నెల రోజుల వ్యవధిలో రెండోసారి కరోనా బారిన పడిన మహిళ

కరోనా నుంచి కోలుకున్నాం, ఇక మాకు తిరుగులేదు అనుకుంటే పొరపాటే. అనేకమంది రెండోసారి కూడా కరోనా బారినపడుతున్నారు. ఇటీవల మనదేశంలో కూడా రెండోసారి కరోనా బారిన పడుతున్న ఘటనలు బాగానే వెలుగు చూస్తున్నాయి. ఏపీలో టీటీడీ ఉద్యోగి రెండోసారి కరోనా బారిన పడిన ఘటన మరువకముందే.. బెంగళూరులో ఓ మహిళ నెల రోజుల వ్యవధిలో రెండోసారి కరోనా బారినపడడం కలకలం రేపుతోంది. 27 ఏళ్ల మహిళ కరోనా సోకడంతో జులై మొదటి వారంలో ఆసుపత్రిలో చేరింది. చికిత్స అనంతరం నెగటివ్ రావడంతో అదే నెల 24న ఆమెను డిశ్చార్జ్ చేశారు. అయితే, నెల రోజుల తర్వాత కరోనా లక్షణాలతో మళ్లీ ఆసుపత్రిలో చేరింది. దీంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. బెంగళూరులో రెండోసారి కరోనా సోకిన తొలి వ్యక్తి ఆమే కావడం గమనార్హం.   కాగా, ముంబై లోనూ ఇటీవల నలుగురు వైద్యులు రెండోసారి కరోనా బారినపడ్డారు. నెదర్లాండ్స్, బెల్జియం వంటి దేశాలలోనూ రెండోసారి కరోనా బారినపడిన కేసులు వెలుగుచూస్తున్నాయి. రెండోసారి కరోనా సోకడంపై ఇప్పటికే పలు పరిశోధనలు జరుగుతున్నాయి. కోలుకున్న తర్వాత వారి శరీరంలో మిగిలి ఉన్న వైరస్ అవశేషాలతో తిరగబెట్టిందా? లేక అది కొత్తగా సోకిందా? అన్న విషయంలో ఇప్పటి వరకు శాస్త్రవేత్తల్లో స్పష్టత లేదు. 

మంచైతే మనదే.. టీడీపీ, వైసీపీ డబుల్ గేమ్.. ఏపీలో రచ్చ

మంచి జరిగితే తమ ఖాతాలో వేసుకోవడం, చెడుదయితే ఇతరులకు అంటగట్టడం. ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పార్టీలు ఇదే పంథా అనుసరిస్తున్నాయి. తమ డబుల్ స్టాండర్ట్ విధానాలతో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పథకాలు హిట్ అయితే తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫెయిల్ అయితే మాత్రం.. విపక్షాలకు అంటగడుతుంటారు. తాజాగా ఈజ్ ఆఫ్ డూయింగ్, రైతు ఆత్మహత్యలపై వచ్చిన ర్యాంకులు, నివేదికలు వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్దానికి దారి తీశాయి.    కేంద్ర సర్కార్ నిర్వహించే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ ర్యాకింగ్స్ లో దేశంలోనే ఏపీకి తొలిర్యాంకు ద‌క్కింది. ర్యాంకులు విడుదలైన వెంటనే చంద్రబాబు, టీడీపీ టీమ్.. ఈ ఘనతను  ఫుల్‌గా త‌న ఖాతాలోనే  వేసుకునే ప్రయత్నాలు చేసింది. గత ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే.. EODBలో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేషన్ ట్వీట్ చేశారు. 2018- 2019‌లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీకి మొదటి ర్యాంకు రావటం అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కృషికి నిదర్శనం అని  ట్వీట్ లో పేర్కొన్నారు. వైసీపీ నేతలు కూడా తాము ప్రారంభించిన కొత్త పారిశ్రామిక విధానాల వల్లే ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని గొప్పలు చెప్పుకున్నారు.    దేశంలో రైతు ఆత్మహత్యలపై ఇటీవలే ఓ సంస్థ నివేదిక ఇచ్చింది. 2019లో రైతు ఆత్మహత్యలు గతంలో కంటే భారీగా పెరిగాయి. దీంతో టీడీపీ నేతలు జగన్ సర్కార్ టార్గెట్ గా ఆరోపణలు చేశారు. వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం వల్లే అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. రైతే రాజు అనే రోజు తీసుకొస్తా అని అసలు రైతే లేని రోజు తీసుకొస్తున్నారని నారా లోకేష్ ట్వీట్ చేశారు. విత్తనాలు, ఎరువులు కూడా ఇవ్వలేక చేతులెత్తేసింది. అసమర్థ వైకాపా ప్రభుత్వం. అన్నదాతల ఆత్మహత్యల్లో దేశంలోనే మూడో స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది.ఇకనైనా పబ్లిసిటీ పిచ్చిని పక్కన పెట్టి రైతన్నలను కాపాడండని లోకేష్ ట్వీట్ లో పేర్కొన్నారు. వైసీపీ నేతలు కూడా ఘాటుగాగే స్పందించారు. చంద్రబాబు ఐదేండ్ల పాలనలో వ్యవసాయం నిర్లక్ష్యానికి గురైందని, అందుకే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు.    2019 మే వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జూన్ నుంచి జగన్ పాలన మొదలైంది. ఈ లెక్కన 2019లో ఏం జరిగినా రెండు ప్రభుత్వాలకు లింక్ ఉంటుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ స‌ర్వే 2019 ఆగ‌స్టు వ‌ర‌కు జ‌రిగిందని కేంద్ర‌మే ప్ర‌క‌టించింది. దీనిని బ‌ట్టి మేలోనే పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన జ‌గ‌న్‌కు కూడా దీనిలో భాగం ఉంద‌నే చెప్పాలి. ఇక‌ ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభ‌మైన‌.. ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు పాలించారు కాబ‌ట్టి చంద్ర‌బాబు కూడా ఫిఫ్టీ ప‌ర్సెంట్ ద‌క్కుతుంది. కాని ఎవరికి వారు తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. రైతు ఆత్మహత్యలకు రెండు ప్రభుత్వాల బాధ్యత ఉంటుంది. కాని ఎవరూ ఆ పని చేయడం లేదు.    ఇక‌ జ‌గ‌న్ సర్కార్ విద్యుత్ సంస్క‌ర‌ణ‌లు అంటూ రైతులు వినియోగించే విద్యుత్ కు మీట‌ర్లు పెడ‌తామ‌ని చెబుతున్నారు. మంత్రి పేర్ని నాని.. కేబినెట్‌లో తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని వెల్ల‌డించిన వెంట‌నే స్పందించిన చంద్ర‌బాబు.. ఇది నా ఆలోచ‌నే! అంటూ ప్ర‌చారానికి దిగారు. సంస్క‌ర‌ణ‌ల‌కు ఆద్యుడు తానేన‌ని ప్ర‌క‌టించుకున్నారు. ఓ రెండు గంట‌లు గ‌డిచిన త‌ర్వాత ఇది అక్ర‌మం, అన్యాయం అంటూ.. గొంతు స‌వ‌రించుకున్నారు చంద్రబాబు. రైతుల‌కు శాప‌మంటూ తిట్ట‌దండ‌కం అందుకున్నారు. ఇలా అన్ని విష‌యాల్లోనూ టీడీపీ, వైసీపీలు.. మంచిని తమ ఖాతాలో వేసుకుంటూ.. చెడును ఇతర పక్షాలకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు డబుల్ గేమ్ ఆడుతుండటంపై స‌ర్వ‌త్రా విమర్శలు వస్తున్నాయి.

