రక్తంతో మోడీకి నిరసన లేఖలు
posted on Jan 20, 2023 6:09AM
బృందావన్ టెంపుల్ కారిడార్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బంకి బిహారీ ఆలయం చుట్టూ నిర్మించ తలపెట్టిన ఈ కారిడార్ పనులను స్థానికులు, వ్యాపారులు, పూజారులు వ్యతిరేకిస్తున్నారు. గత కొన్ని రోజులుగా యూపీ సర్కారు, కేంద్రానికి తమ గోడు వెళ్లబోసుకుంటున్నా పట్టించుకోవటం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమ వ్యతిరేకతను పట్టించుకోవడం లేదంటూ వారు వినూత్న నిరసనకు దిగారు. బృందావన్ టెంపుల్ కారిడార్ పనులను ఆపేయాలంటూ వీరు ప్రధాని మోడీకీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు రక్తంతో లేఖలు రాశారు. బృందావన్ కారిడార్ ప్రాజెక్టు ప్రతులను తగులబెట్టి..తమ రక్తంతో మొత్తం 108 లేఖలను రాశారు.
బృందావనం పవిత్రతను కాపాడాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. కాగా మందిరాన్ని ఆనుకున్న వీధుల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నవారంతా తమ వ్యాపారాలు మూసేసి రోడ్డెక్కారు. కాశీ విశ్వనాథ్ టెంపులు కారిడార్ ప్రాజెక్టులా దీన్ని నిర్మిస్తే చాలా మంది ఉపాధి కోల్పోవడమే కాకుండా సొంత ఇళ్లను కోల్పేయే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బంకి బిహారీ మందిరంలో కృష్ణుడు చిన్న బాలుడిలా ఉంటూ దర్శనం ఇస్తాడు..అయితే ఈ మందిరంలో తరచూ తొక్కిసిలాట జరిగి మరణాలు సంభవిస్తుంటాయి. భక్తుల రద్దీని తట్టుకునే ప్రభుత్వం తలపెట్టిన ఈ కారిడార్ పనులు ఆపేయాలంటూ స్థానికులు న్యాయపోరాటానికి దిగారు.