విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఖాయం! జగన్ రెడ్డిని పట్టించుకోని కేంద్రం..

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయ్యే సమస్యే లేదు .. ఇదీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రకటన. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడ్డుకుని తీరుతాం.. ఇదీ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి చెబుతున్న మాట. ఇటీవలే ఆయన స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలతో కలిసి ఢిల్లీలో  హడావుడి కూడా చేశారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. వైసీపీ నేతలు తాము ఏదో చేస్తున్నామనే ప్రయత్నం చేస్తుండగా.. అటు కేంద్ర సర్కార్ మాత్రం తాను చేయాల్సింది చేసుకుంటూ పోతోంది. జగన్ రెడ్డి సర్కార్ వినతులను కనీసం పట్టించుకోకుండా ముందుకు పోతోంది.  ఆంధ్రప్రదేశ్ లోని జగన్ రెడ్డి ప్రభుత్వానికి కేంద్ర సర్కార్ మరో షాకిచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పష్టమైన ప్రకటన చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీ హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రం తరపున కార్యదర్శి ఆర్కే సింగ్ ఈ మేరకు దాఖలు చేశారు. ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకే.. స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ జరిగిందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కేంద్రం పూర్తిస్థాయిలో పెట్టుబడులు ఉపసంహరించాలని కేబినెట్ కమిటీ నిర్ణయించడంతో ఈ ఏడాది జనవరి 27నే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.సీబీఐ మాజీ జేడీ.. వీవీ లక్ష్మీనారాయణ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం దారుణమని.. దీనికి రాజ్యాంగం సైతం అంగీకరించదని ఆయన కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై పలు దఫాల విచారణ అనంతరం.. తాజాగా.. కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. అఫిడవిట్‌లో కేంద్రం దేశ ఆర్థిక వ్యవహారాలపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి ఉంటుందని, ఇటువంటి విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని ఆర్కే సింగ్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇలాంటివాటిపై గతంలో సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉందన్నారు. కేంద్రం కేబినెట్ కమిటీలో ప్రధాని, ఆర్థికమంత్రి, హోంమంత్రి, ఉక్కుమంత్రి, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి, పెట్రోలియం మంత్రి సభ్యులుగా ఉన్నారన్నారు. పూర్తి అర్హత కలిగిన అధికారులు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా..దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.అంతేకాదు లక్ష్మినారాయణ విశాఖ లోక్ సభ స్థానానికి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారని, ఆయన ఈ పిటిషన్ ను రాజకీయ ప్రయోజనాల కోసమే వేసినట్లున్నారని కూడా తన కౌంటర్ లో కేంద్రం పేర్కొంది.  విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేందుకు వీల్లేదని.. ప్రజాసంఘాలు ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నాయి. రాజకీయ నేతలు కూడా.. దీనిలో భాగమయ్యారు. విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. తన పదవికి రాజీనామా కూడా సమర్పించారు. ఇక ప్రభుత్వం పరంగా కూడా జగన్ లేఖలు రాస్తున్నారు. రాశారు. అయితే.. జగన్ ప్రయత్నాలను మొసలి కన్నీళ్లుగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కొందరు న్యాయపోరాటం చేస్తున్నారు. అయినా స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణపై కేంద్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. 

జూలై 30న సీబీఐకి శీలపరీక్ష.. జగన్ బెయిల్ కేసుపై ఉత్కంఠ 

రాజ్యాంగ సంస్థలు రాజ్యాంగబద్దంగా వ్యవహరించడమే కాదు, అలా వ్యవహరిస్తున్నట్లు కనిపించడం కూడా అవసరమే. కాదంటే, వ్యవస్థల పట్ల ప్రజలకు అపనమ్మకం ఏర్పడుతుంది. సంస్థలు అపవాదులను మోయవలసి వస్తుంది. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) సీబీఐ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే మోస్తున్న అపవాదులు చాలావన్నట్లుగా కొత్త తప్పులు తలకు చుట్టుకుంటోంది. గతంలో ఎప్పుడోనే భారత సర్వోన్నత న్యాయస్థానం, సుప్రీం కోర్టు, సీబీఐని, సర్కార్ పలుకులు పలికే ‘పంజరంలో చిలక’ అని అభివర్ణించింది.  ఒకప్పుడు సీబీఐ అంటే, కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ గా ప్రసిద్ధి చెందింది. అప్పటి విపక్షాలు ఆ విధంగా ఆరోపించాయి. అలాగే, ఇప్పుడు, కాంగ్రెస్ సహా  ప్రతిపక్ష పార్టీలు ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేతిలో సీబీఐ కీలుబొమ్మని ఆరోపిస్తున్నాయి. నిజానికి, అప్పుడైనా, ఇప్పుడైనా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ చేతిలో సీబీఐ కీలుబొమ్మ అనేది, మెజారిటీ ప్రజల అభిప్రాయం. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో, ఆయన బెయిలు రద్దుకు సంబందించి సొంత పార్టీ, వైసీపీ రెబెల్ ఎంపీ దాఖలు చేసిన కేసులో అలాగే,ముఖ్యమంత్రి సొంత బాబాయి, వైఎస్ వివేకానంద మర్డర్ కేసులో సీబీఐ వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిచ్చేలా ఉందని సామాన్య ప్రజలు కూడా సందేహలు వ్యక్తపరుస్తున్నారు.  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ  వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై కోర్టు, ప్రొసీజర్ పాటిస్తూ. అటు నిందితుడు జగన్మోహన్ రెడ్డిని, పిటీషన్ వేసిన రఘురామ కృష్ణం రాజును అలాగే, ఈ కేసును పుష్కర కాలానికి పైగా విచారిస్తున్నసీబీఐని కౌంటర్ దాఖలు చేయమని కోర్టు ఆదేశించింది. ఇందుకు సంబందించి నిందితుడు జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదులు, రఘురామ కృష్ణం రాజు తరపు న్యాయవాదులు లిఖితపూర్వకంగా  కౌంటర్ దాఖలు చేశారు. సీబీఐ మాత్రం దాగుడు మూతలు ఆడుతోంది. ముందు, ఇదిగో అదిగో అంటూ ఒకటి రెండు వాయిదాలు కోరింది. చివరకు  మీ ఇష్టం చట్టం ఎలా చెబితే ఆలా చేయండి అంటూ భారాన్ని కోర్టుకు వదిలేసింది.  మళ్ళీ తూచ్ ... మేము కూడా  లిఖిత  పూర్వకంగా మా వాదన వినిపిస్తామంటూ .. జూలై  14న కోర్టును సీబీఐ కోరింది. అందుకు  పది రోజులు గడవు కోరింది. అన్నిటికీ ఓకే చెప్పిన సీబీఐ న్యాయస్థానం, ఈ నెల (జూలై)26కు విచారణ వాయిదా వేసింది. ఇదే చివరి అవకాశం, అని కూడా కొంచెం చాలా గట్టిగానే చెప్పింది. అయినా జూలై 26 సోమవారం సీబీఐ సీబీఐ కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌లేదు. సీబీఐ అధికారికి   జ్వ‌రంగా ఉన్నందున విచార‌ణ‌ను వాయిదా వేయాల‌ని, కౌంట‌ర్ దాఖ‌లు చేసేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని సీబీఐ లాయ‌ర్లు కోర్టును కోరారు. దీంతో సీబీఐ కోర్టు ఈ కేసు విచారణను మరోసారి వాయిదా వేసింది. ఈ మేరకు జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణను కోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది.ఈ వ్యవహారం చూస్తుంటే ఏదో విధంగా జగన్ రెడ్డి బెయిలు రద్దు పిటీషన్’పై తుది తీర్పు సాధ్యమైనంత వరకు వాయిదా వేయలనేదే సీబీఐ సంకల్పంగా, అందుకోసమే ఇన్ని అడ్డదారులు తొక్కుతోందనే అనుమానాలు బల పడుతున్నాయి.  రేపు జూలై 30న మరో మెలిక పెట్టి మళ్ళీ వాయిదా కోరితే, అదే నిజమని అనుకోక తప్పదు. ఇప్పటికే విశ్వసనీయత కోల్పోయిన సంస్థ మరింతగా విమర్శలను ఎదుర్కొనవలసి వస్తుంది. అంతే కాదు, ఒక్క సీబీఐ మాత్రమే కాదు, సీబీఐ ని వెనకనుంచి నడిపించే కేంద్ర ప్రభుత్వం విశ్వసనీయత కూడా ప్రశ్నార్ధకంగా మారుతుంది. ఇప్పటికే, బీజేపీ, వైసీపీల మధ్య చీకటి బంధం ఉందన్న ఆరోపణఉండనే వుది. ఇప్పుడు అది కన్ఫర్మ్ అవుతుందని అంటున్నారు.అందుకే జూలై 30న సీబీఐ శీల పరీక్షను ఎదుర్కుంటోందని అంటున్నారు.  ఇక జగన్ రెడ్డి బాబాయి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో విచారణ కీలక దశకు చేరుకున్న సమయంలో విచారణ అధికారిని బదిలీచేయడం కూడా, సీబీఐ ఎవరికైనా కొమ్ము కాస్తోందా అనే అనుమానాలకు ఆస్కారం కల్పిస్తోంది. 

ఏపీ డిప్యూటీ సీఎంకు కరోనా..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఇంకా భారీగానే వస్తున్నాయి. రోజుకు 2 వేలకు పైగానే  కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్ ఆంక్షలు తొలగించడంతో జనాలు యథేచ్చగా తిరుగుతున్నారు. మాస్కులు లేకుండానే గుంపులు గుంపులుగా వస్తున్నారు. భౌతిక దూరం పాటించాలన్న సోయి కూడా మర్చిపోయారు. త్వరలోనే థర్డ్ వేవ్ వస్తుందన్న హెచ్చరికలు, జనాల అజాగ్రత్తలతో వైద్య వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.  ఏపీలో వైరస్ కేసులు ఇటీవల తగ్గుముఖం పట్టినప్పటికీ తాజాగా మళ్లీ పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలున్నాయంటూ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నట్టుగానే పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామికి కరోనా సోకింది. గత రెండు రోజులుగా ఆయన అస్వస్థతతో బాధపడుతున్నారు. దీంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయింది. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఐసొలేషన్ లోకి వెళ్లి, చికిత్స తీసుకుంటున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... త్వరలోనే తాను పూర్తి ఆరోగ్యంతో బయటకు వస్తానని ఆయన ప్రకటన విడుదల చేశారు. 

జ‌నాల‌కు చెవిలో పువ్వు.. బీజేపీ మాట‌ల‌కు అర్థాలే వేరులే..

2014లో భారీ మెజార్టీతో గెలిచింది బీజేపీ. అద్వానీనే ప్ర‌ధాని అనుకున్నారంతా. పెద్దాయ‌న‌కు వ‌య‌సు మ‌ళ్లిందంటూ ప‌క్క‌న‌పెట్టేసి.. అంద‌ల‌మెక్కారు మోదీ. ఎప్ప‌టికైనా త‌న దారికి అడ్డొస్తార‌నేమో మ‌రో సీనియ‌ర్ నేత‌ ముర‌ళీమ‌నోహ‌ర్ జోషినీ అదే సాకుతో అడ్డు తొల‌గించుకున్నారు. 70 ఏళ్లు దాటిన వారికి ప‌ద‌వుల్లేవ్ అంటూ బాజా మోగించారు. అదే కార‌ణంతో తాజా కేబినేట్ పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లోనూ కొంద‌రు సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టేశారు. లేటెస్ట్‌గా మ‌రో వ‌య‌సు వేటు ప‌డింది. క‌ర్ణాట‌క సీఎం కుర్చీ నుంచి 79 ఏళ్ల య‌డ్యూర‌ప్ప‌ను అర్థాంత‌రంగా దింపేసింది బీజేపీ. ఆయ‌న సీఎం ప‌ద‌వి చేప‌ట్టి రెండేళ్లే అవుతోంది. అంటే, అప్పుడాయ‌న వ‌య‌సు 77. ఈ లెక్క‌న 77 ఏళ్లు ఉంటే వ‌య‌సులో ఉన్న‌ట్టు.. 79 వ‌స్తే వ‌య‌సు మీరిన‌వాడు అన్న‌ట్టా బీజేపీ ఉద్దేశ్యం? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇదంతా జ‌నం చేవిలో క‌మ‌లం పువ్వు పెట్ట‌డమేన‌ని.. కాషాయ పెద్ద‌లు ఆడుతున్న రాజ‌కీయ క్రీడ‌కు య‌డ్యూర‌ప్ప బ‌లైపోయార‌ని అంటున్నారు.  బీజేపీ చెబుతున్న కుంటి సాకుల‌పై సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో సెటైర్లు పేలుతున్నాయి. ఇటీవ‌ల‌ 89 ఏళ్ల మెట్రో మ్యాన్ శంక‌ర‌న్‌ను కేర‌ళ సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన బీజేపీకి అప్పుడు ఈ ఏజ్ ఫ్యాక్ట‌ర్ గుర్తుకు రాలేదా? అని నిల‌దీస్తున్నారు. కేరళ‌కో రూల్‌.. క‌ర్ణాట‌క‌కు మ‌రో రూలా? అని మండిప‌డుతున్నారు. వ‌చ్చే సెప్టెంబ‌ర్ 17కి మోదీకి సైతం 70 ఏళ్లు నిండుతాయ‌ని.. మ‌రి ఆయ‌న కూడా ప్ర‌ధాని ప‌ద‌వి నుంచి వైదొలుగుతారా? అని సోష‌ల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు నెటిజ‌న్లు.  క‌ర్ణాట‌క‌లో రెండేళ్ల‌కే సీఎం మారిపోయారు. అటు, ఉత్త‌రాఖండ్‌లోనూ ఇప్ప‌టికే ముచ్చ‌ట‌గా ముగ్గురు ముఖ్య‌మంత్రులు చేంజ్ అయ్యారు. ఇక‌, గ‌వ‌ర్న‌ర్లు సైతం ప‌దే ప‌దే మారుతుండ‌టం కామ‌న్‌గా మారింది. ఇక మ‌హారాష్ట్ర‌లో ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్ట‌డానికి ఎన్సీపీని చీల్చే ప్ర‌య‌త్నాన్ని దేశ‌మంతా అస‌హ్యించుకుంది. బెంగాల్‌లో మ‌మ‌త స‌ర్కారును కేసుల‌తో భ‌య‌భ్రాంతుల‌ను గురి చేస్తున్న‌ వైనాన్ని అంతా గ‌మ‌నిస్తూనే ఉన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు వ్య‌తిరేకంగా లెఫ్ట్‌నెంట్ గ‌వ‌ర్న‌ర్‌ను ఉసిగొల్పుతున్న తీరు బీజేపీకే మైన‌స్‌గా మారుతోంది.  ఇక ఏపీలో వైసీపీ స‌ర్కారుతో కుమ్మ‌క్కై.. జ‌గ‌న్‌కు సీబీఐ ర‌క్ష క‌ల్పిస్తుండ‌టం.. ప్ర‌త్యేక హోదా అట‌కెక్కించ‌డం, పోల‌వ‌రం నిధుల‌కు గండి పెట్ట‌డం.. విశాఖ ఉక్కును అడ్డంగా అమ్ముకోబోతుండ‌టం.. అడ్డ‌గోలు అప్పులు, ఆల‌యాల‌ దాడుల‌పై జోక్యం చేసుకోకుండా అవినీతి, అరాచ‌క ప్ర‌భుత్వానికి కొమ్ముకాస్తోంద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. అటు, తెలంగాణ‌కు ఐటీఐఆర్ కారిడార్‌ ఎగ్గొట్ట‌డం.. బీహార్‌కు నిధుల వ‌ర‌ద పారించ‌డం.. ఇలా దేశాన్ని విభ‌జించి పాలిస్తోంద‌నే ఆగ్ర‌హం ప్ర‌జ‌ల నుంచి వెల్లువెత్తుతోంది. విదేశాల నుంచి న‌ల్ల‌ధ‌నం తీసుకొస్తామంటూ బీజేపీ ఆడిన‌ డ్రామాను ప్ర‌జ‌లు ఎప్పుడో మ‌ర్చిపోయినా.. తాజాగా వివిధ రాష్ట్రాల‌తో, వివిధ పార్టీల‌తో క‌మ‌ల‌నాథులు ఆడుతున్న పొలిటిక‌ల్ డ్రామాను చూసి అంతా అస‌హ్యించుకుంటున్నారు.  గ‌తంలో కాంగ్రెస్ ఇలానే చేస్తే.. ఆ పార్టీకి బుద్ది చెప్పి.. రెండు ప‌ర్యాయాలుగా అధికారానికి దూరం పెట్టారు ప్ర‌జ‌లు. గ‌తంలో ముఖ్య‌మంత్రుల‌ను ప‌దే ప‌దే మార్చే సంస్కృతి కాంగ్రెస్‌దే. గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ‌ను క‌క్ష్య సాధింపు చ‌ర్య‌ల‌కు వాడుకునే అల‌వాటు కాంగ్రెస్‌దే. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను చీల్చి.. రాష్ట్రాల‌ను విభ‌జించి పాలించిన చ‌రిత్ర కాంగ్రెస్‌దే. అందుకే, ఆ పార్టీకి క‌ర్రు కాల్చి వాత పెట్టారు. ఇప్పుడు బీజేపీ సైతం నాటి కాంగ్రెస్ అడుగుజాడ‌ల్లోనే న‌డుస్తోందని అంటున్నారు. ఆ తాను ముక్కేనంటూ మండిప‌డుతున్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు అవినీతికి కేరాఫ్‌గా మారితే.. బీజేపీ స‌ర్కారుకు సైతం ఎంతోకొంత అవినీతి మ‌ర‌క అంట‌క‌పోలేదు. ర‌ఫేల్ కొనుగోళ్ల‌లో భారీ స్థాయిలో క‌రెప్ష‌న్ జ‌రిగింద‌నేది ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌. దేశ సంప‌ద‌ను అంబానీ, అదానీల‌కు దోచిపెడుతున్నార‌నే విమ‌ర్శ‌. మాల్యా, మోదీ, చోక్సీలు బ్యాంకుల‌ను కొల్ల‌గొట్టి విదేశాల‌కు చెక్కేయ‌డం స‌ర్కారు చేత‌గానిత‌న‌నేన‌నే ప్ర‌చారం. ఇక పెగాస‌స్‌తో బీజేపీ ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అవుతోంది. దేశ ప్ర‌జ‌ల‌పైనే నిఘా పెట్టిన బ‌రితెగింపుతో బాగా బ‌ద్నామ్ అవుతోంది. అందుకే, రోజురోజుకీ బీజేపీ గ్రాఫ్ బాగా ప‌డిపోతోంది. తీరు మార‌క‌పోతే.. కాంగ్రెస్ వాస‌న‌లు వీడ‌క‌పోతే.. కాషాయ పార్టీకి సైతం కాంగ్రెస్‌లా శిక్ష త‌ప్ప‌క‌పోవ‌చ్చని హెచ్చ‌రిస్తున్నారు. మ‌రి, కాషాయ పార్టీకి ఇప్ప‌టికైనా క‌నువిప్పు క‌లిగేనా? ఇలానే క‌ళ్లు మూసుకొని పాలిస్తుందా?

ప్రవీణ్ కుమార్ టార్గెట్ ఫిక్స్? దళిత బంధు ఆశతో గులాబీ బాస్?  

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాక్కులో, వైఖరిలో క్లారిటీ వచ్చింది. తనకు రాజకీయ శత్రువులెవరో, మిత్రులెవరో గుర్తించారు. అలాగే సామాజికవర్గాల్లో తనతో వచ్చేవారెవరో అంచనా రూపొందించుకున్నారు. అందుకు సూర్యాపేటలో జరిగిన ఉద్యోగ, ఉపాధ్యాయ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన డెలివరీ చేసిన డైలాగులే సాక్ష్యం. గురుకులాల కార్యదర్శిగా రాజీనామా చేసిన తరువాత పలు ఇంటర్వ్యూల్లో ఆయన వెల్లడించిన అభిప్రాయాలకు, తాజాగా సూర్యాపేటలో ఆయన మాటల్లో స్పష్టత కొట్టొచ్చినట్టు కనిపిస్తోందంటున్నారు ఆయన స్పీచ్ విన్నవారు.  తాను చేసిన త్యాగానికి అర్ధం ఉండాలంటే బహుజన వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తామెవరినీ అడుక్కోవలసిన అవసరం లేకుండా బహుజన రాజ్యాన్ని బహుజనులే నిర్మించుకోవాలంటున్నారు. అంతేకాదు.. డబ్బున్న అగ్రవర్ణ నేతల రాజకీయ కబంధ హస్తాల నుంచి బయట పడాలంటే బహుజన అధికార నిధి కోసం అందరూ త్యాగభావాన్ని అలవరచుకోవాలని కోరుతున్నారు. అంటే పార్టీ ఫండ్ కోసం ఎవరినో అడగడం కాదు.. తమ పార్టీ ఖర్చులు తామే భరించుకోవాలని, అప్పుడే రాజకీయ, సామాజిక యుద్ధం ఫలితాలిస్తుందని తాత్విక కోణాలు ఆవిష్కరిస్తున్నారు. ప్రవీణ్ కుమార్ ప్రస్థానంలో దీన్ని పరిణతి గల అంశంగా చూడాలంటున్నారు రాజకీయ పండితులు. పాలకులంతా అక్రమాస్తులతో ప్రజల్ని వంచిస్తున్నారని, ఓట్లను కొనుగోలు చేసి మోసం చేస్తున్నారని ముఖ్యంగా అధికార పార్టీ నమ్ముకున్న ఎలక్షనీరింగ్ మీద దాడిని ప్రారంభించారు ప్రవీణ్ కుమార్. తెలంగాణ అమరుల త్యాగాల మీద ఇంకొకరు సుఖపడటమేంటని, అసలు అమరులైనవారంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలవారేనంటూ పరోక్షంగా అన్ని సామాజికవర్గాల్లో ఆలోచన రేకెత్తిస్తూ బహుజన రాజ్యాధికారానికి బాటలు వేస్తున్నారు. చరిత్రాత్మక నల్లగొండ జిల్లాలోనే రాజకీయ నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు ప్రవీణ్.  దళిత, బహుజన, మైనారిటీ వర్గాలతో కదం కదం కలిపి నడిచేందుకు ఇప్పటికే వ్యూహరచన చేసుకున్న ప్రవీణ్.. అగ్రవర్ణ అభిజాత్యపు విమర్శల్లో నిండా మునిగిన కేసీఆర్ మీద సామాజిక అస్త్రాలు సంధించేందుకు రెడీ అయ్యారు. అందుకు గ్రౌండ్స్ కూడా చాలా పటిష్టంగా తయారు చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 8న బీఎస్పీలో చేరిక ఖాయమైపోగా అంతకుముందు ప్రతిరోజూ ప్రజల్లో ఉండేందుకు, మీడియాలో ఉండేందుకు షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలు కవరయ్యేలాగా రోజుకో జిల్లాలో సమ్మేళనాలు నిర్వహించి తాను పార్టీ కండువా కప్పుకునేనాటికి విపరీతమైన హైప్ క్రియేట్ చేయాలని స్కెచ్ వేసుకున్నారు. ఆయన ఆ దిశగానే కదులుతుండడం అటు టీఆర్ఎస్ అధినాయకత్వానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. చాపకింద నీరులా వస్తున్న ప్రవీణ్ కుమార్ (పీకే), ఆయన స్వేరో సైన్యానికి జడిసే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధును అకస్మాత్తుగా హుజూరాబాద్ ఎన్నికకు ముందే ప్రకటించాల్సి వచ్చిందంటున్నారు.  అటు పీకే కూడా తన లోగుట్టు కేసీఆర్ గుర్తించడం వల్లే ఇటీవల కేబినెట్ భేటీలో తన గురించి చాలాసేపు చర్చ జరిగిందని, ఆ తదుపరి తనపై ప్రభుత్వం శాఖాపరంగా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉన్నందువల్లే ఆరేళ్ల సర్వీసును త్యాగం చేయాల్సి వచ్చిందన్న వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగ బాధ్యతల్లో ఉన్నన్ని రోజులు కేసీఆర్ సర్కారుకు ఎక్కడా వ్యతిరేకంగా కనిపించకుండా అణిగిమణిగి ఉన్న పీకే, ఆ బాధ్యతలను పక్కన పెట్టగానే సర్కారు మీద అస్త్రాలు ఎక్కుపెట్టడం గమనించాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకే హుజూరాబాద్ లో పీకే పోటీ చేయడాన్ని కూడా కొట్టిపారేయలేమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

బొమ్మలాట కాదు .. బొమ్మైకి కత్తిమీద సామే..

కర్ణాటక రాష్ట్రంలో సుమారు రెండు నెలలకు పైగా సాగుతున్న రాజకీయ డ్రామాకు తెరపడింది. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణలో 12 మంది కేంద్ర మంత్రులకు ఇట్టే  ఉద్వాసన పలిగిన బీజేపీ కేంద్ర నాయకత్వం, కర్ణాటక ముఖ్యమంత్రి పదవినుంచి బీఎస్ యడ్యూరప్పను తప్పించేందుకు మాత్రం చాలా చాలా కసరత్తే చేసింది. వ్యూహాలను పన్నింది. పావులు కదిపింది. చివరకు ఎలాగైతేనేమి, 78 ఏళ్ల యడ్డీని అదే వయసు వంకగా చూపించి సగౌరవంగా సాగనంపింది. ఆయన సోమవారం  ‘స్వచ్చందంగా’, తమ పదవికి రాజీనామా చేశారు.అక్కడి నుంచి 24 గంటలు తిరగక ముందే అధిష్ఠానం ఆదేశం మేరకు, బీజేపీ శాసన సభాపక్షం కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ బొమ్మైని ఎన్నుకుంది. ఈయన మాజీ ముఖ్యమంత్రి, జనతా దళ్ నాయకుడు ఎస్ఆర్ బొమ్మై కుమారుడు. ఆయన బుధవారం రాష్ట్ర 20 వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ వ్యవహరంలో బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది.నాయకత్వ మార్పును సాఫీగా కానిచ్చింది. అలాగే, యడియూరప్ప వారసుడి ఎంపిక ప్రక్రియను కూడా హేండిల్ విత్ కేర్  అన్నట్లుగా చాలా సున్నితంగా కానిచ్చింది.   అయితే ఇల్లలకగానే పండగ కాదు, అన్నట్లుగా యడ్యూరప్పను తప్పించడంతోనే కథ సుఖాంతం అయినట్లు కాదు, అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. యడ్యూరప్ప రెండేళ్ళ పాలన మిగిల్చిన మరకలు ఒక వైపు, ఆయన నీడ మరొక వైపు కొత్త ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైని వెంటడుతూనే ఉంటాయి. అయితే, గుడ్డిలో మెల్ల అన్నట్లుగా, బొమ్మైను సెలెక్ట్ చేసింది యడ్డీనే కావడం, ఇద్దరూ ఒకే  (లింగాయత్) సామాజిక వర్గానికే చెందినవారు కావడం ఇటు కొత్త ముఖ్యమంత్రికి, అటు పార్టీ అధిష్ఠానికి కూడా కొంత ఊరట ఇచ్చే, అంశంగానే పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి, ముఖ్యమంత్రి పదవిని వదులుకోవలసిన రావడం పట్ల ఆగ్రహంగా ఉన్న యడ్డీని అలాగే, ఆయన కంట కన్నీరు చూసి కరిగిపోయి, బీజేపీని శపించిన లింగాయత్ సామాజిక వర్గాన్ని బుజ్జగించెందుకే,అదే సామాజిక వర్గానికి చెందిన బొమ్మైని అధిష్ఠానం ఎంపిక చేసిందని, పరిశీలకులు భావిస్తున్నారు.మరో వంక  జనతా పరివార్‌కు చెందినవారు కావడం, యడ్డికి అత్యంత ఆప్తుడిగా గుర్తింపు పొంది అధిష్ఠానం పెద్దలతోనూ సత్సంబంధాలు కలిగివుండడం, బీజేపీలో సౌమ్యుడిగా గుర్తింపు పొందడం, లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందడం వంటి అంశాలన్నీ బొమ్మైకు కలిసొచ్చాయని భావిస్తున్నారు.  అయితే, కొత్త ముఖ్యమంత్రి ముందున్న సవాళ్ళు సామాన్య మైనవి కాదు. మరో 18 నెలల్లో శాసన సభ ఎన్నికల పెద్ద పరీక్షకు పార్టీని సిద్ధం చేయడం సామాన్యమైన విషయం కాదు.కొవిడ్ 19, వరదలు, మరో వంక ఆర్థిక వ్యవహారాలు ఇలా అన్ని దిక్కులా నుంచి సమస్యలు, సంక్షేమాలు కళ్ళురుముతున్నాయి. అలాగే, రాజకీయంగానూ, బొమ్మై ముందు చాలానే సమస్యలున్నాయి. యడ్యూరప్ప రెండేళ్ళ పాలనలో అవినీతి అరోపణలురాని  రోజంటూ లేదు. అది కూడా ప్రతిపక్షాల నుంచి కాదు,సొంత పార్టీ నాయకులు ఎమ్మెల్యేలే యడ్డీకి వ్యతిరేకంగా అధిష్ఠానానికి ఫిర్యాదులు చేశారు.అలాగే, యడ్డీ చిన్న కొడుకు విజయేంద్ర ప్రభుత్వ వ్యవహరాలలో జోక్యం చేసుకోవడం వంటి ఆరోపణలున్నాయి. నిజానికి యడ్డీ ఉద్వాసనకు ఇవ్వన్నీ కూడా కారణమయ్యాయి.అదే విధంగా కాంగ్రెస్, జేడీఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు యడ్డీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనే ఆరోపణ వుంది. ఈ సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కుంటూ ... మరో వంక సిద్దరామయ్య, డీకే శివకుమార్ వంటి ఉద్దండ కాంగ్రెస్ నాయకులకు దీటుగా రాజకీయాలు చేయడం కొత్త ముఖ్యమంత్రి బొమ్మైకి కత్తి మీద సాముగానే పరిశీలకులు భావిస్తున్నారు.  

పారిశ్రామిక పితామహుడు.. వేలాది కుటంబాల్లో వెలుగులు.. ముళ్లపూడికి శతకోటి వందనాలు 

నిలువెత్తు తెలుగుదనం, కృషి, పట్టుదల, అకుంఠిత దీక్షల ప్రతిరూపం డాక్టర్ ముళ్ళపూడి సత్యహరిశ్చంద్రప్రసాద్. ఆంధ్రా పారిశ్రామికరంగ పితామహుడు, పారిశ్రామిక భగీరధుడుగా ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్  దక్షిణ భారత దేశంలో "ఆంధ్రా బిర్లాగా" సుపరిచితులు.  ఆంధ్రషుగర్స్ ఆంధ్రాపెట్రోకెమికల్స్  లాంటి ఎన్నో వ్యవసాయ ఆధారిత భారీ పరిశ్రమల స్ధాపన ద్వారా, ఆంధ్ర పారిశ్రామిక రంగానికి మరియు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు పునాదులు వేసి, రాష్ట్రంలో మెుదటితరం పారిశ్రామిక విప్లవానికి నాంది పలికిన మహానుభావుడు డాక్టర్ ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్.  పారిశ్రామిక అంతరిక్ష  రాకెట్  ఇంధన  తయారీ ద్వారా  భారతదేశాన్ని ప్రపంచ దేశాల సరసన సగర్వంగా చేర్చారు. తణుకును పారిశ్రామిక పట్టణంగా తీర్చిదిద్దారు. ఆంధ్రరాష్ట్రంలో ముఖ్యంగా ఉభయగోదావరిజిల్లాలు, కృష్ణా, గుంటూరు, హైదరాబాద్, ఖమ్మం, విశాఖపట్టణం, రాయలసీమలలోనే కాక.. దేశంలోనే పలు చోట్ల కొన్ని వేల, లక్షల కుటుంబాలకు ఉద్యోగ, ఉపాధి మరియు విద్యావకాశాలు కల్పించి వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన ఆదర్శమూర్తి డాక్టర్ సత్యహరిశ్చంద్రప్రసాద్.  పశ్చిమగోదావరి జిల్లా కోస్తాంధ్ర ఉండ్రాజవరం సంస్ధానాధీశులు, తణుకు ముళ్ళపూడి జమిందారుల వంశంలో.. ఆంధ్రభోజ, సాహితీ వల్లభ, కళాప్రపూర్ణ కీ.శే. ముళ్ళపూడితిమ్మరాజు- వెంకటరమణమ్మ దంపతులకు 1921లో జన్మించారు సత్యహరిశ్చంద్రప్రసాద్. చిన్నతనం నుండే ఆయన తాతగారు, ఉండ్రాజవరం సంస్ధానాధీశులు, "రైతురాయడు" గా ప్రసిధ్ధి గాంచిన ముళ్ళపూడి వేంకటరాయుడు అడుగుజాడల్లో నడిచారు.  ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త, దార్శనికుడు, గొప్ప దాతగా ప్రసిధ్ధి పొందారు. తాత తండ్రుల వారసత్వంగా గాంధీజీ సిధ్ధాంతాలపై ఆశక్తి పెంచుకొన్న ముళ్ళపూడి..స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని సమరయోధుడిగానిలిచారు.  పాఠశాల విద్య (ఎస్ఎస్ యల్ సి) పూర్తి చేసిన హరిశ్చంద్ర ప్రసాద్ దేశానికి స్వాతంత్ర్యము రావడానికి నాలుగు రోజుల ముందు (ఆగస్ట్ 11, 1947) తణుకు లో ఆంధ్రా సుగర్స్ స్థాపించారు. గ్రామీణభారతాన్ని శాస్త్ర సాంకేతిక రంగాల సహాయంతో పారిశ్రామికంగా అభివృధ్ధి చేసి విద్యా ఉద్యోగ రంగాల్లో యువతకు ఉపాధి కల్పించాల్సిన అవసరాన్ని ఆయన చిన్నతనంలోనే గుర్తించారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక వెలుగులు నింపి వేలాది మంది యువతకు ఉపాధి బాట చూపారు. గ్రామీణ ప్రాంతములో, విద్యుత్ లేని కాలములో జనరేటర్ సాయముతో స్థాపించబడిన పరిశ్రమ ఇది.    గత 63 సంవత్సరాల కాలంలో ఆంధ్రా సుగర్స్ లో ఒక్క రోజు కూడ సమ్మె జరగలేదంటే ఆయన పనితీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆంధ్రా షుగర్స్ లో ప్రస్తుతం 12 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. 1947లో రోజుకి 600 టన్నుల చెరకు ఒత్తబడి తో మొదలయ్యి.. ప్రస్తుతము 10,000 టన్నులు చేరింది. రాష్ట్ర ప్రభుత్వమునకు అత్యధిక పన్ను చెల్లించు పరిశ్రమ కూడా ఇదే.  దేశ రాకెట్ ప్రయోగాలకు అవసరమగు ఇంధనము తయారు చేయు ఏకైక సంస్థ కూడా ఇదే. అంతేకాదు ప్రపంచములో రాకెట్ ఇంధనము తయారు చేయు 5 దేశములలో భారత దేశాన్ని చేర్చిన ఘనత సత్య హరిశ్చంద్రప్రసాదే. భారత దేశములో యాస్పిరిన్ తయారు చేసిన తొలి కర్మాగారము కూడా ఆయన నెలకొల్పిందే.  పశ్చిమగోదావరి జిల్లాలోని  తణుకును పారిశ్రామిక పట్టణంగా తయారుచేసి ప్రపంచ పటంలో నిలిపారు. దేశ విదేశాలు పయనించి శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రగతిని అధ్యయనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో  అగ్రభాగాన నిలిపిన ఘనత ఆంధ్రాబిర్లా శ్రీ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాదే. ఈ అభివృధ్ధి నమూనానే నేటి తరం నాయకులు అవలంబిస్తున్నారు.  పశ్చిమగోదావరి జిల్లా రాజకీయ రంగంలో ఎన్నో విశిష్ట పదవులను అలంకరించారు ముళ్ళపూడి సత్యహరిశ్చంద్రప్రసాద్. ఎన్నో అవార్డులు, ప్రశంసలు పొందారు. తాత వెంకట్రాయుడు, తండ్రి తిమ్మరాజు గారి అడుగు జాడల్లో నడిచి.. స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్, ఫ్యాక్టరీలు, వృధ్ధాశ్రమాలు స్ధాపించి సమాజానికి ఎంతో సేవచేసారు. ఆంధ్రుల పారిశ్రామిక మరియు వ్యవసాయ రంగాన్ని అంతరిక్ష స్ధాయికి చేర్చిన మహనీయుడు డాక్టర్ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ కు  శత జయంతి సందర్భంగా ఘన నివాళులు..

తెలంగాణ‌కు ఏపీ హెల్పింగ్ హ్యాండ్‌.. దొందుదొందేన‌ని క్లియ‌ర్‌..

పైపైన తిట్టుకుందాం.. కొట్టుకుందాం.. జ‌నాన్ని ప‌రేషాన్ చేద్దాం. లోలోనా మాత్రం మ‌నం మ‌నం ఒక్క‌టే అన్న‌ట్టు ఉందాం. ఇదే ఇప్పుడు ఇద్ద‌రు సీఎంలు ఫాలో అవుతున్న ఫార్ములాగా ఉంది. జ‌గ‌జ‌గ‌డంపై రెండు రాష్ట్రాలు క‌త్తులు దూస్తున్నాయి. ప్రాజెక్టుల ద‌గ్గ‌ర పోలీసుల‌ను మోహ‌రిస్తున్నాయి. కేంద్రానికి ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. మంత్రులు ప‌ర‌స్ప‌రం దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఇక స‌మ‌ర‌మే అన్న‌ట్టు తెగ సీన్ క్రియేట్ చేస్తున్నారు. క‌ట్ చేస్తే.. ఒక‌రికొక‌రు తోడుగా ఉంటున్నారు. ప‌ర‌స్ప‌రం సాయం చేసుకుంటున్నారు. తాజాగా, ఏపీ స‌ర్కారు త‌న మిత్రుడైన కేసీఆర్ ప్ర‌భుత్వానికి ఓ సాఫ్ట్‌వేర్ షేర్ చేసింది. రాబోవు ఫ్రెండ్‌షిప్ డేకి ముందే గిఫ్ట్ ఇచ్చిన‌ట్టుంది.  తెలంగాణకు జగన్ సర్కార్ సాయం అందించింది. ‘నాడు నేడు’ సాఫ్ట్ వేర్‌ను తెలంగాణ వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చింది. 'మన బడి', 'నాడు-నేడు' సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణలోని పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉప‌యోగించుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణకు ఇచ్చేందుకు నిరభ్యంతర పత్రం జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఏపీ ప్ర‌భుత్వం. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు నడుస్తున్నా.. ఏపీ సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణ అడ‌గ‌డం.. అందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంగీకరించడం ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల ఏర్పాటుకు తెలంగాణ సర్కార్ సిద్ధ‌మ‌వుతోంది. ఆ ప‌నుల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ఏపీ ద‌గ్గ‌ర ఉన్న‌ నాడు–నేడు సాఫ్ట్‌వేర్‌ ప్రయోజనకరంగా ఉంటుందని.. తాము కూడా ఈ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకుంటామని.. దీనిపై నిరభ్యంతర ఉత్తర్వులివ్వాలని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఏపీ విద్యాశాఖ కార్యదర్శికి లేఖ రాసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నాడు-నేడు కార్య‌క్ర‌మ‌ ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ప్ర‌ముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ త‌యారు చేసిన‌ ప్ర‌త్యేక సాఫ్ట్‌వేర్‌ను ఏపీ ప్రభుత్వం వినియోగిస్తోంది. ఎన్ని పనులు చేపట్టారు? ఎన్ని పనులు పూర్తయ్యాయి? ఎన్ని నిధులు ఖర్చయ్యాయి? తదితర అంశాలన్నీ తెలిసేలా ప్రత్యేక పోర్టల్‌ ఏర్పాటు చేశారు. ఆ సాఫ్ట్‌వేర్‌నే  తాజాగా తెలంగాణ ప్రభుత్వం అభ్యంత‌రం మేర‌కు ఆ రాష్ట్రానికి అందిస్తోంది ఏపీ స‌ర్కారు.  ఇక్క‌డ మేట‌ర్‌.. సాఫ్ట్‌వేర్ సాయంకంటే కూడా రెండు రాష్ట్రాల మ‌ధ్య ఉన్న స్నేహాం గురించే ఎక్కువ చ‌ర్చ న‌డుస్తోంది. పైకి రెండు ప్ర‌భుత్వాలు వాట‌ర్ ప్రాజెక్టుల‌పై పోట్లాడుకుంటున్న‌ట్టు క‌నిపిస్తున్నా.. లోలోప‌ల మాత్రం మంచి ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ అవుతోంద‌ని.. సాఫ్ట్‌వేర్ సాయ‌మే అందుకు ఎగ్జాంపుల్ అని అంటున్నారు. మ‌రెందుకో పైకి ఆ వాట‌ర్ వార్‌ డ్రామా? ప్ర‌జ‌ల భావోద్రేకాల‌ను రెచ్చ‌గొట్ట‌డం ఎందుకో? అని మండిప‌డుతున్నారు రెండు రాష్ట్రాల ప్ర‌జ‌లు.   

అత్తిలి సత్తి… సుమంగళి వ్రతాల పేరిట మహిళలకు మస్కా.. 

నిజామాబాద్ జిల్లాలో ‘అత్తిలి సత్తి’… సుమంగళి వ్రతాల పేరిట మహిళలకు మస్కా.. నిట్టనిలువునా దోచేశాడు. అందుగలదు ఇందులేదు అన్న సందేహం లేదు ఎందెందు చూసిన అందందు గలదు మోసం. ప్రతి పనిలో.. ప్రతిదానిలో భాగమైపోయింది. అందరూ  లాజిక్కుల కంటే ఎక్కువగా మేజిక్కులనే నమ్ముతారు. అందుకే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ చెప్పినట్లు మనదేశంలో సైంటిస్టుల కంటే బాబాలే ఫేమస్. మన దేశంలో నకిలీ స్వామీజీలు, దొంగ బాబాల చేసిన.. చేస్తున్న స్కాములు అంత ఇంత కాదు వాళ్ళ మీద సీరియల్స్ తెస్తే ఎపిసోడ్స్ సరిపోవు.. బుక్స్ రాస్తే పెన్నులు పేపర్లు సరిపోవు.. స్వామిలు బాబాలు మోసాలు చేసిన ఎన్ని దారుణాలు చేసిన మళ్ళీ మళ్ళీ జనం  తెలివి లేకుండా ఇంకా వారి వలలో  పడుతున్నారు. తాజాగా సుమంగళి వ్రతాల పేరిట మహిళలకు కుచ్చుటోపీ పెట్టాడు ఓ ఘరానా  పూజారి. నిజామాబాద్ జిల్లా, డిచ్ పల్లి మండలం ధర్మారం (బి) లో ఓ పూజారి బారి మోసానికి తెరలేపాడు. అతని పేరు శ్రీనివాస శర్మ, పురోహితం చేస్తే వచ్చిన  డబ్బులు సపోవడంలేదు అనుకున్నాడేమో మరి.  సుమంగళి వ్రతాలూ చేస్తానని చెప్పి పలువురు మహిళల దగ్గర ఒకటి కాదు రెండు కాదు ఏకంగా  కోటిన్నర వసూలు చేసి ఉడాయించాడు. డిచ్ పల్లి , బోధన్ , మాక్లూర్ లో మహిళల భర్తల క్షేమం కోసం వ్రతాలూ చేస్తానని నమ్మించి వసూళ్లకు పాల్పడ్డాడు నిందితుడు. కొందరు మహిళలు భర్తలకు తెలియకుండా లక్షల్లో అతడికి చెల్లించారు. శ్రీనివాస్ శర్మ మోసం చేశాడని ఆలస్యంగా గ్రహించిన బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పాలసీల పేరుతో భారీ మోసం.. ఏ మాట వెనుక ఎవరి స్వార్ధం ఉందొ తెలుసుకోలేనంతకాలం మోసపోతూనే ఉంటాం అని లెనిన్ చెప్పినట్లు.. ఆ విషయాన్నే మరిచిపోయి ఈ ప్రజలు మళ్ళీ మళ్ళీ మోసపోతున్నారు. తాజాగా ఇన్సూరెన్స్ పాలసీల పేరుతో ఓ వృద్ధురాలి నుంచి సైబర్ కేటుగాళ్లు రూ.15 లక్షలు దండుకున్నారు. హైదరాబాద్​కు చెందిన ఓ వృద్ధురాలి(80)తో… ఇన్సూరెన్స్ పాలసీలు, వాటి లాయాలిటీ, రివర్సల్ బోనస్​ల పేరుతో ఉత్తరప్రదేశ్​కు చెందిన ముగ్గురు సైబర్ కేటుగాళ్లు ఆమెకు ఫోన్​ చేశారు. బోనస్ డబ్బుల ఆశ చూపి అందినకాడికి దోచుకున్నారు. ఆర్పీఐ, ప్రాసెసింగ్, సెబీ, వివిధ ఛార్జీల పేరుతో రూ.15.47 లక్షలు అకౌంట్లో వేయించుకున్నారు. అనంతరం వారి ఫోన్​ స్విచాఫ్​ రావడంతో మోసపోయానని గ్రహించిన వృద్ధురాలు.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు… యూపీలోని ఘజియాబాద్​కి చెందిన దేవాన్ష్, ఇమ్రాన్ ఖాన్​ను అరెస్టు చేసి రిమాండు​కు తరలించారు. మరో నిందితుడు రస్టజీ పరారీలో ఉన్నట్లు… త్వరలోనే అతడిని పట్టుకుంటామని సైబర్​ పోలీసులు తెలిపారు.  

రామ‌ప్ప‌కు పెను ముప్పు!.. పాల‌కుల‌కు ప‌ట్ట‌దా?

కాక‌తీయుల వైభ‌వానికి యునెస్కో గుర్తింపు. ప్ర‌పంచ వార‌స‌త్వ సంప‌ద‌గా రామ‌ప్ప. అంతా బాగుంది. అంద‌రికీ సంతోషంగా ఉంది. తెలుగుజాతికి ద‌క్కిన గౌర‌వంగా అంతా సంబ‌ర ప‌డుతున్నారు. ఇక‌పైనైనా రామ‌ప్ప‌కు మంచి జ‌నాద‌ర‌ణ ల‌భిస్తుంద‌ని ఖుషీ అవుతున్నారు. అయితే, పాల‌కుల అవ‌గాహ‌న రాహిత్యంతో రామ‌ప్ప ఉనికి ప్ర‌మాదంలో ప‌డింది. ప్ర‌భుత్వాల కాసుల క‌క్కుర్తికి చారిత్ర‌క వైభ‌వానికి ముప్పు వాటిల్లుతోంది.  అవును, రామ‌ప్ప టెంపుల్‌కి సింగరేణి ఓపెన్‌ కాస్టు నుంచి ముప్పు పొంచిఉంద‌ని అంటున్నారు. ఆలయానికి జ‌స్ట్ 6 కిలోమీటర్ల దూరంలోనే బొగ్గు ఉత్పత్తికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. బొగ్గు మైనింగ్ కోసం బ్లాస్టింగ్స్ జ‌రిపితే.. ఆ ప్ర‌కంప‌ణ‌లు రామ‌ప్ప వ‌ర‌కూ వ్యాపిస్తాయ‌ని ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.  ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండల కేంద్రంలో సింగరేణి సంస్థ తొలిసారిగా బొగ్గు బ్లాక్‌ ప్రారంభించింది. 315 హెక్టార్ల అటవీ భూములను, 1,483హెక్టార్ల వ్యవసాయ, అసైన్డ్‌ భూములను సేకరిస్తున్నారు. రానున్న 19 ఏళ్లలో 40.43 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే సింగరేణి, రెవెన్యూ శాఖ అధికారులు భూసేకరణ చేపట్టారు. ఈ ఏడాది చివరినాటికి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సింగ‌రేణి ఓపెన్ కాస్టు బ్లాస్టింగ్స్ వ‌ల్ల రామప్ప ఆల‌య పునాదులు దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉంద‌ని తెలుస్తోంది. టెంపుల్‌కు కేవ‌లం 6 కిలోమీట‌ర్ల దూరంలోనే సింగ‌రేణి సంస్థ‌ మైనింగ్‌కు ముందుకురావ‌డం ఆందోళ‌న‌క‌ర అంశం. గ‌తంలోనూ ఇలాంటిదే ఓ ఘ‌ట‌న జ‌రిగింది. 2016లో భూపాలపల్లి జిల్లా భీంగణపురం నుంచి రామప్ప వరకు దేవాదుల నీటిని తరలించేందుకు సొరంగం తవ్వాలని భావించారు. సొరంగం పనులకు  బ్లాస్టింగ్‌ చేయాల్సిన అవసరం ఉండ‌టంతో రామప్ప ఆలయానికి ప్రమాదం పొంచి ఉందని కేంద్ర పురావస్తు శాఖ అధికారులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. తెలిపారు. స్థానికులు కూడా  సొరంగం పనులను వ్యతిరేకించి ఆందోళనకు దిగారు. దీంతో ఆ పనులను నిలిపి వేసి, పైపులైన్‌ నిర్మాణంతో దేవాదుల నీటిని తరలిస్తున్నారు.  ఓపెన్ కాస్టులో బొగ్గు ఉత్పత్తి కోసం బాంబులతో బ్లాస్టింగ్‌ చేస్తారు. ఈ ప్రభావం భూగర్భం గుండా 10 కిలో మీటర్ల దూరం వ‌ర‌కూ ఉంటుందట‌. అందుకే, 6 కి.మీ. దూరంలో ఉన్న‌ రామప్ప ఆల‌యానికి ప్రమాదం ఏర్ప‌డ‌వ‌చ్చ‌నే ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. వెంకటాపూర్‌ ఓపెన్‌కాస్టు ప్రభావంపై మరోసారి సర్వే చేసి, రామప్పకు ముప్పు లేదంటేనే కొనసాగించాలని, లేదంటే బొగ్గు తవ్వకాలు రద్దు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మ‌రి పాల‌కులు, అధికారులు ఏం నిర్ణ‌యం తీసుకుంటారో..? మ‌రోవైపు, రామ‌ప్ప చారిత్ర‌క సంప‌ద సంర‌క్ష‌ణ‌పై తెలంగాణ హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. యునెస్కో విధించిన గ‌డువులోగా స‌మ‌గ్ర సంర‌క్ష‌ణ చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. ఏఎస్ఐ, రాష్ట్ర పురావ‌స్తుశాఖ‌, క‌లెక్ట‌ర్‌తో క‌మిటీ వేసి.. క్షేత్ర‌స్థాయిలో క‌మిటీ ప‌రిశీలించి నివేదిక స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది.   

దాడుల‌తో భ‌య‌పెట్ట‌గ‌ల‌రా? జ‌గ‌న్‌పై తిరుగుబాటు త‌ప్ప‌దా?

కోడ‌లిని కొట్టి అత్త అరిచింద‌నేది సామెత‌. ఇది నిజ‌మేన‌ని ఎప్ప‌టిక‌ప్పుడు రుజువు అవుతూనే ఉంటుంది. సేట్ టు సేమ్‌.. ఈ సామెత‌ను పోలిన సంఘ‌ట‌న ఇప్పుడు ఏపీలో క‌ల‌క‌లం రేపుతోంది. బాధితుల‌పైనే కేసులు. దాడికి గురైన వారిపైనే హ‌త్యాయ‌త్నం బ‌నాయింపు. బ‌హుషా.. రాజారెడ్డి రాజ్య‌మే వాళ్ల టార్గెట్ కాబోలు. అందుకే, వ‌రుస‌గా టీడీపీ నేత‌లే ల‌క్ష్యంగా దాడుల‌కు తెగ‌బ‌డుతూనే ఉన్నారు. తాజాగా, మాజీ మంత్రి దేవినేని ఉమా మీద జ‌రిగిన అటాక్ మ‌రింత అరాచ‌కంగా ఉంది. రాత్రి వేళ‌లో ప‌దుల సంఖ్య‌లో వైసీపీ శ్రేణులు దేవినేని బృందంపై దాడికి బ‌రితెగించారు. కొండ‌ప‌ల్లి అడ‌వుల్లో గ‌ప్‌చుప్‌గా జ‌రుగుతున్న‌ అక్ర‌మ మైనింగ్‌ను బాహ్య ప్ర‌పంచానికి చాటిచెప్ప‌డానికి దేవినేని ఉమా ఆధ్వ‌ర్యంలో టీడీపీ బృందం అక్క‌డికి వెళ్లింది. ఈ విష‌యం తెలిసి వైసీపీ వ‌ర్గాలు దేవినేనిని అడ్డ‌గించి దాడికి పాల్ప‌డ్డారు. టీడీపీ వాళ్లు ఎదురుతిర‌గ‌డంతో దెబ్బ‌లు త‌గ‌ల‌కుండా బ‌తికిపోయారు. త‌న‌పై జ‌రిగిన దాడికి నిర‌స‌న‌గా దేవినేని అక్క‌డే కారులో ధ‌ర్నాకు దిగారు. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పై నుంచి ఏం ఆదేశాలు వ‌చ్చాయో.. ఖాకీలే కారు అద్దాలు ప‌గ‌ల‌గొట్టారు. దేవినేనిని అరెస్ట్ చేసి స్టేష‌న్‌కు త‌ర‌లించారు. మామూలుగా అయితే అక్క‌డికి ఆ ఉద్రిక్త‌త ముగిసిపోవాలి. కానీ, ఏపీ పోలీసులు క‌దా.. వైసీపీ తొత్తుల్లా వ్య‌వ‌హ‌రించార‌ని అంటున్నారు. బాధితుడైన దేవినేనిపైనే ఏకంగా మ‌ర్డ‌ర్ అటెంప్ట్‌ కేసు పెట్టారు. ఉచ్చు మ‌రింత బిగించేందుకు ఎస్సీ, ఎస్టీ సెక్ష‌న్లు కూడా బ‌నాయించారు. బ‌హుషా పాల‌కులు ఫుల్ ఖుషీ అయింటారు.  కృష్ణా జిల్లా నేత‌ల‌పై ఇలాంటి అరాచ‌కాలు జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో కూడా దాదాపు ఇలాంటి దాడులే జ‌రిగాయి. అది స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల స‌మ‌యం. బుద్ధా వెంక‌న్న‌, బోండా ఉమాలు మాచ‌ర్ల‌లో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప‌ర్య‌వేక్షించి విజ‌య‌వాడ తిరిగి వ‌స్తున్నారు. మార్గ మ‌ధ్య‌లో వైసీపీ దుండ‌గులు కాపు కాశారు. టీడీపీ నేత‌లు ప్ర‌యాణిస్తున్న కారును వెంబ‌డించి దాడికి దిగారు. పెద్ద పెద్ద దుంగ‌ల‌తో, క‌ర్ర‌ల‌తో, రాళ్ల‌తో అటాక్‌ చేశారు. కిలోమీట‌ర్ల మేర టీడీపీ వారి వాహ‌నాన్ని వెంబ‌డించి మ‌ళ్లీ మ‌ళ్లీ దాడుల‌కు తెగించారు. చివ‌రాఖ‌రికి కారు డ్రైవ‌ర్ చాక‌చ‌క్యంతో అతిక‌ష్టం మీద‌ బ‌తుకు జీవుడా అంటూ ప్రాణాల‌తో విజ‌య‌వాడ చేశారు. అప్పట్లో ఆ అటాక్ పెను దుమారం రేపింది. టీవీల్లో ఆ దృశ్యాలు చూసి అంతా అవాక్క‌య్యారు. ఆ క‌ర్ర గానీ, ఆ రాయి గాని త‌గిలుంటే ఎంత దారుణం జ‌రిగిపోయేది? వాళ్లు వైసీపీ నాయ‌కులా.. బ‌జారు రౌడీలా అంటూ ప్ర‌జ‌లంతా మండిప‌డ్డారు. అయినా, వైసీపీ వాళ్ల బుద్ధి మార‌నేలేదు. దాడుల దారుణాన్ని ఆప‌నేలేదు. తాజాగా మ‌రోసారి దేవినేని ఉమాను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసే ప్ర‌య‌త్నం తీవ్ర స్థాయిలో జ‌రుగుతోంది.  అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, ధూళిపాళ్ల న‌రేంద్ర‌, బుద్ధా వెంక‌న్న‌, బోండా ఉమా, కొల్లు ర‌వీంద్ర‌, చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌.. ఇలా అనేక మంది నోరున్న‌ టీడీపీ నేత‌లే టార్గెట్‌గా వైసీపీ స‌ర్కారు కేసులు, దాడుల‌తో బ‌రితెగిస్తోంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వ‌ అవినీతి, అరాచ‌క పాల‌న‌ను నిత్యం ప్ర‌జ‌ల్లో ఎండ‌గ‌ట్టడ‌మే పాల‌కుల‌కు కళ్ల‌మంట‌గా మారింది. జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా వినిపించే నోళ్లు నొక్కేసేందుకు.. ప్ర‌ధాన నేత‌ల పేర్లు రాసుకొని మరీ టార్గెట్ చేస్తున్నార‌ని అంటున్నారు. ఫైర్‌బ్రాండ్ లీడ‌ర్ అచ్చెన్నాయుడిని ఈఎస్ఐ కేసులో ఇరికించి నానాతిప్ప‌లు పెట్టారు. ధూళిపాళ్ల న‌రేంద్రపై పాత కేసును కొత్త‌గా బ‌య‌ట‌కు తీసి జైలుకు పంపించారు. ఇలా టీడీపీ నేత‌లంద‌రినీ ఏదో ర‌కంగా కేసుల‌తో ఇబ్బంది పెడుతున్నారు. ఆఖ‌రికి సొంత‌పార్టీ ఎంపీ అయిన ర‌ఘురామ‌ను సైతం వ‌ద‌ల‌కుండా కేసులు, అరెస్టులు, థ‌ర్డ్ డిగ్రీతో చుక్క‌లు చూపిస్తున్నారు.  టీడీపీ టార్గెట్‌గా జ‌రుగుతున్న వ‌రుస దాడులు చూసి.. శాంతికాముకులైన ఆంధ్రులు హ‌డ‌లిపోతున్నారు. క‌డ‌ప ఫ్యాక్ష‌న్‌ను రాష్ట్ర‌మంతా తీసుకొస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. పోలీసుల‌ను పావులుగా వాడుకుంటూ.. చ‌ట్టాన్ని చుట్టంగా మార్చుకొంటూ.. కేసులు, దాడులతో అంబేద్క‌ర్ రాజ్యాంగాన్ని అప‌హ్యాస్యం చేస్తూ.. రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఏపీవ్యాప్తంగా అమ‌లు చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఫ్యాక్ష‌న్ మీద స్వారీ ఎప్ప‌టికైనా ప్ర‌మాద‌క‌ర‌మే. రాజారెడ్డి దారుణ‌ మ‌ర‌ణ‌మే అందుకు నిద‌ర్శ‌నం. మ‌రి, ఆ రాజారెడ్డి అడుగుజాడ‌ల్లో న‌డుస్తున్న నేటి పాల‌కుల పాపం పండే రోజు ద‌గ్గ‌ర‌లోనే ఉందంటున్నారు. కాలం ఎంత‌టివాడినైనా శిక్షించ‌క‌మాన‌దంటూ శ‌పిస్తున్నారు. ఇలా బ‌రితెగించ‌డం దారుణ‌మంటూ మండిప‌డుతున్నారు.

దాడి చేసి.. మర్డర్ కేసు పెట్టి.. ఇదేమి రాజ్యం! 

అధికారం ఉంటే ఇంత భయంకరంగా బరితెగిస్తారా అని ఆశ్చర్యపోవాల్సిన పరిస్ధితి ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తోంది. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై దాడి, ఆ తర్వాత పోలీసుల నిర్బంధం..అరెస్టు వ్యవహారాలు చూస్తుంటే... చట్టం పోలీసుల చేతిలో లేదని.. వైసీపీ నేతల చేతిలో ఉందేమోనని అనిపిస్తోంది. తనపై దాడి జరిగిందని దేవినేని ఉమ ఆందోళన చేస్తే.. పోలీసులు ఆయనపైనే హత్యాయత్నం కేసు నమోదు చేయడం వైసీపీ దుర్మార్గ పాలనను సాక్ష్యంగా నిలుస్తోంది. అందరిని విస్మయ పరుస్తోంది.  అర్ధరాత్రి మొత్తం హైడ్రామా సాగగా.. చివరికి నందివాడ పోలీస్‌స్టేషన్‌లో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, 307 సెక్షన్లు కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దేవినేని హత్యాయత్నానికి పాల్పడినందుకు 307 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దేవినేని ఉమాతో పాటు మొత్తం 18మంది తెదేపా వర్గీయులపై కేసులు నమోదు చేశారు పోలీసులు.  తనపై దాడి చేసిన వైసీపీ నేతలను అరెస్ట్‌ చేయాలంటూ.... తన ఫిర్యాదును తీసుకోవాలంటూ... దేవినేని ఉమా జీ.కొంండూరు పోలీస్‌స్టేషన్‌ వద్దకు ఆందోళనకు దిగారు. ఫిర్యాదు తీసుకునే దాక తాను కదిలేది లేదంటుూ కారులోనే కూర్చున్నారు. కానీ ఆయన ఫిర్యాదు తీసుకోలేదు పోలీసులు. అయితే.. అర్ధరాత్రి తర్వాత ఆయన్ను బలవంతంగా అదుపులో తీసుకున్నారు. కారు అద్దాలు పగులగొట్టి డోరు తెరిచి అదుపులో తీసుకున్నారు. అక్కడ నుంచి పెదపారుపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దాదాపు ఆరు గంటల పాటు కారులోనే ఉమ ఆందోళన చేశారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు టీడీపీ నేతలు. ఫిర్యాదు తీసుకోకుండా... అదుపులో తీసుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీగా కొత్తగా వచ్చిన సిద్ధార్ధ్ కౌశల్.. ప్రజల కోసమే పని చేస్తున్నట్లుగా చేసిన ప్రకటనలన్నీ ఇప్పుడేమయ్యాయో తెలుసుకోవాలని ఉంది. ఫిర్యాదులు తీసుకునే దగ్గర సంస్కరణలు, రోజూ స్పందన కార్యక్రమం పెట్టించిన ఎస్పీ.. ఇక్కడ మాత్రం వైసీపీ నేతలు చెప్పినట్లు చేయాల్సి వస్తుందా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అక్రమ మైనింగ్ జరుగుతుందని బయటి ప్రపంచానికి తెలిసేలా చేయటానికే దేవినేని ఉమామహేశ్వరరావు కొండపల్లి రిజర్వ్ ఫారెస్టులోకి వెళ్లారు.. అక్కడి నుంచే మీడియాతో మాట్లాడారు. ఈ విషయంపై ఎప్పటి నుంచో వాదనలు, ఛాలెంజులు నడుస్తున్నాయి. ఈసారి వైసీపీ నేతలు సీరియస్ గా తీసుకున్నట్లున్నారు. ఏమైనా సరే దాడి చేయాలని డిసైడ్ అయినట్లున్నారు. అందుకే పక్కా ప్లాన్ ప్రకారం వందలమందితో కలిసి దాడి చేశారు.. టీడీపీ శ్రేణులు కూడా ఎదురుతిరగడంతోనే దేవినేని ఉమా దెబ్బలు తగలకుండా తప్పించుకోగలిగారు.. ఇప్పుడు అక్కడ అంటించకుండానే నిప్పు చెలరేగేలా ఉంది పరిస్దితి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పోలీసులు గొడవలు అవుతాయనే పేరు చెప్పి దేవినేనిని తమ నిర్బంధంలో పెట్టుకుని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం.. తెలుగుదేశం కీలక నేతలను గృహ నిర్బంధంలో పెట్టడం.. తెలుగుదేశం కార్యకర్తలపైనే లాఠీఛార్జి చేయడం చూస్తుంటే.. వైసీపీ నేతలు తమ అధికారాన్ని ఏ రేంజులో వాడుతున్నారో అర్ధమవుతూనే ఉంది.మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తన బలాన్ని, బలగాన్ని అన్నిటిని వాడుతున్నారని ఈ ఘటనలు చూస్తుంటే తెలుస్తోంది. ఆఖరికి అక్రమ మైనింగ్ అడ్డుకోవాలని చూసిన ఫారెస్ట్ ఆఫీసర్ ని కూడా బదిలీ చేయించేశారంటే... అధికార యంత్రాంగం అంతా తెలిసి కళ్లు మూసుకుందని అర్ధమవుతోంది. అటవీ సంపదను అక్రమంగా అలా దోచుకుంటుంటే ఆపాల్సిన అధికారులు, పోలీసులు... దేవినేనిని అక్కడకు వెళ్లకుండా ఆపటానికి.. ఆయన మాట్లాడకుండా ఆపటానికే ప్రయత్నిస్తున్నారు.  ఇప్పటివరకు మాటల యుద్ధమే నడిచింది ఆ నియోజకవర్గంలో ఈ దెబ్బతో బాహాబాహీ నడుస్తోంది. ఇంత ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడినా..ఇప్పటివరకు ఎస్పీ స్పాట్ కు రాకపోవడం గమనించాల్సిన విషయం. ఒత్తిడి తట్టుకోలేక.. రాలేదా..లేక వచ్చినా అధికార పార్టీ నేతలు చెప్పిందే చేయాలని తప్పించుకున్నారా అనేది తెలియటం లేదు. పోలీసులు మాత్రం వన్ సైడు వ్యవహారం నడిపిస్తున్నారు. కేవలం టీడీపీ శ్రేణులు అలర్ట్ గా ఉండి ఎదురు తిరగడంతోనే.. పరిస్దితి ఇంతటితో ఆగింది.. లేదంటే ఎంత దూరం వెళ్లేదో చెప్పలేం. 

తెలుగు రాష్ట్రాల్లో కిడ్నాపుల కలకలం..ఇంజినీరింగ్ విద్యార్థి దారుణ హత్య..

తెలుగు రాష్టాల్లో కిడ్నాపులు వరసగా జరుగుతున్నాయి. తాజాగా ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. డబ్బుల కోసం ఇంజినీరింగ్ విద్యార్థిని  కిడ్నాప్ చేయడమే కాకుండా చివరికి  ఇంజినీరింగ్ విద్యార్థిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన జిల్లాలోని నల్లజర్ల మండలం పోతవరంలో బుధవారం ఉదయం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. నిన్న రాత్రి వంశీ అనే ఇంజినీరింగ్ విద్యార్థిని కిడ్నాప్ చేసిన కొందరు దుండగులు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా  రూ.50 లక్షలు డిమాండ్ చేశారు. బాధితుడి తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో ఆ విషయాన్నీ ముందే పసిగట్టిన ఆ దుండగులు వంశీని దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత అతని శవాన్ని తెచ్చి గ్రామశివారులో పడేసారు కిడ్నాపర్లు. ఈ విషయం తెలియడంతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. అయితే, మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు క్లూస్ కోసం వెతుకుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. నిజామాబాద్ లో మరో కిడ్నాప్  తెలంగాణ రాష్ట్రము లోని నిజామాబాద్ జిల్లా బోధన్‌ పట్టణంలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. ముంతాజ్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసిన దుండగులు రూ.2లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో బాధిత కుటుంబం గత్యంతరం లేక విశ్వ అనే వ్యక్తికి రూ.2 లక్షలు చెల్లించింది. అయితే, డబ్బులు ఇచ్చాక కిడ్నాపర్ల చెరలో బంధీగా ఉన్న ముంతాజ్ తప్పించుకున్నాడు. అనంతరం కిడ్నాప్ వ్యవహారంపై ముంతాజ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు రంగంలోకి దిగారు. కొన్ని గంటల వ్యవధిలోనే కిడ్నాపర్లను పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.2లక్షలు, కత్తి, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

60 ఏళ్ళ అత్త బర్త్ డే కి.. 60 రకాల వంటకాలు చేసిన కోడలు..   

అత్తా కోడళ్లు అంటేనే పోట్లాట, అత్త, కోడలు అంటే బద్ద శత్రువులు, వాళ్ళ ఇద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమంటాది అని అటు సీరియల్ లోను ఇటు సినిమాల్లోనూ దంచి కొడుతుంటారు. సినిమాలు, టీవీ సీరియల్స్‌లో  అత్తా కోడలికి, కోడలు అత్తకి ఇచ్చి  వార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  నిజానికి అందరూ అత్తలు ఆలా ఉండరు కోడలు కూడా అలా ఉండరు. అదంతా రీల్ లైఫ్‌లో సమాజంలో అందరికీ ఆదర్శంగా నిలిచే అత్తా కోడళ్లు ఉన్నారు. అత్తమామలను సొంత తల్లిదండ్రులుగా చూసుకునే కోడళ్ళు కూడా ఉన్నారు. తాజాగా ఓ కోడలు తన అత్తా పై తనకు ఉన్న  ప్రేమను అలాగే చూపించింది. పుట్టిన రోజు నాడు ఎవరూ ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. అత్తగారిపై కోడలు చూపించిన ప్రేమను చూసి నోరెళ్లబెడుతున్నారు. అది పశ్చిమగోదావరి జిల్లా. ఆ జిల్లాకు చెందిన కోడలు తన అత్తగారి పుట్టిన రోజు సెలబ్రేషన్స్ కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 60 రకాల వంటకాలను తయారు చేసింది. అన్ని రకాల వెరైటీలు మెనూలో చేర్చేశారు. వంటకాలను డబ్బాల్లో నింపి వాటిపై పేర్లు రాసి పెట్టింది. పులిహోర నుంచి నూడిల్స్ వరకు.. ఇడ్లీ నుంచి పెరుగు వరకు చెప్పుకుంటూ పోతే చాలా వెరైటీలే ఉన్నాయి. అత్తగారిపై కోడలు చూపించిన ప్రేమను చూసి అంతా షాక్ అవుతున్నారు.. ఆ వెరైటీ వంటలు చూసి నోరెళ్లబెడుతున్నారు.60 వంటలు చేయడం వెనుక మరో సర్‌ప్రైజ్ కూడా ఉంది. అత్తకు 60 ఏళ్లు కావడంతో ఆ కోడలు.. 60 రకాల వెరైటీ వంటలను చేసి గిఫ్ట్‌గా ఇచ్చారు. కోడలి ప్రేమకు అత్త కూడా ఫిదా అయ్యారు.. ఈ వంటకాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు.అత్తా కోడళ్ళ అనుబంధం ఇదే అంటున్నారు. చూస్తుంటేనే నోరూరిపోతుందంటున్నారు. అందరూ చెపుతుంటారు.. ఎవరు చెప్పింది నమ్మొడు అని.. అది కొంత వరకు నిజమైతే.. అత్తాకోడళ్ల విషయంలో మనం నిత్యం సినిమాలోనో , సీరియల్ లోను చూసేది కూడా నిజం కాదు.. ఇంకా ఎవరైనా అత్తతో గొడవలు ఉన్న కోడళ్ళు ఇప్పటికైనా మరి వారి వారి అత్తలను సొంత అమ్మలుగా చూసుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్స్ రూపంలో వస్తున్నాయి..   

కొవిడ్ టీకాతో సేఫ్ రెండు నెలలే! తాజా అధ్యయనంతో కలకలం..

ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కల్లోలం కొనసాగుతోంది. సెకండ్ వేవ్ తగ్గిందని ఊపిరి పీల్చుకునే లోపే డెల్టా వేరియంట్ వెలుగులోనికి వచ్చింది. ఇప్పుడు పలు దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇండియాలో మరణ మృదంగం మోగించిన డెల్టా వేరియంట్... ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలను వణికిస్తోంది. కొవిడ్ నియంత్రణకు వ్యాక్సినేషనే ప్రధానమని సైంటిస్టులు చెప్పడంతో.. అన్ని దేశాలు తమ ప్రజలకు టీకాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. వ్యాక్సినేషన్ ను ముమ్మరంగా నిర్వహిస్తున్నాయి. రెండు డోసుల టీకా తీసుకున్న వారికి కొవిడ్ గండం తప్పినట్లేనని చెబుతూ వస్తున్నాయి. కొన్ని దేశాల్లో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారు మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని కూడా ప్రకటించాయి.  అయితే కొవిడ్ టీకాలపై తాజాగా వచ్చిన ఓ అధ్యయనం ఆందోళన కల్గిస్తోంది. రెండు టీకాలు వేసుకున్న వారిలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు ఆరు వారాల తర్వాత క్రమంగా క్షీణిస్తున్నట్టు  బ్రిటన్‌లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తఅధ్యయనంలో తేలింది. ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాలు వేసుకున్న వారిలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలపై అధ్యయనం చేసి ఈ సంచలన విషయాన్ని వెల్లడించారు శాస్త్రవేతలు. ఆస్ట్రాజెనెకాతో పోలిస్తే ఫైజర్ టీకా తీసుకున్న వారిలో యాంటీబాడీల స్థాయి చాలా ఎక్కువగా ఉన్నట్టు వాళ్లు గుర్తించారు. అయితే, ఆ తర్వాత మాత్రం క్రమంగా అవి క్షీణిస్తున్నట్టు గుర్తించారు. కరోనా నుంచి కోలుకున్న వారితో పోలిస్తే టీకా తీసుకున్న వారిలోనే ఎక్కువ యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాలు రెండు డోసులు తీసుకున్న తర్వాత యాంటీబాడీల స్థాయి తొలుత బాగానే ఉన్నప్పటికీ రెండుమూడు నెలల తర్వాత గణనీయంగా పడిపోవడాన్ని గుర్తించినట్టు పరిశోధనలో పాల్గొన్న సైంటిస్టులు చెప్పారు, ఈ అధ్యయన ఫలితాలు ‘లాన్సెట్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. భారత్‌లో ఇస్తున్న కొవిషీల్డ్ టీకాల వల్ల 93 శాతం రక్షణ లభిస్తున్నట్టు సైనిక దళాల వైద్య కళాశాల అధ్యయనం పేర్కొంది. ఈ వ్యాక్సిన్ మరణాల రేటును 98 శాతం వరకు తగ్గిస్తున్నట్టు వెల్లడైంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో 15 లక్షల మంది వైద్యులు, ఫ్రంట్ లైన్ వర్కర్లపై నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలను కేంద్రం బుధవారం వెల్లడించింది.  తాజాగా అమెరికా కూడా తమ కొవిడ్ మార్గదర్శకాల్లో మార్పులు చేసింది. కొంతకాలం క్రితం రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్న అమెరికన్లు ఇకపై మాస్కులు ధరించాల్సిన అవసరం లేదంటూ ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఈ దేశంలో డెల్టా వేరియంట్ విలయ తాండవం చేస్తోంది. ఈ క్రమంలో పూర్తిగా వ్యాక్సినేషన్ జరిగిన తర్వాత కూడా ప్రజలు మాస్కులు ధరించడమే మంచిదని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సూచించింది. కరోనా హాట్‌స్పాట్లలో ఉండే వ్యక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా సరే మాస్కులు ధరించాలని సీడీసీ తెలిపింది.  కే-12 స్కూళ్లలో పనిచేసే టీచర్లు, విద్యార్థులు బహిరంగ ప్రదేశాల్లోనే కాకుండా స్కూళ్లలో కూడా మాస్కులు ధరించాలని సీడీసీ తెలిపింది.

నిండుకుండలా శ్రీశైలం డ్యామ్.. 14 ఏండ్ల తర్వాత జూలైలోనే గేట్లు ఓపెన్! 

ఎగువన నుంచి భారీగా వస్తున్న వరదతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారిపోయింది. జురాలతో పాటు తుంగభద్ర నుంచి డ్యాంలోకి భారీగా ఇన్ ఫ్లో కొనసాగుతోంది. దీంతో బుధవారం సాయంత్రం  డ్యాం గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమయ్యారు.  జలాశయం గేట్లను  పైకెత్తి సాగర్‌కు నీటిని విడుదల చేయనున్నారు. 2007 తర్వాత జూలై నెలలోనే శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయనుండడం ఇదే తొలిసారని చెబుతున్నారు. శ్రీశైలం జలాశాయానికి  ఇన్ ఫ్లో బుధవారం ఉదయం 4,66,864 క్యూసెక్కులుగా ఉంది.  ఔట్‎ఫ్లో: 62 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుతం : 879.30 అడుగులు కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ : 215.8070 టీఎంసీలు కాగా,..ప్రస్తుతం 184.27 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ఒక యూనిట్ ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.  శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తనుండటంతో దాన్ని చూసేందుకు పర్యాటకులు ఉత్సాహ పడుతున్నారు. దీంతో శ్రీశైలం డ్యామ్ దగ్గర పర్యాటకుల సందడి పెరిగింది. నాగార్జున సాగర్ లోనూ ప్రస్తుతం 190 టీఎంసీలకు పైగానే నీళ్లు ఉన్నాయి. ఎగువ నుంచి మరో మూడు రోజులు వరద కొనసాగే అవకాశం ఉంది. దీంతో నాలుగైదు రోజుల్లోనే నాగార్జున సాగర్ డ్యాం కూడా పూర్థిస్థాయిలో నిండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.  

కుర్రాడు  బ్రతికుండగానే చనిపోయినట్లు రికార్డ్.. నెల్లూరులో వింత సమస్య.. 

కొంత మంది సంవత్సరాలు ఇంట్లో నుండి పారిపోయి. లేదంటే తప్పిపోయి కనబడకుండా పోతుంటారు. ఆ తర్వాత వాళ్ళు బతికి ఉన్నారో చనిపోయారో తెలియదు.. కొన్ని ఏళ్ళు ఎదురు చూసి ఎదురు చూసి అతని కుటుంబ సభ్యులు చనిపోయాడు అనుకుంటారు ఆ తర్వాత అతను చనిపోయాడు అన్న  విషయం గవర్నమెంట్ రికార్డు లో నమోదు చేశారు..కొన్ని సార్లు కొంత మంది వ్యక్తులు  చనిపోయినట్లు రికార్డ్ లో నమోదు అయ్యాక కూడా ఆ వ్యక్తులు తిరిగి వచ్చిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అయితే తాజాగా కళ్ళ ముందు కనిపిస్తూ.. ప్రాణాలతో ఉన్న ఓ బాలుడు చనిపోయాడని  గవర్నమెంట్ రికార్డ్ లో నమోదు అయింది.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే తెలుసుకోండి..  అది నెల్లూరు జిల్లా. సంగం మండలం. తిరమనతిప్పలో నివసిస్తున్న నిరుపేద చేనేత కుటుంబం. ఆమె పేరు  పల్లా రత్నమ్మ, అతని పేరు పెంచలయ్య ఇద్దరు దంపతులు. వారి కుమారుడు ప్రతాప్. ఆ బాలుడి పేరు రైస్ కార్డులో నమోదు కాలేదు. దాంతో వారు సచివాలయం, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగారు. రేషన్ కార్డులో తమ కుమారుడి పేరు నమోదు చేయించేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అక్కడ వాళ్లకు అనుకోని సంఘటన ఎదురైయింది. తమ కుమారుడు  చనిపోయినట్లు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో నమోదు అయింది.. ఆ విషయం తెలిసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా షాకయ్యారు.  అక్కడికి వెళ్లిన రత్నమ్మకు 'మీ కుమారుడు చనిపోయినట్లుగా రికార్డుల్లో నమోదైందని.. మేమేం చేయలేమని' అధికారులు చెప్పుకొచ్చారు. తన కుమారుడు బతికే ఉన్నా చనిపోయినట్లు నమోదు కావడం ఏంటని, ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. స్థానిక తహసీల్దారు దగ్గర తన గోడు వెల్లబోసుకున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబానికి చెందిన రత్నమ్మ రోజులో కొంచెం సేపు మగ్గం పని ఆపుకొని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. తన సమస్యను అర్ధం చేసుకుని తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు.

రామప్పలో నమ్మలేని నిజం: 800 ఏళ్ల క్రితమే రాక్ మెల్టింగ్ టెక్నాలజీ

రామప్ప ఆలయ వైభవం, అందులోని శిల్పకళా నైపుణ్యం గురించి అందరూ ఆహా ఓహో అని చెప్పుకోవడమే కానీ.. అసలక్కడి ఆహాలకు, ఓహోలకు అసలైన ఆనవాళ్లేంటో ఎవరూ చెప్పడం లేదు. అదేంటో తెలుగువన్ డాట్ కామ్ పాఠకులకు మేం ప్రత్యేకంగా అందిస్తున్నాం. చదివి ఆనందించండి.. మన శిల్పాచార్యుల నైపుణ్యానికి గర్వించండి.  1213 లో నిర్మాణమైన రామప్ప ఆలయాన్ని ఆనాటి శిల్పాచార్యులు 40 ఏళ్ల పాటు శ్రమించి నిర్మించారు. అంటే దాదాపు ఒక తరం పూర్తిగా, రెండో తరం కొంత భాగం జీవితకాలాన్ని ధారవోశారు. అనేక అద్భుతమైన గుళ్లు, గోపురాలను ఇలాగే తీర్చిదిద్దారు. ఇక రామప్ప ఆలయం గురించి సామాన్య ప్రజలకు తెలియని విషయం మాత్రమే ఇక్కడ డిస్కస్ చేద్దాం.  రామప్పను ఇదివరకే దర్శించినవారికి అక్కడ ఆలయంలో ఓ విగ్రహాన్ని మీటితే అది సరిగమలు పలుకుతుందని తెలుసు. అయితే ఒక రాతి చెక్కడం వేర్వేరు చోట్ల వేర్వేరు విధాలైన శబ్దాలను ఏ విధంగా ఇవ్వగలుగుతుందన్నది ఇటీవలి కాలం వరకు కూడా ఎవరికీ తెలియదు. నమ్మశక్యం కాని ఆ టెక్నాలజీ పేరే రాక్ మెల్టింగ్ టెక్నాలజీ. అంటే ఇతర లోహాల్లాగే రాతిని కరిగించి తాము అనుకున్న ఆకారంలోకి ఒంపుకోవడం. రాయేంటి.. దాన్ని కరిగించడమేంటి అనిపిస్తోంది కదా... అందుకే ఇది నమ్మలేని నిజం. రామప్ప ఆలయంలో వివిధ శబ్దాలు చేసే (సరిగమలు పలికే) శిల్పాలతో పాటు కొన్ని స్తంభాలకు సైతం ఈ టెక్నాలజీ వాడారు. అన్ని విగ్రహాలకు, అన్ని శిల్పాలకు దీన్ని వాడలేదు. ఇది కృష్ణుడు వేణువు వాయిస్తున్న శిల్పంలో బయట పడింది. ఆ శిల్పంలో వేర్వేరు చోట్ల తడిమితే వేర్వేరు శబ్దాలు వస్తున్నాయి. ఇంకో చోట అసలు ఏ శబ్దమూ రావడం లేదు. మామూలు పరిస్థితులకు ఇది పూర్తిగా భిన్నమైన వ్యవహారం.  వస్తువు సాంద్రత మారడం వల్ల అది వెలువరించే శబ్దాల్లో మార్పు సాధ్యమవుతుంది. అదే సూత్రాన్ని ఆనాటి శిల్పాచార్యులు ఇక్కడ అప్లై చేశారు. అలాగే నల్లరాతి శిల్పంలో మన ప్రతిబింబం చూసుకునేంత నునుపుదనం ఊహించశక్యం కానిది. మామూలు చెక్కడాల్లో అంత నునుపుదనం రాదని అనుభవజ్ఞులు సైతం చెబుతున్నారు. ఆ నునుపుదనం, నాజూకుదనం రావడానికి, రాతిలో సాంద్రతను మార్చి శబ్దాల్లో మార్పులు రావడం కోసమే రాక్ మెల్టింగ్ టెక్నాలజీ వాడినట్లు 2016లో జరిగిన పరిశోధనల ద్వారా రుజువైంది. న్యూయార్క్ లోని బఫలో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రాతిని 2500 ఫారెన్ హీట్ డిగ్రీల దగ్గర కరిగించి మోల్డ్ చేయవచ్చని నిరూపించారు. దీంతో 800 ఏళ్ల క్రితం రామప్పలో చేసింది కూడా అదే టెక్నాలజీగా నిర్ధారణ అవుతోంది.  సన్నని, నునుపైన ఇసుకను ముందుగా ఊహించుకున్న ఆకారం మేరకు పేర్చి, కూర్చి మూసగా తయారుచేసి... అందులోకి కరిగిన రాతి ద్రవాన్ని (లావా అన్నమాట) పంపించి చల్లబరుస్తారు. దీంతో ఆ రాతి సాంద్రతలో తేడాలు వస్తాయి. ఫలితంగా ధ్వనుల్లో కూడా తేడాలు వస్తాయి. అలాగే గుడి శిఖరానికి ఉపయోగించిన రాళ్లకు నీళ్లమీద తేలియాడే గుణం కూడా ఇలాగే రాబట్టారు. రాతిని కరిగించినప్పుడు ఇతరత్రా మరికొన్ని ఖనిజాల మూలకాలు కలపడం ద్వారా ఆ రాయి సాంద్రత గణనీయంగా తగ్గిపోయింది. ఆ తగ్గిన రాళ్లనే అనుకున్న ఆకారంలో దిమ్మెల్గుగా చెక్కి గుడిని తేలికగా మార్చడం జరిగింది. పాలంపేట పరిసరాల్లో ఉన్న నల్లరాతి నేలను తట్టుకొనేందుకు ఇంతటి భారీ టెక్నాలజీని 800 ఏళ్ల క్రితమే మనవాళ్లు వాడారంటే... ఆనాటి శిల్పాచార్యులు ఎంత గొప్ప శాస్త్రవేత్తలో అర్థం చేసుకోవచ్చు. రామప్పలో సరిగమలు పలికే శిలలో జరిగింది కూడా ఇదేనని శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు.  

మాజీ మంత్రి దేవినేని ఉమపై దాడి.. రౌడీ రాజ్యమని చంద్రబాబు ఫైర్ 

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ నేతల ఆగడాలు ఆగడం లేదు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. సామాన్య జనాలనే కాదు టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో వైసీపీ కార్యకర్తలు మరింతగా రెచ్చిపోయారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమపై  దాడి చేశారు. ఆయన ప్రయాణిస్తున్న కారుపై రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు ధ్వసమయ్యాయి.  గడ్డమనుగూరు కొండపల్లి రిజర్వ్ పారెస్ట్‌లో అవకతవకలను పరిశీలించేందుకు వెళ్లారు దేవినేని ఉమ. అక్రమ మైనింగ్ను పరిశీలించి వస్తుండగా జి.కొండూరు మండలం గడ్డ మణుగ గ్రామం వద్ద ఉమా వాహనం పై రాళ్ళ దాడికి దిగారు దుండగులు.రెండు వైపుల నుంచి వైసీపీ కార్యకర్తల దాడికి దిగారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. దేవినేని ఉమను నిర్బంధంలోకి తీసుకోవడానికి ప్రయత్నించారు.టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని దేవినేనిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. పీఎస్‌కు రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ దాడి జరిగింది. అయినా ఘటన జరిగిన చాలా సేపటి వరకు పోలీసులు అక్కడికి చేరుకోలేదు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అనుచరులే దాడికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.  సీఎం జగన్‌ కనుసన్నల్లో, సజ్జల నాయకత్వంలో తనపై దాడి జరిగిందని దేవినేని ఉమ ఆరోపించారు. వందల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు తనపై రాళ్లురువ్వారని మండిపడ్డారు. కొండపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌లో లక్షల టన్నుల గ్రావెల్ దోపిడీ జరిగిందన్నారు. నిర్వాసితుల పక్షాన మాట్లాడుతున్నానని తనపై కక్షగట్టారని ఆరోపించారు. తన అంతు చూస్తామని బెదిరించారని తెలిపారు. గ్రావెల్ దోపిడీపై ప్రశ్నిస్తే చంపేస్తామంటున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే చంపేస్తారా..? అని ఉమ  ప్రశ్నించారు.  ఈ ఘటన రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దంపడుతోందన్నారు. దాడిపై డీజీపీ, విజయవాడ సీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తనకే రక్షణ లేకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు.  దేవినేనిపై జరిగిన దాడిని టీడీపీ తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.టీడీపీ నాయకుడు దేవినేని ఉమపై జరిగిన దాడిపై డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాసారు. అక్రమాలను ప్రశ్నించేందుకు వెళ్తే దాడులు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. దాడి జరిగిన తర్వాత గంట సేపు ఎవరూ రాకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో టీడీపీ నేతలు గాయపడ్డారన్నారు. పోలీసులు సకాలంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.దాడికి పాల్పడిన వారిని  వెంటనే అరెస్ట్‌ చేయాలని  చంద్రబాబు డిమాండ్ చేశారు. ఉమకు పూర్తి భద్రత కల్పించాలని డీజీపీని చంద్రబాబు కోరారు