అభిమన్యుడిలా వెంకయ్య.. చంద్రబాబు కితాబు

  పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు ఇంకా ముఖ్యమైన అధికారులు పాల్గొన్నారు.  శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఏపీని ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దాలనుకుంటున్నామని అన్నారు. ఎన్నో ఏళ్లు కష్టపడితే కాని హైదరాబాద్ అభివృధ్ది జరిగింది.. ఎంతోమంది పెట్టుబడులు పెట్టారు కాని ఇప్పుడు రాష్ట్ర విభజన వల్ల హైదరబాద్ లేకుండా పోయింది. ఏపీలో హైదరాబాద్ లాంటి నగరం లేకపోయినా నిలదొక్కుకోవాలనుకుంటున్నాం.. దీనికి కేంద్రం తప్పకుండా సహకరించాలి.. సహకరించి తీరాలని అన్నారు.   ప్రత్యేకహోదా ఇంకా ప్రత్యేకహోదా గురించి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ తాను ఈ నెల 25 న భేటీ కానున్నట్లు తెలిపారు. ఈ భేటీలో ప్రత్యేక హోదా ఒక్క విషయమే కాకుండా ఇంకా ఏపీ రాష్ట్రానికి కావలనిన అవసరాలను.. ఏపీకి ఉన్న ఇబ్బందుల గురించి మాట్లడతానని.. దీనికి సంబంధించిన ముసాయిదాను కూడా తయారుచేశామని తెలిపారు. అభిమన్యుడిలా వెంకయ్యనాయుడు అంతేకాదు ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి గురించి మాట్లాడుతూ రాష్ట్ర విభనప్పుడు వెంకయ్యనాయుడు ఏపీ కోసం చాలా పోరాడారన్నారు. కేవలం తమ పార్టీ ప్రయోజనాలకోసమే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించిన నేపథ్యంలో ఏపీకి అన్యాయం జరగకుండా భవిష్యత్ లో ఏపీకి కావలసిన అవసరాలు.. సమస్యలు గురించి రాజ్యసభలో అభిమన్యుడిలా పోరాడారని.. దానిని ఎప్పటికీ మరిచిపోలేమని ప్రశంసించారు. అంతేకాదు వెంకయ్య ఢిల్లీలో ఉన్నంతకాలం రాష్ట్రానికి ఎలాంటి అన్యాయం జరగదని కితాబిచ్చారు. రాజధాని అవసరాలకు వెంకయ్య ముందుగానే స్పందించారని, ఇప్పటికే రూ.500 కోట్ల నిధులు కేటాయించారని చెప్పారు.

విచారణ కోసం కాదు..కాల్ డాటాని భద్రపరచమని కోరేందుకేనట!

  ఫోన్ ట్యాపింగ్ కేసుపై దర్యాప్తు చేయడానికి నియమించబడిన ఆంద్రప్రదేశ్ సిట్ అధికారులు నిన్న సాయంత్రం తెలంగాణా హోంశాఖ కారదర్శిని విచారణకు హాజరుకమ్మని ఆదేశించేందుకు నోటీసులు ఇవ్వడానికి తెలంగాణా సచివాలయానికి వెళ్ళారని వార్తలు వచ్చేయి. వాళ్ళు వెళ్ళడం, ఆయనకీ నోటీసు ఇవ్వడం వరకు ఆ వార్తలు నిజమే కానీ ఆ నోటీసు విచారణ కోసం మాత్రం కాదు. మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు ఆయనకు సీల్డ్ కవర్లలో అందజేసిన కాల్-డాటా రికార్డులను భద్రంగా ఉంచమని కోరుతూ విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఆయనకు అందజేయడానికే వారు అక్కడికి వెళ్ళారు. ఆంద్రప్రదేశ్ సిట్ అధికారులు సచివాలయానికి వచ్చిన సంగతి తెలుసుకొని సచివాలయంలోని కొందరు ఉద్యోగ సంఘ నేతలు వచ్చి నిరసనలు తెలియజేసారు. కానీ పోలీసులు వారిని అడ్డుకొని సిట్ అధికారులను జాగ్రత్తగా వారి వాహనాల్లో పంపించివేశారు.

రాజధాని భూసేకరణకు నేడు రైతులకు నోటీసులు

  రాజధాని కోసం భూసమీకరణ 98శాతం పూర్తయ్యింది. కానీ మిగిలిన రెండు శాతం భూసేకరణకి నాలుగయిదు గ్రామాలలో రైతులు అంగీకరించకపోవడం వలన తప్పనిసరి పరిస్థితుల్లో వారికీ భూసేకరణ చట్టం క్రింద నోటీసులు ఇచ్చి భూమిని స్వాధీనం చేసుకోవలసి వస్తోంది. ఇంకా 2200 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. అందులో 700 ఎకరాల సేకరణకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత రైతులకు నోటీసులు ఇవ్వబోతున్నట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మిగిలిన 1,500 ఎకరాల భూసేకరణకు కూడా మరొక్క వారం రోజుల్లోగానే నోటీసులు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. కనుక ఇక ఈ వ్యవహారానికి ఇంతటితో ముగింపు పలకడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దం అవుతున్నట్లే భావించవచ్చును. మరి దీనిపై ఆ రైతులు, ప్రతిపక్షాలు, ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. పవన్ కళ్యాణ్ తను రాజధాని గ్రామాలలో రైతులను త్వరలోనే కలుస్తానని నిన్న ట్వీటర్లో ఒక మెసేజ్ పెట్టారు. ఏమయినప్పటికీ భూసేకరణలో ఈ ఆఖరిఘట్టంలో కొంత యుద్ద వాతావరణం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.

అనుష్క టార్చెర్ పెడుతున్న డైరెక్టర్ ఎవరు?

    ఇప్పటికే రుద్రమదేవి సినిమాని పూర్తి చేయడానికి గుణశేఖర్ చాలా కష్టపడ్డాడు. మొదటి నుండి ఈ సినిమాకు పాపం ఎదురుదెబ్బలు బాగానే తగిలాయి. అయినా ఏదోలా సినిమా మాత్రం పూర్తిచేశాడు. అయితే ఇప్పుడు ఈయనకు మరో సమస్య వచ్చిపడింది. అది ఎవరి వల్లో కాదు ఈ సినిమాలో రుద్రమదేవి పాత్ర పోషించిన నటి అందాల భామ అనుష్కవల్లనట. అదెలా అంటే రుద్రమదేవి రిలీజ్ నేపథ్యంలో భాగంగా గుణశేఖర్ ఈ సినిమా ప్రమోషన్లపై దృష్టి పెట్టాడు. అయితే ఈ ప్రమోషన్లపై అనుష్క అంత ఇంట్రస్ట్ చూపించట్లేదట. తన దృష్టంతా తన కొత్త సినిమా సైజ్ జీరో పై ఉందని.. ఈ ప్ర‌మోష‌న్ల‌పై అస్స‌లు దృష్టి నిల‌ప‌డం లేద‌ని టాక్‌. అయితే గుణశేఖర్ ఎలాగో కూర్చోపెట్టి ఇంటర్య్వూలు ఇప్పిస్తున్నాకాని సినిమా గురించి కాన్ఫిడెన్స్‌గా ఒక్క మాట కూడా మాట్లాడ‌డం లేద‌ట. టీవీ ఛాన‌ళ్ల లైవ్ పోగ్రాంకి ర‌మ్మంటే స‌సేమీరా అంటోంద‌ట‌. అయితే అనుష్క మాత్రం ఇప్పటికే ఈ సినిమాకి చాలా రోజులు కేటాయించాను ఇక నావల్ల కాదు అని తేల్చి చెప్పేసిందట.

రాహుల్ భయ్యా.. వదినెక్కడ

  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఎప్పుడూ ఒక సమాధానం లేని ప్రశ్న ఎదురవుతుంటుంది. అది ఏంటా అని ఆలోచిస్తున్నారా అదే రాహుల్ గాంధీ పెళ్లి విషయం. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా అమేథీలో తనకు ఆప్రశ్న ఎదురైంది. రాహుల్ గాంధీ తన నియోజకవర్గమైన అమేథీలో పర్యటిస్తున్న నేపథ్యంలో తన గెస్ట్‌హౌస్‌కు వెళ్లేముందు ఒక వ్యక్తి "భయ్యా, కబ్ తక్ అకేలా ఆయేగా? బాబీ కబ్ సాత్ ఆయేంగి? అంటే భయ్యా ప్రతిసారీ మీరొక్కరే అమేథీకి వస్తున్నారు.. వదినమ్మ ఎప్పుడు వస్తుంది అని ప్రశ్నించాడట. పాపం రాహుల్ గాంధీ ఏం చేస్తాడు ఎప్పటిలాగే చిన్న స్మైల్ ఇచ్చి వెళ్లిపోయారట. మొత్తానికి రాహుల్ గాంధీకి మాత్రం ఎక్కడికెళ్లినా అందరూ ఈ ప్రశ్న అడగటమే. ఇంకా ఎన్నాళ్లు జవాబు ఇవ్వకుండా తప్పించుకుంటారో చూద్దాం.

పవన్ ను ఒప్పించే భూములు సేకరిస్తాం..

  ఏపీ ప్రభుత్వం భూసేకరణ చేపడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రైతుల దగ్గర నుండి భూములు లాక్కోవద్దని.. ఏడాదికి మూడు పంటలు పండే పొలాలను భూసేకరణ చట్టం ద్వారా తీసుకోవద్దని ట్వీట్స్ ద్వారా చంద్రబాబును కోరారు. అయితే దీనికి యనమల కౌంటర్ ఇవ్వడం దానికి పవన్ కళ్యాణ్ రివర్స్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ విషయంపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ఏపీ రాజధానికి అటు రైతులను.. పవన్ కళ్యాణ్ ను ఒప్పించే భూసేకరణ చేస్తామని తెలిపారు. పవన్ కళ్యాణ్ తో మాకు ఎలాంటి విబేధాలు లేవని.. ప్రస్తుత పరిస్థితుల గురించి ఆయనకు తెలియదుని వాటిని వివరిస్తామని అన్నారు. కాగా భూసేకరణ నోటిఫికేషన్ వచ్చిన 24 గంటల్లో రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తామని.. సుమారు మూడువేల ఏకరాల భూమిని భూసేకరణ చట్టంద్వారా సేకరిస్తామని స్పష్టం చేశారు.

నాగార్జునతో అనసూయ

  ఎన్ని షోల్లో యాంకరింగ్ చేసిన జబర్దస్త్ కామెడీ షో ద్వారానే అనసూయకు ఫుల్ క్రేజ్ వచ్చిందన్నది మాత్రం వాస్తవం. దీంతో ఆమెకి సినిమాల్లో నటించే అవకాశాలు కూడా వస్తున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలో ఐటెంసాంగ్ చేసే అవకాశం దక్కింది కాని అనసూయ దానిని తిరస్కరించింది అనే వార్తలు కూడా వచ్చాయి. దాని తరువాత నాగార్జున సినిమాలో నటిస్తున్నానని చెప్పింది. అయితే ఇప్పుడు దీనికి సంబధించి స్వయంగా నాగార్జుననే తన ట్విట్టర్ ద్వారా సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో అనసూయ నటిస్తుందని.. ఆ సినిమాకు సంబంధించిన ఒక స్టిల్‌ ను కూడా పోస్ట్‌ చేశాడు. అయితే ఇంతకుముందు ఈ సినిమాలో అనసూయ నాగార్జున మరదలుగా నటిస్తుందని అని వార్తలు వచ్చాయి.. కాని అది ఎంతవరకు నిజమో తెలియదు.. నాగార్జున కూడా నటిస్తుంది అని అన్నారు కాని ఏ పాత్ర చేస్తుందో మాత్రం చెప్పలేదు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని పోస్ట్ చేస్తానని తెలిపారు. కాగా ఈ చిత్రానికి కళ్యాణ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మొత్తానికి బుల్లి తెర యాంకర్ అనసూయ వెండితెర మీద అది కూడా మన్మధుడు నాగార్జున సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.

ఫోన్ ట్యాపింగ్ లో ఏపీ మరో అడుగు

  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో  ఏపీ ప్రభుత్వం ఇంకో అడుగు ముందుకేసినట్టు కనిపిస్తుంది. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శికి గురువారం నాడు నోటీసులు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఇంకా కొంతమంది  నేతలు తమ ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సిట్ అధికారులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తుంది. దీనిలో భాగంగానే సిట్ అధికారులు కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు అందించనున్నట్టు సమాచారం.

యనమలకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

  భూసేకరణ వద్దని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్వీట్టర్ లో ట్వీట్ లు చేసిన సంగతి తెలిసిందే. ఉండవల్లి, పెనుబాక, బేతపూడి గ్రామల్లో భూములను భూసేకరణనుండి మినహాయించాలని నేరుగా చంద్రబాబునే కోరారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్లకు ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా స్పందించి భూసేకరణ వద్దని చెపుతున్న పవన్ కళ్యాణ్ ఏ చేయాలో కూడా చెబితే బావుంటుందని ఒకింత వెటకారంగానే సమాధాన మిచ్చారు. అయితే దీనికి పవన్ కళ్యాణ్ కూడా స్పందించి నేను రైతుల సమస్యల గురించి.. వారి ఆవేదనల గురించి ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే దాని వెటకారం చేయడం వారికే చెల్లిందని యనమలకు ఘాటుగా సమాధానమిచ్చారు. అయినా "సినిమా పరిశ్రమకు ఇచ్చింది హైదరాబాద్ లో ఉన్న కొండ ప్రాంతాలు కాని పంటలు పండే పచ్చని పొలాలు కాదని ఆ విషయాన్ని యనమల రామకృష్ణుడుకి తెలియదనుకుంటా" అని చురక అంటించారు.   ఇంకా "ముందు కట్టేది స్వర్గం అని తెలిస్తే అది త్రిశంకు స్వర్గమా రెగ్యులర్ స్వర్గమా అనేది తర్వాత అలోచించవచ్చు .." అని ట్వీటారు. కాగా త్వరలోనే బేతపూడి, ఉండవల్లి, పెనుమాక తదితర నదీ పరివాహక గ్రామాల రైతులను కలుస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు.  

రెండు రాష్ట్రాలకు సిగ్గుచేటు

  రాష్ట్ర విభజన ముందు తెలంగాణ, ఆంధ్రా అన్న విభేధాలు కొంతమంది మధ్య ఉన్న రాష్ట్ర విభజన తరువాత మాత్రం అది కాస్త ఎక్కువైందనే చెప్పవచ్చు. రాష్ట్రం విడిపోయి ఏడాదిపైన అయినా ఎన్నో విషయాలలో రెండు రాష్ట్రాలు గొడవలు, గిల్లికజ్జాలు పెట్టుకుంటూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి కట్టుగా ఒక పనిని మాత్రం చేస్తున్నాయి. ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారు కదా అది మహిళలను అవమానపరచడం. ఈ విషయంలో మాత్రం రెండు రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. ఆశ్చర్యం ఏంటంటే మహిళలను అగౌరపరచడం.. వారిని వేధించడంలో దేశంలోనే ఆంధ్రరాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా తెలంగాణ కూడా దాదాపు ముందు వరుసలోనే ఉంది. 2014 లెక్కల ప్రకారం ఈ నేరాల్లో ఆంధ్రరాష్ట్రం ముందుండగా రాష్ట్ర విభజన తరువాత కూడా రెండు రాష్ట్రాల్లో ఇదే కొనసాగుతుండటం గమనార్హం. ఒక్క దీనిలోనే కాదు అటు సైబర్ నేరాలు, మోసాలు వంటి నేరాల్లో కూడా తెలుగు రాష్ట్రాలు ముందున్నాయి. కాగా హత్యలు, కిడ్నాప్ కేసుల్లో ఉత్తరప్రదేశ్, అత్యాచారాల్లో మధ్యప్రదేశ్ తొలి స్థానం సంపాదించుకున్నాయి.

కేసీఆర్ ని గద్దె దించే వరకు పోరాడుతూనే ఉంటా! రేవంత్ రెడ్డి

  తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని మరికొందరు తెదేపా కార్యకర్తలను పోలీసులు మెహబూబ్ నగర్ కొండగల్ మార్కెట్ యార్డు వద్ద అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం ఆయన నియోజక వర్గంలో ఉన్న మార్కెట్ యార్డుకి మంత్రి జూపల్లి కృష్ణారావు భూమిపూజ చేసారు. కానీ, ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే అయిన రేవంత్ రెడ్డిని ఆ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడంతో ఆయన తను అంచరులతో కలిసి అక్కడికి చేరుకొని నిరసనలు తెలుపుతున్నప్పుడు పోలీసులు వారిని అడ్డుకొనే ప్రయత్నం చేయడంతో కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు వారందరినీ అరెస్ట్ చేసి దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. భూమిపూజ కార్యక్రమం పూర్తయ్యే వరకు వారిని స్టేషన్లో ఉంచి తరువాత విడుదల చేసారు.   స్థానిక ఎమ్మెల్యేనయినా తనకు ప్రొకాల్ ప్రకారం ఆహ్వానం పంపకపోగా తనను పోలీసుల చేత అరెస్ట్ చేయించినందుకు రేవంత్ రెడ్డి తెరాస ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈవిధంగా అరెస్టులతో తనను ఎవరూ భయపెట్టలేరని, తెదేపాను ఎంతగా అణగద్రొక్కే ప్రయత్నిస్తే మరినత శక్తివంతంగా ప్రభుత్వాన్ని ఎదుర్కొని పోరాడుతామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ని గద్దె దించేవరకు తన పోరాటం సాగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ ను ఏకేసిన వెంకయ్యనాయుడు

 ఏపీకి కేటాయించిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రారంభించారు. సీఎం చంద్రబాబు, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు, దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వాన్ని ఏకిపడేశారు. తమ పార్టీ ప్రయోజనాల కోసం యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించిందని.. ఏపీకి అన్యాయం చేసిందని మండిపడ్డారు. తెలంగాణా ఏర్పడాలి అలాగే ఏపీకి న్యాయం జరగాలి.. అన్ని సౌకర్యాలు ఇవ్వాలి అని పార్లమెంట్ లో ఎవరు గొంతు చించుకున్నారో అందరికి తెలుసని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో తనను అడ్డుకుంటామని కొందరు చెబుతున్నారని అడ్డుకుంటానంటే నాకు అభ్యంతరం లేదని, కానీ తాను వచ్చినప్పుడల్లా రాష్ట్రానికి ప్రాజెక్టు వస్తుందన్నారు. గడ్డిబొమ్మలు పెట్టి తన దిష్టి బొమ్మలు తలగబెట్టినంత మాత్రన అలాంటివి లెక్కచేయనని మండిపడ్డారు. అంతేకాదు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని కాంగ్రెస్ పార్టీ తెగ హడావుడి చేస్తుంది.. మరి యాభై ఏళ్లు పాలన చేసిన మీరు ఏం చేశారని ప్రశ్నించారు. తాను కష్టపడి ఇంతటి స్థాయికి వచ్చానని నలభై రాజకీయానుభవం ఉన్న నాకు మొదటి నుండి ఇదే పార్టీలో ఉన్నాను.. ఇదే పార్టీలో చస్తాను అని అన్నారు. అంతేకాని వారసత్వ రాజకీయాలతో రాలేదని కౌంటర్ ఇచ్చారు. ఎప్పుడు ఏ పార్టీలోకి మారతారో తెలియని వాళ్లు కూడా ఇప్పుడు తమను అడగడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.

చంద్రబాబు మోడీల భేటీ తేదీ ఖరారు

  ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీల భేటీ ఈ రోజు జరగాల్సిన నేపథ్యంలో కొన్ని అనివార్యకారణాల వల్ల వాయిదా పడింది. అనుకొని పరిస్థితుల్లో సమావేశానికి సమయం ఇవ్వలేకపోతున్నామని ప్రధానమంత్రి కార్యాలయం ఏపీ ప్రభుత్వానికి తెలిపిన నేపథ్యంలో భేటీ కాస్త వాయిదా పడింది. అయితే కేంద్రం తదుపరి భేటీకి ఈనెల 25 లేదా 28, 29, 31వ తేదీల్లో ఏదో ఒక రోజు ఢిల్లీకి రావచ్చని తెలిపింది. దీంతో చంద్రబాబు నాయుడు ఈనెల 25న భేటీకి ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రత్యేక హోదాపై ఏపీలో అనేక ఆందోళనలు జరుగుతున్నాయి. అందులోను మోడీ బీహార్ కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు మరీ ఏపీ ప్రత్యేక హోదాపై చర్చలు మరీ ఎక్కువయ్యాయి. దీంతో చంద్రబాబు కూడా ఇప్పటికే ఈ విషయంలో చాలా ఆలస్యమైందని భావించే 25వ తేదీనే సమావేశానికి ఎంచుకున్నారు.   మరోవైపు ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదాపైన ఇంకా ఏపీకి కావలసిన అవసరాలపై చంద్రబాబు తగిన ముసాయిదాను తయారుచేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపైన  అంతేకాదు ఏపీకి సంబంధించిన ప్రత్యేక హోదా డిమాండ్‌తో పాటు ఏపీకి ఆర్థిక లోటు, పోలవరం నిర్మాణం, రాజధాని నిర్మాణం తదితర అంశాలపై ప్రధానితో బాబు చర్చించాలని.. ఈ మేరకు మోడీని కూడా ఒప్పించాలని నిర్ణయం తీసుకన్నట్టు తెలుస్తోంది. కాగా ప్రత్యేక హోదా విషయంలో ఉత్తరఖండ్ మోడల్ లా ఏపీకి ప్రత్యేక హోదాకాని.. ప్రత్యేక ప్యాకేజీకాని కావాలని కోరనున్నట్టు సమాచారం. 

ఏపీకి ఒక్కచుక్క నీరివ్వం..

  ఏపీ నీటిపారుదల శాఖ కృష్ణా డెల్టాకు తాగునీటి అవసరాల నిమిత్తం 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖను కోరిన సంగతి తెలిసిందే. దీనికి తెలంగాణ నీటి పారుదల శాఖ నాగార్జున సాగర్‌ నుంచి కృష్ణాడెల్టాకు ఒక్కచుక్క కూడ తాగునీరు ఇవ్వలేమని.. ఈ నిల్వ ఉన్న నీటిలో ఏపీకి ఎలాంటి వాటా లేదని కృష్ణా బోర్డుకు తేల్చి చెప్పింది. అంతేకాదు ఏపీ శ్రీశైలం రిజర్వాయర్ నుండి నీటిని విడుదల చేస్తేనే సాగర్‌ నుంచి కృష్ణా డెల్టాకు తాగునీటిని విడుదల చేస్తామని తిరకాసు పెట్టింది. ఇదిలా ఉండగా ప్రస్తుతానికి ఇరు రాష్ట్రాల్లో నీటి కొరత ఉన్ననేపథ్యంలో సెప్టెంబర్‌ రెండో వారంలోగా కృష్ణానదికి వరదలు వచ్చి శ్రీశైలం, సాగర్‌ రిజర్వాయర్లు నిండితేనే తప్ప రెండు రాష్ర్టాలకు నీటి కరువు తీరుతుందని.. లేదంటే, శ్రీశైలంలో 803 అడుగులకు దిగువన ఉన్న 17-18 టీఎంసీలు, సాగర్‌లో 509 అడుగులకు దిగువన ఉన్న 130 టీఎంసీల నీటిని ఇరు రాష్ర్టాలు వాడుకోవాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో తాగునీటి కోసం రెండు రిజర్వాయర్లను ఖాళీచేయడం తప్ప వేరే మార్గం లేదని రెండు రాష్ర్టాల నీటి పారుదల శాఖ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

మహేష్ బాబుకి కేటీఆర్ ఫోన్.. ఒక ఊరు దత్తత

  మహేశ్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా విజయవంతం అయి సూపర్ కలెక్షన్స్ రాబట్టుకుంటుంది. అయితే ఈ సినిమాలో మహేశ్ బాబు ఎలాగైతే ఒక ఊరిని దత్తత తీసుకొని దాని అభివృధ్ధికి పాటుపడతారో.. దాని స్ఫూర్తితో రియల్ లైఫ్ లో కూడా ఊరిని దత్తత తీసుకుంటున్నారట. దీనికి కారణం తెలంగాణ సీఎం కుమారుడు.. ఐటీ మంత్రి కేటీఆర్ చెప్పడమే కారణమట. అసలు సంగతేంటంటే.. శ్రీమంతుడు సినిమాపై కేటీఆర్ ట్విట్టర్ ద్వారా మహేశ్ బాబుకు అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే బుధవారం ఆయనే స్వయంగా మహేశ్  బాబుకు ఫోనే చేసి సినిమా బావుందని అభినందనలు తెలిపి గ్రామజ్యోతి పథకంలో భాగంగా.. సినిమా స్ఫూర్తితో మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక గ్రామాన్ని దత్తతకు తీసుకోవాలని కోరారట. దీనికి మహేష్ బాబు కూడా సానుకూలంగానే స్పందించారట. ఈ విషయాన్ని స్వయంగా మహేశ్ బాబే ట్వీట్టర్ ద్వారా తెలియజేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను కూడా త్వరలో తెలియజేస్తానని..   మరోవైపు మహేశ్ బాబు ఏపీలో కూడా ఒక గ్రామాన్ని దత్తత తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన స్మార్ట్ విలేజ్ కార్యక్రమం కింద తన సొంత గ్రామమైన బుర్రిపాలెంను దత్తత తీసుకునేందుకు స్ఫూర్తినిచ్చిందని మహేష్ తెలిపారు. మొత్తానికి మహేశ్ బాబు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా శ్రీమంతుడనిపించాడు.  

చిరంజీవి 150 సినిమాపై వీడిన కన్ఫ్యూజన్

  చిరంజీవి 150వ సినిమా గురించి ఇప్పటకే ఎన్నో వార్తలు వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి. ఈ సినిమా వస్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ రాకముందే ఈ సినిమాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మొదట్లో ఈ సినిమాకి వినాయక్ డైరెక్టర్ అని వార్తలు వచ్చాయి.. తరువాత ఈ పూరి జగన్నాథ్ అని అన్నారు. ఆతరువాత పూరిజగన్నాథ్ కాదు అని కూడా వార్తలు వచ్చాయి.. అయితే మళ్లీ ఈ సినిమాకు పూరీనే డెైరెక్టర్ అని మళ్లీ అన్నారు. మొత్తానికి ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారో ఇప్పటికీ అభిమానులకు కన్ఫ్యూజన్ గానే ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమాపై కన్ఫ్యూజన్ వీడింది. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ డైరెక్టర్ కాదని ఈ విషయాన్ని చిరంజీవీనే స్వయంగా వెల్లడించారు. ఈ సినిమాకు పూరి ఇప్పటివరకూ ఫస్ట్ హాఫ్ మాత్రమే చెప్పాడని, సెకండ్ హాఫ్ ఇంకా ఇవ్వలేదని చెప్పారు. అంతేకాదు ఇంకా వేరే దర్శకులు కథలు కూడా వింటున్న అని అవి కనుక నచ్చితే వచ్చే రెండు మూడు నెలల్లో షూటింగ్ మొదలవుతుంది అని చిరు స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతానికి కన్ఫ్యూజన్ పోయిన మళ్లీ చిరంజీవి 150వ సినిమా ఎవరు డైరెక్ట్ చేస్తారో ఇంకా తెలియని సస్పెన్స్ గానే ఉన్నది.

మహిళల రేప్ పై ములాయం వివాదాస్పద వ్యాఖ్యలు

  సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా మహిళల అత్యాచారం విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ మహిళను నలుగుర వ్యక్తులు ఒకేసారి ఎలా అత్యాచారం చేస్తారని, అదంతా వట్టిదేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఒక వ్యక్తి అత్యాచారం చేస్తే దానిని మిగిలిన వారిని కూడా ఆపాదిస్తున్నారని అన్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, హింసలు పెరుగుతున్నాయని విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ములాయం పైవిధంగా వ్యాఖ్యానించారు. మిగిలిన రాష్ట్రాలకంటే ఉత్తరప్రదేశ్ చాలా బెటర్ అని.. ఇక్కడ అత్యాచారాలు, నేరాల సంఖ్య తక్కువగా ఉందని.. అసలు గ్యాంగ్ రేప్‌లు లేవని అన్నారు. అయినా రాష్ట్రంలో జరిగే ప్రతి ఒక్క నేరంపై ప్రభుత్వం దృష్టి సారించాలంటే కష్టమన అన్నారు. ఇదిలా ఉండగా ములాయం చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ములాయం సింగ్ ఇలా వ్యాఖ్యానించడం అనైతికం అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.