అఖిల భారతీయ సర్వీస్ అధికారులు పారాహుషార్
posted on Apr 17, 2023 @ 1:57PM
అఖిల భారతీయ సర్వీస్ అధికారులైన ఐఏ ఎస్ , ఐపీఎస్ , ఐఎఫ్ఎస్ అధికారులు షేర్ బజార్ లో పెట్టుబడులు, విక్రయాలు జరిపితే ఇక నుంచి కేంద్ర ప్రభుత్వానికి సమాచారమివ్వాల్సిందే. పారదర్శకతను పాటించాలని ప్రభుత్వం సూచించింది. షేర్ బజార్ లో పెట్టుబడులు , ఇతర పెట్టుబడులు పెట్టినట్లయితే మూలవేతనం కంటే అధికంగా ఉంటే కేంద్ర కార్మిక శాఖకు సమాచారం ఇవ్వాల్సిందే.వారి మొత్తం లావాదేవీల క్యాలెండర్ సంవత్సరంలో ఆరు నెలల మూలవేతనం కంటే ఎక్కువ ఉంటే కేంద్ర కార్మిక శాఖకు సమాచారమివ్వాల్సిందే. అఖిల భారతీయ సర్వీసెస్ నియమావళి 1968 నియమం16(4) ప్రకారం అతను అందించాల్సిన సారూప్య సమాచారానికి అదనంగా ఉంటుంది. ఈ నియమాలు ఆలిండియా సర్వీసెస్ క్రింద ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు అధికారులకువర్తి స్తాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది.
గుజరాత్ కు చెందిన ఐఏఎస్ , ఐపిఎస్ , ఐఎఫ్ఎస్ అధికారులు స్టాక్ మార్కెట్లో 7500 కోట్లు, రియల్ ఎస్టేట్లో పెట్టు బడులు పెట్టినట్లు బట్ట బయలైంది. గుజరాత్ స్టాక్ మార్కెట్ నుంచి దైనిక్ భాస్కర్ అనే హిందీ పత్రిక తెప్పిచుకున్న రిపోర్టును బట్టబయలు చేయడంతో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది.
90 శాతం మంది అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు తమ బంధువులు,స్నేహితుల పేర్లతో తీసుకున్న డీమ్యాట్ ఖాతాల ద్వారా షేర్లలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు దైనిక్ భాస్కర్ పత్రిక తేల్చింది. అందులో IAS, IPS లు స్టాక్ మార్కెట్లో 7500 కోట్లు, రియల్ ఎస్టేట్లో 15 వేల కోట్లు పెట్టుబడి పెట్టినట్లు తేలింది. గుజరాత్ ఎమ్మెల్యేలు,మంత్రుల ఆస్తులు లెక్కలేనంతగా పెరిగాయి.
అధికారులు, మంత్రులు ఇంత పెద్ద మొత్తంలో సంపద కూడబెట్టడానికి అవినీతే కారణమని తేల్చారు.
రిటైర్డ్ ఉన్నతాధికారులు, ఆర్దిక నిపుణులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయినా అవినీతి పరులపై చర్యలు తీసుకోవడం లేదని దైనిక్ భాస్కర్ పేర్కొంది.