లాస్ట్ ఛాన్స్‌.. జ‌గ‌న్ బెయిల్‌ ర‌ద్దుపై విచార‌ణ‌..

ఇదే లాస్ట్ ఛాన్స్‌. బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌పై కౌంట‌ర్ దాఖ‌లు చేయండి అంటూ జ‌గ‌న్  బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌పై విచార‌ణ‌ను ఈ నెల 26కు వాయిదా వేసింది సీబీఐ కోర్టు.  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు జ‌రుగుతున్నాయి. ఓవైపు ఎంపీ ర‌ఘురామ కృష్ణరాజుకు బెయిల్ కోసం ఆయ‌న హైకోర్టు, సుప్రీంకోర్టులో గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నారు. త‌న‌పై ఏపీ సీఐడీ అక్ర‌మంగా కేసు పెట్టారంటూ పోరాడుతున్నారు. ర‌ఘురామ బెయిల్ పిటిష‌న్‌పై ఏటూ తేల్చ‌కుండా సుప్రీంకోర్టు కేసు విచార‌ణ‌ను శుక్ర‌వారానికి వాయిదా వేసింది.  మరోవైపు.. ఇదే రోజు అక్ర‌మాస్తుల కేసులో ఏపీ సీఎం జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాలంటూ ఎంపీ ర‌ఘురామ వేసిన పిటిష‌న్ సైతం సీబీఐ కోర్టులో విచార‌ణ‌కు వ‌చ్చింది. దీనిపై కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని న్యాయ‌స్థానం ఇది వ‌ర‌కే జ‌గ‌న్‌, సీబీఐను ఆదేశించింది. ఈ నెల 7న విచార‌ణ‌ జ‌రిగిన స‌మ‌యంలో కౌంట‌ర్ దాఖ‌లుకు జ‌గ‌న్‌, సీబీఐ త‌ర‌ఫు న్యాయ‌వాదులు స‌మ‌యం కోరారు. తాజాగా, ఇవాళ కూడా మరోసారి గ‌డువు కావాలంటూ సీబీఐ కోర్టును కోరారు. ఈ క్ర‌మంలో సీబీఐ కోర్టు కాస్త ఘాటుగా స్పందించింది. కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌డానికి ఇదే చివ‌రి అవ‌కాశం అంటూ.. విచార‌ణ‌ను ఈ నెల 26కి వాయిదా వేసింది సీబీఐ కోర్టు.  బెయిల్‌పై వ‌చ్చి ముఖ్య‌మంత్రిగా ఉంటూ.. జగన్‌ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని రఘురామ ఇటీవ‌ల సీబీఐ కోర్టులో పిటిష‌న్ వేశారు. జ‌గ‌న్‌ బెయిల్‌ రద్దు చేసి వేగంగా విచారణ చేపట్టాలని కోర్టును కోరారు ర‌ఘురామ‌. ఆ పిటిష‌న్‌ను సీబీఐ కోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించింది. కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని జ‌గ‌న్‌ను, సీబీఐని ఆదేశించింది. అయితే, కౌంట‌ర్ దాఖ‌లుకు ప‌దే ప‌దే గ‌డువు కోరుతుండ‌టంతో.. ఇదే లాస్ట్ ఛాన్స్ అంటూ.. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌పై విచార‌ణ‌ను వాయిదా వేసింది సీబీఐ కోర్టు.  జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కోసం ఎంపీ ర‌ఘురామ పిటిష‌న్ వేసినందుకే ఆయ‌న్ను ఏపీ స‌ర్కారు టార్గెట్ చేసి.. కేసు పెట్టి.. అరెస్ట్ చేసి.. జైలుకు పంపించింద‌నే విమ‌ర్శ‌లు కూడా వినిపిస్తున్నాయి. ఇటు, జ‌గ‌న్‌ బెయిల్ ర‌ద్దు కోసం కోర్టులో పోరాడుతూనే.. అటు, త‌నకు బెయిల్ కోసం ర‌ఘురామ సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. 

ర‌ఘురామ బెయిల్‌పై విచార‌ణ వాయిదా.. ఆరోగ్య ప‌రీక్ష‌ల‌పై ఉత్కంఠ‌..

అటో ఇటో తేలిపోతుంది అనుకున్నారు. ఇవాళ మ‌ధ్యాహ్నం ఉత్త‌ర్వులు వ‌స్తాయ‌ని భావించారు. కానీ, ఉత్కంఠగా మారిన సుప్రీంకోర్టులో ఎంపీ ర‌ఘురామ బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ శుక్ర‌వారానికి వాయిదా ప‌డింది. ఎంపీ ర‌ఘురామ‌కు బెయిల్ మంజూరుతో పాటు ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో వైద్యం అందించాలంటూ ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాదులు గ‌ట్టిగానే వాదించారు. ఏపీ ప్ర‌భుత్వ త‌ర‌ఫు లాయ‌ర్లు బెయిన్‌ను వ్య‌తిరేకిస్తూ వాద‌న‌లు వినిపించారు. ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం.. త‌దుప‌రి విచార‌ణ‌ను శుక్ర‌వారానికి వాయిదా వేసింది. గురువారం లోపు కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ఏపీ ప్ర‌భుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.  నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. జ‌స్టిస్ వినీత్ శ‌ర‌న్‌, జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్‌ల వెకేష‌న్ బెంచ్ కేసుపై విచార‌ణ చేపట్టింది. రఘురామ తరఫున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, ఆదినారాయణ.. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాదులు దుష్యంత్‌ దవే, వీవీ గిరి వాదనలు వినిపించారు.  బెయిల్‌ మంజూరుతో పాటు ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్యం అందించేందుకు రఘురామకు అవకాశం కల్పించాలని ముకుల్‌ రోహత్గీ కోర్టును కోరారు. ఎంపీని అరెస్ట్‌ చేసిన తీరును న్యాయస్థానానికి ఆయన వివరించారు. ప్రైవేట్‌ ఆస్పత్రిలో కూడా వైద్య పరీక్షలు చేయించాలని కింది కోర్టు ఆదేశించినా అధికారులు ఆ పనిచేయలేదని చెప్పారు. కేవలం బెయిల్‌ రాకూడదనే సెక్షన్‌ 124(ఏ) కింద కేసు నమోదు చేశారన్నారు. రఘురామపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. అదనపు డీజీ స్వయంగా విచారణకు ఆదేశించారని.. దాని ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. గుంటూరు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అక్కడ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని రోహత్గీ కోర్టుకు చెప్పారు.  కస్టడీలో రఘురామను తీవ్రంగా కొట్టి హింసించారని.. అరికాళ్లకు తగిలిన గాయలను ఎంపీ మెజిస్ట్రేట్‌కు చూపించారని తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌లో రఘురామకృష్ణరాజుకు బైపాస్‌ సర్జరీ జరిగిన విషయాన్ని ముకుల్‌ రోహత్గీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.  అనంతరం ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినించారు. రమేశ్‌ ఆస్పత్రి వైద్యులతో పరీక్షలు చేయాలన్న రోహత్గీ వాదనలపై దవే అభ్యంతరం తెలిపారు. మంగళగిరి ఎయిమ్స్‌ వైద్యులతో పరీక్షలు చేయిస్తే అభ్యంతరం లేదన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్‌ వినీత్‌ శరన్‌ స్పందిస్తూ ఆర్మీ ఆస్పత్రి ఉందా అని ప్రశ్నించారు. దీనిపై రఘురామ తరఫు న్యాయవాది ఆదినారాయణరావు స్పందిస్తూ సికింద్రాబాద్‌లో ఉందని చెప్పగా.. సమీపంలోని ఏపీలో లేదా తెలంగాణలో ఆర్మీ ఆస్పత్రి ఉందా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. సికింద్రాబాద్‌లో ఉందని.. అక్కడి నుంచే నిందితుణ్ణి అరెస్ట్‌ చేసి తీసుకొచ్చారని ఆదినారాయణరావు తెలిపారు. ఆంధ్రాలో విశాఖపట్నంలో నేవల్‌ బేస్‌ ఆస్పత్రి ఉందని.. అది కూడా 300 కి.మీ కంటే ఎక్కువ దూరమని వివరించారు. అనంతరం తదుపరి విచారణను ధర్మాసనం మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది. ఈలోపు మెయిల్‌ ద్వారా సంబంధిత పత్రాలను పంపించాలని సూచించింది. శుక్రవారానికి విచారణ వాయిదా  మధ్యాహ్నం 12 గంటల తర్వాత తిరిగి విచారణ ప్రారంభమైన తర్వాత రఘురామ వైద్యపరీక్షలకు 10కి.మీ దూరంలో విజయవాడ మణిపాల్‌ ఆస్పత్రి ఉందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్‌ దవే తెలిపారు. వైద్య పరీక్షలకు ఢిల్లీ ఎయిమ్స్‌ మంచిదని రఘురామ తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ అన్నారు. మంగళగిరి ఎయిమ్స్‌తో కొన్ని భయాలు ఉన్నాయని.. అక్కడి పాలకమండలిలో ఇద్దరు అధికార పార్టీ ఎంపీలు ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించాలని ఆయన కోరారు. సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని రఘురామ పిటిషన్‌ వేసినందున చాలా ఇబ్బందులు ఉన్నాయని రోహత్గీ న్యాయస్థానానికి తెలిపారు. ఎయిమ్స్‌కు తరలింపుపై తమకు అభ్యంతరం లేదని కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ (ఎస్‌జీ) తుషార్‌ మెహతా అన్నారు. పరీక్షలు ఆర్మీ ఆస్పత్రిలో ఎందుకు నిర్వహించకూడదని జస్టిస్‌ వినీత్‌ శరన్‌ ప్రశ్నించారు. ఆర్మీ ఆస్పత్రిని రాజకీయాల్లోకి లాగడం ఎందుకని ఎస్‌జీ వ్యాఖ్యానించగా.. ఇందులో రాజకీయం లేదని.. ఒక న్యాయాధికారిని నియమిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేవలం వైద్య పరీక్షలకు మాత్రమే అనుమతివ్వాలని.. ఆస్పత్రిలో అడ్మిషన్‌కు అవకాశం ఇవ్వొద్దని దవే కోరారు. పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని.. గురువారం నాటికి కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.   

వెల్‌డ‌న్ పోలీస్‌.. లాక్‌డౌన్ చ‌ర్య‌ల‌పై హైకోర్టు ప్ర‌శంస‌లు..

3.39 ల‌క్ష‌ల కేసులు. 31 కోట్ల జ‌రిమానా. ఇదీ తెలంగాణ‌లో లాక్‌డౌన్ సంద‌ర్భంగా పోలీసుల ప‌నితీరు. తెలంగాణ‌లో క‌రోనా ప‌రిస్థితుల‌పై హైకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. డీజీపీతో పాటు హైద‌రాబాద్‌, రాచ‌కొండ‌, సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్లు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. లాక్‌డౌన్‌తో పాటు క‌రోనా నిబంధ‌న‌ల అమ‌లుపై కోర్టుకు నివేదిక‌ను స‌మ‌ర్పించారు.  మాస్కులు లేని వారిపై 3,39,412 కేసులు న‌మోదు చేశారు పోలీసులు. మందుల బ్లాక్ మార్కెటింగ్‌పై 98 కేసులు పెట్టారు. భౌతిక‌దూరం పాటించ‌నందుకు 22,560 కేసులు ఫైల్ చేశారు. మొత్తం 31 కోట్ల జ‌రిమానా వ‌సూలయ్యాయి అంటూ పోలీసులు హైకోర్టుకు నివేదించారు. లాక్‌డౌన్‌, రాత్రి క‌ర్ఫ్యూ ప‌క‌డ్బందీగా అమ‌లు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని డీజీపీ కోర్టుకు తెలిపారు.  పోలీసుల ప‌నితీరును హైకోర్టు ప్ర‌శంసించింది. ఇదే స్పూర్తితో ప‌ని చేయాల‌ని సూచించింది. డీజీపీతో పాటు ముగ్గురు క‌మిష‌న‌ర్ల‌ను అభినందించింది హైకోర్టు.  లాక్‌డౌన్ సంద‌ర్భంగా తెలంగాణ పోలీసులు నిర్విరామంగా ప‌ని చేస్తున్నారు. 24 గంట‌ల పాటు నాన్‌స్టాప్‌గా లాక్‌డౌన్‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఉద‌యం 6 నుంచి 10 గంట‌ల మ‌ధ్య‌.. లాక్‌డౌన్‌కు స‌డ‌లింపు ఉండ‌టంతో.. ఆ స‌మ‌యంలో ప్ర‌జ‌లు ఒకేచోట గుమ్మి కూడి ఉండ‌కుండా గ‌ట్టి చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఎవ‌రైనా మాస్కు పెట్టుకోక‌పోయినా.. గుంపులుగా క‌నిపించినా.. అక్క‌డిక‌క్క‌డే ఫైన్‌లు విధిస్తున్నారు. ఇక ఉద‌యం 10 గంట‌ల త‌ర్వాత అస‌లు ప‌ని మొద‌ల‌వుతుంది. స‌రైన కార‌ణం లేకుండా ఎవ‌రైనా బ‌య‌ట‌కి వ‌స్తే పోలీసులు ప‌ట్టేసుకుంటున్నారు. వివ‌రాలు ఆరా తీసి.. అన‌వ‌స‌రంగా రోడ్డు మీద‌కు వ‌చ్చార‌ని భావిస్తే.. జ‌రిమానా విధించి వ‌సూలు చేస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తోనే కాస్త క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. లాక్‌డౌన్‌ను ప‌ర్‌ఫెక్ట్‌గా అమ‌లు చేస్తున్నారు. అందుకు నిద‌ర్శ‌న‌మే.. 3.39 ల‌క్ష‌ల కేసులు.. 31 కోట్ల జ‌రిమానాలు. అందుకే, హైకోర్టు పోలీసుల ప‌నితీరును మెచ్చి వారిని అభినందించింది. 

మార్కెట్లోకి 2DG.. డీఆర్‌డీవో త‌యారీ క‌రోనా మెడిసిన్‌..

కొవిడ్‌ బాధితులకు మరో మెడిసిన్ అందుబాటులోకి వచ్చింది. కరోనా చికిత్సలో ఉపయోగించడం కోసం డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన ‘2డీజీ (2-డియాక్సీ డి-గ్లూకోజ్‌)’ ఔషధం విడుదలైంది. ఢిల్లీలో కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తొలి బ్యాచ్‌ 2డీజీ సాచెట్లను కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌కు అందించారు. ఆరోగ్య మంత్రి వాటిని ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియాకు ఇచ్చారు. 2డీజీ ఔషధంతో కొవిడ్‌ రికవరీ సమయం తగ్గడంతో పాటు ఆక్సిజన్‌ అవసరం కూడా తగ్గుంతుందని ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. కరోనా మహమ్మారిపై పోరులో డీఆర్‌డీవో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.  తొలి విడతలో 10వేల సాచెట్లను అందుబాటులోకి తెచ్చారు. మే 27, 28 తేదీల్లో రెండో విడతలో భాగంగా మరిన్ని సాచెట్లు విడుదల చేయ‌నున్నారు. జూన్‌ నాటికి పూర్తి స్థాయిలో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయని ఔషధాన్ని ఉత్పత్తి చేస్తున్న డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ తెలిపింది. అయితే దీని ధరను డీఆర్‌డీవో ఇంకా ప్రకటించలేదు. కొవిడ్‌ పోరులో ఈ ఔషధం అత్యవసర వినియోగానికి మే 1న డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) అనుమతి ఇచ్చింది.    కరోనా కట్టడి కోసం డీఆర్‌డీవో ఏడాది పాటు శ్రమించి ఈ ఔషధాన్ని తీసుకొచ్చింది. గతంలో దీన్ని క్యాన్సర్‌ కోసం తయారుచేశారు. శరీరంలో క్యాన్సర్‌ కణాలకు గ్లూకోజ్‌ అందకుండా ఈ మందు అడ్డుకుంటుందని అప్పట్లో శాస్త్రవేత్తలు తెలిపారు. ఇదే సూత్రాన్ని కొవిడ్‌కు అన్వయించుకుని పరిశోధనలు ప్రారంభించారు. శరీరంలోకి ప్రవేశించిన కొవిడ్‌ వైరస్‌ కణాలకు గ్లూకోజ్‌ అందకపోతే కణ విభజన జరగదని, ఫలితంగా శరీరంలో కరోనా వ్యాప్తి కూడా ఆగుతుందని శాస్త్రవేత్తలు వివరించారు.  

ర‌ఘురామ బెయిల్‌పై సుప్రీంలో వాదనలు..

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు జ‌రిగాయి. జ‌స్టిస్ వినీత్ శ‌ర‌న్‌, జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్‌ల వెకేష‌న్ బెంచ్ దీనిపై విచార‌ణ చేపట్టింది. రఘురామ తరఫున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, ఆదినారాయణ.. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాదులు దుష్యంత్‌ దవే, వీవీ గిరి వాదనలు వినిపించారు.  బెయిల్‌ మంజూరుతో పాటు ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్యం అందించేందుకు రఘురామకు అవకాశం కల్పించాలని ముకుల్‌ రోహత్గీ కోర్టును కోరారు. ఎంపీని అరెస్ట్‌ చేసిన తీరును న్యాయస్థానానికి ఆయన వివరించారు. ప్రైవేట్‌ ఆస్పత్రిలో కూడా వైద్య పరీక్షలు చేయించాలని కింది కోర్టు ఆదేశించినా అధికారులు ఆ పనిచేయలేదని చెప్పారు. కేవలం బెయిల్‌ రాకూడదనే సెక్షన్‌ 124(ఏ) కింద కేసు నమోదు చేశారన్నారు. రఘురామపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. అదనపు డీజీ స్వయంగా విచారణకు ఆదేశించారని.. దాని ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. గుంటూరు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అక్కడ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని రోహత్గీ కోర్టుకు చెప్పారు.  కస్టడీలో రఘురామను తీవ్రంగా కొట్టి హింసించారని.. అరికాళ్లకు తగిలిన గాయలను ఎంపీ మెజిస్ట్రేట్‌కు చూపించారని తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌లో రఘురామకృష్ణరాజుకు బైపాస్‌ సర్జరీ జరిగిన విషయాన్ని ముకుల్‌ రోహత్గీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.  అనంతరం ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినించారు. రమేశ్‌ ఆస్పత్రి వైద్యులతో పరీక్షలు చేయాలన్న రోహత్గీ వాదనలపై దవే అభ్యంతరం తెలిపారు. మంగళగిరి ఎయిమ్స్‌ వైద్యులతో పరీక్షలు చేయిస్తే అభ్యంతరం లేదన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్‌ వినీత్‌ శరన్‌ స్పందిస్తూ ఆర్మీ ఆస్పత్రి ఉందా అని ప్రశ్నించారు. హైద‌రాబాద్‌లోని ఆర్మీ హాస్పిట‌ల్ అయినా ఓకే అని ర‌ఘురామ త‌ర‌ఫు న్యాయ‌వాదులు తెలిపారు. త‌మ‌కు ఇంకా హైకోర్టు ఉత్త‌ర్వుల కాపీ అంద‌లేద‌ని ఏపీ ప్ర‌భుత్వ న్యాయ‌వాదులు తెలుప‌గా.. పిటిష‌న‌ర్ త‌ర‌ఫు లాయ‌ర్ల నుంచి తీసుకోవాల‌ని సూచించారు. త‌దుప‌రి విచార‌ణ మ‌ధ్యాహ్నానికి వాయిదా వేశారు.

బాబోయ్‌.. అతిభీకర తుఫాను.. ఏపీ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు..

స‌డెన్‌గా వ‌చ్చింది. సైలెంట్‌గా ఎంట్రీ ఇస్తోంది. ఇప్పుడు సునామీలా విరుచుకుప‌డుతోంది. ‘తౌక్టే’ తుఫాను దేశ పశ్చిమ తీర రాష్ట్రాలను ముంచేస్తోంది. ఇప్పటికే గోవా, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది. తాజాగా, మరింత బలపడి ‘అతి భీకర తుపాను’గా మారినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.  ప్రస్తుతం గుజరాత్‌ వైపు పయనిస్తున్న తౌక్టే.. మంగళవారం ఉదయం నాటికి భావనగర్‌ జిల్లాలోని పోర్‌బందర్‌-మహువా ప్రాంతం ద‌గ్గ‌ర‌ తీరాన్ని తాకే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుఫాను హెచ్చ‌రిక‌ల‌తో గుజరాత్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.   తుపాను ఉద్ధృతి దృష్ట్యా ముంబయిలో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది వాతావ‌ర‌ణ శాఖ‌. నగరవ్యాప్తంగా పలు చోట్ల సోమవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ఇప్పటికే ముంబైలో వాన‌లు మొద‌లైపోయాయి. దీంతో ముంబయి పశ్చిమ శివారుల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. గత అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది. తీరంలో నేవీ సిబ్బందిని అప్రమత్తం చేసింది. ముంబయితో పాటు ఠాణె, రాయ్‌గఢ్‌, పాల్ఘర్‌ జిల్లాల్లోనూ వర్షాలు పడే అవకాశమున్నట్లు  వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో విమాన రాకపోకలను నిలిపివేశారు.   అటు, తుపాను ప్రభావంతో గుజరాత్‌ ప్రభుత్వం కూడా సహాయక బృందాలను సిద్ధం చేసింది. తుపాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలు పడే అవకాశమున్నందున కోల్‌కతా, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు గుజరాత్‌ వెళ్లాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి మొత్తం 126 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది మూడు వాయుసేన విమానాల్లో బయల్దేరివెళ్లారు. మరోవైపు ఇప్పటికే గుజరాత్‌ తీరంలో గంటకు 175 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. తుపాను తీరాన్ని తాకే పోర్‌బందర్‌, మహువా ప్రాంతాల మధ్య లోతట్టు ప్రాంతాల్లోని దాదాపు 25వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ కోరారు. 

రుయా ఘ‌ట‌న‌పై హైకోర్టులో పిల్‌.. జ్యూడిషియ‌ల్ విచారణకు పిటిష‌న్‌..

తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఆక్సిజన్ అందక రుయా ఆసుపత్రిలో చనిపోయిన కొవిడ్ బాధితులకు ప్రభుత్వం కోటి రూపాయల నష్ట పరిహారం అందించాలని పిటిషన్‌లో కోరారు. రుయా ఆసుపత్రి ఘటనపై జ్యూడిషియ‌ల్ విచారణ జరిపించాలని పిల్‌లో తెలిపారు. రుయా ఆస్పత్రిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో 5 ఆక్సిజన్ ప్లాంట్స్ వెంటనే నెలకొల్పాలని, కొవిడ్ బాధితులకు మందులు, ఆక్సిజన్ అవసరమైన ఇతర సదుపాయాలు ఆలస్యం లేకుండా  రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో అందించాలంటూ పిటిష‌న‌ర్ హైకోర్టులో ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లు చేశారు. ఇటీవ‌ల ఆక్సిజ‌న్ అంద‌క తిరుప‌తి రుయా హాస్ప‌టిల్‌లో 11మంది కొవిడ్‌ పేషెంట్స్‌ ప్రాణాలు వ‌దిలిన విష‌యం తెలిసిందే. మృతుల సంఖ్య‌పైనా ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. త‌మిళ‌నాడు నుంచి రావాల్సిన ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ ఆల‌స్యం కావ‌డంతో.. రుయాలో ప్రాణ‌వాయువు నిలిచిపోయి.. కొవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోవ‌డం క‌ల‌క‌లం రేపింది. ప్ర‌భుత్వ ఉదాసీన‌త వ‌ల్లే ఆ మ‌ర‌ణాలు సంభ‌వించాయంటూ.. అందుకు స‌ర్కారుదే బాధ్య‌త అంటూ విప‌క్షాలు ఆరోపించాయి. ఆక్సిజ‌న్ నిల్వ‌ల‌ను స‌మ‌కూర్చుకోలేని చేత‌గాని స‌ర్కారు అంటూ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. తాజాగా, రుయా ఆసుప‌త్రి ఘ‌ట‌న‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసి,  జ్యూడిషియ‌ల్ విచార‌ణ జ‌ర‌పాలంటూ హైకోర్టులో పిల్ దాఖ‌ల‌వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

క‌రోనా కేసులు త‌గ్గుతున్నాయ్‌.. మ‌ర‌ణాలు పెరుగుతున్నాయ్‌..

దేశంలో క‌రోనా కేసులు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. వ‌రుస‌గా నాలుగో రోజు కొత్త కేసులు త‌గ్గాయి. తాజాగా, 3 లక్షల దిగువన నమోదయ్యాయి. ఆదివారం 15,73,515 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 2,81,386 మందికి పాజిటివ్‌గా తేలింది. ఏప్రిల్‌ 20న 2.95 లక్షల మందికి కరోనా నిర్ధారణ కాగా.. ఈ తర్వాత 3 లక్షలకు దిగువన కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. వరసగా నాలుగో రోజు కొత్త కేసుల సంఖ్య తగ్గడంతో దాని ప్రభావం క్రియాశీల కేసుల్లో కనిపించింది. ప్రస్తుతం 35,16,997 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. నిన్న ఒక్కరోజే 3,78,741 మంది మహమ్మారి నుంచి కోలుకోవడం గమనార్హం. కొత్త కేసుల కంటే రికవరీలు భారీగా పెరిగాయి. మొత్తంగా 2,11,74,076 మంది వైరస్‌ను జయించారు. అయితే ఆదివారం కొవిడ్‌ పరీక్షల సంఖ్యలో తగ్గుదల కూడా పాజిటివ్ కేసుల తగ్గుదలకు కారణంగా కనిపిస్తోంది.    అయితే.. కొత్త కేసులు త‌గ్గుతున్నా.. మ‌ర‌ణాల సంఖ్య మాత్రం భారీగా న‌మోద‌వుతూ భ‌య‌పెడుతోంది. దేశంలో కరోనా సృష్టిస్తోన్న విలయం భారీ సంఖ్యలో ప్రాణాలను హరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 4వేల మందికి పైగా ప్రాణాలను బలితీసుకుంది. ఆదివారం ఒక్కరోజే 4,106 మంది మృత్యువాత ప‌డ్డారు. మొత్తం కేసులు సంఖ్య 2.49 కోట్లకు చేరగా.. ఇప్పటివరకు 2,74,390 మంది ప్రాణాలు కోల్పోయారు.  మరోవైపు, దేశంలో నిర్వహిస్తోన్న కరోనా టీకా కార్యక్రమంలో ఆశించిన వేగం కనిపించడంలేదు. ఆదివారం కేవలం 6,91,211 మందికి మాత్రమే టీకాలు అందించారు. మొత్తంగా ప్రభుత్వం 18,29 కోట్ల డోసులను పంపిణీ చేసింది.  

ఇంకా జైలులోనే ర‌ఘురామ.. ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌డంలో ఆల‌స్యం..

ఏపీ హైకోర్టు ఆదేశాల మేర‌కు ఎంపీ రఘురామ‌కృష్ణ‌రాజును ఈ ఉద‌యం గుంటూరులోని ర‌మేశ్‌ ఆస్ప‌త్రికి త‌రలించాల్సి ఉంది. అయినా, అధికారులు ఆ మేర‌కు చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేదు. దీంతో ఆయ‌న ఇంకా జిల్లా జైలులోనే ఉన్నారు. ఎంపీని రమేశ్ ఆస్ప‌త్రికి త‌ర‌లించాల‌ని ఉన్న‌త న్యాయ‌స్థానం ఆదివారం రాత్రి ఆదేశించింది. కాగా.. త‌ర‌లింపున‌కు సంబంధించి ఆర్డ‌ర్ కాపీ ఆల‌స్యం అయిన‌ట్టు తెలుస్తోంది. ర‌ఘురామ త‌ర‌ఫు లాయ‌ర్లు జైలు అధికారుల‌కు కోర్టు ఉత్త‌ర్వులు అంద‌జేశారు. జైలు నిబంధ‌న‌ల మేర‌కు ఫార్మాలిటీస్ పూర్తి చేశాక‌.. ర‌ఘురామ‌ను ర‌మేశ్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లిస్తార‌ని తెలుస్తోంది.  మ‌రోవైపు, ర‌ఘురామ‌ను ర‌మేశ్ ఆస్పత్రికి త‌ర‌లించే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో దీనికి వ్య‌తిరేకంగా ప్ర‌భుత్వ త‌ర‌ఫున అధికారులు హైకోర్టులో పిటిష‌న్ వేయ‌నున్న‌ట్లు స‌మాచారం. అటు, సీఐడీ అధికారుల తీరుపై ర‌ఘురామ కుటుంబ‌స‌భ్యులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.   ఆదివారం ర‌ఘురామ‌కు జీజీహెచ్‌లో మాత్ర‌మే వైద్య ప‌రీక్ష‌లు నిర్వహించి ర‌మేశ్ ఆస్పత్రికి తీసుకెళ్ల‌కుండా వెనుక గేటు నుంచి నేరుగా గుంటూరు జైలుకు త‌ర‌లించ‌డం వివాదాస్ప‌ద‌మైంది. మెజిస్ట్రేట్‌ కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఎంపీని రమేశ్‌ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై అద‌న‌పు అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ (ఏఏజీ) అభ్యంతరం తెలుపుతూ రమేశ్‌ ఆసుపత్రికి తరలించడం అంటే టీటీడీ కార్యాలయానికి పంపడం లాంటిదేనన్నారు. అగ్నిప్రమాదం జరిగి పది మంది చనిపోయిన వ్యవహారంలో రమేశ్‌ ఆసుపత్రి ఎండీపై ఇప్పటికే ప్రభుత్వం కేసు నమోదు చేసిందని గుర్తుచేశారు. అక్కడికి పంపొద్దని కోరగా ధర్మాసనం నిరాకరించింది. మెజిస్ట్రేట్‌ ఉత్తర్వులను కనీసం రెండు రోజులైనా నిలుపుదల చేయాలన్న ఏఏజీ అభ్యర్థననూ హైకోర్టు ఆదివారం తోసిపుచ్చింది. 

ఆరోగ్యశ్రీలో కరోనా ... ఆర్థిక పరిస్థితే అవరోధమా? 

తెలంగాణా ప్రభుత్వం కరోనా కట్టడి, చికిత్సను ఆర్థిక కోణంలో చూస్తోందా, అంటే ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు అవుననే అంటున్నాయి. ఓ వంక మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులు, రాష్ట్రంలో కరోనా కట్టడి, చికిత్సకు ఎటువంటి నిధుల కొరత లేదని పదే పదే చెపుతున్నారు. అయితే అదేసమయంలో ప్రభుత్వ చర్యలు మాత్రం అందుకు విరుద్దంగా ఉంటున్నాయని, ప్రతి పక్ష నాయకులు, ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా, పేద మధ్య తరగతి ప్రజల బతుకులను చిత్రం చేస్తున్న కరోనాను ఆరోగ్య శ్రీ’లో చేర్చాలని, సొంత పార్టీ ఎమ్మెల్యే, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మొదలు, కాంగ్రెస్, బీజేపీ తదితర ప్రతిపక్ష పార్టీలు, చాలా కాలంగా  డిమాండ్ చేస్తున్నాయి.అయినా, ప్రభుత్వంలో స్పందన లేదు. ఇంకా పుట్టని షర్మిల పార్టీ మొదలు అన్ని పార్టీలు, చివరకు ప్రజలు, ప్రజా సంఘాలు కూడా కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని పలు రూపాల్లో అన్దోఅలన చేస్తున్నాయి.    కాంగ్రెస్ ఎమ్మెల్ల్యే సీతక్క గత నెలలోనే, కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ, ఇందిరా పార్క్ వద్ద దీక్ష సైతం చేశారు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి ఉస్మానియా అసుపత్రికి తరలించిన తర్వాత కూడా ఆమె దీక్షను కొనసాగించారు. చివరకు,అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ జోక్యం చేసుకుని, ముఖ్యమంత్రితో మాట్లాడి త్వరలోనే కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆమె, దీక్షను విరమించారు. అయితే, ఇంతలో ఈటల పదవి పోయిందే కానీ, అయన ఇచ్చిన హామీ మాత్రం నెరవేరలేదు. ఈ నేపధ్యంలోనే ఆమె ఆదివారం మరో మారు, ఆందోళన చేపట్టారు. లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందజేసి, అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా ఆమె కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. మరోవంక తెలంగాణ పీసీసి అధ్యక్షుడు, ఉత్తమ కుమార్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, ఇతర నాయకులు పలు సందర్భాలలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  రాజకీయ పార్టీలే కాదు, సామాన్య ప్రజలు కూడా వీద్దుల్లోకి వచ్చి, ఆందోళన చేస్తున్నారు. నిజానికి, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, ఎప్పుడో పది నెలల క్రితమే, అసెంబ్లీ సాక్షిగా కరోనానాను ఆరోగ్యశ్రీలో చేరుస్తామని హామీ ఇచ్చారని ప్రజలే గుర్తుచేస్తున్నారు. ఆ విషయం ఆయన మరిచిపోయినా ఇటీవల వరంగల్, తదితర ప్రాంతాల్లో దీక్షలు చేపట్టిన ప్రజలు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ ఏమైదని ప్రశ్నిస్తున్నారు. కరోనా తొలి విడత కంటే రెండవ విడతలో ప్రతి ఇంటిలో ఒకరో ఇద్దరో, మొత్తం కుటుంబమో, కరోనా బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారు. మరణాల సంఖ్య కూడా తొలివిడత కంటే ఎక్కువగా ఉంది, కాబట్టి, ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి కరోనాను, ఆరోగ్యశ్రీలో చేర్చాలని ప్రజలు కోరుతున్నారు. ఇదిలా ఉంటే,ఇదే విషయంపై తాజాగా బీజేపే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, గవర్నర్ తమిళిసైకు లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని  గవర్నర్’కు విజ్ఞప్తి చేశారు. కరోనాను నియంత్రించటంలో, వైద్య వసతులు కల్పించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన లేఖలో ఫిర్యాదు చేశారు. దానివల్లే పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో పడకలు ఖాళీగా లేవని అన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో పేదలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని, ప్రైవేటులో చికిత్స కోసం పేదలు ఆస్తులను అమ్ముకుని అప్పుల్లో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర పథకం ఆయుష్మాన్ భారత్‌లో కరోనా చికిత్స ఉచితంగా అందిస్తున్నట్లే..‘ఆరోగ్య శ్రీ’ ద్వారా కూడా కరోనా చికిత్స ఉచితంగా అందిచాలని, బండి సంజయ్ డిమాండ్ చేశారు.అలాగే, ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలుపుకోవాలని బండి సంజయ్ తమ లేఖలో పేర్కొన్నారు.  అయితే, ఇన్ని విధాలుగా ఇన్ని వైపులా నుంచి వత్తిడి వస్తున్నా, ప్రభుత్వం సానుకూలంగా స్పందిచక పోవడానికి, ఆర్థిక సమస్యలే కారణంగా కనిపిస్తున్నాయి. నిజానికి, కరోనా రాక ముందు నుంచే, కార్పొరేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో  చెల్లించ వలసిన బకాయిలు కొండలా పేరుకు పోయాయి. కార్పొరేట్, ప్రైవేటు  ఆసుపత్రులకు  పెద్ద మొత్తంలో ప్రభుత్వం బకాయి పడింది. ఆ చెల్లింపులు చేయక పోవడం వలన ఆరోగ్యశ్రీ సేవలను చాలా వరకు  కార్పొరేట్ ఆసుపత్రులు నిలిపి వేశాయి.  ఇప్పుడు కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చినా పాత బకాయిలు చెల్లించకుండా, కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు చికిత్స చేయవు. బకాయిలు చెల్లించే పరిస్థిటిలో ఖజానా లేదు. అందుకే, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చేందుకు ప్రభుత్వం విముఖత చూపుతోందని, అధికార వర్గాల సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలించే పరిస్థితులు లేక పోవడం వల్లనే ప్రభుత్వం లాక్ డౌన్ విధించేందుకు సైతం తటపటాయించిందని, చివరకు కోర్టు జోక్యంతో గత్యంతరం లేని పరిస్థితిలో మాత్రమే చివరి క్షణంలో ఆదరాబాదరాగా మంత్రివర్గలో ‘మమ’  అనిపించి  లాక్ డౌన్ ప్రకటన చేశారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. నిజానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, లాక్ డౌన్ విధిస్తే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి కోలుకోలేని దెబ్బ తగులుతుందని బహిరంగంగానే ప్రకటించారు. అందుకే రాష్ట్రంలో లాక్ డౌన్ ఉండడుగాక ఉండదని పలు సందర్భాలలో చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత అద్వాన్నంగా ఉన్నందునే, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చక పోవడం మొదలు, ఇతర కట్టడి చర్యలను, చికిత్సకు అవసరమైన ఆక్సిజన్, వెంటిలేటర్లు, ఇతర మౌలిక సదుపాయలను సంకుర్చుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, అందుకే కేంద్ర సహకరించడం లేదన్న సాకును చూపుతున్నారని, ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. నిజానికి పీసీసీ అధ్యక్షుడు  ఉత్తమ కుమార్ రెడ్డి పెర్కొన్నట్లుగా, ప్రభుత్వం మొదటి నుంచి అనుసరిస్తూ వచ్చియన్ తప్పుడు విధానాల వల్లనే రాష్ట్రం ప్రస్తుత అయోమయ స్థితి చేరిందని, అంటున్నారు, ఆపార్టీ నాయకులు.

ఏపీలో బ్లాక్ ఫంగ‌స్ పంజా.. 12 కేసుల‌తో డేంజ‌ర్ బెల్స్‌..

ఏపీలో కరోనాతో పాటు బ్లాక్‌ ఫంగస్‌ కేసుల సంఖ్య కూడా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 12 కేసులు నమోదైనట్లు తెలిసింది. కొవిడ్‌ బాధితులనే బ్లాక్‌ ఫంగస్ అటాక్ చేస్తోంది. ఐసీయూలో ఉండడం, మెడిక‌ల్‌ ఆక్సిజన్‌, స్టెరాయిడ్స్‌ వాడే వారిలో ఎక్కువగా బ్లాక్‌ ఫంగస్ సోకుతోంది. మొద‌ట‌ శ్రీకాకుళం జిల్లాలో ఒక కేసు వెలుగులోకి వచ్చింది. తర్వాత గుంటూరులో 4, తూర్పుగోదావరి 3, ప్రకాశం 1, కర్నూలులో 2 కేసులు నమోదయ్యాయి. విశాఖ, పశ్చిమగోదావరిలోనూ బ్లాక్ ఫంగ‌స్‌కేసులు క‌నిపించాయి.  బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు.. కళ్లు, ముక్కు ఎరుపెక్కడంతో పాటు తీవ్రంగా నొప్పి చేస్తాయి. జ్వరం, తలనొప్పి, జలుబు, శ్వాస తీసుకోవడంలో సమస్యలు వంటి లక్షణాలు ఉంటాయి. వీటితో పాటు రక్తపు వాంతులు, మానసిక స్థితిలో మార్పులు వస్తాయి. ఇలాంటి లక్షణాలున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించడంతోపాటు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచించింది. బ్లాక్‌ ఫంగ్‌సపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశోధన చేస్తోంది. ఫంగస్‌కు సంబంధించి ఎలాంటి కొత్త విషయాలు బయటపడినా రాష్ట్రాలకు సమాచారం ఇస్తోంది. ఫంగస్‌ సోకిన వారికి ఎలాంటి అనారోగ్య లక్షణాలుంటాయో తెలియజేస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ ఒక పోస్టర్‌ విడుదల చేసింది.  ఏపీలో బ్లాక్ ఫంగ‌స్ కేసులు పెరుగుతుండ‌టం క‌ల‌వ‌రానికి గురి చేస్తోంది. కర్నూలులో చికిత్స పొందుతున్న ఇద్దరు మృతి చెందారు. వారిలో ఒకరు అనంతపురం, మరొకరు కడపకు చెందిన వారుగా తెలుస్తోంది.  మరోవైపు ఆరోగ్యశాఖ ఇప్పటి వరకూ దీనిపై దృష్టిసారించ లేదు. బ్లాక్‌ఫంగ్‌సపై ఇప్పటి వరకూ స్పష్టమైన ఆధారాలు లభ్యం కాలేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. ఏపీ నుంచి ఆరోగ్యశాఖ ప్రతినిధులు హాజరవుతున్నా, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిర్లక్ష్యం వహిస్తున్నారు.  గుంటూరు జిల్లాలో నాలుగు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు వెలుగు చూశాయి. ఈ నలుగురూ గత నెలలో కొవిడ్‌ బారిన పడి కోలుకున్న వారే. ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి.   విశాఖ నగరంలోని మధురవాడ సమీప వాంబేకాలనీ మల్లయ్యపాలెంకు చెందిన మహిళ(35)కు దవడ భాగంలో బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు కనిపించాయి. ఆరిలోవలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి అత్యవసర విభాగంలో ఆ మహిళ చే రారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి రాజమండ్రి, వైజాగ్‌ ఆస్పత్రుల్లో చూపించగా సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ తీయించారని, కన్ను, ముక్కు, మెదడుకు ఫంగస్‌ వ్యాపిస్తోందని వైద్యులు చెప్పినట్లు బాధితుడి భార్య తెలిపారు. అలాగే, పెదపాడు మండలం కలపర్రు గ్రామస్థుడికి బ్లాక్‌ ఫంగ్‌సగా అనుమానిస్తూ అవసరమైన ఇంజక్షన్లు, వైద్యానికి రిఫర్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇద్దరు, కాకినాడలో ఒకరు బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడినట్టు జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి రమే్‌షకిశోర్‌ తెలిపారు.  మ‌రోవైపు.. ఏపీలో కొవిడ్‌ వల్ల చనిపోయిన వారి అంత్యక్రియలకు రూ.15,000 చొప్పున మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

గ‌వ‌ర్న‌ర్ జోక్యానికి చంద్ర‌బాబు లేఖ‌.. ర‌ఘురామ‌కు ప్రాణ‌హాని!

ఎంపీ రఘురామ కృష్ణంరాజుని ఏపీ సీఐడీ  అక్రమ అరెస్ట్ పై గవర్నర్ శ్రీ బిస్వాభూషన్ హరిచందనకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. గ‌వ‌ర్న‌ర్ జోక్యం చేసుకొనిఏపీలో ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడాల‌ని.. ఎంపీ ర‌ఘు రామ‌కృష్ణ రాజు ప్రాణాల‌ను కాపాడాల‌ని కోరారు. హైకోర్టు ఆదేశాల‌కు విరుద్దంగా ర‌ఘురామ‌ను ర‌మేశ్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించ‌కుండా.. జీజీహెచ్ నుంచి నేరుగా గుంటూరు జైలుకు తీసుకెళ్లార‌ని గ‌వ‌ర్న‌ర్ దృష్టికి తీసుకొచ్చారు చంద్ర‌బాబు. ర‌ఘురామ భార్య ర‌మాదేవి త‌న భ‌ర్త ప్రాణాల‌కు ప్ర‌మాదం ఉంద‌ని చెబుతోంద‌ని.. ఎంపీని శారీర‌కంగా గాయ‌ప‌రిచార‌ని లేఖ‌లో తెలిపారు చంద్ర‌బాబు. మ‌రోవైపు, ప‌లువురు టీడీపీ నాయ‌కులు సైతం ర‌ఘురామ ఘ‌ట‌న‌పై మండిప‌డ్డారు. సీఐడీ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఎంపీ రఘురామకృష్ణరాజును జైలుకు పంపారని.. ఆయ‌న‌కు ఏం జరిగినా సీఎం జగన్, సీఐడీ అధికారులదే బాధ్య‌త‌ని అన్నారు టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షులు అచ్చెన్నాయుడు. జగన్ కనుసన్నల్లోనే మెడికల్ బోర్డు నివేదిక ఇచ్చింద‌ని ఆరోపించారున‌. భర్తకు ప్రాణహాని ఉందని రఘురామ భార్య ఆందోళన చెందుతున్నారని.. కోర్టు ఆదేశాల మేరకు రఘురామకు ర‌మేశ్ హాస్పిట‌ల్‌లో వైద్యం అందించాలన్నారు అచ్చెన్నాయుడు.  ఏపీలో ఎమర్జెన్సీ రోజుల కన్నా దారుణంగా పరిస్థితులున్నాయని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. సొంత పార్టీ ఎంపీపైనే థర్డ్ డిగ్రీ ప్రయోగించడం సీఎం జగన్ నియంతృత్వ పోకడలకు పరాకాష్ట అని విరుచుకుపడ్డారు. టీడీపీ నాయకులపైనా అక్రమ కేసులు పెట్టడం, ప్రశ్నిస్తే ఇంకా కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ అరాచకాల నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.  జగన్మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు చేయమన్నందుకే ఎంపీ రఘురామ కృష్ణరాజుపై ప్రభుత్వం కక్షసాధింపులకు దిగిందని టీడీపీ నేత, మాజీ హోంమంత్రి చినరాజప్ప అన్నారు. ఎంపీని అంతమొందించే కుట్ర జరుగుతోందన్నారు. రఘురామ ప్రాణాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. రూల్ ఆఫ్ లా కంటే లాఠీకే పనిచెబుతున్న పోలీసుల తీరు హేయమన్నారు. వైసీపీ ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని చినరాజప్ప ప్రశ్నించారు. రఘురామ నేరస్థుడు కాదని.. ప్రభుత్వ అక్రమ కేసులో నిందితుడని అన్నారు. జగన్ కళ్లల్లో ఆనందం చూసేందుకు కొంతమంది పోలీసులు ఇలా హింసిస్తున్నారని, ఏపీలో అరాచకాలపై రాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్ స్పందించాలన్నారు. దీనిపై కేంద్ర బృందాలతో న్యాయవిచారాణ జరిపించాలని చినరాజప్ప డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ బద్ధమైన పాలన లేదని, ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధించాలని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. జగన్ పాలన కంటే బ్రిటీష్ పాలన మెరుగు అనిపించేటట్లు ఉందన్నారు. ఏపీలో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)కు బదులు జగన్ పీనల్ కోడ్ (ఐపీసీ) అమలవుతోందన్నారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును సీబీసీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం, కస్టడీలో ఉండగా దారుణంగా కొట్టడం దారుణ‌మ‌న్నారు. ఈ చర్య రాజకీయ కక్షపూరితమని, అప్రజాస్వామికమని, అమానుషమని తులసీరెడ్డి మండిప‌డ్డారు.

కాళ్లు వాచాయి.. రంగు మారాయి.. కానీ, గాయాలు లేవు.. రఘురామ మెడికల్ రిపోర్ట్

ఎంపీ రఘురామ రాజు రెండు పాదాలకు, అరికాలుకు రంగు మారింది కానీ, బయటికి గాయాలు కనిపించడం లేదని డాక్టర్లు తమ మెడికల్ రిపోర్టులో తెలిపారు. ఎంపీ రఘురామ రాజుకు సంబంధించిన మెడికల్ రిపోర్టును పోలీసులు హైకోర్టుకు సమర్పించారు. ఈ నివేదికను హైకోర్టు న్యాయవాదులకు చదివి వినిపించింది. రఘురామ కాళ్లు వాచి ఉన్నాయని, రెండు పాదాలకు, అరికాలుకు రంగు మారిందని, కానీ బయటికి గాయాలు కనిపించడం లేదని అందులో ఉంది. అవి కొట్టిన దెబ్బ‌ల‌ని చెప్ప‌లేమ‌ని వైద్యులు అభిప్రాయ‌ప‌డ్డారు.   రఘురామకు గుండె నొప్పి ఉందని ఫిర్యాదు చేశారని, నాలుగున్నర నెలల క్రితం గుండెకు శస్త్రచికిత్స జరిగిందని, వెంటనే కార్డియాలజిస్ట్‌కు పంపామని రిపోర్టులో రాశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం, గుండె నిలకడగానే ఉందని వైద్యులు తమ రిపోర్టులో తెలిపారు. నెఫ్రాలజిస్ట్ దగ్గరకు కూడా పంపామని, నార్మల్‌గానే ఉందని వైద్యులు నివేదిక‌లో పొందుప‌రిచారు.  ఎంపీ రఘురామ కృష్ణంరాజు  శరీరంపై ఎటువంటి గాయాలు లేవని హైకోర్టు కు సమర్పించిన నివేదికలో  వైద్య నిపుణులు కమిటీ స్పష్టం చేసింది. రఘు రామ కృష్ణం రాజు ని రమేష్ ఆసుపత్రికి తరలించాలనే హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. రమేష్ ఆసుపత్రిలో పై క్రిమినల్ కేసులు ఉన్నాయని కోర్టు దృష్టికి ఆయన తీసుకువచ్చారు. ర‌ఘురామ‌ను ర‌మేశ్ హాస్పిట‌ల్‌కు తీసుకెళితే.. టీడీపీ పార్టీ ఆఫీసుకు పంపిన‌ట్టేన‌ని ప్ర‌భుత్వ న్యాయ‌వాది అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఈ వాద‌న‌ను హైకోర్టు విభేదించింది.  హైకోర్టు ఆదేశాల ప్ర‌కారం మ‌ధ్యాహ్నం 12లోగా మెడిక‌ల్ రిపోర్ట్ ఎందుకు కోర్టుకు నివేదించ‌లేద‌ని కోర్టు ప్ర‌శ్నించింది. ఎంపీ ర‌ఘు రామకృష్ణ రాజును త‌క్ష‌ణ‌మే ర‌మేశ్ హాస్పిట‌ల్‌కు పంపించాల‌ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఎంపీ ర‌ఘురామ కేసులో వైద్య బృందం నివేదిక జిల్లా కోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు చేరింది. జీజీహెచ్‌తో పాటు ర‌మేశ్ ఆసుప‌త్రిలోనూ ప‌రీక్ష‌లు చేయాల‌న్న కోర్టు ఆదేశాల‌ను ప‌ట్టించుకోలేద‌ని పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాదులు వాదించారు.  క‌స్ట‌డీలో ఉండ‌గా సీఐడీ అధికారి పిటిష‌న‌ర్‌ను క‌లిశార‌ని, ఇలా క‌ల‌వ‌డం చ‌ట్ట విరుద్ధ‌మ‌ని ర‌ఘురామ త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు. హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టు సీఐడీ కోర్టు ఆదేశాలను ఎలా అమలు చేశారు? రఘురామను ఎందుకు జైలుకు తరలించారు? అని ప్ర‌శ్నించారు.   గుంటూరు ఆరవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆదేశాలను యధాతధంగా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలు, cid కోర్టు ఆదేశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని అదనపు అడ్వకేట్ జనరల్  వాదించడాన్ని తప్పుపట్టారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజు త‌ర‌ఫు న్యాయవాది ఆదినారాయణ.. తన క్లయింట్ ప్రాణాలకు హాని తలపెట్టే ప్రమాదం ఉన్నందున వెంటనే ఆయన్ను హాస్పిటల్‌కు పంపించాలని కోర్టును కోరారు. అలాంటిది ఏదైనా జరిగితే తనను షూట్ చేయవచ్చునని అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకి తెలిపారు. ఇప్ప‌టికే రిమాండ్ విధిస్తూ జ‌డ్జి ఉత్త‌ర్వులు జారీ చేశార‌ని ప్ర‌భుత్వ న్యాయ‌వాది వాదించారు. ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న హైకోర్టు ఎంపీని వెంట‌నే జైలు నుంచి ర‌మేశ్ ఆసుప‌త్రికి పంపాల‌ని ఆదేశించారు. 

ర‌ఘురామ‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించండి.. హైకోర్టు ఆదేశాలు..

ఎంపీ ర‌ఘు రామకృష్ణ రాజును త‌క్ష‌ణ‌మే ర‌మేశ్ హాస్పిట‌ల్‌కు పంపించాల‌ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఎంపీ ర‌ఘురామ కేసులో వైద్య బృందం నివేదిక జిల్లా కోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు చేరింది. జీజీహెచ్‌తో పాటు ర‌మేశ్ ఆసుప‌త్రిలోనూ ప‌రీక్ష‌లు చేయాల‌న్న కోర్టు ఆదేశాల‌ను ప‌ట్టించుకోలేద‌ని పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాదులు వాదించారు.  క‌స్ట‌డీలో ఉండ‌గా సీఐడీ అధికారి పిటిష‌న‌ర్‌ను క‌లిశార‌ని, ఇలా క‌ల‌వ‌డం చ‌ట్ట విరుద్ధ‌మ‌ని ర‌ఘురామ త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు. హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టు సీఐడీ కోర్టు ఆదేశాలను ఎలా అమలు చేశారు? రఘురామను ఎందుకు జైలుకు తరలించారు? అని ప్ర‌శ్నించారు.   గుంటూరు ఆరవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆదేశాలను యధాతధంగా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలు, cid కోర్టు ఆదేశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని అదనపు అడ్వకేట్ జనరల్  వాదించడాన్ని తప్పుపట్టారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజు త‌ర‌ఫు న్యాయవాది ఆదినారాయణ.. తన క్లయింట్ ప్రాణాలకు హాని తలపెట్టే ప్రమాదం ఉన్నందున వెంటనే ఆయన్ను హాస్పిటల్‌కు పంపించాలని కోర్టును కోరారు. అలాంటిది ఏదైనా జరిగితే తనను షూట్ చేయవచ్చునని అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకి తెలిపారు. ఇప్ప‌టికే రిమాండ్ విధిస్తూ జ‌డ్జి ఉత్త‌ర్వులు జారీ చేశార‌ని ప్ర‌భుత్వ న్యాయ‌వాది వాదించారు.  ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న హైకోర్టు ఎంపీని వెంట‌నే జైలు నుంచి ర‌మేశ్ ఆసుప‌త్రికి పంపాల‌ని ఆదేశించారు. 

కొవాగ్జిన్‌.. కొత్త వేరియంట్‌ల‌పైనా ఎఫెక్ట్‌..

కరోనా వైరస్‌ను నిర్మూలించేందుకు స్వదేశంలో అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా కొత్త రకాలపై పనిచేస్తోందని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. భారత్‌లో విజృంభిస్తున్న బి.1.617తో పాటు బ్రిటన్‌లో రకం బి.1.1.7 వైరస్‌నూ కొవాగ్జిన్‌ టీకా తటస్థీకరిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయన పత్రాన్ని భారత్‌ బయోటెక్‌ సహ వ్యవస్థాపకురాలు, జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్లా ట్విటర్‌లో పోస్ట్ చేశారు.   వ్యాక్సిన్‌ వేరియంట్‌ D614Gతో పోలిస్తే బి.1.617 రకాన్ని తటస్థీకరించడంతో కొవాగ్జిన్‌ చెప్పుకోదగిన రీతిలో తగ్గిస్తున్నప్పటికీ.. అంచనా వేసిన దానికంటే ఎక్కువ రక్షణ కల్పిస్తుందని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. ఇక వ్యాక్సిన్‌ వేరియంట్‌, బ్రిటన్‌ రకం బి.1.1.7 వైరస్‌లను తటస్థీకరించడంలో కొవాగ్జిన్‌ ఒకే విధంగా పనిచేస్తుందని తెలిపింది. ఐసీఎంఆర్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సహకారంతో జరిపిన అధ్యయనంలో ఈ ఫలితాలు కనిపించాయని భారత్‌ బయోటెక్ తెలిపింది. కొవాగ్జిన్‌ టీకాను భారత్‌లో ఇప్పటివరకు 18 రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది.   భారత్‌లో ఇప్పటికే మూడు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రాగా ఇప్పటివరకు 18 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను అందించారు. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ భారత్‌లోనే తయారవుతుండగా తాజాగా అందుబాటులోకి వచ్చిన స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ జులై నుంచి భారత్‌లో ఉత్పత్తి కానుంది. ఇక కొత్తగా వెలుగు చూస్తోన్న కరోనా రకాలపై ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లు పనిచేస్తున్నాయని నివేదికలు తెలుపుతున్నాయి. 

భార‌తిని సీఎం చేయాలి.. ఏపీలో డిక్టేట‌ర్ షిప్..

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు రాష్ట్రంలో ప్రతి ఊరు తిరిగి ప్రజల మనోభావాలు తెలుసుకోవాలి.. కనీసం ఆ ప్రాంతాల ఎమ్మెల్యేల దగ్గర నుంచి అయినా సమాచారం తీసుకోవాలి.. ప్ర‌తిపక్షంలో ఉన్నవారిని మాట్లాడనివ్వరు.. కలవడానికి సీఎం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వరు.. ఇదొక వింత ప్రభుత్వం.. వింతైన ముఖ్యమంత్రి.. సీఎం ప‌ద‌వికి జ‌గ‌న్ రాజీనామా చేసి ఆయ‌న స‌తీమ‌ణి వైఎస్ భార‌తికి బాధ్య‌త‌లు అప్ప‌గించాలి.. అప్పుడైనా రాష్ట్రాంలో కొంత మార్పు వ‌స్తుందేమో చూద్దాం.. క‌నీసం ఇప్ప‌టికైనా ప్ర‌జ‌ల ఆర్త‌నాదాల‌ను జ‌గ‌న్ అర్థం చేసుకోవాలి.. అంటూ బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.  ఎంపీ రఘురామకృష్ణంరాజుపై చేసిన దాడి వాస్తవమేనని నివేదిక వస్తే.. దాని అర్థం వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఎవరైనా నోరు విప్పితే బొక్కలో వేసి, నాలుగు ఉతికి పంపిస్తామని చెప్పడానికి చేసిన ప్రక్రియని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. సొంతపార్టీలో ఉన్నవాళ్లకే ఇలా చేస్తే, ఇక ప్రతిపక్ష నేతల పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో కక్ష్య సాధింపులు పెరుగిపోయాయని మండిపడ్డారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అప్పటి సీఎం చంద్రబాబుపై నంద్యాలలో ఆయన చేసిన వ్యాఖ్యాలు ప్రభుత్వాన్ని అస్థిరపర్చడం కాదా? అని ప్రశ్నించారు. దానికంటే రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఎక్కువా? అని నిలదీశారు. ఒక డిక్టేటర్ షిప్‌గా రాష్ట్రంలో పాలన జరుగుతోందని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే వారిపై కేసులు పెట్టి, అరెస్టులు చేయించడం సరికాదని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని విష్ణుకుమార్‌రాజు ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ ఏం మాట్లాడారో తెలియదా? అని నిలదీశారు. వైసీపీ ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే.. ఇక సామాన్యుల పరిస్థితేంటని విష్ణుకుమార్‌రాజు ప్రశ్నించారు.   

రాత్రికి నా భర్తను చంపాలని చూస్తున్నారు..

హత్యలు చేసేవారు రోడ్లపై తిరుగుతున్నారు.. ప్రజా సమస్యలపై ప్రశ్నించే వాళ్లని జైల్లో పెడతారా? ఏపీలో అసలేం జరుగుతోందో తనకు అర్థం కావడం లేదంటూ ఎంపీ ర‌ఘురామ స‌తీమ‌ణి ర‌మాదేవి తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పోలీసులు తన భర్తను బాగా కొట్టారని చెప్పారు. కోర్టు నిబంధనలు పట్టించుకోరా? అని ఆమె ప్రశ్నించారు. రమేశ్ ఆస్పత్రికి తరలించాలని కోరితే..  పట్టించుకోలేద‌ని వాపోయారు. ఈ రోజు రాత్రి తన భర్తను చంపాలని చూస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోపణలు చేశారు ర‌మాదేవి.  ఇప్ప‌టికే, న‌ర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. వైద్యపరీక్షల అనంతరం జీజీహెచ్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి నుంచి నేరుగా జైలుకు తీసుకెళ్లారు. రఘురామ తరలింపు నేపథ్యంలో జిల్లా జైలు వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.  ర‌ఘురామ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో సరైన వైద్యం అందించాలని కోర్టు సూచించింది. మొద‌ట జీజీహెచ్‌, ఆ త‌ర్వాత ర‌మేశ్ హాస్పిట‌ల్‌లో ఆయ‌న‌కు చికిత్స అందించాల‌ని ఆదేశించింది. అయినా కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ రఘురామను జైలుకు తరలించారు పోలీసులు. మరోవైపు రఘురామకృష్ణరాజుకు అయిన గాయాలపై జిల్లా కోర్టుకు మెడికల్‌ బోర్డు నివేదిక ఇవ్వనుంది.   

జైలుకు ర‌ఘురామ‌.. కోర్టు ఆదేశాలు బేఖాతరు?

న‌ర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. వైద్యపరీక్షల అనంతరం జీజీహెచ్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి నుంచి నేరుగా జైలుకు తీసుకెళ్లారు. రఘురామ తరలింపు నేపథ్యంలో జిల్లా జైలు వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.  ర‌ఘురామ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో సరైన వైద్యం అందించాలని కోర్టు సూచించింది. మొద‌ట జీజీహెచ్‌, ఆ త‌ర్వాత ర‌మేశ్ హాస్పిట‌ల్‌లో ఆయ‌న‌కు చికిత్స అందించాల‌ని ఆదేశించింది. అయినా కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ రఘురామను జైలుకు తరలించారు పోలీసులు.   మరోవైపు రఘురామకృష్ణరాజుకు అయిన గాయాలపై జిల్లా కోర్టుకు మెడికల్‌ బోర్డు నివేదిక ఇవ్వనుంది. జీజీహెచ్‌లో ఎంపీకి వైద్య పరీక్షలు పూర్తిచేసిన మెడికల్‌ బోర్డు.. కోర్టుకు సమర్పించే నివేదికను సిద్ధం చేసింది. కోర్టు ఆదేశాలతో రఘురామ గాయాలపై గత రాత్రి నుంచి పరీక్షలు కొనసాగాయి. అనంతరం నివేదికను తయారు చేసేందుకు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతి నేతృత్వంలో మెడికల్‌ బోర్డు ఏర్పాటైంది. బోర్డు సభ్యులుగా జనరల్‌ మెడిసిన్‌ విభాగాధిపతి డాక్టర్‌ నరసింహం, ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ వరప్రసాద్‌, జనరల్‌ సర్జన్‌ సుబ్బారావు ఉన్నారు. ఉదయం 10.30 గంటలకే జిల్లా కోర్టుకు.. మధ్యాహ్నం 12 గంటల్లోపు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు మెడికల్‌ బోర్డు నివేదిక ఇవ్వాల్సి ఉండగా.. పరీక్షలు ముగియకపోవపడంతో జాప్యం జరిగింది. పరీక్షల జాప్యంపై రఘురామ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.  

పోలీసులతో ఎంపీ రేవంత్ రెడ్డి వార్ 

లాక్ డౌన్ సమయంలో ఏపీ రేవంత్ రెడ్డి రోడ్డుపైకి రావడం రచ్చగా మారింది. గాంధీ ఆసుపత్రి దగ్గర రోగుల బంధువులకు భోజనాలు పెట్టడానికి వెళుతున్న మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని బేగంపేటలో పోలీసులు అడ్డుకున్నారు. లాక్‌డౌన్‌లో ఆయ‌న ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తి లేద‌ని చెప్పారు. అయితే తాను పేదలకు సహాయం చేసేందుకు వెళుతున్నాన‌ని పోలీసుల‌కు రేవంత్ రెడ్డి తెలిపారు. అయిన‌ప్ప‌టికీ, లాక్‌డౌన్ స‌మ‌యంలో తిరిగేందుకు అనుమ‌తి లేదంటూ పోలీసులు వాదించారు. తాను సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటుంటే త‌న బండిని రోడ్డు మీదే ఆపేయ‌డ‌మేంట‌ని రేవంత్ రెడ్డి నిల‌దీశారు.తనను అడ్డుకున్న పోలీసులతో రేవంత్ వాగ్వాదానికి దిగారు. పోలీసు ఉన్న‌తాధికారుల‌తో రేవంత్ రెడ్డి ఫోన్ లా మాట్లాడారు. ఓ ఎంపీగా నియోజకవర్గంలో కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి వెళుతుంటే ఇలా అడ్డుకోవడం ఏంటని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  ‘‘నేను లోకల్ ఎంపీని.. నన్ను ఆపమని చెప్పిందెవడు? మీకు ఆదేశాలు ఎవరిచ్చారో చెప్పండి. ఆ కాగితాలు చూపండి. మెలకువలోనే ఉండి మాట్లాడుతున్నారా? ఈ ప్రభుత్వానికి బుర్ర ఉండే మాట్లాడుతుందా... నేను ఇక్కడి ఎంపీని. మీ ఆంక్షలు గాంధీ ఆసుపత్రి దగ్గర పెట్టుకోండి. బేగం పేటలో కాదు. నేను గాంధీ, సికింద్రాబాద్, బేగంపేట్ తదితర ప్రాంతాల్లో కార్యక్రమాలు పెట్టుకున్నాను. నన్ను ఆపమని చెప్పిందెవరు? నేను సామాన్య పౌరుడిని కాదు. స్థానిక ఎంపీని. మీరెందుకు వచ్చారు రోడ్డు మీదకి? మీలాగే నేను కూడా రోడ్డు మీదకు ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను. కష్టాల్లో ఉన్న ప్రజల దగ్గరకు వెళుతుంటే ఎందుకు ఆపుతున్నారు’’ అంటూ రేవంత్ ఫైర్ అయ్యారు.  గాంధీ ఆసుపత్రి దగ్గర రోగుల బంధువులకు నిత్యం వెయ్యి మందికి అన్నదానం చేసే కార్యక్రమాన్ని శనివారం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రెండో రోజు ఈ కార్యక్రమాన్ని గాంధీతో పాటు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద కూడా చేపట్టాలని ఎంపీ భావించారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ రేవంత్‌ను బేగంపేట పోలీస్ స్టేషన్ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. ఎంపీ వాహనాన్ని చుట్టుముట్టి ముందుకు కదలనీయలేదు. దీంతో పోలీసులతో రేవంత్ వాగ్వాదానికి దిగారు.