ఇళయరాజాకు అస్వస్థత

  ప్రముఖ సంగీత దర్శకుడు, 72 సంవత్సరాల వయసున్న ఇళయరాజా అస్వస్థతకు గురయ్యారు. రెండు సంవత్సరాల క్రితం స్వల్పంగా గుండెపోటుకు గురైన ఆయన ఆ తర్వాత కోలుకుని సంగీత దర్శకుడిగా ఉత్సాహంగానే పనిచేస్తున్నారు. ఆగస్టు 15వ తేదీన ఆయన తనకు కడుపులో నొప్పిగా వుందని చెప్పడంతో ఆయనను బంధువులు చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆయన గ్యాస్టిక్ సమస్యతోపాటు, పేగులోకి రక్తం చేరిన సమస్యతో బాధపడుతున్నారని తెలుస్తోంది. అయితే ఇది స్వల్ప అస్వస్థతేనని, ఆయనను రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రివర్గాలు ప్రకటించాయి. ఇళయరాజా మూడు దశాబ్దాలకు పైగా అనేక భారతీయ భాషల్లో ఐదు వేల పాటలకు పైగా సంగీతాన్ని సమకూర్చడంతోపాటు జాతీయ అవార్డును కూడా అందుకున్న విషయం తెలిసిందే.

రెండు విమానాలు ఢీ

  అమెరికాలో రెండు విమానాలు ఢీకొన్నాయి. అమెరికాలోని శాండియాగో కౌంటీలో ఈ ప్రమాదం జరిగింది. రెండు చిన్న విమానాలు ఢీకొన్న ఈ ప్రమాదంలో నలుగురు మరణించినట్టు తెలుస్తోంది. రెండు ఇంజన్లు వుండే సాబ్రిలైనర్జెట్, ఒకే ఇంజన్ వుండే సెస్‌న్నా 172 విమానాలు బ్రౌన్‌ఫీల్డ్ ప్రాంతానికి సమీపంలో ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయి. రెండు విమానాల శకలాలూ పొలాల్లో ఒకేచోట పడిపోయాయి. ఇటీవలి కాలంలో అమెరికాలో ఇలాంటి చిన్న విమానాల ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. ఇదిలా వుండగా, ఇండోనేసియాలో ఆదివారం నాడు 54 మంది ప్రయాణికులతో అదృశ్యమైన విమానం కూలిపోయినట్టుగా భావిస్తున్నారు. విమానంలో ప్రయాణిస్తున్న అందరూ చనిపోయి వుంటారని అనుమానిస్తున్నారు.

కూలిన ఇండోనేషియా విమానం, 54మంది గల్లంతు

  ఇండోనేషియాలో త్రిగానా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఆదివారం కూలిపోయింది. దానిలో విమాన సిబ్బందితో సహా మొత్తం 54 మంది ఉన్నారు. ఆదివారం ఉదయం పపువా ప్రావిన్స్ రాజధాని జయాపురలోని సెంటాని విమానాశ్రయం నుంచి భారత కాలమాన ప్రకారం ఉదయం 11.30 గంటలకు ఒక్సిబిల్ కి బయలుదేరింది. కానీ కొద్ది సేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయి. ఓకేబెవ్ అనే జిల్లాలో తాంగాక్ పర్వతం వద్ద కూలిపోయినట్లు స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో తక్షణమే సహాయ సిబ్బందిని అక్కడికి పంపడానికి ప్రయత్నించారు. కానీ దట్టమయిన అడవులు, కొండలతో నిండిన ఆ ప్రాంతానికి ఇంతవరకు ఎవరూ చేరుకోలేకపోయారు. కనుక విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల, సిబ్బంది ఆచూకి ఇంకా తెలియలేదు. కొద్ది సేపటి క్రితమే అక్కడికి సహాయ సిబ్బంది చేరుకొని ప్రయానికుల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.   ప్రతికూల వాతావరణం కారణంగానే ఈ విమాన ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. గత ఏడాది కాలంలో ఆ దేశానికి చెందిన రెండు విమాన ప్రమాదాలు జరిగాయి. ఇది మూడవది. త్రిగానా ఎయిర్ లైన్స్ సంస్థ చరిత్రలో ఇంతవరకు 14 విమాన ప్రమాదాలు జరిగాయి. విమాన భద్రతా ప్రమాణాలు లేని కారణంగా ఆ సంస్థను ఐరోపా యూనియన్ చాలా కలం క్రితమే బ్లాక్ లిస్టులో పెట్టింది. కానీ నేటికీ ఆ విమాన సంస్థ తన విమానాలను నడుపుతూనే ఉంది. ఇలాగ అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రయానికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతూనే ఉన్నాయి.

గవర్నర్ విందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు డుమ్మా?

  స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా గవర్నర్ నరసింహన్ని నిన్న రాజ్ భవన్ లో ఇచ్చిన తేనీటి విందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరవలేదు. అందుకు గవర్నర్ నొచ్చుకొన్నప్పటికీ ఈ విషయం గురించి అనవసరంగా రాద్ధాంతం చేయవద్దని మీడియాని కోరారు. చంద్రబాబు నాయుడు పట్టిసీమ ప్రాజెక్టు ప్రారంభోత్సవం, కేసీఆర్ కృష్ణా జలాలపై సమీక్షా సమావేశాలతో తీరిక లేనందునే రాలేకపోయారని ఆయన తెలిపారు. ఇద్దరు ముఖ్యమంత్రులకి తను ఆమోదయోగ్యుడినేనని, హైదరాబాద్ లో ఉన్నంత వరకు అందరూ తనను ఆదరిస్తారనే నమ్మకం ఉందని తెలిపారు. తను చాలా ఆశవాదినని సమస్యలన్నీ క్రమంగా సర్దుకొంటాయని ఆశిస్తున్నానని తెలిపారు. తను గవర్నర్ పదవిలో చివరి రోజు వరకు కూడా సంతోషంగా ఉంటానని అన్నారు. ఈ సమావేశానికి తెలంగాణా ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, కేంద్రమంత్రులు సుజనా చౌదరి, బండారు దత్తాత్రేయ, తెలంగాణా మంత్రులు, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోస్లే తదితరులు హాజరయ్యారు.

అనుష్క లుక్ పై సమంత ట్వీట్

  అందాల నటి అనుష్క, ఆర్య జంటగా కలిసి సైజ్ జీరో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో సైజ్ జీరో అంటే అనుష్క కూడా అదే సైజులో ఉంటుందని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో అనుష్క భారీకాయం లుక్‌తో ఫోటో చూసి ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిజంగానే అనుష్క లుక్ డిఫరెంటుగా... సైజ్ జీరోకు వ్యతిరేకంగా చాలా బొద్దుగా ఉంది. దీనిలో భాగంగాన్ ఆర్యతో కలిసి ఇచ్చిన ఫోటో ఫోజుతో ఇప్పుడు సినిమాపై ఆసక్తి నెలకొంది. వెయిట్ లాస్ కాన్సెప్ట్ తో తీస్తున్న ఈసినిమాలో ఈపాత్ర కోసం అనుష్క 20 కేజీల బరువు పెరిగిందట. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న వరల్డ్ వైడ్‌గా 1500 థియేటర్స్‌లో ‘సైజ్ జీరో’ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.   ఇదిలా ఉండగా ఈ సైజ్ జీరోలో అనుష్క లుక్ పై మరో అందాల చిన్నది సమంత అనుష్క అక్కా... సైజ్ జీరో లుక్ అదిరిపోయిందక్కా అంటూ ట్వీట్ చేసింది.

ఆ ప్రశ్న ప్రతిఒక్కరూ వేసుకోవాలి.. ప్రణబ్

  గత నెలలో ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీయే కారణమని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ విషయంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పందించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 69వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు చర్చలకు వేదికగా కాకుండా యుద్ధభూమిగా మారుతుందని అన్నారు. పార్లమెంట్ లో రాజకీయ పార్టీలు చేసే వైఖరి సరైనది కాదని.. ఒకసారి పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. ప్రజాస్వామ్యం ఒత్తిడికి లోనవుతోందని.. ప్రజాస్వామ్యమనే అతి పెద్ద వృక్షానికి వేళ్లు బలంగా ఉన్నా దాని ఆకులు వాడిపోతున్నాయని ఆరోపించారు. మనం పునఃపరిశీలన చేసుకోవాల్సిన తరుణమిదే’’ అని స్పష్టం చేశారు. ఇప్పుడు మనం మన స్వాతంత్ర్య సమర యోధులకు ఇస్తున్న గౌరవ మర్యాదలు మన తరువాతి తరాలు మనకు ఇస్తాయా? అంటే దీనికి సరైన సమాధానం రాకపోవచ్చుకాని ప్రతి ఒక్కరు ఈ ప్రశ్న వేసుకోవాలని అన్నారు.

