పవన్ కళ్యాణ్.. జగ్గారెడ్డి మధ్య భావసారూప్యం

    ప్రభుత్వ మాజీ విప్, కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి భావాలు తనకెంతో నచ్చాయని, తమ ఇద్దరి భావాలూ ఒకేలా వున్నందున ఆయనతో కలిసి పని చేస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం పవన్ కళ్యాణ్‌తో జగ్గారెడ్డి సమావేశమైన అనంతరం పవన్ కళ్యాణ్ ఈ భావసారూప్య మేటర్ని బయట పెట్టారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, జగ్గారెడ్డి భావాలు తనకెంతో నచ్చాయని చెప్పారు. ఒకవైపు తెలంగాణవాదం గురించి మాట్లాడుతూనే ఇరుప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం జగ్గారెడ్డి తపించారని కొనియాడారు.జగ్గారెడ్డి వంటి వారు ప్రజలకు అవసరమన్నారు. భవిష్యత్తులో జగ్గారెడ్డి, తాము కలసి పనిచేస్తామని చెప్పారు. జనసేన ద్వారా పనిచేయాలా? లేక ఇతర పార్టీలతో కలసి పనిచేయాలా? అనే విషయాన్ని త్వరలోనే నిర్ణయిస్తామని చెప్పారు. అలాగే, పవన్ కళ్యాణ్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు జగ్గారెడ్డి కూడా ప్రకటించారు.

నితీష్ రాజీడ్రామా: పాట్నా పాలిటిక్స్

  లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీసుకున్న నిర్ణయం టీకప్పులో తుఫాను మాదిరిగా సర్దుమణిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీహా‌ర్‌లో జేడీయు బీజేపీ చేతిలో చావుదెబ్బ తినగానే అప్పటి వరకూ ప్రధాని అవ్వాలనే కలలు కన్న నితీష్ కుమార్‌కి ఎక్కడ లేని రోషం పొడుచుకొచ్చింది. దాంతో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేశాడు. నితీష్ ఆవేశం చూసిన అందరూ ఇక నితీష్ రాజీనామా వెనక్కి తీసుకోరని అపోహ పడ్డారు. అయితే ఇప్పుడు నితీష్ కుమార్ తన రాజీనామా వెనక్కి తీసుకుని ఎంచక్కా బీహార్‌ని పరిపాలించే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. నితీష్ రాజీనామా అంశం మీద జేడీయూ అగ్ర నాయకులు సమావేశమయ్యారు. బీహార్‌ని పరిపాలించడానికి నితీష్‌ని మించిన మొనగాడెవరూ లేరని వాళ్ళందరూ ఫీలయ్యారు. నితీష్‌ని తన రాజీనామా వెనక్కి తీసుకోవాలని కోరారు. దాంతో నితీష్ మళ్ళీ ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. తన రాజీనామాపై నిర్ణయం తీసుకోడానికి సోమవారం వరకు గడువు ఇవ్వాలని నితీష్ కోరారు. అయితే జేడీయు నాయకుడు శరద్ యాదవ్ మాత్రం నితీష్ రాజీనామాకే కట్టుబడి వుంటేనే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో జేడీయులో కలకలం రేగింది. చిట్టచివరకి ఈ రాజీనామా డ్రామా ఎలా ముగుస్తుందో చూడాలి.

కమ్యూనిస్టుల జాతీయ హోదా మటాష్

  ఈ ఎన్నికలలో వీచిన మోడీ ప్రభంజనం కాంగ్రెస్ పార్టీతోపాటు అనేక పార్టీల గాలి తీసిపారేసింది. ముఖ్యంగా కమ్యూనిస్టులని అధ: పాతాళానికి తోసేసింది. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో జుట్టూ జుట్టూ పట్టుకుని కొట్టుకుంటున్న ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఈ ఎన్నికల తర్వాత ఉభయ భ్రష్టత్వం పొందాయి. ఈ పార్టీలు నిలబెట్టిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఓడిపోయారు. దాంతో లోక్ సభలో ఈ పార్టీల బలం పూర్తిగా తగ్గిపోయింది. అందువల్ల సీపీఐ, సీపీఎం పార్టీలకు వున్న జాతీయ పార్టీల హోదా మటాషైపోయింది. ఏ పార్టీ అయినా జాతీయ హోదా పొందాలంటే ఎన్ని ఎంపీ స్థానాలు సాధించాలో అన్ని స్థానాలు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సాధించలేకపోవడంతో ఈ రెండు పార్టీలకు జాతీయ హోదా గుర్తింపును రద్దు చేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. దీంతో సీపీఐ, సీపీఎం పార్టీల పరిస్థితి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా తయారైంది. ఇంత జరిగినా రాష్ట్రంలో ఈ రెండు పార్టీల వారికి జ్ఞానోదయం కలిగినట్టుగా లేదు. సీపీఎం నేతలు లంచాలు తీసకున్నారని సీపీఐ నేతలు, సీపీఐ నేతలు ఎక్కువగా మాట్లాడుతున్నారని సీపీఎం నేతలు తిట్టుకుంటూ వున్నారు. అయ్యా.. మీరు ఇలా తిట్టుకుంటూనే వుండండి. మిమ్మల్ని వదిలి ఈ దేశం ముందుకు వెళ్ళిపోతుంది.

సీమాంధ్ర ఫలితాలు: జగన్‌ని నమ్మని ఓటర్లకి సెల్యూట్

      సీమాంధ్రలో అధికారంలోకి వచ్చేసి ముఖ్యమంత్రి పదవిని ఎక్కడంతోపాటు, సీమాంధ్రలోని మొత్తం 25 పార్లమెంట్ స్థానాలు గెలిచేసి కేంద్ర ప్రభుత్వాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవాలని వైసీపీ నాయకుడు జగన్ కన్న కలలన్నీ కల్లలైపోయాయి. సీమాంధ్ర ఓటర్లు జగన్ పార్టీని అధికారానికి చాలా దూరంగా తరిమికొట్టారు. జగన్ తన ధనబలం ఉపయోగించి సీమాంధ్ర మొత్తాన్నీ తన వైపు తిప్పుకోవాలని చూశారు. అయితే జగన్ పప్పులు ఎంతమాత్రం ఉడకలేదు. జగన్ పార్టీని మరీ ఘోరంగా ఓడించకుండా కొన్ని అసెంబ్లీ స్థానాలు ఇచ్చినప్పటికీ అధికారాన్నికి ఆమడ దూరంలో వుంచేలా తీర్పు ఇచ్చారు. ఇప్పుడు కేంద్రానికి జగన్ సంపాదించిన సింగిల్ అంకె ఎంపీ సీట్ల అవసరం కేంద్రానికి లేదు. ఇప్పుడు ఈ పార్లమెంటు సీట్లు చూపించి కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేసి తనమీద వున్న కేసుల నుంచి తప్పించుకునే అవకాశం కూడా జగన్‌కి లేకుండా పోయింది. మొత్తంమీద జగన్‌కి ఇలాంటి పరిస్థితి తెచ్చిన ఓటర్లకు సెల్యూట్ చేయాలి.

రాష్ట్రంలో రాజకీయ ఆత్మహత్యలు జరగబోతున్నాయా?

        ఇంతకాలం రాష్ట్రంలో మామూలుగా జరిగే ఆత్మహత్యలు కాకుండా రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఉద్యమాల ఆత్మహత్యలు, ఏ నాయకుడో పోతే హర్టయినవాళ్లు చేసుకున్న ఆత్మహత్యలు మాత్రమే చూశాం. ఈనెల 16న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత రాజకీయ ఆత్మహత్యలు కూడా జరగబోతున్నాయన్న అనుమానాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఎన్నికలలో డబ్బు ఏరులై పారింది. పార్టీలతో నిమిత్తం లేకుండా ఎన్నికలలో పాల్గొన్న నాయకులందరూ భారీగా ఖర్చు పెట్టారు. నా పోటీ అభ్యర్థి ఇంత ఖర్చు పెట్టాడు కాబట్టి.. నేను అంతకు మించి ఖర్చు పెట్టాలి. నా పోటీ అభ్యర్థి ఓటుకి ఇంత డబ్బు ఇచ్చాడు కాబట్టి నేను అంతకంటే ఎక్కువ డబ్బిచ్చి ఓట్లు కొనాలనే సిద్ధాంతంతో చాలామంది అభ్యర్థులు డబ్బు విచ్చలవిడిగా ఖర్చుపెట్టారు. డబ్బు ఖర్చు పెట్టకపోయినా గెలిచే అభ్యర్థులు కూడా రిస్క్ ఎందుకు చేయాలన్నట్టు ఖర్చు పెట్టారు.  కొంతమంది భారీగా డబ్బున్న అభ్యర్థుల విషయం అలా వుంచితే, చాలామంది అభ్యర్థులు ఎన్నికలలో గెలిచి తీరాలన్న పట్టుదలతో వడ్డీలకు తెచ్చి మరి ఎన్నికలలో ఖర్చుపెట్టారు. ఎన్నికల కమిషన్ చూసీ చూడనట్టు వ్యవహరించడంతో బరితెగించి మరీ డబ్బు పారబోశారు. కొంతమంది 10 రూపాయల వడ్డీకి కూడా డబ్బు  అప్పు తెచ్చిమరీ ఖర్చుపెట్టారు. ఈసారి ఎన్నికలలో ఒక్కో నియోజకవర్గంలో ప్రతి అభ్యర్థి 6 నుంచి 7 కోట్ల వరకు ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది. డబ్బు అప్పనంగా సంపాదించిన ఒక పార్టీ అభ్యర్థి అయితే తాను పోటీ చేస్తున్న పార్లమెంట్ నియోజకవర్గంలో 100 కోట్లు ఖర్చుపెట్టినట్టు సమాచారం. ఇంత డబ్బు ఖర్చుపెట్టి ఎన్నికలలో గెలిస్తే, ఆ తర్వాత ఆ డబ్బు తిరిగి సంపాదించుకోవచ్చనే ఆలోచనే ఇలా ఖర్చుపెట్టేలా చేస్తూ వుండొచ్చు. గెలిస్తే సంపాదించే సంగతి తర్వాత.. ఓడిపోతే పరిస్థితేంటి? ఇప్పుడు ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలిచినా, ఓడినా ఆ తర్వాత ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెట్టాంరా దేవుడా అని ఏడవాల్సిందే. కోర్టు కేసులో ఓడినవాడు కోర్టులోనే ఏడుస్తాడు. గెలిచినవాడు ఇంటికెళ్ళాక ఏడుస్తాడన్నట్టు.. ఇప్పుడు రాష్ట్రంలో  ఎన్నికలలో పోటీచేసిన చాలామంది అభ్యర్థుల పరిస్థితి గెలిచినా, ఓడినా ఏడవాల్సిందే అన్నట్టుగా తయారైంది. ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు ఇప్పటికే చాలా ఒత్తిడిలో వున్నారు. 16 తర్వాత ఓడిపోయిన అభ్యర్థుల్లో కొంతమందిలో ఆ ఒత్తిడి మరింత పెరిగే  అవకాశం వుంది. ఆ ఒత్తిడిలో ఆత్మహత్యాప్రయత్నాలు కూడా జరిగే అవకాశం వుందని పరిశీలకులు భావిస్తున్నారు. అలాంటివేవీ జరగకూడదని కోరుకుందాం. ఒకవేళ అలాంటివేవైనా జరిగితే దీనికి పూర్తి బాధ్యత ఎన్నికలలో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించలేకపోయిన ఎన్నికల కమిషనే తీసుకోవాల్సి వుంటుంది.  

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకే అవకాశం

  సీమాంద్రాలో మున్సిపల్, యంపీటీసీ, జెడ్.పీ.టీ.సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తన ప్రత్యర్ధి వైకాపాపై స్పష్టమయిన ఆధిక్యత ప్రదర్శించినందున, సార్వత్రిక ఎన్నికలలో కూడా తెదేపాయే విజయం సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ తెలంగాణాలో కాంగ్రెస్ కొంత ఆధిక్యత కనబరిచినప్పటికీ, తెరాస దానికి సమఉజ్జీగా నిలవడంతో సార్వత్రిక ఎన్నికలలో సైతం ఆ రెండు పార్టీలలో దేనికీ కూడా పూర్తి మెజార్టీ దక్కకపోవచ్చును. అప్పుడు తప్పనిసరిగా వాటికి మజ్లిస్, లెఫ్ట్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులుగా గెలిచిన వారి మద్దతుఅవసరం ఉంటుంది. రెండు పార్టీలు ఇప్పటికే ఆ పని మీదున్నాయి. టీ-కాంగ్రెస్ పార్టీ మరొక అడుగు ముందుకు వేసి తెరాస గెలుపు గుర్రాలకు కూడా వలవేస్తోంది. వారిని నియంత్రించడానికే తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని సోనియా గాంధీకి మళ్ళీ మస్కా కొట్టే ప్రయత్నం చేసారు.   కాంగ్రెస్ అధిష్టానం కేంద్రంలో మళ్ళీ అధికారం దక్కించుకొని రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టేందుకే రాష్ట్ర విభజనకు పూనుకొందనే విషయం అందరికీ తెలిసిందే. రాహుల్ గాంధీ కోసమే సీమాంద్రాలో తన పార్టీని, నేతలని కూడా బలిచేసింది. కానీ వ్రతం చెడినా ఫలం దక్కన్నట్లు సీమాంధ్రలో, కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారం కోల్పోబోతోంది.   కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేఅవకాశం లేనప్పుడు ఇక దానికి తెరాస మద్దతు అవసరం కూడా ఉండదు. అటువంటప్పుడు తెరాసకు తెలంగాణాను అప్పగించవలసిన అవసరం కూడా ఉండబోదు. అదేవిధంగా తెరాస మద్దతు స్వీకరించి దానికి అధికారంలో భాగం పంచి ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ అంగీకరించకపోవచ్చును. కేవలం కేసీఆర్ దురాశ, అధికార కాంక్ష కారణంగానే కాంగ్రెస్ నేడు తెలంగాణాలో కూడా గెలుపు కోసం పోరాడవలసిన దుస్థితిలో పడింది. అందువల్ల ఈ పరిస్థితికి కారణమయిన కేసీఆర్ తో మళ్ళీ చేతులు కలిపే ఆలోచన చేయకపోవచ్చును. ఎలాగు కేంద్రంలో, సీమాంద్రాలో అధికారం కోల్పోబోతున్నపుడు కనీసం తెలంగాణాలోనయినా అధికారం హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ ఆశించడం అసహజమేమీ కాదు. అందుకోసం కాంగ్రెస్ ఎంతకయినా తెగించవచ్చును. అవసరమయితే తెరాస యం.యల్యేలకు మంత్రి పదవులు ఎరగా వేసి పార్టీలోకి ఆకర్షించవచ్చును. తప్పనిసరి పరిస్థితుల్లో తెదేపా-బీజేపీ కూటమి మద్దతు కోరవచ్చును. వారు కూడా తెరాసను దెబ్బ తీయడానికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఇక తెరాస అంటే కేసీఆర్ మరియు ఆయన కుటుంబ సభ్యుల పెత్తనమే సాగుతుంది గనుక ఇతర పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇచ్చేందుకు ఆసక్తి చూపించవచ్చును. అందువల్ల తెరాస తనంతట తానుగా పూర్తి మెజార్టీ సాధిస్తే తప్ప ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టమేనని చెప్పవచ్చును. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీయే అధికారం దక్కించుకొనే అవకాశాలు ఎక్కువ.

కేసీఆర్ పీడకల వెనుక రహస్యమిదే..

      ఫామ్ హౌస్‌లో రెస్ట్ తీసుకుంటున్న తెరాస అధ్యక్షుడు కేసీఆర్ అప్పుడప్పుడు కొన్ని పీడకలలు కంటూ వుంటాడు. వెంటనే ప్రెస్ మీట్ పెట్టి తనకు వచ్చిన పీడకలల వివరాలు జనానికి చెబుతూ వుంటాడు. రీసెంట్‌గా ఆయన ఒక పీడకల కన్నాడు. ఆ కల ఆయనకు స్వీట్ డ్రీమ్ కావొచ్చేమోగానీ, అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ప్రజలకు మాత్రం అదొక పీడకల. ఇంతకీ కేసీఆర్ కన్న పీడకల సారాంశం ఏమంటంటే, జనరల్ ఎలక్షన్స్ ఫలితాలు విడుదలైన తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. సీమాంధ్రలో జగన్ అధికారంలోకి వస్తాడు. వీళ్ళిద్దరూ కలసి రెండు రాష్ట్రాలనీ కలసి మెలసి అద్భుతంగా డెవలప్ చేసేస్తారు. కేసీఆర్ ఈ మాట చెప్పినప్పుడు తెలంగాణ ప్రజలు బిత్తరపోతే, సీమాంధ్ర ప్రజలు ఉలిక్కిపడ్డారు.   కేసీఆర్, జగన్ కలసి మెలసి వుండే సంగతి ఏమోగానీ, ఈ రెండు రాష్ట్రాల్లో వీరిద్దరూ అధికారంలోకి రాకూడదని రెండు ప్రాంతాల ప్రజలు కలసిమెలసి ముక్కోటి దేవతలని కోరుకున్నారు. సోమవారం నాడు వెలువడిన మునిసిపల్ ఫలితాలు ఇటు తెలంగాణకి కేసీఆర్ గండం, అటు సీమాంధ్రకి జగన్ గండం లేదని చెప్పకనే చెప్పాయి. ఇదిలా వుంటే, మహానుభావుడు కేసీఆర్ సీమాంధ్రలో జగన్ రావాలని ఎందుకు కోరుకుంటున్నాడన్న అంశం మీద రాజకీయ వర్గాలలో భారీ స్థాయిలో చర్చ జరిగింది. సీమాంధ్రలో తెలుగుదేశం అధికారంలోకి వస్తే హైదరాబాద్‌లో, తెలంగాణలో సీమాంధ్రులు స్థాపించిన పరిశ్రమలన్నీ సీమాంధ్రకు తరలిపోయే అవకాశం వుంది. సీమాంధ్రులు స్థాపించిన పరిశ్రమలు మాత్రమే కాదు.. తెలంగాణవాళ్ళు స్థాపించిన పరిశ్రమలు కూడా సీమాంధ్రకు వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తాయి. అలా జరిగితే, తెలంగాణ పారిశ్రామికంగా మైనస్‌లో పడిపోతుంది. ఆ మైనస్‌ని సరిదిద్దే శక్తి కేసీఆర్‌కి లేదు. పాపం ఈ పెద్దమనిషికి సీమాంధ్రులను తిట్టడం తప్ప మరో పని వస్తేగా? అదేగనుక సీమాంధ్రలో జగన్ ప్రభుత్వం వస్తే హైదరాబాద్‌లోని ఒక్క పరిశ్రమ కూడా సీమాంధ్ర ముఖం చూడదు. జగన్‌కి భయపడి పారిశ్రామికవేత్తలు సీమాంధ్ర ముఖం కూడా చూడరు. అప్పుడు తెలంగాణలో పరిశ్రమలు అక్కడే పడుంటాయి. కేసీఆర్‌కి ఎలాంటి ఇబ్బందీ వుండదు. ఈ ముందు చూపుతోనే కేసీఆర్ సీమాంధ్రలో జగన్ రావాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు మునిసిపల్ ఫలితాల తర్వాత తెలంగాణలో కేసీఆర్, సీమాంధ్రలో జగన్ అధికారంలోకి రారని తేలిపోయింది కాబట్టి రెండు ప్రాంతాలకీ నో ప్రాబ్లం.

బడంగ్‌పేటలో బుడుంగ్‌మన్న టీఆర్ఎస్

  తెలంగాణ తన జాగీరులాగా మాట్లాడే టీఆర్ఎస్ మునిసిపల్ ఎన్నికలలో అడ్డంగా ఆరిపోయింది. రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట మునిసిపాలిటీలో టీఆర్ఎస్ బుడుంగ్‌మని మునిగిపోయింది. అంటే అర్థం ఏంటంటే, ఈ మునిసిపాలిటీలో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఒక్క కౌన్సిలర్ స్థానం కూడా దక్కలేదు. ఒక్క బడంగ్‌పేటలో మాత్రమే కాదు.. తెలంగాణలోని అనేక మునిసిపాలిటీలలో టీఆర్ఎస్ ఒక్క కౌన్సిలర్ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని ఏడు మునిసిపాలిటీలలో టీఆర్ఎస్‌కి ఒక్క కౌన్సిలర్ స్థానం కూడా దక్కలేదు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, మధిర, నల్గొండ జిల్లాలోని భువనగిరి, కోదాడ, హుజూర్‌నగర్, రంగారెడ్డి జిల్లాలోని బడంగ్‌పేట్, పెద్ద అంబర్‌పేట్ మునిసిపాలిటీలలో టీఆర్ఎస్ మునిగిపోయింది.

సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు అద్దంపట్టనున్న స్థానిక ఫలితాలు

  ఈరోజు వెలువడిన మునిసిపల్ ఎన్నికల ఫలితాలు మరో నాలుగు రోజుల్లో వెలువడనున్న అసెంబ్లీ, లోక్ సభ ఫలితాలు ఏవిధంగా ఉండబోతున్నాయో చూచాయగా తెలియజేసాయి. అయితే ఇవి ప్రధానంగా నగరాలు, పట్టణాల ఓటర్ల అభిప్రాయాన్ని ప్రతిభింప జేసేవే గనుక, గ్రామీణ ఓటర్ల అభిప్రాయానికి అద్దంపట్టే యం.పీ.టీ.సీ., జెడ్.పీ.టీ.సీ.ఎన్నికల ఫలితాలు రేపు వెలువడిన తరువాత ప్రజలు ఏ పార్టీకి అధికారం కట్టబెట్టబోతున్నారనే విషయంపై మరికొంత స్పష్టత రావచ్చును.   ఇంతవరకు వెలువడిన అనేక సర్వే నివేదికలు ఈ సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణాలో తెరాసకు, సీమాంద్రాలో వైకాపాకు తిరుగులేని మెజార్టీ వస్తుందని జోస్యం చెప్పాయి. కానీ వాస్తవానికి తెలంగాణాలో బహుముఖ పోటీ వలన కాంగ్రెస్, తెరాసలకు మెజార్టీ వచ్చే అవకాశం కనబడటంలేదు. అదేవిధంగా సీమాంద్రాలో తెదేపా, వైకాపాలు విజయం కోసం చాలా తీవ్రంగా పోటీ పడ్డాయి గనుక ఆ రెండు పార్టీల మధ్య ఓట్లు చీలి ఎవరికీ పూర్తి మెజార్టీ రాని పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈరోజు వెలువడిన ఫలితాలు తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ, సీమాంద్రాలో తెదేపాలకు సానుకూలంగా ఉన్నాయి. ఒకవేళ రేపు వెలువడే యం.పీ.టీ.సీ., జెడ్.పీ.టీ.సీ. ఎన్నికల ఫలితాలు కూడా ఈవిధంగానే ఉనట్లయితే, అధికారంలోకి రావాలని కలలుగంటున్న తెరాస, వైకాపాల కలలు పగటి కలలుగానే మిగిలిపోయే అవకాశం ఉంది.   కానీ, ఒకవేళ రేపటి ఫలితాలలో తెరాస, వైకాపాలకు ఆధిక్యత వచ్చినట్లయితే, ఆంధ్ర తెలంగాణా రాష్ట్రాలలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవచ్చునని భావించవచ్చును. ఎందువలన అంటే అర్బన్ ఓటర్లు కాంగ్రెస్, తెదేపాలకు, గ్రామీణ ఓటర్లు తెరాస, వైకాపాలకు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టం చేసినట్లవుతుంది. రేపటి ఫలితాలు ఏవిధంగా ఉన్నప్పటికీ సీమాంద్రాలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగు కావడం తధ్యమని ఈ రోజు మున్సిపల్ ఫలితాలు రూడీ చేస్తున్నాయి.

ఈయన రీపీటవుద్దంటాడు.. ఆయన కాదంటాడు

  పార్టీ ఒక్కటే.. గొంతులు మాత్రం రెండు. పార్టీ ఒక్కటే.. కానీ ఒకవైపు హిట్.. మరోవైపు ఫట్. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. మునిసిపల్ ఎన్నికల ఫలితాలలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సూపర్ హిట్ అయి టీఆర్ఎస్‌ని కూడా వెనక్కి నెట్టేసింది. అదే మరోవైపు సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఈ ఫలితాల మీద సీమాంధ్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్పందించారు. ఒకాయన పరాజయ భారంతో స్పందిస్తే, మరొకాయన విజయోత్సాహంతో స్పందించారు. ఇద్దరూ ఈ ఫలితాలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. అంతవరకూ ఓకే, కానీ ఇలాంటి ఫలితాలు అసెంబ్లీ, పార్లమెంటు ఫలితాలలో రిపీటవుతాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ ఫలితాలలో విజయం సాధిస్తుందనేది విషయాన్ని ఆయన చెప్పదలచుకున్నారు. చెప్పేశారు. తెలంగాణలో ఫ్యూచర్లో ఇవే ఫలితాలు రిపీటవుతాయని పొన్నాల చెబుతుంటే, రఘువీరా మాత్రం సీమాంధ్రలో ఇవే ఫలితాలు రిపీట్ కావని అంటున్నారు. ఇప్పుడు సీమాంధ్రలో అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ ఫలితాల్లో మాత్రం దూసుకుపోతుందట. రెండు ప్రాంతాలు.. ఇద్దరు అధ్యక్షులు.. రెండు నాలుకలు.. ఇదే కాంగ్రెస్ స్టైల్.

డల్లయిపోయిన రఘువీరారెడ్డి

  ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్‌ని విభజించిందో అప్పుడే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది. ఆ డెడ్ బాడీని రఘువీరారెడ్డిని చేతిలో పెట్టి ఈ డెడ్‌బాడీని బతికించమని కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది. పాపం రఘువీరారెడ్డి చిరంజీవి లాంటి పెద్దమనిషితో కలసి సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని బతికించాలని ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. మునిసిపల్ ఎన్నికల ఫలితాలు సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటో క్లియర్‌గా చెప్పేశాయి. అయితే ఫలితాలు ఇలా వచ్చినప్పటికీ రఘువీరారెడ్డికి జ్ఞానోదయం కలిగినట్టుగా కనిపించడం లేదు. మునిసిపల్ ఫలితాలలో సీమాంధ్ర కాంగ్రెస్ మటాషైపోయిందని స్పష్టంగా తెలియగానే రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రలో కాంగ్రెస్ గల్లంతైపోవడం, దాంతోపాటు తాను ప్రాతినిధ్యం వహించిన మడకశిర నియోజకవర్గంలోని మడకశిర మునిసిపల్ స్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ఆయన చాలా డల్లుగా మారిపోయారు. ఈ అపజయాన్ని హుందాగా స్వీకరిస్తున్నామని ఆయన మరింత హుందాగా వాయిస్ మార్చి చెప్పారు. రఘువీరా అక్కడితో ఆగితే బాగుండేది. ఇప్పుడు మునిసిపాలిటీల్లో వచ్చిన ఫలితాలు రేపు పార్లమెంట్, అసెంబ్లీ ఫలితాల్లో రావని ఆత్మవిశ్వాసంతో చెప్పారు. పాపం ఈ దశలో అలా చెప్పక ఇంకెలా చెబుతారులే..

పశ్చిమ గోదావరిలో అన్ని స్థానాలూ టీడీపీవే

      మునిసిపల్ ఎన్నికలలో పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని మునిసిపల్ స్థానాలను తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంది. జిల్లాలో మొత్తం ఎనిమిది మునిసిపల్ స్థానాలున్నాయి. భీమవరంలో 39 కౌన్సిలర్ స్థానాలున్నాయి. వీటిలో 19 తెలుగుదేశం, 5 వైకాపా గెలిచాయి. ఒకస్థానంలో ఇతరులు గెలుపొందారు. పాలకొల్లులోని 31 స్థానాల్లో 24 స్థానాల్లో తెలుగుదేశం 6 స్థానాల్లో వైకాపా గెలవగా, ఇతరులు ఒక్క స్థానంలో గెలిచారు. తాడేపల్లిగూడెంలోని 35 స్థానాల్లో 24 స్థానాలు తెలుగుదేశం గెలుచుకోగా, ఏడు స్థానాల్లో టీడీపీ గెలుపొందింది. మూడు స్థానాల్లో ఇతరులు గెలిచారు. నర్సాపురంలోని 31 స్థానాల్లో 10 తెలుగుదేశం, ఏడు వైకాపా, మూడు ఇతరులు గెలిచారు. ఇక్కడ తెలుగుదేశం ఆధిక్యంలోకి వచ్చే అవకాశం వుంది. నిడదవోలులోని 28 వార్డుల్లో 17 తెలుగుదేశం, 10 వైకాపా గెలవగా ఇతరులు ఒక స్థానాన్ని పొందారు. తణుకులోని 34 స్థానాల్లో 31 తెలుగుదేశం గెలుచుకుంది. ఒక స్థానాన్ని వామపక్షాలు, రెండు స్థానాలను ఇతరులు గెలుచుకున్నారు. కొవ్వూరులోని 23 స్థానాల్లో 13 స్థానాలు తెలుగుదేశం గెలిచింది. ఒక స్థానాన్ని ఇతరులు గెలిచారు. ఇతర స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ముందంజలో వున్నారు. జంగారెడ్డిగూడెంలోని 20 స్థానాల్లో 16 స్థానాల్లో టీడీపీ, రెండు స్థానాల్లో వైకాపా, రెండు స్థానాల్లో ఇతరులు గెలిచారు. పశ్చిమ గోదావరి జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ ఒక్క కౌన్సిలర్ స్థానాన్ని కూడా గెలుచుకోకపోవడం విశేషం.

తూర్పు గోదావరిలో తెలుగుదేశం హవా

      తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ హవా నడుస్తోంది. మొత్తం పది మునిసిపల్ స్థానాల్లో ఎనిమిది స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమలాపురంలోని 30 కౌన్సిలర్ స్థానాల్లో తెలుగుదేశం 22, వైసీపీ 7, ఇతరులు 1 స్థానాలు గెలుచుకున్నారు. తునిలోని 30 స్థానాల్లో కాంగ్రెస్ 2, టీడీపీ 17, వైకాపా 12 స్థానాలు గెలుచుకున్నాయి. సామర్లకోటలోని 30 స్థానాల్లో తెలుగుదేశం 24, వైకాపా 6 స్థానాలు గెలిచాయి. రామచంద్రాపురంలోని 17 కౌన్సిలర్ స్థానాల్లో 16 తెలుగుదేశం గెలుచుకోగా ఆరు స్థానాలు మాత్రమే వైకాపా పొందింది. 1 ఇతరులు. పిఠాపురంలోని 30 స్థానాల్లో 23 తెలుగుదేశం, 6 వైకాపా గెలిచాయి. ఒకస్థానాన్ని ఇతరులు పొందారు. మండపేటలోని 29 స్థానాల్లో 18 తెలుగుదేశం, 11 వైకాపా గెలిచాయి. పెద్దాపురంలోని 28 స్థానాల్లో 21 తెలుగుదేశం, 4 వైకాపా గెలిచాయి. ఇతరులు మూడు స్థానాల్లో గెలిచారు. గొల్లప్రోలులోని 20 స్థానాల్లో కాంగ్రెస్ 1 గెలుచుకోగా తెలుగుదేశం, వైకాపా చెరో తొమ్మిది స్థానాల్లో గెలిచాయి. వామపక్షాలు 1 స్థానం గెలిచాయి. ముమ్మడివరంలోని 20 స్థానాల్లో తెలుగుదేశం, వైకాపా 8 స్థానాల చొప్పున గెలిచాయి. ఇతరులు నాలుగు స్థానాల్లో గెలిచారు. ఏలేశ్వరంలోని 20 స్థానాల్లో కాంగ్రెస్ 1, తెలుగుదేశం 10, వైకాపా 9 స్థానాల్లో గెలిచాయి.

సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ మటాష్

      కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్ప ప్రతి ఒక్కరూ సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోతుందని భావించారు. రాష్ట్రాన్ని దారుణంగా విభజించిన కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో తమకు బోలెడంత బలముందని బిల్డప్పులు ఇస్తూ వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలో అసలు సీనే లేదని మునిసిపల్ ఎన్నికలు నిరూపించాయి. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ మటాష్ అని చెప్పేశాయి. మునిసిపల్ ఎన్నికలలో ప్రధాన పోటీ తెలుగుదేశం, వైకాపాల మధ్య కొససాగుతోంది. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీయే సీమాంధ్ర అంతటా ఆధిపత్యంలో వుంది. వైకాపా చావు తప్పి కన్ను లొట్టబోయిన పరిస్థితిలో వుంది. ఈ రెండు పార్టీల మధ్య కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోయింది. సీమాంధ్ర ఓటర్లు కాంగ్రెస్ పార్టీని చాచిపెట్టి కొట్టారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ మునిసిపల్ ఛైర్మన్, మేయర్ స్థానాలను దక్కించుకునే మాట దేవుడెరుగు.. వార్డులు, కార్పొరేషన్ స్థానాలలో రెండు అంకెలను కూడా అందుకోలేకపోయింది.

ఎవరికీ దక్కని ఆధిపత్యం

      సీమాంధ్ర, తెలంగాణ వ్యాప్తంగా కొన్ని మునిసిపల్ స్థానాల్లో ఎవరికీ ఆధిపత్యం దక్కని విధంగా ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు కౌంటింగ్ పూర్తయిన రెండు స్థానాల్లో ఏ పార్టీకీ ఆధిపత్యం దక్కలేదు. ఏ పార్టీ సొంత బలంతో మునిసిపల్ ఛైర్మన్ స్థానాన్ని సొంతం చేసుకునే అవకాశాలు కనిపించడం లేదు. సీమాంధ్రలో ప్రకాశం జిల్లా చీరాలలో మొదట వైకాపా ఆధిపత్యం కొనసాగింది. అయితే ఆ తర్వాత ఆ పార్టీ వెనుకబడిపోయి తెలుగుదేశం ముందడగు వేసింది. మొత్తం మీద ఈ రెండు పార్టీలకూ ఈ స్థానంలో ఆధిపత్యం దక్కలేదు. అలాగే వరంగల్ జిల్లా మహబూబాబాద్ మునిసిపల్ స్థానంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. మొత్తం 28 వార్డుల్లో టీఆర్ఎస్ ఏడు, కాంగ్రెస్ ఏడు, టీడీపీ మూడు, సీపీఎం ఐదు, సీపీఐ మూడు, ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందారు. ఈ రెండు స్థానాల్లోనూ ప్రలోభాలు పనిచేసే అవకాశం వుంది.

రాహుల్‌కి సన్నాయి ఊదిన బిస్మిల్లాఖాన్ కుటుంబం

  ప్రముఖ షహనాయ్ విద్వాంసుడు దివంగత బిస్మిల్లాఖాన్‌ని యావత్ భారతదేశం గౌరవిస్తుంది. కానీ, ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఆ గౌరవాన్ని నిలుపుకునేలా ప్రవర్తించలేదు. వీళ్ళు షహనాయ్ ఊదడంలో ఎంత ప్రతిభావంతులో తెలియదుగానీ, అబద్ధాలు చెప్పడంలో మాత్రం ఘనాపాటీలన్న విషయం తెలిసిపోయింది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ వారణాసి నుంచి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేస్తూ స్థానికులైన బిస్మిల్లాఖాన్‌ కుటుంబ సభ్యులు తనను ఎంపీ అభ్యర్థిగా నామినేట్ చేస్తూ సంతకాలు చేస్తే బాగుంటుందని ఆశించారు. ఆ విషయాన్ని బిస్మల్లాఖాన్ కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకుని వెళ్ళారు. దానికి వాళ్ళు బీజేపీ అంటేనో, మోడీ అంటేనో తమకు ఇష్టం లేదు కాబట్టి సంతకాలు చేయడానికి రాలేం అని చెబితే ఇబ్బంది వుండేది. కానీ బిస్మిల్లాఖాన్ కుటుంబ సభ్యులు ఏమీ ఎరుగని పత్తిత్తుల్లాగా మాట్లాడారు. మా నాన్నగారికి (బిస్మి్ల్లాఖాన్‌కి) రాజకీయాలంటే అస్సలు ఇష్టం వుండేది కాదు. మమ్మల్ని కూడా రాజకీయాల జోలికి వెళ్ళొద్దని చెప్పారు. అందువల్ల మేం రాలేం అని చెప్పారు. పాపం పెద్దాయన చెప్పిన మాటకి కట్టుబడి వున్నార్లే అని అందరూ ఊరుకున్నారు. అప్పుడు మోడీ నామినేషన్‌కి స్థానికులైన కొందరు కార్మికులు సంతకాలు చేశారు. అక్కడితో ఈ ఇష్యూ ముగిసింది. అయితే తాజాగా వారణాసిలో రాహుల్ గాంధీ నిర్వహించిన రోడ్ షోకి బిస్మిల్లాఖాన్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. భుజాల మీద కాంగ్రెస్ కండువాలు వేసుకుని, షహనాయ్‌‌లు ఊదుతూ రాహుల్‌కి స్వాగతం పలికారు. మరి రాజకీయాల జోలికి వెళ్ళొద్దని బిస్మిల్లాఖాన్ చెప్పిన (?) మాటని వీళ్ళు మరచిపోయారో లేక అబద్ధం చెప్పారో ఆ పైనున్న బిస్మిల్లాఖాన్‌కే ఎరుక. మొత్తానికి రాహుల్‌కి వీళ్ళు సన్నాయి ఊదుతూ స్వాగతం చెప్పడం కోసం రాహుల్‌ వీళ్ళదగ్గర ఎన్ని ‘లక్షల’ సన్నాయిలు ఊదాడో మరి!

తెదేపాకు కూడా ‘అపాయింటడ్ డే’ పరీక్ష ఎదుర్కోక తప్పదా

  కేంద్రప్రభుత్వం జూన్ 2న (అపాయింటడ్ డే) తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా అవతరిస్తుందని ప్రకటించి చాలా కాలమే అయింది. అయితే అప్పుడు తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కానీ ఆ పార్టీ నేతలు గానీ అందులో మర్మం కనిపెట్టలేకపోవడంతో ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. కానీ ఎన్నికల ఫలితాలు ఈనెల 16న వెలువడబోతుంటే, దాదాపు రెండు వారాల వ్యవధి మధ్యలో ఉంచుతూ జూన్ 2న ‘అపాయింటడ్ డే’ గా నిర్ణయించడం తమ పార్టీ కొంప ముంచేందుకేనని కేసీఆర్ కి ఇప్పుడు అర్ధమయింది. దానితో అపాయింటడ్ డేని మే17కి మార్చవలసిందిగా హైకోర్టుని ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయింది.   మజ్లిస్, సీపీఐ, స్వతంత్ర అభ్యర్ధుల మద్దతు కూడగట్టుకొని తెలంగాణాలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని కేసీఆర్ ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు టీ-కాంగ్రెస్ నేతలు తెరాసలో గెలుపు గుర్రాలకు వలవేసి తమవైపు ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మురం చేయడంతో ఆయనకు కంగారు మొదలయింది. తెరాస టికెట్ పై పోటీ చేసి యం.యల్.ఏలుగా ఎన్నికవ్వగల 20మంది రెడ్డి కులస్తులు తమతో పూర్తి టచ్చులోఉన్నట్లు కాంగ్రెస్ నేతలు చెప్పుకోవడం, టీ-కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి పదవి కోసం వారిలో వారు కుమ్ములాడుకోవడం గమనించిన తెరాసకు, కాంగ్రెస్ మాటలను అంత తేలికగా తీసుకోరాదని అర్ధమయింది.   తెలంగాణా రాష్ట్రం ఇచ్చినట్లయితే తెరాసను కాంగ్రెస్ పార్టీలో బేషరతుగా విలీనం చేస్తానని మాట ఇచ్చిన కేసీఆర్, ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసినట్లుగా, ఆ పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవడానికి సైతం నిరాకరించారు. సర్వే నివేదికలన్నీ తెరాసకే పూర్తి మెజార్టీ వస్తుందని సూచించడంతో, కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకొని అధికారంలో భాగం ఎందుకు పంచి ఇవ్వాలి? అనే దురాశతోనే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చారు. కానీ ఎన్నికల ముగిసిన తరువాత ఇప్పుడు తమకు పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం కనబడకపోవడంతో కేసీఆర్ కి గుబులు పుట్టుకొంది. పైగా ఈరెండు వారాల వ్యవధిలో కాంగ్రెస్ గనుక తెరాస యంయల్యేలను తనవైపు తిప్పుకొనగలిగితే, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని తెలంగాణాను ఏలాలనే కేసీఆర్ కలలు పగటికలలుగానే మిగిలిపోతాయి. అందుకే తెరాస టికెట్ పై పోటీ చేసిన అభ్యర్దులందరితో కేసీఆర్ మొన్న ఒక సమావేశం ఏర్పాటు చేసి, తమ ప్రభుత్వం ఏర్పడితే వారికి మంత్రి పదవులు వగైరాలు ఇస్తామని హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ, కాంగ్రెస్ నేతలు మాత్రం తెరాస గెలుపు గుర్రాలను తమ పార్టీలోకి ఆకర్షించేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేసారు.   జూన్ 2న అధికారికంగా తెలంగాణా ఏర్పడేవరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదు గనుక, ఇదే సమస్య అక్కడ కూడా తలెత్తే అవకాశం ఉంది. అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీకి బదులు వైకాపా అటువంటి ప్రయత్నాలు చేయవచ్చును. ఈసారి ఎన్నికలలో తెదేపా, వైకాపాలలో దేనికో ఒకదానికి స్పష్టమయిన మెజార్టీ వస్తే పరువాలేదు. కానీ, రెండు పార్టీలకు సరి సమానంగా లేదా ఏదో ఒకదానికి ఎక్కువ మరొక దానికి కొంచెం తక్కువ వచ్చినా ఇదే పరిస్థితి తలెత్తడం ఖాయం. ఈసారి ఈ రెండు పార్టీలు కూడా తమకే స్పష్టమయిన మెజార్టీ రాబోతోందనే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఒకప్పుడు కేసీఆర్ కూడా ఇదేవిధంగా చాలా ధీమా వ్యక్తం చేసారు. కానీ పరిస్థితులు ఇప్పుడు తారుమారు అయ్యాయి. అందువలన ఈ రెండు వారాల వ్యవధి విజయావకాశాలున్న తెదేపాకు అగ్నిపరీక్షగా మారే అవకాశం ఉంది.

జగన్ పార్టీ అల్లర్ల వెనుక అసలు కారణమేంటి?

      బుధవారం సీమాంధ్రలో జరిగిన పోలింగ్ సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగు ప్రజలకి తమ విశ్వరూపం చూపించారు. జగన్ పోటీ చేస్తున్న పులివెందులలో అయితే నాలుగైదు విశ్వరూపాలు ఒకేసారి చూపించారు. ఇక సీమాంధ్రలోని ప్రతి నియోజకవర్గంలోనూ వైకాపా కార్యకర్తలు హింసాకాండకు పాల్పడటం, ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడం చేశారు.   వైకాపా ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఓటర్లు మాత్రం విజ్ఞతతో వ్యవహరించి తెలుగుదేశం పార్టీకే మద్దతు  ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంతకీ వైకాపా రాష్ట్రమంతటా ఎందుకు అరాచకం సృష్టించిందనే దానిమీద రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈసారి సీమాంధ్రలో 70 శాతానికి మించి పోలింగ్ జరిగితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్న వార్తలు వచ్చాయి. లగడపాటి రాజగోపాల్‌ కూడా విలేకరుల సమావేశం పెట్టిమరీ  ఈ విషయాన్ని చెప్పారు. దాంతో వైకాపా పోలింగ్ శాతం తగ్గించడానికే అల్లర్లు సృష్ఠించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతన్నాయి. పోలింగ్ కేంద్రాల దగ్గర అల్లర్లు జరుగుతున్నాయన్న వార్తలు ప్రబలిన పక్షంలో ఓటింగ్‌కి బయల్దేరేవారు సహజంగానే ఎందుకొచ్చిన గొడవ అని ఆగిపోతారు. ఈ వీక్నెస్‌ని అర్థం చేసుకున్న వైకాపా సీమాంధ్రలోని అన్ని నియోజకవర్గాలలో అల్లర్లు సృష్టించి వుండవచ్చని భావిస్తున్నారు. అయితే వైకాపా చేసిన అల్లర్ల కారణంగా కొంతమంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రాకపోయి వుండొచ్చు, కానీ భారీ పోలింగ్ మాత్రం జరిగింది. పోలింగ్ శాతం తగ్గించడానికి వైకాపా వేసిన పథకం పారలేదు  

సిగ్గొదిలేసిన సీమాంధ్ర కాంగ్రెస్

      సీమాంధ్ర కాంగ్రెస్ సిగ్గూ, ఎగ్గూ వదిలేసినట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే రాష్ట్రాన్ని దుర్మార్గంగా విభజించిందో అప్పుడే కాంగ్రెస్ పార్టీని సీమాంధ్ర ప్రజలు చంపేశారు. అయినప్పటికీ ఆశ చావని కాంగ్రెస్ పార్టీ చిరంజీవిని ముందుకు తోసి సీమాంధ్రలో ఎంతోకొంత లాభం పొందాలని ప్రయత్నించింది. దుర్మార్గంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెసే సీమాంధ్రని అభివృద్ధి చేస్తానని కల్లబొల్లి మాటలు చెప్పింది.   అయితే సీమాంధ్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని అసహ్యంగా చూడటం మానలేదు. ఆ విషయం బుధవారం జరిగిన సీమాంధ్ర పోలింగ్‌లో కూడా స్పష్టమైంది. ఓటింగ్ జరిగిన పరిస్థితిని చూస్తే తెలుగుదేశం అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాపం వైకాపా తాను అధికారంలోకి వస్తానని బిల్డప్పులు ఇచ్చుకుంటోంది. జై సమైక్యాంధ్ర పార్టీ కిక్కురుమనడం లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం తాను సీమాంధ్రలో అధికారంలోకి వస్తానని చెప్పేంత సాహసమైతే చేయలేదుగానీ, సీమాంధ్రలో తాము చాలా సీట్లు గెలుచుకుంటామని, సీమాంధ్రలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా తమ  పార్టీ మద్దతు తీసుకోవలసి వస్తుందని చెబుతోంది. గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఇలాంటి మాటలే చెప్పారు. ఆ మాటలు చెబుతున్నప్పులు సదరు నాయకుల ముఖంలో ఎంతమాత్రం సిగ్గు కనిపించకపోవడం విశేషం. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క అసెంబ్లీ, ఒక్క పార్లమెంట్ సీట్ అయినా దక్కే అవకాశం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సమయంలో సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఇలా మాట్లాడుతున్నారంటే, సదరు పార్టీలో సిగ్గు అనే మెటీరియల్ మాయమైపోయినట్టుగా అర్థం చేసుకోవచ్చు.