రోడ్డు ప్రమాదంలో కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే దుర్మరణం

  కొద్ది రోజుల క్రితం కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గోపీనాథ్ ముండే ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యి డిల్లీలో ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ రోజు తెల్లవారుజామున ఆయన డిల్లీ నుండి ముంబాయి బయలుదేరిన ఆయన విమానాశ్రయానికి వెళుతుండగా ఆయన కాన్వాయ్ అదుపుతప్పడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. ఆయనను వెంటనే డిల్లీలో ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ, గుండెపోటుతో మరణించారు. ఆసుపత్రి చేరేసరికే అంతర్గత రక్తస్రావం వల్ల ఆయన పరిస్థితి చాల విషమంగా ఉంది. ఆసుపత్రిలో చేర్చిన కొద్ది సేపటికే ఆయన గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ దృవీకరించారు. ముండే కుటుంబ సభ్యులు కొంత సేపటి క్రితమే ముంబై నుండి డిల్లీ బయలు దేరి వెళ్ళారు.   గోపీనాథ్ ముండేను రాజకీయాలలోకి తీసుకు వచ్చిన వ్యక్తి బీజేపీ సీనియర్ నేత ప్రమోద్ మహాజన్. వారిరువురూ కాలేజీ చదువుల సమయం నుండే మంచి స్నేహితులు. అందువల్ల మహాజన్ తన సోదరి ప్రద్న్యాను ముండేకిచ్చి వివాహం చేసారూ. దానితో వారిరువురి మద్య స్నేహబందం మరింత బలపడింది. ఎమర్జెన్సీ సమయంలో ముండే అఖిల భారతీయ విద్యా పరిషత్ తరపున ఉద్యమాలు చేసి జైలుకి కూడా వెళ్ళారు. 1971లో భారతీయ జన సంఘ్ లో చేరికతో ముండే రాజకీయ జీవితం ఆరంభమయింది. ఆ తరువాత కొంత కాలానికి ఆయన బీజేపీ మహారాష్ట్ర శాఖ యువ మోర్చా అధ్యక్షుడుగా నియమితులయినారు. 1995లో మనోహర్ జోషి ప్రభుత్వంలో ఆయన ఉపముఖ్యమంత్రిగా పనిచేసారు.   ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో గోపీనాథ్ ముండే బీడ్ లోక్ సభ నియోజక వర్గం నుండి రెండు లక్షల మెజార్టీతో విజయం సాధించి కేంద్రమంత్రిగా బాధ్యతలు చెప్పట్టారు. కానీ ఆయన జీవితంలో అత్యున్నత స్థానం చేరుకొన్న ఈ తరుణంలో ఆయన దుర్మరణం చెందడం కుటుంబ సభ్యులనే కాదు , పార్టీ నేతలను, ఆయన అనుచరులను కూడా తీవ్రంగా కలచి వేస్తోంది. గోపీనాథ్ ముండే కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొట్ట మొదటి సారిగా తన స్వరాష్ట్రమయిన మహారాష్ట్రకు వస్తునందున, ముంబైయిలో ఆయనకు స్వాగతం పలికేందుకు స్థానిక బీజేపీ నేతలు కార్యకర్తలు ఘనంగా ఏర్పాట్లు చేసారు. కానీ ఊహించని విధంగా ఆయన మరణవార్త వినవలసి రావడంతో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. ముండే అంత్యక్రియలు రేపు ఆయన స్వరాష్ట్రంలో జరుగవచ్చును.

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎప్పుడు?

  ఇంతవరకు నవంబర్ 1న మనం రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకొంటున్నాము. కానీ నిన్న అంటే జూన్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణా విడిపోవడంతో రెండు రాష్ట్రాలు ప్రత్యేక రాష్ట్రాలుగా అవతరించాయి. అంటే జూన్ 2నే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కూడా జరిగినట్లు అనుకోవచ్చును. కానీ, మద్రాసు నుండి అవిబాజ్య ఆంధ్రప్రదేశ్ వేర్పడిన నవంబర్ 1నే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినంగా పరిగణించాలని కొందరు వాదిస్తున్నారు. ఎందువలన అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కొన్ని జిల్లాలను తీసుకొని తెలంగాణా వేర్పడి వెళ్లిపోయినంత మాత్రాన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మార్చుకోవలసిన అవసరం లేదని వారి వాదన. ఇక మరొక వాదన కూడా వినిపిస్తోంది. జూన్ 8న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్ట మొదటి ప్రభుత్వం ఏర్పడుతుంది గనుక, ఆరోజునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినంగా ప్రకటించాలని కొందరు కోరుతున్నారు. ఈవిషయమై మీడియాలో కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాతనే ఈవిషయమై ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.

బాలకృష్ణ రెండు పడవల ప్రయాణం షురూ

  నందమూరి బాలకృష్ణ హిందూపురం నుండి అసెంబ్లీకి ఎన్నికయిన తరువాత, తాను ప్రజలకు సేవ చేస్తూనే సినిమాలు కూడా చేస్తుంటానని చెప్పారు. అయితే ప్రజాసేవకి ఎక్కువ సమయం కేటాయించేందుకు తన సినిమాలు తగ్గించుకొంటానని హామీ ఇచ్చారు. తను సినిమాలు చేస్తున్నప్పటికీ నియోజక వర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.   ఆయన చెప్పినట్లుగానే ఈరోజు నుండి రెండు పడవల ప్రయాణం ప్రారంభించారు. ఈరోజు తన కొత్త సినిమాను హైదరాబాదులో ప్రారంభించారు. కొత్త దర్శకుడు సత్యదేవ్ దర్శకత్వంలో చేయబోయే ఈ సినిమాలో త్రిష మొట్ట మొదటి సారిగా బాలకృష్ణతో జత కట్టబోతోంది. ప్రముఖ దర్శకులు రాఘవేంద్ర రావు, దాసరి నారాయణ రావు తదితరుల సమక్షంలో సినిమా పూజా కార్యక్రమాలు ముగించికొని ఈరోజు షూటింగ్ మొదలు పెట్టారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.   ఇక ఈరోజు బాలకృష్ణ తన హిందూపురం నియోజకవర్గం పార్టీ నేతలతో, స్థానిక మునిసిపల్ కమీషనర్ తో హైదరాబాదులో సమావేశమయ్యి స్థానిక సమస్యల గురించి చర్చించారు. వాటిలో ప్రధానంగా తాగు నీటి సమస్యను పరిష్కరించేందుకు వెంటనే ఒక పట్టణంలో ఒక భారీ ఓవర్ హెడ్ నీళ్ళ ట్యాంకుని నిర్మించాలని నిర్ణయించారు. త్వరలో చంద్రబాబు ప్రభుత్వ పగ్గాలు చెప్పట్టగానే మొట్టమొదటగా హిందూపురం పట్టణంలో ఒక పెద్ద ప్రభుత్వాసుపత్రిని నిర్మింపజేస్తానని బాలకృష్ణ హామీ ఇచ్చారు.   బాలకృష్ణ సినిమాలు మానేస్తే ఆయన అభిమానులు బాధపడతారు. ఓటేసి గెలిపించిన ప్రజలను పట్టించుకోకపోతే వారు బాధపడతారు. అందువల్ల ఆయన రెండు పడవలలో ప్రయాణం అనివార్యమవుతోంది. కానీ, ఎన్నికలలో పోటీ చేసి గెలిచి ‘పార్ట్ టైం ప్రజాసేవ’ చేస్తానని అంటే ఆయన విమర్శలు ఎదుర్కోక తప్పదు. కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, విద్యా సంస్థలు, చివరికి మద్యం సిండికేట్లు నడిపించుకొంటూ రాజకీయ నాయకులందరూ కూడా పార్ట్ టైం ప్రజాసేవే చేస్తున్నప్పటికీ, బాలకృష్ణ సినిమాలలాగ, వారి వ్యాపార వ్యవహారాలు ప్రత్యక్షంగా కనబడవు కనుక వారు విమర్శల నుండి తప్పించుకోగలుగుతున్నారు. కానీ బాలకృష్ణ ప్రజాసమస్యలను పరిష్కరించకుండా సినిమాలు చేసుకొంటుంటే, ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక మిగిలిన నేతల కంటే మరింత ఎక్కువ సమయం రాజకీయాలకు, తన నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి కేటాయించడం మేలు.

యూపీలో కొనసాగుతున్న అత్యాచార రాజకీయాలు

  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బదౌన్ గ్రామంలో జరిగిన సామూహిక అత్యాచారం, హత్యలతో ఒకవైపు రాష్ట్రం అట్టుడికిపోతుంటే, మళ్ళీ బరేలీకి సమీపంలోని ఐత్ పురా అనే గ్రామంలో అంతకంటే పాశవికంగా సామూహిక అత్యాచారం చేసి, ఆమెచేత యాసిడ్ బలవంతంగా త్రాగించి, ఆపై ఆమె ఆనవాలు తెలియకుండా ఉండేందుకు ఆమె మొహంపై యాసిడ్ పోసి, ఆ తరువాత ఆమెను చెట్టుకు ఉరేసి అత్యంత దారుణంగా హత్య చేసారు.   డిల్లీ నిర్భయ ఉదంతం తరువాత కటినమయిన చట్టాలు అమలులోకి వచ్చినప్పటికీ, కామంతో కళ్ళు మూసుకుపోయి, అగ్రకులాహాంకారంతో పోయిన కొందరు మృగాళ్ళు నిరుపేద దళిత మహిళలపై అత్యాచారాలకు తెగబడుతున్నాయి. అయినప్పటికీ అఖిలేష్ యాదవ్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో, ఈ కులగజ్జి సోకిన ఉత్తరప్రదేశ్ పోలీసు శాఖ, బాధితులకు బాసటగా నిలవకపోగా, దారుణమయిన ఈ నేరాలకు పాల్పడిన వ్యక్తులకే కొమ్ము కాస్తోంది. ఆ కారణంగా మగ మృగాలు మరింత పెట్రేగిపోతున్నాయి.   మొదట బదౌన్ గ్రామంలో అత్యాచారం జరిగినపుడు, ప్రతిపక్షాలు గగ్గోలు పెడితే యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అందుకు బాద్యుడిని చేస్తూ, ఆయనను పదవి నుండి దింపేసి ఆయన స్థానంలో మరొకరిని నియమించేసి, తన పనియిపోయినట్లు చేతులు దులుపుకొన్నారు. సమస్యకు అది సరయిన పరిష్కారం కాదని అఖిలేష్ యాదవ్ కు కూడా తెలుసు, కానీ ఆయన అంతటితో పరిస్థితులు చల్లబడతాయని భావించారు. కానీ మళ్ళీ రెండు రోజుల వ్యవధిలోనే మళ్ళీ మరో దారుణమయిన అత్యాచారం, హత్య జరగడంతో అఖిలేష్ ప్రభుత్వంపై కేంద్రం చర్యలకు సిద్దమవుతోంది. ఇప్పటికే సీబీఐ ఎంక్వయిరీ వేసింది.   ఇంత జరిగినా నేరస్తులపై యస్సీ, ఎస్టీ రక్షణకు ఉన్నప్రత్యేక చట్టాల క్రింద అఖిలేష్ ప్రభుత్వం కేసులు ఎందుకు నమోదు చేయలేదని హోంశాఖ సహాయ మంత్రి కిరెన్ రిజ్జు ప్రశ్నించారు. మరో కేంద్రమంత్రి కల్రాజ్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ “ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో నానాటికి దిగజారుతున్న పరిస్థితులపై గవర్నర్ వెంటనే నివేదిక పంపినట్లయితే, కేంద్రం జోక్యం చేసుకొంటుందని తెలిపారు. ఈరోజు రాష్ట్ర బీజేపీ మహిళా కార్యకర్తలు, నేతలు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నివాసాన్ని చుట్టుముట్టే ప్రయత్నం చేయబోతే,  పోలీసులు వారిపై వాటర్ జెట్ ప్రయోగించి చెదరగొట్టేరు. దానితో మరింత ఆగ్రహం చెందిన స్థానిక బీజేపీ నేతలు అఖిలేష్ ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విదించాలని డిమాండ్ చేస్తున్నారు.   మానవ సమాజం సిగ్గుతో తలదించుకోవలసిన ఇటువంటి ఘటనలలో చురుకుగా మానవతా దృక్పధంతో స్పందించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, పోలీసులు, అధికారులు అందరూ ఈవిధంగా రాజకీయాలు చేయడం అత్యాచారం కంటే నీచం.ఇప్పటికయినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీస్వయంగా జోక్యం చేసుకొని, పరిస్థితులను వెంటనే చక్కదిద్ది, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కటినంగా వ్యవహరించాలి.  

కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిక!

      దేశవ్యాప్తంగా వున్న కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ఆలిండియా పౌరుల తరఫున ఓ బాధ్యతగల పౌరుడి హెచ్చరిక. అదేంటంటే, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోయింది. అలా నాశనం అయిపోవడానికి ప్రధాన కారణం మీ పార్టీ నాయకులైన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ వ్యవహారశైలేనని దేశంలో అందరికీ తెలిసిన విషయమే. వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని ఈ ఇద్దరు తల్లీకొడుకులు పదేళ్ళలో నాశనం చేసిపారేశారు. ఈ విషయంలో చాలామంది కాంగ్రెస్ నాయకులకు సోనియా, రాహుల్ మీద పీకల వరకు కోపం వుంది. కార్యకర్తల్లో కూడా వాళ్ళిద్దరి నాయకత్వం మీద నమ్మకం పోయింది. వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుని కొత్తవారికి బాధ్యతలు ఇస్తే మంచిదన్న గుసగుసలు కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ విషయంలో బయటపడిపోయి సోనియా, రాహుల్‌కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరిక. ఎందుకంటే వీళ్ళకి వ్యతిరేకంగా ఎవరు వ్యాఖ్యానించినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పార్టీ నుంచి సాగనంపుతోంది. సోనియా, రాహుల్ తమ మీద వస్తున్న విమర్శలను పరిశీలించుకుని, ఆత్మ పరిశీలన చేసుకోకుండా, తమను విమర్శించిన వారిని పార్టీ నుంచి బయటకి పంపేయడమే మార్గమని భావిస్తున్నారు. అధికారాన్ని కోల్పోయినప్పటికీ తమ అహంభావాన్ని వదులుకోకుండా వ్యవహరిస్తున్నారు. అందుకే రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీలో ఒక జోకర్‌గా అభివర్ణించిన కేరళ కాంగ్రెస్ నాయకుడిని పార్టీ నుంచి తరిమేశారు. మరో రాజస్థాన్ కాంగ్రెస్ నాయకుడిని కూడా ఇంటికి సాగనంపారు. అంచేత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సోనియా, రాహుల్ మీద ఎంత కోపం వున్నా మనసులోనే దాచుకోండి. బయటపడ్డారో మీ మీద వేటు పడటం ఖాయం. తస్మాత్ జాగ్రత్త.  

చంద్రబాబుని చూసి కేసీఆర్ నేర్చుకోవాల్సింది ఇదే!

      కేసీఆర్ని ఏమైనా అంటే టీఆర్ఎస్‌ వాళ్ళకి ఇంత పొడుగున రోషం పొడుచుకుని వస్తుందిగానీ, హుందాతనం విషయంలో చంద్రబాబు నాయుడిని చూసి కేసీఆర్ నేర్చుకోవాల్సింది చాలా వుంది. సీమాంధ్రలో అధికారం వచ్చినా చంద్రబాబు ఇప్పటి వరకు ఒక్క మాట కూడా అహంకారపూరితంగా మాట్లాడలేదు. అదే కేసీఆర్ అయితే అధికారం దక్కినప్పటి నుంచి మాట్లాడిన మాటలు సీమాంధ్రుల గుండెల్ని మండించాయి. ఇదిలా వుంటే, మర్యాద, మన్నన, ఇరుగు పొరుగు రాష్ట్రాల వారితో స్నేహ సంబంధాలు నెలకొల్పుకునే విషయంలో కూడా చంద్రబాబు కంటే కేసీఆర్ చాలా కిలోమీటర్లు వెనుకబడి వున్నారన్న విషయం కేసీఆర్ ప్రమాణ స్వీకార సందర్భంగానే అందరికీ అర్థమైపోయింది.   కేసీఆర్ తన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రిని ఆహ్వానించలేదు. తనకు రాజకీయంగా శుభారంభాన్నిచ్చిన, పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబు నాయుడిని కూడా వ్యక్తిగతంగా ఆహ్వానించలేదు. ఇది కేసీఆర్‌లో పెరిగిపోయిన అధికార గర్వానికి అద్దం పట్టే అంశమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే కేసీఆర్ ఇలా వ్యవహరించినప్పటికీ, చంద్రబాబు నాయుడు మాత్రం ఎంతో హుందాగా వ్యవహరించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్‌కి చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈనెల 8వ తేదీన సీమాంధ్రలో జరిగే తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా కేసీఆర్‌ని ఆహ్వానించారు. చంద్రబాబు చేసిన ఈ పని కేసీఆర్‌ కళ్ళు తెరిపించిందో లేదో గానీ, చాలామంది తెరాస నాయకులు సిగ్గుతో తలలు వంచుకునేలా చేసింది. చంద్రబాబు కేసీఆర్‌తోపాటు జగన్‌కి కూడా స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు వ్యవహరించిన తీరు పరిణతి కలిగిన రాజకీయ నాయకుడిని, పాలకుడిని ప్రతిఫలిస్తోంది.

తెలంగాణా తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం

  తెరాస అధ్యక్షుడు కే.చంద్రశేఖర్ రావు తన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్ గన్ పార్క్ వద్ద అమరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన తరువాత వారితో కలిసి అక్కడి నుండి నేరుగా రాజ్ భవన్ చేరుకొన్నారు. ఈరోజు ఉదయం ఆరు గంటలకు తెలంగాణా రాష్ట్ర తొలి గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేసిన నరసింహన్, కేసీఆర్ చేత తెలంగాణా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు.   కేసీఆర్ తో బాటు ఆయన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు, ఈటెల రాజేందర్, మహమూద్ అలీ, ఈటెల రాజేందర్, నాయిన నరసింహా రెడ్డి, జగదీశ్‌రెడ్డి, మహేందర్ రెడ్డి, పోచారం శ్రీనివాస రెడ్డి, పద్మారావు, రాజయ్య,జోగు రామన్న, కొప్పుల ఈశ్వర్, మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసారు.   రాజ్ భవన్ లో జరిగిన ఈ ప్రమాణస్వీకారోత్సవానికి కాంగ్రెస్, బీజేపీ, తెరాస నేతలు చాల మంది హాజరయ్యారు. కానీ చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి లను ఆహ్వానించక పోవడంతో తెలుగుదేశం, వైకాపాలకు చెందిన నేతలెవరూ ఈ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు కాలేదు. కానీ బండారు దత్తాత్రేయ వంటి కొందరు తెలంగాణా బీజేపీ నేతలను తెరాస ఆహ్వానించడంతో వారు హాజరయ్యారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది సేపటికే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆయనకు, ఆయన మంత్రివర్గానికి ట్వీటర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడమే కాక, తెలంగాణా కు అన్ని విధాల తమ ప్రభుత్వం సహాయసహకారాలు అందజేస్తుందని హామీ ఇవ్వడం విశేషం.   ఈ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం తరువాత కేసీఆర్, తన మంత్రివర్గ సహచరులతో కలిసి పెరేడ్ గ్రౌండ్స్ చేరుకొని అక్కడ పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. తెలంగాణా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత ఆయన హాజరయ్యే తొలి అధికారిక కార్యక్రమం అదే అవుతుంది.

తెలంగాణా బంద్ దేనికంటే...

  తెలంగాణకు ముఖ్యమంత్రిగా రేపు బాధ్యతలు చేప్పట్టబోతున్న కేసీఆర్ పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రాలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ స్వయంగా తెలంగాణాకు బంద్ కు పిలుపీయడంతో, తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. ఎంతో విజయవంతంగా బంద్ నిర్వహించామని ఉప్పొంగిపోయిన తెరాస నేతల ఆ విమర్శలు చూసి జరిగిన పొరపాటుకు నాలుక కరుచుకొని సంజాయిషీ ఇచ్చుకోవలసి వచ్చింది.   తెరాస నేత ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ, “మాది ప్రజా సమస్యలపై పోరాడేందుకు పుట్టిన ఉద్యమ పార్టీ. తెలంగాణా జిల్లాలలో ఏ మూల గ్రామంలో ప్రజలకు కష్టమొచ్చినా వారి తరపున పోరాడేందుకు మేము సిద్దంగా ఉంటామని చెప్పేందుకే ఈ బంద్ నిర్వహించాము. ముంపు గ్రామాలలో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకే మేము పోరాటం మొదలుపెట్టవలసి వచ్చింది. వెయ్యి అబద్దాలు ఆడయినా ఒక పెళ్లి చేయమని పెద్దలు అన్నట్లు, కేసీఆర్ నాయకత్వంలో అనేక పద్దతులలో కొట్లాడి చివరికి తెలంగాణా సాధించుకొన్నాము. ఇకపై దానిని కాపాడు కొనేందుకు ప్రభుత్వంలో ఉండి పోరాటాలు చేస్తాము."   "తెదేపాతో జత కట్టిన బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం చెప్పట్టినంత మాత్రాన్న, తెదేపా మాటలు విని మా తెలంగాణా ప్రజలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోము. మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేప్పట్టి గట్టిగా నాలుగు రోజులు కాక ముందే, తెదేపా మాటలు విని మాకు వ్యతిరేఖంగా నిర్ణయం తీసుకొని తెలంగాణా పట్ల తీవ్ర వివక్ష చూపారు. ఇంకా ఇక్కడ తెలంగాణాలో కానీ, అక్కడ ఆంధ్రాలో గానీ కేసీఆర్, చంద్రబాబు ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారమే చేయలేదు. ఇంతలోనే మోడీ ప్రభుత్వానికి ఆర్డినెన్స్ జారీ చేయవలసిన అవసరమేమొచ్చింది? అని ప్రశ్నిస్తున్నాము."   "గత అరవై ఏళ్లుగా తెలంగాణా ప్రజలు వివక్షకు గురవుతూనే ఉన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా మేము ఇంకా వివక్ష ఎదుర్కోవలసిందేనా? అని ప్రశ్నిస్తున్నాను. ఇంతవరకు ఉద్యమ పార్టీగా ఉద్యమాల ద్వారా పోరాడాము. ఇకపై ప్రజా ప్రతినిధులుగా ప్రభుత్వంలో ఉండి మా పోరాటం కొనసాగిస్తాము,” అని చెప్పారు.   ఈటెల మాటల సారాంశం ఏమిటంటే, ముంపు గ్రామాలలో భాదితులపై ప్రేమతోనొ, వారిని రక్షించుకోవాలనే తపనతోనో తెరాస తెలంగాణా బంద్ చేయలేదు. మోడీ ప్రభుత్వం చంద్రబాబు మాటలు విని తమ జోలికి వస్తే తమ తడాఖా చూపిస్తామని హెచ్చరించడానికే బంద్ చేసామని ఈటెల చెప్పకనే చెప్పుకొన్నారు. దీనిని బట్టి తెలంగాణాలో తమ బలం ఏపాటిదో ప్రధానమంత్రి మోడీకి చూపడానికే బంద్ నిర్వహించారని అర్ధమవుతోంది. గంటసేపు మీడియాతో మాట్లాడిన ఈటెల రాజేందర్, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ముంపు గ్రామాల నివాసితులను ఆదుకోకపోతే, తమ తెరాస ప్రభుత్వమే ఆదుకొంటుందని ఒక్క ముక్క కూడా అనలేదు.   తెరాసకు నిజంగా నిర్వాసితులవుతున్న ఆదివాసీల పట్ల అంత ప్రేమ ఉండి ఉంటే, తెలంగాణా బంద్ చేసే బదులు వారి పునరావాసం గురించి కేంద్రంతో మాట్లాడి ఉండవచ్చును. పోనీ బంద్ నిర్వహించిన తరువాతయినా వారి యోగక్షేమాల కోసం తమ ప్రభుత్వం ఏమి చేయబోతోందో చెప్పింది లేదు. కనీసం అధికారుల ద్వారా అయినా కేంద్రాన్ని సంప్రదించే ప్రయత్నమూ చేయలేదు.  కానీ ఆదివాసీల కోసం పోరాటాలు చేస్తామని మాత్రం హామీ ఇస్తున్నారు. ఆదివాసీలకు భద్రత, పునరావాసం కల్పించలేని తెరాస పోరాటాల వల్ల ఏమి ప్రయోజనం? కేంద్రం ప్రభుత్వం, ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాల మధ్య జరిగే ఈ రాజకీయ యుద్దంలో అభం శుభం ఎరుగని ఆదివాసీలు లేగాదూడల్లా నలిగిపోకుండా, ఎవరో ఒకరు వారిని మానవత్వంతో కాపాడగలిగితే చాలు.

