అల్లు అర్జున్ నంద్యాల పర్యటనపై  ఈసీ  సీరియస్ 

హీరో అల్లు అర్జున్ నంద్యాల పర్యటన సందర్భంగా భారీ సంఖ్యలో అభిమానులు గుమికూడడంతో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సీరియస్ గా స్పందించింది. భారీ జనసమీకరణ జరుగుతోందని సమాచారం అందించలేదనే కారణంతో ఇద్దరు కానిస్టేబుల్స్ పై చర్యలకు ఆదేశించింది. ఎస్పీ రఘువీర్ రెడ్డి, డీఎస్పీ రవీందర్ రెడ్డి, టూ టౌన్ సీఐ రాజారెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఎస్బీ కానిస్టేబుళ్లు స్వామి నాయక్, నాగరాజులను ఉన్నతాధికారులు వీఆర్ కు పంపించారు. ఈమేరకు తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. అల్లు అర్జున్ పైనా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.  నంద్యాల వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ఇవ్వడానికి అల్లు అర్జున్ ఈ నెల 11న తన భార్యతో కలిసి నంద్యాల వెళ్లారు. హీరో వస్తున్నాడని తెలిసి పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు శిల్పా రవిచంద్ర ఇంటికి చేరుకున్నారు. వేలాదిగా తరలి వచ్చిన అభిమానులతో శిల్పా రవిచంద్ర నివాస ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఓవైపు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా భారీ ఎత్తున జనం గుమికూడడంపై ఈసీ సీరియస్ గా స్పందించింది.విషయం ఉన్నతాధికారులకు తెలియజేయడంలో, ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావడంలో విఫలమైన పోలీస్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈమేరకు ఈసీ నుంచి నోటీసులు అందుకున్న ఎస్పీ, డీఎస్పీ.. ఇద్దరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నారు. దీనిపై స్థానిక రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు చేయడంతో హీరో అల్లు అర్జున్ తో పాటు వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డిపై కేసు నమోదు చేశారు.

అల్లు అర్జున్ కెరీర్ పై సీనీ రాజకీయ రంగాల్లో విస్తృత చర్చ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఓట్ల లెక్కింపు తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఎవరు అధికారంలోకి వస్తారు. ఏ పార్టీ పరాజయాన్ని మూటకట్టుకుంటుంది అన్న చర్చలతో పాటు మరో వ్యక్తి గురించి కూడా రాజకీయ, సినీ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  ఆ వ్యక్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. మెగా ఫ్యామిలీకి దగ్గర బంధువు.. అలా చెప్పే కంటే.. మెగాస్టార్ చిరంజీవికి స్వయానా మేనల్లుడు. అటువంటి అల్లు అర్జున్   ఎన్నికల సందర్భంగా తన మిత్రుడు అంటూ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా చంద్ర కిషోర్ రెడ్డి కి మద్దతుగా నంద్యాల వెళ్లి మరీ ర్యాలీలో పాల్గొన్నారు.  మరో వైపు జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసినప్పటికీ ఆయనకు ఒక ట్వీట్ ద్వారా మద్దతు ప్రకటించి ఊరుకున్న అల్లు అర్జున్ పనిమాలా నంద్యాల వరకూ వెళ్లి మరీ వైసీపీ అభ్యర్థి శిల్పాకు మద్దతు ప్రకటించి రావడం సంచలనం సృష్టించింది. దీంతో మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ కు పొసగడం లేదా అన్న అనుమానాలు సైతం సర్వత్రా వ్యక్తం అయ్యాయి. ఈ విషయంలో మెగా అభిమానులు, అల్లు అర్జున్ అభిమానుల మధ్య సామాజిక మాధ్యమంలో ఓ రేంజ్ లో మాటల యుద్ధం కూడా జరిగింది. అది పక్కన పెడితే ఓట్ల లెక్కింపు జరిగి, ఫలితాలు ప్రకటించే జూన్ 4వ తేదీ సమీపిస్తున్న కొద్దీ అల్లు అర్జున్ పై రాజకీయ సినీ రంగాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.     ఒక వేళ శిల్పా ఓడిపోతే అల్లు అర్జున్ పరిస్థితి ఏమిటి అన్నదే ఈ చర్చ. ఎందుకంటే పోలింగ్ సరళిని చూసిన తరువాత రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది తెలుగుదేశం కూటమే అన్న భావన సర్వత్రా బలపడింది. అందుకు తగ్గట్టుగా వైసీపీ శ్రేణులు, నేతల ప్రకటనలు కూడా ఓటమిని అంగీకరించేసినట్లుగానే ఉన్నాయి.  దీంతో  వైసీపీ అధికారం కోల్పోయినా, గెలిచే  కొన్ని సీట్లలో నంద్యాల లేకపోతే అల్లు అర్జున్ ఇమేజ్  బాగా డ్యామేజ్ అవుతుందని అంటున్నారు.  అదే సమ యంలో  జూనియర్ ఎన్టీఆర్  కున్న   సంయమనం కూడా అల్లు అర్జున్   పాటించలేదని అంటు న్నారు.  ఎందుకంటే వైసీపీ తరఫున గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన కొడాలి నాని, వల్లభనేని వంశీ లు ఎన్టీఆర్ కు చాలా సన్నిహిత స్నేహితులు. వారిరువురూ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాలు కూడా చేశారు.  అయితే ఆ ఇద్దరి తరఫునా ప్రచారం చేయడానికి కానీ, మద్దతు పలకడానికి కానీ ఎన్టీఆర్ ముందుకు రాలేదు. అసలు తన స్నేహితులు ఇద్దరూ వైసీపీ అభ్యర్థులుగా పోటీలో ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ వారికి అనుకూలంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు అటువైపు చూడనే లేదు. అయితే అందుకు భిన్నంగా బన్ని అనవసర ఆర్భాటం చేసి మరీ శిల్పాకు మద్దతుగా నంద్యాల వెళ్లారని సినీ రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. బన్నీ తీరు కచ్చితంగా ఆయన కెరీర్ పై ప్రభావం తప్పకుండా పడుతుందని చర్చించుకుంటున్నారు.  

రైతుని వరించిన అదృష్టం, పొలంలో దొరికిన విలువైన వజ్రం!

కర్నూలు జిల్లాలో ఓ రైతు పంటపడింది. పొలంలో అతడికి విలువైన వజ్రం దొరికింది.  ఇటీవల కురిసిన వర్షాలకు వజ్రం బయటపడింది. పొలం పనులు చేస్తుండగా కంటపడిన వజ్రాన్ని రైతు భద్రంగా ఇంటికి తీసుకెళ్లాడు. విషయం తెలిసి వ్యాపారులు ఆయన ఇంటి ముందు క్యూ కట్టారు. ఆ వజ్రాన్ని సొంతం చేసుకోవడానికి వ్యాపారులు పోటీ పడడంతో వేలం నిర్వహించారు. ఇందులో పెరవల్లికి చెందిన ఓ వ్యాపారస్థుడు రూ.5 లక్షల నగదు, 2 తులాల బంగారం ఇచ్చి ఆ రైతు నుంచి వజ్రాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే, బహిరంగ మార్కెట్ లో ఆ వజ్రం విలువ రూ.10 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఏటా వర్షాకాలం తొలకరి సమయంలో కర్నూలు జిల్లాలో వజ్రాల కోసం పొలాల్లో రైతులు, కూలీలు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారు వెతుకుతుంటారు. దీనికోసం ప్రత్యేకంగా భూమిని లీజుకు తీసుకుని, కూలీలను పెట్టి వెతికించే వాళ్లు కూడా ఉన్నారు. ఒక్క విలువైన వజ్రం దొరికితే దశ మారిపోయే అవకాశం కావడంతో రైతులు కూడా తమ పొలాల్లో వజ్రాల కోసం వెతుకుతుంటారు. ఈ సంవత్సరం కురుస్తున్న తొలకరి వర్షాలతోనూ వజ్రాలు లభిస్తున్న కొందరు రైతుల పంట పండుతోంది.  రాయలసీమ జిల్లాలలో ఈ సీజన్ అదృష్టాన్ని పరీక్షించుకునే సీజన్. ప్రతి ఒక్కరూ పొలాలలో వజ్రాల వేట కొనసాగిస్తారు. ఇక నక్క తోక తొక్కిన అదృష్టవంతులకు వజ్రాలు దొరుకుతాయి. ఎంతోమందిని ఇక్కడ దొరికే వజ్రాలు బికారుల నుండి అమీర్ లుగా మారుస్తున్నాయి. తొలకరి వర్షాల సమయంలో రాయలసీమ జిల్లాలలో ఎంతోమంది వ్యవసాయ కూలీలు, కొందరు గొర్రెల కాపరులు, వ్యవసాయం చేసుకునే రైతులకు వజ్రాలు దొరికిన అనేక ఉదంతాలు ప్రతీ సంవత్సరం చోటు చేసుకుంటూనే ఉన్నాయి. భూమిలో దొరికే విలువైన వజ్రాలు, గుప్త నిధులు వంటివి చట్టప్రకారం ప్రభుత్వ ఖజానాకు చేర్చాల్సి ఉంటుంది. ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూముల్లో దొరికినా సరే అది ప్రభుత్వ ఆస్తేనని చట్టాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా రైతుకు దొరికిన వజ్రాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సిన అధికారులు.. తమకు పట్టనట్టు ఉండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. - ఎం.కె.ఫ‌జ‌ల్‌  

చంద్రబాబు.. వైనాట్ ప్రైమ్ మినిస్టర్?

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధిస్తుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుంది... నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారు... ఇదీ ఇప్పటి వరకు చాలామంది చూస్తున్న దృక్కోణం! కానీ,  ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు జాతీయ స్థాయిలో ఆలోచిస్తున్న కోణం మరొకటి వుంది.. అదే ‘‘చంద్రబాబు.. వైనాట్ ప్రైమ్ మినిస్టర్?’’ ఈసారి ఎన్నికలలో నాలుగు వందల స్థానాలు సాధించాలని బీజేపీ ఊహల పల్లకీలో విహరిస్తోందిగానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా వుంది. ఇప్పటి వరకు జరిగిన అన్ని విడతల పోలింగ్ సందర్భంగా బీజేపీ సొంతగా దుమ్ముదులిపేసింది అని చెప్పుకునే స్థాయిలో ఓట్లు పడలేదు. ఎన్డీయేలో భాగస్వాములుగా వున్న పార్టీలు కొన్ని తమ సత్తాను చాటగలిగాయిగానీ, బీజేపీకి తాను ఊహిస్తున్న స్థాయిలో సీట్లు వస్తాయన్న ఆశ కనిపించడం లేదు.. ఒక వేళ బీజేపీకి రావలసిన మెజారిటీ కంటే చాలా తక్కువ స్థానాలు వచ్చిన పరిస్థితుల్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఈసారి ప్రధానమంత్రి పదవి మోడీకి, బీజేపీ నాయకుడికి కాకుండా ఎన్డీయేలో భాగస్వాములుగా వున్న మిగతా పక్షాల్లో వున్న సమర్థుడైన నాయకుడికి ప్రధానమంత్రిగా అవకాశం ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించే అవకాశం వుంది. ఆ నాయకుడు చంద్రబాబు ఎందుకు కాకూడదు? దేశ రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతోపాటు, ఇండియా భాగస్వామ్య పక్షాలతోపాటు, ఈ రెండు కూటములలోనూ లేని పార్టీల నుంచి కూడా మద్దతు కూడగట్టగల శక్తి వున్న నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆమాటకొస్తే బీజేపీలో కూడా మోడీ, అమిత్ షా మినహా చాలామంది చంద్రబాబు అభిమానులు వున్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం కూలిపోకుండా కాపాడిన చంద్రబాబు చరిత్రను గుజరాత్ బ్యాచ్ మరచిపోయి వుండొచ్చేమోగానీ, బీజేపీ మరచిపోదు. ఒకవేళ ప్రధానమంత్రి అభ్యర్థి మారాల్సి వచ్చిన పక్షంలో చంద్రబాబును మించిన వ్యక్తి మరొకరు లేరు. ఈ మాట అంటే కొంతమందికి కోపాలు వస్తే వచ్చాయిగానీ, అందర్నీ కలుపుకుని వెళ్ళే విషయంలోగానీ, నీతివంతమైన రాజకీయాలు నడపడంలోగానీ, ప్రజాస్వామిక విలువలను, లౌకిక విలువలను పాటించడంలోగానీ, సుదీర్ఘ అనుభవం విషయంలోగానీ, దేశాన్ని ముందుకు నడిపే విజన్‌లోగానీ, ట్రబుల్ షూటింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్‌లోగానీ నరేంద్ర మోడీ కంటే చంద్రబాబు ఒక మెట్టు పైనే వుంటారు. అందుకే ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ అవ్వాల్సిన ఒక కీలక అంశం.. ‘చంద్రబాబు.. వైనాట్ ప్రైమ్ మినిస్టర్’!

