కొత్త రాజధాని పరిసర ప్రాంతాలలో రియల్ భూమ్

  ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టబోతున్న చంద్రబాబు గుంటూరులో తన క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకొని అక్కడి నుండే పరిపాలన సాగించేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. కనుక వీ.జీ.టీ.యం. అర్బన్ డెవలప్ మెంట్ సంస్థ పరిధిలో ఉన్న విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి ప్రాంతాలను  సత్వరమే అభివృద్ధి చేసేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. అందువలన అక్కడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మించె అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ అంచనాలతో ఆ పరిసర ప్రాంతాలలో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చేసాయి.   చంద్రబాబు గుంటూరులో తన క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకోబోతున్నట్లు రూడీ అయినప్పటి నుండి వీ.జీ.టీ.యం. పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలలో కూడా భూముల ధరలు దాదాపు 20 నుండి 40 శాతం వరకు పెరిగాయి. కేసీఆర్ పుణ్యమాని హైదరాబాదులో స్థిరపడిన ఉద్యోగులు కూడా కొత్తరాజధానికి తరలిపోవలసి వచ్చేలా ఉండటంతో ఎందుకయినా మంచిదని వారు కూడా ఈ ప్రాంతాలలో భూములు, ఫ్లాట్లు కొనేందుకు ఆసక్తి చూపుతుండటంతో ధరలు పెరిగిపోయాయి. వీరే గాక ప్రముఖ స్టార్ హోటల్స్, వ్యాపార సంస్థలు, పారిశ్రామికవేత్తలు, విదేశాలలో స్థిరపడిన ఆంద్ర ప్రజలు చాలా మంది ఇక్కడ భూములు కొనేందుకు క్యూ కడుతుండటంతో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి.   ఆ నాలుగు ప్రాంతాలలోనే కాక, పక్కనున్న ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలకు కూడా ఆవేడి బాగానే సోకుతోంది. కారణం కొత్త రాజధానికి పొరుగున ఉండటమే. రాజధాని, దానితోబాటే ప్రభుత్వోద్యోగులు, వివిధ సంస్థలు అన్నీ తరలి వచ్చే అవకాశం కనబడుతున్నందున ఈ ప్రాంతాలలో ఇళ్ళు, వ్యాపార సముదాయాలు అద్దెలు కూడా క్రమంగా పెరుగుతున్నట్లు తాజా సమాచారం. ఈ ప్రాంతాలలో ఇదివరకు భూములపై పెట్టుబడులు పెట్టి అమ్ముకోలేక నష్టాలలో కూరుకుపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇది చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తమ అప్పుల నుండి బయటపడటమే కాక, మళ్ళీ లాభాలు కూడా ఆర్జించవచ్చని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు అయినకాడికి అమ్ముకొని బయటపడదామని చూసిన రియాల్టర్లు, ఇప్పుడు ఇంకా మున్ముందు భూముల ధరలు మరింత పేరుగా వచ్చనే ఆశతో అమ్మకాలు నిలిపివేసి కూర్చొన్నారు.   ఇదంతా చూసి స్థానిక మధ్యతరగతి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అమాంతం పెరిగిపోయిన ఈ ధరలతో ఇక స్వంత ఇంటి కల కలగానే మిగిలిపోతుందని వాపోతున్నారు. ఈసారి అభివృద్ధిని వికేంద్రీకరించి, శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు అన్ని జిల్లాలకు సమానంగా వ్యాపింపజేయాలని చంద్రబాబుతో సహా అందరూ భావిస్తున్నదున మిగిలిన జిల్లాలలో భూములు ధరలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు, తిరుపతి వంటి ప్రధాన నగరాలలో కొందరు పెద్ద రియాల్టర్లు భూముల అమ్మకాలకు తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇందుకు ప్రజలు ఆనందించాలో బాధపడాలో తెలియని పరిస్థితి.

దిగివచ్చిన జైరామ్ రమేష్

  కుహానా మేధావిగా పేరు సంపాదించుకొన్న మాజీ కేంద్రమంత్రి జైరామ్ రమేష్ రాష్ట్ర విభజనలో చూపిన అత్యుత్సాహం గురించి తెలియనివారు లేరు. ఆయన చూసి రమ్మంటే కాల్చివచ్చే బాపతు అని తెలిసినప్పటికీ, సోనియాగాంధీ ఆయననే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారానికి ఏరికోరి పంపారు. రాష్ట్ర విభజనలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు గనుక ఆయననే తెలంగాణకు పంపినట్లయితే కాంగ్రెస్ కు మరింత లబ్ది కలగవలసి ఉంది. పైగా తెలంగాణా ఇచ్చిన కారణంగా కాంగ్రెస్ పార్టీకి మంచి విజయావకాశాలు కూడా బాగా ఉన్నాయి. కానీ జైరామ్ రమేష్ వాచాలత్వం, దుందుడుకుతనంతో తెలంగాణాలో కూడా కాంగ్రెస్ పార్టీ ఊహించనంత ఘోరపరాజయం పాలయింది.   కాంగ్రెస్ పార్టీ చేసిన మరో తప్పు ఏమిటంటే, రాష్ట్ర విభజన తో ఆగ్రహంగా ఉన్న సీమాంధ్ర ప్రజల వద్దకు కూడా ఆయననే పంపించడం. ఆయన పుండు మీద కారం చల్లినట్లు మాట్లాడిన మాటల వల్ల సీమాంద్రాలో కాంగ్రెస్ పార్టీకి కనీసం ఒక్క సీటు కూడా దక్కకుండా పోయింది. అయితే ఆయన అదృష్టమో, కాంగ్రెస్ దురదృష్టమో కానీ ఆ పార్టీ దేశవ్యాప్తంగా పూర్తిగా తుడిచిపెట్టుకు పోవడంతో, ఆయన చేసిన ఘోరతప్పిదాలు కనబడకుండా పోయాయి.   నిన్న మొన్నటి వరకు సకల రాజలాంఛనాలతో ‘రాజు వెడలె రవి తేజములరియగా...కుడి ఎడమలు డాల్కత్తులు మెరియగ..’ అన్నట్లు కాంగ్రెస్ నేతలు వెంటరాగా ఊరేగిన ఆయన, మొన్న డిల్లీలో ఆంధ్రాభవన్ కు వచ్చి చంద్రబాబుని కలిసి రాష్ట్ర విభజనకు సంబందించిన కొన్ని ఫైళ్ళను ఆయనకు అందజేసి, ఆ వివరాలను తెలిపారు. అంతే గాక ఒకవేళ కేసీఆర్ కోరినట్లయితే ఆయనకు కూడా సదరు వివరాలను అందించగలనని మీడియాకు తెలిపారు.   కొన్ని నెలల క్రితం రాష్ట్ర విభజన జరుగుతున్న తీరుని నిరసిస్తూ చంద్రబాబు స్వయంగా డిల్లీలో నిరాహార దీక్ష చేసినా అప్పుడు ఈ జైరామ్ రమేష్ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆయనే స్వయంగా చంద్రబాబుని వెతుకొంటూ వచ్చి విభజన ఫైళ్ళను అందించడం చూస్తే నవ్వొస్తుంది. ఒకప్పుడు లక్షలాది ప్రజలు రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలియజేస్తుంటే, వారి ఉద్యమాన్ని, ఆవేదనని అపహాస్యం చేసిన ఇటువంటి కాంగ్రెస్ నేతలకు ప్రజలు తగిన విధంగానే బుద్ధి చెప్పారు. ఇటువంటి అనేకమంది అహంకారులు, కుహన మేధావులు, కుహన లౌకికవాదుల సలహాల వలనే కాంగ్రెస్ పార్టీకి ఈ గతి పట్టింది.

తెలంగాణాలో తెదేపాకు విషమ పరిస్థితులు

  మళ్ళీ చాలా సుదీర్గ కాలం తరువాత కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్న తెలుగుదేశం పార్టీ ముందు ఎన్ని సవాళ్లు ఉన్నాయో, అంతకంటే ఎక్కువ సమస్యలను ఆ పార్టీ తెలంగాణా శాఖ ఎదుర్కోవలసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు మళ్ళీ బాధ్యతలు చేప్పట్టనున్నారు.అందువల్ల ఇప్పుడు ఆయన దృష్టి అంతా సీమాంద్రాకు కొత్త రాజధాని నిర్మాణం, ఎన్నికల హామీలను నెరవేర్చడం, గాడితప్పిన ప్రభుత్వాన్ని, ఆర్ధిక వ్యవస్థని మళ్ళీ గాడిన పెట్టడం పైనే ప్రధానంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.   కానీ ఇప్పటికే పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న తెలంగాణా తెదేపా నేతలను ఒకవేళ చంద్రబాబు గనుక పట్టించుకోకపోయినట్లయితే, నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్న తెదేపా నేతలను తెరాస అధినేత కేసీఆర్ తమవైపు తిప్పుకొనే ప్రయత్నం తప్పక చేయవచ్చును. బలమయిన క్యాడర్, మంచి అనుభవముగల తెదేపా నేతలను తెరసలోకి ఆకర్షించగలిగితే, తెలంగాణాలో ఇక తెరాసకు ఎదురు ఉండదు. తద్వారా తెరాసను మరింత బలోపేతం చేసుకోవడమే కాక, ఇక వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో బలమయిన ప్రతిపక్షమే లేకుండా చేసుకోవచ్చును. అందుకే తెరాస నేత హరీష్ రావు 2019 ఎన్నికలకి తెలంగాణాలో తెదేపాను కనబడకుండా చేస్తానని అన్నారు. దానిని బట్టి తెలంగాణాలో తెదేపా ఎంత సంకట స్థితి ఎదుర్కోబోతోందో అర్ధమవుతోంది.   సీమాంద్రాలో సమస్యల పరిష్కారానికి కేంద్రం నుండి తగినన్ని నిధులు రాబట్టుకొంటే సరిపోతుంది. కానీ తెలంగాణాలో పార్టీని మరో ఐదేళ్ళ పాటు బ్రతికించుకోవడానికి, చాలా నేర్పు, ఓర్పు, మంచి వ్యూహం అవసరం ఉంటాయి. మరి చంద్రబాబు ఈ సమస్యను ఏవిధంగా ఎదుర్కొంటారో, పార్టీని ఏవిధంగా కాపాడుకొంటారో కాలమే చెపుతుంది.  

బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న విద్యుత్ ఉద్యోగులు

  మరొక వారం రోజుల్లో ఆంధ్ర, తెలంగాణా రెండు రాష్ట్రాలు విడిపోతున్నఈ తరుణంలో ఉభయ ప్రాంతాలకు చెందిన విద్యుత్ ఉద్యోగులు వేతన ఒప్పందం వెంటనే అమలు చేయాలంటూ మెరుపు సమ్మెకు దిగడం బాధ్యతారాహిత్యమే. ఇంతవరకు వేర్వేరు జేఎసీలు పెట్టుకొని రాష్ట్ర విభజనపై కీచులాడుకొన్న విద్యుత్ ఉద్యోగులు, జీతాల పెంపు విషయం వచ్చేసరికి చాలా ఐకమత్యం ప్రదర్శించడం విశేషం. రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారినట్లయితే తమకు నష్టం జరగకూడదనే ముందు చూపుతోనే వారు ఇంత అకస్మాత్తుగా సమ్మెకు దిగారు.ఆ విషయం వారే స్వయంగా చెప్పుకొన్నారు కూడా.   రాష్ట్రంలో ప్రభుత్వం లేని ఈ సమయంలో గవర్నర్ పర్యవేక్షణలో రాష్ట్ర విభజన జరుగుతోంది. ఈ సమయంలో మొత్తం అన్ని వ్యవహారాలు సమర్ధంగా చక్కబెట్టవలసిన గురుతరమయిన బాధ్యత ప్రభుత్వోద్యోగులపైనే ఉంది. అందువల్ల ప్రతీ ఒక్క ప్రభుత్వోద్యోగి కూడా ఈ విభజన ప్రక్రియలో చాలా కీలకమయిన పాత్ర పోషిస్తున్నారు. ఇక సంక్లిష్టమయిన విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి ఉద్యోగులు, అధికారులు, కార్యాలయాలు అన్నీ కూడా రెండు రాష్ట్రాల మధ్య విభజింపబడుతున్నాయి. ఇటువంటప్పుడు కూడా యావత్ రాష్ట్రానికి విద్యుత్ సరఫరాలో ఎటువంటి అవాంతరాలు లేకుండా చూసుకోవలసిన బాధ్యత విద్యుత్ ఉద్యోగుల మీద ఉంది. కానీ వారు తమ బాధ్యత మరిచి, తమ స్వార్ధం చూసుకొంటూ, రాష్ట్రాన్ని, ఇరుగుపొరుగు రాష్ట్రాలని కూడా అంధకారంలోకి నెట్టేందుకు వెనుకాడకపోవడం చాలా దురదృష్టకరం. రాష్ట్ర విభజన కీలక దశకు చేరుకొన్న దశలో విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగడం బాధ్యతారాహిత్యమే.   రాష్ట్రంలో మిగిలిన ప్రభుత్వోద్యోగులు కూడా వారిలాగే తమ స్వార్ధం చూసుకొని సమ్మెకు దిగినట్లయితే పరిస్థితి ఏమిటనే ఆలోచన కూడా లేకుండా విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. మిగిలిన ప్రభుత్వోద్యోగులు రాష్ట్ర విభజన సజావుగా జరిగేందుకు రేయింబవళ్ళు పనిచేస్తుంటే, విద్యుత్ ఉద్యోగులు మాత్రం తమ స్వార్ధం తాము చూసుకొంటున్నారు. చివరికి గవర్నర్ 27శాతం జీతాలు పెంపుకు అంగీకరించినా ఉద్యోగులు 30 శాతం ఇవ్వనిదే దిగిరాము అంటు ఇంకా మొండిగా సమ్మె కొనసాగించడం చాలా దారుణం. రాష్ట్రం, ప్రజలు, ఏమయినా పరువలేదు, తమ ప్రయోజనాలే తమకు ముఖ్యమని విద్యుత్ ఉద్యోగులు సమ్మె కొనసాగిస్తుండటం చాలా దారుణం. ఇప్పటికయినా విజ్ఞత ప్రదర్శించి విద్యుత్ ఉద్యోగులు సమ్మె విరమించితే వారికి గౌరవప్రదంగా ఉంటుంది.

మేము సైతం...మేము సైతం...

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను, అది జరిగిన తీరుని చూసి సీమాంద్రాలో ప్రజలందరూ కూడా చాలా ఆందోళన చెందారు. ఉన్నత విద్యా, వైద్య, ఉపాధి అవకాశాలన్నీకలిగి ఉన్న హైదరాబాద్ నగరాన్నివదులుకొని బయటకు వచ్చిన తమకు ఇక దారేది? అని అగమ్యగోచరంగామారిన తమ భవిష్యత్తుని తలచుకొని యువత చాలా ఆందోళన చెందారు. మళ్ళీ అటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో, అంతవరకు తమ పిల్లల పరిస్థితి ఏమిటని మధ్యతరగతి ప్రజలు చాలా కలత చెందారు. ఇప్పటికే ఆర్ధికంగా నలిగిపోతున్న తమపై లక్షల కోట్ల వ్యయమయ్యే రాష్ట్ర పునర్నిర్మాణ భారం కూడా పడితే తమ పరిస్థితి ఏమిటని ప్రజలందరూ ఆందోళన చెందారు. కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పైసా ఆదాయం లేకపోయినా, మోయలేనన్ని అప్పులు మాత్రం వాటాగా దక్కాయి.   ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కార్యాలయం మొదలు సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ, మంత్రుల నివాస సముదాయాలు, వివిధ ప్రభుత్వ శాఖల కోసం వందలాది భవనాలు సర్వం నిర్మించుకోవలసిన ఆగత్యం ఏర్పడింది. గత ఆరు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని తెలుగు ప్రజలు నెత్తిన పెట్టుకొని గౌరవించినందుకు, ఆ పార్టీ తెలుగు ప్రజలకు విదించిన శిక్ష ఇది అని అనుకోవాలేమో. అందుకే తెలుగు ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఎన్నడూ మరిచిపోలేని విధంగా గట్టిగా బుద్ధి చెప్పారు.   అంతేకాక చాలా విజ్ఞత ప్రదర్శిస్తూ అనుభవం, సమర్ధత, కార్యదక్షత అన్నీ ఉన్న తెలుగుదేశం పార్టీకి పూర్తి మెజార్టీ కట్టబెడుతూ అధికారం అప్పగించారు. అవిబాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అక్షయపాత్ర వంటి హైటెక్ సిటీని నిర్మించి ఇచ్చిన చంద్రబాబు మాత్రమే ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించి, రాష్ట్రాన్ని మళ్ళీ త్వరగా గాడిలో పెట్టగలరని దృడంగా నమ్మినందునే ఆయనకు ముఖ్యమంత్రిగా పట్టం కట్టారు.   అప్పటి నుండే సీమాంధ్ర ప్రజలలో అంతవరకు ఉన్న ఆందోళన క్రమంగా తగ్గుముఖం పట్టసాగింది. ఇంతటి క్లిష్ట పరిస్థితులను కూడా దైర్యంగా ఎదుర్కొని నిలబడగలమనే ఆత్మవిశ్వాసం ఇప్పుడు ప్రజలందరిలో ప్రస్పుటంగా కనబడుతోంది. ఒకప్పుడు తమ భవిష్యత్తు గురించి తీవ్ర ఆందోళన చెందిన ప్రజలే ఇప్పుడు తమ ఉజ్వల భవిష్యత్తు గురించి కలలు కంటున్నారు. ఈ మహత్కార్యం కోసం ఉడతా భక్తిగా తమవంతు సహాయ సహకారాలు అందించేందుకు చిన్నాపెద్దా, ఆడామగా,పేద ధనిక అనే బేధం లేకుండా అందరూ తలో చెయ్యి వేసేందుకు స్వచ్చందంగా ముందుకు వస్తున్నారు.   దేశవిదేశాలలో స్థిరపడిన తెలుగు ప్రజలందరూ ఈ మహాయజ్ఞంలో పాలుపంచుకొనేందుకు ఉవ్విళ్లూరుతూ ఉడతా భక్తిగా కోట్ల రూపాయలు విరాళంగా అందించేందుకు, పరిశ్రమలు,వ్యాపార సంస్థలు, సాఫ్ట్ వేర్ కంపెనీలు స్థాపించేందుకు కూడా సంసిద్దత వ్యక్తం చేస్తున్నారు. సీమాంధ్ర ప్రజలలో కనబడుతున్నఅపూర్వమయిన ఈ సంఘీభావం, పోరాటస్ఫూర్తి, దైర్యం, పట్టుదల నిజంగా చాలా అబ్బురపరుస్తోంది.   వారి ఉత్సాహం చూసి కొన్ని తెలుగు న్యూస్ చాన్నాళ్ళు స్వయంగా ప్రజల నుండి విరాళాలు సేకరించి కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి అందించేందుకు భారీ మొత్తాలు సిద్దం చేసేపనిలోపడ్డాయి. అయితే ఈ విషయంలో సదరు న్యూస్ ఛానళ్ళు పూర్తి పారదర్శకతతో, నిబద్దతతో ఈ మహాయజ్ఞంలో పాలుపంచుకోవలసి ఉంటుంది. లేకుంటే మంచికి పోతే చెడు ఎదురయినట్లు మున్ముందు ప్రజల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి రావచ్చును.   ఏమయినప్పటికీ సీమాంధ్ర ప్రజలకు కన్నతల్లి వంటి మాతృభూమి ఋణం తీర్చుకొనే అవకాశం ఈవిధంగా కలిగింది. వారి దీక్షదక్షతలను యావత్ లోకానికి చాటిచెప్పే మహదవకాశం కలిగింది.

ఫ్లయింగ్ సీయం చంద్రబాబు

  ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారు అయ్యింది. వచ్చేనెల 8వ తేదీన ఆయన గుంటూరులో పదవీ ప్రమాణం చేయబోతున్నట్లు తాజా సమాచారం. నిన్న రాత్రి ఆయన తన పార్టీ యంపీలతో డిల్లీలో ఆంధ్రాభవన్ లో సమావేశమయ్యారు. ఆయన వారంలో మూడు రోజులు గుంటూరులో, రెండు రోజులు హైదరాబాదులో ఉంటూ ప్రభుత్వాన్ని నడిపించాలని భావిస్తున్నట్లు తాజా సమాచారం. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణం నిమిత్తం కేంద్రం నుండి నిధులు విడుదల చేయించుకొనేందుకు కొన్ని రోజుల వరకు వారంలో ఒక రోజు డిల్లీలో కూడా మకాం వేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఈరోజు పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, ప్రభుత్వంలో మంత్రులు, యంపీలు, యం.యల్యే.లు అందరూ కూడా ప్రజాభీష్టానికి అనుగుణంగా పనిచేయాలని, అందుకోసం ప్రతీవారం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తానని తెలిపారు.  

కేసీఆర్ ధోరణి వలన తెలంగాణకు తీరని నష్టం: చంద్రబాబు

  తెలంగాణకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టబోతున్న తెరాస అధ్యక్షుడు కేసీఆర్ సచివాలయంలో పనిచేస్తున్న సీమాంధ్ర ప్రభుత్వోద్యోగులపట్ల, తెలంగాణాలో స్థిరపడిన సీమాంధ్రుల పట్ల అనుచితంగా మాట్లాడటాన్ని, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు తప్పు పట్టారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ “ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఏవిధంగా మాట్లాడినా చెల్లింది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నపుడు ప్రజలను భయబ్రాంతులు చేసేలా మాట్లాడటం చాలా తప్పు. ఒక్క సచివాలయమే కాదు యావత్ తెలంగాణాలో ఉన్న ప్రజలందరికి రక్షణ కల్పించవలసిన బాధ్యత ఆయనపై ఉంది. ఏవయినా సమస్యలు ఉంటే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప రెచ్చగొట్టడం సరికాదు."   "అసలు కేసీఆర్ యుద్ధం ఎవరి మీద ఎందుకు ప్రకటిస్తున్నారో, ఆ వార్ రూమ్ సమావేశాలు దేనికో నాకు అర్ధం కావడం లేదు. ఆయన ఆవిధంగా మాట్లాడి ఏమి సాధిద్దామనుకొంటున్నారో ఆయనకే తెలియాలి. ఎందుకంటే, ఈ దేశంలో ప్రజలు ఎక్కడయినా స్వేచ్చగా బ్రతికే హక్కు ఉంది. వారి హక్కులను కాపాడేందుకు చట్టాలు, న్యాయస్థానాలు, ప్రభుత్వాలు ఉన్నాయి. ఆయన తాను వాటన్నిటికి అతీతుడిని అనుకొంటే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదు. ప్రజలు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తెలుగుజాతి ఎన్నటికీ ఒక్కటేనని విషయం ఆయన గుర్తుంచుకోవాలి."   "రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు జాతి అభివృద్ధిలో పోటీపడాలి తప్ప ఈవిధంగా విద్వేషాలు రెచ్చగొట్టుకొంటూ గొడవలు పడటం సరికాదు. రెండు రాష్ట్రాలు ఒకదానికొకటి సహకరించుకొంటూ అభివృద్ధి పధంలో ముందుకు సాగాలి. అందుకు నా వంతు సహకారం, కృషి అందించేందుకు ఎల్లపుడూ నేను సిద్దమే. ఇప్పటికే హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ దారుణంగా పడిపోయింది. కేసీఆర్ ఇదేవిధంగా ప్రజలను భయబ్రాంతులను చేసేవిధంగా మాట్లాడుతుంటే అది మరింత పడిపోతుంది. హైదరాబాదుకి సాఫ్ట్ వేర్ కంపెనీలను తీసుకు వచ్చేందుకు నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. ఎన్నో ఏళ్ల నిరంతర శ్రమ ఫలితంగా హైదరాబద్ నేడు ఈ స్థితికి చేరుకోగలిగింది. దానిని కేసీఆర్ తన మాటలతో కూల్చదలచుకొంటే దాని వలన తెలంగాణకు, ప్రజలకు తీరని నష్టం కలుగుతుంది."   "కేసీఆర్ ఏమిచేసినా, ఏమి మాట్లాడినా చెల్లుతుందని అనుకోవడం పొరపాటు. హైదరాబాదుతో సహా తెలంగాణాలో అన్ని జిల్లాలలో తెలుగుదేశం పార్టీ ప్రజలకు అండగానిలబడి వారి తరపున పోరాడుతుందని హామీ ఇస్తున్నాను. ఇప్పటికయినా కేసీఆర్ విజ్ఞత ప్రదర్శించి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు చొరవ చూపుతారని ఆశిస్తున్నాను,” అని అన్నారు.

ఏడాదిలోగా జనసేన పార్టీ నిర్మాణం చేస్తా : పవన్

  సరిగ్గా ఎన్నికల ముందు జనసేన పార్టీతో రాజకీయాలలోకి ప్రవేశించిన పవన్ కళ్యాణ్, తన రెండో సభలోనే ఎన్నికలలో పోటీ చేయనని చెప్పి తీవ్ర విమర్శలకు గురయ్యారు. ఆతరువాత నరేంద్ర మోడీకి బేషరతుగా మద్దతు ఇవ్వడంతో మరిన్ని విమర్శలు మూటగట్టుకొన్నారు. తెదేపా-బీజేపీ కూటమి అభ్యర్ధులకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం చేసి వారికి విజయం చేకూర్చగలిగారు. చంద్రబాబు ఆయనను భోజనానికి ఆహ్వానించి కృతజ్ఞతలు చెప్పగా, నరేంద్ర మోడీ ఆయనను కీలకమయిన ఎన్డీయే సమావేశానికి ఆహ్వానించడం ద్వారా ఆయనను గౌరవించారు.   ఆ సందర్భంగా ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చి జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేసుకోవచ్చనే ఊహాగానాలు కూడా వినబడ్డాయి. కానీ అవేవీ నిజం కావని పవన్ కళ్యాణ్ స్వయంగా మీడియాకు తెలిపారు. ఇటీవల ఒక ప్రముఖ తెలుగు ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన భావి రాజకీయ ప్రణాళికల గురించి వివరించారు.   పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే “జనసేనను బీజేపీలో విలీనం చేస్తానని వస్తున్న వార్తలు ఖండిస్తున్నాను. జనసేన పార్టీ తెదేపా-బీజేపీలతో కలిసి పనిచేయవచ్చు, కలిసి ఎన్నికలలో పోటీ చేయవచ్చును కానీ వాటిలో విలీనం మాత్రం కాదు. మరొక ఏడాదిలోగా జనసేన పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేయగల వ్యక్తులను ఆహ్వానించి వారితో పార్టీ నిర్మాణం చేస్తాను. పార్టీ కార్యాలయాన్ని హైదరాబాదులోని నానక్‌రాంగూడ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నాను. త్వరలో జరుగబోయే గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికలతో జనసేన పార్టీ తన రాజకీయ కార్యక్రమాలను మొదలుపెడుతుంది. ఆ ఎన్నికలలో ఓడిపోయినా దానిని ఒక అనుభవంగానే భావిస్తాను తప్ప, రాజకీయాల నుండి పారిపోను. ఓటమి నుండి గుణపాటాలు నేర్చుకొంటూ ముందుకు సాగినప్పుడే చేరుకోవలసిన లక్ష్యం పట్ల సరయిన అవగాహన ఏర్పడుతుందని నేను భావిస్తున్నాను. నేను రాజకీయాలలో కొనసాగడం తధ్యం. అయితే ఆలాగని నిత్యం మీడియా ముందుకు వచ్చి మాట్లాడబోను. చేతిలో ఉన్న కొన్ని సినిమాలు పూర్తి చేసిన వెంటనే పార్టీ నిర్మాణం, దాని కార్యక్రమాలు వంటి విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తాను.”   “చంద్రబాబు, నరేంద్ర మోడీ ఇరువురూ కూడా మంచి సమర్ధులు, కార్యదక్షత గలవారే. అందువల్ల వారి నేతృత్వంలో దేశం, రాష్ట్రం రెండూ త్వరితగతిన అభివృద్ధి చెందుతాయని ఆశిస్తున్నాను. వారిరువురూ నాకు చాలా చనువు ఇచ్చేరు కదా అని వారి వ్యవహారాలలో నేను జోక్యం చేసుకోదలచుకోలేదు. అయితే ఎల్లపుడు వారికి అందుబాటులో ఉంటాను. జనసేన ఎన్డీయే కూటమితో కలిసి పనిచేస్తూన్నపటికీ, వాటి లోపాలను ఎత్తి చూపిస్తూ ప్రజల తరపున పోరాడుతుంది,” అని పవన్ కళ్యాణ్ అన్నారు. .

టీ-కాంగ్రెస్ నేతలకు సోనియా, రాహుల్ క్లాస్

  ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో దేశంలో అన్ని ప్రాంతాల నుండి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోవడంతో, ఇంతవరకు సోనియా, రాహుల్ గాంధీల భజనలో తరిస్తున్న కాంగ్రెస్ నేతలు సైతం ఆ ఓటమికి వారిరువురే కారణమని అనే సాహసం చేయగలుగుతున్నారు. మరి కొందరు కాంగ్రెస్ నేతలు వారిరువుని వేలెత్తి చూపే సాహసం చేయలేక వారి కోటరీలో ఉన్న దిగ్విజయ్, జైరామ్, షిండే, షకీల్ అహ్మద్ వంటివారు సోనియా, రాహుల్ గాంధీ లను తప్పు ద్రోవ పట్టించారని పరోక్షంగా ఆ తల్లి కొడుకులకి కూడా చురకలు వేస్తున్నారు. అయితే వారు కూడా అంతే దీటుగా బదులిస్తున్నారు. స్థానికంగా పట్టులేని నేతల చేతకానితనం వలననే పార్టీ ఓడిపోయిందని ప్రతివిమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతవరకు తమకు వీరవిధేయులుగా మెలిగిన కాంగ్రెస్ నేతలె ఇప్పుడు తమను వేలెత్తి చూపుతూ ఆరోపణలు చేయడం సోనియా, రాహుల్ గాంధీలకు ఓటమికంటే కూడా ఎక్కువ అవమానకరంగా ఉంది.   ఈ అవమానకర పరిస్థుల నుండి ఏవిధంగా గట్టెక్కాలో తెలియక తల్లికొడుకులు సతమత మవుతుంటే, సరిగ్గా అదే సమయంలో, తెలంగాణాలో పార్టీని మట్టి కరిపించిన టీ-కాంగ్రెస్ నేతలు మధు యాష్కీ, పొన్నాల ప్రభాకర్, రాజయ్య, వివేక్, సురేశ్ షెట్కార్, గుత్తా సుఖేందర్ రెడ్డి, నరేశ్ జాదవ్ తదితరులు వారిని కలిసి ఓటమికి గల కారణాలను వివరించి క్షమాపణలు కోరేందుకు రావడంతో తల్లికొడుకులు తమ కోపం అంతా వారిపై చూపించారు. తెలంగాణా ఇస్తే చాలు 15యంపీ, 100 అసెంబ్లీ సీట్లు అవలీలగా సాధిస్తామని తమను నమ్మించి తెలంగాణా ఇప్పించిన టీ-కాంగ్రెస్ నేతలు ఎన్నికలలో ఎందుకు ఓడిపోయారని నిలదీశారు. వారిని గుడ్డిగా నమ్మినందుకు పార్టీ రెండు రాష్ట్రాలలో కూడా తీవ్రంగా నష్టపోయిందని సోనియా, రాహుల్ గాంధీలు ఆరోపించారు. వారెవరికీ క్షేత్రస్థాయిలో పట్టులేని కారణంగానే గెలవలేకపోయారని రాహుల్ నిందించారు.   అందుకు టీ-కాంగ్రెస్ నేతలు బదులిస్తూ మోడీ, పవన్ కళ్యాణ్ ప్రభావం, టీ-కాంగ్రెస్ ని ముందుండి నడిపించగల సరయిన నాయకుడు లేకపోవడం, పార్టీలో సమన్వయ లోపం, అభ్యర్ధుల ఎంపికలో జైరామ్ రమేష్, కొప్పుల రాజు జోక్యం చేసుకోవడం వంటి అనేక కారణాల వలన తాము ఓడిపోయామని, అందుకు చాలా బాధపడుతున్నామని సోనియా, రాహుల్ గాంధీల ముందు మొరపెట్టుకొన్నారు. అయితే ఇక ఇప్పుడు చేసేదేమేమీ లేదు కనుక, ఇక నుండి అయినా టీ-కాంగ్రెస్ నేతలందరూ కష్టపడి పనిచేసి మళ్ళీ పార్టీని బలోపేతం చేయాలని సోనియాగాంధీ టీ-కాంగ్రెస్ నేతలను గట్టిగా హెచ్చరించి పంపారు.

పురందేశ్వరికి మోడీ మంత్రివర్గంలో చోటు దక్కేనా?

  మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నికలకు ముందు బీజేపీలోకి మారి రాజంపేట నుండి పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ ఆమెకు మళ్ళీ కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె గతంలో యూపీయే ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేసి తన సమర్దతను నిరూపించుకొని అందరిచేత ప్రశంశలు అందుకొన్న ఆమెకు నరేంద్ర మోడీ తన మంత్రివర్గంలో ఆమెకు కూడా స్థానం కల్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆమె ఇదివరకు నిర్వహించిన మానవ వనరుల శాఖనే మళ్ళీ ఆమెకు కేటాయించవచ్చును. కానీ ఆమెను మంత్రి వర్గంలో చేర్చుకోదలిస్తే, ఆరు నెలల్లోగా ఆమెను రాజ్యసభకు ఎంపిక చేయవలసి ఉంటుంది. ఇది పెద్ద అవరోధం కాకపోయినప్పటికీ, ఇదే ఆమెకు ప్రతిబంధకంగా మారే అవకాశం ఉంది.   విశాఖ నుండి పోటీచేసి గెలిచిన బీజేపీ సీమాంధ్ర అధ్యక్షుడు కంబంపాటి హరిబాబు, రాజ్యసభ సభ్యుడు వెంకయ్య నాయుడు తదితరులు అనేకమంది కేంద్రమంత్రి పదవి రేసులో ఉండటం కూడా ఆమెకు మరో ప్రతిబందకం కానుంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలలో ఆమె కోరుకొన్న చోటు నుండి లోక్ సభ టికెట్ దక్కకుండా అడ్డుపడి ఆమె విజయావకాశాలకు గండికొట్టిన చంద్రబాబు, మరి ఇప్పుడు కూడా ఆమెకు మంత్రిపదవి దక్కకుండా అడ్డుపడినా ఆశ్చర్యం లేదు. పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీ నుండి విజయావకాశాలున్న బీజేపీలోకి మారినప్పటికీ ఎన్నికలలో ఓడిపోవడంతో ఆమెకు ఎదురీత తప్పడంలేదు. ఈ అవరోధాలన్నిటినీ అధిగమించి ఆమె మోడీ మంత్రివర్గంలో చోటు సంపాదించుకోగలరా లేదా అనేది త్వరలో తేలిపోతుంది.

అందుకే కాంగ్రెస్ ఓడిపోయిందట

  కాంగ్రెస్ అధిష్టానం సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలను ఖాతరు చేయకుండా రాష్ట్ర విభజన వ్యవహారంలో మొండిగా ముందుకు పయనించాలనుకొన్నపుడే, కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలు నిశ్చయించుకొన్నారు. అంటే సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందే దాని ఓటమి ఖరారు అయిపోయింది. ఆ విషయం కాంగ్రెస్ అధిష్టానానికి చాలా స్పష్టంగా తెలిసిఉన్నప్పటికీ, జగన్, కేసీఆర్ ల భరోసా చూసుకొని ఎన్నికలకు వెళ్లి భంగపడింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా సీమాంద్రాలో ఉవ్వెత్తున ఉద్యమాలు జరుగుతున్నపుడయినా అది మేల్కొని ఉండి ఉంటే, కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోర పరాజయం చవిచూసేదే కాదు.   రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ పార్టీ సీమాంద్రాలో ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడంతో కనీసం రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టే అర్హత కూడా కోల్పోయింది. పదేళ్ళు రాష్ట్రాన్నిఏకఛత్రాదిపత్యంగా పరిపాలించిన కాంగ్రెస్ నేతలకు ఇది ఘోర అవమానమే. కాంగ్రెస్ అధిష్టానం తన ప్రత్యర్ధుల కోసం తవ్విన గోతుల్లో తనే పడింది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొన్నట్లు, ఇప్పుడు డిల్లీ నుండి గల్లీ వరకు గల కాంగ్రెస్ నేతలందరూ కూడా తమ పార్టీ ఓటమికి గల కారణాలు స్పష్టంగా కళ్ళెదుట కనబడుతున్నపటికీ, తమకు ఇబ్బంది కలిగించని కొత్త కారణాలను కనుగొనేందుకు నడుం బిగించారు.   సీమాంద్రాకు సంబంధించినంత వరకు రాష్ట్ర విభజన వ్యవహరమే కాంగ్రెస్ కొంప ముంచిన సంగతి అందరికీ తెలుసు. అయితే దానిని బహిరంగంగా ఒప్పుకోవడానికి నేటికీ వారు సిద్దంగా లేరు. అందుకే తమ ఓటమికి మరో కొత్త కారణం కనిపెట్టారు. ఎక్కడో హైదరాబాదులో పార్టీ ప్రధాన కార్యాలయం ఉండటం వలన సీమాంధ్ర ప్రజలకు దూరమయ్యామని, అందుకే ఎన్నికలలో ఓడిపోయామని కొందరు కాంగ్రెస్ నేతలు ఒక కొత్త కారణం కనుగొన్నారు.   ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా వారితో ఏకీభవిస్తూ, త్వరలో కొత్త రాజధానికి స్థలం గుర్తించగానే అక్కడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకొంటామని తెలిపారు. అయితే ఇంత కాలంగా హైదరాబాదులో పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో విజయం సాధిస్తూనే ఉందనే సంగతి వారు విస్మరించారు.   రాష్ట్ర విభజన, కాంగ్రెస్ అసమర్ధ అవినీతి పాలన కారణంగానే ప్రజలు పార్టీని తిరస్కరించారనే సంగతి కాంగ్రెస్ నేతలందరికీ బాగా తెలిసి ఉన్నప్పటికీ, పార్టీ కార్యాలయం హైదరాబాదులో ఉన్నందునే ఎన్నికలలో ఓడిపోయామని చెప్పుకోవడం ఆత్మవంచన చేసుకోవడమే. కాంగ్రెస్ నేతలు కనీసం ఇప్పటికయినా దైర్యంగా ఆత్మవిమర్శ చేసుకొని, లోపాలను సరిదిద్దుకోకుండా ఇటువంటి కుంటి సాకులతో పొద్దుపుచ్చడం చూస్తే వీరిక ఈ జన్మలో మారరని అర్ధమవుతుంది.

రాజకీయాలకి చిరంజీవి గుడ్ బై?

      మాజీ మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ప్రస్థానం ముగిసే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సినీ హీరోగా వున్నప్పుడు ఎన్నో గౌరవాలు అందుకున్న ఆయన ఏ ముహూర్తాన ప్రజారాజ్యం పార్టీని పెట్టి రాజకీయాలలోకి వచ్చారోగానీ అప్పటి నుంచి ఆయన ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. ప్రజాదరణ లేని తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవి సంపాదించుకున్నప్పుడు ఆయన ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు.   కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా పనిచేస్తారని ఆయనకి ఓట్లేసిన జనం ఆయన తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో బిత్తపోయారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన అంశంలో చిరంజీవి వ్యవహరించిన తీరు సీమాంధ్రులకు బాగా బాధని కలిగించింది. ఆ తర్వాత తాజా ఎన్నికలలో చిరంజీవి సీమాంధ్రలో ఎంత గొంతు చించుకుని అరిచినా ఎంతమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అవడానికి చిరంజీవి కూడా ఒక కారణం కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నాయి. ప్రజల చేతిలో ఘోర పరాభావాన్ని పొందిన చిరంజీవి ఎన్నికల ఫలితాల తర్వాత బయట కనిపించడం మానేశారు. దీంతోపాటు ప్రస్తుతం మాజీమంత్రిగా మిగిలిపోయిన చిరంజీవికి  అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో రాజకీయంగా బలం జీరోగా మిగిలింది. మరో మూడు సంవత్సరాలు రాజ్యసభ సభ్యత్వం మినహా ఆయనకు మిగిలిందేమీ లేకుండా పోయింది. రాష్ట్ర రాజకీయాలలో చిరంజీవికి ఇక ఎంతమాత్రం సీన్ లేదని గ్రహించిన కాంగ్రెస్ అధిష్ఠానం ఆయన్ని దూరంగా పెట్టినట్టు తెలుస్తోంది. సోనియాగాంధీని కలవటానికి చిరంజీవి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయనకు అపాయింట్‌మెంట్ దక్కలేదని సమాచారం. దీన్నిబట్టి కాంగ్రెస్ పార్టీకి, ఆయనకి సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్టేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ చెయ్యి పట్టుకుని బీజేపీ పంచలోకి చేరితే బాగుంటుందన్న ఆలోచన చిరంజీవికి వచ్చినప్పటికీ, బీజేపీలో ఆయన మీద ఎవరికీ ఇంట్రస్ట్ లేకపోవడంతో ఇక రాజకీయాల నుంచి తప్పుకుని ప్రశాంతంగా వుండటం మంచిదన్న ఆలోచనలో చిరంజీవి వున్నట్టు సమాచారం. అదే జరిగితే తెలుగు సినిమా ప్రేక్షకులు త్వరలో చిరంజీవి 150వ సినిమా చూడటం ఖాయం.

అదిరిందయ్యా టీడీపీ అశోక్ గజపతీ.. కేంద్ర కేబినెట్‌లో జాక్‌పాట్

  విజయనగరం టీడీపీ ఎంపీగా గెలిచిన అశోకగజపతిరాజుకు కేంద్ర కేబినెట్‌లో స్థానం లభించే అవకాశాలు వుండటంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన్ని అదిరిందయ్యా అశోక్ గజపతీ.. మోడీ కేబినెట్‌లో అవకాశం సంపాదించావని అభినందిస్తున్నారు. ఈనెల 26న ప్రమాణ స్వీకారం చేయబోతున్న నరేంద్రమోడీ కేబినెట్‌లో అశోక్ గజపతి రాజు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలిసింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్‌లో చేరుతామని టీడీపీ చీప్ చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఆ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయో అన్న అంశంపై రాజకీయ వర్గాలలో సర్వత్రా చర్చ సాగింది. టీడీపీకి మొత్తం 13 మంది ఎంపీలు ఉండగా, వీరిలో ఒకరికి కేబినెట్ ర్యాంకు ఇవ్వనున్నారు. మరో రెండు సహాయ మంత్రులను అప్పగించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. మోడీ మంత్రివర్గంలో కేబినెట్ హోదా దక్కించుకోనున్న వారిలో ప్రధానంగా టీడీపీ సీనియర్ నేత అశోక గజపతి రాజు ముందు వరుసలో ఉన్నారు.

మోడీకి కేజ్రీవాల్ తో సవతి పోరు తప్పదా?

  ఒకప్పుడు అత్యంత ప్రజాదరణతో డిల్లీ పీటం అధిష్టించిన అరవింద్ కేజ్రీవాల్,దేశంలో ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థకు శ్రీకారం చుట్టి, పారదర్శకమయిన, ప్రజారంజకమయిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని దేశ ప్రజలందరూ ఆశపడ్డారు. కానీ అధికారం చేప్పట్టిన 49 రోజులలోనే ప్రభుత్వం నడపలేక చేతులెత్తేసి పదవి నుండి దిగిపోవడంతో డిల్లీ ప్రజలు తీవ్ర నిరాశ చెందారు. ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకే ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలలో ఆమాద్మీ పార్టీ డిల్లీలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.   కానీ కేజ్రీవాల్ కి అప్పటికీ జ్ఞానోదయం కాలేదు. డిల్లీ శాసనసభకు మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తే, ఈసారి ఖచ్చితంగా బీజేపీయే గెలిచే అవకాశం ఉంటుంది గనుక, అందుకు ఇష్టపడని కాంగ్రెస్ పార్టీ విధిలేని పరిస్థితుల్లో తనకే మద్దతు ఇస్తుందనే ధీమాతో ఆయన డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ని కలిసి డిల్లీ అసెంబ్లీని రద్దు చేయవద్దని, తాను మళ్ళీ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తానని చెప్పివచ్చారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ కి ఇదివరకు ఒకసారి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి తలబొప్పి కట్టింది. అందువల్ల ఆయనకు మళ్ళీ మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.   ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్, బీజేపీ, ఆమాద్మీ పార్టీలలో దేనికీ కూడా పూర్తి మెజార్టీ లేదు. వాటిలో ఏ ఒక్కరు కూడా తమంతట తాముగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితిలోలేవు. కానీ అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ అధికారం చెప్పట్టేందుకు ప్రదర్శిస్తున్న ఈ అత్యుత్సాహం చూసి బీజేపీ కూడా అప్రమత్తమయినట్లుంది.   నరేంద్ర మోడీ మరో నాలుగు రోజుల తరువాత అంటే ఈనెల26 దేశప్రధానిగా బాధ్యతలు చేపడతారు. అయితే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే తన కలలను కల్లలు చేసిన నరేంద్ర మోడీ మీద పగ తీర్చుకొనేందుకు సోనియా గాంధీ ఆమాద్మీ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సిద్దపడినట్లయితే, అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ డిల్లీ ముఖ్యమంత్రి అయ్యి మోడీకి పక్కలో బల్లెంలా తయారవడం ఖాయం. ఒకవేళ అదే జరిగితే మరో నాలుగేళ్ల పాటు మోడీకి ఈ సవతిపోరు తప్పదు.   బహుశః అందుకే బీజేపీ కేజ్రీవాల్ పై పరువు నష్టం దావాలు వేసి కోర్టులు చుట్టూ తిప్పుతోందని భావించవచ్చును. కేజ్రీవాల్ ని బిజీగా ఉంచగలిగితే, నరేంద్ర మోడీ బాధ్యతలు చెప్పట్టగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్రపతిని కలిసి ప్రస్తుతం సుషుప్తావస్థలో ఉన్న డిల్లీ రాష్ట్ర అసెంబ్లీని రద్దుచేయమని అభ్యర్దించవచ్చును. విశేష ప్రజాధారణతో అఖండ మెజార్టీతో ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోడీ అభ్యర్ధనను రాష్ట్రపతి కూడా తిరస్కరించక పోవచ్చును. ఆయన డిల్లీ అసెంబ్లీని రద్దు చేసినట్లయితే, మళ్ళీ త్వరలోనే ఎన్నికలు కూడా జరుగుతాయి. కనుక అరవింద్ కేజ్రీవాల్ ని మరో నాలుగయిదు రోజులు అడ్డుకోగలిగితే బీజేపీకి గండం గడిచినట్లే.

ఎరక్కపోయివెళ్ళాడు.. ఇరుక్కుపోయాడు...

      వైసీపీ నాయకులు వైఎస్ జగన్ ఇప్పుడు ఇంట్లో కూర్చుని ‘ఎరక్కపోయి వెళ్ళాను.. ఇరుక్కపోయాను’ అని పాటలు పాడుకుంటున్నాడు. ఇంతకీ జగన్ వెళ్ళింది ఎక్కడికి? ఇంకెక్కడికి? ఢిల్లీకి.. నరేంద్రమోడీ దగ్గరకి! ఎన్నికల ప్రచారంలో కేంద్రంలో ఏ ఎల్లయ్య, పుల్లయ్య అధికారంలోకి వచ్చినా మన దగ్గరకి మద్దతు కోసం రావాల్సిందే అని ప్రగల్భాలు పలికిన జగన్ కేంద్రంలో మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తూ వుండటం, ఆంధ్రప్రదేశ్‌లో తన వైసీపీ చతికిలపడటంతో బిత్తరపోయాడు.   అంతలోనే తమాయించుకుని చేత్తో బొకే పట్టుకుని, ఎనిమిది మంది ఎంపీలను వెంట పెట్టుకుని ఢిల్లీకి వెళ్ళాడు. అక్కడకి వెళ్ళి మోడీకి బొకే ఇచ్చి, షేక్ హ్యాండ్ ఇచ్చి వస్తే సరిపోయేది. మోడీ గవర్నమెంట్‌కి అంశాలవారీ మద్దతు ఇస్తానని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. జగన్ ఏదో తెలియక అలా చెప్పాడులే అని బీజేపీ నాయకత్వం విని ఊరుకోలేదు. మీ సపోర్టు మాకు అక్కర్లేదని వెంటనే చెప్పేసింది. దాంతో గతుక్కుమనడం జగన్ వంతయింది. మొత్తమ్మీద ఈ ఇష్యూలో జాతీయ స్థాయిలో జగన్ పరువు ఏదైనా వుంటే అదంతా తుడిచిపెట్టుకునిపోయింది. అంతేకాకుండా జగన్ తన మీద వున్న కేసుల నుంచి తప్పించుకోవాలనికే మోడీని కలిశాడన్న విషయం అందరికీ స్పష్టంగా అర్థమైపోయింది. జగన్‌ని మోడీ పట్టించుకోలేదు కాబట్టి త్వరలో జగన్ అరెస్టు కావడం ఖాయమన్న అభిప్రాయాలు కూడా దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. టోటల్‌గా ఇప్పుడు జగన్ అనవసరంగా ఢిల్లీవెళ్ళి వివాదాల్లో ఇరుక్కుపోయానే అని జగన్ అంతర్మథనం చెందుతున్నట్టు తెలుస్తోంది.

చిరంజీవి మళ్ళీ సినిమాల్లోకి, పవన్ రాజకీయాల్లోకి...

  కేంద్రమంత్రిగా, సోనియాగాంధీకి అంతరంగికుడిగా, కాంగ్రెస్ పార్టీ ప్రచారకమిటీ చైర్మన్ గా ఒకవెలుగువెలిగిన చిరంజీవి పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడిన ఎలుకలా తయారయింది. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో కూడా ఓడిపోవడంతో ఇక చేసేదేమీ లేక ఆయన మళ్ళీ సినిమాలలో నటించాలని ఆలోచిస్తున్నట్లు తాజా సమాచారం. ఆయన తన 150 చిత్రం గురించి చాలా కాలంగా అభిమానులను ఊరిస్తున్నారు. ఇప్పుడు ఎలాగూ ఇక ఖాళీయే గనుక ముందు ఆ సినిమాను పూర్తిచేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఐదేళ్ళు సినిమాలలో నటిస్తూ ప్రజలను మళ్ళీ ఆకట్టుకొనగలిగితే, వచ్చే ఎన్నికల సమయానికి అదేమయినా ఉపయోగపడవచ్చును కూడా.   ఇక ఇంతవరకు సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న పవన్ కళ్యాణ్, ఈ ఐదేళ్ళలో తన జనసేన పార్టీని నిర్మించుకొని గ్రామస్థాయి నుండి బలోపేతం చేసుకోవాలని యోచిస్తున్నారు. జనసేన పార్టీ ఈ ఎన్నికలలో పోటీ చేయనప్పటికీ, రెండు రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిన పార్టీలు సక్రమంగా పనిచేయకపోతే వాటిపై ప్రజల తరపున పోరాడుతానని కూడా పవన్ చాలా సార్లు చెప్పారు. అందుకోసం ఇకపై తాను సినిమాలు తగ్గించుకొని, రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి పెడతానని ఆయన చెప్పారు. ఈవిధంగా అన్న రాజకీయాల నుండి తప్పుకొని సినిమాలలోకి వస్తుంటే, తమ్ముడు సినిమాల నుండి తప్పుకొని రాజకీయాలలోకి వచ్చేందుకు సిద్దం అవడం చాలా ఆసక్తికరంగా ఉంది.   గత ఐదేళ్ళుగా చిరంజీవి రాజకీయాలలో ఉన్నప్పటికీ ఇంతవరకు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకోలేకపోయారు. కానీ తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం, ఎన్నికలలో పోటీ చేయనప్పటికీ, రాజకీయాలలో ప్రవేశించిన రెండు మూడు నెలలలోపునే, రాష్ట్ర రాజకీయాలలో తనదయిన ముద్రవేసి దేశానికి ప్రధాని కాబోతున్న నరేంద్ర మోడీ మనసు చూరగొని ఎన్డీయే సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించబడ్డారు.   పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమలోనే కాక రాజకీయాలలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, గౌరవం సంపాదించుకోవడానికి ప్రధాన కారణం ఆయనలో ఉన్న నిజాయితే. అన్న చిరంజీవి పదవుల కోసం కోట్లాది తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని సోనియా గాంధీ కాళ్ళ ముందు పెట్టి ఒక సగటు రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తే, తమ్ముడు పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచి వారి శ్రేయస్సు కోసం పదవులను కాదనుకొని పోరాడుతున్నారు. పవన్ కళ్యాణ్ మాటలలో, వ్యవహారంలో కొట్టవచ్చినట్లు కనబడుతున్న ఆ నిజాయితీయే ప్రజలను, చివరికి మోడీని కూడా ఆకర్షించింది.   రాజకీయనాయకులలో అరుదుగా కనబడే నిబద్దత, ప్రజలకు మంచి చేయాలనే తపన పవన్ కళ్యాణ్ లో పుష్కలంగా ఉన్నాయి గనుక ఇకనయినా తప్పటడుగులు వేయకుండా ముందుకు సాగినట్లయితే, ఆయన చెపుతున్నట్లు వచ్చే ఎన్నికల నాటికి బలమయిన రాజకీయ నాయకుడిగా ఎదగవచ్చును.

అత్తమీద కోపం దుత్తమీద చూపించిన అఖిలేష్

  ఎవరిమీద కోపాన్నో వేరెవరిమీదో చూపిస్తే అత్తమీద కోపాన్ని దుత్తమీద చూపించారని అంటారు. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చేసిన పని కచ్చితంగా ఇలాంటిదే. ఈ ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీతోపాటు అధికార సమాజ్‌వాది పార్టీ కూడా గల్లంతు అయిపోయింది. ఉత్తర ప్రదేశ్ మొత్తంలో సోనియా, రాహుల్ తప్ప మిగతా పార్లమెంట్ స్థానాలన్నీ బీజేపీయే గెలుచుకుంది. ఎస్పీ అభ్యర్థులందరూ డిపాజిట్లు గల్లంతైపోయి అడ్రస్ లేకుండా పోయారు. అయితే సమాజ్ వాది పార్టీ అధికారంలో వున్నప్పటికీ ఒక్క ఎంపీ స్థానం కూడా గెలుచుకోకపోవడానికి మోడీ హవాతోపాటు మరో కారణం కూడా వుంది. సమాజ్ వాది పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ మహిళల గురించి దారుణంగా చేసిన వ్యాఖ్యలు కూడా ఈ పార్టీ ఓటమికి కారణమయ్యాయి. ఈ విషయాన్ని తెలిసి కూడా తెలియనట్టుగా యుపి ముఖ్యమంత్రి అఖిలేష్ వ్యవహరిస్తున్నాడు. తమను ఘోరంగా ఓడించిన మోడీమీద వున్న కోపాన్ని తన మంత్రివర్గ సహచరుల మీద చూపించాడు. తనతో కలసి 43 మంది మంత్రివర్గ సభ్యులున్నారు. వీరిలో 36 మందిని పదవుల నుంచి తొలగిస్తూ అఖిలేష్ తీసుకున్న నిర్ణయం దేశ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. ఇంతమంది మంత్రులను తీసేయడం కంటే, బీహార్‌లో నితీష్ కుమార్‌లా మీరు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేయొచ్చు కదా అని ప్రశ్నిస్తే, నేను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అఖిలేష్ కూల్‌గా సమాధానం చెప్పాడు.

గంటా రాజకీయాలు టీడీపీలో వర్కవుట్ అవుతాయా?

  పార్టీలు మారడంలో స్పెషలిస్టు అయిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరి భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో టీడీపీలో వున్న సమయంలో, ఆ తర్వాత ప్రజారాజ్యంలోకి మారినప్పుడు, మళ్ళీ కాంగ్రెస్ పంచలో చేరినప్పుడు గంటా తనదైన శైలిలో రాజకీయాలు ప్రదర్శిస్తూ పదవులు పొందుతూ వచ్చారు. ఇప్పుడు కూడా అలా ఎమ్మె్ల్యేగా ఎన్నికయ్యారో లేదో ఇలా రాజకీయాలు మొదలుపెట్టారు. ఇప్పటికే విశాఖ జిల్లాలో సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడితో గంటాకి ఎంతమాత్రం పడటం లేదని వినికిడి. జిల్లానుంచి అయ్యన్న పాత్రుడిని కాదని తనకే పదవి ఇవ్వాలన్న ఉద్దేశంతో గంటా వుండటంతో అయ్యన్నకు, గంటాకు మధ్య అంతరం పెరిగినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా గంటా ఇచ్చిన స్టేట్ మెంట్ రాజకీయాల్లో గంటా ఏ స్థాయిలో ముదిరిపోయారో అర్థమవుతోంది. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో వున్న గంటాకి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు కూడా బాగా ఒంటబట్టినట్టు తెలుస్తోంది. సీమాంధ్రలో చంద్రబాబు మంత్రి వర్గంలో తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే చేస్తాడంట.. లేకపోతే సామాన్య కార్యకర్తగా మిగిలిపోతాడట. ఈరకంగా గంటా చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేస్తున్నాడన్న అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో వ్యవహరించినట్టుగా క్రమశిక్షణ లేకుండా తెలుగుదేశం పార్టీలో వ్యవహరిస్తే కుదరదన్న విషయం గంటా మరచిపోయినట్టున్నాడని అంటున్నారు. ఇలా వ్యవహరిస్తే గంటా తోక చంద్రబాబు కట్ చేయడం ఖాయమని భావిస్తున్నారు.

మీ రాజీడ్రామాలు ఆపండెహె...

  నరేంద్ర మోడీ చేతిలో తుక్కుతుక్కుగా ఓడిపోయినప్పటికీ పలువరు రాజకీయ నాయకులు కుళ్లు అండ్ చద్ది రాజకీయాలు చేయడం మానుకోవడం లేదు. ఎప్పుడో కాలం చెల్లిన రాజకీయ ట్రిక్కులు ప్రదర్శిస్తూనే వున్నారు. ఇంత ఔట్ డేటెడ్‌గా వున్నారు కాబట్టే మోడీ వీళ్ళందరికీ జెల్ల కొట్టి కేంద్రంలో బీజేపీ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే, మోడీ ఘన విజయం సాధించగానే చాలా పార్టీలకి, వారి నాయకులకు కళ్ళు తిరిగిపోయాయి. అసలేం జరిగిందో కూడా అర్థంకానంత షాక్‌కి గురయ్యారు. మెల్లగా తేరుకున్న తర్వాత వాళ్ళ టైపు ఓల్డు మార్కు రాజకీయాలు ఆడటం ప్రారంభించారు. ఆ ఆటలో ప్రధాన అంశం రాజీడ్రామా. తాము ఈ ఎన్నికలలో తుక్కుతుక్కుగా ఓడిపోయామని తెలుసుకున్న వెంటనే ప్రెస్ మీట్ పెట్టిన సోనియా, రాహుల్ చిరునవ్వులు చిందిస్తూ ఓటమిని అంగీకరిస్తున్నామని చిలక పలుకులు పలికారు. ఆ మర్నాడు ఇద్దరూ రాజీనామాలు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. హమ్మయ్య దేశానికి పట్టిన దరిద్రం మరికాస్త వదలబోతోందని ఆనందిస్తూ వుండగానే, కాంగ్రెస్ పార్టీ అలాంటిదేమీ లేదు, వీళ్ళిద్దరూ రాజీనామా చేయబోవడం లేదని వివరణ ఇచ్చింది. అలాగే ఇలాంటి మరో పెద్దమనిషి నితిష్ కుమార్ భరద్వాజ్. బీహార్ ముఖ్యమంత్రి అయిన ఈయనగారికి మోడీ ఇచ్చిన షాక్‌తో కళ్ళు గింగిరాలు తిరిగాయి. దాంతో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించేశాడు. జేడీయూ వర్గాలు నువ్వు తప్ప మరొకడు బీహార్ని ఏలలేడంటూ నితిష్ గడ్డం పట్టుకుని బతిమాలడంతో ఆయన మనసు మార్చుకునే యోచనలో వున్నాడట. అలాగే తమిళనాడులో డీఎంకే పార్టీ కోశాధికారి స్టాలిన్ కూడా ఇలాంటి రాజీడ్రామానే ఆడాడు. జయలలిత చేతిలో దారుణ ఓటమి గురి కావడంతో హర్టయిపోయిన ఆయన తన పార్టీ పదవికి రాజీనామా చేసేశాడు. ఇంతలో పార్టీ కార్యకర్తలందరూ ఆయన కాళ్ళమీద పడి బతిమాలుకునేసరికి కరిగిపోయి రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. రాజకీయ నాయకులు ఇలాంటి రాజీనామా డ్రామాలు ఇంకా ఎంతకాలం ఆడతారో ఏంటో.