సీఎంగా ప్రమాణస్వీకారోత్సవం: ఇదేనా కేసీఆర్ మర్యాద?

  సోమవారం నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోతోంది. కొత్త రాష్ట్రం తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ సోమవారం నాడే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ప్రమాణ స్వీకారోత్సవం పాయింట్ దగ్గరి నుంచే కేసీఆర్ మీద విమర్శల వర్షం కురుస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ కలుపుకుని వెళ్ళాల్సిన కేసీఆర్ ఇప్పటికీ తన పాత పద్ధతిలోనే నియంతలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీని పిలవాల్సిన బాధ్యత కేసీఆర్ మీద వుంది. మోడీ వచ్చినా, రాకపోయినా పిలవాల్సిన అవసరం మాత్రం కేసీఆర్‌కి వుంది. అయితే మోడీని ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించే విషయాన్ని కేసీఆర్ ఎంతమాత్రం పట్టించుకోలేదు. మీడియావాళ్ళు అడిగితే మాత్రం ఏవేవో డొంకతిరుగుతు సమాధానాలు చెప్పారు. సరే, మోడీని పిలవకపోతే పిలవకపోయె.. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో అడ్డంగా ఆరిపోయిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీనైనా పిలవాలి కదా అని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆవేదనగా అంటున్నారు. తెలంగాణ ఇవ్వడం వల్ల అనేకరకాలుగా నష్టపోయిన సోనియాగాంధీని ఇప్పుడు కేసీఆర్ తన ప్రమాణ స్వీకారోత్సవానికి పిలవకపోవడం అవమానకరంగా టీ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఇక ఇలా వుంటే సీమాంధ్రలో అధికారాన్ని సాధించడంతోపాటు తెలంగాణలో గౌరవప్రదమైన స్థానాలు సాధించిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎమ్మెల్యేలకు కూడా సరైన రీతిలో ఆహ్వానం అందలేదు. ఎవరో తెలుగుదేశం పార్టీ కార్యాలయం రిసెప్షన్‌లో తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేల పేరు మీద కొన్ని ఆహ్వాన పత్రాలు ఇచ్చి వెళ్ళారట. ఇది తెలుగుదేశం నాయకులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. కేసీఆర్ కాకపోయినా కనీసం టీఆర్ఎస్ నాయకుడు ఎవరైనా తమకు ఫోన్ చేసి ఆహ్వానించినా మర్యదాగా వుండేదని, ఇలా రిసెప్షన్‌లో ఆహ్వాన పత్రాలు ఇవ్వడం దారుణంగా వుందని వారు అంటున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించే విషయంలో కేసీఆర్ వ్యవహారశైలిని కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా విమర్శిస్తున్నారు. అన్నం మెతుకు పట్టుకుంటే అన్నమంతా ఉడికిందో లేదో తెలుస్తుందన్నట్టుగా, భవిష్యత్తులో కేసీఆర్ ఎంత నియంతృత్వంగా వ్యవహించబోతున్నారన్నదానికి ఈ ప్రమాణ స్వీకారోత్సవం ఒక ఉదాహరణగా నిలిచిందని వారు అంటున్నారు.

రాహుల్ గాంధీ జోకర్ల టీమ్ కు లీడరు: కాంగ్రెస్ నేత

  ఎన్నికలలో కాంగ్రెస్ ఘోరపరాజయం తరువాత అందుకు కారకులయిన పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కొడుకు రాహుల్ గాంధీలకు వ్యతిరేఖంగా కాంగ్రెస్ పార్టీలోనే విమర్శించేవారు రోజురోజుకి పెరుగుతున్నారు. వారం రోజుల క్రితం కేరళా రాష్ట్రానికి చెందిన ముస్తఫా అనే మాజీ మంత్రి రాహుల్ గాంధీని జోకర్ అని, అతను వెంటనే పదవిలో నుండి దిగిపోవాలని లేకుంటే బలవంతంగానయినా వెంటనే దింపేయాలని డిమాండ్ చేయడంతో, ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసారు.   మళ్ళీ నిన్న రాజస్తాన్ కు చెందిన భన్వర్ లాల్ శర్మ అనే కాంగ్రెస్ యం.యల్యే. మరో అడుగు ముందుకు వేస్తూ, “రాహుల్ గాంధీ ఒక జోకర్స్ టీంకు మేనేజింగ్ డైరెక్టర్ వంటివాడు. దశాదిశలేని వ్యక్తి. అతనికి సరయిన ఆలోచనలు కానీ రాజకీయ విధానాలు గానీ ఏమీ లేవు. ఆయన చుట్టూ ఉన్న దిగ్విజయ్ సింగ్, సీపీ జోషి వంటివారు కూడా అటువంటి వ్యక్తులే. వారి అసమర్ధత కారణంగానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయింది. పార్టీలో ప్రజాస్వామ్యం పోయి దాని స్థానంలో భజనస్వామ్యం పెరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీ గాడి తప్పుతున్నప్పుడు దానిని దారిలో పెట్టవలసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పెద్దలు కూడా తమ పదవులను కాపాడుకొనేందుకు సోనియా, రాహుల్ గాంధీల భజనలో మునిగిపోయారు. అందుకే పార్టీ ప్రమాదం అంచున ఉన్నప్పటికీ వారెవరూ కూడా హెచ్చరించలేదు. ఒకవేళ హెచ్చరించినా సోనియా, రాహుల్ వినే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వారి చుట్టూ చేరిన దిగ్విజయ్ సింగ్ వంటి భజన సంఘం నేతలు, వారికీ, పార్టీ శ్రేయోభిలాషులకు మధ్య అడ్డుగోడగా నిలబడి ఉన్నారు. అందువలన ఇప్పటికయినా సోనియాగాంధీ తన పుత్రా వాత్సల్యాన్ని కొంచెం పక్కనబెట్టి సమర్దులయిన వ్యక్తుల చేతిలో పార్టీని పెట్టినట్లయితే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది,” అని భన్వర్ లాల్ శర్మ ఘాటుగా విమర్శించారు. ఆయనకు ముస్తఫాకు పట్టిన గతే పడుతుందని వేరే చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడే కాంగ్రెస్ పార్టీలో ఈ పరిస్థితి ఉంటే, రేపు ఎప్పుడయినా సోనియా గాంధీ రాజకీయాల నుండి తప్పుకొన్నట్లయితే, ఇక రాహుల్ గాంధీని కాంగ్రెస్ నేతలు ఖాతరు చేస్తారా? అనే అనుమానం కలుగుతోంది.

యుపిఎ జీఓఎంలు రద్దు: దరిద్రం వదిలింది

  భారతీయ పౌరుడి పాదాల కిందపడి దుర్మరణం పాలైపోయి, చరిత్రలో సమాధి అయిపోయిన యు.పి.ఎ. గవర్నమెంట్ తాలూకు చేదు జ్ఞాపకాలను ఒక్కొక్కదాన్నే తొలగించే పనిలో దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ బిజీగా వున్నారు. దీనిలో భాగంగా, యుపిఎ ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసిన బోలెడన్ని మంత్రుల బృందాలను (జీఓఎంలు) రద్దుచేసి పారేశారు. యుపిఎ ప్రభుత్వం ఏ విషయాన్నయినా నాన్చాలన్నా, ఏదైనా విషయంలో ప్రజలకు విసుగు పుట్టించాలన్నా సదరు అంశాల మీద ఓ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసేది. సదరు మంత్రుల బృందాలు తమ ఇష్టం వచ్చినట్టుగా సదరు సమస్యతో ఆడుకునేవి. ఇలాంటి బృందాలు యుపిఏ ప్రభుత్వం దాదాపు యాభై వరకూ ఏర్పాటు చేసింది. ఆ బృందాలు టైమ్ పాస్ చేయడం తప్ప ఊడబొడిచిందేమీ లేదు. ఏదైనా ఒక మంత్రుల బృందం ఏదైనా విషయాన్ని త్వరగా తెమిల్చినా, అది జనం బుర్రలు బద్దలు కొట్టే నిర్ణయాలే తప్ప మంచి నిర్ణయాలేవీ లేవు. సోనియాగాంధీ చెప్పినట్టే మంత్రుల బృందాలు పనిచేసేవి. సోనియాగాంధీ ఎలాంటి ఫలితం రావాలని కోరుకుంటే అలాంటి ఫలితాన్నే ఈ బృందాలు ఇచ్చేవి. సదరు బృందాలు ఏ నిర్ణయం తీసుకున్నా మొత్తం మంత్రివర్గంతో సంబంధం లేకుండా ఆ నిర్ణయాలు అమల్లోకి వచ్చేవి. దాంతో మంత్రిమండలి అనుమతి లేకుండా ఎన్నెన్నో బండలు దేశప్రజల నెత్తిన పడ్డాయి. ఒక దశలో దేశ ప్రజలు మంత్రుల బృందం అనే మాట వింటేనే చిరాకుపడే స్థితికి చేరుకున్నారు. యుపిఎ ప్రభుత్వం చేసిన విఫల ప్రయోగం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ప్రక్రియకు నరేంద్రమోడీ మంగళం పాడటం ఒక మంచి పరిణామమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

అన్ని రాష్ట్రాలలో ఐఐటీ ఏర్పాట్లకు ప్రతిపాదన

  కనీసం డిగ్రీ కూడా చేయని స్మృతీ ఇరానీకి, ఉన్నత విద్యావ్యవస్థలు పర్యవేక్షించే కీలకమయిన మానవవనరుల శాఖకు మంత్రిగా నియమించడంతో, కాంగ్రెస్ పార్టీ ఆమెకు అంత కీలకమయిన పదవిని కట్టబెట్టడాన్ని తప్పు పడుతూ తీవ్ర విమర్శలు చేసింది. కానీ బీజేపీ నేతలు ఆమె చాలా సమర్ధురాలు అంటూ ఆమెను వెనకేసుకు వచ్చారు. ఆమె కూడా తన విద్యార్హతలను కాక తన పనిని బట్టి తన సామర్ద్యం, తెలివితేటలు అంచనావేయమని జవాబిచ్చారు. అందువల్ల ఆమె అర్జెంటుగా తన సామర్ద్యం నిరూపించుకొనే పనిలోపడ్డారు.   ఆమె నిన్న తన శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులతో సమావేశమయ్యి, దేశంలో ఐఐటీలు లేని రాష్ట్రాలలో కొత్తవాటిని ఏర్పాటు చేయదలచుకొన్నట్లు తెలిపారు. వాటితో బాటు, హిమాలయన్ టెక్నాలజీ మరియు దేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్ధులు మరియు ఉపాద్యాలు రిఫరెన్స్ కోసం ఈ-గ్రంధాలయం ఏర్పాటు కూడా చేయాలనుకొంటున్నట్లు ఆమె అధికారులకు తెలిపారు. అయితే, అధికారులు మాత్రం కొత్త ఐఐటీ ప్రతిపాదనలకు అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది.   గత యూపీయే ప్రభుత్వ హయాంలో దేశంలో కొత్తగా ఎనిమిది ఐఐటీలు ఏర్పాటు చేయగా వాటిలో మండి-ఐఐటీ తప్ప మిగిలినవన్నీ ఆయా రాష్ట్రాలు వాటికి శాశ్విత ప్రాతిపదికన స్థలాలు కేటాయించకపోవడంతో నేటికీ తాత్కాలిక భవనాలలోనే కొనసాగుతున్నాయని అధికారులు ఆమెకు తెలియజేసారు. వాటికి అన్ని హంగులతో శాశ్విత భవనసముదాయాలు ఏర్పాటు చేసి అందులోకి మార్చడానికి ఒక్కో ఐఐటీకి రూ.750 కోట్లు అవసరమవుతుందని 2008లోనే యూపీయే ప్రభుత్వం అంచనా వేసిందని, కానీ అంత సొమ్ము లేకపోవడంతో, ఆ ఆలోచన విరమించుకొందని అధికారులు ఆమెకు తెలిపారు. అందువల్ల నేటికీ ఏడు ఐఐటీలు తాత్కాలిక భవన సముదాయలలోనే కొనసాగుతున్నాయని, తాజాగా పెరిగిన అంచనాల ప్రకారం వాటికి శాశ్విత భావన సముదాయాలు ఏర్పాటు చేయడానికి మొత్తం రూ.ఆమెకు తెలియజేసి, ఈ పరిస్థితుల్లో వాటిని శాశ్విత భావన సముదాయాలు ఏర్పాటు చేసి వాటిలోకి మార్చడానికి, మొత్తం రూ. 14,000 కోట్లు అవసరమవుతాయని అధికారులు కొత్త మంత్రిగారికి తెలియజేసారు. ఈ పరిస్థితుల్లో మళ్ళీ కొత్తగా మరికొన్ని ఐఐటీలు ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వంపై ఆర్ధికంగా చాలా భారం పడుతుందని, అందువల్ల, ఈవిషయంలో తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఆమెకు అధికారులు సలహా ఇచ్చారు.   కానీ, ఆమె ఎట్టి పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాలలో ఒక్కో ఐఐటీ ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమయిన ఏర్పాట్లు చేయమని అధికారులను ఆదేశించి, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీతో కొత్త ఐఐటీల ఏర్పాటుకు అవసరమయిన నిధులు విషయమై చర్చించారు. జైట్లీ ఆమెకు ఎటువంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది.   నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ప్రజలలో చాలా భారీ అంచనాలున్నాయి. ఎన్నికల సమయంలో ఆయనతో సహా ఆయన పార్టీ నేతలందరూ ఇటువంటివి అనేక హామీలు ఇచ్చేరు. రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని నిర్మాణానికి లక్షల కోట్లు అవసరముంటాయి. అదిగాక దేశంలో వివిధ రాష్ట్రాలలో పోలవరం వంటి అనేక చిన్న పెద్దా ప్రాజెక్టులు వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయి. వాటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వమే డబ్బు కేటాయించవలసి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో దేశ ఆర్ధిక పరిస్థితిని గాడిన పెట్టక మునుపే, స్మృతీ ఇరానీ ప్రతిపాదిస్తున్న కొత్త ఐఐటీలకు మోడీ అనుమతిస్తారా?లేదా? అనే సంగతి త్వరలోనే తేలిపోతుంది.

చంద్రబాబు స్నేహహస్తం కేసీఆర్ అందుకొంటారా?

  తెలుగు ప్రజలు రాష్ట్రాలుగా విడిపోయినా అభివృద్ధి ఫలాలు ఇరువురికీ సమానంగా దక్కాలి. అందుకోసం తెలంగాణా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టబోతున్న కేసీఆర్ ఆంధ్రప్రజల పట్ల తన విద్వేషవైఖరిని విడనాడటం చాలా అవసరం. చంద్రబాబు నేటికీ ఆయనకు స్నేహ హస్తం అందిస్తునే ఉన్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఆయనపై కత్తులు దూస్తున్నారు. నిజానికి కేసీఆర్ ను మంచి చేసుకోవలసిన అవసరం చంద్రబాబుకు లేదిప్పుడు. కానీ, రాష్ట్ర విభజన కారణంగా ఉత్పన్నమవుతున్న అనేక సమస్యలను, ఏ రాష్ట్రానికి నష్టం జరగకుండా పరిష్కరించుకోవాలంటే, ఇరుగుపొరుగు రాష్ట్రాల మధ్య మంచి సఖ్యత చాలా అవసరం గనుకనే చంద్రబాబు కేసీఆర్ కి స్నేహహస్తం అందిస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం చంద్రబాబును అకారణంగా ద్వేషిస్తున్నారు. పోలవరం విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంతో కూడా కయ్యానికి కాలుదువ్వుతున్నారు.   కేసీఆర్ తెలంగాణాను బంగారి తెలంగాణాగా మార్చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ కేవలం మాటలతోనే అది సాకారం కాదు. అందుకు కేంద్రంతో సత్సంబంధాలు నెలకొల్పుకోవలసి ఉంది. తెరాసకు బీజేపీతో ఎటువంటి మిత్రత్వం లేకపోయినా, ఇప్పుడు కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి వల్ల శత్రుత్వం ఏర్పడే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే, కేంద్రం రాష్ట్రానికి తగినన్ని నిధులు విదిలించలేదు. అటువంటప్పుడు తెరాస మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో సత్సంబంధాలు నెలకొల్పుకొనే ప్రయత్నం చెయవలసి ఉంది. ఎన్డీయే ప్రభుత్వంతో సత్సంబంధాలు కల చంద్రబాబుతో సక్యత కోసం కేసీఆరే ముందుగా ప్రయత్నించి ఉండాల్సింది. కానీ ఆయన భేషజాలకు పోయి స్నేహహస్తం అందిస్తున్న చంద్రబాబుతో కయ్యానికి కాలుదువ్వుతున్నారు. కేసీఆర్ ఇంకా ముఖ్యమంత్రి పదవి చెప్పట్టక మునుపే కేంద్రంపై యుద్ధం ప్రకటించారు.   కేసీఆర్ ఇదే వైఖరిని ఇకముందు కూడా కొనసాగిస్తే, దానివలన ఆయన అహం చల్లార వచ్చునేమో కానీ తెలంగాణా ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. నేటికీ తను కేసీఆర్ తో సఖ్యతనే కోరుకొంటున్నానని, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకొందామని, తెలంగాణాను కూడా అభివృద్ధి చేసేందుకు తనవంతు సహాకారం అందిస్తానని చంద్రబాబు పదేపదే చెపుతున్నారు. అందువల్ల కేసీఆర్ ఇప్పటికయినా తన బేషజాలను పక్కనపెట్టి, చంద్రబాబు స్నేహహస్తం అందుకొనేందుకు ముందుకు రావాలి. తెలంగాణా అభివృద్ధి కోసం ఇద్దరు ముఖ్యమంత్రులు చేతులు కలిపి పనిచేస్తే అందరూ హర్షిస్తారు.

