నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర అంటే ఇదేనేమో?

  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సఖ్యత పాటించరు. కానీ, ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పట్ల మంచి సఖ్యత ప్రదర్శిస్తారు. అదేవిధంగా సమైక్యాంధ్ర అని పోరాటాలు చేసిన జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రావారిని అడుగడుగునా అవమానిస్తున్న టీ-ముఖ్యమంత్రిని పల్లెత్తు మాటనరు. కానీ, ఏదో ఒక సాకుతో చంద్రబాబు ప్రభుత్వంపై మీద ఒంటికాలిపై లేస్తుంటారు. ఆంధ్రా విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంటు చేయమని కేసీఆర్ ప్రభుత్వం తేల్చిచెప్పినా జగన్ పెదవి విప్పరు, పోలవరం ముంపు గ్రామాలపై తెలంగాణా ప్రభుత్వం రాద్ధాంతం చేస్తున్నా ఆ సమస్యతో తనకెటువంటి సంబందమూ లేదన్నట్లు వ్యవహరిస్తారు. కానీ ప్రజలెనుకొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పదేపదే ఆరోపణలు చేస్తూ, దానిపై ప్రజలలో అనుమానాలు రేకేత్తించేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తుంటారు. బహుశః దీనినే నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర అని ఆయన భావిస్తున్నారేమో? ఏమో?

వ్యవసాయ రుణాలపై జగన్ ద్వంద వైఖరి

  చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయ రుణాలు మాఫీచేయకుండా కమిటీల పేరుతో ప్రజలను మోసపుచ్చుతోందని, దానివలన రైతులు చాలా ఆందోళన చెందుతున్నారని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మొన్న శాసనసభలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. తమ కోసం తమకంటే ఎక్కువగా జగనే ఆవేదన పడటం చూసి రైతులే ఆశ్చర్యపోతున్నారు. కానీ ఆంద్ర, తెలంగాణా, రాయలసీమ మూడు కూడా తనకు సమానమని చెప్పుకొన్న జగన్మోహన్ రెడ్డి, తమ గురించి మాత్రం ఎందుకు ఆవేదన పడటంలేదని తెలంగాణా రైతన్నలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆంధ్ర రైతులకు అన్యాయం చేస్తున్నాడని విరుచుకుపడే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు కంటే ముందుగా బాధ్యతలు చేప్పట్టిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేయకపోయినా, ఆయనను మాత్రం ఈవిషయంలో ఎందుకు నిలదీయడంలేదో ఎవరికీ తెలియదు. అంటే కేసీఆర్ తో జగన్మోహన్ రెడ్డికి మంచి అనుబంధం ఉంది గనుక, అతనికి తెలంగాణా రైతన్నల గోడు పట్టదు. కానీ చంద్రబాబుతో అతనికి పడదు గనుక, ఆంద్ర రైతన్నల గురించి ప్రశ్నిస్తున్నారను కోవాల్సి ఉంటుంది. అంటే జగన్ ఆసక్తి అంతా రైతన్నల గురించి కానీ, వ్యవసాయ రుణాల మాఫీ గురించి కానీ కాదని కేవలం తనకు అధికారం దక్కకుండా అడ్డుపడిన చంద్రబాబును రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికేనని అర్ధమవుతోంది. విశ్వసనీయతకు పేటెంట్ హక్కులు పొందినట్లు మాట్లాడే జగన్మోహన్ రెడ్డి, ఈవిధంగా ద్వంద వైఖరి కనబరచడం వలననే ప్రజల విశ్వసనీయత కోల్పోయి ఎన్నికలలో ఓడిపోయారు. కానీ ఆ సంగతి మరిచిపోయి, మళ్ళీ వ్యవసాయ ఋణాలపై ద్వంద వైఖరి ప్రదర్శించడం అలవాటులో పోరాపాటనుకోవాలేమో!

కాంగ్రెస్, తెదేపా యంయల్సీలు జంప్

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీలోకి ఇతర పార్టీల యంయల్సీలు తరలివస్తుంటే, తెలంగాణాలో కూడా అధికార తెరాస పార్టీలో చేరేందుకు, కాంగ్రెస్, తెదేపా, బీయస్పీలకు చెందిన నేతలు తరలి వెళ్ళిపోతున్నారు. రెండు ప్రాతీలు కూడా తాము ఇతర పార్టీల నేతలను ఆకర్షించడానికి ఎటువంటి ప్రయత్నమూ చేయడంలేదని, రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకోనేందుకు ఇతర పార్టీల నేతలు తమంతట తాముగా తమ పార్టీలలో చేరేందుకు తరలి వస్తున్నారని వాదిస్తున్నాయి. అయితే నిజానికి తెదేపా, తెరాసలకు శాసనసభలో పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ శాసనమండలిలో బిల్లులను ఆమోదింపజేసుకోవడానికి తగినంత సంఖ్యా బలం లేదు. ఆ కారణంగానే రెండు పార్టీలు కూడా శాసనమండలిలో కూడా తమ బలం పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ప్రయత్నంలోనే ఈ రోజు వివిధ పార్టీలకు చెందినా 9మంది యంయల్సీలను తెరాసలో చేర్చుకొనేందుకు రంగం సిద్దమయింది. ఈ రోజు తెరాసలో చేరుతున్న వారిలో చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడైన సలీం, శాసనమండలిలో తెదేపా ఫ్లోర్ లీడర్ గా నియమితులయినా వెంకటేశ్వరులు కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి మొత్తం ఐదుగురు యం.యల్సీలు- అమోస్, భానుప్రసాద్, భూపల రెడ్డి, జగదీశ్వర రెడ్డి మరియు రాజలింగం ఈరోజు తెరాసలో చేరబోతున్నారు. ఇక బీయస్పీ నుండి ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప, పీ.ఆర్ టీ యూకు చెందిన పీ. రవీంద్ర రెడ్డి, జనార్ధన్ రెడ్డి, మోహన్ రెడ్డి ఈ రోజు కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరబోతున్నారు.

పోలవరంపై ఆందోళన దేనికోసం?

  పోలవరం ముంపు ప్రాంతాలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఖమ్మం జిల్లా పాల్వంచ రెవన్యూ డివిజ్‌లో పోలవరం వ్యతిరేక కమిటీ బంద్ కు పిలుపు ఇచ్చింది. ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ కేంద్రం జారీ ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలవరం విషయంలో పోరాడుతున్నవారు తమ పోరాటం ముంపు గ్రామాల నిర్వాసితుల సంక్షేమం కోరకా లేక తెలంగాణాకు చెందిన గ్రామాలను ఆంధ్రాకు బదలాయించడాన్ని వ్యతిరేఖంగానా లేక పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేఖంగానా అనే విషయం తేల్చుకోవడం మంచిది. ఒకవేళ వారి ఆందోళన అంతా నిర్వాసితుల పునరావాసం కోసమే అయినట్లయితే, వారు తెలంగాణా ప్రభుత్వం ద్వారా కేంద్రంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తగిన ప్యాకేజీ పొందవచ్చును. కానీ వారి పోరాటం, తెలంగాణాకు చెందిన ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలపడానికి వ్యతిరేఖంగా లేదా పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేఖంగా చేస్తున్నట్లయితే దానివల్ల ఎటువంటి ఫలితమూ ఉండబోదని గ్రహించాల్సి ఉంటుంది. ఎందువలన అంటే ఇంతకు ముందు తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కూడా ఇదే అంశం మీద తెలంగాణా బంద్ నిర్వహించారు. కానీ, కేంద్రం మాత్రం దానిపై స్పందించలేదు. అది గమనిస్తే ఈ విషయంలో కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనుకంజ వేసేందుకు సిద్దంగాలేదని స్పష్టమవుతోంది.   దేశంలో అనేక రాష్ట్రాలలో వివిధ ప్రాజెక్టులకు వ్యతిరేఖంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇటువంటి అందోళనల వలన ప్రాజెక్టుల నిర్మాణంలో కొంచెం జాప్యం జరుగుతోందే తప్ప కానీ ఏ ప్రాజెక్టూ కూడా ఆగిపోలేదనే సంగతి పోలవరంపై ఉద్యమిస్తున్న ఆందోళనకారులు గుర్తించవలసి ఉంటుంది. కేంద్రం చేపడుతున్న ఈ ప్రాజెక్టును అడ్డుకోవడం వలన ముంపు గ్రామాల నిర్వాసితులకు ఎటువంటి ప్రయోజనమూ కలగదనే విషయం కూడా వారు గ్రహించాలి. అందువలన వారు ఫలితం లేని ఉద్యమం చేయడం కంటే నిర్వాసితులకు న్యాయం చేకూర్చేందుకు గట్టిగా కృషిచేయడం మేలు.

మళ్ళీ మొదటికొచ్చిన పోలవరం

  ఆంధ్ర, తెలంగాణా శాసనసభలు పోలవరం ముంపు గ్రామాలపై పరస్పర వ్యతిరేఖ తీర్మానాలు ఆమోదించడంతో సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. ఈ విషయంలో రెండు రాష్ట్రాలు వెనక్కి తగ్గకపోవడంతో, కేంద్రం మళ్ళీ జోక్యం చేసుకోక తప్పనిసరి అవుతోంది. అయితే కేంద్రం స్వయంగా ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేయడమే కాకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు స్వయంగా చేపడుతోంది గనుక, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కంటే కేంద్రం మీదనే ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఈ ప్రాజెక్టుపై ఎట్టి పరిస్థితుల్లో ముందుకే సాగాలని కేంద్రం నిర్ణయించుకొన్నందున, తెలంగాణా అభ్యంతరాలను కేంద్రం పట్టించుకోకపోవచ్చును. అదే జరిగితే తెరాస ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వ్యతిరేఖిస్తున్న ఓడిషా, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాల మద్దతు కూడగట్టె ప్రయత్నం చేయవచ్చును. కానీ ఛత్తీస్ ఘర్ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది గనుక, తెరాసకు మద్దతు ఇచ్చే అవకాశం లేదు. అదేవిధంగా తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీలయిన కాంగ్రెస్, తెదేపా, బీజేపీలు కూడా తెరాస ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే అవకాశం లేదు. కనుక తెరాస మళ్ళీ ఒంటరి పోరాటం చేయక తప్పదు. ఇంతవరకు మన దేశంలో అనేక పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మించారు. వాటివల్ల చాలామంది ప్రజలు నిర్వాసితులయినప్పటికీ, అవి దేశాన్ని సస్యశ్యామమలం చేస్తున్నాయి. ఆ ప్రాజెక్టులకి కూడా ఎంతో కొంత స్థానిక ప్రజల నుండి వ్యతిరేఖత ఎదురయ్యే ఉంటుంది. కానీ వాటినన్నిటినీ అధిగమించి ప్రాజెక్టులు నిర్మించబడ్డాయి. ఇప్పుడు కూడా అదేవిధంగా ఈ అడ్డంకులన్నిటినీ అధిగమించి పోలవరం ప్రాజెక్టు కట్టవలసి ఉంటుంది. మోడీ ప్రభుత్వం నిర్దిష్ట సమయంలోనే ఈ ప్రాజెక్టుని పూర్తి చేయవచ్చును.

ఓవర్ కాన్ఫిడెన్స్ ఓడించింది: జగన్‌కి జ్ఞానోదయం

  వైసీపీ నాయకుడు జగన్‌కి జ్ఞానోదయం కలిగింది. ఎన్నికలలో ఓడిపోయి ఇంతకాలం అయిన తర్వాత ఆయనకి తన పార్టీ ఈ ఎన్నికలలో ఎందుకు ఓడిపోయిందో అర్థమైంది. ఆ విషయాన్ని ఆయన అసెంబ్లీలో చెప్పారు. వైసీపీ గెలవటం ఖాయం, తాను ముఖ్యమంత్రి అయిపోవడం ఖాయమని జగన్ కలలు కన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆ కలలన్నీ కల్లలని తేలిపోయింది. ఈ విషయాన్నే జగన్ అసెంబ్లీలో ప్రస్తావిస్తూ, ‘‘తెలుగుదేశం పార్టీ రుణమాఫీ హామీ కారణంగా, మోడీ హవా కారణంగా విజయం సాధించింది. మేం తప్పకుండా గెలుస్తామన్న అతి విశ్వాసంలో మేం వున్నాం. ఆ అతి విశ్వాసమే మా పార్టీని ఓడించింది’’ అని జగన్ చెప్పారు. మొన్నటి ఎన్నికలలో ప్రధాన పోటీ తెలుగుదేశం, వైసీపీ మధ్యలో వుందని, ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని ఆయన అందరికీ తెలిసిన విషయాన్నే మరోసారి చెప్పారు. అలాగే ప్రతిపక్షం అంటే ప్రభుత్వం చేసే ప్రతి పనినీ విమర్శించడం కాదని అన్నారు. మరి ఆయన మాత్రం తెలుగుదేశం ప్రభుత్వాన్ని అప్పుడే అన్నిటికీ విమర్శించడం మొదలెట్టేశారు.

రామచంద్రయ్య తీరు మరీ విచిత్రం

  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని దారుణంగా విభజించి, నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా చాలా దారుణమైన పరిస్థితిలో వుండటానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ. ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నప్పుడు మంత్రి పదవులు వెలగబెట్టిన ప్రతి ఒక్కరూ కారణమే. ఆ కారకుల లిస్టులో మాజీ మంత్రి సి.రామచంద్రయ్య కూడా వుంటారు. రాజ్యసభ సభ్యుడైన రామచంద్రయ్య ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విధాన సభలో కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకుని మోసే ప్రయత్నంలో వున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా తెలుగుదేశం పార్టీని విమర్శించడం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం ఆర్థికంగా చాలా దుర్భరమైన పరిస్థితిలో వుంది. ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలా అని తెలుగుదేశం ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిపోయిన విషయాన్ని గుర్తు చేస్తోంది. అయితే ఇది కాంగ్రెస్ ఎమ్మెల్సీ రామచంద్రయ్యకి అసలు నచ్చడం లేదు. రాష్ట్రం ఆర్థికంగా వెనకబడిపోయిందని, తీవ్ర ఆర్థికలోటులో వుందని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చెప్పడాన్ని శాసనమండలి సభ్యుడు సి.రామచంద్రయ్య భరించలేకపోతున్నారు. ఒక్క హైదరాబాద్ విషయంలో తప్ప మరే విషయంలోనూ ఆంధ్రప్రదేశ్ భేషుగ్గా వుందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ని నాశనం చేయడం కాంగ్రెస్ పార్టీ వంతు.. ఇప్పుడు నాశనమైపోయిందని బాధపడుతున్నా వద్దనడం కూడా కాంగ్రెస్ పార్టీ వంతు అని రామచంద్రయ్య భావిస్తున్నట్టున్నారు. మొత్తమ్మీద రామచంద్రయ్య తీరు మరీ విచిత్రంగా వుందని తెలుగుదేశం నాయకులు అంటున్నారు.

కయ్యానికి కాలుదువ్వుతున్న జగన్ సేన!

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పాలక పక్షానికి అడుగడుగునా అడ్డు తగులుతూ, అయినదానికి కానిదానికి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇబ్బందిపెడుతూ, ఇరుకున పెడుతూ వుండటమే జగన్ పార్టీ నాయకుల ప్రధాన కర్తవ్యంలా కనిపిస్తోంది. అంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో జగన్ పార్టీ నాయకులు, జగన్ అనుసరిస్తున్న తీరును చూస్తుంటే రకరకాల అనుమానాలు కలుగుతున్నాయి. అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక వరకు రాముడు మంచి బాలుడులా వ్యవహరించిన వైసీపీ సభ్యులు ఆ తర్వాతి నుంచి తమ విశ్వరూపం చూపించడం మొదలుపెట్టారు. అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం ముగిసిన వెంటనే వైసీపీ నాయకులు ప్రభుత్వం మీద మాటల తూటాలు విసరడం ప్రారంభించారు. గవర్నర్ ప్రసంగం సంతాప సందేశం చదివినట్టు వుందని ఘాటైన పదజాలం ఉపయోగిస్తూ మాట్లాడారు. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న కమిటీలో చేరకుండానే దానిని ఒక ఇష్యూ చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చ జరిగే సందర్భంలో కూడా వైసీపీ నాయకుడు జగన్ ‌స్వయంగా అధికార పార్టీ మీద విరుచుకుపడ్డారు. మొత్తమ్మీద వైసీపీ వ్యవహార శైలి చూస్తుంటే ఏదోరకంగా తెలుగుదేశం ప్రభుత్వం మీద విరుచుకుపడుతూ వుండటం, నిరంతరం కయ్యానికి కాలుదువ్వుతూ వుండటమే ధ్యేయంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

బస్తీ మే సవాల్! రఘువీరా

  మాజీ మంత్రి రఘువీరా రెడ్డికి ఎవరూ ఊహించని విధంగా ఏపీ పీసీసీ అధ్యక్ష పదవి దక్కినప్పట్టికీ, అది సమయం కాని సమయంలో దక్కడం వలన దాని వలన ఎటువంటి ప్రయోజనమూ లేకుండా పోయింది. ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పొందడమే కాకుండా, పార్టీ మొత్తం ఖాళీ అయిపోయింది. ఇంకా అయిపోతూనే ఉంది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సహజ సిద్దమయిన మేకపోతు గాంభీర్యం మాత్రం అద్భుతంగా ప్రదర్శిస్తూనే ఉన్నారు.   ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదని, అభ్యర్ధులు మాత్రమే ఓడిపోయారని ప్రవచించిన ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ “మా ప్రభుత్వ నిర్ణయాలపై తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని కమిటీలు వేసుకొన్నా మాకేమి భయం, అభ్యంతరం లేదు. కావాలనుకొంటే సిట్టింగ్ జడ్జీతో కూడా విచారణ చేయించుకోవచ్చును. మాకెటువంటి అభ్యంతరమూ లేదు. నిజానికి తెలుగుదేశం పార్టీ యన్టీఆర్ తోనే ముగిసిపోయింది. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నవారు అందరూ నకిలీ సభ్యులే. వారిలో ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీకి చెందినవారే ఉన్నారు. తెదేపా ఇతర పార్టీలవారిని ఆకర్షించి పబ్బం గడుపుకొంటోంది. చివరికి మా పార్టీ యం.యల్సీలను కూడా విడిచి పెట్టడం లేదు. కానీ మా పార్టీ నుండి ఒక్కరు కూడా తెలుగుదేశంలోకి వెళ్లేందుకు సిద్దంగా లేరు. ఒకవేళ ఎవరయినా వెళ్ళదలిస్తే నిరభ్యంతరంగా వెళ్ళవచ్చును. కానీ వెళ్ళే ముందు తమ యం.యల్సీ. పదవులకు కూడా రాజీనామా చేసి వెళితే హుందాగా ఉంటుంది,” అని అన్నారు.   రఘువీరారెడ్డి మేకపోతు గాంభీర్యం మాత్రం అద్భుతంగా ప్రదర్శిస్తున్నప్పటికీ, ఆయన మాటలలో ఆక్రోశం స్పష్టంగా కనబడుతూనే ఉంది. ఆయన అవునన్నా కాదన్నా అనేకమంది కాంగ్రెస్‌కి చెందిన ఎమ్మెల్సీలు తెదేపాలోకి దూకేసేందుకు క్యూ లో నిలబడి ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ యం.యల్సీ.లు చైతన్యరాజు, రవివర్మ, షేక్ హుస్సేన్, లక్షి శివకుమారి, శ్రీనివాసులు నాయుడు, ఇందిర, రెడ్డప్పరెడ్డి, బీ.పుల్లయ్య చంద్రబాబు సమక్షంలో తెదేపా తీర్ధం స్వీకరించారు. ఇంకా చాలా మంది క్యూలో నిలబడి ఉన్నారు కూడా. రఘువీరా రెడ్డి ఇది చాలా అనైతికమని వాదించవచ్చును. కానీ తెలుగుదేశం పార్టీని రెండు ప్రాంతాలలో భూస్థాపితం చేయడానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేయడానికి కూడా వెనకాదలేదనే సంగతి ఆయన ఏవిధంగా మరిచిపోయారు? ఇది అంతకంటే నీచమయిన, దిగజారిన రాజకీయ వ్యూహం కాదు కదా?   రాష్ట్రం విడిపోతోందనే బాధ ఏమాత్రం లేకుండా కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి పదవి కోసం డిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ పైరవీలు చేయడం అయన మరిచిపోయి, ఇప్పుడు తెదేపాను నిందించడం హాస్యాస్పదం. ఆయన తెదేపా నీచ రాజకీయాలు చేస్తోందని ఆరోపిస్తూ, తమ ప్రభుత్వ నిర్ణయాలపై కమిటీలు వేసి విచారణ చేసుకోమని తొడ గొట్టడం దేనికంటే, తద్వారా కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ ప్రత్యర్ధులను ఇరకాటంలో పెట్టేందుకే.   ఆయన కోరినట్లుగానే తెదేపా ప్రభుత్వం సిట్టింగ్ జడ్జీతో విచారణ చేయిస్తే, పార్టీలో ఆయన ప్రత్యర్దులే కాక, కాంగ్రెస్ హయంలో మంత్రులుగా పనిచేసి ప్రస్తుతం తెదేపా ప్రభుత్వంలో కూడా మంత్రులుగా అధికారం చేప్పట్టిన వారి భూభాగోతాలు బయటపడతాయనే ఆలోచనతోనే రఘువీరుడు బస్తీ మే సవాల్ అని తొడగొడుతున్నారని భావించవలసి ఉంటుంది. అదే నిజమయితే స్వంత పార్టీ నేతలకే ఎసరు పెట్టాలని చూస్తున్న ఆయన చేస్తున్న ఈ రాజకీయం ఎటువంటిది?

గవర్నర్ కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమయి ఉండాలా?

  యూపీఏ హయంలో రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేప్పట్టిన నరసింహన్ సమైక్యాంధ్ర, తెలంగాణా ఉద్యమాలు రెండు చూసినవారే. ఆయనే ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణా రెండు రాష్ట్రాలకు గవర్నర్ గ కొనసాగుతుండటంతో ఏ రోటి కాడ ఆ పాట పాడక తప్పని పరిస్థితి ఏర్పడింది. కొద్ది రోజుల క్రితం తెలంగాణా శాసనసభ, శాసనమండలి సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం గొప్పదనం గురించి దాని లక్ష్యాల గురించి తన ప్రసంగంలో వివరించారు. మళ్ళీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్ర ప్రజల మనసులు గాయపడ్డాయని అందుకే కాంగ్రెస్ ను గద్దె దించి చంద్రబాబు ప్రభుత్వానికి పట్టం కట్టారని వివరించారు.   కిరణ్ కుమార్ రెడ్డి హయంలో సమైక్యాంధ్ర ఉద్యమాలు జోరుగా సాగుతున్నపుడు కూడా ఆయనే రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్నారు. అయితే ప్రజల మనసులు గాయపడ్డాయని ఆనాడు ఆయన దైర్యంగా యూపీఏ ప్రభుత్వంతో గట్టిగా చెప్పారో లేదో తెలియదు కానీ ప్రజలు ఏమనుకొన్నా ఖాతరు చేయకుండా యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన చేసి అందుకు తగిన శాస్తి అనుభవించింది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రజల హృదయాలు గాయపడ్డాయని ఇప్పుడు సభాముఖంగా చెపుతున్న గవర్నర్ ఆనాడు కేవలం ప్రేక్షక పాత్ర ఎందుకు పోషించారు? అనేదే ప్రశ్న.   రాష్ట్రానికి ప్రధమ పౌరుడుగా గౌరవం పొందుతున్న ఆయన సమైక్యాంధ్ర, తెలంగాణా ఉద్యమాల సమయంలో ఇరు ప్రాంతాల ప్రజల భావోద్వేగాలను, వారి ఆవేదనను కళ్ళార చూసి కూడా స్పందించకపోవడం, ఇప్పుడు ఆయనే మళ్ళీ ఆ విషయాన్ని స్వయంగా తన ప్రసంగంలో పేర్కొనడం రెండూ ఆశ్చర్యకరమయిన విషయాలే. ఈ విషయంలో ఆయన కేవలం తాను నిమిత్తమాత్రుడనన్నట్లు వ్యవహరించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.   ఆయన ఇదివరకు యూపీఏ ప్రభుత్వానికి అనుకూలంగా, ఇప్పుడు ఆంధ్రాలో ఆంధ్రాకు, తెలంగాణాలో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడవలసి రావడం ఆయన నిర్వహిస్తున్న పదవి రీత్యా సహజమే అనిపించినా, రాష్ట్రానికి ప్రధమ పౌరుడిగా ఆయన రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు, ఆవేదనకు ప్రతిస్పందించి ఉంటే హుందాగా ఉండేది. అందువలన రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరిస్తున్న ఆయన, ఇప్పుడు రెండు ప్రభుత్వాలు ఒకదానితో మరొకటి కలహించుకొంటున్నపుడు ప్రేక్షకపాత్ర వహించి మళ్ళీ రేపు ఎప్పుడో ఇదేవిధంగా సుద్దులు చెప్పినట్లయితే హాస్యాస్పదంగా ఉంటుంది.

ఎర్రచందనానికి ప్రభుత్వం టెండర్

  తీవ్ర ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలపై కొత్తగా ఎటువంటి భారం వేయకుండా ఈ ఆర్ధిక సమస్యల నుండి బయటపడేందుకు ప్రత్యామ్నాయ ఆదాయవనరుల కోసం ఆన్వేషిస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగా అటవీ శాఖ అధికారులు స్మగ్లర్ల నుండి పట్టుకొన్న ఎర్రచందనం దుంగలను అంతర్జాతీయ మార్కెట్ లో అమ్మాలని యోచిస్తోంది. ప్రస్తుతం అటవీశాఖ మరియు దైరేక్తోరేట్ ఆఫ్ రెవెన్యూ డివిజన్ వారి వద్ద దాదాపు 8,000 టన్నుల ఎర్రచందనం దుంగలు చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల గోదాముల్లో పడి ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో వాటి విలువ దాదాపు రూ. 1,200 కోట్లు వరకు ఉంటుందని ఒక అంచనా. ఇంతకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వాటి అమ్మకం కొరకు అనుమతి కోరుతూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కి ఒకలేఖ వ్రాయగా అక్టోబర్ 2013 లోగా అమ్ముకొనేందుకు అందుకు అనుమతి దొరికింది. కానీ ఆ తరువాత ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రాష్ట్రప్రభుత్వం ఎర్రచందనం అమ్మకం చేయలేకపోయింది. అదిప్పుడు తెదేపా ప్రభుత్వానికి కలిసి వచ్చినట్లయింది.   ఇదివరకు ఉన్న 8,000 టన్నులకు తోడు, గత మూడు నాలుగు నెలలో స్మగ్లర్ల నుండి స్వాధీనం చేసుకొన్నది మరో రెండు మూడు వేల టన్నుల వరకు ఉండవచ్చును. ఇప్పుడు ఈ మొత్తం ఎర్రచందనం దుంగలను అమ్ముకొనేందుకు అనుమతి కోరుతూ మళ్ళీ రాష్ట్రప్రభుత్వం డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కి ఒక లేఖ వ్రాయబోతునట్లు సమాచారం. కేంద్రం కూడా రాష్ట్రం పట్ల ఉదారంగా వ్యవహరిస్తోంది గనుక అనుమతి రావడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చును.   కేంద్రం నుండి అనుమతి రాగానే ఎర్రచందనం దుంగల అమ్మకానికి త్వరలోనే రాష్ట్రప్రభుత్వం గ్లోబల్ టెండర్లు పిలిచేందుకు సిద్దపడుతోంది. అయితే వాటి అమ్మకం ద్వారా వచ్చే 12 లేదా 1500 కోట్లతో ప్రభుత్వ సమస్యలు తీరేవి కావు. అదొక తాత్కాలిక ఉపశమనమేనని భావించవచ్చును.

ముగ్గురు ముఖ్యమంత్రులకి మూడింది!

  కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా దుంపనాశనం అయిపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ చుట్టూచేరి భజన చేసే పాతతరం కాంగ్రెస్ నాయకులే అని దేశంలో నిక్కర్లేసుకున్న పిల్లలని అడిగినా చెబుతారు. అయితే వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ ఓటమికి బాధ్యతని తమ భుజాల మీద వేసుకోవడానికి సిద్ధంగా లేరు. నేరమంతా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద వేసి చేతులు దులుపుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా మూడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను కుర్చీమీద నుంచి దించేసి సోనియా భజన చేసే ముసలి నాయకులను ఆ కుర్చీల మీద కూర్చోపెట్టడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. మొదట మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్‌ మీద కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఆయన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలోంచి తప్పించి సుశీల్ కుమార్‌ షిండేని మహారాష్ట్రకి ముఖ్యమంత్రిగా పంపించాలని అనుకుంటుంది. మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికలలో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ మటాషైపోయింది. త్వరలో రాబోతున్న అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ముఖ్యమంత్రిని మారిస్తే సరిపోతుందనుకునే అజ్ఞానంతో కాంగ్రెస్ పార్టీ ఈ దిశగా ముందుకు వెళ్తోంది. అలాగే హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ పదవులకు కూడా కాంగ్రెస్ ఎసరు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. వీరిని ఇంటికి పంపడానికి కూడా గత ఎన్నికలలో ఓటమినే కాంగ్రెస్ పార్టీ సాకుగా చూపుతోంది. దేశంలో కాంగ్రెస్ పార్టీ బాగుపడాలంటే రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ఇంటికి సాగనంపడం కాదు.. సోనియా, రాహుల్ రాజీనామాలు చేసి ఇంట్లో కూర్చోవాలన్న విషయం ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో!

విద్యుత్ పంపకాలపై ముందుకేనంటున్న బాబు

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీ.జెన్.కో. విద్యుత్ పంపకాల ఒప్పందాల రద్దుకు చేసిన అభ్యర్ధనను ఈ.ఆర్.సి. తిరస్కరించినప్పటికీ, ఈవిషయంలో వెనక్కి తగ్గకూడదని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై చంద్రబాబు స్వయంగా కేంద్రానికి లేఖ వ్రాయడమే కాకుండా, త్వరలో డిల్లీ వెళ్ళినప్పుడు స్వయంగా ప్రధానమంత్రి మరియు కేంద్ర విద్యుత్ శాఖా మంత్రితో ఈవిషయం గురించి మాట్లాడాలనుకొంటున్నట్లు తెలుస్తోంది.రాష్ట్ర విభజనలో అన్నిటినీ జనాభా ప్రాతిపదికన విభజించినపుడు విద్యుత్ కేటాయింపులు మాత్రం వినియోగం ఆధారంగా కేటాయించడాన్ని చంద్రబాబు తప్పుపడుతున్నారు. సమైక్య రాష్ట్రంలో రెండు ప్రాంతాల మధ్య జరిగిన ఈ విద్యుత్ కేటాయింపుల ఒప్పందాలలో ఏ ప్రాంతానికి ఎంత నిర్దిష్ట విద్యుత్ కేటాయించాలనే అంశం పేర్కొనబడలేదని, కానీ తెలంగాణా ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. సమైక్యరాష్ట్రంలో జరిగిన ఈ విద్యుత్ పంపిణీ ఒప్పందాలకు రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమీషన్ ఆమోదం తెలుపలేదనే విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసారు.   ఇక ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఏపీ.జెన్.కో. కూడా రాష్ట్ర ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తోంది. విద్యుత్ శాఖ నియమనిబందనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకే ఆయా రాష్ట్రాలలో ఉండే స్థానిక లోడ్ డిస్పాచ్ కేంద్రాలు విద్యుత్ పంపిణీ చేయవలసి ఉంటుందని, అందువల్ల వాటి ప్రతిపాదనలను ఈ.ఆర్.సి. ఆమోదించడం కేవలం లాంఛన ప్రాయమేనని, అటువంటప్పుడు ఆ ప్రతిపాదనలను తిరస్కరించదానికి కూడా వీలులేదని వాదిస్తునట్లు సమాచారం. ఏమయినప్పటికీ ఉభయరాష్ట్రాల విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర కార్యదర్శులు అవసరమయితే ముఖ్యమంత్రులు చర్చించుకొని ఇటువంటి సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకొనే ప్రయత్నం చేయడం మంచిది.

తరిమేవరకూ పదవులు వదలరా?

      పదవులు పట్టుకుని వేలాడటం రాజకీయ నాయకులకు వుండే సహజలక్షణం. తమకు ఆ పదవిలో కొనసాగే అర్హత, నైతిక హక్కు లేదని తెలిసినా పదవిని పట్టుకుని గబ్బిలాల్లా వేలాడుతూనే వుంటారు. అలాంటి కొంతమంది గబ్బిలం బ్యాచ్ రాజకీయ నాయకులలో కొన్ని గబ్బిలాలు తరిమితే పోతాయి. కొన్ని గబ్బిలాలు మాత్రం తరుముతున్నా పోకుండా సదరు సీటును పట్టుకుని వేలాడుతూ వుంటాయి. ప్రస్తుతం కేంద్ర స్థాయిలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో అలాంటి గబ్బిలాలు బోలెడన్ని వున్నాయి. కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ హయాంలో ఎంతోమందిని ఎన్నెన్నో నామినేటెడ్ పోస్టుల్లో పెట్టింది. కొంతమంది పదేళ్ళుగా, మరికొంతమంది కొన్నేళ్ళుగా ఆ పదవులలో సౌఖ్యాలు అనుభవిస్తు్న్నారు. వారిలో కాంగ్రెస్ హయాంలో నియామకాలు పొందిన గవర్నర్లు కూడా వున్నారు. నైతికంగా చెప్పాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పుడు సదరు పెద్దలంతా తమ పదవుల నుంచి తప్పుకోవడం మర్యాద. గవర్నర్ లాంటి పదవుల్లో వున్నవారు మాత్రం కేంద్రం ఆదేశాలు వచ్చేవరకూ పదవుల్లో వుండొచ్చుగానీ, కొర్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థల్లాంటి వాటిలో పదవుల్లో వున్నవారు ప్రభుత్వాలు మారగానే తమ పదవులకు రాజీనామాలు చేయడం అయితే, కేంద్రం, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారి చాలాకాలమవుతున్నా ఇప్పటికీ చాలామంది పదవుల మీద వ్యామోహం తీరక కుర్చీలకు అతుక్కుపోయి కూర్చున్నారు. అలాంటి వారిని వదిలించుకోవడానికి కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టాయి. ప్రభుత్వాలు తరిమేస్తూ వుండటంతో కొంతమంది తమ పదవులకు రాజీనామాలు చేశారు. తాజాగా విపత్తు నివారణ సంస్థకు అధ్యక్షుడిగా వున్న మర్రి శశిధర్ రెడ్డి ప్రభుత్వం ఆదేశించేంత వరకు పదవిని వదల్లేదు. అలాగే మరికొన్ని జాతీయ ప్రభుత్వ సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల్లో వున్నవారు గవర్నమెంట్ తరిమే వరకూ పదవుల్లోనే వేలాడే ఉద్దేశంలో వున్నారు. అలాంటి చాలామందిని ప్రభుత్వాలు వదిలించుకునే పనిలోపడ్డాయి. కొంతమంది గవర్నర్లు అయితే ఈ విషయంలో కోర్టుకు కూడా వెళ్ళేట్టు వున్నారని తెలుస్తోంది. అయితే కేంద్రం తలుచుకుంటే వాళ్ళ పప్పులు ఉడకవనేది సత్యం. ఏది ఏమైనా తరిమేవరకూ పదవులను పట్టుకుని వేలాడటం సరైన పద్ధతి కాదన్న అభిప్రాయాలు ప్రజల్లో వినిపిస్తున్నాయి.

కార్యకర్తల సంక్షేమం కోసం తెదేపాలో వ్యవస్థ ఏర్పాటు

  ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో తెదేపాకు గ్రామ స్థాయి నుండి కూడా చాలా బలమయిన పార్టీ క్యాడర్ ఉందనే సంగతి అందరికీ తెలుసు. గత పదేళ్లలో కార్యకర్తల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చెప్పట్టింది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కార్యకర్తలకు, నిరుపేద కార్యకర్తల పిల్లలు చదువులకు ఆర్ధిక సహాయం చేస్తూ కార్యకర్తలను ఆదుకొంటోంది. అయితే ఈ సంక్షేమ కార్యక్రమాలను నిరంతరంగా నిర్వహించాలంటే దానికి ఒక ప్రత్యేకమయిన నిధి, దానిని నిర్వహించేందుకు ఒక వ్యవస్థ అవసరమని నారా లోకేష్ చేసిన సూచనను పార్టీ ఏకగ్రీవంగా ఆమోదించడమే కాక ఆ భాద్యతను ఆయనకే అప్పగించింది. ఈరోజు తన తండ్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గా లేక వ్యూ గెస్ట్ హౌస్ లో బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలోనే నా రాలోకేష్ కూడా ఈ సంక్షేమ నిధి సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించారు.   ఈ సందర్భంగా నారా లోకేష్ లోకేష్ మాట్లాడుతూ ఒకటి రెండు రోజుల్లోనే కార్యకర్తల సహాయం కోసం (హెల్ప్ లైన్) ఒక ప్రత్యేక ఫోన్ నెంబర్ కేటాయిస్తామని, రెండు రాష్ట్రాలలో కార్యకర్తలు ఎప్పుడయినా ఆ నెంబరుకు ఫోన్ చేసి అవసరమయిన సహాయం పొందవచ్చని తెలిపారు.   సాధారణంగా రాజకీయ పార్టీలకు ఎన్నికల సమయంలోనే పార్టీ కార్యకర్తలు గుర్తుకు వస్తారు. ఆసమయంలో వారిని పూర్తిగా వాడుకొని, అధికారం చేజిక్కించుకొన్నాక మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు వారిని పట్టించుకోరు. అయినప్పటికీ ఏదో ఒకరోజు పార్టీ మేలుచేయకపోతుందా అనే ఆశతో పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటుంటారు. వాటి కోసం తమ కష్టార్జితాన్ని సైతం ఖర్చు చేస్తుంటారు. పార్టీ పిలుపు మేర ధర్నాలు, నిరాహార దీక్షలు చేసి కడుపు మాడ్చుకొంటారు, పోలీసుల లాటీ దెబ్బలు తింటారు, కేసులలో చిక్కుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూ తమ జీవితాలను, తమపై ఆధారపడిన కుటుంబసభ్యుల జీవితాలను కూడా చేజేతులా నాశనం చేసుకొంటుంటారు. అయితే వారి ఈ కష్టానికి ప్రతిఫలం మాత్రం సదరు పార్టీ నాయకులు అనుభవిస్తారు. కార్యకర్తలు వారి కుటుంబాలు పస్తులుంటే, వారి కష్టంతో గెలిచిన నాయకులు మాత్రం విలాసవంతమయిన జీవితం గడుపుతుంటారు.   నారా లోకేష్ ప్రత్యక్ష రాజకేయాలలోకి రాకుండా పార్టీని బలోపేతం చేసే పనిలో ఈ పరిస్థితులన్నిటినీ స్వయంగా చూసారు. అందుకే ఇకపై పార్టీ కార్యకర్తల, వారి కుటుంబాల బాగోగులు పార్టీయే చూడాలని నిర్ణయించుకొన్నారు. ఆ ప్రయత్నంలోనే ఈరోజు కార్యకర్తల సంక్షేమ నిధికి సమన్వయ కర్తగా బాధ్యతలు స్వీకరించారు. దేశంలో మరే పార్టీ చేయని విధంగా పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం, పార్టీయే వారి బాగోగులు చూసుకోవాలని భావించడం నిజంగా చాలా అభినందనీయం. మిగిలిన రాజకీయ పార్టీలు కూడా ఈ పద్ధతి అనుసరిస్తే బాగుంటుంది.

జయలలిత రాజీనామా చేస్తారా లేదా?

  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకి ఇప్పుడు పెద్ద ధర్మసంకటం ఎదురైంది. తమిళనాడులో ఎదురులేని నాయకురాలిగా పరిపాలన చేస్తున్న జయలలిత కోర్టు దగ్గర మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. జయలలిత మీద ఎప్పటి నుంచో వున్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఆమె ఇంతకాలం ఏదో ఒక విధంగా మేనేజ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడా కేసు జయలలితకు పెద్ద తలనొప్పిలా తయారైంది. ఈ కేసులో తమిళనాడు సీఎం జయలలితకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. 66 కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించిన ఈ కేసు విచారణపై విధించిన స్టేను కోర్టు ఎత్తివేసింది. దాంతో ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు ముమ్మరంగా జరిగే అవకాశం వుంది. తన మీద ఒక కేసు దర్యాప్తు జరుగుతూ వుండగా జయలలిత ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడం నైతికంగా ఎంతవరకు కరెక్టన్న వాదన వినిపిస్తోంది. తనపై జరుగుతున్న దర్యాప్తుకు సహకరిస్తూ ఆమె తన ముఖ్యమంత్రి పదవిని వదిలిపెడితే మంచిదన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జయలలిత తన పదవికి రాజీనామా చేస్తారా లేదా అని దేశంలోని రాజకీయ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి.

చంద్రబాబు సమర్ధతకు సవాలుగా మారిన వ్యవసాయ ఋణాలు

    వేలకోట్ల వ్యవసాయ ఋణాలను మాఫీ చేయడం తగదంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాలకు లేఖలు వ్రాసింది. ఒకవేళ ఋణాలు మాఫీ చేయదలిస్తే ప్రభుత్వమే ఆ మొత్తాన్ని నగదు రూపంలో బ్యాంకులకు చెల్లించి మాఫీ చేసుకోవచ్చని కానీ ప్రభుత్వ బాండ్లు పెట్టి మాఫీ కోరడం తగదని స్పష్టంగా చెప్పింది. ఋణాలు మాఫీ చేయకపోతే ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా ఊరుకోరు. మాఫీ చేస్తామంటే ఆర్.బీ.ఐ. ఒప్పుకోవడం లేదు. అందువల్ల రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ల పరిస్థతి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారయింది. కేసీఆర్ ప్రభుత్వానికి కొద్దిగా మిగులు బడ్జెట్ తో ఉన్నందున ఏదోవిధంగా ఈ గండం గట్టెక్కగలదు. కానీ లోటు బడ్జెట్ లో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఈ అప్పుల ఊభి నుండి బయటపడాలంటే చాలా కష్టం.   కేంద్రం చాలా ఉదారంగా ఆదుకొంటే తప్ప అది సాధ్యం కాదు. దేశంలో వివిధ రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి చేసిన హామీలను తీర్చే బాధ్యత ఒకవేళ కేంద్రం తలకెత్తుకొన్నట్లయితే, అదొక సంప్రదాయంగా మారే ప్రమాదం ఉంది. గనుక ప్రధానమంత్రి మోడీ ఈ విషయంలో చంద్రబాబుకి నేరుగా ఆర్ధిక సహాయం చేయక పోవచ్చును. ఒకవేళ కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదుకోవడానికి సిద్దపడినట్లయితే, మిగిలిన ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇటువంటి డిమాండ్లే మొదలయితే అప్పుడు కేంద్రం కూడా ఇరకాటంలో పడుతుంది గనుక ఈ విషయంలో కేంద్రం ఏ మేరకు, ఏ విధంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ, సహకారాలు అందజేస్తుందనేది వేచి చూడాలి.   ఈ సంగతి ముఖ్యమంత్రి చంద్రబాబుకి తెలియదనుకోలేము. ఆర్.బీ.ఐ. నుండి లేఖ అందుకొన్న తరువాత, నిన్న చంద్రబాబు, ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఋణమాఫీపై వేసిన కొండయ్య కమిటీ సభ్యులతో ఈవిషయంపై సుదీర్గంగా చర్చించారు. వ్యవసాయ ఋణాలు మొత్తం అన్నీ కలిపి రూ.59,105కోట్లు ఉన్నట్లు తేలింది. కానీ వాటిని ఏవిధంగా తీర్చాలో మాత్రం తేల్చుకోలేకపోయారు. కానీ ఈవిషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గరాదని మాత్రం ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకు మళ్ళీ కేంద్రాన్నే ఆశ్రయించాలని నిశ్చయించుకొన్నారు. పనిలో పనిగా ఆర్.బీ.ఐ.కు కూడా తాము ఏ పరిస్థితుల్లో పంట ఋణాలు మాఫీ చేసేందుకు అంగీకరించవలసి వచ్చిందో వివరిస్తూ ఒక లేఖ వ్రాసి, ఈ విషయంలో ఆర్.బీ.ఐ. సహకారం కూడా కోరాలని నిర్ణయించేరు. కానీ ఈ రెండు నిర్ణయాల వలన ఎటువంటి ఫలితము ఉండకపోవచ్చును.   రాష్ట్ర విభజన వల్ల చితికిపోయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని తప్పకుండా అన్నివిధాల ఆదుకొంటానని కేంద్రం పదేపదే హామీ ఇస్తుండవచ్చును. కానీ దానర్ధం చంద్రబాబు తలెకెత్తుకొన్న ఈ వేల కోట్ల ఋణభారాన్ని భరిస్తానని మాత్రం కాదని గ్రహించవలసి ఉంటుంది. అటువంటప్పుడు చంద్రబాబే ఈ సమస్యను పరిష్కరించుకోవలసి ఉంటుంది. రైతులకు, ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా, వారిపై కొత్తగా ఎటువంటి ఆర్ధిక భారం మోపకుండా, కేంద్రం నుండి సహాయం అందకపోయినా ఈ జటిల సమస్యను తాను విధించుకొన్న 45రోజుల గడువులో ఏదోవిధంగా పరిష్కరించ వలసి ఉంటుంది. ఆ గడువులో అప్పుడే 10రోజులు పూర్తయిపోయాయి. మిగిలిన ఈ కొద్ది రోజులలో తప్పనిసరిగా ఈ సమస్యకు ఆయన పరిష్కారం కనుగొనవలసి ఉంటుంది. ప్రజలు ప్రతిపక్షాలు కూడా ఆయన ఈ జటిల సమస్యను ఏవిధంగా పరిష్కరిస్తారా? అని ఎదురుచూస్తున్నారు.   ఒకవేళ పరిష్కరించ గలిగితే ఆయన సమర్ధతకు ప్రజలందరూ నీరాజనాలు పడతారు. లేకుంటే విమర్శలు, తీరని అపఖ్యాతి మూటగట్టుకొంటారు. నిజంగా ఇది చంద్రబాబు సమర్ధతకు అగ్ని పరీక్ష వంటిదే! అయితే ఆ పరీక్షను ఆయానే స్వయంగా ఎన్నుకొన్నారు గనుక ఇక ఎవరినీ నిందించడానికి లేదు.

డీఎంకేకి ఖుష్బూ గుడ్ బై.. బీజేపీలోకి..?

      ఒకప్పుడు తమిళ సినిమా రంగంలో టాప్‌ హీరోయిన్‌గా ఒక ఊపు ఊపిన ఖుష్బూ ఆ తర్వాత తమిళనాడు రాజకీయాల వైపు దృష్టి సారించారు. కరుణానిధి నాయకత్వంలోని డీఎంకే పార్టీలో చేరిన ఆమె ఆ పార్టీకి చాలా ఎన్నికలలో ప్రచారం చేశారు. అయితే ఆమె తాజాగా డీఎంకేకి రాజీనామా చేశారు. తాను పార్టీకి సేవలు చేస్తూనే వుంటోంది తప్ప డీఎంకే పార్టీ నుంచి తనకేమీ లభించడం లేదని ఆమె చెప్పింది. డీఎంకేతో తన ప్రయాణం ‘వన్‌ వే’ మాదిరిగా వుందని వాపోతూ ఆమె పార్టీకి రాజీనామా చేశారు.   ఇప్పుడు ఖుష్బూ దృష్టి బీజేపీ మీద పడినట్టు తెలుస్తోంది. ఆమె త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం వుందని రాజకీయ పరిశీకులు అంచనా వేస్తున్నారు. తమిళ రాజకీయాలలో మరో జయలలిత స్థాయిని అందుకోవాలని కలలు కని రాజకీయ రంగప్రవేశం చేసిన ఖుష్బూకి రాజకీయాలలో పెద్దగా అభివృద్ధి కనిపించలేదు. మర్రిచెట్టులాంటి డీఎంకే లాంటి పార్టీ నీడలో వుంటే తమిళనాడు రాజకీయాలలో తాను సాధించేదేమీ  లేదని, కరుణానిధి కుటుంబాన్ని దాటుకుని తాను డీఎంకేలో ఎదిగే అవకాశం లేదని ఖుష్బూ అర్థం చేసుకున్నారు. అందుకే డీఎంకే నుంచి బయటపడి బీజేపీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం బీజేపీకి తమిళనాడులో చెప్పుకోదగ్గ నాయకత్వం లేదు. తాను బీజేపీలో చేరిన పక్షంలో పార్టీలో ఉన్నత స్థానానికి రాగలనని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తోంది. టైమ్ బాగుంటే తమిళనాడు ముఖ్యమంత్రి కావచ్చు. లేకపోతే కేంద్ర స్థాయి రాజకీయాలకు వెళ్ళొచ్చన్న అభిప్రాయంలో ఖుష్బూ వున్నట్టు తెలుస్తోంది. ఖుష్బూ పార్టీలోకి వస్తే చేర్చుకోవడానికి బీజేపీ అగ్ర నాయకత్వం కూడా సిద్ధంగా వున్నట్టు తెలుస్తోంది. ఒక ముస్లిం మహిళ తమ పార్టీలోకి వస్తే బీజేపీ ముస్లింలకు దగ్గరయ్యే అవకాశాలు బలపడతాయని బీజేపీ నాయకత్వం భావిస్తునట్టు సమాచారం.

జగన్‌కి బ్యాడ్ టైమ్ మళ్ళీ మొదలవబోతోందా?

      ఎన్నికల పుణ్యమా అని ఇంతకాలం బెయిల్ మీద తిరుగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేసిన వైసీపీ అధినేత జగన్‌కి మళ్ళీ బ్యాడ్ టైమ్ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. యు.పి.ఎ. ప్రభుత్వం వున్నంతకాలం సోనియా చెప్పినట్టు ఆడిన సీబీఐ ఇప్పుడు ఎన్డీయే హయాంలో కాస్తంత స్వతంత్రంగా పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవినీతి విషయంలో చాలా కఠినంగా వుండే మోడీ హయాంలో సీబీఐ పనితీరు ఆశాజనకంగా వుండొచ్చన్న ఆశలు జనంలో కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ అక్రమాస్తుల కేసులు మళ్ళీ విచారణకు రానున్నాయి. ఈనెల 21 నుంచి జగన్ అక్రమాస్తులకు సంబంధించిన పది కేసులను విచారించడానికి సీబీఐ కోర్టు సన్నాహాలు చేస్తోంది. ఈ పది కేసుల్లోనూ జగన్ మొదటి ముద్దాయిగా వున్నారు. అరబిందో, హెటిరో ఫార్మాలకు సంబంధించిన కేసు ఈనెల 21వ తేదీన సీబీఐ కోర్టు ముందుకు రానుంది. గతంలో బ్యాడ్ టైమ్ నడిచినంతకాలం దాదాపు పదహారు నెలల పాటు జగన్ జైలులో గడపాల్సి వచ్చింది. ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత జగన్ కేసులు మళ్ళీ విచారణకు వస్తున్నాయి. ఈ కేసుల వల్ల జగన్‌కి మళ్ళీ బ్యాడ్ టైమ్ ప్రారంభం కాబోతోందా అనే సందేహాలు రాజకీయ పరిశీలకులలో కలుగుతున్నాయి. ఈనెల 21వ తేదీన సీబీఐ కోర్టు ఎలా స్పందిస్తుందో చూస్తే జగన్‌ భవిష్యత్తు ఎలా వుండబోతోందో అర్థమైపోతుంది.