పార్టీ సమీక్షలనగా ఆత్మస్తుతి, పరనింద

      సాధారణంగా ఎన్నికలలో ఓడిన పార్టీలు సమీక్షా సమావేశాలు నిర్వహించుకొని ఆత్మవిమర్శ చేసుకొని తమ లోపాలను గుర్తించి సవరించుకొనే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొంటాయి. కానీ మన రాజకీయ పార్టీలు సమీక్షా సమావేశాలను కూడా తమ ప్రత్యర్ధులు, మీడియా ఎత్తిపొడుస్తాయనే భయంతోనే సమీక్షా సమావేశాలను కూడా ఒక తప్పనిసరి తద్ధినంలా నిర్వహించేసి చేతులు దులుపుకోవడం రివాజయిపోయింది. ఎలాగూ అంతమంది నేతలు ఒక చోట కలవడం అరుదు గనుక, అలా కలిసినప్పుడు అందరూ కూడా ఆత్మస్తుతి, పరనిందతో కాలక్షేపం చేసి దానినే సమీక్షా సమావేశాలుగా భావిస్తుంటారు. ఈరోజు విజయవాడలో జరుగుతున్న కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశాలలో కూడా ప్రస్తుతం అదే జరుగుతోంది.   ఈ సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నేతలు కేవీపీ రామచంద్ర రావు, సుబ్బిరామిరెడ్డి, కన్నా లక్ష్మి నారాయణ, పల్లంరాజు, కిల్లికృపా రాణీ, కొందరు మురళి, మల్లాది విష్ణు తదితరులు అనేకమంది పాల్గొన్నారు. ఇంతమంది హేమాహేమీలు పాల్గొన్న ఈ సమీక్షా సమావేశాలాలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలు కనుగొని, వాటిని సవరించుకొనేందుకు తగిన నిర్ణయాలు తీసుకోవలసి ఉంది. అదేవిధంగా అసలు శాసనసభలో కాంగ్రెస్ తరపున ఒక్క సభ్యుడు కూడా ప్రాతినిధ్యం లేకపోవడం చేత అధికారంలో నున్న తెదేపా ప్రభుత్వాన్ని ఏవిధంగా ఎదుర్కోవాలనే అంశంపై చర్చ చెప్పట్టవలసి ఉంది. కానీ పార్టీని వీడిపోయిన కాంగ్రెస్ నేతలను అవినీతిపరులని, పార్టీలో మిగిలినవారు మాత్రమే నిజాయితీపరులని చెప్పుకోవడానికే పుణ్యకాలం కాస్త సరిపోయేలా ఉంది. ఇక అవకాశం దొరికితే తెదేపాలోకి దూకేసేందుకు తన సోదరుడు ఆనం రామినారాయణరెడ్డి సిద్దంగా ఉన్నారనే సంగతి కూడా మరిచిపోయిన ఆనం  వివేకానంద రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం నేతలందరూ ఇబ్బడి ముబ్బడిగా ఆస్తులు కూడబెట్టుకోన్నారని, కానీ పార్టీ ఓడిపోయేలా కనిపించడంతో అనేకమంది తెదేపా, వైకాపాలలోకి దూకేసారని ఆరోపించారు. అలాగని పార్టీలో మిగిలిన వారందరూ నిజాయితీ పరులేనని చెప్పలేనని, వారూ చాలా ఆస్తులు పోగేసారని ఆరోపించారు. ఇక చంద్రబాబుకి రెండు కళ్ళు, రెండు కాళ్ళు, అన్నీ రెండే కోరుకొంటారు గనుక ఆయన కేవలం రెండేళ్ళే అధికారంలో కొనసాగుతారని జోస్యం చెప్పారు. ఆయన మాటలకి కాంగ్రెస్ నేతలందరూ పకపకమని నవ్వారు. కానీ సమీక్షా సమావేశాలలో ఇటువంటి డైలాగులతో సరదాగా కాలక్షేపం చేయడం వలన వారికి వినోదం కలుగుతుంది తప్ప పార్టీకే ఎవిదంగా మేలు జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఏమయినప్పటికీ కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉన్నపుడు డబ్బులు పోగేసుకొంటారని పార్టీ సమావేశంలోనే ఒక కాంగ్రెస్ నేత చెప్పుకోవడం చూస్తే కాంగ్రెస్ పార్టీ అవినీతిని పెద్ద తప్పుగా భావించడం లేదని, కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉంటే ఏమి చేస్తారో కూడా స్పష్టమవుతోంది.

మరో తప్పుకి సిద్దమవుతున్న కిరణ్

  ఒకప్పుడు అందు లేడు..ఇందు లేడు అనే సందేహం వలదన్నట్లు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కనబడిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాల నుండి కనబడకుండా అదృశ్యమయిపోయారు. ఆయన మీడియా భారి నుండి తప్పించుకొనేందుకు ప్రస్తుతం బెంగుళూరులో విశ్రాంతి తీసుకొంటున్నట్లు సమాచారం. మరో విశేషం ఏమిటంటే ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదివరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీకి సన్నిహితంగా ఉండే కొందరు గుజరాతీ పారిశ్రామికవేత్తలకు ఆయన సహాయపడ్డారు. ఇప్పుడు బీజేపీలో చేరేందుకు వారి ద్వారా నరేంద్ర మోడీతో సంప్రదింపులు చేస్తున్నట్లు తాజా సమాచారం.   ఎన్నికలలో ఓడిపోయిన తరువాత మళ్ళీ కాంగ్రెస్ గూటికే చేరుకొని ఉంది ఉంటె ఎవరూ ఆశ్చర్యపోయేవారు కాదు. ఆక్షేపించేవారు కాదు. పార్టీ శ్రేయోభిలాషిగా ఆయన చెప్పిన మాటలను పెడచెవిన పెట్టిన కారణంగా కాంగ్రెస్ అధిష్టానం కూడా ఓటమి భారంతో క్రుంగిపోతోంది గనుక ఒకవేళ ఆయన మళ్ళీ పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపితే తప్పకుండా ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానించి ఉండేది. కానీ పొరపాట్లు చేయడం అలవాటుగా మారినందునేమో కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కు బదులు బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.   ఇదే ఆలోచన ఆయన ఎన్నికలకు ముందు, తెదేపాతో బీజేపీ పొత్తులు ఖరారు కాక ముందు చేసి ఉండి ఉంటే బహుశః నేడు ఆయన పరిస్థితి వేరేలా ఉండేదేమో! ఆ సమయంలో సీమంద్రాలో బీజేపీని నడిపించేందుకు సమర్దుడయిన నాయకుడు లేక అల్లాడుతున్న బీజేపీ, బహుశః ఆయనకే ఆ భాద్యతలు కట్టబెట్టి ఉండేదేమో! అప్పుడు బీజేపీ తెదేపాతో పొత్తుల గురించి ఆలోచించేదే కాదేమో!   సమయం కాని సమయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో అందెవేసిన కిరణ్, ఇప్పుడు కాంగ్రెస్ కు బదులు బీజేపీలో చేరాలనుకొంటే అది ఆయన రాజకీయ జీవితంలో మరొక ఘోర తప్పిదం అవుతుంది. ఎందువలన అంటే, మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన ఆయన, ఇప్పుడు ఇంతవరకు మొహం కూడా చూడని బీజేపీ నేతల క్రింద పనిచేయవలసి ఉంటుంది. ఎన్డీయే భాగస్వామి అయిన చంద్రబాబుతో వినయంగా మెలగ వలసి ఉంటుంది. అయినప్పటికీ ఆయనకీ రాష్ట్రంలో కాని కేంద్రంలో గానీ ఇప్పటికిప్పుడు ఎటువంటి మంత్రి పదవులు దక్కే అవకాశం లేదు. ఒకవేళ బీజేపీలో చేరితే అందులో ఒక అనామకుడిగా మిగిలిపోవచ్చును. మరి ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకొంటారో వేచి చూడాలి.

ఆంధ్రా విద్యార్ధులను ఎవరు ఆదుకొంటారు?

