ఇంత నిర్లక్ష్యమా.. కోర్టులంటే లెక్కలేదా? జగన్ సర్కార్ పై హైకోర్టు సీరియస్
posted on Aug 4, 2021 @ 3:44PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల కాలంలో వరుసగా జగన్ రెడ్డి సర్కార్ కు కోర్టులో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అయినా ప్రభుత్వ తీరులో మార్పు రావడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అధికారులపైనా ధర్మాసనం సీరియస్ అయింది. కొందరికి శిక్షలు కూడా వేసింది. అయినా సర్కార్ లాగే అధికారులు కూడా నిర్లక్ష్యం వీడటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఓ కేసు విచారణలో భాగంగా జగన్ ప్రభుత్వంతో పాటు అధికారుల తీరుపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. చివాట్లు పెడుతూ ఘాటు వ్యాఖ్యలతో హెచ్చరికలు జారీ చేసింది.
ఉపాధి హామీ బిల్లుల చెల్లింపులకు సంబంధించిన కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతుండడం పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తాము ఆదేశాలు ఇచ్చినప్పటికీ అమలు చేయలేదని రాష్ట్ర సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను గౌరవించాలని తెలియదా? అంటూ నిలదీసింది. బిల్లులపై విజిలెన్స్ విచారణలో తేలిన అంశాలు ఏమిటని ప్రభుత్వ ప్రతినిధులను హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.
ఉపాధి హామీ పనుల బిల్లులకు సంబంధించి కోర్టు అడిగిన మేరకు ఏపీ పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సమాధానం ఇవ్వలేకపోయారు.దాంతో హైకోర్టు ధర్మాసనం మరింత అసహనానికి లోనైంది. విచారణలో ఉన్న అంశాలపై తగినంత సమాచారం లేకుండా ఎలా వస్తారని మొట్టికాయలు వేసింది.విచారణకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రాకపోవడంపైనా హైకోర్టు తీవ్రంగా స్పందించింది. తదుపరి విచారణకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది.
వాదనల సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టుకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఉపాధి హామీ బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఇప్పటిదాకా రూ.413 కోట్లు చెల్లించామని, మరో 4 వారాల్లో రూ.1.117 కోట్లు చెల్లిస్తామని తెలిపారు.అయితే ప్రభుత్వం బిల్లుల కోసం చెల్లించింది రూ.40 కోట్లేనని పిటిషర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, ఏ గ్రామ పంచాయతీకి ఎంత చెల్లించారో వివరాలతో సమగ్ర అఫిడవిట్ సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.