'శ్రీమంతుడు' చూస్తే చిన్నతనం గుర్తొచ్చింది.. వెంకయ్య

  మహేశ్ బాబు నటించిన సినిమా శ్రీమంతుడు ఇప్పటికే రిలీజ్ అయి హిట్ టాక్ సంపాదించుకుంది. ఈ సినిమా ఒక్క మహేశ్ అభిమానులకే కాదు అటు రాజకీయ నాయకులకు కూడా నచ్చింది. కేంద్రం మంత్రి వెంకయ్యనాయుడికి శ్రీమంతుడు సినిమా బాగా నచ్చిందంట. తెలుగు రాష్ట్రాల ఎంపీల కోసం గుంటూరు టీడీపీ ఎంపీ ఢిల్లీలో ప్రత్యేక షో ఏర్పాటు చేశారు. టీడీపీ, కాంగ్రెస్, వైసీపీలతో పాటు టీఆర్‌ఎస్ ఎంపీలను కూడా ‘శ్రీమంతుడు' ప్రత్యేక షోకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ శ్రీమంతుడు సినిమా తనకు బాగా నచ్చిందని.. సినిమా చూస్తుంటే తనకు తన చిన్నతనం గుర్తొచ్చిందని తెలిపారు. ఈ మధ్యకాలంలో వస్తున్న చిత్రాలలో ఎక్కువగా అశ్లీలత ఎక్కువగా ఉంటుందని.. కానీ శ్రీమంతుడిలో దానికి చోటివ్వకుండా చక్కగా విజ్ఞానం.. వినోదం ఉన్నాయని అన్నారు. ఈ సినిమా ద్వారా కన్నతల్లి, జన్మభూమి, మాతృదేశాన్ని ఎవరూ మరవవద్దు అని చెప్పారని ప్రశంసించారు.

ఏపీ హోదాపై నిలదీసిన చంద్రబాబు

  ఏపీ ప్రత్యేకహోదాపై రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో పరిస్థితి మరీ తీవ్రం తరం కావడంతో ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రమంత్రులతో హోదాపై ఫోన్ లో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీని ప్రత్యేక హోదా విషయంపై నిలదీసినట్టు తెలుస్తోంది. దీంతో అరుణ్ జైట్లీ స్పందించి ప్రత్యేక హోదాపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని.. తుది నిర్ణయానికి వస్తే మీతో మాట్లాడుతామని చెప్పారని తెలుస్తోంది. కాగా వెంకయ్యనాయుడు, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు కూడా చంద్రబాబు ఫోన్ చేసి ప్రత్యేక హోదా గురించి మాట్లాడినట్టు సమాచారం. అయితే ప్రత్యేక హోదా గురించి ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను అర్ధం చేసుకున్నామని.. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని.. ఈ విషయం చర్చించడానికి కొంత సమయం ఇవ్వాలని అమిత్ షా చంద్రబాబుతో అన్నట్టు తెలుస్తోంది.   అంతేకాదు ఏపీ ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీలు కూడా అరణ్ జైట్లీతో భేటీ కాగా రాష్ట్రాన్ని ఆర్ధికంగా ఆదుకుంటామని.. పేరుకు ఏదైనా హోదా కంటే ఎక్కువ ఇస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకొని సాయం చేస్తామని.. పది రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని.. అతి త్వరలో ఏపీకి మరిన్ని ప్రకటనలు ఉంటాయని చెప్పారు జైట్లీ టీడీపీ ఎంపీలకు తెలిపినట్టు సమాచారం.

ఏపీ ప్రత్యేక హోదా.. జయలలిత వల్లే ఇవ్వడంలేదు

  ఏపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి మినహా రాష్ట బంద్ కు చేపట్టారు. మరోవైపు ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు కేంద్రమంత్రులతో సన్నాహాలు చేస్తున్నారు. ఇవన్నీ బానే ఇప్పుడు ప్రత్యేక హోదా పై సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కావాలనే ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదాను ఇవ్వడం లేదని ఆరోపించారు. గతంలో యూపీఏ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు రాష్ట్ర విభజన చేసేప్పుడు ఏపీకి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిందని.. కానీ ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం తాము అధికారంలోకి వస్తే 10 ఏళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని మాటలు చెప్పారని.. కానీ ఇప్పుడు ఇవ్వనని చెప్పడం సబబు కాదని అన్నారు. అంతేకాదు ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వం కనుక ఏపీకీ ప్రత్యేక హోదా ఇస్తే అటు తమిళనాడు కాని.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కాని అంగీకరించరని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి జయ పార్టీ మద్ధతు తప్పనిసరిగా కావల్సిన నేపథ్యంలో ఆమె కోసం ప్రత్యేక హోదా పక్కన పెట్టారని.. కావాలనే ఈ విషయంపై జాప్యం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక చంద్రబాబు అంటే ఎలాగూ మిత్రపక్షం కాబట్టి ఇవ్వకపోయినా ఊరుకుంటారని అందుకే అందుకే కేంద్రం కూడా ఏపీకి ప్రత్యేక హోదా వ్యవహారంపై పట్టించుకోవడం లేదని అన్నారు.

అగ్రిగోల్డ్ డిపాజిటర్లు ఆందోళన పడోద్దు

  అగ్రిగోల్ట్ సంస్థ డిపాజిటర్లకు టోకరా వేసి ఉడకాయించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కుంభకోణానికి బలైన డిపాజిటర్లకు ఏపీ ప్రభుత్వం ఒక తియ్యటి కబురు చెప్పింది. డిపాజిటర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. డిపాజిటర్లకు న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కుంభకోణ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం విచారణ కమిటీని నియమించిన నేపథ్యంలో విచారణ కమిటీ మంగళవారం ఉదయం విజయవాడ క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయింది. ఈ సమావేశంలో అగ్రిగోల్డ్‌ సంస్థ ఆస్తులు రూ.7,000 కోట్లు ఉన్నాయని.. సంస్ధ డిపాజిటర్లలకు రూ. 6,800 కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పారు. దీనిలో భాగంగా సంస్థ ఆస్తులు వేలం వేస్తే 7,000 కోట్లకు పైగా వస్తాయని దీంతో డిపాజిటర్లకు మొత్తాన్ని చెల్లించవచ్చని చెప్పారు. దీనికి చంద్రబాబు కూడా అంగీకరించి సంస్ధ ఆస్తులు అమ్మైనా సరే డిపాజిటర్ల సొమ్ము వచ్చేలా చూడాలని.. బాధితులకు రెండు, మూడు నెలల్లో పరిహారం చెల్లించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ సందర్భంగా నర్సింహమూర్తి మాట్లాడుతూ డిపాజిటర్లు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పారు.. సంస్థకు ఉన్న అప్పుల కంటే ఆస్తుల విలువే ఎక్కువగా ఉన్నాయని.. వచ్చే నెలలోనే సంస్థ ఆస్తులను వేలం ద్వారా విక్రయించి డిపాజిటర్లకు న్యాయం చేస్తామని ఆయన చెప్పారు. కాగా దేశ వ్యాప్తంగా అగ్రిగోల్డ్‌ బాధితులు 32లక్షల మంది ఉండగా ఒక్క ఏపీలోనే 19 లక్షల మంది ఉండటం గమనార్హం.

దానికోసం జగన్ 2కోట్లు ఖర్చుపెట్టారు..

  జేసీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్ పార్టీ ఆధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ధర్నాపై తెలుగుదేశం పార్టీ ఎంపి జేసీ దివాకర్ రెడ్డి విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ధర్నా కోసం రెండు కోట్టు ఖర్చు పెట్టారని.. ధర్నా వల్ల జగన్మోహన్ రెడ్డికి ప్రచారం వచ్చిందేమో కానీ, ఫలితం మాత్రం రాలేదని ఎద్దేవా చేశారు. అంతేకాదు నిరసనలు దీక్షలు గాంధీ కాలంలో చెల్లేవని విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీ.. వైఎస్సార్ పార్టీలు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. కాగా ఈ రోజు ఆంధ్రపదేశ్ లో తిరుపతి మినహా బంద్ చేపడుతున్న నేపథ్యంలో బంద్ ల వల్ల రాష్ట్రానికే నష్టమని.. వాటివల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు.   ఇదిలా ఉండగా లోకసభలో ఏపీకి ప్రత్యేక హోదాపై తక్షణ చర్చ కోసం టిడిపి లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు నోటీసు ఇచ్చింది.

ఇక నుండి చంద్రబాబు అక్కడే..

  సీఎం చంద్రబాబు ఏపీ రాజధానిలో తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేసి అక్కడి నుండే పాలన చేద్దామని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే విజయవాడను తాత్కాలికి కేంద్రంగా ఏర్పాటు చేయడానికి పనులు ముమ్మరం చేస్తున్నారు. వారంలో 5 రోజులు అక్కడే ఉండి పాలనా కార్యక్రమాలు సీఎం చంద్రబాబు గట్టిగా నిర్ణయించుకోవడంతో మిగిలిన అధికార యంత్రాంగం కూడా దీనికి సముఖత చూపి ఆ దిశగా అడుగులు వేసినట్టు తెలుస్తోంది. మరోవైపు సీఎం ఈ నిర్ణయం తీసుకోవడంతో సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు కూడా చంద్రబాబు బాటలో తాను కూడా విజయవాడలోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దీంతో సీఎం చంద్రబాబు పాలనా కార్యక్రమాలు ఇక్కడి నుండే చేసే నేపథ్యంలో హైదరాబాద్ లోని కార్యలయాలు.. ఉద్యోగులను ఇక్కడకు తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు.   అయితే ఉద్యోగులు పనులు చేయడానికి కార్యాలయాలు, ఉండటానికి ఏం వసతులు కావాలి తదితర వివరాలు సేకరించే పనిలో పడ్డారు. దీనిలో భాగంగానే విజయవాడలో ఉన్న అద్దే ఇళ్ల లెక్కలు తీసే పనిలో పడ్డారు అధికారులు. అయితే హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్లాల్సిన ఉద్యోగుల సంఖ్య సుమారు పాతిక వేలు ఉంటుందని అంచనా. అయితే ప్రస్తుతానికి విజయాడలో ఉన్న ప్రభుత్వ కార్యలయాల్లో ఇప్పటికే కొంతమంది అధికారులు ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్ నుండి వెళ్లే ఉద్యోగులకు కావలసిన స్థలం లేకపోవడంతో విజయవాడలోని అద్దె ఇళ్లపై ప్రభుత్వం దృష్టిసారించింది. అంతేకాదు హైదరాబాద్‌ నుంచి వెళ్లేవారికే కాకుండా అవసరమైతే ఏపీలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకి తాత్కాలిక ప్రాతిపదికన అద్దె ఇళ్లు సమకూర్చాలన్నది ప్రభుత్వ ఆలోచన.

సానియా మీర్జాకు జరిమానా

  ఎలాంటి వారైనా నిబంధనలు తప్పినప్పుడు పరిహారం చెల్లించక తప్పదు. అలా నిబంధనలు పాటించక జరిమానా చెల్లించాల్సి వచ్చింది తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా గుర్తింపు పొందిన ప్రముఖ టెన్నిస్ తార సానియా మీర్జా జరిమానా చెల్లించాల్సివచ్చింది. సోమవారం రాత్రి ఆమె జూబ్లిహిల్స్ నుండి వస్తుండగా పోలీసులు ఆమె వాహనాన్ని తనిఖీలు చేశారు. అయితే ఆమె కారు నంబరు ప్లేట్ నిబంధనలకు అనుగుణంగా లేని కారణంగా పోలీసులు రూ. 200 రూపాయలు జరిమానా విధించారు. సాదారణంగా  పోలీసులు విఐపి వాహనాలను చూసిచూడనట్లు వదిలివేస్తారు..కాని సానియా మీర్జా వాహనాన్ని తనిఖీ చేయడమే కాకుండా జరిమానా విధించడం విశేషమే.

ఏపీ.. లక్ష కోట్ల పెట్టుబడి.. 50,000 ఉద్యోగాలు

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్ధికంగా వెనుకబడిన ఏపీ ఇంకా ఎంతో అభివృద్ది సాధించాల్సి ఉంది. దీనిలో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సింగపూర్, జపాన్ దేశాలు మన రాష్ట్రంలో అనేక పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాగా ఇప్పుడు మరో ధనిక దేశమైన దుబాయ్ కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో ఏపీలోని నెల్లూరు లేదా ప్రకాశం జిల్లాలో భారీ పెట్రో రిఫైనరీ, కెమికల్‌ కాంప్లెక్స్‌ లు ఏర్పాటు చేయాలని దుబాయ్ లోని ఓ కంపెనీ ఆసక్తి ఆసక్తి చూపిస్తున్నట్టు అధికారులు తెలుపుతున్నారు. అయితే ముడి చమురు ఎగుమతి, దిగుమతుల కోసం దుబాయ్ కంపెనీ సొంత పోర్టు కూడా కావాలని భావిస్తుండటంతో నెల్లూరు జిల్లాలోని సముద్రతీరానికి దగ్గరలో 3,000 ఎకరాలు కావాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఇప్పటికే అనేక పరిశ్రమల ఏర్పాటుకు అక్కడ భూములు కేటాయించడంతో దానికి మినహాయింపుగా ప్రకాశం జిల్లాలోని భూములను సైతం పరిశీలించాలని కంపెనీని కోరడంతో కంపెనీ కూడా ఇందుకు అంగీకరించింది. ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 50,000 ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. మాములుగా అయితే ఏ రాష్ట్రంలో అయినా కంపెనీ పెట్టాలంటే కంపెనీలు పన్ను రాయితీలతో పాటు భూములను సైతం రాయితీ ధరపై ఇవ్వాలని కోరుతున్నాయి.. కానీ దుబాయ్ కంపెనీ మాత్రం మార్కెట్‌ ధర చెల్లించేందుకు సిద్ధపడినట్టు సమాచారం. దీంతో ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ ప్రాజెక్టుకు స్థలాన్ని.. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈప్రాజెక్ట్ కనుక ఏపీలో అమలైతే దేశంలోనే అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డిఐ) ప్రాజెక్టు అవుతుంది.

తెలంగాణలో భారీ టూరిజం ప్రాజెక్టులు

  రాష్ట్ర విభజన జరిగి ఏడాది అయిపోయినా.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు అభివృద్ధి దిశగా అడుగువేయడానికి సిద్దమైనట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం అన్ని సదుపాయాలు కలిగిన మూడు అత్యంత పెద్ద టూరిజం ప్రాజెక్టులను.. సుమారు రూ. 250 కోట్లుతో కూడిన ఈ ప్రాజెక్టులను నిర్మించడానికి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అవి Heritage and spiritual tourism circuit,  Tribal Tourism  Circuit,  ECO Tourism Cricuit. ఈ మూడు టూరిజం ప్రాజెక్టులకు మహబూబ్ నగర్ జిల్లా మరియు, వరంగల్ జిల్లాలు అనువుగా ఉన్నట్టు తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్(tstdc) గుర్తించింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాజెక్టులు రావడంలో ముఖ్యపాత్ర వహించింది బి.పి ఆచార్య అని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వ పర్యాటక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉన్నఈయన తెలంగాణ టూరిజం ప్రచారం కోసం అనేక దేశాలు కూడా తిరిగారు. బంగారు తెలంగాణ సాధించాలనే ఉద్దేశ్యంతో ఈ టూరిజం ప్రాజెక్టుల విషయంలో చాలా కృషిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది తెలంగాణ టూరిజం ప్రాజెక్టులకు 200 కోట్ల రూపాయలు వరకూ రాగా ఈ ఏడాది అది 300 కోట్ల రూపాయలు సాధించిందని తెలిపారు. హెరిటేజ్ అండ్ స్పిరిట్యుయల్ టూరిజం సర్య్కూట్: ఈ టూరిజం సర్క్యూట్ ని తెలంగాణ రాష్ట్రంలో రెండో పెద్ద నగరమైన వరంగల్ నిర్మించాలని యోచిస్తున్నారు. దీనిలో వరంగల్ జిల్లాలో చాలా ప్రముఖమైన దేవాలయాలు కొలనుపాక, జనగాన్, పాలకుర్తి దేవాలయం, బమ్మెర, ఘనపూర్, మెట్టుగుట్ట, ఏక వీర. ఇనవోలు, భద్రకాళి, పద్మాక్షి పాలంపేట్ దేవాలయాలను కలిపి ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు మొత్తం అయ్యే ఖర్చు రూ. 61.63 కోట్లుగా అంచనా వేశారు. ఇకో టూరిజం: ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం రెండు విభాగాలుగా నిర్మించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో మొదటిగా సోమశీల నది మరియు అక్క మహదేవి కేవ్స్ వరకూ ఒకటిగా.. అక్క మహదేవి గుహలనుండి ఫరహాబాద్, మల్లెలతీర్ధం, మన్ననూర్ ఉమా మహేశ్వరం దేవాలయం కలుపుకొని ఒక సర్యూట్ గా ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం అయ్యే ఖర్చు రూ. 127.27 కోట్లుగా అంచనా వేశారు.     ట్రైబల్ టూరిజం ప్రాజెక్ట్: తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ములుగు, లక్నవరం, మేడారం, తడ్వాయ్, ఏటూరునగరాలను కలుపుకొని నిర్మించాలని చూస్తుంది. కాగా లక్నవరం ఇప్పటికే మంచి టూరిజం ప్లేస్. అక్కడ man made lake with hanging bridge ఉండటంతో మంచి టూరిజం స్పాట్ గా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టుతో ఇంకా మంచి టూరిజం ప్రదేశంగా తీర్చిదిద్దాలని అధికారులు యోచిస్తున్నారు.  ఈ ప్రాజెక్టుకు మొత్తం అయ్యే ఖర్చు రూ. 96.61 కోట్లుగా అంచనా వేశారు.  

పవన్ కళ్యాణ్ అందుకే మౌనంగా ఉన్నారా..!

  ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని మునికోటి ఆత్మహత్య చేసుకోవడం అందరిని కలిచివేసింది. అసలు కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరని చెప్పిన దగ్గరనుండే ఆంధ్రాలో ఆందోళనలు మొదలయ్యాయి. అయితే మునికోటి చేసిన ప్రాణత్యాగానికి ఒక్కసారిగా అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మునికోటి మృతిపట్ట సానుభూతి తెలిపారు. మునికోటి మరణం చాలా బాధను కలిగించింది అని, అతని కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి అని ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. ఈ సమయంలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా ఉండటానికి చాలా ప్రయత్నిస్తున్నానని.. ఎంతో నిగ్రహించుకుంటున్నాను అని అన్నారు.   ఒక రకంగా పవన్ కళ్యాణ్ ఏపీ ప్రత్యేక హోదా గురించి ఎంపీలు ఏం చేస్తున్నారని గట్టిగా విమర్శించిన తరువాతే మన ఎపీ ఎంపీలు కూడా పార్లమెంట్ లో ఏపీ ప్రత్యేక హోదా గురించి అడిగడినట్టు తెలుస్తోంది. అయినా ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పుడు ఏం మాట్లాడలేదు. చాలా మంది నేతలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలి అంటూ ఎంత కోరినా పవన్ కళ్యాణ్ మాత్రం మౌనంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే అభిమానులు, ప్రజలు రెచ్చిపోయే ప్రమాదం ఉందని అందుకే పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారని భావిస్తున్నారు.

తిరుపతి మినహా నేడు ఏపీ బంద్

  ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు బస్సు యాత్రలు చేప్పట్టిన సీపిఐ పార్టీ నేడు ఆంద్రప్రదేశ్ బంద్ నిర్వహిస్తోంది. కాంగ్రెస్, వైకాపాలతో సహా మరికొన్ని ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు కూడా ఈ బంద్ కి మద్దతు తెలుపుతున్నాయి. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ కార్యకర్త మునికోటి ఆత్మహత్య చేసుకొన్నందుకు సంతాపంగా నిన్న తిరుపతిలో బంద్ నిర్వహించారు కనుక నేటి బంద్ నుండి తిరుపతికి మినహాయింపునిచ్చారు. బంద్ ప్రభావంగా రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దానితో దూర ప్రాంతాల నుండి వచ్చిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

NRI టీడీపీ పోరు

  తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు కొత్త రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్రాభివృద్ధికి అహర్నిహలు కష్టపడుతూ.. రాష్ట రాజధాని కోసం.. దానిలో పెట్టుబడుల కోసం చంద్రబాబు నాయుడు చాలా ప్రయత్నిస్తున్నారు. ఈ అభివృద్ధిలో తనవంతు తానుగా సాయం అందించడానికి చంద్రబాబు తనయుడు కూడా బాగానే కష్టపడ్డారు. ఏపీ రాజధానిలో పెట్టుబడుల కొరకు అమెరికా పర్యటన చేసి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని కంపెనీలతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. అయితే ఇప్పుడు నారా లోకేష్ పర్యటన గురించి అందరూ మరిచిపోయినా లోకేశ్ NRI ట్రిప్ తరువాత ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు డా. వేమూరి రవి. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి లోకేశ్ కు ఆంతరంగీకుడిగా ఉన్నట్టు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే లోకేశ్ అమెరికా పర్యటనలో క్రియాశీల పాత్ర పోషించిన ఈయన అక్కడ లోకేశ్ అన్ని కార్యక్రమాలన్నింటిని కో-ఆర్డినేట్ చేశారు. దీనిలో భాగంగానే ఇప్పుడు వేమూరి రవికి కాబినేట్ లో పదవి కట్టబెట్టే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే కేసీఆర్ తనయుడు కేటీఆర్ కూడా అదే సమయంలో అమెరికా పర్యటన చేశారు. ఒక విధంగా చెప్పాలంటే లోకేశ్ కంటే కేటీఆర్ పర్యటనే బాగా సక్సెస్ అయిందనే వార్తలు కూడా వచ్చాయి. అయినప్పటికీ డా. రవికి కేబినేట్ హోదా కలిగిన NRI కో-ఆర్డినేటర్ అనే ఒక పదవిని కట్టబెట్టినట్టు తెలుస్తోంది.   ఇంతవరకూ బానే ఉన్నా అసలు NRI టీడీపీ స్ఠాపించిన దగ్గరనుండి దానికోసం విశ్రాంతి లేకుండా.. కష్టపడిన TANA, NATS ప్రముఖులకు మాత్రం ఇది కాస్త చేదువార్తగానే భావిస్తున్నారు. ఎందుకంటే అప్పట్లో 2007 లో చంద్రబాబు అమెరికా పర్యటనలో కాని లోకేశ్ పర్యటనలో కాని.. మొన్న ఎలక్షన్లలో వాళ్లవంతు సహకారం అందించారు. ముఖ్యంగా జైరాం కోమటి, నాదెళ్ల గంగాధర్, సతీష్ వేమన, రవి మాదాల లాంటి వారికి ఇది శరాగతంగా తగిలింది. రాజకీయంగా ఎలక్షన్స్ లో పోటీ చేయలేని వీళ్లందరికి ఇప్పటికే NRI కోటాలో పార్టీలో ఏమాత్రం సంబంధంలేని ఆనంద్ కూచిబొట్ల కేబినేట్ పదవిలో ఉండటంతో అప్పట్లో పెదవి విరిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు డా. రవికి కూడా కాబినేట్ హోదాలో పదవిని ఇవ్వడంపై కూడా అసంతృప్తి చెందే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ వార్తను వారు ఏ విధంగా తీసుకొని ముందుకెళతారో చూడాలి.

చంద్రబాబును ఇరుకునపెడుతున్నారా!

  రాష్ట్ర విభజన జరిగి ఏపీ రాష్ట్రం ఆర్ధికంగా వెనుకబడటంతో ఎలాగైనా దానిని అభివృద్ధి చేయాలనే ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు పార్టీ నేతలే తలనొప్పిగా తయారయ్యారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చంద్రబాబుకు అండగా నిలిచి రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకోవాల్సింది పోయి.. వారు చేసే వ్యాఖ్యలవల్ల చంద్రబాబును ఇరుకునపెడుతున్నారు. మొన్నటికి మొన్న గోదావరి పుష్కరాల వల్ల జరిగిన తొక్కిసలాటలో చాలా మంది ప్రాణాలు కోల్పారు. ఇదే అదనుచూసుకొని ప్రతిపక్షనేతలు అందుకు కారణం చంద్రబాబు అంటూ విమర్శల మీద విమర్శలు చేశారు. దీనిమీద నేషనల్ మీడియాలో చర్చ జరిగినప్పుడు పార్టీ నేతలు సరైన సమాధానం కూడా చెప్పలేక చెమటలు కక్కారు. దీంతో చంద్రబాబు నేతలమీద అసంతృప్తి చెంది ఇక నుండి ఆంగ్ల మీడియాతో మాట్లాడే బాధ్యతను గల్లా జయదేవ్ కు అప్పగించారు.   ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి కూడా అదే జరుగుతుంది. ఒకవైపు కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. దీంతో ఎప్పటినుండో ఆశలు పెట్టుకొని ఎదురుచూస్తున్న ఏపీ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లినంత పనిచేసింది. అయితే కేంద్రం చెప్పినా కూడా చంద్రబాబు సహా పలువురు ప్రత్యేకహోదా గురించి మళ్లీ ప్రయత్నిస్తామని.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేంతవరకూ పోరాడతామని.. ఎలాగైనా ప్రత్యేక హోదా సాధిస్తామని చెపుతుంటే అదే పార్టీ నేత అయిన జేసీ దివాకర్ రెడ్డి మాత్రం ఏపీకి ప్రత్యేక హోదా రాదు అని చెప్పడం.. రాయపాటి కూడా మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా గురించి ఇంకేం చేయాలి బట్టలు ఊడదీసుకొని తిరగాలా అనడం ఇవన్నీ పార్టీని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలే. ఒకే పార్టీలో ఉండి పార్టీకి విరుద్ధంగా వారు చేసే వ్యాఖ్యలు అటు పార్టీనే కాదు.. చంద్రబాబును కూడా ఇరుకునపెడుతున్నాయి. తాము చేసే వ్యాఖ్యలు ప్రతిపక్ష పార్టీలకు ఆయుధాలుగా మారుతాయి అన్న ఆలోచన కూడా లేకుండా వారు మాట్లాడటం గమనార్హం. కాబట్టి ఇప్పటికైనా తెదేపా నేతలందరూ ఒకే మాట మీద ఉండి ప్రత్యేక హోదా సాధించుకుంటే మంచిది. లేకపోతే ఇలాంటి విరుద్దమైన వ్యాఖ్యలవల్ల ఇతర పార్టీలు రెచ్చిపోయే ప్రమాదం ఉంటుంది.

పేదవారి ముఖాల్లో వెలుగు చూడాలి.. చంద్రబాబు

  ఏపీ సీఎం చంద్రబాబు విశాఖపట్న జిల్లా 'మీ ఇంటికి మీ భూమి' అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల భూమిని వారికి అందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. కాగా రాష్ట్రంలో పేదవారి ముఖాల్లో వెలుగు చూడాలని.. పేదవారికి న్యాయం జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పేదవారికి సంక్షేమ కార్యక్రమాలు అందడంలో దళారుల ప్రమేయం ఉండకూడదని స్పష్టం చేశారు. అంతేకాక రుణమాఫీ కోసం రూ. 25 వేల కోట్లు వెచ్చించామని తెలిపారు. ఉద్యోగులకు అన్నివిధాలా మేలు చేస్తామని.. ఉద్యోగులు అవినీతి రహితంగా పనిచేయాలని సూచించారు. ఎవరైనా తప్పుడు పనులు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కాగా రాష్ట్రవిభజన వల్ల ఏపీ ఆర్ధికంగా బాగా దెబ్బతిందని.. దీనికి సహాయపడేందుకు కేంద్రం ఉందారంగా ముందుకు రావాలని కోరారు.

వారికోసం వీళ్లేందుకు బలవ్వాలి?

  పరిస్థితులు ఎలాంటివైనా ఆఖరికి ఆ పరిస్థితులకు సామాన్య ప్రజలే బలవ్వుతున్నారడంలో ఎలాంటి సందేహం లేదు. రాజకీయాల్లో ప్రవేశించి.. ప్రజలకు మంచి పనులు చేసినా చేయకపోయినా పదవులు అనుభవిస్తున్న రాజకీయ నాయకులు ఎంతో దర్జాగా కాలం గడుపుతుంటే వారి రాజకీయాలకు యువకులు బలవ్వడం బాధాకరమైన విషయం. నాడు రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ రాష్ట్ర వచ్చిందంటే దానికి కారణం ఎంతో మంది యువకులు పోరాట పటిమనే కారణం. అసలు ఆ యువత లేకపోతే కేసీఆర్ అనే వ్యక్తి అసలు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించే వారు కాదేమో.. ప్రత్యేక రాష్ట్రం వచ్చుండేది కాదేమో. అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది యువకులు తమ ప్రాణాలు బలిదానాలు చేశారు. కానీ అమరవీరులు అన్న పేరు తప్ప వారికి ఇంకే లభించింది.. కనీసం వారి కుటుంబాలను సరిగా ఆదుకునే సమయం కూడా నేతలకు లేకుండా పోయింది.   ఇప్పుడు ఏపీ ప్రత్యేక హోదా విషయంలో కూడా ప్రాణ త్యాగాలు మొదలయ్యాయి. కేంద్రం ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పిన నేపథ్యంలో రాష్ట్రంలో ఆందోళనలు మొదలయ్యాయి. కానీ మునికోటి ఆత్మహత్యాయత్నంతో అది తారాస్థాయికి చేరింది. తన ఆత్మహత్యతో ఉద్యమానికి ఆహుతైన మొదటి ప్రమిదగా మారాడు. పదేళ్ల హయాంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ.. తమ పార్టీ ప్రయోజనాల కోసం అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించింది. అప్పట్లో బీజేపీ కూడా పదేళ్లపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పింది. కాలంతో పాటు మాటలు కూడా మారిపోతాయన్నట్టు అప్పుడు ఇస్తామని చెప్పినా ప్రభుత్వమే ఇప్పుడు ఇవ్వనని.. తేల్చిచెప్పేయడం.. మరోవైపు రాష్ట్రాన్ని విడదీసిన పాపం పొగట్టుకునేందుకు చాలా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని మొసలి కన్నీరు కార్చడం.. ఇవన్నీ రాజకీయాల్లోనే సాధ్యం. వారు చేసే దొంగ రాజకీయాలకు సామాన్య ప్రజలు బలవ్వడం ఎంత వరకూ సమంజసమో వారే ఆలోచించుకోవాలి. అధికారంలోకి రావడానికి ఇష్టమొచ్చినట్టు హామీలు ఇచ్చే నేతలకు అధికారంలోకి వచ్చిన తరువాత కాని ఆ హామీలు నేరవేర్చడం అసాధ్యమని తెలియదుకాబోలు.   మొత్తానికి ఏదేమైనా అందరూ బానే ఉన్నా రాజకీయ నాటకాలలో యువకులు బలవ్వడం మాత్రం దురదృష్టకరమైన అంశం. అసలు వారికోసం వీళ్లేందుకు బలవ్వాలి.. యువత ఎందుకు ప్రాణాలు అర్పించాలి. ఇప్పుటికైనా ముని కోటి మరణంతో మన నేతలు కళ్లు తెరిచి నాటకాలాడకుండా నిజాయితీగా పోరాడితే ప్రత్యేక హోదా సాధించవచ్చు. ఇంకా ముందుముందు జరగబోయే దారుణాలను అడ్డుకోవచ్చు.

నేడు తిరుపతిలో మునికోటి అంత్యక్రియలు

  తిరుపతిలో మునికోటి అంత్యక్రియలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కాంగ్రెస్ కార్యకర్త మునికోటి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు. దీంతో ఆయనను చెన్నైలోని ఆస్పత్రికి తరలించగా మృతిచెందాడు. కాగా ఈ రోజు సాయంత్రం తిరుపతిలో మునికోటి అంత్యక్రియలు జరగనున్నాయి. ఏపీ పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి మునుకోటి మృతదేహాన్ని తీసుకురావడానికిగాను చెన్నై వెళ్లారు. ఈ అంత్యక్రియల కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొననున్నారు.   మరోవైపు మునికోటి మృతి నిమిత్తం బంద్ కు పిలువునిచ్చారు. ఈ బంద్ లో కాంగ్రెస్ పార్టీలు.. వామపక్షాలు పాల్గొన్నాయి. సినిమా థియేటర్లు, వాణిజ్య వ్యాపార, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ పాటిండంతో తిరుపతిలో ప్రశాంతంగా బంద్ కొనసాగుతోంది. అయితే దేవుని దర్శార్ధం తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని.. వారి ప్రయాణించే బస్సులను రాకపోకలను అడ్డుకోవద్దని పార్టీ నేతలు నిర్ణయించారు. రాష్ట్ర విభజన వల్ల ఏపీ ఆర్ధికంగా చాలా నష్టపోయిందని.. ఇలాంటి పరిస్థితిల్లో ఏపీకి ప్రత్యేక హోదా అవసరమని.. ఉద్యమం ద్వారనే ప్రత్యేక హోదాను సాధించాలని కాంగ్రెస్‌ నేతలు పేర్కొన్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపు ఇస్తామని.. దీనిపై చర్చించి ఈ రోజు సాయంత్రం లోపు అధికారికంగా ప్రకటిస్తామని సీపీఐ నేతలు తెలిపారు.

చెన్నైలో మృతి చెందిన మునికోటి

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో నిన్న నిర్వహించిన బహిరంగ సభలో ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేసిన ముని కామకోటి ఆదివారం మధ్యాహ్నం చెన్నైలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందాడు. అతను తిరుపతిలో మంచాల వీధికికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త. గంగమ్మ తల్లి జాతర కమిటీలో సభ్యుడుగా కూడా ఉండేవాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తదితరులు అతని మృతికి సంతాపం తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా తనను తాను నిగ్రహించుకొంటున్నట్లుగా పవన్ కళ్యాణ్ ట్వీట్ మెసేజ్ పెట్టారు.

ప్రత్యేక హోదా కోసం యువకుడు ఆత్మహత్య ప్రయత్నం

  ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తిరుపతిలో నిర్వహించిన ఒక బహిరంగ సభలో విషాదం చోటు చేసుకొంది. కాంగ్రెస్ పార్టీకే చెందిన కోటి అనే ఒక వ్యక్తి మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి ప్రసంగిస్తున్న సమయంలో సభ వేదిక కి కొద్ది దూరంలో నిలబడి తన ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసాడు. వెంటనే చుట్టూ ఉన్నవారు మంటలు ఆర్పి అతనిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి చాలా విషమంగా ఉందని, మరో మూడు రోజులు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. సుమారు 50 శాతం కాలిన గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు.   పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి సభలో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న సమయంలో ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరమని అన్నారు. ఇకపై ప్రత్యేక హోదా కోసం ఎవరూ కూడా ఇటువంటి ప్రయత్నాలు చేయవద్దని ప్రజలను కోరారు. ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్దంగా ఉద్యమించి ప్రత్యేక హోదా సాధిద్దామని ఆయన అన్నారు. ఈ సభ ముగియగానే ఆ యువకుడిని అవసరమయితే చెన్నై లేదా వేలూరుకి తరలించి ఇంకా మంచి వైద్యం అందించుతామని ప్రకటించారు.

జగన్ దీక్ష అక్కడ చేయాలి

  కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు జగన్ కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం పై ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్న చేపట్టనున్నారు. ఇప్పుడు ఈ విషయంపై టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు జగన్ పై మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి దీక్ష చేయడం విడ్డూరంగా ఉందని.. ఒక వేళ దీక్ష చేయాలనుకుంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇంటి ముందు చేసుకోవాలని విమర్శించారు. ఎప్పుడూ విమర్శించే పని తప్ప కనీసం రాష్ట్రం విభజించేటప్పుడు సీఎం చంద్రబాబు అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్నారా.. పైగా ఇప్పుడు విమర్శలు గుప్పించడం అనైతికం అని మండిపడ్డారు. అసలు ప్రత్యేక హోదాను బిల్లులోనే పెట్టకపోవడం దారుణమని గాలి మండిపడ్డారు. కానీ ఏపీకి ప్రత్యేక హోదా సాధించడానికి టీడీపీ ప్రయత్నిస్తూనే ఉందని చెప్పారు.