ఎన్టీఆర్ పాఠ్యాంశం.. కేసీఆర్ డేర్ .. బాబు ఢీలా! జగన్ నిర్ణయం... 

రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ దిట్ట. పరిస్థితులకు అనుగుణంగా ఆయన ఎత్తులు వేస్తూ ముందుకు పోతుంటారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన ఎప్పటికప్పుడు కార్యాచరణ మారుస్తూ వెళ్లారు. తనకు నచ్చిన ఆలోచనలు, వ్యూహాలు వెంటనే అమలు చేస్తుంటారు. ముఖ్యమంత్రిగానూ ఆయన తాను అనుకున్నది చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఇబ్బంది అవుతుందని తెలిసినా కొన్ని విషయాల్లో ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గరు. సమగ్ర సర్వే, కాళేశ్వరం ప్రాజెక్టు,  భూముల సర్వే.. ఇలా అన్నివిషయాల్లో విపక్షాలు ఎన్ని ఆరోపణలు, విమర్శలు చేసినా కేసీఆర్.. ఎవరిని పట్టించుకోకుండా తాను అనుకున్నది చేస్తూ పోయారు. తాజాగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జీవితాన్ని 10వ తరగతి సాంఘిక శాస్త్రంలో చేర్చారు  కేసీఆర్. సాంఘిక శాస్త్రంలో 268వ పేజీలో ఎన్టీఆర్ పాఠ్యాంశాన్ని ముద్రించారు. జాతీయ కాంగ్రెస్ నాయకత్వం నుంచి తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి అవమానం జరిగిందని భావించిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని... పేదలకు రూ.2కే కిలో బియ్యం,మధ్యాహ్నం భోజన పథకం,మధ్యపాన నిషేధం వంటి పేదల సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని ఎన్టీఆర్ జీవిత చరిత్రకు సంబంధించిన విశేషాలను పాఠ్యాంశంలో పేర్కొన్నారు. ఎన్టీఆర్ విదేశాలకు వెళ్లినప్పుడు జరిగిన నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు ఎపిసోడ్‌ను కూడా పాఠ్యాంశంలో ప్రస్తావించారు.ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ నిర్ణయాన్ని టీడీపీ నేతలు స్వాగతిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే,టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ  కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.    కేసీఆర్ నిర్ణయంతో చంద్రబాబు వ్యవహారశైలిపైనా ప్రచారం జరుగుతోంది. టీడీపీ వ్యవస్థాపకుడు, తన మామైన ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యంశంగా చేర్చాలని చంద్రబాబు ఆలోచన చేయలేకపోయారనే వాదన వస్తోంది. అయితే చంద్రబాబు ఏ నిర్ణయాన్ని డేర్ గా తీసుకోలేరని, ఎన్టీఆర్ చరిత్రను పాఠ్యాంశంగా మారిస్తే విపక్షాలు వ్యతిరేకిస్తాయని ఆయన ఆలోచించి ఉండవచ్చని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న విషయంలోనూ చంద్రబాబు విఫలమయ్యారని ఆయన వ్యతిరేకులు విమర్శిస్తుంటారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. చంద్రబాబు ఆ డిమాండ్ ను కూడా నేరవెర్చలేదు. ప్రస్తుత సీఎం జగన్ మాత్రం జిల్లాల పునర్విభజనకు సిద్ధమవుతున్నారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే చంద్రబాబుకు ఇబ్బందే. ఎన్టీఆర్ పేరును ఓట్ల కోసం మాత్రమే చంద్రబాబు వాడుకున్నారని ఆయన వ్యతిరేకులు మరింత ప్రచారం చేసే అవకాశం ఉంది.    మొత్తానికి పదో తరగతి పాఠ్యాంశంలో ఎన్టీఆర్ జీవిత చరిత్రను చేర్చిన తెలంగాణ సీఎం కేసీఆర్.. అన్నగారి అభిమానులతో పాటు టీడీపీ కార్యకర్తల ప్రశంసలు అందుకుంటున్నారు. అదే సమయంలో చంద్రబాబుకు ఇబ్బందికర పరిస్థితులు కల్పించారు. అయితే ఎన్టీఆర్ పాఠ్యాంశంపై తెలంగాణలోని ఇతర రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తిగా మారింది. తెలంగాణ ఉద్యమ సంఘాల నుంచి వ్యతిరేకత రావచ్చని భావిస్తున్నారు. మొత్తానికి  రాజకీయాల్లో కేసీఆర్ రూటే సెపరేటు కదూ..

ఇది భారత్ కి చైనాకి తేడా.. మనవాళ్ళు కాపాడారు.. వాళ్ళు కిడ్నాప్ చేశారు

భారత బలగాలు, చైనా బలగాలు మధ్య వ్యత్యాసం ఏంటో తాజాగా జరిగిన రెండు సంఘటనలు తెలియజేస్తున్నాయి. ఒకవైపు చైనాకు చెందిన ముగ్గురు వ్యక్తులను భారత బలగాలు రక్షించగా.. మరోవైపు ఐదుగురు భారతీయులను చైనా బలగాలు అపహరించుకుని వెళ్లాయి.   ఉత్తర సిక్కిం ప్రాంతంలో సముద్ర మట్టానికి దాదాపు 17,500 అడుగుల ఎత్తైన ప్రాంతంలో కారులో ప్రయాణిస్తున్న చైనాకు చెందిన ముగ్గురు వ్యక్తులు దారి తప్పి భారత భూభాగంలోకి ప్రవేశించారు. అయితే భార‌త్- చైనాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త‌లు ఉన్న వేళ కూడా భారత సైనికులు వారిని రక్షించి మానవత్వాన్ని, మన దేశ గొప్పతనాన్ని చాటారు. భార‌త సైనికులు మొదట వారిని అడ్డుకుని ప్ర‌శ్నించి.. పొర‌పాటున దారి తప్పార‌ని నిర్ధారించుకున్న అనంత‌రం వారికి ఆక్సిజన్ తో పాటు మెడిక‌ల్ సాయం అంద‌చేశారు. అలాగే వారికి ఆహారం ఇచ్చారు. చలిని త‌ట్టుకునేందుకు వీలుగా వారికి వెచ్చ‌టి దుస్తులను కూడా ఇచ్చి.. వారు చైనా వెళ్లేందుకు మార్గం చూపి సాగ‌నంపారు.   ఐతే ఒకవైపు చైనా వ్యక్తులను భారత సైనికులు రక్షిస్తే.. మరోవైపు, అరుణాచల్ ప్రదేశ్ లో మన దేశానికి చెందిన ఐదుగురిని చైనా సైనికులు అపహరించడం గమనార్హం. భారత్- చైనా సరిహద్దుల్లో ఉన్న ఎగువ సుబాన్‌సిరి జిల్లాలోని అడవుల్లో శుక్రవారంనాడు వేటకు వెళ్లిన ఐదుగురు భారతీయులను చైనా బలగాలు అపహరించుకుని వెళ్లాయి. వేటకు వెళ్లిన గ్రూపులోని ఇద్దరు ఎలాగో తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, ఈ ఘటనపై వాస్తవాలను నిర్ధారణ చేసుకుని, తక్షణం నివేదిక ఇవ్వాల్సిందిగా నాచో పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి ఆఫీసర్‌ ను ఆదేశించినట్టు పోలీస్ సూపరింటెండెంట్ తరు గుస్సార్ తెలిపారు.

బ్రేకింగ్.. చంద్రబాబుకు త్రుటిలో తప్పిన ప్రమాదం!!

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి హైదరాబాదుకు రోడ్డు మార్గంలో వస్తుండగా.. ఆయన కాన్వాయ్‌ లోని వాహనానికి ప్రమాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.    కాన్వాయ్ కి ఓ ఆవు అడ్డురావడంతో ఎస్కార్ట్‌ వాహనం డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేశారు. ఈ క్రమంలో కాన్వాయ్ లో ముందు ఉన్న ఎస్కార్ట్ వాహనాన్ని బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఒక్కసారిగా ఢీ కొట్టింది. ఆ తర్వాతి వాహనంలోనే చంద్రబాబు ఉన్నారు. ఈ ప్రమాదంలో చంద్రబాబు సహా, ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేవలం వాహనాలు మాత్రమే స్వల్పంగా డ్యామేజ్ అయ్యాయి. ఈ ఘటన అనంతరం కాన్వాయ్ అక్కడి నుంచి హైదరాబాదు వైపు కదిలింది.

ప్రభుత్వ చర్యలు ఎండగట్టేందుకు వ్యూహం

తెలంగాణ రాష్ట్రంలో ఒక వైపు కరోనా.. మరోవైపు కరెప్షన్ రాజ్యమేలుతున్నాయి. కరోనా కారణంగా మరణిస్తున్న వారి సంఖ్యను ప్రభుత్వం దాచి పెట్టిందని హైకోర్టు కూడా తప్పుపడుతున్న నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇప్పటికే కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని భారతీయ జనతాపార్టీ అనేక సార్లు విమర్శలు చేసింది. రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్యరాజన్ కూడా కరోనా ను అడ్డుకోవడంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ వర్షకాల సమావేశాల్లో ఈ విషయం పై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ తమ వ్యూహాలను  సిద్ధం చేస్తున్నాయి.   ఇక ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే మరో అంశం అవినీతి. రాష్ట్రంలో భూముల అక్రమణ, రెవెన్యూ విభాగంలో పేరుకుపోయిన అవినీతిపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. శ్రీశైలం ఎడమ గట్టు ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీయడానికి సమాయత్తం అవుతున్నారు. అయితే ప్రభుత్వం ముందుగానే ప్రతిపక్షం నుంచి వచ్చే సవాళ్లను పసికట్టి వారికి మాట్లాడే అవకాశం ఇవ్వడంలోనూ, మీడియా ముందుకు వెళ్ళకుండా నియంత్రించడంలోనూ వ్యుహరచన చేస్తోంది. కరోనాను కట్టడి చేయలేకపోయినా ప్రభుత్వ అలసత్వంపై ప్రశ్నించే ప్రతిపక్షాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తోంది అంటూ విమర్శిస్తున్నారు సీనియర్ నేతలు.

ప్రతిపక్షాల గళం నొక్కే ప్రయత్నం

మీడియా పాయింట్ ఎత్తేయడం పై విమర్శలు   తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా ఏ పార్టీకి లేదు. దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ రెండంకెలకే పరిమితం కాగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, బిసీల పార్టీగా ఉన్న టిడిపీ ఒక్కస్థానానికే పరిమితం అయ్యాయి. ప్రధాన ప్రతిపక్షం హోదా ఏ పార్టీకి లేకపోవడంతో అధికార పార్టీ తన ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రాష్ట్ర అసెంబ్లీ వర్షకాల సమావేశాల్లో ప్రతిపక్షం గొంతు నొక్కడానికి అధికార పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. శాసన సభలో అధికార పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఆ కొద్ది మంది సభ్యులకు కూడా సమావేశాలలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో చాలాసార్లు వారి తమ గోడునంతా మీడియా పాయింట్ వద్ద మీడియాతో పంచుకుంటారు. ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ సారి కరోనా సాకుగా చూపిస్తూ అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ ను రద్దు చేశారు. దాంతో ప్రతిపక్ష నేతలు తమ గళం వినిపించే అవకాశం లేకుండా పోయింది. సభలో మాట్లాడినప్పుడల్లా మైక్ కట్ చేయడం చేసే అధికార పార్టీ ఈ సమావేశాల్లో ఏకంగా మీడియాకు ప్రతిపక్షాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తోంది అని ప్రతిపక్ష పార్టీల సీనియర్ నేతలు విమర్శిస్తున్నారు.   అసెంబ్లీ సభా సమావేశాలు నిర్వహించడానికి, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కార్యక్రమాలు నిర్వహించడానికి అడ్డురాని కరోనా నిబంధనలు మీడియా పాయింట్ విషయంలోనే అడ్డు వస్తున్నాయని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత భరించలేని ప్రభుత్వం గతంలో ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు తమ గళం వినిపించే వేదికైన ధర్నాచౌక్ ను ఎత్తేసింది. ప్రశ్నించే గళానికి వేదిక లేకుండా చేసింది. అయితే కొన్ని పౌర సంఘాలు హైకోర్టుకు వెళ్లడంతో ధర్నాచౌక్ ను తిరిగి అనుమతి వచ్చింది. ఇప్పుడు అసెంబ్లీ లో ప్రతిపక్షాలు తమ గళం వినిపించడానికి ఉన్న ఏకైక వేదిక మీడియా పాయింట్ ను ఎత్తేయడం ప్రతి పక్షాల గొంతులు నొక్కే కుట్రలో భాగమే అని మండిపడుతున్నారు.  మీడియా పాయింట్ లేకుండా చేయడం ద్వారా ప్రతిపక్షం మీడియా ముందు తమ గోడు వెళ్లబోసుకున్న అవకాశం లేకుండా చేయవచ్చు అనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని విమర్శిస్తున్నారు.  ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలకు కరోనా నిబంధనలను అమలు చేసినట్లు మీడియా పాయింట్ వద్ద కూడా కరోనా నిబంధనలను అమలు చేస్తే సరి పోయే దానికి మీడియా పాయింట్ ను చేయాల్సిన అవసరం లేదని సీనియర్ నేతలు అంటున్నారు. ప్రభుత్వం పథకం ప్రకారం కావాలనే ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని ఆరోపణలు వస్తున్నాయి.

