ఆర్మూరు మాజీ ఎమ్మెల్యేపై చేవెళ్లలో భూ కబ్జా కేసు 

ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఆయన నేర చరిత్ర ఒక్క ఆర్మూర్ ప్రజలకే కాకుండా హైదరాబాద్ శివారు ప్రాంత వాసులకు కూడా బోధపడింది. ఇప్పటికే ఆర్మూరులో భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న జీవన్ రెడ్డి చేవెళ్ల నియోజకవర్గంలో కూడా భూ కబ్జాలు చేసిన ఆరోపణతో  కొత్త చరిత్ర సృష్టించారు. 
 బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్లలో కేసు నమోదైంది. తన భూమిని కబ్జా చేశాడంటూ బాధితుడు ఒకరు చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనపై మారణాయుధాలతో బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు జీవన్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీసులు ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
2023లో ఫంక్షన్ హాలును కూల్చివేసి దానిని కబ్జా చేశారని బాధితుడు దామోదర్ రెడ్డి ఆరోపించారు. ఈ భూమికి పంజాబ్ గ్యాంగ్ ను కాపలా ఉంచారని... తాను ప్రశ్నిస్తే దాడి చేశారని వాపోయారు. కాగా, జీవన్ రెడ్డి, దామోదర్ రెడ్డి మధ్య వివాదం చాలాకాలంగా కొనసాగుతోంది. అయితే ఆ భూమి తనదేనని... తాను నాలుగేళ్ల క్రితం దానిని కొనుగోలు చేశానని జీవన్ రెడ్డి చెబుతున్నారు. ఈ భూమి వ్యవహారంలో జీవన్ రెడ్డి కోర్టుకు వెళ్లారు.

Teluguone gnews banner