ఏపీ మానవ అక్రమ రవాణా కేంద్రంగా మారిందిః చంద్ర‌బాబు ఆందోళన

కాంబోడియా, భారత్ మధ్య  అక్రమ మాన‌వ‌ రవాణా రాకెట్ నడుస్తోంది. ఉద్యోగాల పేరిట ఎర వేసి 150 మందికి పైగా తెలుగు యువతను అక్రమ రవాణా చేశారు. డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఇక్క‌డి నుంచి తీసుకెళ్ళి, ఆన్ లైన్ స్కాం ఎలా చేయాలో వీరికి ట్రైనింగ్ ఇస్తున్నారు. బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారని మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  మన యువతను మోసం చేస్తూ, వారి జీవితాలతో ఆడుకుంటున్న నకిలీ ఏజెంట్ల ఆటకట్టించాలని, ఈ దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.  ఈ సందర్భంగా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ను కూడా చంద్రబాబు తన ట్వీట్ లో ట్యాగ్ చేశారు. వీలైనంత త్వరగా బాధితులను కాంబోడియా నుంచి తిరిగి తీసుకువచ్చేందుకు సాయపడాలని జైశంకర్ కు విజ్ఞప్తి చేశారు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల పేరిట కాంబోడియాకు మానవ అక్రమ రవాణా పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వ్యభిచారం కోసం మహిళల అక్రమ రవాణా అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ మూడో స్థానంలో ఉంది. రాష్ట్రంలో మహిళలు, బాలలు, వృద్ధులపై నేరాలు విపరీతంగా పెరిగాయి. ఆర్థిక, సైబర్‌ నేరాలు ఎక్కువయ్యాయి. హత్యాయత్నాలు, అపహరణలు పెరిగాయి. జాతీయ నేర గణాంక సంస్థ గణాంకాలు విశ్లేషిస్తే మన రాష్ట్రంలోని దారుణ పరిస్థితులు కళ్లకు కడుతున్నాయ‌ని చంద్ర‌బాబునాయుడు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుతోంది. ఏపీ నుంచి 150 మందికి పైగా తరలించినట్టు పోలీసులు గుర్తించారు. దాదాపు 5 వేల మంది వివిధ దేశాల్లో యువత ఆ ముఠా చేతిలో బందిగా వుంది. ఫెడెక్స్ , టాస్క్ గేమ్ పేరిట సైబర్ నేరాలు చేయడంలో ఈ అమాయకులని వాడుకుంటున్నారు. ఐటీ ఉద్యోగం పేరుతో నిరుద్యోగుల నుంచి లక్షన్నర వరకు వసూలు చేసి  కంబోడియాకు త‌ర‌లిస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగం అనగానే యువ‌త ట్రాప్‌లో ప‌డిపోతోంది.  కంబోడియాలో రక్షించిన దాదాపు 60 మంది భారతీయులతో కూడిన మొదటి బ్యాచ్‌ స్వదేశానికి చేరుకుంది.  అందులో పలువురు ఏపీ వాసులు ఉన్నారు. కంబోడియా సైబర్ నేరగాళ్ల ఉచ్చు నుంచి బయటపడి స్వరాష్ట్రానికి చేరుకున్న పలువురికి విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో విశాఖపట్నం పోలీసులు స్వాగతం పలికారు. త‌మ‌ను చైనీస్ ఆపరేటర్లకు విక్రయించి,  హింసించారు.సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడేలా ఒత్తిడి చేశారు, చీకటి గదులలో ఉంచి పనిచేయాలని హింసించిన‌ట్లు బాధితులు చెప్పారు.    అక్రమ రవాణాకు గురైన యువకుల విడుదల కోసం విదేశాంగ మంత్రిత్వ శాఖ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించిందని, హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేసిందని, దౌత్య మార్గాల ద్వారా ప్రయత్నాలు కొనసాగించడానికి ప్రత్యేక అధికారులను కూడా నియమించింది.   - ఎం.కె. ఫ‌జ‌ల్‌

కేంద్రంలో బీజేపీ సర్కార్ కొలువుదీరాలంటే చంద్రబాబే దిక్కు!?

ఆంధ్రప్రదేశ్ లో  తెలుగుదేశం కూటమి విజయం ఖారారైపోయింది. ఈ విషయాన్ని పోలింగ్ కు ముందు.. అంటే షెడ్యూల్ విడుదల కావడానికి ముందు వెలువడిన దాదాపు డజన్ ప్రముఖ సర్వే సంస్థలు చెప్పేశాయి. పోలింగ్ సరళి, పోలింగ్ తరువాత వైసీపీ నేతలు, శ్రేణుల భాష, బాడీ లాంగ్వేజ్ కూడా తెలుగుదేశం కూటమిదే అధికారమని చెప్పకనే చెప్పేశాయి. అధికారికంగా ఫలితాలు జూన్ 4న వెలువడతాయి. కనీసం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రావాలన్నా జూన్ 1 వరకూ ఎదురు చూడక తప్పదు. అప్పటి వరకూ ఎవరి అంచనాలు వారివి. ఎవరి ధీమా వారిది అనే భావించాల్సి ఉంటుంది. అయితే  అయితే ప్రశాంత్ కిషోర్ సహా  ప్రముఖ ఎన్నికల స్ట్రాటజిస్టులు మాత్రం ఇప్పటికే తమ అభిప్రాయంగా ఏపీలో తెలుగుదేశం కూటమి విజయం సునాయాసమని చెప్పారు. తాజాగా ఆ జాబితాలోకి సీనియర్ పోల్ అనలిస్ట్ యోగేంద్ర యాదవ్ చేరారు.  ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో  ఏపీలో ని పాతిక లోక్ సభ స్థానాలలో తెలుగుదేశం కూటమి కనీసం 15 లోక్ సభ స్థానాలలో విజయం సాధిస్తుందని అభిప్రాయపడ్డారు.  ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా జరిగిన పోలింగ్ సరళిని విశ్లేషించిన ఆయన తెలుగుదేశం అండ లేకుండా కేంద్రంలో బీజేపీ సర్కార్ కొలువుదీరే అవకాశాలు చాలా తక్కువ అని అభిప్రాయపడ్డారు. బీజేపీ ఘనంగా చెప్పుకుంటున్నట్లుగా సొంతంగా మూడు వందలకు పైగా స్థానాలలో విజయం సాధించే అవకాశాలు మృగ్యమన్నదే తన అభిప్రాయమని అన్నారు. ఆయన చెప్పిన ఈ మాటలు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంచనాలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఆయన ఇటీవల వరుసగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో ఏపీలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధిస్తుందని చెప్పడమే కాకుండా కేంద్రంలో బీజేపీ సొంతంగానే అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన స్థానాలలో విజయం సాధిస్తుందని చెప్పారు.  అయితే యోగేంద్రయాదవ్ మాత్రం బీజేపీ అగ్రనేతలు ప్రకటనలు చేస్తున్నట్లుగా ఎన్డీయే కూటమి 400 స్థానాలలో విజయం సాధించే అవకాశం లేదని కుండబద్దలు కొట్టేశారు.  బీజేపీకి కంచుకోటలాంటి ఉత్తర ప్రదేశ్ లోనే ఆ పార్టీ భారీగా   సీట్లను కోల్పోయే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.   యోగేంద్రయాదవ్ అంచనా ప్రకారం బీజేపీ సొంతంగా 240 నుంచి 260 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది. అయితే ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు మరో 35 నుంచి 40 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందనీ, దాంతో మొత్తంగా ఎన్డీయేకు 275 నుంచి 305 స్థానాలు వచ్చే అవకాశం ఉందన్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మేజిక్ ఫిగర్ 272 అన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికలలో బీజేపీ సొంతంగా 303 స్థానాలలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఆ పరిస్థితి ఎంత మాత్రం లేదని యోగేంద్రయాదవ్ అభిప్రాయపడ్డారు. సో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే భాగస్వామ్య పక్షాల మద్దతుపై ఆధారపడక తప్పదనీ, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలలో  సీట్ల పరంగా ఎక్కువ స్థానాలు సాధించే పార్టీ తెలుగుదేశమేననీ చెప్పిన ఆయన కేంద్రంలో మోడీ సర్కార్ కొలువుదీరాలంటే, సుస్థిరంగా కొనసాగాలంటే తెలుగుదేశంపై ఆధారపడక తప్పదని యోగేంద్రయాదవ్ చెప్పారు.  

అభ్యర్థులకు చెమట్లు పట్టిస్తున్న నోటా!

నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో నోటా (నన్ ఆఫ్ ది ఎబోవ్) కీలకం కాబోతోంది. బారీ మెజారిటీతో విజయం సాధించే అవకాశాలున్న నియోజకవర్గాలను పక్కన పెట్టేస్తే.. హోరాహోరీగా పోటీ జరిగిన నియోజకవర్గాలలో మాత్రం నోటా గెలుపు ఓటములను కచ్చితంగా ప్రభావితం చేస్తుందని పరిశీలకులు అంటున్నారు. ఇందుకు వారు పలు ఉదాహరణలు కూడా చూపుతున్నారు.  దీంతో ఏపీలో ఇప్పుడు పలు నియోజకవర్గాల అభ్యర్థులకు నోటా టెన్షన్ పట్టుకుంది. నోటా కోటాలో ఎన్ని ఓట్లు పడి ఉంటాయన్న చర్చ విపరీతంగా జరుగుతోంది. 2014 ఎన్నికలలో నోటా ఓట్లు పెద్దగా ప్రభావం చూపలేదు కానీ, 2019 ఎన్నికలలో  నోటాకు పడిన ఓట్లు గణనీయంగా పెరిగాయి. 2024 ఎన్నికలలో కూడా అదే జరిగితే.. ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశమే ఇప్పుడు అభ్యర్థులకు చెమటలు పట్టిస్తోంది.  ఉదాహరణకి అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో 2014లో నోటాకు 14వేల457 ఓట్లు పడ్డాయి. 2019 ఎన్నికలు వచ్చేసరికి ఆ సంఖ్య 48వేల621కి పెరిగింది.  గిరిజన ప్రాంతాలలో పెరిగిన అక్షరాస్యత ఓటర్లు  నోటా వైపుకు మొగ్గు చూపేలా చేస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. గిరిజన ప్రాంతాల సమస్యల పరిష్కారంలో  ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే గిరిజనులలో అక్షరాస్యులు నోటావైపు మొగ్గు చూపుతున్నారని భావిస్తున్నారు. అరకు నియోజకవర్గాన్నే తీసుకుంటే.. అక్కడ 2019 ఎన్నికలలో నోటాకు వచ్చిన ఓట్ల విషయంలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది.   దీంతో ఇప్పుడు నోటా ఓటు అభ్యర్థులకు చెమటలు పట్టిస్తోంది. కొన్ని సందర్బాలలో  విజయం సాధించిన అభ్యర్థికి, పరాజయం పాలైన అభ్యర్థికి మధ్య ఓట్ల తేడా నోటాకు వచ్చిన ఓట్ల కంటే తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఇందుకు ఉదాహరణగా  చోడవరం నియోజకవర్గంలో 2014 ఎన్నికలలో విజయం సాధించిన అభ్యర్థి మెజారిటీ నోటాకు వచ్చిన ఓట్ల కంటే తక్కువగా ఉన్నాయి.     

 దేశంలో ఆరో విడత పోలింగ్ షురూ... ఓటు వేసిన రాష్ట్రపతి, కేంద్రమంత్రులు

దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది ఇప్పటివరకు అయిదు విడతల్లో పోలింగ్ ముగిసింది. ఏపీ అసెంబ్లీ సహా మొత్తం 10 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ ఈ నెల 13వ తేదీన పూర్తయింది.  ఆరవ విడత పోలింగ్ లో . ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఢిల్లీలో ఉదయం 9 గంటల వరకూ సగటున 10 శాతం పోలింగ్ నమోదైంది. ఢిల్లీలో 8.94 శాతం పోలింగ్ నమోదవగా పశ్చిమ బెంగాల్‌లో గరిష్ఠంగా 16.54 పోలింగ్ నమోదైంది. ఈసారి ఎన్నికల్లో 889 మంది కాండిడేట్ల భవిష్యత్తును 11 కోట్ల మంది ఓటర్లు నిర్దేశించనున్నారు.  కాగా, ఈ విడత ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలో ఓటు వేశారు. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, రావ్ ఇందర్‌జిత్ సింగ్, మంత్రి జైశంకర్ బీజేపీ నేత మేనకా గాంధీ, సంబిత్ పాత్ర, మనోహర్ ఖట్టర్, మనోజ్ తివారీ, మహబూబా ముఫ్తీ, కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్, మాజీ క్రికెటర్ బీజేపీ నేత గౌతం గంభీర్ తదితర ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పోస్టల్ బ్యాలెట్టే ఫలితం చెప్పేసింది! వైనాట్ తెలుగుదేశం విన్ 175!!

ఆంధ్రప్రదేశ్‌లో 5 లక్షల 39 వేల 189 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. జూన్ 4వ తేదీన ఆయా జిల్లాల్లో ఎన్ని టేబుల్స్ వేసి లెక్కించాలనే అంశంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 38 వేల 865 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ కాగా రెండో స్థానంలో  నంద్యాల జిల్లా  నిలిచింది. ఇక్కడ 25 వేల 283 పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు పడ్డాయి. ఆ తరువాతి  కడప జిల్లా 24 వేల 918 పోస్టల్ బ్యాలెట్లు పపోలయ్యాయి. ఇక అత్యల్పంగా నరసాపురంలో 15 వేల 320 పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తం మీద ప్రతి నియోజకవర్గంలోనూ సగటున తక్కువలో తక్కువ 3 వేలకు పైగా ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్  వివరాలు పూర్తిగా రావడంతో ఏ జిల్లాలో ఎన్ని  టేబుల్స్ ఏర్పాటు చేయాలి..? ఒక్కో టేబుల్‌లో ఎన్ని లెక్కించాలని అనే అంశంపై రిట ర్నింగ్ అధికారులకు కేంద్ర ఎన్నికల కమిషన్ సమాచారం ఇచ్చింది. ఇలా ఉండగా పోస్టల్ ఓట్ల లెక్కింపు విషయంలో ఒకింత వివాదం తలెత్తింది. డిక్లరేషన్ పై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం లేని ఓట్లు లెక్కించాలా వద్దా అన్నదానిపై మీమాసం నెలకొంది. అయితే గెజిటెడ్ ఆఫీసర్ సతకం చేసిన సీల్ లేకపోయినా పోస్టల్ ఓట్లను పరిగణనలోనికి తీసుకోవాలని తెలుగుదేశం కూటమి గట్టిగా పట్టుబట్టింది. ఇందుకు ఎన్నికల కమిషన్ మౌఖికంగా అంగీకారం కూడా తెలిపింది. అయితే ఆ అంగీకారం రాతపూర్వకంగా కావాలని తెలుగుదేశం కూటమి పట్టుబడుతోంది. వాస్తవానికి గెజిటెడ్ ఆఫీసర్ సంతకం బాధ్యత ఎన్నికల కమిషన్ దేనని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. గెజిటెడ్ ఆఫీసర్ ద్వారానే పోస్టల్ బ్యాలెట్ విడుదల అవుతుంది, ఆయన ఇవ్వకుండా ఎవరికీ పోస్టల్ బ్యాలెట్ అందే అవకాశమే లేదనీ అంటున్నారు. ఆ కారణంగానే సంతకం సీల్ వంటి టెక్నికాలిటీస్ తో సంబంధం లేకుండా పోలైన ఓట్లన్నీ లెక్కించాలని తెలుగుదేశం కూటమి డిమాండ్ చేస్తోంది.  అదలా ఉంచితే..  ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతోందో పోలైన పోస్టల్ ఓట్లను బట్టి చెప్పే యవచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో ఏపీ సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలో ఎన్నడూ, ఎక్కడా లేని విధంగా భారీగా ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఒటు హక్కు వినియోగించుకున్నారు. హోరాహోరీగా జరిగిన ఎన్నికల పోరులో నియోజకవర్గానికి సగటున మూడు వేలకు పైగా పోలైన ఓట్లు అత్యంత కీలకం కానున్నాయి. అధికార పార్టీయే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగులు వినియోగించుకున్న ఓటు కచ్చితంగా తమకు వ్యతిరేకంగానే అని నమ్ముతోంది. ఆ లెక్కన చూస్తే రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలోనూ కూడా వైసీపీ గట్టెక్కే పరిస్థితి లేదన్న భావన ఇప్పుడు సర్వత్రా వ్యక్తం అవుతోంది. అదే సమయంలో నెటిజనులు భారీగా పోలైన పోస్టల్ ఓట్లను ఉటంకిస్తూ.. జగన్ చెప్పిన వైనాట్ 175 రివర్స్ అవుతుందేమో అంటున్నారు. వారు జగన్ వైనాట్ 175 అని వైసీపీ గెలిచే సీట్ల గురించి మాట్లాడితే.. ఇప్పుడు అది రివర్స్ అయినట్లు కనిపిస్తోందనీ, వైనాట్ తెలుగుదేశం విన్ 175 అన్నట్లుగా పరిస్థితి ఉందనీ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ ఓ రేంజ్ లో వైసీపీని ట్రోల్ చేస్తున్నారు.  

వేటగాళ్లకే జగన్ మద్దతు! జూన్ 4 తర్వాత మంచి రోజులు వస్తాయి

వైసీపీ నేతలు ఓటమి భయంతోనే హింసకు పూనుకున్నారు. జూన్ 4న బాక్సులు బద్దలైయ్యేలా ప్రజా ఆమోదంతో టీడీపీ అఖండ మెజార్టీతో గెలవబోతుంది అని ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ ధీమా వ్యక్తం చేశారు. అధికారులు భయపడాల్సిన అవసరంలేదు. లీవ్‌లు పెట్టుకుని వెళ్లాల్సిన అవసరంలేదు. నిష్పక్షపాతంగా పనిచేయాలి అని మహ్మద్ ఇక్బాల్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి ఓటమి భయం పట్టుకుంది. అందుకే రాష్ట్రంలో డబ్బుల పందేరంతో పాటు, అరాచకం సృష్టించి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని ప్లాన్ చేశాడు.  పల్నాడు, తిరుపతి, చంద్రగిరి, నరసరావుపేటలతో పాటు చాలా చోట్ల విధ్వంసం, రక్తపాతం సృష్టించారని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పిన్నెల్లి, పెద్దారెడ్డి లాంటి వేటగాళ్లకు మద్దతు తెలుపుతున్న జగన్ పాలన‌లో అరాచ‌కాల గుట్టును ఆయ‌న‌ విప్పారు. 1. పిన్నెల్లి అరాచకం ప్రజలందరూ చూసినా గుర్తు తెలియని వ్యక్తులని 324 కేసు పెట్టడం దారుణం. వెంటనే 307 కేసు పెట్టి ఉంటే పిన్నెల్లికి బెయిల్ వచ్చేది కాదు.  శేషగిరిరావును హత్య చేయాలని చూసినా కేసు పెట్టలేదు. వైసీపీ గుండాల అరాచకంతో శేషగిరిరావు ఊరి విడిచి పోలాల్లో ఉంటున్న పరిస్థితి వచ్చింది.   2. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దౌర్జన్యంగా 74 పంచాయతీలను ఏకగ్రీవం చేసుకున్నారు.    3. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై దాడులుకు తెగబడ్డారు. 4. వైసీపీ దాడులతో 100 ముస్లిం కుటుంబాలు సొంత ఊరు విడిచిపోయారు.  5. బీసీ వ్యక్తి చంద్రయ్యను సినిమా తరహాలో దారుణంగా గొంతుకోసి చంపారు.  6. నియోజకవర్గంలో పిన్నెల్లి ఇష్టానుసారంగా దోచుకున్నాడు. దాదాపు రూ. 2000 కోట్లు కొల్లగొట్టాడు. అడ్డు అదుపు లేకుండా భరితెగించి ప్రవర్తించాడు. తెలంగాణ బార్డర్ లో చెక్ పోస్టులు పెట్టి కమీషన్‌లు దండుకున్నాడు. రక్తపాతం సృష్టించిన పిన్నెల్లి లాంటి నేతలను సౌమ్యశీలులు అంటున్న జగన్ రెడ్డి విజ్ఞత ఏమనాల‌ని  మహ్మద్ ఇక్బాల్ ప్ర‌శ్నిస్తున్నారు.  జగన్ రెడ్డి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశాడు. పోలీసులు, రెవెన్యూ డిపార్ట్ మెంట్లలో తాబేదారులను నియమించుకుని ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. ప్రజాస్వామ్యంగా గెలవలేమని భావించి దండుకున్న డబ్బులను పంచి గెలవాలని జగన్ రెడ్డి కుట్ర చేశాడు. ఎర్రగొండపాలెం, పుంగనూరులో చంద్రబాబు పై దాడులు చేయించి మళ్లీ టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారు. రాష్ట్రంలో వైసీపీ పార్టీ మాత్రమే ఉండాలని ఎలక్షన్ జరగనివ్వకూడదని వైసీపీ నేతలు యత్నించారు. లేని కారుచిచ్చు రగిలించి రక్తపాతాన్ని సృష్టించారు. డీఎస్పీ చైతన్య లాంటి అధికారులు వంత పాడటంతో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. టీడీపీ సానుకూల పరులు సొంత ఊరు విడిచి పోయిన పరిస్థితికి తెచ్చారు. జగన్ రెడ్డి అన్ని వ్వవస్థలను సర్వ నాశనం చేశాడు. విద్యావస్థను భ్రష్టుపట్టించి బైజూస్ కు వేల కోట్లు కట్టబెట్టి కమీషన్ లు దండుకున్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నాడు. 2019 నుండి 2024వరకు ఇసుక, మద్యంలో దోపిడీలపై రికార్డులను దగ్ధం చేయకుండా ఈసీ చర్యలు తీసుకోవాలి. కిందిస్థాయి పోలీసులు భయపడకుండా ఎలక్షన్ కమిషన్ మనోధౌర్యం కల్పించాలి. కింది స్థాయిలో పోలీసులు డ్యూటీలకు వెళితే తిండిలేని పరిస్థితి ఉంది. లా ఆండ్ ఆర్డర్‌లను కలెక్టర్లు, ఎమ్మార్వోలు కూడా కాపాడాలి. ఇలాంటి ఘటనలపై వెంటనే స్పందించి 307 కేసులు పెట్టించాలి.   అధికారులు తప్పులకు తావులేకుండా ఎలక్షన్ కౌంటిగ్ వద్ద నిర్భయంగా పనిచేయాలి. దాడులు చేసేవారిని ముందే పసిగట్టి శిక్షించాలి. ఒత్తిడిలో ఉన్న అధికారులు బయటకు రావాలి. జూన్ 4 తరువాత మంచిరోజులు వస్తాయి అంటున్నారు మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్. - ఎం.కె. ఫ‌జ‌ల్‌

షర్మిల మళ్లీ మొదలెట్టేసారు!

అసలే ఓటమి భయంతో వణికి పోతున్న వైసీపీ నేతలకు ఇప్పుడు షర్మిల విమర్శల దాడి పుండుమీద కారం చల్లినట్లుగా ఉంది. రాష్ట్రంలో ఎక్కడ ఎవరు వైసీపీకీ, జగన్ కు వ్యతిరేకంగా గొంతెత్తినా వారిని తెలుగుదేశం పెయిడ్ అర్టిస్టులంటూ నిందలేని, విమర్శలు చేసి నానాయాగీ చేసి చంకలు గుద్దుకున్న వైసీపీ నేతలకు షర్మిల రిటార్డ్ మింగుడు పడలేదు. అందరినీ విమర్శించినట్లే షర్మిలపై కూడా వైసీపీ నేతలు, శ్రేణులు తెలుగుదేశం పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ ముద్రవేసి గేలిచేసే ప్రయత్నం చేశారు. కానీ ఆమె వారికి దీటుగా బదులిచ్చి నోళ్లు మూయించగలిగారు. షర్మిల చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారంటూ వైసీపీ విమర్శలకు,  తనకు స్క్రిప్ట్ చూసి ప్రసంగాలు చేయాల్సిన ఖర్మ లేదని చెప్పడమే కాకుండా.. జగన్ కు స్క్రిప్ట్ రాసేవాళ్లెవరో కాస్త వాస్తవాలు తెలుసుకుంటే మంచిదని హితవు చెప్పారు. అంతే కాదు.. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, దౌర్జన్యాలన్నిటి వెనుకా ఉన్నది జగన్ ప్రభుత్వమేనంటే ఎదురుదాడికి దిగారు. కడప లోక్ సభ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిపై పోటీకి దిగి మొత్తం కడప జిల్లా రాజకీయ ముఖచిత్రాన్నే మార్చివేసిన షర్మిల.. ఆ తరువాత అంటే పోలింగ్ ముగిసిన తరువాత తన విమర్శల దాడికి ఒకింత విరామం ఇచ్చారు.   అయితే ఆ విరామం తాత్కాలికమేనని షర్మిల తన తాజా మాటల దాడితో రుజువు చేశారు.  రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉంటే.. ప్రపంచంలోనే అత్యంత పేదవాడైన జగన్  జగన్ అత్యంత ఖరీదైన విమానంలో విహార యాత్రకు వెళ్లారంటూ సెటైర్లు గుప్పించారు.  ఏలూరు జిల్లాలో  టెన్త్  విద్యార్థిని మీద జరిగిన అత్యాచార ఘటనను ఖండిస్తూ రాష్ట్రంలో ఇంత అమానవీయ ఘటనలు చోటు చేసుకుంటుంటే జగన్ మాత్రం, ఓట్లేసిన మహిళల ఆర్తనాదాలు, హాహాకారాలు పట్టించుకోకుండా లండన్ విధులలో విహార యాత్రలు చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు.  పోలింగ్ పూర్తయ్యే వరకూ  తల్లుల్లు, నా అక్క చెల్లెమ్మలు, నా అవ్వలు అంటూ చెప్పిన జగన్ మాటలన్నీ ఫేక్ అని కుండబద్దలు కొట్టేశారు.  వైసీపీ పాలనలో  మహిళల భద్రత కరవైందని దేశం మొత్తం చెబుతుంటే వైసీపీ నేతలు, మంత్రులకు కనీసం సిగ్గని కూడా అనిపించడం లేదని దుయ్యబట్టారు.  అసలే ఎన్నికలలో ఫలితం తమకు అనుకూలంగా లేదన్న ఆందోళనలో ఉన్న వైసీపీకి.. ఇప్పుడు షర్మిల మళ్లీ విమర్శల దాడి మొదలు పెట్టడంతో  సమాధానం ఎలా చెప్పుకోవాలో, షర్మిల విమర్శలకు ప్రతి విమర్శలు ఎలా చేయాలో  కూడా అర్ధం కావడం లేదు. ఇప్పుడు సరే నిజంగానే రేపు వైసీపీ అధికారానికి దూరమైతే షర్మిల మాటల దాడిని తట్టుకోవడం ఎలారా భగవంతుడా అని తలలు పట్టుకుంటున్నారు.   

పిన్నెల్లికి మాచర్ల దూరమే.. నియోజకవర్గంలో అడుగుపెడితే అరెస్టే!

పోలింగ్ కేంద్రంలో ఈవీఎం లను బద్దలుకొట్టిన కేసులో పరారీలో ఉన్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి హై కోర్ట్ లో ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేయగా కోర్టు బెయిలు మంజూరు చేసిన విషయం విదితమే. అయితే ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.   పోలింగ్ రోజే వైసీపీ అభ్యర్థి  పోలింగ్ కేంద్రంలో ఈవీఎం  ను ధ్వంసం చేసి మాచర్ల నియోజకవర్గంలో దాడులతో భయానక వాతావరణాన్ని సృష్టించిన పిన్నెల్లి   కౌంటింగ్ రోజు మాచర్లలోకి అడుగు పెట్టడానికి వీల్లేదని కోర్టు షరతు విధించింది.   పిన్నెల్లి కౌంటింగ్ రోజు కూడా మాచర్లలో ఉంటే అక్కడ పరిస్థితులను అదుపులోకి తీసుకు రావడం కష్టమని అధికారులు భావిస్తున్నారు. ఇటువంటి సమస్యాత్మక ప్రాంతాలలో కౌంటింగ్ రోజు కేంద్ర బలగాలతో అదనపు భద్రతను కల్పించాల్సిన అవసరం ఉందంటూ కూటమి నేతలు అధికారులను డిమాండ్ చేశారు. ఈవీఎం లను ధ్వంసం చేసిన ఘటనలో పిన్నెల్లి ని అరెస్టు చేయాలనీ ఈసీ ఆదేశించినప్పటికీ ఆయనకు హై కోర్ట్ ముందస్తు బెయిలు మంజూరు చేసిన హైకోర్టు ఆయనను మాచర్లలో అడుగుపెట్టరాదని షరతు విధించింది. కౌంటింగ్ రోజున ఆయన నరసరావు పేట కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేందుకైతే అనుమతి ఇచ్చింది. అదే విధంగా నరసరావు పేట దాటి బయటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.  ఇదిలా ఉండగా మాచర్లలో పిన్నెల్లి ఓటమి ఖాయమైపోయిందని తెలుగుదేశం శ్రేణులు చెబుతున్నాయి. కౌంటింగ్ రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. పిన్నెల్లి ధ్వంసం చేసిన ఈవీఎంలో  వీవీ ప్యాట్  ఆధారంగా ఆ బూత్ లో  అప్పటి వరకూ పోలైన ఓట్లలో తెలుగుదేశం సైకిల్ గుర్తుకు 22 ఓట్లు, వైసీపీ ఫ్యాన్ కి 6 ఓట్లు మాత్రమే పడ్డాయని తేలింది. దీనిని బట్టే వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజాగ్రహం, అలాగే పిన్నెల్లిని ఓడించి తీరాలన్న మాచర్ల ప్రజల సంకల్పం ప్రస్ఫులంగా తెలుస్తున్నాయని  తెలుగుదేశం శ్రేణులు చెబుతున్నాయి.   ప్రస్తుతం కోర్టు ఆదేశాలతో మాచర్లలో అడుగుపెట్టడానికి వీల్లేని పిన్నెల్లి, జూన్ 4న ఫలితం వెలువడిన తరువాత మాచర్లవైపు చూసే ధైర్యం కూడా చేయలేరని అంటున్నారు.     వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈనెల 13న పాల్వాయి గేటులోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేస్తుండగా అడ్డుకున్నందుకు తనపై పిన్నెల్లి దాడి చేశాడని టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు రెంటచింతల పోలీసులు తెలిపారు. దీంతో పిన్నెల్లిపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వేసవి సెలవులు ముగింపు దశకు వస్తున్న తరుణంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల 30 వరకూ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. తిరుమల శ్రీవారిని శుక్రవారం (మే 24) మొత్తం 70వేల 668 మంది దర్శించుకున్నారు. వారిలో 38వేల36 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శనివారం (మే 25) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తులు క్యూలైన్ శిలా తోరణం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 64లక్షల రూపాయలు వచ్చింది.  

