రాములమ్మ హ్యాండ్! జంపింగేనా..? ఆపరేషన్ కమల్ 

సిద్ధిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో పోటికి విజయశాంతి నిరాకరించినట్లు తెలుస్తోంది. దుబ్బాక బైపోల్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. రాములమ్మ ఇమేజ్ తో లబ్ది పొందాలని కాంగ్రెస్ ప్లాన్ చేసినట్లు, పోటీకి ఫైర్ బ్రాండ్ అంగీకరించినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే ఉపఎన్నికలో పోటీపై కాంగ్రెస్ కు రాములమ్మ హ్యాండ్ ఇచ్చినట్లు సమాచారం. పోటీ చేసే అంశంపై తెలంగాణ పీసీసీ నేతలు సంప్రదించినపుడు ఆమె నిరాసక్తత తెలిపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డీనే ఈ విషయాన్ని పార్టీ నేతలకు తెలిపినట్లు సమాచారం. విజయశాంతి నో చెప్పడంతో అభ్యర్థిత్వం కోసం గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సహ ఇతర పేర్లను పీసీపీ పరిశీలిస్తున్నట్లు గాంధీభవన్ లో చర్చ జరుగుతోంది.    కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి విజయశాంతి నిరాకరించడం వెనక పెద్ద కథే ఉందని తెలుస్తోంది. గతంలో బీజేపీలో పనిచేసిన విజయశాంతి.. మళ్లీ కమలం గూటి వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. బీజేపీ అగ్రనాయకత్వంతో ఆమె టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల ఆమె కేంద్ర సర్కార్ నిర్ణయాలను సమర్ధిస్తూ ట్వీట్లు కూడా చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక లోపే రాములమ్మ కాషాయ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. బండి సంజయ్ కు బాధ్యతలు ఇచ్చాకా పార్టీ కార్యక్రమాల్లో స్పీడ్ పెరిగింది. టీఆర్ఎస్ సర్కార్ టార్గెట్ గా బీజేపీ జనంలోకి వెళుతోంది. కేసీఆర్ పైనా తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది సంజయ్ టీమ్. హైకమాండ్ డైరెక్షన్ లో పార్టీలోకి వలసలు కూడా పెరిగాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ లోని అసమ్మతి నేతలకు గాలం వేస్తున్నారు కమలనాధులు. అందులో భాగంగానే తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరున్న విజయశాంతిని పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం.   తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రాములమ్మ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సైలెంట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. చాలా గ్యాప్ తర్వాత మేకప్ వేసుకుని మహేష్ బాబు సినిమాలో కీ రోల్ పోషించారు. అయితే ఇటీవలే ఆమె రాజకీయాల్లో కొంత యాక్టివ్ అయ్యారు. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ట్వీట్లు చేస్తున్నారు. రాములమ్మ యాక్టివ్ కావడంతో దుబ్బాక నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయవచ్చని భావించారు.  ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన  ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంది. అయితే టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ చెబుతోంది. దుబ్బాక ఉప ఎన్నికలో సత్తా చాటాలని చూస్తోంది. దుబ్బాకలో బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ కు పెద్ద షాకే. బీజేపీ సెకండ్ ప్లేస్ వచ్చినా హస్తానికి ఇబ్బందే. అందుకే రాములమ్మను పోటీ చేయించాలని పీసీసీ నేతలు భావించారు. రాములమ్మ బీజేపీ ఓట్లు చీలుస్తుందని,.. దాంతో కాంగ్రెస్ గెలవకపోయినా సెకండ్ ప్లేస్ లో అయినా ఉంటుందని అనుకున్నారు. కాంగ్రెస్ వ్యూహాన్ని ముందే  పసిగట్టిన బీజేపీ నేతలు.. రాములమ్మను తమ వైపు లాగేశారనే ప్రచారం జరుగుతోంది. విజయశాంతిని రాజ్యసభకు పంపాలని బీజేపీ చూస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి త్వరలోనే కాంగ్రెస్ కు హ్యాండిచ్చి రాములమ్మ బీజేపీలో చేరవచ్చని తెలుస్తోంది.

భారత్ లో రష్యా వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ త్వరలో..!

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనాను ఎదుర్కొనేందుకు రష్యా మొట్టమొదటి వ్యాక్సిన్ తెచ్చిన సంగతి తెలిసిందే. ఐతే ఈ వ్యాక్సిన్ పై ప్రపంచదేశాలు అనేక అనుమానాలు వ్యక్తం చేయడంతో తాజాగా రష్యా ఈ వ్యాక్సిన్ కరోనాను ఎంత ప్రభావవంతంగా ఎదుర్కుంటుందో, అలాగే దీని భద్రత వంటి విషయాలకు సంబంధించిన పూర్తీ డేటాను ఈరోజు భారత్ కు అందించింది.    తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రష్యా వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ భారత్ లో ఈనెలలోనే ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. దీనికి సంబంధించి రష్యా డైరక్ట్ ఫండ్స్ హెడ్ కిరిల్ డిమిట్రి ఒక ప్రకటన చేస్తూ సౌదీ అరేబియా, ఫిలిప్పైన్స్ తో పాటు భారత్, బ్రెజిల్ లో త్వరలో స్పుత్నిక్-v వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ స్టార్ట్ అవుతాయని ప్రకటించారు.    వ్యాక్సిన్ కు సంబంధించిన ముఖ్యమైన డేటాను రష్యా ఈరోజు భారత్ కు అందించిన నేపథ్యంలో భారత్ లో వ్యాక్సిన్ ట్రయల్స్ కు అడ్డు తొలగిపోయినట్లే. అయితే ఈ ట్రయల్స్ కు సంబంధించిన ఫలితాలు మాత్రం అక్టోబర్ నవంబర్ మధ్యలో వెల్లడి కావచ్చని తెలుస్తోంది.

కేసీఆర్ కొత్త పార్టీ.. మరో వ్యూహానికి తెర లేపారా?

