చంద్రబాబు, లోకేష్ ను టార్గెట్ చేస్తూ సీబీఐ విచారణ కోరుతున్న వైసీపీ 

ఢిల్లీలో నిన్ననే పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఒకపక్క కరోనాతో దేశ ప్రజలు అల్లాడుతుండగా మరో పక్క రాష్ట్రాలకు చెందిన వివిధ సమస్యలు ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఏపీకి సంబంధించి రాజధాని అంశంలో ఇటు అమరావతి రైతులు తమ ఆందోళన ఉధృతం చేస్తున్నారు. మరో పక్క సీఎం జగన్ మాత్రం మూడు రాజధానుల ఏర్పాటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలు మూడు రాజధానులను అడ్డుకునేందుకు లోక్ సభలో పోరాటానికి సిద్దమయ్యారు. ఇప్పటికే దీని గురించి టీడీపీ ఎంపీలు నిన్న కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా ను కలిసి ఏపీ హైకోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ల పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అక్కడ నెలకొన్న వాస్తవ పరిస్థితుల పై వివరించారు. ఆ అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలను సరిచేయాల్సిన బాధ్యత ప్రస్తుతం కేంద్రంపై ఉందని ఈ సందర్భంగా ఎంపీలు అధికారులకు గుర్తు చేసారు. దీంతో న్యాయశాఖ అభిప్రాయాలను తీసుకుని అవసరమైతే అఫిడవిట్‌లు సరిచేసుకునే విషయాన్ని పరిశీలిస్తామని అజయ్‌భల్లా వారికి హామీ ఇచ్చినట్లుగా కూడా టీడీపీ ఎంపీలు తెలిపారు. దీంతో పాటు ఈ అంశాన్ని లోక్ సభ ప్రస్తుత సమావేశాల్లో లేవనెత్తి అమరావతికి న్యాయం జరిగే దిశగా పోరాటం చేయాలనీ నిర్ణయయించారు.   అయితే టీడీపీ ఎంపీల ఈ ప్రయత్నాన్ని తిప్పి కొడుతూ ఒక పక్క మూడు రాజధానులకు మార్గం సుగమం చేస్తూ.. మరో పక్క ప్రతిపక్ష నేత చంద్రబాబు, అయన కుమారుడు లోకేష్ ను టార్గెట్ చేస్తూ వైసిపి పావులు కదుపుతోంది. దీని కోసం ఇప్పటికే ఏపీ రాజధాని అమరావతిలో చోటుచేసుకున్న అక్రమాలు, ఫైబర్ నెట్ కాంట్రాక్టుల్లో అవినీతిపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని జగన్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. అయితే దీని పై ఇంకా కేంద్రం స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఈ రెండు అంశాల పై సీబీఐ దర్యాప్తు డిమాండ్ చేస్తూ లోక్ సభలో ఈ అంశం లేవనెత్తబోతున్నారు. దీంతో అటు అమరావతి నుండి రాజధానిని మార్చడంతో పాటు ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ లను టార్గెట్ చేసి ప్రతిపక్షాన్ని కోలుకోలేని దెబ్బకొట్టే ఆలోచనలో వైసిపి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ పార్లమెంటు సమావేశాల్లో ఏమైనా సరే రాజధాని, ఫైబర్ నెట్ అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేయాలని వైసీపీపీ కేంద్రాన్ని పట్టుబట్టే అవకాశం కూడా ఉంది. టీడీపీ అధినేత తో పాటు పలువురు టీడీపీ ముఖ్య నేతలకు కూడా ఈ స్కామ్ లో భాగస్వామ్యం ఉందని వైసిపి ఎప్పటి నుండో ఆరోపణలు చేస్తున్ననేపథ్యంలో సిబిఐ విచారణ కు కేంద్రం ఒప్పుకుంటే ఇక టీడీపీ గట్టి దెబ్బ అనే ఆలోచనలో వైసిపి అగ్రనాయకత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నటుగా ఇటు రాజధాని మార్పుతో పాటు అటు రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయవచ్చనేది వైసిపి మంత్రాంగం గా కనిపిస్తోంది. అయితే ఈ ప్రయత్నంలో వైసిపి ఎంతవరకు విజయవంతమౌతుందో వేచి చూడాలి.

హిందూ ఆలయాల నిర్మాణానికి సాయం.. ముస్లిం కుటుంబం ఆదర్శం

కులాలు, మతాల పేరుతో మనుషులకి మనుషులకి మధ్య దూరం పెరిగిపోతున్న ఈ రోజుల్లో.. మా దృష్టిలో మనుషులంతా సమానం, అన్ని మతాలను గౌరవిస్తాం అంటూ ఓ ముస్లిం జంట ఆదర్శంగా నిలుస్తోంది. అసోంలోని జోర్‌హాట్ జిల్లాకు చెందిన 39 ఏళ్ల హామిదుర్ రహమాన్, ఆయన భార్య పార్సియా సుల్తానాలు.. మసీదులతో పాటు కొన్ని హిందూ ఆలయాల నిర్మాణాలు, మరమ్మతులు చేయించారు. అంతేకాదు, వారికి సమీపంలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కూడా వేయించారు.   హామిదుర్ తండ్రి టీ తోటలో పనిచేసేవారు. అక్కడ వారి కుటుంబం తప్ప, అందరూ హిందువులే ఉండేవారు. టీ తోటలో ఉన్న హరి మందిరంలో పౌరాణిక నాటకాలు వేసేవారు. హామిదుర్ కూడా తన మిత్రులతో కలిసి వాటిలో పాత్రలు వేసేవారు. ఆ విధంగా ఆయనకు అన్ని మతాలపై గౌరవం ఏర్పడింది.    "మా కాలనీలో ఉండేవాళ్లు, మిత్రులు నన్ను ఎప్పుడూ వేరే మతం వాడిగా చూడలేదు. తాను అన్ని మతాలను గౌరవించడానికి ఇదే కారణం. నా స్తోమత కొద్దీ వీలైన సాయం చేస్తుంటా. నా మనసుకు సంతోషం కలగాలని ఈ పని చేస్తున్నాను తప్ప ప్రచారం కోసం కాదు" అని హామిదుర్ మీడియాతో చెప్పారు.   హామిదుర్ రోజూ నమాజ్ చదువుతారు. హిందూ ఆలయాల్లో జరిగే కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంటారు. వీలైన సాయం చేస్తుంటారు. స్థానికంగా మసీదు నిర్మాణం, సుందరీకరణకు హామిదుర్ దాదాపు రూ.12 లక్షలు దానం చేశారు. ఓ హిందూ మందిరానికి కాళీ మాత విగ్రహాన్ని, త్రిశూలాన్ని, గంటను దానం చేశారు. తితాబర్‌ పట్టణంలో ఓ శివాలయ నిర్మాణానికి కూడా సాయం చేశారు. తితాబర్ హైండిక్ గ్రామంలో ఉన్న మందిరంలో ఒక హాలును, బంగాలీ పట్టీలోని రాధాకృష్ణ మందిర ప్రాంగణంలో టాయిలెట్లను కట్టించారు. రాధాకృష్ణ మందిర సమీపంలో రోడ్డును కూడా వేయించారు. హిందూ దేవాలయాల నిర్మాణానికి హామిదుర్ సాయం చేస్తుండటాన్ని స్థానిక ముస్లింలు కూడా అభినందిస్తున్నారు.   హామిదుర్‌ కు జోర్‌హాట్‌లోని చినామార్‌లో ఉక్కు పరిశ్రమ ఉంది. ఒకప్పుడు ఆయన తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, గత కొన్నేళ్లలో వ్యాపారంలో బాగా ఎదిగారని స్థానికులు చెబుతున్నారు. అప్పటి నుంచి తనకి తోచిన సాయం చేయడం మొదలుపెట్టారు. ఆయనకు కుటుంబం కూడా మద్దతిస్తోంది. "సాయం చేయడం కన్నా మంచి పని ఏముంటుంది. మా మొత్తం కుటుంబం ఆయన వెంట ఉంది. మాకు దేవుడి ఆశీస్సులు ఉన్నాయి" అని హామిదుర్ భార్య సుల్తానా అంటున్నారు.   కొందరు స్వార్థ రాజకీయాల కోసం కులాలు, మతాల పేరుతో మనుషుల మధ్య చిచ్చు పెడుతుంటే.. హామిదుర్ మాత్రం 'మనుషులంతా సమానం, అన్ని మతాలను గౌరవిస్తాం' అంటూ ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

ఏపీ మంత్రి అవంతికి కరోనా పాజిటివ్

ఏపీలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ ఇటు సామాన్య ప్రజలనే కాక అటు ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా చుట్టబెడుతున్న సంగతి కూడా తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్ లో మరో మంత్రి వచ్చి చేశారు. తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. అయన తో పాటు ఆయ‌న కుమారుడికి కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. దీంతో ప్రస్తుతం ఇద్ద‌రూ హోంఐసోలేష‌న్‌లోకి వెళ్లారు.    తానూ తన కుమారుడు కరోనాకు చికిత్స తీసుకుంటున్నందువల్ల త‌న‌ను నేరుగా కలవడానికి ఎవరూ ఇంటికి రావొద్ద‌ని అయన కోరారు. అలాగే త‌న ఆరోగ్యంపై ‌ఆందోళన చెందవద్దని మంత్రి తన అనుచరులకు తెలిపారు. ఏవైనా అత్య‌వ‌స‌ర‌మైన ప‌నుల‌కు త‌న కార్యాలయ సిబ్బంది అందుబాటులో ఉంటారని, ఇంకా ఏదైనా స‌మ‌స్య ఉన్నవారు సిబ్బందిని ఫోన్ లో సంప్రదించవచ్చని మంత్రి తెలిపారు.

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ సింగ్ ఎన్నిక

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ గా జేడీయూ నేత, ఎన్డీయే అభ్యర్థి హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ ఎన్నికయ్యారు. హరివంశ్‌ సింగ్‌ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైనట్టు రాజ్యసభ చీఫ్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు.    డిప్యూటీ చైర్మన్ పదవి కోసం హరివంశ్ పేరును బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ జేపీ నడ్డా ప్రతిపాదన చేయగా, కేంద్రమంత్రి తవర్చంద్ గెహ్లాట్ బలపరిచారు. అటు, విపక్ష అభ్యర్థిగా ఆర్జేడీ నేత మనోజ్ కుమార్ ఝా పేరును కాంగ్రెస్ నేత గులాంనబీ అజాద్ ప్రతిపాదించగా, కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ బలపరిచారు. వాయిస్‌ ఓట్‌ ద్వారా రాజ్యసభ ఛైర్మన్‌ ఎన్నిక నిర్వహించగా.. మనోజ్‌ ఝాపై హరివంశ్‌ సింగ్‌ విజయం సాధించారు.   రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. హరివంశ్ తొలిసారిగా 2018 ఆగస్టు 8న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. అయితే రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీకాలం 2020 ఏప్రిల్ తో ముగిసింది. అనంతరం మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. గత రెండేళ్లుగా పెద్దల సభను హరివంశ్‌ నడిపించిన తీరుతో పార్టీలకు అతీతంగా పలువురు సభ్యుల నుంచి ఆయనకు ప్రశంసలు లభించాయి.    ఇక, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్‌ కి వైసీపీ, టీడీపీ, బీజేడీ మద్దతు ఇచ్చాయి. ఈ ఎన్నికకు టీఆర్ఎస్‌ దూరంగా ఉంది.

అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ కేసు.. పోలీసుల అదుపులో పిటిషనర్‌!!

గుంటూరు జిల్లా సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ వైసీపీ కార్యకర్తలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రాజుపాలెం మండలం కోట నెలమపురి, కొండమోడు గ్రామాల్లో అంబటి రాంబాబు, ఆయన అనుచరులు అక్రమ మైనింగ్‌ కి పాల్పడుతున్నారని పిటిషన్‌ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ పై స్పందించిన హైకోర్టు.. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని గనుల శాఖను ఆదేశించింది. అయితే, మంగళవారం హైకోర్టులో అక్రమ మైనింగ్ కేసు విచారణకు రానున్న నేపథ్యంలో.. పిటిషనర్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది.    కోటనెమలిపురి, కుబాద్పురం గ్రామాల పరిధిలో ఉన్న ప్రభుత్వానికి చెందిన భూముల్లో అంబటి రాంబాబు, ఆయన అనుచరులు అక్రమంగా వైట్‌ లైమ్‌స్టోన్‌ తవ్వకాలకు పాల్పడుతున్నారని, దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ వైసీపీ కార్యకర్తలైన కోటనెమలిపురికి చెందిన పప్పుల శ్రీనివాసరెడ్డి, కొండమోడుకు చెందిన నల్లగొర్ల రామయ్య హైకోర్టును ఆశ్రయించారు. వైసీపీ కార్యకర్తల తరఫున హైకోర్టు న్యాయవాది నాగరఘు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ పై గత నెల 26న విచారణ జరపగా.. పూర్తి నివేదిక తమకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.   మంగళవారం హైకోర్టులో ఈ అక్రమ మైనింగ్ కేసు విచారిస్తారు. ఈ నేపథ్యంలో పిటిషనర్ నల్లగొర్ల రామయ్యను పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపుతోంది. రామయ్యను ఎందుకు తీసుకెళ్లారో చెప్పాలని ఆయన కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. సెటిల్‌మెంట్‌ కి రావాలని రెండు రోజులుగా అధికార పార్టీ రామయ్యపై ఒత్తిడి పెంచుతోందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. 

మాట తప్పిన మీరంతా రాజీనామా చేయండి.. వైసీపీకి రఘురామరాజు ఝలక్

వైసిపి పార్టీ అధిష్టానానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు తాజాగా మరో సారి అధిష్టానానికి ఝలక్ ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై సీఎం జగన్ తన పార్టీ ఎంపీలు అందరికీ ఒక సమావేశం ద్వారా మార్గనిర్దేశం చేశారు. అయితే.. రఘురామ రాజుకి మాత్రం ఈ సమావేశానికి పిలవలేదు. వైసిపి ఎంపీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ఉందని ఉదయం 9 గంటలకు ఏపీ భవన్ నుంచి అందరికి ఆహ్వానం అందింది. అయితే అంతలోనే 11:10 గంటలకు రఘురామరాజుకు ఫోన్ చేసి పార్టీకి మీకు ఎటువంటి సంబంధం లేదు.. మీరు సమావేశానికి రావొద్దని చెప్పారు. తాజాగా దీనిపై రఘురామరాజు స్పందిస్తూ.. "నన్ను వైకాపా నుంచి బహిష్కరించారనే భావిస్తున్నాను. అయితే దీనిపై రాతపూర్వక సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత పార్టీపై ఉంది. అయితే నన్ను బహిష్కరించినప్పటికీ నేను పార్టీ జారీ చేసే విప్ ను మాత్రం పాటిస్తాను. ప్రస్తుతం నేను ఏ పార్టీలో ఉన్నానో నాకే అర్థం కావడం లేదు. మీడియాలో కూడా విద్యావంతులు ఉన్నారు కాబట్టి దీనిపై మీరు ఎలా రాసుకుంటారో రాసుకోండి" అని మీడియాకు తన అభిప్రాయాన్ని తెలిపారు.   ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అయన ‘‘ఫలానా ఎక్స్ బొమ్మ పెట్టుకుని గెలిచానన్నారు. అయితే నా ముఖంతోనే నేను గెలిచాను. నా ముఖం చూసే ప్రజలు బటన్ నొక్కారు. అది అటు ప్రజలకు కూడా తెలుసు. అంతేకాకుండా నా రక్తం పీల్చేసిన ఎమ్మెల్యేలకు కూడా తెలుసు. అమరావతే రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా చెప్పి ఇపుడు వెనకడుగు వేసి రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా వెళ్లారు. కాబట్టి మీరంతా మూకుమ్మడిగా రాజీనామా చేయాలి. నా ముఖం మాత్రం అక్కడే ఉంది. మళ్లీ మళ్లీ చెబుతున్నాను.. నేను నెగ్గాను. అమరావతిపై అపుడు ప్రతిపక్షంలో ఉండి ఇపుడు అధికారంలోకి వచ్చి ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోలేదు కాబట్టి.. ఒకవేళ రాజీనామా అంటూ చేయాల్సి వస్తే మీరు, మీ మంత్రివర్గం చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప.. నేను చేయాల్సిన అవసరం లేదు. సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా చెబుతున్నాను. నేను ఎప్పటికి పార్టీకి విధేయుణ్ణి.. పార్టీ ఆనాడు చెప్పిన మాటను నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇచ్చిన మాట తప్పారు కాబట్టి.. మీరు రాజీనామా చేసుకోండి. నేను మాత్రం రాజీనామా చేయను’’ అని రఘురామకృష్ణం రాజు ఖరాఖండిగా తేల్చి చెప్పారు.

షాకింగ్.. 25 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్

పార్లమెంట్‌ వ‌ర్షాకాల సమావేశాల నేపథ్యంలో సభ్యులందరూ కరోనా పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని నిబంధన విధించిన విషయం తెలిసిందే. దీంతో కరోనా పరీక్షలు నిర్వహించగా.. భారీ సంఖ్య‌లో ఎంపీల‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఉభ‌య‌స‌భ‌ల‌కు చెందిన 25 మంది ఎంపీలు ఈ మ‌హ‌మ్మారి బారిన‌ ప‌డిన‌ట్టు తెలిసింది. ఇందులో 17 మంది లోక్‌స‌భ ఎంపీలు కాగా.. మిగిలిన వారు రాజ్య‌స‌భ స‌భ్యులుగా గుర్తించారు.   క‌రోనా బారిన‌ ప‌డిన‌ 17 మంది లోక్‌స‌భ ఎంపీలలో 12 మంది బీజేపీ స‌భ్యులు కాగా.. ఇద్ద‌రు వైసీపీ, శివ‌సేన‌, ఆర్ఎల్‌పీ, డీఎంకేకు చెందిన ఒక్కో ఎంపీ ఉన్నారు. వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీల్లో అరకు ఎంపీ మాధవి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ఉన్న విషయం తెలిసిందే. ఇక, 8 మంది రాజ్య‌స‌భ ఎంపీలలో.. ఇద్ద‌రు బీజేపీ, ఇద్ద‌రు కాంగ్రెస్ కాగా.. అన్నాడీఎంకే, టీఆర్ఎస్, ఆప్, తతృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఒక్కో ఎంపీ ఉన్నారు.    పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ఇవాళ ప్రారంభమైన విష‌యం తెలిసిందే. క‌రోనా వ్యాప్తి దృష్ట్యా లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భల‌ను వేరు వేరు స‌మ‌యాల్లో నిర్వ‌హిస్తున్నారు. లోక్‌స‌భ ఉద‌యం 9 గంట‌ల‌ నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు జ‌రిగింది. రాజ్య‌స‌భ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప్రారంభం కాగా, 7 గంట‌ల వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. కొత్త స‌భ్యులు అజిత్ కుమార్‌, పూలో దేవి నీత‌మ్‌ల చేత చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు ప్ర‌మాణ స్వీకారం చేయించారు.

ఏపీ పోలీస్ వ్యవస్థపై హైకోర్టు సీరియస్.. కంట్రోల్ చేయలేకపోతే డీజీపీ రాజీనామా చేయాలి 

ఏపీ పోలీస్ వ్యవస్థపై హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. ఏపీలో పోలీస్ వ్యవస్ద గాడి తప్పుతుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో 'రూల్ ఆప్ లా' అమలు కావడం లేదని మండిపడింది. గతంలో డీజీపీని పలుసార్లు కోర్టుకు పిలిపించినా మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు, పోలీసు వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతే డీజీపీ రాజీనామా చేయాలని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.   తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం ఇందుపల్లిలో వెంకటరాజు అదృశ్యంపై హైకోర్టులో హెబియస్ కార్పస్ దాఖలైంది. బాధితుడి మేనమామ నారాయణ స్వామి హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా, ఈ కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలియడంతో.. పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో మూడు కేసుల్లో జుడిషియల్ విచారణ చేస్తే పోలీసులదే తప్పని తేలిందని.. ప్రతిసారి ఇలాంటి పరిస్థితే వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ప్రతి కేసులో సీబీఐ విచారణ సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది.   కాగా, ఇప్పటికే పలు సందర్భాల్లో పోలీస్ అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొందరు అధికారులు అధికార పార్టీని సంతృప్తి పరచడానికి పనిచేస్తున్నారని తప్పుబట్టింది. ఇప్పుడు ఏకంగా.. పోలీస్ వ్యవస్థ తమ తీరు మార్చుకోకపోతే.. నైతిక బాధ్యత వహిస్తూ డీజీపీ రాజీనామా చేయాలని హైకోర్టు తెగేసి చెప్పడం.. ఏపీలో పోలీస్ వ్యవస్ద పనితీరుకి అద్దంపడుతోంది.

పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్లు.. ఇకపై లంచం ఇవ్వాల్సిన అవసరం రాదు

తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. కొత్త రెవెన్యూ చట్టంపై శాసనమండలిలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. రాష్ట్రంలో రెవెన్యూ సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, వీఆర్వో వ్యవస్థను రద్దు చేశామని చెప్పారు. పాత రెవెన్యూ చట్టంతో రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు. పాత రెవెన్యూ చట్టంతో చాలా దారుణాలు చూశామని.. వీఆర్వోల విశేషాధికారాలతో చాలా మంది నష్టపోయారని కేసీఆర్ తెలిపారు.   రాష్ట్రం వచ్చాక భూముల రేట్లు అద్భుతంగా పెరిగాయ‌ని, ఎక్కడో రిమోట్ ఏరియాలో తప్ప ఎకరం రూ.10 లక్షలకు కూడా దొరకట్లేదన్నారు. భూముల రేట్లు పెరగడంతో లాండ్ మాఫియా కూడా పెరిగిందన్నారు. రైతుబంధు పథకం భూస్వాముల కోసం కాదని, రాష్ట్రంలో భూస్వాములు లేనేలేరని, రాష్ట్రంలో 98 శాతం మంది పది ఎకరాల లోపు ఉన్న వాళ్లేన‌ని అన్నారు. 25 ఎకరాల పైబడి ఉన్న రైతులు కేవలం 6 వేల మంది ఉన్నారని సీఎం కేసీఆర్ తెలిపారు.   కొత్త రెవెన్యూ చట్టం సామాన్యుల కోసమే. పలు చట్టాల సమాహారంగా ఈ కొత్త రెవెన్యూ చట్టం ఉంటుందని కేసీఆర్ తెలిపారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో అవినీతికి ఆస్కారం ఉండదని, ఇకపై భూముల రిజిస్ట్రేషన్‌కు లంచం ఇవ్వాల్సిన అవసరం రాదని తెలిపారు. వ్యవసాయ భూములకు సంబంధించి ధరణి పోర్టల్‌ పారదర్శకంగా పనిచేస్తుంది అన్నారు. ఎవరైనా, ఎప్పుడైనా ఓపెన్‌ చేసి చూసుకోవచ్చు. తహసీల్దార్లు కూడా ట్యాంపర్‌ చేయలేని విధంగా సాఫ్ట్‌వేర్ రూపొందించాం అని కేసీఆర్ స్పష్టం చేశారు. బ‌యోమెట్రిక్, ఐరిస్, ఆధార్‌, ఫోటోతో రిజిస్ర్టేష‌న్లు చేస్తామ‌ని, ఈ వివ‌రాల‌న్నీ లేకుండా త‌హ‌సీల్దార్ల‌కు పోర్ట‌ల్ తెరుచుకోదన్నారు. రిజిస్ట్రేషన్‌కు మాత్రమే ఎమ్మార్వోకు ధరణి పోర్టల్‌ను ఓపెన్ చేసే అవకాశం ఉందని, సబ్‌ రిజిస్ట్రార్లకు ఎలాంటి విచక్షణాధికారం లేదని తెలిపారు. పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్లు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని, ధరణి పోర్టల్‌లో అప్‌డేట్‌ కాగానే రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్‌, ఆప్‌డేషన్‌ కాపీలు వస్తాయని కేసీఆర్ తెలిపారు.   రెవెన్యూ కోర్టులను రద్దు చేశామని, కావాలని వివాదాలు పెట్టుకునే వారి కోసం ప్రభుత్వం సమయం వృథా చేయదని తేల్చిచెప్పారు. కావాలని గొడవలు పెట్టుకుంటే సివిల్‌ కోర్టులోనే తేల్చుకోవాలి. కొత్త రెవెన్యూ చట్టంతో భూవివాదాలు తగ్గుతాయి అని అన్నారు. కౌలుదారులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైతు తనకు నచ్చిన వ్యక్తికి భూమిని కౌలుకు ఇచ్చుకుంటాడు అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.  

భారత్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న క‌రోనా కేసులు.. డబ్ల్యూహెచ్ఓ ఆందోళన

భారత్ లో క‌రోనా కేసులు, మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 92,071 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. అదే సమయంలో 1,136 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 48,46,428 కు చేరింది. మృతుల సంఖ్య మొత్తం 79,722కు పెరిగింది. ప్రస్తుతం 9,86,598 యాక్టివ్ కేసులున్నాయి.   ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో భారత్‌ రెండోస్థానంలో నిలిచింది. అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఒక్క ఆగస్టు నెలలోనే భారత్‌ లో 20లక్షల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధిక కేసులు నమోదు చేస్తున్న దేశాలలో భారత్‌, అమెరికా, బ్రెజిల్‌ దేశాలు ముందు వరసలో ఉన్నాయి.   కాగా, ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో నమోదవుతున్న కరోనా కేసులుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. గత 24 గంటలలో ప్రపంచవ్యాప్తంగా 307,930 కేసులు నమోదయ్యాయని, ఇది ఒకే రోజు అత్యధిక కేసులలో ఒక రికార్డని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 5,500మంది మరణించారని, దీంతో ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య 917,417 చేరుకున్నట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.   భారత్‌లో కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. అమెరికా, బ్రెజిల్‌ తోపాటు భారత్‌లో రోజువారీ కేసులు అత్యధిక స్థాయిలో నమోదవుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.

స్వర్ణ ప్యాలెస్‌ కేసు విచారణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. కండిషన్స్ అప్లై!!

స్వర్ణ ప్యాలెస్‌ కేసులో డాక్టర్‌ రమేష్‌ బాబును విచారణ చేసేందుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, విచారణ చేసేందుకు అనుమతి ఇస్తూనే షరతులు పెట్టింది. డాక్టర్ రమేష్ బాబును నిర్బంధంలోకి తీసుకోకుండా విచారణ చేయాలని షరతు విధించింది.   గతంలో స్వర్ణ ప్యాలెస్‌ కేసులో హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ పై సోమవారం జస్టిస్‌ నారీమన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రమాద దర్యాప్తును నిలిపివేయడం సరికాదని అభిప్రాయపడిన సుప్రీం కోర్టు.. దర్యాప్తు చేసేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, డాక్టర్ రమేష్‌ ను నిర్బంధించకుండా విచారించుకోవచ్చునని ప్రభుత్వానికి సూచించింది. రమేష్ కూడా దర్యాప్తుకు సహకరించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.    కాగా, విజయవాడలోని స్వర్ణప్యాలస్ ను కోవిడ్ కేంద్రంగా మార్చిన సంగతి తెలిసిందే. ఈ కోవిడ్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరగడంతో 10మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. డాక్టర్‌ రమేష్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ సీతా రామ్మోహన్ రావులపై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్వర్ణ ప్యాలెస్‌ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం సంగతేమిటని ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంలో హైకోర్టు ప్రశ్నించింది. అదే హోటల్‌లో అంతకుముందు ప్రభుత్వం క్వారంటైన్‌ కేంద్రాన్ని నిర్వహించిన నేపథ్యంలో.. స్వర్ణ ప్యాలెస్‌ సురక్షితం కాదని తెలిసినప్పుడు అక్కడ క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటుకు అధికారాలు ఎలా అనుమతిచ్చారు? అని నిలదీసింది. ఈ వ్యవహారానికి సంబంధించి కృష్ణా జిల్లా కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌, డీఎంహెచ్‌వోలను నిందితులుగా ఎందుకు చేర్చలేదని ప్రశ్నించిన హైకోర్టు.. వారిని నిందితులుగా చేర్చేదాకా ఈ కేసులో ముందుకెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేసింది. దీంతో, హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

పార్లమెంట్‌లో కరోనా కలకలం.. వైసీపీ ఎంపీలకు పాజిటివ్

నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. సమావేశాలకు హాజరవుతున్న సభ్యులు, సిబ్బంది అందరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన వారిని మాత్రమే పార్లమెంట్ లోకి అనుమతిస్తున్నారు.    కాగా, పార్లమెంట్ సభ్యులకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు ఎంపీలకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, అరకు ఎంపీ మాధవిలకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఎంపీ రెడ్డప్పకు ఎలాంటి లక్షణాలు లేకుండానే కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. ఇక, గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఎంపీ మాధవి.. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ గా తేలింది. దీంతో రెండు వారాల పాటు ఢిల్లీలోనే చికిత్స తీసుకోనున్నారు.   కాకినాడ ఎంపీ వంగ గీతా సైతం ఇటీవల కరోనా బారినపడిన విషయం తెలిసిందే. గత శనివారం ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ గా తేలింది.    కాగా, ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటి వరకు  24 మంది ఎంపీలకు, 8 మంది కేంద్రమంత్రులకు కరోనా పాజిటివ్‌ గా తేలింది. అయితే సమావేశాల మధ్యలో ఎవరికైనా వైరస్‌ సోకితే మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

చైనా పెద్ద కుట్ర... పీఎం మోడీతో సహా వేల మంది ప్రముఖుల పై గూఢచర్యం

ఇండియా చైనా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొనగా ఒక పక్క చైనా మన భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తోందనే విషయం స్పష్టంగా మనకు కనిపిస్తుండగా మరో పక్క కంటికి కనిపించకుండా డ్రాగన్ దేశం మరో కుట్ర చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ కుట్రలో భాగంగా ప్రధాని మోడీ, రాష్ట్రపతి కోవింద్, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సుప్రీం కోర్టు సిజెఐ బాబ్డే, సహా కేంద్ర మంత్రులపై గూఢ చర్యం చేయడానికి చైనా కుట్ర పన్నింది. దీనికి సంబంధించి కొన్ని కంపెనీలతో చైనా ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లుగా ఒక జాతీయ దినపత్రిక సంచలన విషయాలను వెల్లడించింది.   దీనికి సంబంధించి చైనాకు చెందిన "షెన్‌జేన్" అనే సంస్థతో కలిసి చైనా గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని ఆ పత్రిక తెలిపింది. ఈ షెన్‌జేన్ సంస్థకు చైనా ప్రభుత్వంతో ప్రత్యక్ష సంబంధం ఉందని కూడా ఆ పత్రిక పేర్కొంది. కొద్ది రోజుల క్రితం సరిహద్దులో ఘర్షణల నేపథ్యంలో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చైనా వస్తువులు, యాప్‌లపై నిషేధం విధించిన నేపథ్యంలో చైనా ఈ దుశ్చర్యకు కుట్ర పన్నినట్లుగా తెలుస్తోంది.   ఈ నిఘాలో సాక్షాత్తు రాష్ట్రపతి, ప్రధాని, సీజేఐ మాత్రమే కాకుండా కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ వ్యాపారవేత్తలు.. ఇలా దాదాపు 10,000 మందిపై చైనా గూఢ చర్యానికి పాల్పడుతున్నట్లు సమాచారం. ఆ పది వేల మందిలో ముఖ్యంగా రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, సీజేఐ బాబ్డే, రాజ్‌నాథ్, పీయూశ్ గోయల్, సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్‌తో పాటు సోనియా గాంధీ తోపాటు ఆమె కుటుంబం, మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, నవీన్ పట్నాయక్ ఉన్నారు. అంతేకాకుండా పారిశ్రామిక దిగ్గజాలు రతన్ టాటా, గౌతమ్ అదానీ వంటి ప్రముఖుల పై నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రముఖులే కాక ఇండియాలోని అధికారులు, జడ్జిలు, సైంటిస్టులు, విద్యా వేత్తలు, జర్నలిస్టులు, నటులు, మీడియా ప్రతినిధులు, మత పెద్దలు, ఉద్యమ కారులపైనా నిఘా పెట్టినట్లు తెలిసింది. అంతేకాకుండా ఆర్థిక నేరాలు, అవినీతి, ఉగ్రవాదం, డ్రగ్స్, బంగారం, ఆయుధాల స్మగ్లింగ్‌కి పాల్పడే వారిపైనా నిఘా కొనసాగుతున్నట్లుగా తెల్సుస్తోంది. ఈ సంస్థ చైనా నిఘా వర్గాలు, సైనిక, భద్రతా ఏజెన్సీలతో కలిసి పనిచేస్తోందని తెలిసింది.   ఈ ప్రముఖుల డిజిటల్ లైఫ్ ను చైనా కంపెనీలు ఫాలో అవుతున్నాయని, అలాగే వారి కుటుంబీకులు, మద్దతు దారులు పని తీరుపై కూడా చైనా కంపెనీ నిఘా పెట్టిందని ఆ పత్రిక పేర్కొంది. అంతేకాకుండా ఈ పదివేల మంది ప్రముఖుల "రియల్ టైమ్ డేటా" ను కూడా చైనా కంపెనీలు పూర్తిగా సిద్ధం చేసుకున్నాయి. ఈ గూఢచర్యం కోసం చైనా ప్రభుత్వం, షెన్‌జాన్ సంస్థ, చైనా కమ్యూనిస్ట్ పార్టీ కలిసి "ఇన్ఫర్మేషన్ డాటా" అనే స్థావరాన్ని సృష్టించి, ఈ మిషన్ నడుపుతున్నాయని ఆ జాతీయ పత్రిక తెలిపింది.   గత రెండు నెలలుగా తాము పెద్ద పెద్ద డేటా టూల్స్ వాడి ఈ పరిశోధన చేసినట్లుగా ఆ పత్రిక తెలిపింది. ఈ షెన్‌జేన్ కంపెనీ ఇండియాతోపాటూ... అమెరికా, బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా కెనడా, జర్మనీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ నుంచి కూడా డేటా సేకరిస్తున్నట్లుగా తెలిపింది. అయితే ఈ డేటాను చైనా పాలకులు ఈ కంపెనీ నుండి ఎందుకు కలెక్ట్ చేస్తున్నారనే సంగతి తేలాల్సి ఉంది.

కరోనా వైరస్ పుట్టుక పై సంచలన నిజాలు బయటపెట్టిన చైనా వైరాలజిస్ట్..   

చైనాలోని వూహాన్ లో మొదలైన కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసందే. అయితే ఈ వైరస్ ల్యాబ్ లో పుట్టిందా లేక జంతువుల నుండి మనుషులకు సోకిందా అనే విషయం పై ఇప్పటికి క్లారిటీ రాలేదు. అయితే తాజాగా దీని పై చైనాకు చెందిన వైరాలజిస్ట్ డాక్టర్ లీ మెగ్ యాన్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ ప్రాణాంతక వైరస్ చైనా ప్రభుత్వ ఆధీనంలోని వూహాన్ ల్యాబ్‌లోనే తయారు చేసారని ఆమె పేర్కొన్నారు. హాంకాంగ్‌ లోని స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో పనిచేస్తున్న లీ కరోనా వైరస్‌పై పరిశోధన చేస్తున్నారు. తాను న్యూమోనియాపై పరిశోధనలు చేస్తున్న సమయంలోనే ఈ వైరస్‌ చైనాలోని ఓ ల్యాబ్‌లో తయారైనట్టు గుర్తించినట్టు చెప్పారు. దీనికి సంబంధించి తన దగ్గర సైన్టిఫిక్ ఆధారాలు ఉన్నాయని ఆమె తెలిపారు.   అయితే కరోనా వైరస్‌పై తాను చేసిన హెచ్చరికలను అటు చైనా కానీ, ఇటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) కానీ ఏమాత్రం పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన హెచ్చరికలను నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రపంచానికి ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ విషయం పై తాను బయటపెట్టగానే చైనా అధికారుల నుంచి తనకు బెదిరింపులు వచ్చాయని, అంతేకాకుండా తనపై దుష్ప్రచారం మొదలుపెట్టారని లీ మెగ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తన ప్రాణాలకు ముప్పు ఏర్పడడంతో తాను పారిపోయి అమెరికాకు వచ్చేసినట్టు ఆమె చెప్పారు. ఈ వైరస్ ప్రకృతి సిద్ధంగా వచ్చిన వైరస్ కాదని.. కొన్ని పాత వైరస్ లపై రీసెర్చ్ చేసి నావెల్ కరోనా వైరస్ ను వూహన్ ల్యాబ్ లో డెవలప్ చేసారని ఆమె పేర్కొన్నారు. దీనికి సంబంధించి తాను మరికొద్ది మంది సైంటిస్టుల తో కలిసి జనవరి నుండి చేస్తున్న పరిశోధనల వివరాలు త్వరలో పబ్లిష్ చేస్తానని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఈ వైరస్ పుట్టుక వెనుక దాగి ఉన్న నిజాల్ని ప్రపంచం మొత్తానికి సైన్టిఫిక్ ఆధారాలతో సహా తెలిసేలా చేస్తానని ఆమె ప్రకటించారు.

సూపరింటెండెంట్ వేధింపులతో ఎక్సైజ్ మహిళా ఎస్ఐ ఆత్మహత్యాయత్నం..

గుంటూరు జిల్లా పెదకూరపాడులో ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆత్మహత్య యత్నం చేశారు. దీనికి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ బాలకృష్ణన్ వేదింపులే కారణమని ఆమె ఆరోపించారు. దీంతో ఉన్నతాధికారులు ఎక్సయిజ్ సూపరింటెండెంట్ బాలకృష్ణన్ ను సస్పెండ్ చేశారు. అయితే గత కొంత కాలంగా సూపరిటెండెంట్ బాలకృష్ణన్ పై వేధింపుల ఆరోపణలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో బాలకృష్ణన్ వ్యవహారం పై విచారణ కోసం ఉన్నతాధికారులు ఒక కమిటి ఏర్పాటు చేశారు. ఈ విచారణ కమిటీ ఎదుట హాజరైన బాధితులు గగ్గోలు పెడుతూ తమను ఆయన ఎలా వేధిస్తున్నారో చెప్పి మరీ బోరుమన్నారు. తాజాగా ఆయన వేధింపుల వల్లే మహిళా ఎక్సైజ్ ఎస్‌ఐ గీత ఆత్మహత్యాయత్నం చేశారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం ఎక్సైజ్ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది.   అయితే, ఎస్ఐ గీత ఆరోపణల్లో నిజం లేదని బాలకృష్ణన్ అన్నారు. పని వత్తిడి కారణంగానే తనపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. విచారణ కమిటీ ఎదుట అన్ని స్పష్టంగా చెబుతానని, విచారణలో అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు.

అసెంబ్లీ దగ్గర ఆత్మహత్యాయత్నం చేసిన నాగులు మృతి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎందరో ఆత్మ బలిదానం చేసుకున్నారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి ఆరేళ్ళు దాటాక కూడా బలిదానాలు చేసుకోవడం ఆవేదన కలిగిస్తోంది.   హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ఎదుట నాగులు అనే వ్యక్తి పెట్రోలు పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. గురువారం నాడు అసెంబ్లీ సమీపంలో నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలంగాణ వచ్చిన తరువాత కూడా బతుకుల్లో మార్పు లేదని, తనకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ నాగులు ఆత్మహుతికి పాల్పడ్డాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు అతణ్ని రక్షించే ప్రయత్నం చేశారు. వెంట‌నే ఆటోలో ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. అయితే అత‌ని ప‌రిస్థితి విష‌మించి ఈరోజు మ‌ర‌ణించాడు.   నాగులు మృతిపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. అతని మరణానికి ప్రభుత్వమే కారణమని, ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హ‌త్యేన‌ని అన్నారు. తెలంగాణ వచ్చినా కూడా ప్రజలకు ఏమి లాభం జరగలేదని నాగులు చెప్పాడని అన్నారు. అమరవీరుల ఆత్మత్యాగాలతో వచ్చిన తెలంగాణ ఫలితాలు ఒక్క సీఎం కుటుంబానికి దక్కుతున్నాయని పొన్నం ప్రభాకర్ విమర్శించారు.

సామాన్యుల నెత్తిన ఏపీ సర్కార్ గ్యాస్ "పిడుగు"

కరోనా మహమ్మారి కారణంగా సామాన్య జనం ఇప్పటికే సంపాదన లేక అల్లాడుతుంటే తాజాగా ఏపీలోని జగన్ సర్కార్ పేద, సామాన్య మధ్యతరగతి వర్గాల నడ్డి విరిచే నిర్ణయం తీసుకుంది. సామాన్యులు, మధ్యతరగతి అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు పొద్దున్న లేచిన దగ్గర నుండి ఏది తినాలన్న గ్యాస్ స్టవ్ వెలిగించాల్సిందే. అయితే తాజాగా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సామాన్యులు స్టవ్ వెలిగించాలంటే ఏడుపు వచ్చే పరిస్థితి ఏర్పడింది. తాజాగా వంట గ్యాస్ పై ఏపీ ప్రభుత్వం వ్యాట్ ను భారీగా పెంచేసింది. ఇప్పటివరకు 14.5 శాతంగా ఉన్నవ్యాట్ పన్నును ఏకంగా 24.5 శాతానికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయిన నేపథ్యంలో వంట గ్యాస్ పై వ్యాట్ ను 10 శాతం పెంచింది. ఇప్పటికే పెట్రోల్ పై 31 శాతంతో పాటు అదనంగా మరో నాలుగు రూపాయల మేర, డీజిల్ పై 22.5 శాతంతో పాటు అదనంగా నాలుగు రూపాయల మేర వసూలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా గ్యాస్ పైన కూడా వ్యాట్ పెంచి మరీ సామాన్యుల నడ్డి విరుస్తూ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం లో పడింది.   ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రభుత్వం ఆదాయంతో సంబంధం లేకుండా ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం గత సంవత్సర కాలంగా వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మరీ సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారు. దీంతో ఆదాయం పెంచుకోవడం కోసం మళ్ళీ అదే సామాన్యుల నడ్డి విరిచే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు.

కొంచెం బాధ కలిగించింది.. వీటికి సమాధానాలు చెప్పండి

వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కొత్త చట్టం వల్ల అవినీతి అంతమవుతుందని, ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే, తాజాగా దీనిపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు.   అసెంబ్లీలో రెవెన్యూ చట్టంపై రైతుల పక్షాన నాకు మాట్లాడే అవకాశం కల్పించకపోవడం బాధ కలిగించిందని చెప్పిన సీతక్క.. నావి కొన్ని ప్రశ్నలు మీతో పంచుకుంటున్నాను అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు పోస్ట్ చేశారు.   వీఆర్వోలు అవినీతిపరులైనప్పుడు వారు గుర్తించిన 57 లక్షల మంది రైతులకు మీరు రైతుబంధు ఇస్తున్నారు. దాంట్లో ఎంతమంది నిజమైన రైతులు ఉన్నారు? అంటే రైతులు కానీ వాళ్ళకి కూడా రైతుబంధు లభిస్తుంది కదా? అని ప్రశ్నించారు. అంతేకాదు, గొప్పలు ముఖ్యమంత్రికి.. అవినీతి ఉద్యోగులకు అంటగడుతున్నారని విమర్శించారు.   సెక్షన్ 5 ప్రకారం రైతులు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేస్తారు? మరలా మధ్యవర్తులు ఏర్పడతారు కదా? వాళ్లు అవినీతి చేయరా? అని ప్రశ్నించారు.   ఎమ్మార్వో గారు గానీ అధికారపక్షం లో ఉండే నాయకులు గానీ తమ స్వార్థం కోసం భూమి వేరే పేరు మీద ఎక్కిస్తామని రైతులను బెదిరించరా? అని ప్రశ్నించారు. ఒకవేళ ఎక్కిస్తే సెక్షన్ 9 ప్రకారం రైతుల కోర్టుకు పోయే అధికారం కూడా లేదు కదా అని అడిగారు. ఆన్లైన్ మీద పని చేసేది కూడా మనుషులే దేవుడు కాదు కదా అని ప్రశ్నించిన సీతక్క.. ఇదే టిఆర్ఎస్ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రి భూ ప్రక్షాళన చట్టం వచ్చినప్పుడు అద్భుతం మహా అద్భుతం అన్నారని ఎద్దేవాచేశారు. దానికి నిదర్శనమే ఇవాళ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ అవినీతిలో భారత దేశంలోనే మొదటి స్థానంలో ఉందని విమర్శించారు.   వీఆర్వో లలో కొందరు అవినీతి పరులు ఉన్నారు వాళ్లను శిక్షించరా? వేరే డిపార్ట్మెంట్ లో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ అవినీతి చేయరని గ్యారెంటీ ఏంటి? అని సీతక్క ప్రశ్నించారు.

న్యాయమే గెలిచింది.. తెలుగు 'విన్'

అధికారం మా చేతిలో ఉందంటూ నియంతృత్వ పోకడలకు పోయే ప్రభుత్వాలకు న్యాయ స్థానాల్లో భంగపాటు తప్పదని మరోసారి రుజువైంది. రాష్ట్ర ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రిపైనా అభ్యంతరకర వార్త ప్రసారం చేసిందని ఆరోపిస్తూ 'తెలుగు వన్' సంస్థపై సీఐడీ పోలీసులు ఏప్రిల్ 29వ తేదీన అక్రమ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, అర్థరాత్రి పూట సీఐడీ అధికారులు మా తెలుగు వన్ ఆఫీస్ లో సోదాలు నిర్వహించి.. సెక్యూరిటీ సిబ్బంది, డ్రైవర్ తో దురుసుగా ప్రవర్తించి.. ఆఫీస్ కి సంబంధించిన సిస్టమ్స్, హార్డ్ డిస్క్ లు పట్టుకెళ్లారు.    కేసులు పెట్టినా, విలువైన కంటెంట్ ఉన్న హార్డ్ డిస్క్ లు పట్టుకెళ్లినా.. మా సంస్థ అధినేత కంఠంనేని రవిశంకర్ గారు కానీ, మా సంస్థ కానీ ఏ మాత్రం భయపడలేదు. రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అధికారాన్ని అడ్డుపెట్టుకొని మా సంస్థపై వేధింపులకు దిగారు. ఇలాంటి వేధింపులు, ఒత్తిళ్లు భరించలేక కొందరు తమ వ్యాపారాల కోసం అధికార పార్టీ పంచన చేరారు, వారికి బాకా ఊదారు. కానీ మా అధినేత అలా చేయలేదు. "ఏ తప్పు చేయనప్పుడు నేనెందుకు తల దించుకోవాలి. అధికారం ఈరోజు ఉంటుంది రేపు పోతుంది. కానీ నిజాయితీ, న్యాయం ఎప్పటికీ నిలబడతాయి" అంటూ న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. ఆయన పోరాట పటిమని చూసి పలువురు రాజకీయ నాయకులు, మీడియా మిత్రులు సైతం ఆశ్చర్యపోయారు.   న్యాయ పోరాటానికి దిగిన మా సంస్థ అధినేత తెగింపుకి, నిజాయితీకి విశేష మద్దతు లభించింది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సంస్థపై దాడి చేసి, ఆయనపై కేసు పెట్టారని ఆరోపిస్తూ అప్పట్లో పెద్ద ఎత్తున యువత సోషల్ మీడియాలో గళం వినిపించారు. మరోవైపు, తాను న్యాయం, నిజాయితీని నమ్ముకున్నానని.. ఇలాంటి వేధింపులు, బెదిరింపులకు భయపడేది లేదని.. న్యాయపోరాటం చేసి గెలిచి తీరుతానని స్పష్టం చేసిన మా అధినేత.. చెప్పినట్టుగానే బెయిల్ పొంది మొదటి విజయాన్ని సాధించారు. ఇక, తాజాగా హైకోర్టు ఈ కేసుని కొట్టివేయడంతో ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని రుజువు చేశారు.    తమపై పెట్టిన అక్రమ కేసును రద్దు చేయాలని కోరుతూ మా సంస్థ అధినేత హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి అధికారుల తీరుని తీవ్రంగా తప్పుబట్టారు. కేసు నమోదు, దర్యాప్తుతోపాటు.. చానల్ కు చెందిన ఎలక్ట్రానిక్ ఎక్విప్ మెంట్ ను స్వాధీనం చేసుకున్న తీరు చూస్తే అధికార పార్టీని సంతృప్తి పరిచేందుకే చేసినట్లుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. “పార్టీలు అధికారంలోకి రావచ్చు. కొంతకాలానికి పోవచ్చు. అధికారులు రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా పని చేయాలి." అని హితవు పలికారు. "ప్రజాస్వా మ్యంలో ఉన్నప్పటికీ.. చట్టం పట్ల కనీస అవగాహన, శాఖపై పాలనాపరమైన నియంత్రణ లేని అధికారుల వల్ల ఖాకీస్టోక్రసీలో(దారుణమైన పాలనలో) జీవిస్తున్నామనే భావన ప్రజల్లో కల్పిస్తున్నారు” అని ఆగ్రహించారు. ఈ కేసులో సీఐడీ పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. సీఐడీ పోలీసులు ప్రభుత్వానికి సాధనంగా మారి.. పిటిషనర్ పై కేసు నమోదు చేశారని.. ఇది చట్ట విరుద్ధమని ఆగ్రహించారు. పిటిషనర్ పై సీఐడీ నమోదు చేసిన కేసును రద్దు చేయాలని, స్వాధీనం చేసుకున్న సామాగ్రిని వెంటనే వెనక్కి ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు.   ఇది మా విజయం కాదు. నిజాయితీకి, న్యాయానికి దక్కిన గౌరవం. అధికారం చేతుల్లో ఉందికదా అని మమ్మల్ని వారి గుప్పిట్లోకి తెచ్చుకోవాలని చూసారు. కానీ మేం న్యాయపోరాటం చేసి గెలిచి తగిన గుణపాఠం చెప్పాం. అధికారం ఈరోజు ఉంటుంది రేపు పోతుంది. మీ తాటాకు చప్పుళ్ళకు మేం భయపడం. మీ రాయలసీమ పాలెగాళ్ల పాలనలో ఎందరో అమాయకులు బలయ్యారు. మేం వాళ్ళలాగా బలికాము, వాళ్ళ గళమై వినిపించి మీ పనిపడతాం. మీ బెదిరింపులు, రౌడీయిజాలు, నియంత పోకడలు.. మా నిజాయితీ ముందు నిలబడలేవు. న్యాయాన్ని గెలిపించడం కోసం ఎంతవరకైనా వెళ్తాం, ఎవరితోనైనా తలబడతాం. మా గెలుపు మీకు చెంపపెట్టు లాంటిది.   తెలుగు వన్ ఎప్పుడూ ఒకరికి కొమ్ము కాయలేదు.. ఒకరికి బాకా ఊదలేదు. ఎప్పుడూ నిజాయితీగానే పని చేసింది. ఇక మీదటా అలాగే పనిచేస్తుంది. అధికార మదంతో, మీ వాపు బలంతో.. మా గొంతు నొక్కాలని చూస్తే.. అంతకు వెయ్యి రెట్లు మా గళాన్ని వినిపిస్తాం. తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నిస్తాం, ప్రజలకు అన్యాయం చేస్తే ఎవరినైనా ఎదిరిస్తాం. మధ్యమధ్యలో వచ్చే ఈ బెదిరింపులు, వేదింపులకు న్యాయపోరాటంతోనే గెలిచి సమాధానం చెప్తాం.    మా ఈ న్యాయ పోరాటంలో మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మా అధినేతకు బెయిల్ రావడానికి కృషి చేసిన ఉమేష్ గారికి, హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి న్యాయ పోరాటంలో పాలుపంచుకున్న 'అంబటి అండ్ అవధాని అసోసియేట్స్'కి కృతజ్ఞతలు. అలాగే ప్రజల పక్షాన గొంతు వినిపిస్తున్న ఈటీవీ, టీవీ5 తో పాటు ఇతర మీడియా సంస్థలకు ధన్యవాదాలు. ఇక మా సంస్థకు మద్దతుగా నిలిచి గళం వినిపించిన లక్షల మంది సామాన్యులకు, శ్రేయోభిలాషులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాం.