వైసీపీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు.. వైఎస్సార్ పేరు ఇక ఉండదా?

వైసీపీ గుర్తింపును రద్దు చేయాలంటూ అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని వైసీపీకి, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.   వైసీపీకి ఆ పార్టీ పేరు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోన్న సంగతి తెలిసిందే. తమ పార్టీ పేరు 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ' అయితే 'వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ' పేరుతో ఎలా నోటీసులు ఇస్తారంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఈ వివాదానికి తెరదీశారు. ఈ క్రమంలో 'అన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ' రంగంలోకి దిగింది. 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ' పేరును 'వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ'గా చలామణీ చేస్తున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి 'అన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ' అధ్యక్షుడు మహబూబ్ బాషా ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ అనే పదాన్ని వైసీపీ వాడకుండా చూడాలని ఈసీని కోరారు. అంతేకాదు, వైసీపీ గుర్తింపు రద్దు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో మహబూబ్ బాషా పిటిషన్ కూడా దాఖలు చేశారు.   ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు వైసీపీకి కూడా గతంలోనే నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ తదుపరి విచారణ జరగనున్న సెప్టెంబర్ 3వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే, ఇప్పటివరకూ కేంద్ర ఎన్నికల సంఘం, వైసీపీ కౌంటర్ దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో దీనిపై మరోసారి విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని వైసీపీని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ.. విచారణను నవంబరు 4కి వాయిదా వేసింది.   ఈ వ్యవహారం వైసీపీకి ఇబ్బందికరంగా మారనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయకపోతే కోర్టు దిక్కరణ అవుతుంది. కౌంటర్ దాఖలు చేస్తే.. లెటర్ హెడ్లు, పోస్టర్లు, బ్యానర్లలో  'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్'కి బదులుగా 'వైఎస్సార్ కాంగ్రెస్‌' పేరు ఎందుకు ఉపయోగిస్తున్నారో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ వివరణతో కోర్టు సంతృప్తి చెందకపోతే.. అసలు పార్టీ గుర్తింపునే రద్దు చేసినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఎన్నికల సంఘంలో ఆ పార్టీ పేరు 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ'గా రిజిస్టర్ అయ్యుంది. ఒకవేళ రద్దు చేయకపోయినా.. వైఎస్సార్ అనే పేరుని ఇక మీదట ఉపయోగించకూడదని కోర్టు ఆదేశాలిచ్చే అవకాశముంది అంటున్నారు. అదే జరిగితే వైసీపీకి తీవ్ర నష్టం జరిగే అవకాశముంది.

రాజాసింగ్ పై ఫేస్‌బుక్ నిషేధం.. ధన్యవాదాలు తెలిపిన రాజాసింగ్ 

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఫేస్‌బుక్ నిషేధం విధించింది. ద్వేషపూరిత ప్ర‌సంగాలు, వివాదాస్పద వ్యాఖ్య‌లు చేస్తూ ఫేస్‌బుక్ నిబంధ‌న‌ల్ని ఉల్లంఘించిన కార‌ణంగా నిషేదం విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. హింసను ప్రేరేపించేలా వ్యాఖ్య‌లు చేస్తున్న కార‌ణంగా ఆయ‌న ఫేస్‌బుక్ అకౌంట్‌ ని తొలిగిస్తున్నామంటూ ఫేస్‌బుక్ ప్రతినిధి తెలిపారు.   ఫేస్‌బుక్ నిషేదంపై స్పందించిన రాజాసింగ్.. త‌న‌కు అఫీషియ‌ల్‌ గా ఫేస్‌బుక్ అకౌంట్ లేద‌ని, త‌న పేరుతో ఉన్న న‌కిలీ అకౌంట్ల‌కు తాను బాధ్యుడిని కానంటూ వివర‌ణ ఇచ్చారు. ఫేస్ బుక్ లో తన పేరు మీద ప్రస్తుతమున్నపేజీలు నా అధికారిక పేజీలు కాదు.. వాటిని తొలగించినందుకు ఫేస్‌బుక్‌ కి ధన్యవాదాలు అన్నారు. అయితే, ఆయా పేజీలలో చేసిన పోస్టులతో తాను ఏకీభవిస్తానన్నారు. తన అధికారిక ఫేస్ బుక్ పేజీ 2018 లో హ్యాక్ అయ్యిందని.. ఆ తర్వాత దాన్ని వాడేందుకు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. అయితే, తాను సొంతంగా వాడేందుకు ప్రస్తుతం ఒక ఫేస్‌బుక్‌ పేజీ కావాలి.. దాన్ని ఫేస్‌బుక్‌ విధానాలను ఉల్లంఘించకుండా ఉపయోగిస్తాను. దీనికి సంబంధించి సదరు సంస్థకు విన్నవించుకుంటానంటూ రాజాసింగ్ పేర్కొన్నారు.    కాగా, భారత్‌ లో అధికార బీజేపీ నేతలు ఫేస్‌బుక్‌ లో చేసే విద్వేషపూరిత వ్యాఖ్యలు, ప్రసంగాలను ఫేస్‌బుక్‌ సంస్థ చూసీచూడనట్లు వదిలేస్తోందని..‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’ఇటీవల కథనం ప్ర‌చురించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై విపక్ష కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించడమే కాకుండా.. ఫేస్‌బుక్‌ సంస్థకి లేఖలు కూడా రాసింది. ఈ నేప‌థ్యంలో తాజాగా రాజాసింగ్‌పై నిషేధం విధించడం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.  

ప్రపంచ యుద్ధ మొదటి ఫొటోగ్రాఫర్

మేరీ ఆలివ్ ఎడిస్ (3 సెప్టెంబర్ 1876 - 28 డిసెంబర్ 1955)   మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ ఆధికారిక ఫొటోగ్రాఫర్ గా యుద్ధవాతావరణాన్ని, ప్రజాజీవనాన్ని కెమెరాలో బంధించిన వ్యక్తి మేరీ ఆలివ్ ఎడిస్. ఆమె తీసిన ఎన్నో ఫొటోలు ఆనాటి వాతావరణాన్ని, పరిస్థితులను చూసే వీలు కల్పిస్తున్నాయి. అంతేకాదు ఆమె తీసిన ఫొటోలు బ్లాక్ అండ్ వైట్ లోనే కాకుండా ఆటోక్రోమ్ ఫొటోగ్రఫీ లో అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. 1920లో కెనడా పర్యటనలో ఆమె తీసిన ఫొటోలు ఆ దేశం మొట్టమొదటి కలర్ ఫొటోలుగా ఛాయాగ్రహణ చరిత్రలో నిలిచిపోయాయి. ఎడిస్ లండన్ లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు మేరీ , ఆర్థర్ వెల్లెస్లీ ఎడిస్. లండన్ చర్చి స్ట్రీట్ లో ఆమె తన ఫస్ట్ ఫొటో స్టూడియోను ఏర్పాటుచేశారు. ఫొటోలు తీయడంలో ఆమె ప్రతిభను గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం అధికారిక యుద్ధ ఫొటోగ్రాఫర్ గా ఎడిస్ ను నియమించారు. దాంతో అనేక యుద్ధ సమయంలో అనేక అంశాలను తన కెమెరాలో బంధించారు. బ్రిటిష్ ఉమెన్స్ సర్వీసెస్ సేవలను క్యాప్చర్ చేశారు. యుద్ధం ముగిసిన తర్వాత పరిస్థితులను కూడా ఛాయాచిత్రాల ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. లండన్ లో అనేక ఫొటో స్టూడియోలను ఏర్పాటుచేసిన ఆమె ఆటోక్రోమ్ పోర్ట్రెయిట్ లకు ప్రసిద్ధి చెందిన స్టూడియోలుగా వాటిని తీర్చిదిద్దారు. రాజవంశీకుల నుంచి అతి సామాన్యల వరకు ఎందరినో చిత్రాల్లో బంధించారు.   ప్రముఖ రచయితలు థామస్ హార్దీ, జార్డ్ బెర్నార్డ్ షా తదితరులను ఫస్ట్ ఫొటో తీసిన ఘనత ఆమెకే దక్కింది. 28 డిసెంబర్ 1955లో ఎడిస్ మరణించారు.   ఆమె తీసిన యుద్ధచిత్రాల్లో చాలా ఇంపీరియల్ వార్ మ్యూజియంలో ఉన్నాయి. మరికొన్ని ఇతర చిత్రాలను సేకరించి  ఆమె పేరుతో ఎగ్జిబిషన్స్ కూడా నిర్వహిస్తున్నారు.

ఉచిత విద్యుత్‌ పై పేటెంట్‌ ఒక్క వైఎస్సార్‌ కే ఉంది: సీఎం జగన్‌ 

సీఎం వైఎస్ జగన్‌ అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ భేటీలో 'ఉచిత విద్యుత్‌ పథకం- నగదు బదిలీ'కి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. రైతుకు అందే విద్యుత్తు ఎప్పటికీ ఉచితమేనని, ఒక్క కనెక్షన్‌ కూడా తొలగించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల వల్ల రైతులపై ఒక్క పైసా కూడా భారం పడదని హామీ ఇచ్చారు. అమల్లో ఉన్న పథకాన్ని మరింత మెరుగుపరుస్తున్నామని, వచ్చే 30-35ఏళ్లపాటు ఉచిత విద్యుత్‌ పథకానికి ఢోకా ఉండబోదని వెల్లడించారు.   కనెక్షన్‌ ఉన్న రైతు పేరు మీద బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసి, ఆ ఖాతాలోకి నేరుగా నగదు జమ చేస్తామని, ఆ డబ్బునే డిస్కంలకు చెల్లించడం జరుగుతుందని, దీని వల్ల రైతుపై ఎలాంటి భారం ఉండదని స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్‌పై పేటెంట్‌ ఒక్క వైఎస్సార్‌ కే ఉంది. అందుకే పథకానికి ఆయన పేరు అని సీఎం జగన్‌ తెలిపారు. మొదట శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా పథకం అమలు చేస్తామని వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు సీఎం జగన్‌ పేర్కొన్నారు.   కాగా, ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉచిత విద్యుత్‌ పథకాన్ని ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. రైతుల నుంచి కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటిలాగా ఉంటే తమకు ఏ సమస్య ఉండదని.. కొత్తగా ఈ బిల్లులు, నగదు జమ, బిల్లు చెల్లింపులు వల్ల అనవసరపు శ్రమ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, ఒకవేళ ప్రభుత్వం నగదు జమ ఆలస్యం చేస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం.. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న సంస్కరణలకు అనుగుణంగానే వ్యవసాయ విద్యుత్తు వినియోగదారులకు నగదు బదిలీ పథకాన్ని చేపట్టాల్సి వచ్చిందని చెబుతోంది.

కృష్ణా జిల్లాలో పేలుడు.. ఇద్దరు మృతి

ఏపీలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలోని గ‌న్న‌వ‌రం మండ‌లం సూరంప‌ల్లి పారిశ్రామికవాడ‌లో పేలుడు సంభ‌వించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి.   గురువారం మధ్యాహ్నం స్థానికంగా ఉన్న ప్లైవుడ్ కంపెనీలో పేలుడు సంభ‌వించ‌డంతో తండ్రీకుమారుడు మృతి చెందారు. మృతుల‌ను విజ‌య‌వాడ రూర‌ల్ కండ్రిక వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతులిద్ద‌రూ విజ‌య‌వాడ నుంచి స్క్రాప్‌ కొనేందుకు ప్లైవుడ్ కంపెనీకి వ‌చ్చారు. ప్లైవుడ్ కంపెనీలో కెమిక‌ల్ డ‌బ్బాల‌ను ఆటోలో ఎక్కిస్తుండ‌గా భారీ శ‌బ్దంతో పేలుడు సంభ‌వించింది. దీంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

బెంబేలేత్తిస్తున్న కరోనా.. నిన్న ఒక్క రోజే 83,883 పాజిటివ్ కేసులు

భారత్‌లో కరోనా వైరస్ విలయ తాండవం సృష్టిస్తోంది. మనదేశంలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 83,883 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే సమయంలో 1,043 మంది కరోనా తో మరణించారు. ఇది ఇలా ఉండగా నిన్న 68,584 మంది కరోనా నుండి కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశం‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 38,53,406కి చేరింది. ఇప్పటికే కరోనా పై పోరాడి 29,70,492 మంది పూర్తిగా కోలుకున్నారు. కాగా వైరస్‌తో పోరాడుతూ 67,376 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఇంకా మనదేశంలో 8,15,538 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో రికవరీల రేటు 77 శాతంగా ఉంది.   కాగా, రాష్ట్రాల వారీగా మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా 8,25,739 లక్షల కేసులు నమోదయ్యాయి. తాజాగా అక్కడ కొత్తగా 17,433 కరోనా కేసులు నమోదు కాగా 24 గంటల్లో 292 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.

ఇంకా తేలని గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు.. నాయినితో టెన్షన్.. ఇంత లేటా!

అధికార టీఆర్ఎస్ పార్టీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ చిచ్చు రేగుతోంది. మూడు స్థానాలు ఖాళీగా ఉన్నా..  అభ్యర్థులను ఖరారు చేయలేకపోతున్నారు గులాబీ బాస్. ఎక్కువ మంది అశావహులు ఉండటం, సీటు దక్కకపోతే కొందరు తిరుగుబాటు చేసే అవకాశం ఉందని ఐబీ సమాచారంతో కేసీఆర్ అభ్యర్థుల ఎంపికలో మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. నాయిని నర్సింహా రెడ్డి టర్మ్ జూన్ లోనే ముగిసింది. రాములు నాయక్ పార్టీమారడంతో ఆయనపై అనర్హత వేటు పడి ఆ స్థానం ఖాళీ అయింది. మరో ఎమ్మెల్సీగా ఉన్న కర్నె ప్రభాకర్ టర్మ్ ఆగస్టు 18తో ముగిసింది. గతంలో ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయితే.. రోజుల్లోనే అభ్యర్థులను ఖరారు చేసి ఎంతో ముందే ప్రకటించేవారు కేసీఆర్. అయితే సీట్లు ఖాళీగా ఉండి చాలా రోజులవుతున్నా.. ఎంపిక చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. పార్టీలో నెలకొన్న పరిస్థితులే ఇందుకు కారణమనే ప్రచారం జరుగుతోంది.    నాయినికి ఇవ్వకపోతే తిరుగుబాటే!  మాజీ హోం మంత్రి నాయిని తనకు మరో చాన్స్ దక్కుతుందని ధీమాగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన అల్లుడికి టికెట్ ఇవ్వనందుకు, తనకు మరోసారి ఎమ్మెల్సీ పదవిని కేసీఆర్ ఇస్తారని నాయిని తన అనచరులతో చెబుతున్నారు. నాయినికి మరోసారి అవకాశం ఇవ్వకపోతే ఆయన తిరుగుబాటు చేస్తారనే భయం టీఆర్ఎస్ లో ఉంది. ఇటీవల మండలి మాజీ చైర్మెన్ స్వామిగౌడ్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. ఉద్యమంలో ముందున్న నేతలకు అన్యాయం జరుగుతుందని స్వామిగౌడ్ ఆరోపించారు. పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంటే ఉన్నారు నాయిని. మొదటి టర్మ్ లో మంత్రి పదవి ఇచ్చినా... సెకండ్ టర్మ్ లో తీసుకోలేదు. రాజ్యసభకు పంపిస్తారని ప్రచారం జరిగినా అది జరగలేదు. దీంతో చాలా కాలంగా నాయిని అసంతృప్తిగానే ఉన్నారు. కొన్ని సార్లు తన అసంతృప్తిని ఓపెన్ గానే బయటపెట్టారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా ఇవ్వకపోతే ఆయన తీవ్ర నిర్ణయం తీసుకోవచ్చని టీఆర్ఎస్ నేతలు ఆందోళన పడుతున్నట్లు తెలుస్తోంది.    రేసులో పీవీ కుమార్తె వాణిదేవి.. టెన్షన్ లో దేశపతి?  ఇటీవలే పదవి కాలం పూర్తైన కర్నె ప్రభాకర్ తనకు రెన్యూవల్ ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు. పార్టీ నుంచి ఆయనకు సిగ్నల్స్ కూడా వచ్చినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్సీ పదవికోసం దేవీ ప్రసాద్, దేశపతి శ్రీనివాస్ ఆశపడుతున్నారు. అయితే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పీవీ కూతురు వాణీ దేవిని సీఎం కేసీఆర్ ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతుంది. సర్కారు నిర్వహిస్తున్న పీవీ శతజయంతి ఉత్సవాల కారణంగా వాణీ దేవి తరచుగా సీఎం కేసీఆర్ ను కలుస్తున్నారు. కాంగ్రెస్ లో పీవీకి అన్యాయం జరిగిందని కేసీఆర్ అన్నారు. వాణీ దేవిని ఎమ్మెల్సీగా ఎంపికచేసి ఆ కుటుంబానికి న్యాయం చేశామని కాంగ్రెస్ ను ఇరుకున పెట్టే వ్యూహంలో కేసీఆర్ ఉన్నట్టు ప్రచారం జరిగింది. రేసులోకి వాణీ దేవి ఎంటరవడంతో తమ చాన్స్ కు ఆమె గండి కొడుతుందేమోనని.. ఆమె సామాజిక వర్గానికే చెందిన దేశపతి, దేవీ ప్రసాద్ టెన్షన్ పడుతున్నట్లు కనిపిస్తోంది.    కొత్త వారికి ఎమ్మెల్సీ ఇవ్వాలనే డిమాండ్?  రాములు నాయక్ స్థానాన్ని తనకు ఇస్తారని మాజీ ఎంపీ సీతారాం నాయక్ ధీమాలో ఉన్నారు. 2014లో ఎంపీగా ఉన్న నాయక్ కు గత ఎన్నికల్లో సీటు ఇవ్వలేదు. గతంలో ఆయనను మండలికి పంపిస్తామని గులాబీ బాస్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇంకా చాలా మంది లీడర్లు తమ అదృష్టం పరీక్షించుకునే పనిలోపడ్డారు. సమయం వచ్చిన ప్రతిసారి కేటీఆర్ ను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఖమ్మం జిల్లా నుంచి మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వరంగల్ జిల్లా నుంచి మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ ఎంపీ గుండు సుధారాణి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు పోటీ పడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ నుంచి అరెకల నర్సారెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరావు, కరీంనగర్ నుంచి తుల ఉమ, నల్గొండ నుంచి మందుల సామేలు, గ్రేటర్ హైదరాబాద్ నుంచి బండి రమేశ్‌, క్యామ మల్లేష్ పోటీ పడుతున్నారు. టీఆర్ఎస్ ఎల్పీసెక్రటరీ రమేష్ రెడ్డి కూడా ఎమ్మెల్సీస్థానాన్ని ఆశిస్తున్నట్టు తెలిసింది. కొత్తవారికి ఎమ్మెల్సీ ఇవ్వాలనే డిమాండ్ పార్టీలో వస్తోంది. దీంతో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక కేసీఆర్ కు చిక్కుముడిగా మారిందని చెబుతున్నారు. అందుకే గతంలో ఎప్పుడు లేనంతా సమయం తీసుకుంటున్నారని తెలంగాణ భవన్ లో చర్చ జరుగుతోంది.

మెట్రో ప్రయాణీకులకు జాగ్రత్తలు

కోవిద్ 19 వైరస్ వ్యాప్తి కారణంగా ఆగిపోయిన రవాణా వ్యవస్థ ఇప్పుడిప్పుడే కదులుతోంది. అన్ లాక్ 4లో భాగంగా దేశవ్యాప్తంగా మెట్రో రైళ్లకు ఈనెల 7 నుంచి అనుమతి ఇచ్చారు. అయితే ఈనెల 12 నుంచి అన్ని కారిడార్లు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నందన మెట్రో ప్రయాణీకులకు ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం..   - మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలి - సామాజికదూరాన్ని కచ్ఛితంగా పాటించాలి. ఇందుకు అనుగుణంగా స్టేషన్లతో పాటు, రైలు బోగీల్లో కూడా మార్కింగ్ వేస్తారు. - థర్మల్ స్క్రీనింగ్ తర్వాత కరోనా లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే స్టేషన్ లోపలికి అనుమతిస్తారు. - ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు కొన్ని స్టేషన్లలోనే రైళ్ళు ఆగుతాయి. - కంటైన్మెంట్ జోన్లలో ఉండే స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసే ఉంచుతారు. - స్టేషన్ ఎంట్రన్స్ లో శానిటైజర్లు అందుబాటులో ఉంటాయి. - స్మార్ట్ కార్డ్, ఆన్ లైన్ చెల్లింపులకే ప్రాధాన్యత - టోకెన్లు, టికెట్లను కూడా సరైన రీతిలో శానిటైజ్ చేయాలి. - అతి తక్కువ లగేజీని మాత్రమే అనుమతిస్తారు. మెటల్ ఐటెమ్స్ ని అనుమతించరు.

సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్ కు మరోసారి చుక్కెదురు.. 

ఏపీలో విద్యాబోధనకు ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ జగన్ సర్కారు తీసుకొచ్చిన 81, 85 జీవోలను హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో హైకోర్టు తీర్పు పై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. విద్యార్థుల తల్లిదండ్రుల్లో 94 శాతం మంది ఇంగ్లిష్‌ మీడియంలో బోధననే కోరుతున్నారని అందువల్ల హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని సుప్రీంకోర్టును కోరింది. అయితే ఏపీ ప్రభుత్వ అభ్యర్ధనకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఏపీ ప్రభుత్వ అభ్యర్థనపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించింది. అంతేకాకుండా కేవియట్ వేసిన విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రొఫెసర్లు కూడా రెండు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేస్తున్నట్లుగా సుప్రీంకోర్టు తెలిపింది.

అయోధ్యరామ మందిరం లేఔట్ కు ఏడీఏ ఆమోదం

అయోధ్య రామ మందిరం భూమి పొరల్లో టైమ్ క్యాప్సూల్   రామ జన్మభూమి అయోధ్యలో రామ మందిరం వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న సంకల్పంతో అయోధ్య ట్రస్ట్ శరవేగంగా పనులు చేస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ భూమి పూజ చేసే నాటికే మందిర డిజైన్ మొత్తం పూర్తి అయ్యింది. భూమి పూజ తర్వాత రామ మందిర నిర్మాణం కోసం తీసుకోవల్సిన అనుమతులపై అయోధ్య ట్రస్ట్ దృష్టి సారించింది. తాజాగా రామ మందిరం లేఔట్ కు అయోధ్య డెవలప్ మెంట్ అథారిటీ(ఏడీఏ)కూడా ఆమోదం తెలపడంతో నిర్మాణ పనులు వేగవంతం చేయనున్నారు. మొత్తం లేఔట్ రెండు లక్షల 74వేల చదరపు మీటర్లు. ప్రధాన ఆలయాన్ని 12,879 చదరపు మీటర్ల విస్తీర్ణం నిర్మిస్తారు. రామ మందిరం నిర్మాణానికి సంబంధించి అన్ని శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్ తీసుకున్నారు.   అయోధ్య‌లో మొత్తం 67 ఎకరాలను ఆలయ ట్రస్ట్ కు అప్పగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ప్రధాన ఆలయాన్ని 12,879 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తారు. మిగిలిన స్థలంలో ఆల‌య కాంప్లెక్స్ నిర్మాణం జ‌రుగుతుంది. మొత్తం మూడు అంత‌స్థుల్లో నిర్మించ‌నున్నారు. అందులో గ్రౌండ్ ఫ్లోర్, మొద‌టి, రెండో అంత‌స్థులు ఉంటాయి. ఇక ఆల‌య కాంప్లెక్స్‌లో ఓ న‌క్ష‌త్ర వాటికను కూడా నిర్మించ‌నున్నారు. ఇందులో మొత్తం 27 న‌క్ష‌త్ర వృక్షాల‌ను నాటుతారు. ఇక ప్రధాన రామ మందిరానికి 15 అడుగుల లోతున పునాదులు తీయ‌నున్నారు. పూర్తిగా కాంక్రీట్‌ను ఉప‌యోగించి పునాదులు నిర్మిస్తారు. అయోధ్య రామ మందిరం ఎత్తు 161 అడుగులుగా ఉండ‌నుంది.   అయోధ్య రామ మందిరం భూమి పొరల్లో టైమ్ క్యాప్సూల్ ( టైమ్ కాప్స్యూల్ అనేది ఒక డివైస్. ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని అందులో నిక్షిప్తం చేస్తారు. ఇది భవిష్యత్ తరాలకు సమాచారాన్ని అందించే ప్రయత్నం)పెట్టబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన సమాచారం రాలేదు.

టీడీపీ నేత అచ్చెన్నాయుడికి త్వరలో ప్రమోషన్..!

కొద్ది రోజుల క్రితం కరోనా నుండి కోలుకుని ఇంటికి చేరుకున్నటీడీపీ నేత అచ్చెన్నాయుడికి త్వరలోనే పార్టీలో ప్రమోషన్ దక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన్ను ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు నియమించనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఒక నిర్ణయానికి వచ్చారని ప్రచారం జరుగుతోంది. ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడు కొద్ది రోజులు జైలులో రిమాండ్ లో ఉండి తరువాత బెయిల్‌ పై ఇటీవల బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. శాసనసభ లోపల, బయట ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతున్న కారణంగా కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే వైసీపీ ప్రభుత్వం అచ్చెన్నను అరెస్టు చేసి ఇబ్బందిపెడుతోందని చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. అయితే జైలు నుంచి బయటకు వచ్చాక అచ్చెన్న వైసీపీ సర్కారుపై దూకుడు తగ్గిస్తారా లేక మరింత తీవ్రం చేస్తారా అని ఒక పక్క చర్చ జరుగుతోంది.   ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీలో అచ్చెన్నకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. వైసీపీని రాజకీయంగా ఎదుర్కొనేందుకు దూకుడుగా వ్యవహరించే అచ్చెన్నాయుడు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉండాల్సిన అవసరం ఉందని పార్టీ లో మెజారిటీ నేతలు భావిస్తున్నారు. దీంతో అచ్చెన్నకు పదవి ఇవ్వడం పై సీనియర్ల ఆమోదం కూడా ఉండటంతో త్వరలోనే చంద్రబాబు తన నిర్ణయాన్ని కూడా ప్రకటించే అవకాశముంది. దీనిపై చంద్రబాబు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను టీడీపీ ఇప్పటికే మండలస్థాయి వరకు పూర్తీ చేయగా ఇక లోక్‌సభ నియోజకవర్గాల వారీగా కమిటీలను నియమించడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వారం, పది రోజుల్లో పార్లమెంటరీ కమిటీలను ప్రకటిస్తారని, ఆ తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీల నియామకం కూడా పూర్తిచేస్తారని తెలుస్తోంది.

మా విధుల్లో ప్రభుత్వ జోక్యాన్ని ఆపండి.. హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్

కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా నిమ్మగడ్డ తిరిగి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం విధుల్లో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఆరోపించారు. అంతేకాకుండా తమ స్వతంత్రతను అణచివేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో తమ సిబ్బందిపై సీఐడీ ఫైల్ చేసిన కేసును కూడా రాజ్యాంగ విరుద్ధం గా ప్రకటించాలని, అంతేకాకుండా ఈ మొత్తం వ్యవహారం పై సీబీఐతో దర్యాప్తునకు ఆదేశించాలని పిటిషన్‌ దాఖలు చేశారు. ఎస్‌ఈసీ సహాయ కార్యదర్శి సాంబమూర్తి ఉపయోగించిన కంప్యూటర్‌ను, అందులోని డేటాను సీఐడీ అధికారులు తీసుకెళ్లారని.. వారు స్వాధీనం చేసుకున్న వస్తువులన్నిటినీ తమకు తిరిగి అప్పగించేలా ఆదేశాలివ్వాలని ఆ పిటిషన్ లో నిమ్మగడ్డ కోరారు. గతంలో తాను కేంద్రానికి రాసిన ఒక లేఖ వ్యవహారానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన సీఐడీ అధికారులు.. ఆ విషయాన్ని పూర్తిగా పక్కనబెట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు మాత్రమే ఆసక్తి చూపారన్నారు.   అప్పటికే పని చేయని ఒక కంప్యూటర్‌ను ఫార్మాట్‌ చేసినందుకు తన సహాయ కార్యదర్శి సాంబమూర్తిని సీఐడీ అధికారులు వేధించడమే గాక.. సాక్ష్యాలను ధ్వంసం చేశారంటూ ఆయనపై తప్పుడు కేసు పెట్టారని అయన తెలిపారు. కేవలం ఎన్నికల కమిషన్‌ను, ఉద్యోగులను వేధించేందుకే ప్రభుత్వం ఆ కేసు పెట్టిందన్నారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సీఐడీ అదనపు డీజీ, కేంద్ర హోం శాఖ కార్యదర్సులను ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఎస్‌ఈసీ సహాయ కార్యదర్శి సాంబమూర్తి కూడా హైకోర్టును ఆశ్రయించడంతో.. ఈ రెండు పిటిషన్లను కలిపి విచారించేలా వీటిపై తరువాతి విచారణను ఈ నెల 7కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. తనకు భద్రత కల్పించాలని గతంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ కేంద్రానికి రాసిన లేఖపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అనుమానం వ్యక్తం చేస్తూ.. దీనిపై విచారణ జరిపించాలని డీజీపీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

దుబ్బాక బరిలో రాములమ్మ.. టీఆర్ఎస్ కి ఓటమి తప్పదా?

ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించడంతో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. అయితే దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి బరిలోకి దిగే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.   కరోనా కాలంలో కూడా దుబ్బాక ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోంది. అసలు మొదట్లో దుబ్బాక బరిలో టీఆర్ఎస్ తరఫున కల్వకుంట్ల కవిత నిలవనున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ ప్రచారంలో నిజం లేదని, టీఆర్ఎస్ తరఫున రామలింగారెడ్డి కుటుంబసభ్యుల్లో ఒకరు పోటీ చేసే అవకాశముందని తెలుస్తోంది. ఇక కాంగ్రెస్, బీజేపీ కూడా టీఆర్ఎస్ తరఫున ఎవరు బరిలో నిలిచినా తాము బరిలోకి దిగి తీరుతామని ఇప్పటికే ప్రకటించాయి. బీజేపీ తరఫున రఘునందన్ రావు పోటీకి దిగనుండగా, కాంగ్రెస్ తరపున ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు విజయశాంతి పేరు తెరమీదకు వచ్చింది.    గతంలో మెదక్ ఎంపీగా వ్యవహరించిన విజయశాంతిని దుబ్బాక బరిలో నిలిపితే పోరు రసవత్తరంగా ఉంటుందన్న ఆలోచన కాంగ్రెస్ వర్గాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన విజయశాంతి రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. మెదక్ ఎంపీగా పనిచేసిన ఆమెకు ఉమ్మడి మెదక్ జిల్లాపై మంచి పట్టుంది. గత ఎన్నికల్లో దుబ్బాక నుంచి కాంగ్రెస్‌ కు సరైన అభ్యర్థి లేకున్నా రెండో స్థానం కైవసం చేసుకుంది. ఇప్పుడు విజయశాంతిని బరిలోకి దింపితే అన్ని రకాలుగా కలిసి వస్తుందని, విజయశాంతి వ్యక్తిగత ఇమేజ్ తమకు ప్లస్ అవుతుందని కాంగ్రెస్‌ పార్టీ లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది. పోటీ చేసే విషయంపై విజయశాంతి కూడా పాజిటివ్‌ గా ఉన్నట్లు సమాచారం.   దుబ్బాకలో విజయశాంతి బరిలోకి దిగితే టీఆర్ఎస్ కి ఎదురుదెబ్బ తగిలే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే దుబ్బాక టీఆర్ఎస్ లో గ్రూపు రాజకీయాలు దుమారం రేపుతున్నాయి. రామలింగారెడ్డి కుటుంబం పోటీ పట్ల టీఆర్ఎస్‌ లో అసంతృప్తి ఉంది. టికెట్ విషయంలో టీఆర్ఎస్‌లో ఉన్న అనిశ్చితి, నియోజకవర్గంలో విజయశాంతికి పట్టు, పార్టీలకు అతీతంగా ఆమెకున్న వ్యక్తిగత ఇమేజ్.. టీఆర్ఎస్ ను దెబ్బ తీసే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ప్రధాని మోడీ పర్సనల్ ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసిన సైబర్ నేరస్థులు 

ప్రధాని నరేంద్ర మోడీ పర్సనల్ ట్విట్టర్ అకౌంట్ ను ఈ తెల్లవారుజామున సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. తాజాగా ఈ విషయాన్ని ట్విట్టర్ కూడా నిర్ధారించింది. narendramodi_in పేరుతొ ఉన్న ఈ అకౌంట్ ను గురువారం తెల్లవారుజామున 3:15 గంటల సమయంలో హ్యాకర్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఈ అకౌంట్ నుండి వరుసగా రెండు ట్వీట్లు చేసి కలకలం రేపారు. మొదటి ట్వీట్ లో "కరోనా కట్టడి కోసం అందరూ ప్రధాన మంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్‌కు క్రిప్టో కరెన్సీ రూపంలో విరాళాలు అదించండి. ఇండియాలో కూడా బిట్ కాయిన్ రూపంలో క్రిప్టో కరెన్సీ లావాదేవీలు ప్రారంభమయ్యాయి.'' అని మొదట ఓ ట్వీట్ చేశారు. ఇక రెండో ట్వీట్ లో ''అవును ఈ అకౌంట్ ను జాన్ విక్‌ బృందం హ్యాక్ చేసింది. మేమేమి పేటీఎం మాల్‌ను హ్యాక్ చేయలేదు.'' అని పేర్కొన్నారు. అయితే హ్యాకర్ల బారినపడిన narendramodi_in ట్విటర్ అకౌంట్ ప్రధాని మోదీ వ్యక్తిగత వెబ్‌సైట్‌ కి సంబంధించినదే కానీ అది ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విటర్ అకౌంట్ కాదు. ఐతే దీనిపై వెంటనే దర్యాప్తు మొదలు పెట్టినట్లు ట్విట్టర్ ప్రతినిధి పేర్కొన్నారు. హ్యాక్ అయిన మోదీ ఖాతాకు 2.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే వెంటనే అప్రమత్తమైన ట్విటర్ టీమ్ హ్యాకర్లు పెట్టిన ఆ రెండు ట్వీట్లను తొలగించింది. ప్రస్తుతం ఆ ఖాతాను తమ ఆధీనంలోకి తీసుకుంది.   గత జులైలో కూడా ఇలాగె ప్రపంచంలోని పలువురు ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్ లు హ్యాక్‌కు గురవడం అప్పట్లో సంచలనం రేపింది. తాజాగా ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కావడం మరింత కలకలం రేపుతోంది. జులైలో అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న అభ్యర్థి జో బైడెన్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మల్టీ బిలియనీర్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ అకౌంట్ లు హ్యాక్‌ కు గురయ్యాయి. అంతేకాకుండా ఆ మధ్య ఉబెర్, యాపిల్ కంపెనీలకు చెందిన అధికారిక అకౌంట్లు కూడా హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోయాయి. అయితే ఇలాంటి ఘటనలు వరుసగా జరగుతుండడంతో ట్విటర్ టెక్నికల్ టీమ్ దీనిపై సీరియస్‌గా దృష్టిపెట్టింది.

సౌదీ కన్నా తక్కువ భారత్ రక్షణ బడ్జెట్

ప్రపంచంలోని అనేక దేశాలు తమ రక్షణ బడ్జెట్ ను ఏటేటా పెంచుతున్నాయి. జాతీయ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వేల కోట్ల రూపాయలను రక్షణారంగానికి కేటాయిస్తున్నాయి. భారత్ చైనా సరిహద్దుల్లో యుద్ధవాతావరణం నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఏయే దేశాలు రక్షణవ్యవస్థ కోసం ఎంత బడ్జెట్ ను కేటాయిస్తున్నాయో పరిశీలిస్తే సౌదీ అరేబియా కన్నా భారత దేశం తక్కువ బడ్జెట్ ను రక్షణా రంగానికి కేటాయిస్తోంది.   ప్రపంచ మొత్తం సైనిక వ్యయం 2018 లో సుమారు 8 1.8 ట్రిలియన్లు. ఇది 2017 బడ్జెట్ కన్నా 2.6శాతం అధికం. ప్రపంచంలో అత్యధిక రక్షణ వ్యయం ఉన్న పది దేశాలు రక్షణా రంగానికి కేటాయిస్తున్న బడ్జెట్ వివరాలు పరిశీలిస్తే ఆయా దేశాలు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాయో తెలుస్తోంది.   యునైటెడ్ స్టేట్స్ అమెరికా రక్షణ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఏటా బడ్జెట్ లో కేటాయింపులు పెంచుతోంది. సైనికుల జీతభత్యాలతో పాటు పరిశోధనలకు కూడా ఇందులో కేటాయింపులు ఉంటాయి. అమెరికా రక్షణ వ్యయం 649 బిలియన్ డాలర్లు   చైనా  ప్రపంచంలో అధిక జనాభా ఉన్న చైనా రక్షణ రంగానికి భారీగానే కేటాయింపులు చేస్తోంది. ప్రతి ఏటా 250 బిలియన్ డాలర్లకు మించి రక్షణ శాఖకు కేటాయింపులు చేస్తోంది.   సౌదీ అరేబియా  ఈ దేశ జనాభా సుమారు 34,813,871. అయితే రక్షణ రంగానికి కేటాయింపులు మాత్రం 67. 6 బిలియన్ డాలర్లు. అంటే ఆ దేశ జిడిపిలో 8.8శాతం.   భారత్ భారతదేశంలో రక్షణా వ్యయం 66.5 బిలియన్ డాలర్లు. అంటే జిడిపిలో 2.4శాతం మాత్రమే. సౌదీ అరేబియా కేటాయించిన దాని కంటే ఇది తక్కువ.   ఇరత దేశాలు ఇక ఇతర దేశాల రక్షణా బడ్జెట్ ను పరిశీలిస్తే ఫ్రాన్స్   63.8 బిలియన్ డాలర్లు, రష్యా  61.4 బిలియన్ డాలర్లు, యునైటెడ్ కింగ్‌డమ్ 50 బిలియన్ డాలర్లు, జర్మనీ  49.5 బిలియన్ డాలర్లు, జపాన్  46.6 బిలియన్ డాలర్లు, దక్షిణ కొరియా  43.1 బిలియన్ డాలర్లు.  

చైనా సరిహద్దుల్లో హైఅలర్ట్.. అత్యవసరంగా తరలుతున్న బలగాలు

భారత చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు తీవ్రమవుతుండటంతో కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది. దీంతో సరిహద్దుల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని తాజాగా హోం శాఖ భద్రతా బలగాలను ఆదేశించింది. భారత్ కు చైనా, నేపాల్, భూటాన్లతో గల సరిహద్దుల్లో భద్రతా బలగాలు హైఅలర్ట్ లో ఉండాలని హోం శాఖ ఆదేశించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి.   మరీ ముఖ్యంగా చైనాకు ఆనుకుని ఉన్న సరిహద్దుల్లో పెట్రోలింగ్, నిఘాను పెంచాలని సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ)‌ కు, ఇండో టిబెటెన్ బోర్టర్ పోలీసు (ఐటీబీపీ) కి తాజాగా హోం శాఖ ఆదేశాలు జరీ చేసింది. ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్, సిక్కిం సరిహద్దుల్లో చాలా అప్రమత్తంగా ఉండాలని ఐటీబీపీని హోం శాఖ ఆదేశించింది. దీనితో పాటు, ఇదే సమయంలో ఇండో-నేపాల్-చైనా ట్రై జంక్షన్, ఉత్తరాఖండ్‌లోని కాలాపాని ప్రాంతంలో కూడా తమ నిఘా పెంచాలని ఎస్ఎస్‌బీ, ఐటిబిపిలకు హోమ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.   కాగా కేంద్ర హోం శాఖ తాజా ఆదేశాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌బీకి చెందిన పలు కంపెనీల దళాలను భారత్ నేపాల్ సరిహద్దుకు తరలించారు. ఇంతకుముందు జమ్మూకశ్మీర్, ఢిల్లీలో మోహరించిన ఈ బలగాలను తాజాగా బోర్డర్ కు తరలించారు. అంతేకాకుండా ఎల్ఏసీ వెంట మన భూభాగంలోని ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న భద్రతా బలగాలను అక్కడి నుంచి ఎటువంటి పరిస్థితుల్లోనూ కదలవద్దని కూడా ఆదేశాలు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. తాజాగా చైనా సరిహద్దు ప్రాంతాలను మార్చేందుకు విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కొన్ని "వ్యూహాత్మక ప్రదేశాల్లో" మన సైన్యాన్ని మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. ఇప్పటికే తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగ్యాంగ్ లేక్ చుట్టూ ఉన్న కీలక ప్రాంతాల్లో మరిన్ని అదనపు బలగాలను మోహరిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఓ వైపు మిలటరీ చర్చలు జరుగుతుండగానే నిన్న(మంగళవారం) చైనా మరోసారి బోర్డర్ లో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే.

చైనాకు భారత్ మరో పెద్ద షాక్.. పబ్జీ సహా 118 యాప్ లు బ్యాన్ 

ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం చైనాకు మరో పెద్ద షాక్ ఇచ్చింది. గత కొద్దిరోజులుగా సరిహద్దు వివాదం పై చైనా ఒకపక్క భారత్ తో చర్చలు జరుపుతూనే మరోపక్క సరిహద్దుల్లో దుందుడుకుగా వ్యవహరిస్తూండటంతో కేంద్రం తాజాగా మరికొన్ని చైనీస్ యాప్‌లపై వేటు వేసింది. ఆన్‌లైన్ గేమింగ్ యాప్ పబ్జీతో పాటు మరో 118 చైనా మొబైల్ యాప్ లపై నిషేధం విధిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పబ్జీపై నిషేధం విధించినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించడంతో వెంటనే భారత్‌లో ఈ గేమింగ్ యాప్‌ను అందుబాటులో లేకుండా అటు గూగుల్ ప్లే స్టోర్ నుండి, ఇటు యాపిల్ ప్లే స్టోర్ నుంచి కూడా తొలగించారు. ఈ పబ్జీ యాప్‌ను మన దేశంలో దాదాపు 50 మిలియన్ల మందికి పైగా వినియోగిస్తున్నారు. ఇప్పటికే గల్వాన్ లోయ వద్ద జరిగిన ఘర్షణల సమయంలో దేశ భద్రత, రక్షణ దృష్ట్యా టిక్ టాక్ తో సహా మరో 59 యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.   అయితే ఈ పబ్జీ యాప్ ను నిషేధించాలని గత కొంత కాలంగా తల్లితండ్రులు ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఒక మాతృమూర్తి దీనిని నిషేధించాలని ఏకంగా ప్రధానికి కూడా విజ్ఞప్తి చేసింది. ఈ యాప్ వ్యామోహంలో పడి కొంతమంది యువత తమ సమయాన్ని కూడా మరిచిపోయి ప్రవర్తించడం కూడా మనం చూస్తున్నాం. మరి కొంత మంది టీనేజర్లయితే తల్లితండ్రులు తమను ఈ గేమ్ ఆడనివ్వడం లేదని ఏకంగా ఆత్మహత్యలు కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. చివరికి కారణమేదైనా ఈ యాప్ ను మనదేశంలో బ్యాన్ చేయడం భారత్ లోని తల్లి తండ్రులకు పెద్ద ఊరట అనే చెప్పాలి.

