shammugun nathan muthukumar

హీరోలైన కార్మికులు

  సింగపూర్ లో మన భారతీయ యువకులు ఇద్దరు హీరోలయ్యారు. ఎలాగంటారా... వివరాలు.. షణ్ముగన్ నాథన్, ముత్తుకుమార్ అనే యువకులు సింగపూర్ లో నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. రోజూ మాదిరిగానే వారు విధులు నిర్వహిస్తుండగా వారికి ఒక పసిపాప ఏడుపు గట్టిగా వినిపించింది. దీంతో ఆ ఏడుపు ఎక్కడినుండి వస్తోందని చూడగా ఒక పసిపాప వారు పనిచేస్తున్న పక్క అపార్ట్ మెంట్ రెండవ అంతస్తు బాల్కనీ గ్రిల్ మధ్య తల చిక్కుకొని వేలాడుతూ కనిపించింది. దీంతో ఇద్దరు యువకులు ఒక్కసారిగా అప్రమత్తమై అక్కడకు చేరుకొని రెండవ అంతస్తులోకి ఎక్కి పాపను రక్షించారు. సమాచారాన్ని అందుకున్న ఎస్పీడీఎఫ్ అక్కడకు చేరుకునే లోపులోనే వారు ఆపాపను ప్రాణాలతో కాపాడి కిందకు దించారు. దీంతో ఆ ఇద్దురు యువకులు ప్రదర్శించిన సాహసానికి, సమయస్పూర్తికి సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రశంసలతో పాటు, పబ్లిక్ స్పిరిటెడ్నెస్ అవార్డుకి ఎంపిక చేశారు.

Kcr Telangana Nizam Nawab

నిజాం నవాబు మళ్లీ పుట్టాడు

  తెదేపా సీనియర్ నేత మోత్కపల్లి నర్సింహులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ను నిజాం నవాబుతో పోల్చి ఎద్దేవా చేశారు. నిజాం నవాబును ఎవరు మెచ్చుకోరని, అలాంటి నిజాం నవాబును కేసీఆర్ మెచ్చుకోవడం, గొప్పవాడిగా కీర్తించడం నిజాం ప్రతిరూపానికి కేసీఆర్ నిదర్శనం అని విమర్శించారు. అతి క్రూరంగా పాలించి, ప్రజలకు నరకం చూపించిన నిజాం నవాబు కేసీఆర్ రూపంలో ఇంకా బ్రతికే ఉన్నాడని అన్నారు. నిజాం నవాబు ఎలాగైతే దళితులను, ఇతర వర్గాలను అణచివేశారో కేసీఆర్ కూడా అదే తరహాలో దళితులను అణచివేస్తున్నారని విమర్శించారు.

nepal earth quake

నేపాల్‌లో భారీ భూకంపం

  నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. శనివారం నాడు సంభవించిన భూప్రకంపనలతో నేపాల్లో భవనాలు, నివాస సముదాయాలు కుప్పకూలాయి. నేపాల్ రాజధాని ఖట్మాండుతో సహా ఆ దేశంలోని అనేక ప్రాంతాల్లో భూకంపం బీభత్సం సృష్టించింది. ఖట్మాండుకు 83 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం వుంది. నేపాల్ లాంజంగ్ ప్రాంతంలో భూప్రకంపనలు అధికంగా నమోదు అయ్యాయి. భూకంపం కారణంగా భవనాలు కూలిపోయాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. ఖాట్మండు విమానాశ్రయాన్ని మూసివేశారు. ఖాట్మాండు మొత్తం దుమ్ము ధూళితో నిండిపోయింది. నేపాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థపై కూడా భూకంపం తీవ్ర ప్రభావం చూపింది. అందుకే భూకంపం సంభవించిన చాలాసేపటికి గానీ ఆ వార్త బయటి ప్రపంచానికి తెలియలేదు. భూకంపం కారణంగా ఒకరు మరణించినట్టు తెలుస్తోంది. నేపాల్‌లో ఏర్పడిన ఈ భూకంప ప్రభావం భారతదేశం మీద కూడా పడింది. ఢిల్లీతోపాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో భూమి కంపించింది.

earth quake

ఢిల్లీలో, ఏపీలో భూకంపం

  ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలు మీద భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. నేపాల్‌లోని భరత్‌పూర్‌కి 60 కిలోమీటర్ల దూరంలో భూమిలో 11 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం వున్నట్టు అధికారులు గుర్తించారు. శనివారం ఉదయం 11.44 సమయంలో ఒక నిమిషం 8 సెకన్లపాటు భూమి కంపించినట్టు సమాచారం. ఢిల్లీతోపాటు ఏపీ, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నో, కోల్‌కతా. జైపూర్ తదితర ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయని అధికారులు తెలిపారు. ప్రకంపనల కారణంగా ఇళ్ళలోని వస్తువులు కింద పడిపోవడంతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్ళలోంచి బయటకి పరుగులు తీశారు. ఏపీలో భూ ప్రకంపలన ప్రాంతాలు ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రంలో కూడా శనివారం ఉదయం 11.44 సమయంలోనే భూ ప్రకంపనలు సంభవించాయి. కృష్ణాజిల్లా గొల్లపూడి, తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, రాజానగరం, రావులపాలెం, శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, ఉర్లాం పరిసరాల్లో భూ ప్రకంపనలు జరిగాయి.

ap checkpost

ఏపీ సరిహద్దుల్లో రవాణా పన్ను

  తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే ఆంధ్రప్రదేశ్ వాహనాలకు రవాణా పన్ను వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా తన సరిహద్దుల వద్ద రవాణా పన్ను వసూలు చేయడం ప్రారంభించింది. శుక్రవారం అర్ధరాత్రి దాటినప్పటి ఏపీ అధికారులు నుంచి రవాణా పన్ను వసూలు చేయడం ప్రారంభించారు. రవాణా పన్ను వసూలు చేయడం ప్రారంభించిన మొదటిరోజే భారీ స్థాయిలో పన్ను వసూలైందని తెలుస్తోంది. కృష్ణాజిల్లా గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు 200 వాహనాల నుంచి కోటి 30 లక్షల రూపాయల పన్ను వసూలు చేశారు. తిరువూరు చెక్‌పోస్ట్ దగ్గర 80 వేల రూపాయల పన్ను వసూలైంది.

Karachi

మానవహక్కుల నేత కాల్చివేత

  పాకిస్తాన్, కరాచీలో మానవ హక్కుల నేత సబీన్ మహమ్మద్ పై తెలియని దుండగులు కాల్పులు జరిపారు. బలూచిస్తాన్ పేరుతో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ప్రసంగించిన ఆమె హోటల్ నుండి బయటికి వెళుతుండగా ఇద్దరు దుండగులు ఆమె కారుపై కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో సబీన్ మహమ్మద్ తో పాటు ఆమె తల్లి కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించేలోపే సబీన్ ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసు అధికారి తారిఖ్ ధరేజో తెలిపారు. కాగా సబీన్ మహమ్మద్ గత కొంత కాలంగా బలూచిస్తాన్ ప్రావిన్స్ లో తిరుగుబాటుదారులతో, పోలీసుదళాలకు మధ్య నడుస్తున్న పోరులో అమాయకులను కాల్చి చంపుతున్నారని ఆరోపిస్తూ ఉద్యమిస్తున్నారు.

Mastanbabu

పర్వతారోహకుడు మస్తాన్ బాబు అంత్యక్రియలు

  పర్వాతారోహణలో గిన్నిస్ రికార్డు సాధించి తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేశాడు మల్లి మస్తాన్ బాబు. అతనికి తన స్వస్థలం నెల్లూరు జిల్లా గాంధీజనసంగంలో అతని పొలంలోనే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మస్తాన్ బాబు కుటుంబసభ్యులు, బంధువులు, అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. మస్తాన్ బాబు అంత్యక్రియలకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ మంత్రులు నారాయణ, పల్లె రఘునాథరెడ్డి, రావెల కిశోర్ బాబు, జిల్లా కలెక్టర్ జానకి పలువురు రాజకీయ నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మల్లి మస్తాన్ బాబు మళ్లీ పుడతాడని అన్నారు. పర్వాతరోహణలో మస్తాన్ బాబు చరిత్ర సృష్టించాడని, ఆయన కీర్తి ఎవరెస్టు శిఖరాన్ని దాటిందన్నారు. మస్తాన్ బాబు మృతదేహం ఇక్కడికి రావడానికి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ చొరవే కారణమని తెలిపారు. వారే అర్జెంటీనాతో దౌత్యపరమైన చర్చలు జరిపి మృతదేహాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు.

ap special status

ఏపీకి ప్రత్యేక హోదా లేదట

  ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పట్లో ప్రతిపక్షంలో వున్న బీజేపీ ఇచ్చిన ఐదు సంవత్సరాల ప్రత్యేక హోదా ఇక రానట్టేనని తెలిసిపోయింది. ప్రత్యేక హోదా ఐదేళ్ళు ఇస్తానని కాంగ్రెస్ అంటే, కాదు కాదు పదేళ్ళు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టిన బీజేపీ కూడా ఇప్పుడు మాట మార్చింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని శుక్రవారం నాడు పార్లమెంటులో తేల్చి చెప్పింది. ఏపీకి ఇప్పటికే చాలా ఇచ్చామని, ఇక ఇచ్చే అవకాశం లేదని తెలిపింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ఎంపీలు కొత్త ప్రభాకరరెడ్డి, మాగంటి బాబు అడిగిన ప్రశ్నలకు కేంద్ర  ప్రణాళికా శాఖ మంత్రి ఇంద్రజిత్  లోక్‌సభలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ అంశాన్ని స్పష్టం చేశారు. ఇకపై ఏ రాష్ట్రానికీ  ప్రత్యేక హోదాపై  ఇచ్చే అవకాశం లేదని, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులే ఆర్థిక అవసరాలకు మార్గదర్శకం అని మంత్రి తన సమాధానంలో తేల్చేశారు. ఏపీ విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చామని, పలు పారిశ్రామిక రాయితీలు ప్రకటించామని,  అదనపు పెట్టుబడి, అదనపు తరుగుదల రాయితీలు ఇచ్చామన్నారు. ఇవి ఏప్రిల్‌ 1 నుంచి ఐదేళ్ల పాటు అమలవుతాయని మంత్రి తెలిపారు.

tippu suthan sword

20 కోట్లు పలికిన 'టిప్పు' ఖడ్గం

  లండన్ లో జరిగిన వేలంలో మైసూర్ మహారాజు టిప్పు సుల్తాన్ వాడిన ఖడ్గం భారీ ధరకి అమ్ముడుపోయింది. ఈ ఖడ్గం పిడి పులి తల బొమ్మతో ఉండి వజ్రాలు, రత్నాలతో పొదిగి ఉంటుంది. ఓ వ్యక్తి ఈ ఖడ్గాన్ని ఏకంగా రూ. 20 కోట్లు పెట్టి దక్కించుకున్నాడు. వేలంలో టిప్పు సుల్తాన్ ఖడ్గంతో పాటు ఆయన ఉపయోగించిన 30 రకాల ఆయుధాలను విక్రయించింది 'బోన్ హామ్స్'. టిప్పు సుల్తాన్ కత్తికి రూ. 20 కోట్లు రాగా మిగిలిన ఆయుధాలను మొత్తం రూ. 37 కోట్లకు విక్రయించారు. అయితే టిప్పు సుల్తాన్ వాడిన ఖడ్గం రూ 10 కోట్లు రావచ్చని అంచనా వేసామని కానీ ఆ అంచనాలను దాటి రెట్టింపు ఆదాయం వచ్చిందని బోన్ హామ్స్ అధికారులు తెలిపారు.

trs plenary

టీఆర్ఎస్ ప్లీనరీ ప్రారంభం

  హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడిగా ఎనిమిదోసారి ఎన్నికైన అనంతరం ఎల్బీ స్టేడియానికి చేరుకున్న కేసీఆర్ జ్యోతి ప్రజ్వనల చేసి పార్టీ ప్లీనరీని ప్రారంభించారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు కేకే, కేటీఆర్, ఈటెల రాజేందర్, హరీష్‌రావుతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణలోని పది జిల్లాల నుంచి టీఆర్ఎస్ శ్రేణులు ఈ ప్లీనరీలో పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా కేసీఆర్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ సాధించడానికి టీఆర్ఎస్ చేసిన కృషిని వివరించి, తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

ap cm narachandrababu naidu

కార్యకర్తలకు రుణపడి ఉంటా.. చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహబూబ్ నగర్ పాలమూరులో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపాను దెబ్బతీయడం ఎవరి వల్ల కాదని, ఈరోజు తెలంగాణ రాష్టం ధనిక రాష్టంగా ఉందంటే దానికి నేను చేసిన అభివృద్ధే కారణమని స్పష్టం చేశారు. ఒకరిద్దరు పార్టీ నుండి వెళిపోతే పార్టీకీ వచ్చిన నష్టం ఏం లేదన్నారు. ఒక నాయకుడు పోతే వంద మంది నాయకులను తయారుచేసే సత్తా పార్టీకి ఉందని అన్నారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఉండటం పార్టీకి అదృష్టమని, ఇక్కడి కార్యకర్తల అభిమానం చూసి వారికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా అని అన్నారు. గతంలో పాలమూరు జిల్లా ఎక్కువగా బడుగు, బలహీన వర్గాల పేదలున్నారు. ఈ జిల్లాను అభివృద్ధి చేస్తానని చెప్పినట్టుగానే ఆ మాటకు కట్టుబడి ఉన్నా అని తెలిపారు. మహిళలకు ప్రసవ సమయంలో ఏదైనా జరిగితే ఆదుకోవాలని నేతలు సూచించినప్పుడు తప్పకుండా ఈ విషయం మీద ఆలోచిస్తానని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణకు జాతీయ కమిటీ ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు.

DOHCHAY review

‘దోచేయ్‌’ షార్ట్ రివ్యూ...

నాగచైతన్య, కృతి సనన్ జంటగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘దోచెయ్’ సినిమా శుక్రవారం నాడు విడుదలైంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే, చేయ‌ని నేరానికి సీతారామ్ (రావు ర‌మేష్‌) జైలుపాలై యావ‌జ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తుంటాడు. సీతారామ్ కొడుకు... చందు(నాగ చైతన్య).   "మంచితనం మాట్లాడటానికి పనికి వస్తుంది కాని బతకడానికి కాదు అనే మాట న‌మ్ముతాడు. అందుకే.. చెల్లాయిని మెడిసెస్ చ‌దివించ‌డం కోసం మోస‌గాడిగా మార‌తాడు.  చందుకి మీరా(కృతి సనన్) పరిచయం అవుతుంది. ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డిపోతారు. మాణిక్యం (పోసాని) త‌న ముఠాతో బ్యాంకుల్ని లూఠీ చేయిస్తుంటాడు. ఓ బ్యాంక్‌లో రెండు కోట్లు ఎత్తేసిన ముఠా స‌భ్యులు ఒక‌రిని కాల్చుకొని మ‌రొక‌రు చ‌నిపోతారు. ఆ డ‌బ్బు అనూహ్యంగా చందుకి దొరుకుతుంది. ఆ డ‌బ్బుతో త‌న తండ్రిని జైలు నుంచి విడిపించుకొందామ‌నుకొంటాడు చందు. అయితే ఈ డ‌బ్బు కో్సం మాణిక్యం, ఆ ఏరియా సీఐ రిచ‌ర్డ్ (ర‌విబాబు) వెంట‌ప‌డ‌తారు. ఆ డ‌బ్బుని చందూ ఎలా కాపాడుకొన్నాడు. త‌న తండ్రిని జైలు నుంచి ఎలా విడిపించుకొన్నాడు?  అస‌లు సీతారామ్ జైలులో ఉండ‌డానికి కార‌ణం ఏమిటి?  అనేదే చిత్ర క‌థ‌. స్వామిరారాతో సుధీర్ వ‌ర్మ‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ న‌మ్మ‌కం క‌లిగింది. ఈ సినిమాలో  క‌థ - క‌థ‌నాల దృష్ట్యా అతను బాగా నిరుత్సాహ‌ప‌రుస్తాడు. క్రైమ్ కామెడీని ఎలా న‌డిపించాలో స్వామి రారాతో ఓ పాఠంగా చెప్పిన సుధీర్‌.. ఎలా తీయ‌కూడ‌దో ఈ సినిమాతో మ‌ళ్లీ తానే చూపించాడ‌నిపించింది. నాగ‌చైత‌న్య ఎప్ప‌ట్లా న‌టించేశాడు. ఆటోన‌గ‌ర్ సూర్య‌కీ, మ‌నంకీ, దోచేయ్‌కి న‌ట‌న‌లో ఎలాంటి మార్పూ చూపించ‌లేక‌పోయాడు. ఎన‌ర్జిటిక్ గా క‌నిపించాల్సిన సీన్స్‌లో నీర‌సంగా ఎలా న‌టించ‌గ‌లుగుతున్నాడో, ఆ సీక్రెట్ ఏంటో చైతూనే చెప్పాలి.

chicken

చికెన్ తినండి.. తెలంగాణ మంత్రులు

  తెలంగాణ మంత్రులు ఈటెల రాజేందర్, మంత్రి టి. పద్మారావు తో పాటు పలువురు నేతలు సికింద్రాబాద్ లోని చిలకలగూడలో వెన్‌కాబ్ చికెన్ సంస్థ సహకారంతో నిర్వహించిన చికెన్ అండ్ ఎగ్ మేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ చికెన్ తింటే బర్డ్ ప్లూ వస్తోందని అనేక వదంతులు వస్తున్నాయని, అలాంటి వదంతులను నమ్మద్దని సూచించారు. ఎలాంటి భయం లేకుండా చికెన్ తినచ్చని అన్నారు. ఈ సందర్భంగా చికెన్ తో తయారుచేసిన వంటకాలను, గుడ్లను ఉచితంగా పంపిణీ చేశారు. రాష్ట వ్యాప్తంగా ఇలాంటి చికెన్ అండ్ ఎగ్ మేళాలు నిర్వహిస్తామని, శుక్రవారం ప్లీనరీ సమావేశంలో కూడా చికెన్ తోనే వంటకాలు తయారుచేయిస్తామని తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో వాలనున్న వాల్‌మార్ట్

  ఇప్పటికే హైదరాబాద్‌లో తన బ్రాంచ్‌లను ప్రారంభించిన అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ఇక తెలంగాణ రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారీ స్థాయిలో తన స్టోర్స్‌ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి అనుమతులు తదితరాల కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వాల్ మార్ట్ ప్రతినిధులు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. వీరి ప్రతిపాదనలకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి సానుకూల స్పందన లభించినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాల్‌మార్ట్ ఏర్పాటు చేయబోయే స్టోర్‌లకు అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులను అందించే విషయంలో తన సహకారం అందించడానికి ఒప్పుకుందని తెలుస్తోంది. దీనికోసం ఒక టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేయడానికి కూడా ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా వాల్‌‌మార్ట్‌కి తమ ప్రభుత్వం సహకరిస్తుందని అంటూనే, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే త్వరలో ఏపీ, తెలంగాణల్లో వాల్‌మార్ట్ విజృంభించబోతున్నట్టు అర్థమవుతోంది.

క్షమాపణ చెప్పిన కేజ్రీవాల్

  రెండు రోజుల క్రితం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద గజేంద్ర సింగ్ అనే రైతు ఆత్మహత్య చేసుకొన్న సంగతి తెలిసిందే. దీనిపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. పార్లమెంట్ లో గందరగోళం జరిగింది. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పెద్ద ఇరకాటంలో పడ్డారు. ఘటన జరిగి అనేక ఆందోళనలు జరిగిన తరువాత ఇప్పుడు కేజ్రీవాల్ నోరు విప్పారు. ఘటన జరిగిన తరువాత నేను ప్రసంగించకుండా ఉండాల్సింది ఎవర్నైనా బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి అంటూ ఆఖరికి క్షమాపణ చెప్పారు. ఘటన జరిగిన తరువాత పదినిమిషాలు ఆయన మాట్లాడుతూ గజేంద్రసింగ్ ను కాపాడటంలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారని ప్రసంగించారు. దీంతో ప్రతిపక్షాలు, పోలీసులు ఒక్కసారిగా ఆయనపై విమర్శల వర్షం కురిపిరంచారు. గజేంద్ర ఆత్మహత్య చేసుకుంటున్న సమయంలో ఆప్ కార్యకర్తలు చోద్యం చూస్తూ కూర్చున్నారని, వారు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి.

నటుడిగా సచిన్ టెండుల్కర్

  క్రికెట్ లెజెండ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ క్రికెట్ లో ఎన్నో రికార్డులు సృష్టించాడు. క్రికెట్ లో ఎన్నో మెరుపులు మెరిపించి ఎంతో మంది అభిమానుల మనసులో స్థానం నిలుపుకున్నాడు. ఒక్క క్రికెట్ లోనే కాకుండా యాడ్స్ లో, చట్టసభ సభ్యుడిగా ఇలా ఎన్నో అవతారాలు ఎత్తాడు. ఇప్పుడు కొత్తగా ఒక డాక్యుమెంటరీ కోసం నటుడిగా మారనున్నాడు. సచిన్ జీవిత చరిత్ర ఆధారంగా డాక్యుమెంటరీ - ఫీచర్ సినిమా తీయనున్నారు. దీనికి హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ డాక్యుమెంటరీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నదని సమాచారం. అత్యున్నత పురస్కారం భారతరత్నను అందుకున్న సచిన్ ఇప్పటికే నెల్లూరు జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకొని దానిని అభివృద్ధి చేసేందుకు పూనుకున్నారు.