        హైదరాబాదులో చదువుకొంటున్న ఆంధ్రా విధ్యార్దులకు, తెలంగాణా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వవలసిన అవసరం ఉందా? అని ప్రశ్నించిన కేసీఆర్, ఈ విద్యా సంవత్సరం నుండి కేవలం తెలంగాణా విద్యార్ధులకు మాత్రమే ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. అందువల్ల ఈరోజు ఆయన నిర్వహించబోయే అఖిలపక్ష సమావేశంలో ఈ ప్రతిపాదనను కూడా చర్చకు పెట్టబోతున్నారు. బహుశః ఈ ప్రతిపాదనకు ప్రతిపక్షాల నుండి మిశ్రమ స్పందన రావచ్చును.   ఆయన తెలంగాణా ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈవిధంగా కొంత భారం తగ్గించుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు చెపుతున్నప్పటికీ, తెలంగాణా ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజలందరినీ సమానంగా చూడవలసిన ఆయన, ఆంద్ర విద్యార్దులపట్ల ఈవిధంగా వివక్ష చూపాలనుకోవడం వలన విమర్శలు ఎదుర్కోవలసి రావచ్చును. కానీ, ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీలు కొన్ని సూచనలు చేసి అందుకు ఆయన అంగీకరిస్తే మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఏమయినప్పటికీ, తెలంగాణాలో పుట్టి పెరిగి అక్కడే చదువుకొంటున్న విద్యార్ధులు, తెలంగాణా విద్యార్ధులు, ఆంధ్రా నుండి వచ్చిన విద్యార్ధులకు కేసీఆర్ ప్రభుత్వం వేర్వేరు విధానాలు అవలంభించాలనుకొంటే అది విద్యార్ధులలో కూడా చీలికలు సృష్టిస్తుంది. ముఖ్యంగా ఆంద్ర విద్యార్ధులలో, వారి తల్లి తండ్రులలో అభద్రతా భావం సృష్టిస్తుంది. అందువల్ల కేసీఆర్ ప్రభుత్వం ఈవిషయంలో ప్రతిపక్షాల సలహాలు, సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవడం మేలు.   ఒకవేళ కేసీఆర్ ప్రభుత్వం ఆంధ్రా విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వని పక్షంలో దానిపైనే ఆధారపడి చదువుకొంటున్న వందలాది విద్యార్ధులు చదువులు కొనసాగించలేని దుస్థితి ఏర్పడుతుంది. హిమాచల్ ప్రదేశ్ లో హైదరాబాద్ కు చెందిన విద్యార్ధులు మరణించినపుడు చంద్రబాబు స్వచ్చందంగా ముందుకు వచ్చి తక్షణమే సహాయచర్యలు చేప్పట్టి, మరణించిన విద్యార్ధులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించి ఏవిధంగా మానవతా దృక్పదం ప్రదర్శించారో అదేవిధంగా కేసీఆర్ కూడా ఆంధ్రా విద్యార్దులపట్ల మానవతా దృక్పధంతో స్పందిస్తే అందరూ హర్షిస్తారు. ఒకవేళ తన ప్రభుత్వమొక్కటే వారి భారం మోయలేదని ఆయన భావిస్తే ఆయన చంద్రబాబుని సంప్రదించి ఇరు ప్రభుత్వాలు విద్యార్ధుల భాద్యతను స్వీకరిస్తే అందరూ హర్షిస్తారు.

రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు బ్లూ ప్రింట్ సిద్దం చేసారా?

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి క్యాబినెట్ సమావేశం తరువాత రాష్ట్ర రాజధానితో బాటు వైజాగ్, తిరుపతి మరియు నగరాలను మెగా సిటీలుగా అభివృద్ధి చేయాలనుకొంటున్నట్లు తెలిపారు. పదమూడు జిల్లాలలో ఒక్కో ప్రాంతానికి ప్రత్యేకమయిన వనరులున్నాయని, వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకొనేలా ఆ ప్రాంతాల అభివృద్ధికి తగిన ప్రణాళికలు సిద్దం చేస్తామని ఆయన తెలిపారు. నిన్న ఆయనతో సమావేశమయిన శివరామ కృష్ణన్ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తమతో కూడా మళ్ళీ అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారని తెలిపారు. అభివృద్ధి అంతా కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా మొత్తం అన్ని జిల్లాలకు సమానంగా వ్యాపింపజేయాలని ఆయన కోరుకొంటున్నారని వారు తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం అన్ని విధాల తగిన స్థలం కోసం తమ అన్వేషణ కొనసాగిస్తామని, అయితే ఈ విషయంలో తాము ఆయనకు కేవలం సలహాలు, సూచనలు మాత్రమే చేస్తామని అంతిమ నిర్ణయం ఆయనే తీసుకోవలసి ఉంటుందని వారు తెలిపారు. అభివృద్ధిని వికేంద్రీకరణ చేయాలని చంద్రబాబు భావిస్తున్నందున రాజధానితో బాటు ఇతర నగరాలు, పట్టణాల అభివృద్ధికి తగిన సూచనలు, సలహాలు, వాటికీ ఉన్న అవకాశాలు, అవసరమయిన వనరులు, నిధుల గురించి కూడా తమ నివేదికలో చేర్చుతామని తెలిపారు. రేపటి నుండి రాయలసీమలో పర్యటించి ఆ ప్రాంతపు వివరాలు కూడా సేకరిస్తామని తెలిపారు. చంద్రబాబు, శివరామ కృష్ణన్ కమిటీ సభ్యులు చాలా లోతుగా చర్చించారు గనుక ఇప్పుడు రాజధాని నిర్మాణం, ఇతర నగరాలు, పట్టణాలు అభివృద్ధి విషయంలో వారందరూ సరయిన అవగాహనకు వచ్చి ఉండవచ్చును. అందువల్ల ఈసారి కమిటీ నుండి మరింత నిర్దిష్టమయిన, మెరుగయిన ప్రతిపాదనలు సూచనలు సలహాలు వచ్చే అవకాశం ఉంది.   ఇక కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి యం. వెంకయ్య నాయుడు వైజాగ్ లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ప్రజలు ఎటువంటి అనుమానాలు, అపోహలకు లోను కావద్దని ఆయన తెలిపారు. రాష్ట్రానికి ఆర్ధిక లోటు ఉన్న సంగతి కేంద్రానికి కూడా తెలుసునని, అందువల్ల కనీసం మొదటి సంవత్సరం ఆ లోటును కేంద్ర ప్రభుత్వమే భరించవచ్చని ఆయన తెలిపారు. ఎన్ని అవాంతరాలు ఎదురయినా కేంద్రం వాటిని అధిగమించి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో వంద స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని యోచిస్తోందని తెలిపారు. వాటిలో కొన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉండవచ్చును గనుక ఆ విధంగా కూడా రాష్ట్రంలో కొన్ని జిల్లాల అభివృద్దికి కేంద్రం నుండి అధనపు నిధులు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రానికి ఆర్ధిక సమస్యలున్నాయి తప్ప సహజ వనరులు, మానవ వనరులకు లోటు లేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఆర్ధికంగా సహాయపడతామని స్పష్టమయిన హామీ ఇస్తోంది గనుక ఇక ప్రయత్నా లోపం లేకుండా కేంద్రం నుండి నిధులు రాబట్టుకొంటూ, రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం గట్టిగా ప్రయత్నించాల్సి ఉంది.

