Actor Nagababu

తనను కూడా నాలుగు పీకి బాధ్యతలు నేర్పమన్న నాగబాబు

నాగబాబు మళ్ళీ యాక్టివ్ అయిపోయారు. ప్రజలు హక్కులే కాదు, బాధ్యతల గురించి కూడా మాట్లాడటం, వాటిని అలవాటు చేసుకోవటం నేర్చుకోవాలని ట్విట్ట్టర్ వేదికగా సూచించాడు. " ఒక న్యూస్ ఛానెల్ లో ఎవరో ప్రొఫెసర్ దాస్ గారు అన్నమాట నాకు చాలా నచ్చింది."మనం ప్రజలకి హక్కులు నేర్పాము.బాధ్యతలు నేర్పలేదు"అక్షర సత్యం ...ఈ తప్పు ప్రభుత్వం వారిదే.మా జనాలకి బాధ్యతలు నేర్పే టైం వచ్చింది.నేను కూడా అతితుడ్ని కాదు.మా ప్రజలందరికీ తన్ని బాధ్యతలు నేర్పించండి.నేర్చుకుంటాం..." అంటూ అయన చేసిన ట్వీట్, బాధ్యత రహితంగా ఉండే ప్రజానీకానికి హెచ్చరికలా , ఆయన ట్వీట్ పని చేస్తుందని ఆశిద్దాం.

Vijayawada

కరోనా చికిత్స కేంద్రంగా బెజవాడ

కృష్ణా జిల్లాలో రోజురోజుకూ అనుమానిత కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు ఓపీ సేవలతోపాటు సర్జరీ, జనరల్‌ మెడిసిన్‌, ఆర్థో, న్యూరాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, కార్డియాలజీ, ఈఎన్‌టీ, సైకియాట్రి, డయాలసిస్‌ ఇలా అన్ని రకాల వైద్యసేవలను అందిస్తూ జిల్లాలోనే పెద్దాసుపత్రిగా పేరొందిన విజయవాడ కొత్త ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని పూర్తిగా కరోనా వ్యాధి చికిత్సా కేంద్రంగా (కరోనా ఆసుపత్రి)గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1050 మంచాలతో కూడిన ఈ పెద్దాసుపత్రిలో ఇక నుంచి పూర్తిగా కరోనా వైరస్‌ బాధితులకు మాత్రమే వైద్యసేవలందించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.  ప్రస్తుతం ఇక్కడ ఆయా విభాగాల్లో ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందుతున్న రోగుల్లో ఆరోగ్యం మెరుగుపడిన వారిని డిశ్చార్జి చేసి ఇంటి దగ్గరే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బుధవారం సాయంత్రానికే కొన్ని వార్డులు ఖాళీ అయిపోయాయి. సీరియస్‌ కండిషన్‌లో ఉన్న రోగులను మాత్రం అంబులెన్స్‌ల్లో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి, వారికి అక్కడ వైద్యసేవలను కొనసాగించనున్నారు. డయాలసిస్‌ అవసరమైన రోగులు కూడా గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వెళ్లాల్సిందే. విజయవాడ ప్రభుత్వాసుపత్రికి ప్రతి రోజూ దాదాపు రెండు వేల మంది ఔట్‌ పేషెంట్లు వస్తుంటారు. ఇలా వచ్చే వారికి నగరంలోని పటమట, కొత్తపేట, రాజీవ్‌నగర్‌ల్లో ఉన్న అర్బన్‌ ఫ్యామిలీ హెల్త్‌ సెంటర్లలో ఓపీ సేవలను కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బస్టాండ్‌ సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో అదనంగా ప్రత్యేక అల్లోపతి డిస్పెన్షరీ ఏర్పాటు చేయనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ఈ నాలుగు హెల్త్‌ సెంటర్లకు వచ్చే ఓపీ పేషెంట్లలో ఎవరికైనా ఎమెర్జెన్సీ వైద్యసేవలు, శస్త్రచికిత్సలు అవసరమైతే వారిని అంబులెన్స్‌ల్లో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లి మెరుగైన వైద్యసేవలందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వారు చెబుతున్నారు. విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని పూర్తిగా కరోనా ఆసుపత్రిగా మార్చేస్తున్నందున ఇక నుంచి కరోనా పాజిటివ్‌, ఆ వైరస్‌ లక్షణాలతో బాధపడుతున్న వారికి మాత్రమే ఇక్కడ చికిత్స అందించనున్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలతోపాటు తూర్పు గోదావరి జిల్లాలోని సగభాగం నుంచి కరోనా కేసులను విజయవాడ ప్రభుత్వాసుపత్రి (కరోనా ట్రీటింగ్‌ సెంటర్‌)కి తీసుకువచ్చి ఇక్కడ చికిత్స అందిస్తారని వైద్య అధికారులు చెబుతున్నారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ప్రసూతి, చిన్నపిల్లల విభాగాలు.యథావిధిగా కొనసాగనున్నాయి.

vasireddy amarnath about corona

ఇండియాలో తక్కువ ప్రభావాన్ని చూపే కరోనా సోకుతుందా?

ఆంథ్రోపాలజీ అధ్యాపకుడు వాసిరెడ్డి అమర్నాథ్ క‌రోనాపై ఆస‌క్తిక‌ర‌మైన అంశాల‌ను లేవ‌నెత్తారు. ఇండియా మరో ఇటలీ కాదని ఆయ‌న విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వ‌ర‌కు హైదరాబాద్ లో ఒక్క రోగి కి కూడా వెంటిలేటర్ ను వాడాల్సిన అవసరం ఏర్పడలేదని తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్ రెండు సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు. అంటే ఇవన్నీ మైల్డ్ ఇన్ఫెక్షన్స్ అన్న మాట . సుబ్రమణ్య స్వామి, అమెరికా లోనో మరెక్కడో ఉన్న డాక్టర్ ను సంప్రదిస్తే ఆయన భారతీయులకు virulent స్ట్రైన్ కాకుండా తక్కువ ప్రభావాన్ని చూపే కరోనా స్ట్రైన్ సోకిందని చెప్పారట . సో ఆయన గారు ట్వీటారు. జనాలు దాన్ని షేర్ చేస్తున్నారు . దీని అర్థం ఏమిటంటే ఇప్పటిదాకా యాదృచ్చికం గా virulent వెరైటీ సోక లేదు కాబట్టి ఇక్కడ పరిస్థితి మెరుగ్గా వుంది . అది సోకితే ఇక హాహాకారాలే. సుబ్రమణ్య స్వామి ట్వీట్ లో నిజమెంతో చూద్దాం. ఇప్పటిదాకా భారత దేశం లో ప్రధానంగా విదేశాలను నుండి వచ్చిన వారికే కరోనా ఎక్కువగా వచ్చింది. వారు ఇటలీ , లండన్ , స్పెయిన్ , అమెరికా , సింగపూర్ .. ఇలా పలు దేశాలనుండి వచ్చారు . ముఖ్యంగా యూరోప్ అమెరికా లో ఈ వ్యాధి విస్తృతి, ఇటలీ లాంటి చోట్ల అయితే దీని ప్రభావం అందరికి తెలిసిందే . అంటే ఇటలీ లో తెల్లవాళ్లకు virulent స్ట్రైన్ సోకింది. మనవారికి మాత్రం పోనీలే అని తక్కువ ప్రభావాన్ని చూపే కరోనా సోకిందా ? ఇందులో ఏమైనా అర్థం ఉందా ? మన వారి పై ఇది అంత తీవ్ర స్థాయిలో ప్రభావం చూపక పోవడానికి కారణం అది కాదు . అమెరికా లో కరోనా వ్యాధి న పడిన భారతీయుల సంఖ్య బాగా తక్కువ . దీనికి కారణం మనాళ్ళు హోమ్ quarantine చేసుకోవడం ఒక్కటే కాదు . అమెరికా యూనివర్సిటీ ల లో పాఠాలు చెప్పే స్లేట్ విద్యార్థులు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఏమిటంటే ఈ వ్యాధి బారిన పడిన ఇండియన్స్ తక్కువ . వారం క్రితమే ఇప్పుడు యూనివర్సిటీ లో బోధిస్తున్న స్లేట్ పూర్వ విద్యార్ధి కి అతని పాకిస్థానీ ఫ్రెండ్స్ కు ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి . వారి పై ఈ వ్యాధి చాల మైల్డ్ గా ఉండడం తో ఆసుపత్రులు కనీసం వారికీ టెస్ట్ నిర్వహించలేదు . ఇప్పుడు వారి ఆరోగ్యం మెరుగ్గా వుంది . అలాగే అమెరికా లో నివసిస్తున్న ఆఫ్రికన్ మూలాలు ఉన్న నల్ల జాతి వారి పై కూడా కరోనా అతి తక్కువ ప్రభావాన్ని చూపుతోంది . పై రెండు పాయింట్స్ బట్టి నిర్ధారితం అవుతున్న దేమిటంటే మలేరియా వ్యాధి సోకే ఉష్ణ మండల ప్రాంతాల్లో పుట్టిన వారికి లేదా కనీసం ఆ మూలాలు ఉన్న వారికి కరోనా రెసిస్టన్స్ వుంది . అంటే జెనెటిక్ గా మనకు పరిణామ క్రమం లో mutations ద్వారా ఈ లక్షణం వచ్చింది . అది మలేరియా నిరోధకతను సంబంధించింది . అదే ఇప్పుడు కరోనా వ్యాధి నుంచి కూడా రక్షణ కల్పిస్తోంది . ఒక వేళా కరోనా అనేది చైన్ తయారు చేసిన బయో వెపన్ అయితే దీన్ని ఉద్దేశ పూర్వకంగా ఇలా చేశారేమో అనిపిస్తుంది . కరోనా వైరస్ చైనా లాబ్స్ నుంచి ప్రమాదవశాత్తు లీక్ అయింది అనే అభిప్రాయాన్ని తోసి పుచ్చలేము . కానీ కావాలనే చైనా దీని ప్రయోగించింది అంటే అది సరి కాదని నా అభిప్రాయం . ఒక వేళ అది వారు తయారు చేసిన బయో వెపన్ అయితే వారి దగ్గర దానికి టీకా ఉండక పోవచ్చు . కానీ దానిపై వారికి మెరుగైన అవగాహన ఉండవచ్చు . అసలు చైనా .. బయో వెపన్ అనేది కేవలం ఒక అనుమానం మాత్రమే . ప్రపంచం లో అత్యంత పవర్ఫుల్ నెట్ వర్క్ కలిగిన సి ఐ ఏ దీని గురించి ఎలాంటి సమాచారం ఇవ్వక పోవడాన్ని బట్టి ఈ బయో వెపన్ థియరీ కి పెద్దగా విలువ లేదని చెప్పవచ్చు. భారత దేశం లో ఉన్న అధిక ఉష్ణోగ్రతలు కూడా ఈ వ్యాధి చాల నెమ్మదిగా ప్రబలడానికి కారణం. ఒక వేళ ఇండియన్స్ కూడా ఇటలీ వారి లాగే కరోనా బారిన పడే అవకాశం ఉంటే .. లాక్ ఇన్ కూడా మనల్ని రక్షించలేదు . లాక్ ఇన్ పేరుతొ మోండా మార్కెట్ లో జనాలు ఒకరి పై ఒకరు పడడం.. అమీర్పేట్ , కూకట్పల్లి ప్రాంతాల్లలో హాస్టల్ విద్యార్థులు వందల్లో పోలీస్ స్టేషన్ ముందు గుమిగూడడం , చెన్నై రైల్వే స్టేషన్ లో మొన్న కిక్కరిసిన జన సమూహం .. ఇవి చాలు .. వేల సంఖ్యలో కరోనా వ్యాధి విస్తరించడానికి . కానీ ఆలా జరగదు .. ఎందుకంటే మనకు మైక్రో ఎవల్యూషన్ లో భాగంగా వచ్చిన మలేరియా రెసిస్టన్స్ ఇప్పుడు ఉపయోగపడుతోంది . మన పై ఈ వ్యాధి ప్రభావం చాల మటుకు మైల్డ్ గానే ఉంటుంది . ఎవరో మరీ అనారోగ్యం తో బాధ పడుతున్నవారు .. వృద్దులు ... ఇలాంటి వారి పైనే ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది . దీనికి తోడు ఇప్పుడు లాక్ ఇన్ . తొలి రెండు రోజులు కొన్ని అపశృతులు దొర్లిన మాట వాస్తవం . కారణం జనాల పానిక్ కొనుగోళ్లు .. అలాగే ప్రయాణాలు .. దీనికి తోడు ఉగాది పండుగ కొనుగోళ్లు .. పోలీస్ లు, ప్రభుత్వం చాలా బాగా పని చేస్తున్నాయి . బహుశా ఈ రోజు నుండి అన్ని సర్దుకుంటాయి . లాక్ ఇన్ అనేది బాగా పని చేస్తుంది. ఇక ఊపిరి పీల్చుకో భారత దేశమా!

last photo of Dr Hadio Ali who died after treating the people affected by Corona

డాక్ట‌ర్ చివ‌రిచూపు..గేట్ వెలుపల నుంచే వీడ్కోలు!

ఈ నిస్సహాయ కళ్ళు తేమగా ఉన్నాయి. చనిపోయే ముందు ఇంటికి వచ్చి, గేట్ వెలుపల నుండి పిల్లలను చూసి వెళ్లిపోయాడు మరియు తరువాత అతను ప్రపంచానికి వీడ్కోలు చెప్పాడు. అతను తన పిల్లలను తన చేతితో కూడా తాకలేకపోయాడు. ఈ చిత్రాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, ఈ పదునైన చిత్రం చూసైనా అప్ర‌మ‌త్తంగా వుండండి. ఇండోనేషియాకు చెందిన డాక్టర్ హైడియో అలీ యొక్క చివరి చిత్రం ఇది, కరోనా వైరస్ రోగులకు చికిత్స చేస్తున్నప్పుడు కరోనాకు సోకింది. తాను ఇకపై బ్ర‌త‌క‌లేడ‌ని, చావుత‌ప్ప‌ద‌ని భావించినప్పుడు, అతను ఇంటికి వెళ్లి, గేటు వెలుపల నిలబడి, తన పిల్లలను మరియు గర్భిణీ భార్యను చివరిసారిగా చూస్తూ, ఆపై వెళ్లిపోయాడు, ఈ చిత్రాన్ని అతని భార్య తీసింది. అతను తన పిల్లలను హృదయపూర్వకంగా చూడటానికి మరియు వారి వీడ్కోలు తీసుకోవడానికి వచ్చినప్పుడు, అతను చాలా దూరంగా నిలబడ్డాడు, తన బీబీ పిల్లలకు వైరస్ రావాలని అతను కోరుకోలేదు. డాక్టర్ హైడియో అలీ మానవుడిగా దేవదూత అని నిరూపించాడు, అలాంటి వైద్యుడికి వందనం.

3 yr old with travel history of Saudi tests positive in hyderabad

మూడేళ్ల బాలుడికి కరోనా, తెలంగాణలో ఆరు కాంటాక్ట్ కేసులు!

తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతంగా విస్తరిస్తోంది. సౌదీ నుంచి వచ్చిన మూడేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. హైదరాబాద్‌కు చెందిన మరో మహిళకు ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా కరోనా సోకింది. దీంతో మొత్తం వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 41కి పెరిగింది. చిన్నారులకు కూడా కరోనా సోకడం ఆందోళనకర అంశం. హైదరాబాద్‌ గోల్కొండలో నివసిస్తున్న ఓ కుటుంబం ఇటీవలే సౌదీ అరేబియా నుంచి వచ్చారు. వీరిలో మూడేళ్ల చిన్నారికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల రక్త నమూనాలను కూడా సేకరించి పరీక్షిస్తున్నారు. బాలుడి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. రోజురోజుకూ స్థానికంగా రెండో కాంటాక్ట్‌ ద్వారా కేసుల సంఖ్య పెరుగుతోందని, ఆరు కాంటాక్ట్ కేసులు నమోదైన‌ట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు లాక్ డౌన్ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు చేపడుతున్నారు.

corona deaths in world

క‌రోనా కాటుకు 21వేల 200 మంది బ‌లి!

మార్చి 26వ తేదీ గురువారం ఉదయం వరకు ప్రపంచ వ్యాప్తంగా 21, 200 మందిని క‌రోనా మహమ్మారి బలి తీసుకుంది. మొత్తం 4 లక్షల 68 వేల 905 మందికి ఈ వైరస్ సోకింది. అందులో 14 వేల 792 మందికి సీరియస్ గా ఉంది. 3 లక్షల 33 వేల 487 మంది ఈ వైరస్ తో పోరాడుతుంటే...లక్షా 14 వేల 218 మంది కోలుకున్నారు. 198 దేశాకు కరోనా వైరస్ విస్తరించింది. ఇటలీ : 7,503. స్పెయిన్ : 3,647. చైనా : 3,287, ఇరాన్ : 2, 077. ఫ్రాన్స్ : 1,331, యూఎస్ఐ : 994. యూకే : 465. నెదర్లాండ్స్ : 356. జర్మనీ : 206, బెల్జియం : 178. స్విట్జర్లాండ్ : 153. సౌత్ కొరియా : 126 మంది చ‌నిపోయారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు నాలుగున్నర లక్షలు దాటేసింది. మన దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. లాక్‌ డౌన్‌ పాటిస్తున్నా.. వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య వృద్ధి చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకూ దేశంలో 649 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 12 మంది చనిపోయారు. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో పాజిటివ్‌ వచ్చిన రోగులు ఎక్కువగా ఉన్నారు. తెలంగాణా రోగుల సంఖ్య 41కి చేరుకుంది. ఏపీలో కొత్తగా రెండు పాజిటివ్‌ కేసులు వెలుగు చూడటంతో వైరస్‌ వచ్చిన వారు పది మంది అయ్యారు. లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేస్తున్నా.. నిన్న హైదరాబాద్‌తోపాటు.. ఏపీ, తెలంగాణ బోర్డర్‌లో భారీగా జనం గుమిగూడటం ఆందోళన కలిగించింది.

Hostels should be kept open for hostellers says Telangana DGP

హాస్టళ్ల నుంచి విద్యార్థులను ఖాళీ చేయించొద్దు!తెలంగాణ డీజీపీ

లాక్‌డౌన్‌ నేపథ్యంలో హాస్టళ్లలో ఉండే విద్యార్థులను ఖాళీ చేయించొద్దని నిర్వాహకులకు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. హాస్టల్‌లో ఉండే విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపొద్దని అధికారులను ఆయన ఆదేశించారు. లాక్‌డౌన్‌ ఉన్నందున ఎవరూ ఇళ్లు విడిచి వెళ్లొద్దని సూచించారు. స్వస్థలాలకు వెళ్లేందుకు ఇప్పటి వరకు పోలీసులు ఇచ్చిన అనుమతి పత్రాలేవీ చెల్లవని డీజీపీ స్పష్టం చేశారు. పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు హాస్టళ్ల నిర్వాహకులతో మాట్లాడాలని మహేందర్‌రెడ్డి ఆదేశించారు. మరోవైపు స్వస్థలాలకు వెళ్లేందుకు ఇప్పటికే వందల సంఖ్యలో అనుమతి పత్రాలను నగర పోలీసులు జారీ చేశారు. వాటితో ఊళ్లకు బయల్దేరిన కొంతమంది హాస్టల్‌ విద్యార్థులు ఏపీ సరిహద్దుల్లో పడిగాపులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న నారా లోకేష్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి ట్వీట్ చేశారు. స్వంత రాష్ట్రాల‌కు వెళ్ల‌వ‌చ్చ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం అనుమ‌తించింది. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసులు అడ్డుకుంటున్నారని ట్వీట్ చేశారు. ఈ విష‌యంపై ఏపీ స‌ర్కార్ స్పందించింది. హైదరాబాద్‌లో హాస్టళ్ల నుంచి విద్యార్థులను ఖాళీ చేయిస్తున్నారని, వారికి రవాణా ఇబ్బందులు తలెత్తుతాయని తెలంగాణా ప్ర‌భుత్వ‌ దృష్టికి ఏపి అధికారులు తీసుకెళ్లారు. కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో ఒకచోట నుంచి మరొక చోటుకి కదలడం శ్రేయస్కరం కాదని ఏపి ప్ర‌భుత్వం అంటోంది. ఇదే అంశాలపై ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని సైతం తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌తో మాట్లాడారు. తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా పోలీసు పాసులు ఇస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఏపీ సీఎస్‌ చెప్పారు. మరోవైపు ఏపీ సీఎంవో అధికారులు కూడా తెలంగాణ సీఎంవో అధికారులతో దీనిపై చర్చించారు. ఈ పరిణామాల నేపథ్యంలో హాస్టళ్ల నుంచి విద్యార్థులను ఖాళీ చేయించొద్దని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించి అధికారుల‌కు ఆదేశాలు జారీచేశారు.

huge vehicles stalled at andhra telangana border

గరికపాడు చెక్ పోస్ట్ తో రాజ‌కీయాలు చేయ‌వ‌ద్దు! క్వారెంటయిన్ వెళ్ళాల్సిందే!

హైదరాబాద్ నుండి విజయవాడ వస్తున్న వాహనాలు గరికపాడు చెక్ పోస్ట్ వద్ద వందలాదిగా నిలిచిపోవ‌డంతో ఆంధ్ర‌-తెలంగాణా స‌రిహ‌ద్దులో యుద్ధ‌వాతావ‌ర‌ణం నెల‌కొంది. తెలంగాణా పోలీసుల నుండి అనుమతి పత్రాలతో వచ్చినా ఆంధ్ర పోలీసులు అంగీకరించలేదు. దీంతో వేలాదిగా వాహనదారులు రోడ్డుపై ఉండ‌డంతో దాదాపు మూడు కి.లోమీట‌ర్ల వ‌ర‌కు ట్రాఫిక్ నిలిచిపోయి ఉద్రిక్తంగా మారింది. చీకటి పడటంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉన్నతాధికారులతో ఆంధ్ర పోలీసులు చర్చించారు. ఆంధ్రాలోకి రావాలంటే నూజివీడు ఐఐఐటీలో 14 రోజులు ఉండాలన్న అధికారుల ఆంక్షలతో కొందరు విద్యార్థులు, ప్రయాణికులు వెనుదిరి వెళ్ళిపోయారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట గరికపాడు చెక్ పోస్టు వద్ద పడిగాపులు కాసిన విద్యార్థులను ప్రయాణికులను ఎట్టకేలకు ఆంధ్రా పోలీసులు వెనక్కు పంపించివేశారు. విజయవాడ సబ్ కలెక్టర్ విద్యార్థులకు నచ్చజెప్ప‌డంతో సుమారు 100మంది విద్యార్థులు ఐఐఐటీ లో ఉండేందుకు అంగీక‌రించారు. కర్ఫ్యూ కారణంగా ఇకపై ఎవ్వరూ హైదరాబాద్ నుండి రావద్దని పోలీసులు ఆదేశించారు. తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు కొందరికి వాహనాలు లేక పోవడంతో చెక్ పోస్టు వద్దే మ‌రికొంత మంది క‌నిపించారు. తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చిన 44 మందిని నూజివీడు క్వారంటీన్ కు బస్సుల్లో తరలించారు. అయితే క్వారెంటయిన్ కేంద్రాలకు వెళ్లేందుకు అంగీకరించని 200 మందిని సురక్షితంగా పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సొంత వాహ‌నాలున్న వారు హైదరాబాద్ కి తిరిగి వెళ్లిపోయారు. ప్ర‌స్తుతం ఏపీ సరిహద్దు ప్రాంతంలోని గరికపాడు చెక్ పోస్ట్ వద్ద సాధారణ పరిస్థితి నెల‌కొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్ లోని కి అనుమతించడం లేదని ఎక్కడి వారు అక్కడే తమ నివాసాలకు పరిమితం కావాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణ వైపు నుండి వచ్చే కార్లను తెలంగాణ చెక్ పోస్టు నుంచే పోలీసులు వెనక్కి పంపుతున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో జాగ్ర‌త‌లు పాటించ‌డంలో భాగంగానే క్వారెంటయిన్ కేంద్రాలకు వెళ్ళాల్సిందేన‌ని ఆంధ్ర‌ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌డంపై మొత్తం రాష్ట్ర ప్ర‌జ‌ల నుంచి పాజిటివ్ స్పంద‌న వ‌స్తోంది. హైద‌రాబాద్‌లో అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం వుంది. విదేశీయులు, విదేశాల నుంచి వ‌చ్చేవారు ఎక్కువ‌గా వ‌స్తువుంటారు కాబ‌ట్టి క్వారెంట‌యిన్ త‌రువాతే ఇళ్ల‌కు వెళ్ల‌మ‌ని చెప్ప‌డంలో త‌ప్పులేదు. అయినా దీనిపై కూడా రాజ‌కీయాలు చేయ‌డం దారుణం. మొత్తం ఆంధ్ర‌ప్ర‌జ‌ల జీవితాల‌తో చెల‌గాటం ఆడ‌డ‌మే. గరికపాడు చెక్ పోస్ట్ వ‌ద్ద క‌ఠ‌నంగా వ్య‌వ‌హ‌రించ‌డాన్ని అర్థం చేసుకోవాలి త‌ప్ప రాజ‌కీయాలు చేయ‌డంపై చ‌ర్చ అన‌వ‌స‌రం అని ప్ర‌జ‌లు చెప్పుకుంటున్నారు.

Take over

ప్రైవేటు ఆస్పత్రులు స్వాధీనం చేసుకోండి! క‌లెక్ట‌ర్ల‌కు ప్ర‌భుత్వ‌ ఆదేశం!

ఐసోలేషన్‌ వార్డుల కోసం అవసరమైతే ప్రైవేటు ఆస్పత్రులను స్వాధీనం చేసుకోవాలని ఏపి ప్రభుత్వం కీల‌క‌ నిర్ణయం తీసుకుంది. అవసరాన్ని బట్టి ప్రైవేటు ఆస్పత్రులను స్వాధీనం చేసుకునే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగించిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తెలిపారు.   ఒక్కో ఆసుప‌త్రిలో 2 వేల బెడ్లు అందుబాటులో ఉండేలా కొత్త‌గా నెల్లూరు, తిరుపతి, విశాఖ, విజయవాడలో ప్రత్యేక కరోనా ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  అంతే కాదు కరోనా పరీక్షల కోసం మరో మూడు ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు జవహర్‌రెడ్డి వెల్లడించారు.  అన్ని జిల్లా కేంద్రాల్లో 200 ఐసోలేషన్‌ బెడ్‌లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించినట్లు వివరించారు. అలాగే ప్రతి నియోజకవర్గంల క్వారంటైన్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.   రాష్ట్రంలో ఇప్పటి వరకు 8 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, బుధవారం ఒక్క కోవిడ్ 19 కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. కరోనా వైరస్ అనుమానిత కేసులను ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. విదేశాల‌నుంచి వ‌చ్చిన 29 వేల మందిపై గ‌ట్టి నిఘా పెట్టాం. ఎప్ప‌ట్టిక‌ప్పుడు వారి ఆరోగ్య ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు.

Coronavirus: Chef Floyd Cardoz

కరోనా తో ప్రపంచ ప్రఖ్యాత చెఫ్ ఫ్లాయిడ్ కార్డోజ్ కన్నుమూత

ఫ్లాయిడ్ కార్డోజ్, చిరునామా అక్కర్లేని పేరున్న  చెఫ్ ఈ రోజు న్యూ యార్క్ లో మరణించారు. ముంబై లో జన్మించిన ఈ 59 ఏళ్ల చెఫ్  కరోనా వైరస్  బారిన పడి న్యూ యార్క్ లోని ఒక ప్రయివేట్ హాస్పిటల్ లో కన్ను మూశారు. మార్చ్ 8  నుంచి తిరిగి వచ్చిన తర్వాత, జ్వరం బారిన పడిన ఫ్లాయిడ్ కార్డోజ్, తనకు తానుగా ఆస్పత్రిలో ఎడ్మిట్ అయినట్టు తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో వెల్లడించారు. ఆయన స్థాపించిన ది హంగర్ ఇన్ కార్పొరేషన్  కంపెనీ, ఆయన ఆస్పత్రిలో ఎడ్మిట్ అయినా విషయాన్న ధృవీకరించింది కూడా. ఆయన 1998 లో యు ఎస్ ఏ లో ఏర్పాటు చేసిన తబలా రెస్టారెంట్ , అది కూడా డ్యానీ మేయర్, యూనియన్ స్క్వేర్ హాస్పిటాలిటీ గ్రూప్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయటం -ఒక చరిత్ర గా నిలిచిపోయింది. 2010 లో ఆ రెస్టారెంట్ మూతబడినప్పటికీ, యు ఎస్ ఏ లోని ఇండియన్ రెస్టారెంట్లలో అత్యంత ప్రతిష్టాత్మక రెస్టారంట్ గా పేరు పొందింది. ఆ తర్వాత ఆయన అటు యు ఎస్ ఏ లోనూ, ఇటు భారత్ లోనూ పలు రెస్టారెంట్స్ ప్రారంభించారు. ఫ్లాయిడ్ కార్డోజ్ - ముంబై లో బాంబే  క్యాంటీన్, ఓ ' పెడ్రో అనే ఒక గోవన్ రెస్టారెంట్ ల నిర్వహణే కాకుండా, న్యూ యార్క్ లోని పావు వల్లా ని బాంబే బ్రెడ్ బార్ గా కళాత్మకం గా మలచటం ద్వారా తన దైన ముద్ర వేసుకున్నారు.  

Poori jagannadha swamy under self quarantine

పూరీ జగన్నాథుని సెల్ఫ్ క్వారంటిన్!

ప్రపంచ ప్రఖ్యాత పూరీ క్షేత్రంలో జగన్నాధస్వామి వారు ఏటా జ్వరం బారిన పడతారు. దీని వ్యాప్తి జరగకుండా స్వామివారు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. జగన్నాధ రధయాత్రలో స్నానం చేసినపుడు స్వామి వారికి వచ్చేది వైరల్ ఫీవరేనని, అది భక్తులకు అంటకుండా స్వామి ఏకాంతంలోకి వెళ్లాడనీ భావించాలి. అది కూడా 14 రోజులే కావటం విశేషం! స్నానపూర్ణిమలో 108 కుండల నీటిలో జలకాలాడిన జగన్నాథునికి జ్వరం వస్తుంది. ఆనాటి నుంచి రెండువారాల పాటు పూరీ ఆలయంలో భక్తులకు మూలవిరాట్టుల దర్శనం ఉండదు. మూలవిరాట్ల స్థానంలో సంప్రదాయక 'పొటొచిత్రో' పద్దతిలో పెద్దవస్త్రంపై చిత్రించిన విగ్రహాల రూపాలనే దర్శించు కోవాల్సి ఉంటుంది. ఈ రెండువారాల కాలంలో జగన్నాథుని మూలవిరాట్టుకు ఛప్పన్న (యాభై ఆరు) భోగాల నైవేద్యం కూడా నిలిచిపోతుంది. జ్వరపీడితుడైన జగన్నాథునికి ఔషధ మూలికలు, ఆకులు, కషాయాలు, కొన్ని పండ్లను మాత్రమే దైతాపతులు సమర్పిస్తారు. జగన్నాథుని తొలుత ఆరాధించిన గిరిజన రాజు విశ్వవసు కూతురు లలిత, బ్రాహ్మణ పూజారి విద్యాపతిల వారసులే దైతాపతులు. జగన్నాథుని ఆరాధనలో వీరికి విశేష అధికారాలు ఉంటాయి. జ్వరపీడితుడైన జగన్నాథునికి పథ్యపానాలు సమర్పించేది ఈ దైతాపతులు మాత్రమే. అంటే వీరు శానిటైజర్లు ఉన్నవారు లేదా ఇమ్యూనిటీ కలవారునేమో? రథయాత్ర వేడుకలు ముగిసేంత వరకు వీరి ఆధ్వర్యంలోనే జగన్నాథుని పూజాదికాలు జరుగుతాయి. జగన్నాథునికి జ్వరం తగ్గేలోగా రథాల తయారీ, వాటి అలంకరణ పూర్తవుతుంది.

One Hour delivery

ఇంటి వద్దకే నిత్యావసరాలు - బుక్ చేసిన గంటలోపే ఇంటి ముందుకు

టోటల్ ఫ్రెష్ యాప్ ఆవిష్కరణ-నామ మాత్రపు ధరలకే అందుబాటులో. కరోనా మహమ్మారిపై మంగళగిరి మున్సిపల్ అధికారులు  సరికొత్త యుద్ధం మొదలు పెట్టారు.వినూత్న ఆలోచన తో టోటల్ ఫ్రెష్ ఆన్ లైన్ యాప్ ద్వారా నిత్యావసర సరుఖుల్ని ప్రజల చెంతకు చేరవేయనున్నారు. కరోనా ప్రబలకుండా చర్యల్లో భాగంగా తద్వారా ప్రజలను ఇళ్లకు పరిమితం చేయడం లక్ష్యం గా పెట్టుకున్నారు.   కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు ఆంక్షలు విధించారు. అయినప్పటికీ ప్రజలు వివిధ అవసరాల పేరిట రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. ప్రజలను కట్టడి చేయడం అధికారులకు తలనొప్పిగా మారింది. దీంతో ప్రజల అవసరాలను తీర్చేందుకు మున్సిపల్ కమీషనర్ హేమమాలిని  నిత్యావసరాలైన పాలు, పండ్లు, కూరగాయలు, మందులు తదితరాలను నేరుగా ప్రజల ఇళ్లకు చేర్చేందుకు టోటల్ ఫ్రెష్ అనే ఆన్ లైన్ యాప్ ద్వారా వసతిని రూపొందింపజేశారు.ఈ యాప్ ను ఆమె బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఆవిష్కరించారు. యాప్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కమీషనర్ నిర్వాహకులకు  సూచించారు ఈ యాప్ ను స్మార్ట్ ఫోన్స్ లోని ప్లే స్టోర్ లలో డౌన్ లోడ్ చేసుకొని నిత్యావసర సరుఖుల, కూరగాయలు,పండ్లు,పాలు,పెరుగు ప్యాకెట్లు ఆర్డర్ చేస్తే గంట వ్యవధిలో డెలివరీ భాయ్ ఆయా సరుఖుల్ని ఇంటికి తీసుకు వస్తాడు.ఆయా సరుఖులు,కూరగాయలు నామ మాత్రపు ధరలకే లభ్యమవుతాయి.సాధారణంగా సరుఖుల ఇంటికి చేర్చినందుకు 30 రూపాయలు డెలివరీ చార్జీల క్రింద వసూలు చేస్తారు.ప్రస్తుతం ప్రజల ఇబ్బందుల దృశ్యా రూ.15 మాత్రమే డెలివరీ చార్జీలు గా నిర్ణయించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.అత్యవసర పరిస్థితుల్లో మెడిసిన్,మాస్కులు,శానిటైజర్లు ఆర్డర్ చేయవచ్చు.ఈ యాప్ ను బన్నీ అండ్ టీమ్  వారం రోజుల్లో తయారు చేశారు.ఇక పై బయటకు వెళ్లి ఆయా దుకాణాల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. ఈ క్రింది లింక్ ద్వారా యాప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు https://play.google.com/store/apps/details?id=com.totalfresh.basket  

hyderabad bachelors hit the road

హైదరాబాద్ బ్యాచిలర్స్ రోడ్డున ప‌డ్డారు!

లాక్‌డౌన్‌తో ప్రైవేట్ హాస్టల్స్‌లో ఉంటున్న బ్యాచిలర్స్ రోడ్డున ప‌డ్డారు. హాస్టల్స్‌లో ఉండే ప‌రిస్థితి లేదు. అలా అని సొంత ఊళ్లకు వెళ్లలేక పోలీస్ స్టేషన్లను ఆశ్రయించి త‌మ గోడు వెళ్ల‌బోసుకుంటూ సోష‌ల్ మీడియాలో ఫొటోలు పెడ్తున్నారు. సాయంత్రం ఏడు గంటల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌రకు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కాబ‌ట్టి త‌మ సంగ‌తేందో తేల్చ‌మ‌ని పోలీసుల‌కు చిరాకుపుట్టిస్తున్నార‌ట‌. నిన్న రాత్రి నుంచి నిబంధ‌న‌ల్ని గ‌ట్టిగా అమ‌లుచేయ‌డంతో తిన‌డానికి ఏమీ దొర‌క‌క పాపం అల్లాడి పోతున్నార‌ట‌. ఏం చేయాలో తోచ‌క పొట్ట‌చేత‌ప‌ట్టుకొని అన్న‌మో రామ‌చంద్ర అంటూ  బ్యాచిలర్స్ రోడెక్కారు.   దాదాపు అన్ని హాస్టల్స్ మూసివేశారు. అయినా ఖాళీ చేయ‌కుండా వున్న వారిని నిర్వాహ‌కులు గ‌ట్టిగానే త‌రిమివేస్తున్నారు. దీంతో  యువతి, యువకులు తీవ్ర అసౌక‌ర్యానికి గురౌతూ ఇబ్బందులు పడుతున్నారు. అటు హాస్టల్స్‌లో ఉండటానికి వీల్లేక.. ఇటు సొంత ఊళ్లకు వెళ్లలేక రోడ్డుపై నిలబడ్డారు. వారంతా సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లకు క్యూ కట్టారు. తాము సొంత ఊర్లకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. ఎస్సార్‌నగర్, అమీర్‌పేట, పంజాగుట్ట, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చబౌలి ప్రాంతాల్లో రోడ్ల మీద ఎవ‌రిని అడిగినా ఇదే చెబుతున్నారు. పోలీసులు కూడా ఈ సమస్యపై గందరగోళంలో ప‌డ్డారు.  వీరిని సొంత ఊర్లకు ఎలా పంపించాలనే అంశంపై ఫోకస్ పెట్టారు.. అధికారులతో చర్చిస్తున్నారు. యువతీ, యువకులకు ఒక్కసారి ప్రయాణం చేసేలా పాస్‌లు ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారు. పాస్ ఇచ్చినా వారు ఊర్లకు ఎలా వెళ్తార‌నేది అర్ధంకాక అయోమయంలో ఉన్నారు.

Corona virus

ఇంట్లో ఉంటే జనాభా లెక్కల లో ఉంటారు, బయట పోతే కరోనా లెక్కలలో పోతారు!

నిర్లక్ష్యం.. ఇవి కేవ‌లం మూడు అక్షరాలైన దానీ అర్ధాన్నీ మాటల్లో వివరించలేము.. ఒకరి నిర్లక్ష్యం వలన ఈ రోజు ఈ ప్రపంచమే అల్లకల్లోలం అవుతుంది..  ఒకరి నిర్లక్ష్యం వలన పేదవాళ్ళు ఆకలి చావులు చస్తున్నారు.. ఒకరి నిర్లక్ష్యం వలన మధ్యతరగతి జీవితాలు సంపాదన లేక దిక్కు తోచని స్థితిలో బ్రతుకుతున్నారు..  ఒకరి నిర్లక్ష్యం వలన రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. ఆ ఒకరి నిర్లక్ష్యం వలన నిండు ప్రాణాలు బలి అవుతున్నాయి..  చైనా నుండి ఇండియా 1800 వంద‌ల‌ మైళ్ల దూరంలో ఉంది..  ఎక్కడో చైనా లో పుట్టిన వైరస్ 1800 వంద‌ల మైళ్ల‌ దూరంలో ఉన్న ఇండియాకి వచ్చి ఇక్కడ ఉన్న జనాలను ఇబ్బంది పెడుతుంది.. మరి చైనా పక్కనే దానీ దేశ సరిహద్దును అనుకోని ఉన్న వియత్నాం 1500 వంద‌ల మైళ్ల  దూరంలో ఉంది.. కానీ అక్కడ కరోన వైరస్ కంట్రోల్ లో ఉంది. అయితే  ఇంత దూరంలో ఉన్న ఇండియాలో మాత్రం చేయి దాటి పోతుంది. ఎందుకంటే దానికి కారణం మన నిర్లక్ష్యమే. చైనా నుండి 4700 వంద‌ల మైళ్ల‌ దూరంలో ఉన్న ఇటలీలో ఆ దేశ ప్రజల నిర్లక్ష్యం వలన ఈ రోజు ఇటలీ పరిస్థితి ఎలా విషమంగా తయారైందో మనంద‌రం చూస్తూనే వున్నాం. అయినా మ‌నకు భ‌యం లేదు.  మన జాగ్రత్తలే మన జీవితాన్ని కాపాడుతాయి.. నీ కోసం కాక పోయిన నిన్ను కన్న తల్లిదండ్రుల కోసం, నువ్వు కన్న నీ పిల్లల కోసం... నీ ఆరోగ్యాన్ని కాపాడుకో... ఇంట్లోనే వుండు. జ‌నాభా లెక్క‌ల్లో వుంటావు.  

Corona virus

నిర్లక్ష్యానికి మన బతుకులు సమాధి కాబోతున్నాయా?

ప్రపంచ అభివృద్ధి సైన్స్ తోనే సాధ్య‌మ‌ని తెలిసి కూడా నూత‌న అధ్య‌య‌నం వైపు ప్రయాణించని మన డొల్ల‌త‌నం ముందు మనకేసి మనమే జాలిగా చూసుకున్నా,  బతకని స్థితిలోకి చేరుకుంటున్నామా?   సైన్స్ ఇచ్చే ప్రయోజనాల్ని జుర్రుకుంటూ అడుగడుగునా సైన్స్ ని అవమానించే వైఖరికి,  పుట్టిన రోగాలకు మన బతుకుల్ని మనం అర్పించుకునే దుస్థితిలోకి వెళ్లిపోతున్నాం. సైన్స్ వెలుగులో వెలిగిన దేవుడి  స్వార్ధ పరత్వం ముందు దేవుడే దీనంగా నిలబడి, ఇన్నాళ్లూ లక్షోప లక్షల రకాల పూజలు, సువార్తా ప్రార్థనలు, ఉపవాస దీక్ష‌లు, న‌మాజ్‌లు అందుకుని విర్రవీగి ఇప్పుడు ఒంటరిగా తన గర్భ కుహరంలో తానే బందీ ఐపోయాడు. మాస్కుల్లేని పూజలు, మాస్కుల్లేని ప్రార్ధనలు ఇప్పుడు నిషిద్ధం.  థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో సైన్స్ ని అత్యంతగా  నిర్లక్ష్యం చేసిన ఉపద్రవాన్ని మనం చవి చూడబోతున్నాం. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని, ప్రజలందరికీ దక్కాల్సిన సమాన హక్కులు, సమాన ఆక్సిజన్, సరిపడిన వైద్యం  దక్కనీయకుండా చేసినందుకు ప్ర‌తిఫ‌లంగా ఒక్కొక్క‌రిపై దాడి చేస్తూ క‌రోనా క‌రాళ‌నృత్యం చేస్తోంది. సైన్స్ రంగాలకు కేటాయింపులు భారీగా తగ్గించడం, శాస్త్ర సాంకేతిక పరిశోధన సంస్థల మూల్గులని పీల్చి, సైన్స్ ఆవిష్కరణలని గేలి చేసిన, దుర్మార్గం ముందు మన పాలిపోయిన ముఖం మీద కరోనా ఊస్తున్నది. ఒక్కోసారి ఒక్కో పాలకుడు రాజ్యాంగంలో పేర్కొన్నట్టు  శాస్త్ర సాంకేతిక రంగాల విస్తృతికి తోడ్పాటు అందించ‌డం లేదు.  తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు  విద్య, వైద్యం, సామాజిక శాస్త్రాల, వైజ్ఞానిక శాస్త్రాలు, శాస్త్ర సాంకేతిక శాస్త్రాలని సమాజంలోని అనేక వర్గాలకు దూరం చేసిన వెధవాయిత్వాన్నికరోనా బట్టలిప్పేసి బజారులో నిలబెడుతున్నది.  ఇప్పుడు సత్వర చావు లేమి వారసత్వం గాళ్ళది.  క్రిటికల్ కేర్ లో చావు వైభోగం సంపన్నులది. ఏమైతేనేం, కరోనా ఇప్పుడు సమాన న్యాయం గెలిచేసిన పాలకుల లత్కోరు స్వభావాన్ని నిరసిస్తూ వెనకా ముందూ  అందరికీ సమాన చావు ప్రసాదించడానికి సంసిద్ధంగా వుంది. గొప్ప ఆయుర్వేద విజ్ఞానం ఇక్కడ వుంది. దానికి దైవత్వం అప్పాదించి విష పూరితం చేశారు.  గొప్ప సంఖ్యా శాస్త్రం, గొప్ప ఖగోళ శాస్త్రం, ప్రపంచానికి మార్గదర్శనం చేయగల గొప్ప విజ్ఞానం వుంది. దానికి హేతువుని దూరం చేసి దాని శాస్త్రీయ దృక్పథం ప్రాణ తీగెని తెంచి నామం బెట్టి, విభూది పూసి దాని స్వభావం నాశనం చేసి వంచించారు. ఈ శతాబ్దాల వెక్కిరింతని కరోనా మరింతగా బట్టబయలు చేస్తున్నది. ఇప్పుడు ఏది చేసినా ఉపశమనమే. ఇప్పుడు ఏమి చేసినా  మరణాన్ని వాయిదా వేయడమే. ఇప్పుడు వ్యాధి నిరోధాన్ని వ్యాప్తి చేయడమే. ఇప్పుడు ఏమి చేసినా  వ్యాధి విస్తృతిని అడ్డుకోవడమే. సైన్స్ విస్తృతిని విస్తృతంగా అడ్డుకున్న దుష్పరిణామాల శిథిలత్వం కింద ఇక పేర్లు లేని సమాధుల్లో చిరునామా వెతుక్కోవడమే.

సింగరేణి భూమిని ఎవరు అమ్ముకున్నారు?

మందమర్రిలో శ్రీకృష్ణ థియేటర్ ముందు ఉన్న సింగరేణి భూమి (గ్రౌండ్)ని ఎవరు అమ్ముకున్నారు? మందమర్రిలోని శ్రీకృష్ణ థియేటర్ ముందు సింగరేణికి సంబంధించిన గ్రౌండ్ ఉన్న మాట మందమర్రి ప్ర‌జ‌లంద‌రికీ తెలుసు. అయితే ఆ గ్రౌండ్ క్రమంగా కనుమరుగైపోతున్నా ఎవరూ నిల‌దీసే ద‌మ్ము ఎవ‌రికీ లేదు. ఎందుకు? దీని వెన‌కాల ఎవ‌రున్నారు? గ్రౌండ్ భూమిని కబ్జా చేసి క్రమంగా తెగ‌న‌మ్ముతున్నారు. అంతే కాదు ఇప్పుడు వారి కన్ను ఆ గ్రౌండ్ ముందు గుడెసెలేసుకొని జీవిస్తున్న పేద కుటుంబాల‌పై ప‌డింది. అదే గత నలభై సంవత్సరాలుగా జీవిస్తున్న సీస కమ్మరి కుటుంబాలపైన పడింది. మేక తలకాయలను కమిరిచ్చి పొట్టపోసుకునే ఈ సీస కమ్మరి కుటుంబాలను ఎందుకు వెళ్ళాగొట్టాలి అనుకుంటున్నారు, వారి గుడిసెలను అక్రమంగా తొలగించిందెవరు? వాళ్ళను ఏ నీడ లేకుండా బిక్కుబిక్కుమంటూ భయపడుతూ బ్రతికేలా చేస్తుందెవరో ఎవరికి తెలియడం లేదు. ఎవ‌రో డ‌బుల్ గేమ్ ఆడుతున్నారని స్థానికులు అనుకుంటున్నార‌ట‌. సీస కమ్మరి కుటుంబాల వాళ్ళను హెల్త్ సెంటర్ సాకుతో గతంలో వెళ్ళాగొట్టాలనుకున్న‌ప్ప‌డు, సాక్షాత్తు ఎమ్మెల్యే బాల్క సుమన్ వెళ్ళవలసిన అవసరం లేదని అభయమిచ్చారట‌. అయినా ఇప్పుడు ఈ నిరుపేద‌ల‌ను భయపెట్టే వాళ్ళకు తెలియదా లేక మర్చిపోయారా? సింగ‌రేణి గ్రౌండ్ భూమికి, వాళ్ళ గుడిసెలకు సంబంధం లేకున్నా వాళ్ళను వెళ్ళగొట్టి ఆ భూమిని ఏం చేద్దామనుకుంటున్నారు. పురపాలక అధికారులు ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని పౌర‌హ‌క్కుల ప్ర‌జాసంఘం నేత ఎం.వి. గుణ ఆరోపిస్తున్నారు.

టిఆర్ఎస్ నేత‌ దౌర్జన్యం, సింగరేణి క్వార్టర్స్ కబ్జా...

ప్రాణహిత కాలనీ (షిర్కే) క్వార్టర్స్ లో ఉన్న అసలైన లబ్దిదారులు ఎంతమంది? అధికారపార్టీ అండతో ఉంటున్నవాళ్ళు ఎంతమంది? 3వ జోన్ లో క్వార్టర్స్,ప్రభుత్వ భూమిని వదలని నేరచరిత్ర కల్గిన అధికారపార్టీ నాయకుని అరాచ‌కాల‌పై స్పందించాల‌ని పౌర‌హ‌క్కుల సంఘం డిమాండ్ చేస్తోంది. సింగరేణిలో ఎంతో ఘన చరిత్ర కల్గిన మందమర్రిలో అధికారపార్టీ నాయకుల దౌర్జన్యాలకు హద్దు, అదుపు లేకుండా పోతుంద‌ని పౌరహక్కుల ప్రజా సంఘం నేత ఎం.వి.గుణ ఆరోపించారు. మందమర్రిలో ఒకప్పుడు 14 వేల మంది సింగరేణి కార్మికులు ఉండేవారు. 1964 తర్వాత క్రమంగా సింగరేణి ఉద్యోగుల కోసం 4 వేలకు పైగా క్వార్టర్స్ కట్టించడం జరిగింది. అయితే ఇప్పుడు మందమర్రిలోని సింగరేణి ఉద్యోగుల సంఖ్య దాదాపు 5 వేల మంది మాత్రమే. ఒకప్పుడు సింగరేణి ఉద్యోగుల కుటుంబాలతో కలకలలాడిన క్వార్టర్స్ ఇప్పుడు అధికారపార్టీ నాయకుల కుటుంబాలతో దోపిడీకి గురైనట్లు స్పష్టంగా తెలుస్తుంది. యువ సింగరేణి ఉద్యోగులు క్వార్టర్ కి ఆప్లై చేసినా సింగరేణి యాజమాన్యం స్పందించట్లేదు కాని అధికారపార్టీకి చెందిన ప్రముఖ కార్మిక సంఘం నాయకుని అండదండలతో అధికారపార్టీకి చెందిన గల్లీ లీడర్ కూడా కాని వాళ్ళు 'కింగ్' లా ఫీలవుతూ క్వార్టర్లలో అక్రమంగా ఉంటున్నారు. గతంలో నేరచరిత్ర కల్గిన ఒక నాయకుడైతే పాలచెట్టు ఏరియాలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కొత్తగా షటర్లుగా మార్చడం జరిగింది. ఇదే వ్యక్తి అధికారపార్టీ కార్మిక సంఘం ప్రముఖ నాయకుని అండదండలతో 3వ జోన్ లో ఒక క్వార్టర్ ని కబ్జా చేసి ఉండటమే కాక మరొక క్వార్టర్ ని దగ్గరి బంధువుకి ఇప్పించాడని మందమర్రి కోడై కూస్తుంది. ఇదే వ్యక్తి గతంలో ఒకసారి జైలుకు వెళ్ళి రావడమే కాక ఇంకా కొన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అంటే ఇదంతా చూస్తుంటే మద్దతు ఇస్తే చాలు ఎంత నేరచరిత్ర ఉన్నా మాకు అనవసరం అనేలా అధికారపార్టీ వ్యవహరించడం దుర్మార్గం. అలాగే షిర్కేలో ఉండే అధికారపార్టీకి చెందిన నాయకులు ఇంకా పటేల్ పట్వారి వ్యవస్థ, దొరల పెత్తనం అనుకొని ఎంతమంది ఇల్లీగల్ గా ఉంటున్నారో అందరికీ తెలిసిందే. ఈ మధ్య కబ్జాదారులను వదిలేసి నలభై ఏళ్ళుగా ఉంటున్న సీసకమ్మరి కుటుంబాల గుడిసెలను ఆక్రమణ పేరుతో కూల్చేశారు. అధికారపార్టీ అయితే ఒక న్యాయం, పేదవాళ్ళయితే ఒక న్యాయమా?. ఇప్పటికైనా అధికారపార్టీ నాయకులు ప్రభుత్వ భూమి కబ్జాలు ఆపాలని, అక్రమంగా ఉంటున్న క్వార్టర్స్ నుండి ఖాళీ చేయాలని పౌరహక్కుల ప్రజా సంఘం నేత ఎం.వి.గుణ డిమాండ్ చేస్తున్నారు.

కార్పోరేట్‌ల‌పై ఉన్న ప్రేమ జ‌నంపై లేదా?

దేశాజనాభా 130 కోట్లు. 15 వేల కోట్ల కంటితుడుపు సాయం. అంటే తలకు 115 రూపాయలు మాత్రమే. ఇదేనా క‌రోనా మహమ్మారిపై యుద్దానికి ప్ర‌ధాని చేసిన సాయం? అంటూ ఐఎఫ్‌టీయూ ప్రసాద్ (పిపి) ఘాటుగా స్పందించారు. కేరళ జనాభా ఎంత? కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.20,000 కోట్ల సాయం ప్రకటించింది. 130 కోట్ల జనాభాకి అంతకంటే కూడా తక్కువ సాయం! మహమ్మారి వ్యాధి నివారణ, నియంత్రణలకు కాకుండా మరింక దేనికి ఖర్చు చేస్తుంది? దేశ ప్రజలపై శ్రద్ధ ఇదేనా? ఒక్క కలం పోటుతో RBI నిల్వల నుండి రూ.1,76,000 కోట్లు స్వాహా! బడా కార్పోరేట్ సంస్థలకు టాక్స్ మినహాయింపు ఖరీదు రూ.1,45,000, కోట్లు! గత ఆరేళ్ళ పాలనలో నిరర్ధక ఆస్తుల పేరిట 28 కార్పోరేట్ సంస్థలకు మాఫీ చేసిన బ్యాంకుల సొమ్ము మొత్తం రూ.10,00,000 కోట్లు. ఇంకెన్నో ఇలాంటి మాఫీలూ, రాయుతీలూ, మినహాయింపులూ, మూల్యాలూ! ఓ వందమంది కూడా లేని బడా కార్పోరేట్ కంపెనీలకు ఇంతటి సాయాలూ, ఉద్దీపనలూ! కానీ 130 కోట్ల మంది జనాభాకు మాత్రం తలకు 115 రూపాయలు మాత్రమే! క‌నీసం యెస్ బాంక్ ఎగవేతల సొమ్ము ని కూడా కేటాయించలేదు మ‌న ప్ర‌ధాన మంత్రి. కార్పొరేట్ల పై ప్రదర్శించే శ్రద్దాసక్తులలో ఇది ఎన్నో వంతు? మోడీ షా సర్కార్‌ ఒక సారి ఆలోచించుకోవాలి? క‌రోనా నియంత్రణ కోసం బడ్జెట్ లో ఎన్ని నిధుల్ని కేటాయించారనేది ముఖ్యమైనది. దేశం యావత్తు ఒకే త్రాటిపై నిలబడి మహమ్మారి పై యుద్ధం చేయాల్సిన కీలక పరీక్షా సమయం లో మంగ‌ళ‌వారం రాత్రి ప్ర‌ధాని ప్ర‌సంగంలో 15 వేల కోట్ల కంటితుడుపు ప్ర‌క‌ట‌న‌ను ఎలా అర్థం చేసుకోవాలి?

విదేశాల నుంచి వచ్చిన‌ మనోళ్లే శాడిస్టుల్లా!

మ‌రీ దారుణం. ఇంత దరిద్రంగా.. హీనంగా వ్యవహరిస్తారా? అన్న సందేహంతో పాటు.. వారి వ్య‌వ‌హార‌శైలి క‌రోనా వైర‌స్‌లా వుంది. విదేశాల నుంచి వచ్చినోళ్లు మరీ ఇంత భాద్యత లేకుండా వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్లే క‌రోనా దెబ్బ‌కు దేశంలోని ప్ర‌జ‌లు క‌రోనా బారిన ప‌డుతూ ఒకొక్క‌రూ రాలిపోతున్నారు. విదేశాలకు వెళ్లిన వారిలో అత్యధికులు బాగా చదువుకొని చక్కటి ఉద్యోగం చేసుకుంటూ, సంపద విషయంలోనే కాదు.. అలవాట్లు.. ఆలోచనలు సైతం అంతో ఇంతో బాగుంటాయన్న భావన మొన్నటి వరకూ ఉండేది. కానీ.. ఎప్పుడైతే వ‌చ్చిన వాళ్ళు ఇంటి ప‌ట్టున వుండ‌క తెగింపుతో ప్ర‌జ‌ల‌తో క‌లవాల‌నుకోవ‌డం వీరి పాడు బుద్ధిని బ‌య‌ట‌పెడుతోంది. వీళ్ల లేకీత‌నానికి ఇంకెంత మంది బ‌లికావ‌ల్సి వుందో. ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రానికి 19 వేల 313 మంది అంతర్జాతీయ ప్రయాణీకులు వ‌చ్చారు. వీరిలో చాలామంది స్వీయ నిర్భందనం పాటించ‌డం లేదు. ఎంత అప్రమత్తంగా ఉండాలో అలా వుండ‌టం లేదు. అవగాహన కల్పించేలా ఉండాలే తప్పించి.. బాధ్యత లేకుండా బలాదూర్ తిరుగుతున్న వారి తీరు చూస్తే.. అనవసరంగా విదేశాల నుంచి వారు వ‌చ్చేలా ప్ర‌భుత్వం ఎందుకు స‌హ‌క‌రించింద‌ని పిస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారికి క్వారంటైన్ విధిస్తే.. వాటిని వదిలేసి.. ఎక్కడికి పడితే అక్కడకు తిరుగుతున్నారు. పార్టీలు చేసుకుంటున్నారు. చుట్టాల‌తో క‌లుస్తున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్పిన‌ట్లు ఇలా రోడ్ల‌పై కనిపించిన ఇటీవ‌ల విదేశాల నుంచి వ‌చ్చిన వ్య‌క్తుల పాస్‌పోర్టుల శాశ్వ‌తంగా ర‌ద్దు చేసి ఈ విష‌యాన్ని టీవీలో విస్తృతంగా ప్ర‌చారం చేయ‌గ‌లిగితే అలాంటి మూర్ఖుల్లో కొంతైనా మార్పు రావ‌చ్చు. అనవసరంగా దేశంలోకి రానిచ్చి భారీ మూల్యం చెల్లించుకుంటోంది దేశం ఇప్పుడు. ఇంత కాలం విదేశాల నుంచి వచ్చిన వారి విషయంలో అటు ప్రభుత్వం.. ఇటు ప్రజలు ఓపికతో సహించారు. చుట్టుప‌క్క‌ల వున్న ప్ర‌జ‌ల‌కు ఈ విష‌యం తెలుస్తుంది కాబ‌ట్టి ప్ర‌జ‌లే అప్ర‌మ‌త్తంగా వుండి అలాంటి వారి వివ‌రాలు వెంట‌నే పోలీసుల‌కు అందించాలి. లేక పోతే మీ జీవితాలు ఆరిపోతాయ‌న్న అంశాన్ని గుర్తించుకోవాలి. అలాగే విదేశాల‌నుంచి వ‌చ్చిన వారి బంధుమిత్రులు స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్ళిపోవాలి. వారి స‌మాచారం స్థానిక పోలీసులకు ఇవ్వటం చాలా అవసరం. విదేశాల నుంచి వచ్చినోళ్లు బాధ్యత లేకుండా వ్యవహరించటం కారణంగా.. ఇక్కడి ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశాన్ని ఇవ్వకూడదన్నది మర్చిపోకూడదు. కరోనా మహమ్మారి బారి ప‌డి ఇంత మంది బాధ‌ప‌డుతున్నారంటే దానికి ప్ర‌ధాన‌ కారణం.. విదేశాల నుంచి వచ్చినోళ్ల పుణ్యమేనన్నది మర్చిపోకూడదు. తాము ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాం అన్న విష‌యాన్ని మ‌రిచి నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తూ త‌మ కుటుంబ‌స‌భ్యుల జీవితాల‌తో పాటు చుట్టుప‌క్క‌ల వారి ప్రాణాల‌తో చెల‌గాటమ‌డాడం ఎంత వ‌ర‌కు న్యాయ‌మో ఒక సారి ఆలోచించుకోవాలి. విదేశాల నుంచి వచ్చిన స్వదేశీయులు.. బుద్ధిగా ఎవరిళ్లల్లో వారిని సెల్ఫ్ క్వారంటైన్ చేసుకోకుండా ఆ విషయాన్ని పట్టించుకోకుండా వుండ‌టం నీచాతి నీచమే, వ‌ళ్లు కొవ్వు ఎక్కితే ఇలాగే వుంటుంది. శాడిజ‌మే అంటే ఇదే మ‌రి.