ఏపీ గవర్నర్ మౌనానికి కారణం అదేనా?

కారణాలేమిటో తెలియదుకాని, ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాత్రం ఈమద్యకాలంలో సైలెంట్ అయ్యారు. కోవిడ్ మహమ్మారి రాష్ట్రంలో విపరీతంగా ప్రబలుతున్న నేపధ్యంలో, ఆయన వయసు రీత్యా ఎలాంటి కార్యక్రమాలకి హాజరు అవడం గాని, సందర్శకులకు కలవడం గాని చేయడంలేదని రాజ్ భవన్ వర్గాలు అంటున్నప్పటికీ, కనీసం పండుగలు పబ్బాలప్పుడు కూడా మెసేజిలు కూడా ఇవ్వడం మానేశారు..    సహజంగా ఏదైనా పండగలకో, మరేఇతర కార్యక్రమాలకో రాజ్ భవన్ నుండి రాష్ట్ర ప్రజలకు సందేశాలు రావడం సహజం. అలాంటిది, కనీసం అత్యంత ప్రాముఖ్యమున్న వినాయక చవితికి కూడా గవర్నర్ వద్దనుండి ఎలాంటి సందేశం లేదంటే, పరిస్థితిని సులభంగానే అర్థంచేసుకోవచ్చు.    దీనికి కారణాలేయమైనప్పటికీ, ఆంధ్ర ప్రదేశ్ లోని రాజకీయ వర్గాలు మాత్రం దీనిని వేరే కోణంలో చూస్తున్నాయి. ముఖ్యంగా, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ విషయంలో అయితే నేమి, రాజధాని మార్పు, సీఆర్డీయే చట్టం రద్దు విషయంలో అయితే నేమి, రాజ్ భవన్ కొంత విమర్శలు ఎదుర్కొన్న మాట నిజం. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ విషయంలో అయితే నేరుగా సుప్రీమ్ కోర్ట్ గవర్నర్ విడుదల చేసిన ఆర్డినెన్సు ను పూర్తిగా చెల్లదని చెప్పడంతో, రాజ్ భవన్ వర్గాలు కొంత ఆశ్చర్యానికి గురైన మాట వాస్తవం.    ఇక, మూడు రాజధానులు మరియు సీఆర్డీఏ చట్టం రద్దు విషయాలైతే ప్రస్తుతానికి హై కోర్ట్ దాటి సుప్రీమ్ కోర్ట్ వరకు వెళ్ళాయి. దేశ అత్యున్నత న్యాయస్తానం నిర్ణయం ఇంకా రానప్పటికీ, వీటిపై గవర్నర్ తీసుకున్న నిర్ణయాలు మాత్రం కొంతవరకు విమర్శలకు గురైనాయి.    అప్పటినుండే, రాష్ట్ర గవర్నర్ మౌనం వహించారని రాజకీయ విశ్లేషకుల వాదన. కోవిద్ నేపథ్యంలో అయితేనేమి, ఆయన వయసు రీత్యా అయితేనేమి,  గవర్నర్ ప్రత్యక్ష్యంగా జనబాహుళ్యంలోకి రాకపోయినా, కనీసం ఆన్లైన్ ద్వారా నయినా కొన్నీ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలున్నప్పటికీ, ఎందుకో తెలియదుకాని, ఆయన మౌనం వహించారు.    సుమారు అదే వయసులో వున్న హిమాచల ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ దాదాపు ప్రతి రోజు ఏదోవిధంగా వార్తల్లో ఉంటూనే వున్నారనేది అందరికి తెలిసిందే. ఇక తెలంగాణా గవర్నర్ తమిళసై అయితే దాదాపు ప్రతిరోజు ఏదోఒక కార్యక్రంలో పాల్గొంటూనే వున్నారు. లేదా కనీసం రాజ్ భవన్ నుండి ఏదోఒక సందేశాన్నైనా విడుదల చేస్తారు.    అలాంటిది, ఆంధ్ర గవర్నర్ కనీసం వినాయక చవితి శుభాకాంక్షలు కూడా రాష్ట్ర ప్రజలకు అందించలేదు. చివరిసారిగా బిశ్వభూషణ్ హాజరైన కార్యక్రమం, జగన్ కేబినెట్లో ఇద్దరు మంత్రులు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మరియు అప్పలరాజు లకు జులై 22 న ప్రమాణ స్వీకారం చేయించినప్పుడు మాత్రమే. అప్పుడు కూడా రాష్ట్రం కోవిద్ మహమ్మారి గుప్పట్లోనే వుంది. ఇంకా చెప్పాలంటే, లాక్ డౌన్ అప్పట్లో చాలా పకడ్బందీగా అమలవుతున్న సమయం. కానీ, ఆయన దీనికి హాజరవడం, కొంతమంది ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత, ఇక కేవలం ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డిని మాత్రమే ఆయన రెండు సార్లు కలవడం జరిగింది. అదికూడా ఆ రెండు ఆర్డినెన్సు లు విడుదల చెయ్యడానికి మాత్రమే.    ఎందుకో తెలియదుకాని, జగన్ కూడా మూడు రాజధానుల విషయంలో విడుదల చేసిన నోటిఫికేషన్ తర్వాత, ఆయన కూడా రాజ్ భవన్ కు వెళ్లిన దాఖలాలు కనబడ్డంలేదు. కోవిడా, మరే ఇతర కారణలా, ఏది ఏమైనప్పటికి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాత్రం ఈ మధ్య కొంత మౌనంగానే వుంటున్నారనేది మాత్రం వాస్తవం.