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయాల్లోకి అరగేంట్రం చేస్తున్నారని వస్తున్న వార్తలపై రాష్ట్ర ప్రజల స్పందన ఎలా వున్నా,  ప్రతిపక్ష పార్టీల నాయకులు మాత్రం దీన్ని పూర్తిగా కొట్టిపారేస్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇటు బీజేపీ నాయకులు ఇద్దరు ఇది కేవలం కేసీఆర్ మరో గేమ్ ప్లాన్ గానే చూస్తున్నారు.    రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో మునిగిపోయి ఉందని, ఈ సమయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు దీనిపై మాట్లాడకుండా ఉండడానికే కేసీఆర్ మరో వ్యూహానికి తెర లేపారని కాంగ్రెస్ నాయకులంటుంటే, ప్రస్తుతం రెవెన్యూ చట్టానికి సవరణలు చేస్తూ, రాష్ట్రంలో వీఆర్వో  వ్యవస్థను పూర్తిగా రద్దుచేసే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో, ప్రజల మరియు రాజకీయ నాయకుల ద్రుష్టి దీన్ని నుండి మరలించడానికే కొత్త వ్యూహానికి తెరలేపారని బీజేపీ నాయకులు   భావిస్తున్నారు.    కేసీఆర్ నయా భరత్ పేరుతో కొత్త పార్టీ స్థాపించబోతున్నారని, ఇప్పటికే బెంగాల్ ముఖ్య మంత్రి మమాత బెనర్జీ, హిమాచల్ ముఖ్య మంత్రి హేమంత్ సొరేన్ లాంటి నాయకులతో చర్చలు కూడా జరిపారని ఒక ప్రముఖ తెలుగు దిన పత్రిక నేడు ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై  కొంతమంది ప్రముఖ నాయకుల స్పందన కోసం ప్రయత్నించినప్పుడు, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు  దీన్ని పూర్తిగా కొట్టివేయగా, మరి కొందరు వేరే పార్టీల నాయకులైతే కేటీఆర్ ను ముఖ్య మంత్రి స్థానంలో కూర్చొబెట్టడానికె ఇంత సీన్ క్రియేట్ చేసారని అంటున్నారు.    కేటీఆర్ ను ముఖ్య మంత్రిని చెయ్యాలంటే తాను ఏదోఒక ప్లాట్ఫారం చూసుకోవాలని, తాను ఇక్కడేవుండి కొడుకును పీఠం మీద కూర్చోబెడితే  ప్రజలకు కొన్ని తప్పుడు సిగ్నల్స్ వెళ్లే ప్రమాదం ఉందని భావించి, ఈ కొత్త ప్రతిపాదనను అలోచించి ఉంటారనేది వారి వాదన. ఇంకొంతమంది నాయకులు, బీజేపీ రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలంటే తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు భావన కల్పించాలనే ఆలోచన కెసిఆర్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.    కనీసం, తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లినా, వెళ్లకున్న, బీజేపీ అయితే రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా జోక్యం చేసుకోకుండా ఉంటుందని, ఆవసరమైతే తనను కొంత మేరకు సంతృప్తి పరిచే విధంగా కూడా ఆ పార్టీ ఆలోచించ వచ్చని, అందువల్లనే ఈ ప్రతిపాదనను తెరమీదకు కేసీఆర్ తెచ్చారని ఈ నాయకులు అభిప్రాయపడుతున్నారు.    తెరాస కు కొంత వరకు దగ్గరగా వుండే నాయకులైతేమాత్రం, కెసిఆర్ కొత్త ప్రతిపాదనను సమర్దిస్తున్నారు. అంతే కాకుండా ఆయనకు మద్దతు కూడా పలుకుతున్నారు. 2018 ఎన్నికల్లోనే కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఫై ఆలోచించారని, అయితే అప్పుడు కొందరు ఇతర రాష్ట్ర నాయకులు ఈ విషయంపై చంద్రబాబు ను సంప్రదిచారని, ఆయన దీనిని అంతగా సమర్ధించలేదని, దాంతో వారుకూడా వెనక్కు తగ్గారని, అంటున్నారు. అంతే కాకుండా, 2019 ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడంతో, ఫెడరల్ ఫ్రంట్ విషయం మరుగున పడి పోయిందని కూడా వీరంటున్నారు,   ఇప్పుడు ఇది సరైన సమయమని, కేసీఆర్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని వీరు నమ్ముతున్నారు. ఒకవేళ, కేసీఆర్ కు ఎప్పటికి తమ మద్దతు ఉంటుందని, కేటీఆర్ కు కూడా ముఖ్యమంత్రి అవడానికి అవసరమైన అన్ని అర్హతలు ఉన్నాయని, కూడా వారు నమ్ముతున్నారు. ఏది ఏమైనప్పటికి, కేసీఆర్ జాతీయ రాజకీయ అరగేంట్రం ఫై అతి త్వరలో ఒక స్పష్టత వస్తుందో, రాదో వేచి చూడ వలసిందే.  

ఏపీలో 5 లక్షలు దాటిన కరోనా కేసులు

ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. పట్టణం, పల్లె అన్న తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఏపీలో 8,368 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,06,493కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 70 మంది మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,487 కి చేరింది. ఇప్పటివరకు ఏపీలో 4,04,074 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 97,932 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 58,187 కరోనా టెస్టులు నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తం 41.66 లక్షల కరోనా టెస్టులు చేశారు.

మీరు దావూద్ ఇబ్రహీంకు కూడా సెక్యూరిటీ ఇస్తారు.. కేంద్రంపై శివసేన ఫైర్

సుశాంత్ సింగ్ రాజపుత్ వ్యవహారంలో మహారాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు కేంద్ర హోంశాఖ వై ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో విరుచుకు పడ్డారు. సాక్షాత్తు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు కూడా రక్షణ కల్పిస్తారని ఈ సందర్భంగా ఆయన కేంద్రాన్నిఎద్దేవా చేశారు. ఒకవేళ అండర్ వరల్డ్ డాన్ దావూద్ కు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రభుత్వం కనుక మాట్లాడితే... రేపే దావుద్ కు కూడా కేంద్రం రక్షణ కల్పిస్తుందని అయన అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అణగదొక్కడానికి కేంద్రం ఏమైనా చేస్తుందని అయన మండిపడ్డారు. ఒకపక్క ఉత్తరప్రదేశ్, బీహార్ లలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు మహిళా కమిషన్ కు పట్టవని ప్రతాప్ సర్నాయక్ విమర్శించారు. అదే సమయంలో ముంబై పోలీసులను నమ్మని వ్యక్తులకు మాత్రం కేంద్రం భద్రత కల్పిస్తుందని అయన అన్నారు. మంబైని పీఓకేతో పోల్చిన కంగనా పై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని అయన పరోక్షంగా వ్యాఖ్యానించారు.

వీఆర్వో వ్యవస్థ కు రాంరాం

కొత్త రెవెన్యూ యాక్ట్  ల్యాండ్ మేనేజ్ మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ గా పేరు   అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదం   శతాబ్దాల నాడు రూపొందించిన రెవెన్యూ చట్టంలో మార్పులు తీసుకురావాలని గత కొన్ని దశాబ్దాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం రెవెన్యూ చట్టాన్ని మార్చడానికి ప్రయత్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో అప్పటి సీఎం చంద్రబాబు 1999లో ఆంధ్రప్రదేశ్‌‌ భూమి రెవెన్యూ కోడ్‌‌–1999 పేరుతో కొత్త నిబంధనలను ఫ్రేం చేశారు. అందులో 17 భాగాలు, 47 అధ్యాయాలు, 260 సెక్షన్లను పొందుపరిచారు. దీనిపై రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు. అయితే ఈ కోడ్ లో ఉన్న విషయాలపై కేంద్ర న్యాయ శాఖ 146 ప్రశ్నలతో అట్టకెక్కింది. రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చేందుకు సమాయత్తం అయ్యింది. అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని దీన్ని రెవెన్యూ చట్టంగా తీసుకువస్తూ ‘ల్యాండ్  మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ ’గా పేరు మార్చారు. రెవెన్యూ శాఖలో మార్పుపై, పేరుకుపోతున్న అవినీతిపై కొన్నాళ్లుగా  తరుచూ మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ కొత్త చట్టానికి రూపకల్పన చేశారు.   నిజాం కాలం నుంచి.. నిజాం పరిపాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానంలోని భూచట్టాలకు 113 ఏండ్ల చరిత్ర ఉంది. అప్పటి పాలకులు  1907లో ‘ఫస్లీ–1317’ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇప్పటివరకు అమల్లోకి వచ్చిన అన్ని భూచట్టాలకు ఇదే కేంద్రబింధువుగా ఉంది. భూ పరిపాలనకు సంబంధించింనంత వరకు ఇదే సమగ్ర రెవెన్యూ చట్టం. ఆ తర్వాత ఎన్నో మార్పులుచేర్పులతో ప్రస్తుతం ఉన్న రెవెన్యూ చట్టం అమలులోకి వచ్చింది. ఇందులో భూపరిపాలన, భూసేకరణ, కౌలుదారులు, రైతుల  హక్కులు ఇలా అనేక అంశాలుగా విడిపోయి కొత్తకొత్త చట్టాలు పుట్టుకువచ్చాయి. నియమ నిబంధనలు మారాయి. ఇందులోని అనేక సెక్షన్లు లోపభూయిష్టంగా ఉన్నాయని, అవినీతికి ఆస్కరం కల్పిస్తున్నాయని అనేక సార్లు ముఖ్యమంత్రి అన్నారు. వీటన్నింటిని కలిపి కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావాలన్న కసరత్తు గత కొద్దినెలలుగా జరుగుతోంది. ఈ కొత్త చట్టానికి ల్యాండ్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ గా పేరు పెట్టారని తెలిసింది. రెవెన్యూ శాఖలో ఇప్పటివరకు ఉన్న వీఆర్వోల వ్యవస్థ రద్దు కావడంతో పాటు వారిని వివిధ శాఖల్లో భర్తీ చేస్తారని వినికిడి.  భూ రికార్డుల ప్రక్షాళన, రికార్డులన్నీ డిజిటలైజ్ చేయడం మొదలైన అనేక సంస్కరణలు తీసుకురానున్నారు.

మద్య నిషేదంపై జగన్ వైఖరి మారిందా.. ఏపీలో ఇక మద్య నిషేదం లేనట్టేనా?

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయాలు. ప్రణాళిక లేకుండా అడ్డగోలుగా మద్యం ధరలు పెంచుకుంటూ పోయింది జగన్ సర్కార్. రాష్ట్రంలో కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టింది. మద్యం తాగేవారి సంఖ్యను తగ్గించాలనే ఉద్దేశంతోనే నిర్ణయాలు తీసుకున్నామని గొప్పగా ప్రకటించుకుంది. దశల వారీగా షాపులను కూడా తగ్గిస్తూ.. పూర్తి మద్యపాన నిషేదం దిశగా వెళతామని సీఎం జగన్ తో పాటు మంత్రులు చెప్పారు. అయితే సిన్ రివర్స్ కావడంతో మద్యం ధరలను తగ్గించింది జగన్ సర్కార్. ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది. మద్యం తాగేవారిని తగ్గించేందుకు ధరలు పెంచామని చెప్పుకున్న ప్రభుత్వం.. ఇప్పుడెందుకు పెంచిందనే ప్రశ్న వస్తోంది. దశల వారీగా మద్య నిషేదంపై జగన్ వైఖరి మారిందా... ఏపీలో ఇక మద్య నిషేదం లేనట్టేనా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మాట తప్పం.. మడమ తిప్పమనే వైసీపీ నేతలు ఇప్పుడేం చెబుతారని పలువురు నిలదీస్తున్నారు.    లిక్కర్ ధరలు పెంచుతూ జగన్ సర్కార్ తీసుకున్న తొందర పాటు నిర్ణయంతో కొత్త సమస్యలు వచ్చాయి. ధరలు పెరగడం మందుబాబులకు ప్రాణాలమీదకు వచ్చింది. మత్తుకు బానిసలుగా మారిన కొందరు.. ఎక్కువ ధర లిక్కర్ కొనలేక.. శానిటైజర్ కు అలవాటుపడ్డారు. మత్తుగా ఉండటంతో దాన్నే లిక్కర్ గా ఊహించుకుని తాగారు. శానిటైజర్ మోతాదు మించడంతో పలు జిల్లాలో మరణాలు సంభవించాయి. ప్రకాశం జిల్లా కురిచేడులోనే 13 మంది ప్రాణాలు కోల్ఫోయారు. తిరుపతిలో నలుగురు, కడప జిల్లాలో ముగ్గురు శానిటైజర్ తాగి చనిపోయారు. అన్ని జిల్లాల్లోనూ శానిటైజర్ తాగే వారున్నారనే సమాచారంతో .. ఆలస్యంగా మేల్కొన్న జగన్ సర్కార్ ఎస్ఈబీని విచారణకు ఆదేశించింది. ధరలు ఎక్కువగా ఉండటం వల్లే  శానిటైజర్లు, మిథైల్ ఆల్కహాల్ తాగి ప్రాణాలు కోల్పోతున్నారని, ధరలు సవరించాలని ప్రభుత్వానికి ఎస్ఈబీ నివేదిక ఇచ్చింది.    2019 అక్టోబర్ లో తీసుకువచ్చిన కొత్త మద్యం పాలసీలోనే లిక్కర్ ధరలు పెంచింది జగన్ సర్కార్. కరోనా ప్రభావంతో మార్చి చివరలో మద్యం దుకాణాలు బందయ్యాయి. అన్ లాక్ లో షాపులు తెరవగా మందు కోసం జనాలు పోటెత్తారు. ఏ షాపు దగ్గర చూసినా కిలోమీటర్ల క్యూలైన్లు కనిపించాయి. దీంతో తాగేవారి సంఖ్యను తగ్గించాలనే సాకుతో మద్యం ధరలను మరో 75 శాతం పెంచింది ఏపీ సర్కార్. మద్యం ధరలు పెరగడంతో సామాన్యులు, పేదలు కొనలేకపోయారు. అదే సమయంలో మత్తును మరిచిపోలేక శానిటైజర్లకు అలవాటు పడ్డారు. ఇంకొందరు నాటుసారా తాగారు. చీప్‌ లిక్కర్‌ ధర పెరిగేకొద్దీ నాటుసారా సాధారణంగానే పెరుగుతూ ఉంటుంది. గతంలో ఇలాంటి సందర్భాలున్నాయి. అయినా ఆ సంగతి ఊహించకుండా... వరుసగా  షాక్‌ కొట్టేలా ధరలు ఎందుకు పెంచారనే ప్రశ్న వినిపిస్తోంది.      జరగాల్సిన నష్టం జరిగాకా మేల్కొన్న జగన్ సర్కార్.. పేదలు తాగే చీప్‌ లిక్కర్‌ ధరలను తగ్గించింది. మీడియం, ప్రీమియం మద్యం ధరలను మాత్రం భారీగా పెంచింది. అత్యంత చీప్‌ అయిన రెండు కేటగిరీల మద్యం ధరలను  తగ్గించింది. కనిష్ఠంగా 90 ఎంఎల్‌కు రూ.10 తగ్గింది. అదే... క్వార్టర్‌ రూ.600పైన ధర ఉన్న రకం మద్యంపై 90 ఎంఎల్‌పై రూ.140 పెంచారు. క్వార్టర్ రూ.150 నుంచి 190 మధ్య ఉన్న బ్రాండ్ల ధరల్లో మార్పు చేయలేదు. క్వార్టర్ రూ.190 నుంచి రూ.210 కంటే ఎక్కువ ఉన్న బ్రాండ్లకు.. రూ.40 నుంచి రూ.300 వరకు పెంచారు. బీర్లు, రెడీ టు డ్రింక్‌పై రూ.30 తగ్గించారు.     రాష్ట్రంలో ఇప్పటికే 30కిపైగా కొత్త బ్రాండ్లు రంగప్రవేశం చేశాయి. అత్యంత చీప్‌ నుంచి బాగా ఖరీదైన మద్యం వరకు అన్నీ కొత్త బ్రాండ్లే. ఎప్పటినుంచో ఉన్న ప్రముఖ మద్యం బ్రాండ్ల స్థానాన్ని ఇవి ఆక్రమించేశాయి. వచ్చిందే తడవుగా ఎక్సైజ్‌శాఖ కూడా కొత్త బ్రాండ్లకు చకచకా అనుమతులు ఇచ్చేసింది. వీటి వెనుక అధికార పార్టీ నేతలే ఉన్నట్లు బలమైన ఆరోపణలున్నాయి. తాజాగా మీడియం, ప్రీమియం బ్రాండ్ల ధరలను బాగా పెంచి... జేబులు నింపుకొనే ప్లాన్‌ చేస్తున్నట్లు తెలిసింది. చీప్‌ లిక్కర్‌ ధర తగ్గి సేల్స్‌ పెరిగినా, ఆపై రకం మద్యం ధరలు పెరిగినా... సొమ్ములన్నీ సొంత పార్టీ నేతలకే వెళ్లేలా స్కెచ్ వేశారనే ఆరోపణలు వస్తున్నాయి.    ధరలు తగ్గించిన తర్వాత కూడా రాష్ట్రంలో చీప్ లిక్కర్ ‌ ధర పొరుగు రాష్ట్రాలతో పోల్చితే 30 నుంచి 40 శాతం అధికంగానే ఉంది. ఇక రాష్ట్రంలో దొరికేదంత కొత్త, నాసిరకం మద్యమే. మీడియం, ప్రీమియం కేటగిరీలో పాపులర్‌ బ్రాండ్లు రాష్ట్రంలో దొరకడం లేదు. దీంతో వాటినీ ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నారు. అడ్డదారిలో లక్షలు సంపాదించుకోవచ్చన్న దుర్భుద్దితో కొందరు దళారి వ్యాపారులు.. అక్రమంగా భారీగా మద్యం బాటిళ్ల ను ఏపీకి తరలిస్తున్నారు. దీంతో లాక్‌డౌన్ నాటినుంచి కోట్లాది రూపాయల మద్యాన్ని ఏపీ పోలీసులు పట్టుకున్నారు. ప్రీమియం బాండ్ల ధరలు పెంచిన నేపథ్యంలో ఈ అక్రమ రవాణా మరింత పెరిగే అవకాశముంది. ధరల సవరణతో కొత్తగా ప్రయోజనమేంటో తెలియడం లేదని ఎక్సైజ్ అధికారులే అభిప్రాయపడుతున్నారు.

ఎన్నికల కమిషన్ వ్యవహారంలో సీఐడీ విచారణపై హైకోర్టు స్టే 

ఏపీ సర్కార్ కు హైకోర్టులో ఈరోజు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ ఎన్నికల కమిషన్ అంశంలో సీఐడీ చేస్తున్న దర్యాప్తు పై హైకోర్టు స్టే విధించింది. ఎన్నికల సంఘం ఉద్యోగులు తమ విధులు నిర్వర్తించకుండా సీఐడీ కేసులు నమోదు చేసిందని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఎలక్షన్ కమిషన్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వేధిస్తోందని ఆ పిటిషన్ లో అయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఎస్ఈసీ సహాయ కార్యదర్శి సాంబమూర్తి కూడా సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో నిమ్మగడ్డ రమేశ్, సాంబమూర్తిల పిటిషన్లను కలిపి విచారణ జరుపుతామని హైకోర్టు ఈరోజు తెలిపింది. ముందుగా ఈ కేసులో విచారణ ఎవరిపై, ఎందుకు చేస్తున్నారో వివరాలు తెలపాలని ఏపీ సిఐడిని ఆదేశించింది. ఈ కేసులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేంతవరకు తదుపరి చర్యలు నిలిపివేయాలని సీఐడీకి కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

తెలంగాణ చరిత్రలో చెరగని ముద్ర

ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణ అసెంబ్లీ ఘననివాళి   తెలంగాణ శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాల మొదటిరోజు మాజీ రాష్ట్రపతి దివంగత నేత ప్రణబ్ ముఖర్జీ, తెలంగాణ ఎమ్మెల్యే  సొలిపేట రామలింగారెడ్డిలకు నివాళులు అర్పించారు. శాసనసభలో ప్రణబ్ ముఖర్జీపై సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ భారత దేశం శిఖ‌ర స‌మాన‌మైన నేత‌ను కోల్పోయింద‌ని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్ర‌పంచంలోనే ప్ర‌ముఖ ఆర్థికవేత్త‌గా ప్ర‌ణ‌బ్ పేరు తెచ్చుకున్నార‌ని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రణబ్ ముఖర్జీ పాత్ర మరవలేదని, రాష్ట్రపతి హోదాలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై సంతకం చేసిన మహానుభావుడని గుర్తుచేశారు. ప‌శ్చిమ బెంగాల్ లో చిన్న గ్రామంలో పుట్టిన ఆయ‌న రాష్ట్ర‌ప‌తి వ‌ర‌కు ఎదిగార‌ని, చిన్నతనంలో స్కూలుకు వెళ్లాలంటే చిన్నవాగు ఈదుకుంటూ వెళ్లేవారని, గొప్ప నేతగా ఎదిగిన ఆయన  రాజ‌కీయ స‌ముద్రాన్ని స‌మ‌ర్థంగా ఈదిన నేత అని సిఎం కొనియాడారు.   తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు క‌రోనా కట్టడికి అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటూ సోమవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లోకి మాస్క్ధరించడంతో పాటు కరోనా నెగిటివ్ రిపోర్ట్ ఉన్నవారిని మాత్రమే అనుమతించారు. సభా ప్రాంగణాల్లో శానిటైజర్, థర్మల్ స్కానర్లు, ఆక్సీమీటర్లతో సహా అవసరమైన వైద్య పరికరాలను, వైద్యసిబ్బందిని సిద్ధంగా ఉంచారు.   రాష్ట్ర ప్రణబ్ ముఖర్జీకి సభ సంతాప తీర్మానం చేసిన తర్వాత ఇటీవల మరణించిన దుబ్బాక ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డికి సభ నివాళుల‌ర్పించింది. ఇటీవల మరణించిన మాజీ స‌భ్యులు సున్నం రాజ‌య్య‌, ఎడ్మ కిష్టారెడ్డి, పి రామ‌స్వామి, కావేటి స‌మ్మ‌య్య‌, జువ్వాడి ర‌త్నాక‌ర్ రావు, పోచ‌య్య‌, మ‌స్కు న‌ర్సింహ‌, బి కృష్ణ‌, మాతంగి న‌ర్స‌య్య మృతి ప‌ట్ల స‌భ నివాళుల‌ర్పిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. ఆ తర్వాత సభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి.

వలసలతో కాషాయ జోరు.. కారుకు కష్టమేనా! 

సిద్ధిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో అక్కడ బైపోల్ అనివార్యమైంది. అధికార పార్టీగా ఉండటం, ఎమ్మెల్యే చనిపోయిన సెంటిమెంట్ తో టీఆర్ఎస్ గెలుపు ఈజీగానే ఉంటుందని మొదట అందరూ భావించారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ రికార్డ్ కూడా అద్భుతంగా ఉంది. గతంలో జరిగిన చాలా ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయాలు సాధించింది. ఇలా అన్నిఅనుకూలంగా ఉండటంతో దుబ్బాకలో వార్ వన్ సైడ్ గానే ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమయింది. అయితే ప్రస్తుతం దుబ్బాకలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. విపక్షాలు సవాల్ గా తీసుకోవడంతో కారు పార్టీకి టఫ్ ఫైట్ ఉండే సూచనలు కన్పిస్తున్నాయి.    బీజేపీ నుంచి సీనియర్ నేత రఘునందన్ రావు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లోనూ ఆయన ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ ఉద్యమంలో ముందున్న నేతగా ఆయనకు ప్రజల్లో గుర్తింపు ఉంది. వరుసగా ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయనపై ప్రజల్లో సానుభూతి కూడా ఉంది. మరోవైపు సోలిపేట కుటుంబంపై స్థానికంగా వ్యతిరేకత కనిపిస్తోంది. ఇలా అన్ని అంశాలు కలిసి వస్తుండటంతో ప్రచారంలో స్పీడ్ పెంచారు రఘునందన్ రావు. ఇప్పటికే ఆయన సగానికి పైగా గ్రామాలు చుట్టేశారు. యువత టార్గెట్ గా ఆయన ముందుకు పోతున్నారు. బీజేపీలోకి వలసలు జోరందుకున్నాయి. యువకులు, యూత్ సంఘాలు రఘునందన్ రావుకు మద్దతు ప్రకటిస్తున్నాయి. దీంతో రోజు రోజుకు దుబ్బాకలో బీజేపీ బలం పుంజుకుంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.    కాంగ్రెస్ కూడా దుబ్బాక ఉపఎన్నికలను సీరియస్ గా తీసుకుంది. మెదక్ మాజీ ఎంపీ విజయశాంతిని రంగంలోకి దింపాలని ప్లాన్ చేస్తోంది.  ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో పాటు విజయశాంతి వ్యక్తిగత ఇమేజ్ తమకు ప్లస్ అవుతుందని కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన రాములమ్మ మెదక్ ఎంపీగా పనిచేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాపై ఆమెకు మంచి పట్టుంది. నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లో వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్నాయి. పార్టీలకతీతంగా అన్ని పార్టీలతో ఆమెకు సంబంధాలున్నాయి. గత ఎన్నికలో దుబ్బాక నుంచి కాంగ్రెస్‌కు సరైన అభ్యర్థి లేకున్నా రెండో స్థానం కైవసం చేసుకోగా బీజేపీకి మూడో స్థానం వచ్చింది. విజయశాంతిని బరిలోకి దింపితే అన్ని రకాలుగా కలిసి వస్తుందని హస్తం పార్టీ లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది.     2019 మార్చిలో జరిగిన ఉత్తర తెలంగాణ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఎన్నికల్లో అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఏకంగా మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఉద్యోగులు, యువకుల్లో టీఆర్ఎస్ పట్ల పెరిగిన వ్యతిరేకత ఆ ఎన్నికల్లో కన్పించింది. ఇప్పుడు అంతకు మించి కేసీఆర్ పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని కాంగ్రెస్, బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. కేసీఆర్ కు షాకిచ్చేందుకు జనాలు ఉత్సాహంగా ఉన్నారని చెబుతున్నారు.    బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాలతో టీఆర్ఎస్ అప్రమత్తమైంది. క్షేత్రస్థాయిలో పరిస్థితిలో సానుకూలంగా లేవని గ్రహించిన సీఎం కేసీఆర్.. మంత్రి హరీష్ రావును ప్రచార బాధ్యతలు అప్పగించినట్లు చెబుతున్నారు. టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్.. ఇప్పటికే నియోజకవర్గంలో పలు సమావేశాలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన కరోనా సోకడంతో హోం ఐసోలేషన్ లో ఉన్నారు. అయినా దుబ్బాక రాజకీయాలను ఆయన నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. హరీష్ డైరెక్షన్ లో మెదక్ ఎంపీతో పాటు జిల్లాకు చెందిన అధికార ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మండలాల వారీగా బాధ్యతలు తీసుకుని కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి గతంలో చాలా ఉప ఎన్నికలను ఈజీగా గెలుచుకున్న టీఆర్ఎస్ కు... దుబ్బాక సవాల్ గా మారిందనే ప్రచారం గులాబీ వర్గాల్లోనూ జరుగుతోంది.

కరోనా ముప్పు పల్లెలకు సోకింది

కరోనా మహమ్మారి పట్టణాలను వదిలి గ్రామల మీద ప్రతాపం చూయిస్తోంది. భారతదేశంలో ప్రస్తుతం నమోదు అవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో ఎక్కువ శాతం గ్రామాల్లోనే వస్తున్నాయి. దేశంలో మొత్త కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నలభై లక్షల కు చేరువలో ఉంది. అసుపత్రి సదుపాయాలు సరిగ్గా లేని గ్రామాల్లో ఈ వైరస్ తన ప్రభావం చూపిస్తోంది. హౌ ఇండియా లివ్స్ వెబ్ సైట్ చేసిన సర్వేలో దాదాపు 94శాతం గ్రామీణ ప్రాంతాల వారు కరోనా బారిన పడ్డారని తెలుస్తోంది. దేశంలోని 714జిల్లాల్లో కరోనా సోకిందని ఈ సర్వే ఫలితాలు చెప్తున్నాయి. ప్రభుత్వాలు ప్రకటించే సంఖ్యలో మాత్రం వాస్తవాలు కనిపించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాపిస్తే పరిస్థితులు ఆందోళన కరంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.   పిల్లల నుంచే ఎక్కువగా.. కరోనా వ్యాప్తికి కారణాలను అన్వేషిస్తున్న పరిశోధకులు చెప్తున్న విషయాలు ఆశ్చర్యంగా ఉంటున్నాయి. కోవిద్ 19 వైరస్ పిల్లలకు సోకినా వారిలో అంతగా లక్షణాలు కనిపించవి అయితే వారి ద్వారా ఇతరులకు వ్యాపిస్తుందని చెప్తున్నారు. పిల్లలు సరైనా మాస్కులు లేకుండా గుంపులుగా ఆట పాటల్లో నిమగ్నమవుతున్నారు. టీనేజ్ పిల్లల్లో రోగ నిరోధక శక్తి  ఎక్కువగా ఉండటంతో వారిలో కరోనా వైరస్‌ పెద్దగా ప్రభావం ఉండదు. లక్షణాలు కూడా బయటకు కనిపించవు. అయితే వారి ద్వారా పెద్దలకు వైరస్‌ సోకుతుందని  ‘ది జర్మన్‌ సొసైటీ ఫర్‌ వైరాలోజీ’ తాజాగా హెచ్చరించింది. స్పెయిన్‌లో కరోనా వైరస్‌ సోకినా 60 వేల మందిపై యాండీ బాడీస్‌ పరీక్షలు నిర్వహించగా, వారిలో 3.4 శాతం పిల్లలు ఉన్నారని, వారందరిలో యాంటీ బాడీస్‌ అభివృద్ది చెందినట్లు గుర్తించారు. లక్షణాలు కనిపించలేదని అజాగ్రత్త చేయవద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అన్ లాక్ 4 మార్గదర్శకాలను విడుదల చేసిన ఏపీ సర్కార్

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్‌లాక్ 4 మార్గదర్శకాలను ఏపీ సర్కార్ విడుదల చేసింది. ఈ నెల 30 వరకు విద్యా సంస్థల బంద్ కొనసాగనుంది. అయితే ఈ నెల 21 నుండి 9, 10, ఇంటర్ విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇందుకు తల్లిదండ్రుల రాత పూర్వక అంగీకారం తప్పనిసరిగా పేర్కొంది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లకు కూడా ఈ నెల 21 నుండి అనుమతి ఇచ్చింది. అలాగే పీహెచ్‌డీ, పీజీ విద్యార్థులు తరగతులకు హాజరయ్యేందుకు అనుమతిని ఇస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది.    ఈ నెల 21 నుండి 100 మందికి మించకుండా సామాజిక, విద్య, స్పోర్ట్స్, మత పరమైన, పొలిటికల్ సమావేశాలు జరుపుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఈ నెల 20 నుండి పెళ్ళిలకు 50 మంది అతిథులతో అనుమతినిచ్చింది. అలాగే, అంత్యక్రియలకు 20 మందికి అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 21 నుండి ఓపెన్ ఏర్ థియేటర్స్‌కు ప్రభుత్వం అనుమతినిచ్చింది. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్క్‌ లకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. 

వీఆర్వో వ్యవస్థ రద్దు.. రికార్డులను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు!

తెలంగాణలో గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. రెవెన్యూ వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని సీఎం కేసీఆర్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యవస్థ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, ప్రధానంగా గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్‌వోల) వల్ల ప్రభుత్వం బద్‌నాం అవుతోందని ఆయన భావిస్తున్నారు. రెవెన్యూ వ్యవస్థ బాగుపడాలంటే వీఆర్‌వో వ్యవస్థ రద్దు ఒకటే మార్గమని సీఎం స్పష్టం చేశారు. వీఆర్‌వోలను ఇతర శాఖల్లో కలిపేయాలన్నారు.   ఇప్పటికే వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం సాయంత్రం కల్లా రికార్డులు స్వాధీనం చేసుకుని, రిపోర్ట్‌ పంపాలని సీఎస్ కలెక్టర్లకు ఆదేశించారు.   అయితే, దీనిపై మాకు చాలా అనుమానాలు ఉన్నాయని, మా అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. మా సర్వీస్ పరిస్థితి ఏంటి? మేం ఏ శాఖలో ఉద్యోగులం అవుతామో చెప్పాలి అని వారు ప్రశ్నిస్తున్నారు.

అధిష్టానంతో పెట్టుకుంటే అంతే.. యూపీ సీనియర్ నేతలకు షాక్!

అధిష్టానంతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో కాంగ్రెస్ మరో సారి రుచి చూపించింది. యూపీ సీనియర్ కాంగ్రెస్ నేతలను అదును చూసి దెబ్బ కొట్టారు అధినేత్రి. మరో రెండేళ్లలో జరిగే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ నేపథ్యంలో అధిష్ఠానం ఏడు కమిటీలను ఏర్పాటు చేసింది. సీనియర్ నేతలైన రాజ్ బబ్బర్, జితిన్ ప్రసాదతో పాటు మరి కొందరికి వీటిలో చోటు దక్కలేదు. క్రియాశీల నేత, పూర్తికాలపు అధ్యక్షుడు కావాలంటూ లేఖ రాసి సంతకాలు పెట్టిన 23 మంది నేతలలో వీరిద్దరు కూడా ఉన్నారు. జితిన్ ప్రసాద యూపీఏ హయాంలో కేంద్ర మంత్రి. రాజ్ బబ్బర్ నిన్న మొన్నటి వరకు యూపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఉన్నారు. ఏడు కమిటీల్లో ఏ ఒక్క దానిలో కూడా వీరికి చోటు దక్కపోవటాన్ని బట్టి చూస్తే సోనియా వీరిపై ఎంత ఆగ్రహంతో ఉన్నారో అర్థమవుతోంది.   హైకమాండ్ నిర్ణయంపై యూపీ కాంగ్రెస్ నేతలు వేరేలా బావిస్తున్నారు. వారు ఇప్పటికే అనేక బాధ్యతలు నిర్వహిస్తున్నందున అదనపు భారం మోపటం ఇష్టం లేకే వారిని కమిటీలకు దూరంగా పెట్టిందని, అంతకు మించి అధిష్టానిని వారిపై ఏ దురుద్దేశం లేదని పార్టీ నాయకులు కొందరు అంటున్నారు.   కాంగ్రెస్ అధిష్ఠానం యూపీ మేనిఫెస్టో కమిటీని కూడా ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ దీనికి నాయకత్వం వహిస్తారు. పి.ఎల్. పూనియా, సుప్రియా శ్రీనాతే, అర్ధానా మిశ్రా, ప్రమోద్ తివారీ, ఇమ్రాన్ మసూద్ తదితరులు ఖుర్షీద్ టీమ్ లో ఉన్నారు. వీరు ఉత్తర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ మ్యానిఫెస్టోను రూపొందిస్తారు. ఉత్తర ప్రదేశ్‌లో పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న ప్రియాంక గాంధీ ఇప్పటికే పలు ఎన్నికల బృందాలను ఏర్పాటు చేయడం ప్రారంభించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.   గత ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ముందే ప్రియాంకకు ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను నడిపించే బాధ్యతలు అప్పగించారు. కానీ ఆ ఎన్నికల్లో ఆమె అట్టర్ ఫ్లాప్ అయ్యారు. కేవలం రెండే రెండు సీట్లు గెలిచింది కాంగ్రెస్. రాష్ట్రంలో ఇప్పటివరకు కాంగ్రెస్ చెత్త పర్ఫామెన్స్ అదే. సోనియా గాంధీ రాయ్ బరేలిని నిలుపుకున్నప్పటికీ, బిజెపి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ అమేథిలో ఘోర పరాజయం చవిచూశారు. ఇప్పుడు భవిష్యత్ లోకి చూడటమే ముఖ్యమని భావించి అధిష్టానానికి ఎంతో దగ్గరివాడైన సల్మాన్ ఖుర్ఫీద్ పై పెద్ద బాధ్యతలు పెట్టినట్టు తెలుస్తోంది. అలీగఢ్ లో జన్మించిన ఖుర్షీద్ ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లోని ఫరూఖాబాద్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. ఈయన మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన మవనడు.

కరోనా మందు.. ఎవరికి ముందు

ఆలు లేదు చూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్న నానుడి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో జరుగుతున్న చర్చల తీరు గమనిస్తుంటే ఈ నానుడిని మరోసారు గుర్తుకు చేసుకోవల్సిందే. కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా వందకు మించి ప్రయోగాలు జరుగుతున్నాయి. వాటిలో చాలా వరకు క్లినికల్ ట్రయల్స్ లోనే ఉన్నాయి. అవి విజయవంతమై ఉత్పత్తిని ఇంకా ప్రారంభించనే లేదు. ఇంతలోనే ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. కోవిద్ 19 వైరస్ ను ఎదుర్కోన్నే వ్యాక్సి న్ విజయవంతమైతే ముందుగా ఎవరికీ ఆ వ్యాక్సిన్ ఇవ్వాలి అన్న అంశంపై అంతర్జాతీయంగా చర్చజరుగుతోంది. ప్రపంచంలో అన్ని దేశాలకు ప్రాధాన్యతనిస్తూ టీకా పంపిణీ చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే సంపన్న దేశాలకు సూచించింది.   ఈ వైరస్ ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలను, మరణాల రేటు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని 19 మంది అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులు ఒక బృందంగా ఏర్పడి కొన్ని సూచనలు చేశారు. ఈ బృందానికి పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన ఎజెకీల్‌ జే ఎమ్మన్యూల్‌ నేతృత్వం వహిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే  మూడు దశల్లో వ్యాక్సిన్‌ పంపిణీ చేయాలంటూ కొన్ని సూచనలు చేశారు. వాటిలో కొన్నింటి పరిశీలిస్తే.. కోవిద్ 19 వైరస్ కారణంగా అత్యధికంగా మరణాలు సంభవించే దేశాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. వైరస్‌తో పోరాడుతూనే ఆర్థికంగా ముందుకు వెళుతున్న దేశాలకు రెండో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాలకు వ్యాక్సిన్‌ సరఫరా చేయాలని సూచించారు. కరోనా తో ఊహించిన దానికంటే ముందుగా మరణాలు నమోదయ్యే ప్రాంతాలను గుర్తించి అక్కడి ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు.   అయితే అక్టోబర్ చివరికల్లా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని, అన్ని రాష్ట్రాలు సిద్ధం కావాలంటూ సీడీసీ డైరెక్టర్ రాబర్ట్ రెడ్ ఫీల్డ్ ఓ లేఖలో పేర్కొన్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇప్పటికే అమెరికాలో నవంబర్ 1వ తేదీ నుంచి వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభిస్తామంటున్నారు.  వ్యాక్సిన్ పంపిణీ కోసం ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ (AstraZeneca) ఆమోదానికి చేరువలో ఉందని ఇటీవల ప్రకటించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందే కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరగాలని ఆయన భావిస్తున్నారు.   ఇప్పటివరకు ప్రయోగశాలను దాటి క్లినికల్ ట్రయల్స్ లోనే ఉన్న వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమై మార్కెట్ లోకి వస్తే తప్ప కరోనా మందు ఎవరికీ ముందు అన్న విషయంపై స్పష్టత రాదు. అప్పటివరకు ప్రయోగాలతో పోటీ పడి అంతర్జాతీయ వేదికలపై ఇలా చర్చలు జరగడం మాములే..! ఎందుకుంటే కరోనా చేసిన నష్టం, కలిగించిన కష్టం ఇంతంత కాదు కదా..!

బెంబేలెత్తిస్తున్న కరోనా.. ప్రపంచంలోనే రెండో స్థానంలో భారత్.. 

భారత్‌లో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. తాజాగా గడచిన 24 గంటల్లో 90,802 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 42,04,614కు చేరుకుంది. నిన్న మరో 1016 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 71,642కు చేరుకుంది. అయితే దేశంలో ఇప్పటివరకు 32,50,429 మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 8,82,542కి చేరింది.   ఇది ఇలా ఉండగా ప్రపంచంలోనే ఒక దేశంలో ఒకే రోజు 90వేల పాజిటివ్ కేసులు నమోదవడం ఇదే మొదటి సారి. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులున్న దేశాల్లో... అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. అంతేకాకుండా కొత్త కేసుల నమోదులో భారత్ 32 రోజులుగా టాప్ పొజిషన్‌లో కొనసాగుతోంది. ఇక మరణాల విషయంలో అమెరికా, బ్రెజిల్ తర్వాత ఇండియా మూడో స్థానంలో ఉంది.

లాక్ డౌన్ సమయంలో ప్రయాణం చేయలేని విమాన ప్రయాణికులకు శుభవార్త

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో విమాన సర్వీసులన్నీ రద్దు చేశారు. మార్చి 25  నుంచి మే 3 మధ్య దేశీయ, విదేశీయ విమాన ప్రయాణాల కోసం ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులకు శుభవార్త చెప్తున్నాయి విమానయాస సంస్థలు. ప్రయాణీకులు బుక్ చేసుకున్న టికెట్ మొత్తాన్ని పూర్తిగా రిఫండ్ ఇస్తామంటున్నారు. వచ్చే ఏడాది అంటే 2021 మార్చి 31లోగా అదే టిక్కెట్ పై ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తారు.    లాక్ డౌన్ సమయంలో ప్రయాణం చేయలేనివారి తరపున ప్రవాసీ లీగర్ సెల్ ఎన్జీవో సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ విషయంపై సమాధానం చెప్పాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్రాన్ని ఆదేశించింది. లాక్ డౌన్ సమయంలో టిక్కెట్ బుక్ చేసుకున్నవారికి విమానయాన సంస్థలు కనుక రిఫండ్ ఇవ్వకుంటే వచ్చే ఏడాది మార్చి 31 వరకు అదే టికెట్‌పై మరోమారు ప్రయాణించే అవకాశం (క్రెడిట్ షెల్) లభిస్తుందని కేంద్రం వివరించింది.  క్రెడిట్ షెల్ వినియోగించుకోని ప్రయాణికులకు పూర్తిస్థాయి రిఫండ్ ఇస్తుందని అత్యున్నత ధర్మాసనానికి కేంద్రం తెలిపింది. విమాన ప్రయాణికులు తమ టికెట్‌ను వేరేవారికి బదిలీ చేసే అవకాశం కూడా ఉంటుందని పేర్కొంది. దీంతో కరోనా సమయంలో ప్రయాణం చేయలేకపోయిన వారికి కాస్త ఊరట కలిగింది.

ప్రపంచ అనారోగ్య సంస్థ కబంధ హస్తాల నుంచి విముక్తి ఎపుడో..

ప్రపంచ మానవాళిని గత కొద్ది నెలలుగా పట్టిపీడిస్తున్న మహమ్మారి కరోనా. ఇప్పటివరకు లక్షణాలతో, కొత్త కేసులతో భయపెట్టిన ఈ వ్యాధి ఇప్పుడు చాపకింద నీరుగా విస్తరిస్తూ బయటకు కనిపించకుండానే ప్రాణాలు తీస్తుంది. ప్రపంచంలోని సగానికి పైగా దేశాల్లో కొత్తగా కరోనా కేసులు నమోదు కావడం లేదు. ఇందుకు కారణం కరోనా లక్షణాలు కనిపించకపోవడంతో వైద్యపరీక్షలు చేయించుకోకపోవడం. ఒక వేళ నమోదు అవుతున్నా తక్కువ సంఖ్యలోనే బయటపడుతున్నాయి.  45 శాతం దేశాల్లో రోజుకి వెయ్యి లోపు  కేసులే కొత్తగా నమోదు అవుతున్నాయి. కొత్త కేసుల విషయం లో భారతదేశం మొదటి స్థానంలో ఉండగా (ఆదివారం ఒక్కరోజే 91723 కొత్త కేసులు నమోదు అయ్యాయి) అమెరికా రెండవ స్థానంలో (31110 కొత్తకేసులు)వుంది. మరో రెండుమూడు వారాల్లో అమెరికాలో కరోనా కేసుల సంఖ్య అయిదు వేల కంటే తక్కువగా పడి పోతుంది అని వైద్య బృందాలు వెల్లడిస్తున్నాయి. రోజుకు దాదాపు 15 వేల కేసులు తో బ్రెజిల్ మూడవ స్థానం లో వుంది. ఇక్కడ కూడా కేసులు వేగం గా తగ్గిపోతున్నాయి. మరో రెండు వారాల్లో ఈ సంఖ్య చాలావరకు తగ్గుతుందని పరిశోధకులు అంటున్నారు. అంటే  ఈనెల చివరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా సమస్య 98 శాతం సమసి పోతుంది అనుకోవచ్చు.   ప్రపంచ అనారోగ్య సంస్థ సూచనల్ని బేఖాతరు చేసిన స్వీడన్ , థాయిలాండ్, వియత్నాం లాంటి అనేక దేశాలు కరోనా పై నూటికి నూరు శాతం విజయం సాధించాయి. మాస్క్ లు , భౌతిక దూరం లాంటివి ఇప్పుడు అక్కడ అవసరం లేకుండా పోయింది. అన్నట్టు మన దాయాది దేశం పాకిస్థాన్ లో నిన్న నమోదైన కొత్త కేసులు 500 లోపే.. నిబంధనలు పాటించకుండా వారు చేసిన రంజాన్ షాపింగ్ పుణ్యమా అని వారికి హెర్డ్ ఇమ్మ్యూనిటి త్వరగా వచ్చేసింది.   సెప్టెంబర్ ఇరవై తరువాత కొత్త గా కరోనా పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదు అయ్యే ఏకైక దేశంగా ఇండియా మిగిలిపోతుంది అనడంతో ఏ మాత్రం సందేహం కనిపించడం లేదు. ఆదివారం ఒకరోజే 91వేలకు పైగా కేసులు నమోదు కాగా.. నేడో, రేపో కొత్త కేసుల సంఖ్య లక్షను చేరుతుంది అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచంలో రోజూ లక్ష కొత్త కేసులు నమోదు అయిన దేశంగా రికార్డు సృష్టించబోతున్నది భారతదేశం. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇంతగా పెరగడానికి, ఇది రావణ కాష్టంలా సాగడానికి ప్రధాన కారణం మనలో చాల మంది ప్రపంచ అనారోగ్య సంస్థ(మన పాలిట అనారోగ్య సంస్థే) మాటల్ని విపరీతమైన భక్తి తో పాటించడమే ! కోవిడ్ 19 వైరస్ కేసులు నమోదు అయిన తొలి రోజుల నుంచి ఇప్పటివరకు ప్రపంచ అనారోగ్య సంస్థ చేసిన ప్రకటనలు చూస్తే ఏది వాస్తవం, ఏది అవాస్తవం అన్నది మనం స్పష్టంగా తెలుసుకోలేని అయోమయపరిస్థితి. ఇంటి నుంచి కాలు బయట పెడితే కరోనా వైరస్ సోకుతుంది, ఒకసారి వైరస్ శరీరంలోకి వచ్చిందంటే మరణమే శరణమని నమ్ముతున్నాం. ప్రాణాలు తీసే కరోనా బారిన పడకుండా నాలుగుగోడల మధ్య బందీగా మారారు.  ప్రపంచ అనారోగ్య సంస్థ చెప్పే ప్రతి మాటను మూఢభక్తి తో నమ్ముతున్న ప్రజలున్న ఏకైక దేశం మనదే! భయం తో ఉన్న వారినే చూసి కాటెయ్యడం కరోనా ప్రపంచ వ్యాప్తంగా చూపిన లక్షణం.      కోటి జనాభా ఉన్న స్వీడన్ "నేను హెర్డ్ ఇమ్మ్యూనిటి మార్గంలో వెళుతాను.. ప్రకృతి సిద్ధమైన రోగనిరోధక శక్తినే నమ్ముకొంటాను .. ప్రపంచ అనారోగ్య సంస్థ సైన్స్ పేరుతొ చెబుతున్న బూటకపు మాటల్ని కాదు" అని ముందుకు వెళ్ళింది. ఆ దేశంలో అతి తక్కువ కేసులు నమోదు కావడంతో పాటు ఇప్పటివరకు కేవలం అయిదు  వేల మరణాలతో కరోనా పై నూటికి నూరు శాతం విజయం సాధించింది.   కళ్ళుండీ చూడలేని మనుషులున్న ప్రపంచం మనది. అంతరీక్షంలోకి మరో దశాబ్దాలంలో మనుషులు వెళ్లగలిగేంత అభివృద్ధిని సాధిస్తున్నాం. మరోవైపు సైన్స్ పేరుతో మధ్య యుగం నాటి మూఢ నమ్మకాలను ప్రచారం చేస్తున్నారు. కరోనా ఎలా వస్తుందో, ఎందుకు వస్తోందో స్పష్టంగా చెప్పలేకపోయినా ప్రపంచ అనారోగ్య సంస్థ  చెబుతున్న విషయాలను  మనం గుడ్డిగా నమ్మాల్సిందే. కాదని ఎవరైనా ప్రశ్నించినా  సరైన సమాధానం ఆ సంస్థ వద్ద లేదు. అందుకే వింతవింత కారణాలు, పొంతనలేని విషయాలు చెప్పుతూ నాటకాలు ఆడుతున్నది ప్రపంచ అనారోగ్య సంస్థ. జీవితాలను బందీ చేస్తున్న ఈ సంస్థ కబంద హస్తాల నుంచి మనకు విముక్తి ఎప్పుడో?