మళ్లీ హస్తినకు రేవంత్!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు మేరకు ఆయన హడావుడిగా హస్తిన పర్యటనకు వెళ్లినట్లు సమాచారం. ఈ పర్యటనలో ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు పలువురు పార్టీ పెద్దలతో భేటీ కానున్నారు. ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణ, తెలంగాణ ప్రదేశ్ కార్యవర్గ కూర్పు, నామినేటెడ్ పోస్టల భర్తీ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. సుదీర్ఘ కాలంగా తెలంగాణ కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశాలు పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ అంశాలపై ఇప్పటికే పలుమార్లు హస్తిన వెళ్లి రేవంత్ అధిష్ఠానంతో చర్చించిన సంగతి తెలిసిందే. ప్రతి సారీ రేవంత్ హస్తిన పర్యటనకు వెళ్లడం, ఆశావహులు ఇహనో ఇప్పుడో కేబినెట్ విస్తరణ, కార్పొరేషన్ పదవుల భర్తీ ఖాయమని భావించడం ఆ తరువాత అంతా మామూలే అన్నట్లు మారడం జరుగుతూనే వస్తున్నది. అయిననూ పోయి రావలె హస్తినకు అన్నట్లుగా రేవంత్ తరచూ ఢిల్లీ వెళ్లి అధిష్ఠానం పెద్దలతో భేటీ అవుతూనే ఉన్నారు.  ఇప్పుడు తాజాగా రేవంత్ పర్యటన మాత్రం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ మార్పు నేపథ్యంలో ఇక రాష్ట్ర కాంగ్రెస్ లో నామినేటెడ్ పోస్టుల భర్తీ, కేబినెట్ విస్తరణలతో పాటు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ కూర్పు విషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

మాధవీలత ఫిర్యాదు.. జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ లో కేసు

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి తనను కించపరచారంటూ సినీ నటి మాధవి లత చేసిన ఫిర్యాదుపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.  రాజకీయ నాయకురాలిగా మారిన సినీ నటి మాధవీలత బీజేపీలో ఉన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా జేసీ ప్రభాకరరెడ్డి ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం నేపథ్యంలో మాధవీలత, జేపీ ప్రభాకరరెడ్డిలపై మాటల యుద్ధం నడిచింది. ఆ సందర్భంగా జేపీ ప్రభాకరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.  తాడిపత్రిలో మహిళల కోసం న్యూ ఇయర్ రోజున జేసీ పార్క్ లో సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు. అయితే, జేసీ పార్క్ కు మహిళలు వెళ్లొద్దని, అక్కడి అరాచక శక్తుల వల్ల మహిళలకు అపాయం కలిగొచ్చని మాధవీలత వ్యాఖ్యానించారు. దాంతో జేసీ భగ్గుమన్నారు. మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో జేపీ ఆ తరువాత క్షమాపణ కూడా చెప్పారు. 

నిలిచిపోయిన అమరావతి పనులు.. కారణమేంటో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులు నిలిచిపోయాయి. టెండర్ల ప్రక్రియకు బ్రేక్ పడింది. ముందుగా నిర్ణయించిన మేరకు అమరావతి పనులకు టెండర్లు పిలవాల్సి ఉన్నా, సీఆర్డీయే అధికారులు దానికి బ్రేక్ వేశారు.  అయితే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అధికారులు ఈఆ ప్రక్రియను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం మాత్రమే అమరావతి పనులకు టెండర్లు పిలిచి, పనులను పరుగులెత్తించాలని అధికారులు నిర్ణియించారు. ఎన్నికల కోడ్ కు అమరావతి పనులకు సంబంధం లేదని చెబుతూ వచ్చిన అధికారులు,  ఈ విషయంలో ఎన్నికల కమిషన్ నుంచి క్లారిటీ తీసుకుందామని కూడా ఒక దశలో భావించారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో పనులను చేపట్టడం సరికాదని భావించిన ప్రభుత్వం కోడ్ ముగిసిన తరువాతే ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించడంతో టెండర్ల ప్రక్రియను సీఆర్డీఏ నిలిపివేసింది.    రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయి. టెండర్లను ఆహ్వానించి వెంటనే పనులు ప్రారంభించాలని ప్రభుత్వం కూడా నిర్ణయించింది.  ఇందుకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. సరిగ్గా ఈ తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.  దీంతో ఎన్నికల కోడ్ ముగిసే వరకూ పనులను నిలిపివేయాలనీ, టెండర్ల ప్రక్రియను కూడా ఎన్నికల కోడ్ ముగిసిన తరువాతనే ఆరంభించాలని నిర్ణయించింది.  

బిజెపికి ఎమ్మెల్యే రాజాసింగ్  గుడ్ బై?

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిల్చిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో మారు వార్తల్లోకెక్కారు. ఈ సారి ఆయన ఏకంగా పార్టీ అధిష్టాపంపై తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. క్రమశిక్షణకు మారు పేరుగా నిల్చిన బిజెపిలో తిరుగు బాటు జెండా ఎగరడం చర్చనీయాంశమైంది.  రాజాసింగ్ పరిస్థితి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల బిజెపి  జిల్లా అధ్యక్షుల నియామకం జరిగింది. తొలుత 19 మంది జిల్లా అధ్యక్షులను,  తాజాగా గురువారం నలుగురు జిల్లా అధ్యక్షులను పార్టీ అధిష్టానం నియామకం చేసింది. ఈ నలుగురి పేర్లలో తాను సూచించిన గోల్కొండ అధ్యక్షుడి పేరు లేకపోవడమే వివాదానికి కేంద్రబిందువయ్యింది. గోల్కొడ బిజెపి అధ్యక్షుడు ఉమా మహేశ్ పేరును అధిష్టానం ప్రకటించడాన్ని రాజాసింగ్ కు మింగుడు పడలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా తన పేరు ప్రకటించిన సమయంలో ఉమా మహేశ్ సహకరించలేదు. ఇది రాజాసింగ్ ఆరోపణ. కాంగ్రెస్ , ఎంఐఎం పార్టీలతో ఉమా మహేశ్ కుమ్ముక్కయినట్లు రాజాసింగ్ అంటున్నారు. తాను సూచించిన పేరు కాకుండా ఉమా మహేశ్ పేరు పదిరోజుల క్రితమే పార్టీ అధిష్టనానం ప్రకటించింది. అప్పట్లో రాజాసింగ్ వ్యతిరేకించడంతో పార్టీ అధిష్టానం గోల్కొండ జిల్లాను పెండింగ్ లో పెట్టింది. తాజాగా ప్రకటించిన జిల్లా అధ్యక్షుల పేర్లలో గోల్కొండ జిల్లా అధ్యక్షుడుగా ఉమా మహేశ్ పేరును అధిష్టానం  మరో మారు ప్రకటించింది. దీంతో రాజాసింగ్  తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఆడియో ఒకటి విడుదల చేశారు.  నా అవసరం లేదంటే పార్టీ నుంచి నన్ను వెళ్లిపోమంటే వెళ్లిపోతానని ధిక్కారస్వరం వినిపించారు.  ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.   ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో రాజాసింగ్  2009లో రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. టిడిపి కార్పోరేటర్ గా ఆయన మంగళ్ హాట్ డివిజన్ నుంచి తన రాజకీయ జీవితం ప్రారంభించారు. 2014లో ఆయన బిజెపి అభ్యర్థిగా గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. రెండో సారి కూడా ఆయన అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. హిందుత్వ వాదాన్ని బలంగా వినిపించడంతో ఆయన పేరు ప్రఖ్యాతులు దేశ వ్యాప్తంగా ఉన్నాయి. హిందుత్వ వాదాన్ని బలపరిచే పార్టీలతో బాటు వివిధ సంస్థల ద్వారా తన వాదాన్ని బలంగా వినిపించేవారు ఆయన. మహమ్మద్ ప్రవక్త మీద వివాదాస్పదవ్యాఖ్యలతో బిజెపి ఆయన్ను సస్పెండ్ చేసింది. దాదాపు రెండేళ్లు ఆయన సస్పెండ్ అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి బిజెపి అభ్యర్థిగా ఆయన పేరు ప్రకటించకపోవచ్చని ప్రచారం జరిగింది. చివరిక్షణంలో ఆయన పేరును ప్రకటించింది. ప్రస్తుత కేంద్రమంత్రి బండి సంజయ్ జోక్యంతో ఆయనపై ఉన్న సస్పెన్షన్ వేటును బిజెపి ఎత్తేసింది.మూడోసారి బిజెపి టిక్కెట్ దక్కించుకున్నారు రాజాసింగ్. బిజెపి నుంచి మూడోసారి గెలిచి హట్రిక్ సాధించిన ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. అయినప్పటికీ బిజెపి ఆయనకు పెద్ద పీట వేయలేదు. హైద్రాబాద్ లోకసభ నుంచి పోటీ చేయలనుకున్న రాజాసింగ్ కు ఆదిలోనే హంసపాదుపడింది. రాజాసింగ్ గెలిస్తే కేంద్ర మంత్రి పదవి వరిస్తుందని కొందరు వ్యతిరేకించారు. అప్పటివరకు బిజెపి సభ్యత్వం కూడా లేని మాధవిలత పేరును  అధిష్టానం ప్రకటించింది. పార్టీలో మగాళ్లే దొరకలేదా అని రాజాసింగ్ ధిక్కారస్వరం వినిపించారు. మాధవిలత ఎన్నికల ప్రచారానికి కూడా రాజాసింగ్ దూరంగా ఉన్నారు.  హిందుత్వ వాదిగా ముద్ర ఉన్న రాజా సింగ్ హైద్రాబాద్ నుంచి గెలిచిన ఏకైక బిజెపి ఎమ్మెల్యే. ప్రతీ బహిరంగ సభలో ముస్లింలను దూషించడంతో ఆయనకు వివాదాలు చుట్టుముట్టాయి. ఫేస్ బుక్ అకౌంట్లు సీజ్ అయ్యాయి. ముస్లిం తీవ్రవాద సంస్థల హిట్ లిస్ట్ లో ఉన్నారు. ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా ఆయనకు అనేక సార్లు అరెస్ట్ వారెంట్లు పట్టుకుని హైద్రాబాద్ వచ్చేవారు. అక్కడి కోర్టుల్లో రాజాసింగ్ విచారణ ఎదుర్కొనేవారు. ఫైర్ బ్రాండ్ గా పేరున్న రాజాసింగ్ కు స్వంత పార్టీలో పరాభవం చెందడం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.  రాజాసింగ్ మాతృసంస్థ టిడిపిలో చేరవచ్చని ప్రచారం జరుగుతోంది. 

14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కు వల్లభనేని వంశీ

విజయవాడ కోర్టు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో పోలీసులు వంశీని విజయవాడ జిల్లా కోర్టుకు తరలించారు.  గన్నవరంలోని తెలుగుదేశం కార్యాలయం ధ్వంసం కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో వంశీని గురువారం ఉదయం హైదరాబాద్ లో అరెస్టు చేసి విజయవాడకు తరలించిన సంగతి తెలిసిందే. వి జయవాడలో వంశీని దాదాపు ఎనిమిది గంటల పాటు విచారించిన పోలీసులు ఆ తరువాత ఆయనకు వైద్య పరీక్షలు చేయించి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు వల్లభనేని వంశీకి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కాగా కోర్టులో వల్లభనేని వంశీ తరఫుర పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు వినిపించారు. గురువారం అర్ధరాత్రి దాటే వరకూ కూడా కోర్టులో వాదనలు జరిగాయి. అనంతరం న్యాయమూర్తి వంశీకి జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించారు.  ఇలా ఉండగా వంశీ  సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి, చంపేస్తానని బెదరించారనీ, దీంతో ప్రాణ భయంతో సత్యవర్ధన్ ఆయన చెప్పినట్లు తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో తన ఫిర్యాదును ఉప సంహరించుకున్నారనీ పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.   

కర్నూలు హైకోర్టు బెంచ్‌ వద్దంటూ పిటిషన్.. ఎవరిపనో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కుళ్లు రాజకీయాలు అంతం లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి పొడగిట్టదన్నట్లుగా ఆ పార్టీ తీరు ఉంది. అధికారంలో ఉన్న ఐదేళ్లూ రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాలే లేకుండా చేసిన జగన్ సర్కార్.. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత కూడా అడుగడుగునా అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తోంది.  అధికారంలో ఉన్న సమయంలో అమరావతిని నిర్వీర్యం చేసి, మూడు రాజధానుల నాటకానికి తెరలేపిన వైసీపీ కర్నూలును న్యాయరాజధాని చేస్తామంటూ హడావుడి చేసింది. కానీ ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు కూడా వేయలేదు. అమరావతి నిర్మాణం పూర్తయితే తెలుగుదేశంకు ఆ క్రెడిట్ దక్కేస్తుందన్న దుగ్ధతోనే అలా వ్యవహరించిందనడంలో సందేహం లేదు.  సరే ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సర్కార్ జగన్ హయాంలో జరిగిన విధ్వంసాలను ఒక్కటొక్కటిగా సరిదిద్దుతూ రాష్ట్రాన్ని గాడిలో పెడుతోంది. రాయలసీమ వాసుల చిరకాల వాంఛ అయిన కర్నూలులో హైకోర్టు బెంచ్ దిశగా చకచకా అడుగులు వేస్తోంది.   కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకి అందుబాటులో ఉన్న భవనాల వివరాలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇప్పటికే అందజేసింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ మరో నాలుగైదు నెలలలో సాకారం అవుతుందని అంతా భావిస్తున్న తరుణంలో  కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలకు వైసీపీ తెరతీసింది. అమరాతి ఏపీ ఏకైక రాజధాని అని హైకోర్టు ధర్మాసనం తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే అధికారం లేదంటూ ఇద్దరు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ వేశారు. కర్నాలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియను నిలిపివేయాలని ఆ పిటిషన్ లో కోరారు.    తాండవ యోగేష్, తురాగా సాయిసూర్య అనే ఇద్లరు న్యాయవాదులు వేసిన ఆ పిటిషన్ వెనుక ఉన్నది వైసీపీయే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రం మొత్తం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటును స్వాగతిస్తున్నది. రాయలసీమ వాసులు తమ చిరకాల ఆకాంక్ష సాకారమౌతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ దశలో ఆ ప్రక్రియను నిలిపివేయాలంటూ పిటిసన్ దాఖలు కావడంతో సర్వత్రా వైసీపీ కుళ్లు రాజకీయాల పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పిటిషన్ వెనుక ఉన్న ఉద్దేశంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. తమ హయాంలో న్యాయరాజధానిగా కర్నూలు అంటూ ఊదరగొట్టి ఆ దిశగా ఒక్క అడుగుకూడా వేయని వైసీపీ, ఇప్పుడు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటైతే తెలుగుదేశం సర్కార్ కు క్రెడిట్ దక్కుతుందనీ, రాయల సీమలో తమ ప్రతిష్ట దిగజారిపోతుందన్న భయంతోనే ఆ ప్రక్రయిను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోందని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. తమకు దక్కని క్రెడిట్ తెలుగుదేశంకు దక్కడానికి వీల్లేదన్నట్లుగా వైసీపీ తీరు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్  విచారణను హైకోర్టు రెండు వారాలు వాయిదా వేసింది. ఈ పిటిషన్ ద్వారా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వేగంగా వేస్తున్న అడుగులకు బ్రేక్ వేయాలన్నదే వైసీపీ ఉద్దేశంగా కనిపిస్తోంది. 

జగన్ పార్టీ ముద్దు.. జగనే వద్దు!

ఏపీసీసీ మాజీ చీఫ్ శైలజానాథ్ కాంగ్రెస్ ను వీడి వైసీపీ గూటికి చేరి ఆరు రోజులయ్యిందో లేదో.. జగన్ కు బిగ్ షాక్ ఇచ్చారు. వైసీపీ పగ్గాలు విజయమ్మకు అప్పగించాలంటూ జగన్ గాలి తీసేశారు. తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై పోరాడేందుకే తాను వైసీపీలో చేరానని చెప్పిన శైలజానాథ్, ఆ లక్ష్యం నెరవేరాలంటే వైసీపీ పగ్గాలు జగన్ చేతిలో కాదు విజయమ్మ చేతిలో ఉండాలని అన్నారు. తాను వైఎస్సార్ కు వీరాభిమానినని చెప్పుకున్న ఆయన.. జగన్ భావాలు, ఆలోచనలు తన ఆలోచనలకు దగ్గరగా ఉన్నందునే తాను కాంగ్రెస్ ను వీడి వైసీపీలో చేరానన్నారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ పగ్గాలను జగన్ నుంచి విజయమ్మ తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.  శైలజానాథ్ కాంగ్రెస్ ను వీడి వైసీపీ గూటికి చేరి కేవలం ఆరు రోజులే అయ్యింది. ఇంతలోనే ఆయన జగన్ నాయకత్వంపై అపనమ్మకాన్ని, అయిష్టతను వ్యక్తం చేసి విజయమ్మకు పార్టీ పగ్గాలు అప్పగించాలని అనడం వైసీపీలో సంచలనం సృష్టించింది. జగన్ సీటు కింద శైలజానాథ్ బాంబు పెట్టారన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తం అవుతోంది.   పార్టీ పగ్గాలు విజయమ్మకు అప్పగిస్తే   పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వైసీపీలో చేరతారన్న సంకేతాలను శైలజానాథ్ తన వ్యాఖ్యల ద్వారా ఇచ్చారు.  వైఎస్సార్ కు రాష్ట్రంలో అసంఖ్యాక అభిమానులు ఉన్నారనీ, వారంతా కూడా ఆయన కుటుంబంలో ఆస్తుల తగాదా పట్ల తీవ్ర ఆవేదనతో ఉన్నారని చెప్పిన శైలజానాథ్.. వైఎస్సార్ కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాల పట్ల విచారం వ్యక్తం చేశారు.  అదే సమయంలో విజయమ్మకు పార్టీ పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ తో జగన్ కు బిగ్ షాక్ ఇచ్చారు. వైసీపీ ఓకే కానీ జగన్ నాయకత్వం మాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పకనే చెప్పారు. అది కూడా విజయమ్మ  తన కుమారుడు, కోడలు అబద్ధాలు చెబుతున్నారంటూ బహిరంగంగా చెప్పిన రెండు రోజులకే పార్టీ నాయకత్వం విజయమ్మకు ఇస్తేనే వైపీపీ బలోపేతం అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. సరస్వతి పవర్ వాటాల విషయంలో జగన్, భారతి అబద్ధాలు చెప్పారని విజయమ్మ కుండబద్దలు కొట్టిన తరుణంలో శైలజానాథ్ వైసీపీ పగ్గాలను విజయమ్మకు అప్పగించాలడం సంచలనం సృష్టించింది. శైలజానాథ్ వ్యాఖ్యల పట్ల వైసీపీలో కూడా సానుకూలత వ్యక్తం అవుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద  కోరి తెచ్చుకున్న శైలజానాథ్ జగన్ సీటుకే ఎసరు పెట్టారన్న టాక్ రాజకీయవర్గాల్లో నడుస్తోంది.  

వల్లభనేని వంశీ అరెస్టు ఓకే.. కొడాలి నాని వంతెప్పుడు?

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని అరెస్టు వార్త గురువారం (ఫిబ్రవరి 13) ఉదయమే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన ముందస్తు బెయిలు కోర్టులో పెండింగ్ లో ఉండగా ఎలా అరెస్టయ్యారన్న అనుమానాలు వ్యక్తమైనా, గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో కాకుండా మరో కేసులో వల్లభనేని వంశీ అరెస్టయ్యాడని తెలియడంతో ఆ కేసేమిటా అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అయ్యింది. అనుమానాలన్నీ వల్లభనేని అరెస్టు వార్త వాస్తవం కాదేమోనన్న సంశయంతోనే తప్ప ఆయన అరెస్టుకు నిరసనగా కాదని, ఆ తరువాత ఆయన అరెస్టుపై జనస్పందన చూసిన తరువాత అర్ధమైంది. ఇంతకీ వల్లభనేని వంశీ  గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి జరిగిందంటూ ఫిర్యాదు చేసిన తెలుగుదేశం కార్యాలయంలో డీటీపీ ఆపరేటర్ గా పని చేసిన సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో పోలీసులు వంశీని హైదరాబాద్ లో అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసిన వల్లభనేని వంశీ, ఆ కేసు వెనక్కు తీసుకోవాలని బెదరించారన్నది పోలీసుల అభియోగం. ఈ విషయంలో  వల్లభనేని వంశీ అడ్డంగా దొరికిపోయాడు. దాడి కేసులో ఫిర్యాదు ఉపసంహరణకు సత్యవర్ధన్ ను వంశీ స్వయంగా కారులో తీసుకువచ్చిన ఫుటేజీలు ఉన్నాయి. దీంతో క్షణం ఆలస్యం చేయకుండా పోలీసులు వంశీని అరెస్టు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక ప్రశ్న వినిపిస్తోంది. వల్లభనేని వంశీ అరెస్టు సరే.. మరి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని వంతు ఎప్పుడన్నదే ఆ ప్రశ్న. ఈ ప్రశ్న ఉత్పన్నం కావడానికి కారణం ఉంది.  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఈ ఇరువురికీ ఓ ప్రత్యేకత ఉంది. ఇద్దరూ మంత్రి మిత్రులు. ఇద్దరి రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైంది. అంతకు ముందు ఇద్దరూ తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతలు.  కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ కు మంచి మిత్రులు. ఇద్దరూ కూడా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో పని చేశారు. కొడాలి నాని గుడివాడ నియోజకవర్గం నుంచి 2004లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. వల్లభనేని వంశీ 2009లో విజయవాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో  పరాజయం పాలయ్యారు.  కొడాలి నాని మాత్రం 2009లో కూడా గుడివాడ నుంచే పోటీలో నిలిచి తెలుగుదేశం తరఫున విజయం సాధించారు.  ఆ తరువాత రాష్ట్ర విభజన జరిగింది.  2014 ఎన్నికలు వచ్చే సరికి కొడాలి నాని తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ గూటికి చేరారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా గుడివాడ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. వంశీ మాత్రం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. 2014 ఎన్నికలలో గన్నవరం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.  2019 ఎన్నికలో కూడా అదే జరిగింది. కొడాలి నాని గుడివాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. గన్నవరం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా వల్లభనేని వంశి గెలుపొందారు. ఇరువురూ పార్టీలు వేరైనా మంచి మిత్రులుగా కొనసాగారు.  2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలై.. రాష్ట్రంలో వైసీపీ అధికార పగ్గాలు చేపట్టింది. దీంతో వల్లభనేని వంశి జగన్ కు మద్దతు తెలుపుతూ  వైసీపీ గూటికి చేరారు. కొడాలి నాని జగన్ తొలి కేబినెట్ లో  మంత్రి పదవి దక్కించుకున్నారు.   అప్పటి వరకు వేరే పార్టీలో ఉంటున్నా.. కొనసాగిన వంశీ, నానిల స్నేహబంధం, వంశీ తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరడంతో మరింత గట్టి పడింది. వాస్తవానికి కొడాలి నాని ప్రభావంతోనే వంశీ వైసీపీ గూటికి చేరారు.  ఆ తరువాత వల్లభనేని వంశీ, కొడాలి నాని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ టార్గెట్ గా ఇష్టారీతిగా విమర్శలు వ్యాఖ్యలూ చేస్తూ పెట్రేగి పోయారు. లోకేష్ పై అయితే ఆయన వ్యక్తత్వ హననమే లక్ష్యమన్నట్లుగా విమర్శలు, వ్యాఖ్యలూ చేశారు.  అక్కడితో ఆగకుండా చంద్రబాబు భువనేశ్వరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు.   ఆ తరువాత 2024 ఎన్నికలో వైసీపీ ఘోరంగా ఓడిపోయి అధికారాన్ని కోల్పోయింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబుబు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచీ విరిద్దరినీ అరెస్టు చేయాలి అన్న డిమాండ్ తెలుగుదేశం వర్గాల నుంచే కాకుండా, వీరి దాష్టికాల కారణంగా బాధితులుగా మారిన ప్రజల నుంచి కూడా గట్టిగా వినిపించింది. అయినా గత ఎనిమిది నెలలుగా అదిగో, ఇదిగో అనడం తప్ప వీరి అరెస్టు జరగలేదు. ఒక దశలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేతకాని తనం వల్లనే కొడాలి నాని, వల్లభనేని వంశీ స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని తెలుగుదేశం శ్రేణుల నుంచే విమర్శలు వినవచ్చాయి.  తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిద్దరి మీద కేసులు తెరపైకి తెచ్చారు.  అయితే అరెస్టు మాత్రం చేయలేదు. ఈ నేపథ్యంలోనే వల్లభనేని అరెస్టు పట్ల తెలుగుదేశం వర్గాలలోనే కాకుండా గన్నవరం నియోజకవర్గ ప్రజలలో కూడా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో వల్లభనేని వంశీ అరెస్టు సరు.. కొడాలి నాని వంతెప్పుడు అన్న ప్రశ్నలూ వినవస్తున్నాయి. 

మోహన్ బాబుకు సుప్రీంలో భారీ ఊరట

నటుడు మోహన్ బాబుకి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయన సుప్రీం కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. తెలుగు సినీ పరిశ్రమతో ఐదు దశాబ్దాల అనుబంధం ఉన్న మోహన్ బాబు ఈ ఐదు దశాబ్దాలలో పలు విజయవంతమైన చిత్రాలలో నటించారు. పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఒక దశలో వరుస హిట్ చిత్రాలతో అలరించిన మోహన్ బాబును పరిశ్రమ కలెక్షన్ కింగ్ గా   పేర్కొంది. విలక్షణమైన డైలాగ్ డెలివరీతో మోహన్ బాబు ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు.  పెద్దాయన నందమూరి తారక రామారావు తర్వాత ఆ స్థాయిలో డైలాగ్ చెప్పగల నటుడు మోహన్ బాబు మాత్రమే అని  దర్శకరత్న దాసరి నారాయణరావు అంతటి వ్యక్తి చెప్పాడంటే మోహన్ బాబు స్టామినాని అర్ధం చేసుకోవచ్చు.  అయితే ఇటీవలి కాలంలో ఆయన తరచూ వివాదాలలో ఇరుక్కుంటున్నారు. సొంత కుటుంబ గొడవలు రచ్చకెక్కడంతో ఆయన ఇబ్బందుల్లో పడ్డారు. కొన్ని రోజుల కిందట హైదరాబాద్ శివారులోని జల్లేపల్లిలోని మోహన్ బాబు నివాసంలో ఆయన రెండో కుమారుడు మనోజ్ తో గొడవపడ్డారు. ఆ సమయంలో కవరేజ్ కి వెళ్లిన మీడియాపై మోహన్ బాబు దురుసుగా ప్రవర్తించారు.ఆ సందర్భంగా మోహన్ బాబు ఒక జర్నలిస్టుపై దాడి చేసి గాయపరిచారు. దీనిపై మోహన్ బాబుపై కేసు నమోదైంది. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరుతూ మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఆయన యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో మోహన్ బాబు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ఆయనకు ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ గురువారం (ఫిబ్రవరి 13) ఉత్తర్వులు జారీ చేసింది.   

చికెన్ ప్రియులకు వైద్యుల హెచ్చరిక!

తెలుగు రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి వేగం ప్రజలను వణికించేస్తున్నది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అందులోనూ ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి తీవ్రాతి తీవ్రంగా ఉంది. బర్డ్ ఫ్లూ కేవలం కోళ్లు, పక్షులకే కాకుండా మనుషులకూ వ్యాపిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో  ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో వైద్యులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒక హెచ్చరిక చేశారు. బర్డ్ ఫ్లూ ఉధృతి తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడేంత వరకూ చికెన్ కు దూరంగా ఉండాలన్నదే ఆ హెచ్చరిక సారాంశం. బర్డ్ ఫ్లూ కోళ్లకే కాదు, మననుషులకూ ప్రమాదకారేనని పేర్కొన్నారు. అలాగే బర్డ్ ఫ్లూ అనేది కేవలం ఫారం కోళ్లకే పరిమితం అన్నది అపప్రద మాత్రమేననీ, ఇది నాటుకోళ్లకూ సోకుందని పేర్కొన్నారు. కనుక కొంత కాలం పాటు చికెన్, గుడ్లకు దూరంగా ఉండటం మంచిదని హెచ్చరించారు. బర్డ్ ఫ్లూ సోకిన పక్షులను తాకడం, చంపడం, బర్డ్ ఫ్లూ సోకిన పక్షుల మాంసం తినడం ద్వారా ఈ వైరస్ మనుషులకూ సోకే ప్రమాదం ఉంది. బర్డ్ ఫ్లూ సోకిన మనుషులలో  కండరాల నొప్పి, దగ్గు, ఊపిరి ఆడకపోవడం, తలనొప్పి, కడుపు నొప్పి, అతిసారం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్ సోకిన 3-5 రోజులలో  లక్షణాలు బయటపడతాయి. దీని నివారణకు ప్రత్యేకంగా వ్యాక్సిన్ ఏమీ లేదు.  ఇప్పటికే ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. 

ఏపీలో కాంగ్రెస్ ఖాళీ.. జగన్ వ్యూహం అదేనా?

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. గత ఎన్నికలకు ముందు వైఎస్సార్ కుమార్తె షర్మిలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడం ద్వారా వైసీపీని దెబ్బకొట్టేందుకు ఆ పార్టీ పన్నిన వ్యూహం పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అదే వ్యూహాన్ని రివర్స్ లో అమలు చేస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా తనకు బద్ధ విరోధిగా మారిన షర్మిలను దెబ్బకొట్టడంతో పాటు.. రాష్ట్రంలో వైసీపీని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ కు ఖాళీ చేసే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.  ఔను.. గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ పరిస్థితి అప్పటి నుంచీ కూడా జారుడుబండమీద నిలబడినట్లుగానే ఉంది. ఆ పార్టీ నేతలు ఒక్కరొక్కరుగా ఇతర పార్టీలకు వెళ్లిపోతున్నారు. మరి కొందరు రాజకీయ సన్యాసం ప్రకటిస్తున్నారు. ఆ పార్టీ నుంచి వలసల ఉధృతి చూస్తుంటే.. సమీప భవిష్యత్ లో ఆ పార్టీ అడ్రస్ గల్లంతవ్వడం ఖాయమన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీని నిలబెట్టడం, అలాగే షర్మిల దూకుడుకు బ్రేకులు వేయడం కోసం జగన్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారని పరిశీలకులు అంటున్నారు. అందులో భాగంగానే.. వైసీపీని వీడే వాళ్ల గురించి పట్టించుకోకుండా, బయట నుంచి నేతలను పార్టీలోకి తీసుకుంటున్నారు.అలా వచ్చేందుకు రాష్ట్ర విభజన తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ లో నామమాత్రంగా మిగిలిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు రెడీగా ఉన్నారు.  గత ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టారు. దాంతో రాష్ట్రంలో కాంగ్రెస్ కొంత మేర పుంజుకున్న పరిస్థితి కనిపించింది. అయితే ఎన్నికల ఫలితాల తరువాత మళ్లీ రాష్ట్ర కాంగ్రెస్ లో నిరాశ, నైరాశ్యం, నిస్ఫృహలు అలముకున్నాయి. ఈ పరిస్థితుల్లోనే గతంలో రాష్ట్ర కాంగ్రెస్ లో  చక్రం తిప్పిన సీనియర్ నేతలు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పేరుకు కాంగ్రెస్ లో ఉన్నా వారు పార్టీ కార్యక్రమాలలో పాలుపంచుకోవడం లేదు సరికదా.. కనీసం పార్టీ కార్యాలయంవైపు కూడా కన్నెత్తి చూడటంలేదు. అలాంటి వారిపై జగన్ దృష్టి పెట్టారు. వైసీపీలోకి వస్తే వారి సీనియారిటీకి తగిన ప్రాధాన్యత కల్పిస్తానని హామీ ఇస్తూ వారిని ఫ్యాన్ గూటికి ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగానే తొలుత ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సాకె శైలజానాథ్ ను వైసీపీలో చేర్చుకున్నారు.  ఇప్పుడిక ఆయన కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహించేందుకు రంగం సిద్ధం చేశారని రాజకీయవర్గాలలో టాక్ నడుస్తోంది. వైసీపీలోకి చేరనున్న కాంగ్రెస్ సీనియర్ల జాబితాలో కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వంటి వారు ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది. అలాగే మాజీ ఎంపీ హర్షవర్థన్ ను కూడా జగన్ వైసీపీలోకి ఆహ్వానించారని చెబుతున్నారు. సీనియర్ల చేరికతో వైసీపీలో కొత్త ఊపు వస్తుందని జగన్ భావిస్తున్నారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. అయితే గత ఐదేళ్ల జగన్ పాలనపై జనంలో ఏ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమయ్యిందో చూసిన తరువాత కాంగ్రెస్ సీనియర్లు ఆయన పంచన చేరే అవకాశాలు అంతంత మాత్రమేనని పరిశీలకులు అంటున్నారు. అయినా కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు వైఎస్ కుమార్తె చేతిలో ఉన్నందున వైఎస్ ను నిజంగా అభిమానించే నేతలెవరూ కాంగ్రెస్ ను వీడి వైసీపీ గూటికి చేరే అవకాశాలు లేవని అంటున్నారు.  

అత్యుత్తమ సిఎంల జాబితాలో   చంద్రబాబు

మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో చంద్రబాబు నాలుగో స్థానంలో  ఉన్నారు.గత ఏడాది ఆగస్టులో ఆయన ఐదో స్థానంలో ఉన్నారు.  ప్రతీ ఆరునెలలకోసారి ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో చంద్రబాబు నాలుగో స్థానానికి చేరుకోవడం సంచలనమైంది.  ఎపిలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఈ ఆరు నెలల్లో తన స్థానాన్ని ఆయన  మెరుగుపర్చుకున్నారు. ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా రాష్ట్రాన్ని గాడినా పెట్టడంలో   చంద్రబాబు  సఫలీ కృతులయ్యారు. అంతే కాదు  పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్లు, ఉచిత సిలిండర్ వంటి పథకాలు అమలు చేయడంలో  చంద్రబాబు విజయం సాధించారు.  అత్యుత్తమ  సీఎంల జాబితాలో యోగి ఆదిత్యానాథ్ మొదటి స్థానంలో నిలిచారు.  ప్రపంచ అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక కుంభమేళా నిర్వహణ, ఏర్పాట్ల విషయంలో ఆయన ప్రజాదరణ చూరగొన్నారు.  

ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై హత్యాయత్నం 

చింతచచ్చినా పులుపు చావదు అన్నట్టు ఉంది వైకాపా పరిస్థితి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలకు పడిపోయినా  వైకాపాకు బుద్దిరాలేదు. టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై బుధవారం  అర్ధరాత్రి వైకాపా గూండాలు దాడి చేశారు. ఈ ఘటన తర్వాత దెందులూరు అట్టుడుకింది. తనపై ఏలూరులో వైకాపా గూండాలు దాడి చేశారని చింతమనేని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే చింతమనేని  ప్రభాకర్ ప్రయాణిస్తున్న కారును వైకాపా గూండాలు అటకాయించారు. ఎమ్మెల్యే గన్ మెన్ దగ్గర నుంచి గన్ లాక్కొనే ప్రయత్నం చేసినట్టు ప్రభాకర్  ఆరోపిస్తున్నారు. తనపై ఐరన్ రాడ్డుతో దాడి చేశారని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. 

మనుషుల్లోనూ వ్యాప్తి చెందుతున్న బర్డ్ ఫ్లూ..ఏలూరు జిల్లాలో ఒకరికి పాజిటివ్

ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి తీవ్ర రూపం దాల్చింది. కోళ్లు, పక్షులే కాకుండా మనుషులకు సైతం సోకుతోంది. బర్డ్ ఫ్లూ చాపకింద నీరులా అతి వేగంగా విస్తరిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలలో తీవ్ర భయందోళనలు వ్యక్తం అవుతున్నాయి.  ఏలూరు జిల్లాలో ఒక వ్యక్తికి బర్డ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో సర్వత్రా తీవ భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. బర్డ్ ఫ్లూ ఒక వ్యక్తికి కూడా సోకినట్లు నిర్ధారణ కావడంతో అధికారులు జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. బర్డ్ ఫ్లూ కు సంబంధించి సమాచార సేకరణ, మెడికల్ క్యాంపుల నిర్వహకణ వంటి చర్యలు ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ కేంద్రంగా జరుగుతాయి.  ఏలూరు జిల్లా పరిధిలో ఎక్కడ కోళ్లు చనిపోతున్నా 9966779943 నంబర్‌కు సమాచారాన్ని అందించాలని అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో కోళ్ల పెంపకానికి ప్రసిద్ధి చెందిన ఉంటుటూరు మండలంలోని వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్లు తేలింది. దీంతో ఆ ప్రాంతంలో  వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. బర్డ్‌ ఫ్లూ వ్యాధి సోకిన వారికి వైద్య చికిత్సలు అందించేంకు అసవరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు.