమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

జీవో 1 ను సస్పెండ్ చేసిన హైకోర్టు

ఏపీ ప్రభుత్వానికి హై కోర్టులో మరోసారి చుక్కెదురైంది. రాష్ట్రంలో సభలూ,  సమావేశాలపై నిషేధం విధిస్తూ ఏపీ సర్కార్ జారీ చేసిన జీవో1 ను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. జీవో నంబర్‌-1ను సవాల్ చేస్తూ  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.   జీవో నంబర్ 1 ప్రకారం సభలు, రోడ్‌షోలు, అనుమతి లేకుండా.. రాజకీయ పార్టీలు సభలు నిర్వహించకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సీపీఐ రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌ను హై కోర్టు  గురువారం (జనవరి 12)న విచారించింది. జీవో నంబర్ 1ను ఈ నెల 23 వరకూ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా ఈ జీవో చెల్లదని మొదటి నుంచీ తెలుగుదేశం సహా అన్ని  విపక్షాలు చెబుతూ వస్తున్నసంగతి విదితమే. 

కమలంతో కలిస్తే సీన్ సితారే.. అత్మసాక్షి ఫస్ట్ రిపోర్ట్

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తిదాయకంగా మారుతున్నాయి. నిజానికి ఎన్నికలకు ఇంకా చాలా సమయముంది. ముందస్తు ఎన్నికల ఊహాగానాలు అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి. కానీ  ముందస్తు ఎన్నికలకు వెళ్లి ముందుగా ఇంటికి వెళ్ళడం కంటే, అందాక ఆగి అయిన కాడికి నాలుగు రాళ్ళు వెనకేసుకోవడం ఉత్తమమనే అభిప్రాయం అధికార పార్టీ ఎమ్మెల్యేలలో వ్యక్తమౌతోంది.   అదలా ఉంటే  రాష్ట్ర రాజకీయ పరిస్థితిపై ‘ఆత్మ సాక్షి’ పొత్తుల ప్రాతిపదికన నిర్వహించిన ప్రాథమిక సర్వే ప్రకారం  టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తే  ఆ కూటమి తిరుగులేని మెజారిటీతో సింహాసనం ఎక్కేస్తుంది. అదే  టీడీపీ, జనసేన కూటమితో మూడో పార్టీ బీజేపీ జట్టు కడితే  మూడు పార్టీల కూటమి మళ్ళీ మరో ఐదేళ్ళు విపక్షంలో నిరీక్షించక తప్పదు. నిజమే ఇది కొంచెం తప్పుడు లెక్కలా ఉన్నా ఆత్మ సాక్ష సర్వే ప్రకారం టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే  రెండు పార్టీల కూటమికి 105 నుంచి 112  వరకు అసెంబ్లీ సీట్లు ఖాయంగా వస్తాయి. అయితే  ఆ లెక్క నిజం కావాలంటే, టీడీపీ 36 నియోజక వర్గాలో ప్రస్తుతం ఉన్న ఇంచార్జ్ లని , అంటే అభ్యర్ధులను తీసీసి కొత్త వారికి టికెట్ ఇవ్వాలని ఆత్మ సాక్షి సర్వే చెబుతోంది. అదలా ఉంటే టీడీపీ, జనసేన కూటమిలోకి కమలం వచ్చి చేరితే, మూడు పార్టీల కూటమి 75 నుంచి 78 సీట్లు మాత్రమే గెలుచుకుంటుంది.  వైసీపీకి 90 నుంచి 95 సీట్లు వస్తాయి. వైసీపీ సునాయాసంగా రెండవ సారి అధికారంలోకి వస్తుంది. ఇదేమిటి ఒకటి ప్లస్ ఒకటి రెండు, రెండు ప్లస్ ఒకటి మూడు కావాలి కానీ, రెండు కంటే తక్కువ ఎలా అవుతుంది, అంటే, అదంతే అంటోంది అత్మసాక్షి సర్వే.   ఇక మూడో సినేరియోలో .. బీజేపీ, జనసేన ఒక జట్టుగా, వైసీపీ, టీడీపీ విడివిడిగా పోటీ చేసినా ముక్కోణపు పోటీలో కూడా వైసీపీనే మళ్ళీ విజయం సాధిస్తుంది.  వైసీపీకి 90 నుంచి 95, టీడీపీకి 68 నుంచి 70 సీట్లు, జనసేనకు 5 సీట్లు వస్తాయి. మరో 8 నుంచి పది సీట్లలో కీన్ కాంటెస్ట్ ఉంటుంది.  అయితే, ఆత్మ సాక్షి లెక్క ప్రకారం ప్రతి పక్షాల ముందన్న మంచి ఆప్షన్ మరొకటి వుంది. ... టీడీపీ,జనసేన,సిపిఐ, సిపిఎం పార్టీలు జట్టు కడితే, వైసీపీ కేవలం 60 నుంచి 65 ఎమ్మెల్యే సీట్లకే పరిమితం అవుతుంది. టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీల కూటమి భారీ మెజారిటీ సాధిస్తుంది.  ఆత్మ సాక్షి టీడీపీకి ఓ చిన్న సూచన కూడా చేసింది. మొత్తం 175 నియోజక వర్గాలకు గాను, 42 అసెంబ్లీ స్థానల్లో మాత్రమే టీడీపీ కాసింత బలహీనంగా వుంది. ఈ 42 నియోజక వర్గాల్లో బలమైన అభ్యర్ధులను ఇంచార్జ్ లుగా నియమించడమో లేదంటే ఉన్న వారికి బూస్ట్ ఇచ్చి,  ఉత్సాహన్ని నింపి గట్టిగా పనిచేసేలా చేయడమో చేయాలని ఆత్మ సాక్షి సూచించింది. చివరగా,ఆ 42 మంది బలహీన ఇంచార్జ్ ను మార్చలేక పోతే టీడీపీ బలం 59, 65 మధ్యలోనే ఉంటుందని ఆత్మసాక్షి.. సర్వే సూచిస్తోంది. అయితే ఇది సర్వే ప్రైమరీ రిపోర్ట్ మాత్రమే .. పూర్తి స్థాయి  సర్వే నివేదికతో కానీ,  అసలు నిజాలు బయటకు రావు.

ఆ సిట్టింగులకు నో టికెట్స్.. ఇప్పటికే జగన్ నిర్ణయం?

ఏపీలో వైసీపీ గ్రాఫ్, ఎమ్మెల్యేల పనితీరు దారుణంగా పడిపోతోంది. ఇందుకు సర్వేలను, నివేదికలను ఉటంకించాల్సిన అవసరం లేదు. జరుగుతున్న పరిణామాలు గమనిస్తే సరిపోతుంది.  ఆ విషయం విపక్షానికే కాదు.. అధికార వైసీపీకీ మరీ ముఖ్యంగా ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ కూ కూడా స్పష్టంగానే అర్ధమైంది. ఈ క్రమంలోనే  సీఎం జగన్ రెడ్డి తమ పార్టీ నేతలు, జిల్లాలు, ప్రాంతీయ ఇన్ చార్జిలతో  వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. సమీక్షలు చేస్తున్నారు. వీటన్నిటిలోనూ ఆయన వైనాట్ 175 అంటూ చెబుతుండటం మేకపోతు గాంభీర్యం తప్ప మరోటి కాదని.. సొంత పార్టీ ఎమ్మెల్యేలే అంతర్గత సంభాషణల్లో సెటైర్లు వేసుకుంటున్నారు. ఆ సంగతి అలా ఉంచితే.. ఆ భేటీల్లో తాను స్వయంగా చేయించిన సర్వేల్లో వైసీపీకి వ్యతిరేకంగా వచ్చిన రిపోర్టులపై జగన్ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా  పార్టీ మరోసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని, అందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలపై జగన్ లో  అసహనం ఓ రేంజ్ లో పెరిగిపోతోందని ఆయన మాటలే స్పష్టం చేస్తున్నాయి.  ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు సరిగా లేకపోవడం వల్లే పార్టీకి గడ్డు  పరిస్థితి వచ్చిందని జగన్ అంటున్నారు.  ఈ క్రమంలోనే జగన్ తన పార్టీలోని సిట్టింగులలో చాలా మందికి వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ ఇచ్చేది లేదని చెప్పకనే చెప్పేస్తున్నారు.   ఇలా సిట్టింగులకు ఉద్వాసన చెప్పే నియోజకవర్గాలలో దాదాపు 30 నియోజకవర్గాలపై ఇప్పటికే ఆయనో నిర్ణయం తీసేసుకున్నారని కూడా అంటున్నారు. అలా పక్కన పెట్టాలనుకునే వారిలో పలువురు సీనియర్లు, ఒకరిద్దరు మంత్రులు, మాజీ మంత్రులూ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. మరో వైపు జగన్ కూడా ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా ఎమ్మెల్యేలూ మీరు మారాలి, మీ పని తీరు మెరుగుపడాలి.. లేకుంటే టికెట్ కష్టమే.. ఇందులో ఎలాంటి మోహమాటం లేదు అని చెబుతూ వస్తున్నారు.  ఇప్పటికే చెప్పినా పని తీరు మార్చుకోని, మెరుగుపరుచుకోని ఓ 30 మందికి వచ్చే ఎన్నికలలో టికెట్ ఇవ్వకూడదన్న నిర్ణయానికి కూడా వచ్చేశారని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.  ప్రస్తుతం అభ్యర్థి మార్పు తథ్యమని వినిపిస్తున్న నియోజకవర్గాల విషయానికి వస్తే.. ఉమ్మడి నెల్లూరు జిల్లా జిల్లా గూడూరు, వెంకటగిరి, నెల్లూరు రూరల్ ఉదయగిరి, అలాగే ఉమ్మడి కడప జిల్లా రాజంపేట, హిందూపురం, ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కైకలూరు, నందిగామ, తిరువూరు అలాగే కర్నూలు జిల్లా పాణ్యం, నందికొట్కూరు ఇంకా  తిరుపతి,  కనిగిరి, గిద్దలూరు శ్రీకాళహస్తి ,పలమనేరు ననియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను తెరమీదకు తీసుకురావడం ఖాయమని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ఇంకా   శ్రీకాకుళం జిల్లాలోనూ   మార్పులు ఉంటాయంటున్నారు. అదే విధంగా విజయనగరం, బొబ్బిలి, భీమిలి నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఉమ్మడి పశ్చిమలోని ఏలూరు, ఆచంట, తాడేపల్లిగూడెం, నరసాపురం నియోజకవర్గాలలోనూ కొత్త అభ్యర్థులను రంగంలోకి దించేందుకు జగన్ ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నారని చెబుతున్నారు.  అయితే వీరే కాక ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ టికెట్లు దక్కని సిట్టింగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రజలలో ఉండి, వారి సమస్యలు తెలుసుకుని సత్వరం పరిష్కరించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలను ఉపేక్షించేది లేదని జగన్ చెబుతున్న మాటలు కేవలం హెచ్చరికలు కావనీ, కొత్త ముఖాలతో వచ్చే ఎన్నికలకు వెళితేనే.. ఇప్పుడు పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల వ్యక్తమౌతున్న వ్యతిరేకత తీవ్రత ఒకింతైనా తగ్గే అవకాశం ఉందన్నది ఆయన అభిప్రాయంగా కనిపిస్తోందని అంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలనూ, ఎక్కడికక్కడ పేరుకుపోయిన సమస్యలనూ ఎమ్మెల్యేల వైఫల్యంగా ప్రజలకు చూపి సేఫ్ గేమ్ అడాలన్న ఉద్దేశంతో జగన్ అడుగులు వేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అయితే సిట్టింగులకు టికెట్లు దక్కని పరిస్థితిపై పార్టీలో అసమ్మతి రాజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తమకు టికెట్ వచ్చే అవకాశం లేదంటూ జగన్ ఇస్తున్న సంకేతాలపై ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని బయటపెడుతున్నారు. ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. తిరుగుబావుటా ఎగురవేసేందుకు రెడీ అవుతున్నారు. రానున్న రోజులలో వైసీపీలో అసమ్మతి మరింత జ్వలించే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. 

ఈ మార్పు .. దేనికి సంకేతం ?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్  శాంతి కుమారి ఎంపిక అనూహ్యమే, అసలు రేసులోనే  లేని ఆమెను ముఖ్యమంత్రి ఎంపిక చేయడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. నిజానికి, ఆమెకు కూడా ఇది సర్ప్రైజ్  కావచ్చును. కానీ ముఖ్యమంత్రి కేసేఆర్ తీసుకునే కొన్ని కొన్ని నిర్ణయాలు ఆయన తప్ప మరొకరు అలోచించనైనా ఆలోచించ లేరు. అవి ఆయనకు తప్ప ఇంకెవరికీ అర్థం కావు. గతంలో హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్ నగర్‌ స్థానానికి మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె వాణి దేవిని  ఆఖరి క్షణంలో తెరాస అభ్యర్థిగా ఖరారు చేశారు. అప్పుడు ఇలాగే అందరూ అవాక్కయ్యారు. అలాగే ఇప్పడు సీఎస్ గా  శాంతి కుమారి ఎంపిక కూడా చాలా మందిని చాలా రకాలుగా ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే అంతకంటే విచిత్ర్రం మాజీ సీఎస్ సోమేష్ కుమార్ నిష్క్రమణ. నిజానికి, సోమేశ్ కుమార్ కోర్టు ఆదేశాలను ఇలా హుందాగా స్వీకరిస్తారని కానీ..  మౌనంగా ఉంటారని కానీ..  కోర్టు పొమ్మనగానే, జేబులో చేతులు పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్లి పోతారని కానీ ఎవరూ ఉహించలేదు. హై డ్రామా జరుగుతుందనే అందరూ ఉహించారు. మీడియా  అదే ఆశించింది. అయితే  సోమేశ్ కుమార్  అందరినీ  డిసప్పాయింట్  చేస్తూ ఎలాంటి చడీ చప్పుడు లేకుండా కోర్టు గీసిన గీత దాటకుండా నడుచుకుంటూ వెళ్లి పోయారు.  అయితే ఇప్పడు అదే ఆయన అలా జేబులో చేతులు పెట్టుకుని మౌనగా ఏపీకి వెళ్లి పోవడమే, అందరినీ అంతు చిక్కని ప్రశ్నగా వెంటాడుతోంది. అవును.. ఆయన ఎందుకు అలా వెళ్ళిపోయారు ? ముఖ్యమంత్రి కేసేఆర్  తమకు అన్ని విధాల అనుకకూలమైన ఆయన్ని ఎందుకు అలా.. వెళ్ళనిచ్చారు. ఎందుకు ఒంటరిగా వదిలేశారు? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరినీ వెంటాడు తున్నాయి.  హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఒక్క క్షణం వృధా చేయకుండా అత్యంత వేగంగా పావులు కదిపింది. తెలంగాణ ప్రభుత్వ విధుల నుంచి సోమేశ్‌ కుమార్‌కు వెంటనే రిలీవ్‌ కావాలని ఆదేశిస్తూ  ఉత్తర్వులు జరీ చేసింది. కోర్టు తీర్పు వచ్చిన రోజునే  మంగళవారం (జనవరి 10) ఈమేరకు  కేంద్ర శిక్షణ, సిబ్బంది వ్యవహారాల శాఖ(డీఓపీటీ) ఉత్తర్వులను జారీ చేసింది. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ నెల 12 లోపు అంటే గురువారం లోగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని సోమేశ్‌ను ఆదేశించింది. ఒక విధంగా ఇది ఊహించిందే  ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌ విభజన సందర్భంగా తన సీనియారిటీ ప్రకారం తాను ఆప్షన్‌ ఇచ్చిన తెలంగాణకు కాకుండా ఏపీకి కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ సోమేశ్‌ కుమార్‌ 2014లో సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌(క్యాట్‌)ను ఆశ్రయించారు. సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తెలంగాణలోనే కొనసాగేలా క్యాట్‌ 2016లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ(డీవోపీటీ) 2017లో హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఇప్పుడు ఆ పిటిషన్‌ పైనే కోర్టు తీర్పు నిచ్చింది.  మరోవంక రాజకీయ కోణంలో చూసినా సోమేశ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత ఆప్తుడు, ఇష్టుడు కావడం వలన ఆయన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆఘమేఘాల మీద పరుగులు తీయడాన్ని  అర్థం చేసుకోవచ్చును.కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అంతే వేగంగా చక చకా నిర్ణయాలు తీసుకున్నారు.  సోమేశ్ కుమార్ అటో ఇటో ఎటో తేల్చుకోక ముందే కొత్త సీఎస్ బాధ్యతలు స్వీకరించారు. ఇది  చాలా మందిని చాలా చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంచు మించుగా మూడున్నరేళ్ళుగా ముఖ్యమంత్రి నోట్లో నాలుకలా అన్ని కార్యాలు చక్కపెట్టిన సోమేశ్ కుమార్ కు కనీసం ఒక సాంప్రదాయ వీడ్కోలు అయినా లేకుండానే ఎందుకు అలా వదిలేశారు అనేది పొలిటికల్ ఆఫీషియల్ సర్కిల్స్ లో మిలియన్ డాలర్ల ‘చర్చ;’ గా మారింది.     నిజానికి కోర్టు తీర్పును ముందుగానే ఊహించిన సోమేశ్ కుమార్ కు, అదే జరిగితే ఏమి చేయాలనే విషయంలో ఒక స్పష్టత ఉందనే ప్రచారం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్‌కుమార్‌ కొనసాగింపును హైకోర్టు రద్దు చేయడంతో ఆయన తన పోస్టుకు రాజీనామా చేస్తారనే ప్రచారం మరింత జోరందుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే ఉద్దేశం, ఆసక్తి ఆయనకు ఏమాత్రం లేవని వార్తలొచ్చాయి. అంతే కాకుండా ఆయన సర్వీస్ ఇంకా నిండా సంవత్సరం కుడా లేదు. ఈ ఏడాది అంటే 2023 డిసెంబరు 30తో ఆయన సర్వీసు కాలం ముగుస్తుంది. కనుక  ఇంత తక్కువకాలం కోసం ఏపీకి వెళ్లి  చిన్న పోస్టులో కొనసాగడం అవసరమా అనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు వార్తలొచ్చాయి. అందుకే తన ఐఏఎస్‌ పదవికి రాజీనామా చేస్తారని చర్చ కూడా జరిగింది. అనంతరం తెలంగాణ సర్కారు ఆయనను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమిస్తుందనే ఊహాగానాలు వినిపించాయి. నిజానికి సోమేశ్‌కుమార్‌ కు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మొదటి నుంచీ  సత్సంభాదాలే ఉన్నాయి కనుక ఆయన ఐఏఎస్ గా రాజీనామా చేసినా,  తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్ ఆయన  సేవలను సలహాదారు గానో, మరో విధంగానో ఎక్కడో అక్కడ తప్పకుండా  ఉపయోగించు కుంటారనే ప్రచారం జరిగింది.  కానీ  అవేవీ లేకుండా సోమేష్ కుమార్ హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే సీన్ మారిపోయింది. కోర్టు తీర్పు వచ్చిన 24 గంటల లోగానే,  కొత్త సీఎస్ నియామకం జరిగిపోయింది. కొత్త సీఎస్‌గా శాంతికుమారి పేరు మీడియాకు తెలియడం, ఆమె కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలవడం, ఆ వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడం గంటల వ్యవధిలోనే జరిగిపోయాయి. అయితే ఎందుకిలా జరిగింది? మాజీ సీస్ ఇంతలోనే ఎందుకు మనసు మార్చుకున్నారు? ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు అంతలా  ఉదాసీనంగా ఉన్నారు ...? కేంద్రంతో మరో వివాదం కొని తెచ్చుకోవడం ఇష్టం లేక కేసీఆర్ మౌనంగా ఉండిపోయారా... ఈ గుణాత్మక మార్పుకు సిబిఐ , ఈడీ కేసులు, విచారణలకు ఏమైనా సంబంధం వుందా? ఇవ్వన్నీ ప్రస్తుతానికి జవాబు లేని ప్రశ్నలు

తెలంగాణ కొత్త సీఎస్.. ఏపీ కోసం కేసీఆర్ ఎత్తుగడేనా?

