మల్కాజిగిరి విన్నర్ జేపీయేనా?

      మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎలాగూ కనిపించడం లేదు. వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుస్తాడన్న అనుమానం ఎవరికీ లేదు. ఇక్కడ బీజేపీ బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా మల్లారెడ్డి పోటీలో వున్నారు. అలాగే లోక్‌సత్తా అభ్యర్థిగా జయప్రకాష్ నారాయణ రంగంలో నిలిచారు. బీజేపీ-తెలుగుదేశం మధ్య ఎన్నికల పొత్తు ఉన్నప్పటికీ, మల్కాజిగిరి స్థానంలో తెలుగుదేశం అభ్యర్థి కంటే జయ ప్రకాష్ నారాయణే గెలిస్తే బాగుంటుందన్న అభిప్రాయంలో బీజేపీ నాయకత్వం వున్నట్టు తెలుస్తోంది.   జయప్రకాష్ నారాయణ బీజేపీకి చాలా సన్నిహితంగా వుంటున్న వ్యక్తి. రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి బీజేపీ కేంద్ర నాయకత్వానికి పూర్తిస్థాయి లెక్కలు సమర్పించిన వ్యక్తి ఆయనే. ఐఏఎస్ చదువుకున్న ఇటువంటి వ్యక్తి పార్లమెంట్‌లోకి ప్రవేశించడం మంచిదన్న అభిప్రాయంలో బీజేపీ వుంది. జేపీ పార్లమెంటుకు ఎన్నికైతే మోడీ నాయకత్వంలోని ప్రభుత్వంలో ఆయనకు మంత్రి పదవి కూడా ఆఫర్ చేయాలన్న ఆలోచనలో వున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. దీనితోపాటు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బండారు దత్తాత్రేయకు జేపీ ప్రచారం చేశారు. ఈ కృతజ్ఞత కూడా బీజేపీ నాయకత్వానికి వుంది. ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తు ఎలా వున్నప్పటికీ, మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో జేపీకే మద్దతు ఇచ్చి, తమ ఓట్లన్నీ టీడీపీ అభ్యర్థికి కాకుండా జేపీకే పడేలా చూడాలనే సమాచారం బీజేపీలో అంతర్గతంగా వ్యాపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా అయితే, కాంగ్రెస్ వ్యతిరేక ఓటు, తెలుగుదేశంలో మల్లారెడ్డిని వ్యతిరేకించే వారి ఓట్లు, సీమాంధ్రుల ఓట్లు, జేపీని ఇష్టపడే విద్యావంతుల ఓట్లు.. బీజేపీ మద్దతుతో లభించే ఓట్లతో మల్కాజిగిరి నియోజకవర్గంలో జేపీ గెలిచే అవకాశాలున్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఆళ్ళగడ్డ ఎన్నికపై ఇ.సి. పునరాలోచన?

      ఆళ్ళగడ్డలో వైకాపా అభ్యర్థి శోభా నాగిరెడ్డి మరణించడంతో ఆ స్థానంలో ఎన్నిక నిర్వహించడం మీద ఎన్నికల కమిషన్ రకరకాల గందరగోళాలకు తెరతీసింది. ఆళ్ళగడ్డలో ఎన్నికల నిర్వహణ మీద రోజుకోమాట చెబుతూ వచ్చి ప్రజల్ని అయోమయానికి గురించేసింది. తాజాగా ఆళ్ళగడ్డ ఎన్నిక సందర్భంగా ఈవీఎంలో శోభా నాగిరెడ్డి పేరు కూడా వుంటుందని, ఆమెకు అందరికంటే ఎక్కువ ఓట్లు వస్తే ఆళ్ళగడ్డకు మళ్ళీ ఎన్నిక నిర్వహించబోతున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.   అయితే ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మేధావి వర్గాల నుంచి సాధారణ ప్రజల వరకు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. జీవించిలేని మనిషి పేరును ఈవీఎంలో ఉంచడం, ఆ వ్యక్తికి ఎక్కువ ఓట్లు పడితే మళ్ళీ ఎన్నిక నిర్వహిస్తామనడం ఈ గజిబిజి ఎందుకని ప్రశ్నిస్తున్నారు. శోభా నాగిరెడ్డి మరణంతో విషాదంలో ఉన్న ఆ నియోజకవర్గ ప్రజలు సెంటిమెంట్‌తో ఆమెకే ఓట్లు వేసే అవకాశాలున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఎన్నికల సంఘం మళ్ళీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం వుంటుంది. ఈ గందరగోళం అంతా లేకుండా శోభా నాగిరెడ్డి పేరును ఈవీఎంలో పెట్టకుండా వుంటేనే బాగుంటుందని అనుకుంటున్నారు. కాగా, ఈ విషయంలో ఎన్నికల సంఘం పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో తాను సృష్టించిన గందరగోళానికి తానే తెరవేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని సవరించే అవకాశం వున్నట్టు సమాచారం అందుతోంది.

జగన్ విజయ రహస్యాలు

  జగన్మోహన్ రెడ్డి బలమంతా తన తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డికి ప్రజలలో ఉన్న ఆదరణ, సానుభూతేనని చెప్పవచ్చును. నిజానికి దీనిని బలం కంటే బలహీనతగానే చెప్పుకోవలసి ఉంటుంది. ఎందుకంటే ఆయనపోయి ఐదేళ్ళు అవుతున్నా కూడా నేటికీ ఆయన పేరు చెప్పుకొనే ప్రజలను ఓట్లు అడుగుతున్నారు తప్ప జగన్ తన స్వంత పార్టీ సిద్దాంతాలు, దాని బలం, తన శక్తి యుక్తులు ఆధారంగా ఓట్లు అడగలేకపోతున్నారు. ఇంతవరకు ఒక్కసారి కూడా ఆయన పార్టీ అధికారం చెప్పట్టలేదు గనుక ఆయన తన శక్తి సామర్ధ్యాలు నిరూపించుకోలేకపోయారు. బహుశః ఆ కారణం చేతనే ఆయన తన తండ్రి పేరు ప్రతిష్టలను ఆయన మరణం తాలూకు సానుభూతిని పెట్టుబడిగా పెట్టి అధికారంలోకి రావాలని తపిస్తున్నారు.   ఈ రోజుల్లో ఏకంగా ఐదేళ్ళపాటు జగన్ తన తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణం తాలూకు సానుభూతిని ప్రజలలో యధాతధంగా నిలిపి ఉంచగలగడం సాధారణమయిన విషయమేమీ కాదు. జగన్ ఓదార్పు యాత్రలు, షర్మిల పాదయాత్రలు, విజయమ్మ సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజలలో నేటికీ అదే స్థాయిలో సానుభూతి నిలుపుకోగలిగారు. ఇక దానిని ఇప్పుడు ఓట్ల రూపంలో మార్చుకోగలిగితే వారి ప్రయత్నంలో నూటికి నూరు శాతం సఫలం అయినట్లే. ఈ ముగ్గురు కలిసి సమిష్టిగా చేసిన ఈ ప్రయత్నం అంతా పార్టీని బ్రతికించుకోవడానికే అయినప్పటికీ, వారు మాత్రం తాము ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడే త్యాగాలు చేసామని చెప్పడం కూడా గొప్ప ఆలోచనే. ప్రజలని ఓదార్చే మిషతో వారికి దగ్గరయ్యి, వారిలో ఆ సానుభూతి కరిగిపోకుండా చూసుకొంటూ, తన పార్టీని మెల్లగా బలోపేతం చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.   ఇటీవల తెలంగాణాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్ “త్వరలోనే షర్మిల తెలంగాణాలో కూడా ఓదార్పు యాత్ర చేప్పట్టబోతోందని” ప్రకటించారు. మళ్ళీ నిన్న హైదరాబాదులో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన “ఈ ఎన్నికలలో కాకపోతే వచ్చే ఎన్నికలలో అయినా తెలంగాణాలో తప్పక గెలుస్తామని” అన్నారు. ఈ రెండు ప్రకటనలను కలిపి చూసినట్లయితే ఆయన ఓదార్పు యాత్రలు పార్టీని బలోపేతం చేసుకోవదానికేనని స్పష్టంగా అర్ధమవుతుంది. అటువంటప్పుడు అది ఏవిధంగా ‘త్యాగం’ అవుతుందో వారికే తెలియాలి. వారు తమ పార్టీని బలోపేతం చేసుకోదలిస్తే దానికి ఎవరు అభ్యంతరం చెపుతారు? ఒక రాజకీయ పార్టీగా వారికి ఆ హక్కు ఎప్పుడూ ఉంటుంది. దానికి ఓదార్పు, త్యాగమనే సబ్ టైటిల్స్ ఎందుకు?   ఇక వారు ముగ్గురూ కలిసి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి వలన సామాన్య ప్రజలకు అందిన కొన్ని సంక్షేమ కార్యక్రమాల గురించి గట్టిగా ప్రచారం చేస్తూ, జగన్ పై అనేక అవినీతి కేసులున్నాయనే విషయాన్ని కూడా ప్రజలు పట్టించుకోకుండా ఉండేలా చేయలనుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. పోలీసు స్టేషన్ గడప తొక్కడమే అవమానంగా భావించే ప్రజలకి, పద్దెనిమిది నెలలు జైలులో ఉండి వచ్చిన జగన్, అది తన సహనానికి, పట్టుదలకి ప్రత్యర్ధ పార్టీలు పెట్టిన అగ్నిపరీక్షగా చెపుతూ దానిలో తాను విజయవంతంగా నెగ్గి బయటకు వచ్చిన గొప్ప వీరుడిగా ప్రజలను నమ్మింపజేయాలని ప్రయత్నించడం చేయడం చూస్తే ప్రజలకు అసలు లోకజ్ఞానం, రాజకీయ అవగాహన వంటివి ఏవీ ఉండవని వారు భావిస్తున్నట్లు కనబడుతోంది.   సాధారణంగా ఎవరయినా జైలుకెళ్ళి వచ్చినవారు సమాజంలో చులకనవుతారు. కానీ జగన్ మాత్రం తాను ప్రజల కోసం చేస్తున్న పోరాటం కారణంగానే అన్యాయంగా జైలు పాలయ్యాననే ఒక భావనను ప్రజలలో వ్యాపింపజేస్తూ, తనను తాను ఒక త్యాగమూర్తిగా ప్రదర్శించుకొంటున్నారు. ఇటువంటి వ్యవహారాల వలన వేరెవరయినా అయితే అప్రదిష్ట మూటగట్టుకొంటారు. కానీ జగన్ మాత్రం దానిని కూడా ప్రజల సానుభూతి పొందే అంశంగా మలుచుకొని ఓట్లు రాల్చుకోవాలని కలలు కంటున్నారు.   ఒక అబద్దాన్ని వందసార్లు నిజమని గట్టిగా వాదించగలిగితే అది చివరికి నిజమయిపోతుందని జగన్, షర్మిల, విజయమ్మ నిరూపించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఈ ఎన్నికలలో వైకాపా విజయం సాధించి, జగన్ ముఖ్యమంత్రి అవ్వగలిగితే, ప్రజలను మభ్యపెట్టడంలో వారు ముగ్గురూ విజయవంతం అయినట్లేనని అంగీకరించక తప్పదు. 

కేంద్ర మంత్రి పదవిపై పవన్ కళ్యాణ్ ఆశలు!

      బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రధాని పీఠం మీద ఆశలు పెట్టుకున్నాడో లేదోగానీ, బీజేపీ, టీడీపీ కూటమి తరఫున ప్రచారం చేస్తున్న పవన్ కళ్యాణ్ మాత్రం కేంద్ర మంత్రి పదవి మీద గొంతు వరకూ ఆశలు పెట్టేసుకున్నట్టు కనిపిస్తోంది. కేంద్ర మంత్రి పదవి మీద మోడీ ఆశ పెట్టాడో, ఈయనకి ఈయనే ఊహించేసుకుని ఎన్నికల ప్రచారంలో ఎడాపెడా పాల్గొంటున్నాడోగానీ, మొత్తమ్మీద పవన్ కళ్యాణ్ వరస చూస్తుంటే కేంద్ర మంత్రి పదవి మీద కూర్చోవాలని ఉబలాటపడిపోతున్నట్టు అర్థమవుతూనే వుంది.   తనకి కేంద్ర మంత్రి పదవి వస్తే జనాలు ఒక్కసారిగా షాక్ తినకుండా పవన్ అందర్నీ మానసికంగా ప్రిపేర్ కూడా చేస్తున్నాడు. మొన్న కామారెడ్డి సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ తన కేంద్ర మంతి ‘కళ’లను ప్రదర్శించాడు. తాను భవిష్యత్తులో సినిమాలలోఎక్కువగా నటించనని, తాను దేశసేవలోనే నిమగ్నమవ్వాలని అనుకుంటున్నానని ప్రకటించేశాడు. ఈరోజుల్లో పవన్ కళ్యాణ్ లాంటివాళ్ళు ‘దేశసేవ’ చేయాలంటే మంత్రి పదవి కంపల్సరీ కదా! రేపు బీజేపీ అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్‌కి అర్జెంటుగా రాజ్యసభ మెంబర్‌షిప్ ఇచ్చేసి, కేంద్రమంత్రి పదవిని తాంబూలంలో పెట్టి అప్పగిస్తుందని పవన్ కళ్యాణ్ సన్నిహితులు అనుకుంటున్నారు. చిరంజీవి కి కాంగ్రెస్ పార్టీ కేంద్ర సహాయమంత్రి పదవి మాత్రమే ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్‌కి కేబినెట్ హోదా వున్న కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు. ఈ ఆశలన్నీ నిజమవుతాయా, పవన్ కళ్యాణ్‌ని కూరలో కరేపాకులా వాడేసుకున్నారా అనే విషయం రాబోయే రోజుల్లో తెలుస్తుంది.

సీమంద్రాలో తెదేపా బలాబలాలు

  సమైక్యాంధ్ర ఉద్యమాలతో అస్తవ్యస్తమయిన సీమాంధ్ర, ఇప్పుడు రాష్ట్ర విభజనతో ప్రధాన ఆదాయం కోల్పోయి మరింత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొనవలసి ఉంటుంది. సరిగ్గా ఇదే సమయంలో రాష్ట్ర పునర్నిర్మాణం కూడా జరగవలసి ఉంది. ఇవి చాలవన్నట్లు అధికారం చేజిక్కించుకోవడం కోసం అన్ని పార్టీలు చేసిన ఉచిత వాగ్దానాలు కొన్నయినా తప్పనిసరిగా అమలు చేయవలసి ఉంటుంది. వీటన్నిటినీ ఏక సమయంలో సమర్ధంగా చక్కబెట్టగలవాడికే ప్రజలు పట్టం కట్టాలని భావించడం సహజం. మంచి పరిపాలనాదక్షుడు, రాజకీయ అనుభవజ్ఞుడు, కేంద్రంతో సత్సంబంధాలున్నవ్యక్తి, పార్టీవైపే ప్రజలు మొగ్గు చూపడం సహజం.   అంటే పరిస్థితులు చంద్రబాబుకు, ఆయన పార్టీకి చాలా అనుకూలంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీనిని చంద్రబాబు, పవన్, మోడీ, తెదేపా అభ్యర్ధులు బలంగా ప్రచారం చేసుకోగలిగితే, తెదేపాకు లబ్ది చేకూరవచ్చును. ఈసారి తేదేపాకు ప్రధానంగా కలిసి వస్తున్న అంశం ప్రజలలో కాంగ్రెస్ పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేఖత, ఆ కారణంగా పూర్తిగా కాంగ్రెస్ బలహీనపడి ఉండటం. ఇక కొమ్ములు తిరిగిన కాంగ్రెస్ నేతలు ఈసారి తెదేపా టికెట్ పై పోటీ చేస్తుండటం తెదేపాకు కలిసివచ్చే అంశమే.   దేశ వ్యాప్తంగా మోడీకి అనుకూల పరిస్థితులు కనిపిస్తున్న ఈతరుణంలో తెదేపా బీజేపీతో జత కట్టడం కూడా పార్టీకి ఎంతో కొంత మేలు చేయబోతోంది. ఇక తెలంగాణాలో తనకు ఎదురేలేదని భావిస్తున్న కేసీఆర్ అంతటివాడిని దైర్యంగా ఎదుర్కొని తాట తీస్తానని హెచ్చరించి అభిమానుల దృష్టిలో రియల్ లైఫ్ హీరోగా ఎదిగిన పవన్ కళ్యాణ్ ఈసారి పార్టీకి వరంగా మారారు.   చంద్రబాబు చాలా కాలంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేఖంగా పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకి పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ కూడా తోడయితే, తెదేపా మరింత బలపడే అవకాశం ఉంటుంది. కేసీఆర్ ను ద్దేకొని వచ్చిన పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డిని కూడా అంతే బలంగా డ్డీ కొనడం తధ్యం. త్వరలో సీమాంద్రాలో ఎన్నికల ప్రచారానికి రానున్న నరేంద్ర మోడీ కూడా ఇదే అంశం గట్టిగా ప్రస్తావించబోతున్నారు.   కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్న ఆయన సోదరుడు చిరంజీవి ప్రజలను ఎంతమాత్రం ఆకట్టుకోలేకపోయినందున, మెగాభిమానులు, యువత, కూడా పవన్ కళ్యాణ్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఆ విధంగా కూడా తెదేపా-బీజేపీ అభ్యర్ధులు ప్రయోజనం పొందనున్నారు.   ఇక గల్లా జయదేవ్ తరపున మహేష్ బాబు ట్వీటర్ ద్వారా జయదేవ్ కు మద్దతు ప్రకటించి, అభిమానులను కూడా కోరారు. కానీ, ఆయన ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారో లేదో ఇంకా ప్రకటించలేదు. ఒకవేళ మహేష్ బాబు కూడా తెదేపా తరపున కనీసం గుంటూరు జిల్లా అంతటా ప్రచారం చేసినా అది తెదేపాకు చాలా లబ్ది కలిగించవచ్చును.   ఇక తెదేపాకు ఉన్నత కులాల మద్దతు ఎంత ఉందో బీసీ, కాపు కులస్థుల మద్దతు కూడా అంతే ఉంది. ఇక 13 జిల్లాలలో తెదేపాకున్న బలమయిన క్యాడర్, మంచి అంగబలం, అర్ధ బలం ఉన్న అభ్యర్ధులు, నాయకులు వారికి ఆయా ప్రాంతాలపై ఉన్న మంచిపట్టు అన్నీ కూడా తెదేపాకు కలిసి వచ్చే అంశాలే.   ఇదేవిధంగా తేదేపాకు కొన్ని వ్యతిరేఖ అంశాలు కూడా ఉన్నాయి. ఏ దేశముదురు కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకొని అవలీలగా గెలవాలని తెదేపా భావిస్తోందో, సరిగ్గా వారివలననే పార్టీకి నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. కారణం ప్రజలలో వారిపట్ల, కాంగ్రెస్ పట్ల నెలకొని ఉన్నతీవ్ర వ్యతిరేఖతే. ఈసారి బీజీపీతో జత కట్టి ప్రయోజనం పొందాలని భావిస్తున్న తెదేపా, ఆ పార్టీ కారణంగానే, ముస్లిం ఓట్లు కోల్పోయే అవకాశం ఉంది. ఇక ఈసారి ఎన్నికలలో జూ.యన్టీఆర్ లేని లోటు చాలా స్పష్టంగా కనబడుతోంది. ఆయన ప్రచారంలో పాల్గొనక పోవడం వలన, కనీసం 1-2 శాతం ఓట్లు వదులుకోకతప్పదు.

మోడీ అంటే మండిపడుతున్న నలుగురు అమ్మలు

      దేశమంతటా మోడీ హవా నడుస్తోంది. మోడీకే ఓటేద్దాం అనే మాట వినిపిస్తోంది. ఎవర్ని కదిలించినా మోడీ గురించి చెబుతున్నారు. దేశానికి కాబోయే ప్రధానమంత్రి మోడీయే అని చెబుతున్నారు. ఇలా అన్ని చోట్లా మోడీ గురించి బాగానే అనుకుంటున్నారు. కానీ దేశంలో నాలుగు మూలల్లో వున్న నలుగురు అమ్మలు మాత్రం మోడీ గురించి తమకు చేతనంతగా బ్యాడ్ ప్రాపగాండా చేస్తున్నారు. ఆ నలుగురు అమ్మలు ఎవరయ్యా అంటే, సోనియాగాంధీ, జయలలిత, మమతా బెనర్జీ, మాయావతి. ఈ నలుగురు అమ్మలూ మోడీ అంటే ఎందుకు మండిపడుతున్నారంటే....   సోనియాగాంధీ: ఈ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేసి తాను రిటైరై రెస్టు తీసుకోవాలని అనుకున్నారు. అయితే బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీ ఎంటర్ కావడంతో సీన్ రివర్సయిపోయింది. మోడీ ఎంత సమర్థుడో దేశానికి తెలియడంతోపాటు ఆయనతో పోల్చి రాహుల్‌ గాంధీని ఎవరూ లెక్కచేయడం లేదు. అక్కడొచ్చింది. తేడా. జయలలిత, మమతా బెనర్జీ, మాయావతి: ఈసారి తానే ప్రధానమంత్రి కాబోతున్నానని కలలు కంటోన్న జయలలిత, మమతా బెనర్జీ, మాయావతి కలల మీద మోడీ నీళ్ళు కుమ్మరించాడు. ఈ ముగ్గురమ్మలూ ఎన్ని తంటాలు పడినా పీఎం అయ్యే అవకాశం లేకుండా చేశాడు. దాంతో ఈ ముగ్గురు కూడా అకారణంగా మోడీ మీద విరుచుకుపడుతున్నారు.  

ఇక జగన్ తో చంద్రబాబు ఢీ

    తెలుగుదేశం పార్టీ సీమాంద్రాతో పోలిస్తే తెలంగాణాలో చాలా బలహీనంగానే ఉందని చెప్పక తప్పదు. పైగా చంద్రబాబు అనుసరించిన వైఖరి వలన తెలంగాణాలో పార్టీకి కొంత వ్యతిరేఖత కూడా ఉంది. మాటల మాంత్రికుడు కేసీఆర్ తెదేపాపై చేసిన విషప్రచార ప్రభావం కూడా ఎంతో కొంత తప్పకుండా ఉంటుంది. ఈవిధంగా తెలంగాణాలో తెదేపాకు అన్ని విధాల వ్యతిరేఖత కనబడుతుంటే, కాంగ్రెస్, తెరాసలకు మాత్రం తెలంగాణా సాధించిన భుజకీర్తులు అదనంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా తెలంగాణాలో కాంగ్రెస్, తెరాసలకు ధీటుగా తెలుగుదేశం పార్టీని నిలబెట్టగలిగిన ఘనుడు చంద్రబాబు. అక్కడ ఎన్నికల ప్రచారం ముగించుకొని ఇక ఇప్పుడు తనకు బాగా పట్టున్న ఆంధ్ర ప్రాంతంపై చంద్రబాబు దృష్టి సారించనున్నారు. ఈసారి ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ లెక్కలో లేకపోయినప్పటికీ, దానికి బదులుగా వైకాపాను, ముఖ్యంగా దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు ఎదుర్కోవలసి ఉంటుంది. తెలంగాణాలో కాంగ్రెస్, తెరాసలపై బీసీ అస్త్రం ప్రయోగించి నిలువరించ గలిగిన చంద్రబాబు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పై ఎటువంటి అస్త్రాలు సంధిస్తారో అందరికీ తెలుసు. ఆయన ప్రధానంగా జగన్ పై ఉన్న సీబీఐ కేసులు, ఆయన తండ్రి హయాంలో జగన్ చేసిన అవినీతి భాగోతాలు, కాంగ్రెస్ పార్టీతో ఆయనకున్న రహస్య అవగాహన వంటివి ప్రస్తావించడం తధ్యం. అటువంటి అవినీతిపరుడు, పరిపాలనానుభవం లేనివాడికి ఓటేస్తే అది కొరివితో తల గోక్కోన్నట్లే అవుతుందని ప్రజలకు హితబోధ చేయవచ్చును.

24 గంటలు అయిపోయాయి హరీష్‌రావ్?!

      పవన్ కళ్యాణ్ హరీష్ రావు మీద కొన్ని ఆరోపణలు చేశాడు. హరీష్ రావుకి బొత్సతో వ్యాపార సంబంధాలున్నాయని ఆరోపించాడు. వాటికి హరీష్ రావు వీరావేశంగా స్పందించాడు. తనకు బొత్సతో ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని రంకెలేసి మరీ చెప్పాడు. తన లాంటి అమాయకుడి మీద పవన్ కళ్యాణ్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని హరీష్ విరుచుకుపడ్డాడు. పవన్ కళ్యాణ్ అర్జెంటుగా బుద్ధి తెచ్చుకుని, 24 గంటల్లోగా తనకు క్షమాపణ చెప్పాలని, లేకపోతే తాను పవన్ కళ్యాణ్ మీద పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించేశాడు. హరీష్ రావు ఈ భారీ ప్రకటన చేసి 24 గంటలు ఎప్పుడో గడిచిపోయాయి. ఇంతవరకు హరీష్ రావు పవన్ కళ్యాణ్ మీద పరువునష్టం దావా వేయలేదు. ఎందుకు వేయలేదో.. తనకు పరువే లేదని హరీష్ అనుకున్నాడో ఏంపాడో. అయినా రాజకీయ నాయకులు ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వడం, ఆ తర్వాత వాటిని పట్టించుకోకుండా వుండటం మామూలే కదా. అందువల్ల హరీష్ రావు స్టేట్‌మెంట్‌ని మనమూ పట్టించుకోకుండా వుంటే సరి.

ఆళ్ళగడ్డ ఎన్నిక: కన్ఫ్యూజ్ చేస్తున్న ఎన్నికల కమిషన్

      ఆళ్ళగడ్డ ఎన్నిక విషయంలో ఎన్నికల సంఘం జనాన్ని అయోమయానికి గురి చేస్తోంది. ఆళ్ళగడ్డ నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆమె మరణించడంతో ఆళ్ళగడ్డ ఎన్నికను వాయిదా వేస్తారని అందరూ భావించారు. అయితే ఎన్నికల కమిషన్ ఎక్కడో వున్న ఒక లా పాయింట్ బయటకి తీసుకొచ్చి, వైసీపీ ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ చేసుకున్న పార్టీయే తప్ప గుర్తింపు వున్న పార్టీ కాదు కాబట్టి శోభా నాగిరెడ్డి మరణించినా అక్కడ ఎన్నిక వాయిదా వేయాల్సిన అవసరం లేదని తీర్మానించింది. సరేలే అన్నీ తెలిసిన ఎన్నికల కమిషన్ చెప్పింది కదా అని అందరూ ఊరుకున్నారు.  ఈ పాయింట్ చెప్పిన ఎన్నికల కమిషనే మరో పాయింట్ కూడా చెప్పింది. ఈవీఎంలో శోభా నాగిరెడ్డి పేరు వున్న బటన్ పని చేయదని మొదట్లో చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ శోభా నాగిరెడ్డి పేరు మీద బటన్ నొక్కితే ఆ ఓటు ‘నోటా’ అకౌంట్లో చేరుతుందని చెప్పింది. మళ్ళీ ఇంకోసారి శోభా నాగిరెడ్డి తర్వాతి స్థానంలో నిలిచిన వ్యక్తి ఆళ్ళగడ్డ ఎన్నికలో గెలిచినట్టు ప్రకటిస్తామని తెలిపింది. ఇప్పుడు తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఎన్నికలల ఆళ్ళగడ్డలో శోభా నాగిరెడ్డికి అత్యధిక.. అంటే మరో అభ్యర్థికంటే ఎక్కువ ఓట్లు వచ్చిన పక్షంలో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తుందట. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ వైసీపీకి రాసిన లేఖలో తెలిపింది. అసలు మరణించిన వ్యక్తి పేరును ఈవీఎంలో ఉంచడం ఎందుకు? ఆ వ్యక్తికి ఎక్కువ ఓట్లు వస్తే ఉప ఎన్నిక నిర్వహించడం ఎందుకు? ఈ ఎన్నికల కమిషన్ ఎవరికీ అర్థంకాదు.

పవన్ కళ్యాణ్ బకరా కానున్నారా?

  ఇటీవల తెలంగాణాలో వరుసపెట్టి నాలుగు సభలలో మాట్లాడిన నరేంద్ర మోడీ, తన ప్రసంగాలలో తెరాసను కానీ, దాని అధ్యక్షుడు కేసీఆర్ ను గానీ గట్టిగా విమర్శించలేదు. అందువల్ల శాస్త్రం కోసమనట్లు ఏదో మొక్కుబడిగా తెరాస గురించి ఓ రెండు ముక్కలు మాట్లాడి సరిబెట్టేసారు. అయితే, ఈమధ్యనే జనసేన పార్టీతో రాజకీయాలలో ప్రవేశించిన పవన్ కళ్యాణ్ తెదేపా-బీజేపీ కూటమికి తన మద్దతు తెలుపడమే కాకుండా వారి అభ్యర్ధుల తరపున తెలంగాణా లో చాల గట్టిగానే ప్రచారం చేస్తున్నారు.   ఆ ప్రచారంలో ఆయన కాంగ్రెస్, తెరాసలపై చాలా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. “కేసీఆర్! పిచ్చిపిచ్చి కూతలు కూస్తే నీ తాట తీస్తా!” అంటూ తీవ్రంగా హెచ్చరించారు కూడా. అయితే కాంగ్రెస్ పార్టీ ఆయన విమర్శలను ఎంత మాత్రం పట్టించుకొన్నట్లు కనబడలేదు, కానీ కేసీఆర్ మాత్రం అంతే దీటుగా ప్రతిస్పందిస్తూ ‘నేను చిటికేస్తే కనబడకుండా పోతావని’ గట్టిగానే హెచ్చరించారు. పనిలోపనిగా చంద్రబాబుని, నరేంద్ర మోడీని కూడా మరోమారు తీవ్రంగా విమర్శించారు.   ప్రస్తుతం చంద్రబాబు, కేసీఆర్ ఒకరినొకరు ఎంతగా విమర్శించుకొన్నా, ఎన్నికల తరువాత ఒకవేళ ఇరువురూ ఆంధ్ర తెలంగాణాలలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలిగితే అప్పుడు వారు ఒకరికొకరు సహకరించుకొన్నా ఆశ్చర్యం లేదు. లేదా అసలు ఒకరినొకరు ఎంత మాత్రం పట్టించుకోకపోవచ్చును. అదేవిధంగా ఒకవేళ కేంద్రంలో మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం, తెలంగాణలో తెరాస అధికారంలోకి వచ్చినట్లయితే, అప్పుడు తెలంగాణా అభివృద్ధికి కేంద్రం నుండి నిధులు, సహకారం కావలసి ఉంటుంది గనుక, కేసీఆర్ తాను ఇప్పుడు నోరారా తిడుతున్న మోడీకే తప్పనిసరిగా మద్దతు ఈయవచ్చును. బహుశః ఎన్నికల తరువాత తెరాస మద్దతు అవసరం ఉండవచ్చనే ముంచు చూపుతోనే మోడీ కూడా కేసీఆర్ పై ఎటువంటి విమర్శలు చేయలేదనుకోవాలి. ఒకవేళ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాలేకపోతే అప్పుడు మోడీ గుజరాత్ తిరుగు ప్రయాణమయిపోవడం తధ్యం. అప్పుడు మధ్యలో నష్టపోయేది ఈ రాజకీయాలు తెలియని పవన్ కళ్యాణ్ మాత్రమే. అంటే వీరందరరి కోసం మధ్యలో పవన్ కళ్యాణ్ బకరా అయ్యేరనుకోవచ్చును.   ఎన్నికల తరువాత ఒకవేళ తెరాస ప్రభుత్వ పగ్గాలు చేపట్టి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆయన తన తాట తీస్తానని హెచ్చరించినందుకు పవన్ కళ్యాణ్ పై కక్ష సాధింపు చర్యలు చేపడితే, మరి అప్పుడు మోడీ కానీ చంద్రబాబు గానీ ఆయనను ఆదుకొనేందుకు వస్తారో లేదో పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవడం మేలు.

మోడీని అడ్డుకొనేందుకు రాహుల్ త్యాగానికి సిద్దం?

  ఎదుటవాడివి రెండు కళ్ళు పోతాయంటే అందు కోసం తనది ఒక కన్నుపోగొట్టుకోవడానికి సిద్దపడే నేతలు పార్టీలు మనకి చాలానే ఉన్నాయి. వాటిలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ 100 సీట్లు, బీజేపీకి 200 సీట్లు వరకు రావచ్చని, ఎట్టిపరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అటు కేంద్రంలో, ఇటు ఆంధ్ర, తెలంగాణాలలో కానీ అధికారంలోకి వచ్చే అవకాశంలేదని సర్వేలన్నీ ఘోషిస్తున్నా కూడా విజయం తమదే అంటూ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.   రాష్ట్రంలో సంగతి ఎలా ఉన్నప్పటికీ, ఈసారి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాలేకపోయి, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కుర్చీలో స్థిరపడితే, బహుశః రాహుల్ గాంధీ ఇక తన జీవితంలో ఎన్నడూ ప్రధానమంత్రి అయ్యే అవకాశం దక్కకపోవచ్చును. అందువల్ల ఒకవేళ తమకు అధికారం దక్కకపోతే, నరేంద్ర మోడీకి కూడా ఆ అవకాశం దక్కనీయకూడదనే కృత నిశ్చయంతో కాంగ్రెస్ సరికొత్త వ్యూహం అమలుచేయడానికి సిద్దం అవుతోంది.   బీజేపీ స్వయంగా 272 సీట్లు సాధించాలననే లక్ష్యంతో గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. కానీ తాజా లెక్కలు ప్రకారం బీజేపీకి 200 యంపీ సీట్లు, ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు అన్నీకలిసి మహా అయితే మరో 40-50 సీట్లు మాత్రమే సాధించగలవని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. 552 సీట్లున్న లోక్ సభలో, కనీసం 272 సీట్లు సాధించిన పార్టీ లేదా కూటమికి మాత్రమే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేసే అవకాశం దక్కుతుంది. అంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి కనీసం మరో 20-30 సీట్లు అవసరం ఉంటాయి. ఇటువంటి పరిస్థితి ఎదురయితే, దేశంలో చిన్న చితకా పార్టీలను, తమిళనాడులో రెండు పార్టీలలో దేనినో ఒకదానిని దువ్వి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ తెర వెనుక ప్రయత్నాలు మొదలుపెట్టింది.   కాంగ్రెస్ కూడా సరిగ్గా ఇదే వ్యూహం అమలు చేసేందుకు అప్పుడే పావులు కదుపుతోంది. మతతత్వ బీజేపీని, నరేంద్రమోడీని అధికారం చేపడితే అది దేశానికే చాలా ప్రమాదమని, అందువల్ల సెక్యులర్ పార్టీలన్నీ తమతో చేతులు కలిపాలని, అందుకు వారు అంగీకరిస్తే, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తాము థర్డ్ ఫ్రంట్ కి మద్దతు ఇచ్చేందుకు కూడా సిద్దమని కాంగ్రెస్ ప్రకటించింది. థర్డ్ ఫ్రంట్ నేతలు కాంగ్రెస్ ప్రతిపాదనను స్వాగతించడం, హర్షం ప్రకటించడం కూడా జరిగిపోయాయి.   థర్డ్ ఫ్రంటులో ములాయం సింగు, మాయావతి, జయలలిత, నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి కనీసం ఒక అరడజను మంది నేతలు తమ జీవితంలో ఒక్కసారయినా ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోవాలని తహతహలాడిపోతున్నారు. అయితే థర్డ్ ఫ్రంట్ కూడా ఎట్టి పరిస్థితుల్లో మెజార్టీ సాధించలేదు కనుక వారి కలనెరవేరే అవకాశం కూడా లేదు. అందువల్ల అటువంటి వారితో కూడిన థర్డ్ ఫ్రంట్ కి మద్దతు ఇస్తే, ప్రస్తుతం రాహుల్ గాంధీ ప్రధాని కాలేకపోవచ్చునేమో కానీ మోడీ కూడా ప్రధాని కాకుండా అడ్డుకోవచ్చును.   దురాశాపరులయిన థర్డ్ ఫ్రంట్ నేతల చేతిలో అధికారం పెట్టినట్లయితే వారు దేశాన్ని మరింత భ్రష్టు పట్టించడం ఖాయం. కనుక అప్పుడు ప్రజలు వారికంటే కాంగ్రెస్ పాలనే నయమనుకొనే రోజులు మళ్ళీ తప్పక వస్తాయి. ప్రస్తుతం మోడీని ప్రధాని కాకుండా అడ్డుకోగలిగితే, ఆయన గుజరాత్ తిరిగి వెళ్లిపోవడం తధ్యం. ఆనక థర్డ్ ఫ్రంట్ లో కొన్ని పార్టీలను తనవైపు తిప్పుకొని, వారి ప్రభుత్వాన్ని కూల్చి రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారం చెప్పట్టవచ్చునని కాంగ్రెస్ అధిష్టానం దూర దురాలోచన చేస్తోంది.   కానీ ఒకవేళ మోడీ చెపుతున్నట్లుగా బీజేపీయే స్వయంగా 272 సీట్లు సాధించగలిగితే కాంగ్రెస్ వేసుకొంటున్న ఈ లెక్కలు, వ్యూహాలు పనిచేయవు. అదే జరిగితే రాహుల్ గాంధీ ఇక ఎన్నడూ ప్రధాని కాలేకపోవచ్చును.

కేవీపీ చక్రం తిప్పుతున్నారా

  వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చచ్చినట్లుంది కేవీపీ పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయంలో తెర వెనుకే ఉంటూ ఆయన గిరగిరా చక్రం తిప్పారు. ఆ తరువాత రాష్ట్ర విభజన వ్యవహారంలో కూడా ఆయన గిరగిరా చక్రం తిప్పి అందరినీ ఆకట్టుకొన్నారు. అధిష్టాన దేవత ఆగ్రహానికి గురయిన తోటి కాంగ్రెస్ యంపీలు అందరూ పార్టీ నుండి సస్పెండ్ అయ్యి చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లుగా చెల్లాచెదురయి అగమ్య గోచరంగా తిరుగుతుంటే, రాజ్యసభలో ప్లకార్డులు పట్టుకొని నిరసనలు తెలిపినప్పటికీ ఆయన మాత్రం మళ్ళీ అదే రాజ్యసభలో సీటు దక్కించుకోగలగడం ఆయన చక్రం మహిమేననుకోవాలి. రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా ఆయనే చక్రం తిప్పి పొన్నాల లక్ష్మయ్యను తెలంగాణా పీసీసీ కుర్చీలో కూర్చోబెట్టారని కేసీఆర్ అంతటివాడు ప్రకటించడం ఆయన చక్రం పవరేమిటో తెలియజేస్తోంది. అదేవిదంగా, తనను ప్రలోభ పెట్టడానికి ఆయన ‘వేల కోట్లు’ ఆఫర్ చేసారని కేసీఆర్ చెప్పుకోవడం కూడా ఆయన ‘గొప్ప ధనాన్ని’ తెలియజేస్తోంది.   ఇంతటి గొప్ప వ్యక్తి కూడా ఎక్కడో సప్త సముద్రాల అవతల ఉన్న అమెరికాలో యఫ్.బీ.ఐ. అనే ఒక దర్యాప్తు సంస్థ టైటానియం కుంభకోణంలో తనను నిందితుడని ప్రకటించినపుడు మొదట మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినప్పటికీ, ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ అయ్యి అది నేరుగా వయా డిల్లీ ఏకంగా తన కొంపకే వచ్చేయడంతో ఆయన ‘శరణు శరణు’ అంటూ హై కోర్టును ఆశ్రయించారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో జారీ అయిన రెడ్ కార్నర్ నోటీసు నుండి నిన్ను కాపాడలేమని కోర్టువారు కూడా తప్పుకోవడంతో, తన లాయర్ల సలహా మేరకు మళ్ళీఅదే కోర్టులో తనను సీబీఐ లేదా సీ.ఐ.డీ వారు అరెస్టు చేయకుండా స్టే ఇమ్మని కోరుతూ మరో పిటిషను పడేసి లౌక్యం ప్రదర్శించారు. అది కోర్టు పరిధిలోకే వస్తుంది గనుక ఆయన పిటిషన్ను విచారణకు స్వీకరించి కేసును సోమవారానికి వాయిదా వేసింది హై కోర్టు.   మరి మళ్ళీ ఆయన తన చక్రం అడ్డువేసారో ఏమో కానీ, రెడ్ కార్నర్ నోటీసు అందుకొన్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించిన సీఐడీ వారు, తమకు అందిన నోటీసులో కేవీపీ గారిని అరెస్టు చేయమని ఎక్కడా ఒక్క అక్షరం ముక్క కూడా కనబడలేదని, అందువల్ల ఆ నాలుగు ముక్కలు ప్రత్యేకంగా పేర్కొంటే తప్ప ఆయనను అరెస్టు చేయడానికి తమ రూల్స్ ఒప్పుకోవంటూ డిల్లీకి ఓ లెటర్ కొట్టి చేతులు దులుపుకొన్నారు.   అయితే సదరు నోటీసు హైదరాబాదుకి పంపించి చేతులు దులుపుకొన్న సీబీఐ వారు, అసలు రెడ్ కార్నర్ నోటీసు అంటేనే అరెస్టు వారెంట్ అనే ఇంగిత జ్ఞానం కూడా మీకు లేకపోతే ఎలా? అని విసుకొంటూ, విదేశాంగ శాఖ వారికి ‘ఆ నాలుగు ముక్కలు’ వ్రాసుకోనేందుకు అనుమతి కోరుతూ మరో లెటర్ కొట్టేసి చేతులు దులుపుకొన్నారు. ఒకవేళ కేవేపీ వారి చక్రం గిరగిరా తిరుగుతుంటే ఆ రెడ్ కార్నర్ నోటీసు ఒక కార్యాలయం నుండి మరొక దానికి, ఒక మంత్రిత్వ శాఖ నుండో మరొక దానికి, హైదరాబాదు నుండి డిల్లీకి, డిల్లీ నుండి హైదరాబాదుకి మళ్ళీ వెనక్కి అక్కడి నుండి మళ్ళీ అమెరికాకి, అమెరికా నుండి డిల్లీ మధ్యన తిరుగుతూనే ఉండిపోయినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ ఏ కారణం చేతయినా ఆయన చక్రం పనిచేయక అరెస్టు అనివార్యమయితే అకస్మాత్తుగా ఆయన ఆరోగ్యపాడయిపోయినా పోవచ్చును. ప్చ్..ప్చ్..

కాంగ్రెస్ హస్తంలో వైకుంటం చూపిన రాహుల్

  రాహుల్ గాంధీ నాలుగు రోజుల వ్యవదిలో తెలంగాణాలో మూడు సభలలో పాల్గొన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే తెలంగాణా వచ్చిందనేది మూడు సభల సారాంశం. కాంగ్రెస్ లేకుంటే తెలంగాణా ప్రజల 60 ఏళ్ల కల ఎన్నటికీ నెరవేరేదేకాదని ఆయన గ్యారంటీ ఇచ్చారు. తెరాస కంటే తమ పార్టీ నేతలే తెలంగాణా ఇవ్వమని డిమాండ్ చేసారని, ఆ తరువాతే తెరాస పార్టీ ఏర్పడిందని ఆయన కనిపెట్టిన కొత్త విషయం ప్రజలకు చాటి చెప్పారు. తెరాస నేతలు కనీసం తెలంగాణా బిల్లు డ్రాఫ్ట్ రూపకల్పనలో కూడా కల్పించుకోలేదని, ఇక పార్లమెంటులో తెలంగాణా కోసం వారు చేసిన ప్రయత్నాలు ఏమీ లేవని తెలియజెప్పారు.   పది సం.ల క్రితం సోనియాగాంధీ తెలంగాణా ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడినందునే తెలంగాణా ఏర్పడిందని ఆయన నొక్కి చెప్పారు. అంతే గాక రాగల పది సం.లలో తాము తెలంగాణకు ఏమేమి చేయబోతున్నమో కూడా చెప్పారు. ఇంతవరకు తెలంగాణా ప్రజలు చైనా దేశంలో తయారయిన మొబైల్స్, వాచీలు, బూట్లు, బట్టలు వాడుతున్నారని కానీ తాను మాత్రం త్వరలోనే ‘మేడ్ ఇన్ తెలంగాణా’ వాచీని ధరించేందుకు ఉవ్విళ్ళూరుతున్నాని ఆయన అన్నారు.   తెరాస లక్ష రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తే, తాము రెండు లక్షలు మాఫీ చేస్తామని, ఇతర పార్టీలు ఎటువంటి అవగాహన లేకుండా విద్యుత్ సరఫరాపై ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తున్నారని, తాము మాత్రం దేశంలోకెల్లా అతిపెద్ద పవర్ ప్లాంట్ 4000 మెగావాట్ల సామర్ధ్యం గల విద్యుత్ ఉత్పత్తి సంస్థను స్థాపించి తెలంగాణకు విద్యుత్ కోరతనేది లేకుండా చేస్తామని, వ్యవసాయానికి రోజుకి 9గంటలు పగలే విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ పనులన్నీ గత పదేళ్ళలో ఎందుకు చేయలేకపోయారో చెప్పగలిగితే ప్రజలు కూడా విని సంతోషించేవారు.

కేసీఆర్ టీమ్‌పై సీబీఐ కోర్టు కేసు: ఎన్నెన్నో సందేహాలు!

      కేసీఆర్, హరీష్‌రావు, విజయశాంతి సంపాదన మీద విచారణ జరిపించాలని సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించింది. ఈ ఆదేశాల మీద స్పందిస్తూ హరీష్‌రావు ఇది కాంగ్రెస్ పార్టీ కుట్రే అని గగ్గోలు పెట్టగా, విజయశాంతి మాత్రం తనకేం భయం లేదని చెప్పారు. అయితే టోటల్‌గా ఈ అంశంలో సమాధానాలు దొరకని కొన్ని సందేహాలున్నాయి. కేసులు పెడితే, తెలంగాణ ఉద్యమం పేరుతో వసూళ్ళు చేశారన్న ఆరోపణలు కేసీఆర్ కుమారుడు కేటీఆర్ మీద, కేసీఆర్ కుమార్తె కవిత మీద కూడా వున్నాయి. అయితే వాళ్లిద్దరినీ ఈ కేసు నుంచి ఎందుకు తప్పించారనేది ఒక పెద్ద సందేహం. హరీష్‌రావు ఆక్రోశించినట్టు ఇది కాంగ్రెస్ కుట్ర అయితే కేసీఆర్, హరీష్‌రావు పేరుతోపాటు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే వున్న విజయశాంతి మీద కూడా ఎందుకు కేసు పెట్టారు? కేసీఆర్, హరీష్‌రావుతోపాటు విజయశాంతి మీద కూడా కేసు పెడితే ఇది కాంగ్రెస్ కుట్ర అని ఎవరూ అనుకోరని ముందు జాగ్రత్త చర్యగా ఆమెను కూడా ఈ కేసులో ఇరికించారా? మరో ఐదు రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో పోలింగ్ జరగబోతూ వుండగా, ఇప్పుడే ఈ కేసుని ఎందుకు వెలుగులోకి తెచ్చారు? ఇలాంటి సందేహాలు ఎన్నెన్నో కలుగుతున్నాయి. ఈ సందేహాలకు సమాధానాలు దొరకాలంటే మరికొంతకాలం ఆగాలి.

సోనియా, రాహుల్ ప్రచారంతో ఓట్లు రాలుతాయా?

  ఈరోజు రాహుల్ గాంధీ మరోమారు తెలంగాణాలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. ఆయన మొదట వరంగల్‌లో పార్టీ తరపున ప్రచార సభలో పాల్గొన్న తరువాత హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. రాహుల్ క్రిందటి సారి తన పర్యటనలో కేసీఆర్ నే ప్రధాన లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించి, టీ-కాంగ్రెస్ నేతల ఆత్మవిశ్వాసం పెంచగలిగారు. అదేవిధంగా జాతీయ పార్టీ అయిన తమ పార్టీ మాత్రమే తెలంగాణా త్వరగా అభివృద్ధి చేయగలదని, ప్రాంతీయ పార్టీ అయిన తెరాస వల్ల సాధ్యం కాదని గట్టిగా నొక్కి చెప్పారు. అనేక ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీయే దేశంలో, రాష్ట్రంలో కూడా అధికారం చలాయిస్తున్నపటికీ చేయలేని అనేక అభివృద్ధి పనులను ఇప్పుడు తమకు ఓటేస్తే చేసి చూపుతామని చెపుతూ, వాటికి మరికొన్ని కొత్తగా జోడించి తెలంగాణ ప్రజలకు తమ హస్తంలో వైకుంటం చూపించేరు. బహుశః ఈరోజు సభలలో కూడా అవే విషయాలు మరోమారు వల్లెవేయవచ్చును.   అయితే ఆయన వెళ్ళిన తరువాత మోడీ తెలంగాణాలో ప్రచారసభలు నిర్వహించి, తెలంగాణా కోసం వందల మంది యువకులు చనిపోతున్నపటికీ, పదేళ్ళ పాటు నిర్లిప్తంగా చూస్తూ కూర్చొని 1100 మంది యువకులను పొట్టన పెట్టుకొన్న పాపాత్మురాలు కాంగ్రెస్ పార్టీ అని, ఆ పార్టీ తెలంగాణాను, ప్రజలను నిర్లక్ష్యం చేయడం వల్లనే ఉద్యమాలు మొదలయ్యాయని తీవ్ర విమర్శలు గుప్పించారు. కనుక రాహుల్ గాంధీ ఈరోజు సభలలో బీజేపీ దానితో పొత్తులు పెట్టుకొన్న తెదేపాపై బాణాలు వేయవచ్చును. పనిలోపనిగా కేసీఆర్ చేసిన ప్రతివిమర్శలకు కూడా ధీటుగా బదులివ్వవచ్చును.   అయితే రాహుల్ గాంధీ తన పార్టీ శ్రేణులకు, నేతలకు తన ప్రసంగంతో ఉత్సాహం కలిగించవచ్చునేమో కానీ, కేసీఆర్, తెలంగాణా సెంటిమెంటు ప్రభావంలో ఉన్న తెలంగాణా ప్రజలను కాంగ్రెస్ పార్టీకే ఓటేసేలా చేయలేరని చెప్పవచ్చును. ఆ పని కేవలం టీ-కాంగ్రెస్ నేతల వలననే సాధ్యమవుతుంది. వారు కాంగ్రెస్ జెండా, సోనియా, రాహుల్ గాంధీల ఫోటోలు పట్టుకొని తిరుగుతున్నపట్టికీ, వారు ప్రధానంగా తమ స్వశక్తి, పలుకుబడితోనే ఎన్నికలలో విజయం సాధించగల సమర్ధులు. ప్రస్తుతం వారందరూ తమ తమ నియోజకవర్గాలలో ఆ పని మీదనే ఉన్నారు. అందువల్ల రాహుల్, సోనియాగాంధీల ప్రచారం కేవలం కాంగ్రెస్ ప్రత్యర్ధులను బలంగా డ్డీకొని, ప్రజలకు అరచేతిలో వైకుంటం చూపించడానికే తప్ప వేరెందుకు ఉపయోగపడదనే భావించవచ్చును.

చంద్రబాబు హామీతోనే పోటీపై పట్టు సడలించా: కంఠంనేని

      ఎక్కడ నెగ్గాలో మాత్రమే కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినవాడే నిజమైన నాయకుడు. అలాంటి వ్యక్తే కృష్ణాజిల్లా అవనిగడ్డకి చెందిన తెలుగుదేశం నాయకుడు కంఠంనేని రవిశంకర్. ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేసి, స్థానికంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన కంఠంనేని రవిశంకర్‌కి ఈ ఎన్నికలలో అవనిగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి టిక్కెట్ ఇస్తానని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అయితే చివరి నిమిషంలో మండలి బుద్ధ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడంతో చంద్రబాబు కంఠంనేని రవిశంకర్‌ని కాదని బుద్ధ ప్రసాద్‌కి టిక్కెట్ ఇచ్చారు. దాంతో మనస్తాపం చెందిన రవిశంకర్ అవనిగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం రెబల్‌గా నామినేషన్‌ వేశారు.   కంఠంనేని రవిశంకర్ నామినేషన్ వేయడానికి వెళ్తున్నప్పుడు దాదాపు పదివేలమంది మద్దతుదారులు ఆయనవెంట నడిచారు. స్థానిక తెలుగుదేశం కార్యకర్తలందరూ మేమంతా కంఠంనేని వెంటే వుంటామని ముక్తకంఠంతో చెప్పారు. ఎలాంటి అధికారం లేకపోయినా తమకు ఎంతో సేవ చేసిన కంఠంనేనిని గెలిపించుకుంటామని స్థానిక ప్రజలు కూడా ఆయనకు బలమిచ్చారు. రాజకీయ వర్గాలు కూడా అవనిగడ్డ నియోజకవర్గంలో కంఠంనేని రవిశంకర్ గెలుపు ఖాయమని నిర్ధారణకి వచ్చాయి. అవనిగడ్డ సీటు తెలుగుదేశం అకౌంట్‌లోంచి జారిపోయినట్టేనని తీర్మానించేశాయి. అందుకే కంఠంనేని నామినేషన్‌ వేసినప్పటి నుంచి సుజనాచౌదరి లాంటి అనేకమంది నాయకులు ఆయనన్ని పోట నుంచి విరమించుకోవాల్సిందిగా కోరారు.  అయితే కంఠంనేని అందుకు నిరాకరించి ప్రచారంలో నిమగ్నమయ్యారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజున తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రవిశంకర్‌కి ఫోన్ చేసి పోటీనుంచి విరమించుకోవాలని కోరడంతో ఎప్పుడు తగ్గాలో కూడా తెలిసిన రవిశంకర్ తన నామినేషన్‌ని ఉపసంహరించుకుని మండలి బుద్ధ ప్రసాద్ గెలుపుకి మార్గం సుగమం చేశారు. తనవెంట వున్న కార్యకర్తలకు న్యాయం చేస్తానని చంద్రబాబు నుంచి, బుద్ధ ప్రసాద్ నుంచి స్పష్టమైన హామీ రావడంతో పోటీ నుంచి వెనక్కి తగ్గానని రవిశంకర్ చెప్పారు.  ఇక అవనిగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి తనవంతు కృషి చేస్తానని ప్రకటించారు. నామినేషన్ ఉపసంహరించుకున్న కంఠంనేనికి మండలి బుద్ధ ప్రసాద్‌ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రవిశంకర్ వెంట నడిచిన తెలుగుదేశం కార్యకర్తలను తన సొంత మనుషుల మాదిరిగా చూసుకుంటానని బుద్ధ ప్రసాద్ హామీ ఇచ్చారు.  కంఠంనేని పోటీ నుంచి తప్పుకోవడంతో అవనిగడ్డ నుంచి తన విజయం ఖాయమైందని ఆయన సంతోషాన్ని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీకి కంఠంనేని రవిశంకర్ చేసిన సేవలను చంద్రబాబు నాయుడు గుర్తించారని, రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక కంఠంనేని రవిశంకర్‌కి ప్రాధాన్యం వున్న పదవి ఇవ్వడానికి చంద్రబాబు సుముఖంగా వున్నారని, ఈ విషయంలో తనవంతు సహకారాన్ని మనస్పూర్తిగా అందిస్తానని అన్నారు.

శోభానాగిరెడ్డి మృతి: రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక శైలి

      రాష్ట్ర రాజకీయాలలో ప్రత్యేక శైలి కలిగిన రాజనీతివేత్తగా శోభానాగిరెడ్డి నిలిచారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శోభా నాగిరెడ్డి మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. యాక్సిడెంట్‌కి గురైన వెంటనే కోమాలోకి వెళ్ళిపోయిన ఆమె రక్తపోటు, పల్స్ నార్మల్‌గానే ఉన్నాయని మొదట వైద్యులు ప్రకటించినప్పుడు ఆమె కోలుకుంటారన్న ఆశ కలిగింది. అయితే అంతలోనే ఆమె కన్నుమూసినట్టు వైద్యులు ప్రకటించడం విషాదాన్ని కలిగించింది.   శోభానాగిరెడ్డి రాజకీయ నేపథ్యం వున్న కుటుంబం. ఆమె తండ్రి ఎస్.వి.సుబ్బారెడ్డి కాకలు తీరిన రాజకీయవేత్త, రాష్ట్రానికి మంత్రిగా కూడా పనిచేశారు. ఇంటర్మీడియట్ వరకూ చదువుకున్న శోభ వివాహం 1986లో భూమా నాగిరెడ్డితో జరిగింది. శోభానాగిరెడ్డిగా మారిన శోభ గృహిణిగా తన కుటుంబాన్ని ఆదర్శవంతంగా నడిపారు. ఆమెకు ముగ్గురు పిల్లలున్నారు. ఇటీవలే కుమార్తె వివాహం జరిగింది. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఎంతమాత్రం లేని ఆమె తన భర్త ప్రోత్సాహంతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తన భర్త, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి నంద్యాల లోక్‌సభకు ఎన్నిక కావడంతో ఉప ఎన్నికలో ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు.  తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆమె ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. ఛైర్మన్‌గా రెండేళ్ళపాటు ప్రశంసనీయంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఇమడలేక చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 ఎన్నికలలో రాయలసీమలో ప్రజారాజ్యం తరఫున ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యేగా శోభా నాగిరెడ్డి నిలిచారు.  ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి మారారు. ప్రస్తుత ఎన్నికలలో ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. శోభా నాగిరెడ్డి ఏ పార్టీలో వున్నా అగ్రశ్రేణి  నాయకురాలిగానే  ఉన్నారు. చక్కని మాట తీరుతో, సంస్కారం ఉట్టిపడేలా మాట్లాడేవారు. రాష్ట్ర రాజకీయాలలో ఉజ్వలమైన భవిష్యత్తు వున్న శోభా నాగిరెడ్డి ఇలా ఆకస్మిక మరణం చెందటం ఆమె కుటుంబాన్ని, ఆమె నియోజకవర్గ ప్రజలను మాత్రమే కాకుండా ఆమె రాజకీయ ప్రత్యర్థులను కూడా షాక్‌కి గురి చేసింది.  

ఏపీఎన్జీవోలను దువ్వుతున్న జైరాం

      ప్రస్తుతం తెలుగుదేశానికి దగ్గరై వున్న ఏపీఎన్జీవోలను దువ్వడానికి కేంద్ర మంత్రి జైరాం రమేష్ పెద్ద దువ్వెనతో సిద్ధమయ్యారు. సీమాంధ్రలో ఉద్యోగులందరూ తెలుగుదేశం, బీజేపీ కూటమికి ఓటు వేయడానికి మానసికంగా సిద్ధమైపోయారు. కాంగ్రెస్ పార్టీ పేరు చెబితేనే ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగుల మద్దతు లేని పార్టీ గెలిచిన దాఖాలాలు చరిత్రలో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీఎన్జీవోలను మచ్చిక చేసుకోవడం ద్వారా సీమాంధ్రలో గండం నుంచి గట్టెక్కాలని జైరాం రమేష్ ప్లాన్ వేశారు. ఈ ప్లాన్‌లో భాగంగా ఏపీఎన్జీవోలతో సమావేశం ఏర్పాటు చేశారు.   ప్రస్తుతం ఏపీఎన్జీవోలు ‘ఆప్షన్లు ఉండాల్సిందే’ అనే పట్టు మీద వున్నారు. వారికి ఏం కావాలో వారికి ఇచ్చి తమకు ఏంకావాలో అది తీసుకునే ఇచ్చిపుచ్చుకునే ధోరణితో జైరాం రమేష్ వ్యవహరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చి తీరతామని వాళ్ళకి హామీ ఇచ్చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని వాళ్ళకి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్ర ఉద్యోగులకు అన్యాయం జరగకుండా వుండాలంటే కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపించాలని  ఉద్యోగ సంఘాల నాయకులను కోరినట్టు సమాచారం. రాష్ట్రాన్ని అడ్డంగా విభజించి సీమాంధ్రులకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని సీమాంధ్రులెవరూ నమ్మరన్న విషయాన్ని జైరాం రమేష్ మరచిపోయినట్టున్నారు. కాంగ్రెస్ సిద్ధాంతమే విభజించి పాలించు. అందుకే రాష్ట్రాన్ని విభజించి కూడా రెండు ప్రాంతాలనీ పాలించాలని అనుకుంటోంది. ఈ విషయంలో ఏపీఎన్జీవోలని కూడా అనాలి. రాష్ట్రం అడ్డగోలు విభజనకు జైరాం రమేష్ కూడా కారణమని తెలిసి కూడా, ఆయన పిలవగానే కలవటానికి వెళ్ళారు. వినతిపత్రాలు సమర్పించారు. ఆయన చెప్పిన సోది అంతా విని వచ్చారు.  

టీఆర్ఎస్‌కి ఓటమి భయం పట్టుకుంది

      ఈ ఎన్నికలలో 90 అసెంబ్లీ స్థానాలు తమ పార్టీ సంపాదించుకుంటుందని, తెలంగాణలో ప్రభుత్వం స్థాపించడంతోపాటు కేంద్రంలో కూడా చక్రం తిప్పుతుందని టీఆర్ఎస్ నాయకులు పైకి చెబుతున్నారు. మొన్నటి వరకూ 60 సీట్లు వస్తాయని అనుకున్నామని, ఇప్పుడు 90 వస్తాయని అనుకుంటున్నామని ప్రకటిస్తున్నారు. అయితే బయట పరిస్థితి చూస్తే టీఆర్ఎస్‌కి అంత సీన్ కనిపించడంలేదు. అందుకే పైకి ఎంత డాంబికాలు పలుకుతున్నా, లోలోపల మాత్రం టీఆర్ఎస్ నాయకులను ఓటమి భయం పట్టి పీడిస్తోంది.   అందుకే అప్పుడప్పుడు నోరు జారి నిర్వేదంగా మాట్లాడుతున్నారు. టీడీపీ, బీజేపీ పొత్తు పక్కాగా కుదరడంతో ఆ రెండు పార్టీలకి తెలంగాణ ప్రజల్లో మద్దతు పెరుగుతోంది. టీఆర్ఎస్ పార్టీ లేనిపోని ఉద్రికత్తలు పెంచి లాభపడటం తప్ప తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయదని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చే సమయంలో మోడీని తిట్టిపోసే టీఆర్ఎస్‌కి ఓటేస్తే భవిష్యత్తులో మోడీ ప్రభుత్వం టీఆర్ఎస్‌కి సహకరించదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే టీఆర్ఎస్ కేవలం ఉత్తర  తెలంగాణలో మాత్రమే బలంగా కనిపిస్తోంది. దక్షిణ తెలంగాణలో ఆ పార్టీని పట్టించుకునేవారే కనిపించడంలేదు. ఖమ్మం జిల్లాలో అయితే టీఆర్ఎస్ ఊసే లేదు. దీంతోపాటు తెలంగాణ అంతటా టీఆర్ఎస్ అభ్యర్థుల్లో చాలామంది బలహీనంగా వున్నారు. ఇలా అనేక కారణాలు టీఆర్ఎస్‌ని ఓటమి వైపు తీసుకెళ్తున్నాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న టీఆర్ఎస్ నేతలు వారం రోజుల నుంచి నిర్వేదంగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ అయితే నన్ను గెలిపిస్తే తెలంగాణని పాలిస్తా, లేకపోతే రెస్ట్ తీసుకుంటానని నిర్మొహమాటంగా ప్రకటించేశారు. టీఆర్ఎస్ మిగతా నాయకులు కూడా అంత ఉత్సాహంగా కనిపించడం లేదు. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే టీఆర్ఎస్ ఎన్నికల ముందే ఓటమిని ఒప్పుకోక తప్పేట్టులేదు.