బండి, అక్భర్ పై కేసులు! హాట్ కామెంట్లపై పోలీసుల యాక్షన్

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీలపై పోలీసులు  కేసులు నమోదు చేశారు. సెక్షన్ 505 కింద కేసులు నమోదు చేసిన ఎస్సార్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బండి సంజయ్, అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలతో సామాజిక ఘర్షణలు చెలరేగే ప్రమాదం ఉందని ఎఫ్ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు.    గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల బండి సంజయ్ మాట్లాడుతూ.. పాతబస్తీలో రోహింగ్యాలు నివసిస్తున్నారని, వారిపై సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామని అన్నారు. ఇత పాతబస్తిలో జరిగిన ఓ  సభలో మాట్లాడిన ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ..   హుస్సేన్ సాగర్‌ను ఆక్రమించి ఎన్టీఆర్, పీవీ నరసింహారావు సమాధులను నిర్మించారని, వాటిని కూల్చే దమ్ముందా? అని సవాల్ విసిరారు. అక్భర్ కామెంట్లకు కౌంటరిచ్చిన బండి సంజయ్.. అదే జరిగితే రెండు గంటల్లో దారుస్సలాం కూలిపోతుందని తీవ్రంగా స్పందించారు. వీరి సవాళ్లతో సామాజికంగా ఘర్షణలు రేకెత్తే ప్రమాదం ఉందంటూ పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేశారు.

రాజకీయ గందరగోళంలో గబ్బర్ సింగ్! తమిళ పత్రిక సెటైర్లు

జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌ ను గందరగోళ నేతగా అభివర్ణించింది తమిళనాడుకు చెందిన ఓ సాయంకాల దినపత్రిక.  ఆయనపై సెటైర్లు వేస్తూ తమిళ మురసులో ప్రత్యేక కథనం వచ్చింది. రాజకీయాల్లో ఆయన తీసుకుంటున్న అయోమయ నిర్ణయాలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు  ఆయనను ఇలానే అనుకుంటున్నారని ఆ పత్రిక రాసుకొచ్చింది. జనసేన పార్టీ ఆవిర్బావం నుంచి పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయాలు, వివిధ పార్టీలతో పొత్తుల అంశాలను వివరిస్తూ.. పవన్ కల్యాణ్ ను గందరగోళవాదిగా చూపించే ప్రయత్నం చేసింది తమిళ మురసు సాయంకాల పత్రిక.  జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు గందరగోళంగా ఉంటున్నాయనే ప్రచారం జరుగుతోంది.  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు పవన్. 50 డివిజన్లకు అభ్యర్థులు ఖరారయ్యారని చెప్పారు. పార్టీ ఆఫీసులో గ్రేటర్ ఎన్నికల కోసం  హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారు. ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం లేదని, బీజేపీకి తాము మద్దతిస్తామని ప్రకటించారు. ఈ వివరాలను కూడా తమిళ పత్రిక తమ కథనంలో పొందు పరిచింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని పవన్ పార్టీ తొలుత నిర్ణయించిందని, అయితే, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ నేత లక్ష్మణ్‌లను కలిసిన తర్వాత పవన్ కల్యాణ్ తన మనసు మార్చుకుని యూటర్న్ తీసుకున్నారని విమర్శించింది. తాము ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, బీజేపీకి జనసేన మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారని వివరించింది. అంతేకాకుండా, అప్పటికే ప్రకటించిన అభ్యర్థులను వెనక్కి తీసుకుంటున్నట్టు పవన్ చెప్పారని ఆ పత్రిక తమ కథనంలో పేర్కొంది. గత సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ కూటమిలో చేరిన పవన్ పార్టీకి ఆరు శాతం మాత్రమే ఓట్లు వచ్చాయని, ఆ తర్వాత మాయవతి నేతృత్వంలోని ఆ కూటమి నుంచి జనసేన బయటకు వచ్చిందని, అనంతరం బీజేపీతో పవన్ సంబంధాలు పెట్టుకున్నారని కథనంలో పేర్కొంది. దీంతో ఎప్పుడే నిర్ణయం తీసుకుంటారో తెలియని పవన్‌ను గందరగోళ రాజకీయ నేతగా ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు విమర్శిస్తున్నారని తమిళ మురసు తన కథనంలో పేర్కొంది.  ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌ కూడా తాజాగా పవన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనప్పుడు పార్టీ ఎందుకని ఆయన ప్రశ్నించారు.

ఫవన్‌ను.. ఫ్రకాష్‌రాజ్ ఫొగిడారా? తిట్టారా?

కన్నడిగుడయినా, విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ అచ్చ తెలుగులో ఊసరవెల్లి పదాన్ని బాగానే వాడారు. ఇంతకూ ఆయన ఆ పదప్రయోగం చేసింది ఎవరిపైనో తెలుసా? జనసేనాధిపతి, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాడికిందపడేసిన మన పవన్‌కల్యాణ్ గురించి! అవునా ప్రకాష్‌రాజ్ మన జనసేనాని గురించి అంతేసిమాటలన్నారా అని వెంటనే ఉడుక్కోకండి. కొద్దిగా పొడిగే ప్రయత్నం కూడా చేశారండీ! ఒక నాయకుడయి ఉండీ, ఆయనకో పార్టీకూడా ఉండీ, మరో పార్టీకి మద్దతునివ్వడం తనకు నచ్చలేదని కూడా చెప్పారు. అంటే ఆ లెక్కన కల్యాణ్‌బాబును నాయకుడిగా ప్రకాష్‌రాజ్ గుర్తించినందుకు, అన్నదమ్ములిద్దరితోపాటు, జనసైనికులు ఆయనకు థ్యాంక్స్ చెప్పాల్సిందే. గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోవడం, తనను నిరుత్సాహపరిచిందని కూడా మనసులో మాట చెప్పారు. అంటే.. జనసైనికుల లెక్క ప్రకారం.. ప్రకాష్‌రాజ్, పవనన్నయ్యను పొగిడినట్లుగానే భావించాలి. గత ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం ఎంతో తెలిసి కూడా, పవన్ ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ప్రకాష్‌రాజ్‌కు సుతరామూ నచ్చలేదట. ఏం చేస్తాం? పీత కష్టాలు పీతవి. పవన్ కష్టాలు పవన్‌బాబువి మరి! అప్పటికీ రెండురోజులు ఢిల్లీలో అంతచలిలో కూడా, నద్దా గారి దర్శనభాగ్యం కోసం ఎదురుచూస్తే, రెండోరోజు ఆ భాగ్యం కలిగింది. ఆ భేటీలో పవన్ విశ్వరూపం ప్రదర్శించారని జనసైనికుల కథనం. ఏపీలో బీజీపీ బలం ‘పాయింట్ ఎయిట’న్న విషయాన్ని పవన్‌కు, ప్రకాష్‌రాజ్జ్ నొక్కివక్కాణించి మరీ గుర్తుచేయడమే ఏమీ బాగోలేదు. సరే.. పవన్‌కూ వేరే దిక్కులేదు. ఇప్పటికే అన్ని పార్టీలతో దోస్తానా అయిపోయింది. ఇక మిగిలింది బీజీపీనే. ఈ వయసులో ఆయన మాత్రం ఇంకా ఎన్నిపార్టీల చుట్టూ తిరుగుతారు చెప్పండి? అమరావతి, గ్రేటర్ ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నిక యవ్వారంలో, ‘కమలం’ తనను ‘పులుసులోముక్క’ను చేసి ఆడిస్తున్నా.. చేగువేరా టైపులో తిరగబడకుండా, చేష్టలుడిగి చూడాల్సిన దుస్థితిపై ఎవరికీ చెప్పుకోలేని దైన్యం. అసలింతకూ ప్రకాష్‌రాజ్ బాధేమిటో అర్ధం కావడం లేదు. మా పవన్ ఎవరికి సపోర్టు చేస్తే ఆయనకెందుకు? గ్రేటర్ ఎన్నిక ల్లో పోటీ చేయాలని ఏదో తెలియక ఆవేశపడ్డారనుకోండి. తొందపడి ముందే కూసినట్లు, అభ్యర్ధుల పేర్లు కూడా ఎంపిక చేసే హడావిడి కూడా చేశారనుకోండి. అయినా జనసేనతో పొత్తు జాన్తానై అని, కమలదళపతి సంజయ్ చెప్పిన తర్వాత, సరే మీ ఇష్టమని గౌరవప్రదంగా చేతులెత్తేశారే అనుకోండి. అంతమాత్రాన.. ఒకప్పుడు టీడీపీ-బీజేపీ సంకీర్ణ సర్కారు వచ్చేందుకు పోరాడిన, మా ‘ఆంధ్రా చేగువేరా’ను ప్రకాష్‌రాజ్ అంత అవమానిస్తారా? అయినా.. గ్రేటర్‌లో పోటీ చేయనందుకు పవనన్నయ్య ఫీలవ్వాలి గానీ, మధ్యలో ఈ ప్రకాష్‌రాజ్‌కెందుకు? అని జనసైనికులు తెగ ఫీలవుతున్నారట. పోనీలెండి.. పాపం పవన్ ప్రతాపం తెలియక, ఏదేదో మాట్లాడిన ప్రకాష్‌రాజ్‌ను క్షమించేద్దాం. ఓకేనా? -మార్తి సుబ్రహ్మణ్యం  

మీరు రానవసరం లేదు.. సీఎం కేసీఆర్ కు పీఎంవో ఝలక్

ప్రధాని మోడీ ఈరోజు హైదరాబాద్ కు ఆకస్మిక పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. దేశంలో కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న మూడు ప్రముఖ సంస్థల పర్యటనలో భాగంగా హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ ను సందర్శించి వ్యాక్సిన్ ట్రయల్స్ పురోగతి, అలాగే ఉత్పత్తి పై చర్చించనున్నారు. అయితే అయన హకీమ్ పేట ఎయిర్ పోర్ట్ కు వచ్చిన సమయంలో ప్రోటోకాల్ ప్రకారం సీఎం స్వాగతం చెప్పాల్సి ఉంటుంది. అయితే ఒకపక్క జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, టిఆర్ఎస్ ప్రధాన రాజకీయ ప్రత్యర్ధులు కావడంతో ప్రధాని పర్యటన పై ఉత్కంఠ నెలకొంది   అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం నేడు హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు వస్తున్న ప్రధానికి స్వాగ‌తం ప‌లికేందుకు సీఎం కేసీఆర్ రాన‌స‌వ‌రం లేద‌ని ప్రధాని కార్యాలయం (పీఎంవో) స‌మాచారం ఇచ్చింది. ఈ మేర‌కు ప్ర‌ధాని వ్యక్తిగత సహాయకుడు వివేక్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఫోన్‌చేసి విషయం చెప్పారు. అంతేకాకుండా హకీమ్ పేట విమానాశ్రయంలో ప్ర‌ధానికి స్వాగతం చెప్పడానికి ఐదుగురికి మాత్రమే పీఎంవో అవకాశం ఇచ్చింది. వీరిలో హకీంపేట ఎయిర్‌ ఫోర్స్ ఆఫీస్‌ కమాండెంట్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్, మేడ్చల్‌ కలెక్టర్‌ శ్వేతా మొహంతి మాత్రమే రావాలని పీఎంవో ఆదేశాలు పంపింది. పీఎంవో తాజా నిర్ణ‌యంపై ఇటు ప్ర‌భుత్వ వ‌ర్గాలు, అటు టీఆర్ఎస్ నేత‌లు అవాక్క‌య్యారు.   సాధార‌ణంగా ప్రధాని రాష్ట్రాల్లో అధికారిక పర్యటనకు వస్తే ఆ రాష్ట్ర గవర్నర్‌, ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు స్వాగతం ప‌లుకుతారు. అలాగే హకీంపేట ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ స్వాగతం చెప్తార‌ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రధాని కార్యాలయానికి సమాచారమిచ్చింది. కానీ అనూహ్యంగా సీఎం రావాల్సిన అవసరం లేదని ప్రధాని కార్యాలయమే స్వ‌యంగా సందేశం పంపడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

కృత్రిమ వరద సృష్టించి ప్రకృతికి కోపం తెప్పించారా?

అదేదో సినిమాలో సునీల్ ఒక డైలాగ్ చెప్తాడు. "నెత్తి మీద జుట్టు ఉండాలనుకుంటే శాంపిల్ సోప్ వాడినా ఉంటుంది, ఒక్కసారి రాలిపోవాలని డిసైడ్ అయితే మాత్రం ఎంత కాస్ట్ లీ షాంపూలు వాడినా రాలిపోవడం ఆగదు". నివర్ తుఫాన్ పుణ్యమా అని ఇప్పుడు ఈ డైలాగ్ గుర్తుకొచ్చింది. మనం కృత్రిమ వరదలు సృష్టించినంత మాత్రాన నగరాలు అంత తేలికగా మునగవు. లోతట్టు ప్రాంతాలపైనే వరదలు ప్రభావం చూపిస్తాయి. ఇప్పటికైనా ఈ విషయం జగన్ సర్కార్ కి బోధ పడిందో లేదో!.   వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీ రాజధానిని మార్చేస్తుందని గత ఎన్నికలకు ముందు టీడీపీ ఆరోపించింది. అయితే, వైసీపీ మాత్రం అదంతా అబద్ధం, అమరావతే రాజధానిగా ఉంటుందని హామీ ఇచ్చింది. తీరా అధికారంలోకి వచ్చాక మాట మార్చింది. రాజధానికి అమరావతి అనువైన ప్రాంతం కాదని, వరదలు ముంచెత్తుతాయని ఇలా రకరకాలుగా చెప్పుకొచ్చింది. అంతేకాదు, అమరావతిలో కృత్రిమ వరదలు సృష్టించే ప్రయత్నం కూడా చేసింది. ప్రకాశం బ్యారేజీ సామర్థ్యం 3 టీఎంసీలు అయితే.. రాజధాని ప్రాంతాన్ని ముంచాలనే ఉద్దేశంతో, 4 టీఎంసీల నీటిని బ్యారేజీలో నిల్వ ఉంచి కుట్రపూరితంగా నీళ్లను ఒకేసారి వదిలారని ఆరోపణలు కూడా వచ్చాయి. అలాగే, ఇటీవల భారీ వర్షాలకు ఏపీ హైకోర్టు ప్రాంతమంతా జలమయమైందని వైసీపీ శ్రేణులు ప్రచారం చేశాయి. అయితే అదంతా తప్పుడు ప్రచారమని తరువాత తేలిపోయింది. దానితోపాటే రాజధానిగా అమరావతి ప్రాంత ఎంపిక కూడా సరైనదని తేలిపోయింది. ఎందుకంటే హైదరాబాద్ సహా పలు మహా నగరాలు వరదలకు అల్లాడిపోయాయి. కానీ అమరావతిలో మాత్రం వరదలు రాలేదు.   ఇక, ఇప్పుడు నివర్ తుఫాన్ ధాటికి ఏపీలోని పలు ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా సీఎం సొంత జిల్లా కడపను వరదలు ముంచేశాయి. బుగ్గవంక ప్రాజెక్టు నీటితో నగర ప్రజలు రాత్రంతా భయం గుప్పిట్లో గడిపారు. బుగ్గవంక పరీవాహ ప్రాంతాలకు చెందిన రెండు వేల మందికి పైగా ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీగా పంట నష్టం కూడా వాటిల్లింది. కడపతో పాటు ఏపీలోని చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాలు కూడా తుఫాన్ ధాటికి ప్రభావితమయ్యాయి. అయితే ఈ తుఫాన్ ప్రభావం కూడా అమరావతి ప్రాంతంలో కనిపించలేదు.   తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచింది అన్నట్టుగా.. ఒక ప్రాంతంలో కృత్రిమ వరద సృష్టించి ముంచాలని చూస్తే, ప్రకృతికి కోపం వచ్చి అన్ని ప్రాంతాలపై ప్రభావం చూపుతుందేమో అనిపిస్తుంది. మరి ఇప్పటికైనా జగన్ సర్కార్ అమరావతి వరదముప్పు ప్రాంతం కాదని తెల్సుకుంటుందో లేదో.

'సైకిల్'.. ఏ పార్టీ గాలి తీస్తుంది?

దుబ్బాకలో టీడీపీ పోటీ లేకపోవడంతో బయపడిన బీజేపీ   అందరి చూపూ.. సెటిలర్ల ప్రాంతాల వైపే   గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సెటిలర్లు ఏ పార్టీకి పట్టం కట్టనున్నారు? గతంలో రెండవ స్థానంలో నిలిచిన టీడీపీ సైకిల్, ఇప్పడు ఏ పార్టీ గాలి తీయనుంది?.. ఇదీ ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో జరుగుతున్న చర్చ.   గతంలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ సహా ఏపీ సీనియర్ నేతలంతా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయినా ఆ పార్టీకి వచ్చింది ఒక్కటే సీటు. సంఖ్యాపరంగా ఒక్క సీటు మాత్రమే వచ్చినప్పటికీ.. టీడీపీ 4,39,047 ఓట్లతో 13.11 శాతం ఓట్లు సాధించడాన్ని విస్మరించకూడదు. విడిగా పోటీచేసిన బీజేపీ 3,46,253 ఓట్లతో 10.34 శాతం సాధించింది. కాంగ్రెస్ 3,48,388 ఓట్లతో 10.4 శాతం సాధించింది. ఇక గ్రేటర్‌పై గులాబీ జెండా ఎగురవేసిన టీఆర్‌ఎస్ 14,68,618 ఓట్లతో 43.35 శాతం సాధించింది. తెరాసకు పరోక్ష మిత్రపక్షమైన ఎంఐఎం 5,30,812 ఓట్లతో 15.85 శాతం సాధించింది. ఇవీ గత ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు వచ్చిన సీట్లు, ఓట్ల శాతం వివరాలు.   తెరాస, మజ్లిస్ తర్వాత మూడోస్థానంలో నిలిచిన టీడీపీ.. ఇప్పుడు అత్యంత బలహీనంగా మారింది. చంద్రబాబు చేతులెత్తేయడంతో, 90 స్థానాలకే ఆ పార్టీ పోటీ పడుతోంది. అంటే కేవలం ఉనికి కోసమే టీడీపీ పోటీ చేస్తుందన్నది సుస్పష్టం. పైగా ఆ పార్టీ నాయకత్వం, అభ్యర్ధులకు నయాపైసా నిధులిచ్చే పరిస్థితిలో లేదు.  అయితే, సీమాంధ్రులున్న అన్ని డివిజన్లలోనూ అది పోటీ పడుతోంది. గత ఎన్నికల ప్రచారంతో పోలిస్తే, ఇప్పటి ఆ పార్టీ ప్రచారం నామమాత్రమే. ఇప్పటి ప్రచారసరళి పరిశీలిస్తే టీడీపీ 2-5 శాతం ఓట్లు తెచ్చుకునే అవకాశం మాత్రమే కనిపిస్తోంది.  కమ్మ సామాజికవర్గం దాదాపు 25 డివిజన్లలో ప్రభావం చూపుతోంది.   వారు కాకుండా సెటిలర్లు మొత్తం నగరంలోని 35 నుంచి 40 డివిజన్లలో ప్రభావితం చూపించే అవకాశాలున్నాయి. ఇప్పటి పరిస్థితి ప్రకారం,  కమ్మవర్గం  గంపగుత్తగా తెరాసకే జైకొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారు కాకుండా మిగిలిన సెటిలర్లు ఇప్పుడు ఎవరికి ఓటు వేస్తారు? గతంలో టీడీపీకి పోలైన ఆ ఓట్లు ఇప్పుడు ఏ పార్టీ ఖాతాలోకి వెళతాయి? అసలు సైకిల్ గుర్తు, ఏ పార్టీ గాలి తీయనుందన్న చర్చ జరుగుతోంది.   దీనికి సంబంధించి రాజకీయ పరిశీలకుల విశ్లేషణ ఆసక్తికరంగా కనిపిస్తోంది. టీఆర్‌ఎస్ గత ఆరున్నరేళ్ల నుంచి సీమాంధ్రులతో సఖ్యతగానే ఉంటోంది. ఎక్కడా ఒక్క హింసాకాండ జరిగిన దాఖలాలు లేవు. పైగా ఆ పార్టీ కూడా నలుగురు కమ్మవారికి సీట్లిచ్చింది. ఈ కోణంలో చూస్తే, కమ్మ-సీమాంధ్రుల మొగ్గు తెరాస వైపేనని విశ్లేషిస్తున్నారు. కానీ, బీజేపీ కూడా కమ్మ వర్గం నేతలు, ఏపీ నేతలను ప్రచారంలోకి దింపింది. హిందూ-ముస్లిం భావోద్వేగ ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. ప్రధానంగా బీజేపీ చీఫ్ సంజయ్ యమా స్పీడుతో వెళుతున్నారు. సెటిలర్లు ఉన్న డివిజన్లలో,  టీడీపీ వైపు మొగ్గుచూపే సెటిలర్లంతా తమకే ఓటు వేస్తారన్న అంచనా బీజేపీలో కనిపిస్తోంది. అయితే సెటిలర్లకు చెందిన యూత్ మాత్రం బీజేపీ వైపు ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు కొన్ని డివిజన్లలో కనిపించింది.   కానీ, టీడీపీ ఓటర్లు బీజేపీ కంటే.. టీఆర్‌ఎస్‌తో పాటు,  స్థానికంగా కొంతమేరకు కాంగ్రెస్ వైపు చూసే అవకాశాలే, ఎక్కువ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా. కారణం.. అమరావతి అంశంలో బీజేపీ నమ్మించి మోసం చేసిందన్న భావన, గ్రేటర్‌లో నివసించే సీమాంధ్రులలో బలపడటమేనని వారి మాటలు స్పష్టం చేస్తున్నాయి.  టీఆర్‌ఎస్‌కు ఓటు వేయడం వల్ల తమకు వచ్చే నష్టం లేకున్నా, బీజేపీకి ఓటు వేయడం వల్ల అమరావతికి ద్రోహం చేసిన ఆ పార్టీని, మరింత ప్రోత్సహించినట్లవుతుందన్న భావన కనిపిస్తోంది. ప్రధానంగా కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, సనత్‌నగర్, ఉప్పల్, ఎల్బీనగర్, మలక్‌పేట, మల్కాజిగిరిలో కొన్ని డివిజన్ల పరిశీలన సందర్భంగా,  ఈ భావన స్పష్టంగా కనిపించింది.   అమీర్‌పేటలో టీఆర్‌ఎస్ అభ్యర్ధినిపై వ్యక్తిగతంగా వ్యతిరేకత ఉన్నప్పటికీ, బీజేపీకి ఓటు వేయకూడదన్న భావనతో, ఆమెకే ఓటు వేయకతప్పడం లేదని పలువురు సెటిలర్లు చెప్పడం గమనార్హం. ఇలాంటి వ్యాఖ్యలు సెటిలర్లు ఉన్న డివిజన్లలో వినిపిస్తున్నాయి. అయితే వీరంతా గత గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసే వారే కావడం ప్రస్తావనార్హం. ఈసారి టీడీపీ పోటీలోఉన్నప్పటికీ, తాము టీడీపీ బదులు టీఆర్‌ఎస్‌కే ఓటు వేస్తామని చెబుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే కనిపిస్తోంది.   ప్రధానంగా... బీజేపీ-మజ్లిస్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కూడా, సెటిలర్లను టీఆర్‌ఎస్ వైపు చూసేలా చేస్తున్నట్లు.. వారి ఆందోళన బట్టి స్పష్టమవుతోంది. ఈ పరిస్థితి నగరంలో మతకలహాలు-ఉద్రిక్తతకు దారితీసే ప్రమాదం ఉన్నందున, మళ్లీ టీఆర్‌ఎస్‌నే గెలిపిస్తే ఏ గొడవా ఉండదన్న భావనకు కారణమవుతున్నట్లు కనిపిస్తోంది. ‘ప్రశాంతతను కోరుకునే తమలాంటి వారికి ఈ యుద్ధం మాటలు భయపెట్టేలా ఉన్నాయ’ని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డుకు చెందిన మాధవి అనే 60 ఏళ్ల మహిళ వ్యాఖ్యానిందంటే.. బీజేపీ-మజ్లిస్ మాటల తీవ్రత, సెటిలర్లపై ఏ స్థాయిలో ప్రభావం చూపుతున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.   ఇక సీమాంధ్రులు నివసించే ప్రాంతాల్లో.. అమరావతికి మద్దతునిస్తున్నందుకు, కాంగ్రెస్‌పై కొంత సానుకూలత కనిపించింది. అమరావతి కోసం కాంగ్రెస్ ప్రత్యక్ష పోరాటం చే స్తుండటాన్ని, సెటిలర్లు మెచ్చుకుంటున్నారు. అయితే, ఈ పరిస్థితి మల్కాజ్‌గిరి, మలక్‌పేట, ఎల్బీనగర్, కూకట్‌పల్లి, అంబర్‌పేట నియోజకవర్గాల్లో కనిపించింది.   ఆ ప్రకారం చూస్తే.. గతంలో టీడీపీకి పోలయిన ఓట్లలో సింహభాగం టీఆర్‌ఎస్‌కు, కొంతభాగం కాంగ్రెస్‌కు పోలయ్యే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. ఇది ఇప్పటి పరిస్థితి. అమిత్‌షా, నద్దా వంటి అగ్రనేతలు వచ్చినందున,  మరి పోలింగ్ నాటికి పరిస్థితి మారుతుందేమో చూడాలి.   నిజానికి ఇప్పటి పరిస్థితి-పోటీని పరిశీలిస్తే బీజేపీ-టీడీపీ కలసి పోటీ చేసి ఉంటే.. ఎన్నికలు రసవత్తరంగా ఉండేవని, రాజకీయ విశ్లేషకులు చె బుతున్నారు. బీజేపీకి టానిక్‌లా మారిన దుబ్బాక ఉప ఎన్నికలో, టీడీపీ పోటీకి దూరంగా ఉంది. ఫలితంగా బీజేపీ కష్టంగానయినా 1100 ఓట్ల మెజారిటీతో బయటపడగలిగింది. ఒకవేళ టీడీపీ కూడా పోటీ చేస్తే, ఓట్లు చీలిపోయి టీఆర్‌ఎస్ సులభంగా గెలిచేదని విశ్లేషకులు వివరిస్తున్నారు. ఇప్పుడు టీడీపీ విడిగా బరిలో దిగినందున, అది బీజేపీకి నష్టదాయకమేనని విశ్లేషిస్తున్నారు. అయితే కేవలం మున్సిపల్ ఎన్నికల కోసం బీజేపీ తన విధానాన్ని మార్చుకోవడం అసాధ్యం.  పైగా గ్రేటర్‌లో పొత్తు ప్రభావం ఏపీ రాజకీయాల్లో కూడా చూపే అవకాశం ఉన్నందుకే,  పొత్తుల జోలికి వెళ్లనట్లు కనిపిస్తోందని ఓ బీజేపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.  -మార్తి సుబ్రహ్మణ్యం

ఇలాంటి నేతలతో ప్రయోజనమేంటీ! వలసలపై బీజేపీలో చర్చ

తెలంగాణపై స్పెషల్ ఫోకస్ చేసింది బీజేపీ హైకమాండ్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే ఇతర పార్టీల్లోని నేతలను ఆహ్వానిస్తున్నారు కమలనాథులు. బీజేపీ నేతల ప్రయత్నాలు ఫలిస్తూ.. ఆ పార్టీలోకి భారీగానే వలసలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొంత మంది కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు కమలం కండువా కప్పుకోగా.. మరికొందరు నేతలు త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జరుగుతోంది.  మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు మొదలుకొని నియోజకవర్గ స్థాయి నేతలు కాషాయ గూటికి చేరుతున్నారు. అయితే  పార్టీలో జరుగుతున్న చేరికలపై బీజేపీలోనే భిన్న స్పందన వస్తుందనే ప్రచారం జరుగుతోంది. స్వామి గౌడ్ వంటి నేతలు ఫర్వాలేదు కాని.. ప్రజా బలం లేని లీడర్ల కోసం ప్రయత్నించడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎవరిని  పడితే వారిని చేర్చుకోవడం వల్ల..అద్వానీ, వాజ్ పేయి వంటి మచ్చలేని నేతలు నడిపించిన పార్టీ ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉందనే ఆందోళన కొందరు నేతల్లో వ్యక్తమవుతోంది.    బీజేపీలోని కొందరు నేతలు భయపడుతున్నట్లే ఆ పార్టీలోకి తాజా వలసలు కనిపిస్తున్నాయి. గతంలో బీజేపీలో పనిచేసి వెళ్లినవారు, ఏనాడు ఎన్నికల్లో పోటీ చేసి గెలవని వారు, మీడియాలో ఫోకస్ కావడం తప్ప ప్రజల్లో పలుకుబడి లేని వారు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ  నిత్యం వార్తల్లో ఉండేవారు, గొడవలు పడుతూ కాంట్రవర్సీగా ఉండే నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ఇటీవల బీజేపీలోకి జరిగిన వలసలు చూసినవారు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విజయశాంతి, సర్వే సత్యనారాయణ, విక్రం గౌడ్, గూడురు నారాయణ రెడ్డి వంటి వారితో పార్టీకి ప్రయోజనం కంటే నష్టాలే ఎక్కువుంటాయనే గుసగుసలు బీజేపీ కార్యాలయంలో వినిపిస్తున్నాయి.    విజయశాంతి రాజకీయ జీవితం బీజేపీతోనే ఆరంభమైంది. ఇప్పటి వరకు ఆమె నాలుగు  పార్టీలు మార్చేసింది. సొంతగా ఒక పార్టీ పెట్టుకుని కొంత కాలానికి దుకాణం ఎత్తేసింది. 1998లో బీజేపీలో చేరింది విజయశాంతి. కొంత కాలానికే బీజేపీ నుంచి బయటికొచ్చి తల్లి తెలంగాణ పార్టీని స్థాపించింది. 2009లో ఆ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేసింది రాములమ్మ. 2009లో మెదక్ లోక్ సభ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. కొద్ది రోజులకే కేసీఆర్ తో విభేదాలు రావడంతో ఆ పార్టీకి దూరంగా ఉన్నారు.  2014 ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. మెదక్  లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయశాంతిని  పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. 2018 ఎన్నికల తర్వాత నుంచి ఆమె రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. రాజకీయాల్లో నిలకడ లేని రాములమ్మ చేరికతో బీజేపీకి వచ్చే ప్రయోజనం ఏమిటన్న చర్చ బీజేపీలోనే జరుగుతోంది.    కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కూడా బీజేపీలో చేరారు. సర్వేకు పెద్ద కేడర్ కూడా లేదు. ఆయనకు సొంత నియోజకవర్గం కూడా లేదు. గత ఏడాది క్రితం కాంగ్రెస్ పార్టీ ఆయన్ను సస్పెండ్ చేసింది. ఇప్పుడాయన పార్టీలో చేరితే ఉపయోగం ఏంటన్నది కొందరు కమలనాధుల వాదన. ఎప్పుడూ  వివాదాస్పద కామెంట్లతో కాంట్రవర్సిగా ఉండే సర్వేతో కమలానికి నష్టమే తప్ప  లాభం ఉండదనే చర్చ కమలనాధుల్లో జరుగుతుంది.సర్వే లాంటి నేతలు ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియదు. గతంలో ఆయన చేసిన కామెంట్లు చాలాసార్లు కాంట్రవర్సీ అయ్యాయి. బీజేపీ నేతగానూ ఆయన నోరు జారితే పార్టీకి తీరని నష్టం జరగవచ్చనే అభిప్రాయం కొందరు బీజేపీ నేతల నుంచి వస్తుందని చెబుతున్నారు.అంతేకాదు సర్వేతో బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారనే విషయం తెలిసాకా కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు బీజేపీకి ఇబ్బందిగా మారాయి.తాము వద్దనుకుని వదిలించుకున్న నేతలను బీజేపీ తీసుకుంటుందనే కాంగ్రెస్ నేతల కామెంట్లకు కమలనాధుల దగ్గర కౌంటరే లేకుండా పోయింది.    మాజీ మంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్ కూడా బీజేపీలో చేరబోతున్నారు. విక్రం గౌడ్ రాజకీయాల్లో పూర్తిగా విఫలమైన వ్యక్తి. 2016 గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ అతన్ని మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన విక్రం గౌడ్ తన డివిజన్ లో మూడో స్థానంలో నిలిచి ఘోరంగా ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గోషా మహాల్ నుంచి పోటీ చేసి కనీస పోటీ కూడా ఇవ్వలేదు. మూడేండ్ల క్రితం విక్రం గౌడ్ పై జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే పోలీసుల విచారణలో .. విక్రం గౌడే కిరాయి గ్యాంగుతో తనపై దాడి చేయించుకున్నాడని తేలడంతో అతని పరువు పోయింది. డివిజన్ లో కార్పొరేటర్ గా గెలవలేని వ్యక్తి బీజేపీలోకి వస్తే పార్టీకి వచ్చే ప్రయోజనం ఏంటన్నది కమలం కార్యకర్తల ప్రశ్న. పీసీసీ కోశాధికారిగా ఉన్న గూడురు నారాయణ రెడ్డి కూడా బీజేపీలో చేరతారనే ప్రచారం ఉంది. మీడియాలో ఫోకస్ కావడం తప్ప జన బలం లేని గూడూరు లాంటి నేతలతో పార్టీకి ప్లస్ అయ్యేది ఏమి లేదని బీజేపీలో చర్చ జరుగుతోంది.    గ్రేటర్ ఎన్నికల సందర్భంగా బీజేపీలోకి భారీగా వలసలు జరిగాయి. కొత్తగా వచ్చిన నేతలు కార్పొరేటర్ అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వలస నేతలకు టికెట్లు ఇవ్వడంపై పార్టీలో నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగం పల్లి నియోజకవర్గాల్లో  మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలు ఆందోళన చేశారు. అంతేకాదు కొత్తగా వచ్చిన నేతలకు టికెట్లు ఇవ్వడం వల్ల పార్టీకి నష్టం జరిగిందనే చర్చ కూడా పార్టీలో జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పార్టీలో చేరుతున్న నేతలతో భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. పార్టీలో ఇప్పటికే బలమైన నేతలు ఉన్నారని, పార్టీ బలోపేతానికి అవసరమయ్యే నేతలను తీసుకుంటే సరిపోతుందని కొందరు నేతలు చెబుతున్నారు. ప్రజా బలం లేని, వివాదాస్పదంగా ఉండే నేతలను తీసుకుంటే పార్టీకి నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు.

డిసెంబర్ 25న 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ! ఏపీ కేబినెట్ ఆమోదం

డిసెంబర్ 25న 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు 28లక్షల 30వేల ఇళ్ల నిర్మాణానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. హౌసింగ్ కాలనీల నిర్మాణానికి ఓకే చెప్పింది. డిసెంబర్ 8న 2.49లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ, అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముసాయిదా బిల్లులు, కురుపాం జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కాలేజీకి 105 ఎకరాల భూ సేకరణ, 2019 ఖరీఫ్‌ ఉచిత పంటల బీమా పథకానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఏపీ ఫిషరీస్‌ యూనివర్శిటీ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రూ.9,027 కోట్లతో భూముల సమగ్ర సర్వేకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.    నివర్‌ తుపానుపై కేబినెట్‌లో చర్చించామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. 30 వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలు , 1300 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయన్నారు. డిసెంబర్‌ 30 కల్లా పంట నష్టపరిహారాన్ని అందించాలని సీఎం ఆదేశించారని కన్నబాబు చెప్పారు. సుమారు 10వేల మందికిపైగా సహాయక శిబిరాలకు తరలించామని, శిబిరాల్లో ఉన్నవారికి రూ.500 ఇవ్వాలని సీఎం ఆదేశించారని మంత్రి తెలిపారు.     ఉద్యోగులు, పింఛన్‌దారుల డీఏ బకాయిల్ని చెల్లించాలని నిర్ణయించామని, 3.144 శాతం డీఏ పెంపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు కన్నబాబు. ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలన్నీ పూర్తిగా చెల్లించాలని కేబినెట్‌ నిర్ణయించిందన్నారు. కరోనా సమయంలో జీతాలు, పింఛన్లలో విధించిన కోత డిసెంబర్‌, జనవరి నెలలో చెల్లింపులు చేస్తామని చెప్పారు. డిసెంబర్ 25న 30లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని, మూడేళ్లలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఇసుకను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించామన్నారు.

ఎంఐఎం బీజేపీ కలిసి టీఆర్ఎస్ ను ముంచేస్తాయా..!

గత కొద్ది రోజులుగా జీహెచ్ఎంసి ఎన్నికల ప్రచార సరళిని పరిశీలిస్తే ఎంఐఎం, బీజేపీ పార్టీలు తమ ప్రచారంలో తీవ్ర భావోద్వేగాలు రేపుతున్నాయి. ఈ భావోద్వేగాల మధ్య ఓటర్లకు అయితే ఎంఐఎం లేదంటే బీజేపీ మాత్రమే కనిపించేటట్లుగా ఈ రెండు పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్, అటు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ల నుండి ప్రజల దృష్టి మరల్చేలా రెండు పార్టీలు కూడబలుక్కుని వ్యవహరిస్తున్నాయి అని రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.   అయితే దీనికి బలమైన కారణం లేకపోలేదు. గతంలో హైదరాబాద్, తెలంగాణకు మాత్రమే పరిమితమైన ఎంఐఎం గడచిన కొంత కాలంగా తెలంగాణ పక్క రాష్ట్రాలలోను, అలాగే నార్త్ ఇండియాలోని పలు రాష్ట్రాలలో పోటీ చేస్తూ అక్కడి ప్రతిపక్షాల ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీ కి మేలు చేస్తోందని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బీహార్ ఎన్నికలలో ఎంఐఎం పోటీ చేసి 5 సీట్లు సాధించినప్పటికీ ఓట్లను చీల్చి ఆర్జేడీ కూటమికి అధికారాన్ని దూరం చేసి.. బీజేపీ కూటమి (ఎన్డీయే) కు లాభం చేకూర్చేలా వ్యవహరించింది.   తాజాగా పశ్చిమ బెంగాల్ లో కూడా ఇలాగే తమ రహస్య దోస్తీని కొనసాగించి తృణమూల్ ను దెబ్బ తీయాలని చూసిన బీజేపీ-ఎంఐఎం లకు ఆ రాష్ట్ర ఎంఐఎం అధ్యక్షుడు అన్వర్ హుస్సేన్ పాషా రాజీనామా చేసి పెద్ద షాక్ ఇచ్చారు. అంతేకాకుండా అయన వెళ్తూ.. వెళ్తూ చేసిన ఆరోపణలు వింటే ఈ రెండు పార్టీల రహస్య స్నేహం గుట్టు బయటపడిపోయింది. "హిందువుల ఓట్లన్నీ బీజేపీకి పడేలా ఎంఐఎం దేశవ్యాప్తంగా రాజకీయాలు చేస్తోంది. మొన్న బీహార్ ఎన్నికలలో ఇదే జరిగింది. బెంగాల్ లో ఎంఐఎంకు ఆ అవకాశం ఇవ్వదల్చుకోలేదు. బెంగాల్ కు ఓవైసీ రావడానికి వీల్లేదు. రాజకీయాలను కేవలం మతం కోసం వాడుకునే ఒవైసి వంటి కొందరికి బెంగాల్లో ఎంత మాత్రం చోటు లేదు. అది కాషాయమైనా.. ఆకుపచ్చ అయినా ఒకటే" అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ రెండు పార్టీల అసలు రంగును బయట పెట్టాయి.   ఇంతవరకు బీజేపీ ఎంఐఎం అంటే కేవలం మతతత్వ పార్టీలని... ఈ రెండు పార్టీల మధ్య వ్యవహారం ఉప్పు నిప్పు లాంటిదని సామాన్య జనం అనుకున్నారు. అయితే మహారాష్ట్ర, బీహార్ ఎన్నికలతో పాటు ఇప్పటి జీహెచ్ఎంసీ ప్రచారంలో కూడా నువ్వెంత.. అంటే నువ్వెంత అని తీవ్ర విమర్శలు చేసుకుంటున్న బీజేపీ ఎంఐఎం ల అసలు లోగుట్టు ఇదనీ.. అంతేకాకుండా రేపు బెంగాల్లో కూడా జరగబోయేదీ ఇదేనని హుస్సేన్ నిరూపించారు. మతం పేరు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఎన్నికలలో గెల్చి అధికారం చేపడుతున్న ఈ పార్టీల అసలు రంగు బయటపడడంతో ఇపుడు ప్రజలకు ఏ సాకులు చెపుతారో వేచి చూడాలి.

కరోనా పరిస్థితి దారుణం నుంచి తీవ్రంగా మారింది! కేంద్ర చర్యలపై సుప్రీం అసంతృప్తి 

కరోనా మహమ్మారి కట్టడికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. వైరస్ కట్టడికి కేవలం మార్గదర్శకాలు జారీ చేస్తే సరిపోదని, వాటిని కఠినంగా అమలయ్యేలా చూడాలని  కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా బాధితులకు చికిత్స, మృతదేహాల నిర్వహణపై విచారణ సందర్భంగా అత్యున్నత ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పరిస్థితి మరింత దిగజారుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, రాజకీయాలకు అతీతంగా మహమ్మారిపై పోరాటం చేయాలని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.     క్షేత్రస్థాయిలో మాస్క్‌లు ధరించడంలో చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటున్నారని ధర్మాసనం వెల్లడించింది. 80శాతం ప్రజలు మాస్క్‌లు పెట్టుకోవట్లేదు. మిగతా వాళ్లు పెట్టుకున్నా వాటిని దవడ కిందకు వేలాడదీస్తున్నారని తెలిపింది. పరిస్థితి దారుణం నుంచి తీవ్రంగా మారింది.. డిసెంబరులో మరింత దిగజారే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్రాలు కఠిన చర్యలు తీసుకోవాలని, మార్గదర్శకాలు కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. అన్ని రాష్ట్రాల్లో నిబంధనలు పాటించేలా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.       గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో కరోనా ఆసుపత్రిలో గత శుక్రవారం జరిగిన అగ్నిప్రమాద ఘటనపై  సుప్రీంకోర్టు ఆరా తీసింది. కేంద్రం మార్గదర్శకాలను సరిగ్గా అమలు చేయకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను తాము సుమోటాగా తీసుకున్నట్లు వెల్లడించింది. రాజ్‌కోట్‌ ఘటనపై గుజరాత్‌ ప్రభుత్వం నివేదిక సమర్పించాలని ఆదేశించింది. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నా.. వివాహాది శుభకార్యాలపై ఎందుకు నిబంధనలు తీసుకురాలేదని గుజరాత్‌ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. పరిస్థితి తీవ్రంగా ఉన్న ఎందుకు వేడుకలకు అనుమతిస్తున్నారని మండిపడింది. కరోనా పరిస్థితిపై స్టేటస్‌ రిపోర్ట్‌ ఇవ్వాలంటూ డిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌ సహా పలు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను డిసెంబరు 1వ తేదీకి వాయిదా వేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం.  

పాక్ కాల్పులు.. ఇద్దరు భారత జవాన్లు వీరమరణం

సరిహద్దులో పాకిస్తాన్ మరోసారి విధ్వంసానికి తెగబడింది. జమ్మూకశ్మీర్‌ లోని  రాజౌరీ జిల్లాలో సుందర్బనీ సెక్టార్‌లో నియంత్రణ రేఖ  వెంబడి ఏకపక్ష కాల్పులకు తెగబడింది. ఈ దాడిలో ఇద్దరు భారత జవానులు  రైఫిల్‌మన్ సుఖ్‌బీర్ సింగ్, నాయక్ ప్రేమ్ బహదూర్ ఖాత్రి  అమరులయ్యారని రక్షణ శాఖ తెలిపింది. పాకిస్తాన్‌ చేసిన ఈ దాడిని భారత సైన్యం దీటుగా ఎదుర్కొందని రక్షణ శాఖ ప్రకటించింది.   ఇటీవల జమ్మూలోని నగ్రోటా వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌ ప్రదేశంలో దొరికిన కీలక సమాచారం ఆధారంగా సరిహద్దు భద్రతా బలగాలు భారత్‌- పాకిస్తాన్‌ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి గల సుమారు 200 మీటర్ల పొడవు గల సొరంగాన్ని కనుగొన్నాయి. కొద్దిరోజుల క్రితం నలుగురు జైషే మహ్మద్‌ ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వారు భారత్‌లోకి ప్రవేశించేందుకు సొరంగ మార్గాన్ని ఎంచుకున్నట్లు రక్షణ శాఖ తెలిపింది. కశ్మీర్‌లో  ఉగ్రదాడికి పాల్పడేందుకు సిద్ధమైన ముష్కరులు, ఈ క్రమంలో 8 మీటర్ల లోతు, 200- మీటర్ల పొడవు గల సొరంగాన్ని తవ్వినట్లు గుర్తించినట్లు పేర్కొం‍ది.. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 160 మీటర్ల దూరంలో గల ఈ సొరంగం కొత్తగా తవ్విందని, దీని గుండా కశ్మీర్‌లోకి చొరబడి ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు ఉగ్రవాదులు పథకం రచించారని భద్రతా అధికారులు అభిప్రాయపడ్డారు. జమ్మూ కశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు అవరోధం కలిగించడమే వీరి లక్ష్యంగా భావిస్తున్నట్లు తెలిపారు.

ఎమ్మెల్యేలు, అభ్యర్థులకు మధ్య గ్యాప్! గులాబీ పెద్దల్లో టెన్షన్ 

ఎమ్మెల్యేకు అభ్యర్థికి మధ్య వార్. ఎమ్మెల్యేకు ఇంచార్జ్ తో విభేదాలు. ఇంచార్జులను పట్టించుకోని క్యాండిడేట్లు.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో అధికార టీఆర్ఎస్ లోని పరిస్థితి ఇది. రెండో సారి అధికారం ఖాయమని చెబుతున్న టీఆర్ఎస్ లో క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న సీన్లు ఇవి. గ్రేటర్ లో సెంచరీ కొడతామని మంత్రి కేటీఆర్ చెబుతుంటే.. అందులో సగం కూడా వస్తాయో రావేమోనన్న ఆందోళన గులాబీ నేతల్లో ఉందని చెబుతున్నారు. ప్రచారం అనుకున్నంత దూకుడుగా లేకపోవడం, అభ్యర్థులపై వ్యతిరేకత, లోకల్ ఎమ్మెల్యే పనితీరుపై అసంతృప్తి.. ఇలా చాలా కారణాలు గులాబీ నేతల భయానికి కారణమని చెబుతున్నారు.   గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 డివిజన్లు గెలిచింది టీఆర్ఎస్. అందులో 75 మందికి తిరిగి టికెట్లు ఇచ్చింది. ఇదే ఇప్పుడు అధికార పార్టీగా సమస్యగా మారింది. గతంలో చాలా మంది కార్పొరేటర్లు లోకల్ ఎమ్మెల్యేలతో విభేదించారు. కొన్ని డివిజన్లలో నువ్వెంత అంటే నువ్వెంత అన్న స్థాయి వరకు ఈ గొడవలు వెళ్లాయి. తమకు నచ్చని వారికి ఈసారి టికెట్లు రాకుండా కొందరు ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. అయితే పార్టీ మాత్రం చాాలా వరకు సిట్టింగులకే అవకాశం ఇచ్చింది. దీంతో గతంలో తమతో విభేదించిన అభ్యర్థుల డివిజన్లను ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. తన అనుకున్న వారి విజయానికి కృషి చేస్తూ.. ఇతర డివిజన్ల వైపు ఎమ్మెల్యేలు చూడటం లేదని చెబుతున్నారు. కొన్ని డివిజన్లలో తమకు నచ్చని వారిని ఓడించేందుకు కూడా కొందరు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.  పార్టీ అభ్యర్థులను విసుక్కోవడం, ఖర్చు చేయడం లేదంటూ తరచూ ఆగ్రహం వ్యక్తం చేయడం వంటివి చేస్తూ ఎమ్మెల్యేలు తప్పించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.ఎల్బీనగర్, ఖైరతాబాద్, మల్కాజ్ గిరి , ఉప్పల్ నియోజకవర్గాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలుస్తోంది.    కొన్ని ప్రాంతాల్లో  డివిజన్‌ ఇన్‌చార్జులకు లోకల్ ఎమ్మెల్యేలు  సహకరించడం లేదట. బూత్‌ ఏజెంట్ల విషయంలోనూ పేచీలు పెడుతున్నారని తెలుస్తోంది. కొన్ని డివిజన్లలో అభ్యర్థులు కూడా పార్టీ నియమించిన ఇంచార్జులను బేఖాతరు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఇంచార్జులతో సంబంధం లేకుండానే ప్రచారాలు చేసుకుంటున్నారట. కొందరు అభ్యర్థులు పార్టీలోని అందరు నేతలను కలుపుకొని పోవడం లేదని చెబుతున్నారు. కొంత మంది ఎమ్మెల్యేల తీరుతో ఇన్‌చార్జులు విస్తుపోతున్నారట. సహాయ నిరాకరణతో ఏమీ చేయలేని పరిస్థితి ఉండటంతో సైలెంటుగా ఉండిపోతున్నారట.తమకు అప్పగించిన డివిజన్లలో పార్టీ పరిస్థితిని  ఎప్పటికప్పుడు హైకమాండ్ కు నివేదిస్తున్నారట ఇంచార్జులు.   ఇంచార్జులు ఇస్తున్న నివేదికలతో అధినాయకత్వం అప్రమత్తమైనట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందనే సందేహంతో నిఘా వర్గాల ద్వారా తెప్పించుకున్న అంశా లు షాకింగ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, అభ్యర్థుల మధ్య పెరిగిన దూరం పార్టీకి చేటుగా ఇబ్బందిగా మారిందని,  20 నుంచి 25 సీట్ల ఫలితంపై ప్రభావం చూపుతుందని నివేదికలో వచ్చినట్లు  సమాచారం. దీనిపై  అధికార పక్షం దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. టికెట్లు ఇచ్చే సమయంలోనే పరస్పరం సహకరించుకోవాలని చెప్పిన తర్వాత కూడా ఇలా చేయడం ఏమిటంటూ సంబంధిత ఎమ్మెల్యేలపై ముఖ్య నేత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సొంత పంచాయితీలను పార్టీ మీద రుద్దటం ఏమిటంటూ గుస్సా అయినట్లు సమాచారం.  తీరు మార్చుకోవాలని, ఫలితంలో తేడా వస్తే బాధ్యత వహించాల్సిందేనని హెచ్చరించినట్లు సమాచారం.     అభ్యర్థుల ఎంపిక విషయంలో అధికార పార్టీ ముందు నుంచే ఆచితూచి వ్యవహరించింది. లోకల్ ఎమ్మెల్యేల ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవడంతోపాటు.. స్థానిక అంశాలపై నాలుగైదు నివేదికలు తెప్పించుకొని మరీ అభ్యర్థుల్ని ఎంపిక చేసింది. ఎమ్మెల్యేలకు, వారి పరిధిలోని అభ్యర్థులకు విభేదాలు ఉంటే సంబంధిత నేతలు ముందే కౌన్సెలింగ్‌ చేశారు. పార్టీ గెలుపు కోసం శ్రమించాలని కోరారు. అన్నింటికీ ఓకే చెప్పిన వారు.. తీరా ఎన్నికల వేళలో అనుసరిస్తున్న వైఖరి పార్టీ అధినాయకత్వానికి మింగుడు పడడం లేదని తెలుస్తోంది. పరిస్థితి ఇలా ఉంటే గ్రేటర్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చనే ఆందోళన గులాబీ పెద్దల్లో ఉందని చెబుతున్నారు.

నాకు, మా ప్రజలకు వ్యాక్సిన్ అవసరం లేదు.. బ్రెజిల్ అధ్యక్షుడి మరో వితండవాదం 

ప్రపంచం మొత్తాన్ని కరోనా గడగడలాడిస్తున్న నేపథ్యంలో దానిని ఏమాత్రం పట్టించుకోకుండా.. కనీసం మాస్క్ కూడా ధరించడానికి నిరాకరించిన గొప్ప దేశా.... ధినేతలు ఇద్దరే ఇద్దరు. వారిలో ఒకరు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కాగా మరొకరు బ్రెజిల్ అధ్యక్షడు జైర్ బోల్సనారో. ఒక పక్క తమ దేశంలో కరోనా విలయ తాండవం చేస్తుంటే కనీస జాగ్రత్తలు కూడా పాటించకుండా పెద్ద పెద్ద ర్యాలీలు జరిపి ప్రజల మరణాలకు కూడా కారణమయ్యాడు బోల్సనారో.   ఇది ఇలా ఉండగా ఒకటి రెండు నెలలలో కరోనా వ్యాక్సిన్ రానున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు తమ ప్రజలకు వ్యాక్సిన్ ఎలా అందించాలని తలమునకలవుతున్నాయి. అయితే బ్రెజిల్ అధ్యక్షుడు మాత్రం మా ప్రజలకు వ్యాక్సిన్ అవసరం లేదని ప్రకటించాడు. అసలు తాను కూడా వ్యాక్సిన్ తీసుకోనని.. అంతేకాకుండా అది తన హక్కని సంచలన వ్యాఖ్యలు చేసారు. కరోనాను ఎదుర్కొనే అంశంలో మొదటి నుంచి వ్యాక్సిన్లను వ్యతిరేకిస్తూ వస్తున్న బోల్సొనారో.. వ్యాక్సిన్ తమ ప్రజలకు అవసరం లేదు కానీ, తన శునకానికి మాత్రమే అవసరమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు.   అంతేకాకుండా గతంలో మాస్క్ పెట్టుకుంటే కరోనా రాదని గ్యారంటీ ఏంటని.. అసలు దీనికి స్పష్టమైన ప్రూఫ్ లు లేవని అడ్డంగా వాదించిన గొప్ప అధ్యక్షుడు బోల్సనారో. అంతకు ముందు ఆయనకు కరోనా సోకిన సంగతి ప్రకటించిన సందర్భంలో కూడా విలేకరుల సమావేశం నిర్వహించి ఏమాత్రం దూరం పాటించకుండా మాస్క్ తీసి మరీ తాను కరోనా పాజిటివ్ అని ప్రకటించడంతో అక్కడ ఉన్న విలేకరులు హడలిపోయారు. బోల్సనారో వితండ వాదంతో  ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాలు సంభవించిన దేశాలలో బ్రెజిల్ ది రెండో స్థానం కావడం ఇక్కడ గమనార్హం. అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఆయన హక్కు అయన ఇష్టం దానిని ఎవరు కాదనలేరు. అదేసమయంలో ప్రజలకు కూడా తమను తాము మహమ్మారి నుండి కాపాడుకునే హక్కు ఉందనే విషయాన్ని బోల్సనారో మర్చిపోయి ప్రవర్తించడం దారుణం.

మేము గెలిస్తే.. మా వాళ్ళు మిమ్మల్ని బతకనివ్వరు: మజ్లీస్ అభ్యర్థి సంచలన కామెంట్స్

జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో పొలిటికల్ పార్టీలు, నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఓల్డ్ సిటీ పై సర్జికల్ స్ట్రైక్స్ అలాగే ప్రముఖ దివంగత నేతల ఘాట్ లు కూల్చివేయాలనే వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా విన్నాము. తాజాగా కిషన్ బాగ్ డివిజన్ ఎంఐఎం అభ్యర్థి హుస్సేనీ పాషా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను తీవ్రంగా హెచ్చరిస్తూ... మిమ్మల్ని గల్లీల్లో తిరగనివ్వమంటూ స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. కిషన్ బాగ్ డివిజన్‌లో గురువారం రాత్రి ప్రచారం చేసిన ఆయన.. తాము గెలిస్తే పాతబస్తీ గల్లీలలో ప్రత్యర్థులను తిరగనివ్వమని తీవ్రంగా హెచ్చరించారు. ఎంఐఎం కార్యకర్తలు మిమ్మల్ని బతుకనివ్వరని, అంతేకాకుండా దశాబ్దాలుగా ఇక్కడే స్థిరపడి ఉన్నా.. మీరు ఇక్కడి నుండి వెళ్లిపోక తప్పదని, పరిణామాలు చాల తీవ్రంగా ఉంటాయని ఓటర్లలో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేశారు.   ఇది ఇలా ఉండగా బహదూర్ పూరా ఎంఐఎం ఎమ్మెల్యే మౌజం ఖాన్ తాము వాటర్, కరెంట్ బిల్లులు కట్టేది లేదని జిహెచ్ఎంసికి సవాల్ విసిరారు. అసలు తమను బిల్లులు అడిగే ధైర్యం ఎవరికీ లేదని అయన సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. ఎంఐఎం కు ఓటేస్తే ప్రజలు బిల్లులు కట్టాల్సిన పని లేదని అయన పేర్కొన్నారు. ఇప్పటికే ఓల్డ్ సిటీలో కరెంట్, నీటిని బిల్లులు కట్టకుండా వాడుకుంటున్నారని బీజేపీ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో సాక్షాత్తు ఎంఐఎం ఎమ్మెల్యే మౌజం ఖాన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

గ్రేటర్ ఓటర్లకు భారీగా వరాలు! నిధులపై క్లారిటీ ఇవ్వని లీడర్లు 

జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు పోటాపోటీ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఓట్ల కోసం గ్రేటర్ ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. అయితే హామీలు ఇవ్వడంలో పార్టీలు హద్దులు దాటుతున్నాయని, ప్రజలను మోసం చేస్తున్నాయనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు సాధ్యం కాని హామీలు ఇస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా పార్టీలు విడుదల చేసిన మేనిఫెస్టోల్లోని హామీలు అమలు చేయాలంటే వేల కోట్ల రూపాయలు కావాల్సిందే. దీంతో పార్టీల మేనిఫెస్టోలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.    ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు ... చలాన్లు కట్టాల్సిన పనిలేదు.. విద్యుత్, నల్లా నీళ్లు బిల్లులు ఉండవు...  ఉచితంగా ఇళ్లు కట్టిస్తాం... సిటీ బస్సులు, మెట్రో రైళ్లలో మహిళలకు టికెట్ ఉండదు.. కులాలవారీగా లబ్ధి కలిగిస్తాం... వరద బాధితులకు రూ. వేలల్లో పరిహారం. ఇవీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలకు ప్రధాన రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీలు. ఒక పార్టీ నెలకు 20 వేల లీటర్లు ఉచితం అంటే మరో పార్టీ 30 వేల లీటర్లు ఉచితమని ప్రకటించింది. ఇంకో పార్టీ నల్లా బిల్లే కట్టాల్సిన పనిలేదని చెబుతోంది. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనులను కూడా తామే చేస్తామంటూ పోటీలు పడి వరాలు కురిపిస్తున్నాయి పార్టీలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన పనులను బల్దియా ఎలా చేస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.    గతంలో ఎప్పుడు లేనంతగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఈసారి హీట్ పుట్టిస్తున్నాయి. ఎలాగైనా గెలిచేందుకు ప్రధాన పార్టీలు ఎడాపెడా హామీలిచ్చేస్తున్నాయి. అయితే చలాన్ల రద్దు, మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు, వరద సాయం రూ. 50 వేలు లాంటి హామీలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా వరద సాయం కింద బాధిత కుటుంబానికి రూ. 50 వేలు ఇస్తామని, రూ. 25 వేలు ఇస్తామని పార్టీలు చెబుతున్న మాటలు ప్రజల్లో ఆశలు రేపుతున్నా అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తారనే చర్చ కూడా జరుగుతోంది. గ్రేటర్‌ బడ్జెట్‌ పరిధి ఎంత, ఈ ఉచిత హామీల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తెచ్చి నెరవేరుస్తారనే ప్రశ్నలకు రాజకీయ పార్టీల దగ్గరే సమాధానమే ఉండటం లేదు.      గ్రేటర్ లో రూ. 10 వేల కోట్ల ప్రత్యేక నిధి, డబుల్‌ బెడ్రూం ఇళ్లు, ఉచిత విద్యుత్, ఆస్తిపన్ను రద్దు, ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు లాంటివి అమలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే జీహెచ్‌ఎంసీ తరఫున ఎలా చేస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శాంతి భద్రతలు పూర్తిగా రాష్ట్ర సర్కార్ పరిధిలో ఉంటాయి. అయితే  పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామనే హామీలు కూడా కొన్ని పార్టీలు ఇస్తున్నాయి. కేంద్ర సర్కార్ పరిధిలోకి వచ్చే అంశాలు, అక్కడి నుంచి వచ్చే నిధులు కూడా నేరుగా జీహెచ్‌ఎంసీకి వచ్చే పరిస్థితి లేని నేపథ్యంలో హామీలు ఎలా అమలు చేస్తారన్న అనుమానాలు ఓటర్లలో వ్యక్తమవుతున్నాయి. హామీలు ఇవ్వడంలో తప్పు లేదు కాని.. ఇలా తమ పరిధిలో లేని అంశాలు, సాధ్యం కాని హామీలను మేనిఫెస్టోలో పెట్టి ప్రజలను మోసం చేయడం సరికాదనే అభిప్రాయం మేధావులు, ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.

గ్రేటర్ లో స్వింగ్ ఓటర్లే కీలకం! ఈసారి ఎటువైపో? 

ఎన్నికల్లో స్వింగ్ అనే పదం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎక్కువగా వినిపిస్తుంది. ఎన్నికల్లో విజయానికి కీలకంగా ఉండే వాటిని స్వింగ్ అంటారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఏడు రాష్ట్రాలు కీలకంగా ఉంటాయి. అక్కడ ఎవరికి మెజార్టీ వస్తే వారే యూఎస్ ప్రెసిడెంట్ అవుతుంటారు. అందుకే అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల్లో ఆ ఏడు రాష్ట్రాలను స్వింగ్ రాష్ట్రాలు అంటారు. 2016లో స్వింగ్ రాష్ట్రాల్లో స్వీప్ చేసి ట్రంప్ గెలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్వింగ్ రాష్ట్రాలు జోబిడెన్ కు జై కొట్టడంతో ఆయనే ప్రెసిడెంట్ పీఠం అధిష్టించారు.    అమెరికా తరహాలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ స్వింగ్ ఓటర్లున్నారని, వారే పార్టీల భవితవ్యాన్ని తేల్చనున్నారు. స్థానిక పరిస్థితులు, రాజకీయ పరిణామాలు, సమీకరణాలను అనుగుణంగా అభిప్రాయాలను మార్చుకునే స్వింగ్​ ఓటర్లు డివిజన్ లో  18 శాతం వరకు ఉంటారని చెబుతున్నారు. గ్రేటర్ లోని దాదాపు 60  నుంచి 70  డివిజన్లలో స్వింగ్ ఓటర్లే కీలకం.  విద్యావంతులు, రాజకీయాలు, అభివృద్ధి అంచనా వేసేవారు, సమీకరణాలను చూసి గెలుపోటములు నిర్ధారించుకునే వారంతా స్వింగ్​ ఓటర్ల జాబితాలో ఉంటారు. ప్రస్తుతం గ్రేటర్ లో ఈసారి  రాజకీయ పార్టీలతో పాటు అన్ని వర్గాల అభ్యర్థులకు స్వింగ్​ ఓటర్లు ఎవరి పక్షాన ఉంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. అన్ని పార్టీలు ఇప్పటి నుంచే పోలింగ్​ సరళిని అంచనా వేసుకుంటున్నాయి. ప్రలోభాలతో పోలయ్యే ఓట్లు కొన్నింటిని ఖాతాల్లో వేసుకుంటున్నారు. ఆ తర్వాత సామాజిక వర్గాలు, కుల ప్రాతిపదికన, పథకాలకు ఆకర్షుతులు, ఏండ్ల తరబడి ఒకే పార్టీకి మద్దతుగా ఉండే ఓటర్ల వారీగా వివరాలు సేకరించుకుంటూ గెలుపోటములను అంచనా వేసుకుంటారు. అయితే  స్వింగ్​ ఓటర్లను మాత్రం అభ్యర్థులు, పార్టీలు అంచనా  వేయలేకపోతున్నాయి.   2016 గ్రేటర్​ ఎన్నికల్లో స్వింగ్​ ఓటర్లు మొత్తం అధికార పార్టీకి అండగా నిలిచారు. అందుకే కారు పార్టీ ఏకపక్ష విజయాలు సాధించి గతంలో ఎప్పుడు లేనట్టుగా ఏకంగా 99 డివిజన్లు గెలుచుకుంది. అయితే ఈసారి అలాంటి పరిస్థితులు లేవంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ప్రభావం గ్రేటర్ లో కనిపిస్తుందని, స్వింగ్ ఓటర్ల మైండ్ సెట్ లోనూ మార్పు వస్తుందని తెలుస్తోంది. ఎల్​ఆర్​ఎస్​, బీఆర్​ఎస్​ వంటి స్కీంలు ప్రభుత్వంపై కొంత వ్యతిరేకతను పెంచాయని చెబుతున్నారు. కార్పొరేటర్ల అవినీతి, అక్రమ వ్యవహారాలపై చాలా అయిష్టతతో ఉన్నారట స్వింగ్ ఓటర్లు. దీంతో స్వింగ్​ ఓటర్లతో అధికార పార్టీకి కొంత ముప్పు ఉందని ప్రచారం జరుగుతోంది.    సాధారణంగా గెలిచే అవకాశాలున్న అభ్యర్థుల వైపు స్వింగ్ ఓటర్లు మొగ్గు చూపుతుంటారు. దీంతో వీరి ఓట్లు ఎవరికి లాభం చేకూర్చుతాయనేది సందేహంగానే మారింది. సికింద్రాబాద్ పరిధిలో స్వింగ్ ఓటర్లు బీజేపీకి మద్దతు ఇవ్వవచ్చని అంచనా వేస్తున్నారు. ఐటీ ఉద్యోగులు ఎక్కువుండే శేరిలింగం పల్లి ఏరియాలో కారుకు సపోర్ట్ చేయవచ్చంటున్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో స్వింగ్ ఓటర్లు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఉప్పల్​, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో  టీఆర్​ఎస్​, బీజేపీకి సమాన అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.సెటిలర్ ఓటర్లు ఎక్కువుండే కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో స్వింగ్ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తిగా మారింది.సెటిలర్లు ఎటువైపు మొగ్గు చూపితే వారికి ఫలితాలు వారికి అనుకూలంగా ఉంటాయని చెబుతున్నారు.

మానవత్వం మరిచి ఎస్సీ రైతులకి సంకెళ్లు వేసి జైళ్లో పెట్టారు: నారా లోకేష్

కృష్ణాయపాలెం ఎస్సీ రైతులకు జగన్ ప్రభుత్వం మానవత్వం మరిచి సంకెళ్లు వేసి జైళ్లో పెట్టిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. తమను జగన్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందంటూ బెయిల్ పై  విడుదలైన రైతులు లోకేశ్ తో సమావేశమై కన్నీటి పర్యంతమయ్యారు. వారిని పరామర్శించిన లోకేష్ అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేసినవారే కంప్లైంట్ వెనక్కి తీసుకున్నా రైతులకు సంకెళ్లు వేయించటం జగన్ రెడ్డి శాడిజానికి పరాకాష్ట అని దుయ్యబట్టారు.   "దాడులు దౌర్జన్యాలెన్నో భరిస్తూ ఎంతకాలమైనా వెన్నుచూప‌ని అమ‌రావ‌తి ప‌రిర‌క్షణ ఉద్యమందే అంతిమ విజ‌యమని లోకేష్ స్పష్టం చేశారు.  రైతుల పోరాటానికి తెలుగుదేశం పార్టీ అండ‌గా ఉంటుందని హామీ ఇచ్చారు. అన్నం పెట్టే అన్నదాతలు భూతల్లిని రాజధాని కోసం చేసిన త్యాగాలను లోకేష్ కొనియాడారు. అమ‌రావ‌తిని చంపేసే కుట్రల్ని నిర‌సిస్తూ శాంతియుతంగా ఉద్యమిస్తున్నవాళ్లని గుర్తు చేశారు. తమ త్యాగాల పునాదుల‌పై ఏర్పడిన ప్రజారాజ‌ధానికి స‌మాధి క‌ట్టొద్దంటూ నిన‌దించిన కృష్ణాయ‌పాలెం రైతులు, మూడుముక్కలాట‌కి మ‌ద్దతుగా వ‌చ్చిన బిర్యానీ ఆర్టిస్టుల్ని అడ్డుకోవ‌డ‌మే నేరంగా ప‌రిగ‌ణించి, ఎస్సీల‌పైనే ఎస్సీ, ఎస్టీ కేసు జగన్ రెడ్డి పెట్టించారని లోకేష్ ధ్వజమెత్తారు.

కేసీఆర్ దొర మాస్టర్ ప్లానే వేశారు! విజయశాంతి ట్వీట్

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. మూడు రోజుల్లో ప్రచారం ముగియనుండటంతో అభ్యర్థులు స్పీడ్ పెంచారు. అయితే గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి సీఎం కేసీఆర్ పై ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు విజయశాంతి. ఎంఐఎం పార్టీ మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే... కేసీఆర్ దానిని కట్టడి చేయలేకపోయారని ఆరోపించారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే వారిని కంట్రోలే చేయకపోగా.. ఎంఐఎం దౌర్జన్యాన్ని నిలదీసిన పార్టీలను నియంత్రించే విధంగా పోలీసు బలగాలను ప్రయోగించడానికి సీఎం దొరగారు మాస్టర్ ప్లాన్ వేశారనే వార్తలు వస్తున్నాయని విజయశాంతి ట్వీట్ చేశారు.    'ఇంతకాలం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను హైజాక్ చెయ్యడం లేదా ఎన్నికలు పూర్తయిన తర్వాత గెలిచిన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను ప్రలోభపెట్టి ఫిరాయింపులను ప్రోత్సహించడం కేసీఆర్ గారికి అలవాటుగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇలాంటి రాజకీయాలు ఫలించవనే నిర్ణయానికి రావడంతో ఏకంగా బలమైన ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను శాంతిభద్రతల పేరుతో బరిలో నుంచి తప్పించడానికి గులాబీ బాస్ కొత్త ఎత్తుగడ వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ కుట్రలకు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తే తెలంగాణ సమాజం సహించదు, క్షమించదు అని రాములమ్మ ట్వీట్ లో చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్షాల దూకుడును తట్టుకోలేక బెంబేలెత్తిపోతున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఎంఐఎంతో కలసి కుట్రలు చేసి ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను చివరి క్షణంలో పోటీ నుంచి తప్పించేందుకు కుయుక్తులు పన్నుతున్నారనే అనుమానాలు బలపడుతున్నాయని ఆమె  ట్వీట్ చేశారు.

కేసీఆర్ సభ టైంలోనే ప్రధాని టూర్! గ్రేటర్ వ్యూహమేనా?  

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో హోరాహోరీ పోరు సాగుతున్న సమయంలో ప్రధాని మోడీ హైదరాబాద్ రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోడీ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకే వస్తున్నా.. గ్రేటర్ ఎన్నికల సమయంలో పర్యటన ఉండటం పొలిటికల్ హీట్ పెంచుతోంది. అందులోనూ సీఎం కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల సభ ఉన్న రోజునే.. అదే సమయానికే మోడీ హైదరాబాద్ వస్తుండటం మరింత చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ ప్రచారంలో టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.  వ్యక్తిగత ఆరోపణలు, దూషణలు, రెచ్చగొట్టే ప్రసంగాలతో గ్రేటర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది.    ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన పూర్తిగా అధికారిక కార్యక్రమమే అయినా.. ఎంపిక చేసుకున్న సమయంపై రాజకీయ ఆసక్తి నెలకొంది. సాధారణంగా ప్రధాని పర్యటన ఉంటే రాష్ట్రాల అధికారులకు వారం రోజుల ముందే సమాచారం వస్తుంది. ప్రధాని పర్యటనకు పోలీసులు ఏర్పాట్లు చేసుకోవడానికి వీలుగా ఇలా వారం రోజుల ముందే చెబుతారు. కాని ఈసారి ప్రధాని పర్యటనకు సంబంధించిన సమాచారం రాష్ట్ర అధికారులకు కేవలం రెండు రోజుల ముందే వచ్చింది. దీంతో పోలీసులు హడావుడిగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. దీన్ని బట్టే  ప్రధాని హైదరాబాద్ పర్యటన అకస్మాత్తుగా ఫిక్స్ అయిందని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చగా మారింది.    జీహెచ్‌ ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా  శనివారం సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం టీఆర్ఎస్ ఏర్పాట్లు కూడా చేస్తుంది. అయితే శనివారమే ప్రధాని మోడీ హైదరాబాద్ వస్తున్నట్లు గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. కోవిడ్‌–19 వైరస్‌కు విరుగుడుగా  నగరానికి చెందిన భారత్‌ బయోటెక్‌ ఫార్మా కంపెనీ తయారుచేస్తున్న ‘కొవాగ్జిన్‌’ పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు ప్రధాని వస్తున్నారని కేంద్ర సర్కార్ సమాచారమిచ్చింది. 28న మధ్యాహ్నం ఢిల్లీ నుంచి నేరుగా మోదీ హకీంపేట సైనిక విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి శామీర్‌పేట వద్ద గల భారత్‌ బయోటెక్‌ ల్యాబ్‌ను సందర్శిస్తారు. వ్యాక్సిన్‌ రూపకల్పనకు కృషిచేస్తున్న శాస్త్రవేత్తల బృందంతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం పుణె పర్యటనకు వెళ్తారని అధికారవర్గాలు తెలిపాయి.   ఎల్బీ స్టేడియంలో 30 వేలమందితో బహిరంగసభ నిర్వహించి గ్రేటర్‌ ఎన్నికల వాతావరణాన్ని టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మలచుకోవాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్‌ ఉన్నారు. సరిగ్గా అదేరోజు ప్రధాని మోడీ అధికారిక పర్యటన ఖరారు కావడం వెనక బీజేపీ వ్యూహం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రేటర్‌ ఎన్నికల్లో దూకుడుగా వెళుతూ ఓటర్లను ఆకర్షించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. చివరి అస్త్రంగా ప్రధాని మోడీని నగరానికి రప్పిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. సీఎం బహిరంగసభ రోజే ప్రధాని నగర పర్యటన జరిగితే జాతీయ మీడియాతో పాటు స్థానిక మీడియాలోనూ ప్రధాని పర్యటనకు అధిక ప్రచారం లభించే అవకాశాలున్నాయని.. బల్దియా ఎన్నికల్లో బీజేపీకి ప్రధాని పర్యటన కొంత వరకు కలిసొచ్చే సూచనలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ స్థాయి ముఖ్య నేతలు  బల్దియాలో ఎన్నికల ప్రచారం చేశారు. జేపీ నడ్డా, యూపీ సీఎం యోగీ ఆధిత్యనాథ్ ను కూడా బీజేపీ రంగంలోకి దింపింది.         జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటి 2023లో జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో గెలుపునకు బాటలు వేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. అందుకే అన్ని అస్త్రాలను ప్రయోగిస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  తమను గెలిపిస్తే గ్రేటర్ ప్రజలందరికి కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని బీజేపీ హామీ ఇవ్వడం.. ప్రధాని మోడీ కూడా కరోనా వ్యాక్సిన్ తయారీని పరిశీలించేందుకు వస్తుండటం ఆసక్తిగా మారింది. ఇది కచ్చితంగా కమలనాధులకు కలిసి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  బీజేపీ నేతలు మాత్రం ప్రధాని మోడీ పర్యటనకు గ్రేటర్ ఎన్నికలకు సంబంధం లేదని చెబుతున్నారు.కరోనాపై ఇటీవలే సీఎంలతో ప్రధాని సమీక్ష నిర్వహించారని, అందులో వచ్చిన అభిప్రాయాల మేరకే కరోనా వ్యాక్సిన్ తయారీని పరిశీలించేందుకు ప్రధాని వస్తున్నారని క్లారిటీ ఇస్తున్నారు.   మరోవైపు  ప్రధాని మోడీ అధికారిక పర్యటన కోసం నగరానికి వస్తే ప్రొటోకాల్‌ ప్రకారం సీఎం కేసీఆర్‌ సైతం ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఆ తరువాతే కేసీఆర్‌ ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగసభకు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.