దావుద్ ఇబ్రహీం కోసం కేంద్రం పక్కా ప్రణాళిక

  మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం ఎన్నో సంవత్సరాల క్రితమే అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. కానీ అక్కడే ఉండి అనేక మారణహోమాలకి పాత్ర వహించాడు. ఇప్పుడు దావుద్ ఇబ్రహీంను అరెస్ట్ చేయడానికి మోడీ ప్రభుత్వం పక్కా ప్రణాళికను సిద్దం చేస్తుందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే కేంద్రంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దావూదా కు సాయం చేసే దేశాలు గుర్తించి ఆ దేశాల్లో దావూద్ ఇబ్రహీం కాలుపెట్టకుండా ఉండేదుకు తగిన చర్యలు తీసుకోనుంది. అంతేకాదు దావూద్ ఇబ్రహీం ఆర్థిక మూలాలు కూడా గుర్తించి.. వాటిని దెబ్బకొట్టాలని భావిస్తోంది.   దావుద్ ఇబ్రహీంపై పాకిస్థాన్‌లోనే ఉన్నట్టు భారత్ నిఘా వర్గాల దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని వీటిని ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో పాకిస్థాన్‌కు అందజేసేందుకు న్యూఢిల్లీ సిద్ధంగా ఉందని డైలీ మెయిల్ అనే పత్రికా ఓ కథనంలో ప్రచురించింది. అంతేకాదు దావుద్ ఇబ్రహీంకు నివాసాలకు సంబంధించిన వివరాలు కూడా సేకరించామని భారత నిఘా సంస్థలు తెలిపాయి.

కేసీఆర్ ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడుతున్నారు

  తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు శోభారాణి తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శల బాణాలు సంధించారు. కేసీఆర్ కు ఇప్పటికే కాలేయం పాడైందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పుడు అతి తక్కువ ధరకే మద్యం అందుబాటులోకి తీసుకొచ్చి.. ఇప్పుడు చీప్ లిక్కర్ తాగించి ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడతారా అని ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని లిక్కర్ మాఫియా చేతిలో పెట్టబోతున్నారని.. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా త్వరలో మేము బయటపెడతామని ఆమె ఆరోపించారు. అంతేకాదు వరంగల్ జిల్లా గంగదేవిపల్లి గ్రామం అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలోనే కెసిఆర్ చేశారని గుర్తుంచుకోవాలన్నారు.

బెజవాడ బిజీవాడ

ఏపీ సీఎం చంద్రబాబు నాలుగు రోజులు విజయవాడలో ఉండే పాలన కార్యక్రమాలు చూసుకోవాలని నిర్ణయం తీసుకున్నసంగతి తెలిసిందే. ఒక్క చంద్రబాబే కాదు ముఖ్యమైన అధికారులు కూడా విజయవాడలోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే చాలామంది విజయవాడలోనే ఉండి అన్నిపనులు చూసుకుంటున్నారు. అంతేకాదు చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా హైదరాబాద్ నుండి ఇక్కడి వచ్చి ఉంటున్నారు. ఇంకా ఇరవై వేల మంది ఉద్యోగులు ఇక్కడికి తరలిరావాల్సి ఉంది. అయితే రాజధాని పూర్తయ్యేంత వరకూ తాత్కాలిక రాజధాని అయిన విజవాడలోనే వారికి కార్యలయాలు కాని వసతి గృహాలు కాని కేటాయించనున్నారు. దీనికోసం జవహర్ కమిటీ కూడా గట్టి ప్రయత్నమే చేస్తుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు చంద్రబాబు వారానికి నాలుగు రోజులు విజయవాడలోనే ఉండి అక్కడి నుండే అన్ని సమీక్షలు, భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీంతో బెడవాడ కాస్త ఒక్కసారిగా బిజీవాడగా మారింది. సీఎం క్యాంపు ఆఫీసుకు వచ్చే మంత్రులు, అధికారులు పోలీసులతో క్యాంప్‌ ఆఫీస్‌ సందడిగా మారిపోయింది. అంతేకాదు  దేశ, విదేశ వ్యాపార ప్రతినిధులు కలిసేందుకు కూడా బెజవాడ నుంచే అపాయింట్‌మెంట్స్‌ ఇచ్చారు. మొత్తానికి తాత్కాలిక రాజధాని అయిన బెజవాడ ఇప్పటికే చాలా బిజీబిజీ అయిపోవడంతో మిగిలిన శాఖలు కూడా త్వరగా ఇక్కడకు వచ్చేందుకు సమాయత్తమవుతున్నాయి.

బీహార్ కు మోడీ రూ.1.25 లక్షల కోట్ల భారీ ప్యాకేజ్

  భారత ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ రాష్ట్రానికి భారీ ప్యాకేజీను ఇస్తున్నట్టు ప్రకటించారు. బీహార్ లో జరిగిన ఆరా బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ రాష్ట్రానికి రూ.1.25 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ఇస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్బంగా మోడీ మాట్లాడుతూ ఈ ప్యాకేజీ వల్ల బీహార్ రాష్ట్ర పూర్తిగా అభివృద్ధి చెందాలని.. బీహారీల దశదిశ మారుతుందని తాను భావిస్తున్నానన్నారు. రైతుల సంక్షేమంతోనే వ్యవసాయాభివృద్ధి సాధ్యమన్నారు. బీహార్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని.. అభివృద్ధితో రాష్ట్ర రూపురేఖలే మార్చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు మరో రూ.40వేల కోట్ల రూపాయలను బీహార్ ప్రాజెక్టుల కోసం అదనంగా ఖర్చుపెడతామని ప్రధాని మోడీ చెప్పారు. కాగా ఈ బీహార్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 11 జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టులను ప్రారంభించారు. రూ.25వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనం చేశారు. 23 స్కిల్ ట్రెయినింగ్ సెంటర్లు ప్రారంభించారు.     మరోవైపు ఇప్పుడు ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు త్వరలో బీహార్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మోడీ ఈ ప్యాకేజీ ఇచ్చారని రాజకీయవర్గాలు అనుకుంటున్నాయి.

కేటీఆర్ గన్‌మన్‌, డ్రైవర్లకు అరెస్ట్ వారెంట్లు!

  ఓటుకు నోటు కేసులో కేటీఆర్ గన్‌మన్‌, డ్రైవర్లకు నోటీసుల ఇచ్చిన నేపథ్యంలో వారిద్దరు విచారణకు హాజరుకాని నేపథ్యంలో ఏపీ సీఐడీ తదుపరి చర్యలకు సన్నద్దమవుతోంది. ఇద్దరికి అరెస్ట్ వారెంట్ లు జారీచేసే యోచనలో ఉంది. ఈ కేసు వ్యవహారంలో నాలుగో నిందితుడైన జెరుసలేం మత్తయ్యను బెదిరించారనే ఆరోపణలపై వీరిద్దరికి నోటీసులు జారీ చేశారు.. మొదట నోటీసులు ఇచ్చేందుకు కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి.. తరువాత ఇంటికి వెళ్లినా కానీ వారు మాత్రం అందుబాటులో దొరకలేదు. దీంతో ఏపీ అధికారులు తెలంగాణ ఐఎస్‌డబ్ల్యూ చీఫ్‌ మహేశ్‌ భగవత్‌ వద్దకెళ్లి నోటీసులు అందించి, రశీదులు తీసుకొని సోమవారం ఎట్టిపరిస్థితిలోనూ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కానీ జానకీరాం, సత్యనారాయణ మాత్రం నోటీసులను ఖాతరు చేయకుండా విచారణకు హాజరుకాకపోవడంతో ఏపీ సీఐడీ అధికారులు వారిద్దరికి కోర్టు ద్వారా అరెస్ట్ వారెంట్లు ఇవ్వాలని భావిస్తున్నారు.

గూగుల్ సెర్చ్ లో రాధికా ఆప్టే టాప్ ప్లేస్

  లెజెండ్ సినిమాతో టాలీవుడ్ సినీ పరిశ్రమకు పరిచయమైన అందాలతార రాధికా ఆప్టే. సినిమాల పరంగా కాని.. వివాదల పరంగా కానీ మొత్తానికి తక్కువ టైమ్ లోనే ఎక్కువ పాపులర్ అయింది. ఉన్నది ఉన్నట్టు మొహం మీద చెప్పడానికి అసలు మొహమాట పడని ఈ భామ అందాల ఆరబోతలో కూడా అస్సలు మొహమాట పడదు. అందుకే బాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా తన సత్తా చాటుకుంటుంది. ఒక్క బాలీవుడ్ లోనే కాదు మరాఠీ భాషల సినిమాల్లో మధ్యలో షార్ట్ ఫిలిమ్స్ లోనూ నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే సినీ పరిశ్రమలోనే కాదు గూగుల్ సెర్చ్ లో కూడా రాధికా ముందు వరుసలో నిలిచి అందరిని ఆశ్చర్యపరిచింది. అహల్య అనే 15 నిమిషాల షార్ట్ ఫిలింలో నటించిన రాధికా విచ్చలవిడిగా అందాలను ఆరబోసింది.. దీనికి తోడు తను నగ్నంగా నటించిందంటూ వీడియో క్లిప్ బయటికి పొక్కాయి.. అది కాస్త సద్దుమణిగేలోపే బాత్‌రూమ్‌లో నగ్నంగా సెల్ఫీలు తీసుకొన్నప్పటి ఫొటోలు బయటకువచ్చాయి ఇక చెప్పేదేముంది ఎక్కడ చూసినా రాధిక ఆప్టే గురించే సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్ చల్ చేశాయి. దీంతో రాధికా అందరిని వెనక్కి నెట్టేసి గూగుల్ సెర్చ్ లో ముందు వరుసలో నిలిచింది. అయితే గూగుల్ సెర్చ్ లో మొదటిస్థానం మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం మొదటిస్థానంలో రావడం విశేషం.

సుప్రీంకోర్టుకు బాంబు బెదిరింపు లేఖ

  సుప్రీంకోర్టును బాంబులు పెట్టి పేల్చేస్తామని బెందిరింపులు రావడంతో కోర్టు చుట్టూ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలియని ఒక ఈ మెయిల్ ఐడి నుండి ఈ బెదిరింపు లేఖ వచ్చిందని.. దీంతో సుప్రీంకోర్టులోకి వచ్చేవారిని.. వెళ్లేవారిని క్షుణ్ణంగా పరిశీలుస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ఒక్క న్యాయమూర్తులను తప్ప మిగిలిన న్యాయవాదులతో సహా అందరినీ పరిశీలిస్తున్నామని.. అంతేకాదు ఈ మెయిల్ ఎక్కడినుండి వచ్చిందో అని కూడా ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.   అయితే యాకుబ్ మెమెన్ ఉరిశిక్ష విధించిన నేపథ్యంలో ఈ బెదిరింపు లేఖ వచ్చిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు వ్యవహారంలో కొద్దిరోజుల క్రితం న్యాయమూర్తి దిపక్ మిశ్రాకు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయనకు బులెట్ ఫ్రూఫ్ కారుతో పాటు ఇంటి చుట్టూ గట్టి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అయితే దీనిలో భాగంగానే సుప్రీంకోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చినట్టు భావిస్తున్నారు. ఎందుకంటే యాకూబ్ మెమెన్ కేసులో తీర్పు నిమిత్తం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్. దత్తు త్రిసభ్య బెంచ్ ఏర్పాటు చేశారు. దీనిలో జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్లా సి. పంత్, జస్టిస్ అమితావ్ రాయ్ ఉండగా వీరు ముగ్గురు అర్దరాత్రి సుప్రీం కోర్టులో యాకుబ్ క్షమాభిక్ష పిటిషన్ పై చర్చించి ఆ ఆర్జీని తిరస్కరించి ఉరి శిక్ష అమలు చేశారు. ఈనేపథ్యంలోనే సుప్రీంకోర్టుకు బెదిరింపులు వచ్చినట్టు తెలుపుతున్నారు.

దారితప్పిన చంద్రబాబు హెలికాఫ్టర్..

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ దారితప్పింది. ఈ విషయం ఎవరో కాదు స్వయంగా చంద్రబాబే తెలిపారు. నిన్న సాయంత్రం హెలికాఫ్టర్ లో కడపకు బయలు దేరిన ఆయన 30 నిమిషాల్లో అక్కడికి చేరుకోవాల్సింది పది నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నారట. ఈ విషయాన్ని కడప విమానాశ్రయంలో స్వయంగా చంద్రబాబు మీడియా ప్రతినిధులకు తెలిపారు. కాగా అనంతరం ఆయన కర్నూలులో రెండు భారీ ప్రాజెక్టులకు జూపాడుబంగ్లా మండలం తంగడంచెలో కర్నూలు అల్ర్టా మెగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ప్రాజెక్టుకు, ఓర్వకల్లు మండలంలోని పుడిచర్లలో పరిశ్రమల హబ్‌కు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో రూ.3300 కోట్లతో 6 స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని.. వీటి ద్వారా యువతకు వృత్తి నైపుణ్యాలు పెంచవచ్చని స్పష్టం చేశారు. అంతేకాదు రైతుల రుణమాఫీలు చేశామని.. అలాగే గొర్రెల, మేకల పెంపకందారుల రుణాలను మాఫీ చేస్తామన్నారు.

తరువాత నేనే సీఎం.. జగన్

  మరో మూడేళ్లలో తనే సీఎం అవుతాడంటా ఇది ఎవరో చెప్పిన మాటలు కాదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. మరో రెండేళ్ల వరకే చంద్రబాబు సీఎంగా ఉంటారని.. వచ్చే ఎన్నికల్లో తానే సీఎం అవుతానని జోస్యం చెపుతున్నారు. మూడు రోజుల కడప జిల్లా పర్యటనలో ఉన్న ఆయన పులివెందులలోని తన ఇంట్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో మూడేళ్లు ఆగండి.. ముఖ్యమంత్రిగా నేనే వస్తా. మీ సమస్యలు తీరుస్తా'' అని ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. కాగా రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం గట్టిగా ప్రయత్నిస్తున్నానని.. తనతో పాటు అందరూ ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయాలని అన్నారు. అలాగే ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ బంద్ నిర్వహించనున్న నేపథ్యంలో అందరూ బంద్ లో పాల్గొనాలని.. బంద్ విజయవంతంగా అయ్యేలా అందరూ కృషిచేయాలని కోరారు.

ఓటుకి నోటు కేసులో మరో ఇద్దరికీ నోటీసులు

  ఓటుకి నోటు కేసులో ఏసిబి అధికారుల దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రతీ పదిపదిహేనురోజులకు ఒకసారి ఎవరో ఒకరికి నోటీసులు ఇస్తూ, అందరూ ఊహిస్తున్నట్లుగా ఈ కేసును అటకెక్కించేయలేదని, అది ఇంకా సజీవంగానే ఉందనే భావన ప్రజలకి కలిగేలా చేస్తున్నట్లున్నారు. మళ్ళీ నిన్న మాజీ కాంగ్రెస్ ఎంపీ డీకె. ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాసనాయుడికి, అతని స్నేహితుడు విష్ణు చైతన్యకి ఏసిబి అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ కేసు విషయంలో విచారించేందుకు వారిద్దరినీ మంగళవారం తమ ముందు కావలసిందిగా ఆదేశిస్తూ సెక్షన్:160వ క్రింద నోటీసులు అందజేశారు. బెంగూళూరులో నివాసముంటున్న శ్రీనివాసనాయుడు ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నందున ఏసిబి అధికారులు అక్కడ ఉన్న ఆయన సిబ్బందికి నోటీసులు అందజేసి వెనక్కి తిరిగి వచ్చారు. వారిరువురూ ఈ కేసులో సాక్షులని భావించడం చేతనే ఏసిబి అధికారులు వారికి నోటీసులు అందజేసినట్లు తెలుస్తోంది.

బ్యాంకాక్ లో బాంబు ప్రేలుడులో 27 మంది మృతి

  థాయ్ ల్యాండ్ రాజధాని సెంట్రల్ బ్యాంకాక్ లోని సుప్రసిద్ధ రాచ ప్రసాంగ్ అనే ప్రాంతంలో ఒక హిందూ దేవాలయం వద్ద సోమవారం సాయంత్రం ఏడు గంటలకు భారీ బాంబు ప్రేలుడు జరిగింది. ఆ ప్రేలుడుకి 12మంది అక్కడిక్కడే మరణించగా మరో 78మంది చాలా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో మరో 15 మంది చికిత్స పొందుతూ మరణించారు. బాంబుని మోటార్ సైకిల్ పై అమర్చి దేవాలయం సమీపంలో నిలిపి ఉంచి బాగా రద్దీగా ఉన్న సమయంలో ప్రేలుడు జరపడంతో చాల మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటి వరకు మొత్తం 15మంది చనిపోయారు. ఆలయాన్ని చుట్టుముట్టిన భద్రతా దళాలు మరో బాంబుని కనుగొని నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తప్పింది, లేకుంటే మరింత ప్రాణ నష్టం జరిగి ఉండేది. థాయ్ ల్యాండ్ లో కొందరు ముస్లిం తీవ్రవాదులు అప్పుడప్పుడు ఇటువంటి దాడులకు పాల్పడుతూ తమ ఉనికిని చాటుకొంటున్నారు. బహుశః వారే ఈ ప్రేలుళ్ళకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ ఇంతవరకు ఎవరూ ఆ ప్రేలుళ్ళకు తామే బాధ్యులమని ప్రకటించుకోలేదు.

చంద్రబాబుకు ప్రధాని అపాయింట్‌మెంట్

  భారత ప్రధాని నరేంద్రమోడీతో ప్రత్యేక సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అపాయింట్‌మెంట్ ఖరారైంది. ఈనెల 20వ తేదీన సాయంత్రం 4 గంటలకు ప్రధానితో చంద్రబాబు భేటీ కానున్నారు. విభజన చట్టంలోని హామీల అమలుపై ప్రధానితో చంద్రబాబు చర్చించనున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు పట్టుదలతో వున్నారు. ఈ విషయం మీద అన్ని వైపుల నుంచి వస్తున్న ఒత్తిడిని ఆయన ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళే అవకాశం వుంది. ఈ భేటీ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రధాని నుంచి ఏపీకి అవసరమైన వాటిని సాధించగలరన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తమవుతోంది.

భోజనంలో బల్లి... బాబోయ్...

  మధ్యాహ్న భోజనంలో బల్లి పడటంతో అది తిన్న 30 మంది బాలికలు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగింది. ఇటావా జిల్లాలోని జవహర్ నవోదయ పాఠశాలలో మధ్యాహ్నం భోజనంలో బల్లి పడింది. దాన్ని గమనించని విద్యా్ర్థినులు ఆ ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనంతరం బాలికలు వాంతులు అవుతున్నట్టు పాఠశాల సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే వైద్యుడిని పాఠశాలకు పిలిపించి ప్రథమ చికిత్స చేయించారు. పిల్లలను ఆస్పత్రిలో చేర్పించకుండా పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకి గురైనప్పటికీ, సరైన సమయంలో వైద్య సహాయం అందడంతో అందరూ కోలుకున్నారని పాఠశాల సిబ్బంది ప్రకటించారు.

పెట్టుబడుల స్వర్గం ఇండియా

  భారతదేశం కేవలం ఒక మార్కెట్ మాత్రమే కాదని, ఒక శక్తి అని, పెట్టుబడుల స్వర్గమని భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ప్రస్తుతం ఆయన యుఎఇ పర్యటనలో వున్నారు. ఆయన సోమవారం అబుదాబిలోని మస్దర్ నగరంలోని పారిశ్రామికవేత్తలతో సమావేశమైన సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత - యుఎఇ మధ్య చాలా విమాన సర్వీసులు వున్నా, భారత ప్రధాని ఇక్కడకు రావడానికి 34 సంవత్సరాలు పట్టింది. భారతదేశంలో అభివృద్ధికి అపార అవకాశాలు వున్నాయి. వాటిని ప్రపంచ పారిశ్రామికవేత్తలు అందిపుచ్చుకోవాలి. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, మూడీస్ అంగీకరించాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం భారతదేశంలో ఒక ట్రిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయని, మౌలిక వసతుల అభివృద్ధి, స్థిరాస్తి రంగాల్లో అపార అవకాశాలు వున్నాయని మోడీ వివరించారు.

పాపం... ఆ 54 మందీ....

  అయ్యో... అందరూ భయపడిందే జరిగింది... ఆ 54 మందీ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఇండోనేసియా విమానాల ప్రాణ దాహానికి మరో 54 మంది బలైపోయారు. ఇండోనేసియాలో 54 మందితో ప్రయాణిస్తు్న త్రిగానా ఎయిర్ లైన్స్‌కి చెందిన విమానం ఆచూకీ తెలియకుండా పోయిన విషయం తెలిసిందే. ఆ విమానానికి సంబంధించి సేఫ్‌గా వుందనే వార్త వింటామని ఎదురుచూస్తున్న వారందరికీ పిడుగులాంటి వార్త తెలిసింది. ఆ విమానం కూలిపోయిందని, విమానంలో ప్రయాణిస్తున్న ఎవరూ బతికి లేరని త్రిగానా ఎయిర్ వేస్ ప్రతినిధులు ప్రకటించారు. ఈశాన్య పపువా ప్రాంతంలోని ఓస్కిబీ జిల్లాలో ఒక మారుమూల ప్రదేశంలో విమాన శకలాలను గుర్తించామని తెలిపారు. ప్రయాణికులలో ఐదుగురు చిన్నారులు కూడా వున్నారు. అసలు ఇండోనేసియా విమానాలే తరచుగా ఎందుకు ప్రమాదాలకు గురవుతున్నాయన్న విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం వుంది.

కప్పలను తిన్న హీరోయిన్

  హీరోయిన్ సల్మా హయక్ ఎంచక్కా కప్పలను భోంచేసింది. కప్పలను మాత్రమేనా.. పట్టు పురుగులను కూడా మరమరాలు తిన్నట్టుగా తినేసింది ‘విల్ సల్మా ఈట్ ఇట్’ అనే టీవీ ప్రోగ్రాంలో పాల్గొన్న సల్మా హయేక్ బాగా దోరగా వేయించిన కప్పలను, అప్పుడే నూనెలో వేయించి తీసిన పట్టు పురుగులను తినేసింది. టీవీ ప్రోగ్రాం కోసం కాబట్టి తిన్నానుగానీ, నిజానికి వాటిని తింటున్నప్పుడు తనకు చాలా ఇబ్బందిగా అనిపించిందని సల్మా హయేక్ తర్వాత చెప్పింది. తాను మరోసారి ఇలాంటి వాటిని పొరపాటున కూడా తినబోనని చెప్పింది. అయితే సల్మా భర్త, ఫ్రెంచ్ వ్యాపారవేత్త ఫ్రాంకోయిస్ హెన్రీ మాత్రం తానయితే చికెన్‌ ఎంత ఇష్టంగా తింటానో కప్పలను కూడా అంతే ఇష్టంగా తింటానని చెప్పుకొస్తున్నాడు. ఇంకో రెండు మూడుసార్లు సల్మా కూడా కప్పల్ని తింటే వాటిలో వున్న రుచి తెలుసుకుంటుందని అంటున్నాడు.

ఎమ్మెల్యే కారు ఢీకొని....

  ఎమ్మెల్యే కారు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వరంగల్ జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. వరంగల్ జిల్లా కాజీపేట సమీపంలోని బోడగుట్టకు చెందిన రైల్వే విశ్రాంత ఉద్యోగి మహ్మద్ సర్వర్ కుమారుడు ఖాజా సహేర్ అలీ (26) తన స్నేహితుడు గౌస్ పాషాతో కలసి బైక్‌పై ప్రయాణిస్తు్న్నాడు. హన్మకొండలో జరిగిన ఒక వివాహానికి హాజరై వీరు తిరిగి వెళ్తున్నారు. జూబ్లీ మార్కెట్ సమీపంలో వీరి వాహనం రోడ్డు దాటుతూ వుండగా హైదరాబాద్ నుంచి హన్మకొండ వైపు వెళ్తున్న నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం వీరి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో సాహెర్ అలీకి తీవ్ర గాయాలై, హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. గౌస్ పాషా పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది.

మరో ర్యాగింగ్ కలకలం

  ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో ర్యాగింగ్ కలకలం తరచుగా జరుగుతోంది. నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న తర్వాత విద్యా సంస్థల యాజమాన్యాలు ర్యాగింగ్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తు్న్నాయి. అయినప్పటికీ ర్యాగింగ్ ఆగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ర్యాగింగ్‌కి పాల్పడిన ఒక యువతి ప్రిన్సిపాల్ మందలించడంతో ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం కూడా జరిగింది. ఏపీ విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌ని ఉక్కుపాదంతో అణచివేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరో ర్యాగింగ్ ఉదంతం కలకలం రేపింది. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో ర్యాగింగ్ ఉదంతం జరిగింది. ఎంసీఏ మొదటి సంవత్సరం విద్యార్థుల మీద సీనియర్లు ర్యాగింగ్‌కి పాల్పడినట్టు తెలుస్తోంది. ర్యాగింగ్‌కి పాల్పడిన విద్యార్థుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రకటించారు.