రౌడీ ముదిరి రాజకీయ నాయకుడైతే మంత్రి కొడాలి నాని!!

ఏపీలో టీడీపీ వైసీపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నిన్న మంత్రి కొడాలి నాని స్టార్ట్ చేసిన ఈ మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. నాని నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల పై ఇప్పటికే దేవినేని ఉమా తో సహా మరికొంతమంది నేతలు స్పందించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా మంత్రి నాని వ్యాఖ్యలపై టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి స్పందిస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసలు కొడాలి నాని పనితీరు కానీ, మాటలు కానీ ప్రజలకు ఏమైనా ఉపయోగకరంగా ఉన్నాయా? అని ఆమె ఈ సందర్భంగా ప్రశ్నించారు. మంత్రి నానీని చూస్తుంటే రౌడీ ముదిరి రాజకీయ నాయకుడైనట్టు ఉందని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కరోనా ప్రభావం ఆయనకు తెలిసుంటే.. చంద్రబాబు వేషధారణ గురించి అలా మాట్లాడేవారు కాదన్నారు. ఎవరెన్ని అన్న చంద్రన్నది నిజంగా చంద్రమండలం స్థాయేనని కొడాలి నాని తెలుసుకోవాలని స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.   అసలు మాటిమాటికి చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడనే నాని, ఆరోజు జరిగిన పరిణామాలకు తనే స్క్రిప్ట్ రాశాడా?. స్వర్గీయ ఎన్టీఆర్ ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా స్టెరాయిడ్స్ ఎవరిచ్చారో, సూట్ కేసులు ఎవరు తరలించారో నానీకి తెలియదా? అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు తండ్రి అయిన ఖర్జూర నాయుడి గారి కుటుంబం రౌడీయిజంతోను, ఫ్యాక్షనిజంతోను పైకి రాలేదని అన్నారు. అసలు చంద్రబాబు వయస్సు గురించి, చావుల గురించి మాట్లాడటానికి మంత్రి ఏమైనా యమధర్మరాజుకి శిష్యుడా?. ఇప్పటికైనా సరే, వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబుతో సమానంగా ఎవరైనా పనిచేయగలరా అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు గురించి ఒకసారి ఒక పేపర్‌లో చులకనగా రాశారని గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును.. నాని లాంటి వాళ్లు ఎన్ని మాటలన్నా, ఆయన తలవెంట్రుకల్లో ఒక్కటి కూడా కదలదు. మంత్రిస్థాయిలో ఉండి లారీలతో గుద్దిస్తామనే ఆలోచనలు చేయడం బాధాకరం అని అంటూ.. లక్షకోట్ల అప్పులు తెచ్చి, ఏం చేశారో చెప్పకుండా, కేవలం ప్రశ్నించినవారిని చంపేస్తాం.. లేపేస్తాం అని బెదిరిస్తారా.. సీఎం జగన్ ప్రజలసొమ్ముని కోర్టు ఖర్చులకు దుబారా చేయకుండా, ఆ సొమ్ముతో తన సొంత పార్టీవారికి సభ్యత, సంస్కారాలు నేర్పితే మంచిది. ఇక మంత్రి నానినుద్దేశించి మాట్లాడుతూ.. మొరటోడికి మొగలిపువ్వు ఇస్తే, ఎక్కడో పెట్టుకున్నట్టు, మంత్రి పదవితో నాని ఏం చేస్తున్నాడో తెలియడం లేదు అని నానిపై దివ్యవాణి తీవ్ర విమర్శలు చేశారు.

కెనడియన్ జానపద సాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చిన హెలెన్

మేరీ హెలెన్ క్రైటన్ (5 సెప్టెంబర్ 1899 - 12 డిసెంబర్ 1989)   గ్రామీణ ప్రాంతాలప్రజల రోజువారి జీవితాల నుంచి వచ్చే పాటలు, ఆటలు కాలక్రమేణా మరుగున పడిపోతాయి. వాటిని సేకరించి భవిష్యత్ తరాలవారి కోసం భద్రపరచాలన్న ఆలోచనతో తన జీవితాన్ని జానపదం కోసం అంకితం చేశారు మేరీ హెలెన్ క్రైటన్. కెనడాకు చెందిన ప్రముఖ జానపద రచయిత. ఆమె కృషి వల్లే ఈనాడు కెనడాలో జనపద సాహిత్యం వెలుగులోకి వచ్చింది.    నోవా స్టోటియాలో 5 సెప్టెంబర్ 1899 లో జన్మించిన హెలెన్ పల్లెపాటలు వింటూ పెరిగారు. దాంతో ఆమెకు తెలియకుండానే జానపదసాహిత్యంపై మక్కువ పెరిగింది. హాలిఫాక్స్ లేడీస్ కాలేజీ చదువుకున్న ఆమె మెక్గిల్ విశ్వవిద్యాలయంలో సంగీతం డిప్లొమా పూర్తి చేశారు.టొరొంటోలోని రాయన్ ప్లైయింగ్ కార్పోస్ లో చేరారు. కింగ్స్  కాలేజీ యూనివర్సిటీ లో ఆమె డీన్ గా పనిచేశారు. జన బాహుళ్యంలో ప్రాచుర్యంలో ఉన్న పాటలను, కథలను హెలెన్ సేకరించేవారు. అలా దాదాపు ఆమె నాలువేల సాంద్రాయ పాటలను, కథలను సేకరించారు. వాటన్నింటినీ అక్షరీకరిస్తూ అనేక పుస్తకాలు ప్రచురించారు. లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ అందించిన ఫెలోషిప్ తో రికార్డర్ కొని ఆమె జానపద పాటలను, రికార్డు చేసేవారు. కెనడియన్ మ్యూజియం ఆఫ్ సివిలైజేషన్ కోసం పాటలను కంపోజ్ చేసి రికార్డింగ్ చేశారు. కేవలం కెనడియన్ జానపదసాహిత్యామే కాకుండా గాలీ, జర్మన్, మిక్ మక్, ఆఫ్రికన్  ప్రజల ఆచారాలను సేకరించారు. ఇందుకోసం ఆమె మారుమూల ప్రాంతాల్లోకి కాలినడకన వెళ్లేవారు. అలా ఆమె సేకరించిన జానపదసాహిత్యంలోని పాటలు, కథలు అక్కడి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.   దశాబ్దాల పాటు చేసిన పరిశోధనల ఫలితంగా వెలుగులోకి వచ్చిన పాటలు, కథలే కాదు ప్రజల ఆచారాలు, మూఢనమ్మకాలను హెలెన్ పుస్తకాలుగా తీసుకువచ్చారు. జానపదసాహిత్యంలో ఆమె చేసిన కృషికి అనేక గౌరవ డిగ్రీలు అందుకున్నారు. 1976లో ఆర్డర్ ఆఫ్ కెనడాలో సభ్యురాలిగా పనిచేశారు. 12 డిసెంబర్ 1989లో ఆమె చనిపోయిన తర్వాత  ఆమె ఇల్లు, ఎవర్‌గ్రీన్ హౌస్, డార్ట్మౌత్ హెరిటేజ్ మ్యూజియంలో ఒక భాగంగా ప్రజలకు అందుబాటులో ఉంది. ది ఫ్రాంక్ డేవిస్ లెగసీ అవార్డును అందుకున్న హెలెన్ ను 2018లో జాతీయ చారిత్రక వ్యక్తిగా కెనడా గుర్తించింది.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో ఏపీ నెంబర్‌వన్‌.. క్రెడిట్ చంద్రబాబుదే!!

ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్‌(సులభతర వ్యాపార నిర్వహణ)లో ఆంధ్రప్రదేశ్‌ నెంబర్‌వన్‌ స్థానం నిలబెట్టుకుంది. 2019 ఏడాదికిగాను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం ర్యాంకులు విడుదల చేశారు. ఏపీ మొదటి స్థానంలో నిలువగా రెండోస్థానంలో ఉత్తర ప్రదేశ్‌, మూడోస్థానంలో తెలంగాణ రాష్ట్రాలు నిలిచాయి. ఇంత‌కు ముందు ఏడాది రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ ఈ సారి ఒక స్థానం దిగ‌జారింది. ఇక తెలంగాణ‌ త‌ర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్ ఉన్నాయి.   కాగా, ఈజ్ ఆప్ డూయింగ్ లో ఏపీ అగ్ర‌స్థానంలో నిలవ‌డానికి త‌న తండ్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబే కార‌ణ‌మ‌ని నారా లోకేష్ ట్వీట్ చేశారు. "ఇది చంద్ర‌బాబు క‌ష్ట‌ప‌డి ప‌నిచేసేత‌త్వానికి ఓ నిద‌ర్శ‌నం. ఆయన కష్టం వల్లే ఈజ్ ఆప్ డూయింగ్ 2019లో టాప్ లో ఏపీ నిలిచింది. వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళికను స‌మ‌ర్థంగా అమ‌లు చేసినందుకు ధ‌న్య‌వాదాలు. చంద్ర‌బాబులా వైఎస్ జ‌గ‌న్ కూడా ఏపీలో మంచి ప‌నుల‌ను చేయాల్సింది.. కానీ చేయ‌క‌పోవ‌డం విచార‌క‌రం" అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.

సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. పొలిటికల్ ఎంట్రీపై లారెన్స్ కీలక ప్రకటన

ఎందరో సినీ స్టార్స్ రాజకీయాల్లోకి వస్తుంటారు. అయితే వారిలో కొందరు మాత్రమే సక్సస్ అవుతారు. సినిమాల ద్వారా కోట్ల మంది అభిమానులని సంపాదించుకున్న స్టార్స్ సైతం.. రాజకీయాల్లోకి అడుగు పెట్టాక ఓట్లు సంపాదించటానికి అవస్థలు పడుతుంటారు. అయినప్పటికీ ఎందరో సినీ స్టార్స్  రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉంటారు.    తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఎన్నో ఏళ్లుగా చర్చ జరుగుతుంది. ప్రతి ఏడాది ఆయన ఈ పుట్టినరోజు నాడు పార్టీని ప్రకటించబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. దీంతో అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తారు. తీరా ఆయన పుట్టినరోజు నాడు ఎటువంటి ప్రకటన ఉండదు. ఇది కొన్నేళ్లుగా జరుగుతున్న తంతు. మరోవైపు రజనీకాంత్ కూడా రాజకీయాల్లోకి వస్తా అంటారు కానీ, ఎప్పుడొస్తారో క్లారిటీ ఇవ్వరు. దీంతో అసలు ఆయన రాజకీయాల్లోకి రారేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే రజినీకాంత్ పొలిటికల్ పార్టీ గురించి తాజాగా ప్రముఖ దర్శకుడు, నటుడు లారెన్స్  కీలక ప్రకటన చేశారు. త్వరలో రజనీకాంత్ పార్టీ పెట్టబోతున్నారని, ఆ పార్టీలో తాను చేరబోతున్నానని స్పష్టం చేశారు.   రాజకీయాలకు దూరంగా ఉండే లారెన్స్ తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘ఎన్నో ఏళ్లుగా నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి ఎంతో మంది అభిమానులు, సన్నిహితులు నన్ను రాజకీయాల్లోకి రావాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. వారందరికీ ఓ శుభ వార్తను చెబుతున్నా. నా గురువు రజనీకాంత్‌ పార్టీ ప్రకటన అనంతరం ఆయన పార్టీలో చేరతాను. నా సమాజ సేవకు జయలలిత, కరుణానిధితో పాటు స్టాలిన్, పళనిస్వామి ఎంతో సహాయం చేశారు. నేటి రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేయడం తప్పడంలేదు. కానీ రజనీకాంత్‌ మాత్రమే విపక్ష నాయకులపై విమర్శలు చేయకుండా రాజకీయాలు చేయగలరు. అందునే నేను ఆయన దారిలో నడవాలని నిర్ణయించుకున్నా. నాకు సహాయం చేసిన వారిని నేను విమర్శించలేను’ అని లారెన్స్‌ ట్వీట్‌ చేశారు.    లారెన్స్‌ చేసిన ప్రకటన తమిళనాడు రాజకీయాల్లో హాట్ ‌టాపిక్ ‌గా మారింది. రజనీకాంత్‌ పార్టీపై తమిళనాడులో మళ్లీ చర్చలు మొదలైయ్యాయి. రాజకీయాలకు దూరంగా ఉండే లారెన్స్.. ఉన్నట్టుండి రజనీకాంత్‌ పార్టీ ప్రకటన అనంతరం ఆయన పార్టీలో చేరతానని చెప్పడం చూస్తుంటే.. త్వరలోనే రజనీకాంత్‌ పార్టీ ప్రకటన ఖచ్చితంగా ఉంటుందని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.   

అమరావతిలో కలకలం.. అంబేడ్కర్‌ స్మృతివనంలో విగ్రహాలు మాయం

అమరావతిని నుండి రాజధానిని తరలించొద్దు అంటూ అక్కడి రైతులు 250 కి పైగా రోజుల నుండి ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలు మాయం కావడం కలకలం రేపుతోంది.   అమరావతిలో ఉన్న అంబేడ్కర్‌ స్మృతివనంలో విగ్రహాలు మాయమయ్యాయి. శాఖమూరులో గత టీడీపీ ప్రభుత్వం ఆరు నమూనా విగ్రహాలను ఏర్పాటు చేయగా.. అందులో ఐదు విగ్రహాలు మాయమయ్యాయి. మరో విగ్రహానికి ఉన్న కళ్లద్దాలను పగలగొట్టారు. ఈ విషయం తెలుసుకున్న దళిత ఐకాస నేతలు స్మృతివనం దగ్గర ఆందోళనకు దిగారు. విగ్రహాలను మాయం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, అంబేడ్కర్‌ విగ్రహాలు మాయం కావడంపై అమరావతి రైతులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఆందోళనలు జరుగుతున్న సమయంలో ఇలాంటి ఘటన జరగడంపై మండిపడుతున్నారు. దళిత ఐకాసకు సంఘీభావం పలుకుతూ, వారితో పాటు రైతులు కూడా ఆందోళనలో దిగారు.

బావా త్వరగా రావా.. హరీష్ కు ట్వీట్ చేసిన కేటీఆర్

కరోనా నేపథ్యంలో నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాలకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా పాజిటివ్ ఉంటే అసెంబ్లీ సమావేశాలకు నో ఎంట్రీ అన్న విషయాన్ని శాసనసభ, మండలి స్పీకర్లు ఇప్పటికే స్పష్టంచేశారు. ఈ ప్రకటన వెలువడి 24గంటలు గడవకముందే ఆర్థికశాఖమంత్రి టి. హారిష్ రావు తనకు కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చిందని, తనను ఈ వారం రోజుల్లో కలిసిన వారంతా ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ట్విట్టర్ లో తెలిపారు. దాంతో ఒక్కసారిగా మంత్రులు, ఎమ్మెల్యేలు, టిఎస్ఆర్ నాయకులు ఉలిక్కి పడ్డారు. కరోనా వచ్చినవారు కనీసం 15రోజుల నుంచి 20రోజుల వరకు ఐసోలేషన్ లో ఉండాలి. అయితే  సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ వర్షకాల సమావేశాలకు  హారిష్ రావు పూర్తిగా దూరంగా ఉండనున్నారని వినిపిస్తోంది. ఈ సమావేశాలు ఆర్థిక శాఖ మంత్రి లేకుండానే జరగనున్నాయా అన్న చర్చజరుగుతోంది. అయితే ఆర్థికశాఖ బాధ్యతలను ముఖ్యమంత్రి కెసిఆర్ ఎవ్వరికి ఇస్తారో అన్న చర్చ కూడా జరుగుతుంది. ఈనెల 7న జరిగే టిఆర్ఎల్ పి సమావేశానికి కూడా హారిష్ దూరంగానే ఉండనున్నారు. ఇక, బావా త్వరగా కోలుకో అంటూ కెటిఆర్ చేసిన ట్వీట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది.

ఈనెల 7 నుంచి కోవాక్జిన్ రెండోదశ క్లినికల్ ట్రయల్స్

12 కేంద్రాల్లో పరీక్షలకు అనుమతి ఇచ్చిన ఐసీఎంఆర్   ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు బలితీసుకుంటున్న కోవిడ్ 19 వైరస్ ను ఎదుర్కోనేందుకు మన దేశంలో తయారవుతున్న కోవాక్జిన్ రెండోదశ క్లినికల్ ట్రయల్స్ ఈనెల 7 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి అయినట్లు ప్రకటించారు. కోవాక్జిన్ వ్యాక్సిన్ ను పూనే లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ తయారుచేస్తోంది.    ఈ వ్యాక్సిన్ రెండోదశ క్లినికల్ ట్రయల్స్ కు ఇండియాస్‌ డ్రగ్స్‌ రెగ్యులరేటర్‌ (భారత ఔషధ నియంత్రణ సంస్థ) తాజాగా అనుమతి ఇచ్చింది. దేశ వ్యాప్తంగా ఐసీఎంఆర్ ఎంపిక చేసిన 12 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించనుంది. వ్యాక్సిన్ ఎంత సమర్థంగా పనిచేస్తుందనే అంశంతో పాటు ఈ వ్యాక్సిన ఎంత వరకు సురక్షితం అన్నదే ప్రధానంగా ఈ క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయి.   ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 120కిపైగా వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉన్నాయి. మన దేశానికి భారత్‌కు చెందిన సుమారు ఆరు సంస్థలు వ్యాక్సిన్ అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి.

మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కరోనా వైరస్ అటు సామాన్యులనే కాక ఇటు విఐపిలను కూడా చుట్టేస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి హరీశ్ రావుకు కరోనా సోకింది. ఈ సంగతిని ఆయనే స్వయంగా ట్వీట్ ద్వారా వెల్లడించారు. తనలో కొన్నికొద్దీ రోజులుగా స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్నానని.. రిపోర్టులో కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆయన ఆ ట్వీట్ లో తెలిపారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. అయితే కొద్దిరోజులుగా తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన వారందరూ కరోనా టెస్ట్ లు చేయించుకోవాలని అయన కోరారు.

వ్యక్తిత్వాన్ని చెక్కే శిల్పి గురువే

సామాజిక మాధ్యమాల్లో తమ గురువులను మననం చేసుకుంటున్న నెటిజన్లు   ‘‘గురుబ్రహ్మ: గురువిష్ణు: గురుదేవో: మహేశ్వర: గురుసాక్షాత్‌ పరబ్రహ్మ: తస్మైశ్రీ గురవే నమ:’’   బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలగలసిన మూర్తిమత్వం గురువు.  ‘గురువును దైవంగా పూజించే సంప్రదాయం భారతదేశానిది. అందుకే  మన పెద్దలు గురువుకు ప్రముఖ స్థానం ఇచ్చారు.. నిజానికి గు అంటే చీకటి, రు అంటే పోగొట్టేది… అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడు గురువు అని అర్థం.  ఒక రాయికి రూపం తేవాలంటే శిల్పి కావాలి. మట్టిలో దొరికిన మాణిక్యానికి మెరుగులు దిద్దితేనే దాని విలువ ప్రపంచానికి తెలుస్తుంది. అదే విధంగా ఒక వ్యక్తి ఉన్నతంగా ఎదగాలంటే, మంచిచెడు విచక్షణతో సమాజంలో జీవించాలంటే అతడికి గురువు మార్గదర్శనం ఉండాలి. అందుకే ఉపాధ్యాయుడు లేని విద్య నిష్ఫలం అని పెద్దలు అంటారు.  మానసిక పరిపక్వత చెందే దశలో పిల్లలకు విద్య, బుద్ధి, క్రమశిక్షణ నేర్పించి,  ఉత్తమ పౌరుడుగా తీర్చిదిద్దేవాడు ` గురువు’. ప్రతి ఒక్కరికీ తల్లే తొలి గురువే. తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువుదే. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అన్నారు. అఆలు నేర్పిన ఉపాధ్యాయుడి నుంచి విద్యాభ్యాసం పూర్తయ్యేవరకు పాఠం చెప్పిన ప్రతిఒక్కరూ గురువే. గురువంటే మార్గదర్శి. గురువువంటే వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే శిల్పి, నైపుణ్యతను జోడించే నేర్పరి. అలాంటి గురుస్థానం నుంచి దేశ ప్రథమ పౌరుడి స్థానం వరకు ఎదిగిన వ్యక్తి భారత రత్న, భారతదేశ తొలి ఉప రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌. ఆయన పుట్టిన రోజైన 5 సెప్టెంబర్ ను ప్రతి ఏటా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటాం.   నేను మొదట గురువుకే నమస్కరిస్తా అన్నారు మహానుభావుడు కబీర్ దాస్.   పుస్తకాలు వేలకొద్దీ ముందున్నా..? వాటిని అర్థం చేసుకుని వాటి పరమార్థాన్ని చెప్పగలిగేవారు లేకుంటే వ్యర్థం. అందుకే గురువు మన జీవితానికి అర్థం చెప్పే ఓ దైవం అన్నారు    దాశరథి కృష్ణమాచార్యులు   పురాణాల్లో, ఇతిహాసాల్లోనూ గురువుకు పెద్దపీఠ వేశారు. గురువులుగా కెరీర్ ను ప్రారంభించి తర్వాత కాలంలో సాహిత్యరంగంలో రాణించిన ప్రముఖ తెలుగు కవులు గిడుగు రామ్మూర్తి పంతులు, గురజాడ అప్పారావు, గుర్రం జాషువ, విశ్వనాథ సత్యనారాయణ, వావిళ్ల రామస్వామి ,  చిలకమర్తి లక్ష్మీనర్సింహం, రాయప్రోలు సుబ్బారావు, జ్యోతిరావు ఫూలే తదితరులు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం సాహిత్య సాంస్కృతిక రంగాల్లో రాణిస్తున్న వారిలో అధిక శాతం మంది ఉపాధ్యాయులే ఉన్నారు. గురువులు తమ విధులను చిత్తశుద్ధితో నిర్వహించినపుడే సమాజం జాగృత మవుతుంది. మార్గదర్శకులైన గురువులున్నపుడే జాతి సమున్నత శిఖరాలకు చేరుకుంటుంది.   పూర్వకాలంలో గురుకులాలు ఉండేవి. విద్యార్థులకు విద్యాబోధనతో పాటు వారి వ్యక్తిత్వాన్ని కూడా ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యత గురువులపై ఉండేది. ఆ తర్వాత విద్యావ్యవస్థలో వచ్చిన మార్పులతో కేవలం విద్యాబోధనకే గురువులు పరిమితం అయ్యారు. ప్రస్తుతం డిజిటల్ విద్యాబోధనలో విద్యార్థులకు, గురువులకు మధ్య ఇంటర్నెట్ చేరింది. తరగతి గది మొబైల్‌లోకి వచ్చిన ప్రస్తుత కాలంలో ఉపాధ్యాయుడి బాధ్యత మరింత పెరిగింది.   ప్రతిఏటా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారిని అవార్డులతో సత్కరిస్తున్నారు. ప్రస్తుత కరోనా సమయంలో ఇంటికే పరిమితమై విద్యార్థులు, ఇంటర్నెట్ కే పరిమితమై టీచర్లు ఉంటున్నారు. అయినా గురువు స్థానం గురువుదే. వాట్సాప్ మెసెజ్, ట్విట్టర్లు, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం రోజున తమ జీవితంలో మార్పు చెప్పిన గురువుల గురించి మరోసారి మననం చేసుకుంటున్నారు.  

రష్యా వ్యాక్సిన్ అద్భుతంగా పనిచేస్తోంది.. కన్ఫామ్ చేసిన లాన్సెట్ జర్నల్ 

రష్యా ప్రభుత్వం హడావిడిగా తీసుకొచ్చిన కరోనా వ్యాక్సిన్ "స్పుత్నిక్వి-v" బాగా పనిచేస్తోందని.. వ్యాక్సిన్‌ రెండు దశల ట్రయల్స్ పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయని తాజాగా మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ పేర్కొంది. ఈ వ్యాక్సిన్‌ తొలి రెండు దశల ట్రయల్స్‌లో పాల్గొన్న అందరిలోనూ కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు వంద శాతం ఉత్పత్తయ్యాయని ఆ పత్రిక తెలిపింది. దీంతో స్పుత్నిక్‌-v వ్యాక్సిన్ సరిగా పనిచేయదన్న వారికి తొలి రెండు దశల పరీక్షల్లో వచ్చిన రిజల్ట్స్ సమాధానమని తాజాగా రష్యా ప్రభుత్వం పేర్కొంది. మొన్న జూన్‌ - జులై నెలలలో వ్యాక్సిన్‌పై జరిపిన రెండు దశల పరీక్షలలో 76 మంది పాల్గొనగా.. వారందరిలో యాంటీబాడీలు పెరిగాయి. అంతేకాకుండా వారిలో ఎవరికీ తీవ్రమైన సైడ్‌ఎఫెక్ట్స్‌ రాలేదని లాన్సెట్‌ జర్నల్ తెలిపింది.   అయితే మరి అంతా బాగుంటే మరి ఈ వ్యాక్సిన్‌పై విమర్శలు ఎందుకనే ప్రశ్న కూడా వస్తుంది. ఈ వ్యాక్సిన్ తేవడంలో రష్యా వ్యవహరించిన తీరుతో దీని పై వ్యతిరేకత ఏర్పడినట్లుగా తెలుస్తోంది. అసలు తొలి రెండు దశల ట్రయల్స్‌లో వచ్చిన ఫలితాలపై రష్యా ప్రభుత్వం ప్రపంచానికి ఏమాత్రం సమాచారం ఇవ్వలేదు. దీనికి తోడు మూడు దశల ట్రయల్స్ విజయవంతంగా పూర్తైన తర్వాతే వ్యాక్సిన్ విడుదల చెయ్యాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేయడమే. కానీ రష్యా మాత్రం రెండు దశల ట్రయల్స్ పూర్తవగానే హడావిడిగా వ్యాక్సిన్ రిలీజ్ చేసేసింది. దీంతో కరొనాకు అది సరైన వ్యాక్సిన్ కాదని ప్రపంచ దేశాలు, నిపుణులు కూడా తిరస్కరించారు. అయితే లాన్సెట్ జర్నల్ కూడా ఈ వ్యాక్సిన్‌కి అప్పుడే పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీనిపై మరింత భారీ స్థాయిలో ఎక్కువ కాలం పాటు పరీక్షలు జరపాలని కోరింది.   తాజాగా రష్యా గత వారం 40వేల మందిపై ఈ వ్యాక్సిన్ తో ట్రయల్స్ నిర్వహించింది. వాటి ఫలితాలు కూడా త్వరలో రానున్నాయి. అయితే ఈలోగానే రష్యా భారీ ఎత్తున వ్యాక్సిన్ తయారు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈ సంవత్సరం ఆఖరికి నెలకు దాదాపు 20 లక్షల వ్యాక్సిన్ డోసుల్ని ఉత్పత్తి చేస్తూ.. క్రమ క్రమంగా నెలకు 60 లక్షల డోసుల్ని తయారుచేస్తామని స్పష్టం చేస్తోంది. అంతేకాకుండా రష్యా ప్రభుత్వం ఇతర దేశాల్లో తయారవుతున్న వ్యాక్సిన్లకు కూడా సవాల్ విసురుతోంది. మేము తయారు చేసిన వ్యాక్సిన్ పై కామెంట్స్ చేస్తున్న మీరు తయారు చేస్తున్న వ్యాక్సిన్లు ఏమాత్రం పనిచేస్తాయో చూస్తాం అంటూ రష్యా అధికారులు సవాల్ విసురుతున్నారు.  

కరోనా నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే అనుమతి

మీడియా పాయింట్ లేదు   తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే వారికి కరోనా నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరిగా ఉండాలి. కరోనా మహ్మమారి వ్యాప్తి కారణంగా ఈ మేరకు సరికొత్త నిబంధనలను వెల్లడించారు. ఈనెల 7వ తేదీ, సోమవారం నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశల నియమ నిబంధనలను శాసన సభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వివరించారు.   కరోనా నేపథ్యంలో జరుగున్న అసెంబ్లీ స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో పాటు అధికారులు, సిబ్బంది, పోలీసులు, మీడియా ప్ర‌తినిధులు, మంత్రుల పీఎస్‌లు, పీఏలు త‌ప్ప‌నిస‌రిగా కొవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకోవాలన్నారు. ఈ మేరకు కోవిడ్ 19 వైరస్ నిర్ధారణ పరీక్షలను అసెంబ్లీ ఆవరణలో నిర్వహిస్తున్నారు. కొవిడ్ పాజిటివ్ తేలితే అసెంబ్లీ ప్రాంగ‌ణంలోకి రావద్ద‌ని స్పీక‌ర్ సూచించారు. మాస్కు ఉంటేనే స‌భ‌లోకి అనుమ‌తిస్తారు. ప్రభుత్వం తరుపున శాసన సభ్యులు, మండలి సభ్యులకు ఆక్సి మీటర్, శానిటైజేర్, మాస్క్ లు ఉన్న కిట్ ఇస్తున్నారు. అసెంబ్లీలోకి వెళ్లే ప్రతి ఎంట్రెన్స్ వద్ద టెంపరేచర్, ఆక్సిజన్ లేవల్ చెక్ చేస్తారు. శ‌రీర ఉష్ణోగ్ర‌త‌లు సాధార‌ణంగా ఉండి, జలుబు, దగ్గు వంటి లక్షణాలు లేనివారినే అనుమ‌తి ఉంటుంది.    20రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు 20రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది. అయితే విజిటర్స్ కు అనుమతి లేదు. సభలో సభ్యుల సిట్టింగ్ లోనూ మార్పులు చేశారు. మీడియా పాయింట్ రద్దు చేశారు. ప్రతి పక్షం ఏది మాట్లాడాలన్నా సభలోనే మాట్లాడాలని కోరారు.

మళ్లీ వాయిదా.. తొందరపాటు నిర్ణయాలు.. విపక్షాల ఫైర్! 

ఆంధ్రప్రదేశ్ సర్కార్ తొందరపాటు నిర్ణయాలతో గందరగోళం నెలకొంటుంది. ఇప్పటికే పలు అంశాల్లో హడావుడిగా నిర్ణయాలు తీసుకుని..  తర్వాత మళ్లీ మార్చుకుంది. కరోనా ప్రభావంతో మూతపడిన విద్యాసంస్థ రీ ఓపెన్ పైనా జగన్ సర్కార్ నిర్ణయాలు విద్యార్థులు, వారి పేరెంట్స్ ను అయోమయానికి గురి చేశాయి. కేంద్రం లాక్ డౌన్ మార్గదర్శకాల ప్రకారమే ఎడ్యుకేషనల్ సంస్థలు తెరవాల్సిన ఉన్నా.. ఏపీ సర్కార్ మాత్రం ముందే నిర్ణయాలు తీసుకుంది. క్షేత్రస్థాయిలో సానుకూల పరిస్థితులు లేకున్నా సెప్టెంబర్ 5న స్కూల్స్ తెరుస్తామని ప్రకటించింది. ఇంతలోనే కేంద్రం గైడ్ లైన్స్ రావడంతో మళ్లీ అక్టోబర్ 5కు వాయిదా వేసింది.    ఈ విద్యా సంవత్సరాన్ని ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 5 నుంచిపునర్ ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించింది. అదే రోజు జగనన్న కానుక పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఏపీలో రోజూ 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో వైరస్ విస్తరించింది. దీంతో స్కూల్స్ తెరవడం సరికాదని పేరెంట్స్ అభిప్రాయపడ్డారు. విపక్షాలు కూడా పిల్లల జీవితాలతో చెలగాటమాడొద్దని, స్కూల్స్ తెరిచే విషయంలో తొందర పడవద్దని సూచించాయి. అయినా స్పందించలేదు జగన్ సర్కార్. సెప్టెంబర్ 5నే విద్యాసంస్థలను ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. నాలుగు రోజుల క్రితం సెప్టెంబర్‌ 30 వరకు పాఠశాలలు తెరవకూడదని కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చింది. దీంతో వెనక్కి తగ్గింది ఏపీ సర్కార్. స్కూల్స్ ఓపెనింగ్ ను అక్టోబర్‌ 5కి వాయిదా  వేసింది. జగనన్న విద్యా కానుక కార్యక్రమం కూడా అదే రోజున నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. గతంలోనూ  ఎలాంటి ప్రణాళిక లేకుండానే, ముందస్తు జాగ్రత్తలు లేకుండానే ఆగష్టు3 నుంచి పాఠశాలలన్నీ తెరిచేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే అన్ని జిల్లాల్లోనూ కరోనా కేసులు భారీగా పెరగడంతో వాయిదా వేసింది.    జగన్ సర్కార్ తొందరపాటు నిర్ణయాలపై విమర్శలు వస్తున్నాయి. ఏపీతో పోల్చితే తెలంగాణలో కరోనా కేసులు తక్కువగా ఉన్నాయి. కాని అక్కడ విద్యాసంస్థలను తెరవాలని అక్కడి సర్కార్ నిర్ణయించలేదు. ఆన్ లైన్ క్లాసులు ప్రారంభించింది. డీడీతో ఇతర ఛానళ్ల ద్వారా ప్రసారాలు అందిస్తోంది. డిజిటల్ టీచింగ్ కు తెలంగాణలో మంచి స్పందన వస్తోంది. 90 శాతం మంది విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులు వింటున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. మరికొన్ని రాష్ట్రాల్లోనూ డిజిటల్ క్లాసులు జరుగుతున్నాయి. ఏపీ సర్కార్ మాత్రం ఆన్ లైన్ క్లాసుల ఆలోచన చేయకుండా స్కూల్స్ తెరుస్తామంటూ మొండిగా ముందుకెళ్లింది. కేంద్రం ఆదేశాలతో మళ్లీ వాయిదా వేసుకుంది. ఇప్పుడు తెలంగాణలో డిజిటిల్ టీచింగ్ కొనసాగుతుండగా.. ఏపీలో అందుకు అవకాశం లేకుండా పోయింది. జగన్ సర్కార్ తొందరపాటు నిర్ణయాల వల్లే విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. కరోనా ఎప్పటికి కట్టడిలోకి వస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారంటున్న పేరంట్స్.. ఇప్పటికైనా స్కూల్స్ తెరవడంపై ఫోకస్ చేయకుండా ఆన్ లైన్ క్లాసులపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు.