ఏపీలో ప్రజాస్వామిక ఓట్ల సునామీ!
ఏపీలో పోలింగ్ సాగుతోంది . మారుమూల గ్రామాల నుంచి పట్టణాల వరకు జనం ఓ ఉత్సాహంతో, ఓ జోష్ తో పోలింగ్ బూత్ లకు బారులు తీస్తున్నారు. వేల సంఖ్యలో ఓటర్లతో పోలింగ్ బూత్లు కిటకిటలాడుతున్నాయి. ఉత్సాహంగా ఓటు వేయడానికి అన్ని వర్గాల ప్రజలూ ఉత్సాహం చూపుతున్నారు. గ్రామీణ ప్రాంతాలతోపాటు ఈ సారి పట్టణ ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున పోలింగ్ జరుగుతోంది. మాచర్ల, పుంగనూరు వంటి చోట్ల దాడులు జరిగినా పోలింగ్పై వాటి ప్రభావం ఇసుమంతైనా కనిపించడం లేదు.
ఉదయం11 గంటలకే దాదాపు పాతిక శాతం పోలింగ్ నమోదైంది. ఓటింగ్ శాతం భారీగా పెరుగుతుండడం కూటమి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతుంటే, అధికార వైసీపీలో నిరుత్సాహం పెరిగిపోతోంది. ఊహించిన దానికంటే భారీగా ప్రజామద్దతు కూటమిపై ఉన్నట్లు పోలింగ్ సరళిని బట్టి అర్ధమౌతోందని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ ప్రచారం జగనే కావాలి అంటూ జగన్ చేసుకున్న ప్రచారంపై నెటిజన్లు సెటైర్లు గుప్పిస్తున్నారు.
వై ఏపీ నీడ్స్ జగన్ (ఏపీకి జగనే ఎందుకు కావాలి) పేరుతో వైసీపీ పెద్ద ఎత్తున చేసుకున్న ప్రచారాన్ని గుర్తు చేస్తూ జగనే కావాలి అని జనంచెప్పాలి కానీ, వారి చేత బలవంతంగా చెప్పిస్తే ఫలితం ఇలాగే ఉంటుందని అంటున్నారు. వైఏపీ నీడ్స్ జగన్ అంటూ జనంలోకి వెళ్లడానికి ధైర్యంలేని వైసీపీ నేతలు తమ పార్టీ కార్యకర్తల్లాంటి వలంటీర్లను, అధికారులను జనం ముందుకు పంపి వారి చేత జగనే కావలని బలవంతంగా చెప్పించారు. అలా చెప్పకపోతే పథకాలు ఆగిపోతాయంటూ బెదిరింపుకు కూడా దిగారు.
ఇప్పుడు సరిగ్గా ఎన్నికల వేళ జగన్ తమకు ఎందుకు వద్దో చెప్పడానికి జనం పోలింగ్ బూతులకు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. ఓటింగ్ సరళిని గమనిస్తున్న పరిశీలకులు ప్రభుత్వ వ్యతిరేకత జనంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. వైసీపీ మూకలు రెచ్చిపోయి శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నా అవేమీ పోలింగ్ పై ప్రభావం చూపడం లేదనీ, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తమ ఓటు హక్కు వినియోగించుకు తీరుతామన్న పట్టుదలను ప్రదర్శిస్తున్నారు.
ఏపీలో పోలింగ్ సరళిని పరిశీలకులు ప్రజాస్వామిక ఓట్ల సునామీగా అభివర్ణిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సామాన్యులు అధికారపార్టీ ఎమ్మెల్యేలను మంత్రులను నిలదీస్తున్న తీరును చూస్తే ప్రజలలో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రత అవగతమౌతోందంటున్నారు. సాక్షాత్తూ ఎమ్మెల్యే చెంపే ఛెళ్లుమనిపించిన ఉదంతమే ఇందుకు నిదర్శనమంటున్నారు. తెనాలిలో అధికార పార్టీ ఎమ్మెల్యే దాష్టీకాన్ని ఓ సామాన్య ఓటరు ఎదిరిస్తే, పిఠాపురంలో ఓ పోలింగ్ బూత్ లో వైసీపీ అభ్యర్థి వంగా గీతకు నిబంధనలు గుర్తు చేసి మరీ నిలదీశారు ఇంకో ఓటరు. వైసీపీ మూకల దాడులు, దౌర్జన్యాలూ, దాష్టీకాలకు వెరవకుండా ఓటర్లు ఎదురుతిరుగుతున్న పరిస్థితి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నది.