తెలంగాణ కొత్త సీఎస్ గా శాంతి కుమారి నియామకం వెనుక కేసీఆర్ పెద్ద వ్యూహమే ఉంది.  అయితే ఆ వ్యూహం తెలంగాణ లక్ష్యంగా కాదు.. ఏపీలో బీఆర్ఎస్ బలోపేతం లక్ష్యంగా రచించారని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీలో బీఆర్ఎస్ బలోపేతం కోసం ఇప్పటికే ఒక సామాజిక వర్గం లక్ష్యంగా చేరికలను ఆహ్వానించిన కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ కొత్త సీఎస్ గా శాంతికుమారిని నియమించడం ద్వారా ఏపీలో ‘ఒక’ సామాజిక వర్గం మొత్తంగా బీఆర్ఎస్ వైపు ఆకర్షితులయ్యేలా వ్యూహం పన్నారని అంటున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ మూలాలుఉన్న శాంతి కుమారిని సీఎస్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. కేసీఆర్ ఏపీలో ఏ సామాజికవర్గాన్నైతే లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతున్నారో.. ఏ సామిజక వర్గం బీఆర్ఎస్ కు చేరువ అవుతో ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ నిర్ణయాత్మక శక్తిగా మారుతుందని భావిస్తున్నారో.. ఆ సామాజిక వర్గానికే చెందిన శాంతి కుమారిని తెలంగాణ సీఎస్ గా నియమించారు. ఆయన వ్యూహం లక్ష్యం సవ్యదిశగానే సాగుతోందనడానికి ఆమె నియామకం జరిగి.. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఏపీ కాపు ప్రముఖులు కొత్త సీఎస్ తో కలిసి సీఎం కేసీఆర్ ను కలవడమే  నిదర్శనంగా పరిశీలకులు చెబుతున్నారు.   శాంతి కుమారి వాస్తవానికి తెలంగాణలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి అయినా, ఇంత కాలం ఆమె అంతగా ప్రాధాన్యత లేని అటవీ శాఖకు పరిమితం చేశారు. ఆమె గతంలో  సీఎంవోగా పని చేసినా ఆమెకు అక్కడ కూడా దక్కాల్సిన ప్రాముఖ్యత దక్కినట్లు కనిపించదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. తెలంగాణ సీఎస్ రేసులో సీఎంకు సన్నిహితులైన అధికారులు నలుగురైదుగురు ఉన్నా కూడా ఆ రేసులో కనీసం పేరు కూడా వినిపించని శాంతి కుమారిని కేసీఆర్ అనూహ్యంగా సీఎస్ గా నియమించడం వెనుక ఏపీ లక్ష్యంగా ఉన్న వ్యూహమే కారణమని చెబుతున్నారు.  ఇటీవలే బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమించిన కేసీఆర్.. రోజుల వ్యవధిలోనే అదే సామాజిక వర్గానికి చెందిన శాంతి కుమారిని తెలంగాణ సీఎస్ గా నియమించి.. ఆ సామాజిక వర్గానికి బీఆర్ఎస్ ఎనలేని ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను ఇస్తోందన్న సంకేతాలు ఇచ్చారు.  అదే సమయంలో తెలంగాణలో తెలుగు అధికారులకు కీలక పదవులు ఇవ్వడం లేదంటూ తనపై తెలంగాణలో వెల్లువెత్తుతున్న విమర్శలకు కూడా ఆయన శాంతికుమారిని సీఎస్ గా నియమించడం ద్వారా చెక్ పెట్టి ఒకే సారి రెండు ప్రయోజనాలు సిద్ధించేలా పావులు కదిపారు. ఏపీ లక్ష్యంగా కేసీఆర్ వేసిన ఈ ఎత్తుగడ ఏ మేరకు బీఆర్ఎస్ ఆ రాష్ట్రంలో బలపడేందుకు తోడ్పడుతుందో తెలియదు కానీ, ఆమెతో కలిసి  ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, పార్థసారథి తదితరులు సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి కృతజ్ణతలు చెప్పడంతోనే ఆయన ఏ ఉద్దేశంతో శాంతి కుమారిని తెలంగాణ సీఎస్ గా నియమించారన్నది స్పష్టమౌతోంది.  

ఠాక్రే... తేల్చేస్తారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన సంక్షోభం పరిష్కారానికి పార్టీ అధిష్టానం కొంచెం ఆలస్యంగానే అయినా నడుం బిగించింది. నిజానికి రేవంత్ రెడ్డిని  పీసీసీ అధ్యక్షునిగా నియమించిన క్షణానే, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సంక్షోభానికి బీజం పడింది. రేవంత్ నియామకం అయిన వెంటనే, కోమటి రెడ్డి వెంకటరెడ్డి నిరసన గీతానికి సిగ్నేచర్ ట్యూన్ సెట్ చేశారు.  .రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నంత కాలం గాంధీ భవన్ గడప తొక్కనని తొలి నిరసన గళం వినిపించారు. ప్రతిజ్ఞ చేశారు. కోమటి రెడ్డి వెనక జగ్గా రెడ్డి ఆయన వెంట వీహెచ్, మర్రి శశిధర్ రెడ్డి మరి కొందరు ఇలా ఒకరి వెంట ఒకరుగా పార్టీ సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పుతూ వచ్చారు.  మరో వంక మాజీ పీసీసీ అధ్యక్షుడు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి, ఎమ్మెల్యే డి. శ్రీధర్ బాబు వంటి మరికొందరు సీనియర్లు, తటస్థంగా ఉన్నట్లు ఉంటూనే., రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక విధమైన మౌన పోరాటం చేశారు. చాపకింద నీరులా రేవంత్ రెడ్డి కుర్చికి ఎసరు తెచ్చే ప్రయత్నాలు సాగించారు. అయితే, మునుగోడు ఉప ఎన్నిక ముందు నుంచి సీనియర్ నేతలు రూట్ మార్చి రేవంత్ రెడ్డికి ‘బయటి’ వ్యక్తి  అనే ముద్ర వేశారు. అదే సమయంలో  రేవంత్ రెడ్డి ఆయన ముఖ్య అనుచరులు, కాంగ్రెస్ కల్చర్ తెలిసీ, తెలియక  చేసిన వ్యాఖ్యలు సీనియర్లకు అస్త్రాలయ్యాయి.  ఆ అస్త్రాలను ఉపయోగించుకునే రేవంత్ రెడ్డికి చెక్ పెట్టే వ్యూహంలో భాగంగా మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్ధికి డిపాజిట్ అయినా దక్కకుండా చేయడంలో సీనియర్లు కృతకృత్యులయ్యారు. అలాగే మునుగోడు ఓటమిని పూర్తిగా రేవంత్ రెడ్డి వ్యక్తిగత ఖాతాలో వేసి, ఆయన పోటుగాడు కాదు,  పనికిరానోడే అని అధిష్టానానికి పెద్దక్షరాల్లో ఫిర్యాదు చేశారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం అందరూ చేతులు కలిపారు. ఒకే స్వరంతో  ‘కోరస్’గా నిరసన గీతాన్ని ఢిల్లీకి వినిపించారు. ఢిల్లీ కదిలింది.     అయితే, అధిష్టానం సమస్యను గుర్తించడంలో జరిగిన జాప్యం వల్లనైతేనేమీ, సమస్య పరిష్కారానికి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోక పోవడం వల్లనైతేనేమీ, అధిష్టానం నడుం బిగించే సమయానికే, సమస్య జటిలమై కూర్చుంది. రాష్ట్ర వ్యవహరాల బాధ్యుడు మాణిక్యం ఠాగూర్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో జట్టు కట్టి కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని సీనియర్ నాయకులు తీవ్ర స్వరంతో ఆరోపించిన తర్వాత కానీ కాంగ్రెస్ అధిష్టానంలో కదలిక రాలేదు. అంతే కాదు దిగ్విజయ్ దౌత్యం కూడా విఫలమైన తర్వాత కానీ, మాణిక్యం ఠాగూర్ ను తొలిగించ లేదు. అందుకే కావచ్చును,చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున చందాన ఠాగూర్ ను సాగనంపినా పెద్దగా ఫలితం లేక పోయింది. సీనియర్లు శాంతించడం లేదు. మరోవంక రేవంత్ రెడ్డి కూడా కాడి  వదిలేసే ఆలోచకు వచ్చినట్లు తెలుస్తోంది.   ఈ నేపధ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇంచార్జ్ మాణిక్‌రావు ఠాక్రే రంగంలోకి దిగారు. రెండు రోజుల పర్యటనకు హైదరాబాద్ వచ్చారు. మహారాష్ట్రకు చెందిన ఠాక్రే సీనియర్ నాయకుడు.  సందేహం లేదు. నాలుగైదు మార్లు ఎమ్మెల్యేగా, ఒకటి రెండు మార్లు మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటుగా పార్టీలోనూ పీసీసీ సహా కీలక పదవులు నిర్వహించిన అనుభవం వుంది. అయితే. మాణిక్యం ఠాగూర్ తో కానీ పని మాణిక్‌రావు ఠాక్రేతో అవుతుందా? దిగ్విజయ్ అంతటివాడితో కానీ పని ఠాక్రేతో అవుతుందా? అనే అనుమానాలు అయితే బలంగానే వినిపిస్తున్నాయి.  మరోవంక  ఠాక్రే రాకతో గాంధీ భవన్‌లో కొత్త జోష్‌ కనిపించింది. చాలాకాలం నుంచి దూరం దూరంగా ఉంటున్న రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలంతా గాంధీ భవన్‌లో దర్శనమిచ్చారు. కానీ  రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నంత వరకు  తాను గాంధీభవన్‌ గడప తొక్కనని ప్రతిజ్ఞ చేసి కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుత అసమ్మతికి తొలి బీజం నాటిన కోమటి రెడ్డి వెంకట రెడ్డి మాత్రం ఆ మాట మీదనే నిలబడ్డారు. ఆహ్వానం పంపినా ఆయన రాలేదు. అఫ్కోర్స్ మధ్యలో ఆయన ఒకటి రెండు సందర్భాలో గాంధీభవన్  కు వచ్చారు అనుకోండి అది వేరే విషయం. అలాగే, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి తిరుమల వెళ్లడంతో.. ముఖాముఖి సమావేశాల్లో పాల్గొనలేకపోయారు. అదలా ఉంటే రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన పార్టీ ఎమ్మెల్యేలు సీతక్క పోదెం వీరయ్య తదితర నేతలూ ‘వ్యక్తిగత’  కారణాలతో సమావేశాలకు రాలేదు. అలాగే  ఠాక్రేతో ఎవరికి వారుగా సమావేశమైన నాయకులు  దిగ్విజయ్ సింగ్ ముందు వినిపించిన విధంగా ఎవరి వాదన వారు వినిపించినట్లు తెలుస్తోంది  రాష్ట్రంలో కాంగ్రెస్ కు సానుకూల పరిస్థితే ఉందని, రేవంత్‌రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించకుండా అందర్నీ కలుపుకొపోతేనే సానుకూల ఫలితం వస్తుందన్న అభిప్రాయాన్ని సీనియర్లు వ్యక్తం చేస్తే  సానుకూలతను ఓట్ల రూపంలో మార్చుకునే ప్రక్రియలో రేవంత్‌కు సీనియర్ నాయకుల సహకారం అందడం లేదని రేవంత్ రెడ్డి  అనుకూల వర్గం నేతలు తమ వాదన వినిపించినట్లు తెలిసింది.  పీఏసీ సభ్యులందరికీ సమయం ఇచ్చి అభిప్రాయాలు విన్న ఠాక్రే.. పార్టీలో ఎవరి గౌరవం వారికి దక్కేలా తాను చూస్తానని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే .. ఇరు వర్గాలు ఎవరికి వారు, ‘తగ్గేదే లే’ అంటున్న నేపధ్యంలో  అది అయ్యే పనేనా ? కాదంటే, పరిస్థితి ఏంటి ? ఇవే ఇప్పుడు కాంగ్రెస్ క్యాడర్, అభిమానుల ముందున్న ప్రశ్నలు.

తమిళనాడు గవర్నర్ కావాలనే రెచ్చగొడుతున్నారా?

రాష్ట్రప్రభుత్వాలూ, గవర్నర్ ల మధ్య వివాదం తలెత్తడమన్నది కొత్త విషయమేమీ కాదు.  కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికీ మధ్య సత్సంబంధాలు  లేని ప్రతి సందర్భంలోనూ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు గవర్నర్లతో పేచీ తలెత్తడం సాధారణమే. ఈ పరిస్థితి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ ఉన్నదే.  కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్న కాలంలోనూ ఇలా గవర్నర్లు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎన్టీఆర్ ను పదవీ చ్యుతుడిని చేసి నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించిన సందర్భంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రామ్ లాల్ వ్యవహరించిన తీరు, పోషించిన పాత్ర తెలిసిందే.   సరే ఇప్పుడు బీజేపీ హయాంలోనూ అటువంటి పరిస్థితే కొనసాగుతోంది. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళ సైల మధ్య విభేదాలు తెలియనివి కావు.  అలాగే తాజాగా  తమిళనాడులో నూ ఇదే పరిస్థితి ఏర్పడింది. అయితే తమిళ నాడులో జరిగింది మాత్రం మామూలు వివాదం కాదు. ఇది దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే అత్యంత అరుదైన సంఘటన. ప్రజాస్వామ్యంలో మాయని మచ్చగా మిగిలిపోయే వివాదం. తమిళనాడు శాసనసభ కొత్త సంవత్సరంలో మొదటిసారిగా సమావేశమైనప్పుడు చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు గవర్నర్‌, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య ఉన్న వివాదాలను మరింత రాజేశాయి. శాసనసభను ఉద్దేశించి గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి తాను చేయాల్సిన ప్రసంగంలో చివరి నిమిషంలో కొన్ని మార్పులు, చేర్పులు చేయడం, దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి   తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, దీని మీద గవర్నర్‌ సభ నుంచి వాకౌట్‌ చేయడం వంటి ఘటనలు స్వతంత్ర భారత దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ జరగలేదు. శాసనసభ ఆమోదించిన సుమారు పన్నెండు బిల్లుల మీద సంతకం చేయకుండా గవర్నర్‌ తొక్కి పెట్టి ఉంచడం గతంలో పలు సందర్భాలలో పలు రాష్ట్రాలలో జరిగింది. అయితే తమిళనాడు గవర్నర్ మాత్రం ఇది చాలదన్నట్టు ఒక అడుగు ముందుకు వేసి  శాసనసభలో చేసిన వ్యాఖ్యలు గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అగాధాన్ని మరో ఎత్తుకు తీసుకు వెళ్లింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ తరచూ సన్నాయి నొక్కులు నొక్కే తమిళనాడు గవర్నర్‌   శాసనసభలో తాను ప్రసంగించడానికి ప్రభుత్వం తయారు చేసి ఇచ్చిన ప్రసంగంలో కొన్ని వాక్యాలను చదవ లేదు.   తన ‘విచక్షణాధికారం’ నెపంతో వదిలేశారు.  ఈ వ్యవహారమంతా చినికి చినికి గాలివానగా మారి, గవర్నర్ల పాత్రపై వాడి వేడి చర్చకు తెరలేపింది.  రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు సంబంధించిన ప్రసంగంలో మార్పులు, చేర్పులు చేయడానికి, తనకు తోచిన విధంగా కొన్ని భాగాలను తొలగించడానికి గవర్నర్‌కు హక్కుందా అన్నది పక్కన పెడితే..  నా ప్రభుత్వం అంటూ గవర్నర్ ఆరంభించే ప్రసంగంలో అలా ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రసంగించడం లేదా కొన్ని వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రం సమంజసం కాదు. గతంలో అంటే 2018లో కేరళలో కూడా ఇటువంటి సంఘటనే చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర గవర్నర్‌ పి. సదాశి వం తన బడ్జెట్‌ ప్రసంగంలో కొన్ని భాగాలను తొలగించి చదివారు. కేంద్ర ప్రభుత్వాన్ని, పాలక పక్షాన్ని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆ భాగాలను   గవర్నర్‌ చదవకుండా దాటేసినా వాటిని కూడా చదివినట్టుగానే పరిగణిస్తామని అప్పట్లో కేరళ  స్పీకర్‌ రూలింగ్‌ ఇచ్చారు. గవర్నర్‌ తీరుపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. చివరికి దానంతటదే చల్లారింది.  ఇక 2020లో కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ కూడా ఇదే విధంగా వ్యవహరించారు. సదాశివం, ఆరిఫ్‌ మొహ మ్మద్‌ ఖాన్లు గవర్నర్లుగా ఉన్నంత వరకూ రాష్ట్ర ప్రభుత్వంతో విభేదిస్తూనే వచ్చారు. ఆ కొందరు సంప్రదాయాలను, పద్ధతులను పాటించడానికి ఇష్టపడడం లేదు. దేశ సర్వోన్నత న్యాయస్థానం  ఒక కేసులో   గవర్నర్ల రాజ్యాంగపరమైన అధికారాలను వివరించింది. తాము గవర్నర్లుగా ఉన్న రాష్ట్రానికి తాము కార్య నిర్వాహక అధిపతులే కానీ, వాస్తవంలో మంత్రివర్గమే రాష్ట్రానికి కార్య నిర్వాహక అధిపతిగా వ్యవహరిస్తుంది. ఇంత స్పష్టంగా సుప్రీం తీర్పు ఉన్నప్పటికీ కొన్ని కొన్ని సందర్భాలలో గవర్నర్లు పరిధి మీరడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం రాజ్యాంగం పట్ల గౌరవం లేకపోవడమేననే చెప్పాలి. ఇక తమిళనాడు గవర్నర్ విషయానికి వస్తే ఆయన కావాలనే తమిళనాడు ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో విపక్ష ఏఐడీఎంకే కూడా తన నిరసనను వ్యక్తం చేసిందంటే గవర్నర్ రవి ప్రసంగం ఎవరికీ నచ్చని విధంగానే ఉందన్నది తేటతెల్లమౌతోంది. 

చంద్రబాబుతో రజనీకాంత్ భేటీ.. మోహన్ బాబు కోసమేనా?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబునివాసానికి వెళ్లిన రజనీకాంత్ ఆయనతో దాదాపు అరగంట సేపు భేటీ అయ్యారు. ఈ విషయాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్వయంగా ట్వీట్ చేశారు. మిత్రుడు రజనీకాంత్ ను కలవడం సంతోషంగా ఉందంటూ వారిరువురూ కలిసిన ఫోటును కూడా ఆ ట్వీట్ కు జత చేశారు. సరే ఇంతకీ ఇరువురి మధ్యా ఏం చర్చ జరిగిందన్న విషయంపై రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ జరిగిన అనంతరం రజనీకాంత్ చంద్రబాబుతో భేటీ వెనుక ఏదో కారణం ఉండే ఉంటుందన్న ఊహాగానాలూ వ్యక్తమౌతున్నాయి. మర్యాదపూర్వకంగానే చంద్రబాబుతో భేటీ అయినట్లు రజనీకాంత్ చెబుతున్నా.. అదొక్కటే కాదు ఇంకేదో కారణం ఉండి ఉంటుందని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీతో ఎన్టీఆర్ హయాం నుంచీ సినీ ప్రముఖులు సన్నిహితంగానే ఉంటూ వచ్చారు. ఇక రజనీకాంత్ విషయానికి వస్తే మాజీ ఎంపీ, ప్రస్తతుం వైసీపీలో ఉన్న మోహన్ బాబు సన్నిహిత మిత్రుడు. ఇటీవలి కాలంలో మోహన్ బాబు వైసీపీలో ఉక్కపోతకు గురౌతున్నారు. ఆ పార్టీలో ఎటువంటి గుర్తింపూ లేక, కనీసం పట్టించుకునే వారు కూడా కరవై ఇబ్బందులు పడుతున్నారు. తన స్థాయికీ, స్టేచర్ కు తగిన పదవి ఇస్తారని భావించినా జగన్ అసలు మోహన్ బాబును ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆయన తెలుగుదేశం వైపు చూస్తున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అలాగే గతంలో ఒక సారి తిరుపతిలోని తన విద్యా సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాయిబాబా విగ్రహావిష్కరణకు ఆహ్వానించేందుకు మోహన్ బాబు చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. అప్పుడే మోహన్ బాబు తెలుగుదేశం గూటికి చేరుతారన్న ప్రచారం జరిగింది. కారణాలేమైనా అప్పట్లో అది జరగలేదు. ఆ ప్రచారమూ సద్దుమణిగింది. తాజాగా ఇప్పుడు రజనీకాంత్ చంద్రబాబుతో భేటీ కావడంతో ఆ ప్రచారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇక పోతే మోహన్ బాబు, పవన్ కల్యాణ్  మధ్య అంతగా సయోధ్య లేదని చిత్ర పరిశ్రమలో ఒక టాక్ ఉంది. పలు సందర్భాలలో ఆ విషయం నిజమేననిపించే సంఘటనలూ జరిగాయి. అయితే రజనీకాంత్ కు పవన్ కల్యాణ్ తోనూ, చంద్రబాబుతోనూ కూడా మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అలాగే మోహన్ బాబు ఆయనా కూడా మంచి స్నేహితులు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతో రజనీకాంత్ మోహన్ బాబు తెలుగుదేశం ప్రవేశం గురించి చర్చించి ఉంటారని పరిశీలకులు అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు, రజనీకాంత్ ల భేటీ  రాజకీయ చర్చకు తావిచ్చిందనడంలో సందేహం లేదు.  

శబరిమల ఆవరణ పంపిణీ నిలిపివేత!

ఆలయాలలో ప్రసాదాల తయారీ, పంపిణీ, నాణ్యత, పవిత్రత విషయంలో ఇటీవలి కాలంలో వివాదాలు పెచ్చరిల్లుతున్నాయి.  రెండు నెలల కిందట విజయవాడ దుర్గగుడిలో శానిటేషన్ శాఖలో పని చేసే ఉద్యోగి.. ప్రసాదం లడ్డూలపై కూర్చుని ఫోన్ మాట్లాడుతూ.. ఇదేమని ప్రశ్నించిన భక్తులపై ఎదురు దాడికి దిగాడు. వాళ్లెంత అభ్యంతర పెట్టినా నా ఇష్టం నాదే అన్నట్లు వ్యవహరించాడు. దీంతో కొందరు భక్తులు ఆ ఉద్యోగి లడ్డూల పై కూర్చుని ఫోన్ మాట్లాడుతుండగా ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. అలాగే.. ఇటీవల భద్రచాలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో భక్తులకు బూజు పట్టిన లడ్డూలు విక్రయించిన సంఘటన మరువక ముందే.. శబరిమలలో ప్రసాదాల పంపిణీని నిలిపివేయాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. ఆవరణగా పిలిచే ఈ ప్రసాదం తయారీలో యాలకులు ఉపయోగిస్తారు. అయితే ఈ యాలకులను అధిక మొత్తంలో రసాయినాలు వాడి పండిస్తున్నట్లు తేలింది. దీంతో ఈ ప్రసాదం తినే వారికి హానికరమని భావించిన కేరళ హైకోర్టు ఆవరణ పంపిణీ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు యాలకులు వాడకుండా ప్రసాదం తయారు చేయాలని నిర్ణయించింది.  మొత్తం మీద వరుస సంఘటనలు చూస్తుంటే.. భక్తులు అత్యంత భక్తితో వచ్చే దేవాలయాల పవిత్రత, పరిశుభ్రత, ప్రసాద నాణ్యత వంటి విషయాలలో సంబంధిత అధికారులు పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కేంద్రం, రాష్ట్రాల మధ్య నిథుల ‘పంచాయతీ’

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీ నిధుల విషయంలో పరస్పరం ఎంత దుమ్మెత్తి పోసుకున్నా, ఎన్ని విమర్శలు చేసుకున్నా.. వాస్తవమేమిటంటే.. గ్రామ పంచాయతీలకు నిధులు అందడం లేదన్నది మాత్రమే. గ్రామాల అభివృద్ధికి కానీ, గ్రామాలలో సంక్షేమ పథకాలకు కానీ పైసా  నిధులు కూడా లేవు. అమలు జరిగిన, జరుగుతున్న కార్యక్రమాలకు నిధులు అందక సర్పంచ్ లు అడకత్తెరలో పోక చెక్క మాదిరి నలిగిపోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. గ్రామాల అభివృద్ధి విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శమని సొంత భుజాలు చరుచుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ జరగని విధంగా తెలంగాణలో గ్రామాభ్యుదయం వికసించిందని చెప్పుకుంటున్నారు.  అయితే గ్రామ పంచాయతీలకు నిధుల మంజూరు విషయంలో మాత్రం కేంద్రంపై నెపం తోసేసి చేతలు దులిపేసుకుంటోది. అదే సమయంలో  కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తోంది. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర నిందారోపణలో పబ్బం గడిపేసుకుంటూ.. గ్రామాలకు నిధుల మంజూరు విషయాన్ని విస్మరిస్తున్నాయి.  రాష్ట్రంలో గ్రామాలు దేశంలో మరెక్కడా లేనివిధంగా అభివృద్ధి చెందు తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గొప్పగా చెప్పుకుంటున్నా వాస్తవంలో మాత్రం నిధుల కొరతతో గ్రామ పంచాయతీలు నానా అవస్థలూ పడుతున్నాయి.   నిధుల కొరత కారణంగా తాము నానా అవస్థలూ పడుతున్నామంటూ గత కొన్ని నెలలుగా  సర్పంచులు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. తాము కూడా చివరికి వ్యవసాయ కార్మికులుగా, కాపలా దార్లుగా పని చేయాల్సి వస్తోందని, ప్రాణాలు తీసుకోవడం కూడా జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు  గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు గాను కాంట్రాక్టర్లకు చెల్లించడానికి రుణాలు తీసుకోవాల్సి వస్తోందని  చెబుతున్నారు. తమ దగ్గర నిధులు లేకపోయినా, అభివృద్ధి కార్యక్రమాల అమలు విషయంలో తమపై విపరీతంగా ఒత్తిడి పెరుగుతోందని  వారు వాపోతున్నారు. చాలా నెలలుగా తమకు నిధులు విడుదల కావడం లేదంటూ   గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయంలో పార్టీలతో సంబంధం లేదు. ఏ సర్పంచ్ ఏ పార్టీకి చెందినవారైనా నిధుల కొరత మాత్రం అందరికీ సమానంగానే ఉంటోంది. అత్యధిక శాతం గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం పది లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు బాకీ పడిందని వారు చెబుతున్నారు.  గ్రామ పంచాయతీలు నిధులు కేటాయించడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై  విమర్శలు, అలాగే కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందంటూ ఆరోపణలు, నిరసనలతో బీజేపీ హోరెత్తిస్తుంటే.. కాంగ్రెస్ కూడా పంచాయతీలకు నిధుల విషయంలో కేసీఆర్ సర్కార్ నే నిందిస్తోంది.  అయితే, కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు సరిగా నిధులు రావడం లేదని, కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని, నిధుల్లో కోత విధించడం, నిధుల మంజూరులో ఆలస్యం చేయడం, విధులు ఆపేయడం వంటి చర్యలకు పాల్పడుతోందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ పరస్పరారోపణల మధ్య అసలు వాస్తవం మరుగున పడిపోతోంది.  వాస్తవం ఏమిటంటే కేంద్రం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులను విడుదల చేయడం రాష్ట్రాల హక్కులను హరించడమేనని కేసీఆర్ అంటున్నారు. నిజమే.. కానీ కేంద్రం విడుదల చేశాం కానీ, రాష్టం దారి మళ్లించిందంటోది.  రాష్టరమేమో కేంద్రం నుంచి నిధులే రాలేదంటోంది. ఇప్పటికైనా పరస్పర నిందారోపణలను పక్కన పెట్టి వాస్తవమేమిటన్నది వెల్లడించి పంచాయతీలకు నిధుల కొరత పరిష్కరించాల్సిన అవసరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. 

తెలంగాణ సీఎస్ గా శాంతి కుమారి

తెలంగాణ కొత్త సీఎస్‌గా శాంతికుమారి నియమితులయ్యారు. ఈ పదవిలో ఆమె   2025 వరకు ప  కొనసాగనున్నారు. శాంతికుమారి ప్రస్తుతం  అటవీశాఖ స్పెషల్‌ సీఎస్‌గా పనిచేస్తున్నారు.  గ‌తంలో వైద్యారోగ్య శాఖ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించారు. సీఎంవోలో స్పెష‌ల్ ఛేజింగ్ సెల్ బాధ్య‌త‌ల‌ను కూడా నిర్వ‌హించారు.   మెద‌క్ క‌లెక్ట‌ర్‌గా కూడా శాంతి కుమారి సేవ‌లందించారు. హైకోర్టు తీర్పుతో సోమేష్ కుమార్ తెలంగాణ సీఎస్ గా రిలీవ్ అయిన క్షణం నుంచీ రాష్ట్రంలో కొత్త సీఎస్ ఎవరన్న ఉత్కంఠ నెలకొంది.  ఈ నేపథ్యంలోనే సీనియర్ ఐఎస్ఎస్ అధికారులు రామకృష్ణ, అరవింద్ కుమార్ లలో ఎవరు తెలంగాణ కాబోయే సీఎస్ అన్న చర్చ అధికార వర్గాలలో జోరుగా సాగింది.  మునిసిపల్ శాఖ స్పెషల్ సీఎస్ గా ఉన్న అరవింద్ కుమార్, ప్రణాళికా శాఖ స్పెషల్ సీఎస్ గా ఉన్న రామకృష్ణలు రేసులో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. వీరిరువురిలో కూడా బీహార్ కు చెందిన అరవింద్ కుమార్ కే ఎక్కువ అవకాశాలున్నట్లుగా అధికార వర్గాలు సైతం భావించాయి. మునిసిపల్ శాఖ స్పెషల్ సీఎస్ గా అరవింద్ కుమార్ మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గుడ్ సెల్వ్స్ లో ఉన్నారన్న ప్రచారంతో తెలంగాణ స్పెషల్ సీఎస్ గా ఆయనకే ఎక్కువ అవకాశాలున్నాయన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే కేసీఆర్ కూడా బీహార్ క్యాడర్ కు చెందిన అరవింద్ కుమార్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. సీనియారిటీ ప్రకారం రామకృష్ణారావు ముందు వరుసలో ఉన్నప్పటికీ.. కేసీఆర్ మొగ్గు మాత్రం అరవింద్ కుమార్ వైపే ఉందని భావించారు. అయితే అనూహ్యంగా  అటవీశాఖ స్పెషల్ సీఎస్ గా ఉన్న శాంతి కుమారిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపిక చేశారు. ఆమెను కొత్త సీఎస్ గా నియమించారు. శాంతికుమారి  1989 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి శాంతి కుమారి.. గ‌తంలో ఆమె సీఎం కార్యాల‌యంలో ప‌ని చేశారు. శాంతి కుమారి తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా సీఎస్ గా రికార్డు సృష్టించారు.  తెలంగాణ తొలి మహిళా సీఎస్ గా నియమితురాలైన శాంతి కుమారి ప్రగతి భవన్ కు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. మెరైన్ బయోలజీలో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్న శాంతి కుమారి అమెరికాలో ఎంబీఏ చేశారు. ఐఏఎస్ అధికారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ఆ తరువాత తెలంగాణలోనూ వివిధ హోదాలలో పని చేసిన శాంతి కుమారి  తెలంగాణ సీఎస్ గా నియమితురాలయ్యే వరకూ తెలంగాణ అటవీ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు.  

రామగోపాల్ వర్మ.. వివాదమా.. ఉన్మాదమా?..

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన రామ్ గోపాల్ వర్మ తాజాగా చేసిన ట్వీట్ ఇటు రాజకీయ పార్టీలూ, అటు కాపు సామాజిక వర్గం కూడా తీవ్రంగా ఖండించి ఆయన తీరును తప్పుపట్టిన నేపథ్యంలో తగ్గేదే లే అన్నట్లుగా మళ్లీ అదే విధంగా రెండు సామాజిక వర్గాల మధ్యా చిచ్చు రేపేలా మరో ట్వీట్ చేశారు. రామగోపాల వర్మ చేసిన ట్వీట్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీకి రాజకీయ లబ్ధి చేకూర్చేవిగా, అదే సమయంలో రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చు రగిల్చేవిగా ఉన్నాయి. ఇంతకీ రామ్ గోపాల్ వర్మ వైసీపీకి ప్రయోజనం కలిగించడం కోసం ఎందుకు పాకులాడుతున్నారూ అంటే.. తను దర్శకత్వం వహించనున్న రెండు రాజకీయ చిత్రాల వెనుక ఉన్నది వైసీపీ కనుక. వాటికి ప్రచారం కల్పించుకోవడంతో పాటు ఎవరూ తన ముఖం చూడకపోయినా.. తనకు రెండు సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన వైసీపీకి ఏదో విధంగా మేలు చేసే ఉద్దేశంతోనే రామ్ గోపాల్ వర్మ ట్వీట్ల రచ్చకు దిగినట్ల పరిశీలకులు అంటున్నారు. ఆయన రామ్ గోపాల్ వర్మ కాదు.. రాంగ్ గోపాల్ వర్మ అంటూ అభివర్ణిస్తున్నారు. ఆయన సినిమాలలాగే ఆయన సామాజిక మాధ్యమంలో పెట్టే పోస్టులు, వీడియోలూ కూడా నైతికతకు తిలోదకాలిచ్చేసి, విశృంఖలతకు, జవాబుదారీతనం లేని తనానికి నిలువెత్తు సాక్ష్యాలుగా ఉంటాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఒక వైసీపీ నాయకుడు నిర్మిస్తున్న వైసీపీకి అనుకూలంగా ఉండేలా.. రానున్న ఎన్నికలలో వైపీపీకి ప్రచారంగా దోహదపడేందుకు వ్యూహం, శపథం అన్న రెండు సినిమాలకు ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సినిమాలు ఎప్పుడు తెరకెక్కుతాయొ తెలియదు కానీ, వాటి కోసం రామ్ గోపాల్ వర్మ సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకు కూడా వెనుకాడటం లేదు. అసలు తొలి నుంచీ కూడా రామ్ గోపాల్ వర్మ.. సమాజం పట్ల ఏ మాత్రం బాధ్యత లేకుండా ఉన్మాది తరహాగా వ్యవహరిస్తున్నారు. అది పక్కన పెట్టి ప్రస్తుతానికి వస్తే.. వైసీపీ నాయకుడొకరు నిర్మిస్తున్నరెండు సినిమాలపై చర్చించేందుకే ఆయన ఇటీవల తాడేపల్లి వెళ్లి మరీ జగన్ ను కలిసి వచ్చారు. ఆ తరువాత నుంచీ ఆయన వైఖరిలో తీవ్రమైన మార్పు వచ్చింది. విపక్షాలను టార్గెట్ చేస్తూ బాధ్యతా రహితంగా పోస్టులు పెట్టడం ప్రారంభమైంది. తాజాగా హైదరాబాద్ లో  జరిగిన పవన్ కల్యాణ్, చంద్రబాబుల భేటీపై సభ్య సమాజం అసహ్యించుకునేలా ఆయన చేసిన ట్వీట్లు దుమారం లేపాయి. అన్ని వర్గాలలోనూ తీవ్ర అసహనం వ్యక్తం అయ్యింది. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా, ఒక సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ఉన్న ఆ ట్వీట్లపై కోర్టు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలన్నడిమాండ్ లూ వెల్లువెత్తాయి. కొందరు న్యాయవాదులైతే ఆయన చేసిన ట్వీట్లు ఆధారంగా ఏయే సెక్షన్ల కింద కేసులు నమోదు చేయవచ్చో కూడా చెపపారు. సరే అదలా ఉంటే.. రామ్ గోపాల్ వర్మ  ‘రిప్’ కా  ట్వీట్ పై కాపుసామాజిక వర్గంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అలాగే జనసేన శ్రేణులు కూడా అగ్గిమీద గుగ్గిలంలా మండి పడుతున్నాయి.  పవన్ కల్యాణ్ అభిమాన సంఘాలైతే ఒక అడుగు ముందుకు వేసి రామ్ గోపాల్ వర్మకు ఆయన శైలిలోనే బదులిచ్చాయి. రామ్ గోపాల్ వర్మకు కన్నీటి వీడ్కోలు అన్న బ్యానర్లు పెట్టి, ఆ బ్యానర్లలో ఆయన ఫొటోకు దండ వేసి కర్మకాండలు నిర్వహించాయి.  మొత్తం మీద రామ్ గోపాల్ వర్మ సినీదర్శకుడిగా కాకుండా సమాజానికి చీడ పురుగులా తయారయ్యారని తటస్థులు, మేధావులు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ఎటువంటి విలువలకూ విలువ ఇవ్వని ఒక ఉన్మాద మనస్థత్వంతో వ్యవహరిస్తున్న రామ్ గోపాల్ వర్మ సామాజిక మాధ్యమంలో పెడుతున్న పోస్టుల ఆధారంగా ఆయన సోషల్ మీడియా అక్కౌంట్లను బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందని పరిశీలకులు అంటున్నారు.

బాలినేని జంప్ ఖయామేనా?

