బీభత్సం సృష్టించనున్న రెమాల్ తుపాను
బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను, తీవ్ర తుఫానుగా మారి బీభత్సం సృష్టించనుంది. ఈ తుఫాను బంగ్లాదేశ్ కేపుపారా కూ దక్షిణంగా 330 కిలోమీటర్ల దూరంలో, పశ్చిమ బెంగాల్ సాగర్ ఐలాండ్స్క 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న రెమాల్ ఉత్తర దిశగా కదులుతూ మరింత బలపడుతున్నది. ఆదివారం ( మే 26) అర్ధరాత్రి బంగ్లాదేశ్ కేపూపారా, వెస్ట్ బెంగాల్ సాగర్ ఐలాండ్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ గాలుల తీవ్రత 135 కిలోమీటర్ల వేగానికి పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, మిజోరం, మణిపుర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అండమాన్, నికోబార్ దీవుల ప్రభుత్వాలను భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.
ఈ క్రమంలో సోమవారం వరకూ మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. రెమాల్ తుపాను ప్రభావం ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో మంగళవారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణ మీదుగ ఆవర్తనం.. కేరళ పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. వీటి ప్రభావంతో పశ్చిమ దిశ నుంచి ఏపీ వైపు గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఏపీలో పలుచోట్ల చెదురు మొదురు వర్షాలు.. ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో తుఫాను నేపథ్యంలో పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
తుఫాను ప్రభావం వల్ల శనివారం (మే 25) ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అనంతపురం, ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, ప్రకాశం, శ్రీసత్యసాయి తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. అనంతపురంలో శుక్రవారం రాత్రి భారీవర్షం కురిసింది. అత్యధికంగా కళ్యాణదుర్గం మండలంలో 86.4, కణేకల్లులో 70, ఉరవకొండలో 62 మి.మీ.లు వర్షపాతం నమోదైంది. శ్రీసత్యసాయి జిల్లాలోని మడకశిర మండలంలో 72.2 మి.మీ.లు, కనగానపల్లి మండలంలో 63 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. ఆదివారం కూడా రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో వరుసగా కురుస్తున్న వర్షాల ధాటికి పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. దీంతో చేతికి వచ్చిన పంట వర్షం పాలు కావడంతో రైతన్నలు కన్నీరు పెట్టుకుంటున్నారు.