హార్డ్ వేర్ రంగంపై దృష్టి పెట్టాలి: జే.ఏ. చౌదరి

  హైదరాబాదు నగరాన్ని ప్రపంచ సాఫ్ట్ వేర్ చిత్రపటంలో స్థానం కల్పించడానికి చంద్రబాబు చేసిన కృషి అందరికీ తెలిసిందే. ఆ మహాయజ్ఞంలో ఆయనతో కలిసి పనిచేసిన వారిలో జేఏ చౌదరి గారు కూడా ఒకరు. ఆయన ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ టీ.ఐ.ఈకి ప్రెసిడెంట్ మరియు ప్రముఖ గ్రాఫిక్స్ సంస్థ యన్.వి.ఐ.డీ.ఐ.ఏకు మేనేజింగ్ డైరెక్టర్ గా సేవలందిస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత మళ్ళీ ఇప్పుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా సాఫ్ట్ వేర్ సంస్థలను రప్పించి, రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాది అవకాశాలు పెంచడం, రాష్ట్ర ఆర్ధిక లోటును పూడ్చుకోవలాసిన అవసరం ఏర్పడింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అనేక అమూల్యమయిన సూచనలు చేసారు. ఆయన ఏమి చెప్పారంటే...   “ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ లో సాఫ్ట్ వేర్ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. కానీ మైక్రోసాఫ్ట్ వంటి సాఫ్ట్ వేర్ దిగ్గజాలను రాష్ట్రానికి రప్పించవలసి ఉంది. అందుకోసం చంద్రబాబు ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సంస్థతో సహా అనేక దేశ, విదేశీ కంపెనీలతో సంప్రదింపులు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో మన రాష్ట్రానికి చెందిన సత్య నాదెళ్ళ మైక్రోసాఫ్ట్ సంస్థకు సి.ఈ.ఓ. గా నియమితులవడం మన అదృష్టమనే చెప్పుకోవచ్చును. చంద్రబాబు ఆయనతో కూడా మాట్లాడారు. అటువంటి పెద్ద సంస్థలను రాష్ట్రానికి రప్పించగలిగితే, వాటిని ఇతర సంస్థలు అనుసరిస్తాయి.   మన రాష్ట్రం, దేశం సాఫ్ట్ వేర్ రంగంలో చాలా మంచి పేరు సంపాదించుకొంది. అయితే హార్డ్ వేర్ రంగంపై మనం ఇంకా దృష్టి పెట్టవలసి ఉంది. మనకున్న అపరిమితమయిన మానవ వనరులను వినియోగించుకొని మనం ఈ రంగంలో అభివృద్ది సాధించేందుకు కృషి చేయాల్సి ఉంది. అన్ని విధాల అభివృద్ధి చెందిన చెన్నై నగరానికి సమీపంలో గల నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో, బెంగుళూరుకు దగ్గరగా ఉండే అనంతపురం జిల్లాలలో ఈ సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ పరిశ్రమలు ఏర్పాటు చేసుకొంటే వెనుకబడిన ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందడమే కాకుండా, ఆ సంస్థలు కూడా త్వరగా నిలద్రోక్కుకోగలవు.   అదేవిధంగా ఓడిస్సా రాష్ట్రానికి దగ్గరగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈ సంస్థలు స్థాపించగలిగితే అక్కడ కూడా అభివృద్ధి జరిగి, సంస్థలు త్వరగా నిలద్రోక్కుకోగలవు. వైజాగ్ లో ఇప్పటికే కొన్ని ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి కనుక అక్కడికి కొత్తవి రప్పించడం పెద్ద కష్టమేమీ కాదు. సాఫ్ట్ వేర్ తో బాటు హార్డ్ వేర్ సంస్థలను కూడా ఏర్పాటు చేసేందుకు గట్టిగా కృషిచేయాల్సుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా హార్డ్ వేర్ సంస్థల స్థాపనకు ప్రోత్సహాకాలు ఇచ్చేందుకు సుముఖంగా ఉంది గనుక మనం ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని హార్డ్ వేర్ సంస్థల స్థాపనకు గట్టిగా కృషి చేయాలి. మన రాష్ట్రం సాఫ్ట్ వేర్ రంగంలో మంచి పేరు సంపాదించుకొంది. అదేవిధంగా ఇప్పుడు హార్డ్ వేర్ రంగంపై కూడా మంచి పట్టు సాధించాల్సి ఉంది. చంద్రబాబు కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన నన్ను మళ్ళీ ఆహ్వానిస్తే తప్పకుండా రాష్ట్ర పునర్నిర్మాణంలో పాలుపంచుకోవడానికి సిద్దంగా ఉన్నాను, “ అని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం-3

  ఒకప్పుడు ప్రజలకి ప్రభుత్వంపై అపార నమ్మకం ఉండేది. ప్రభుత్వం తమ ధన, మాన, ప్రాణాలకు పూర్తి భద్రత ఇస్తుందని నమ్మేవారు. కారణం అప్పటి ప్రభుత్వాలను నడిపిన రాజకీయ నేతలు చాలా చిత్తశుద్దితో, నిస్వార్ధంగా పాలన సాగించేవారు. కానీ ఇప్పుడు అటువంటి గొప్ప నేతలు లేరు, అందువల్ల ప్రభుత్వాలపై ప్రజలకు మునుపటి నమ్మకమూ లేదు. ప్రభుత్వాలు కూడా ప్రజలలో ఆ అపనమ్మకాన్ని మరింత పెంచుతూనే ఉన్నాయి.   ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధ ప్రయోజనాల కోసం ఏకంగా రాష్ట్ర విభజనకే పూనుకొంది. తెలంగాణా ఏర్పాటు చేయడాన్ని ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ అందుకోసం సీమంద్రా ప్రజలను రోడ్డున పడేయడమే చాలా దారుణం. అందుకే ఆ పార్టీకి ఎన్నికలలో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా చాలా కటినంగా శిక్షించారు. కానీ అదే సమయంలో ప్రజలు చంద్రబాబు హామీలపై, సమర్ధతపై నమ్మకం ఉంచి తెదేపాను గెలిపించారు.   అందువల్ల ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొనే బాధ్యత చంద్రబాబు, తెదేపా నేతలదే. ఇప్పుడు తెదేపా ప్రభుత్వం ముందు అనేక క్లిష్టమయిన సమస్యలున్నాయి. వాటిని అధిగమించాలంటే, నిబద్దత, దీక్ష దక్షతలతో పాటు ప్రజలలో ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడేలా చేయడం కూడా చాలా అవసరం. అప్పుడే వారి నుండి కూడా పూర్తి సహకారం దొరుకుతుంది. రాష్ట్ర ఆర్ధిక స్థితి గురించి నిత్యం ప్రజలకు వివరిస్తూ వారి నుండి సహాయ సహకారాలు అర్ధించడమే కాకుండా, కోట్లకు పడగలెత్తిన నేతలందరూ కూడా స్వయంగా భారీ విరాళాలు ఇచ్చి, తమకు ప్రభుత్వం కల్పిస్తున్న డజన్ల కొద్దీ కార్లతో కూడిన కాన్వాయిలను, బ్లాక్ క్యాట్ కమెండో సెక్యురిటీ వంటి కొన్ని సౌకర్యాలను వదులుకొని, ప్రభుత్వానికి చెల్లించవలసిన ఇంటిపన్నులు, నీటి పన్నులు, కరెంటు బిల్లులు, ఫోన్ బిల్లులు వంటి కోట్లాది రూపాయల బాకీలను వెంటనే చెల్లించి ప్రజలలో నమ్మకం కలిగించవచ్చును. కానీ వారు ఎటువంటి త్యాగాలు చేయకుండా ప్రజాధనంతో విలాసంగా జీవిస్తూ ప్రజలను త్యాగాలు చేయమని, విరాళాలు ఇమ్మని కోరితే ప్రజల చేతిలో కాంగ్రెస్ పార్టీలాగే భంగపాటు తప్పదని గుర్తుంచుకోవాలి.   ప్రజలు తమ నుండి ఏమి ఆశిస్తున్నారో చాలా స్పష్టంగా తెలుసు గనుక అధికారం చేప్పట్టిన నేతలందరూ, నిజాయితీగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం మొదలుపెడితే, ప్రజలందరూ కూడా తమ వంతు సహకారం అందించడానికి ఎన్నడూ వెనకాడరు. ప్రజలు, ప్రభుత్వము చేయిచేయి కలిపి నడిస్తే, రాజధాని నిర్మాణం, రాష్ట్ర పునర్నిర్మాణం పెద్ద అసాధ్యమేమీ కాదు.  

ప్రత్యేక హోదా అర్హత ఆంధ్రప్రదేశ్‌కి లేదు: ప్రణాళికా సంఘం

      రాష్ట్ర విభజన విషయంలో అన్యాయం జరిగినా, ప్రత్యేక హోదా దక్కుతుందన్న ఊరటలో వున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కేంద్ర ప్రణాళికా సంఘం పిడుగు వేసింది. కేంద్రం నుంచి అదనపు సాయం పొందే అర్హత, ప్రత్యేక హోదా పొందే అర్హత ఆంధ్రప్రదేశ్ కు లేదని, జాతీయ అభివృద్ధి మండలి నిర్దేశించిన నిబంధనలు, సూత్రాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పొందలేదని ప్రణాళికా సంఘం తేల్చి చెప్పింది. ప్రణాళికా శాఖ కేంద్ర మంత్రి ఇందర్ జీత్ సింగ్ రావుకు ప్రణాళికా సంఘం అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌కి ఐదేళ్ళపాటు ప్రత్యేక హోదా ఇస్తామన్న యుపిఎ గవర్నమెంట్ వాగ్దానం, పదేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ హామీ, ప్రత్యేక హోదా పదిహేనేళ్ళపాటు కావాలని కోరుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఆశ గల్లంతయ్యే ప్రమాదం కనిపిస్తోంది. జాతీయ అభివృద్ధి మండలి నిబంధనల ప్రకారం కొండలు, దుర్గమ ప్రాంతాలు ఉండటం, జన సాంద్రత తక్కువగా ఉండటం, పెద్ద సంఖ్యలో గిరిజన జనాభా ఉండటం, వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న సరిహద్దు రాష్ట్రమై ఉండటం వంటి లక్షణాలున్న రాష్ట్రాలకే ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వడానికి వీలవుతుంది. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, ఉత్తరాఖండ్, నాగాలాండ్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, సిక్కింలకు మాత్రమే ప్రత్యేక హోదా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్‌ని ప్రత్యేకంగా పరిగణించి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాన్ని పరిశీలించే ఛాన్స్ వుందని కొందరు అధికారులు అంటున్నారు.

మా ఫిలిం ఛాంబర్ మాగావాలె..

  రాష్ట్ర విభజనలో భాగంగా పీటముడిపడున్న ప్రభుత్వ శాఖలను, వాటిలో పనిచేసే ప్రభుత్వోద్యోగులను ఎలాగో అతికష్టం మీద రెండు రాష్ట్రాలకు మధ్య పంపకాలు అయ్యాయి. కానీ హైదరాబాదు కేంద్రంగా ఉన్న తెలుగు సినీ పరిశ్రమలో మాత్రం ఇంకా ఈ పంపకాలు జరగకపోవడంతో తెలంగాణా సినీ పరిశ్రమగా విడిపోయిన కొందరు మా మా ఫిలిం ఛాంబర్ మాగావాలె...అంటూ ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనం ముందు ఈ రోజు గొడవకు దిగారు. వారు ఇప్పటికే తెలంగాణా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను ఏర్పాటు చేసుకొన్నారు. కానీ ఇంతవరకు అన్ని ప్రాంతాలకు కలిపి ఉమ్మడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ కార్యాలయ భవనంలో తమకు న్యాయంగా దక్కవలసిన వాటా తమకీయమని డిమాండ్ చేస్తూ ధర్నా చేసారు.   వారు విడిపోవాలని గట్టిగా పట్టుబడుతుంటే, కొద్ది రోజుల క్రితం ఇరుప్రాంతాలకు కలిపి కొత్తగా తెలుగు ఫిలిం ఛాంబర్ అనే మరో కొత్త సంస్థను ఏర్పాటు చేసారు. రాష్ట్రాలు విడిపోయినప్పటికీ ఒక రాష్ట్రంలో తీసిన సినిమాలు మరొక రాష్ట్రంలో విడుదల చేయాలంటే, అందుకు రెంటి మధ్య అనుసంధానంగా ఇటువంటి ఏర్పాటు అవసరమనే మంచి ఆలోచనతోనే దీనిని ఏర్పాటు చేసారు. కానీ దానితో తమకు ఎటువంటి సంబందమూ, అవసరమూ లేదని తెలంగాణకు చెందిన కొందరు నిర్మాతలు, డిస్త్రిబ్యుటర్లు వాదిస్తున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో ఇంకా ఒకే కార్యాలయంలో కలిసి పనిచేయడం అసాధ్యమని వారు వాదిస్తున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ కార్యాలయ భవనంలో తమ వాటాగా రావలసిన భాగాన్ని తమకు అప్పగించాలని, లేకుంటే బలవంతంగానయినా ఆక్రమించుకొంటామని హెచ్చరించారు.   ఫిలిం ఛాంబర్ భవనంలో తెలంగాణా సినీ పరిశ్రమవారికి ఈయవలసిన భాగం పంచి ఇచ్చేయవచ్చును. కానీ ఇంత వ్యతిరేఖత ఎదుర్కొంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తెలుగు సినీ పరిశ్రమ ఎంతోకాలం హైదరాబాదుని అంటిపెట్టుకొని ఉండటం కష్టమే. తెలంగాణా ఉద్యమాలు జరుగుతున్నంత కాలం, సినీ పరిశ్రమ చాలా కష్టాలు ఎదుర్కొంది. చాలా తీవ్రంగా నష్టపోయింది. అయినప్పటికీ అక్కడే కొనసాగుతోంది.   మా అధ్యక్షుడు మురళీ మోహన్ మాట్లాడుతూ “మద్రాసు నుండి హైదరాబాద్ కు సినీ పరిశ్రమ తరలి వచ్చి స్థిరపడిందనుకొంటున్న సమయంలో ఈ సమస్య రావడం దురదృష్టం. ఇప్పటికిప్పుడు హైదరాబాదు నుండి వేరే చోటకు సినీ పరిశ్రమను తరలించడం చాలా కష్టం. అందువల్ల కొన్ని సమస్యలు ఎదురయినా ఇక్కడే కొనసాగుతాము. ఇరు ప్రభుత్వాలు కూడా తెలుగు సినీ పరిశ్రమకు పూర్తి సహకారం అందింస్తాయని ఆశిస్తున్నాము,” అని అన్నారు.   హైదరాబాదులో అనేక ఫిలిం మరియు రికార్డింగ్ స్టూడియోలు, ల్యాబులు, చిత్ర నిర్మాణానికి అవసరమయిన సామాగ్రీ, సాంకేతిక నిపుణులు, జూనియర్ ఆర్టిస్టులు వగైరా అన్నీలభ్యమవుతాయి. అందువల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సినీ పరిశ్రమ హైదరాబాదులోనే కొనసాగక తప్పదు. కానీ, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే ముండే మేల్కోవడం మేలని ఇప్పటికే ఒకసారి తెలిసి వచ్చింది. కనుక సినీ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనువయిన ప్రాంతానికి తరలించేందుకు ఇప్పటి నుండే మెల్లగా ఏర్పాట్లు చేసుకొనట్లయితే, రాజధాని విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇబ్బందులు పడుతున్నట్లుగా సినీ పరిశ్రమ ఇబ్బందులు పడకుండా తప్పించుకోవచ్చును. సినీ పరిశ్రమ నుండి వచ్చిన మురళీ మోహన్, బాలకృష్ణ వంటివారు స్వయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నారు గనుక వారే చొరవ తీసుకొని పరిశ్రమకు కావలసిన సౌకర్యాలన్నిటినీ కల్పించేందుకు కృషి చేస్తే బాగుంటుంది.

ఒకదెబ్బకు రెండు పిట్టలా?

  నిన్న వైజాగ్ లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. గత పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో క్విడ్-ప్రో క్రింద జరిగిన అక్రమ భూపంపకాలను గుర్తించి, అటువంటి భూములను తిరిగి ప్రభుత్వం స్వాదీనం చేసుకోవాలని నిర్ణయించారు. అందుకోసం మంత్రులతో కూడిన ఒక సబ్ కమిటీని వేసేందుకు చంద్రబాబు అంగీకరించారు. క్విడ్ ప్రోకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న అవినావ సంబంధం గురించి అందరికీ తెలిసిందే. అంటే చంద్రబాబు ప్రభుత్వం తన తొలి సమావేశంలోనే అతని చుట్టూ మరింత గట్టిగా ఉచ్చు బిగించేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు అర్ధమవుతోంది. అయితే చంద్రబాబు మాత్రం తనకు ఎవరిపైనా వ్యక్తిగతంగా ద్వేషం లేదని, అక్రమంగా కేటాయించబడ్డ ప్రభుత్వ భూములను గుర్తించి వెనక్కు తీసుకోవడానికే ఈ ప్రతిపాదనకు అంగీకరించానని చెప్పుకొన్నారు. కానీ అన్ని నదులు చివరికి సముద్రంలోనే కలిసినట్లుగా, అన్నిక్విడ్ ప్రో కేసులూ చివరికి జగన్మోహన్ రెడ్డి కేసులలోనే కలుస్తున్నాయి గనుక ఈ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన మిగిలినవారందరితో పాటు జగన్మోహన్ రెడ్డికీ మళ్ళీ సమస్యలు తప్పవని అర్ధం అవుతోంది.   ప్రస్తుతం అతనిపై ఇదే వ్యవహారంలో పది చార్జ్ షీట్లు సీబీఐ కోర్టులో ఉన్నాయి. గనుక ఆ కేసులతో సంబంధం ఉన్న భూముల వ్యవహారంలో మంత్రుల సబ్-కమిటీ వేలు పెట్టలేదు కానీ ఇంకా అటువంటివి మరేమయినా ఉన్నాయేమో తెలుసుకొని వాటిని వెనక్కు తీసుకొనే ప్రయత్నం చేయవచ్చును. ఇదివరకు జగన్ క్విడ్ ప్రో కేసులపై సమగ్ర దర్యాప్తు చేసి, సీబీఐ కోర్టులో జగన్ పై చార్జ్ షీట్లు దాఖలు చేసిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మి నారాయణను తిరిగి రప్పించి ఆయనకే ఈ భాద్యతలు అప్పగిస్తే బాగుటుందని మంత్రులు దేవినేని ఉమా, బొజ్జల గోపాల కృష్ణ చేసిన సూచనకు చంద్రబాబుకు అంగీకారం తెలిపారు. త్వరలో కేంద్రంతో మాట్లాడి ఆయనను వెనక్కు రప్పించే ప్రయత్నం చేస్తానని తెలిపారు.   గత పదేళ్ళలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల భూములు క్విడ్ ప్రో పద్దతిలో అక్రమంగా ప్రైవేట్ సంస్థలు, వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు రాజధాని, కొత్తగా స్మార్ట్ సిటీలు, శాటిలైట్ సిటీలు రోడ్లు, భవనాలు నిర్మాణం కోసం వేల ఎకరాల భూములు, డబ్బు చాలా అవసరం. ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా పంచబడిన ఆ లక్షల ఎకరాల భూములలో సగమయినా వెనక్కి రాబట్టగలిగినట్లయితే చాలా ఉపయోగపడుతుంది. పైగా ప్రజలు కూడా హర్షిస్తారు. కానీ ఈ వ్యవహారామంతా జగన్మోహన్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకే పరిమితం చేసినట్లయితే విమర్శలు మూటగట్టుకోవడం తధ్యం.   అయితే అక్రమంగా పంచబడిన భూములను చంద్రబాబు ప్రభుత్వం తిరిగి స్వాదీనం చేసుకోనగలిగితే, కాగల కార్యం ఆ లక్ష్మి నారాయణుడే చక్కబెట్టగలరు. అప్పుడు చంద్రబాబు ఆశించినట్లు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్లవుతుంది.

వికలాంగుల పెన్షన్ పై బాబు మెలిక

  ఎన్నికలలో హామీలివ్వడం ఎంత తేలికో అధికారం చేప్పట్టిన తరువాత వాటిని అమలుచేయడం అంత కష్టం. ఈ విషయాన్ని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రుణాలమాఫీ విషయంలో అప్పుడే నిరూపించి చూపగా, ఈరోజు తొలి మంత్రివర్గ సమావేశం నిర్వహించిన చంద్రబాబు నాయుడు దానిని మరోమారు నిరూపించి చూపారు. వ్యవసాయ రుణాల సంగతి తేల్చేందుకు కమిటీ వేస్తున్నట్లు మొదటి రోజే ప్రకటించేశారు గనుక దాని గురించి ఆలోచించేందుకు మరో 45రోజుల గడువు సంపాదించుకొన్నారు. అందువల్ల ఆ విషయంలో ఆయనను విమర్శించడానికి అవకాశం లేదు. కానీ వికలాంగులకు పెన్షన్ విషయంలో మాత్రం చిన్న మెలికపెట్టడం ద్వారా కొంతయినా ఆర్ధిక భారం తగ్గించుకొనే ప్రయత్నం చేయడంతో, బహుశః రేపటి నుండి ఆయనపై ప్రతిపక్షాలు విమర్శలు కురిపించవచ్చును. చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో వికలాంగులకు రూ.1500 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు 80శాతం అంగ వైకల్యం ఉన్నవారికే రూ.1500 పెన్షన్ ఇస్తామని, అంతకంటే తక్కువ ఉన్న వారికి రూ.1000 మాత్రమే ఇస్తామని ప్రకటించారు.   ఎన్నడూ అబద్దం ఆడని ధర్మరాజు అంతటివాడు కురుక్షేత్ర యుద్దంలో కౌరవ సేనలకు నాయకత్వం వహిస్తున్న ద్రోణాచార్యుల వారిని నిలువరించలేకపోవడంతో, ఆయనను మానసికంగా దెబ్బతీసి ఆయనపై పైచేయి సాధించేందుకు, “అశ్వత్థామ హతః...కుంజరః” (ఆయన కొడుకు అశ్వత్థామ చనిపోయాడు అని బిగ్గరగా అరిచి, మెల్లగా ఆ పేరు గల ఏనుగు అని పలుకుతాడు). ధర్మరాజు కూడా అబద్దం ఆడినప్పటికీ, కుంజరః అని ద్రోణాచార్యుల వారికి వినపడనంత మెల్లగా పలికడం ద్వారా అపవాదు తప్పించుకొన్నాడు.   ఇప్పుడు కేసీఆర్, చంద్రబాబులు కూడా అదేవిధంగా రైతుల రుణాలు మాఫీ చేస్తామని, వికలాంగులకు పెన్షన్లు ఇస్తామని ఎన్నికల సమయంలో ప్రజలందరి చెవులు చిల్లులు పడేంత బిగ్గరగా అరిచి చెప్పారు. కానీ కేవలం 2013-14సం.లలో లక్షలోపు తీసుకొన్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని, బంగారు నగలు కుదువబెట్టి తెచ్చుకొన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేయమని కేసీఆర్, 80శాతం కంటే తక్కువ అంగవైకల్యం ఉన్నవారికి రూ.1000 మాత్రమే ఇస్తామని ఇప్పుడు చంద్రబాబు ఎన్నికల కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత చల్లగా చెపుతున్నారు.   బహుశః వారిరువురూ మున్ముందు ఈ “అశ్వత్థామ హతః...కుంజరః” ఫార్ములాను ఇంకా చాలాసార్లు ప్రయోగించవచ్చును. అందువల్ల ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా కూడా ఆ ‘కుంజర’ శబ్దం కోసం ఇకపై చెవులు నిక్కబొడుచుకొని వినేందుకు సిద్దంగా ఉండక తప్పదు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం-2

  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని విజయవాడ-గుంటూరు మధ్య ఏర్పాటు చేయాలనుకొంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. కొన్ని భవన సముదాయాలు నిర్మించి దానినే రాజధాని అనుకోకూడదని, రాజధానికి అన్ని హంగులతో బాటు జీవం, జీవనం కూడా ఉండాలని కోరుకొంటున్నట్లు తెలిపారు. సింగపూరు వంటి రాజధాని నిర్మాణానికి కనీసం దాదాపు 20వేల ఎకరాల స్థలం అవసరం ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అటువంటి గొప్ప రాజధాని కలిగి ఉండటం ఆంధ్ర ప్రజలందరికీ గర్వకారణమే. కానీ అది అక్షయ పాత్ర వంటి పచ్చని పంట పొలాల మీద నిలబడటం ఎవరూ హర్షించరు.   పొలాలు పోగొట్టుకొన్న రైతన్నలకి ఏదో రూపంలో పరిహారం చెల్లించ వచ్చును. కానీ సారవంతమయిన అటువంటి భూములను మరొక చోట సృష్టించలేము. వాటికి నీటి సౌకర్యమూ కల్పించడము అదనపు భారమే అవుతుంది. పైగా ఆర్భాటానికి పోయి చేజేతులా ఆహారపు కొరతను సృష్టించుకొన్నవారము అవుతాము.   రాజధానిని విజయవాడ-గుంటూరు మధ్యే ఏర్పాటు చేయాలనుకొన్నట్లయితే, అందుకు అవసరమయినంత భూమిని మాత్రమే సేకరించాలి. వీలయినంత వరకు సారవంతమయిన పంట పొలాల జోలికి పోకుండా ఉంటేనే మంచిది. ఇప్పటికే కొందరు స్వార్ధ పరులయిన రాజకీయ నేతలు, రియల్టర్లు ఆ ప్రాంతంలో పచ్చటి పంట పొలాలను, మామిడి, కొబ్బరి, అరటి వంటి తోటలను చదునుచేసి లే అవుట్లుగా మారుస్తున్నారు. వీరు కాక పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు, పారిశ్రామిక వేత్తలు ఆ పరిసర ప్రాంతాలలో భారీగా (పంట) భూములను కొనుగోలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అటువంటి వారిని ప్రభుత్వం తక్షణమే అడ్డుకొని పంట భూములను కాపాడుకోవాలి. కానీ ఆపని చేయకుండా ప్రభుత్వమే ఇప్పుడు స్వయంగా ఆ రెండు జిల్లాలలో మిగిలిన పంట భూములను సేకరించి దానిపై కొత్త రాజధాని నిర్మించాలనుకొంటే, మున్ముందు ఇతర రాష్ట్రాల నుండి బియ్యం, పప్పులు దిగుమతి చేసుకోవలసి దుస్థితి ఏర్పడుతుంది.   అయితే దీనికి పరిష్కారం ఏమిటంటే కొత్త రాజధానిని కేవలం పరిపాలనా కేంద్రంగా మాత్రమే ఏర్పాటు చేసి, హైకోర్టు, అసెంబ్లీ, శాసనమండలి, ఉన్నత విద్యా, వైద్య సంస్థలు, పరిశ్రమలు వంటివన్నిటినీ మిగిలిన జిల్లాలలో ఒక్కో చోట ఏర్పాటు చేయవచ్చును. తద్వారా సారవంతమయిన పంట పొలాలను కాపాడుకొంటూనే, అభివృద్ధి వికేంద్రీకరణ చేసే అవకాశం ఉంటుంది. పదమూడు జిల్లాలలో ఉంటున్న ప్రజలందరికీ కూడా అభివృద్ధి ఫలాలు సమానంగా అందినట్లయితే ఇక అసంతృప్తికి తావుండదు.   రాష్ట్ర రాజధాని అంటే కేవలం ఒక వృత్తాకారంగానో, చతురస్రాకారంగానో ఉండాలనే నియమేమీ లేదు. అవసరమయితే తూర్పు గోదావరి జిల్లా నుండి ప్రకాశం జిల్లా వరకు పొడవుగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చును.   ఒకవేళ రాజధానిని ఖచ్చితంగా విజయవాడ-గుంటూరు మధ్యే ఏర్పాటు చేయాలనుకొన్నట్లయితే, అక్కడ ఉన్న పంట భూములను అంతా నాశనం చేసి నిర్మించడం కంటే, ఆకాశ హర్మ్యాలు నిర్మించుకోవచ్చును కూడా. జపాన్, తైవాన్, సింగపూర్ వంటి చిన్న చిన్న దేశాలలో ఇదే పద్ధతి అవలంభిస్తున్నారు. ఇంతవరకు మన రాష్ట్రంలో 20-30 పైబడి నిర్మించిన భవన సముదాయం ఒక్కటి కూడా లేదు. అందువల్ల సింగపూర్, మలేషియా, అమెరికా వంటి దేశాలలో నిర్మించినట్లు 50-100 లేదా అంతకు పైబడి అంతస్తులు గల భవన సముదాయాలు కొత్త రాజధానిలోనే నిర్మించినట్లయితే, సారవంతమయిన పంట పొలాలను రక్షించుకొన్నట్లవుతుంది. పైగా అటువంటి ఆకాశ హర్మ్యాలు దేశంలో మొట్ట మొదటగా సారిగా మన రాష్ట్రంలోనే నిర్మించబడటం రాష్ట్ర ప్రజలందరికీ గర్వ కారణమవుతుంది.

శాఖల కేటాయింపుకు ముందే మంత్రులకు బాబు క్లాసు

  ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన చంద్రబాబు కూడా మోడీనే ఆదర్శంగా తీసుకొని పని ప్రారంభించారు. మంత్రులకు పోర్ట్ ఫోలియోలు కేటాయించక ముందే ఒక్కొక్కరితో విడివిడిగా సమావేశమయ్యి శాఖలు ఏవయినప్పటికీ మంత్రులందరూ తప్పనిసరిగా ఐకమత్యంగా ఉంటూ ఒకరికొకరు సహకరించుకొంటూ రాష్ట్రాభివృద్ధికి గట్టిగా కృషి చేయాలని, ముటాలు, గ్రూపు రాజకీయాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ముందే అందరికీ హెచ్చరికలు జారీ చేసారు. మూడు నెలల తరువాత వారి పని మంచి పనితీరు స్వయంగా సమీక్షిస్తానని , సంతృప్తికరంగా లేకపోయినా మంత్రివర్గంలో నుండి ఉద్వాసన తప్పదని ముందే హెచ్చరించారు.   మంత్రులకి పోర్ట్ ఫోలియోలు కేటాయించక ముందే చంద్రబాబు అందరికీ గట్టిగా క్లాసు తీసుకోవడంవలన, ఎవరూ కూడా ఇంతవరకు తమకు అప్రదాన్యమయిన శాఖలు ఇచ్చేరని అలిగి కూర్చోన్నట్లు వార్తలు రాలేదు. ఎవరయినా అలిగినట్లయితే బహుశః వారిని ఆ పదవి నుండి తప్పించినా ఆశ్చర్యం లేదు. ఇటీవల చంద్రబాబు నాయుడు తెలంగాణా అసెంబ్లీకి తెదేపా శాసనసభాపక్ష చైర్మన్ గా ఎర్రబెల్లి దయాకర్ రావుని, శాసనసభ ఫ్లోర్ లీడర్ గా తలసాని యాదవ్ ను నియమిద్దామనుకొన్నపుడు, తలసాని యాదవ్ తనకు శాసనసభాపక్ష నాయకుడిగా నియమించనందుకు అలిగి, తనకు ఎటువంటి పదవులు వద్దని శాసనసభ్యుడుగానే కొనసాగుతానని ప్రకటించడంతో, చంద్రబాబు ఆయనను పక్కన పెట్టేసారు.   అందువల్ల ఇప్పుడు అప్రదాన్య శాఖలను ఇచ్చినందుకు అలిగితే తమకు అదే పరిస్థితి ఎదురవుతుందని మంత్రులందరిలో ఒకరకమయిన భయం ఏర్పడింది. గ్రూపు రాజకీయాలు నడపడంలో అందెవేసిన గంట శ్రీనివాస రావు బహుశః అందుకే తనను వ్యతిరేఖించే విశాఖజిల్లాకు చెందిన అయ్యన్నపాత్రుడుతో కలిసిపని చేస్తానని చెప్పారు.

మోడీ మార్క్ పరిపాలన

  ప్రధాని నరేంద్ర మోడి పాలనలో తనడైయిన ముద్రవేసే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు. చిన్నమంత్రివర్గం-ఎక్కువ పరిపాలన అనే సూత్రం అమలు చేస్తూ కొన్ని మంత్రిత్వ శాఖలను ఒకే గొడుగు క్రిందకు తీసుకువచ్చి వాటి బాధ్యత ఒకే మంత్రికి అప్పజెప్పారు. ప్రభుత్వానికి భారంగా మిగిలిన 21 కేంద్రమంత్రుల సాధికార బృందాలను రద్దు చేసి, తిరిగి కేంద్రమంత్రి వర్గానికే అన్ని అధికారాలు దాఖలు పరిచారు. మళ్ళీ నిన్న అటువంటివే మరో నాలుగు స్టాండింగ్ కమిటీలను వేరే కమిటీల అధీనంలోకి తీసుకు వస్తూ ఉత్తర్వులు జారీచేసారు.   తద్వారా కేంద్రమంత్రులకు మరిన్ని అధికారాలు, వాటితోబాటే బరువు బాధ్యతలు కూడా అప్పగించినట్లయింది. అందువలన ఇకపై కేంద్రమంత్రులు స్వతంత్రంగా వేగంగా నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఏర్పడుతుంది. అంతేగాక తమ నిర్ణయాలకు తామే జవాబుదారీ అయ్యేలా చేసారు. కనుక మంత్రులు మరింత అప్రమత్తంగా నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. అదేవిధంగా ఐఏయస్, ఐపీయస్ వంటి ఉన్నతాధికారులకు పూర్తి స్వేచ్చ ప్రసాదిస్తూ వారిని రాజకీయ ఒత్తిళ్ళ నుండి విముక్తులు చేసేందుకు చర్యలు తీసుకొంటున్నారు.   కేంద్రమంత్రులకు అధికారాలతో బాటు బాధ్యతలు కూడా అప్పగించి వారిలో జవాబుదారీతనం పెంచినట్లే ఉన్నతాధికారులకు కూడా మోడీ అదే సూత్రం వర్తింపజేయబోతున్నారు. మోడీ తన మంత్రివర్గ సభ్యులెవరూ తమ బంధువులను తమ కార్యదర్శులుగా నియమించుకోరాదని విస్పష్టంగా తేల్చిచెప్పారు. అంతే కాక కేంద్రమంత్రులు అందరూ కూడా మూడు నెలలలోగా తమ ఆదాయ, ఆస్తుల వివరాలను లికితపూర్వకంగా సమర్పించాలని ఆదేశించారు.   మంత్రులందరూ వంద రోజులలో నిర్దిష్ట లక్ష్యాలు పెట్టుకొని పనిచేయాలని, మళ్ళీ మూడు నెలల తరువాత వారి పనితీరుని సమీక్షిస్తానని అయన తొలి సమావేశంలోనే అందరినీ హెచ్చరించారు. మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ ఏనాడూ కూడా, ఇటువంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకొన్న దాఖలాలు లేవు. అందుకు కారణాలు అందరికీ తెలిసినవే.

బొకేల వ్యాపారులకు బ్యాండ్ పడింది!

  ఎలక్షన్లు అయిపోయాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రమాణ స్వీకారాలు చేసేశారు. వారందరికీ అభినందనలే అభినందనలు.. దండలే దండలు.. బొకేలే బొకేలు.. దాంతో తమ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు దండల మాదిరిగా వర్ధిల్లుతుందని ఆశించిన హైదరాబాద్‌లోని ఫ్లవర్ బొకేల వ్యాపారుల ఆశల మీద రాజకీయ నాయకులు నీళ్ళు చల్లారు. మామూలుగా గతంలో అయితే అయినదానికీ, కానిదానికీ రాజకీయ నాయకుల దగ్గర బొకేల హడావిడి వుండేది. అయితే తాజాగా అటు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన రాజకీయ నాయకులు, ఇటు తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు పొదుపు మంత్రాలు పఠిస్తున్నారు. తమ దగ్గరకి వచ్చేవారు బొకేలు, దండలు పట్టుకురావద్దని స్పష్టంగా చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర విభజన జరిగిన పరిస్థితుల్లో అందరూ పొదుపు చేయాల్సిన అవసరం వుందని, దుబారా ఖర్చు చేయకూడదని అందుకే తాము బొకేలకి, దండలకి దూరంగా వుంటున్నామని చాలామంది రాజకీయ నాయకులు చెప్పుకుంటున్నారు. తాము దుబారా ఖర్చులని ఎలా అదుపు చేస్తున్నారో బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఏనుగులు వెళ్ళే దారి వదిలేసి, చీమలు వెళ్ళే దారిలో కాపలా పెట్టినట్టు... మిగతా దుబారా ఖర్చులన్నీ యథావిధిగా జరిగిపోతున్నప్పటికీ, బొకేలు, దండల విషయంలోనే రాజకీయ నాయకులు పొదుపు పాటించేస్తూ దేశాన్ని కాపాడేస్తు్న్నారు. రాజకీయ నాయకుల దగ్గరకి వెళ్లేవాళ్ళు కూడా హమ్మయ్య ఖర్చు తగ్గిందనుకుని హ్యాపీగా ఫీలవుతున్నారు. రాజకీయ నాయకుల పొదుపు సంగతేమోగానీ, వీళ్ళను నమ్ముకుని హైదరాబాద్‌లో పూల వ్యాపారాలు పెట్టుకున్నవాళ్ళు మాత్రం నష్టపోతున్నారు. ఈ సీజన్‌లో బొకేలు, దండల వ్యాపారం బాగా వుంటుందని బోలెడు పూలు తెప్పించామని అయితే, రాజకీయ నాయకుల అతి పొదుపు కారణంగా తమకు బ్యాండ్ పడిందని సదరు వ్యాపారులు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం-1

  రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ మొదటి నుండి పునర్నిర్మాణం చేసుకోవలసిన అగత్యం ఏర్పడింది. అందుకు ప్రధాన కారణం ఇంతవరకు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రులందరూ కూడా కేవలం హైదరాబాదునే అభివృద్ధి చేసారు తప్ప రాష్ట్రంలో మిగిలిన జిల్లాలను పెద్దగా పట్టించుకోలేదు. వివిధ జిల్లాలకు చెందిన మంత్రులు, యం.యల్.ఏ.లు, యంపీలు కనీసం తమతమ జిల్లాలను నియోజక వర్గాలను అభివృద్ది చేసుకొనేందుకు ఎన్నడూ ప్రయత్నించలేదు. స్వర్గీయ కింజారపు ఎర్రంనాయుడు వంటి ఏ కొద్దిమందో ప్రజాప్రతినిధులు మాత్రం తమ నియోజక వర్గానికి, జిల్లాకు పరిశ్రమలు, మౌలిక వసతులు వంటివి ఏర్పాటు చేసుకొన్నారు. అందువల్ల రాష్ట్ర విభజన తరువాత వైజాగ్, రాజమండ్రి, విజయవాడ మరియు తిరుపతి నాలుగు నగరాలు మాత్రమే ఎంతో కొంత అభివృద్ధి చెందినట్లు కనబడుతున్నాయి తప్ప అభివృద్ధి విషయంలో మిగిలిన ప్రాంతాల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ లోటు రాష్ట్ర విభజన తరువాత మరీ కొట్టవచ్చినట్లు కనడుతుంటే, రాజకీయ నేతలు సైతం తాము చేసిన పొరపాటుకు చింతిస్తున్నారు. అందుకే ఇప్పుడు 13 జిల్లాలకు అభివృద్ధిని సమానంగా వ్యాపింపజేయాలనే ఆలోచన వారిలో కూడా మొదలయింది.   మన పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను చూసినట్లయితే అవి మొదటి నుండి కూడా అభివృద్ధిని వికేంద్రీకరణ చేసినట్లు అర్ధం అవుతుంది. అందుకే వాటికి ఇటువంటి సమస్య ఎదురవలేదు. ఒకవేళ దురదృష్టవశాత్తు ఎదురయినా అవి ఇంత దైన్యస్థితిలో మాత్రం ఉండవని ఖచ్చితంగా చెప్పవచ్చును. తమిళనాడు రాజధాని చెన్నైతో సమానంగా మదురై, సేలం, కోయంబత్తూర్ జిల్లాలు అభివృద్ధి చెందాయి. అవికాక కన్యాకుమారి, తిరుపూర్, వెల్లూరు వంటి జిల్లాలు వివిధ రంగాలలో ఎంతో కొంత అభివృద్ధి సాధించాయి. అందువల్ల అక్కడ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నందున ప్రజలు రాజధాని చెన్నైపై ఆధారపడటం తక్కువ. అదేవిధంగా కర్ణాటకలో బెంగళూరు నగరాన్ని మనదేశ సాఫ్ట్ వేర్ రాజధానిగా అందరూ భావిస్తున్నప్పటికీ, ఆ రాష్ట్రంలో కూడా షిమోగా, బళ్ళారి, కోలార్, దావణగేరే వంటి జిల్లాలకు అభివృద్ధి వ్యాపించి ఉంది. అందువల్ల ఇప్పుడు మన రాష్ట్రం కూడా అదేవిధంగా అభివృద్ధిని అన్ని జిల్లాలకు సమానంగా వ్యాపింపజేయవలసి ఉంది. మన నేతల ప్రయత్నలోపం లేకపోతే కేంద్రప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందించేందుకు సిద్దంగా ఉంది గనుక అభివృద్ధి సాధించడం అసాధ్యమేమీ కాదు.

తెదేపా-వైకాపాల రాజకీయ యుద్ధం మళ్ళీ షురూ

  ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత తెదేపా, వైకాపాలు రెండూ కూడా ఒకదానిపై మరొకటి కత్తులు దూసుకోకుండా నిన్న మొన్నటి వరకు సంయమనం పాటించాయి. ఎప్పుడూ చంద్రబాబును తిట్టిపోసే జగన్ కు చెందిన సాక్షి మీడియా కూడా చంద్రబాబు కార్యక్రమాల వివరాలు ప్రసారం చేయడం చాలా ఆశ్చర్యం కలిగించింది. కానీ మళ్ళీ జగన్ చంద్రబాబుపై వ్యవసాయ రుణాల విషయంలో యుద్ధం ప్రకటించగానే సహజంగానే సాక్షి మీడియా కూడా ఆయనను అనుకరిస్తూ యధాప్రకారంగా చంద్రబాబుపై విమర్శలు మొదలుపెట్టేసింది. కానీ మోడీ ప్రభుత్వం గురించి మాత్రం నేటికీ సాక్షి మీడియా నాలుగు మంచి ముక్కలే చెపుతోంది. ఓటమిపాలయిన జగన్మోహన్ రెడ్డే స్వయంగా తమ ప్రభుత్వంపై యుద్ద శంఖం పూరించడంతో, విజయోత్సాహంతో ఉన్న తెదేపా నేతలు కూడా వైకాపాతో యుద్దానికి ‘సై’ అనడంతో రాష్ట్ర రాజకీయాలు మళ్ళీ క్రమంగా వేడెక్కసాగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుని లక్ష్యంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తూ బహిరంగ లేఖలు వ్రాస్తుంటే దానికి సాక్షి మీడియా వంత పాడుతోంది. అందుకు తెదేపా నేతలు కూడా అంతే ఘాటుగా ప్రతివిమర్శలు చేయడమేకాక, పరిటాల సునీత, గాలి ముద్దుకృష్ణం నాయుడు వంటివారు తమ ప్రభుత్వం త్వరలోనే జగన్మోహన్ రెడ్డిపై ఉన్న వివిధ కేసులను వేగవంతం చేస్తుందని స్పష్టం చేసారు. వారు చెపుతున్నట్లుగా ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిపై చర్యలకు ఉపక్రమిస్తే ఆ రెండు పార్టీల మధ్య యుద్ధం మళ్ళీ పతాకస్థాయికి చేరుకోవడం ఖాయం.   ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తమపై తెదేపా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైకాపా ఆరోపిస్తే, తెదేపా నేతలు చట్టం తనపని తాను చేసుకుపోతుందనో లేకపోతే చట్టం నుండి ఎవరూ ఎల్లకాలం తప్పించుకోలేరనో ‘స్టాండర్డ్ సమాధానం’ చెప్పవచ్చును. దానితో ఆ రెండు పార్టీల యుద్ధం మళ్ళీ పతాక స్థాయికి చేరవచ్చును. ఏమయినప్పటికీ, అవినీతి విషయంలో మోడీ ప్రభుత్వం తన స్వంత మంత్రులనే ఉపేక్షించేందుకు సిద్దంగా లేదని స్పష్టమవుతోంది గనుక అనేక కేసులలో A-1 ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి మున్ముందు మళ్ళీ కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు తప్పకపోవచ్చును. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి తెదేపాపై తన యుద్ధం కొనసాగిస్తూనే ఉండవచ్చును. తెదేపా కూడా అంతే ధీటుగా బదులివ్వకామానదు. అయితే రాష్ట్ర పునర్నిర్మాణంలో పాలుపంచుకోవలసిన సమయంలో ఆ రెండు పార్టీలు ఒకదానిపై మరొకటి పైచేయి సాధించేందుకు ఈవిధంగా రాజకీయ యుద్ధం చేయడాన్ని ప్రజలు మాత్రం హర్షించరనే సంగతి అవి గ్రహిస్తే బాగుంటుంది.

వైజాగ్, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తొలి మంత్రివర్గ సమావేశం

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు తన మొట్ట మొదటి మంత్రివర్గ సమావేశం విశాఖపట్నంలో ఉన్న ఆంధ్రవిశ్వవిద్యాలయంలో రెడ్డి ఆడిటోరియంలో జూన్ 12న ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించబోతున్నారు. ఇంతకాలం ఇటువంటి కార్యక్రమాలన్నీ కేవలం హైదరాబాదుకే పరిమితంయ్యేవి. కానీ ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం విశాఖలోనే జరగబోతుండటంతో విశాఖ నగరవాసులు చాల సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు.   కానీ నాలుగైదు దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజలందరూ కలిసి నిర్మించుకొన్న హైదరాబాదు నగరాన్ని వదులుకొని, ఇటువంటి అతి ముఖ్యమయిన అధికారిక కార్యక్రమాలను కూడా విశ్వవిద్యాలయాలలో నిర్వహించుకోవలసిరావడం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం తాత్కాలికంగా మరొక విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసుకోవలసి రావడం చూస్తే ఆంధ్రప్రజల హృదయాలు బాధతో కలుక్కుమనక మానవు. ఇందుకు కాంగ్రెస్ పార్టీనే నిందించక తప్పదు.   కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాలని చూసుకొని, హైదరాబాదును 10 ఏళ్ల పాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ప్రకటించేసి హడావుడిగా రాష్ట్రవిభజన కానిచ్చేసింది. హైదరాబాదులో రెండు ప్రభుత్వాలకు భవనాలను కేటాయించింది. ఇంతవరకు రాష్ట్రమంతా ఒక్కటే గనుక హైదరాబాదులో ప్రభుత్వం కొలువై ఉండటం ఎవరికీ వింతగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిపోయిన తరువాత, రాష్ట్రంతో భౌగోళికంగా ఏవిధంగానూ సంబందమూ లేని హైదరాబాదు నుండి రాష్ట్ర పాలన చేయడం అంటే చాలా వింతగా ఉంటుంది.   హైదరాబాదులో ముఖ్యమంత్రికి, రాష్ట్రమంత్రులకు, ఉన్నత పోలీసు అధికారులకి కార్యాలయాలు ఉండవచ్చు గాక కానీ అవేవీ మనవి కావనుకొన్నపుడు, అక్కడ ఉండటం కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కడో అక్కడ తాత్కాలిక ఏర్పాట్లు చేసుకొని అక్కడి నుండే ప్రభుత్వ పాలన సాగించుకోవడమే ఉత్తమం. అయితే దానికీ మరికొంత సమయం అవసరం గనుక అంతవరకు ప్రభుత్వానికి ఈ తిప్పలు తప్పవు. అందుకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే నిందించక తప్పదు.

మంత్రిపదవి వద్దన్న బాలకృష్ణ.. అభిమానుల నిరాశ!

  నందమూరి బాలకృష్ణలో ఆయన అభిమానులు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావునే చూసుకుంటూ వుంటారు. ఎన్టీఆర్ సాధించిన ఘనతలన్నీ ఆయన కూడా సాధిస్తారన్న నమ్మకాన్ని పెంచుకుంటూ వుంటారు. కథానాయకుడిగా తండ్రి వారసత్వాన్ని విజయవంతంగా నెరవేర్చిన బాలకృష్ణ రాజకీయంగా కూడా తన తండ్రి అంతా స్థాయికి ఎదగాలని కోరుకుంటూ వుంటారు. నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆ ఆశలు మరింత పెరిగాయి. ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ మంత్రి కూడా అవుతారని అభిమానులు ఆశించారు. అయితే ఈనెల 8న ఆయన పేరు మంత్రివర్గంలో కనిపించలేదు. అది బాలకృష్ణ అభిమానులలో నిరాశ కలిగించింది. మంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా వున్నప్పటికీ బాలకృష్ణను మంత్రిగా చూడలేకపోతున్నందుకు వారు బాగా ఫీలయ్యారు. ఈ ఫీలింగ్ రాష్ట్రవ్యాప్తంగా వున్న అందరి అభిమానుల్లోనూ వుండి. తన అభిమానులు తాను మంత్రి కాలేదని ఫీలవుతున్నారని బాలకృష్ణ అర్థం చేసుకున్నట్టున్నారు. అందుకే తన పుట్టినరోజు నాడు మంత్రి పదవికి సంబంధించిన తన అభిప్రాయాలను బాలకృష్ణ స్పష్టంగా చెప్పారు. తనకు మంత్రి పదవి మీద ఆసక్తి లేదని పదవులు లేకుండానే సేవ చేయాలన్న ఉద్దేశంతో తాను వుంటానని చెప్పారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే మంత్రిపదవి కోరుకోకపోవడం బాలక‌ృష్ణలోని పరిణతికి అద్దం పడుతోంది. కానీ, ఆయన అభిమానులు మాత్రం నిరాశ పడుతున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా కొంత కాలం తర్వాత అయినా సరే బాలకృష్ణని మంత్రిగా చూడాలని ఆశపడుతున్నారు.

కొండను తవ్వి ఎలుకను పట్టిన రాజధాని కమిటీ

        యూపీఏ ప్రభుత్వం ఏదయినా ఒక క్లిష్టమయిన అంశాన్ని పరిష్కరించవలసి వస్తే, ముందుగా దానికొక ఒక కమిటీ వేసి చేతులు దులుపుకొనేది. అందుకు ఉదాహరణగా జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని చెప్పుకోవచ్చును. దాదాపు రూ.60కోట్లు పైగా ఖర్చుచేసి రాష్ట్రవిభజనపై ఆ కమిటీ తయారు చేసిన నివేదికను చెత్తబుట్టలో పడేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తరువాత చాలా హడావుడిగా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన యూపీఏ ప్రభుత్వమే స్వయంగా రాజధాని ఎక్కడ ఏర్పరచాలో నిర్ణయం తీసుకొని ఉండవచ్చును. కానీ ఆవిధంగా చేసినట్లయితే, మిగిలిన ప్రాంతాలలో ప్రజలు తమ పార్టీని తరిమి కొడతారని భయపడి దానికీ ఒక కమిటీని వేసి చేతులు దులుపుకొంది.   ఆ కమిటీ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు పర్యటించి వివరాలు సేకరించింది. అందుకు ఎన్ని లక్షలు ఖర్చయ్యాయో తెలియదు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న మీడియాతో మాట్లాడుతూ విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేయాలనుకొంటున్నట్లు ప్రకటించడంతో వారి పని కొండను తవ్వి ఎలుకని పట్టినట్లయింది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చెప్పట్టగానే కేంద్రానికి గుదిబండగా మారిన ఇటువంటి అనేక జీ.ఓ.యం.(కమిటీ)లను రద్దు చేసి, తిరిగి కేంద్రమంత్రి వర్గానికే సర్వాధికారాలు కట్టబెట్టారు.   ఆవిధంగా చేయడం వలన మంత్రులు త్వరగా నిర్ణయం తీసుకోవడమే కాకుండా, ఖజానాపై భారం తగ్గుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రంలో అదే పద్ధతి అవలంభిస్తే బాగుంటుంది. అనవసరమయిన కమిటీలను రద్దు చేసి, కొన్ని మంత్రిత్వ శాఖలను, ప్రభుత్వ శాఖలను ఒకే గొడుగు క్రిందకు తీసుకు రాగలిగితే ప్రభుత్వంపై కొంత ఆర్ధికభారం తగ్గించుకోవచ్చును. అదేవిధంగా పార్టీలో అందరినీ సంతృప్తి పరిచేందుకు అందరికీ మంత్రి పదవులు లేదా నామినేటడ్ పదవులో కల్పించే ఆలోచన కూడా విరమించుకొంటే బాగుంటుంది. ప్రతీసారి ప్రజలనే త్యాగాలు చేయమని కోరకుండా మంత్రులు, పార్టీ నేతలు కూడా స్వయంగా కొన్ని త్యాగాలు చేసి, రాజధాని నిర్మాణం కోసం భారీగా విరాళాలు ఇచ్చినట్లయితే వారిని చూసి ప్రజలు కూడా మరింత స్ఫూర్తి పొందే అవకాశం ఉంటుంది.