రోడ్డు తవ్వి కంకర దొంగతనం.. అమరావతిలో ఘోరం? ఇదెవరి పన్నాగం? 

ఒక బిల్డింగ్ కడుతు కడుతూ మధ్యలో వదిలేస్తే... అలాగే ఉంచేస్తే ఏమవుతుంది? నెమ్మదిగా దానికి ఎవరూ లేకుండా పోతారు. ఎవరో ఒక వాచ్ మెన్ నామ్ కే వాస్తే ఉంటాడంతే.. ఎవడిదైనా కన్ను పడిందంటే చాలు మెల్లగా అందులో కుదిరినవన్నీ ఎత్తుకుపోతుంటాడు.. కావాలంటే వాచ్ మెన్ కి కమీషన్ ఇస్తారు. లేదంటే కొడతారు. ఇప్పుడు అమరావతి పరిస్ధితి అలాగే ఉంది. అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకోవాల్సిన ప్రాంతం నేడు శిథిలమైన భవనంలా మారింది. దీనికీ వాచ్ మెన్ ఉన్నాడు.. కాని ఆ వాచ్ మెన్ స్వయంగా దానిని నాశనం చేయాలనుకుంటున్నాడు.. దొంగలు పడి ఎత్తుకుపోతుంటే... ఆ దొంగలను చూసీ చూడనట్లు వదిలేస్తున్నాడు. దొంగలను అతడే పంపాడా..లేక అతడి మనుషులే దొంగలా అనేది అతనికే తెలియాలి. అమరావతిలో రోడ్డు తవ్వి కంకర ఎత్తుకుపోయారంటే.. ఎత్తుకుపోయినా ఎవరూపట్టించుకోలేదదంటే..ఇంతకంటే ఘోరం ఇంకేం కావాలి. అమరావతిలో ఈ విచిత్రం జరిగింది. జగన్ అధికారంలోకి వచ్చేటప్పటికే అమరావతిలో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. కాంట్రాక్టర్లంతా మెటీరియల్ ను రోడ్డు మీదే వేసుకుంటారు కాబట్టి అదే పని చేశారు. ఇసుక, కంకర, స్టీల్ అన్నీ సైట్ల పక్కనే ఉన్నాయి. సడెన్ గా జగన్ ఆ నిర్మాణాలకు పేమెంట్స్ నిలిపేశారు.. మళ్లీ చేస్తారో చేయరో చెప్పలేదు. దీంతో లేబర్ అంతా వెళ్లిపోయారు. కాంట్రాక్టర్లు కూడా వేరే పనులు చూసుకున్నారు. అమరావతిలో ఇక నిర్మాణాలు జరగవని కొందరికే తెలుసు అప్పటికి.. వారంతా రోడ్డుపైన ఉన్న ఇసుక, కంకర, స్టీల్ ఎత్తుకుపోవడం మొదలెట్టారు. కొందరు కాంట్రాక్టర్లు పోలీసులకు కంప్లయింట్ చేశారు. పోలీసులు వేగంగానే స్పందించారు.. కాని చేస్తున్నదెవరో తెలిశాక.. చేతులెత్తేశారు. ఇప్పుడు ఏకంగా వేసిన రోడ్డును తవ్వి మరీ కంకర ఎత్తుకుపోయారు. ఉద్ధండరాయునిపాలెం దగ్గర సీడ్ యాక్సెస్ రోడ్డుకు అనుసంధానంగా వేస్తున్న రోడ్డు మధ్యలోనే ఆగిపోయింది. కంకర కూడా వేసినా..ఫైనల్ లేయింగ్ పని చేయకముందే ఆ పని ఆపేయడంతో కాంట్రాక్టర్ వెళ్లిపోయాడు. వాళ్ల బిల్లు కూడా ఇప్పటివరకు క్లియర్ కాలేదు. సైట్ల పక్కన పడి ఉన్నవి ఎత్తుకుపోయిన గ్యాంగ్ కళ్లు ఇప్పుడు ఈ రోడ్ల మీద పడ్డాయి. ఒకటిన్నర అడుగు వరకు ..దాదాపు 30 మీటర్ల మేర తవ్వుకుని లోడ్ చేసుకున్నారు. ఇంతలో అమరావతి దళిత జేఏసీ నాయకులకు ఎవరో చెప్పడంతో.. వారు పరుగులు పెట్టి అక్కడికి వెళ్లేసరికి ఆ గ్యాంగ్ కంకర లోడుతో సహా పారిపోయింది.  వాళ్ళు ఎత్తుకుపోవడం విచిత్రం కాదు. అమరావతి కూడా ఏపీలో భాగమేనని.. పరిపాలనలో అది కూడా చూసుకోవాలనే ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం ఉండటమే ఆశ్చర్యం. అక్కడికి పోలీసులు కేవలం అమరావతి ఉద్యమం చేస్తున్న రైతులను ఆపటానికో, కొట్టడానికో.. అరెస్టు చేయడానికో తప్ప.. వేరే ఏ పని మీద అడుగు పెట్టరు. వైసీపీ వారు చేసే అక్రమాలపై ఫిర్యాదులు వస్తే అసలే పట్టించుకోరు. అందుకే అలా యధేచ్ఛగా రోడ్డు కూడా తవ్వుకుని తీసుకుపోయారు వారు. ఈ పాపాలన్నీ ఎప్పటికి పండుతాయో.. ఎప్పటికి వీటికి ఎండ్ కార్డు పడుతుందోనని అమరావతి రైతులు ఆవేదన చెందుతున్నారు. 

భర్తకు హ్యాండ్.. బాయ్ ఫ్రెండ్ కి గోల్డ్.. 

ఆమెకు పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్త చాలా మంచి వాడు. ఆర్థికంగా  వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. మన ఇంట్లో కోడి కూర కంటే పక్కింటి పాసిన కూరే రుచి అన్నట్లు. మొగుడు ఉండగానే ఆ మహిళ పరాయి మగాడి  మోజులో పడింది. తన భర్తకు  తెలియకుండా ఎదావిదిగా వివాహేతర సంబందానికి తెర లేపింది. అయితే భర్త ఇంట్లో ఉన్న టైంలో ప్రియుడితో రాసలీలలు నడపడం కష్టం అవుతుంది. రోజు అలాగే జరగడంతో ఇబ్బందిగా మారడంతో ప్రియుడి ఎడబాటు తట్టుకోలేకపోయింది ఆ కామ ప్రియురాలు.ఇలా ఐతే కాదని చివరికి ప్రియుడితో ఎక్కడికైనా ఎగిరిపోవాలనుకుంది. ఆమె అనుకున్నట్లు గానే ఆ విషయం ప్రియుడితో పంచుకుంది. ఆ మాటకు ఆమె ప్రియుడు తనకు ఆర్థిక సమస్యలు ఉన్నాయని చెప్పాడు. ఇక అంతే ప్రియుడితో కలిసి సొంతింటికే కన్నంవేయాలని చూసింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకున్నారా..? ఆ ప్రియురాలు తన ప్రియుడితో ఎగిరిపోయిందా..? లేదా వాళ్ళ పధకం ఏమైంది అని తెలుసుకోవాలంటే ఈ వార్త పూర్తిగా చదవండి..  వివరాల్లోకి వెళ్తే.. అది అనంతపురం జిల్లా. తాడిపత్రిపట్టణంలోని నంద్యాల రోడ్డు. ఆ రోడ్డు సమీపంలో ఉన్న హజీవలీ, షాజహాన్ సోదరులు నివాసం ఉంటున్నారు. అయితే ఈ ఏడాది మే 22న వారి ఇళ్లల్లో రూ. 7.50 లక్షలు విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకా తాడిపత్రి రూరల్ పోలీసులు రంగంలోకి దిగి కేసు చేసి. దర్యాప్తు చేపట్టారు. షాజహాన్‌కు షాహీనాతో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. అక్కడితో సంతోషపడక సాహీనా మరో వ్యక్తితో ప్రేమలో పడింది. అదే గ్రామానికి చెందిన బాలబ్రహ్మయ్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్తకు తెలియకుండా షాహీనా బాలబ్రహ్మయ్యతో తరచూ కలిసేది. వాళ్ళ ప్రేమ అనే చీకటి మాటున హద్దులు కూడా దాటేవాళ్ళు  అయితే భర్త ఇంటి దగ్గర ఉన్న సమయంలో కలుసుకోవడానికి ఇబ్బందిగా ఉండటంతో ఇద్దరూ ఎటైనా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. భవిష్యత్‌లో జీవించేందుకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు షాహీనా మాస్టర్ ప్లాన్ వేసింది. మే 22న తన ఇంట్లోని బంగారు, వెండి ఆభరణాలతో పాటు పొరుగున ఉన్న బావ ఇంట్లోని బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేసి బ్రహ్మయ్యకు అందచేసింది. అనంతరం ఏమీ తెలియనట్లు మహా నటి పాత్ర పోషించింది..  అనంతరం మే 28న కుమార్తెతో కలిసి తన ప్రియుడితో అనుకున్నట్లుగానే షాహీనా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. దీంతో తన భార్య కనిపించడం లేదంటూ..షాజహాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే చోరీ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు షాహీనాపై అనుమానం వచ్చింది. వారి మెుబైల్ ఫోన్‌ను ట్రాప్ చేశారు. ప్రకాశం జిల్లా మార్టూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 23న మార్టూరుకు చేరుకుని షాహీనాతో పాటు ఆమె ప్రియుడు బాలబ్రహ్మయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని తాడిపత్రికి తీసుకొచ్చారు. తామే చోరీ చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు. వీరి దగ్గర నుంచి 16 తులాల బంగారు నగలతో పాటు 600 గ్రాముల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకుని కుటుంబసభ్యులకు అప్పగించారు. వీటి విలువ రూ.7.50 లక్షలుగా ఉంటుందని అంచనా. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు మిస్టరీని ఛేదించిన సీఐ, ఎస్ఐతో పాటు కానిస్టేబుళ్లను ఎస్పీ ఫక్కీరప్ప అభినందించారు.

హైదరాబాద్ లో భూ ప్రకంపనలు.. 

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో భూ ప్రకంపనలు వచ్చాయి.  సోమవారం తెల్లవారుజామున నగరంలోని దక్షిణ ప్రాంతానికి చెందిన పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించింది. భూకంప కేంద్రం యొక్క అక్షాంశం మరియు రేఖాంశ వివరాలను ఎన్‌సిఎస్ తెలిపింది. భూకంప తీవ్రంగా నాలుగుగా నమోదు కావడంతో పెద్ద ప్రమాదం ఏమి జరగలేదు. హైదరాబాద్ లో గత కొన్నేండ్లుగా తరుచూ భూ ప్రపంకనలు వస్తున్నాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్, బోరబండ ప్రాంతాల్లో ప్రతి ఏటా భూమి కంపిస్తోంది. వర్షాకాలం సీజన్ లో ఇలా ఎక్కువగా జరుగుతోంది. భూ ప్రకంపనలు తరుచూ వస్తుండటంతో ఇక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్ కు భూకంపాలు వచ్చే ప్రమాదం లేదని సైంటిస్టులు చెబుతుండగా.. వరుసగా నమోదవుతున్న ప్రకంపనలు ఆందోళన కల్గిస్తున్నాయి. 

ద‌మ్ముంటే ఎన్నికలకు వెళ్దామా? సీఎంకు పీసీసీ చీఫ్‌ ఛాలెంజ్..

ప్ర‌తిప‌క్షం ఎంత బ‌లంగా ఉంటే.. పాల‌కుల‌కు అంత‌గా టెన్ష‌న్‌. ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కుడు ఎంత దూకుడుగా ఉంటే ముఖ్య‌మంత్రికి అంత‌గా ముచ్చెమ‌ట‌లు త‌ప్ప‌వు. అధికారంలో ఉన్నామ‌నే ఆనందంకంటే.. ఎందుకు సీఎం సీట్లో ఉన్నామా అనే ఆందోళ‌నే ఎక్కువ‌గా ఉంటుంది. దిన‌దిన‌గండం.. ఐదేళ్ల పాల‌న‌గా సాగుతుంటుంది. తెలంగాణ‌లో పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ఎంట్రీతో అలాంటి ప‌రిస్థితే ఉందంటున్నారు. తెలంగాణ మాదిరే.. క‌ర్ణాట‌క‌లోనూ ప్ర‌తిప‌క్షానికి బ‌ల‌మైన నాయ‌కుడు ఉన్నారు. క‌ర్ణాట‌క పీసీసీ అధ్య‌క్షుడు డీకే శివ‌కుమార్ మ‌హా ప‌వ‌ర్‌ఫుల్‌. అందుకే, అధికార బీజేపీకి చుక్క‌లు చూపిస్తున్నారు. తాజాగా, క‌ర్ణాట‌కలో ముఖ్య‌మంత్రి మార్పు వార్త‌ల నేప‌థ్యంలో ఎన్నిక‌ల‌కు వెళ్దామా అంటూ డీకే స‌వాల్ విస‌ర‌డం సంచ‌ల‌నంగా మారింది.  కర్ణాటక ప్రభుత్వంలో మార్పులు జరగబోతున్నాయంటూ వస్తున్న వార్తలతో ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. మార్పులు పార్టీ వ్యక్తులు కాకుండా ప్రజలు చేయాలని, దమ్ముంటే ఎన్నికలకు వెళ్దామని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివకుమార్ సవాల్ విసిరారు. భారతీయ జనతా పార్టీకి పాలన చేసే సామర్థ్యం కానీ, నిజాయితీ కానీ లేదని మండిప‌డ్డారు. ప్రజల అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. ‘‘ప్రజలను ఎలా కాపాడాలో భారతీయ జనతా పార్టీకి తెలియదు. వారికి పాలించే సామర్థ్యం కానీ, నిజాయితీ కానీ లేదు. ఓ వైపు ప్రజలు చనిపోతుంటే వీళ్లకు రాజకీయాలు మాత్రమే కావాలి. యడియూరప్ప ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రజల ముందుకు వెళ్దాం. ప్రజలనే తీర్పు ఇస్తారు. ఎన్నికలకు వెళ్లడానికి బీజేపీ సిద్ధమేనా?’’ అని డీకే సవాల్ విసిరారు. రాష్ట్రంలో వరదలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీని డీకే ప్రశ్నించారు. కర్ణాటకకు ప్రధాని ఎందుకు రాలేదని నిలదీశారు. రాష్ట్రం నుంచి 25 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా కూడా ఎలాంటి ప్రయోజనం లేదని, రాష్ట్ర పరిస్థితిని బాగు పర్చడానికి ఒక్క ఎంపీకి సామర్థ్యం లేదని డీకే విమర్శించారు. డీకే పీసీసీ చీఫ్ అయ్యాక‌ క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో ప‌ని చేస్తోంది. ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా.. కాంగ్రెస్‌దే గెలుప‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే, ఎల‌క్ష‌న్స్‌కి వెళ్దామా అంటూ డీకే స‌వాల్ విసిరారు. సేమ్ టూ సేమ్ తెలంగాణ‌లోనూ అలాంటి ప‌రిస్థితే ఉందంటున్నారు. డీకే లానే రేవంత్‌రెడ్డి సైతం డైన‌మిక్ లీడ‌ర్‌. రేవంత్‌కు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించాక కాంగ్రెస్‌లో జోష్ పెరిగింది. రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వంలో క‌ద‌నోత్సాహంతో ఎన్నిక‌ల‌కు సిద్ద‌మ‌వుతోంది కాంగ్రెస్ పార్టీ.  

ధూంధాంగా కేటీఆర్ బ‌ర్త్‌డే అందుకేనా? ఆ రెండే కార‌ణ‌మా? రేవంత్‌రెడ్డి ఎఫెక్ట్ ఉందా?

కేటీఆర్ 46వ పుట్టిన‌రోజు వేడుక‌లు హోరెత్తాయి. ఊరూ-వాడ ధూంధాంగా బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ జ‌రిగాయి. రాష్ట్రానికి ఏదో పండ‌గొచ్చిన మాదిరిగా తెలంగాణ వ్యాప్తంగా హంగామా న‌డిచింది. దివ్యాంగుల‌కు త‌న వంతుగా 100 మూడు చ‌క్రాల స్కూట‌ర్లు ప్ర‌క‌టించారు కేటీఆర్‌. ఆయ‌న్ను ఇంప్రెస్ చేయ‌డానికే అన్న‌ట్టు.. ప‌లువురు టీఆర్ఎస్ నాయ‌కులు మేముసైత‌మంటూ త్రిచ‌క్ర వాహ‌నాలు విత‌ర‌ణ చేశారు. ఇక గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి కేటీఆర్‌పై ప్ర‌త్యేక సాంగ్స్‌తో ఊద‌ర‌గొట్టారు ఆయ‌న అనుచ‌రులు. కేక్ క‌టింగ్స్‌, సోష‌ల్ మీడియా విషెష్‌కైతే లెక్కేలేదు. ఇక ముక్కోటి వృక్షార్చ‌న వీట‌న్నిటికంటే హైలైట్‌. గ్రామ గ్రామాన మొక్క‌లు నాటి.. కేటీఆర్ బ‌ర్త్‌డే అనే సంగ‌తి అంద‌రికీ తెలిసేలా, గుర్తుండిపోయేలా రికార్డు సృష్టించారు. ఇలా, జులై 24ను తెలంగాణ‌లో ఉత్స‌వంగా నిర్వ‌హించారు టీఆర్ఎస్ శ్రేణులు.  ఇదంతా కేటీఆర్ డైరెక్ష‌న్‌లోనే జ‌రిగింద‌ని అంటున్నారు. ఆయ‌న ఇషారా ఇచ్చాకే గులాబీ ద‌ళం ఇంత‌లా హంగామా చేసిందంటున్నారు. వాన‌లు, క‌రోనా క‌ష్టాలు ఇవేమీ ప‌ట్ట‌కుండా పుట్టిన‌రోజును పండగ‌లా జ‌ర‌ప‌డం వెనుక రాజ‌కీయ వ్యూహం ఉంద‌ని చెబుతున్నారు. కేటీఆర్‌ను బ‌ల‌మైన లీడ‌ర్‌గా ఊద‌ర‌గొట్ట‌డానికి, ఆయ‌న‌కు తెలంగాణ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉంద‌ని అనిపించ‌డానికి, కేటీఆర్ ఫాలోయింగ్ ఎంతో చూపించ‌డానికే.. ఇలా బ‌ర్త్‌డే వేడుక‌ల‌తో బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగార‌ని అంటున్నారు. అందుకు ప్ర‌ధానంగా రెండు కార‌ణాలు చెబుతున్నారు. ఆ రెండు రీజ‌న్సూ ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తున్నాయి.  కేటీఆర్ క్లాస్ లీడ‌ర్‌. ఎంత మాస్‌గా మాట్లాడినా కేసీఆర్‌లా మాస్ గుర్తింపు రాలేదు. క్లాస్ అనేది కొన్ని వ‌ర్గాల‌కే న‌చ్చుతుంది. అదే మాస్ ముద్ర ఉంటే అంద‌రివాడు అవుతాడు. తెలంగాణ‌లో అలాంటి మాస్ ఇమేజ్ ఉన్న లీడ‌ర్లు ఇద్ద‌రే ఇద్ద‌రు. ఒక‌రు కేసీఆర్‌. ఇంకొక‌రు రేవంత్‌రెడ్డి. పీసీసీ చీఫ్ అయ్యాక రేవంత్.. తెలంగాణ బాహుబ‌లి అయ్యారు. కొన్ని వారాలుగా రాష్ట్రంలో రేవంత్ పేరే మారుమోగుతోంది. రేవంత్ హంగామాకు బ్రేకులేసి.. ఒక్క‌సారిగా ఆ స్థానంలోకి కేటీఆర్ రావాలంటే.. ఎదైనా బిగ్ యాక్టివిటీ తీసుకురావాల‌ని భావించార‌ట‌. టాపిక్ రేవంత్‌రెడ్డి నుంచి మ‌రో అంశం వైపు డైవ‌ర్ట్ అవ్వాల‌ని స్కెచ్ వేశార‌ట‌. అందుకే, ద‌ళిత బంధును ప్ర‌క‌టించి ప్ర‌జ‌ల్లో చ‌ర్చ రేపారు. అదే స‌మ‌యంలో కేటీఆర్ బ‌ర్త్‌డే వేడుక‌ల‌తో ధూంధాంగా నిర్వ‌హించి యావ‌త్‌ తెలంగాణలో కేటీఆర్ పేరు మారుమోగేలా ప్లాన్ చేశార‌ని అంటున్నారు. రోజంతా, రాష్ట్ర‌మంతా కేటీఆర్ పేరే వినిపించ‌డం.. కేటీఆర్ ఫోటోలే క‌నిపించ‌డం.. కేటీఆర్ గురించే మాట్లాడుకోవ‌డం.. కేటీఆర్ పాట‌లే వినిపించ‌డం.. ఇలా పుట్టిన‌రోజు వేడుక‌లతో తెలంగాణ‌ను కేటీఆర్ మ‌యం చేసేశార‌ని చెబుతున్నారు. పాట‌ల్లో కూడా మాస్ ట‌చ్ ఉండేలా చూసి.. కేటీఆర్‌ను మాస్ లీడ‌ర్‌గా ప్ర‌మోట్ చేసే ప్ర‌య‌త్నం చేశార‌ని.. న‌గ‌రాల‌తో పాటు గ్రామాల్లోనూ కేటీఆర్ హ‌వా క‌నిపించేలా.. గ్రామ‌గ్రామాల్లో ఆయ‌న బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ జ‌ర‌గాల‌ని ప్ర‌గ‌తిభ‌వ‌న్ నుంచి ఆదేశాలు వ‌చ్చాయ‌ని అంటున్నారు. ఘ‌నంగా కేటీఆర్ పుట్టిన‌రోజు వేడుక‌లు జ‌ర‌ప‌డం వెనుక పెద్ద వ్యూహ‌మే దాగుంద‌ని అంటున్నారు. ఇక మ‌రో కార‌ణం ఏంటంటే..... ముఖ్య‌మంత్రి కావ‌డం కేటీఆర్ చిర‌కాల వాంచ‌. గ‌తంలోనే అనేక‌మంది మంత్రులు ఆ విష‌యాన్ని బ‌హిరంగంగానే ప్ర‌స్తావించి కేటీఆర్ కాబోయే సీఎం అంటూ స్వామి భ‌క్తి చాటుకున్నారు. ఆ దిశ‌గా ఇప్ప‌టికే ప‌లుమార్లు ప్ర‌య‌త్నించినా.. చివ‌రి క్ష‌ణంలో ఏదో కార‌ణాల‌తో అది వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. కేసీఆర్ గ్రాఫ్ దారుణంగా ప‌డిపోతుండ‌టం.. పార్టీలో కుట్ర‌దారులు పెరిగిపోతుండ‌టంతో.. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా కేటీఆర్‌ను సీఎం కుర్చీపై కూర్చోబెట్టాల‌ని కేసీఆర్ సైతం భావిస్తున్నార‌ట‌. అయితే, ఎప్ప‌టిక‌ప్పుడు ఉప ఎన్నిక‌లు రావ‌డం.. ఈట‌ల రాజేందర్ ఎపిసోడ్‌తో అది మ‌రింత ఆల‌స్యం అవుతోంది. ఈసారి హుజురాబాద్ ఎన్నిక‌లు ముగియ‌గానే.. కేటీఆర్‌కు ముఖ్య‌మంత్రి కిరీటం ప‌క్కా అంటున్నారు. పార్టీ అంతా కేటీఆర్ వెంటే ఉంద‌నే మెసేజ్ ఇవ్వ‌డానికి.. పార్టీలో, ప్ర‌భుత్వంలో కేటీఆరే సూప‌ర్ లీడ‌ర్ అని అనిపించ‌డానికి.. ఇలా అట్ట‌హాసంగా కేటీఆర్ పుట్టిన‌రోజు వేడుక‌లు జ‌రిపార‌ని చెబుతున్నారు. రేవంత్‌రెడ్డి, ఈట‌ల రాజేంద‌ర్‌, బండి సంజ‌య్‌ల రాజ‌కీయ దూకుడుతో డ‌ల్‌గా మారిన‌ గులాబీ కేడ‌ర్‌లో ఉత్సాహం నింపడానికే.. కేటీఆర్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ ధూంధాంగా నిర్వ‌హించార‌ని అంటున్నారు. మ‌రి, ఈ జోష్ ఎన్నిరోజులు ఉంటుందో....

ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప ఆలయం

తెలంగాణలోని రామప్ప గుడికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది.  అద్భుత శిల్ప కళా నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తున్న చరిత్రాత్మక రామప్ప రుద్రేశ్వర ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించినట్టు యునెస్కో ప్రకటించింది. చైనాలో జరిగిన ఓ వర్చువల్ సమావేశంలో ప్రపంచ వారసత్వ కట్టడాల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కాకతీయ రాజుల కాలం నాటి శిల్పకళా వైభవం ఖండాంతరాలు దాటింది. తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన తొలి కట్టడం రామప్ప గుడి రికార్డులకెక్కింది. 2020 సంవత్సరానికి గాను భారత్ నుంచి ఇదొక్క ఆలయమే నామినేట్ అయింది. 2019లో యునెస్కో ప్రతినిధులు రామప్ప గుడిని సందర్శించారు. ప్రపంచవ్యాప్తంగా 42 కట్టడాలను ఈసారి గుర్తింపు ఇవ్వగా మన దేశం నుంచి రామప్ప ఆలయానికి మాత్రమే అవకాశం దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప రికార్డు సృష్టించింది. రామప్ప గుడి ములుగు జిల్లా పాలంపేటలో 800 ఏళ్ల కిందట కాకతీయుల హయాంలో నిర్మితమైంది. అపురూప శిల్పాలకు చిరునామాగా విలసిల్లే రామప్ప గుడి ఉమ్మడి వరంగల్‌ జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో (ప్రస్తుత ములుగు జిల్లా) పాలంపేట గ్రామంలో రామప్ప ఆలయం ఉంది. ఈ అపురూప శిల్పాలయాన్ని క్రీ.శ. 1213లో కాకతీయ ప్రభువు గణపతిదేవుని సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు కట్టించాడు.  ఈ గుడి శిల్పి పేరుతో ప్రాచుర్యంలోకి రావడం విశేషం అని చెప్పాలి. ఇది ప్రధానంగా శివాలయం. ఇందులో రామలింగేశ్వరుడు కొలువై ఉన్నాడు. దీన్ని కాకతీయ రుద్రేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ఆ కాలంలో ఇంతటి అద్భుత శిల్పకళా నైపుణ్యంతో మరే ఆలయం లేకపోవడంతో, అందులోని దేవుడి పేరుమీద కాకుండా, ఆలయాన్ని తీర్చిదిద్దిన శిల్పి రామప్ప పేరిట పిలవడం ప్రారంభించారు.యునెస్కో గుర్తింపుతో ములుగు జిల్లాలో ఉన్న పాలంపేటలో 800 ఏళ్ల కాలం నాటికి చెందిన ఆలయం కాకతీయ శిల్పకళా వైభవం ఖండాంతరాలు దాటింది. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరూ రామప్ప ఆలయాన్ని సందర్శించి, గొప్పదనం గురించి ప్రత్యక్ష అనుభవాన్ని పొందాలని కోరారు. కాకతీయ వారసత్వానికి ప్రతీక రామప్ప ఆలయం అని కొనియాడారు. కాకతీయుల శిల్పకళా వైభవం రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించడంపై సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. రామయ్య ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించడం సంతోషకరమంటూ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్వీట్ చేశారు.  తెలంగాణ నుంచి యునెస్కో గుర్తింపు పొందిన తొలి ప్రదేశం రామప్ప ఆలయం అని తెలిపారు. ఈ సందర్భంగా యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నించిన అందరికీ కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. తర్వాత హైదరాబాద్‌కు ప్రపంచ వారసత్వ నగర గుర్తింపు.. మన తదుపరి లక్ష్యమని కేటీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు.

తెలంగాణలో జోరుగా కొత్త పార్టీల రిజిస్ట్రేషన్.. 

అధికారంలోకి వచ్చేదెవరో, పొత్తులెలా ఉంటాయో అప్పుడే చెప్పలేకున్నా.. తెలంగాణలో మాత్రం కొత్త పార్టీల రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉండగానే కొత్త భావాలతో, కొత్త ఎజెండాలతో పార్టీలు రిజిస్టర్ అవుతున్నాయి. మామూలుగా అయితే ఎన్నికలకు 3, 4 నెలల ముందు పార్టీల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఇది సాధారణం. కానీ ఈసారి వచ్చే ఎన్నికల కోసం చాలా మంది అప్పుడే గ్రౌండ్ వర్క్ చేయడం మొదలుపెట్టడం విశేషం. జూన్, జులై మాసాల్లోనే నాలుగు పార్టీలు రిజిస్టరయ్యాయి.  వైఎస్ షర్మిల నేతృత్వంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్ టీపీ) జులై 8న పురుడు పోసుకుంది. అది కాకుండా జున్, జులై మాసాల్లోనే మరో నాలుగు పార్టీలు రిజిస్టర్ కావడం ఆసక్తి రేపుతోంది. అవి.. 1) ప్రజా ఏక్తా పార్టీ (పీఈపీ), 2) జన చైతన్య పార్టీ (జేసీపీ), 3) తెలంగాణ జన జాగృతి పార్టీ (టీజేజేపీ), 4) భారత్ లేబర్ ప్రజా పార్టీ (బీఎల్పీపీ). అదే కోవలో ఇటీవలే గురుకులాల కార్యదర్శిగా ఉన్న మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం కొత్త పార్టీకి పథకరచన చేస్తుండడం విశేషం.  ఇక తెలంగాణలో కామన్ సింబల్ పొందని రిజిస్టర్డ్ పార్టీలు 51 ఉన్నాయి. కామన్ సింబల్ పొందాలంటే మొత్తం సీట్ల నుంచి కనీసం 10 శాతం సీట్లకు పోటీ చేయాలి. అలాగే ఓట్ల శాతం కూడా కనీస నిబంధనల మేరకు నమోదు కావాలి. అలా జరక్కపోతే అలాంటి పార్టీలకు కామన్ సింబల్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ రద్దు చేస్తుంది. ఈ మేరకు ఆ 51 పార్టీలకు కామన్ సింబల్ ను రద్దు చేయడం జరిగింది. అలా కామన్ సింబల్ రద్దయినవాటిలో జనసేన పార్టీ (గ్లాసు గుర్తు), హిందుస్తాన్ జనతా పార్టీ (కొబ్బరికాయ గుర్తు), మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ యునైటెడ్ (గ్యాస్ సిలిండర్ గుర్తు), ఇండియన్ ప్రజాపార్టీ (విజిల్ గుర్తు) ఉన్నాయి. ఇక విచిత్రంగా పాపులర్ పార్టీల పేర్లతో సారూప్యత కలిగిన పార్టీలు కూడా ఆ 51 పార్టీల జాబితాలో ఉన్నాయి. అలాంటివాటిలో తెలుగు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ జనం పార్టీ, తెలంగాణ లోక్ సత్తా పార్టీ, తెలంగాణ జనజాగృతి సమితి, తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ.. ఇలా ఉన్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల నుంచి ఇప్పటివరకు అభ్యంతరాలు రాకపోవడంతో ఈ పార్టీల రిజిస్ట్రేషన్ కు ఎలాంటి ఇబ్బందీ తలెత్తలేదు.  వాస్తవానికి దుబ్బాక ఎన్నికల సమయానికే తెలంగాణలో వచ్చే ఎన్నికల కోసం ప్రణాళికలు, పథకరచనలు వేసుకోవడం మొదలైంది. అధికార టీఆర్ఎస్ ను ఎలాగైనా గద్దె దింపేందుకు, టీఆర్ఎస్-ఎంఐఎం స్నేహ బంధం మధ్య చిచ్చు పెట్టేందుకు అన్ని ప్రధాన పార్టీలూ కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో మేము సైతం అంటూ ప్రధాన పార్టీలతో సంబంధం లేకుండా పోటీ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు షర్మిల వంటి రాజకీయ వారసత్వం కలిగిన ప్రముఖులే కాక చిన్నాచితకా వ్యక్తులు, సంస్థలు, ఆశావహులు సైతం తమక్కూడా రాజ్యాధికారం కావాలని, అది లేకుండా సామాజిక న్యాయం సాధించలేమన్న ఉద్దేశంతో పార్టీలు రిజిస్టర్ చేసుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే వచ్చే ఎన్నికలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించడం కష్టమంటున్నారు రాజకీయ నిపుణులు. 

గోదావరికి 10 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో.. కోనసీమలో వరద బీభత్సం 

ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి ప్రవాహం ప్రమాద స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం 10.4 అడుగులకు నీటిమట్టం చేరుకుంది.  ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9,41,146 క్యూసెక్కులుగా ఉంది. అత్యవసర సహాయక చర్యల కోసం రెండు NDRF, మూడు SDRF బృందాలను సిద్ధంగా ఉంచారు. తూర్పుగోదావరి జిల్లా కూనవరం, చింతూరు, విఆర్ పురం. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, కెఆర్ పురంలో బృందాలు రెడీగా ఉన్నాయి. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు. కోనసీమలో గోదావరి ఉప నదులు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పిల్ల కాలువలు, ఉపనదులకు వరద పోటెత్తుతుండటం.. ఆ ప్రవాహం గోదావరిలో కలుస్తుండటంతో నది ప్రవాహం ఉధృతంగా మారింది. వైనతేయ, వశిష్ట, గౌతమి, వృద్ధ గౌతమి నదులకు వరద ప్రవాహం పోటెత్తుతోంది. పి.గన్నవరం మండలం ఊడిముడి లంక నదీపాయకు అడ్డుకట్ట తెగిపోవడంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోనసీమలోని అధికారులకు సెలవులు రద్దు చేసింది ప్రభుత్వం. లంక గ్రామాల ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నది ఉధృతి కారణంగా కొబ్బరి చెట్లు నేలకొరుగుతున్నాయి. మామిడికుదురు మండలం అప్పనపల్లి నదీ తీర ప్రాంతంలో గోదావరి వరద ఉధృతి కారణంగా పచ్చని కొబ్బరి చెట్లు కూలిపోతున్నాయి. నదీ కోత కారణంగా 9 కొబ్బరి చెట్లు వరద నీటిలో పడిపోయాయి. మరోవైపు భద్రాచలంలో గోదావరి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. శనివారం నీటిమట్టం భారీగా పెరగడంతో రామాలయం ఎదురుగా ఉన్న స్లూయిజ్ లీక్ కావడంతో అన్నదాన సత్రం వద్దకు గోదావరి వరద నీరు చేరింది.  రాములవారి పడమటి గుడిమెట్ల ముందు ఉన్న ఇళ్లు, బొమ్మ కొట్టలోకి గోదావరి వరద నీరు చేరింది. స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సత్రంలోకి, ఇళ్ల వద్దకు వచ్చిన గోదావరి వరద నీటిని మోటార్ల ద్వారా గోదావరి నదిలోకి పంపింగ్ చేస్తున్నారు అధికారులు.ఎగువ నుంచి వరద తగ్గడంతో భద్రాచలంలో నీటిమట్టం తగ్గుతుండటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 

సంజయ్ పాదయాత్రకు కాంగ్రెస్  కౌంటర్! రేవంత్ రెడ్డి దళిత దండోరా..

తెలంగాణ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. అన్ని పార్టీలో పోటాపోటీగా జనంలోకి వెళుతున్నాయి. త్వరలో ఉప ఎన్నిక జరగనున్న హుజురాబాద్ కేంద్రంగానే ఎత్తులు వేస్తున్నాయి. ఆగస్టు 9 నుంచి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర చేయబోతున్నారు. చార్మీనార్ భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి యాత్ర ప్రారంభించనున్న సంజయ్.. హుజురాబాద్ భారీ బహిరంగ సభతో ముగించనున్నారు. వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా త్వరలోనే పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.  పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకంతో జోష్ మీదున్న కాంగ్రెస్ కూడా వరుసగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా మరో కార్యక్రమాన్ని ప్రకటించారు రేవంత్ రెడ్డి. అయితే బండి సంజయ్ పాదయాత్ర మొదలు పెట్టనున్న రోజే కాంగ్రెస్ ప్రొగ్రామ్ ఉండేలా రూట్ మ్యాప్ ప్రకటించారు. దళిత బంధు పథకం పేరిట సీఎం కేసీఆర్‌ చేస్తున్న మోసాలను ఎండగట్టేందుకు కార్యాచరణను టీపీసీసీ ప్రకటించింది. క్విట్‌ ఇండియా ఉద్యమం జరిగిన ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 17 వరకు ‘దళిత దండోరా’ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. ఆగస్ట్ 9 నుంచి సెప్టెంబర్ 17వరకు దళిత గిరిజన దండోరా నిర్వహిస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు.  ఆగస్టు 9న ఇంద్రవెళ్లి గడ్డమీద లక్ష మందితో దండు కట్టి దండోరా నిర్వహిస్తామని తెలిపారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా  సీఎం కేసీఆర్‌ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  ఉప ఎన్నికలొస్తేనే కేసీఆర్‌కు పథకాలు గుర్తుకొస్తాయని విమర్శించారు. ఎక్కడ ఉప ఎన్నికలుంటే అక్కడే పథకాలు తెస్తారా?.. 118 నియోజక వర్గాల్లో ఉన్న దళితుల పరిస్థితి ఏంటి? అని రేవంత్ ప్రశ్నించారు. ఓట్ల కోసం దళితులను మోసం చేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. 

'అప్పుల‌ప్ర‌దేశ్‌'పై కేంద్రం క‌న్నెర్ర‌! జీవీఎల్ ఎంట్రీతో జ‌గ‌న్‌కు చెక్ త‌ప్ప‌దా?

జీవీఎల్ న‌ర‌సింహారావు. ఊరికే రారు మ‌హానుభావుడు. ఆయ‌న వ‌చ్చారంటే.. ఎవ‌రికో ఎస‌రు పెడుతున్న‌ట్టే. రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఢిల్లీలో తిష్ట‌వేసి.. ఇటు బీజేపీ త‌ర‌ఫున‌, అటు అన‌ధికారికంగా కేంద్ర ప‌క్షాన‌.. ఏపీ వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెడుతుంటారు జీవీఎల్‌. చ‌క్క బెట్ట‌డం కంటే కూడా.. చిక్కు పెట్ట‌డంపైనే ఆయ‌న ఎక్కువ‌గా దృష్టి సారిస్తుంటార‌నే పేరు. కొంత‌కాలంగా ఏపీ విష‌యంలో సైలెంట్‌గా ఉంటూ వ‌స్తున్న జీవీఎల్‌.. మ‌ళ్లీ ఇప్పుడు స్వ‌రం పెంచారు. ఏపీ వ్య‌వ‌హారాల్లో దూకుడు పెంచారు. ఆయ‌న ఎక్కువ ఫైనాన్సియ‌ల్ మేట‌ర్స్‌లోనే.. వేలు పెట్టి కెలుకుతుంటారు. పీడీ బిల్లులేవంటూ ఇటీవ‌ల‌ ఏపీ స‌ర్కారును నిల‌దీశారు. తాజాగా, ఏపీ ప్ర‌భుత్వాన్ని కేంద్రం ముందు దోషిగా నిల‌బెట్టేలా.. అప్పులపై నిప్పులు చెరిగారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అప్పుల‌ప్ర‌దేశ్‌గా మార్చేస్తున్న‌ సీఎం జ‌గ‌న్ అడ్డ‌గోలు విధానాల‌పై స్వ‌యంగా కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.  ఏపీ.. అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మారిందనే విషయం దేశం మొత్తం తెలిసిందంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మండిప‌డ్డారు. కొత్త అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్ర‌తీరోజూ ప్రయత్నాలు చేసే పరిస్థితి వ‌చ్చింద‌న్నారు. ఏపీకి చెందిన పలు అంశాలపై కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. అప్పులకోసమే ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీ ఎస్‌డీసీ) ఏర్పాటు చేసినట్టుందని.. అది రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించేలా ఉందంటూ త‌ప్పుబ‌ట్టారు. ఈ విష‌యాల‌న్నిటిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాన‌న్నారు జీవీఎల్‌. ఎస్‌డీసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సవరణలు చేయాలని ఆయ‌న‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అప్పుల మంత్రిగా కనిపిస్తున్నారంటూ సెటైర్లు వేశారు. ప్ర‌తీరోజూ కొత్త అప్పుల కోసం పడరాని పాట్లు పడుతున్నారని.. ఏపీ అప్పులపై కాగ్‌, ఆర్బీఐతో ఆడిట్‌ చేయాలని కేంద్రాన్ని కోరతానని జీవీఎల్ అన్నారు.  జీవీఎల్ అభిప్రాయ‌మే బీజేపీ అభిప్రాయం. కేంద్రం ఏపీని టార్గెట్ చేయాల‌ని అనుకుంటే.. ముందు జీవీఎల్‌ను రంగంలోకి దింపుతుంది. ఆయ‌న‌తో ప్ర‌భుత్వ ప‌రువంతా తీయిస్తుంది. ఆ త‌ర్వాత యాక్ష‌న్‌లోకి దిగుతుంది. జీవీఎల్ మాట‌ల‌ను బ‌ట్టి చూస్తుంటే.. కేంద్రం జ‌గ‌న్ స‌ర్కారుకు స‌హాయ నిరాక‌ర‌ణ చేయ‌బోతోంద‌ని అర్థ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. సంక్షేమ ప‌థ‌కాల పేరుతో అభివృద్ధిని అట‌కెక్కించేసి.. ఏపీని అప్పుల కుప్ప‌గా మార్చేసిన సీఎం జ‌గ‌న్ తీరుపై కేంద్రం గుర్రుగా ఉంద‌ని అంటున్నారు. అందుకే, జ‌గ‌న్ ముంద‌రి కాళ్ల‌కు బంధాలేసేందుకే జీవీఎల్‌తో కేంద్రానికి ఫిర్యాదు చేయించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఆ త‌ర్వాత ఇక అస‌లైన యాక్ష‌న్ మొద‌ల‌వుతుంద‌ని చెబుతున్నారు. అయితే, ఈ చ‌ర్య‌లు కేవలం ఆర్థిక‌ విధానాల వ‌ర‌కే ప‌రిమిత‌మ‌వుతుందా? లేక‌, సీబీఐ విచార‌ణ‌,  జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దునూ ప్ర‌భావితం చేస్తుందా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.   

కేసీఆర్‌ సోష‌ల్‌మీడియా స్టంట్స్‌!.. అందుకేనా ఆ ఫోన్ కాల్స్‌?

ట్రింగ్ ట్రింగ్‌.. ట్రింగ్ ట్రింగ్‌.. ఫోన్ రింగ్ అవుతుంది. కాల్ లిఫ్ట్ చేసి హ‌లో అంటే.. అట్నుంచి కేసీఆర్ గొంతు. అంతే, మ‌నోడు ఫుల్ షాక్‌. ముఖ్య‌మంత్రే త‌న‌కు ఫోన్ చేయ‌డంతో ఫుల్ ఖుషీ. క‌ట్ చేస్తే.. క్ష‌ణాల్లో అన్ని టీవీ ఛానెల్స్‌లో బ్రేకింగ్ న్యూస్ ద‌డ‌ద‌డ‌లాడుతుంది. స‌ర్పంచ్‌కు స్వ‌యంగా ఫోన్ చేసిన సీఎం.. రైతులు కాల్ చేసిన కేసీఆర్‌.. ఇలా గంట‌ల త‌ర‌బ‌డి న్యూస్ న‌డుస్తుంది. మీడియా హౌజ్‌ల‌న్నిటిలోనూ ఒక‌టే హంగామా న‌డుస్తుంది. ఫ‌లానా అత‌నికి కేసీఆర్ ఫోన్ చేశార‌ట‌.. ఫ‌లానా విష‌యం మాట్లాడార‌ట‌.. అంటూ రెండు మూడు రోజులు చ‌ర్చ న‌డుస్తుంది. ఇలా అనేక‌సార్లు జ‌రగటంతో ఇదంతా కావాల‌నే చేస్తున్న ప‌బ్లిసిటీ స్టంట్ అనే వాద‌న వినిపిస్తోంది.  కేసీఆర్ ఫోన్ చేస్తారు.. అవ‌త‌లి వారు మాట్లాడుతారు.. మ‌రి, ఆ ఫోన్ కాల్స్‌ బ‌య‌ట‌కు ఎలా వ‌స్తున్నాయ్‌? ఆ కాల్ రికార్డ్ చేస్తున్న‌ది ఎవ‌రు? వాటిని సోష‌ల్ మీడియాలో పెడుతున్న‌ది ఎవ‌రు? మీడియాకు లీక్ చేస్తున్న‌ది ఎవ‌రు? అనే అనుమానం ఎవ‌రికైనా వ‌చ్చిందా? ఒక‌వేళ వ‌చ్చినా.. ఆ జోష్‌లో ఆ విష‌యాన్ని ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోరు. కానీ, ఇదంతా ప‌క్కా ప్లాన్డ్‌గా సాగుతున్న ప్ర‌మోష‌న్ అని అంటున్నారు.  తాజాగా, ద‌ళిత బంధు ప‌థ‌కంపై మాట్లాడుకుందామంటూ జమ్మికుంట మండలం తనగుల ఎంపీటీసీ సభ్యురాలు నిరోష భర్త రామస్వామికి కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడటం వైర‌ల్‌గా మారింది. ఎప్ప‌టిలానే ఆ ఫోన్ కాల్‌తో కొన్ని గంట‌ల పాటు మీడియా హౌజెస్ పండ‌గ చేసుకున్నాయి. ఈ ఎపిసోడ్‌తో అంద‌రికంటే సీఎం కేసీఆరే చాలా సంతోషించి ఉంటారు. ఎందుకంటే, జ‌స్ట్ ఒక్క నిమిషం ఫోన్ కాల్‌తో.. ద‌ళిత బంధు గురించి, కేసీఆర్ గురించి.. తెలుగు రాష్ట్రాల్లో రోజంతా తెగ చ‌ర్చ న‌డిచింది. పైసా ఖ‌ర్చు లేకుండా సింపుల్‌గా ఇంత ప్ర‌చారం మ‌రే ర‌కంగానైనా వ‌స్తుందా? రెండేళ్లుగా సీఎం కేసీఆర్ ఫోన్ కాల్స్‌తో మంచి డ్రామా పండిస్తున్నారు. 2019లో మంచిర్యాల జిల్లాకు చెందిన యువ‌రైతు శ‌ర‌త్.. త‌న భూమికి వేరొక‌రి పేరుమీద ప‌ట్టా చేశారని ఆరోపిస్తూ సోష‌ల్ మీడియాలో ఓ సెల్ఫీ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో ముఖ్య‌మంత్రి దృష్టికి రావ‌డంతో.. కేసీఆరే స్వ‌యంగా శ‌ర‌త్‌కు ఫోన్ చేసి ఆయ‌న స‌మ‌స్య ప‌రిష్క‌రిస్తాన‌ని చెప్పారు. ప్రాబ్ల‌మ్ సాల్వ్ అయ్యాక‌.. ఆ విష‌యాన్ని మ‌ళ్లీ ఫేస్‌బుక్‌లో పెట్టాలంటూ కేసీఆరే రిక్వెస్ట్ చేయ‌డం.. ఆయ‌న అస‌లు ఉద్దేశ్యాన్ని చెప్ప‌క‌నే చెబుతుంది. ఆ స‌మ‌యంలో సీఎం కేసీఆర్ ధ‌ర‌ణి వెబ్‌సైట్ తీసుకొచ్చే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. అదే స‌మ‌యంలో యువ‌రైతు శ‌ర‌త్ రెవెన్యూ అధికారుల‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని.. కేసీఆర్ త‌న‌కు అనుకూలంగా వాడుకున్నారు. రెవెన్యూ శాఖ‌లో ఇలాంటి అరాచ‌కాలు జ‌రుగుతుంటాయ‌ని.. అందుకే తాను ధ‌ర‌ణి వెబ్‌సైట్‌కు శ్రీకారం చుట్టాన‌ని మెసేజ్ ఇచ్చారు. ఆ ఫోన్ కాల్ అప్ప‌ట్లో వైర‌ల్ కావ‌డం.. మీడియాలో హ‌డావుడి జ‌ర‌గ‌డం.. రెవెన్యూ శాఖ‌పై విమ‌ర్శ‌లు.. ధ‌ర‌ణి కావాలంటూ డిమాండ్లు.. ఇలా కాగ‌ల కార్యాన్ని చాలా సులువుగా  ఫోన్‌కాల్‌తో సాధించుకున్నారు కేసీఆర్‌. అప్ప‌టి నుంచీ ఆయ‌న అప్పుడ‌ప్పుడూ ఇలా ఫోన్‌కాల్ ట్రిక్‌ను చాక‌చ‌క్యంగా ప్ర‌యోగిస్తున్నార‌ని అంటున్నారు.  గ‌తంలోనూ చాలాసార్లు కేసీఆర్ ఈ టాక్‌ట్రిక్స్ ప్లే చేశారు. జూన్‌లో తాను ద‌త్త‌త తీసుకున్న యాదాద్రి జిల్లా వాసాల‌మ‌ర్రి స‌ర్పంచ్‌కు ఫోన్ చేసి.. తాను గ్రామానికి వ‌స్తున్నానని.. అంత క‌లిసి మాట్లాడుకుందామ‌ని.. క‌లిసి భోం చేద్దామంటూ ఫోన్ చేశారు. సీఎం.. వాసాల‌మ‌ర్రికి వెళ్లేదాక ఆ ఫోన్ కాల్ తెగ వైర‌ల్ అవుతూనే ఉంది. ఇదే క‌దా కేసీఆర్‌కు కావ‌ల‌సింది..! ఈ ఏడాది జ‌న‌వ‌రిలో సంగారెడ్డి జిల్లా జ‌హీరాబాద్‌కు చెందిన నాగిరెడ్డి అనే రైతుకు ఫోన్ చేసి ఆలుగ‌డ్డ సాగుపై వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. గ‌తేడాది జులైలో జ‌గిత్యాల‌కు చెందిన ఓ రైతుకు కేసీఆర్ ఇలానే ఫోన్ చేశారు. వ‌ర‌ద కాలువ నిర్మాణం, ముంపు క‌ష్టాల‌పై మాట్లాడారు. తెలంగాణ వారికే కాదు.. ఆంధ్ర ప్ర‌జ‌ల‌కూ కేసీఆర్ ఫోన్లు చేసిన ఘ‌ట‌న‌లు ఉన్నాయి. 2020 డిసెంబ‌ర్‌లో కృష్ణా జిల్లా ఘంట‌శాల‌కు చెందిన ఆద‌ర్శ రైతు ఉప్ప‌ల ప్ర‌సాద‌రావుకు ఫోన్ చేసి సీడ్రిల్ ఆధునిక వ్య‌వ‌సాయ యంత్రాల ప‌నితీరు, లాభాల గురించి వివ‌రాలు క‌నుక్కున్నారు.  ఇలా, ప‌లుమార్లు కేసీఆర్ ఫోన్‌కాల్స్ తెగ వైర‌ల్ అవుతున్నాయి. అయితే, కేసీఆర్ చేసే అన్ని కాల్స్ బ‌య‌ట‌కు రావు. తాను కావాల‌నుకున్న‌, కావాల‌ని చేసిన కాల్స్‌ను మాత్ర‌మే ఉద్దేశ్య‌పూర్వ‌కంగా వైర‌ల్ చేస్తుంటారు. ఇటీవ‌ల వైసీపీ ఎమ్మెల్యే రోజాకు చెన్నై ఆసుప‌త్రిలో స‌ర్జ‌రీ జ‌రిగితే.. సీఎం కేసీఆర్ ఫోన్ చేసి ప‌రామ‌ర్శించారు. ఆ ఫోన్ కాల్ బ‌య‌ట‌కు రాలేదు. అంటే, ఆ విష‌యాన్ని పబ్లిసిటీకి వాడుకోవాల‌ని భావించ‌లేదు కేసీఆర్‌. అలానే అనేక అంశాల‌పై వివిధ వ‌ర్గాల ప్ర‌ముఖుల‌కు, అధికారుల‌కు, కేంద్ర ప్ర‌భుత్వ‌ శాఖ‌ల‌కు సీఎం కేసీఆర్ ఫోన్లు చేస్తూనే ఉంటారు. అవేవీ రికార్డు అవ‌వు.. బ‌య‌ట‌కు రావు.. కేవ‌లం, కేసీఆర్ ఏ విష‌యంపైనైతే చ‌ర్చ జ‌ర‌గాల‌ని కోరుకుంటారో.. ఏ టాపిక్ అయితే మీడియాలో హ‌డావుడి జ‌ర‌గాల‌ని భావిస్తారో.. ఆ స‌మ‌యంలో ఆయ‌న కావాల‌నో ఫోన్ చేస్తుంటారు.. ఆ కాల్‌ను ఆయ‌నే రికార్డు చేస్తుంటారు.. ఆ ఆడియాను మీడియాకు లీక్ చేసి.. త‌నకు కావాల్సిన‌ ప్ర‌యోజ‌నం పొందుతుంటారు. ఇలా వైర‌ల్‌గా మారే ఫోన్‌కాల్స్ య‌వ్వార‌మంతా.. కేసీఆర్ క‌నుస‌న్న‌ల్లో.. ప్ర‌గ‌తిభ‌వ‌న్ డైరెక్ష‌న్‌లో జ‌రిగేవే అంటున్నారు.   

తిరుపతి యువకుడికి ప్రధాని మోడీ ప్రశంసలు..

ఆంధ్రప్రదేశ్ లోని తిరుప‌తికి చెందిన సాయి ప్ర‌ణీత్ అనే యువ‌కుడిని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌శంసించారు. మ‌న్ కీ బాత్‌లో మాట్లాడిన మోడీ.. సామాజిక మాధ్య‌మాల్లో రైతుల‌కు ఏపీ వెదర్ మ‌న్ పేరుతో వాతావ‌ర‌ణ స‌మాచారం అందిస్తూ సాయి ప్ర‌ణీత్ మంచి పని చేస్తున్నార‌ని చెప్పారు. బెంగ‌ళూరులో సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్‌గా ప‌నిచేస్తోన్న సాయి ప్ర‌ణీత్ రైతుల‌కు అందిస్తోన్న సేవ‌ల‌కు గాను ఐక్య‌రాజ్య‌స‌మితి, భార‌త వాతావ‌ర‌ణ శాఖ నుంచి కూడా గ‌తంలో ప్ర‌శంస‌లు అందుకున్నారు. ఆయ‌న సేవ‌ల‌ను మ‌న్ కీ బాత్‌లో మోడీ ప్ర‌స్తావించారు. చండీగ‌ఢ్‌కు చెంద‌ని 29 ఏళ్ల సంజ‌య్ రాణాను కూడా మోదీ ప్ర‌శంసించారు. ఆ యువ‌కుడు ఫుడ్ స్టాల్ ను నిర్వ‌హిస్తుంటాడ‌ని, సైకిల్ పై తిరుగుతూ ఛోలే భ‌తూర్ అనే వంట‌కాన్ని అమ్ముతుంటాడ‌ని మోడీ అన్నారు. క‌రోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారికి ఆయ‌న ఉచితంగా దాన్ని అందిస్తూ స్ఫూర్తిగా నిలిచార‌ని కొనియాడారు. త‌మిళ‌నాడులోని నీల‌గిరికి చెందిన రాధిక శాస్త్రి అనే మ‌హిళ అంబ‌ర్క్స్ ప్రాజెక్ట్ చేప‌ట్టి సేవ‌లందిస్తున్నార‌ని ప్ర‌ధాని మోడీ ప్ర‌శంసించారు. కొండ ప్రాంతాల ప్ర‌జ‌లు ఆసుప‌త్రుల‌కు వెళ్లేందుకు ప‌డుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకుని  వారి కోసం ఆమె ఉచితంగా ర‌వాణా స‌దుపాయాల‌ను క‌ల్పిస్తున్నార‌ని చెప్పారు. త‌న స‌హ‌చ‌ర ఉద్యోగుల వ‌ద్ద విరాళాలు సేక‌రించి ఆమె ఈ సేవ‌లు కొన‌సాగిస్తున్నార‌ని ప్రధాని వివ‌రించారు. ఆమె మొత్తం ఆరు అమ్‌బ‌ర్క్స్  స‌ర్వీసులు న‌డిస్తున్నార‌ని కొనియాడారు. ప్రజలకు కొవిడ్ జాగ్రత్తలు చెప్పారు ప్రధాని మోడీ. పండుగ‌లు, శుభ‌కార్యాలు జ‌రుపుకునే స‌మ‌యంలో క‌రోనా ఇంకా తొల‌గిపోలేద‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌ని  సూచించారు. క‌రోనా ఇంకా మ‌న మ‌ధ్యే ఉంద‌ని, కొవిడ్ నియంత్ర‌ణ నియ‌మాల‌ను మ‌ర్చిపోకూడ‌ద‌ని మోడీ తెలిపారు. ఒలింపిక్ ప్లేయర్లు ఎన్నో కష్టాలు భరించి... ఆ స్థాయి కి వెళ్లారన్న ప్రధాని మోడీ.. వారిని సోషల్ మీడియా ద్వారా ఎంకరేజ్ చెయ్యాలని కోరారు. ఇందుకోసం విక్టరీ పంచ్ క్యాంపెయిన్ ప్రారంభించినట్లు తెలిపారు. జులై 26న కార్గిల్ విజయ్ దివస్ అని గుర్తు చేసిన మోడీ.. మన భారత సైనికుల నిబద్ధత, క్రమశిక్షణ, పట్టుదలను ప్రపంచ దేశాలు చూశాయన్నారు. 1999 కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు  శ్రద్ధాంజలి ఘటించమని, సలాం చెయ్యమని దేశ ప్రజలను కోరారు. కార్గిల్ విజయ గాథను చదవాలని విద్యార్థులను కోరారు ప్రధాని మోడీ. 

ఆగస్టులోనే థర్డ్‌ వేవ్‌!.. ఈసారి మ‌రింత డేంజ‌ర‌స్‌...!

క‌రోనా కేసులు భారీగా త‌గ్గాయి. క‌ర్ఫ్యూ ఆంక్ష‌లు పోయాయి. జ‌నం రోడ్ల‌పై విచ్చ‌ల‌విడిగా తిరిగుతున్నారు. ఇన్నాళ్లూ ఆంక్ష‌ల‌తో కంట్రోల్లో ఉన్న ప్ర‌జ‌లు.. ఇప్పుడు ఒళ్లు విరుచుకుని విహారం చేస్తున్నారు. గుళ్లు, గోపురాలు, షాపులు, ప‌ర్య‌ట‌న‌లు, బంధువులు, పార్కులు, మాల్స్‌.. ఇలా అవ‌స‌రం ఉన్నా లేకున్నా ఏదో ఒక సాకుతో, ప‌నితో బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. క‌రోనా పోయింద‌ని బిందాస్‌గా ఉంటున్నారు. కానీ, క‌రోనా ఎక్క‌డికీ పోలేద‌ట‌. ఇంకా మ‌న మ‌ధ్య‌నే తిరుగుతోంద‌ట‌. ఫ‌స్ట్ వేవ్ నుంచి సెకండ్ వేవ్‌కు మ‌ధ్య బ్రేక్ ఇచ్చిన‌ట్టుగానే.. ఇప్పుడు థ‌ర్డ్ వేవ్‌తో దాడి చేసేందుకు సిద్ధంగా ఉంద‌ట‌. అందుకు ఎంతో టైమ్ కూడా లేద‌ని.. ఈ ఆగ‌స్టులోనే థ‌ర్డ్ వేవ్ విజృంభించే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.  మ‌న ద‌గ్గ‌ర రెండు వారాలుగా పాజిటివ్‌ కేసులు.. పాజిటివిటీ రేటు నిలకడగా ఉన్నాయి కానీ.. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. భార‌త్‌లో మొదటి, రెండో దశలు.. తొలుత కేరళ తర్వాత మహారాష్ట్ర అనంతరం ఢిల్లీ నుంచి ప్రారంభమయ్యాయి. ఆ క్ర‌మంలో ఇప్పుడు మ‌రోసారి కేరళ, మహారాష్ట్రలో కేసులు పెరుగుతుండ‌టం థ‌ర్డ్ వేవ్‌కు సంకేతంగా భావిస్తున్నారు. కేరళలో పాజిటివిటీ రేటు 10 శాతంగా ఉంది. మహారాష్ట్రలో ప్రతిరోజూ 9 వేల కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో పాజిటివ్‌ కేసుల నమోదులో కేరళ, మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో ఉండ‌టం ఆందోళ‌న‌క‌ర విష‌యం. థ‌ర్డ్ వేవ్ ఏపీపై తీవ్ర ప్ర‌భావం చూపే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు.  ఏపీలో రోజుకు స‌గ‌టున 2వేల కేసులు వ‌స్తున్నాయి. పాజిటివిటీ రేటు 2.1 నుంచి 2.6 శాతం వరకూ ఉంది. తూర్పుగోదావరి, చిత్తూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కేసుల సంఖ్య అదుపులోకి రావడం లేదు. ఆయా జిల్లాల్లో కేసులు పెరుగుతాయి తప్ప.. తగ్గక‌పోవ‌డంతో.. థ‌ర్డ్ వేవ్ ముంద‌ర ఏపీ ఉంద‌ని అంటున్నారు. సుల సంఖ్య తగ్గకపోవడంతో ప్రభుత్వం కూడా కర్ఫ్యూ నిబంధనలను అమలు చేస్తోంది. రాత్రి 10 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉంది. ఏ వారానికి ఆ వారం కర్ఫ్యూను పొడిగించుకుంటూ వస్తోంది. మూడోదశను దృష్టిలో పెట్టుకునే కర్ఫ్యూ పొడిగిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ఫ్యూ అమలులో ఉన్న‌ తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, చిత్తూరుజిల్లాల్లో కేసుల ఎక్కువగా నమోదవుతున్నాయి.  దేశవ్యాప్తంగా 67 శాతం హెర్డ్‌ ఇమ్యూనిటీ ఉందని సీరో సర్వే ద్వారా వెల్లడవుతుంది. ఏపీలో కూడా దాదాపు 70శాతంపైన హెర్డ్‌ ఇమ్యూనిటీ ఉన్నట్లు సీరో సర్వేతో తేలింది. అయితే, రెండో దశ ఉధృతిని హెర్డ్‌ ఇమ్యూనిటీ నియంత్రించలేకపోయింది. మూడో దశ ప్రభావం తొలి రెండుదశల స్థాయిలో ఉండొచ్చని అంచ‌నా. జాగ్రత్తగా లేక‌పోతే మ‌రింత ప్ర‌మాద‌క‌రం. వ్యాక్సినేష‌న్ ఎంత వేగంగా జ‌రిగితే.. అంత ఉప‌యోగం. 

పప్పు అంటూ కేటీఆర్ ట్వీట్..  సోషల్ మీడియాలో రచ్చ 

తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ లీడర్లు, కార్యకర్తలు హంగామా చేశారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా కోటి వృక్షార్చన పేరుతో భారీగా మొక్కలు నాటి కేటీఆర్ కు శుభాకాంక్షలు  చెప్పారు. టీఆర్ఎస్ నేతలతో పాటు వివిధ పార్టీల నేతలు కూడా కేటీఆర్ కు  విషెష్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. జాతీయ స్థాయిలోని ప్రముఖులు కూడా కేటీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.  కేటీఆర్ బర్త్ డే రోజున ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. థ్యాంక్యూ పప్పు అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. దేశ రాజకీయాలతో పాటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పప్పు అన్న పదానికి చాలా స్టోరీ ఉంది. కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీని విపక్ష నేతలు పప్పు అని ఆరోపణలు చేస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాలకు వస్తే.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను వైసీపీ నేతలు లోకేష్ అని కామెంట్ చేస్తుంటారు. దీంతో కేటీఆర్ పప్పు అని చేసిన కామెంట్ ఆసక్తి రేపింది.   అయితే కేటీఆర్ చేసిన పప్పు ట్వీట్ వెనుక అసలు విషయంలోకి వెళితే.. ఎమ్మెల్సీ కవిత  తన సోదరుడు కేటీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. ''హ్యాపీ బర్త్ డే అన్నయ్యా.. ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి. మరిన్ని విజయాలు సాధించాలి.'' అంటూ కవిత ట్వీట్ చేశారు. సోదరి కవిత ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ స్పందించారు. థ్యాంక్యూ పప్పు.. అని రిప్లై ఇచ్చారు. దీనిపై టీఆర్ఎస్ నేతలతో పాటు సామాన్య జనాలు కూడా వెరైటీగా స్పందించారు. నెటిజన్లు సరదా కామెంట్లు పెట్టారు. మరికొందరు సెటైర్లు వేశారు. కవితను మీరు పప్పు అని పిలుస్తారా? అని నెటిజన్లు కేటీఆర్ ను ప్రశ్నించారు.  మొత్తానికి కవిత నిక్ నేమ్ తొలిసారి బయటపెట్టారు అంటూ సరదాగా ట్వీట్స్ చేస్తున్నారు. కేటీఆర్ ట్వీట్ తో ఇంట్లో కవితను పప్పు అనే ముద్దు పేరు ఉందనే విషయం బయటకు వచ్చింది. చిన్నప్పుడు కవితను పప్పు అన్న పేరుతోనే అందరూ పిలిచేవారని చెబుతున్నారు.      

పీవీ సింధు విన్.. సొనియా జోడీ అవుట్

టొక్సో ఒలింపిక్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు శుభారంభం చేసింది. గ్రూప్‌-జే తొలి మ్యాచ్‌లో వరల్డ్ 58వ ర్యాంకర్ ఇజ్రాయెల్‌కు చెందిన సెనియా పోలికర్పోవాపై సునాయసనంగా గెలిచింది. వరుస సెట్లలో 21-7, 21-10 తేడాతో సింధు ఘన విజయం సాధించింది. సూపర్ ఫామ్ కొనసాగించిన సింధు.. కేవలం 28 నిమిషాల వ్యవధిలోనే ఈ మ్యాచ్‌ను ముగించింది. తన తరువాతి మ్యాచ్‌లో సింధు హాంగ్‌కాంగ్‌కు చెందిన చెయుంగ్ గాన్‌తో తలపడనుంది.  ఇక మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో భారత షూటర్లు నిరాశపరిచారు. మనుబాకర్‌, యశస్విని ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. మనుబాకర్‌ 575 పాయింట్లతో 12వ స్థానానికి పరిమితం కాగా, యశస్విని 574 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచారు. చివరి షూటర్ 577 పాయింట్లతో ఫైనల్స్‌కు అర్హత సాధించారు. దీంతో రెండు పాయింట్ల తేడాతో మనుబాకర్ ఫైనల్‌కు వెళ్లలేకపోయారు.  ఒలింపిక్స్‌ టెన్నిస్‌ మహిళల డబుల్స్‌లో హైదరాబాదీ ,మాజీ ఒలింపియన్ సానియా మిర్జా జోడి తొలి రౌండ్ లోనే నిష్క్రమించింది. ఉక్రెయిన్‌కు చెందిన కవలలు లియుడ్మిలా కిచెనోక్, నదియా కిచెనోక్..  సానియా మిర్జా, అంకితా రైనా జోడిని ఓడించారు. భార‌త్‌పై ఉక్రెయిన్ 6-0, 6-7, 8-10 తేడాతో గెలిచింది. తొలి సెట్ ను బాగా సోనియా మీర్జా జోడి.. ఆ త‌ర్వాత ఏ మాత్రం రాణించ‌లేక‌పోయారు. తొలి సెట్‌ను 6-0తో కైవసం చేసుకోగా, అనంత‌రం రెండు సెట్లలో ఓడిపోయారు. మొద‌ట సానియా జోడి రెండో సెట్‌లో 5-3 తేడాతో లీడ్‌లో కొన‌సాగింది. ఆ త‌ర్వాత మాత్రం ఉక్రెయిన్ క్రీడాకారిణుల‌పై సానియా జోడి పైచేయి సాధించ‌లేక‌పోయింది. 

వెండి వెలుగుల‌ వెనుక క‌ష్టాలెన్నో.. మీరాబాయి లైఫ్ స్టోరీ..

ఒలింపిక్స్‌లో ర‌జతం సాధించ‌డంతో ఇప్పుడు ప్ర‌పంచ‌మంతా మీరాబాయి పేరు మారుమోగుతోంది. ఇప్పుడామె ఓ సూప‌ర్‌స్టార్‌. ప్ర‌శంస‌లు.. న‌జ‌రానాలకు కొద‌వే లేదు. అయితే, టోక్యో వ‌ర‌కు ఆమె ప్ర‌యాణం  అంత సాఫీగా సాగ‌లేదు. ఈ విజ‌యం వెనక అనేక‌ త్యాగాలు.. అంత‌కుమించి అవమానాలు. గెలవాలనే ప‌ట్టుద‌ల‌.. ప‌త‌కం సాధించాల‌నే త‌ప‌నే.. ఆమెను ఒలింపియ‌న్‌గా నిల‌బెట్టింది. ర‌జితంతో మెరిసేలా చేసింది.  ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో 1994, ఆగస్టు 8న ఇంఫాల్‌లోని నాంగ్‌పాక్‌ కాక్‌చింగ్‌లో ఓ సాధారణ కుటుంబంలో జన్మించింది మీరాబాయి చాను. బడికెళ్లే వయసులో విలువిద్య నేర్చుకోవాలని భావించింది. ఎప్పుడైతే కుంజరాణి దేవి వెలుగులు చూసిందో వెయిట్‌లిఫ్టింగ్‌ను ఎంచుకుంది. వంటకోసం కట్టెలు తీసుకొచ్చేందుకు సోదరుడితో అడవికి వెళ్లేది. ఆ కట్టెల మోపులను మోయడమే వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆమెకు లభించిన మొదట శిక్షణ.  మీరాబాయి స్వస్థలంలో వెయిట్‌ లిఫ్టింగ్‌ శిక్షణ శిబిరాలు లేక‌పోవ‌డంతో ఆమె రోజూ 60 కిలోమీటర్లు ప్రయాణించేది. మొదట ఆమె కోచ్‌ అనితా చాను వెదురు బొంగులతో సాధన చేయించేది. రోజూ వెదురుబొంగులు తెప్పించడం.. వాటికి బరువులు పెట్టి మోయిస్తూ టెక్నిక్స్‌ నేర్పించేది. మీరాబాయి వేగంగా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. 2014లో గ్లాస్గో కామన్వెల్త్‌ క్రీడల్లో 48 కిలోల విభాగంలో రజతం గెలిచింది. 2016 రియో ఒలింపిక్స్‌కు ఎంపికైనా.. ఒత్తిడి తట్టుకోలేక అనర్హతకు గురైంది.  ఆ త‌ర్వాత‌ రోజూ ఆరు గంటలకుపైగా సాధన చేసింది. కోచ్‌ల పర్యవేక్షణలో కొత్త మెలకువలు నేర్చుకుంది. మీరాబాయి కఠిన శ్రమకు ఫలితాలు లభించసాగాయి. 2017లో అమెరికాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం సాధించింది. 2018లో రాజీవ్‌ ఖేల్‌రత్న, పద్మశ్రీ వ‌రించాయి. ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లో ర‌జతం గెలిచింది.  ‘రియో ఒలింపిక్స్‌లో ఓటమి చెందినప్పుడే నిర్ణయించుకున్నా.. నేనేంటో టోక్యోలో నిరూపించుకోవాలని అని మీరాబాయి చెప్పడం ఆమె ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ‘ఐదేళ్లలో ఐదు రోజులు మాత్రమే ఇంటిదగ్గర ఉన్నా. ఇప్పుడు ఈ పతకంతో ఊళ్లో అడుగుపెడతా’ అంటూ రజత పతకం సాధించాక చెప్పిన మాటలే చాను పట్టుదలకు, మనస్తత్వానికి నిద‌ర్శ‌నం.  టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన మీరాబాయి చానుకు మణిపూర్‌ సీఎం బీరెన్‌ సింగ్‌ భారీ నజరానా ప్రకటించారు. రూ.కోటి నజరానాతో పాటు ఓ ప్ర‌భుత్వ‌ ఉద్యోగాన్ని రిజర్వు చేసి ఉంచుతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం రైల్వే టీసీగా పనిచేస్తున్న మీరాబాయి చానుకు ఆ ఉద్యోగానికి బదులుగా మరో కొత్త ఉద్యోగాన్ని రిజర్వు చేసి ఉంచుతున్నట్టు చెప్పారు.   

రాజీనామాల‌పై చంద్ర‌బాబు స‌వాల్‌.. స‌ర్కారు ఎస్కేప్‌.. అందుకే అంత‌ భ‌య‌మా?

అధికారంలో ఉన్నారు. సంక్షేమం పేరుతో డ‌బ్బులు పంచుతున్నారు. స్థానిక సంస్థ ఎన్నిక‌ల్లో గెలిచారు. అయినా, టీడీపీ అంటే భ‌యం. ఇంకా చంద్ర‌బాబు అంటే వ‌ణుకు. కార‌ణం, వైసీపీ పాల‌న‌పై ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నార‌నే విష‌యం వారికి స్ప‌ష్టంగా తెలుసు. అమ‌రావ‌తి, క‌రోనా క‌ట్ట‌డి నుంచి జాబ్ క్యాలెండ‌ర్ వ‌ర‌కూ రెండేళ్లుగా జ‌నం.. జ‌గ‌న్‌పై ఎంత అసంతృప్తి, అస‌హ‌నంతో ఉన్నారో పాల‌కుల‌కు బాగా తెలుసు. క‌రోనా కేసులు త‌గ్గ‌డంతో ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు, ముట్ట‌డిల‌తో ప్ర‌జ‌ల నుంచి ఎగిసిప‌డుతున్న ఆగ్ర‌హ‌జ్వాల‌లే అందుకు నిద‌ర్శ‌నాలు.  ఇక‌, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఎలా గెలిచారంటారా? ఎన్ని కుట్ర‌లు, కుతంత్రాలు, బెదిరింపులు, అక్ర‌మాలు, దొంగ ఓట్ల‌తో గ‌ట్టెక్కారో ఏపీలో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అందుకే, రాజీనామాలంటే భ‌య‌ప‌డుతున్నారు. మ‌ళ్లీ ఎన్నిక‌లంటే వ‌ణికిపోతున్నారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న చంద్ర‌బాబే.. ఎల‌క్ష‌న్ల‌కు బెద‌ర‌కుండా విశాఖ ఉక్కు, ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం రాజీనామాల‌కు సిద్ధ‌మా అని స‌వాల్ విసిరితే.. వైసీపీ మాత్రం రాజీనామాల‌కు ముఖం చేటేస్తోంది. స‌వాల్ స్వీక‌రించ‌కుండా త‌ప్పించుకుంటోంది.  ఇక‌ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, ముఖ్య‌మంత్రి త‌ర్వాత ముఖ్య‌మంత్రి అంత‌టివాడైన స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అయితే.. రాజీనామాల విష‌యంలో మ‌రీ దిగ‌జారి మాట్లాడుతున్నారు. రాజీనామా చేయాలనుకుంటే మీరే చేసుకోండంటూ పిరికిత‌నం ప్ర‌ద‌ర్శించారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ అధినేత చంద్రబాబు తన ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించాలనుకుంటే చేయించవచ్చని సజ్జల మాట్లాడ‌టం.. ఎన్నిక‌లంటే వైసీపీలో క‌లుగుతున్న క‌ల‌వ‌ర‌పాటుకు నిద‌ర్శ‌నం అంటున్నారు.  గ‌తంలో అధికారంలో ఉండిమ‌రీ ప్ర‌త్యేక హోదా కోసం కేంద్రంతో అలుపెర‌గ‌ని పోరాటం చేసిన‌.. ఎంపీలంతా రాజీనామ చేసిన ఘ‌న‌త టీడీపీది. చంద్రబాబు ఆదేశాల‌తో రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ కోసం ప‌ద‌వుల‌ను తృణ‌పాయంగా వ‌దిలేశారు తెలుగుదేశం ప్ర‌జాప్ర‌తినిధులు. అయితే, కేంద్రంతో అంట‌కాగుతూ.. ఢిల్లీకి గులాంగిరీ చేస్తూ.. ఏపీ ప్ర‌యోజ‌నాల‌ను కాల‌రాస్తోంది వైసీపీ. బీజేపీకి ఫుల్ మెజార్టీ ఉందంటూ.. మ‌న‌మేమీ చేయ‌లేమంటూ.. ప్ర‌త్యేక హోదా నినాదాన్ని ఎప్పుడో అట‌కెక్కించేశారు. రెండేళ్ల త‌ర్వాత ఇప్పుడు పార్ల‌మెంట్‌లో ఉత్తుత్తి నినాదాలు చేస్తున్నారు. పోల‌వ‌రం నిధుల కోసం గ‌ట్టిగా నిల‌దీసింది లేదు. విశాఖ ఉక్కును అంగ‌డి స‌రుకుగా అమ్ముకుంటున్నా.. ఉద్య‌మిస్తున్న‌ది లేదు. చంద్ర‌బాబు ఓ అడుగు ముందుకేసి.. జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో స్టీల్ ప్లాంట్ కోసం పోరాటానికి సిద్ధ‌మంటూ ప్ర‌క‌టించినా.. ప్ర‌భుత్వం నుంచి ఉలుకూప‌లుకూ లేదు. ఇంత‌టి చేత‌గాని, చేష్ట‌లుడిగిన ప్ర‌భుత్వాన్ని ఇంత‌కు ముందెప్పుడూ చూడ‌లేదంటూ మండిప‌డుతున్నారు ప్ర‌జ‌లు. అయితే, జ‌గ‌న్ జుట్టు కేంద్రం చేతిలో ఉండ‌టం.. సీబీఐ కేసుల ఉచ్చు బిగిస్తుండ‌ట‌మే.. ఢిల్లీకి జ‌గ‌న్ దాసోహమ‌వ‌డానికి కార‌ణ‌మ‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. నేరం జ‌గ‌న్ చేస్తే.. శిక్ష ఏపీ అనుభ‌వించాల్సి వ‌స్తోంద‌ని ఆగ్ర‌హంతో కూడిన ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు ప్ర‌జ‌లు.   

కేటీఆర్ కు విషెష్ చెబుతూ సెటైర్లు.. షర్మిలను ఆటాడుకున్న నెటిజన్లు 

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి శాఖా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా  ఘనంగా నిర్వహించారు. గ్రీన్ చాలెంజ్ లో భాగంగా పార్టీ శ్రేణులతోపాటు మంత్రులు,ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. కేటీఆర్ కు బర్త్ డే విషెష్ చెబుతూ దేశ వ్యాప్తంగా ప్రముఖులు ట్వీట్లు చేశారు. సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ కు శుభాకాంక్షలు వెలువెత్తాయి. రాజకీయాలకు అతీతంగా నేతలు ఆయనకు విషెస్ చెప్పారు.  వైఎస్ఆర్ టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాత్రం భిన్నంగా స్పందించారు. ఆయన్ను నేరుగా మంత్రి కేటిఆర్‌గా కాకుండా మరోసారి సీఎం కేసిఆర్ గారి కొడుకు కేటిఆర్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. గతంలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూనే సెటైర్లు వేశారు.ఆయనకు భగవంతుడు ఆయురాగ్యోలతోపాటు రాష్ట్రంలోని నిరుద్యోగుల ఆత్మహత్యలను ఆపే శక్తిని ఇచ్చే విధంగా లక్షా 91 వేల ఉద్యోగ ఖాలీలను భర్తి చేసే పట్టుదలను ఇవ్వాలని ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతోపాటు 54 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే చిత్తశుద్ధిని, విద్యార్థులకు పూర్తి ఫీజ్ రిఎంబర్స్మెంట్ ఇచ్చె మనసుని..ఇవ్వాలని కోరుకొంటున్నానని షర్మిల ట్వీట్ చేశారు. చివరి ట్విస్ట్ గా వనపర్తికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని లావణ్య ఆత్మహత్య చేసుకున్న వీడియోను కానుకగా ఇస్తున్నాట్టు ఆ వీడియోను పోస్టు చేసింది.  కేటీఆర్ కు విషెస్ చెబుతూ షర్మిల పోస్టు చేసిన వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. బర్త్ డే రోజున ఇలాంటి పోస్టులు ఏంటని కొందరు ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఇదివరకు కేటీఆర్ ఎవరో తెలియదని చెప్పావ్ మరి విషెస్ దేనికని మరికొందరు ప్రశ్నించారు.  షర్మిల ఎన్ని జిమ్మిక్కులు చేసినా..తెలంగాణలో ఆమె పార్టీకి ఉనికి ఉండదని మరికొంతమంది అన్నారు. టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం షర్మిలను విపరీతంగా ట్రోల్ చేశారు. చంద్రకాంత్ రెడ్డి మొదటి భార్య, బ్రదర్ అనీల్ శాస్త్రీ రెండో భార్య షర్మిలకు కృతజ్ఞతలు అంటూ విరుచుకుపడ్డారు. కరోనాను కాలితో తొక్కి చంపే, వానలను తిట్లతో ఆపే మత ప్రచారకుడి  సెకండ్ హ్యాండ్ బాణం అంటూ కౌంటర్లు వేశారు. బాబాయ్ లాగా తనకు అవుతుందోమోనన్న భయంతోనే తెలంగాణకు షిప్ట్ అయిందని మరికొందరు ఆరోపిస్తూ పోస్టులు పెట్టారు.  మొత్తానికి కేటీఆర్ బర్త్ డే రోజున వైఎస్ షర్మిల చేసిన పోస్టు రాజకీయంగా రచ్చగా మారింది. జన్మదిన శుభాకాంక్షలు చెప్పడంలో హుందాగా వ్యవహరించాలని.. కాని షర్మిల ఓవరాక్షన్ చేసిందనే విమర్శలే ఎక్కువగా వినిపించాయి. చంద్రబాబు, జగన్ సైతం పుట్టిన రోజు శుభాకాంక్షలు పద్దతిగా చెప్పుకుంటారని, షర్మిల తీరు సరిగా లేదని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. రాజకీయ పరిపక్వత లేనట్లుగా షర్మిల వ్యవహరిస్తున్నారనే  టాక్ జనాల నుంచి కూడా వస్తోంది.  

గోవధ చట్టాన్ని ఎత్తివేయాలి.. వైసీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ లోని ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోవధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని దేశ వ్యాప్తంగా డిమాండ్ వస్తున్న వేళ... ఆ ఎమ్మెల్యే మాత్రం అందుకు వ్యతిరేకమైన కామెంట్లు చేశారు. గోవధ చట్టాన్ని ఎత్తివేయాలంటూ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గోవధ చట్టం అమలు సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. గోవధ చట్టంపై వైసీపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్లు తీవ్ర కలకలం రేపుతున్నాయి.  భారత్‌లో కాలం చెల్లిన చట్టాల్లో గోవధ చట్టం ఒకటన్నారు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి. ప్రపంచంలో ఎక్కడా గోవధ చట్టం అమలులో లేదన్నారు. లౌకిక దేశంలో గోవు పూజించేవారికి పూజించే వస్తువని, తినే వారికి ఆహార వస్తువన్నారు. ప్రజల ఆహార అలవాట్లపై నిషేధం విధించడం పౌరుని ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని ఆయన అన్నారు.  బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, భజరంగధల్ బక్రీద్ పండుగ రోజు గోవధ చట్టాన్ని వివాదంగా మారుస్తున్నాయని కూడా వైసీపీ ఎమ్మెల్యే చెప్పారు. మైనార్టీలపై గోవధ చట్టం పేరుతో రాద్ధాంతం చేయడం కరెక్టు కాదన్నారు.  వైసీపీ ఎమ్మెల్యే గా చెప్పడం లేదంటూనే అతి సున్నితమైన గోవధ చట్టాన్ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు చెన్నకేశవ రెడ్డి. మునులు గోవులను తిన్నట్టుగా తాను విన్నానని వ్యాఖ్యానించారు. గోవధ నియంత్రణ యంత్రాంగం ఏ ప్రభుత్వం దగ్గర లేదని స్పష్టం చేశారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్పినట్లు మన చట్టాల్లో ఈ కాలానికి అవసరం లేని చట్టాలు తొలగించాలని సూచించారు. గోవులు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఆహార వస్తువులుగా ఉపయోగపడుతున్నాయని తెలిపారు.లౌకికవాదిగా చెప్తున్నానంటూనే వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.