కాంగ్రెస్ లో ఒకే ఒక్కడు! ఆయనపైనే గ్రేటర్ ఆశలు

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. గెలుపు కోసం అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీలు ప్రచారంలో దూకుడుగా కనిపిస్తుండగా.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రం వెనకబడిపోయినట్లు కనిపిస్తోంది. ముందు కొంత ఉత్సాహంగా ఉన్నా పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది కాంగ్రెస్ అభ్యర్థులు కాడి ఎత్తేస్తున్నట్లు కనిపిస్తుందనే చర్చ జరుగుతోంది. మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఒక్కడే గ్రేటర్ లో కాంగ్రెస్ గెలుపు  కోసం ముమ్మర ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డ ప్రచారానికి ప్రజల్లోనూ మంచి స్పందన కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి కూడా రోజు 10 డివిజన్ల వరకు రోడ్ షో నిర్వహిస్తున్నారు. అయితే  ఆయనకు మద్దతుగా ఇతర కాంగ్రెస్ నేతలెవరు గ్రేటర్ ప్రచారంలో యాక్టివ్ గా కనిపించడం లేదు. పీసీసీ ముఖ్య నేతలు కూడా హైదరాబాద్ ప్రచారంలో అంతంత మాత్రంగానే కనిపిస్తున్నారు.    గ్రేటర్ ఎన్నికలను సవాల్ గా తీసుకున్న బీజేపీ ప్రచారంలో  కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాలు సీఎంలు, ఆ పార్టీ జాతీయ నేతలు పాల్గొంటున్నారు. టీఆర్ఎస్ అయితే రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులందరిని గ్రేటర్ లోనే మోహరించింది. డివిజన్ కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీని ఇంచార్జ్ గా పెట్టడంతో .. వారంతా గల్లి గల్లీ తిరిగి టీఆర్ఎస్ అభ్యర్థుల కోసం ఓట్లు అడుగుతున్నారు. ర్యాలీలు, సభలు నిర్వహిస్తూ హడావుడి చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ కూడా ఉదయం హుషార్ హైదరాబాద్ సభలు, సాయంత్రం రోడ్ షోలు నిర్వహిస్తూ కారు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. కాంగ్రెస్ లో మాత్రం రేవంత్ రెడ్డి ఒక్కడే ఆ పార్టీ అభ్యర్థులకు దిక్కయ్యారని చెబుతున్నారు. ఇతర నేతలు చురుకుగా లేకపోవడం, ప్రచారానికి వచ్చినా ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో.. కాంగ్రెస్ అభ్యర్థులంతా తమ డివిజన్ లో ప్రచారం చేయాలని రేవంత్ రెడ్డిని అభ్యర్థిస్తున్నారని చెబుతున్నారు. అయితే సమయం తక్కువగా ఉండటంతో రేవంత్ రెడ్డి కూడా అన్ని డివిజన్లకు వెళ్లలేకపోతున్నారని చెబుతున్నారు.   తమ  పార్టీ నేతల సహకారం లేకపోవడం.. టీఆర్ఎస్, బీజేపీ దూకుడుగా ఉండటంతో కాంగ్రెస్ అభ్యర్థులు చాలా మంది గ్రేటర్ రేసు నుంచి ముందే తప్పుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొంత మంది అభ్యర్థులు ప్రచారం కూడా ఆపేశారని చెబుతున్నారు. అధికార పార్టీతో పాటు బీజేపీ అభ్యర్థులు భారీగా ఖర్చు చేస్తుండటంతో.. వారిని తట్టుకోవడం సాధ్యం కాదని భావిస్తున్న కొందరు కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారం సమయంలోనే హ్యాండప్ అంటున్నారని సమాచారం. గ్రేటర్ లో 150 డివిజన్లు ఉండగా... పాతబస్తిలోనే 50 వరకు ఉన్నాయి. అక్కడ ఎంఐఎంకి తప్ప ఏ పార్టీకి ఆశలు ఉండవు. మిగిలిన వంద డివిజన్లలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. ఇందులో ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులు కేవలం 20 నుంచి 25 స్థానాల్లో మాత్రం ప్రత్యర్థులకు పోటీ ఇస్తుందని తెలుస్తోంది. ముందు దాదాపు 60 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు ఉత్సాహంగానే ప్రచారం చేసినా.. పరిస్థితులను బట్టి చాలా మంది హస్తం అభ్యర్థులు వెనక్కి తగ్గారని చెబుతున్నారు.   కాంగ్రెస్ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్న డివిజన్లు అన్ని మల్కాజ్ గిరి లోక్ సభ పరిధిలోనే ఉన్నాయని తెలుస్తోంది. ఎంపీ రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్లే అక్కడ కాంగ్రెస్ పోటీ ఇస్తుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తన ఎంపీ పరిధిలోకి వచ్చే మల్కాజ్ గిరి, ఎల్బీ నగర్, ఉప్పల్, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపారు రేవంత్ రెడ్డి. వారి కోసం ప్రచారం కూడా ముమ్మరంగా చేస్తున్నారు. దీంతో ఈ నాలుగు నియోజకవర్గాల పరిధిలోనే కాంగ్రెస్ అభ్యర్థులు రేసులో ఉన్నారని, మిగితా అన్ని నియోజకవర్గాల్లో ముందే చేతులెత్తేశారని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రచారానికి మంచి స్పందన వస్తుండటంతో కుత్బుల్లాపూర్, ఉప్పల్, మల్కాజ్ గిరి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు మంచి ఫలితాలు రావచ్చని చెబుతున్నారు. ఎల్బీ నగర్ లో రేవంత్ రెడ్డి క్రేజీ  ఉన్నప్పటికి.. కొందరు ముఖ్యనేతలు బీజేపీలో చేరడంతో  కాంగ్రెస్ కు బలమైన అభ్యర్థులు దొరకలేదని తెలుస్తోంది. మొత్తంగా గ్రేటర్ కాంగ్రెస్ గెలుపు భారమంతా రేవంత్ రెడ్డిపైనే పడిందని, ఆయన కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. మరీ ఒకే ఒక్కడుగా పోరాడుతున్న రేవంత్ రెడ్డి.. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు సాధించి పెడతారో చూడాలి మరీ...

సంఘ విద్రోహ శక్తులను అణిచివేయండి! పోలీసులకు స్వేచ్చ ఇచ్చిన కేసీఆర్ 

తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్న కొన్ని అరాచక శక్తులు హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో ఘర్షణలు సృష్టించి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కుట్ర పన్నుతున్నాయని, వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి పోలీసు అధికారులను ఆదేశించారు. అరాచక శక్తుల కుట్రలకు సంబంధించి ప్రభుత్వానికి ఖచ్చితమైన సమాచారం ఉందని సిఎం అన్నారు. హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడమే అత్యంత ప్రధానమని, సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకునే వ్యక్తులు, శక్తుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని, సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని చెప్పారు. సంఘ విద్రోహ శక్తులను అణచివేసే విషయంలో పోలీసులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇస్తుందని సిఎం ప్రకటించారు.   రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డి.జి.పి. మహేందర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సిపిలు అంజనీ కుమార్, విసి సజ్జనార్, మహేశ్ భగవత్, అడిషనల్ డిజిపి జితేందర్, ఐజిలు స్టీఫెన్ రవీంద్ర, వై. నాగిరెడ్డి, నిజామాబాద్ ఐజి శివ శంకర్ రెడ్డి, వరంగల్ ఐజి ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.   జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా రాజకీయ లబ్ది పొందడానికి కొందరు అనేక కుట్రలు చేస్తున్నారు. మొదట సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేశారు. మార్ఫింగ్ ఫోటోలతో ప్రజలను ఏమార్చాలని చూశారు. తర్వాత మాటలతో కవ్వింపు చర్యలకు పూనుకున్నారు. అయినప్పటికీ సహజంగానే శాంతి కాముకులైన హైదరాబాద్ ప్రజలు వారి కవ్వింపు మాటలను, అబద్ధపు ప్రచారాన్ని పట్టించుకోలేదు. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజల నుంచి స్పందన రావడం లేదు. డబ్బులు పంచి ఓట్లు దండుకోవాలనే ప్రయత్నాలు కూడా హైదరాబాద్ లో నడవవు అని వారికి తెలిసింది. దీంతో వారు మరింత దిగజారి రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఘర్షణలు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు. రాష్ట్రంలోని ఏ కరీంనగర్లోనో, వరంగల్ లోనో, ఖమ్మంలోనో, మరో చోటనో గొడవలు రాజేసి, దాన్ని హైదరాబాద్ లో విస్తృత ప్రచారం చేయాలని చూస్తున్నారు. హైదరాబాద్ నగరంలో కూడా ఏదో ఓ చోట గొడవ పెట్టుకోవాలని, దానికి మతం రంగు పూయాలని, ప్రార్థనా మందిరాల దగ్గర ఏదో ఓ వికృత చేష్ట చేయాలని చూస్తున్నారు. అలా చేసి ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. పెద్ద ఎత్తున గొడవలు చేసి, ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి అసలు జిహెచ్ఎంసి ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకుండా చేయాలని, ఎన్నికలు వాయిదా వేయించాలని పక్కా ప్రణాళిక రచించారు. దీనికి సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్ద ఉంది అని సిఎం కేసీఆర్ చెప్పారు.    హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో శాంతి సామరస్యాలు యథావిధిగా కొనసాగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఎట్టి పరిస్థితుల్లో సంఘ విద్రోహ శక్తుల ఆటలు సాగనీయవద్దు. ఎంతో పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. కడుపు కట్టుకుని, నోరు కట్టుకుని నిబద్ధతతో పనిచేసి రాష్ట్రాన్ని ఓ దరికి తెచ్చాం. శాంతిభద్రతల పరిరిక్షణలో రాజీలేకుండా వ్యవహరిస్తున్నాం. పేకాట కబ్బులు, గుడుంబా లాంటి మహమ్మారులను దూరం చేశాం. సంఘ విద్రోహ శక్తుల పట్ల, మాఫియాల పట్ల, విచ్చిన్నకర శక్తుల పట్ల టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించిందో ప్రజలు చూశారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. శాంతి భద్రతలను కాపాడే విషయంలో, సంఘ విద్రోహ శక్తులను అణచివేసే విషయంలో ప్రభుత్వం మొదటి నుంచి రాజీలేని ధోరణి అవలంభిస్తున్నది. కాబట్టే నేడు హైదరాబాద్ నగరం, రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. ప్రజలు సుఖంగా ఉన్నారు. ఎవరి పని వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నారని చెప్పారు కేసీఆర్.   ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి సేఫ్ సిటీ అనే మంచి పేరు వచ్చింది. పెద్ద ఎత్తున పెట్టుబడులు నగరానికి వస్తున్నాయి. యువకులకు ఉపాధి దొరుకుతున్నది. హైదరాబాద్ మహా నగరంలో మూడు కమిషనరేట్ల పరిధిలో దాదాపు కోటి 60 లక్షల జనాభా ఉంది. ఈ నగరాన్ని కాపాడుకోవడం ప్రభుత్వానికున్న ప్రధాన బాధ్యత. ప్రభుత్వానికి ఈ రాష్ట్రం బాగుండడం ముఖ్యం. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండడం ముఖ్యం. ఇక్కడి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించడం ముఖ్యం. ప్రశాంత హైదరాబాద్ నగరంలో, తెలంగాణకు గుండె కాయ లాంటి హైదరాబాద్ లో మత విద్వేషాలు రెచ్చగొట్టి, మత ఘర్షణలు పెట్టి, రాజకీయ లబ్ది పొందాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ నగర ప్రశాంతతను ఫణంగా పెట్టి ఎవరినో క్షమించాల్సిన అవసరం లేదు. ఘర్షణలు సృష్టించే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలి. ఎంతటి వారినైనా సరే, వారు అధికార పార్టీ సభ్యులైనా సరే వదలొద్దు. ఎక్కడికక్కడ సమాచారం సేకరించి, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి కుట్రలను భగ్నం చేయాలని అని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు.    ప్రశాంత హైదరాబాద్ లో మత చిచ్చు పెట్టడానికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నాలు చేసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఉద్వేగాలు, ఉద్రేకాలు రెచ్చగొట్టే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవద్దని యువకులను కోరారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్య బద్ధంగా, పారదర్శకంగా పోరాడాలని రాజకీయ పార్టీలను కోరారు. పోలీసు యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లో అరాచక, సంఘ విద్రోహ శక్తుల కుట్రలు భగ్నం చేసి తీరుతామని పోలీసు అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. హైదరాబాద్ లోనే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉంటారని, ఎక్కడ ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా చూస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

బీజేపీలోకి స్వామి గౌడ్! కారుకు ఇక పంక్చర్లేనా?

టీఆర్ఎస్ లో అసమ్మతి బాంబ్ పేలబోతుందా? కేసీఆర్ కు షాకిచ్చేందుకు నేతలు ఒక్కొక్కరుగా సిద్ధమవుతున్నారా? కారు పార్టీకి ఇకపై వరుస కష్టాలేనా? తెలంగాణలో జరుగుతున్న రాజకీయ మార్పులతో జనాల్లో ఇదే చర్చ జరుగుతోంది. శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ బీజేపీలో చేరడంతో.. ఆయన బాటలోనే మరికొందరు గులాబీ నేతలు కమలం గూటికి చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. కేసీఆర్ తీరుపై గుర్రుగా ఉన్న నేతలంతా బయటికి రాబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.    శాసనమండలి మాజీ చైర్మెన్ స్వామి గౌడ్ కొంత కాలంగా కేసీఆర్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. శాసనమండలి చైర్మెన్ పదవి కాలం ముగిసాకా ఆయనను పట్టించుకోవడమే మానేశారట టీఆర్ఎస్ పెద్దలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి పోటీకి సిద్ధమైన స్వామి గౌడ్ కు టికెట్ ఇవ్వలేదు. లోక్ సభ ఎన్నికల్లో చేవెళ్ల టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినా అది కూడా జరగలేదు. దీంతో కేసీఆర్ వైఖరి, టీఆర్ఎస్ సర్కార్ పై చాలా సార్లు అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తపరిచారు స్వామి గౌడ్. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులందరిని ఏకం చేసిన తనకు ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదని ఆయన ఆగ్రహంగా ఉన్నారనే ప్రచారం జరిగింది. రెండు నెలల క్రితం కూడా హాట్ కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ లో బీసీ నేతలను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. దీంతో స్వామి గౌడ్ పార్టీ మారతారని ప్రచారం జరిగినా ఆయన ఖండిస్తూ వచ్చారు.    దుబ్బాక ఉప ఎన్నిక విజయంతో స్పీడ్ పెంచిన బీజేపీ.. మూడేళ్ల తర్వాత జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే గులాబీ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఇటీవలే స్వామిగౌడ్‌తో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్‌ సమావేశమై బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. అయితే అప్పుడు చేరికను నిర్దారించని స్వామి గౌడ్.. ఢిల్లీకి వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. స్వామి గౌడ్ చేరికతో గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి భారీగా ప్రయోజనం కలగనుంది కమలం నేతలు చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులను ఏకతాటిపై నడిపిన స్వామి గౌడ్ కు.. ఇప్పటికే ఉద్యోగ సంఘాలపై పట్టుంది. గ్రేటర్ ఓటర్లలో లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారు. వారంతా ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేయవచ్చని భావిస్తున్నారు. నగరంలోని గౌడ సామాజిక వర్గం కూడా బీజేపీ వైపు మెగ్గుచూపుతుందని భావిస్తున్నారు.                   స్వామి గౌడ్ బీజేపీలో చేరడంతో తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. స్వామి గౌడ్ బాటలోనే చాలా మంది టీఆర్ఎస్ నేతలు కారు దిగి కమలం గూటికి చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన చాలా మంది నేతలకు ఇప్పటి వరకు ఎలాంటి పదవులు రాలేదు. అలాంటి వారంతా బీజేపీలో చేరుతారని చెబుతున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ బీటీ, యూటీ బ్యాచ్ లుగా విడిపోయిందన్న చర్చ జరుగుతోంది. బంగారు తెలంగాణ.. బీటీ బ్యాచ్ హవానే పార్టీలో సాగుతుందని.. ఉద్యమ తెలంగాణ నేతలకు అన్యాయం జరుగుతుందన్న విమర్శలు ఉన్నాయి. పలుసార్లు స్వామిగౌడ్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. దీంతో ఇప్పుడు యూటీ బ్యాచ్ నేతలంతా బీజేపీ వైపు వస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు కమలం నేతలతో టచ్ లోకి వచ్చారని చెబుతున్నారు. గ్రేటర్ ఎన్నికల్ల బీజేపీ విజయం సాధిస్తే .. ఆ పార్టీలోకి వలసలు మరింత పెరుగుతాయంటున్నారు.    మరోవైపు స్వామి గౌడ్ చేరికతో తమకు మరింత బలం వచ్చిందని భావిస్తున్న తెలంగాణ బీజేపీ నేతలు.. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ కు ముందే మరిన్ని చేరికలకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. గ్రేటర్ ప్రచారానికి జేపీ నడ్డా రానుండటంతో.. ఆయన సమక్షంలో మరికొందరు టీఆర్ఎస్ నేతలు కాషాయ కండువా కప్పుకునేలా కసరత్తులు చేస్తున్నారట. మొత్తంగా స్వామి గౌ]డ్ తో మొదలైన టీఆర్ఎస్ నుంచి జంపింగ్ లు కొనసాగుతూనే ఉంటాయని, టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి ఊహించని విధంగా చేరికలు ఉంటాయని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు. కొందరు పెద్ద నేతలు కూడా కమలం పెద్దలతో మాట్లాడుతున్నారని కూడా బాంబ్ పేల్చుతున్నారు.

హామీల ‘బండి’ పరుగులు తీసేనా?

గ్రేటర్‌లో ‘సంజయ్’ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్   ఇచ్చిన హామీలకు నిధులెలా?   ట్రాఫిక్, ఎల్‌ఆర్‌ఎస్‌తో ‘గ్రేటర్’కు సంబంధమేమిటో?   తెలంగాణలో బీజేపీ ‘సంజయ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్’.. అధికార టీఆర్‌ఎస్  పార్టీ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. కేసీఆర్ సర్కారును ఊపిరాడనీయకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంజయ్.. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో,  బస్తీనిద్ర చేసే వరకూ వెళుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక విజయం ఇచ్చిన టానిక్.. అందరికంటే సంజయ్‌కే ఎక్కువ పనిచేస్తున్నట్లు గ్రేటర్‌లో ఆయన దూకుడు చూస్తే స్పష్టమవుతోంది. అందుకే ఎవరూ ఊహించని హామీలు వరదలా పారిస్తూ, అందరినీ తన వైపు మళ్లించుకునే ప్రయత్నం చేస్తున్నారు.   సహజంగా ఏ ఎన్నికలప్పుడయినా,  మేనిఫెస్టోలు విడుదల చేయడం అన్ని పార్టీలకూ అలవాటే. ప్రధానంగా.. అధికారంలో ఉన్న పార్టీలు,  స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు విడుదల చేసే మేనిఫెస్టోకు ఎక్కువ విలువ-నమ్మకం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఆ పార్టీనే అధికారంలో ఉంటుంది కాబట్టి, అది ఇచ్చే హామీలే ఎక్కువ మేరకు పనిచేసే అవకాశం ఉంటుంది. అదే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఎన్ని హామీలిచ్చినా,  వాటిని ప్రజలు నమ్మే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. ప్రభుత్వంలో ఒక పార్టీ ఉంటే, కార్పొరేషన్‌లో మరో పార్టీ అధికారంలోకి వస్తే పనులు జరగవు. పైగా ప్రతిరోజూ ఘర్షణ వాతావరణం ఉంటుంది. ఈ ఒక్క కారణంతోనే ప్రజలకు.. ప్రభుత్వాలపై వ్యతిరేకత, ప్రతిపక్షాలపై సానుకూలత ఉన్నప్పటికీ, ఓటు మాత్రం అభివృద్ధి కోణంలో, అధికారంలో ఉన్న పార్టీకే వేస్తుంటారు. ఇది ఎక్కడయినా సహజమే.   గతంలో చెన్నై నగరంలో ఇదే జరిగింది. అధికారంలో అన్నాడిఎంకె ఉంటే, మేయర్ పదవి డీఎంకె చేతిలో ఉండేది. ఆ సమయంలో జరిగిన ఘర్షణ తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో ఎంసీహెచ్ ఎన్నికలు జరిగితే టీడీపీ మేయర్‌గా తీగల కృష్ణారెడ్డి సారధ్యంలో టీడీపీ అధికారం సాధించింది. అప్పటివరకూ టీడీపీనే ప్రభుత్వంలో ఉన్నందున ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఆ తర్వాత వైఎస్ సీఎంగా రావడంతో, గ్రేటర్ పరుగు మందగించిన వైనాన్ని విస్మరించకూడదు.  పైగా ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్న కార్పొరేషన్లు పంపించే ప్రతిపాదనలను, రాష్ట్ర ప్రభుత్వం సహజంగా ఆమోదించదు. బడ్జెట్ లో కూడా వివక్ష ప్రదర్శిస్తుంది. కాబట్టి.. విపక్ష పార్టీలు ఇచ్చే హామీలు చెల్లుబాటయ్యే అవకాశాలు బహు తక్కువగా ఉంటాయి. నేరుగా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే వెసులుబాటు కూడా తక్కువగానే ఉంటుంది. ఈ  దృష్ట్యా నిధులు-అధికారాల కోసం నిత్యం అధికారంలో ఉన్న పార్టీతో యుద్ధం చే యడం అనివార్యం.   ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో, బీజేపీ దళపతి బండి సంజయ్ ఇచ్చిన హామీలు దుమ్మురేపుతున్నాయి. ఓ వైపు ప్రజలు వాటిపై ఆశ-ఆసక్తి ప్రదర్శిస్తున్నా.. మరోవైపు అది ఎంతవరకూ ఆచరణ సాధ్యమన్న సందేహాలూ వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన బాధితులకు, కేసీఆర్ సర్కారు ఇంటికి పదివేలు నష్టపరిహాం అందించింది. అయితే, ఆ పంపిణీ ప్రక్రియపై చాలా ఆరోపణలు కూడా వచ్చాయి. టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, స్థానిక నేతలు తమ వారికి మాత్రమే ఇప్పించుకున్నారని, అందులో సగం కొట్టేశారన్న ఆరోపణలు కాంగ్రెస్-బీజేపీ నుంచి వినిపించిన విషయం తెలిసిందే. ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది.  వరద నిధుల సాయం ఆపాలని బండి సంజయ్ ఫిర్యాదు చేసినందుకే,  ఎన్నికల కమిషన్ దానిని ఆపివేసిందని టీఆర్‌ఎస్ ఆరోపించటం..  దానిని రుజువుచేయాలని సంజయ్ సవాల్ చేసి, ప్రమాణం చేసేందుకు  భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లడం సంచలనం సృష్టించింది.   మళ్లీ ఎన్నికల వాతావరణాన్ని కాక పుట్టించేందుకు..  సంజయ్ బీజేపీ పక్షాన ఇచ్చిన హామీలు కూడా, జనక్షేత్రంలో చర్చనీయాంశంగా మారాయి. తాము గ్రేటర్ ఎన్నికల్లో గెలిస్తే, వరద బాధితులకు ఇంటికి 25 వేలు ఇస్తామని, వరదలో కారు-మోటర్‌వాహనం పాడయిపోతే కొత్త వాహనాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా... నగరంలో ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేస్తూ యువతను వేధిస్తున్నందున, తాము అధికారంలోకి వస్తే.. ఆ చలాన్లు తామే కడతామని, అసలు ట్రాఫిక్ చలాన్ల వ్యవస్థనే రద్దు చేస్తామన్న సంచలన హామీలు,  సహజంగానే టీఆర్‌ఎ స్‌లో కలవరం కలిగిస్తున్నాయి. ఎల్‌ఆర్‌ఎస్ రద్దు హామీ కూడా అందులో ఒకటి. అయితే.. సంజయ్ హామీల సాధ్యాసాధ్యలపైన విద్యాధికులు, మధ్య తరగతి వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది.   అసలు..  సంజయ్ ఇచ్చిన హామీలన్నీ రాష్ట్ర ప్రభుత్వ పరిథిలోనివి అయినప్పుడు, ఒకవేళ గ్రేటర్ ఎన్నికల్లో గెలిచే మేయర్ ఎలా అమలుచేస్తారన్న సందేహం తెరపైకి వస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ బడ్జెట్ 18 వేల కోట్లు మాత్రమే. అందులో జీతాలకే సింహభాగం ఖర్చవుతుంది. ఇక ఇటీవలి వరద బాధితులకు..  ముఖ్యమంత్రి సహాయ నిధి ఖాతా నుంచి మాత్రమే,   ఇంటికి పదివేల రూపాయల చొప్పున చేసిన సాయం చేశారు.  దీనికి- గ్రేటర్ కార్పొరేషన్ నిధులకు ఏమాత్రం సంబంధం లేదు. ఇక ఎల్‌ఆర్‌ఎస్ కొనసాగింపు లేదా రద్దు అంశం కూడా,  పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిథిలోనిదే. ఒకవేళ రేపు బీజేపీ మేయర్‌గా గెలిస్తే, ఇంటికి 25 వేలు ఏ ఖాతా నుంచి ఇస్తారన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.   మరో కీలక అంశం ట్రాఫిక్ చలాన్ల రద్దు. దీనితో గ్రేటర్ కార్పొరేషన్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ చలాన్లు గ్రేటర్ కార్పొరేషన్ చెల్లిస్తే చెల్లించవచ్చు. కానీ అందుకు కోట్ల రూపాయల నిధుల అవసరం ఉంది. ఇప్పటికే గ్రేటర్ కార్పొరేషన్ నిధుల్లేక అవస్థల పాలవుతోంది.  అయితే, మోటార్ వెహికల్ యాక్టు పూర్తిగా కేంద్ర మార్గదర్శకాల మేరకు అమలవుతుంది. చలాన్లు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వెళుతుంది. వాటిని పోలీశాఖ లేదా ప్రభుత్వ అవసరాల మేరకు వినియోగిస్తుంటారు. ఇది ఒక్క తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వమే కాదు, బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనూ అమలయ్యే ప్రక్రియనే.   తాజా గ్రేటర్ ఎన్నికల్లో..  తమ పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రజలు నిబంధనలు ఉల్లంఘిస్తూ కడుతున్న ట్రాఫిక్ చలాన్లు.. ఇకపై  గ్రేటర్ కార్పొరేషన్ చెల్లిస్తుందన్న,  బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హామీపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. 2014 నుంచి 2019 జూన్ వరకూ అందుబాటులో ఉన్న గణాంకాలు పరిశీలిస్తే... మొత్తం 56 కోట్ల రూపాయలు చలాన్ల రూపంలో వసూలయ్యాయి. అందులో సిగ్నల్ జంపింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, లైసెన్సు లేకుండా డ్రైవింగ్ చేయడం, త్రిబుల్‌రైడింగ్ వంటి కేసులకు సంబంధించిన చలాన్లు ఉన్నాయి. కేంద్రప్రభుత్వం కూడా చలాన్ల రుసుం పెంచడం ద్వారా, ప్రమాదాలు తగ్గించేందుకు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. దేశంలోని అన్ని రాష్ర్టాలూ వాటినే అమలుచేస్తున్నాయి.   అయితే, బండి సంజయ్ హామీ ఇచ్చినట్లు...గ్రేటర్  కార్పొరేషనే ట్రాఫిక్ చలాన్లు చెల్లించడం లేదా రద్దు చేయడం వంటి చర్యలను.. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కూడా అమలుచేస్తున్న దాఖలాలు కనిపించవు. మరి ఒక్క ‘గ్రేటర్’లోనే ఆ విధానం ఎలా అమలుచేస్తారన్న సందేహం, గ్రేటర్‌లో విద్యాధికుల నుంచి వినిపిస్తోంది. పైగా 18 వేల కోట్ల గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ బడ్జెట్‌లో,  జీతాలకు పోగా మిగిలేది అ తి స్వల్పమయినప్పుడు... ఇక ట్రాఫిక్ చలాన్ల రూపంలో వచ్చే బిల్లులు ఏవిధంగా.. ఎక్కడి నుంచి ఇస్తారన్నది మరో ప్రశ్న.   ఎందుకంటే.. ఒక్క 2019 జూన్ వరకే,  5.2 లక్షల కేసులకు గాను... 9.12 కోట్ల రూపాయలు చలాన్ల రూపంలో వసూలయ్యాయి. 2018లో 6.79 కోట్లు, 2017లో 8.84 కోట్లు, 2016లో 10.98 కోట్లు, 2015లో 11.30 కోట్లు, 2014లో 21.63 కోట్లు చలాన్ల రూపంలో ఖజానాకు చేరాయి. మరి ఈ డబ్బును గ్రేటర్ కార్పొరేషన్,  పోలీసులకు ఎలా చెల్లిస్తుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మద్యం తాగి డ్రైవింగ్ చేసేవారి నుంచి, 3 కోట్ల రూపాయల చలాన్లు వసూలు చేశారు. మద్యం తాగుతూ డ్రైవింగ్ చేయడం నేరం. అందుకే బీజేపీ అధికారంలో ఉన్న కేంద్రప్రభుత్వమే భారీ చలాన్లు విధించింది. మరి ఒకవేళ బీజేపీ గ్రేటర్‌లో గెలిస్తే... మద్యం తాగుతూ పట్టుపడ్డ వాహనదారులకు విధించే చలాన్లు, అదే బీజేపీ చెల్లిస్తే.. అది కేంద్ర విధానాన్ని ధిక్కరించినట్లే కదా? మద్యం తాగుతూ వాహనాలు నడపటాన్ని ప్రోత్సహించినట్లు కాదా అన్నది మరో ప్రశ్న.   ఇక ఎల్‌ఆర్‌ఎస్ రద్దు కూడా,  గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిథిలోని అంశం కాదు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాల్సిందే. చివరకు బీఆర్‌ఎస్, బీపీఎస్ వంటి స్కీములు కూడా ప్రభుత్వం ఆమోదిస్తేనే..  గ్రేటర్ కార్పొరేషన్ అమలుచేయాల్సి ఉంటుంది. మరి ఏ అధికారంతో..  బీజేపీ,  ఎల్‌ఆర్‌ఎస్ రద్దు హామీ ఇచ్చిందన్న అంశంపైనే  ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.  బీజేపీ పట్ల  మధ్య తరగతి-విద్యాధికులలో ఇప్పటివరకూ సానుభూతి ఉంది. ఇలాంటి అసాధ్యమైన హామీలు గుప్పించడం ద్వారా, ఆ సానుభూతి దూరమయ్యే ప్రమాదం లేకపోలేదు. -మార్తి సుబ్రహ్మణ్యం

పీవీ, ఎన్టీఆర్ ఘాట్ లు కూలిన రెండు గంటల్లో దారుస్సలాం ను కూల్చేస్తాం... అక్బరుద్దీన్ కు సంజయ్ స్?

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్ లపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈరోజు అక్బరుద్దీన్ మాట్లాడుతూ హుస్సేన్ సాగర్ పై ఉన్న ఎన్టీఆర్, పీవీ సమాధులను కూల్చాలని తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందిస్తూ, "హుస్సేన్ సాగర్‌పై ఉన్న పీవీ సమాధిని, ఎన్టీఆర్ సమాధిని కూల్చే దమ్ము నీకుందా? అవి నీ అయ్య జాగీరా, నీ తాత జాగీరా. పీవీ, ఎన్టీఆర్ ల సమాధులను కూల్చిన రెండుగంటల్లోనే నీ దారుస్సలాంను బీజేపీ కార్యకర్తలు కూల్చేస్తారు" అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రజలను మభ్యపెట్టి, ఏమార్చి ఓట్లు పొందాలని టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు చూస్తున్నారన్నారు. టీఆర్ఎస్ నాయకులు చేవచచ్చి ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎంఐఎం నాయకులు చేసే సవాల్‌ను స్వీకరించలేని దౌర్భాగ్య పరిస్థితిలో టీఆర్ఎస్ నేతలు ఉన్నారని సంజయ్ అన్నారు. హిందువులు అందరూ ఓటు బ్యాంకుగా మారితేనే హైదరాబాద్‌లో బీజేపీ గెలుస్తుందన్నారు.

ఎన్నికల ప్రచారంలో గుంపులు గుంపులు? కరోనా ముప్పు తప్పదా ?

కరోనా సెకండ్ వేవ్ భయపెడుతోంది. మహమ్మారి విజృంభణతో ఇప్పటికే పలు దేశాలు మరోసారి లాక్ డౌన్ అయ్యాయి. మన దేశంలోనూ కరోనా కేసులు మళ్లీ వేగంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉంది. కేరళ, కర్ణాటక, గుజరాత్ లోనూ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అహ్మదాబాద్, గాంధీనగర్ లో నైట్ కర్ప్యూ అమలు చేస్తున్నారు. తాజాగా పంజాబ్ సర్కార్ కూడా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తామని ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ దారుణంగా ఉంటుందని, మరో మూడు నెలల వరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని WHOతో పాటు దేశంలోని ఐసీఎమ్మార్ కూడా హెచ్చరించింది.  దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ టెన్షన్ ఉంటే తెలంగాణలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కరోనా మహమ్మారి సంగతే మర్చిపోయారు జనాలు. హైదరాబాద్ లో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతుండటంతో.. ప్రచారం హడావుడిలో కరోనా జాగ్రతలు మర్చిపోయారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా జనాలే కనిపిస్తున్నారు. వారిలో ఎవరికి మాస్క్ ఉండటం లేదు. భౌతిక దూరం అసలే పాటించడం లేదు. ఎన్నికల ర్యాలీలు, సభల్లోనూ వందలాది మంది పాల్గొంటున్నారు. మాస్కులు లేకుండానే, ఫిజికల్ డిస్టెన్స్ పాటించకుండానే గుంపులుగా తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.  కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రచారం చేసుకోవాలని ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఇచ్చింది. కాని వాటిని పట్టించుకునే వారే లేరు. అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఇదే పరిస్థితి. రాజకీయ నేతలు కూడా  కోవిడ్ రూల్స్ పాటించడం లేదు. మాస్కులు లేకుండానే వందలాది మందిని తీసుకుని  విచ్చలవిడిగా ప్రచారం చేస్తున్నారు. గ్రేటర్ లో రోడ్ షోలు నిర్వహిస్తున్న మంత్రి కేటీఆర్, ఎంపీ రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి  సంజయ్ .. ఇలా అందరూ అందరే. ఎన్నికల ప్రచారంలో ఏ ఒక్కరూ కోవిడ్ రూల్స్ పాటించడం లేదు. లీడర్లు మాస్కులు పెట్టుకోకపోవడంతో.. వారి బాటలోనే పార్టీ ద్వితియ శ్రేణి నేతలు,  కార్యకర్తలు కూడా మాస్కులు పక్కన పెట్టేశారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ఓట్లు అడుగుతున్నారు. తమ ముఖం ఓటరుకు కనిపించాలన్న ఉద్దేశంతో అభ్యర్థులు మాస్కుల్ని ధరించడం లేదు. దీంతో తమకెక్కడ వైరస్‌ సోకుతుందోనని ఓటర్లు వణికిపోతున్నారు. ఓట్ల కోసం తమ ఇంటికి వస్తున్న అభ్యర్థులు, నేతలను కొందరు ప్రజలు మాస్కులే లేవని గట్టిగానే మందలిస్తున్న ఘటనలు కూడా జరుగుతున్నాయి.  గ్రేటర్‌ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అన్ని డివిజన్లకు ఇన్‌చార్జిలుగా తమ అగ్రనేతలను మోహరించాయి. దీంతో ఆయా నాయకులు తమ జిల్లాల నుంచి  భారీగా కార్యకర్తల్ని వెంటబెట్టుకుని నగరానికి చేరుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒక్కో డివిజన్‌లో ప్రచారం నిర్వహిస్తున్న వందలమంది స్థానిక కార్యకర్తలు, పొరుగు జిల్లాల నుంచి వచ్చిన పార్టీ జనాలతో    నగర వీధులు జనసంద్రాలుగా మారాయి. ప్రచారంలో వందలాది మంది కూలీలు పాల్గొంటున్నారు. ప్రచారంలో ఎవరూ కనీస కరోనా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఇదే ఆందోళనకు కారణమవుతోంది. ఆ జనంలో ఎవరిలో కరోనా ఉందో, ఎవరికి లేదో తెలియని పరిస్థితి. ఎన్నికల సంగతి దేవుడెరుగు.. ఇదెక్కడ తమ ప్రాణాల మీదకు వస్తుందోనని నగర ప్రజలు హడలిపోతున్నారు.  ముందున్నది చలికాలం కావడం, ఎన్నికల ప్రచారంలో జనం భారీగా ఇంటింటికీ తిరుగుతుండటంతో.. డిసెంబరులో కేసులు తీవ్రంగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల హడావుడిలో పడి కరోనా జాగ్రత్తలు తీసుకోకపోతే దారుణ పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. రాజకీయ పార్టీలు కూడా ప్రచారంలో కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలని, తమ నేతలకు కూడా దీనిపై అలర్ట్ చేయాలని డాక్టర్లు , ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి.

పివి, ఎన్టీఆర్ ఘాట్లను కూల్చండి.. అక్బరుద్దీన్ సెన్సేషనల్ కామెంట్స్

జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ పార్టీలు, నేతల మధ్య ఇంతకూ ముందు ఎపుడు లేనంతగా మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. గతంలో 4,700 ఎకరాల హుస్సేన్‌సాగర్ ప్రస్తుతం 700 ఎకరాలు కూడా లేదన్నారు. అయితే టిఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ కట్టడాలను కూల్చేస్తామంటోందని.. దీనిలో భాగంగా హుస్సేన్‌సాగర్ కట్టపై ఉన్న పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చాలని అయన కామెంట్ చేసారు. అంతేకాకుండా గత ఎన్నికల్లో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని... మళ్లీ ఈ ఎన్నికల్లో మాయ మాటలు చెబుతున్నారని ప్రభుత్వంపై అక్బరుద్దీన్ మండిపడ్డారు. ఎంఐఎంతో పొత్తు లేదని మంత్రి కేటీఆర్ అంటున్నారని... తమకు ఎవరి కింద బతకాల్సిన దుస్థితి లేదని అయన అన్నారు. తాము అడుగేస్తే దుమ్ము లేస్తుందని.. అసెంబ్లీలో తోకను తొక్కి టీఆర్ఎస్ ను ఎలా నిలబెట్టాలో, ఎలా కూర్చోబెట్టాలో కూడా తమకు తెలుసని అన్నారు. తమ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కనుసన్నల్లోనే ఓల్డ్ సిటీ నడుస్తుందని అక్బరుద్దీన్ ఓవైసి పేర్కొన్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో మేయర్ బొంతు రామ్మోహన్ భార్యకు చేదు అనుభవం

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటోన్న పలు పార్టీల ముఖ్య నాయకులు, అభ్యర్థులకు గత కొద్ది రోజులుగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాము కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోని వారు ఓట్ల కోసం మాత్రం తమ గల్లీల్లోకి వస్తున్నారంటూ నేతలు, అభ్యర్థులపై బస్తీల వారు మండిపడుతూ.. వారిని వెనక్కి తిప్పి పంపుతున్నారు. తమ కాలనీల్లో కనీస మౌలిక వసతులు లేవని, నాయకులు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చి వెళ్తున్నారు కానీ వాటిని అమలు చేయడం లేదని పలు కాలనీ వాసులు నాయకులను మొహం మీదే అడిగేస్తున్నారు. దీంతో ప్రజలకు నేతలు నచ్చచెప్పలేక సతమతమౌతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికలలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య బొంతు శ్రీదేవి చర్లపల్లి డివిజన్ నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ రోజు ఆమె కుషాయిగూడలోని పలు కాలనీల్లో పర్యటిస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు. అయితే, వరద సాయంపై స్థానిక మహిళలు ఆమెను అక్కడే నిలదీశారు. దీంతో అందరికీ వరద సాయం అందేలా చూస్తామని చెప్పి అక్కడి నుంచి ఆమె వెళ్లిపోయారు.

గ్రేటర్‌లో భూపేంద్ర మార్క్! ఉక్కిరిబిక్కిరవుతున్న టీఆర్ఎస్

దుబ్బాకలో గెలిచేశాం.. జీహెచ్ఎంసీపై  జెండా పాతేద్దాం.. మూడేళ్ల తర్వాత అధికారాన్ని కైవసం చేసుకుందాం.. ఇదే ఇప్పుడు తెలంగాణ బీజేపీ నినాదం. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా గ్రేటర్ ఎన్నికను సవాల్ గా తీసుకుంది బీజేపీ హైకమాండ్. ఎట్టి పరిస్థిత్తుల్లోనూ బల్దియా పీఠాన్ని చేజిక్కించుకునేందుకు పకడ్బంధి ప్రణాళికలు రచిస్తోంది. జాతీయ స్థాయిలో పార్టీకి ట్రబుల్ షూటర్ గా ఉన్న భూపేంద్రయాదవ్ ను ఇంచార్జ్ గా నియమించింది. హైకమాండ్ ఆదేశాలతో హైదరాబాద్ లోనే మకాం వేసిన భూపేంద్ర యాదవ్.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన మార్క్ చూపిస్తున్నారు. ఎవరికి అంతుపట్టని అలోచనలు, సరికొత్త ఎత్తుగడలతో ప్రత్యర్థి పార్టీలకు చెమటలు పట్టిస్తున్నారు. గ్రేటర్ ప్రచారంలో బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లోకి ఈజీగా వెళుతుండటంతో ప్రత్యర్థి పార్టీలు కలవరపడుతున్నాయని తెలుస్తోంది. భూపేంద్ర యాదవ్ ప్రచార వ్యూహాలతో అధికార గులాబీ పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోందని చెబుతున్నారు.     గ్రేటర్ లో ఓటర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త కార్యక్రమాలు చేపట్టింది బీజేపీ. గ్రేటర్ ప్రజలు మార్పు  కోరుకుంటున్నారని చెబుతున్న బీజేపీ.. చేంజ్ హైదరాబాద్ పేరుతో  సభలు నిర్వహిస్తోంది. గ్రేటర్ నగరాన్ని మారుస్తామని, భాగ్యనగరంగా తీర్చిదిద్దుతామని చేంజ్ హైదరాబాద్ అంటూ యాప్ ను కూడా ప్రారంభించింది. ముఖ్యంగా యువతను, అకట్టుకునేందుకు ‘చేంజ్ హైదరాబాద్’ కార్యక్రమం కోసం  బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, యువ ఎంపీ తేజస్వి సూర్యను  ప్రచారంలోకి దింపింది బీజేపీ. హైదరాబాద్ ప్రచారంలో దూకుడు ప్రదర్శించారు సూర్య. తెలంగాణ సెంటుమెంటును కూడా తమవైపు తిప్పుకునేందుకు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. తెలంగాణ  ఉద్యమానికి ఆయువుపట్టుగా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ లోపలికి వెళ్లి చరిత్రాత్మక ఆర్ట్స్ కాలేజీ దగ్గర ఉత్తేజపూరిత ప్రసంగం చేస్తూ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు తేజస్వి సూర్య.   క్లీన్ పాలిటిక్స్ పేరుతో గ్రేటర్ లో మరో వినూత్న ఆలోచన చేసింది బీజేపీ. కార్పోరేటర్ గా పోటీచేస్తున్న అభ్యర్థితో ప్రజల సమక్షంలోనే ప్రమాణం చేయిస్తోంది. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని హబ్సిగూడ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి చేతన హరీష్ ప్రజల సమక్షంలో ప్రమాణ పత్రం చదివారు. తాను స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తానని, ఎటువంటి అవినీతి, అక్రమాలకు పాల్పడబోనని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని ప్రజల సమక్షంలో  కార్పొరేటర్ అభ్యర్థిని దైవ సాక్షిగా ప్రమాణం చేసింది. ఓటర్లలో నమ్మకం కలిగించేందుకు అభ్యర్థిచేత ప్రజా క్షేత్రంలోనే ప్రమాణం చేయిస్తున్నామని .. ఇది ఓటర్లను బాగా ఆకర్శిస్తుందని చెబుతున్నారు కమలం నేతలు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి బాగా ఉపయోగపడిన నేతల బస్తినిద్ర కార్యక్రమాన్ని గ్రేటర్ లోనూ అమలు చేస్తోంది బీజేపీ. ప్రతి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం రాత్రి వరకు సాగించిన  అనంతరం ప్రచారం ముగిసిన ప్రాంతంలోనే ఆ రాత్రి ఆ బస్తీలోనే నాయకులు నిద్రిస్తున్నారు. దీని ద్వారా స్థానికుల్లో బీజేపీ ప్రజల పార్టీయని, ప్రజల్లోనే ఉంటుందన, ప్రజాభివృద్దిని కోరుకుంటుందనే సంకేతాలను బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.  చేంజ్ హైదరాబాద్, బస్తి నిద్ర, క్లీన్ పాలిటిక్స్ తరహాలోనే మరిన్ని  ప్రయోగాలు భూపేంద్ర యాదవ్ అమలు చేయబోతున్నారని తెలుస్తోంది. ఎంఐఎం పార్టీని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తూ హిందువుల ఐక్యతను బలంగా వినిపిస్తోంది కమలదళం. రోడ్ షోలు కొనసాగిస్తూనే..  టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోపై , సీఎం పనితీరుపై, కేటీఆర్ ప్రకటనలపై, నగర పరిస్థితులపై బీజేపీ అరోపణలు సంధిస్తోంది. భూపేంద్ర యాదవ్ వ్యూహాలతో ప్రచారంలో బీజేపీ దూకుడు పెరిగిందని రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ప్రత్యర్థి పార్టీలకు ప్రచారం కోసం ఎక్కువ సమయం ఉండవద్దనే ఉద్దేశంతో గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ ను హడావుడిగా ఇచ్చినా.. భూపేంద్ర ఎత్తులతో అధికార పార్టీ పాచికలు పారడం లేదంటున్నారు. ప్రచారం ముగిసేలోగా భూపేంద్ర ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతారోనన్న ఆసక్తి గ్రేటర్ బీజేపీ నేతలతో పాటు నగర ప్రజల్లోనూ కనిపిస్తుందని చెబుతున్నారు.

కాకినాడలో దారుణం.. నిద్రిస్తున్న పాపను ఎత్తుకెళ్ళి అత్యాచారం... 

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. ఒక ఆగంతకుడు ఇంట్లో నిద్రిస్తున్న అయిదేళ్ల బాలికను తెల్లవారుజామున ఎత్తుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో మంచంపై పాప కనిపించకపోవడంతో.. ఆ బాలిక తండ్రి, నాయనమ్మ వెతకడం మొదలు పెట్టగా చివరకు బాలిక ఊరి చివర దేవాలయం వద్ద కనిపించింది. అయితే ఆ బాలిక ఒంటిపై దుస్తులు లేకపోవడంతో పాటు శరీరంపై గాయాలు కనిపించాయి. వెంటనే ఆ బాలికను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే పోలీసులకు చెప్పకుండా చికిత్స అందించడానికి డాక్టర్లు నిరాకరించారు. దీంతో డాక్టర్ల పై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 

'సర్జికల్ స్ట్రయిక్' అంటే ఎందుకింత ఆగమాగం! ఎవరినైనా దాచిపెట్టారా?: విజయశాంతి ట్వీట్ 

హైదరాబాదు పాతబస్తీలో సర్జికల్ స్ట్రయిక్ నిర్వహిస్తామన్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యలతో గ్రేటర్ రాజకీయం మరింత వేడెక్కింది. సంజయ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ కూడా బండికి కౌంటరిస్తోంది. అయితే బండి సంజయ్ 'సర్జికల్ స్ట్రయిక్' కామెంట్లను సమర్దించారు మాజీ ఎంపీ విజయశాంతి. 'సర్జికల్ స్ట్రయిక్' అంటే  టీఆర్ఎస్, ఎంఐఎం ఎందుకంత ఆగమాగం అవుతున్నాయని ఆమె  ప్రశ్నించారు. హైదరాబాద్ పాతబస్తీలోని రోహింగ్యాలు, పాకిస్థానీల గురించి ఆ రెండు పార్టీలు ఎందుకు ఆందోళన చెందుతున్నాయని విజయశాంతి నిలదీశారు.  టీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఇంటింటి సర్వే నిర్వహించిందని, పాతబస్తీలో ఎవరూ ఆ విధంగా లేరని సీఎం గారు తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్రానికి అధికారపూర్వక నివేదిక ఇవ్వొచ్చు కదా అని విజయశాంతి ట్వీట్ చేశారు. లేకుంటే ఎవరినైనా దాచిపెట్టడం వల్లనే టీఆర్ఎస్ భయాందోళనలకు గురవుతున్నదని ప్రజలు అభిప్రాయపడే అవకాశముందని వ్యాఖ్యానించారు. బీజేపీ చీఫ్ వ్యాఖ్యలను సమర్ధిస్తూ విజయశాంతి ట్వీట్ చేయడంతో ఆమె కమలం గూటికి చేరడం ఖాయమని తేలిపోయింది. అయితే ముహుర్తం మాత్రం ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది.

కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ను కబళించిన కరోనా... సోనియా, రాహుల్ దిగ్భ్రాంతి

కాంగ్రెస్ సీనియర్ నేత, ట్రబుల్ షూటర్ అహ్మద్ పటేల్ కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో ఈరోజు తెల్లవారు ఝామున 3.30 గంటలకు అహ్మద్ పటేల్ మృతి చెందారని ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. అహ్మద్ పటేల్‌కు నెల రోజులు క్రితం కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే . అయితే గత కొద్ది రోజులుగా ఆయన శరీరంలోని పలు అవయవాలు సరిగా పనిచేయకపోవడంతో ఆరోగ్యం మరింతగా క్షీణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 15 నుంచి అహ్మద్ పటేల్ ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు వారు పేర్కొన్నారు.   కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మృతిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. తనకు నమ్మిన బంటులా ఉంటూ.. పార్టీ కష్టాల్లో పడిన వేళ తన చతురతతో సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషించే అహ్మద్ పటేల్ మరణ వార్త తనను ఎంతో కలచి వేసిందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆవేదన వ్యక్తం చేసారు. ‘‘అహ్మద్ పటేల్ లేని లోటును ఎవ్వరూ తీర్చలేరు. అత్యంత నమ్మకమైన స్నేహితుడు. ఆయన జీవితం మొత్తాన్ని కాంగ్రెస్‌కే ధార పోశారు. పార్టీపట్ల అంకితభావం, విశ్వసనీయతతో ఉండటం, సహాయం చేయడానికి అందరికంటే ముందుండటం, కర్తవ్యం పట్ల ఆయనకున్న నిబద్ధత, ఔదార్యం... ఇవన్నీ ఆయనలో ప్రత్యేక లక్షణాలు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆయన కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తున్నాను.’’ అంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ట్వీట్ చేశారు.   అహ్మద్ పటేల్ కరోనాతో మరణించడం పట్ల రాహుల్ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. "ఇది నిజంగా విషాదకర దినం అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి అహ్మద్ పటేల్ ఓ మూలస్తంభం లాంటివారని" కొనియాడారు. "ఆయన శ్వాస, ఆశ అన్నీ కాంగ్రెస్ పార్టీయేనని కీర్తించారు. అనేక సంక్షోభ సమయాల్లో పార్టీకి వెన్నంటి నిలిచారని.. తమకు ఆయన ఓ ఆస్తిలాంటివారని" రాహుల్ అభివర్ణించారు.

గ్రేటర్ కు బీజేపీ బడా నేతలు! కారు ఖేల్ ఖతమేనా? 

కారు పార్టీకి కౌంట్ డౌన్  మొదలైనట్టేనా? గ్రేటర్ ఎన్నికతో గులాబీ బాస్ కు చెక్ పెట్టబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే లక్ష్యంతో బడా నేతలను రంగంలోకి దింపుతోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కమలదళం..  మరో మూడేళ్లలో జరగనున్న అసెంబ్లీ సమరానికి..జీహెచ్ఎంసీ ఎన్నికను సెమీఫైనల్ గా భావిస్తోంది. గ్రేటర్ లో పాగాతో తమ లక్ష్యానికి చేరుకునేలా కార్యాచరణ రెడీ చేసుకుంటోంది. ఇందులో భాగంగానే గ్రేటర్ ప్రచారానికి పార్టీ అగ్రనేతలను  రంగంలోకి దింపుతోంది.    జీహెచ్ఎంసీ ఎన్నికను బీజేపీ హైకమాండ్ మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేస్తుందంటే వాళ్లు ఎంత సీరియస్ గా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎ‍న్డీయేను విజయతీరాలకు చేర్చిన భూపేంద్ర యాదవ్‌ ను గ్రేటర్ ఎన్నికల ఇంచార్జ్ గా నియమించింది. కొన్ని రోజులుగా హైదరాబాద్ లోనే మకాం వేసి రాష్ట్ర నేతలకు దిశానిర్ధేశం చేస్తున్నారు భూపేంద్ర యాదవ్‌. లోకల్ బాడీ ఎన్నికకు జాతీయ స్థాయిలో ట్రబుల్ షూటర్ గా పేరున్న భూపేంద్రను ఇంచార్జ్ గా పంపించిన హైకమాండ్.. అంతటితో ఆగడం లేదు. కేంద్రమంత్రులను హైదరాబాద్ ప్రచారానికి పంపిస్తోంది. రెండు రోజుల క్రితమే గ్రేటర్ లో ప్రచారం చేసి వెళ్లారు ప్రకాశ్ జవదేకర్. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలపై ఆయన చార్జీషీట్ విడుదల చేశారు. కేసీఆర్ పాలనపై, టీఆర్ఎస్ పై ఓ రేంజ్ లో ఫైరయ్యారు ప్రకాశ్ జవదేకర్.    బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య కూడా రెండు రోజులుగా నగరంలో పర్యటిస్తున్నారు. ఛేంజ్‌ హైదరాబాద్‌’ కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ కేడర్ లో జోష్ నింపుతున్నారు. ఉస్మానియా యూనివర్శిటీలో మీటింగ్ పెట్టి కేసీఆర్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు తేజస్వి సూర్య. గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రజలు తమకు ఒక్క అవకాశం ఇస్తే భాగ్యనగరం రూపురేఖలు మారుస్తామని, పాతబస్తీలో అరాచక శక్తులను తరిమికొడతామని  తేజస్వి సూర్య అన్నారు. తాను భాగ్యలక్ష్మి దేవాలయానికి వెళ్తే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారని, తనను రెచ్చగొడితే భాగ్యలక్ష్మి దేవాలయాన్ని అడ్డాగా చేసుకుంటానని సవాల్‌ విసిరారు. దమ్ముంటే తనను అరెస్టు చేయాలన్నారు సూర్య. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ బుధవారం గ్రేటర్ లో ప్రచారం చేయబోతున్నారు. స్మృతికి తెలంగాణ ఉద్యమంతో అనుబంధం ఉండటంతో ఆమెకు ఇక్కడ చాలా మంది అభిమానులు ఉన్నారు.    కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ పాటు మరికొంతమంది నేతలు జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెబుతున్నారు. గ్రేటర్ లో పాగా వేస్తే దక్షిణాదిలో పార్టీకి ఫుల్ జోష్ వస్తుందని బీజేపీ ప్లాన్ చేసిందని చెబుతున్నారు. గౌతమ్ గంభీర్, సైనా నెహ్వాల్, కుష్భు లు కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం లో పాల్గొననున్నారు తెలుస్తోంది. అవసరమైతే మరికొందరు కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలను హైదరాబాద్ పంపించాలని బీజేపీ హైకమాండ్ భావిస్తుందట.  బీజేపీ వ్యూహాలతో అధికార టీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే స్థానిక ఎన్నికలను పెద్దగా పట్టించుకోని సీఎం కేసీఆరే స్వయంగా జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారని, గ్రేటర్ ప్రజలకు వరాలు కురిపించారని చెబుతున్నారు. వరాలు ఇవ్వడమే కాదు బీజేపీ గెలిస్తే శాంతి భద్రతల సమస్యలు వస్తాయంటూ ఓటర్లను భయాందోళన కల్గించే ప్రయత్నం చేశారు కేసీఆర్. బీజేపీ దూకుడుతో గులాబీ నేతల్లో గుబులు పెరిగిపోతుందని రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది.    దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత బీజేపీకి జోష్ వచ్చింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి గ్రేటర్‌ పోటీలో బీజేపీ రేసులోకి వచ్చింది. ఇప్పుడు గ్రేటర్‌ లోనూ అధికార పార్టీకి చుక్కలు చూపిస్తోంది బీజేపీ రాష్ట్ర నేతలందరినీ మోహరించి భాగ్యనగర్‌ బస్తీల్లో జోరు పెంచుతోంది.  బండి సంజయ్‌, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, డీకే అరుణ, రఘునందన్‌రావుతో సహా రాష్ట్ర స్థాయి నేతలంతా హైదరాబాద్‌లోనే ప్రచారం చేస్తున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

చైనాకు భారత్ మరో పెద్ద షాక్.. మరో 43 యాప్‌ల నిషేధం

భారత్ చైనా సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో గత జూన్ లో పలు చైనా యాప్‌లను నిషేధిస్తూ చర్యలు తీసుకున్నకేంద్ర ప్రభుత్వం.. తాజాగా చైనాకు మరో ఝలక్ ఇచ్చింది. ఆ దేశానికి చెందిన 43 యాప్‌లను బ్యాన్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మనదేశ సార్వభౌమత్వం, సమగ్రత, రక్షణ, భద్రతకు ముప్పు వాటిల్లుతోందని పేర్కొంటూ ఈ 43 మొబైల్ అప్లికేషన్లను నిషేధిస్తూ సమాచార, సాంకేతిక శాఖ ఈరోజు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుబంధ ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్తగా బ్యాన్ చేసిన ఈ యాప్స్‌లో చైనా వ్యాపార దిగ్గజ సంస్థ అలీ ఎక్స్‌ప్రెస్ కూడా ఉంది. దానితో పాటు అలీబాబా వర్క్ బెంచ్, హీరోస్ ఎవాల్వ్‌డ్, డింగ్ టాక్ వంటి ఇతర అప్లికేషన్లున్నాయి.    ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది జూన్ 29న ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69 ఏ కింద 59 మొబైల్ యాప్స్‌ను.. అలాగే సెప్టెంబర్ 2న మరో 118 యాప్‌లను ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. వీటిలో ఎక్కువగా చైనీస్ యాప్‌లే. కాగా టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, వీ చాట్, లూడో వంటి యాప్‌లు భారతదేశ సమగ్రత, సార్వభౌమత్వానికి భంగం వాటిల్లేలా చేస్తున్నాయంటూ గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి.

మాస్క్ తీసేసి.. శానిటైజర్ లో కాలేసిన మంత్రి కేటీఆర్

మాట తప్పే వ్యక్తిని ఏమంటారు? అంటే రాజకీయ నాయకుడు అని చెప్పుకొనే రోజుల్లో బతుకుతున్నాం. ఏదో నూటికో కోటికో ఒకరిద్దరు తప్ప దాదాపు రాజకీయ నాయకులంతా అదే కోవకి చెందిన వాళ్లనేది బహిరంగ రహస్యం. చిన్నదో పెద్దదో ఏదొక విషయంలో, ఏదొక సందర్భంలో మాట మార్చడమో, మాట తప్పడమో చేస్తూనే ఉంటారు. దీనికి తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా అతీతులు కాదు. తాజాగా ఆయన మాస్క్ గురించి ఉపన్యాసం ఇచ్చిన 24 గంటల్లోనే శానిటైజర్ లో కాలేశారు.   యాంకర్ సుమ తాజాగా మంత్రి కేటీఆర్ ని ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో హైదరాబాద్ అభివృద్ధి అంశంతో పాటు పలు విషయాలను పంచుకున్నారు. అదంతా బాగానే ఉంది కానీ, ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో కేటీఆర్ చెప్పిన దానికి, ఇంటర్వ్యూ ముగిసిన కొద్ది గంటలకు ఆయన చేసిన దానికి అసలు పొంతనే లేదు. కేటీఆర్ మాస్క్ లేకుండా ఇంటర్వ్యూలో పాల్గొనడంతో.. మిమ్మల్ని మాస్క్ లేకుండా చూసి ఎన్ని రోజులైంది అని సుమ ప్రశ్నించింది. దీంతో పొంగిపోయిన కేటీఆర్ మాస్క్ గురించి చిన్నపాటి ఉపన్యాసమే ఇచ్చారు. మనిషికి ముక్కు ఎంత ముఖ్యమో ప్రస్తుతం పరిస్థితుల్లో మాస్క్ కూడా అంతే ముఖ్యం అన్నట్టుగా చెప్పారు. ఆరేడు నెలల నుంచి తాను ఎక్కడికెళ్లినా మాస్క్ ధరించే వెళ్తున్నానని.. లాక్ డౌన్ సమయంలో కంటైన్మెంట్ జోన్లలో తిరిగాను, కరోనా పేషెంట్స్ ని కలిసాను.. అయినా తనకి కరోనా సోకలేదని, ఎప్పుడూ మాస్క్ ధరిస్తూ ఉండటమే దానికి కారణమని చెప్పుకొచ్చారు. అంతేకాదు, కొందరుంటారు పేరుకి మాస్క్ పెట్టుకుంటారు, మాట్లాడేటప్పుడు మాస్క్ తీసేసి మాట్లాడతారు అంటూ సెటైర్స్ కూడా వేశారు.   అబ్బబ్బా మాస్క్ గురించి మంత్రి కేటీఆర్ ఎంత గొప్పగా సెలవిచ్చారో కదా. ఆగండి ఆగండి కంగారుపడి పొగిడేసి మనం కూడా ఆయనలాగా శానిటైజర్ లో కాలేస్తే ఎలా?. మాస్క్ గురించి ఉపన్యాసం ఇచ్చిన 24  గంటల్లోనే కేటీఆర్ మాస్క్ గొప్పతనాన్ని మరిచారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన.. నిన్న ప్రచారంలో మాస్క్ ని ముక్కుకి పెట్టుకోవడమే మరిచారు. మాస్క్ లేకుండా పబ్లిక్ లోకి రానని చెప్పిన ఆయన, కొందరు మాట్లాడేటప్పుడు మాస్క్ తీసేస్తున్నారని సెటైర్స్ వేసిన ఆయన.. చెప్పిన 24 గంటల్లోనే తప్పులో కాలేశారు. ఏదో ఫార్మాలిటీకి మెడలో మాస్క్ తగిలించుకొని ప్రచారంలో పాల్గొన్నారు. ఇలా అయితే ఎలా మంత్రి గారు. అసలే మిమ్మల్ని ప్రజలు మాస్క్ కి బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటున్నారు. మీరు మాస్క్ మరిచి మా మనోభావాలు హర్ట్ చేయకండి. దయచేసి వాక్సిన్ వచ్చేవరకు మాస్క్ తోనే కనిపించండి.

పవన్ కళ్యాణ్ కు బీజేపీ బిగ్ షాక్.. తిరుపతి నుండి మేమే పోటీ చేస్తాం

జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీతో అవగాహనకు వచ్చిన జనసేన చివరి నిమిషంలో బరి నుండి తప్పుకుంది. బీజేపీ అగ్రనేతల రాయబారం తర్వాత ఎన్నికల బరి నుంచి తప్పుకునేందుకు పవన్ కల్యాణ్ అంగీకరించారు. అయితే త్వరలో ఏపీలోని తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతుండడంతో.. ఆ సీట్‌‌ను జనసేన కోరుకుంటోంది. బీజేపీ కోసం జిహెచ్ఎంసి ఎన్నికల నుండి తప్పుకున్నామని, దీనికి ప్రతిగా తిరుపతి సీటును తమకు ఇవ్వాలని కోరడానికి జనసేన నేతలు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఢిల్లీ చేరుకున్నారు. అయితే నిన్న సోమవారం నుంచి ఇప్పటివరకు వారికి బీజేపీ అగ్రనేతల అపాయింట్ మెంట్ ఇంకా దొరకలేదు. దీంతో బీజేపీ అగ్రనేతలను కలవడం కోసం పవన్, మనోహర్ ఎదురు చూస్తున్నారు.   ఇది ఇలా ఉండగా తిరుపతి లోకసభ సీటును జనసేనకు ఇవ్వబోమని, తామే అక్కడ నుండి పోటీ చేస్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పష్టం చేసారు. తమ పార్టీ గతంలో కూడా తిరుపతి లోక్ సభ స్థానం నుండి గెలిచిందని ఆయన గుర్తు చేశారు. మరోపక్క తిరుపతిలో పోటీ చేస్తామని ముందే ప్రకటించిన ఎపి బీజేపీ ఇన్ ఛార్జ్ సునీల్ దియోధర్ కూడా జనసేనకు అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో పోటీ చేసి.. పవన్ కల్యాణ్ మద్దతుతో వైసీపీని ఓడించొచ్చని.. దీంతో ఏపీలో తమ పరపతి పెరుగుతుందని.. పైగా సీఎం జగన్ కూడా తమ కంట్రోల్ లో ఉంటాడని బిజెపి స్కెచ్ వేసింది. ఇంతకూ బీజేపీకి గ్రేటర్ ఎన్నికలలో చేసిన సాయానికి బదులుగా మిత్రపక్షం జనసేనకు తిరుపతి సీటు ఇస్తారా.. లేక అక్కడ కూడా బీజేపీ నే పోటీ చేస్తుందా వేచి చూడాలి.

బీజేపీ దేశాన్ని అమ్మేస్తోంది! 50 ప్రశ్నలు సంధించిన కేటీఆర్‌

బీజేపీకి అవకాశం ఇస్తే హైదరాబాద్‌ను కూడా అమ్మేస్తారని విమర్శించారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఇప్పటికే మోడీ సర్కార్ భారతదేశాన్ని అమ్మేస్తోందని ఆరోపించారు. అన్నింటినీ ప్రైవేట్‌పరం చేయడమే బీజేపీ పాలసీ అన్నారు కేటీఆర్. రైల్వే రంగాన్ని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారో చెప్పాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయని హామీలంటూ బీజేపీ విడుదల చేసిన ఛార్జ్‌షీట్‌పై మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చాడు. బీజేపీ నేతలు గోబెల్స్‌ కజిన్స్‌లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం మంత్రులు సైతం అస్యతాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల కష్టాలను తీర్చినందుకా టీఆర్‌ఎస్‌ ప్రభత్వుంపై చార్జ్‌షీట్‌ విడుదల చేశారని బీజేపీ నేతలను ప్రశ్నించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో రైతుబంధు అమలు చేస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడలేని విదంగా 24 గంటల కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణాయే అన్నారు. తెలంగాణ నెంబర్‌ వన్‌ రాష్ట్రమని కేంద్రమంత్రులు చెప్పారని గుర్తుచేశారు.    బీజేపీకి 50 ప్రశ్నలు సంధించారు కేటీఆర్. లోయర్‌ సీలేరును తీసుకెళ్లి ఏపీలో కలిపింది బీజేపీ కాదా?అని ప్రశ్నించారు. పేకాట క్లబ్‌లు మూసివేయించినందుకా మాపై ఛార్జిషీట్‌? లక్షల మంది చిరు వ్యాపారుల పొట్టగొట్టారు.. వారు భాజపాపై ఛార్జిషీట్‌ వేయాలి. కరోనా సమయంలో చనిపోయిన వలస కార్మికుల ఆత్మలు ఛార్జిషీట్‌ వేయాలి అన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడుతున్నందుకు బీజేపీపై రైతులు ఛార్జిషీట్‌ వేయాలన్నారు. పెట్టు బడుల ఉపసంహరణ దేశ భవిష్యత్‌ కోసమా.. గుజరాత్‌ పెద్దల కోసమా? అని ప్రశ్నించారు.  ఐటీఐఆర్‌ రద్దు చేసింది ఎవరు? ఆరేళ్ల లో హైదరాబాద్‌కు బీజేపీ ఏం చేసిందో చెప్పగలరా? అని బీజేపీ నేతలను నిలదీశారు. ఇంటింటికి మంచి నీళ్లు, వేలాది గురుకులాలు పెట్టి పేద విద్యార్థులను చదివిస్తున్నందుకే  టీఆర్‌ఎస్‌పై చార్జ్‌షీట్‌ విడుదల చేశారా? అని బిజేపీ నేతలను ప్రశ్నించారు కేటీఆర్.

జీహెచ్ఎంసీకి కేంద్ర నిధులు ఇవ్వలేమన్న కిషన్! పార్టీకి భారమంటూ కేడర్ ఫైర్ 

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం కోసం దూకుడుగా పోరాడుతున్న బీజేపీకి సొంత పార్టీ నేతలే బ్రేకులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. నగరం నుంచే లోక్ సభకు ప్రాతినిధ్య వహిస్తూ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తీరుతో కమలం పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారం హోరాహారీగా జరుగుతున్న సమయంలో కేడర్ లో జోష్ నింపాల్సిన కిషన్ రెడ్డి.. పార్టీకి ఇబ్బంది కలిగించేలా మాట్లాడుతున్నారన్న చర్చ బీజేపీలోనే జరుగుతోంది. ముఖ్యంగా వరద సాయం, కేంద్ర నిధులపై ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని చెబుతున్నారు. కేంద్ర మంత్రిగా, నగర ఎంపీగా గ్రేటర్ ఎన్నికల్లో పార్టీని పరుగులు పెట్టాంచాల్సిన కిషన్ రెడ్డే.. పార్టీ భారంగా మారారనే చర్చ బీజేపీ నుంచే వినిపిస్తోంది.    జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వరద సాయం అంశం కీలకంగా మారింది. ప్రభుత్వం చేసిన 10 వేల రూపాయల ఆర్థిక సాయం కొందరికి మాత్రమే అందింది. దీంతో సాయం అందని వారంతా కేసీఆర్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీని గెలిపిస్తే వరద బాధితులకు సాయంగా 25 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు బండి సంజయ్. ఇది జనంలోకి బాగా వెళ్లింది. ఇది గ్రహించిన  అధికార పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు. వరద సాయం చేసేది జీహెచ్ఎంసీ కాదని, రాష్ట్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చిందని.. టీఆర్ఎస్సే ఇంకా మూడేళ్లు అధికారంలో ఉంటుంది కాబట్టి... సాయం చేయడం తమతోనే సాధ్యమని ఎన్నికల ర్యాలీలలో చెబుతూ వస్తున్నారు మంత్రి కేటీఆర్. ఇలాంటి సమయంలో కేంద్రం నుంచి నిధులు తెచ్చి వరద బాధితులకు సాయం చేస్తామని కిషన్ రెడ్డి ప్రకటిస్తే బీజేపీకి ఎంతో బూస్ట్ వచ్చేది. అయితే అలాంటి ప్రకటన చేయని కిషన్ రెడ్డి.. సంజయ్ హామీనే తప్పనే అర్దం వచ్చేలా మాట్లాడారు. స్థానిక సంస్థలకు కేంద్రం నిధులు ఇవ్వదని, అలా ఇవ్వడానికి చట్టాలు ఒప్పుకోవని చెప్పారు కిషన్ రెడ్డి.    కిషన్ రెడ్డి ప్రకటనతో కమలం నేతలు అవాక్కయ్యారట. సంజయ్ ఇచ్చిన వరద సాయం హామీ వల్ల వచ్చిన మైలేజీ అంతా కిషన్ రెడ్డి ప్రకటనతో పోయిందని గ్రేటర్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారట. వరద సాయం, కేంద్ర నిధులపై  కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మలుచుకుంది టీఆర్ఎస్. కిషన్ రెడ్డి కామెంట్లను నిమిషాల్లో వైరల్ చేసింది. కేంద్రం నిధులు ఇవ్వదని కేంద్రమంత్రి చెబుతుంటే.. ఇంటికి 25 వేల రూపాయలు సాయం చేస్తామంటూ ప్రజలను బండి సంజయ్ మోసం చేస్తున్నారంటూ.. ఇద్దరు మాట్లాడిన వీడియోలను జనంలోకి వదిలారు కారు పార్టీ నేతలు. ఆ వీడియోలు చూసిన జనాలకు కూడా.. బీజేపీ ఎక్కడి నుంచి తెచ్చి వరద సాయం చేస్తుందనే అనుమానాలు వస్తున్నాయని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారాల్లోనూ మంత్రి కేటీఆర్ పంచ్ డైలాగులతో విరుచుకుపడుతుంటే కిషన్ రెడ్డి మాత్రం సొల్లు ప్రసంగాలు చేస్తున్నారని.. ఇలా అయితే టీఆర్ఎస్ ను ఎదుర్కోవడం కష్టమనే అభిప్రాయం కమలం కేడర్ లో వస్తోంది అంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలోనూ కిషన్ రెడ్డి నామమాత్రంగా వ్యవహరించారని బీజేపీ నేతలు చెబుతున్నారు.     అంతేకాదు కిషన్ రెడ్డి ఎంఐఎం నేతలతో సన్నిహితంగా ఉంటారనే ప్రచారం ఉంది.  ఎంఐఎం సహకారం వల్లే అంబర్ పేట నుంచి ఎమ్మెల్యేగా  ఆయన వరుసగా గెలుస్తూ వచ్చారని కూడా చెబుతారు. ఇప్పుడు ఇది కూడా గ్రేటర్ ప్రచారంలో బీజేపీకి ఇబ్బందిగా మారిందంటున్నారు. గతంలో అసద్ తో కిషన్ రెడ్డి కలిసి ఉన్న ఫోటోలు, వారిద్దరు వేదికలపై నవ్వుతూ మాట్లాడుతూ కూర్చున్న వీడియోలను కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు. దీంతో గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న కమలం నేతలకు ఇది మైనస్ గా మారిందని బీజేపీ నేతలే చెబుతున్నారు. గ్రేటర్ టికెట్ల  విషయంలోనూ కిషన్ రెడ్డి వ్యవహారం వల్లే కొన్ని చోట్ల కార్యకర్తలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు.

తిరుపతి కోసం గ్రేటర్ ఫిక్సింగ్? పవన్ పై రోజా పంచ్ 

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు సంబంధించి పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా. గ్రేటర్ ఎన్నికల్లో  బీజేపీ కోసం జనసేన తప్పుకుందని చెప్పారు. తిరుపతిలో సీటు కావాలని అన్నాడు అంటే మ్యాచ్ ఫిక్సింగ్ అని భావించాలా?.. గ్రేటర్ లో వదులుకున్నాం కాబట్టి తిరుపతిలో సీటు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారా?" అని పవన్ ను టార్గెట్ చేస్తూ రోజా ప్రశ్నించారు. బీజేపీకి కొన్ని ఓట్లు పడాలి, టీఆర్ఎస్ ఓడాలి అంటూ ఎన్నికల నుంచి పవన్ వైదొలిగారు.. ఇప్పుడు తిరుపతికొచ్చి పోటీచేస్తున్నారని రోజా అన్నారు. గతంలో తన సొంత నియోజకవర్గంలో, తన సొంతవాళ్ల మధ్యే గెలవలేని వ్యక్తి ఇప్పుడు తిరుపతి వచ్చి ఏం చేస్తాడని ఆమె ప్రశ్నించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తిరుపతిలో గెలిచేది వైసీపీనే అని స్పష్టం చేశారు.    జనసేన పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు రోజా. జనసేన పార్టీయా లేక కేటీఆర్ అన్నట్టు మోడీ భజనసేన పార్టీయా అనేది అర్థం కావడంలేదని రోజా ఎద్దేవా చేశారు. పార్టీ స్థాపించిన వెంటనే ఎన్నికలకు పోకుండా టీడీపీ, బీజేపీలకు  ప్రచారం చేసి వాళ్లకు ఓట్లు వేయాలని ప్రజలకు చెప్పారని ఆమె విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న మోడీ గారు ఇవ్వకపోయినా పవన్ ఏమీ మాట్లాడలేదని రోజా విమర్శించారు.