ఎన్నికలు దూసుకొస్తున్న వేళ... వైసీపీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయా? ఇంతకాలం పంటి బిగువుల అసంతృప్తిని అణచుకున్న ఒక్కొక్కరూ ఇప్పుడు బయటకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారా? అంటే ఔననే సమాధానం వస్తుంది. తాజాగా ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిలో ఆసంతృప్తి రోజురోజుకు తీవ్రమవుతోందా? ఆ క్రమంలో ఆయన కుదురుగా ఉండలేకపోతున్నారా? అందుకే ఆయన అడుగులు మరోపార్టీ వైపునకు పడుతున్నాయా? అంటే నియోజకవర్గ ప్రజలు ఔననే అంటున్నారు.  అంతే కాదు ఇటీవల  జరిగిన పరిణామాలను ఉదాహరణగా చూపుతున్నారు. ఒంగోలులో బాలకృష్ణ కొత్త సినిమా వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్ సజావుగా సాగడానికి స్థానిక ఎమ్మెల్యే బాలినేని పూర్తిగా సహాయ సహకారాలు అందించారంటూ.. అదే వేదికపై నుంచి ఆ చిత్ర దర్శకుడు గోపిచంద్ మలినేని ప్రకటించడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అలాగే ఒకానొక దశలో ఈ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించిందంటూ.. ఓ వార్త  తెగ ప్రచారంలోకి వచ్చింది.  దీంతో ఈ కార్యక్రమానికి అనుమతి లభిస్తోందా? లేదా? అంటూ బాలయ్య అభిమానుల్లో కొంత సందిగ్థత నెలకొంది. అలాంటి పరిస్థితుల్లో ఈ చిత్ర ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రభుత్వం నుంచి అనుమతి లభించడానికి కర్త.. కర్మ..  క్రియ అంతా బాలినేని వారేనని వారు పేర్కొంటున్నారు. బాలినేని అలా వ్యవహరించడం వెనుక ఉన్న మర్మమేమిటని నియోజకవర్గ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.     ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. వైసీపీ పైన.. ఆ పార్టీ నాయకులపైన.. నిత్యం నిప్పులు చెరుగుతూ ఉంటారని.. అయితే జగన్ పార్టీలో పురుషులందు పుణ్య పురుషులు వేరయా లా .. జగన్ పార్టీలోని నాయకుల్లో.. బాలినేని వంటి మనస్సున్న వారు వేరుగా ఉంటారంటూ జనసేనాని పవన్ ఇప్పటికే పలు వేదికలపై నుంచి ప్రకటించారని.. అలాగే పవన్ కల్యాణ్ స్వయంగా ఫోన్ చేసి అడిగారని.. ఓ జనసేన వీర మహిళ మీద పెట్టిన కేసును సైతం బాలినేని తీయించివేశారని వారు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు.  జనసేన పార్టీ పట్ల.. బాలినేనికి ఉన్న సాఫ్ట్ కార్నర్‌పై తాడేపల్లి ప్యాలెస్‌లోని పెద్దలు ఒకింత గుర్రుగా ఉండాడానికి ఇది కూడా ఓ కారణం అయి ఉంటుందని వారు అంటున్నారు.  మరోవైపు జగన్ తొలి కేబినెట్‌లో మంత్రి పదవి కాస్తా హుళక్కి అయిన తర్వాత.. ఆసంతృప్తితో ఉన్న బాలినేనిని బుజ్జగించడానికి  నెల్లూరు జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త పదవిని సీఎం జగన్ ఆయనకు కట్టబెట్టారు. అయితే ఆయన హాయాంలో ఆ నెల్లూరు జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలంతా ఆసంతృప్తి గళం వినిపించారు. దీంతో జిల్లా పంచాయతీ కాస్తా.. తాడేపల్లి ప్యాలెస్‌కు చేరింది. జిల్లాలోని ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలాంటి వారు.. చెలరేగిపోతుంటే..  పార్టీ సమన్వయకర్తగా ఏం చేస్తున్నావంటూ బాలినేనికి  వైసీపీ అధినేత, సీఎం జగన్ గట్టిగానే తలంటినట్లు ఓ టాక్ అయితే నియోజకవర్గంలో హల్‌చల్ చేసిందని ప్రజలే చెబుతున్నారు. అదీకాక.. జగన్ తొలి కేబినెట్‌లో మంత్రిగా కొనసాగిన ఆయనను.. మలి కేబినెట్‌లో   తొలగించి.. అదే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేశ్‌ను కొనసాగించడంతో బాలినేని తీవ్ర ఆసంతృప్తికి లోనయ్యారు.  అంతేకాదు.. జగన్ మలి కేబినెట్‌లో 100కి వంద శాతం అంతా కొత్త వారే ఉంటారంటూ  బాలినేని స్వయంగా మీడియా ముందుకు వచ్చి ప్రకటించారు.  కానీ తన పాత కేబినెట్‌లోని 11 మందికి మళ్లీ జగన్.. తన మంత్రి వర్గంలో చోటు ఇవ్వడం.. బాలినేనికి ఏ మాత్రం మింగుడు పడని వ్యవహారంగా మారింది.  అదీకాక జగన్‌కు బాలినేని సమీప బంధువు. అయినా.. ఎక్కడైనా బంధువే కానీ.. కేబినెట్‌ దగ్గర కాదన్నట్లుగా జగన్ వ్యవహారం ఉండడంతో బాలినేనిలో నాడు చేలరేగిన అసంతృప్తి... నేడు  మరింత పెరిగిందని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు.    ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో కొంచెం అటు ఇటుగా అయినా.. తన రాజకీయ భవిష్యత్తుకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా ఉండేందుకు బాలినేని చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు.. ఆయన చర్యలు చూస్తే అర్థమవుతోందని ఒంగోలు నియోజకవర్గ ప్రజలు పేర్కొంటున్నారు. అలాగే తన నియోజకవర్గంలో సామాజిక వర్గాల ఓట్లు..  వారి సమీకరాణాలను పరిశీలించుకొంటూ.. వాటి ద్వారా ఓ అంచనా వేసుకొంటూ.. ప్రస్తుతం బాలినేని ప్రయాణం సాగుతోందని.. ఆ క్రమంలోనే ఆయన చర్యలు ఉన్నాయని నియోజకవర్గ ప్రజలు స్పష్టం చేస్తున్నారు.

మోడీ హైదరాబాద్ పర్యటన వాయిదా

తెలంగాణ బీజేపీ ఉత్సాహంపై నీళ్లు చల్లినట్లైంది. రాష్ట్రంలో దూకుడు పెంచిన బీజేపీ ఈ నెలలో ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనపై బోలెడు ఆశలు పెట్టుకుంది. కేంద్రం తెలంగాణకు మొండి చేయి చూపిందంటూ భారాస నాయకులు చేస్తున్న ప్రచారాన్ని, విమర్శలకు తిప్పి కొట్టే విధంగా మోడీ తన పర్యటనలో  దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనుండటం, ఆ తరువాత పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభలో ప్రసంగించడంతో భారాస విమర్శలను తిప్పికొట్టేందుకు మంచి అవకాశంలభిస్తుందన్న ఉత్సాహంతో ఉన్న రాష్ట్ర బీజేపీ నాయకులు మోడీ పర్యటన వాయిదాపడటంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.   బిజీ షెడ్యూల్ కారణంగా మోడ పర్యటన వాయిదా పడిందని చెబుతున్నారు. సికిందరాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు భూమి పూజ, వందే భారత్ రైలు ప్రారంభోత్సవం, అలాగే 1,850 కోట్ల వ్యయంతో 150 కి. మీ. ల పొడవున నిర్మించనున్న 3 జాతీయ రహదారి ప్రాజెక్టుల విస్తరణ పనులకు భూమిపూజ, ఇంకా రూ. 521 కోట్ల వ్యయంతో కాజీపేట్ నందు నిర్మించనున్న  రైల్ పీరియాడిక్ ఓవర్ హాలింగ్ వర్క్ షాపునకు  భూమిపూజ కార్యక్రమాలు కూడా మోడీ పర్యటనతో పాటే వాయిదా పడ్డాయి. అలాగే పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభలో మోడీ నోటి వెంట కేంద్రం తెలంగాణకు అందించిన సహాయం, చేసిన మేళ్లు వివరించే అవకాశం ఆయన పర్యటన వాయిదాతో చేజారిందన్న అభిప్రాయం బీజేపీ నేతలలో వ్యక్తమౌతోంది.

భారత్ జోడో యాత్ర సక్సెస్ కు కారణమిదేనా?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఈ యాత్ర ఆద్యంతం రాహుల్ గాంధీలో మారిన మనిషి కనిపిస్తున్నారు. మౌనాన్ని మించిన భాష లేదు.. వినడాన్ని మించిన జ్ణానం లేదు అన్నట్లుగా ఆయన యాత్ర కొనసాగుతోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఒక రాజకీయ యాత్రగా కాకుండా దేశంలో  సమస్యలు, పరిష్కారాలు కనుగొనేందుకు చేపట్టిన యాత్రగా  కనిపిస్తోంది. తెలుగువన్ ముందే చెప్పినట్లుగా..  పార్టీ ఎన్నికల వైఫల్యాలతో సంబంధం లేకుండా రాహుల్ తన యాత్రను ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు. గుజరాత్ ఎన్నికలలో ఘోర పరాజయం,  ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలలో తేరుకోలేని ఎదురుదెబ్బ వీటిని వేటినీ రాహుల్ పట్టించు కోలేదు.. స్థిత ప్రజ్ణత సాధించిన మౌనిలా ఆయన నడక కొనసాగిస్తున్నారు. జనంలో మమేకం అవుతున్నారు. ఇక ఇప్పుడు రాహుల్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకుంటోంది. ఈ సుదీర్ఘ యాత్ర పొడవునా ఆయన ప్రసంగాలు చేయలేదు.. వాగ్దానాలు గుప్పించలేదు. అరచేతిలో స్వర్గం చూపించ లేదు.  రాహుల్ యాత్ర కారణంగా ఆ యాత్ర సాగిన ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ బలోపేతమైందన్న సూచన లేదు.   అయినా అశేష జనవాహిని ఆయన యాత్రను స్వాగతించింది. అన్ని వర్గాలకు చెందిన వారూ ఆయన యాత్రలో అడుగు కలిపారు. యాత్ర సందర్భంగా జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పరాజయాల పరంపర కొనసాగినా.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఆత్మ విశ్వాసం సన్నగిల్లలేదు సరికదా ఇనుమడించింది. అసలిది ఎలా జరిగింది? సుదీర్ఘ ప్రసంగాలు లేకపోయినా, అరచేతిలో వైకుంఠం చూపిన చందంగా వాగ్దానాలు లేకపోయినా, అన్ని వర్గాల ప్రజలూ, ముఖ్యంగా యువత రాహుల్ జోడో యాత్రలో పెద్ద సంఖ్యలో ఎందుకు  మమేకమయ్యారు? ఈ ప్రశ్నలకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పారు. తన యాత్రలో భాగంగా బుధవారం పంజాబ్ లో ని  ఫతేహగ్ సాహిబ్ లో  ఆధ్యాత్మిక ప్రదేశాలను రాహుల్ గాంధీ సందర్శించిన అనంతరం  మాట్లాడారు. తన యాత్ర  సుదీర్ఘ ప్రసంగాలు చేయడానికి కాదనీ,  ప్రజలు చెప్పేది వినేందుకేననీ స్పష్టం చేశారు.  ఈ యాత్ర లక్ష్యం ప్రజలు చెప్పేది వినడమే. దేశంలో పెరిగిన ద్వేషం, హింస, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలను లేవనెత్తి, ఆ సమస్యలకు వ్యతిరేకంగా ఆ యాత్ర ద్వారా పోరాటం చేయాలన్నదే లక్ష్యం అని రాహుల్ వివరించారు. ఆయన యాత్ర ఆద్యంతం ఈ లక్ష్యానికి అనుగుణంగానే సాగుతోందని చెప్పాలి. జోడో యాత్ర సందర్భంగా ఆయన ఎక్కడా పరుష వ్యాఖ్యలు చేయలేదు. రాజకీయ విమర్శలను గుప్పించలేదు. అందుకే రాహుల్ భారత్ జోడో యాత్రకు రాజకీయాలతో సంబంధం లేకుండా సమాజంలోని అన్ని వర్గాల నుంచీ మద్దతు సంఘీభావం వ్యక్తం అవుతోందని అంటున్నారు.  

