కేసీఆర్ దొర మాస్టర్ ప్లానే వేశారు! విజయశాంతి ట్వీట్
posted on Nov 27, 2020 @ 10:09AM
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. మూడు రోజుల్లో ప్రచారం ముగియనుండటంతో అభ్యర్థులు స్పీడ్ పెంచారు. అయితే గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి సీఎం కేసీఆర్ పై ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు విజయశాంతి. ఎంఐఎం పార్టీ మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే... కేసీఆర్ దానిని కట్టడి చేయలేకపోయారని ఆరోపించారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే వారిని కంట్రోలే చేయకపోగా.. ఎంఐఎం దౌర్జన్యాన్ని నిలదీసిన పార్టీలను నియంత్రించే విధంగా పోలీసు బలగాలను ప్రయోగించడానికి సీఎం దొరగారు మాస్టర్ ప్లాన్ వేశారనే వార్తలు వస్తున్నాయని విజయశాంతి ట్వీట్ చేశారు.
'ఇంతకాలం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను హైజాక్ చెయ్యడం లేదా ఎన్నికలు పూర్తయిన తర్వాత గెలిచిన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను ప్రలోభపెట్టి ఫిరాయింపులను ప్రోత్సహించడం కేసీఆర్ గారికి అలవాటుగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇలాంటి రాజకీయాలు ఫలించవనే నిర్ణయానికి రావడంతో ఏకంగా బలమైన ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను శాంతిభద్రతల పేరుతో బరిలో నుంచి తప్పించడానికి గులాబీ బాస్ కొత్త ఎత్తుగడ వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ కుట్రలకు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తే తెలంగాణ సమాజం సహించదు, క్షమించదు అని రాములమ్మ ట్వీట్ లో చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్షాల దూకుడును తట్టుకోలేక బెంబేలెత్తిపోతున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఎంఐఎంతో కలసి కుట్రలు చేసి ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను చివరి క్షణంలో పోటీ నుంచి తప్పించేందుకు కుయుక్తులు పన్నుతున్నారనే అనుమానాలు బలపడుతున్నాయని ఆమె ట్వీట్ చేశారు.