సొంత రాష్ట్రానికి సీబీఐ లక్ష్మినారాయణ

      సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ మహారాష్ట్ర క్యాడర్‌కు బదిలీ చేసిన నేపథ్యంలో ఆయన ఇవాళ రిలీవ్ అయ్యారు. డీఐజీ వెంకటేష్‌కు తన బాధ్యతలను అప్పగించారు. తాను రిలీవ్ అవుతున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతి వల్లే దేశాభివృద్ధి కుంటు పడుతోందని .. ఇప్పటి వరకు రాష్ట్రంలో దర్యాప్తు చేసిన కేసుల వివరాలను సీబీఐ కోర్టుకు తెలిపామని, ఎవరెవరు అవినీతికి పాల్పడ్డారో కోర్టుకు సమర్పించామని” ఆయన తెలిపారు. పెండింగ్‌లో ఉన్న దర్యాప్తును డీఐజీ వెంకటేష్ బృందం పూర్తి చేస్తోందని తెలిపారు. అయితే కేసుల దర్యాప్తు విషయంలో తనపై ఎలాంటి ఒత్తిడిలేదని తెలిపారు. తాను మీడియాకు ఎలాంటి దర్యాప్తు సమాచారాన్ని లీకు చేయలేదని, అవసరమనిపిస్తే తానే మీడియా నుంచి సమాచారాన్ని సేకరించానని తెలిపారు. సొంత రాష్ట్రంలో పనిచేయడం తనకెంతో సంతోషాన్ని, సంతృప్తినిచ్చిందని లక్ష్మినారాయణ అన్నారు.

బొగ్గు స్కామ్ లో దాసరి పై ఎఫ్‌ఐఆర్‌

        దేశంలోనే భారీ స్థాయి కుంభకోణాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న బొగ్గుస్కామ్ లో ఏపీ వాటాలు కూడా బయట పడుతున్నాయి. యూపీఏ ప్రభుత్వాన్ని వణికిస్తున్న కోల్ స్కామ్ లో దాసరికి కూడా వాటా ఉందని దాదాపుగా నిర్దారణ అయ్యింది. లక్షా 86 వేల కోట్ల రూపాయల కోల్‌స్కామ్‌లో దాసరి నారాయణరావుపై సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. బొగ్గు కేటాయింపుల్లో మంత్రిగా దాసరిపాల్పడిన అక్రమాలకు పక్కా ఆధారాలు దొరికనట్టు తెలుస్తోంది. ఈ కేసులో కూడా సీబీఐ క్విడ్ ప్రోకో కోణాన్ని పసిగట్టినట్టు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నవీన్‌ జిందాల్‌ కంపెనీలకు దాసరి బొగ్గు కేటాయింపులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు ప్రతిగా దాసరి నారాయణరావు కంపెనీ సిరి మీడియాలో నవీన్‌జిందాల్‌ పెట్టబడులు పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే దాసరితో పాటు మరికొంత మంది ప్రముఖుల ఇళ్లలో సోదాలను కూడా నిర్వహించింది సిబిఐ.. కాగ్‌ నివేదిక ఆదారంగా జరుగుతున్న ఈ ఇన్వెస్టిగేషన్లో ఇంకెంత మంది పేర్లు బయట పడతాయో అని భయపడుతుంది కేంద్ర నాయకత్వం..

వీసీ శుక్లా కన్నుమూత

        కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి విసి శుక్లా కన్నుమూశారు. గత నెల 25వ తేదీన ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ నేతలపై మావోయిస్టులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడిన శుక్లా ఢిల్లీలోని వేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఆయన మృతికి ప్రముఖ నేతలు సంతాపం తెలియజేశారు. ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తమ ప్రగాఢ సంతాపం తెలుపుతూ, శుక్లా కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. 1966లో ఇందిరాగాంధీ మంత్రి వర్గంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు.వీసీ శుక్లా తొమ్మిది సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు.

నన్ను రెచ్చగొడితే నీకే నష్టం: దగ్గుబాటి

      తనను రెచ్చగొడితే సుబ్బరామిరెడ్డికే నష్టమని దగ్గుబాటి వెంకటేశ్వర రావు హెచ్చరిక జారీ చేశారు. మరి ఈయన దగ్గరు సుబ్బిని బెదిరించడానికి ఏ అస్త్రాలు ఉన్నాయో కానీ…ఇలా నాతో పెట్టుకోకు అని బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. ''సుబ్బరామిరెడ్డి పంపించిన లీగల్ నోటీసుల వ్యవహారం నేను కోర్టులోనే తేల్చుకుంటాను. అయినా నాతో వివాదం పొడిగించుకోవడం సుబ్బరామిరెడ్డికే నష్టం. నాతో పెట్టుకోవద్దు..నన్ను రెచ్చగొట్టొద్దు..ఇలాగే చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి” అని కేంద్రమంత్రి పురంధేశ్వరి భర్త, కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. సుబ్బరామిరెడ్డి పంపిన లీగల్ నోటీసులను ఆయన చాలా తేలికగా తీసుకున్నారు. మా ఇద్దరి వివాదం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదని, అభ్యర్థుల శక్తి సామర్ధ్యాలను బట్టి ఎన్నికల్లో టికెట్లు వస్తాయని అయన అన్నారు.

వాయిదాలతో శాసనసభ వాయిదా

        శాసనసభ రెండో రోజు కూడా ఎలాంటి చర్చలు జరుగకుండా వాయిదా పడింది. బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ అంశంపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరగాలంటూ టిడిపి ఎమ్మెల్యేలు పట్టుపడుతూ పోడియం దగ్గర డిమాండ్‌ చేయగా..తెలంగాణాపై తీర్మానం చేయాలంటూ టీఆర్ఎస్, బీజేపీ నేతలు సభను స్తంభింపచేశారు. దీంతో స్పీకర్ సభను పదేపదే రెండు సార్లు అరగంట పాటు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో విపక్షాలు తమ అందోళన కొనసాగించారు. బడ్జెట్ పద్దులపై చర్చ చేద్దామంటూ స్పీకర్ పలుమార్లు విజ్ఞప్తి చేసిన విపక్షాల సభ్యులు పట్టించుకోలేదు. మొదటి వాయిదా తర్వాత సమావేశమైన సభలో బడ్జెట్‌ పద్దులపై స్టాండింగ్‌ కమిటీలు రూపొందించిన నివేదికలను సభకు సమర్పించినట్టు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ అధికారికంగా ప్రకటించారు. సభ్యుల ఆందోళనల మధ్యే పలు బిల్లులను మంత్రులు ప్రవేశట్టారు. రెండుసార్లు వాయిదా తర్వాత మూడోసారి ప్రారంభమైన సభలోను విపక్షాల ఆందోళన కొనసాగడంతో స్పీకర్‌ సభను రేపటికి వాయిదా వేశారు.

దాసరికి అంటుకున్న బొగ్గు మసి

        తన ప్రత్యర్ధులను బెదిరించటానికి కేంద్రం వాడుకున్న సిబిఐ అస్త్రం ఇప్పుడు మిస్‌ ఫైర్‌ అయినట్టుగా కనిపిస్తుంది.. రాష్ట్రంతో పాటు కేంద్రంలోనూ సిబిఐ సోదాలతో కాంగ్రెస్‌ అవినీతి డొంక కదులుతుంది.. ఇన్నాళ్లు సిబిఐ చార్జీ షీట్లతో పదివిలో ఉన్న మంత్రలు మాజీలవుతుంటే ఇప్పుడు మాజీలకు కూడా కష్టాలు తప్పేలా లేదనిపిస్తుంది..   ముఖ్యంగా కేంద్రంలో సాక్ష్యాత్తు ప్రదాన మంత్రే అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణలు వినిపించిన స్కాం బొగ్గు కుంభకోణం. అయితే ఇప్పుడు ఈ స్కాంలో ఆ బోగ్గు మసి ఆ శాఖ కు సహాయ మంత్రిగా వ్యవహరించిన దాసరికి కూడా అంటుకున్నట్టుగా కనిపిస్తుంది.. సిబిఐ తాజాగా నమోదు చేసిన ఎఫ్‌ ఐ ఆర్‌లో దాసరి పేరును కూడా చేర్చడంతో దాసరి కూడా అరెస్ట్‌ అవుతారన్న ప్రచారం జరుగుతుంది.. చిరు పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయిన దగ్గర నుంచి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న దాసరి పార్టీ పై కాస్త అసంతృప్తిగా కూడా ఉన్నరన్న టాక్‌ ఉంది.. ఇప్పటికే దాసరితో పాటు మరికొంత మంది ప్రముఖుల ఇళ్లలో సోదాలను కూడా నిర్వహించింది సిబిఐ.. కాగ్‌ నివేదిక ఆదారంగా జరుగుతున్న ఈ ఇన్వెస్టిగేషన్లో ఇంకెంత మంది పేర్లు బయట పడతాయో అని భయపడుతుంది కేంద్ర నాయకత్వం.. దాసరితో పాటు మరో కాంగ్రెస్‌ నాయకుడు నవీన్‌ జిందాల్‌ పేరు కూడా ఎఫ్‌ ఐ ఆర్‌లో చేర్చడంతో ఇప్పుడు కాంగ్రెస్‌ ఈ సమస్యపై ఎలా స్పందిస్తుందో అని అంతా ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు..

అభిమానం డబ్బులిస్తే రాదు: బాలయ్య

        నందమూరి నటసింహం బాలకృష్ణ తన బర్త్ డే వేడుకలు అభిమానుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. రామకృష్ణ సినీ స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో బోయపాటి శ్రీను, బాలకృష్ణల కాంబినేషన్ లో రూపొందనున్న సినిమా ప్రారంబించారు. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘సింహ’ సినిమా ఘనవిజయం సాధించింది. శ్రీమన్నారాయణ సినిమా తరువాత బాలకృష్ణ చేస్తున్న చిత్రం ఇది.   ఈ సంధర్భంగా బాలకృష్ణ అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ “నాకు జన్మనిచ్చింది ఎన్టీఆర్ దంపతులు అయితే ఇంతవాడిని చేసింది అభిమానులు. అభిమానం అనేది గుండెలోతుల్లోంచి రావాలి తప్పితే ..డబ్బులిస్తేనో..ప్రలోభాలకు గురిచేస్తేనో రాదు” అని అన్నారు. “కొందరు ఆశించడానికి పుడితే..మరి కొందరు శాసించడానికి పుడతారు” అని కొత్త సినిమా డైలాగ్ కొట్టి అభిమానులను ఆనందపరిచారు బాలయ్య. 2014 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేస్తానంటున్న బాలకృష్ణకు ఇది ఆఖరు చిత్రం అవుతుందా..లేక ఈ లోపే 100వ చిత్రం మొదలు పెడతారా ? చూడాలి.

అద్వాని కి బుజ్జగింపు యత్నాలు

      భారతీయ జనతాపార్టీకి అద్వాని చేసిన రాజీనామాను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ తిరస్కరించారు. ఆయనను బుజ్జగించేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే వెంకయ్యనాయుడు ఈ మధ్యాహ్నం రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. విషయం తెలుసుకున్న సీనియర్ నేతలందరూ ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ కూడా రంగంలోకి దిగింది. ఆ పార్టీ అధ్యక్షుడు భగవత్ సింగ్ ఢిల్లీలోని ఆద్వానీ నివాసానికి వెళ్లారు. మోడీ అనుచరులు మరో విధంగా ఊహించారు. కేంద్రంలో మోడీని ప్రధానిని చేద్దామని, అద్వానీని రాష్ట్రపతిని చేయాలనేదే తమ కోరికగా వారు తెలిపారు. బీజేపీ విధానాలపై తీవ్ర మనస్తాపం చెందిన అద్వానీ ఈ రోజు ఉదయం పార్టీకి, పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీలేదని, అలాంటి పార్టీలో కొనసాగేది లేదని అద్వానీ పేర్కొన్నారు.

అద్వాని అస్త్ర సన్యాసం

        బి. జె. పి. కురువృద్ధుడు ఎల్ . కె. అద్వాని ఆ పార్టీలోని తన అన్ని పదవులకు రాజీనామా చేశారు. బి. జె. పి తరఫున మోడీకి ప్రచార బాధ్యతలు అప్పగించిన తక్షణం ఆయన ఇలా రాజీనామా చేయటం దేశ ప్రజలందరిని ఒకింత విస్మయానికి గురి చేసింది. అద్వాని తన రాజీనామా లేఖలో నేడు వ్యక్తుల సొంత ఎజెండాతో నడుస్తున్న పార్టీయే గాని,నాడు శంకరముఖర్జీ,వాజిపేయి ల నాటి సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న పార్టీ కాదు అని పేర్కొనడం జరిగింది. అంటే ఇది పరోక్షంగా నరేంద్ర మోడీ ని గురించిన వ్యాఖ్యానమనే అనుకోవచ్చా?అయితే 86సం'ల అద్వాని కొత్త నీరు వస్తున్నపుడు పాత నీరు దానికి ఆహ్వా నమ్ పలకాలి అనే సంగతిని విస్మరించారా? అద్వాని 1982లో 2ఎంపి సీట్లు మాత్రమే కలిగి ఉన్న బి. జె.పి ని తర్వాతి కాలంలోతన రధ యాత్ర ద్వారా భారతదేశాన్ని పరిపాలించే స్థాయికి బి. జె.పిని తీసుకెళ్ళిన ఘనుడు. ఆనాడు కేవలం అద్వాని సామర్థ్యం వల్లనే బి. జె. పి పట్టం గట్టినా,వాజిపేయి కి ప్రధాని పదవిని అప్పగించి,తన గౌరవాన్ని మరింతగా పెంచుకుకున్నారు. అదే నరేంద్రమోడి విషయానికొస్తే గుజరాత్ లో   మూడు సార్లు అధికారంలోకి బి. జె. పి ని తీసుకొచ్చిన ఘనత కలిగిన  నేత. గుజరాత్ ను అభివృద్ధి పధం వైపు తీసుకెళుతు ఒక్కసారి దేశ ప్రజలందరి దృష్టి తన వైపు  మళ్లించుకున్న నాయకుడు నరేంద్రమోడి.                                   అయితే ఈనాడు కేవలం గుజరాత్ రాష్ట్ర స్థాయి అభివ్రుది,ఆస్థాయి పరిపాలన దేశాన్ని పరిపాలించే సామర్ధ్యానికి సరిపోవు అనేది అద్వాని అభిప్రాయమ్. అంతేకాదు గోద్రా అల్లర్ల నేపధ్యంలో నరేంద్రమోడి మీద ఉన్న మతతత్వ అభిప్రాయం,పార్టీకి మిగతా మతాల వారి ఓటు బాంక్ ను దూరం చేస్తుందనేది కూడా. అలాఐతే నాడు బాబ్రి మసీదు విషయంలో ఎల్. కె అద్వాని పట్ల కూడా దేశంలోని ఒక వర్గం ప్రజలకు ఇలాంటి అభిప్రాయమే ఉండవచ్చును కదా!పైగా 2002 నాటి గోద్రా అల్లర్ల విషయంలో నరేంద్ర మోడీ ని సమర్ధించింది,ఈ ఎల్కెఅద్వానీయె అన్న విషయం జగమెరిగిన సత్యం. అసలు బి. జె. పి అంటేనే మతతత్వ పార్టీ. అలాంటపుడు ఇపుడు కొత్తగా మోడీ వల్ల పార్టీకి జరిగే నష్టం ఏమిటి ?           ఇహ సామర్థ్యం విషయానికి వస్తే కార్గిల్ మరకలు,చిన్నరాష్ట్రాలు  తద్వారా మావోఇష్టుల మరకలు బిజె.పి కి ఎటూ ఉండనే ఉన్నాయి,ఏది ఏమైనా నేడు బిజె.పి ని అనుకోని సమస్యలోకి నెట్టి,చేజేతులా నష్టాన్న్ని తెచ్చిపెట్టిన వాడుగా అద్వాని మిగిలిపోనున్నారా?      

కిరణ్, బాబుల రాజకీయకుట్రలు

        వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యకురాలు విజయమ్మ నగరంలోని అంబేద్కర్ విగ్రహం నుండి అసెంబ్లీ వరకు పార్టీ ఎమ్మేల్యేలతో కలిసి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ...''చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి లది రాజకీయ కుట్ర అని, రాష్ట్ర ప్రజలందరికి తెలుసు. అప్పుడేమో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో కలిపినా తర్వాత అవిశ్వాసం పెట్టిన చంద్రబాబు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేలపై వేటు పడిన తర్వాత అవిశ్వాసం పెట్టాలనుకుంటున్నారు'' అని విజయమ్మ విమర్శించారు. వీరిద్దరి రాజకీయ కుట్రలకు ఇంతకన్నా నిదర్శనం మరొకటి లేదని,15 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయటం సరికాదని విజయమ్మ అన్నారు.

బీజేపీకి అద్వానీ రాజీనామా

      భారతీయ జనతా పార్టీలో సంక్షోభం ముదిరినట్లే కనిపిస్తోంది. పార్టీ పదవులకు ఆ పార్టీ అగ్రనేత ఎల్.కే అద్వానీ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. గత కొద్ది కాలంగా భారతీయ జనతా పార్టీ పని తీరును తాను జీర్ణించుకోలేకపోతున్నానని ఎల్.కే అద్వానీ తన లేఖలో పేర్కొన్నారు. ఇటీవల కాలంలో చాలా మంది పార్టీలో వ్యక్తిగత అజెండాతో పనిచేస్తున్నారని, సిద్దాంతాలకు అనుగుణంగా పార్టీ ఎక్కువకాలం పనిచేస్తుందని అనుకోవడంలేదని.. సిద్దాంతాలకు కట్టుబడని పార్టీలో తాను కొనసాగలేనని ఆయన తనలేఖలో పేర్కొన్నారు.   తన మాట కాదని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని బీజేపీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమించడంపై భంగపడ్డ అద్వానీ మనస్తాపం చెంది, పార్టీకి, పదవులకు రాజీనామా చేసినట్లు సమాచారం. దీనికి తోడు ఆర్‌ఎస్‌ఎస్ కూడా ఏక పక్షం నిర్ణయం తీసుకుంటూ మోడీని కన్వీరన్‌గా కాకుండా ఏకంగా ఛైర్మన్‌గా నియమించాలని నాగ్‌పూర్ నుంచి ఆదేశాలు జారీ చేయడంపై కూడా అద్వానీ మనస్తాపం చెందారు. అయితే మోడీ నియామకం అద్వానికి ఇష్టం లేకపోయినా తర్వాత సర్దుకుంటారని బీజేపీ నేతలు భావించారు తప్ప, రాజీనామా చేస్తారని ఎవరూ అనుకోలేదు.  

బ్రాహ్మణయ్య మృతికి అసెంబ్లీ సంతాపం

        ఇటీవల మృతి చెందిన టిడిపి ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్యకు శాసనసభ సంతాపం ప్రకటించింది. అంబటి బ్రాహ్మణయ్య మరణంపై జరిగిన సంతాపసభలో చంద్రబాబు మాట్లాడి నివాళి అర్పించారు. నీతి, నిజాయితీకి నిలువుటద్దం ఎమ్మెల్యే అంబటి బ్రహ్మణయ్య అని అన్నారు. బ్రహ్మణయ్య విలువలతో కూడిన రాజకీయం చేశారని కొనియాడారు. బ్రహ్మణయ్య విద్యారంగానికి ఎనలేని కృషి చేశారన్నారు. పులిగడ్డ వంతెనకు బ్రహ్మణయ్య పేరుపెట్టాలని, అవనిగడ్డలో ఆయన విగ్రహం పెట్టాలని చంద్రబాబు సూచించారు.   ఎమ్మెల్యే అంబటి బ్రహ్మణయ్య సేవలు ఎనలేనివి అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొనియాడారు. రైతులు, పేదల సమస్యలపై బ్రహ్మణయ్య రాజీలేని పోరాటం చేశారని చెప్పారు. అనంతరం స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు.

దగ్గుబాటికి సుబ్బరామిరెడ్డి లీగల్ నోటీస్ లు

        విశాఖ ఎంపీ సీటు వివాదం కొత్త మలుపు తిరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు టి.సుబ్బరామిరెడ్డి లీగల్ నోటీసులు పంపించారు. దగ్గుబాటి తనపై ఇటీవల చేసిన ఆరోపణలు నిరూపించకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు ఎదుర్కొనాల్సి వస్తుందని 12 అంశాలతో కూడి నోటీసును సుబ్బరామిరెడ్డి పంపారు. అయితే తనకు సుబ్బరామిరెడ్డి నుండి ఎలాంటి నోటీసులు అందలేదని దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. విశాఖ ఎంపీ సీటుకోసం సుబ్బరామిరెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దానికితోడు పురంధేశ్వరిని నరసారావుపేట వెళ్లాలని, ఆమెను కాంగ్రెస్ లోకి తెచ్చింది తానేనని ఆయన అన్నారు. దీంతో విభేదించిన దగ్గుబాటి అసలు సుబ్బరామిరెడ్డి చరిత్రం ఏంటి ? నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో సిమెంటు అమ్ముకున్న కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్లాడు అని ఆరోపించారు. దీంతో సుబ్బరామిరెడ్డి దగ్గుబాటికి నోటీసులు పంపారు.

కెసిఆర్ పార్టీలో 'ఆత్మహత్యల' పరకాయప్రవేశం !!

    మహాభారతం చదువుకున్నవాళ్ళకు "ముసలం'' అనే మాట తెలిసి ఉంటుంది. "యాదవకులంలో ముసలం'' అన్న పదం అదే! అలాగే, తెలుగుజాతిని విచ్చిన్నం చేయడానికి, తద్వారా తన రాజకీయ నిరుద్యోగానికి ఒక పరిష్కారంగా తెలంగాణలో తిష్ఠవేసిన కోస్తాంధ్రుడు "బొబ్బిలిదొర''గా పలువురు చెప్పుకునే కల్వకుంట్ల చంద్రశేఖర రావు టి.ఆర్.ఎస్. అనే పార్టీనొకదాన్ని స్థాపించుకున్నది లగాయతూ తోటి తెలుగు వారందరినీ కలిపి "సీమాంధ్ర దోపిడీదారులు''గా ప్రకటించి విద్వేష ప్రచారం ప్రారంభించాడు. అది మొదలు, కొంతమంది యువకుల ఆత్మహత్యలను ప్రోత్సహిస్తూ వచ్చాడు. ఫలితంగా "సీమాంధ్రులను తెలంగాణా ఆంధ్రుల మధ్యనుంచి వెళ్లగొట్టి, వారి భూముల్ని, వారి ఇళ్ళను, వారి సంస్థలను మనం స్వాధీనం చేసుకోవడంద్వారా ఉద్యోగాలన్నీ మనకే దక్కుతా''యన్న ప్రచారంద్వారా స్థానిక యువకుల్లో భ్రమలు, ఆశలు పురిగొల్పాడు. ఈ "పురి'' కొందరు తెలంగాణా యువకులపాటి టి.ఆర్.ఎస్. నాయకుడు కెసిఆర్ విధించిన 'ఉరి'గా మారి, రకరకాల పేరిట ఆత్మహత్యల్ని ప్రోత్సహించింది! చివరికి ఈ "ప్రోత్సాహం'' కెసిఆర్ పార్టీ నిర్మాణ తీరుతెన్నుల పట్ల ఏ కరీంనగర్ జిల్లా తనదేనని కెసిఆర్ భ్రమిస్తున్నాడో సరిగ్గా ఆ జిల్లాలోనే అంతర్గత కుమ్ములాటల గురించి విన్నవించుకోదలచిన ప్రధాన కార్యదర్శి, జిల్లా యువజన విభాగం నాయకుడైన గుండా నాగరాజు ఆత్మహత్యకు దారితీసింది. తోటి తెలుగువారిపై కెసిఆర్ ప్రారంభించిన విద్వేష ప్రచారంలో మొదలైన ఆత్మహత్యలు కెసిఆర్ పార్టీలోకే ప్రవేశించక తప్పలేదు! నాగరాజు ఆత్మహత్య పార్టీలోని కుమ్ములాటల గురించిన తన విజ్ఞాపనను కెసిఆర్ పట్టించుకోనందుకే గాక, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన తనను "మంథని'' శిక్షణా తరగతుల సభావేదికపైకి సహితం కెసిఆర్ ఆహ్వానించక పోవడంతో తీవ్రంగా కలతచెందిన నాగరాజు సభావేదిక సమీపంలోనే పురుగుమందు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆస్పత్రికి తీసుకువెళ్లినా బతికించడం సాధ్యపడలేదు. ఇతర కార్యకర్తలయినా ఆస్పత్రికి వెళ్ళి నాగరాజు మృతికి కుటుంబాన్ని కలుసుకొని సంతాపం తెలియజేసివచ్చారు గాని, కెసిఆర్ ఆ ఛాయలకు కూడా వెళ్ళకుండా, సరాసరి హైదరాబాద్ కు ఉడాయించడం అందరినీ ఆశ్చర్యపరిచిందని కొన్ని పత్రికలు రాశాయి. నాగరాజు మృతి వార్తను అన్ని పత్రికలూ ఒకలా రాయకుండా ప్రస్తుతపు "ఉద్రిక్త వాతావరణం''లో అగ్నికి ఆజ్యం పోయడం ఎందుకని భావించి, సెంటిమెంటు పేరిట నాగరాజు తెలంగాణా కోసం బెంగపడి ఆత్మహత్య చేసుకున్నట్టు కొన్ని పత్రికలు చిత్రించ జూచాయి. కాగా, తెలంగాణా వాదాన్ని బలపరచడం ద్వారా స్థానికంగా ఓ నాలుగు సీట్లయినా రాకపోతాయా అని భావించి అవకాశవాద రాజకీయాన్ని ఆశ్రయించి, అంతకుముందు తెలంగాణా రైతాంగసాయుధ పోరాటం ద్వారా వివిధ ప్రాంతాల్లో పరాయి పాలనల వల్ల చెల్లాచెదురై ఉన్న తెలుగువారందరినీ ఒక్క రాష్ట్రంగా (విశాలాంధ్ర) ఒక్క గొడుగుక్రింద సమీకరించిన కమ్యూనిస్టుపార్టీ దినపత్రిక "విశాలాంధ్ర'' నాగరాజు ఆత్మహత్య వార్తను యిలా అందించింది: "టి.ఆర్.ఎస్.లో వర్గపోరుకు ఒకరు బలి : కె.సి.ఆర్. సభలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు ఆత్మాహుతి'' : మంథనిలో జరిగిన శిక్షణా తరగతులకు ఆ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్రావు హాజరయ్యారు. అయితే, టి.ఆర్.ఎస్. జిల్లా ప్రధాన కార్యదర్శి గుండా నాగరాజును (29) వేదిక మీదకు ఆహ్వానించకపోవటంతో మనస్థాపం చెందాడు. క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దానిని గమనించిన నాయకులు నాగరాజును వెంటనే కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ నాగరాజు మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మంధని సి.పీ.ఐ. నేత కొవ్వూరి రాజలింగం, పట్టాన కార్యదర్శి సత్యనారాయణ, టిడిపి మంథని మండల అధ్యక్షులు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి రాజ్య, పట్టాన అధ్యక్షులు లక్కాకుల వెంకన్న విలేకరులతో మాట్లాడుతూ నాగరాజు కుటుంబానికి కెసిఆర్ తక్షణం రూ.10 లక్షణ ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. నాగరాజు మృతికి కెసిఆర్ పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పార్టీలో ఆయనకు ప్రాధాన్యత తగ్గినా దృష్ట్యా నాగరాజు కలత చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటన కారణంగా మంథనిలో టి.ఆర్.ఎస్. ఫ్లెక్సీలు, తోరణాలను నాగరాజు సహచరులు తొలగించడంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి'' కాగా, "సాక్షి'' పత్రిక కూడా నాగరాజు తెలంగాణా కోసం 12ఏళ్లుగా కష్టపడ్డాడని, కాని ఈరోజు స్టేజీమీదికి ఆయన్ని రానివ్వకపోవటంతో అవమానంతో క్రిమిసంహారకమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి బావ ప్రభాకర్ ఆరోపించారు'' [07-06-20`13] ఇక బొబ్బిలిదొర'' బందీగా ఉన్న 'టి'ఛానల్ ఒక్కటే నాగరాజు తెలంగాణా రాలేదనే ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రకటించడం ఆ ఛానల్ చూస్తున్న కొద్దిమందికి సహజంగానే ఆశ్చర్యం కల్గించలేదు! కాగా గత కొంతకాలంగా జరుగుతున్న విచిత్ర పరిణామాల వెనక రహస్యం ఎవరికీ బోధ పడడంలేదు. ఎందుకంటే, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటాన్ని సజావుగానూ, సమర్థవంతంగానూ, ఆశాజనకంగానూ, పకడ్బందీగానూ, ఆత్మవిశ్వాసంతోనూ నిర్వహించడంలో ఆరితేరిన తెలంగాణా ప్రాంత ప్రజలు ఆత్మహత్యలకు పూర్తిగా వ్యతిరేకం. 1947-53 దాకా సాగిన నాటి సాయుధ పోరాటంలో ఏ ఒక్కరూ ఆత్మహత్య చేసుకోలేదు. కాని ఇప్పుడా పరిస్థితి ఎందుకు, ఎవరివల్ల వచ్చింది? తెలంగాణా యువతలో కొందరిని ఎందుకీ బలహీనత ఆవరించింది? అంతేగాదు, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల (తెలంగాణా, కోస్తాంధ్ర, రాయలసీమ)లో మిగతా రెండు ప్రాంతాలతో పోల్చితే, తెలంగాణలో ఎక్కువ ఆత్మహత్యలు జరగడానికి దారితీసిన పరిస్థితులేవి? ఈ ఆత్మహత్యలు యువతకే కట్టుబడకుండా తెలంగాణాలోని రైతులు, వ్యవసాయ కార్మికులు, బడుగు, బలహీనవర్గాల కుటుంబాల వరకూ వ్యాపించిపోవటానికి కారణం తెలంగాణా వాదమా లేక రాజకీయ, సామాజిక, ఆర్థిక అసమానతలూ ప్రధాన కారణమా? ఈ ప్రశ్నకు సాధికారికంగా సమాధానం చెప్పుకోకుండా ప్రజాసమస్యలను విశ్లేషించుకోలెము.   "పుట్టినబిడ్డ బారెడ''ని ఓ సామెత! అలాగే తన స్వార్థరాజకీయం కోసం "తెలంగాణా రాష్ట్రం ఇదిగో నేడో, రేపో, ఎల్లుండో'' అంటూ తెలంగాణా ప్రజల్ని మోసపుచ్చుతూ ఇప్పటికి కనీసం ఎంతలేదన్న డజనుసార్లు "ఉద్యమాన్ని'' వాయిదా వేసుకున్నాడు కెసిఆర్. ఈసారి 'వాయిదా' సరాసరి నవంబర్ కు నెట్టి, 2014 ఎన్నికల లక్ష్యం - "ఓట్లు, సీట్లేగాని'', తెలంగాణా కాదంటున్నాడిప్పుడు! అయితే మరి రాష్ట్రాన్ని ఎలా సాధిస్తాడట? కాంగ్రెస్ లోని టి.ఆర్.ఎస్.ను విలీనం చేయడంద్వారా, తాను ముఖ్యమంత్రి కావడం ద్వారానట! కాని ఈ మధ్యలో మరో 'చిట్కా' వదిలాడు. ఇది కూడా 'వాయిదాల'కు సంబంధించిందే! తెలంగాణా వస్తే గిస్తే 'దళితుడ్ని' ముఖ్యమంత్రిని చేస్తానని ఏడాదిన్నర నాడు ప్రకటించి, మళ్ళా ఇన్నాళ్ళూ ఆ వూసెత్తకుండా 2014 ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మరోసారి (02-0602013) ఈసారి "దళితుడే ముఖ్యమంత్రి'' అని నినదించాడు. కాని ఢిల్లీలో ఆంధ్ర భవన్ లోని దళిత అధికారిమీద 'దొర'తనం చేయిచేసుకుని గాయపరిచిన తరువాత 'నష్టపరిహారం'గా ఎన్నికలలో టి.ఆర్.ఎస్. కు ఓట్ల కోసం "దళితుడే ముఖ్యమంత్రి'' అన్న పొలికేకను వినిపించాడు! కానీ ఇతని రాజకీయ "చదరంగపు'' ఆటను, కుట్రను తెలంగాణలో దశాబ్దాల తరబడిగా 'దొర'ల, జాగిర్దార్ల,దేశ్ ముఖ్ ల దోపిడీ దౌర్జన్యాలను అనుభవించి కునారిల్లిపోయిన గిరిజన, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తరగతులు, తదితర బడుగువర్గాలన్నీ పసికట్టేశారు! ఎవరోకాదు, టి.ఆర్.ఎస్. ప్రధాన దళిత కార్యదర్శి ఎలా టి.ఆర్.ఎస్. నాయకత్వం బేరసారాల ద్వారా వందలకోట్లు వసూలు చేశారో బహిరంగంగా ఆరోపించి, ఆ నాయకత్వం ఎలా దళిత వ్యతిరేక నాయకత్వామో ఆరోపిస్తూ ప్రకటన విడుదల చేశాడు. తెలంగాణలో జరుగుతున్నా ఆత్మహత్యల స్వరూపస్వభావాల గురించి, ఆత్మహత్యలకు కారణమైన సశాస్త్రీయ కారణాల గురించీ సాయీమనీష్ (bold) అనే పరిశోధకుడు జరిపిన సర్వే ఫలితాలను, వాటి విశేషాలనూ ఇటీవల ఒక నివేదిక రూపొందించాడు. ఆ నివేదనను భారతదేశ మ్యాగజైన్ జర్నలిజంలో, ప్రత్యేక పరిశోధక నివేదికల రూపకల్పనలో, అవినీతిని, అక్రమాలను వెల్లడించడంలో సాధికారతను, విశ్వసనీయతను దేశంలోనేగాక, విదేశాలలోనూ పొందిన తేజ్ పాల "తెహల్కా'' (2013, మార్చి 9న) ప్రచురించింది. ఆ ప్రత్యేక పరిశోధనలో సాయీమనీష్ తెలంగాణలో ఆత్మహత్యలకు కారణాలను విపులంగా వివరించాడు : "స్వేచ్చా టిబెట్, (ఫ్రీ-టిబెట్) పేరిట టిబెటనలు ఆత్మాహుతి చేసుకుంటుంటారు. సరిగ్గా తెలంగాణాలో ఆత్మహత్యల దృశ్యం కూడా అలాంటిదే. కాని, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ ఒక్కటే తెలంగాణాలో జరిగే ఆత్మహత్యలకు కారణం కాదు. అదే అసలు కథ కాదు'' అని చెబుతూ ప్రాంతంలో ఆత్మహత్యల పర్వం వెనక దాగిఉన్న అసలు కారణాల్ని మనీష్ నివేదిక యిలా వెల్లడిస్తోంది.   "2009 నవంబర్ కు 2012 జనవరి నెల మధ్య కాలంలో తెలంగాణలో జరిగిన ఆత్మహత్యల సంఖ్య 849. ఈ ఆత్మహత్యల్లో కొన్ని తెలంగాణా రాష్ట్రం సమస్యపై జరిగినవైతే, వాటిలో పెక్కు ఆత్మహత్యలు నానాటికీ తీసికట్టు అవుతున్న దారుణ సాంఘిక-ఆర్థిక పరిస్థితుల మూలంగా జరిగాయి. దుర్భరదారిద్ర్యం, రుణాలు చెల్లించలేని పరిస్థితులు, వ్యవసాయరంగ సంక్షోభం, ఉద్యోగావకాశాలు సన్నగిల్లిపోవటం, ప్రత్యేకరాష్ట్రం ఏర్పడకపోతే తెలంగాణా ప్రజలకు యిక భవిష్యత్తే లేదన్న నిరంతర రాజకీయ ప్రచార మత్తు ఫలితంగానూ - తెలంగాణాలో చేనేత పనివారు, రైతులు, విద్యార్థులు ఆత్మహత్యల వైపునకు నెట్టబడ్డారు. ఇలా ఒక వైపున అమూల్యమైన జీవితాలు కొడిగట్టి పోతూండగా మరొక వైపున ఆంధ్రప్రదేశ్ లో పరస్పరం దుమ్మెత్తిపోసుకునే రాజకీయ ప్రహసనం యదేచ్చగా సాగిపోతోంది. ఇక తెలంగాణా ఉద్యమంలో అట్టడుగు బలహీన వర్గాల ఆత్మహర్యాలు మానవుడి కనీసపు ఆత్మగౌరవానికి కూడా నోచుకోని పరిస్థితులలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకా స్పష్టంగా, వాస్తవం చెప్పాలంటే తెలంగాణా పేరిట ఆత్మహత్యలు చేసుకున్నవారిలో దాదాపు అందరూ షెడ్యూల్డ్ కులాలు (ఎస్.సి.) షెడ్యూల్డ్ తరగతులకు (ఎస్.టి.) లేదా వెనుకబడిన తరగతులకు (బి.సి.లు)చెందినవారేగాని, తెలంగాణా రాష్ట్రసమితి నాయకుడు, వెలమ కులానికి చెందిన కె.సి.ఆర్. కులంనుంచి ఒక్కడంటే ఒక్కడూ ఆత్మహత్య చేసుకున్నట్టు ఎక్కడా నమోదు కాలేదని ఈ సందర్భంగా గుర్తించాలి ... ఒక వైపున ఈ ఆత్మహత్యల్ని రాజకీయ సమస్యకు ఉద్రేకపూరిత స్పందనలుగా ప్రచారం చేస్తూండగా, రాష్ట్రంలోని రాజకీయవేత్తలు ఇంకొక వైపున నిరుద్యోగం, అనంతమైన రుణభారం లాంటి ప్రజాసమస్యలను బాపకిందకు తోసేసి, వ్యక్తుల దారుణ విషాద ఘటనలకు ప్రాధాన్యమిచ్చి ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు .... అంతేగాదు, మనీష్ తన నివేదికలో యింకా యిలా తెలియజేశాడు : "1996 నుంచి 2007 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఆత్మహత్యల్లో మూడింట రెండు వంతులు తెలంగాణాలోనే నమోదయ్యాయి. శ్రీకృష్ణ కమిటీ నివేదిక కూడా తెలంగాణాలో దుర్భిక్ష పరిస్థితులవల్లం కొత్తరకం పత్తివిత్తనాలు విఫలమవటంవల్ల, 2004 మే నుంచి 2005 నవంబర్ మధ్యకాలంలో చేనేత పనివారు జీవనభృతికి దూరం కావడంవల్ల - మొత్తం రాష్ట్రంలో జరిగిన 1068 ఆత్మహత్యల్లో తెలంగాణాలో నమోదైనవి 663 ఆత్మహత్యలు. ఈ లెక్కన కూడా ప్రాంతాలలోనూ ఒక్కొక్క ప్రాంతంలో పరిస్థితిని విశ్లేషించగా [కోస్తాంధ్రనుంచి ప్రకాశంజిల్లా, తెలంగాణా నుంచి మెదక్ జిల్లా, రాయలసీమలో అనంతపురం జిల్లా], ఎక్కువ ఆత్మహత్యలు కోస్తాంధ్ర, రాయలసీమల్లోని అగ్రకులాల్లో నమోదుకాగా, తెలంగాణాలో మాత్రం ఈ ఆత్మహత్యలు అగ్రకులాలు, షెడ్యూల్డ్ కులాలు, తదితర వనుకబడినవర్గాల మధ్య నమోదదయ్యాయి. తెలంగాణాలో దళితులు, వెనుకబడిన కులాలలో ఆత్మహత్యలు తరచుగా సర్వసాధారణమయ్యాయి. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రోద్యమంలో 2009-10 సంవత్సరాల మధ్యన, 2009 నవంబర్, 2010 ఫిబ్రవరి మధ్యకాలంలో 313 ఆత్మహత్యలు నమోదుకాగా, వాటిలో 218 ఆత్మహత్యలకు పాల్పడ్డవారు 18-50 సంవత్సరాల మధ్య వయస్సుగల వాళ్ళు. "వీటిలో ఎక్కువ ఆత్మహత్యలు కెసిఆర్, అతని మేనల్లుడు హరీష్ రావు విద్యోశక తరహా అపహాస్యపు ప్రకటనలకు లోనవడం వల్ల జరిగాయి. ఆ ఏడాది నవంబర్ 29న హరీష్ రావు కిరోసిన్ మీద పోసుకున్నాడు కాని నిప్పంటించడానికి అగ్గిపెట్టె దొరక్కపోవటం ఒక అట్టహాసంకాగా, పగిలిన గాజుముక్కతో కోసుకుని చస్తానన్న కెసిఆర్ బెదిరింపు మరొక అపహాస్యపు ఘటన'' అని ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎస్.సింహాద్రి చేప్పార''ని మనీష్ ఉదాహరించారు. అప్పటికే గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టబడ్డ యువకుల్లోనూ ఇతరుల మనస్సుల్లోకి కెసిఆర్, హరీష్ రావుల అపహాస్యపు పనులు ప్రమాదకరమైన సందేశం ఎక్కించినట్టయింది. ఈలాంటి సందేశం ద్వారా తమ బాధలన్నింటికీ పరిష్కారం తెలంగాణా ప్రత్యేక రాష్ట్రమేనన్న అభిప్రాయాన్ని ప్రజలకు పదే పదే గుర్తుచేస్తున్నట్టయింది. ఇలాంటి చర్యల ద్వారానే [ఆత్మహత్యలకు పాల్పడడం ద్వారానే] తమ జీవితాలు సార్థ్యక్యం పొందుతాయనీ, తాము తద్వారా 'హీరోలు'కావడానికి ఇది మంచి అవకాశమని పెక్కుమంది యువకులు భావించారన్న'' ప్రొఫెసర్ సింహాద్రి అభిప్రాయాన్ని శ్రీకృష్ణ కమిటీ కూడా తన నివేదికలో ప్రతిధ్వనించడం గమనార్హం. ఇదంతా కెసిఆర్ వాచాలత్వం, ఉదార ఫలితమని రుజువైంది. కనుకనే ఈలాంటి విస్మయకర దృశ్యాన్ని మనస్తత్వ శాస్త్రజ్ఞులు "మారిలిన్ మన్రో సిండ్రోమ్'' (మానసికస్థితి) అని నామకరణం చేశారనీ తాము అనుకున్న లక్ష్యం నెరవేరక విఫలమైనప్పుడు ఆ బలహీనతతో కొందరు గుడ్డిగా ఆత్మహత్యలకు పాల్పడతారనీ మనీష్ నివేదిక తెలిపింది. ఇందుకు ఉదాహరణగా మనీష్ హైదరాబాద్ లోని ఒక స్థానిక రెస్టారెంట్ లో తన విద్యా ఖర్చుల కోసమని పనిచేస్తున్న యాదయ్య అనే అనాథ యువకుడు ఉస్మానియా విద్యార్థీకాడు, ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడూ కాడు. కాని అతను ఆత్మహత్య చేసుకున్నది తెలంగాణా రాష్ట్రం కోసం కాదు, ఆర్థిక బాధలవల్ల ఆ పనిచేశాడు. కాని అతని ఆత్మహత్యను ఓ టి.వి.ఛానల్ 'లైవ్' చూపింది. అది చూసిన వెంటనే నానాబాపతు రాజకీయాలూ యాదయ్య ఆత్మహత్యను తెలంగాణా కోసం జరిగిన ఆత్మహత్యగా ముద్రవేయడానికి తొక్కిసలాడుకొన్నారు. అయితే యాదయ్య వద్ద ఉన్న అనేకమంది ఫోటో జర్నలిస్టులు చెప్పారు : "యాదయ్య చనిపోతూ రక్షించండి, రక్షించండి'' అంటూ కేకలు పెట్టాడనీ, టి.ఆర్.ఎస్. వర్గం చెప్పుకుంటున్నట్టు యాదయ్య నోట "జై! తెలంగాణా'' అన్న నినాదమే వినిపించలేదనీ చెప్పారు! టెలివిజన్ ప్రసారాలు చూసి ఎక్కువమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారనీ, రాజకీయవేత్తలు ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల్ని పొగడ్తలతో ముంచెత్తడం ద్వారా తెలంగాణాలోని విద్యార్థులలో ఆత్మహత్యా ధోరణులను పెంచుతున్నారని హైదరాబాద్ మనస్తత్వశాస్త్ర అధ్యయన సంస్థ శాస్త్రవేత్త డయానా మాంటిరొ ఆరోపించారు. అందుకే భూస్వామ్య వ్యవస్థ తాలూకు మనస్తత్వాలూ, నిరంతర సమస్యలూ చింత చచ్చినా పులుపు చావదన్నట్టు అంతతేలిగ్గా, త్వరగా పోవని మనీష్ వ్యాఖ్యానించాడు! అన్నివందలమంది ఆత్మహత్యలకు ప్రోత్సాహకుడు, కారకుడయిన సీమాంధ్ర "బొబ్బిలిదొర'' కెసిఆర్ దివంగతులయిన యువకుల కుటుంబాల ధర్మాగ్రహానికి అర్హుడు కాక తప్పదు!

15 మంది ఎమ్మెల్యే లపై అనర్హత వేటు

శాసన సభలో అవిశ్వాసం సంధర్బంగా విప్ దిక్కరించిన 15 మంది ఎమ్మెల్యే లపై స్పీకర్ అనర్హత వేటు వేశారు.   అనర్హులుగా ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు: బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి - దర్శి మద్దాల రాజేష్ - చింతలపూడి ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి -కాకినాడ గొట్టిపాటి రవి- అద్దంకి సుజయ కృష్ణ రంగారావు - బొబ్బిలి పేర్ని నాని - మచిలీపట్నం ఆళ్ల నాని - ఏలూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - పుంగనూరు జోగి రమేష్ - పెడన అనర్హులుగా ప్రకటించిన టిడిపి ఎమ్మెల్యేలు: ప్రవీణ్ కుమార్ రెడ్డి - తంబళ్లపల్లి కొడాలి నాని - గుడివాడ తానేటి వనిత - గోపాలపురం అమర్నాథ్ రెడ్డి - పలమనేరు వై.బాలనాగిరెడ్డి - మంత్రాలయం సాయిరాజ్ - ఇచ్చాపురం

సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ బదిలీ కాలేదా!

        సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ బదిలీ అయ్యారని వార్తలు వస్తున్న నేపధ్యంలో..తనకు బదిలీ ఉత్తర్వులు ఇంతవరకు అందలేదని డైరెక్టర్ లక్ష్మీనారాయణ వెల్లడించడంతో, ఇప్పుడు ఈ విషయం ఆసక్తికరంగా మారింది. జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అసలు తనకు బదిలీ ఉత్తర్వులు అందలేదని..మహారాష్ట్రలో పోస్టింగ్ ఇచ్చిన విషయం తనకు మీడియాలో వచ్చిన వార్తలు చూసే తెలిసిందని అన్నారు. సీబీఐ బలమయిన వ్యవస్థ అని, తన బదిలీ మూలంగా కేసుల మీద ఎలాంటి ప్రభావం ఉండదని జేడీ అన్నారు. న్యాయస్థానం అనుమతి ఇస్తే మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని అన్నారు. అయితే ఇప్పటివరకు బదిలీ ఉత్తర్వులు అందలేదని అంటున్నారంటే డిల్లీలో ఉత్తర్వులను నిలిపివేశారని అనుకోవాలా?లేక ఉత్తర్వులు అసలు ఇవ్వలేదనుకోవాలా?

అమెరికాలో తుపాకీ కి మళ్లీ 6 బలి

        అమెరికాలో మళ్లీ కాల్పులు జరిగాయి. కాలిఫోర్నియాలోని సాంటా మోనికాలో ఉన్న కళాశాల లైబ్రరీలోకి సాయుధుడయిన అగంతకుడు నల్లటి దుస్తులు ధరించి వచ్చి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా అనేకమంది గాయపడ్డారు. పోలీసులు సమాచారం తెలుసుకుని వచ్చి జరిపిన కాల్పుల్లో అగంతకుడు మరణించాడు. అయితే హతుడికి సంబంధించిన వివరాలు వెల్లడికాలేదు. అమెరికాలో తుపాకీ సంస్కృతి మీద భారీ ఎత్తున చర్చ జరుగుతుండగానే వరసగా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కాల్పులు జరిగిన అన్ని సంఘటనల్లో ఆగంతకులు సైకోలు అన్న విషయం తేలుతోంది. ఈ సైకోల మూలంగా అమెరికాలో భద్రత ఇబ్బందిగా మారుతోంది. ఎన్ని భద్రతా చర్యలు చేపట్టినా ఎవరు ? ఎలాంటి వారు ? అన్నది గుర్తించడం చాలా కష్టంగా మారుతుంది. తాజాగా కాల్పులకు పాల్పడిన నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ప్రతిఘటించడంతో అతన్ని కాల్చి చంపామని కాలిఫోర్నియాకు చెందిన పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.

సీబీఐ చేతిలో ధర్మాన ప్రసాదం

  కర్ణుడికి కవచ కుండలాలు రక్షగా నిలిచినట్లు ఇంతవరకు ధర్మానకు మంత్రి హోదా రక్షగా నిలిచింది. కానీ, అది కాస్తా ఇప్పుడు తొలగిపోవడంతో ఆయన ఇప్పుడు ఒంటరిగా నిస్సహాయంగా సీబీఐకి దొరికిపోయారు. నిన్న సీబీఐ ఆయన జ్యుడిషియల్ రిమాండ్ కోరుతూ కోర్టులో ఒక మెమో దాఖలు చేసింది. దానిని విచారించేందుకు కోర్టు ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. వాన్ పిక్ భూముల వ్యవహారంలో ఆయన అక్రమాలకూ పాల్పడ్డారని సీబీఐ ఆయనపై అభియోగం నమోదుచేసింది.   భూముల బదిలీలు(అక్రమాలు) జరిగిన మాట వాస్తవమని ఆయన ఒప్పుకొంటున్నపటికీ, అది కేవలం తన ఒక్కడి నిర్ణయమే కాదని, క్యాబినెట్ సమిష్టి నిర్ణయమని, అందువల్ల తానూ ఈ విషయంలో నిర్దోషినని ఆయన వాదన. అందుకు ఆయనకు కొందరు మంత్రులు కూడా వత్తాసు పలికినప్పటికీ, తరువాత ఆయన వాదన వెనుకున్న లా పాయింటు అర్ధం అవడంతో క్రమంగా అందరూ ఆయనకి దూరం జరిగారు. ఒకవేళ కోర్టు ఆయన వాదన సరయినదేనని అంగీకరిస్తే, అప్పుడు వైయస్సార్ మంత్రి వర్గంలో ఉన్న మంత్రులందరూ కూడా కటకటాల వెనక్కి వెళ్ళకతప్పదు.   అదిగాక, అవినీతి ఆరోపణలతో మంత్రి వర్గంలోంచి తప్పుకొన్న అటువంటి వారికోసం మాట్లాడే తీరిక, శ్రద్ధ, అవసరం గానీ ఎవరికీ లేవు గనుక ధర్మాన ఒంటరిగా మిగిలిపోక తప్పదు. అందువల్ల ఈ రోజు కాకపోయినా రేపయినా ఆయన కూడా చంచల్ గూడాలోకి ప్రవేశం తప్పకపోవచ్చును.