సోమేష్ కుమార్ రిలీవ్ డ్.. నెక్ట్స్ సీఎస్ ఎవరంటే..?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ కొనసాగింపును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానం తీర్పు దృష్ట్యా సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను తెలంగాణ నుంచి రిలీవ్‌ చేస్తూ డీవోపీటీ ఆదేశాలు జారీ చేయడమే కాకుండా, ఇవి తక్షణమే అమల్లోకి వస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే సోమేష్ కుమార్ ఈ నెల 12 లోగా ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని కూడా డీవోపీటీ స్పష్టం చేసింది. అంటే తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాలన్న సోమేష్ కుమార్ ముందు ఏపీ సర్కార్ కు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర విభజన సమయంలో సోమేష్ కుమార్ ను కేంద్రం ఏపీకి కేటాయించింది.దీనిపై ఆయన క్యాట్ ను ఆశ్రయించడంతో గతంలో ఆయన తెలంగాణలోనే కొనసాగేలా క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది.  అప్పటి నుంచీ ఆ ఉత్తర్వులతో తెలంగాణలో సోమేశ్‌కుమార్‌ కొనసాగుతున్నారు. క్యాట్‌ ఉత్తర్వులను కొట్టివేయాలని 2017 లోనే కేంద్రం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. తెలంగాణ సీఎస్ గా సోమేష్ కుమార్ కొనసాగించటాన్ని హైకోర్టు రద్దు చేసింది. దీంతో సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదం కొలిక్కి వచ్చింది. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను కూడా హైకోర్టు కొట్టేయటం విశేషం. అయితే ..3 వారాలు సమయం కావాలని సోమేశ్ కుమార్ అభ్యర్థనను కూడా   తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సోమేష్ కుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయింనున్నట్లు చెబుతున్నారు. అయితే ఆయన సుప్రీంను ఆశ్రయించినా ఆశ్రయించకున్నా కోర్టు తీర్పు మేరకు ఆయనను తెలంగాణ బాధ్యతల నుంచి రిలీవ్ చేసి ఈ నెల 12 లోగా.. అంటే మంగళవారం (జనవరి 10) కోర్టు తీర్పు ఇస్తే.. గురువారం (జనవరి 12)లోగా ఏపీ సర్కార్ కు రిపోర్టు చేయాలని డీవోపీటీ ఆదేశించింది. దీంతో సోమేష్ కుమార్ ఏపీకి వెళ్లడమా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవడమా అన్న సందిగ్ధంలో పడ్డారు. ఏపీకి వెళ్లకుండా స్వచ్ఛంద విరమణ తీసుకుంటే ఆయనకు రాష్ట్రంలో రెండు ఆప్షన్స్ ఉంటాయని అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రితో సత్సంబంధాల కారణంగా ఆయనకు ఏదో ఒక సలహాదారు వంటి పదవి దక్కే అవకాశం ఉంది. లేదంటే గతంలో కేవీ రమణాచారి చేసిన విధంగా రాజకీయాలలోకి ప్రవేశించే అవకాశం కూడా ఉందంటున్నారు. బీఆర్ఎస్ లో చేరి క్రియాశీలంగా వ్యవహరించే అవకాశం ఉందనిపరిశీలకులు అంటున్నారు. ఇక సోమేష్ కుమార్ విషయం అలా ఉంచితే ఆయన రిలీవ్ అయిపోవడంతో.. తెలంగాణ సీఎస్ ఎవరన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలుగువన్ ఇంతకు ముందే చెప్పినట్లు స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయిలో తెలంగాణలో పలువురు ఉన్నప్పటికీ  పోటీ మాత్రం ప్రధానంగా ముగ్గురి మధ్యే ఉంటుంది. వారిలో మరీ ముఖ్యంగా ప్రణాళికా సంఘం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణ, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ శాఖల స్పెషల్ సీఎస్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న అరవింద్ కుమార్ లు రేసులో ముందున్నారన సచివాలయ వర్గాలలో వినిపిస్తోంది. సోమేష్ కుమార్ ను రిలీవ్ చేసిన నేపథ్యంలో తదుపరి సీఎస్ ఎవరన్నది కేసీఆర్ సర్కార్ ఇహనో ఇప్పుడో   ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ ఐఎస్ఎస్ అధికారులు రామకృష్ణ, అరవింద్ కుమార్ లలో ఎవరు తెలంగాణ కాబోయే సీఎస్ అన్న చర్చ అధికార వర్గాలలో జోరుగా సాగుతోంది.  అయితే వీరిలో మంత్రి కేటీఆర్ గుడ్ సెల్వ్స్ లో ఉన్న అరవింద్ కుమార్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కేసీఆర్ కూడా బీహార్ క్యాడర్ కు చెందిన అరవింద్ కుమార్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. సీనియారిటీ ప్రకారం రామకృష్ణారావు ముందు వరుసలో ఉన్నప్పటికీ.. కేసీఆర్ మొగ్గు మాత్రం అరవింద్ కుమార్ వైపే ఉందని చెబుతున్నారు.  కాగా రాష్ట్రంలోని వివిధ కీలక పోస్టింగ్స్‌లో బీహార్‌కు చెందిన అధికారులే ఉన్న నేపథ్యంలో అదే రాష్ట్రానికి చెందిన  అరవింద్ కుమార్ కే కేసీఆర్ అవకాశం ఇస్తారని అంటున్నారు.  అయితే విపక్షాలు బయటి వారికి కీలక పదవులు కట్టబెడుతున్నారంటూ కేసీఆర్ పై విమర్శలు కురిపిస్తున్న నేపథ్యంలో రామకృష్ణకు సీఎస్ పదవి కట్టబెట్టే విషయం ముఖ్యమంత్రి పరిశీలించే అవకాశం కూడా ఉందని అంటున్నారు. అయితే మునిసిపల్ వ్యవహారాల శాఖ స్పెషల్ సీఎస్ గా ఉన్న అరవింద్ కుమార్ కేసీఆర్ గుడ్ సెల్వ్స్ లో ఉండటం, అలాగే స్థానికుల కంటే ఇతర రాష్ట్రాలకు చెందిన వారికే కీలక పదవులు కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి మెగ్గు చూపుతుండటంతో అరవింద్ కుమార్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ డీజీపీగా ఉన్న అంజనీ కుమార్ కూడా బీహార్ కు చెందిన వారే కావడం గమనార్హం.   

చైనాలో ఒక రాష్ట్రం మొత్తం కరోనా బాధితులే?!

డ్రాగన్ దేశం కరోనా గుప్పిట్లో చిక్కుకుందా? కోట్లాది మంది కరోనా బారిన పడి విలవిలలాడుతున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తుంది. వ్యాక్సినేషన్, క్యూర్ వంటి వాటిపై శ్రద్ధ పెట్టకుండా జీరో కోవిడ్ విధానాన్ని మాత్రమే నమ్ముకుని పొరపాటు చేసిన చైనా.. ప్రజాగ్రహం కారణంగా అనివార్యంగా కరోనా ఆంక్షలను సడలించక తప్పని పరిస్థితిని ఎదుర్కొంది. అంతే కరోనా ఆంక్షలను ఎత్తివేసిన తరువాత ఆ దేశంలో మహమ్మారి విజృంభణ అనూహ్యంగా పెరిగిపోయింది. ఆ దేశంలో రోజుకు సగటున  లక్షల మంది వైరస్ బారిన పడుతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అలాగే మరణాలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయని అంటున్నారు. అయితే కరోనా విజృంభణకు సంబంధించిన వార్తలు బయటకు పొక్కకుండా డ్రాగన్ దేశం గోప్యత పాటిస్తోందన్న విమర్శలూ  ప్రపంచ దేశాలలో వెల్లువెత్తుతున్నాయి. అనధికారిక సమాచారం ప్రకారం చైనాలోని  హెనాన్ రాష్ట్ర జనాభాలో 90శాతం మందికి పైగా కరోనా సోకింది. ఆ ఒక్క రాష్ట్రంలోనే దాదాపు 9 కోట్ల మంది మహమ్మారి బాదితులుగా ఉన్నారని చైనా అధికార వర్గాల ద్వారానే లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అదే విధంగా క్రిస్మస్ సమయంలో దేశంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో బయటపడ్డాయని తెలుస్తోంది. కరోనా విజృంభణ అత్యంత ప్రమాదకర స్థాయికి చేరినా, మృత్యుఘంటికలు  మోగిస్తున్నా చైనా మాత్రం కరోనా ఆంక్షలు విధించడం లేదు. దీంతో వ్యాధి వ్యాప్తి అదుపులేకుండా పోయింది. ఈ వ్యాప్తి విజృంభణ ఇలాగే కొనసాగితే ప్రపంచం మరో సారి కరోనా ఆంక్షల చట్రంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అమ్మకు మించి దైవమున్నదా?

ముందు అమ్మ.. ఆ తరువాతే ఏదైనా.. ఇదీ అమ్మ గొప్పతనం. ఎంత ఎదిగినా బిడ్డ ఆలనా పాలనా స్వయంగా చూసుకుంటేనే ఆమెకు తృప్తి ఆనందం. అత్యున్నత స్థానంలో ఉండి కూడా బిడ్డ ఆలనా పాలనా చూసేందుకు వాటిని తృణ ప్రాయంగా త్యజించిన వాళ్లను చూశాం. నెలల పిల్లను చంకనేసుకుని విధి నిర్వహణ చేసిన వారినీ చూశాం. కరోనా సమయంలో బిడ్డను వీడి ఆసుపత్రుల్లో ఉద్యోగం చేస్తూ కన్నీటి పర్యంతమైన తల్లుల గాధలూ విన్నాం. ఇప్పుడు తాజాగా ఓ కంపెనీ సీఈవో.. తన విధులు నిర్వహిస్తూనే బిడ్డ ఆలనా పాలనా కూడా చూసుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. చంటి బిడ్డతో ఆఫీసుకు వచ్చి అటు తల్లిగా, ఇటు సీఈవోగా ఆమె ద్విపాత్రాభినయం చేస్తున్న దృశ్యాలు నెటిజన్లను కదిలించి వేస్తున్నాయి. ఆమెపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నాయి.  ఎడెల్విస్ మ్యూచువల్ ఫండ్ సీఈవో, ఎండీ  రాధికా గుప్త తల్లిగా, సీఈవోగా  తాను ట్రావెల్ చేస్తున్న తీరుపై ట్విట్టర్ లో  పోస్ట్ చేశారు. తన డెస్క్ పక్కనే ఆమె కుమారుడు బొమ్మలతో ఆడుకునే ఫోటోను ఆమె ట్వీట్ కు జత చేశారు.  ఆడవారి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ను రాధిక పోస్ట్ చేసిన ఒక్క పోస్ట్ తో వివరించినట్టైందని నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు.