డిసెంబర్ 25న 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ! ఏపీ కేబినెట్ ఆమోదం
posted on Nov 27, 2020 @ 4:53PM
డిసెంబర్ 25న 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు 28లక్షల 30వేల ఇళ్ల నిర్మాణానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. హౌసింగ్ కాలనీల నిర్మాణానికి ఓకే చెప్పింది. డిసెంబర్ 8న 2.49లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ, అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముసాయిదా బిల్లులు, కురుపాం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీకి 105 ఎకరాల భూ సేకరణ, 2019 ఖరీఫ్ ఉచిత పంటల బీమా పథకానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఏపీ ఫిషరీస్ యూనివర్శిటీ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.9,027 కోట్లతో భూముల సమగ్ర సర్వేకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
నివర్ తుపానుపై కేబినెట్లో చర్చించామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. 30 వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలు , 1300 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయన్నారు. డిసెంబర్ 30 కల్లా పంట నష్టపరిహారాన్ని అందించాలని సీఎం ఆదేశించారని కన్నబాబు చెప్పారు. సుమారు 10వేల మందికిపైగా సహాయక శిబిరాలకు తరలించామని, శిబిరాల్లో ఉన్నవారికి రూ.500 ఇవ్వాలని సీఎం ఆదేశించారని మంత్రి తెలిపారు.
ఉద్యోగులు, పింఛన్దారుల డీఏ బకాయిల్ని చెల్లించాలని నిర్ణయించామని, 3.144 శాతం డీఏ పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు కన్నబాబు. ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలన్నీ పూర్తిగా చెల్లించాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. కరోనా సమయంలో జీతాలు, పింఛన్లలో విధించిన కోత డిసెంబర్, జనవరి నెలలో చెల్లింపులు చేస్తామని చెప్పారు. డిసెంబర్ 25న 30లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని, మూడేళ్లలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఇసుకను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించామన్నారు.