ycp candidate vote to tdp

వైసీపీ అభ్యర్థి మహా మంచి పొరపాటు!

ఏదో వాషింగ్ పౌడర్ ప్రకటనలో ‘మరక మంచిదే’ అంటూ వుంటారు. ఈ తరహాలోనే ఒక్కోసారి ‘పొరపాటు కూడా మంచిదే’ అనొచ్చు. అలాంటి మంచి పొరపాట్లు అరుదుగా జరుగుతాయి. లేటెస్టుగా అలాంటి మంచి పొరపాటు చేసే అవకాశం కావలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డికి వచ్చింది. ఎన్నికల సందర్భంగా హోరాహోరీగా ప్రచారం చేసిన ఆయన, పోలింగ్ రోజున తన ఓటు వేయడానికి వెళ్ళారు. ఓటు వేయడానికి వెళ్ళిన ఆయన చక్కగా ఓటేసి రావచ్చు కదా.. ఈయన అలా చేయకుండా పోలింగ్ బూత్‌ దగ్గర వున్న పోలింగ్ సిబ్బందికి బిల్డప్‌గా అభివాదం చేశారు. ఆ అభివాదాల గోలలో పడి,  ఈవీఎం మీద వున్న ఫ్యాన్ గుర్తు ముందువున్న బటన్ నొక్కకుండా, సైకిల్ గుర్తు ముందు వున్న బటన్ నొక్కేశారు. దాంతో ఈయన గారి ఓటు వైసీపీ ఎంపీ అభ్యర్థికి పడకుండా నెల్లూరు తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి పడింది. బటన్ నొక్కిన తర్వాత విషయాన్ని అర్థం చేసుకున్న ఆయన వెంటనే పోలింగ్ సిబ్బందికి ఏం జరిగిందో చెప్పారు. అప్పుడు పోలింగ్ సిబ్బంది ఇక చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి, తూర్పు తిరిగి దణ్ణం పెట్టి, ఇంటికి వెళ్ళి పెరుగన్నం తిని బబ్బోమని చెప్పారు. ఇలాంటి పొరపాటు చేశానేంట్రా దేవుడా అనుకుంటూ ప్రతాప్ రెడ్డి పోలింగ్ స్టేషన్ నుంచి బయటపడ్డారు. ఏది ఏమైనప్పటికీ, ప్రతాప్ రెడ్డి పొరపాటు చేసినప్పటికీ, టీడీపీకి ఓటు వేయడం మంచి పనేగా?

where is dbt money

ఎన్నికలైపోయాయి.. సొమ్ములు కరిగిపోయాయి.. బటన్ నొక్కిన డబ్బుల జాడేదీ?!

ముఖ్యమంత్రిగానే కాదు, ఆపద్ధమర్మ ముఖ్యమంత్రిగా కూడా జగన్ మోసాలు కొనసాగుతున్నాయి. సరిగ్గా ఎన్నికలకు రెండు రోజుల ముందు గతంలో బటన్ నొక్కేశాను, ఆ డబ్బులు ఇప్పుడు లబ్ధిదారుల ఖాతాలలో అర్జంటుగా జమ చేసేయండి అంటూ తనకు తైనాతీగా వ్యవహరిస్తున్న సీఎస్ ను ఆదేశించారు. దీంతో సీఎస్ జవహరర్ రెడ్డి తక్షణం ఆ పని చేయడానికి అవసరమైన ఏర్పాట్లన్నీచేసేశారు. రాష్ట్రంలోని బ్యాంకులను గత శనివారం (మే 11) రెండో శనివారమైనా సరే తెరిచి ఉంచాలని హుకుం జారీ చేశారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో సొమ్ము పంపిణీకి ఎన్నికల సంఘం క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ ఎన్నికల సంఘం కొర్రీ వేయడంతో సొమ్ముల పంపిణీ ఆగింది.   దీంతో లబ్ధిదారులమంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. బటన్ నొక్కి నెలలైనా సొమ్ములు పడకపోయినా ప్రశ్నించని ఈ లబ్ధిదారలు సరిగ్గా ఎన్నికలకు రెండు రోజుల ముందు ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లడం వెనుక ఉన్నదెవరో ఊహకి అందని విషయం కాదు. నాటకీయ పరిణామాల మధ్య గతంలో నొక్కిన బటన్లకు సంబంధించిన సొమ్మును పోలింగ్ పూర్తి అయిన మరునాడు మే 14న లబ్ధాదారుల ఖాతాలలో జమచేయాలని పేర్కొంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పోలింగ్ కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాలలో సొమ్ములు జమచేయడానికి ఎక్కడ లేని తొందరా ప్రదర్శించిన సర్కార్, మరీ ముఖ్యంగా సీఎస్.. పోలింగ్ ముగిసిన తరువాత మాత్రం ఆ ఊసే మరచిపోయినట్లు వ్యవహరిస్తున్నారు.  అన్ని వైపుల నుంచీ ఒత్తిడి పెరగడంతో  ఫీజు రీఎంబర్స్ మెంట్…  ఆసరా పథకం డబ్బులు  కొంత మేరకు మాత్రమే జమ చేశారు. కొంత మేర అంటే మొత్తం జమ చేయాల్సిన సొమ్ములలో ఓ పది శాతం విదిల్చినట్లుగా లబ్థిదారుల ఖాతాలలో జమ చేశారు. లబ్ధిదారులకు పంచాల్సిన సొమ్ములు అడ్డదారుల్లో అస్మదీయ కాంట్రాక్టర్లకు చెల్లింపులుగా మరళిపోయాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా ఎన్నికల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ములు జమ చేసి లబ్ధిపొందుదామని తహతహలాడిన జగన్ అది కుదరకపోయేసరికి లబ్ధిదారుల పట్ల ఆయన ‘నిజమైన ప్రేమ’ ప్రదర్శించారు. వారికి ఇవ్వాల్సిన సొమ్ములకు ఎగనామం పెట్టేసి అస్మదీయ కాంట్రాక్టర్లకు పందేరం చేశారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. 

modi on money seized by ed

మోడీకి ‘ఆశ కురుపులు’ వస్తాయేమో!

మనం చిన్నప్పుడు ఎవరికైనా ఏదైనా ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే ‘ఆశ కురుపులు’ వస్తాయని అనుకునేవాళ్ళం. అంటే, ఎవరికైనా ఏదైనా ఇస్తామని చెబితే కచ్చితంగా ఇచ్చేయాలి. లేకపోతే కంటి మీద  ఒక స్పెషల్ కురుపులు వస్తాయి. వాటిని ‘ఆశ కురుపులు’ అంటారు.  ఇప్పుడు ఇలాంటి ‘ఆశ కురుపులు’ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  2014 ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ స్విస్ బ్యాంకుల్లో ఇండియన్ల బ్లాక్ మనీ బోలెడంత వుందని, దాన్ని ఇండియాకి పట్టుకొస్తానని, అలా తెచ్చి, ప్రతి పేదవాడి అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తానని చెప్పారు. ఆ తర్వాత వెంటనే పేదలందరి పేరు మీద ‘జనధన్’ పేరుతో బ్యాంకు ఖాతాలు కూడా తెరిచారు. దాంతో పేదలందరూ మోడీకి ఓటేశారు. మోడీ తమ అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తారని ఆశగా ఎదురుచూశారు. పాపం మన దేశంలో జనం అంతేకదా.. ఎవరు ఏది ఇస్తామన్నా వద్దనరు.. ఆశలు పెంచుకుంటారు. ఎవరు ఏమిస్తారా.. తీసుకుందామా అని వెయ్యి కళ్ళతో, చాచిన చేతులతో ఎదురు చూస్తారు. అలా పదిహేను లక్షల కోసం ఆశలు పెట్టుకున్న జనం నిరాశకు గురయ్యారు. మోడీ స్విట్జర్లాండ్ నుంచి డబ్బు తెచ్చిందీ లేదు.. పేదల బ్యాంక్ అకౌంట్లలో వేసిందీ లేదు. అలాగే 2019 ఎన్నికలప్పుడు రైతు ఆదాయం రెట్టింపు చేస్తాననే హామీ ద్వారా రైతులకు అరచేతిలో స్వర్గం చూపించి, ఆ తర్వాత రైతులను భూమ్మీదే వుంచారు. ఇప్పుడు మరోసారి ఎన్నికలు వచ్చాయి. మోడీ గారు మరోసారి పేద జనాలకు సరికొత్త ఆశ పెడుతున్నారు. అవినీతి కేసుల విచారణ సందర్భంగా ఈడీ స్వాధీనం చేసుకున్న డబ్బు మొత్తాన్నీ పేదలకు పంచే అవకాశాలను అన్వేషిస్తున్నట్టు మోడీ చెబుతున్నారు. ‘‘కొందరు వ్యక్తులు అధికార బలంతో, తమ పదవులను దుర్వినియోగం చేసి పేదల సొమ్మును దోచుకున్నారు. ఆ డబ్బంతా పేదలకు చెందాలని కోరుకుంటున్నాను. ఈ డబ్బంతా పేదలకు పంచడం కోసం ఏంచేయాలనే విషయాన్ని పరిశీలించడానికి న్యాయబృందాన్ని ఇప్పటికే కోరాను. దీనికోసం చట్టాలను  మార్చడానికి కూడా వెనుకాడను’’ అని మోడీ అంటున్నారు. ఇలా పేదలకు ఆశల మీద ఆశలు పెడుతున్న మోడీ వాటిని ఈసారైనా నెరవేరుస్తారా? లేకపోతే ఆయనకు ‘ఆశ కురుపులు’ రావడం ఖాయం!

Jr. NTR who was rejected by the High Court in the land dispute

భూ వివాదంలో హైకోర్టు నాశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్ 

 ఒక భూమి కు సంబంధించిన వివాదంలో  జూనియర్ ఎన్టీఆర్ హై కోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 లో ఉన్న ప్లాట్ విషయంలో వివాదం నెలకొంది. 2003లో గీత లక్ష్మీ అనే మహిళ నుంచి ప్లాట్ కొనుగోలు చేశారు తారక్. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. అప్పటికే 1996 నుండి పలు బ్యాంకుల వద్ద ఇదే ప్రాపర్టీ మోర్ట్ గెజ్ ద్వారా  గీతలక్ష్మి కుటుంబం లోన్స్ తీసుకున్నారు. మూడు నాలుగు బ్యాంక్ ల నుంచి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టీ లోన్ తీసుకుంది గీత లక్ష్మీ. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు ఈ ప్రాపర్టీ అమ్మే సమయంలో విషయాన్ని గీత లక్ష్మి దాచిపెట్టింది. ఐదు బ్యాంకుల నుండి ఇదే డాక్యుమెంట్ మీద లోన్స్ తీసుకుంది గీత లక్ష్మి కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మార్ట్ గేజ్ లోన్ ఉన్నట్లు ఎన్టీఆర్ కు చెప్పిందట ఆ కిలాడి గీత లక్ష్మీ. చెన్నై లో ఒక బ్యాంక్ లో లోన్ క్లియర్ చేసి డాక్యుమెంట్ తీసుకున్నారు తారక్. 2003 నుండి ప్లాట్ ఒనర్ గా తారక్ ఉన్నారు. అప్పటినుండి పలు బ్యాంకు మేనేజర్లతో వివాదం కొనసాగుతుంది. ప్రాపర్టీ ను స్వాధీనం చేసుకునేందుకు బ్యాంక్ మేనేజర్లు ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఆ బ్యాంకు మేనేజర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు జూనియర్ ఎన్టీఆర్. 2019 లో ఇదే వ్యవహారంలో పోలీసులు ఛార్జి షీట్ దాఖలు చేశారు. అయితే  డిఆర్టి  లో జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది. దీంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జూనియర్ ఎన్టీఆర్. జూన్ 3 లోపు DRT డాకెట్ ఆర్డర్ సబ్మిట్ చేయమని హై కోర్టు ఆదేశించింది. జూన్ 6న విచారణ చేపడతామన్న హైకోర్టు తెలిపింది.

YCP in Frustration

 ఫ్రస్టేషన్ లో వైసీపీ...  ప్రకాశంలో ఓటరు  చెవి కోసేసిన వైనం 

సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని తేలిపోవడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఫ్రస్టేషన్ లో ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో వైసీపీ వరుస దాడులకు బరి తెగించింది. ఈసీ జోక్యం చేసుకుని ఆయా జిల్లాలకు చెందిన అధికారులను సస్పెండ్ చేయడం, బదిలీ చేయడం , వేటు వేయడం వంటి చర్యలు తీసుకొంటున్నప్పటికీ దున్నపోతు మీద  వర్షం పడ్డట్టు తయారయ్యింది.   ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. టీడీపీకి ఓటు వేశాడనే కోపంతో ఆ పార్టీ కార్యకర్త చెవిని వైసీపీ నేత కోసేశాడు. బాధితులు, స్థానికులు అందించిన సమాచారం మేరకు... పందువ గ్రామానికి చెందిన తిమోతి ఇటీవలే వైసీపీని వీడి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరాడు. ఎన్నికల సమయంలో బంధువులు, చుట్టుపక్కల వారికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు విషయాలను వివరించాడు. ఈ నేపథ్యంలో తిమోతిపై స్థానిక వైసీపీ నేత గురవయ్య అక్కసు పెంచుకున్నాడు. రోడ్డుపై వెళ్తున్న తిమోతిపై కొడవలితో దాడి చేశాడు. ఈ దాడిలో తిమోతి చెవి తెగిపోయింది. గాయపడిన తిమోతిని కనిగిరి ఆసుపత్రిలో చేర్పించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Drugs are once again in the capital

రాజధానిలో మరోసారి డ్రగ్స్ కలకలం

హైదరాబాద్ న‌గ‌రంలో మరోసారి డ్రగ్స్ ప‌ట్టుబ‌డ‌టం క‌ల‌క‌లం రేపింది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు నగరంలోని కూకట్‌పల్లి ప‌రిధిలోని శేషాద్రినగర్‌లో స్థానిక పోలీసులతో కలిసి ఎస్‌వోటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో అధికారులు 3 గ్రాములు ఎంఎంబీఏ మాదకద్రవ్యం స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం డ్ర‌గ్స్ విక్ర‌యిస్తున్న‌ రాజశేఖర్, శైలేష్‌ రెడ్డి అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.అలాగే తులసీనగర్‌లో జగద్గిరిగుట్ట పోలీసులతో కలిసి ఎస్‌వోఓటీ పోలీసులు సోదాలు నిర్వహించారు. రోహిత్‌, తిలక్‌ సింగ్‌ అనే ఇద్దరు నిందితుల వద్ద 45 గ్రాముల గంజాయితో పాటు 3 గ్రాముల ఎంఎండీఏ ప‌ట్టుబ‌డింది. దాంతో ఆ ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్న‌ పోలీసులు కేసు నమోదుచేసి విచారిస్తున్నారు.ఇటీవల కాలంలో హైదరాబాద్ డ్రగ్స్ విక్రయాలకు అడ్డాగా మారింది. మూడు నెలల క్రితం గసగసాల గడ్డితో తయా చేసిన గడ్డిని పోలీసులు పట్టుకున్నారు. ఈ గడ్డి సేవిస్తే మంచి కిక్ వస్తుందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా రెచ్చిపోతూనే ఉంది. చాపకింద నీరులా గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తూనే ఉన్నారు. తాజాగా నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం చర్చనీయాంశమైంది.  

netizens troll jagan comparing his injury with rentala women manjulareddy

జగన్.. గాయమంటే ఇదీ.. గులకరాయి దెబ్బ కాదు!

ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో రెండు ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలను చూపుతూ నెటిజనులు ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ ను చెడుగుడు ఆడేస్తున్నారు. ఇంతకీ ఆ ఫొటోలు ఏమిటంటే.. ఒక ఫొటో జగన్ మనమంతా సిద్ధం యాత్రలో గులకరాయి దాడిలో గాయపడి నుదుటిపై బ్యాండేజ్ తో ఉన్న ఫొటో. మరొకటి  ఏపీలో పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటాల గ్రామంలో తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్ అయిన మంజులారెడ్డి అనే  మహిళపై వైసీపీ మూకలు గొడ్డలితో దాడి చేసి నరికితే నుదుటిపై రక్తం గాయంతో కూడ నిర్భయంగా నిలబడిన ఫొటో. ఆమె అంతటి గాయంతోనూ ఆసుపత్రికి కాదు.. పోలింగ్ ఏజెంట్ ను పోలంగ్ బూత్ లోకే వెడతానని చెప్పింది. ఇప్పుడు ఈ రెండు ఫొటోలనూ, రెండు సంఘటనలనూ పోలుస్తూ  జగన్ పులివెందుల పులి కాదు పిల్లి అంటూ నెటిజనులు ఏకి పారేస్తున్నారు. గులకరాయి దాడిని హత్యాయత్నంగా అభివర్ణించి ఊరూ వాడా ఏకం చేసేయడమే కాకుండా  ఆసుపత్రికి వెళ్లి ఆ గాయానికి ఓ అరడజనుకు పైగా వైద్యుల బృందంతో చికిత్స చేయించుకుని, నుదుటిపై బ్యాండేజీ వేయించుకున్న జగన్ ఎక్కడ.. నుదుటిపై అంగుళం లోతు గాయంతో.. ముఖమంతా ధారగా కారిన రక్తంతో కూడా ధైర్యంగా పోలింగ్ బూత్ లోకి వెళ్లి తెలుగుదేశం ఏజెంట్ గా కూర్చున్న మంజులారెడ్డి ఎక్కడ? అంటూ పోస్టులు పెడుతున్నారు. జగన్ నుదుటిపై గాయమైతే ఒక్కటంటే ఒక్క రక్తం చుక్క కారిన దాఖలాలు లేవు. ఏక్కడో దూరం నుంచి గులకరాయితో దాడి చేస్తేనే హత్యాయత్నం అంటూ నానాయాగీ చేసిన జగన్, తనకు తగిలిన గాయానికి రోజుకో సైజులో ప్లాస్టర్ తో దర్శనమిస్తే.. మంజులారెడ్డి నుదుటిపై   అంగుళం మేర లోతు గాయంతో ధారగా కారుతున్న రక్తంతో , దెబ్బలతో వాచిపోయిన ముఖంతో చలించకుండా  ఆసుపత్రికి పరుగులు తీయకుండా  పోలింగ్ బూత్‌లోనే కూర్చుంది.  ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ మంజులారెడ్డి ధైర్యాన్ని ప్రస్తుతిస్తూ జగన్ పై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజనులు. 

one chip challange

అమెరికాలో ‘వన్ చిప్ ఛాలెంజ్’ మెంటల్!

మామూలుగా శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు వుంటాయి. కానీ, కొంతమంది అనంతకోటి దరిద్రాల కోసం శతకోటి ఉపాయాలను ఆలోచిస్తారు. ఈ జనరేషన్ యూత్ ఇలా ఆలోచించే వాళ్ళలో ముందుంటారు. ముఖ్యంగా అమెరికన్ యూత్ అయితే ఏ మెంటల్ పని చేయడానికైనా రెడీగా వుంటారు. అలా ఇప్పుడు అమెరికన్ కుర్రోళ్ళు చేస్తున్న ఒక మెంటల్ పని ‘వన్ చిప్ ఛాలెంజ్’. అసలేంటీ ‘వన్ చిప్ ఛాలెంజ్’. మన టీవీ షోలలో అప్పుడప్పుడు మిరపకాయలను తినే పోటీలు వుంటాయి చూశారా అలాంటి పోటీనే. కాకపోతే మిరపకాయల కంటే ఎన్నోరెట్లు ఎక్కువ ఘాటు వున్న చిప్ తినే పోటీ. పాఖీ అనే చిప్స్ తయారు చేసే సంస్థ అత్యంత ఘాటుగా వుండే పదార్థాలతో ఒక చిప్ తయారు చేస్తూ వుంటుంది. దాన్ని శవపేటిక ఆకారంలో వుంటే ఒక ప్యాక్‌లో వుంచుతుంది. ఈ సంస్థ అమెరికన్ యూత్‌కి ఒక ఛాలెంజ్ చేసింది. తమ చిప్‌ని తింటూ వీడియో చేయాలి. తమ చిప్ తిన్న తర్వాత నీళ్ళు తాగకుండా, పంచదార లాంటి ఏ పదార్థాలూ తినకుండా ఐదు క్షణాలు వుండగలగాలి. ఇదీ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నవాళ్ళని నోరు మండిపోవడం తప్ప వచ్చేదీ చచ్చేదీ ఏమీ వుండదు. అయినప్పటికీ అమెరికన్ వెర్రి యూత్ ఈ ఛాలెంజ్‌లో పార్టిసిపేట్ చేస్తూ వుంటారు. తమ ఫోన్లలో వీడియో కెమెరా ఆన్ చేసుకుని, బ్యాక్ గ్రౌండ్లో కౌంట్ డౌన్ టైమర్ పెట్టుకుని చిప్ తింటూ వుంటారు. ఐదు క్షణాలు కౌంట్ డౌన్ అయ్యే వరకూ ఆ చిప్ ధాటికి కుయ్యో మొర్రో అంటారు. ఐదు క్షణాలు దాటిన తర్వాత ఏదో ప్రపంచాన్ని జయించినట్టు ఎక్స్.ప్రెషన్ ఇస్తారు. ఇదీ ఈ ‘వన్ చిప్ ఛాలెంజ్’ వ్యవహారం.  ఈ దిక్కుమాలిన ఛాలెంజ్‌లో కుర్ర సన్నాసులతోపాటు అమెరికాలో వున్న సెలబ్రిటీస్ కూడా పాల్గొనడంలో ఇది బాగా పాపులర్ అయిపో్యింది. వన్ చిప్ ఛాలెంజ్ చేయనివాడు యూత్ కాదన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఈ ఛాలెంజ్ అంత ఈజీగా వుండదు. ఆ దిక్కుమాలిన చిప్ తినగానే నోరు మండిపోతుంది. ఐదు క్షణాలపాటు కూడా భరించలేనంత మండిపోతుంది. ఐదు క్షణాలపాటు అలాగే వున్నవారి సంగతి అలా వుంచితే, చిప్ తినగానే భళ్ళున వాంతులు చేసుకున్నవాళ్ళు, కళ్ళుతిరిగి పడిపోయినవాళ్ళు, నోరు మండిపోయి చాలారోజులు ఏమీ తినలేక తంటాలుపడిన వాళ్ళు కోకొల్లలు.  సరే, ఎవరి పిచ్చి వారికి ఆనందం అని ఊరుకోవచ్చు. కానీ, 2023 సెప్టెంబర్లో ఒక ఘోరం జరిగింది. ఈ వన్ చిప్ ఛాలెంజ్‌లో పాల్గొన్న వొలోబా అనే కుర్రాడు అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్రమైన ఘాటు వల్ల అతని గుండెపోటు వచ్చి చనిపోయాడు. దాంతో పాఖీ కంపెనీని అందరూ తిట్టిపోయడంతో ఈ కంపెనీ ఈ ‘వన్ చిప్ ఛాలెంజ్‌’ని ఉపసంహరించుకుంది. మార్కెట్లో వున్న తమ కంపెనీ చిప్స్ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయాలని ప్రకటించింది. అయితే, ఈ చిప్స్ స్టాక్‌ని చాలామంది వెనక్కి ఇవ్వలేదు. సీక్రెట్‌గా అమ్మకాలు జరుగుతూనే వున్నాయి. ‘వన్ చిప్ ఛాలెంజ్’ వీడియోలు వస్తూనే వున్నాయి. ఈ దారుణమైన ఛాలెంజ్ వల్ల ఇంకా ఎంతమంది చనిపోతారో అని అమెరికా పేరెంట్స్ భయపడుతున్నారు. యూత్‌కి ఈ మెంటల్ ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురుచూస్తున్నారు.

ycp will lost in ap elections

బొత్సకి కూడా నమ్మకం లేదు!

ఏపీలో టీడీపీ విజయం ఫిక్సయిపోయింది. ఏపీలో దారిన పోయే దానయ్యని ఆపి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటావ్ అని అడిగితే, ఆ దానయ్య ఎగాదిగా చూసి ‘టీడీపీ రాబోతోందని ఇంకా అర్థం కాలేదా’ అని అంటాడు. మరి పామరులకే అసలు విషయం అర్థమైపోయినప్పుడు వైసీపీ నాయకులకు అర్థం కాకుండా వుంటుందా? అయినప్పటికీ మేకపోతు గాంభీర్యాలు, బిల్డప్పులు ఫలితాలు వచ్చే వరకూ ప్రదర్శించాలి కదా. ప్రస్తుతం వైసీపీ నాయకులు ఆ పనిలోనే బిజీగా వున్నారు. మేమే గెలుస్తున్నాం అని వాళ్ళు చెబుతున్నారు. అయితే, ఆ గొంతుల్లో నమ్మకం ధ్వనించడం లేదు. సోషల్ మీడియాలో ఈమధ్య ఒక పాయింట్ బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే, జూన్ 12న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని.. ఈ పాయింట్‌ని బేస్ చేసుకుని ఆపద్ధర్మ మంత్రి బొత్స సత్యనారాయణ  నేను కూడా వున్నా అంటూ రంగంలోకి దిగారు. ఈసారి కూడా వైసీపీ గెలుస్తుందని ఆశిస్తున్నానని, ఈనె 9న జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశిస్తున్నానని స్టేట్‌మెంట్ ఇచ్చారు. బొత్స స్టేట్‌మెంట్ చూసి జనం నవ్వుకుంటున్నారు. గెలుస్తున్నాం.. ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పకుండా, గెలుస్తారని ఆశిస్తున్నానని, ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశిస్తున్నాను అన్నప్పుడే బొత్సకి కూడా మళ్ళీ అధికారంలోకి వస్తారని నమ్మకం పోయిందని అనుకుంటున్నారు. మొన్నామధ్య జగన్ పబ్లిక్ మీటింగ్‌లో బొత్స తన తండ్రి లాంటి వాడు అని అన్నప్పటి నుంచి బొత్స ఎమోషనల్‌గా ఫీలైపోతున్నట్టున్నారు. అందుకే, మిగతా మంత్రులందరూ విజయం మీద మాట్లాడే శక్తి లేక నవ డాష్‌లూ మూసుకుని కూర్చుంటే, బొత్స మాత్రం బయటకి వచ్చి ‘గెలుస్తామని ఆశిస్తున్నాను’ లాంటి బలహీన స్టేట్‌‌మెంట్ ఇచ్చారు. బొత్స స్టేట్‌మెంట్ వల్ల వైసీపీకి లాభం జరగకపోగా, మరింత నష్టం జరిగింది. పోలింగ్‌కి ముందు రోజు మీడియాతో మాట్లాడిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మన బొత్స గారిని మామూలుగా తిట్టలేదు. బొత్సలాంటి వాళ్ళ వల్లే జగన్ పూర్తిగా నాశనమయ్యాడని చెప్పారు. కరెక్టే... ‘గెలుస్తామని ఆశిస్తున్నాను.. ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశిస్తున్నాను’ అని స్టేట్‌మెంట్ ఇవ్వడమేంటి? వైసీపీని మరింత నాశనం చేయడానికి కాకపోతే!?

Rains are rains for five days in Telugu states

తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు వర్షాలే వర్షాలు 

నిన్నటి వరకు ఉక్కపోతగా  వాతావరణం ఒక్క సారిగా చల్లబడింది. శుక్రవారం హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షంతో ప్రారంభమైన వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి.   దీంతో తెలుగు రాష్ట్రాలను అలర్ట్ చేసింది వాతావరణశాఖ. రానున్న ఐదురోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఎల్లో హెచ్చరిక జారీచేసింది. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏపీలో ఐదు రోజులపాటు కుండపోత వానలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాంధ్రను ఆనుకుని ఉపరితల ద్రోణి ఏర్పడటం కారణంగా కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణశాఖ. దీంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణశాఖ. ఆయా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని చెప్పింది.

will cs be changed before counting

సీఎస్ ను మారిస్తేనే సజావుగా కౌంటింగ్.. ఈసీ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ!

ఏపీలో ఎన్నికలు పూర్తి అయి నాలుగు రోజులైనా రాష్ట్రంలో  ఉద్రిక్తతలు చల్లారలేదు. హింసాకాండ అదుపులోనికి రాలేదు. పోలింగ్ సందర్భంగా, పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై  సీఈసీ  సీరియస్ అయింది.  సీఎస్,డిజిపీలను ఢిల్లీకి పిలిపించుకుని మరీ వివరణ కోరింది. సరే దాదాపు మూడు గంటల పాటు సీఎస్, డీజీపీలో రాష్ట్రంలో పరిస్థితులపై వారి వివరణ ఇచ్చారు. అయితే వారి వివరణ అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం ఒకింత సీరియస్ అయినట్లు కనిపిస్తోంది.  అనంతపురం,తిరుపతి,పల్నాడు మూడు జిల్లాల్లో 12మంది పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది.  తిరుపతి ఎస్పీని బదిలీ  చేసింది.పల్నాడు కలెక్టర్ నూ బదిలీ చేసింది. వీరందరిపై శాఖాపరమైన విచారణకు ఆదేశిస్తూ, సిట్ ఏర్పాటు చేసి అల్లర్లకు కారణమైన వారిపై విచారణకు ఆదేశించి  48 గంటల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు రాష్ట్రంలో కౌంటింగ్ పూర్తి అయిన తరువాత 15రోజుల వరకూ ఉండేలా పారామిలిటరీ దళాలను ఏపీకి తరలించాలని సీఈసీ ఆదేశించింది. అయతే సీఎస్, డీజీపీలపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. వారి కింది అధికారులపై వేటు వేసి ఊరుకుందా? అనే చర్చ రాష్ట్రంలో  మొదలైంది.  ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింసాకాండకు ఎన్నికల్లో ఓడిపోతారనే దుగ్ధతో ప్రత్యర్ధులపై   వైసీపీ నాయకులు, మూకలు కారణమనీ, పోలీసులు, అధికారులు ఈ హింసాకాండను, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు టార్గెట్ గా జరిగిన దాడులను చోద్యం చూస్తున్నట్లు చూస్తూ ఉండిపోయారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క తెలుగుదేశం నేతలు, కార్యకర్తలే అని కాదు, తమకు ఓటు వేయలేదని భావించిన  ఓటర్లపై కూడా దాడులు జరిగాయి. ‘పైవారి’ ఆదేశాల మేరకే చేష్టలుడిగి ఉండిపోయామని స్వయంగా ప్రైవేటు సంభాషణల్లో కొందరు పోలీసులే చెబుతున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. వారు చెప్పే ‘పైవారు’ ఎవరన్నది ఊహించడం పెద్ద  కష్టం కూడా కాదు.   పోలింగ్ సరళితో.. స్వయంగా వైసీపీ అంతర్గతంగా నిర్వహించుకున్న సమీక్షలో, అలాగే ఐప్యాక్ నివేదికలో పార్టీ ఓటమి ఖాయమైపోయిన నేపథ్యంలో ఇప్పుడు  వైసీపీ అధినాయకత్వం మీద ఉన్న గురుతర బాధ్యత ఏమిటంటే  ఓట్ల లెక్కింపు జరిగే వరకైనా పార్టీ నేతలు, క్యాడర్ ను కాపాడుకోవడం, ఇప్పుడే చేతులెత్తేస్తే కౌంటింగ్ కేంద్రాలలో కూర్చోవడానికి కూడా ఏజెంట్లు దొరకరన్న భయం. అందుకే కౌంటింగ్ జరిగే వరకూ వైసీపీ నాయకులను, శ్రేణులలో విజయం సాధిస్తున్నామన్న విశ్వాసాన్ని నిలిపి ఉంచడానికి నానా తంటాలూ పడుతున్నారు. ఆ క్రమంలో జగన్ ఏకంగా గత ఎన్నికలలో కంటే అధిక స్థానాలు సాధిస్తున్నామంటూ ప్రకటించారు. సొంత పార్టీ నేతలే ఆ మాటలు నమ్మడం లేదు. బొత్స వంటి సీనియర్ నాయకులు కూడా విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పారు. అయితే వారి ప్రకటనలు పార్టీలో పెద్దగా జోష్ నింపలేదు. ఎందుకంటే అంతకంటే ముందే సజ్జల, అనీల్ కమార్ యాదవ్, రోజా,  అంబటి రాంబాబు,  కొమ్మినేని శ్రీనివాసరావు వంటి వారు పార్టీ ఓటమి తథ్యమని పరోక్షంగా సంకేతాలిచ్చేశారు. అనవసరంగా బెట్టింగులకు పాల్పడి ఆర్థికంగా నష్టపోవద్దని హితవు చెప్పారు. ఈ పరిస్థితుల్లో క్యాడర్ ను ఎంగేజ్ చేయాలంటూ కౌంటింగ్ వరకూ రాష్ట్రంలో ఉద్రిక్తతలు కొనసాగేలా చేయడం వినా మరో మార్గం లేదని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే వైసీపీ మూకలను రెచ్చగొడుతున్నారు. ఉద్రిక్తతలు చల్లారకుండా దాడులను ప్రేరేపిస్తున్నారు.  ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున  ఈసీ పర్యవేక్షణలో అధికారులు తమ బాధ్యతను గుర్తెరిగి ఎలాంటి అభిమానం దురభిమానాలకు దూరంగా శాంతిభద్రతలు కాపాడాలి. అయితే రాష్ట్రంలో కొందరు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుండటం వల్లనే పోలింగ్ ముగిసిన నాలుగు రోజుల తరువాత కూడా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈసీ ఏపీ విషయంలో సీరియస్ యాక్షన్ కు దిగింది.  కౌంటింగ్ సందర్భంగా అధికార యంత్రాంగం  నిష్పాక్షికంగా వ్యవహరించాలంటే సీఎస్ ను మార్చాల్సిన అవసరం ఉందని విపక్ష తెలుగుదేశం కూటమి డిమాండ్ చేస్తున్నది. మరి రానున్న ఒకటి రెండు రోజులలో ఈసీ ఆ దిశగా చర్యలు తీసుకుంటుందా చూడాల్సి ఉంది. 

ycp attacks on people

టీడీపీకే ఓటు వేస్తామంటే చావగొట్టారు

ఎన్నికల పోలింగ్‌కి ముందు, పోలింగ్ తర్వాత వైసీపీ గూండాలు చేస్తున్న దారుణాలు మనం ప్రజాస్వామ్య దేశంలోనే వున్నామా అనే సందేహాలు కలిగిస్తున్నాయి. సాక్షాత్తూ న్యాయస్థానాలు కూడా ఏపీలో జరుగుతున్న దారుణాలు చూసి దిగ్భ్రాంతికి గురవుతున్నాయి. జరక్కూడని దారుణాలు జరిగిపోయిన తర్వాత ఇప్పుడు తీరిగ్గా వైసీపీ అనుకూల పోలీస్ అధికారులను బదిలీ చేస్తున్నారు. ఈ బదిలీలు జరిగిన నష్టాన్ని భర్తీ చేయగలవా? తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారన్న కోపంతో వైసీపీ గూండాలు బుధవారం నాడు ఒక కుటుంబం మీద దాడి చేసి దారుణంగా గాయపరిచాయి. విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఈ దారుణం జరిగింది. సుంకర ధనలక్ష్మి అనే మహిళ ఇంటికి పోలింగ్‌కి ముందు బొగ్గు శ్రీను నాయకత్వంలోని వైసీపీ గూండాలు వచ్చారు. వైసీపీకే ఓటు వేయాలని చెబుతూ డబ్బు ఇవ్వబోయారు. అయితే, ఆమె తమకు డబ్బు వద్దని, తాము తెలుగుదేశం పార్టీకే ఓటు వేస్తామని చెప్పారు. అయితే మీ సంగతి ఎన్నికల తర్వాత చూసుకుంటాం అని చెప్పి వెళ్ళిపోయిన లోకేష్, భాస్కర్, సాయి అనే వైసీపీ గూండాలు పోలింగ్ ముగిసిన తర్వాత ధనలక్ష్మి ఇంటి మీద దాడి చేశారు. ఆ సమయంలో ఇంట్లో వున్న ధనలక్ష్మి, ఆమె కుమార్తె నూకరత్నం, కుమారుడు మణికంఠలపై దాడి చేసి రాడ్లతో తలమీద, ఒళ్ళంతా కొట్టారు. దాంతో వాళ్ళు రక్తసిక్తం అయిపోయారు. ఇంట్లోనే వున్న రమ్య అనే గర్భిణిని తాను గర్భిణిని అని చెబుతున్నా వినకుండా కడుపు మీద కొట్టారు. తెలుగుదేశం నాయకులు ఆందోళన చేయడంతో వీరిలో ఒక నిందితుడు లోకేష్‌ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. 

JAGAN SURPASS PAUL IN POLITICAL COMEDY

పొలిటికల్ కామెడీ.. పాల్ ను మించిపోయిన జగన్

పొలిటికల్ కామెడీడలో ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ను మించిపోయారు. ఇంత కాలం రోహిణీకార్తె ఎండలను మించి వేడెక్కిన రాజకీయ మంటల నుంచి పాల్ మాత్రమే తన ప్రసంగాలతో ఒకింత ఉపశమనం కలిగిస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. అయితే ఇప్పడు ఇక  పాల్ ప్లేస్ ను జగన్ ఆక్రమించేసినట్లు కనిపిస్తోంది. ఏపీలో ఇలా ఎన్నికలు ముగిశాయో లేదో అలా పాల్ విశాఖ ఎంపీగా తన విజయం ఖాయమని ప్రకటించేయడమే కాకుండా... తాను ఎంపీగా తన పని కూడా ప్రారంభించేస్తున్నానని చెప్పి జనం పొట్టలు చెక్కలు చేశారు. ఇది  జరిగిన మరుసటి రోజునే జగన్ పాల్ ను మించిన కామెడీ చేశారు.  పనిమాలా అమరావతిలోని ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లి మరీ కామెడీ చేశారు. ముఖంలో ఇసుమంతైనా విశ్వాసం కనిపించకపోయినా, ఆయన వెనుక నిలుచుని ఉన్న మంత్రులు బొత్స సత్యానారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల ముఖాలలో నైరాశ్యం విస్పష్టంగా కనిపిస్తున్నా.. జగన్ మాత్రం ఎన్నికలలో ఘన విజయం గురించి ఐప్యాక్ సభ్యులకు గోప్పగా చెప్పారు. 151ని మించి అసెంబ్లీ స్థానాలలో వైసీపీ విజయం సాధించబోతోందని ఆయన చెబుతుంటే.. ఐ ప్యాక్ సభ్యులు  ఎగతాళిగా చప్పట్లు కొడుతూ 175 అని అరవడం వినిపించింది. కనిపించింది. పాల్ విశాఖ ఎంపీగా విజయం సాధించేశానని ప్రకటించడాన్ని మించి జగన్ గత ఎన్నికల కంటే అధిక స్థానాలు సాధిస్తామని చెప్పుకోవడమే జనాలను ఎక్కువగా నవ్వించింది.  సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా పోలింగ్ పూర్తయిన తరువాత గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుంది. పార్టీ క్యాడర్ లో విశ్వాసం నింపడానికి, ఓట్ల లెక్కింపునకు ముందే వారు జారిపోయి.. కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లే లేని పరిస్థితి రాకుండా ఉండటానికి విజయం సాధిస్తున్నామంటూ పార్టీల నాయకులు ప్రకటనలు చేయడం కొత్తేమీ కాదు. కానీ జగన్ విజయం సాధించబోతున్నామంటూ జగన్ చెప్పిన సంఖ్యే సొంత పార్టీ నేతలకు కూడా ఘోరంగా ఓడిపోబోతున్నామన్న సంకేతాన్ని పంపింది. ఐప్యాక్ కార్యాలయంలో జగన్ విజయంపై చేసిన ప్రకటన చూసిన తరువాత సొంత పార్టీ శ్రేణులే రివర్స్ పాలన అలవాటైన మా నాయకుడికి ఎన్నికల ఫలితాలను కూడా రివర్స్ లో అంచనా వేయడం అలవాటైపోయిందని సెటైర్లు వేసుకుంటున్నారంటే ఆయన పొలిటికల్ కామెడీ ఏ స్థాయికి చేరిందో అర్ధమైపోతుంది.  ఒక వైపు సొంత పార్టీకి చెందిన తన ఆంతరింగుకుడి లాంటి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ.. సాక్షాత్తూ కేంద్ర ఎన్నికల సంఘం తెలుగుదేశం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలను పాటించిందని ప్రకటించి ఓటమిని పరోక్షంగా అంగీకరించేశారు. ఆయన దాకా ఎందుకు పోలింగ్ కు ముందే ఓటమి పసిగట్టిన జగన్ ఈ సారి ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న విశ్వాసం తనకు లేదని ప్రకటించి చేతులెత్తేశారు. ఇలా ఇప్పటి వరకూ వైసీపీ ఓటమి ఖాయమన్న సంకేతాలిచ్చి.. ఇప్పుడు పార్టీకి ఎన్నికల వ్యూహాలు అందించి, నివేదికలు అందించిన ఐప్యాక్ కార్యాలయంలో ఘన విజయం అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు మించిన కామెడీ ఏముంటుందని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  

is cs jawahrreddy safe

సీఎస్ జవహర్ రెడ్డి సేఫేనా?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల రోజు, ఆ తరువాత యథేచ్ఛగా సాగిన హింసాకాండకు సంబంధించి కొందరు పోలీసు అధికారులు, కలెక్టర్లపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. పల్నాడు కలెక్టర్ ను బదిలీ చేసింది. పలువురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. వారందరిపై కూడా శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. ఇందు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ను నియమించి 48 గంటల లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఈ చర్యలు తీసుకోవడానికి వీలుగా నివేదికలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ సీఎస్ జవహర్ రెడ్డి. ఆయన నివేదిక ఆధారంగానే కేంద్ర ఎన్నికల సంఘం ఈ చర్యలు తీసుకుంది.  అయితే అధికారులపై నెపం నెట్టేసి జవహర్ రెడ్డి సేఫ్ గేమ్ ఆడి తప్పించుకున్నారా, ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో సర్వం సీఎస్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. అటువంటి సీఎస్ కు రాష్ట్రంలో జరిగిన సంఘటనలకు సంబంధించి బాధ్యత ఉండదా?  అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఏపీలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన క్షణం నుంచీ అధికార యంత్రాంగం అంతా అధికార పార్టీ సేవలో తరించడానికే పరిమితమైందన్న ఆరోపణలు ఉన్నాయి. సామాజిక పెన్షన్ల పంపిణీ విషయంలో ఎన్నికల సంఘం ఆదేశాలను సైతం బుట్టదాఖలు చేసి సీఎస్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అసలు విపక్ష తెలుగుదేశం కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నీ కూడా ముందు నుంచీ సీఎస్ వ్యవహారశైలిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో ఎన్నికల ప్రక్రియ అపహాస్యం పాలయ్యేలా జరిగిన సంఘటనలకు సీఎస్ బాధ్యుడు కాడా అని ప్రశ్నిస్తున్నారు.  జగన్ కు మేలు చేయడమే లక్ష్యంగా ఆయన ప్రతి అడుగూ ఉందని సామాన్య జనం కూడా బాహాటంగానే చర్చింకుకుంటున్న పరిస్థితి.   ఇప్పుడు కూడా ఎన్నికల అనంతర హింస విషయంలో సీఎస్ పై ఈసీ చర్య తీసుకుంటుందా లేదా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈసీ  ఆదేశాలను అమలు చేయాల్సిన సీఎస్ తన వైఫల్యాలను కప్పిపుచ్చు కునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఆయన సీఎస్ గా ఉండగా  ఓట్ల లెక్కింపు  జరిగితే  అది సక్రమంగా జరుగుతుందన్న నమ్మకం లేదని విపక్ష తెలుగుదేశం కూటమే కాదు, సామాన్య ప్రజలు కూడా అంటున్న పరిస్థితి. మరి కేంద్ర ఎన్నికల సంఘం ఏం చర్యలు తీసుకుటుందో చూడాల్సి ఉంది. 

ec serious on election  violence in ap

ఏపీ ఎన్నికల హింసపై ఈసీ సీరియస్.. బదలీ వేట్లు.. సస్పెన్షన్లు

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హింసపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఏపీ సీఎస్, డీజీపీలను ఢిల్లీకి పిలిపించుకుని మరీ వివరణ కోరింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానం కావడానికి బాధ్యులెవరని నిలదీసింది. హింస ప్రజ్వరిల్లిన పల్నాడు ఎస్పీపై బదిలీ వేటు వేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. అలాగే పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేసింది. తిరుపతి ఎస్పీని బదిలీ చేసింది. వీరిపై కూడా శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. మొత్తంగా ఎన్నికల సంఘం ఏపీలో పరిస్థితులపై ఆలస్యంగానైనా స్పందించింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో మొత్తం 12 మంది పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. అంతే కాకుండా ఈ విచారణ కోసం స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ (సిట్) ఏర్పాటు చేసింది. హింసాత్మక ఘటనలపై 48 గంటలలోగా నివేదిక ఇవ్వాలని, ఇపీసీ సెక్షన్ల ప్రకారం ఎఫ్ ఐఆర్ అప్డేట్ చేయాలనీ ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా ఏపీలో  కౌంటింగ్ ముగిసిన పదిహేను రోజుల వరకూ రాష్ట్రంలో పాతిక కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలను కొనసాగించాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల రోజునూ, ఆ తరువాత కూడా జరిగిన హింసాత్మక ఘటనలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయి. పక్కా ప్రణాళిక ప్రకారం అధికార వైసీపీ మూకలు దాడులకు తెగబడుతుంటే పోలీసులు చోద్యం చూశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. విపక్ష కూటమి అభ్యర్థులపై హత్యాయత్నాలకు పాల్పడేందుకు కూడా వైసీపీ మూకలు వెనుకాడలేదంటే రాష్ట్రంలో పోలీసుల వైఫల్యం ప్రస్ఫుటంగా కళ్లకుకట్టింది. పోలింగ్ ముగిసి నాలుగు రోజులు గడిచినా ఇప్పటికీ పరిస్థితులు అదుపులోకి రాలేదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈసీ కన్నెర్ర చేసింది.  ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం రాష్ట్రంలో ప్రతీకార దాడులకు ఆస్కారం ఉందంటూ ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీఎస్పీ బలగాలను పంపుతామనీ, అవసరాన్ని బట్టి కేంద్ర సాయుధ బలగాలనూ మోహరించాల్సి ఉంటుందని ఇంటెలిజెన్స్ విభాగం సూచించింది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అవసమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొంది.  

జగన్ ‘ద్వంద్వ మతతత్వం’ గోల!

కొంతమందికి రెండు దేశాల్లో పౌరసత్వం వుంటుంది. దాన్ని ‘ద్వంద్వ పౌరసత్వం’ అంటారు. ఇప్పుడు వైఎస్ జగన్ వ్యవహారాన్ని చూస్తుంటే ‘ద్వంద్వ మతతత్వం’ అనే పదాన్ని సృష్టించాలని అనిపిస్తోంది. జగన్ పూర్వికులు ఏనాడో హిందూ మతాన్ని వదిలి క్రైస్తవాన్ని స్వీకరించారు. జగన్ కుటుంబం మొత్తం నిరంతరం ఏసు ప్రభువుకి ప్రార్థన చేసుకుంటూ వుంటారు. మంచిదే.. ఎవరి మత విశ్వాసాలు వారివి. అమెరికా పారిపోయిన విజయమ్మ అయితే, గత ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చినప్పుడు చేతిలో బైబిల్ లేకుండా ఏనాడూ కనిపించలేదు. హిందూ మతానికి దూరమైపోయినప్పటికీ ఈ కుటుంబం ‘రెడ్డి’ అనే హిందూ కులాన్ని మాత్రం అక్కున చేర్చుకుంది. ఇది వీరి పెద్ద మనసుకు నిదర్శనం. అసలు ఈ కుటుంబం రెడ్లే కాదని, రెడ్ల ఓట్ల కోసమే ఆ మకుటం తగిలించుకున్నారని కొంతమంది నిఖార్సయిన రెడ్లు వాదిస్తూ వుంటారుగానీ, ఆ వాదనలోకి ఇప్పుడు వెళ్ళడం అనవసరం. అటు క్రైస్తవ మతానికి, ఇటు హిందూ కులానికి న్యాయం చేస్తూ ఈ కుటుంబం చాలా అభివృద్ధిలోకి వచ్చింది.. సంతోషం! అయితే, ఆమధ్య... అంటే, 2019 ఎన్నికలకు ముందు విశాఖ శారదాపీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర సరస్వతి అండ్ జగన్ రాసుకుని పూసుకుని తిరిగిన రోజుల్లో ఆయన ఓ ఫైన్ మార్నింగ్ జగన్‌ని నీళ్ళలో ముంచి, పైకి లేపి హిందువుగా మార్చేశారు. దాంతో హిందుత్వ భావాలు వున్నవాళ్ళందరూ మురిసిపోయారు. అయితే ఆ మురిపెం ఎక్కువకాలం మిగల్లేదు. ఆ తర్వాత జగన్ ఏనాడూ వ్యక్తిగత హోదాలో ఏనాడూ ఏ హిందూ దేవాలయానికి వెళ్ళిన ధాఖలాలు లేవు. యథాతథంగా క్రైస్తవ మత ప్రార్థనా కార్యక్రమాల్లో పాల్గొనడం, జెరూసలేం వెళ్ళడం లాంటివి జరిగిపోతూనే వున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా హిందూ దేవాలయాలకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు జగన్ ప్రవర్తించే తీరు జగద్విదితమే. దేవాలయంలో ఇచ్చే ప్రసాదాలు, తీర్థాలు తీసుకుంటున్నప్పుడు ఆయనలో అయిష్టత స్పష్టంగా కనిపిస్తూనే వుండేది. హిందూ మత విశ్వాసాలను పాటించకపోయినప్పటికీ, హిందూ దేవాలయాల నుంచి వచ్చిన ఆదాయాన్ని ఇతర మతాల వారికి మళ్ళించినప్పటికీ, హిందూ దేవాలయాల్లో ఇతర మతస్తులకు ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ ఎవరూ ఏమీ చేయలేక సర్వం మూసుకున్న పరిస్థితి. జగన్ తన క్రైస్తవంలోనే కొనసాగుతున్న యథాతథ పరిస్థితి. అదేంటో, ఎన్నికల సమయం రాగానే మరోసారి జగన్‌ మనసు హిందూ విశ్వాసాల మీదకి మళ్ళింది. అధికారాన్ని వచ్చేలా చేసే రాజశ్యామల యాగం మీద మక్కువతో ఆయన గత 41 రోజులకు పైగా తాడేపల్లి నివాసంలో సీక్రెట్‌గా రాజశ్యామల యాగం క్రతువులు పూర్తి చేశారు. యాగం చివరిరోజైన బుధవారం నాడు జరిగిన పూర్ణాహుతిలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. 2019 ఎన్నికల సందర్భంగా కూడా విశాఖ శారదాపీఠంలోని ఆలయంలో స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో జగన్ రాజశ్యామల యాగం నిర్వహించారు. ఆ యాగం ఫలితంగానే తనకు అధికారం దక్కిందని జగన్ నమ్ముతున్నట్టున్నారు. అందుకు ఈసారి కూడా రాజశ్యామల యాగం ప్లాన్ చేశారు. కాకపోతే, స్వరూపానందేంద్ర సరస్వతితో జగన్‌కి చెడింది కాబట్టి, ఇప్పుడు ఆ బాధ్యత మరెవరో స్వీకరించి పూర్తి చేశారు. అంతా బాగుందిగానీ, ఇంతకీ జగన్ హిందువా, క్రైస్తవుడా అనే సందేహం, అయోమయం అటు హిందువులలో, క్రైస్తవులలో పెరిగిపోతోంది. సర్లే, ఏ మతం అయితే ఏం గానీ, వున్నది ఒకే దేవుడు.. కనిపించేవనీ దేవుడి రకరకాల రూపాలు అంతే.. ఇంతకీ ఆయన చేసిన రాజశ్యామల యాగం ఈసారి ఫలిస్తుందా? కచ్చితంగా ఫలించదు. ఎందుకంటే, రాజశ్యామల దేవత కూడా ఓటరు దేవుళ్ళ లాంటిదే. అప్పట్లో జగన్ ‘ఒక్క ఛాన్స్’ అని ప్రాధేయపడ్డాడు కాబట్టి, ఓటరు దేవుళ్ళ తరహాలోనే రాజశ్యామల దేవత కూడా కరుణించి అధికారం ఇచ్చింది. ఈ ఐదేళ్ళ పాలనలో జగన్ నిజ స్వరూపం ఏమిటో తెలిసిపోయింది కాబట్టి, ఇటు ఓటరు ఓటు వేయలేదు.. అటు రాజశ్యామలా దేవి కూడా కరుణించదు.  రాజశ్యామలా దేవి కూడా ఓటరు దేవుడి లాంటిదే జగనప్పా.. ఓటరు బూత్‌కి వచ్చి ఓటు వేస్తాడు.. రాజశ్యామలాదేవి అలా ఓటు వేయకుండానే అనుగ్రహిస్తుంది. మిగతా అంతా సేమ్ టు సేమ్.. అయినా, జగన్ అంటే పడిచచ్చే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొన్నటి ఎన్నికల ముందు కూడా రాజశ్యామల యాగం చేశాడు.. ఏమైంది? చెత్తగా పరిపాలించడం వల్ల దారుణంగా ఓడిపోయాడు. ఇప్పుడు జగన్ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ అవబోతోంది.