కెసిఆర్ పార్టీలో 'ఆత్మహత్యల' పరకాయప్రవేశం !!
మహాభారతం చదువుకున్నవాళ్ళకు "ముసలం'' అనే మాట తెలిసి ఉంటుంది. "యాదవకులంలో ముసలం'' అన్న పదం అదే! అలాగే, తెలుగుజాతిని విచ్చిన్నం చేయడానికి, తద్వారా తన రాజకీయ నిరుద్యోగానికి ఒక పరిష్కారంగా తెలంగాణలో తిష్ఠవేసిన కోస్తాంధ్రుడు "బొబ్బిలిదొర''గా పలువురు చెప్పుకునే కల్వకుంట్ల చంద్రశేఖర రావు టి.ఆర్.ఎస్. అనే పార్టీనొకదాన్ని స్థాపించుకున్నది లగాయతూ తోటి తెలుగు వారందరినీ కలిపి "సీమాంధ్ర దోపిడీదారులు''గా ప్రకటించి విద్వేష ప్రచారం ప్రారంభించాడు. అది మొదలు, కొంతమంది యువకుల ఆత్మహత్యలను ప్రోత్సహిస్తూ వచ్చాడు. ఫలితంగా "సీమాంధ్రులను తెలంగాణా ఆంధ్రుల మధ్యనుంచి వెళ్లగొట్టి, వారి భూముల్ని, వారి ఇళ్ళను, వారి సంస్థలను మనం స్వాధీనం చేసుకోవడంద్వారా ఉద్యోగాలన్నీ మనకే దక్కుతా''యన్న ప్రచారంద్వారా స్థానిక యువకుల్లో భ్రమలు, ఆశలు పురిగొల్పాడు. ఈ "పురి'' కొందరు తెలంగాణా యువకులపాటి టి.ఆర్.ఎస్. నాయకుడు కెసిఆర్ విధించిన 'ఉరి'గా మారి, రకరకాల పేరిట ఆత్మహత్యల్ని ప్రోత్సహించింది!
చివరికి ఈ "ప్రోత్సాహం'' కెసిఆర్ పార్టీ నిర్మాణ తీరుతెన్నుల పట్ల ఏ కరీంనగర్ జిల్లా తనదేనని కెసిఆర్ భ్రమిస్తున్నాడో సరిగ్గా ఆ జిల్లాలోనే అంతర్గత కుమ్ములాటల గురించి విన్నవించుకోదలచిన ప్రధాన కార్యదర్శి, జిల్లా యువజన విభాగం నాయకుడైన గుండా నాగరాజు ఆత్మహత్యకు దారితీసింది. తోటి తెలుగువారిపై కెసిఆర్ ప్రారంభించిన విద్వేష ప్రచారంలో మొదలైన ఆత్మహత్యలు కెసిఆర్ పార్టీలోకే ప్రవేశించక తప్పలేదు! నాగరాజు ఆత్మహత్య పార్టీలోని కుమ్ములాటల గురించిన తన విజ్ఞాపనను కెసిఆర్ పట్టించుకోనందుకే గాక, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన తనను "మంథని'' శిక్షణా తరగతుల సభావేదికపైకి సహితం కెసిఆర్ ఆహ్వానించక పోవడంతో తీవ్రంగా కలతచెందిన నాగరాజు సభావేదిక సమీపంలోనే పురుగుమందు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆస్పత్రికి తీసుకువెళ్లినా బతికించడం సాధ్యపడలేదు. ఇతర కార్యకర్తలయినా ఆస్పత్రికి వెళ్ళి నాగరాజు మృతికి కుటుంబాన్ని కలుసుకొని సంతాపం తెలియజేసివచ్చారు గాని, కెసిఆర్ ఆ ఛాయలకు కూడా వెళ్ళకుండా, సరాసరి హైదరాబాద్ కు ఉడాయించడం అందరినీ ఆశ్చర్యపరిచిందని కొన్ని పత్రికలు రాశాయి.
నాగరాజు మృతి వార్తను అన్ని పత్రికలూ ఒకలా రాయకుండా ప్రస్తుతపు "ఉద్రిక్త వాతావరణం''లో అగ్నికి ఆజ్యం పోయడం ఎందుకని భావించి, సెంటిమెంటు పేరిట నాగరాజు తెలంగాణా కోసం బెంగపడి ఆత్మహత్య చేసుకున్నట్టు కొన్ని పత్రికలు చిత్రించ జూచాయి. కాగా, తెలంగాణా వాదాన్ని బలపరచడం ద్వారా స్థానికంగా ఓ నాలుగు సీట్లయినా రాకపోతాయా అని భావించి అవకాశవాద రాజకీయాన్ని ఆశ్రయించి, అంతకుముందు తెలంగాణా రైతాంగసాయుధ పోరాటం ద్వారా వివిధ ప్రాంతాల్లో పరాయి పాలనల వల్ల చెల్లాచెదురై ఉన్న తెలుగువారందరినీ ఒక్క రాష్ట్రంగా (విశాలాంధ్ర) ఒక్క గొడుగుక్రింద సమీకరించిన కమ్యూనిస్టుపార్టీ దినపత్రిక "విశాలాంధ్ర'' నాగరాజు ఆత్మహత్య వార్తను యిలా అందించింది:
"టి.ఆర్.ఎస్.లో వర్గపోరుకు ఒకరు బలి : కె.సి.ఆర్. సభలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు ఆత్మాహుతి'' : మంథనిలో జరిగిన శిక్షణా తరగతులకు ఆ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్రావు హాజరయ్యారు. అయితే, టి.ఆర్.ఎస్. జిల్లా ప్రధాన కార్యదర్శి గుండా నాగరాజును (29) వేదిక మీదకు ఆహ్వానించకపోవటంతో మనస్థాపం చెందాడు. క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దానిని గమనించిన నాయకులు నాగరాజును వెంటనే కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ నాగరాజు మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మంధని సి.పీ.ఐ. నేత కొవ్వూరి రాజలింగం, పట్టాన కార్యదర్శి సత్యనారాయణ, టిడిపి మంథని మండల అధ్యక్షులు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి రాజ్య, పట్టాన అధ్యక్షులు లక్కాకుల వెంకన్న విలేకరులతో మాట్లాడుతూ నాగరాజు కుటుంబానికి కెసిఆర్ తక్షణం రూ.10 లక్షణ ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. నాగరాజు మృతికి కెసిఆర్ పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పార్టీలో ఆయనకు ప్రాధాన్యత తగ్గినా దృష్ట్యా నాగరాజు కలత చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటన కారణంగా మంథనిలో టి.ఆర్.ఎస్. ఫ్లెక్సీలు, తోరణాలను నాగరాజు సహచరులు తొలగించడంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి''
కాగా, "సాక్షి'' పత్రిక కూడా నాగరాజు తెలంగాణా కోసం 12ఏళ్లుగా కష్టపడ్డాడని, కాని ఈరోజు స్టేజీమీదికి ఆయన్ని రానివ్వకపోవటంతో అవమానంతో క్రిమిసంహారకమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి బావ ప్రభాకర్ ఆరోపించారు'' [07-06-20`13]
ఇక బొబ్బిలిదొర'' బందీగా ఉన్న 'టి'ఛానల్ ఒక్కటే నాగరాజు తెలంగాణా రాలేదనే ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రకటించడం ఆ ఛానల్ చూస్తున్న కొద్దిమందికి సహజంగానే ఆశ్చర్యం కల్గించలేదు!
కాగా గత కొంతకాలంగా జరుగుతున్న విచిత్ర పరిణామాల వెనక రహస్యం ఎవరికీ బోధ పడడంలేదు. ఎందుకంటే, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటాన్ని సజావుగానూ, సమర్థవంతంగానూ, ఆశాజనకంగానూ, పకడ్బందీగానూ, ఆత్మవిశ్వాసంతోనూ నిర్వహించడంలో ఆరితేరిన తెలంగాణా ప్రాంత ప్రజలు ఆత్మహత్యలకు పూర్తిగా వ్యతిరేకం. 1947-53 దాకా సాగిన నాటి సాయుధ పోరాటంలో ఏ ఒక్కరూ ఆత్మహత్య చేసుకోలేదు. కాని ఇప్పుడా పరిస్థితి ఎందుకు, ఎవరివల్ల వచ్చింది? తెలంగాణా యువతలో కొందరిని ఎందుకీ బలహీనత ఆవరించింది? అంతేగాదు, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల (తెలంగాణా, కోస్తాంధ్ర, రాయలసీమ)లో మిగతా రెండు ప్రాంతాలతో పోల్చితే, తెలంగాణలో ఎక్కువ ఆత్మహత్యలు జరగడానికి దారితీసిన పరిస్థితులేవి? ఈ ఆత్మహత్యలు యువతకే కట్టుబడకుండా తెలంగాణాలోని రైతులు, వ్యవసాయ కార్మికులు, బడుగు, బలహీనవర్గాల కుటుంబాల వరకూ వ్యాపించిపోవటానికి కారణం తెలంగాణా వాదమా లేక రాజకీయ, సామాజిక, ఆర్థిక అసమానతలూ ప్రధాన కారణమా? ఈ ప్రశ్నకు సాధికారికంగా సమాధానం చెప్పుకోకుండా ప్రజాసమస్యలను విశ్లేషించుకోలెము.
"పుట్టినబిడ్డ బారెడ''ని ఓ సామెత! అలాగే తన స్వార్థరాజకీయం కోసం "తెలంగాణా రాష్ట్రం ఇదిగో నేడో, రేపో, ఎల్లుండో'' అంటూ తెలంగాణా ప్రజల్ని మోసపుచ్చుతూ ఇప్పటికి కనీసం ఎంతలేదన్న డజనుసార్లు "ఉద్యమాన్ని'' వాయిదా వేసుకున్నాడు కెసిఆర్. ఈసారి 'వాయిదా' సరాసరి నవంబర్ కు నెట్టి, 2014 ఎన్నికల లక్ష్యం - "ఓట్లు, సీట్లేగాని'', తెలంగాణా కాదంటున్నాడిప్పుడు! అయితే మరి రాష్ట్రాన్ని ఎలా సాధిస్తాడట? కాంగ్రెస్ లోని టి.ఆర్.ఎస్.ను విలీనం చేయడంద్వారా, తాను ముఖ్యమంత్రి కావడం ద్వారానట! కాని ఈ మధ్యలో మరో 'చిట్కా' వదిలాడు. ఇది కూడా 'వాయిదాల'కు సంబంధించిందే! తెలంగాణా వస్తే గిస్తే 'దళితుడ్ని' ముఖ్యమంత్రిని చేస్తానని ఏడాదిన్నర నాడు ప్రకటించి, మళ్ళా ఇన్నాళ్ళూ ఆ వూసెత్తకుండా 2014 ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మరోసారి (02-0602013) ఈసారి "దళితుడే ముఖ్యమంత్రి'' అని నినదించాడు. కాని ఢిల్లీలో ఆంధ్ర భవన్ లోని దళిత అధికారిమీద 'దొర'తనం చేయిచేసుకుని గాయపరిచిన తరువాత 'నష్టపరిహారం'గా ఎన్నికలలో టి.ఆర్.ఎస్. కు ఓట్ల కోసం "దళితుడే ముఖ్యమంత్రి'' అన్న పొలికేకను వినిపించాడు! కానీ ఇతని రాజకీయ "చదరంగపు'' ఆటను, కుట్రను తెలంగాణలో దశాబ్దాల తరబడిగా 'దొర'ల, జాగిర్దార్ల,దేశ్ ముఖ్ ల దోపిడీ దౌర్జన్యాలను అనుభవించి కునారిల్లిపోయిన గిరిజన, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తరగతులు, తదితర బడుగువర్గాలన్నీ పసికట్టేశారు! ఎవరోకాదు, టి.ఆర్.ఎస్. ప్రధాన దళిత కార్యదర్శి ఎలా టి.ఆర్.ఎస్. నాయకత్వం బేరసారాల ద్వారా వందలకోట్లు వసూలు చేశారో బహిరంగంగా ఆరోపించి, ఆ నాయకత్వం ఎలా దళిత వ్యతిరేక నాయకత్వామో ఆరోపిస్తూ ప్రకటన విడుదల చేశాడు.
తెలంగాణలో జరుగుతున్నా ఆత్మహత్యల స్వరూపస్వభావాల గురించి, ఆత్మహత్యలకు కారణమైన సశాస్త్రీయ కారణాల గురించీ సాయీమనీష్ (bold) అనే పరిశోధకుడు జరిపిన సర్వే ఫలితాలను, వాటి విశేషాలనూ ఇటీవల ఒక నివేదిక రూపొందించాడు. ఆ నివేదనను భారతదేశ మ్యాగజైన్ జర్నలిజంలో, ప్రత్యేక పరిశోధక నివేదికల రూపకల్పనలో, అవినీతిని, అక్రమాలను వెల్లడించడంలో సాధికారతను, విశ్వసనీయతను దేశంలోనేగాక, విదేశాలలోనూ పొందిన తేజ్ పాల "తెహల్కా'' (2013, మార్చి 9న) ప్రచురించింది. ఆ ప్రత్యేక పరిశోధనలో సాయీమనీష్ తెలంగాణలో ఆత్మహత్యలకు కారణాలను విపులంగా వివరించాడు : "స్వేచ్చా టిబెట్, (ఫ్రీ-టిబెట్) పేరిట టిబెటనలు ఆత్మాహుతి చేసుకుంటుంటారు. సరిగ్గా తెలంగాణాలో ఆత్మహత్యల దృశ్యం కూడా అలాంటిదే. కాని, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ ఒక్కటే తెలంగాణాలో జరిగే ఆత్మహత్యలకు కారణం కాదు. అదే అసలు కథ కాదు'' అని చెబుతూ ప్రాంతంలో ఆత్మహత్యల పర్వం వెనక దాగిఉన్న అసలు కారణాల్ని మనీష్ నివేదిక యిలా వెల్లడిస్తోంది.
"2009 నవంబర్ కు 2012 జనవరి నెల మధ్య కాలంలో తెలంగాణలో జరిగిన ఆత్మహత్యల సంఖ్య 849. ఈ ఆత్మహత్యల్లో కొన్ని తెలంగాణా రాష్ట్రం సమస్యపై జరిగినవైతే, వాటిలో పెక్కు ఆత్మహత్యలు నానాటికీ తీసికట్టు అవుతున్న దారుణ సాంఘిక-ఆర్థిక పరిస్థితుల మూలంగా జరిగాయి. దుర్భరదారిద్ర్యం, రుణాలు చెల్లించలేని పరిస్థితులు, వ్యవసాయరంగ సంక్షోభం, ఉద్యోగావకాశాలు సన్నగిల్లిపోవటం, ప్రత్యేకరాష్ట్రం ఏర్పడకపోతే తెలంగాణా ప్రజలకు యిక భవిష్యత్తే లేదన్న నిరంతర రాజకీయ ప్రచార మత్తు ఫలితంగానూ - తెలంగాణాలో చేనేత పనివారు, రైతులు, విద్యార్థులు ఆత్మహత్యల వైపునకు నెట్టబడ్డారు. ఇలా ఒక వైపున అమూల్యమైన జీవితాలు కొడిగట్టి పోతూండగా మరొక వైపున ఆంధ్రప్రదేశ్ లో పరస్పరం దుమ్మెత్తిపోసుకునే రాజకీయ ప్రహసనం యదేచ్చగా సాగిపోతోంది. ఇక తెలంగాణా ఉద్యమంలో అట్టడుగు బలహీన వర్గాల ఆత్మహర్యాలు మానవుడి కనీసపు ఆత్మగౌరవానికి కూడా నోచుకోని పరిస్థితులలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకా స్పష్టంగా, వాస్తవం చెప్పాలంటే తెలంగాణా పేరిట ఆత్మహత్యలు చేసుకున్నవారిలో దాదాపు అందరూ షెడ్యూల్డ్ కులాలు (ఎస్.సి.) షెడ్యూల్డ్ తరగతులకు (ఎస్.టి.) లేదా వెనుకబడిన తరగతులకు (బి.సి.లు)చెందినవారేగాని, తెలంగాణా రాష్ట్రసమితి నాయకుడు, వెలమ కులానికి చెందిన కె.సి.ఆర్. కులంనుంచి ఒక్కడంటే ఒక్కడూ ఆత్మహత్య చేసుకున్నట్టు ఎక్కడా నమోదు కాలేదని ఈ సందర్భంగా గుర్తించాలి ... ఒక వైపున ఈ ఆత్మహత్యల్ని రాజకీయ సమస్యకు ఉద్రేకపూరిత స్పందనలుగా ప్రచారం చేస్తూండగా, రాష్ట్రంలోని రాజకీయవేత్తలు ఇంకొక వైపున నిరుద్యోగం, అనంతమైన రుణభారం లాంటి ప్రజాసమస్యలను బాపకిందకు తోసేసి, వ్యక్తుల దారుణ విషాద ఘటనలకు ప్రాధాన్యమిచ్చి ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు ....
అంతేగాదు, మనీష్ తన నివేదికలో యింకా యిలా తెలియజేశాడు : "1996 నుంచి 2007 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఆత్మహత్యల్లో మూడింట రెండు వంతులు తెలంగాణాలోనే నమోదయ్యాయి. శ్రీకృష్ణ కమిటీ నివేదిక కూడా తెలంగాణాలో దుర్భిక్ష పరిస్థితులవల్లం కొత్తరకం పత్తివిత్తనాలు విఫలమవటంవల్ల, 2004 మే నుంచి 2005 నవంబర్ మధ్యకాలంలో చేనేత పనివారు జీవనభృతికి దూరం కావడంవల్ల - మొత్తం రాష్ట్రంలో జరిగిన 1068 ఆత్మహత్యల్లో తెలంగాణాలో నమోదైనవి 663 ఆత్మహత్యలు. ఈ లెక్కన కూడా ప్రాంతాలలోనూ ఒక్కొక్క ప్రాంతంలో పరిస్థితిని విశ్లేషించగా [కోస్తాంధ్రనుంచి ప్రకాశంజిల్లా, తెలంగాణా నుంచి మెదక్ జిల్లా, రాయలసీమలో అనంతపురం జిల్లా], ఎక్కువ ఆత్మహత్యలు కోస్తాంధ్ర, రాయలసీమల్లోని అగ్రకులాల్లో నమోదుకాగా, తెలంగాణాలో మాత్రం ఈ ఆత్మహత్యలు అగ్రకులాలు, షెడ్యూల్డ్ కులాలు, తదితర వనుకబడినవర్గాల మధ్య నమోదదయ్యాయి. తెలంగాణాలో దళితులు, వెనుకబడిన కులాలలో ఆత్మహత్యలు తరచుగా సర్వసాధారణమయ్యాయి. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రోద్యమంలో 2009-10 సంవత్సరాల మధ్యన, 2009 నవంబర్, 2010 ఫిబ్రవరి మధ్యకాలంలో 313 ఆత్మహత్యలు నమోదుకాగా, వాటిలో 218 ఆత్మహత్యలకు పాల్పడ్డవారు 18-50 సంవత్సరాల మధ్య వయస్సుగల వాళ్ళు.
"వీటిలో ఎక్కువ ఆత్మహత్యలు కెసిఆర్, అతని మేనల్లుడు హరీష్ రావు విద్యోశక తరహా అపహాస్యపు ప్రకటనలకు లోనవడం వల్ల జరిగాయి. ఆ ఏడాది నవంబర్ 29న హరీష్ రావు కిరోసిన్ మీద పోసుకున్నాడు కాని నిప్పంటించడానికి అగ్గిపెట్టె దొరక్కపోవటం ఒక అట్టహాసంకాగా, పగిలిన గాజుముక్కతో కోసుకుని చస్తానన్న కెసిఆర్ బెదిరింపు మరొక అపహాస్యపు ఘటన'' అని ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎస్.సింహాద్రి చేప్పార''ని మనీష్ ఉదాహరించారు. అప్పటికే గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టబడ్డ యువకుల్లోనూ ఇతరుల మనస్సుల్లోకి కెసిఆర్, హరీష్ రావుల అపహాస్యపు పనులు ప్రమాదకరమైన సందేశం ఎక్కించినట్టయింది. ఈలాంటి సందేశం ద్వారా తమ బాధలన్నింటికీ పరిష్కారం తెలంగాణా ప్రత్యేక రాష్ట్రమేనన్న అభిప్రాయాన్ని ప్రజలకు పదే పదే గుర్తుచేస్తున్నట్టయింది. ఇలాంటి చర్యల ద్వారానే [ఆత్మహత్యలకు పాల్పడడం ద్వారానే] తమ జీవితాలు సార్థ్యక్యం పొందుతాయనీ, తాము తద్వారా 'హీరోలు'కావడానికి ఇది మంచి అవకాశమని పెక్కుమంది యువకులు భావించారన్న'' ప్రొఫెసర్ సింహాద్రి అభిప్రాయాన్ని శ్రీకృష్ణ కమిటీ కూడా తన నివేదికలో ప్రతిధ్వనించడం గమనార్హం. ఇదంతా కెసిఆర్ వాచాలత్వం, ఉదార ఫలితమని రుజువైంది. కనుకనే ఈలాంటి విస్మయకర దృశ్యాన్ని మనస్తత్వ శాస్త్రజ్ఞులు "మారిలిన్ మన్రో సిండ్రోమ్'' (మానసికస్థితి) అని నామకరణం చేశారనీ తాము అనుకున్న లక్ష్యం నెరవేరక విఫలమైనప్పుడు ఆ బలహీనతతో కొందరు గుడ్డిగా ఆత్మహత్యలకు పాల్పడతారనీ మనీష్ నివేదిక తెలిపింది.
ఇందుకు ఉదాహరణగా మనీష్ హైదరాబాద్ లోని ఒక స్థానిక రెస్టారెంట్ లో తన విద్యా ఖర్చుల కోసమని పనిచేస్తున్న యాదయ్య అనే అనాథ యువకుడు ఉస్మానియా విద్యార్థీకాడు, ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడూ కాడు. కాని అతను ఆత్మహత్య చేసుకున్నది తెలంగాణా రాష్ట్రం కోసం కాదు, ఆర్థిక బాధలవల్ల ఆ పనిచేశాడు. కాని అతని ఆత్మహత్యను ఓ టి.వి.ఛానల్ 'లైవ్' చూపింది. అది చూసిన వెంటనే నానాబాపతు రాజకీయాలూ యాదయ్య ఆత్మహత్యను తెలంగాణా కోసం జరిగిన ఆత్మహత్యగా ముద్రవేయడానికి తొక్కిసలాడుకొన్నారు. అయితే యాదయ్య వద్ద ఉన్న అనేకమంది ఫోటో జర్నలిస్టులు చెప్పారు : "యాదయ్య చనిపోతూ రక్షించండి, రక్షించండి'' అంటూ కేకలు పెట్టాడనీ, టి.ఆర్.ఎస్. వర్గం చెప్పుకుంటున్నట్టు యాదయ్య నోట "జై! తెలంగాణా'' అన్న నినాదమే వినిపించలేదనీ చెప్పారు! టెలివిజన్ ప్రసారాలు చూసి ఎక్కువమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారనీ, రాజకీయవేత్తలు ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల్ని పొగడ్తలతో ముంచెత్తడం ద్వారా తెలంగాణాలోని విద్యార్థులలో ఆత్మహత్యా ధోరణులను పెంచుతున్నారని హైదరాబాద్ మనస్తత్వశాస్త్ర అధ్యయన సంస్థ శాస్త్రవేత్త డయానా మాంటిరొ ఆరోపించారు. అందుకే భూస్వామ్య వ్యవస్థ తాలూకు మనస్తత్వాలూ, నిరంతర సమస్యలూ చింత చచ్చినా పులుపు చావదన్నట్టు అంతతేలిగ్గా, త్వరగా పోవని మనీష్ వ్యాఖ్యానించాడు! అన్నివందలమంది ఆత్మహత్యలకు ప్రోత్సాహకుడు, కారకుడయిన సీమాంధ్ర "బొబ్బిలిదొర'' కెసిఆర్ దివంగతులయిన యువకుల కుటుంబాల ధర్మాగ్రహానికి అర్హుడు కాక తప్పదు!