పోలవరంపై నోరు మెదపని జగన్

  తెరాస అధ్యక్షుడు కేసీఆర్ సీమాంధ్ర ప్రజలను పదేపదే నిందిస్తూ చాలా అవమానకరంగా మాట్లాడుతున్నా కూడా వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకు స్పందించడంలేదని, వారిరువురికీ మధ్య ఉన్న ఉన్న రహస్య అవగాహన బయటపెట్టాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో చాలా సార్లు ప్రశ్నించారు. కానీ దానికి జగన్మోహన్ రెడ్డి జవాబీయలేదు. కనీసం ఆ తరువాత అయిన కేసీఆర్ని పల్లెత్తు మాటన్న దాఖలాలు లేవు. కేసీఆర్ పట్ల అతని వైఖరిలో మార్పు కనబడలేదు. పవన్ కళ్యాణ్ సందించిన ప్రశ్నలకు జావాబు చెప్పకపోవడం, కేసీఆర్ పట్ల జగన్ అదే వైఖరి కొనసాగించడం కూడా వైకాపా ఓటమికి ప్రధాన కారణాలలో ఒకటని చెప్పవచ్చును. పోలవరం విషయంలో ఆయన ఇంతవరకు కూడా స్పందించక పోవడం చూస్తే, ఓటమి తరువాత కూడా కేసీఆర్ విషయంలో జగన్ వైఖరిలో ఎటువంటి మార్పు లేదని స్పష్టమవుతోంది. అంటే పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు నిజమేనని భావించవలసి ఉంటుంది.   రాష్ట్రంలో అన్ని పార్టీలు, నేతలు కూడా పోలవరం విషయంలో వారివారి రాష్ట్రాలకు, పార్టీల వైఖరికి అనుగుణంగా స్పందిస్తున్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇంతవరకు ఈ విషయంలో నోరుమెదపక పోవడం చాలా విచిత్రం. ఎన్నికల ప్రచార సమయంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానని పదేపదే చెప్పిన ఆయన, ఇప్పుడు కనీసం దానికి మద్దతుగా ఎందుకు మాట్లడట్లేదు? అనే ప్రశ్నకు వైకాపా నుండి జవాబు రావలసి ఉంది. తెలంగాణా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టబోతున్న కేసీఆర్ స్వయంగా పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలపడాన్ని నిరసిస్తూ తెలంగాణా బంద్ కు పిలుపిస్తే, వైకాపా దానిపై స్పందన నామమాత్రంగా ఉంది.   జగన్ గెలుపుపై అతని కంటే ఎక్కువ నమ్మకం వ్యక్తం చేసిన వ్యక్తి కేసీఆర్. ఆయన జగన్ ముఖ్యమంత్రి అయితే అతనితో కలిసి పనిచేసేందుకు సిద్దమని జగన్ అడగక ముందే ప్రకటించారు. ఒకవేళ జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నికయి ఉంటే, అప్పుడు కూడా కేసీఆర్ పోలవరం ముంపు గ్రామాల విషయంలో ఇదేవిధంగా ప్రవర్తించేవారా? ప్రవర్తిస్తే జగన్ ఇప్పటిలాగే మౌనం దాల్చేవారా? వారిరువురే ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సి ఉంటుంది.   జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ, తాము అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా అవతరించామని గొప్పగా చెప్పుకొన్నారు. పోలవరం ముంపు ప్రాంతాల గురించి తన రహస్య స్నేహితుడు కేసీఆర్ అంత రాద్ధాంతం చేస్తున్నపుడు, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎందుకు, ఆయన వాదనలను ఖండించట్లేదు? ఎందుకు నోరు విప్పి మాట్లాడటం లేదు? కనీసం ఈవిషయంలో తమ పార్టీ వాదనలయినా ఎందుకు వినిపించలేక పోతున్నారు?   జగన్ వైఖరి చూస్తుంటే నేటికీ కేసీఆర్ విషయంలో అతని వైఖరిలో ఎటువంటి మార్పు కలగలేదని స్పష్టమవుతోంది. కేసీఆర్ పట్ల జగన్, జగన్ పట్ల కేసీఆర్ అంత మెతక వైఖరి అవలంబించడానికి ఏదో చాలా బలమయిన కారణమే ఉండి ఉండవచ్చును. అదేమిటో నేడు కాకపోతే రేపయినా బయటపడటం తధ్యం. కానీ, పోలవరం విషయంలో కూడా నేడు జగన్ ఎందుకు స్పందించడం లేదో చెపితే ప్రజలు చాలా సంతోషిస్తారు.

వడ్డించేవాడు మనవాడయితే....

  వడ్డించేవాడు మనవాడయితే ఏ మూల కూర్చొన్నా విస్తరి నిండుతుందన్నట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని పునర్నిర్మాణం జరగవలసిన ఈ తరుణంలో, నరేంద్రమోడీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్టానికి చెందిన వెంకయ్య నాయుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, ఆనందగజపతి రాజు విమానయాన శాఖా మంత్రులుగా బాధ్యతలు చెప్పట్టడం రాష్ట్రానికి చాలా శుభపరిణామం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మోడీ క్యాబినెట్ తమ మొట్టమొదటి సమావేశంలోనే పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ లో కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేయడమే అందుకు ఉదాహరణగా చెపుతున్నారు.   నూతన రాజధాని నిర్మాణంతో బాటు, మిగిలిన అన్ని జిల్లాలలో రోడ్లు, నూతన భవనాలు తదితర మౌలికవసతులు కల్పనకు అవసరమయిన నిధులు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడే విడుదల చేయవలసి ఉంటుంది. అదేవిధంగా, నూతన రాజధానితో బాటు అంతర్జాతీయ విమానాశ్రయం, వివిధ జిల్లాలలో నూతన విమానాశ్రయాల నిర్మాణం జరగవలసి ఉంది. వాటికి అవసరమయిన అనుమతులు, నిధులు వగైరాలన్నీ విమానయాన శాఖా మంత్రి అశోక్ గజపతిరాజే మంజూరు చేయవలసిఉంటుంది. ఉదాహరణకు శంషాబాద్ విమానాశ్రయం పేరును మళ్ళీ స్వర్గీయ యన్టీఆర్ పేరును పెట్టాలని మహానాడులో చంద్రబాబుచేసిన ప్రతిపాదనపై కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు వెంటనే సానుకూలంగా స్పందిస్తూ, త్వరలోనే విమానాశ్రయం పేరును మార్చుతామని హామీ ఇచ్చారు. మరో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా చంద్రబాబు ప్రతిపాదనను సమర్దించారు.   అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పరకాల ప్రభాకర్ అర్ధాంగి శ్రీమతి నిర్మలా సీతారామన్ మానవవనరుల శాఖా మంత్రిగా బాధ్యతలు చెప్పట్టడం కూడా శుభాపరిణామమే. ఆమె ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా మేలు జరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా అనేక ఉన్నత విద్యాసంస్థలు ఏర్పాటు చేయవలసి ఉంది. వాటికి అవసరమయిన నిధులు, అనుమతులు వంటివి మానవ వనరుల శాఖ మంత్రి మంజూరు చేయవలసి ఉంది.   ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న చంద్రబాబు నాయుడుకి ప్రధానమంత్రి నరేంద్రమోడీతో మంచి సత్సంబంధాలు ఉండటం, ఇద్దరూ అభివృద్ధి మంత్రమే పటిస్తుండటం వంటివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు చేకూర్చే అంశాలే.

