పవన్ కళ్యాణ్ కు అవగాహన లేదు.. మురళీమోహన్

భూసేకరణ వ్యవహారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి పార్లమెంటు సభ్యులు, తెలుగుదేశం పార్టీ నేత మురళీ మోహన్ పై వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మురళీ మోహన్ స్పందించారు. రాజధాని ప్రాంతంలో తాను భూమిని  కొనుగోలు చేశానన్న వార్తలు అవాస్తవమని.. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. అవసరమైతే తాను కూడా పవన్ కళ్యాణ్ తో కలిసి భూసేకరణ విషయంలో రాజధానిలో పర్యటిస్తానని.. రాజధాని ప్రాంతంలో తనకు అంగుళం భూమి కూడా లేదన్నారు. కాంగ్రెస్ పార్టీనే రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడు ఔటర్ రింగు రోడ్డు కోసం తన 18 ఎకరాల భూమిని లాక్కుందని.. ఈ నేపథ్యంలోనే తను సుప్రీంకోర్టును ఆశ్రయించానని అన్నారు. ఇదిలా ఉండగా తానే పవన్ కళ్యాణ్ ను ప్రశంసించారు. భూసేకరణ విషయంలో రైతుల దగ్గర నుండి భూములు లాక్కోవద్దని పవన్ కళ్యాణ్ చెప్పేది కరెక్ట్ అని అన్నారు. అయితే, రాజధాని కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం రైతులు భూమిని ఇవ్వాలన్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి మృతి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి మంగళవారం ఉదయం కన్నుమూశారు. మెదక్ జిల్లా నారాయణ ఖేడ్ నియోజకవర్గానికి చెందిన ఈయన గత కొంతకాలంగా గుండెపోటుతో బాధపడుతున్నారు. అయితే మంగళవారం ఉదయం ఈయన హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్‌లో నిద్రలోనే తుది శ్వాస విడిచినట్టు చెబుతున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ప్రస్తుతం ఆయన పిఏసి చైర్మన్‌గా ఉన్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున నారాయణ ఖేడ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కాగా కిష్టారెడ్డి మృతికి పలువురు నేతలు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ నీరుపారుదల శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మెదక్ జిల్లా గొప్ప నేతను కోల్పోయిందని సంతాపం తెలిపారు.  డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కిష్టా రెడ్డి మృతి తెలిసి తాను దిగ్భ్రాంతికి లోనయ్యానని అన్నారు.

ఏపీకి "స్పెషల్" కాదు "స్పెషల్" 'స్పెషల్" స్టేటస్

ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక హోదాపై ఈ రోజు చర్చించిన విషయం  తెలిసిందే. అయితే ఈ భేటీలో ఏపీ ప్రత్యేక హోదా ఇంకా స్పష్టత రాలేదు కానీ.. కేంద్రం మాత్రం విభజన చట్టంలో అన్ని హామీలు నెరవేరుస్తామని.. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తప్పకుండా సహకరిస్తుందని మాత్రం చెప్పింది. అయితే ఈ ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదాను మించిన ఆదరణ ఇస్తుందని.. ఏపీకి స్పెషల్ స్టేటస్ కాదు.. స్పెషల్ స్పెషల్ స్టేటస్ వస్తుందని అన్నారు. ప్రత్యేక హోదా అన్న పదం వాడేందుకు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉన్నాయని చెప్పారు. ప్రత్యేక హోదా వస్తే ఎన్ని రాయితీలు, ప్రయోజనాలు వస్తాయో, వాటన్నింటినీ సాధించేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. తమ పార్టీ ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన అప్పుడు ఏపీకీ ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చింది ఆ హామీని తప్పకుండా నెరవేర్చాలని అన్నారు. విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ నెరవేర్చుతామని కేంద్రం చెప్పిందని.. అలాగే ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలని.. దీనిపై కేంద్రంలో చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ఇంకా ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, మరో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా పాల్గొన్నారు.  ఇదిలా ఉండగా ఉండగా మరోవైపు సుజనా చేసిన వ్యాఖ్యలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ ప్యాకేజీలతో కూడిన రాయితీలు ఉంటాయని సుజనా చేసిన వ్యాఖ్యలను బట్టి ఏపీకి ప్రత్యేక హోదా రావడం అనుమానంగానే ఉందని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. అంతేకాక ఏపీకి ప్రత్యేక కాదు.. స్పెషల్ స్పెషల్ స్టేటస్ అని చేసిన వ్యాఖ్యలు కూడా నిజమేనా లేక వెటకారమా అని అనుకుంటున్నారు.

ప్రత్యేక హోదా పై షాక్

  ఏపీ ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్రమోడీ సీఎం చంద్రబాబుల భేటీ ముగిసింది. ఈ సమావేశంలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, యనమల రామకృష్ణుడు,  పలువురు అధికారులు పాల్గొన్నారు. సుమారు గంటకు పైగా సాగిన ఈ భేటీలో ఏపీ ప్రత్యేక హోదా.. ప్యాకేజీ.. ఇంకా ఏపీకి కావలసిన అవసరాల గురించి చర్చించినట్టు తెలుస్తోంది. భేటీ అనంతరం అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడుతూ ఏపీకి న్యాయం చేయడానికి కేంద్ర ఎప్పుడూ సహకరిస్తుందని అన్నారు. అంతేకాదు విభజన చట్టంలోని అన్ని హామీలను నెరవేరుస్తామని.. ఆర్ధికంగా నష్టపోయిన ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంటుందని ప్రధాని మోడీ చెప్పారని అరుణ్ జైట్లీ చెప్పారు.  అయితే ఎంతగానో ఎదురుచూస్తున్న ఏపీ ప్రత్యేక హోదాపై మాత్రం ఇప్పుడు కూడా స్పష్టత రాలేదు. ప్రత్యేక హోదా అంశం ప్రస్తుతం మా చర్చల్లో ఉందని అరుణ్ జైట్లీ బాంబు పేల్చారు. విభజన చట్టంలోని 46, 90, 94ల పైన ప్రధానంగా చర్చించామని చెప్పారు. ఈసారి కూడా ఏపీ ప్రజల ఆశలకు భ్రేక్ పడింది. మరి ఇంకా కేంద్రం ప్రత్యేక హోదాపై చర్చలు దగ్గరే ఉంది మరి దీనిపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో.. ఒకవేళ తీసుకున్నా ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

చంద్రబాబు మోడీల భేటీ.. ఓ కన్నేసిన టీ సర్కార్

ఈరోజు ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్ర మోడీ.. సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా?రాదా? ఏపీకి ఇచ్చిన అన్ని హామీలను కేంద్రం  నెరవేరుస్తుందా ఇలా చాలా ప్రశ్నలు తలెత్తున్నాయి. అయితే ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై కేంద్రం ఎలా స్పందిస్తుందని ఒక పక్క ఆంధ్ర రాష్ట్ర నేతలు ప్రజలు ఎంతలా చూస్తున్నారో మరోపక్క తెలంగాణ ప్రభుత్వం కూడా అంతలా ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మోడీ.. చంద్రబాబు భేటీల పై ఓ కన్నేసినట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఏపీకి ఇచ్చేహామీలను బట్టి తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్లాలని.. అంతేకాదు రాష్ట్ర విభజనపుడు ఆంధ్రతో పాటు తెలంగాణకు కూడా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఒత్తిడి తీసుకురావాలని టీ సర్కార్ భావిస్తున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే కేంద్ర ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఏమో కాని ప్రత్యేక ప్యాకేజీ మాత్రం ఏపీకి భారీగానే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఏపీకి ప్రకటించే ప్రత్యేక ప్యాకేజీ ఏ విధంగా ఉంటుందో చూసి దానిని బట్టి తెలంగాణకు ప్యాకేజీ కోసం ప్రభుత్వాన్ని కోరుతామంటున్నారు. విభజన చట్టంలో ఉన్న హామీలనైనా అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు జితేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరగక ముందు ఉమ్మడి రాష్ట్రం లో ఎక్కువగా నష్టపోయింది తెలంగాణనే అని.. తెలంగాణ ప్రాంతం అన్యాయానికి గురైందని అన్నారు. అందుకేసమే పోరాడి  ప్రత్యేక రాష్ట్రం కోసం సాధించామని.. తెలంగాణ ప్రాంతంలో ఏడు జిల్లాలు వెనుబడి ఉన్నాయని.. ఏపీకి ఎలాగైతే ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నారో అలాగే తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

డీఎస్ గవర్నర్ భేటీ.. రాష్ట్రాల వివాదాలపై చర్చ

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సలహాదారు డి శ్రీనివాస్ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాల గురించి చర్చించినట్టు తెలుస్తోంది. అయితే తెలంగాణకు ఇతర రాష్ట్రాలు కర్నాటక, మహారాష్ట్రలతో పలు అంశాల్లో వివాదాలున్నప్పటికీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఉన్న వివాదాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రెండు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి చొరవ చూపాలని, అదే విధంగా కేంద్రం నుంచి తెలంగాణకు రావలసిన ప్రయోజనాలపై దృష్టిసారించాలని డి శ్రీనివాస్ గవర్నర్‌ను కోరినట్టు సమాచారం.

చంద్రబాబు మోడీల భేటీ.. సర్వత్ర ఉత్కంఠం

  ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీకి ప్రత్యేక హోదా.. ప్రత్యేక ప్యాకేజీ విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారో అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కూడా పాల్గొంటారు.      మరోవైపు ఇప్పటికే ఏపీకి కావలసిన అవసరాలు.. ఉన్న సమస్యలకు సంబంధించిన 200 పేజీల ముసాయిదాను ఏపీ ప్రభుత్వ తయారు చేసుకుంది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వ ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ కావలసినంత ఇవ్వడానికి ఉన్నా ప్రత్యేక హోదా విషయంలో మాత్రం కాస్తంత వెనుకాడుతున్న నేపథ్యంలో చంద్రబాబు మాత్రం ఎలాగైనా ప్రత్యేక హోదా సాధించాలని పట్టుదలతో ఉన్నారు. ఉత్తరఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ.. ప్రత్యేక హోదా ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేయనున్నారు.   అయితే మరి కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందా?లేదా? ప్రత్యేక ప్యాకేజీ ఎంతిస్తారు? విభజన చట్టంలోని హామీలను అమలు చేస్తారా? ఏపీకి కావలసిన అన్ని అవసరాలను తీరుస్తుందా? ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరకాలంటే వారి భేటీముగిసే వరకు ఆగాల్సిందే.

నా పేరు వాడుకోండి.. రతన్ టాటా

  ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా, సీఎం చంద్రబాబు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారు ఏపీకి ఉన్న సమస్యల గురించి.. అనేక ప్రాజెక్టుల గురించి మాట్లాడినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని.. పారిశ్రామిక వర్గాల్లో ఏం చేయాలో తనకు చెప్పాలని, భారతదేశంలోనే ఏపీని కంపెనీల స్థాపన కేంద్రంగా చేద్దామని రతన్ టాటా చంద్రబాబుతో అన్నట్టు తెలుస్తోంది. తనకు చాలా పరిచయాలు ఉన్నాయని వాటిని ఉపయోగించుకోవడానికి తన పూర్తి సహకారం అందిస్తానని.. అవసరమైతే నేనే వెళ్లి పనులు చేసుకొని వస్తానని రాష్ట్రాభివృద్ధికి తన పూర్తి సహకారం అందిస్తానని హామి ఇచ్చారు. నా ప్రితష్టను ఎక్కడ కావాలంటే అక్కడ మీరు వాడుకోవచ్చని చెప్పారు. కాగా భేటీ ముగిసిన అనంతరం ఢిల్లీకి బయలుదేరిన రతన్ టాటా తానే స్వయంగా విమానాన్ని నడుపుకుంటూ వెళ్లారు.   కాగా..ప్రధాని నరేంద్ర మోదీ సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజనను ప్రారంభించిన నేపథ్యంలో గ్రామాలను దత్తత తీసుకోవాలని.. టాటా ట్రస్ట్ తరుపున గ్రామాలను అభివృద్ధి చేయాలని కోరిగా దీనిలో భాగంగానే రతన్ టాటా ఏపీలో 264 గ్రామాలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.

ప్రధాని నరేంద్ర మోడీతో నేడు సమావేశం కానున్న చంద్రబాబు

  ఈరోజు ఉదయం 10.30 గం.లకి ప్రధాని నరేంద్ర మోడీతో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుసమావేశం కాబోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్నా ఇంతవరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, ఆర్ధిక లోటుని పూడ్చేందుకు అవసరమయిన నిధులు వంటి అనేక హామీలను కేంద్రప్రభుత్వం అమలుచేయకపోవడంతో రాష్ట్ర ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ఇదే విషయాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్ళి తక్షణమే ప్రత్యేక హోదాతో సహా అన్ని హామీల అమలుచేయాలని ప్రదానిని చంద్రబాబు కోరబోతున్నారు. రాష్ట్ర విభజన వలన ఇప్పటికే రాష్ట్రం చాలా దెబ్బతింది. హామీల అమలుపై కేంద్రప్రభుత్వం ఇంకా ఆలస్యం చేసినట్లయితే రాష్ట్రంలో మళ్ళీ ఉవ్వెత్తున ఉద్యమాలు మొదలయితే రాష్ట్ర పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని ప్రధాని నరేంద్ర మోడీకి తెలియజెప్పి, రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక హోదాతో బాటు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి కూడా మంజూరు చేయాలని కోరబోతున్నారు. మరి ప్రధాని నరేంద్ర మోడీ ఏవిధంగా స్పందిస్తారో మరికొన్ని గంటల్లోనే తెలియవచ్చును. ప్రధాని మోడీతో సమావేశం ముగిసిన తరువాత హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, వ్యవసాయ శాఖా మంత్రి రాధామోహన్ సింగ్ లతో చంద్రబాబు నాయుడు వరుసగా సమావేశం అవుతారు. పెండింగులో ఉన్న ప్రాజెక్టులు, రాష్ట్రానికి రావలసిన నిధులు, ఇతర హామీల గురించి వారితో చర్చిస్తారు. కేంద్రమంత్రులు, అధికారులతో సమావేశమయ్యేందుకు వీలుగా చంద్రబాబు నాయుడు డిల్లీలో రెండు రోజులు ఉంటారు. మళ్ళీ బుదవారం విజయవాడకి తిరిగి వస్తారు.

చంద్రబాబుతో రతన్ టాటాల భేటీ

  ప్రముఖ పారిశ్రామిక వేత్త.. టాటా సంస్థ అధినేత రతన్ టాటా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో వారు రాష్ట్ర పరిస్థితి.. సమస్యలు.. పలు ప్రాజెక్టులపైన చర్చించినట్టు తెలుస్తోంది.     కాగా..ప్రధాని నరేంద్ర మోదీ సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజనను ప్రారంభించిన నేపథ్యంలో దీనిలో భాగంగా గ్రామాలను  దత్తత తీసుకోవాలని.. టాటా ట్రస్ట్ తరుపున గ్రామాలను అభివృద్ధి చేయాలని కోరారు. దీనికి రతన్ టాటా వెంటనే స్పందించి దేశంలోని ఎంపీలందరికి లేఖలు రాయగా అందులో ముగ్గురు ఎంపీలు మాత్రమే స్పందించారు. అందులో విజయవాడ ఎంపీ కేశినేని నాని ఒకరు. ఈయన రతన్ టాటా రాసిన లేఖకు స్పందించి విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న 254 గ్రామాలను అభివృద్ధి చేయాలని ఆయనను కోరగా ఆయన దీనికి సంబంధించి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు.

వాళ్లిద్దరి వల్ల జగన్ కు బ్రేక్ పడిందా?

ప్రస్తుతానికి వైకాపా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి కాలం కలిసి రానట్టుగానే కనపడుతోంది. ఏదో విషయం పై రాద్దాతం చేసి రాజకీయంగా బలపడుదామనుకునే జగన్ కు పాపం ఇప్పుడు ఆఛాన్స్ సరిగా దొరకడం లేదు. ఇప్పటికే ఏపీ ప్రత్యేక హోదాపై.. భూసేకరణపై తను పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినా కాని అవి బూడిదలో పోసిన పన్నీరులా అయ్యాయి.   అసలు రాష్ట్ర విభజన చేసినప్పుడు యూపీఏ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామంటూ హామి ఇచ్చింది. అయితే ఎన్నికల తరువాత ఆపార్టీ తలరాతే మారిపోయంది. రాష్ట్రం ఇచ్చినందుకు తెలంగాణ మాత్రం సోనియమ్మ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు కాని ఓట్లు మాత్రం వేయలేదు. ఇక ఏపీలో ఆపార్టీ పరిస్థితి గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఏదో ఒక విధంగా ప్రజలకు దగ్గరవ్వాలన్న నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఎన్డీఏ ప్రభుత్వంపై ఆందోళనలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడతానని చెప్పారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి కూడా పెద్ద ఎత్తునే ఆందోళన చేశారు. ఏకంగా ఢిల్లీలో ధర్నా కూడా చేశారు. దీనిలో భాగంగానే ఈ నెల 29వ రాష్ట్ర బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. తేదీన కానీ రాహుల్‌ గాంధీ ప్రత్యేక హోదా కోసం పోరాడతానని ప్రకటించిన తర్వాతే ఈ అంశంపై జగన్‌ స్పందించారనే ప్రచారం జరిగింది.        ఇప్పుడు భూసేకరణ విషయంలో కూడా అలాగే జరిగింది. ఏపీ ప్రభుత్వం రాజధాని కోసం భూసేకరణ చేస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీని విమర్శించి ఏదో విధంగా పెద్ద ఆందోళన చేసేసి క్రెడిట్ కొట్టేద్దామనుకున్నారు. కానీ దానికి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అవకాశం ఇవ్వలేదు. తాను రైతులను పరామర్శించి వారి సమస్యలు తెలుసుకుందామనుకునే లోపలే పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతాల్లో ముఖ్యంగా భూసేకరణకు ఏపీ ప్రభుత్వం నోటీఫికేషన్లు జారీ చేసిన ప్రాంతాల్లో పర్యటించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు.  అంతేకాదు.. రైతల దగ్గర నుండి భూములను తీసుకోవద్దని.. వారికి ఇష్టమైతేనే భూములు తీసుకోండని అంతేకాని బలవంతంగా భూములు తీసుకుంటే ఊరుకోనని పోరాడటానికైనా సిద్ధమని చెప్పారు. ఇలా జగన్ కు ఈ అవకాశం కూడా పోయింది.     మొత్తానికి జగన్ కు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దూసుకుపోవాలని భావిస్తున్న జగన్ కు బాగానే బ్రేకులు పడుతున్నాయి. ఈ యువ నాయకులు జగన్క కు ఎక్కడా ఛాన్స్ ఇవ్వడంలేదు. తను ముహూర్తాలు చూసుకొని.. అన్నీ ఆలోచించుకొని తీరిగ్గా వెళదాములే అనుకునేలోపు ఇతర పార్టీల నాయకులు దూకుడుగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్నారు. మరి ఇప్పుడు  ఇంకేం కొత్త అంశంపై ఆందోళనలు చేస్తారో చూడాలి. 

అతడే నిజమైన నాయకుడు.. వీహెచ్

  భూసేకరణ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ ట్వీట్టర్ లో ట్వీట్లు పోస్టు చేసిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత ఆ ట్వీట్లపై.. పవన్ కళ్యాణ్ ను విమర్శించిన సంగతి తెలిసిందే.. ఇంట్లో కూర్చొని ట్వీట్లు చేస్తే ఏం వస్తుంది.. రైతుల దగ్గరకు వెళ్లాలి వారి సమస్యలను తెలుకోవాలని సూచించారు. అయితే ఇప్పుడు వీహెచ్ పవన్ కళ్యాణ్ ను ప్రశసించారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను పట్టించుకోకుండా ఏపీ ప్రభుత్వం భూసేకరణపై రైతులకు నోటీఫికేషన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆయనే స్వయంగా రాజధాని ని పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకొని ఏపీ ప్రభుత్వపై పోరాటానికి దిగారు. ఈ నేపథ్యంలో వీహెచ్ స్పందిస్తూ రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి భూములను బలవంతంగా లాక్కోరాదని డిమాండ్ చేస్తూ పవన్ కల్యాణ్ ప్రజల్లోకి వెళ్లడం.. వారి సమస్యలను పవన్ తెలుసుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. అంతేకాదు కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధాని అవసరమే కాని దానికి రైతుల దగ్గర నుండి బలవంతంగా భూములు లాక్కోవడం సరికాదని అన్నారు. ప్రజల ఇబ్బందులపై స్పందించేవాడే నిజమైన నాయకుడు అని మా పార్టీ నేతలు చేయలేని పనిని పవన్ కళ్యాణ్ చేస్తున్నాడని ప్రశంసలు కురిపించారు.

గుడ్డుపై గవర్నర్ ఆగ్రహం.. ఒక్క గుడ్డేనా

  ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్.. తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ కలిసి గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిలో భాగంగానే మహబూబ్ నగర్ జిల్లా కిషన్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో పరిశీలించారు. ఈ సందర్భంగా గవర్నర్ అక్కడి విద్యార్ధులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయితే కళాశాల సిబ్బంది విద్యార్ధులకు వారానికి ఒక గుడ్డు మాత్రమే పెడుతున్నారని తెలుసుకొని ఆగ్రహం వ్యక్త చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందో తెలసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అంతేకాదు ఏఏ పాఠశాలలు విద్యార్ధులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నాయో ఆ పాఠశాలలకు సబ్సిడీ గ్యాస్ అందేలా చూడాలని ఆదేశించారు. అనంతరం కిషన్ నగర్ ప్రజలతో ఆయన ముఖాముఖి నిర్వహించిన గ్రామంలోని సమస్యలపై ఆరా తీశారు.

నేను బానిసను కాదు.. పవన్ కళ్యాణ్

  జనసేన అధినత పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు ఏపీ రాజధాని పర్యటన చేసిన సంగతి. ఏపీ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణనను వ్యతిరేకిస్తూ ఆయన రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన బహిరంగసభలో మాట్లాడుతూ ఏపీ రాష్ట్రానికి రాజధాని అవసరం.. అదే విధంగా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలి దానికి భూసేకరణ తప్ప మరో మార్గం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రా అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషిచేస్తున్నారని.. హైటెక్‌ సిటీతోపాటు ఎంతో అభివృద్ధి చేసిన చంద్రబాబుకు ఈ విషయం తెలియదని తాను అనుకోవడం లేదని అన్నారు.  గతంలో రాజధానికి కావలసిన భూసేకరణ నేపథ్యంలో రైతులు గొడవలు ఆందోళనలు చేశారని అప్పుడే వారిని పరామర్శించానని.. వారికి సంబంధించిన సమస్యలను గురించి అప్పుడే చంద్రబాబుకు ‘సార్‌ చూడండి’ అంటూ ట్విటర్లో మెసేజ్‌ పోస్టు చేశాను అని తెలిపారు. అప్పుడు కూడా మంత్రులు దానిని సూచనగా తీసుకోకుండా  నాపై కామెంట్లు చేశారని అన్నారు. ఇప్పుడు కూడా భూసేకరణ వ్యవహారంలో టీడీపీ నేతలకు పవన్ కళ్యాణ్ కు మధ్య మాటలు  యుద్దాలు జరిగిన నేపథ్యంలో తాను కేవలం టీడీపీకి మిత్రుడనేనని.. అంతేకాని బానిసను కాదని ఘాటుగానే సమాధానమిచ్చారు. న్యాయంగా వ్యవహరించకపోతే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రారని హెచ్చరించారు.  నేను ఇక్కడికి వచ్చింది గొడవపడటానికి కాదు రైతుల సమస్యలు తెలుకొని వాటి గురించి తెలియజేయడానికి వచ్చానని.. కానీ గొడవల వల్ల వారి సమస్యలు తీరతాయయంటే గొడవలకు కూడా సిద్ధమేనని తేల్చి చెప్పారు.

భూములు లాక్కోవద్దు.. నేనొచ్చింది గొడవకి కాదు.. పవన్ కళ్యాణ్

  భూసేకరణ వద్దని.. వారి రైతుల దగ్గర నుండి భూములు లాక్కోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదిక ద్వారా చంద్రబాబును కోరిన సంగతి తెలిసిందే. కానీ ఏపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను పక్కన పెట్టి ఐదు గ్రామాల పరిధిలో భూముల సేకరణకు రైతులకు నోటిఫికేషన్ లు జారీ చేసింది. దీంతో పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. తన సినిమా షూటింగ్ ను మధ్యలోనే ఆపేసి వచ్చి మరీ ఆదివారం రాజధాని ప్రాంతమైన ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో పర్యటించారు. ఏడాదికి మూడు పంటలు పండే రైతుల దగ్గర నుండి భూములు లాక్కోవద్దని ఒకవేళ రైతులు తమ ఇష్ట ప్రకారం భూములు ఇస్తానంటే తీసుకోండి.. అంతేకాని ఇవ్వని వారి దగ్గర నుండి బలవంతంగా భూములు లాక్కోవద్దు..! లాక్కోవద్దు..!! లాక్కోవద్దు!!! అంటూ తేల్చి చెప్పారు. ఒకవేళ అలా చేస్తే రైతుల తరుపున తాను పోరాడతానని.. వారి కోసం ధర్నా చేస్తానని, నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. అంతేకాదు నేను ఇక్కడికి వచ్చింది టీడీపీతోనో ముఖ్యమంత్రితోనో గొడవ పెట్టుకోవడానికి కాదని.. రైతుల సమస్యలను తెలియజేయడానికి వచ్చానని.. దయచేసి భూసేకరణ నోటిఫికేషన్లు ఆపండని.. బలవంతపు భూ సేకరణ చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు.  

ఎంపీగారు ఇకనైనా ఆపండి

  కొంత మంది రాజకీయ నాయకులు చేసే కొన్ని పనులు వారికి సమస్య కాకపోవచ్చుకాని పక్కన వాళ్లకు మాత్రం సమస్యగానే ఉంటుంది. ఏదో చేయాలని చూస్తే ఏదో జరుగుతుంది. ఇప్పుడు ఒక రాజకీయ నేత చేసిన ఓవరాక్షన్ వల్ల  ప్రధాని మోడీ సెక్యూరిటీ  గార్డులలో ఇద్దరు గార్డులపై వేటు పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒక టీడీపీ ఎంపీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కువ అత్యుత్సాహం చూపిస్తున్నట్టు..  ప్రధాని తను ఎక్కువ క్లోజ్ అన్నట్టు.. ఎప్పుడు మీడియాలో కనిపించాలని తెగ ప్రయత్నిస్తున్నట్టు రాజకీయవర్గాలు అనుకుంటున్నాయి. దీనిలో భాగంగానే ఈ టీడీపీ ఎంపీ గారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి అంత్య క్రియల నేపథ్యంలో ప్రధానికి అతి సమీపంలో నడవడానికి ప్రయత్నించారట. అంతేకాదు ప్రధాని మంత్రి చైనా యాత్ర చేసినప్పుడు కూడా ఆపర్యటనలో తను కూడా ఉన్నట్టు తన పేరు కూడా ఉండేలా పేరు రాయించుకున్నారంట దీంతో అందరూ ఆ ఎంపీ గారికి చీవాట్లు పెట్టి పంపారు. దీంతో ప్రధానికి కూడా ఎంపీ గారి వ్యవహారం నచ్చలేదంట. ఇదంతా మన ఎంపీగారు ఎందుకు చేస్తున్నారంటే తనకు ఉన్న OTS ( one time settlement ) బ్యాంకు అఫ్రూవల్ కోసమే అని.. ప్రధాని తనకు బాగా క్లోజ్ అని తెలిసేలా చేస్తే దానిని ఎలాగైనా చేయించుకోవచ్చని చూశారంట కాని ప్రధాని కార్యలయం మాత్రం దానిని రిజెక్ట్ చేసిందని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అదొక్కటే కాదు  ఆంధ్ర రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఒక భూమి విషయంలో కూడా ఈ ఎంపీగారు అలాగే వ్యవహరించినట్టు తెలుస్తోంది. వైజాగ్ లో ఉన్న భూమిని అధికారులను మభ్యపెట్టి రెగ్యులైజ్ చేసుకోవడానికి ప్రయత్నించారట. కాని అధికారులు సీఎం ఆ ఫైల్ ను తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఎంపీగారి వైఖరిని చూసి అందరూ నవ్వుకుంటున్నారట. అయినా ఇన్ని భంగపాట్లు పడినా కూడా ఈ ఎంపీగారి మాత్రం తను ధోరణిలో తానే ఉన్నారని ఇంకా మారలేదని నవ్వుకుంటున్నారు. అయినా కూడా ముఖ్యమంత్రిగారికి.. పీఎం గారికి దగ్గరగా ఉండే ప్రయత్నాలే చేస్తున్నారంట. అసలే ఇప్పటికే అర్ధికపరంగా సమస్యలతో ఈ ఎంపీగారికి మరి ఆయన చేసే ప్రయత్నాలు ఎంతవరకూ పనిచేస్తాయో చూడాలి.