అన్ లాక్ 4 మార్గదర్శకాలను విడుదల చేసిన ఏపీ సర్కార్
posted on Sep 7, 2020 @ 2:21PM
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్లాక్ 4 మార్గదర్శకాలను ఏపీ సర్కార్ విడుదల చేసింది. ఈ నెల 30 వరకు విద్యా సంస్థల బంద్ కొనసాగనుంది. అయితే ఈ నెల 21 నుండి 9, 10, ఇంటర్ విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇందుకు తల్లిదండ్రుల రాత పూర్వక అంగీకారం తప్పనిసరిగా పేర్కొంది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు కూడా ఈ నెల 21 నుండి అనుమతి ఇచ్చింది. అలాగే పీహెచ్డీ, పీజీ విద్యార్థులు తరగతులకు హాజరయ్యేందుకు అనుమతిని ఇస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ నెల 21 నుండి 100 మందికి మించకుండా సామాజిక, విద్య, స్పోర్ట్స్, మత పరమైన, పొలిటికల్ సమావేశాలు జరుపుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఈ నెల 20 నుండి పెళ్ళిలకు 50 మంది అతిథులతో అనుమతినిచ్చింది. అలాగే, అంత్యక్రియలకు 20 మందికి అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 21 నుండి ఓపెన్ ఏర్ థియేటర్స్కు ప్రభుత్వం అనుమతినిచ్చింది. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్క్ లకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.