తెలంగాణా దొరలను బీసీలు ఎదుర్కోగలరా?

    తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గత కొన్ని నెలలుగా ‘సామాజిక తెలంగాణ’ ఏర్పాటు గురించి మాట్లాడుతున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పడమే కాకుండా, వారి ప్రతినిధి ఆర్. కృష్ణయ్యను పార్టీలో చేర్చుకొని తెలంగాణాకు పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించారు. నిన్న జరిగిన మహానాడు సమావేశంలో కూడా చంద్రబాబు మళ్ళీ ‘సామాజిక తెలంగాణ’ ఏర్పాటు గురించి మాట్లాడారు. కేసీఆర్ ధాటికి తట్టుకొని తెలంగాణాలో నిలబడాలంటే, అందుకు ఇదే దివ్యాస్త్రమని చంద్రబాబు భావిస్తున్నట్లున్నారు. అందుకే బీసీ వర్గానికి ఎల్.రమణను తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమించబోతున్నారు. ఆయన జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కూడా అయినందున అపారమయిన రాజకీయ అనుభవము కూడా ఉంది. ముఖ్యంగా బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో, కేసీఆర్ లేదా ఆయన కుటుంబ సభ్యులు ఆయన విషయంలో చాలా ఆచితూచి మాట్లాడవలసి ఉంటుంది. లేకుంటే బీసీల మీద దొరల అహంకారం ప్రదర్శిస్తున్నరని విమర్శలు ఎదుర్కోక తప్పదు.   ఇంతవరకు చంద్రబాబు అమలుచేసిన ఇటువంటి అనేక వ్యూహాలు దీర్గాకాలంలో మంచి ఫలితాలు ఇచ్చాయి. కనుక బహుశః వచ్చే ఎన్నికల నాటికి, ఒకవేళ కేసీఆర్ ప్రభుత్వం తన ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేక, చంద్రబాబుతో పోటీపడి తెలంగాణాను అభివృద్ధి చేయలేక చతికిలపడినట్లయితే, బీసీల నేతృత్వంలో తెదేపా తెలంగాణాలో కూడా బలపడుతుందని చంద్రబాబు ఆలోచన కావచ్చును.   అయితే గత పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉంటున్న తెలంగాణా తెదేపా సీనియర్ నేతలు, ఇప్పుడు పార్టీ అధ్యక్ష పదవిని కూడా వదులుకొనేందుకు అంగీకరిస్తారా? అనే అనుమానాలున్నాయి. కానీ చంద్రబాబు ఎన్నికల సమయంలో తామందరినీ కాదని, పార్టీలోకి కొత్తగా తీసుకువచ్చిన ఆర్.కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించినపుడు వారెవరూ వ్యతిరేఖించలేదు. కనుక ఇప్పుడు కూడా యల్. రమణకు పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెడితే వ్యతిరేఖించకపోవచ్చును. నిన్న మహానాడులో మాట్లాడిన తెలంగాణా నేతలందరూ పోటీలుపడి చంద్రబాబును ఆకాశానికి ఎత్తేయడం చూస్తే వారు చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేఖించకపోవచ్చనిపిస్తోంది.

మహానాడులో ఉత్సాహంగా పాల్గొన్న తెదేపా తెలంగాణా నేతలు

  నిన్నటి మహానాడు సమావేశాలకి తెదేపా సీనియర్ నేత రేవంత్ రెడ్డితో సహా మరి కొందరు తెలంగాణా నేతలు హాజరు కాకపోవడంతో మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ ఈరోజు సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరవడమే కాక, తను తెలంగాణాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం రూ.2లక్షలు విరాళం ఇస్తున్నట్లు సభాముఖంగా ప్రకటించారు. అంతేకాక పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం మరో రూ.5 లక్షల విరాళాలు కూడా ఇచ్చారు.   మరో సీనియర్ తెలంగాణా నేత మోత్కుపల్లి నరసింహులు మహానాడు సమావేశంలో మాట్లాడుతూ, స్వర్గీయ యన్టీఆర్ ఆనాడు తనకు పార్టీ టికెట్ ఇచ్చి ఎంతగానో ప్రోత్సహించడం వలననే నేడు ఈ స్థాయికి ఎదగగలిగానని, అందువల్ల ఎల్లపుడు తెదేపాకు తాను ఋణపడి ఉంటానని అన్నారు. తెలంగాణా ఉద్యమాల సమయంలో తనకు ఇతర పార్టీల నుండి చాలా బెదిరింపులు ఎదుర్కొన్నానని, అయినా తాను ఎన్నడూ పార్టీని వీడే యోచన చేయలేదని, వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో పార్టీని బలోపేతం చేస్తానని అన్నారు.   ఈసారి ఎన్నికలలో అనేకమంది తెదేపా నేతలు తెలంగాణాలో ఓడిపోయారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి వంటి కొందరు నేతలు ఎన్నికలలో గెలిచినప్పటికీ, తెలంగాణాలో తమపార్టీ అధికారంలోకి రాకపోవడం వలన, వారికీ తమ గెలుపు వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. అందువల్ల వారందరూ నిరుత్సాహానికిగురయిన మాట యధార్ధమే. కానీ, కాంగ్రెస్ కంటే తమ పరిస్థితి అన్నివిధాల మెరుగా ఉండటమే వారికి ఒకింత ఊరట కలిగిస్తోంది. త్వరలో తెలంగాణకు ప్రత్యేకంగా తెదేపా శాఖను ఏర్పాటు చేసినట్లయితే అందులో కీలక పదవులు దక్కే అవకాశం ఉన్నందున, ఒకరిద్దరు మినహాయించి దాదాపు అందరూ మహానాడు సమావేశాలలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చెప్పట్టబోతున్న చంద్రబాబు నాయుడు, తెలంగాణాలోని తన పార్టీని, నేతలని, కార్యకర్తలని ఏవిధంగా ముందుకు నడిపిస్తారో, వారిని ఏవిధంగా ఆదుకొంటారనే దానిపైనే పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.

కయ్యానికి కాలు దువ్వుతున్న కేసీఆర్

  ఇంతవరకు ఒకటిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జూన్ 2 నుండి ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలుగా విడిపోయి ఇరుగుపొరుగు రాష్ట్రాలుగా మారబోతున్నాయి. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే వాటి మధ్య, వాటి ముఖ్యమంత్రుల మధ్య, ప్రజల మధ్య మంచి సయోధ్య చాలా అవసరమని అందరికీ తెలుసు. కానీ దురదృష్టవశాత్తు రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేప్పట్టబోతున్న చంద్రబాబు, కేసీఆర్ ల మధ్య అప్పుడే మాటల యుద్ధం మొదలయింది. మొదట ప్రభుత్వోద్యోగుల విషయంలో మొదలయిన మాటల యుద్ధం, ఇప్పుడు పోలవరం ముంపు ప్రాంతాల విషయంలో మొదలయింది. ఇందుకు కేసీఆర్ నే నిందించవలసి ఉంటుంది. ఆయన కోరుకొన్న విధంగా తెలంగాణా ఏర్పాటయి, ఆయనే స్వయంగా దానికి ముఖ్యమంత్రి అవుతున్నప్పటికీ, ఆయన ఆంధ్ర ప్రజలు, పాలకుల పట్ల తన విద్వేష వైఖరిని మాత్రం విడిచిపెట్టేందుకు ఇష్టపడటం లేదు.   కానీ చాలా ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే, ఇదే కేసీఆర్ కొన్ని రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ “జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఎన్నికలలో గెలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతాడని, అతనేమి అంటరాని వ్యక్తి కాడని, ఇరుగు పొరుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు కాబోతున్న తాము కలిసి పనిచేసేందుకు ఎటువంటి అభ్యంతరమూ లేదని,” అన్నారు. జగన్మోహన్ రెడ్డి అడగక ముందే స్నేహహస్తం అందించిన కేసీఆర్, చంద్రబాబుతో మాత్రం కయ్యానికి కాలు దువ్వుతుండటం చాలా విచిత్రమనిపిస్తున్నా, అందుకు బలమయిన కారణం ఉంది.   జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణాపై ఎటువంటి ఆసక్తి లేదు. అందువల్ల అతనితో కేసీఆర్ కు ఎటువంటి ఇబ్బందీ లేదు. కానీ కేసీఆర్ తెదేపాను తుడిచి పెట్టేద్దామని ఎంతగా ప్రయత్నించినా వీలుపడటం లేదు. పైగా అది నేటికీ ఆయనకు పక్కలో బల్లెంలా మిగిలే ఉంది. అందుకే కేసీఆర్ చంద్రబాబును, తెదేపాను ద్వేషిస్తున్నారు. కేసీఆర్ తన వ్యక్తిగత, రాజకీయ ద్వేషాలతోనే ఏదో ఒక మిషతో చంద్రబాబు ప్రభుత్వంతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు.   ఒక కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న కేసీఆర్, ఇరుగుపొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సయోద్యకు ప్రయత్నించాలే తప్ప, ఈవిధంగా నిత్యం రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతూ కయ్యానికి కాలు దువ్వడం వల్ల రెండు రాష్ట్రాలకి, ప్రజలకి తీవ్ర నష్టమే తప్ప ఎటువంటి ప్రయోజనమూ ఉండదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రవిభజన వల్ల ఊహించని అనేక సమస్యలు ఎదురవుతాయని మొదటి నుండి చాలా మంది వారిస్తున్నపటికీ, ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు, ప్రణాళిక లేకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసి చేతులు దులుపుకొంది. ఊహించినట్లే ఇప్పుడు సమస్యలు ఒకటొకటిగా ఎదురవుతున్నాయి. అటువంటప్పుడు ఆ సమస్యలను సామరస్య ధోరణితో చర్చల ద్వారా పరిష్కరించుకొనే ప్రయత్నం చేసే బదులు, చంద్రబాబు సయోద్యకు ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ కేసీఆర్ మాత్రం నేటికీ కయ్యానికే మొగ్గు చూపడం సబబు కాదని సీమాంధ్ర ప్రజలు భావిస్తున్నారు.   అయితే ఆయన ఇదేవిధంగా తన ధోరణి కొనసాగించినట్లయితే, చివరికి ఆంద్ర ప్రజలే కాదు తెలంగాణా ప్రజలు కూడా ఆయన పట్ల విముఖత చూపే ప్రమాదం ఉందని, అందువల్ల కేసీఆర్ ఇప్పటికయినా తన ధోరణి మార్చుకొని సమస్యలను చర్చల ద్వారా సానుకూలంగా పరిష్కరించుకొనే ప్రయత్నం చేస్తే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కేసీఆర్ అందుకే కయ్యానికి కాలు దువ్వుతున్నారా?

  కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం చాలా హడావుడిగా రాష్ట్ర విభజన చేసి, ఎన్నికలలో గెలవలేక చేతులు దులుపుకొని వెళ్లిపోయింది. రాష్ట్రవిభజనతో ఆగ్రహంగా ఉన్న సీమాంధ్ర ప్రజలను చల్లబరిచేందుకు, పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా చేపడతామని ప్రకటించింది. అయితే ఆ ప్రాజెక్టు క్రింద తెలంగాణాలో ఖమ్మం జిల్లాలో కొన్ని వందల గ్రామాలు ముంపునకు గురవుతాయని గ్రహించి, ఆ ప్రాంతాలను ఆంధ్రాలో కలుపుతూ నిర్ణయం తీసుకొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన బిల్లులో పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదన చేసినప్పుడే కేసీఆర్ ఉద్యమం చేసి ఉండి ఉంటే నేడు ఇటువంటి పరిస్థితి ఎదురయ్యేది కాదు. కానీ, ఆనాడు కాంగ్రెస్ అధిష్టానంతో సత్సంబందాలున్న కారణంగా పోలవరంపై రగడ చేయలేదు. ఆ దైర్యంతోనే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణాలో ముంపు ప్రాంతాలను ఆంధ్రాకు బదలాయించింది.   ఇప్పుడు మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చింది గనుక సత్వరమే దీని కోసం ఒక ఆర్డినెన్స్ జారీ చేయవచ్చని మీడియాలో వస్తున్న వార్తలను చూసి, తెలంగాణా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టబోతున్న కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. ఒకవేళ మోడీ ప్రభుత్వం తమ సమ్మతి లేకుండా సరిహద్దులు మారుస్తూ ఆర్డినెన్స్ చేసేందుకు ప్రయత్నిస్తే తాము మళ్ళీ ఉద్యమం మొదలుపెడతామని హెచ్చరించారు. ఆర్టికల్ 3ప్రకారం చేయవలసిన పనిని ఆర్డినెన్స్ ద్వారా చేయాలని చూస్తే తాము ఖచ్చితంగా అడ్డుకొంటామని ఆయన హెచ్చరించారు. అవసరమయితే ఇద్దరు ముఖ్యమంత్రులతో చర్చించిన తరువాతే ఏ నిర్ణయమయినా తీసుకోవాలని కేసీఆర్ మోడీకి సూచించారు.   అయితే ముఖ్యమంత్రిగా బాధ్యత చేప్పట్టబోతున్న కేసీఆర్ ప్రభుత్వోద్యోగుల విషయంలో, ఇప్పుడు పోలవరం ముంపు ప్రాంతాల గురించి ఈ విధంగా మాట్లాడటానికి అసలు కారణం మాత్రం వేరే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్ ఎన్నికలలో పోటీ చేసి అధికారం దక్కించుకోగలిగారు కానీ ఆయన ఇంతవరకు ఒక్కసారి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం లేదు. పైగా ఎన్నికలలో గెలిచేందుకు ఆయన ప్రతీ కుటుంబానికి ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, కేజీ టూ పీజీ ఉచిత నిర్బంద విద్య వంటి అనేక ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పించారు. అవికాక విద్యుత్, సాగునీరు, ఉద్యోగుల క్రమబద్దీకరణ వంటి అనేక సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. అయితే అవ్వన్నీ పరిష్కరించడం అంత తేలికయిన విషయం కాదు. బహుశః అందుకే ఆయన తనకు బాగా తెలిసిన విద్యను మళ్ళీ ప్రదర్శిస్తున్నారు. తెలంగాణా ప్రజలు దోపిడీకి గురవుతున్నారంటూ మళ్ళీ వారిలో సెంటిమెంటు రాజేసి, వారి దృష్టిని మళ్ళించే ప్రయత్నంలోనే ఆయన ఈవిధంగా కయ్యాలకు దిగుతున్నారు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   విశేష ప్రజాధారణతో డిల్లీ పీఠం ఎక్కిదిగిపోయిన అరవింద్ కేజ్రీవాల్ అందుకు సజీవ ఉదాహరణ అంటున్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వం నడపడం చేతకాక, ప్రజల దృష్టిని మళ్ళించేందుకు, తమకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే నిత్యం గొడవలు పెట్టుకొంటూ, ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా డిల్లీ రోడ్ల మీద నిరసన దీక్షలు చేసేరు. చివరికి ఒకమంచి రోజు, ఒక కుంటి సాకు చూసుకొని అధికారంలో నుండి దిగిపోయిన సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ కూడా అచ్చు అరవింద్ కేజ్రీవాల్ లాగే ఇప్పుడు వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆయన కేజ్రీవాల్ లాగ మధ్యలో అధికారం వదులుకోరని చెపుతున్నారు.   వారి విశ్లేషణే నిజమయితే, ఇకపై రానున్న ఐదేళ్ళు కూడా కేసీఆర్ ఏదో ఒక కుంటి సాకుతో ఆంద్ర, కేంద్ర ప్రభుత్వాలతో యుద్ధం చేస్తూనే ఉంటారనుకోవలసి ఉంటుంది. తెలంగాణా ప్రజలకు అనేక ఆశలు కల్పించి వాటిని నెరవేర్చకుండా ఇలా ఏదో ఒక వంకతో వారి దృష్టిని మళ్ళించడానికి ప్రయత్నిస్తూ కాలక్షేపం చేసేయవచ్చని కేసీఆర్ భావిస్తే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదు.