మోడీకి వ్యతిరేకంగా బీబీసీ డాక్యుమెంట్
posted on Jan 19, 2023 @ 9:51PM
వలసవాద పాలన అంతమై, ఏడున్నర దశాబ్దాలు పూర్తయినా బ్రిటన్ నేషనల్ బ్రాడ్కాస్టర్ బీబీసీ ధోరణి మాత్రం మారలేదు. ఇప్పటికీ భారత దేశాన్ని, భారతీయ ఆచార వ్యవహారాలను అవహేళన చేయడం మానలేదు. భారతే దేశం విభిన్న రంగాల్లో సాధించిన ప్రగతిని ప్రపంచం అంతా గుర్తించినా, బీబీసీ మాత్రం భారత దేశం సాధించిన పురోగతిని తిరోగమనంగా ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా, కేంద్రంలో అధికార మార్పిడి జరిగి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీబీసీ సాగిస్తున్న భారతగా వ్యతిరేక ప్రచారం మరింత పెరిగింది. హద్దులు దాటి, వ్యక్తిగత దూషణల స్థాయికి దిగజారిన వైనం ఈ మధ్య కాలంలో మరింత పస్పుటంగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ సిరీస్ వివాదాస్పదంగా మారింది. ఈ సిరీస్ పై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అపఖ్యాతి పాలు చేసే కథనాన్ని ప్రచారం చేయడం కోసమే ఈ విశ్వసనీయత లేని డాక్యుమెంటరీని ప్రసారం చేశారని దుయ్యబట్టింది. బ్రిటన్లోని అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో వలసవాద మనస్థత్వం, ఆలోచనా ధోరణి కనిపిస్తోందని పేర్కొంది.
బ్రిటన్ నేషనల్ బ్రాడ్కాస్టర్ బీబీసీ మోడీ పై రెండు భాగాలుగా ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. 2002లో గుజరాత్లో జరిగిన అల్లర్ల సమయంలో మోడీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని చెబుతూ, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంపై ఈ డాక్యుమెంటరీలో విమర్శలు గుప్పించింది. దీంతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. కొన్ని ప్లాట్ఫామ్ల నుంచి దీనిని తొలగించారు. భారతీయ మూలాలుగల బ్రిటన్ పౌరులు ఈ డాక్యుమెంటరీని తీవ్రంగా ఖండించారు. ప్రముఖ బ్రిటన్ పౌరుడు లార్డ్ రమి రేంజర్ మాట్లాడుతూ, 100 కోట్ల మందికి పైగా గల భారతీయుల మనసును బీబీసీ తీవ్రంగా గాయపరిచిందన్నారు.
ఈ నేపథ్యంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మీడియాతో మాట్లాడారు. బ్రిటన్ అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీ షో వలసవాద ఆలోచనా ధోరణిని వెల్లడిస్తోందని అన్నారు. విశ్వసనీయత లేని కథనాన్ని అందరి మనసుల్లోకి జోప్పించాలనే లక్ష్యంతో రూపొందించిన, తప్పుదారి పట్టించే, పక్షపాతంతో కూడిన ప్రచారమని ఆరోపించారు. పక్షపాతం ఉండటం, నిష్పాక్షికత లేకపోవడం, వలసవాద ఆలోచనా ధోరణిని యథేచ్ఛగా కొనసాగించడం స్పష్టమవుతున్నాయన్నారు.
దీనిని ప్రసారం చేయడం వెనుక ఎజెండా ఏమిటని ప్రశ్నించారు. గౌరవ, మర్యాదలతో పని చేయాలని కోరుకుంటున్నామన్నారు. ఈ డాక్యుమెంటరీలో బ్రిటన్ మాజీ సెక్రటరీ జాక్ స్ట్రా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, జాక్ స్ట్రా ఏదో అంతర్గత బ్రిటన్ నివేదికను ప్రస్తావించినట్లు కనిపిస్తోందని, అది తనకు ఏవిధంగా అందుబాటులో ఉంటుందని ప్రశ్నించారు. అది ఇరవయ్యేళ్ళ క్రితంనాటి నివేదిక అని, దానిపైన మనం ఇప్పుడు ఎందుకు స్పందించాలని అడిగారు. జాక్ చెప్పినంత మాత్రానికి అది సరైనదని వారు ఎలా చెప్పగలరని ప్రశ్నించారు.
ఇంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ అనే మాటలను తాను విన్నానని, వలసవాద ఆలోచనా ధోరణి అనే పదాలను మనం మాట్లాడటానికి ఓ కారణం ఉందని తెలిపారు. మనం పదాలను ఇష్టానుసారం వాడబోమన్నారు. ఇంక్వైరీ ఏమిటి? వారు అక్కడ దౌత్యవేత్తలు కదా? అన్నారు. ఇన్వెస్టిగేషన్ అంటే దేశాన్ని వారు పాలిస్తున్నారా? అని ప్రశ్నించారు. అయితే, దురదృష్టం ఏమంటే ... బీబీసీ తప్పుడు కథనాలను బ్రిటన్ లోని భారతీయలు వ్యతిరేకిస్తున్నారు. కానీ, దేశంలోని కొందరు వ్యక్తులు, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నాయకులు బీబీసీ కథనానికి సోషల్ మీడియాలో ప్రాచుర్యం కల్పిస్తున్నారు.