కొత్త రెవెన్యూ చట్టం.. విమర్శలు.. డిమాండ్లు
తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో సెప్టెంబర్ 9 వ తేదీన “తెలంగాణ భూమి హక్కులు, పట్టాదార్ పాస్ పుష్టకాల బిల్లు, 2020”ను ప్రవేశ పెట్టింది. ఇంత ముఖ్యమైన బిల్లును హడావిడిగా ఎటువంటి సంప్రదింపులు లేకుండా రెండు రోజులు అసెంబ్లీ లో చర్చించి ఆమోదించాలన్న ప్రభుత్వం చర్య అత్యంత అప్రజాస్వామికమైనది. ఇది ప్రధానంగా చిన్న, సన్నకారు రైతుల , మహిళా రైతుల, కౌలు రైతుల, ఆదివాసీల హక్కులను పరిగణించకుండా కేవలం రెవిన్యూ శాఖలో ప్రబలి ఉన్న అవినీతిని కొంతవరకు నియంత్రించడానికి మాత్రమే దృష్టిలో పెట్టుకుని తయారుచేయబడినదిగా అగుపిస్తున్నది. అలాగే ప్రభుత్వ వైఖరి రెవిన్యూ శాఖ ఉద్యోగులు కేవలం భూమికి సంబంధించిన లావాదేవీలను మాత్రమే చూస్తారన్న భ్రమలో ఉండటం కూడా హాస్యాస్పదమే. ఈ బిల్లును ప్రజా అసెంబ్లీ సభ్యులు పరిశీలించి స్పందిస్తూ, ముఖ్యమైన ప్రజాస్వామికమైన వ్యాఖలను చేస్తూ కొన్ని ప్రశ్నలను లేవనెత్తారు. ఇటువంటి అప్రజాస్వామిక మైన బిల్లును ప్రవేశపెట్టే ముందు ఈ కింది విమర్శనాత్మక వ్యాఖ్యలను పరిశీలించి ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. . .
రెవిన్యూ బిల్లు పై విశ్లేషణాత్మక విమర్శలు
ఈ కొత్త రెవిన్యూ చట్టం ఉద్దేశం భూమి చుట్టూ జరిగే లావాదేవీలను, వ్యాపారాన్ని సులభతరం చేస్తుంది అని ప్రభుత్వమే ప్రకటించింది.
ఈ కొత్త బిల్లు భూ రికార్డులను నవీకరించటం గానీ లేదా వాటికి ఖచ్చితత్వాన్ని కల్పించటానికి కాక అది ఎన్కుంబరెన్సీలను (లను) తొలగించి మార్కెట్ లో భూమి వ్యాపారానికి మార్గం సుగమంచేయటానికే రూపొందించబడింది. బడా పారిశ్రామికవేత్తల భూసేకరణ కోసం ఈ బిల్లు మార్గాన్ని సుగమం చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం అవినీతి నిరోధం అంటూ ప్రజల శ్రేయస్సును పక్కన పెట్టి పారిశ్రామిక రంగానికి అనువుగా రచించిన బిల్లు ఇది.
ఈ బిల్లు చిన్న సన్నకారు పేద రైతులకు ఏ విధంగానూ సహాయపడదు, ప్రస్తుతం వారు కొత్తగా భూములను కొనుగోలు చేసే పరిస్థితిలో లేరు. వారి ఆన్లైన్ రికార్డులను సరిచూసుకోలేరు కాబట్టి భూ రికార్డుల కంప్యూటరీకరణ విధానంలో వారికి పెద్ద నష్టం ఏర్పడుతుంది. ఎందుకంటే భూ రికార్డులను సరిచూసుకోవటం, నవీకరించటం వంటి అంశాల పని భూ యజమానులపైనే ఉంటుంది. చదువుకొని స్మార్ట్ ఫోన్ లు, కంప్యూటర్ లు, ఇంటర్నెట్ సౌకర్యం ఉండి, వాటి పైన సాంకేతిక నైపుణ్యం కలిగి ఉన్నవారు మాత్రమే వాటిని చేయగలుగుతారు. ధరణి వెబ్ సైట్ నిర్వహణ సామాన్యులకు అందుబాటులో ఉండదు సరికదా అర్థం కూడా కాదు. నిరక్షరాస్యులైన పేద రైతులకు ఈ అవకాశం ఉండదు.
చాలా కాలంగా ఆస్తి, యాజమాన్యం కేంద్రంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో భాగంగానే ఇది ముందుకొచ్చింది, వ్యవసాయ భూ యజమానులను రక్షించటమే దీని లక్ష్యం. నిరక్షరాస్యులైన బడుగు పేద వర్గాలనుద్దేశించి కాదు. ఇది అప్రజాస్వామికం. దీనిలో ప్రకటించని ఉద్దేశం ఏమిటంటే, గతంలో తెచ్చిన సవరణకు అనుగుణంగా సాగుదారులను తొలగించటమే.
అటవీ భూములకు సంబంధించి ఆర్ ఓఎఫ్ ఆర్ రికార్డులను రెవెన్యూ రికార్డులతో అనుసంధానం చేయకపోవటమే పెద్ద సమస్య. అటవీ భూములను సాగు చేస్తున్న వారందరికీ, ఆర్ ఓఎఫ్ ఆర్ పట్టాలు వున్న వారందరికీ కూడా ఈ కొత్త చట్టం ప్రకారం పట్టాదార్ పాస్ పుస్తకాలు టైటిల్ డీడ్ లు ఇవ్వటానికి ఈ విధమైన అనుసంధానం తప్పనిసరిగా చేయాలి. అటవీ భూములను ప్రభుత్వం అభివృద్ధి పేరుతో పరిశ్రమలకు ఇచ్చే ప్రమాదం ఉంది. ఇది అటవీ హక్కుల ఉల్లంఘన. దీనికే ఈ బిల్లు ద్వారా పునాది వేస్తున్నట్టు ఉంది.
గ్రామ రెవెన్యూ అధికారులు (VRO)లు, గ్రామ రెవెన్యూ అసిస్టెంట్లు (VRA)ల వ్యవస్థ తొలగించటం తో MROల చేతిలో భూ రికార్డులు నిర్వహించటం, రిజిస్ట్రేషన్ చేయటం ఈ రెండిటికీ సంబంధించి అధిక అధికారాలు కేంద్రీకరించబడతాయి. ఇది మరింత అవినీతి పెరగటానికి దారి తీస్తుంది.
ఈ కొత్త చట్టం ప్రతిపాదిస్తున్నటువంటి సవరణలు భూవ్యవస్థను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చి జవాబుదారీ తనాన్ని పెంచి అవినీతిని తొలగిస్తుంది అనే దాఖలాలు ఎక్కడా లేవు. చివరగా సాగుదారులు, కౌలుదారులను తొలగించటం ద్వారా భూయజమానులు భూమిని సరుకుగా మార్కెట్ చేయటానికి మార్గం సుగమం చేస్తుంది.
సాదా భైనామా సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదాలు పరిష్కారం కాలేదు. వక్ఫ్, దేవాదాయ, భూదాన్ భూముల వివాదాలు అలాగే ఉన్నాయి. ఆ సమస్యల గురించి ఈ బిల్లులో ప్రస్తావనే లేదు. ఇప్పుడున్న భూవివాదాలను పరిష్కరించడానికి తాత్కాలికంగా జిల్లా స్థాయి ట్రిబ్యునల్స్ ఏర్పరిచినా, అవి పరిష్కారం అయ్యాక భూ వివాదాలు పరిష్కారానికి సివిల్ కోర్టులకు వెళ్లాల్సి ఉంటుంది. అది సన్న, చిన్న కారు రైతులకు మరింత కష్టం.
ఈ చట్టాన్ని కింది స్థాయి ఉద్యోగులను అవినీతి ఆరోపణల నెపంతో తొలగించడానికి చేసినట్టు ఉంది. VRO లకు ఇతర డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు ఎప్పటికి ఇస్తారన్నది స్పష్టంగా లేదు. వీరి ఇతర విధుల నిర్వహణ ఎవరు చేస్తారనేది కూడా స్పష్టంగా లేదు. గ్రామ స్థాయి రెవెన్యూ అధికారులు కేవలం భూమికి సంబంధించిన లావాదేవీలతో పాటు అనేక సంక్షేమ పధకాల అమలు లో కూడా కీలకమైన పాత్రవహిస్తారన్న విషయం మరచినట్టు ఉన్నది ప్రభుత్వ వైఖరి.
ఈ బిల్లులో మూడు స్థాయిల న్యాయ వ్యవస్థను రద్దు చేశారు. తక్షణ ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిష్కరించుకునే సమస్యలను ఇప్పుడు జిల్లా స్థాయికి తీసికుని వెళ్ళవలసిన అగత్యం ఎదురవుతుంది.
రెవెన్యూ అధికారుల న్యాయ అధికారాలు తొలగించిన తరువాత, పోలీసుల ప్రమేయం ఆజమాయిషీ పెరిగే ప్రమాదం ఉంది. సంరక్షించే బదులు నియంత్రించే పరిస్థితి చోటుచేసుకోవచ్చు.
గ్రామ స్థాయిలో కనీస వేతనం, భూఆక్రమణ, ప్రకృతి వైపరీత్యాలు, data collection వంటి బాధ్యతలు VRO లేకుండా జరగవు. దాదాపు 5400 మంది VROలు ఇప్పుడు అయోమయ పరిస్థితిలో ఉన్నారు.
బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు రెవెన్యూ అధికారుల జోక్యం చాలా అవసరం.. ఇప్పుడు ఆ యంత్రాంగం నిర్వీర్యం అయితే పిల్లల భవిష్యత్తు అధోగతి పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం ప్రకారం Release Certificate పొందిన కార్మికులకు భూమి పంపిణీ కలెక్టర్ ఆదేశానుసారంగా, MRO చేస్తారు. ఇప్పుడు అలాంటి సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారో తెలియదు.
సాగుదారులను గుర్తించటం అనేది పూర్తిగా తొలగించాక, భూమి హక్కులు లేకుండా వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులు, మహిళా రైతులు తీవ్రంగా నష్టపోతారు. వాస్తవ సాగు దారుల, భూమిలేని పేదల జీవనోపాధికి ఉపయోగ పడాల్సిన భూమి, డబ్బున్న వాళ్లకు మార్కెట్ సరుకుగా అందుబాటులోకి తేవడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశ్యం. భూమి యాజమాన్యం కలిగి వున్నవారే రైతులుగా గుర్తించబడుతున్న దుర్మార్గపు వ్యవస్థ మరింత గట్టిపడుతుంది. ప్రస్తుతమున్న రైతుబంధు కూడా ఇటువంటి పరిస్థితుల్లో అమలుచేస్తున్నారు.
ధరణి వెబ్ సైట్ లో అవకతవకలను సరిచేయకుండా రెవిన్యూ డిపార్ట్మెంట్ ను నిర్వీర్యం చేయడం సమంజసం కాదు. ఇప్పుడు దరణిలో ఉన్న తప్పుడు తడకల సమాచారాన్ని బాగుచేయకుండా దాని ఆధారంగా రెవెన్యూ రికార్డులకు శాశ్వతత్వం కల్పిస్తామని చెప్పడం మరిన్ని వివాదాలు పెరగడానికి కారణ మవుతుంది.
అసైన్డు భూములను సాగు చేస్తున్నవారిలో చాలా తక్కువ శాతం మందికి మాత్రమే 1971 చట్టం ప్రకారం కొత్త పాస్ పుస్తకాలు అందాయి. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే వారు కొత్త పాస్ పుస్తకాలు టైటిల్ డీడ్స్ అందుకోవటానికి ఈ కొత్త చట్టంలో ఎటువంటి ప్రస్తావనా లేదు.
క్రింది స్థాయిలో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఒక పారదర్శక యంత్రాంగం లేకపోతే పేద రైతులకు చాలా ఇబ్బంది.అవినీతి పేరుతో వీళ్ళను రద్దు చేసినంత మాత్రాన, అన్ని చోట్లా ఉండే అవినీతి తగ్గిపోతుందని భావించడం తప్పు. పైగా డబ్బున్నవాళ్ళ పక్షాన మరింత పెరిగే ప్రమాదం వుంది. అవినీతితో జరిగే పనులలో పై వారికి ఇక అడ్డుండదు. అన్నింటినీ మించి కొద్ది భూమి గల పేద రైతులు కూలీలు గా పనులు వెతుక్కుంటూ పోవలసి వస్తుంది. భూమి స్వీయ గౌరవ సాధనం కదా పేద తెలంగాణ గౌరవం సమస్య అవుతుంది. ఈ చట్టం అనేక విపరినామాలకు దారి సుగమం చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే గత చట్టంతో ఏమెరకునా జరిగిన భూ వికేంద్రీకరణ ఇక కేంద్రీకరణ వైపు అడుగులు వేస్తుంది. కలవారికి ఇది ఉపయోగం
ఈ బిల్లు కౌలు రైతులకు ఎలా ఉపయోగపడుతుందో వివరించలేదు. అసలే గుర్తింపు లేని కౌలు రైతుల సమస్యలు ఇంకా క్లిష్టరమయ్యే ప్రమాదం ఉంది.
నోటీసుల విధానం అనేది తప్పులు జరగకుండా అడ్డుకోవటానికి. రెవెన్యూ యంత్రంగం తప్పులు చేస్తే అప్పీల్ చేసుకునే అవకాశం ప్రజలకు ఉండాలి. చట్టాల్లో అప్పీల్ వ్యవస్థ లేకపోవటం ప్రాధమిక హక్కులను హరించినట్లే అవుతుంది.
డిమాండ్లు :
అత్యంత ముఖ్యమైన, విస్తృతమైన ప్రభావాన్ని కలిగించే ఈ కొత్త రెవెన్యూ చట్టం పై చర్చలు జరపకుండా అసెంబ్లీ లో ప్రవేశపెట్టి రెండు మూడు రోజులలో ఆమోదించటం అప్రజాస్వామిక చర్య.. ఈ బిల్లు ఆమోదాన్ని వాయిదా వేసి ప్రజలలోకి తీసుకెళ్లి అన్ని సెక్షన్ల రైతులు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపి వాటినుండి వచ్చిన అభిప్రాయాలను పరిగణన లోకి తీసుకోవాలి.
ఈ బిల్లును రెవెన్యూ మరియు న్యాయ నిపుణులతో కూడిన ఒక నిపుణల కమిటీకి పంపాలి, దీనిపై ప్రజా సంప్రదింపుల ప్రక్రియ చేపట్టాలి.
సమగ్ర భూ సర్వే జరిపి మాగాణి,మెట్ట భూముల విస్తీర్ణాన్ని తేల్చాలి. దాని ఆధారంగా మిగులు భూములను తేల్చాలి.అసలైన భూ యజమానులు గుర్తించి రికార్డు చేయాలి. ఈ సర్వే ద్వారా వెలువడే గణాంకాల ప్రకారం భూ గరిష్ట పరిమితి కంటే అదనంగా వున్న భూమిని 1973 భూ సంస్కరణల చట్టం ప్రకారం భూమి లేనివారికి పంపిణీ చేయాలి.
ఆర్ ఓఎఫ్ ఆర్ రికార్డులను రెవెన్యూ రికార్డులతో అనుసంధానం చేసి అటవీ భూములకు హక్కు పత్రాలు వున్న వారందరికీ కొత్త పట్టాదారు పాసు పుస్తాకాలు ఇవ్వాలి, వారందరికీ ప్రభుత్వ వ్యవసాయ పధకాలను అందుబాటులోకి తేవాలి.
తెలంగాణ రాష్ట్రంలో వాస్తవ సాగుదారులను గుర్తించాలి - కౌలు రైతులు, మహిళా రైతులు, పోడు వ్యవసాయం చేసే రైతులను గ్రామ స్థాయిలో రిజిస్టర్ చేసి భూ యాజమాన్యంతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు ఇవ్వాలి.
ధరణి వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్, ఆ వెంటనే మ్యుటేషన్ జరగటం వివాదాల్లేని రైతులకు మేలు చేయవచ్చు కానీ పేద రైతులు, భూ వివాదాలతో ఇబ్బందులు పడుతున్న రైతులను మరింత ఇబ్బంది పెట్టినట్లే అవుతుంది. భూ వివాదాల పరిష్కారానికి శాశ్వత ట్రిబ్యునల్ ను గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఏర్పాటు చెయ్యాలి
భూ సమస్యల విషయంలో అప్పీలు వ్యవస్థను రద్దు చేయటం సరైనదికాదు. ఉన్న రెవెన్యూ అధికారుల జవాబుదారీతనం పెంచి పారదర్శకంగా తయారు చేయా