నో సెకండ్ చాన్స్.. ఇది కన్షర్మ్.. ఏపీలో వైసీపీ సీన్ అయిపోయిందా?
posted on Feb 21, 2023 @ 3:56PM
2019 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఓటమి కారణాలను సహేతుకంగా విశ్లేషించడం సాధ్యం కాదు. ఎందుకంటే.. రాష్ట్ర విభజన అరిష్టాలను ఎదుర్కుంటూ, నవ్యాంద్ర తొలి ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు, రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు, తన అనుభవం అంతా రంగరించి ప్రణాళికా బద్దంగా అడుగులు వేశారు. రాజధాని అమరావతిని, ‘గ్రోత్ ఇంజిన్’ నగరంగా అభివృద్ధి చేసేందుకు చరిత్రలో ఎన్నడూ ఎరగని విధంగా భూసమీకరణ చేశారు. నిర్మాణాలూ ఆరంభమయ్యాయి. మొత్తం ప్రపంచం దృష్టి అంతా అమరావతిపైనే కేంద్రీకృతమై ఉంది. మరొక్క ఐదేళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే, రాజధాని నగరం అమరావతి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడమే కాదు, రాష్ట్రం అన్ని రంగాలో అభివృద్ధి సాధించేది. అగ్రగామి రాష్ట్రంగా నిలిచేది. అయితే కారణాలేమైతేనేం, 2019 అసెంబ్లీ ఎన్నికలో తెలుగు దేశం పార్టీ పరాజయం పాలయ్యింది. వైసీపీ అధ్యక్షడు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అభ్యర్ధన ఆ పార్టీని గెలిపించింది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక ఆతర్వాత ఏమి జరిగిందన్నది కళ్ళ ముందు కదులుతున్న,నడుస్తున్న చరిత్ర.
రాష్ట్ర విభజన అనతరం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఐదేళ్ళ పాలనలో రాష్ట్రం సగటున 10.8 శాతం వృద్ధి రేటు నమోదైతే, అది జగన్ రెడ్డి పాలనలో 3 శాతానికి పడిపోయింది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం వలన రాష్ట్రం ఏం కోల్పోయిందో చెప్పడానికి ఈ లెక్క చాలు. నిజానికి, జగన్ పాలనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాలు, అన్నీ ఇన్నీ కాదు.అందుకే ఇప్పడు రాష్ట్ర ప్రజలు మళ్ళీ చంద్రన్న రావాలి ... వెలుగు తేవాలి అంటున్నారు. చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న యాత్రలకు పోటెత్తున్న జనాన్ని చూస్తే జగన్ పాలనతో వారు ఎంతగా విసిగిపోయారో, చేసిన తప్పు దిద్దుకోవడానికి ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్థమవుతుంది.
నిజానికి 2019 ఓటమి తర్వాత తెలుగు దేశం ‘అస్తిత్వం’ విషయంలో కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. వైసేపీ ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడం , టీడీపీ బలం కేవలం 23 స్థానాలకు పడిపోవడంతో టీడీపీ తిరిగి పుంజుకోవడం అంత ఈజీ కాదన్న విశ్లేషణలు అప్పట్లో వెల్లువెత్తాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వయసు రీత్యా రాజకీయంగా అంత చురుకైన పాత్రను పోషించలేక పోవచ్చని, అలాగే, పార్టీని ముందుకు నడిపించడంలో గతంలోలా చురుకుగా వ్యవహరించే అవకాశాలులేవని అంతా భావించారు. అయితే ఇప్పుడు ఆ చాలా మందే, అటు చంద్రబాబు విషయంలో తమ అంచానాలు తప్పాయని అంగీకరిస్తున్నారు.
వైసేపీ అరాచక పాలనను తట్టుకుని టీడీపీ అస్తితాన్ని నిలుపుకోవడమే కాదు, పడిలేచిన కెరటంలా దూసుకొస్తోంది. చంద్రబాబు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు కదుపుతున్నారు. నిజానికి చంద్రబాబు నాయుడికి ఇదేం కొత్త కాదు. నాలుగు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో ఎత్తు పల్లాలు చూశారు. ప్రతి ఓటమి నుంచి గుణపాఠాలు నేరుస్తూ.. గెలుపు తలుపులు తెరిచారు. ఇప్పడు మళ్ళీ అదే జరుగుతోంది. ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అన్నట్లుగా చంద్రబాబు 70 ఏళ్ల యువకుడిలా సాగిస్తున్న రోడ్ షో లు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నిపుతున్నాయి. చంద్రబాబు వేసే ప్రతి అడుగులో కొత్త ఉత్సాహం తోణికిసలాడుతోంది. టీడీపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
ఆలాగే లోకేష్ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడే కాదు.. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే.. నారా లోకేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అయితే.. 2019లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయినా.. వెనకడుగు వేయలేదు. వివిధ కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లోనే ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాకుండా తాజాగా పాదయాత్రతో జనంలో మమేకం అయ్యారు.
మరోవంక జగన్ రెడ్డి 2019 ఎన్నికలలో అన్ని విధాల అండగా ఉన్న, తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను దూరం చేసుకున్నారు. వారనే కాదు.. 2019 ఎన్నికల సమయంలో ఆయనకు అన్ని విధాలుగా అండగా నిలిచిన ఆయన బంధువర్గం ఇప్పుడు దూరమైంది. అందుకు జగన్ తీరే కారణం. సొంత సోదరి షర్మిలను తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేసినా,జగన్ రెడ్డి స్పందించలేదు. కనీసం ఖండించలేదు. ఇక పార్టీలో ఆయన నమ్మే వారు, ఆయన్ని నమ్మే వారు ఎవరైనా ఉన్నారంటే వాళ్ల సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆయనకు దూరం అవుతున్న పరిస్థితి. ఇక జనం సంగతి చెప్పనే అవసరం లేదు. ఒక్క చాన్స్ అంటే ఇచ్చామనీ, మరో చాన్స్ అంటే నమ్మడానికి సిద్ధంగా లేమనీ జనం అంటున్నారు. ఈ విషయం ఎవరో చెప్పడం లేదు. రాజకీయ పరిశీలకుల విశ్లేషణల జోలికి పోనవసరం లేదు. ఆయన స్వయంగా సొమ్ములిచ్చి మరీ చేయించుకుంటున్న సర్వేలే చెబుతున్నాయి. ఆ సర్వే నివేదికలను పట్టుకుని ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలకు పీకుతున్న క్లాసులే తేటతెల్లం చేస్తున్నాయి. వైనాట్ 175 నుంచి మరోసారి అధికారంలోకి రావడానికి అవసరమైనన్ని స్థానాలనైనా గెలుస్తే చాలంటూ ఆయన చెబుతున్న బేల మాటలే వైసీపీ, జగన్ గ్రాఫ్ ఎంతలా పడిపోయిందో తేటతెల్లం చేస్తున్నాయి. మూడు రాజధానుల నుంచి విశాఖే ఏకైక రాజధాని అంటూ మారిన స్వరమే చెబుతోంది. మరో సారి అధికారం అన్నఆశ జగన్ లో అడుగంటి పోయిందని. విపక్షాల సభలూ, సమావేశాలపై ఆంక్షలూ, నిషేధాలే చెబుతున్నాయి