జగన్ వెంటే జనం.. ఎమ్మెల్యేల వల్లే ఓటమి.. వైసీపీ కొత్త కథలు!

ఆంధ్రప్రదేశ్ లో మార్పు ఖాయమని తేలిపోయింది. మార్చి 13న రాష్ట్ర ప్రజలు మొక్కవోని ధైర్యంతో, మార్పు కావాలన్న సంకల్పంతో ఎన్నో అవరోధాలు ఎదుర్కొని మరీ పోలింగ్  బూత్ లకు వచ్చి గంటల తరబడి నిలబడి మరీ ఓటు వేశారు. తమ ఓటు హక్కు వినియోగించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి కాముకుడి చేతుల్లో పెట్టాలన్న పట్టుదలతో రాష్ట్రాలు, దేశాలలో స్థిరపడి కొలువులు చేసుకుంటున్నవారు కూడా స్వస్థలాలకు ఎన్నో వ్యయప్రయాశలకు ఓర్చి మరీ వచ్చారు. దీంతో రాష్ట్రంలో భారీగా పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ సరళి వైసీపీ పెద్దల మైండ్ బ్లాక్ చేసింది. పోలింగ్ ముగిసిన క్షణం నుంచే వారు తమ ఓటమిని అంగీకరించేశారు. ఓటమికి కారణాలు వెతుక్కుని వెతుక్కుని మరీ చెప్పారు.  నగరి నుంచి పోటీ చేసిన మంత్రి రోజా అయితే.. తన ఓటమికి సొంత పార్టీ వారే కారణమని పోలింగ్ ఇంకా పూర్తిగా ముగియకుండానే మీడియా ముందుకు వచ్చి గొంతు చించుకుని మరీ చెప్పారు. ఇక పోలింగ్ జరిగిన మరుసటి రోజు నుంచి వైసీపీ నేతలు ఒక్కరొక్కరుగా.. మైకుల ముందుకు వచ్చి తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తూ, ఆయన ఎన్నికల సంఘాన్నీ పోలీసులనూ మేనేజ్ చేసి తమ అవకాశాలు దెబ్బతీశారంటూ విమర్శలు గుప్పించడం మొదలు పెట్టారు. అధికార పార్టీ అయి ఉండీ కొందరు పోలింగ్ ఏకపక్షంగా తెలుగుదేశంకు అనుకూలంగా జరిగిందని బేల అరుపులు అరిచారు. సరే ఎంత గింజుకున్నా, ఎంత మొత్తుకున్నా ఓటమి మాట మాత్రం వారి నోటి వెంట వారికి తెలియకుండానే వచ్చేసింది.  ఇక పార్టీ అధినేత జగన్ గంభీరంగా గత ఎన్నికల కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం అని ఓ మాట చెప్పి విదేశీ పర్యటనకు చెక్కేశారు. అధినేత గెలుపుపై చెప్పిన మాట వైసీపీ శ్రేణులకు ఇసుమంతైనా భరోసా కలిగించలేదనుకోండి అది వేరే సంగతి.  ఇక ఓట్ల లెక్కింపునకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీ వ్యూహకర్తలు ఓటమికి కారణాలు వెతుక్కుని మరీ చెబుతున్నారు. అందులో భాగంగానే  విరిప్పుడు ఎన్నికలలో వైసీపీ పరాజయం పాలు కావడం ఖాయమని అంగీకరించేసి.. ఆ ఓటమికి కారణాలు చెప్పుకొస్తున్నారు. అందుకు వారు సామాజిక మాధ్యమాన్నే వేదికగా ఎంచుకున్నారు.  జనం మొత్తం జగన్ వెంటే ఉన్నారని చెప్పుకొస్తున్నారు. అయితే ఎమ్మెల్యేలపై ప్రజలలో గూడుకట్టుకున్న తీవ్ర వ్యతిరేకత కారణంగా జగన్ అధికారానికి దూరం కాబోతున్నారన్నట్లుగా కథనాలు వండి వారుస్తోంది. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత గడపగడపకూ సమయంలోనే ప్రస్ఫుటమైందనీ, వైసీపీ అధికారంలో ఉండాలి అయితే ఆ ఎమ్మెల్యే మాత్రం మాకు వద్దు అంటూ పలు నియోజకవర్గాలలో ప్రజల నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చాయనీ చెప్పుకొస్తున్నారు. అందుకనుగుణంగానే జగన్ పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను మార్చినప్పటికీ అప్పటికే ఆలస్యమైందని వివరణలు ఇచ్చుకుంటున్నారు.  కానీ వాస్తవమేమిటంటే ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పు స్పష్టంగా జగన్  పాలనక వ్యతిరేకంగా ఇవ్వడానికి డిసైడైపోయారని పరిశీలకులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే..జనం ఈ ఎమ్మెల్యే మాకొద్దు అంటూనే జగన్ అసలే వద్దు అని విస్పష్టంగా చెప్పేశారనీ, అందుకే ఇప్పుడు జగన్ కు అనుకూలమే కానీ వ్యతిరేకత అంతా ఎమ్మెల్యేలపైనని కలర్ ఇచ్చేందుకు శతథా ప్రయత్నిస్తున్నారు. అసలు జగన్ పై కంటే ఎమ్మెల్యేలపై ప్రజలలో వ్యతిరేకత ప్రబలడానికి కారణాలేమీ లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే నియోజకవర్గాలలో వాలంటీర్ల పెత్తనంతో  ఎమ్మెల్యేల పాత్ర  డమ్మీల స్థాయికి పరిమితమైపోయిందని అంటున్నారు. 

మద్యం డోస్ ఎక్కువై రోడ్ల‌పై రెచ్చిపోతున్న ప్రేమికులు!

మద్యం మత్తులో యువతీ యువకుల అరాచ‌కాల‌కు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. డ్రగ్స్ , గంజాయి తదితర మత్తుపదార్ధాలకు అలవాటుపడి నేషనల్ హైవే పై, ప‌బ్లిక్ ప్లేస్‌ల‌లోనే  గొడవపడుతున్నారు. వీరేమ‌న్నా అవారాగాళ్ళ అంటే అదీ కాదు.  విద్యావంతులే. అయితే పశువులు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. మరీ వీళ్లను ఏమనాలో..!  జనంతో ఛీ అనిపించుకునే పరిస్థితులు తెచ్చుకుంటున్నారు.  సమాజ కట్టుబాటుపై, చట్టాల పై ధిక్కార స్వరం..! వీరు ఆధునిక జీవనశైలికై ఆరాట‌ప‌డుతూ అరాచ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. హైదరాబాద్‌లో  ఓ యువ‌ జంట పట్టపగలే నడిరోడ్డుపై రెచ్చిపోయింది. శుక్రవారం వేకువజామున బీరు తాగుతూ నానా హంగామా సృష్టించారు. నాగోల్‌లో ఓ వైపు మార్నింగ్ వాకర్స్ తమ పనుల్లో నిమగ్నమై ఉంటే.. ఇంకోవైపు ప్రేమికులిద్దరూ బీరు సీసాలు చేతిలో పెట్టుకుని.. కారులో భీకరమైన లౌడ్ స్పీకర్లు ఆన్ చేసి.. నడిరోడ్డుపై తాగుతూ అభ్యంతరకరంగా ప్రవర్తించారు. వారి చేష్టలను కొంతసేపు భరించిన వాకర్స్.. మరింత శృతిమించడంతో ప్రజలు కలుగజేసుకుని ఇది పద్ధతి కాదని చెప్పిన పాపానికి జంట మరింత రెచ్చిపోయింది. వాకర్స్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అమ్మాయైతే.. బీరు సీసా చేతిలో పట్టుకుని దాడి చేసేందుకు ప్రయత్నిస్తూ బండ బూతులు తిట్టింది. అక్కడే ఉన్న వాకర్స్.. ఈ దృశ్యాలు మొబైల్‌లో చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. పలువురు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇదేం మాయరోగం అంటూ జంటపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదేం పెంపకం అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.   రాజస్థాన్‌లోనూ ఇలాంటి సంఘ‌ట‌నే వైర‌ల్ అయి నెట్‌లో చ‌క్క‌ర్ కొడుతోంది. ఆ జంట నడిరోడ్డుపై బైక్‌పై వెళ్తూ హద్దులు దాటి ప్రవర్తించింది. ప్రేమికులిద్దరూ రొమాన్స్‌లో మునిగిపోయారు.  ముద్దులు పెట్టుకుంటూ బైక్‌పై ఎంజాయ్ చేశారు. అయితే అక్క‌డి పోలీసులు జోక్యం చేసుకొని ఆ ప్రేమ‌ప‌క్షుల్ని పోలీసులు స్టేషన్‌కు తరలించారు.  గుంజీలు తీయించారు. ఇద్దరి చేత ప్రమాణాలు కూడా చేయించారు. మరోసారి ఇలా చేయమంటూ వారిద్దరి చేత ప్రమాణపత్రం కూడా తీసుకున్నారు. 

పాలిసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల.. జూన్ 20న కౌన్సిలింగ్ ప్రారంభం 

తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో బాలికలదే పై చేయిగా నిలిచింది. ఈ నేపథ్యంలో  తెలంగాణలో పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. రెండు విడుతల్లో కౌన్సెలింగ్ ఉండనుంది. జూన్ 20న పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. జూన్ 22న తొలి విడత వెబ్ ఆప్షన్లు, జూన్ 30న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉండనుంది. జులై 7న రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. జులై 9న రెండో విడత వెబ్ ఆప్షన్లు, జులై 13న రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇంటర్నల్ స్లైడింగ్‌ని కన్వీనర్ ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. జులై 21 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్‌కి అవకాశమిచ్చారు. జులై 24న సీట్లను కేటాయించి... జులై 23న స్పాట్ అడ్మిషన్ మార్గదర్శకాలను విడుదల చేస్తారు.ఇంజినీరింగ్ కౌన్సిల్ షెడ్యూల్ కూడా విడుదలైంది. జూన్ 27 నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ, జూన్ 30 నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లు, జులై 12న మొదటి విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయించనున్నారు. మూడు విడతల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియను చేపట్టనున్నారు. జులై 19న రెండో విడత కౌన్సెలింగ్, జులై 24న సీట్ల కేటాయింపు ఉంటుంది. జులై 30న ఇంజినీరింగ్ తుది విడత కౌన్సెలింగ్, ఆగస్ట్ 5న తుది విడత సీట్లను కేటాయించనున్నారు.

ఆర్మూరు మాజీ ఎమ్మెల్యేపై చేవెళ్లలో భూ కబ్జా కేసు 

ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఆయన నేర చరిత్ర ఒక్క ఆర్మూర్ ప్రజలకే కాకుండా హైదరాబాద్ శివారు ప్రాంత వాసులకు కూడా బోధపడింది. ఇప్పటికే ఆర్మూరులో భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న జీవన్ రెడ్డి చేవెళ్ల నియోజకవర్గంలో కూడా భూ కబ్జాలు చేసిన ఆరోపణతో  కొత్త చరిత్ర సృష్టించారు.   బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్లలో కేసు నమోదైంది. తన భూమిని కబ్జా చేశాడంటూ బాధితుడు ఒకరు చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనపై మారణాయుధాలతో బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు జీవన్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీసులు ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 2023లో ఫంక్షన్ హాలును కూల్చివేసి దానిని కబ్జా చేశారని బాధితుడు దామోదర్ రెడ్డి ఆరోపించారు. ఈ భూమికి పంజాబ్ గ్యాంగ్ ను కాపలా ఉంచారని... తాను ప్రశ్నిస్తే దాడి చేశారని వాపోయారు. కాగా, జీవన్ రెడ్డి, దామోదర్ రెడ్డి మధ్య వివాదం చాలాకాలంగా కొనసాగుతోంది. అయితే ఆ భూమి తనదేనని... తాను నాలుగేళ్ల క్రితం దానిని కొనుగోలు చేశానని జీవన్ రెడ్డి చెబుతున్నారు. ఈ భూమి వ్యవహారంలో జీవన్ రెడ్డి కోర్టుకు వెళ్లారు.

హెలికాప్టర్ కూలిపోయేదే... బాబోయ్ గుండె దడ!!

ప్రముఖ పుణ్యక్షత్రం కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్ ప్రమాదం జస్ట్ మిస్సయింది. ఉత్త‌రాఖండ్‌లోని జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్‌‌ వెళ్ళే భక్తులు నడిచి వెళ్తారు. కొంతమంది హెలికాప్టర్లలో వెళ్తూ వుంటారు. దానికోసం ప్రైవేట్ ఛాపర్లు అందుబాటులో వుంటాయి. శుక్రవారం నాడు అలాంటి ఒక హెలికాప్టర్ ఏడుగురు భక్తులను కేదార్‌నాథ్‌కి తీసుకొచ్చింది. లాండింగ్ అవుతూ వుండగా ఉన్నట్టుండి ఏమైందోగానీ హెలికాప్టర్ గిరగిరా తిరగడం ప్రారంభించింది. హెలికాప్టర్ ఫ్యాన్ గిరగరా తిరుగుతుంది కదా.. ఇందులో కొత్తేముంది అనుకోకండి.. గిరగిరా తిరిగింది హెలికాప్టర్ చక్రం కాదు.. హెలికాప్టరే. దాంతో హెలీప్యాడ్ దగ్గర వున్నవాళ్ళందరూ భయంతో పరుగులు తీశారు. హెలికాప్టర్లో వున్న ఏడుగురి పరిస్థితి అయితే గుండె అరికాళ్ళలోకి జారిపోయింది. మొత్తానికి పైలట్ హెలికాప్టర్ని కంట్రోల్ చేశాడు. హెలిప్యాడ్‌కి పక్కనే లాండ్ చేశాడు. ఏడుగురు భ‌క్తులు సేఫ్ అయ్యారు. టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈ హెలికాప్టర్ గిర్రున తిరిగిందట. పైలెట్ కంట్రోల్ చేశాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే పైలెట్‌తో సహా ఎనిమిది మంది శివార్పణం అయిపోయేవారే.