తెలంగాణ సీఎస్ గా శాంతి కుమారి

తెలంగాణ కొత్త సీఎస్‌గా శాంతికుమారి నియమితులయ్యారు. ఈ పదవిలో ఆమె   2025 వరకు ప  కొనసాగనున్నారు. శాంతికుమారి ప్రస్తుతం  అటవీశాఖ స్పెషల్‌ సీఎస్‌గా పనిచేస్తున్నారు.  గ‌తంలో వైద్యారోగ్య శాఖ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించారు. సీఎంవోలో స్పెష‌ల్ ఛేజింగ్ సెల్ బాధ్య‌త‌ల‌ను కూడా నిర్వ‌హించారు.   మెద‌క్ క‌లెక్ట‌ర్‌గా కూడా శాంతి కుమారి సేవ‌లందించారు. హైకోర్టు తీర్పుతో సోమేష్ కుమార్ తెలంగాణ సీఎస్ గా రిలీవ్ అయిన క్షణం నుంచీ రాష్ట్రంలో కొత్త సీఎస్ ఎవరన్న ఉత్కంఠ నెలకొంది.  ఈ నేపథ్యంలోనే సీనియర్ ఐఎస్ఎస్ అధికారులు రామకృష్ణ, అరవింద్ కుమార్ లలో ఎవరు తెలంగాణ కాబోయే సీఎస్ అన్న చర్చ అధికార వర్గాలలో జోరుగా సాగింది.  మునిసిపల్ శాఖ స్పెషల్ సీఎస్ గా ఉన్న అరవింద్ కుమార్, ప్రణాళికా శాఖ స్పెషల్ సీఎస్ గా ఉన్న రామకృష్ణలు రేసులో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. వీరిరువురిలో కూడా బీహార్ కు చెందిన అరవింద్ కుమార్ కే ఎక్కువ అవకాశాలున్నట్లుగా అధికార వర్గాలు సైతం భావించాయి. మునిసిపల్ శాఖ స్పెషల్ సీఎస్ గా అరవింద్ కుమార్ మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గుడ్ సెల్వ్స్ లో ఉన్నారన్న ప్రచారంతో తెలంగాణ స్పెషల్ సీఎస్ గా ఆయనకే ఎక్కువ అవకాశాలున్నాయన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే కేసీఆర్ కూడా బీహార్ క్యాడర్ కు చెందిన అరవింద్ కుమార్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. సీనియారిటీ ప్రకారం రామకృష్ణారావు ముందు వరుసలో ఉన్నప్పటికీ.. కేసీఆర్ మొగ్గు మాత్రం అరవింద్ కుమార్ వైపే ఉందని భావించారు. అయితే అనూహ్యంగా  అటవీశాఖ స్పెషల్ సీఎస్ గా ఉన్న శాంతి కుమారిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపిక చేశారు. ఆమెను కొత్త సీఎస్ గా నియమించారు. శాంతికుమారి  1989 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి శాంతి కుమారి.. గ‌తంలో ఆమె సీఎం కార్యాల‌యంలో ప‌ని చేశారు. శాంతి కుమారి తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా సీఎస్ గా రికార్డు సృష్టించారు.  తెలంగాణ తొలి మహిళా సీఎస్ గా నియమితురాలైన శాంతి కుమారి ప్రగతి భవన్ కు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. మెరైన్ బయోలజీలో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్న శాంతి కుమారి అమెరికాలో ఎంబీఏ చేశారు. ఐఏఎస్ అధికారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ఆ తరువాత తెలంగాణలోనూ వివిధ హోదాలలో పని చేసిన శాంతి కుమారి  తెలంగాణ సీఎస్ గా నియమితురాలయ్యే వరకూ తెలంగాణ అటవీ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు.  

రామగోపాల్ వర్మ.. వివాదమా.. ఉన్మాదమా?..

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన రామ్ గోపాల్ వర్మ తాజాగా చేసిన ట్వీట్ ఇటు రాజకీయ పార్టీలూ, అటు కాపు సామాజిక వర్గం కూడా తీవ్రంగా ఖండించి ఆయన తీరును తప్పుపట్టిన నేపథ్యంలో తగ్గేదే లే అన్నట్లుగా మళ్లీ అదే విధంగా రెండు సామాజిక వర్గాల మధ్యా చిచ్చు రేపేలా మరో ట్వీట్ చేశారు. రామగోపాల వర్మ చేసిన ట్వీట్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీకి రాజకీయ లబ్ధి చేకూర్చేవిగా, అదే సమయంలో రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చు రగిల్చేవిగా ఉన్నాయి. ఇంతకీ రామ్ గోపాల్ వర్మ వైసీపీకి ప్రయోజనం కలిగించడం కోసం ఎందుకు పాకులాడుతున్నారూ అంటే.. తను దర్శకత్వం వహించనున్న రెండు రాజకీయ చిత్రాల వెనుక ఉన్నది వైసీపీ కనుక. వాటికి ప్రచారం కల్పించుకోవడంతో పాటు ఎవరూ తన ముఖం చూడకపోయినా.. తనకు రెండు సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన వైసీపీకి ఏదో విధంగా మేలు చేసే ఉద్దేశంతోనే రామ్ గోపాల్ వర్మ ట్వీట్ల రచ్చకు దిగినట్ల పరిశీలకులు అంటున్నారు. ఆయన రామ్ గోపాల్ వర్మ కాదు.. రాంగ్ గోపాల్ వర్మ అంటూ అభివర్ణిస్తున్నారు. ఆయన సినిమాలలాగే ఆయన సామాజిక మాధ్యమంలో పెట్టే పోస్టులు, వీడియోలూ కూడా నైతికతకు తిలోదకాలిచ్చేసి, విశృంఖలతకు, జవాబుదారీతనం లేని తనానికి నిలువెత్తు సాక్ష్యాలుగా ఉంటాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఒక వైసీపీ నాయకుడు నిర్మిస్తున్న వైసీపీకి అనుకూలంగా ఉండేలా.. రానున్న ఎన్నికలలో వైపీపీకి ప్రచారంగా దోహదపడేందుకు వ్యూహం, శపథం అన్న రెండు సినిమాలకు ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సినిమాలు ఎప్పుడు తెరకెక్కుతాయొ తెలియదు కానీ, వాటి కోసం రామ్ గోపాల్ వర్మ సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకు కూడా వెనుకాడటం లేదు. అసలు తొలి నుంచీ కూడా రామ్ గోపాల్ వర్మ.. సమాజం పట్ల ఏ మాత్రం బాధ్యత లేకుండా ఉన్మాది తరహాగా వ్యవహరిస్తున్నారు. అది పక్కన పెట్టి ప్రస్తుతానికి వస్తే.. వైసీపీ నాయకుడొకరు నిర్మిస్తున్నరెండు సినిమాలపై చర్చించేందుకే ఆయన ఇటీవల తాడేపల్లి వెళ్లి మరీ జగన్ ను కలిసి వచ్చారు. ఆ తరువాత నుంచీ ఆయన వైఖరిలో తీవ్రమైన మార్పు వచ్చింది. విపక్షాలను టార్గెట్ చేస్తూ బాధ్యతా రహితంగా పోస్టులు పెట్టడం ప్రారంభమైంది. తాజాగా హైదరాబాద్ లో  జరిగిన పవన్ కల్యాణ్, చంద్రబాబుల భేటీపై సభ్య సమాజం అసహ్యించుకునేలా ఆయన చేసిన ట్వీట్లు దుమారం లేపాయి. అన్ని వర్గాలలోనూ తీవ్ర అసహనం వ్యక్తం అయ్యింది. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా, ఒక సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ఉన్న ఆ ట్వీట్లపై కోర్టు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలన్నడిమాండ్ లూ వెల్లువెత్తాయి. కొందరు న్యాయవాదులైతే ఆయన చేసిన ట్వీట్లు ఆధారంగా ఏయే సెక్షన్ల కింద కేసులు నమోదు చేయవచ్చో కూడా చెపపారు. సరే అదలా ఉంటే.. రామ్ గోపాల్ వర్మ  ‘రిప్’ కా  ట్వీట్ పై కాపుసామాజిక వర్గంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అలాగే జనసేన శ్రేణులు కూడా అగ్గిమీద గుగ్గిలంలా మండి పడుతున్నాయి.  పవన్ కల్యాణ్ అభిమాన సంఘాలైతే ఒక అడుగు ముందుకు వేసి రామ్ గోపాల్ వర్మకు ఆయన శైలిలోనే బదులిచ్చాయి. రామ్ గోపాల్ వర్మకు కన్నీటి వీడ్కోలు అన్న బ్యానర్లు పెట్టి, ఆ బ్యానర్లలో ఆయన ఫొటోకు దండ వేసి కర్మకాండలు నిర్వహించాయి.  మొత్తం మీద రామ్ గోపాల్ వర్మ సినీదర్శకుడిగా కాకుండా సమాజానికి చీడ పురుగులా తయారయ్యారని తటస్థులు, మేధావులు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ఎటువంటి విలువలకూ విలువ ఇవ్వని ఒక ఉన్మాద మనస్థత్వంతో వ్యవహరిస్తున్న రామ్ గోపాల్ వర్మ సామాజిక మాధ్యమంలో పెడుతున్న పోస్టుల ఆధారంగా ఆయన సోషల్ మీడియా అక్కౌంట్లను బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందని పరిశీలకులు అంటున్నారు.

బాలినేని జంప్ ఖయామేనా?

ఎన్నికలు దూసుకొస్తున్న వేళ... వైసీపీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయా? ఇంతకాలం పంటి బిగువుల అసంతృప్తిని అణచుకున్న ఒక్కొక్కరూ ఇప్పుడు బయటకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారా? అంటే ఔననే సమాధానం వస్తుంది. తాజాగా ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిలో ఆసంతృప్తి రోజురోజుకు తీవ్రమవుతోందా? ఆ క్రమంలో ఆయన కుదురుగా ఉండలేకపోతున్నారా? అందుకే ఆయన అడుగులు మరోపార్టీ వైపునకు పడుతున్నాయా? అంటే నియోజకవర్గ ప్రజలు ఔననే అంటున్నారు.  అంతే కాదు ఇటీవల  జరిగిన పరిణామాలను ఉదాహరణగా చూపుతున్నారు. ఒంగోలులో బాలకృష్ణ కొత్త సినిమా వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్ సజావుగా సాగడానికి స్థానిక ఎమ్మెల్యే బాలినేని పూర్తిగా సహాయ సహకారాలు అందించారంటూ.. అదే వేదికపై నుంచి ఆ చిత్ర దర్శకుడు గోపిచంద్ మలినేని ప్రకటించడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అలాగే ఒకానొక దశలో ఈ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించిందంటూ.. ఓ వార్త  తెగ ప్రచారంలోకి వచ్చింది.  దీంతో ఈ కార్యక్రమానికి అనుమతి లభిస్తోందా? లేదా? అంటూ బాలయ్య అభిమానుల్లో కొంత సందిగ్థత నెలకొంది. అలాంటి పరిస్థితుల్లో ఈ చిత్ర ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రభుత్వం నుంచి అనుమతి లభించడానికి కర్త.. కర్మ..  క్రియ అంతా బాలినేని వారేనని వారు పేర్కొంటున్నారు. బాలినేని అలా వ్యవహరించడం వెనుక ఉన్న మర్మమేమిటని నియోజకవర్గ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.     ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. వైసీపీ పైన.. ఆ పార్టీ నాయకులపైన.. నిత్యం నిప్పులు చెరుగుతూ ఉంటారని.. అయితే జగన్ పార్టీలో పురుషులందు పుణ్య పురుషులు వేరయా లా .. జగన్ పార్టీలోని నాయకుల్లో.. బాలినేని వంటి మనస్సున్న వారు వేరుగా ఉంటారంటూ జనసేనాని పవన్ ఇప్పటికే పలు వేదికలపై నుంచి ప్రకటించారని.. అలాగే పవన్ కల్యాణ్ స్వయంగా ఫోన్ చేసి అడిగారని.. ఓ జనసేన వీర మహిళ మీద పెట్టిన కేసును సైతం బాలినేని తీయించివేశారని వారు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు.  జనసేన పార్టీ పట్ల.. బాలినేనికి ఉన్న సాఫ్ట్ కార్నర్‌పై తాడేపల్లి ప్యాలెస్‌లోని పెద్దలు ఒకింత గుర్రుగా ఉండాడానికి ఇది కూడా ఓ కారణం అయి ఉంటుందని వారు అంటున్నారు.  మరోవైపు జగన్ తొలి కేబినెట్‌లో మంత్రి పదవి కాస్తా హుళక్కి అయిన తర్వాత.. ఆసంతృప్తితో ఉన్న బాలినేనిని బుజ్జగించడానికి  నెల్లూరు జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త పదవిని సీఎం జగన్ ఆయనకు కట్టబెట్టారు. అయితే ఆయన హాయాంలో ఆ నెల్లూరు జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలంతా ఆసంతృప్తి గళం వినిపించారు. దీంతో జిల్లా పంచాయతీ కాస్తా.. తాడేపల్లి ప్యాలెస్‌కు చేరింది. జిల్లాలోని ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలాంటి వారు.. చెలరేగిపోతుంటే..  పార్టీ సమన్వయకర్తగా ఏం చేస్తున్నావంటూ బాలినేనికి  వైసీపీ అధినేత, సీఎం జగన్ గట్టిగానే తలంటినట్లు ఓ టాక్ అయితే నియోజకవర్గంలో హల్‌చల్ చేసిందని ప్రజలే చెబుతున్నారు. అదీకాక.. జగన్ తొలి కేబినెట్‌లో మంత్రిగా కొనసాగిన ఆయనను.. మలి కేబినెట్‌లో   తొలగించి.. అదే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేశ్‌ను కొనసాగించడంతో బాలినేని తీవ్ర ఆసంతృప్తికి లోనయ్యారు.  అంతేకాదు.. జగన్ మలి కేబినెట్‌లో 100కి వంద శాతం అంతా కొత్త వారే ఉంటారంటూ  బాలినేని స్వయంగా మీడియా ముందుకు వచ్చి ప్రకటించారు.  కానీ తన పాత కేబినెట్‌లోని 11 మందికి మళ్లీ జగన్.. తన మంత్రి వర్గంలో చోటు ఇవ్వడం.. బాలినేనికి ఏ మాత్రం మింగుడు పడని వ్యవహారంగా మారింది.  అదీకాక జగన్‌కు బాలినేని సమీప బంధువు. అయినా.. ఎక్కడైనా బంధువే కానీ.. కేబినెట్‌ దగ్గర కాదన్నట్లుగా జగన్ వ్యవహారం ఉండడంతో బాలినేనిలో నాడు చేలరేగిన అసంతృప్తి... నేడు  మరింత పెరిగిందని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు.    ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో కొంచెం అటు ఇటుగా అయినా.. తన రాజకీయ భవిష్యత్తుకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా ఉండేందుకు బాలినేని చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు.. ఆయన చర్యలు చూస్తే అర్థమవుతోందని ఒంగోలు నియోజకవర్గ ప్రజలు పేర్కొంటున్నారు. అలాగే తన నియోజకవర్గంలో సామాజిక వర్గాల ఓట్లు..  వారి సమీకరాణాలను పరిశీలించుకొంటూ.. వాటి ద్వారా ఓ అంచనా వేసుకొంటూ.. ప్రస్తుతం బాలినేని ప్రయాణం సాగుతోందని.. ఆ క్రమంలోనే ఆయన చర్యలు ఉన్నాయని నియోజకవర్గ ప్రజలు స్పష్టం చేస్తున్నారు.

మోడీ హైదరాబాద్ పర్యటన వాయిదా

తెలంగాణ బీజేపీ ఉత్సాహంపై నీళ్లు చల్లినట్లైంది. రాష్ట్రంలో దూకుడు పెంచిన బీజేపీ ఈ నెలలో ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనపై బోలెడు ఆశలు పెట్టుకుంది. కేంద్రం తెలంగాణకు మొండి చేయి చూపిందంటూ భారాస నాయకులు చేస్తున్న ప్రచారాన్ని, విమర్శలకు తిప్పి కొట్టే విధంగా మోడీ తన పర్యటనలో  దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనుండటం, ఆ తరువాత పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభలో ప్రసంగించడంతో భారాస విమర్శలను తిప్పికొట్టేందుకు మంచి అవకాశంలభిస్తుందన్న ఉత్సాహంతో ఉన్న రాష్ట్ర బీజేపీ నాయకులు మోడీ పర్యటన వాయిదాపడటంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.   బిజీ షెడ్యూల్ కారణంగా మోడ పర్యటన వాయిదా పడిందని చెబుతున్నారు. సికిందరాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు భూమి పూజ, వందే భారత్ రైలు ప్రారంభోత్సవం, అలాగే 1,850 కోట్ల వ్యయంతో 150 కి. మీ. ల పొడవున నిర్మించనున్న 3 జాతీయ రహదారి ప్రాజెక్టుల విస్తరణ పనులకు భూమిపూజ, ఇంకా రూ. 521 కోట్ల వ్యయంతో కాజీపేట్ నందు నిర్మించనున్న  రైల్ పీరియాడిక్ ఓవర్ హాలింగ్ వర్క్ షాపునకు  భూమిపూజ కార్యక్రమాలు కూడా మోడీ పర్యటనతో పాటే వాయిదా పడ్డాయి. అలాగే పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభలో మోడీ నోటి వెంట కేంద్రం తెలంగాణకు అందించిన సహాయం, చేసిన మేళ్లు వివరించే అవకాశం ఆయన పర్యటన వాయిదాతో చేజారిందన్న అభిప్రాయం బీజేపీ నేతలలో వ్యక్తమౌతోంది.

భారత్ జోడో యాత్ర సక్సెస్ కు కారణమిదేనా?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఈ యాత్ర ఆద్యంతం రాహుల్ గాంధీలో మారిన మనిషి కనిపిస్తున్నారు. మౌనాన్ని మించిన భాష లేదు.. వినడాన్ని మించిన జ్ణానం లేదు అన్నట్లుగా ఆయన యాత్ర కొనసాగుతోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఒక రాజకీయ యాత్రగా కాకుండా దేశంలో  సమస్యలు, పరిష్కారాలు కనుగొనేందుకు చేపట్టిన యాత్రగా  కనిపిస్తోంది. తెలుగువన్ ముందే చెప్పినట్లుగా..  పార్టీ ఎన్నికల వైఫల్యాలతో సంబంధం లేకుండా రాహుల్ తన యాత్రను ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు. గుజరాత్ ఎన్నికలలో ఘోర పరాజయం,  ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలలో తేరుకోలేని ఎదురుదెబ్బ వీటిని వేటినీ రాహుల్ పట్టించు కోలేదు.. స్థిత ప్రజ్ణత సాధించిన మౌనిలా ఆయన నడక కొనసాగిస్తున్నారు. జనంలో మమేకం అవుతున్నారు. ఇక ఇప్పుడు రాహుల్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకుంటోంది. ఈ సుదీర్ఘ యాత్ర పొడవునా ఆయన ప్రసంగాలు చేయలేదు.. వాగ్దానాలు గుప్పించలేదు. అరచేతిలో స్వర్గం చూపించ లేదు.  రాహుల్ యాత్ర కారణంగా ఆ యాత్ర సాగిన ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ బలోపేతమైందన్న సూచన లేదు.   అయినా అశేష జనవాహిని ఆయన యాత్రను స్వాగతించింది. అన్ని వర్గాలకు చెందిన వారూ ఆయన యాత్రలో అడుగు కలిపారు. యాత్ర సందర్భంగా జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పరాజయాల పరంపర కొనసాగినా.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఆత్మ విశ్వాసం సన్నగిల్లలేదు సరికదా ఇనుమడించింది. అసలిది ఎలా జరిగింది? సుదీర్ఘ ప్రసంగాలు లేకపోయినా, అరచేతిలో వైకుంఠం చూపిన చందంగా వాగ్దానాలు లేకపోయినా, అన్ని వర్గాల ప్రజలూ, ముఖ్యంగా యువత రాహుల్ జోడో యాత్రలో పెద్ద సంఖ్యలో ఎందుకు  మమేకమయ్యారు? ఈ ప్రశ్నలకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పారు. తన యాత్రలో భాగంగా బుధవారం పంజాబ్ లో ని  ఫతేహగ్ సాహిబ్ లో  ఆధ్యాత్మిక ప్రదేశాలను రాహుల్ గాంధీ సందర్శించిన అనంతరం  మాట్లాడారు. తన యాత్ర  సుదీర్ఘ ప్రసంగాలు చేయడానికి కాదనీ,  ప్రజలు చెప్పేది వినేందుకేననీ స్పష్టం చేశారు.  ఈ యాత్ర లక్ష్యం ప్రజలు చెప్పేది వినడమే. దేశంలో పెరిగిన ద్వేషం, హింస, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలను లేవనెత్తి, ఆ సమస్యలకు వ్యతిరేకంగా ఆ యాత్ర ద్వారా పోరాటం చేయాలన్నదే లక్ష్యం అని రాహుల్ వివరించారు. ఆయన యాత్ర ఆద్యంతం ఈ లక్ష్యానికి అనుగుణంగానే సాగుతోందని చెప్పాలి. జోడో యాత్ర సందర్భంగా ఆయన ఎక్కడా పరుష వ్యాఖ్యలు చేయలేదు. రాజకీయ విమర్శలను గుప్పించలేదు. అందుకే రాహుల్ భారత్ జోడో యాత్రకు రాజకీయాలతో సంబంధం లేకుండా సమాజంలోని అన్ని వర్గాల నుంచీ మద్దతు సంఘీభావం వ్యక్తం అవుతోందని అంటున్నారు.  

సోమేష్ కుమార్ రిలీవ్ డ్.. నెక్ట్స్ సీఎస్ ఎవరంటే..?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ కొనసాగింపును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానం తీర్పు దృష్ట్యా సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను తెలంగాణ నుంచి రిలీవ్‌ చేస్తూ డీవోపీటీ ఆదేశాలు జారీ చేయడమే కాకుండా, ఇవి తక్షణమే అమల్లోకి వస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే సోమేష్ కుమార్ ఈ నెల 12 లోగా ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని కూడా డీవోపీటీ స్పష్టం చేసింది. అంటే తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాలన్న సోమేష్ కుమార్ ముందు ఏపీ సర్కార్ కు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర విభజన సమయంలో సోమేష్ కుమార్ ను కేంద్రం ఏపీకి కేటాయించింది.దీనిపై ఆయన క్యాట్ ను ఆశ్రయించడంతో గతంలో ఆయన తెలంగాణలోనే కొనసాగేలా క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది.  అప్పటి నుంచీ ఆ ఉత్తర్వులతో తెలంగాణలో సోమేశ్‌కుమార్‌ కొనసాగుతున్నారు. క్యాట్‌ ఉత్తర్వులను కొట్టివేయాలని 2017 లోనే కేంద్రం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. తెలంగాణ సీఎస్ గా సోమేష్ కుమార్ కొనసాగించటాన్ని హైకోర్టు రద్దు చేసింది. దీంతో సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదం కొలిక్కి వచ్చింది. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను కూడా హైకోర్టు కొట్టేయటం విశేషం. అయితే ..3 వారాలు సమయం కావాలని సోమేశ్ కుమార్ అభ్యర్థనను కూడా   తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సోమేష్ కుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయింనున్నట్లు చెబుతున్నారు. అయితే ఆయన సుప్రీంను ఆశ్రయించినా ఆశ్రయించకున్నా కోర్టు తీర్పు మేరకు ఆయనను తెలంగాణ బాధ్యతల నుంచి రిలీవ్ చేసి ఈ నెల 12 లోగా.. అంటే మంగళవారం (జనవరి 10) కోర్టు తీర్పు ఇస్తే.. గురువారం (జనవరి 12)లోగా ఏపీ సర్కార్ కు రిపోర్టు చేయాలని డీవోపీటీ ఆదేశించింది. దీంతో సోమేష్ కుమార్ ఏపీకి వెళ్లడమా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవడమా అన్న సందిగ్ధంలో పడ్డారు. ఏపీకి వెళ్లకుండా స్వచ్ఛంద విరమణ తీసుకుంటే ఆయనకు రాష్ట్రంలో రెండు ఆప్షన్స్ ఉంటాయని అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రితో సత్సంబంధాల కారణంగా ఆయనకు ఏదో ఒక సలహాదారు వంటి పదవి దక్కే అవకాశం ఉంది. లేదంటే గతంలో కేవీ రమణాచారి చేసిన విధంగా రాజకీయాలలోకి ప్రవేశించే అవకాశం కూడా ఉందంటున్నారు. బీఆర్ఎస్ లో చేరి క్రియాశీలంగా వ్యవహరించే అవకాశం ఉందనిపరిశీలకులు అంటున్నారు. ఇక సోమేష్ కుమార్ విషయం అలా ఉంచితే ఆయన రిలీవ్ అయిపోవడంతో.. తెలంగాణ సీఎస్ ఎవరన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలుగువన్ ఇంతకు ముందే చెప్పినట్లు స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయిలో తెలంగాణలో పలువురు ఉన్నప్పటికీ  పోటీ మాత్రం ప్రధానంగా ముగ్గురి మధ్యే ఉంటుంది. వారిలో మరీ ముఖ్యంగా ప్రణాళికా సంఘం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణ, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ శాఖల స్పెషల్ సీఎస్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న అరవింద్ కుమార్ లు రేసులో ముందున్నారన సచివాలయ వర్గాలలో వినిపిస్తోంది. సోమేష్ కుమార్ ను రిలీవ్ చేసిన నేపథ్యంలో తదుపరి సీఎస్ ఎవరన్నది కేసీఆర్ సర్కార్ ఇహనో ఇప్పుడో   ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ ఐఎస్ఎస్ అధికారులు రామకృష్ణ, అరవింద్ కుమార్ లలో ఎవరు తెలంగాణ కాబోయే సీఎస్ అన్న చర్చ అధికార వర్గాలలో జోరుగా సాగుతోంది.  అయితే వీరిలో మంత్రి కేటీఆర్ గుడ్ సెల్వ్స్ లో ఉన్న అరవింద్ కుమార్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కేసీఆర్ కూడా బీహార్ క్యాడర్ కు చెందిన అరవింద్ కుమార్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. సీనియారిటీ ప్రకారం రామకృష్ణారావు ముందు వరుసలో ఉన్నప్పటికీ.. కేసీఆర్ మొగ్గు మాత్రం అరవింద్ కుమార్ వైపే ఉందని చెబుతున్నారు.  కాగా రాష్ట్రంలోని వివిధ కీలక పోస్టింగ్స్‌లో బీహార్‌కు చెందిన అధికారులే ఉన్న నేపథ్యంలో అదే రాష్ట్రానికి చెందిన  అరవింద్ కుమార్ కే కేసీఆర్ అవకాశం ఇస్తారని అంటున్నారు.  అయితే విపక్షాలు బయటి వారికి కీలక పదవులు కట్టబెడుతున్నారంటూ కేసీఆర్ పై విమర్శలు కురిపిస్తున్న నేపథ్యంలో రామకృష్ణకు సీఎస్ పదవి కట్టబెట్టే విషయం ముఖ్యమంత్రి పరిశీలించే అవకాశం కూడా ఉందని అంటున్నారు. అయితే మునిసిపల్ వ్యవహారాల శాఖ స్పెషల్ సీఎస్ గా ఉన్న అరవింద్ కుమార్ కేసీఆర్ గుడ్ సెల్వ్స్ లో ఉండటం, అలాగే స్థానికుల కంటే ఇతర రాష్ట్రాలకు చెందిన వారికే కీలక పదవులు కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి మెగ్గు చూపుతుండటంతో అరవింద్ కుమార్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ డీజీపీగా ఉన్న అంజనీ కుమార్ కూడా బీహార్ కు చెందిన వారే కావడం గమనార్హం.   

చైనాలో ఒక రాష్ట్రం మొత్తం కరోనా బాధితులే?!

డ్రాగన్ దేశం కరోనా గుప్పిట్లో చిక్కుకుందా? కోట్లాది మంది కరోనా బారిన పడి విలవిలలాడుతున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తుంది. వ్యాక్సినేషన్, క్యూర్ వంటి వాటిపై శ్రద్ధ పెట్టకుండా జీరో కోవిడ్ విధానాన్ని మాత్రమే నమ్ముకుని పొరపాటు చేసిన చైనా.. ప్రజాగ్రహం కారణంగా అనివార్యంగా కరోనా ఆంక్షలను సడలించక తప్పని పరిస్థితిని ఎదుర్కొంది. అంతే కరోనా ఆంక్షలను ఎత్తివేసిన తరువాత ఆ దేశంలో మహమ్మారి విజృంభణ అనూహ్యంగా పెరిగిపోయింది. ఆ దేశంలో రోజుకు సగటున  లక్షల మంది వైరస్ బారిన పడుతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అలాగే మరణాలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయని అంటున్నారు. అయితే కరోనా విజృంభణకు సంబంధించిన వార్తలు బయటకు పొక్కకుండా డ్రాగన్ దేశం గోప్యత పాటిస్తోందన్న విమర్శలూ  ప్రపంచ దేశాలలో వెల్లువెత్తుతున్నాయి. అనధికారిక సమాచారం ప్రకారం చైనాలోని  హెనాన్ రాష్ట్ర జనాభాలో 90శాతం మందికి పైగా కరోనా సోకింది. ఆ ఒక్క రాష్ట్రంలోనే దాదాపు 9 కోట్ల మంది మహమ్మారి బాదితులుగా ఉన్నారని చైనా అధికార వర్గాల ద్వారానే లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అదే విధంగా క్రిస్మస్ సమయంలో దేశంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో బయటపడ్డాయని తెలుస్తోంది. కరోనా విజృంభణ అత్యంత ప్రమాదకర స్థాయికి చేరినా, మృత్యుఘంటికలు  మోగిస్తున్నా చైనా మాత్రం కరోనా ఆంక్షలు విధించడం లేదు. దీంతో వ్యాధి వ్యాప్తి అదుపులేకుండా పోయింది. ఈ వ్యాప్తి విజృంభణ ఇలాగే కొనసాగితే ప్రపంచం మరో సారి కరోనా ఆంక్షల చట్రంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అమ్మకు మించి దైవమున్నదా?

ముందు అమ్మ.. ఆ తరువాతే ఏదైనా.. ఇదీ అమ్మ గొప్పతనం. ఎంత ఎదిగినా బిడ్డ ఆలనా పాలనా స్వయంగా చూసుకుంటేనే ఆమెకు తృప్తి ఆనందం. అత్యున్నత స్థానంలో ఉండి కూడా బిడ్డ ఆలనా పాలనా చూసేందుకు వాటిని తృణ ప్రాయంగా త్యజించిన వాళ్లను చూశాం. నెలల పిల్లను చంకనేసుకుని విధి నిర్వహణ చేసిన వారినీ చూశాం. కరోనా సమయంలో బిడ్డను వీడి ఆసుపత్రుల్లో ఉద్యోగం చేస్తూ కన్నీటి పర్యంతమైన తల్లుల గాధలూ విన్నాం. ఇప్పుడు తాజాగా ఓ కంపెనీ సీఈవో.. తన విధులు నిర్వహిస్తూనే బిడ్డ ఆలనా పాలనా కూడా చూసుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. చంటి బిడ్డతో ఆఫీసుకు వచ్చి అటు తల్లిగా, ఇటు సీఈవోగా ఆమె ద్విపాత్రాభినయం చేస్తున్న దృశ్యాలు నెటిజన్లను కదిలించి వేస్తున్నాయి. ఆమెపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నాయి.  ఎడెల్విస్ మ్యూచువల్ ఫండ్ సీఈవో, ఎండీ  రాధికా గుప్త తల్లిగా, సీఈవోగా  తాను ట్రావెల్ చేస్తున్న తీరుపై ట్విట్టర్ లో  పోస్ట్ చేశారు. తన డెస్క్ పక్కనే ఆమె కుమారుడు బొమ్మలతో ఆడుకునే ఫోటోను ఆమె ట్వీట్ కు జత చేశారు.  ఆడవారి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ను రాధిక పోస్ట్ చేసిన ఒక్క పోస్ట్ తో వివరించినట్టైందని నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు.  

భారాస తెలుగుదేశం జోరు పెంచేస్తుందా?

ఎన్నికల హడావుడి మొదలైపోయింది. దీంతో అన్ని పార్టీలూ ఓట్ల వేట ప్రారంభించాయి..   అధికార పీఠాన్ని కైవసం చేసుకొనేందుకు వ్యూహాలు.. ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. అందులోభాగంగా.. బీఆర్ఎస్  అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్.. జనవరి 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. అయితే టీఆర్ఎస్ .... బీఆర్ఎస్‌గా రూపాంతరం చెందిన తర్వాత జరుగుతున్న తొలి సభ కావడం.. ఈ సభకు దేశంలోని బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులను సైతం ఆహ్వానించారు. వారిలో ఎవరు వస్తారు? ఎవరు రానన్నది పక్కన పెడితే.. సభ ఏర్పాట్లు మాత్రం వేగంగా జరిగిపోతున్నాయి. బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ ఇదే కావడంతో  అందుకు తగినట్లుగా ఘనంగా ఈ సభను నిర్వహించాలని  కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం.  మరోవైపు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. ఇటీవల ఖమ్మంలో శంఖరావం పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు జనం భారీగా తరలివచ్చారు. ఈ సభ సక్సెస్‌తో.. తెలంగాణలోని తెలుగుదేశం పార్టీలో లీడర్ నుంచి కేడర్ వరకు అందరిలో నయా జోష్ కొట్టొచ్చినట్లు కనిపించింది. అంతే కాదు తెలుగుదేశం పార్టీ ఆంధ్రలోనే బతికి ఉంది.. తెలంగాణలో మాత్రం కనుమరుగైపోయిందంటూ వస్తున్న విమర్శలకు ఈ సభ సక్సెస్‌  ఫుల్‌స్టాప్ పెట్టింది. దీంతో కొత్త ఊపు ఉత్సాహంతో తెలంగాణలో తెలుగుదేశం అడుగుల వేగం పెంచింది. అయితే బారాస అధినేత   కేసీఆర్.. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తోందంటూ ప్రకటించారు. అలాంటి వేళ.. ఆయన దేశంలో ఎక్కడైనా ఈ సభను నిర్వహించవచ్చు. కానీ అలా కాకుండా.. తెలంగాణలోని అదీ.. ఖమ్మం వేదికగా ఈ సభను ఏర్పాటు చేయడం ఏమిటనే చర్చ అయితే పార్టీ వర్గాల్లోనే మొదలైంది.   మరోవైపు గతంలో ఖమ్మం జిల్లాలోని పలు పార్టీలకు చెందిన కీలక నేతలు.. కారు పార్టీలోకి జంప్ కొట్టి.. షికారు కొట్టారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో వారంతా వరుసగా ఒక్కొక్కరుగా కారు దిగి.. ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. బీజేపీలో  చేరేందుకు ముహూర్తం   ఫిక్స్ అయిందని సమాచారం. ఇక అదే జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సైకిల్ పార్టీలో చేరేందుకు వివిధ పార్టీలకు చెందిన నేతలే కాదు.. కేడర్ సైతం భారీగానే ఉన్నట్లు.. ఆ క్రమంలోనే వారంతా కలసికట్టుగా చంద్రబాబు సభను.. సూపర్ డూపర్ సక్సెస్ చేశారని సమాచారం. అయితే అదే ఖమ్మంలో సీఎం కేసీఆర్ సభ నిర్వహిస్తే... చంద్రబాబు సభకు తరలి వచ్చినట్లు జనం తరలి వస్తారా? అనే ఓ సందేహం  భారాస శ్రేణులను తొలిచేస్తోందని అంటున్నారు.  ఎందుకంటే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెరాస పెద్దగా బలంగా లేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అందుకే ఓ వేళ.. ఖమ్మంలో కేసీఆర్ సభకు జనం రాకుంటే.. బీఆర్ఎస్ పార్టీ సినిమా ఖమ్మం గల్లీలోనే ఆడలేదు.. ఇక ఢిల్లీలో ఏం ఆడుతుందనే  ఓ విమర్శనాస్త్రాన్ని  ప్రతిపక్ష పార్టీలకు అందించినట్లు అవుతుందని భారాసా శ్రేణులు భావిస్తున్నారని సమాచారం. దీంతో టీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఉన్న ఇమేజ్‌ను   ప్రతిపక్షాలు డ్యామేజీ చేసినా చేస్తాయని గులాబీ శ్రేణులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.   అయినా కేసీఆర్.. తెలంగాణలో ఇన్ని జిల్లాలు ఉండగా.. ఖమ్మంనే ఎందుకు ఎంచుకున్నారు... అక్కడే సభ ఎందుకు నిర్వహించాలని నిర్ణయించారనే అంశంపై క్లారిటీ రాకపోవడంతో.. కారు పార్టీలోని శ్రేణులంతా సందేహం తీర్చేవారి కోసం వెతుకుతున్నారు. ఏదీ ఏమైనా మళ్లీ పురిటిగడ్డపై తెలుగుదేశం పార్టీ పుంజుకొంటోంది... అలాంటి వేళ.. కారు పార్టీ తెలంగాణలో జోరు తగ్గిందని భారాస ఖమ్మం సభ తేలిస్తే..  ఇక తెలంగాణలో తెలుగుదేశంకు తిరుగుండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఏపీలో బీఆర్ఎస్ భవిష్యత్ పై పీకే సర్వే ఏమి చేబుతోందంటే?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఅర్ జాతకాలు నమ్ముతారు. వాస్తును విశ్వశిస్తారు. ఇక,యజ్ఞయాగాదుల విషయం అయితే చెప్పనే అక్కరలేదు. ఇవెక్కడి మూఢ నమ్మకాలని ఎవరైనా తూల నాడినా ఆయన పట్టించుకోరు. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు, ఇమాంలు మంత్రించి ఇచ్చిన ఆకుపచ్చ చేతి పట్టి మరిచి పోరు. ఇలాంటి నమ్మకాలు  ఆయనకు ఇంకా చాలానే ఉన్నాయని అంటారు. అయితే అదే సమయంలో ప్రశాంత్ కిశోర్ వంటి ఎన్నికల వ్యూహకర్తల సైంటిఫిక్  సర్వేలను, కంప్యూటర్ వ్యూహాలను కూడా కేసీఆర్ అంతగా విశ్వశిస్తారు. రిలీజియస్ గా భక్తిగా ఫాలో అవుతారు. అందుకే కేసీఆర్ ఏ పని మొదలు పెట్టినా, పూజలు, పునస్కారాలు, యజ్ఞయాగాదుల నిర్వహించడంతో పాటుగా సర్వేలు చేయించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.   కాగా, ఇప్పడు కేసీఆర్ ... భారత రాష్ట్ర్ర సమితి విస్తరణలో భాగంగా, ఏపీలో మొదటి అడుగు వేశారు. తెలంగాణ వెలుపల, తెలంగాణ కంటే ముందుగా ఏపీలో పార్టీ నియామకాలు మొదలుపెట్టారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షునిగా  జనసేన నాయకుడు తోట చంద్రశేఖర్ ను నిమించారు. ఆయనతో పాటుగా మరో ఇద్దరు ముఖ్యనాయకులు, మరి కొందరు వారి అనుచరులు మందీ మార్బలంతో పనిగట్టుకుని మరీ హైదరాబాద్  వచ్చి పార్టీలో చేరారు. అయితే, తెలగాణ వెలుపల వేసిన తొలి అడుగు ఏమిటి  ఎలా పనిచేస్తుంది పొరుగు రాష్ట్రంలో తెలంగాణ నాయకుడి పార్టీకి  ఎంతవరకు ప్రజాదరణ లభిస్తుంది అనే కోణంలో సర్వే నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం గతంలో కొంత కాలం భారాస (అప్పట్లో తెరాస) ఎన్నికల వ్యూహ కర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్తో ఫ్రెష్ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఏపీలో బీఆర్ఎస్ భవిష్యత్  మీద  సర్వేలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.  ఏపీలో బీఆర్ఎస్ పోటీచేయడంవల్ల ఇతర రాజకీయ పార్టీల పరిస్థితి ఏమిటి? అసెంబ్లీ సీట్లు కానీ, లోక్ సభ సీట్లు కానీ గెలవడానికి అవకాశాలున్నాయా? ప్రజలు ఏమనుకుంటున్నారు? కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై కేసీఆర్ చేస్తున్న పోరాటం గురించి ఆంధ్రులు ఏమనుకుంటున్నారు? ఏపీలో వైసీపీ పాలనకు, తెలంగాణలో బీఆర్ఎస్ పాలనకు మధ్య తేడాను గమనించారా? ఏపీలో సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరు, తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరు? బీఆర్ఎస్ విస్తరణను స్వాగతిస్తారా? తదితర విషయాలపై సర్వే నిర్వహిస్తున్నట్లు విస్వసనీయంగా తెలుస్తోంది.  అంతే కాకుండా ఏపీలో పోటీకి అనుకూల నియోజక వర్గాలను గుర్తించే బాధ్యతను కూడా కేసేఆర్ ఐ ప్యాక్  బృందానికే అప్పగించినట్లు చెపుతున్నారు. అలాగే  నేరుగా పొరుగు రాష్ట్త్రాల నట్టింటి నుంచి కాకుండా, తెలంగాణ-ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గాలపై కేసీఆర్ గురి పెట్టారని అంటున్నారు. అందు కోసమే, ఢిల్లీ లేదా యూపీలో అనకున్న బీఆర్ఎస్ అవిర్భావ సభను, ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు జిల్లా ఖమ్మంలో ఏర్పాటు చేశారు. అలాగే  ఎపీలోని మొత్తం 175 నియోజకవర్గాలకు పోటీ చేయడంకన్నా తనకు అనువుగా ఉన్న సీట్లలో పోటీచేసి విజయావకాశాలను పెంచుకోవాలని కేసేఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 20 నుంచి 25 నియోజకవర్గాల్లో పోటీచేయాలనే ఆలోచనతో అందుకు తగ్గట్టుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.అలాగే, ఎపీతో పాటుగా కర్ణాటక, మహారాష్ట్ర,మధ్య ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్  రాష్ట్రాలలోనూ పరిమిత సీట్లలో పోటీచేసే అలోచన చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తరాదిలో అడుగు పెట్టే ముందు. బీఆర్ఎస్ సీట్లు గెలుచుకోవడంకన్నా గణనీయ సంఖ్యలో ఓట్లను సాధించగలిగితే రాజకీయంగా ప్రయోజనం సిద్ధిస్తుందని బీఆర్ఎస్ వ్యూహకర్తలు భావిస్తున్నారు. జాతీయ పార్టీగా  గుర్తింపు పొందేందుకు అవసరమైన అర్హతలు సాధించి, ఆపైన  ఉత్తరాదిఫై దృష్టి కేద్రీకరించాలని కేసీఆర్ తాజా వ్యూహంగా చెపుతున్నారు.  కాగా  ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన - 1968 ప్రకారం చివరగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి. ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాలి. దీనితో పాటు ఏదైనా ఒక రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి కనీసం నలుగురు అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికవ్వాలి. ఇందులో మొదటి నిబందన కష్టం కాదు, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్ సహా మరి కొన్ని రాష్ట్రలో బీఆర్ఎస్ అభ్యర్ధులను పోటీకి నిలుపుతుంది. అందుకు అవసరమైన గ్రౌండ్ ప్రిపేర్ అవుతోంది. ఇక ఆరు శాతం ఓట్లు, నలుగురు ఎంపీ నిబంధనపైనే కేసీఆర్ దృష్టి కేంద్రీకరించారని, అందులో భాగంగానే పార్టీ విస్తరణ కార్యక్రమానికి ఏపీలో సర్వేతో  శ్రీకారం చుట్టారని అంటున్నారు.

తెలంగాణ తదుపరి సీఎస్ ఎవరంటే?

తెలంగాణ సీఎస్ గా సోమేష్ కుమార్ కేటాయింపును తెలంగాణ హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో తదుపరి సీఎం ఎవరన్న చర్చ తెరపైకి వచ్చింది. ఆయన తక్షణం ఏపీకి వెళ్లాల్సిందేనని కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయన వెంటనే తెలంగాణ బాధ్యతల నుంచి రిలీవ్ కావాల్సి ఉంటుంది. అయితే సోమేష్ కుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించే ఉద్దేశంతో ఉన్నారని అంటున్నారు. అయినప్పటికీ  కోర్టు తీర్పు నేపథ్యంలో తదుపరి సీఎస్ ఎవరన్న దానిపై జోరుగా చర్చ సాగుతోంది.  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్‌ కుమార్‌ 2019 డిసెంబరు 31న బాధ్యతలు చేపట్టిన సోమేష్ కుమార్  మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నారు.  రెవెన్యూ, ఆబ్కారీ, వాణిజ్యపన్నులు, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, భూపరిపాలన కమిషనర్‌ వంటి కీలక పోస్టులన్నీ ఆయనే   నిర్వహిస్తున్నారు. భూ రికార్డుల కంప్యూటరీకరణకు ఉద్దేశించిన ధరణి వెబ్‌సైట్‌ రూపకల్పనలో సోమేష్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. ఆయన పదవీ కాలం  ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనుంది. అయితే తాజాగా హైకోర్టు తీర్పుతో తదుపరి సీఎస్ ఎవరన్న దానిపై చర్చ జరుగుతుండగా ప్రధానంగా ముగ్గురి పేర్లు ప్రముఖంగా తెరమీదకు వస్తున్నాయి. ప్రణాళికా సంఘం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణ, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ శాఖల స్పెషల్ సీఎస్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న అరవింద్ కుమార్, నీటిపారుదల శాఖ  స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న  డాక్టర్ రజిత్ కుమార్, ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ కే. రామకృష్ణారావులు  రాష్ట్ర తదుపరి సీఎస్ రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే వీరిలో మంత్రి కేటీఆర్ గుడ్ సెల్వ్స్ లో ఉన్న అరవింద్ కుమార్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కేసీఆర్ కూడా బీహార్ క్యాడర్ కు చెందిన అరవింద్ కుమార్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. సీనియారిటీ ప్రకారం రామకృష్ణారావు ముందు వరుసలో ఉన్నప్పటికీ.. కేసీఆర్ మొడగ్గు మాత్రం అరవింద్ కుమార్ వైపే ఉందని చెబుతున్నారు.  కాగా రాష్ట్రంలోని వివిధ కీలక పోస్టింగ్స్‌లో బీహార్‌కు చెందిన అధికారులే ఉన్న నేపథ్యంలో అదే రాష్ట్రానికి చెందిన  అరవింద్ కుమార్ కే కేసీఆర్ అవకాశం ఇస్తారని అంటున్నారు.  

బీజేపీ విస్తరణకు విస్తారక్ లు!

దేశవ్యాప్తంగా బీజేపీని బలోపేతం, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో   హ్యాట్రిక్ విజయాన్నిఅందుకోవడం కోసం భారీ కసరత్తే జరుగుతోంది.  పార్టీకి మరింతగా బలోపేతం చేయడానికి కొత్త చేరికలకు ఆహ్వానం పలుకుతోంది బీజేపీ పార్టీ ఇందుకోసం పార్టీ విస్తరణ లక్ష్యంగా విస్తారక్ ల నియామకానికి నిర్ణయించింది.  సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాదిలో 9 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాలలో పార్టీ విజయం లక్ష్యంగా తొలుత మూడు నుంచి మూడు వేల ఐదోందల మంది విస్తారక్ లను నియమించాలన్న నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత అవసరమైతే మరింత మందిని నియమించి 2024 ఎన్నికలలో విజయం కోసం బాటలు వేసుకోవాలని భావిస్తోంది. ముందుగా ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, త్రిపుర, కర్నాటక, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లపై దృష్టిసారించింది. ఈ తొమ్మిది రాష్ట్రాలలో ఆరు రాష్ట్రాలలో ప్రస్తుతం అధికారంలో ఉన్నది బీజేపీయే. అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అధికారాన్ని నిలుపుకోవడం, ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రాలలో అధికారాన్ని కైవసం చేసుకోవడం లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే పార్టీ విస్తరణ పనుల్లో జోరు పెంచేందుకు విస్తారక్ ల నియామకానికి శ్రీకారం చుడుతోంది.   ఈ విస్తారక్ లు నేరుగా పార్టీ కేంద్ర నాయకత్వానికే జవాబుదారీగా ఉంటారు.  వీరు వారికి అప్పగించిన నియోజకవర్గాలలో క్షేత్ర స్థాయి వరకూ చొచ్చుకుని వెళ్లి పార్టీ విస్తరణ, బలోపేతానికి కృషి చేస్తారు.  వీరు నేరుగా కేంద్ర నాయకత్వానికే జవాబుదారీ అయినా, స్థానిక నేతలతో సమన్వయం చేసుకుంటూ పని చేస్తారు. అదే సమయంలో క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితి, విజయావకాశాలు, అలాగే స్థానిక నేతల పనితీరుీతితర అంశాలపై ఎప్పటికప్పుడు పార్టీ కేంద్ర నాయకత్వానికి నివేదిస్తారు. అంటే కిందిస్థాయిలో ఏం జరుగుతోంది. పరిస్థితులు ఏమిటీ, పార్టీ పరిస్థితి ఎలా ఉంది. స్థానిక నాయకత్వం బలాబలాలేమిటి? వంటి అన్ని అంశాలూ ఎప్పటికప్పుడు బీజేపీ కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళతారన్న మాట. కాగా ఇప్పటికే ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో ఒకటైన తెలంగాణలో విస్తారక్ ల నియామకం జరిగింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ విస్తారక్ ల నియామకం జరిగి పోయింది. అలాగే దేశ వ్యాప్తంగా పార్టీ ఒకింత బలహీనంగా ఉందని గుర్తించిన 160 వరకూ ఉన్న నియోజకవర్గాలకు కూడా విస్తారక్ ల నియామకం ఇప్పటికే పూర్తయ్యింది.   

చంద్రబాబుతో రజనీకాంత్ భేటీ.. ఏం చర్చించారంటే..?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబునివాసానికి వెళ్లిన రజనీకాంత్ ఆయనతో దాదాపు అరగంట సేపు భేటీ అయ్యారు. ఈ విషయాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్వయంగా ట్వీట్ చేశారు. మిత్రుడు రజనీకాంత్ ను కలవడం సంతోషంగా ఉందంటూ వారిరువురూ కలిసిన ఫోటును కూడా ఆ ట్వీట్ కు జత చేశారు. సరే ఇంతకీ ఇరువురి మధ్యా ఏం చర్చ జరిగిందన్న విషయంపై రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ జరిగిన అనంతరం రజనీకాంత్ చంద్రబాబుతో భేటీ వెనుక ఏదో కారణం ఉండే ఉంటుందన్న ఊహాగానాలూ వ్యక్తమౌతున్నాయి. మర్యాదపూర్వకంగానే చంద్రబాబుతో భేటీ అయినట్లు రజనీకాంత్ చెబుతున్నా.. అదొక్కటే కాదు ఇంకేదో కారణం ఉండి ఉంటుందని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీతో ఎన్టీఆర్ హయాం నుంచీ సినీ ప్రముఖులు సన్నిహితంగానే ఉంటూ వచ్చారు. ఇక రజనీకాంత్ విషయానికి వస్తే మాజీ ఎంపీ, ప్రస్తతుం వైసీపీలో ఉన్న మోహన్ బాబు సన్నిహిత మిత్రుడు. ఇటీవలి కాలంలో మోహన్ బాబు వైసీపీలో ఉక్కపోతకు గురౌతున్నారు. ఆ పార్టీలో ఎటువంటి గుర్తింపూ లేక, కనీసం పట్టించుకునే వారు కూడా కరవై ఇబ్బందులు పడుతున్నారు. తన స్థాయికీ, స్టేచర్ కు తగిన పదవి ఇస్తారని భావించినా జగన్ అసలు మోహన్ బాబును ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆయన తెలుగుదేశం వైపు చూస్తున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అలాగే గతంలో ఒక సారి తిరుపతిలోని తన విద్యా సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాయిబాబా విగ్రహావిష్కరణకు ఆహ్వానించేందుకు మోహన్ బాబు చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. అప్పుడే మోహన్ బాబు తెలుగుదేశం గూటికి చేరుతారన్న ప్రచారం జరిగింది. కారణాలేమైనా అప్పట్లో అది జరగలేదు. ఆ ప్రచారమూ సద్దుమణిగింది. తాజాగా ఇప్పుడు రజనీకాంత్ చంద్రబాబుతో భేటీ కావడంతో ఆ ప్రచారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇ క పోతే మోహన్ బాబు, పవన్ కల్యాణ్  మధ్య అంతగా సయోధ్య లేదని చిత్ర పరిశ్రమలో ఒక టాక్ ఉంది. పలు సందర్భాలలో ఆ విషయం నిజమేననిపించే సంఘటనలూ జరిగాయి. అయితే రజనీకాంత్ కు పవన్ కల్యాణ్ తోనూ, చంద్రబాబుతోనూ కూడా మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అలాగే మోహన్ బాబు ఆయనా కూడా మంచి స్నేహితులు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతో రజనీకాంత్ మోహన్ బాబు తెలుగుదేశం ప్రవేశం గురించి చర్చించి ఉంటారని పరిశీలకులు అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు, రజనీకాంత్ ల భేటీ  రాజకీయ చర్చకు తావిచ్చిందనడంలో సందేహం లేదు.  

చంద్రబాబు, పవన్.. తెలంగాణలో ప్రభావం ఎలా ఉంటుందంటే..?

చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ ఏపీ రాజకీయాలలో పెను సంచలనం సృష్టించిన సంగతి విదితమే.   వచ్చే ఎన్నికలలో ఏపీలో రాజకీయ సమీకరణాలేమిటన్నది ఈ భేటీ తేల్చేసిందనే పరిశీలకులు చెబుతున్నారు. వీరి భేటీపై అధికార వైసీపీ నేతల విమర్శలే.. రాజకీయ యవనికపై వీరి కలయిక ఎంతటి ప్రభావం చూపిందన్నది ఇట్టే అవగతమౌతుంది. జగన్  పాలనను  ప్రజా క్షేత్రంలో ఎండగట్టడమే లక్ష్యంగా ఇంత కాలం తెలుగుదేశం, జనసేనలు వేర్వేరుగా ప్రణాళికలు, వ్యూహాలతో ముందుకు వెళ్లాయి. ఇప్పుడు ఇక జగన్ ప్రభుత్వ రాజ్యహింస, అణచివేత పతాక స్థాయికి చేరుకోవడంతో ఉమ్మడి ప్రణాళికలు, వ్యూహాలతో ముందుకు కదలాలని నిర్ణయానికి వచ్చాయా? ఏపీలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడం ఖాయమైపోయిందా? అంటూ వీరి భేటీ అనంతరం రాజకీయ వర్గాలలో చర్చ ప్రారంభమైంది. ఎన్నికలు ఇంకా బోలెడు సమయం ఉన్నా.. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల హీట్ పీక్స్ కి చేరింది. దానికి తోడు ముందస్తు ఊహాగానాల నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు, సీట్ల సర్దుబాటు వంటి అంశాల విషయంలో ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చేశాయని చెబుతున్నారు. సరే ఏపీలో పరిస్థితి ఇలా ఉంటే.. వీరి భేటీ ప్రభావం తెలంగాణలో ఎలా ఉంది.  ఉంటుంది అన్న విషయానికి వస్తే..  ఒక వేళ తెలుగుదేశం, జనసేనలు ఈ ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పొత్తు పెట్టుకుని పోటీలోకి దిగితే పరిస్థితి ఏమిటన్న దానిపై కూడా రాజకీయ వర్గాలలో విస్తృత చర్చ జరుగుతోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నాయకుల కొరత ఉన్నా.. క్షేత్ర స్థాయిలో పార్టీ క్యాడర్ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. అందుకే..  తెలంగాణలో టీడీపీ ఇంకా బ్రతికే ఉందా?.. నాయకులే లేని పార్టీ ఇంకా మనుగడ సాగిస్తుందా? క్యాడర్ మొత్తం ప్రత్యామ్నాయ పార్టీలలో దూరిపోగా ఇంకెక్కడ టీడీపీ!.. అంటూ ఇంత కాలంగా వినవస్తున్న వ్యాఖ్యలన్నీ పూర్వపక్షమై పోయేలా ఇటీవలి చంద్రబాబు ఖమ్మం సభ సక్సెస్  అయ్యింది. తెలంగాణలో లీడర్ లేకపోయినా.. తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉందన్న విషయాన్ని తెలుగుదేశం సభ నిర్ద్వంద్వంగా నిరూపించింది.  ఎవరు అంగీకరించినా అంగీకరించకున్నా తెలంగాణలో ఇప్పటికీ  తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ వంటి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ గట్టి పట్టు ఉంది. ఇక పవన్ కల్యాణ్ విషయానికి వస్తే ఆయనకు ఏపీలోనే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా కూడా బలమైన ఫ్యాన్ బేస్ ఉంది. దీంతో చంద్రబాబు, పవన్ కల్యాన్ భేటీ తెలంగాణలో కూడా రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.  జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి తెలంగాణ రాజకీయ రణ క్షేత్రంలో  అడుగు పెడితే ఇక్కడ అధికార పార్టీకి ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. తెలుగుదేశం పార్టీకి ఉన్న బలమైన క్యాడర్, జనసేనానికి ఉన్న ఆదరణ కలిసి రాష్ట్ర రాజకీయాలపై పెను ప్రభావమే చూపే అవకాశం ఉంది.  2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 14.7 శాతం ఓట్లతో 15 స్దానాలలో విజయం సాధించింది. అలాగే 2018 ఎన్నికలలో రెండు స్థానాలలో విజయం సాధించింది. ఇప్పటికీ   కనీసం పాతిక స్థానాలలో తెలుగుదేశం ప్రభావం గణనీయంగా ఉంటుందని పరిశీలకలు  విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిపోయిన తరువాత తెలంగాణ సెంటిమెంట్ కనుమరుగైపోయిందనీ, ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో తెలుగుదేశం మరింత ప్రభావమంతమైన పాత్ర పోషిస్తుందంటున్నారు. తెలుగుదేశం, జనసేనలు కలిస్తే ఆ ప్రభావం మరింతగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల కలయిక వెనుక ఆర్ఎస్ఎస్ ఉండటంతో తెలంగాణలో  వీరి కలయికతో  అనూహ్య ఫలితాలు వచ్చే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. అందులోనూ బీజేపీ మెంటార్ అయిన ఆర్ఎస్ఎస్ తెలుగుదేశం, జనసేనల కలయిక వెనుక ఉందంటే కచ్చితంగా ఈ రెండు పార్టీల కు బీజేపీ మద్దతు కూడా తోడౌతుందనీ అంటున్నారు. ఉభయ తారకంగా తెలుగుదేశం జనసేనల పొత్తుకు ఏపీలో బీజేపీ సహకారం, అందుకు ప్రతిగా ఈ కూటమి తెలంగాణలో కమలం పార్టీకి  అండ  అన్న వ్యూహం అమలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. మొత్తం మీద చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ ఏపీలోనే కాకుండా తెలంగాణలో కూడా ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు. 

సెంట్రల్ విస్తాలోనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు?

ఫిబ్రవరి 1 నుంచి జరగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నూతన పార్లమెంట్ భవనంలోనే జరుగుతాయా అంటే కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఔననే అంటున్నాయి. పార్లమెంటు కొత్త భవనం రెడీ అయ్యిందని, తుదిమెరుగులు కూడా శరవేగంగా పూర్తవుతున్నాయనీ ఆ వర్గాలు చెబుతున్నాయి. సెంట్రల్ విస్తా పేరుతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పార్లమెంటు కొత్త భవనంలోనే రానున్న బడ్జెట్ సమావేశాలు జరుగుతాయన్న విషయాన్ని ఇంకా అఫీషియల్ గా ప్రకటించనప్పటికీ.. ఈ సమావేశాలను కొత్త భవనంలోనే నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త బవనంలో సెంట్రల్ సెక్రటేరియెట్, ప్రధాని నివాసం, కొత్త కార్యాలయం, ఉపరాష్ట్రపతి నిలయం వంటివన్నీ ఉంటాయి. రెండేళ్ల కిందట ఈ నిర్మాణం మొదలైంది. 2020లో భూమి పూజ జరిగింది. టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ ఈ నిర్మాణ పనులు చేపట్టింది. దేశ ప్రజాస్వామ్య వారసత్వాన్ని చాటేలా జరుగుతున్న ఈ భవన నిర్మాణం తుదిమెరుగులు పూర్తి చేసుకుని ఈ నెలాఖరుకు ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్న పట్టుదలతో  కేందం ఉంది.   నిజానికి గతేడాది నవంబర్ లోనే పార్లమెంట్ నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నా కోవిడ్ కారణంగా పనుల్లో కాస్త జాప్యం చోటుచేసుకుంది. మొత్తం మీద వచ్చే నెలలో జరిగే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు పార్లమెంటు కొత్త భవనంలో జరుగుతాయా లేదా అన్న విషయంలో ఇప్పటికింకా క్లారిటీ రాకపోయినప్పటికీ.. ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి. 

ఖమ్మం తరువాత నిజామాబాద్.. భారీ సభకు తెలంగాణ తెలుగుదేశం సన్నాహాలు

తెలంగాణలో తెలుగుదేశం మళ్లీ తనదైన శైలిలో పంజా విసురుతోంది. ఇప్పటికే ఖమ్మంలో నిర్వహించిన శంఖారావం సభ... సక్సెస్ కాదు.. సూపర్ డూపర్ సక్సెస్ అయింది. అదే జోష్‌తో మళ్లీ మరో చోట.. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ తెలుగుదేశం కసరత్తు చేస్తోంది. ఆ క్రమంలో ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా కేంద్రంగా భారీ సభ నిర్వహించాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. అదీ ఈ జనవరి నెలాఖరులోగా ఉంటుందని తెలుస్తోంది. అందుకు త్వరలో తేదీ కూడా ఖరారు చేయనుందని సమాచారం.  ఆ క్రమంలో ఇప్పటికే టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్జానేశ్వర్ నిజామాబాద్ లోక్‌సభ పరిధిలోని నేతలతో సమావేశమై ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఇతర ముఖ్య నాయకులతో కూడా ఆయన భేటీ కానున్నారని సమాచారం. మరోవైపు అన్ని నియోజకవర్గాల్లో బస్సు యాత్రలు చేసే అంశంపై కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. ఆ క్రమంలో గడప గడపకు మన టీడీపీ పేరుతో కార్యక్రమాలు సైతం చేపట్టనుందని తెలుస్తోంది. అందులో భాగంగా ఉమ్మడి ఏపీలో టీడీపీ ప్రభుత్వ హాయంలో చేపట్టిన అన్ని సంక్షేమ పథకాలను కరపత్రాల రూపంలో ప్రతి ఇంటికి చేరే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తోందని సమాచారం. ఇక గతంలో తెలుగుదేశం నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన వారిని సైతం..  తిరిగి ఆహ్వానించి.. అలా వచ్చిన వారికి కీలక పదవులు కట్టబెట్టాలని.. అలాగే పార్టీ కోసం శక్తి వంచన లేకుండా కష్టపడే వారికి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు   ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామనే ఓ స్పష్టమైన సంకేతాలను పార్టీ నేతల్లోకి బలంగా వేళ్లేలా పార్టీ అగ్రనాయకత్వం ఇప్పటికే   ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.  అలాగే గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ పరంగా   తరచూ  సమీక్షా సమావేశాలు తరచు నిర్వహిస్తూ..  నిత్యం ప్రజల్లో పార్టీ ఉండేలా ప్రణాళికలు   సిద్దం చేసినట్లు సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ కేంద్రంగా జరిగిన అభివృద్ధి అంతా టీడీపీ హయాంలోనే జరిగిందని.. మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే.. కచ్చితంగా అభివృద్ధి జరుగుతోందనే ఓ విధమైన భరోసా ప్రజల్లో కల్పించాలనే లక్ష్యంతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది.   మరోవైపు ఇప్పటికే ఖమ్మంలో ప్రారంభమైన టీడీపీ బహిరంగ సభల ఏర్పాటు.. నిజామాబాద్ మీదగా.. వరంగల్, మహబూబ్‌నగర్‌తోపాటు   అన్ని జిల్లాల మీదుగా సాగి.. చివరకు అంటే.. జస్ట్ ఎన్నికల ముందు హైదరాబాద్‌ మహానగరంలో అతి పెద్ద భారీ బహిరంగ సభ నిర్వహించాలనే లక్ష్యంతో టీటీడీపీ నేతలు ఉన్నట్లు సమాచారం.  ఇక తెలంగాణ సెంటిమెంట్‌ను పునాదిగా చేసుకొని ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాన్ని రగిలించిన.. టీఆర్ఎస్   స్థాపకుడు కేసీఆర్  పార్టీని తాజాగా బీఆర్ఎస్ పార్టీగా మార్చేశారు. దీంతో గతంలో ఆయన రగలించిన తెలంగాణ సెంటిమెంట్ కాస్తా.. పార్టీ పేరులో కూడా లేకుండా పోయింది. అదీకాక..  తెలంగాణలో కేసీఆర్ పాలనపై ప్రజల్లో  వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాంటి నేపథ్యంలో కేసీఆర్‌ని.. ఆయన  బీఆర్ఎస్‌ని తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా? అంటే సందేహమేనని రాజకీయ విశ్లేషకులు   పేర్కొంటున్నారు.  మరోవైపు బీజేపీ సైతం తెలంగాణలో పాగా వేసేందుకు ఎంత చేయాలో అంత చేస్తోంది. అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల గోలతో.. ఆ పార్టీ అధికారంలోకి రావడం కల్ల అన్న సంగతి తెలంగాణ ప్రజలు ఏమో కానీ .. హస్తం పార్టీ నేతలకే పూర్తిగా అర్థమైపోయింది.  తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో.. సైకిల్ పార్టీలోని లీడర్ నుంచి కేడర్ వరకు అంతా ఏక తాటిపైకి వచ్చి కొద్దిగా కష్టపడితే.. రానున్న ఎన్నికల్లో పురుటి గడ్డపై తెలుగుదేశం పార్టీ మళ్లీ సత్తా చాటుతోందని రాజకీయ విశ్లేషకులు సైతం విశ్లేషించి మరీ చెబుతున్నారు.

విపక్షాల ఐక్యతా యత్నాలు సవ్యంగా సాగేనా?

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయంటే అధికార  పక్షంలో కాదు ప్రతి పక్షాల్లోనే  హడావుడు ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే గత అనుభవం దృష్ట్యా  చివరి క్షణంలో  ఐక్యతా ప్రయత్నాల వల్ల ఇసుమంతైనా ప్రయోజనం లేదని, అధికార బీజేపీని ఎదుర్కొవడం అంత తేలికైన టాస్క్ కాదనీ అర్దమవ్వడమే.   2014, 2019లో ఎన్నికలలో  విపక్షాల అనైక్యతే బీజేపీకి అదనపు బలంగా మారిందన్నసంగతి అన్ని రాజకీయ పార్టీలూ గ్రహించేశాయి.  అయినా విపక్షాల మధ్య ఐక్యతా యత్నాల ధోరణి ఎవరి దారి వారిదే అన్నట్లుగానే ఉంది.   భారత్‌ జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ   ప్రతిపక్షాల ఐక్యత గురించి ప్రస్తావించారు. సరే ఇక ఆరంభం అవుతాయా అనుకునేలోగానే.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు  కూటమి అయినా, పొత్తులున్నా.. రాహుల్ గాంధీని పీఎం అభ్యర్థిగా అంగీకరించాల్సిందే నంటూ కండీషన్ ను తెరమీదకు తీసుకు వచ్చారు. ఈ ఏడాదిలో పలు రాష్ట్రాల అసెంబ్లీలకు  ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలలో ఐక్యతా రాగం ఆలపించగలిగితేనే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నకల నాటికి ఐక్యత బలపడే అవకాశం ఉంటుంది.  అయితే ఈ ఏడాది వివిధ అసెంబ్లీలకు జరిగే ఎన్నికలలో విపక్షాలు సంఘటితంగా సత్తా చూపే అవకాశాలున్నాయా అన్న ప్రశ్నకు మాత్రం సంతృప్తి కరమైన సమాధానం రావడం లేదు.   2014, 2019 సంవత్సరాల్లో ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు  ఏక తాటి మీద నిలబడి పోటీ చేసి సత్ఫలితాలను అందుకున్నాయి. కానీ, సార్వత్రిక ఎన్నికల విషయం వచ్చే సరికి  ఈ రెండు రాష్ట్రాల్లోనూ కూడా బీజేపీ తిరుగులేని విజయం సాధించింది.   ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో  ఆర్‌ఎల్‌.డి, బి.ఎస్‌.పి, ఎస్‌.పిలు కలిసి కేవలం 15 స్థానాలు మాత్రమే చేజిక్కించుకోగా, బీహార్‌లో ఆర్‌.జె.డి, జె.డి.యు, కాంగ్రెసులు ఒక్క స్థానానికే పరిమితమయ్యాయి.   ఈ విషయం ఎవరికి అర్ధమైనా కాకున్నా  రాహుల్‌ గాంధీకి మాత్రం   పూర్తిగా బోధపడిందని అర్ధమౌతున్నది.  ప్రతిపక్షాలు ఈ సారైనా ప్రజల దగ్గరికి ఒక విజన్‌తో వెళ్లాలి. ఈ విజన్‌ బీజేపీ విజన్ కు ప్రత్యామ్నాయంగా ఉండాలి. అది లేకుండా కలిసి కట్టుగా జనం ముందుకు వెళ్లినా ఫలితం ఆశించిన విధంగా ఉండదని ఆయన ఇప్పటికే తేటతెల్లం చేశారు. అయితే తృణమూల్‌ కాంగ్రెస్‌, సమాజ్ వాదీ పార్టీ, డి.ఎం.కె, వామ పక్షాలు బీజేపీకి బద్ధ శత్రువులే అయినప్పటికీ, 2014 నుంచి ఈ పార్టీలు ప్రతిపక్షాల ఐక్యతకు దూరంగా  ఉంటున్నాయి.   రాహుల్‌ గాంధీ చెప్పినట్టు, ప్రతిపక్షాల ఐక్యత అనే ది సీట్ల పంపకం స్థాయి  దాటి లోతుకు వెళ్లాలి. కానీ బీజేపీ వ్యతిరేక కూటమికి  సారథి ఎవరు అనే విషయంలోనే విపక్షాల మధ్య బేధాభిప్రాయాలు పొడసూపుతున్నాయి. ఇప్పటికింకా ఐక్యతా యత్నాలు పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు కానీ,  విపక్ష ఐక్య కూటమికి నాయకుడెవరన్న విషయంలో చర్చోపచర్చలు అయితే మొదలైపోయాయి. మమతా బెనర్జీ, నితీశ్‌ కుమార్‌  సహా పలువురు నాయకులు ఈ రేసులో మేమున్నామంటూ అప్పుడే సంకేతాలు, సందేశాలు పంపుతున్నారు.   దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పరిస్థితి అధ్వానంగా,ఉన్నప్పటికీ విపక్షాల ఐక్యతకు సారథ్యం విషయంలో మాత్రం  కాంగ్రెస్‌ నేనున్నానంటూ అగ్రతాంబూలం కోసం రెడీ అయిపోతోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేవలం మూడు రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో ఉన్న సంగతి విదితమే.  అక్కడ కూడా సార్వత్రిక ఎన్నికల్లో విజయాలు సాధిస్తుందన్న విశ్వాసం అయితే ఆ పార్టీలో గట్టిగా కనిపించడం లేదు. ఈ కారణంగానే ప్రతిపక్షాలు కాంగ్రెస్ నాయకత్వంపై పెద్దగా విశ్వాసం కనబరచడం లేదు. ఇప్పటికిప్పుడైతే విపక్షాల ఐక్య కూటమికి కాంగ్రెస్‌ నాయకత్వాన్ని  మెజారిటీ పక్షాలు అంగీకరించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ స్వయంగా  ప్రతిపక్షాల ఐక్యత గురించి ముందుగా ప్రస్తావించారు. ఆయన ప్రతిపాదనకు, ఆయన చెబుతున్న డిఫరెంట్ విజన్ అంశానికీ విపక్షాల నుంచి ఎటువంటి స్పందన వస్తుందన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.  ప్రతిపక్షాల మధ్య ఉన్న రాజకీయ వైవిధ్యాలను చక్కదిద్ది, వాటిని ఒకే తాటి మీదకు తీసుకురావడానికి కాంగ్రెస్‌కు లేదా రాహుల్‌ గాంధీకి ఉన్న అర్హతలేమిటన్న ప్రశ్న రాజకీయ వర్గాలలో సర్క్యలేట్ అవుతోంది. సొంత పార్టీలో విభేదాల పరిష్కారానికే చెమట్లు కక్కుతున్న కాంగ్రెస్ ఇక విపక్షాల మధ్య రాజకీయ ఐక్యత ఏ విధంగా తీసుకురాగలదని పరిశీలకులు అంటున్నారు. ఉదాహరణగా తెలంగాణ కాంగ్రెస్ లో ముదిరి పాకాన పడ్డ విభేదాల పరిష్కారంలో కాంగ్రెస్ అధిష్ఠానం వైఫల్యాన్ని చూపుతున్నారు. 

గవర్నర్ వర్సెస్ సీఎం.. తమిళ సభలో కొత్త చిత్రం

తమిళనాడు అసెంబ్లీకి మంచి చరిత్ర వుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకోవడం.. కొండకచో ముష్టిఘాతలకు పాల్పడడం .. మొదలు మినీ వస్త్రాపహరణ యత్నాల వరకు.. చాలా చాలా అవాంఛనీయ సంఘటనలకు తమిళనాడు అసెంబ్లీ వేదికగా నిలిచిన ఘన చరిత్ర వుంది.  అఫ్కోర్స్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్త్ర ప్రదేశ్  రాష్ట్రాలలోనూ, నిండు సభలో ప్రతిపక్ష నేత కన్నీళ్లు పెట్టుకున్న సంఘటనల వంటివి చాలానే జరుగుతున్నాయి  అది వేరే విషయం. ఇప్పుడు తమిళనాడు శాసనసభలో  మరో మారు...  మరో అనూహ్య ఘటన చోటు చేసుకుంది.  ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడం సాధారణం. అది ఎక్కడైనా ఉన్నదే. జరిగేదే. కానీ తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్ ఆర్ఎన్ రవి వాకౌట్ చేశారు. సీఎం స్టాలిన్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆయన సభ నుంచి వెళ్లిపోయారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సభను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ ఆర్ఎన్ రవి  తమిళనాడు చరిత్రను వక్రీకరించి పుస్తకాలు రాశారని.. వాటిని సవరించాల్సిన అవసరం ఉందని అన్నారు. తమిళనాడు ద్రవిడుల భూమి అన్న ప్రచారం జరిగిందని,  తమిళనాడు పేరును తమిళగం అని మార్చాలని చెప్పారు.  దీనిపై డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసెంబ్లీలో ఆందోళనకు దిగారు.  దీంతో ఎమ్మెల్యేల తీరును నిరసిస్తూ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసిన గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేశారు. ఇదే సమయంలో డీఎంకే మిత్రపక్ష ఎమ్మెల్యేలు కూడా సభ నుంచి వాకౌట్‌ చేసి అసెంబ్లీ ఎదుట ఆందోళనకు దిగారు.  గవర్నర్ తన ప్రసంగంలో ఉద్దేశపూర్వకంగానే తమిళనాడు పదాన్ని పలకలేదని ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసంగం కాపీల్లో తమిళనాడు అని ఉన్నా.. గవర్నర్ ప్రస్తావించకపోవడంపై సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసంగంలో ఉన్న విషయాలను చదవకుండా తమిళనాడు ప్రజలను అవమానించారని మండిపడ్డారు. ప్రసంగంలో ఉన్న ద్రావిడ మోడల్, తమిళనాడు అన్న చోట గవర్నర్ ప్రత్యామ్నాయ పదాలను వాడారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని మాత్రమే స్పీకర్ రికార్డ్ చేయాలని,  గవర్నర్ ప్రసంగంలోని పలు అభ్యంతరకర వ్యాఖ్యలను తొలగించాలని స్టాలిన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ దాన్ని ఆమోదించింది. అయితే, ఇది ఎదో యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన అయితే కాదు, తెలంగాణలో ఎలాగైతే, గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య యుద్ధం నడుస్తోందో, తమిళ నాడులోనూ చాలా కాలంగా ముఖ్యమంత్రి గవర్నర్ మధ్య అలాంటి యుద్ధమే నడుస్తోంది. అందులో భాగంగానే ఈ పరిణామాన్ని చూడాలి. తమిళనాడు  గవర్నర్ ఆర్ఎన్ రవి. ముఖ్యమత్రి స్టాలిన్ ప్రభుత్వం మధ్య గతంలో ‘నీట్’ పరీక్ష విషయంలో, ఇటీవల కోయంబత్తూర్ లో జరిగిన కారు విష్పోటనం విషయంలో వివాదం తలెత్తింది.  ఈ వివాదాల నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చందూ అసలు గవర్నర్ వ్యవస్థే అనవసరమని సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర పదవి అనవసరమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా బిల్లుల్ని గవర్నర్ పెండింగులో పెట్టడం ఏ మేరకు సమంజసమని జస్టిస్ చందూ ప్రశ్నించారు. అయితే  బిల్లులను పెండింగ్ లో పెట్టే అధికారం భారత రాజ్యాంగమే గవర్నర్ కి  కల్పించిందని, మరో వాదన వుంది. నిజానికి  కేంద్రంలో రాష్ట్రాలలో వేర్వేరు పార్టీల ప్రభుత్వాలు ఉన్నప్పుడు గవర్నర్ వ్యవస్థ ఎప్పటికప్పడు వివాదస్పద మవుతోందని, ఈ నేపధ్యంలో  బ్రిటిష్ కాలం నాటి గవర్నర్ వ్యవస్థను కొనసాగించడం అవసరమా అనే చర్చ కూడా జరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీలో జరిగిన ఘటన నేపథ్యంలో ఇప్పడు మళ్ళీ మరో మారు  అదే  చర్చ మొదలైంది.

ఖమ్మం చుట్టూ తెలంగాణ రాజకీయం

తెలంగాణ రాజకీయాలకు ఖమ్మం అడ్డుగా మారుతోందా? గల్లీ నుంచి ఢిల్లీ దాకా సాగుతున్న తెలంగాణ రాజకీయాలు ఖమ్మం చుట్టూనే తిరుగుతున్నాయా? ఉభయ తెలుగు రాష్ట్రల సరిహద్దు జిల్లా రాజకీయాలు తెలంగాణ రాజకీయాలలో కీలకం కానున్నాయా  అంటే, అవుననే సమాధానమే వస్తోంది. తెలుగుదేశం పార్టీ గత డిసెంబర్ 21న ఖమ్మంలో శంఖారావం పేరిట బహిరంగ సభను నిర్వహించింది. అనూహ్యంగా  టీడీపీ సభ సూపర్ సక్సెస్ అయింది. సభ సక్సెస్ అవడమే కాదు  రాష్ట్ర రాజకీయాలని కొత్త మలుపు తిప్పింది. కొత్త చర్చకు దారి చూపింది. తెరాస, భారాసగా మారి జాతీయ స్థాయిలో విస్తరించేందుకు అడుగులు వేస్తున్న నేపధ్యంలో టీడీపీలో చాలా కాలం తర్వాత తెలంగాణ గడ్డమీద సభ  నిర్వహించం, ఈ సభలో చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్  మారింది.  అదలా ఉంటే కొత్త సంవత్సరం (2023) జనవరి ఫస్ట్ న ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు అధికార భారాస ముఖ్య నేతలు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు,  మాజీ ఎంపీ పొంగులేటి  ఒకరు పాలేరులో ఇంకొకరు ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనాలు అధికార బీఆర్ఎస్ లో ప్రకంపనలు సృష్టించాయి. ఇక అక్కడి నుంచి తెలంగాణ రాజకీయాలు ఖమ్మం చుట్టూతా  తిరుగుతున్నాయి. ఇటు తుమ్మల, అటు పొంగులేటి ఒకే సారి అసమ్మతి గళం వినిపించడం ఆ ఇద్దరు పార్టీతో సంబంధం లేకుండా రేపటి ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ప్రకటించడం, అందుకు కొనసాగింపుగా ఆ ఇద్దరు పార్టీ మారడం ఖాయమని ప్రచారం జరగడంతో అధికార బీఆర్ఎస్ నాయకులు అప్రమత్తమయ్యారు.   జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ తో పాటుగా ఇతర మంత్రులు  ముఖ్య నేతలు ఉమ్మడి ఖమ్మం  జిల్లాలో  పర్యటిస్తున్నారు. మరో వంక పొంగులేటి బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమై, మండలాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్  ఈ నెల 18న ఢిల్లీలో అనుకున్న భారాస ఆవిర్భావ సభను ఖమ్మంలో నిర్వహించాలని నిర్ణయించారు. గతంలో ఢిల్లీ  లేదా యూపీలో భారీ బహిరంగసభ పెట్టి బీఆర్ఎస్ సన్నిహిత జాతీయ నేతలందర్నీ పిలిచి..  కొత్త పార్టీ విధి, విధానాలు, జెండా, అజెండాలను ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్లాన్ మార్చి ఖమ్మంలో ఆవిర్భావ సభ పెడుతున్నారు. దీంతో ఖమ్మం రాజకీయాలపై మీడియా  ఫోకస్ పెరిగింది. అదలా ఉంటే అదే రోజున పొంగులేటి, ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైందని అంటున్నారు. అయితే, పొంగులేటి ఢిల్లీలో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరతారా లేక, ఒక రోజు తర్వాత  జనవరి 19 న హైదరాబాద్ వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో పార్టీలో చేరతారా అనే విషయంలో కొంత క్లారిటీ రావలసి వుంది. ప్రధాని మోడీ జనవరి 19న హైదరాబాద్ విజయవాడ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించడంతో పాటు  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్  ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు.  ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సభలో పొంగులేటి పార్టీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు .అయితే చిత్రంగా చంద్రబాబు నాయుడు ఖమ్మంలో కాలు పెట్టింది మొదలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ రాజకీయాలు ఖమ్మం చుట్టూనే తిరుగుతున్నాయి.