పవర్ స్టార్ సర్దార్ ఫస్ట్ లుక్

  స్వాతంత్య దినోత్సవం సందర్బంగా పవర్ స్టార్ అభిమానులకు ఓ మంచి కానుకను అందజేశారు. ఎప్పటినుండో అనుకుంటున్న గబ్బర్ సింగ్ సీక్వెల్ తో వస్తున్న సర్దార్ సినిమా ఫస్ట్ లుక్ ను నిన్న అర్ధరాత్రి రిలీజ్ చేశారు. గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆసినిమాలో ఉన్నట్టుగానే ఇందులోకూడా పవన్ కళ్యాణ్ చేతిలో గన్నులతో, మెడలో ఎర్రటి తువ్వాలుతో ... చొక్కా గుండీలు విప్పేసి సూపర్ మాస్ పోలీసాఫీరసర్‌గా కనిపిస్తున్నారు. గట్స్.. గన్స్.. లవ్.. అంటూ ఓ క్యాప్షన్‌తో పాటు సాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేశాడు పవర్ స్టార్. కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ను పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు.

కేంద్రం మాట నిలబెట్టుకోవాలి.. బాలకృష్ణ

  హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ ప్రత్యేక హోదాపై స్పందించారు. ఈ రోజు స్వాంతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఆయన తన నియోజకవర్గమైన హిందూపురంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఎంజీఎం గ్రౌండ్ లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత ఆంధ్ర రాష్ట్రం చాలా నష్టపోయిందని.. అలాంటి ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం తను ఇచ్చిన హామీని తప్పకుండా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అంతేకాదు హిందూపురం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని.. ప్రజలంతా సోదరభావంతో మెలగాలని బాలయ్య పిలుపునిచ్చారు.

పర్వతం ఎవ్వడికి ఒంగి సలామ్ చెయ్యదు.. పవన్

  జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వాతంత్యదినోత్సవం సందర్భంగా అందరికి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆయన చేసిన ట్వీట్ లు అందరిలో ఆసక్తి రేపుతున్నాయి. ఎప్పటిలాగే పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ట్వీట్ లు చేశారు. "సముద్రం  ఒకడి  కాళ్ళ  దగ్గర  కూర్చుని మొరగదు, తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు, పర్వతంఎవ్వడికి  ఒంగి సలామ్ చెయ్యదు.. నేనింతా ఒక  పిడికెడు మట్టే కావచ్చు కాని కలమెత్తితే ఒక దేశపు జండా కున్నంత  పొగరుంది అంటూ ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ కావ్యాన్ని గుర్తుచేస్తూ ట్వీట్స్ పోస్టు చేశారు. కవి శేషేంద్ర శర్మ ఎలాగైతే చెప్పారో అలాంటి భావనే ప్రతిఒక్కరి మనసులో ఉండాలని అన్నారు.  

ప్రతిపక్షాలకు చంద్రబాబు కౌంటర్

  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ అటు పార్టీ నేతలనుండి.. ఇటు సామాన్య ప్రజల వరకూ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదా సంగతేమోకాని ఈ విషయాన్ని అడ్డుపెట్టుకొని చంద్రబాబును ఇరుకున పడేద్దామని చూస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ ప్రతిపక్షాలైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సీపీఐ పార్టీలు ఇదే అదనుగా చంద్రబాబుపై విమర్శల బాణాలు సంధిస్తూ వచ్చారు. అసలు ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా ఎప్పుడు విమర్శలు చేద్దామా అని చూసే జగన్ అయితే ఏకంగా ఢిల్లీలోనే ధర్నా చేపట్టాడు. అయితే ఇప్పుడు వీళ్లందరికి చంద్రబాబు కౌంటర్ ఇచ్చారా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే మోదీ ప్రత్యేక హోదా పై తనకు ఫోన్ చేశారని ఆగష్ట్ 15 తరువాత ఈ విషయం పై భేటీ అయి చర్చిద్దామని చెప్పినట్టు తెలిపారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబు భేటీ అయ్యేంత వరకూ ప్రతిపక్షనేతలు ఆగాల్సిందే.   మరోవైపు బీజేపీ మిత్రపక్షమైనప్పటికీ ప్రత్యేకహోదా విషయంపై ఎట్టిపరిస్థితిలోనూ రాజీ పడే ప్రసక్తి లేదని ఈ విషయంలో కూడా చంద్రబాబు వ్యూహాత్మకంగానే వ్యవహరించారని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత ప్రధానిదేనని, విభజన సమస్యలను పరిష్కరించి ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి అవసరమైన సాయమంతా కేంద్రం చేయాల్సిందేనని ఆయన స్పష్టంగా చెప్పారు. అంతేకాదు ప్రత్యేక హోదా ఒక్కటే చాలదని.. ఏపీకి కావాలసిన అన్ని ప్రయోజనాలు పొందేలా చూసుకోవాలని అని అన్నారు.   దీంతో ప్రస్తుతానికి ప్రతిపక్షాల నేతల నోటికి తాళం పడినట్టయింది. మళ్లీ వాళ్లు ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబుపై విమర్శలు చేయాలంటే మోడీ చంద్రబాబు భేటీ వరకూ ఆగాల్సిందే. అయితే చంద్రబాబు అప్పటికీ ఈ విషయంపై ఒక స్పష్టత తీసుకువస్తారని రాజకీయ నేతలు అనుకుంటున్నారు.

విశాఖలో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు సంపూర్ణం

  విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా సాగరతీరాన్న స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చాలా ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులు, చీఫ్ సెక్రెటరీ ఐ.వై.ఆర్. కృష్ణారావు, డీజీపి రాముడు తదితరులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జెండా ఎగురవేసి ఈ వేడుకలను ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర పోలీసు దళాలు, భద్రతా దళాలు, హోం గార్డులు, ఎన్.సి.సి. బృందాలు, సైనిక స్కూల్ విద్యార్ధులు తదితర బృందాలు ముఖ్యమంత్రికి గౌరవ వందనం సమర్పించాయి. విశాఖలోనే మొట్టమొదటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. విశాఖనగరంలోనే అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అదే జరిగితే రాష్ట్ర విభజన తరువాత ప్రభుత్వం విశాఖలో మూడు ప్రధాన కార్యక్రమాలు నిర్వహించినట్లవుతుంది.

సానియాకు ఖేల్ రత్నఅవార్డు

  క్రీడా రంగంలో విశేష కృషి చేసిన వారికి ప్రతీఏటా ఇచ్చే ఖేల్ రత్న, అర్జున అవార్డుల పేర్లను కేంద్రప్రభుత్వం నిన్న ప్రకటించింది. దేశంలో మొత్తం 17 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు ప్రకటించింది. ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారంగా భావించబడే రాజీవ్ ఖేల్ రత్న అవార్డును ఖరారు చేసింది. ప్రముఖ క్రికెట్ ఆటగాడు రోహిత్ శర్మకు అర్జున అవార్డు ఖరారయింది. అర్జునా అవార్డులు అందుకోబోతున్న వారిలో ఇద్దరు తెలుగు వారు కూడా ఉన్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్, స్కేటింగ్ క్రీడాకారుడు అనూవ్ కుమార్ అర్జునా అవార్డులకు ఎంపిక అయ్యారు.

ఆధార్‌తో ఓటర్ అనుసంధానం ఆపండి.. సుప్రీం

  ఆధార్ కార్డుతో ఓటరు అనుసంధానం అంటూ పెద్ద ఎత్తున ఈ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఈ అనుసంధాన ప్రక్రియను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ ప్రక్రియను నిలిపివేయాలని.. అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇక మీదట ఓటర్ల నుంచి ఆధార్ నంబర్లు తీసుకొవద్దని తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అంతేకాదు అధార్ కార్టు తప్పనిసరి కాదని ఈ విషయాన్ని పత్రికలు, టీవీల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆధార్‌లో పొందడానికి ప్రజలు ఇచ్చిన వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ ఇవ్వరాదని, యఐడీఏఐ విభాగానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ప్రజా పంపిణీ వ్యవస్ధ, గ్యాస్ రాయితీలకు తప్ప మరే పథకానికి ఆధార్ డేటాను ఉపయోగించుకోవడానికి వీల్లేదంటూ గతంలోనే సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

మంత్రుల స్టార్ హోటళ్ల బస కట్

  ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్టార్ హోటళ్లలో మంత్రుల బస పైన నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. మంత్రులు స్టార్ హోటళ్ల నుండి బయటకు రావాలని సూచించారు. ప్రభుత్వ అతిథి గృహాల్లో మంత్రులు నివాసం ఉండాలని సూచించారు. దీనిలో భాగంగానే మంత్రులు అతిథి గృహాల్లో ఉండాలంటే వాటి మరమ్మతు పనులు చేయాలని రోడ్స్ అండ్ బిల్డింగ్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలా మంది విజయవాడ రానున్నారని.. వారి కార్యాలయాలు.. వసతి ఏర్పాట్ల గురించి జవహర్ కమిటీ పర్యవేక్షిస్తుందని చెప్పారు. హడ్కో ద్వారా రాజధాని ప్రాంతంలో ఉద్యోగులకు ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. త్వరలో పదివేల ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామన్నారు.

విమర్శలు తప్ప ఒరిగేదేం లేదు

కాంగ్రస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహాల్ గాంధీ ప్రస్తుతం రాజకీయాల్లో చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు.  సెలవులకంటూ కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిన రాహుల్ తిరిగొచ్చిన తరువాత ఏమయిందో ఏమో కానీ బాగానే ప్రతిపక్షాలకు ధీటుగా రాజకీయ వ్యూహాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. దానికి పార్లమెంట్ సమావేశాలే నిదర్శనమని చెప్పవచ్చు. భూసేకరణ బిల్లుపై.. లిలిత్ మోదీ వ్యవహారంపై పార్లమెంట్లో చేసిన గందరగోళం అంతా ఇంతా కాదు. గత నెలలో ప్రారంభమైన వర్షకాల సమావేశాలు నిన్నటితో ముగిశాయి.. కానీ ఈ సమావేశాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి మొత్తం సారధ్యం వహించింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. తనయుడు రాహుల్ గాంధీ అని అందరికీ అర్ధమవుతోంది.   ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాది కాలం పాటు నోరు మెదపకుండా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన దూకుడుని ప్రదర్శిస్తుంది. ఇప్పటికే పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో ఉనికి లేకుండా పోయింది.. ఇంకా అలానే ఉంటే భవిష్యత్ లో పార్టీ ఉంటుందో లేదో అని అనుకున్నారమే కానీ తల్లి సోనియా.. తనయుడు రాహుల్ కలిసి పార్టీని కాపాడటానికి చాలా కష్టపడుతున్నట్టు కనిపిస్తోంది. వారితో పాటు కాంగ్రెస్ నేతలను కూడా పరుగులు పెట్టిస్తూ ధర్నాలంటూ, నిరసనలంటూ చెమటలు పట్టిస్తున్నారు.   కానీ అధికారం ఉన్నప్పుడు చేయనివారు.. అధికారం లేని తరువాత ధర్నాలు నిరసనలు చేస్తే ప్రశంసించే వాళ్ల సంగతేమో కాని విమర్శించేవాళ్లే ఎక్కువమంది ఉంటారు. దానికి కారణాలు లేకపోలేదు.. అసలు యూపీఏ ప్రభుత్వం హయాంలో ఉన్నన్నీ రోజులు రైతులు ఎంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.. కానీ అప్పట్లో అధికారంలో ఉన్నారు కదా అని పట్టించుకోలేదు. ఇప్పుడు రైతు ఆత్మహత్య భరోసా అంటూ రైతుల కుటుంబాలను పరామర్శిస్తే మాత్రం ప్రతిపక్షాలు విమర్శించకుండా ఉరుకుంటాయా. అదే విధంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎంపీలను సస్పెండ్ చేసి విభజన బిల్లు ఆమోదం పొందేలా చేశారు సోనియాగాంధీ.. ఇప్పుడు తమ పార్టీ ఎంపీలను సస్పెండ్ చేసినందుకు ప్రజాస్వామ్యం చనిపోయిందంటూ మొత్తుకుంటూ ధర్నాలు చేస్తే మాత్రం ఎవరు పట్టించుకుంటారు. పైగా ఈ విషయంపై సోనియాగాంధీపై చాలా మంది అప్పడు గుర్తుకు రాని  ప్రజాస్వామ్యం ఇప్పుడు గుర్తొచ్చిందా అంటూ చురకలు వేశారు. ఇదిలా ఉండగా తమ పార్టీ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విడదీసి ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ మొసలి కన్నీరు కారుస్తుంది. దీనిలో భాగంగా రాహుల్ గాంధీ ఏపీలో ధర్నా కూడా చేయాలని నిర్ణయించుకున్నారంట. రాష్ట్రాన్ని విభజించినందుకే కాంగ్రెస్ పార్టీ పై పీకల్లోతు కోపంతో ఉన్న ఏపీ జనాలు ఇప్పుడు రాహుల్ గాంధీ ఏదో ప్రత్యేక హోదా కోసం ఏపీలో ధర్నా చేస్తే మాత్రం వారిని ఆదరిస్తారా.. ఇప్పటికే ఈ విషయంపై విమర్శలు వినిపిస్తున్నాయి.   ఏది ఏమైనా సోనియాగాంధీ.. రాహుల్ గాంధీ ఏదో ఆవేశ పడిపోయి తమ పార్టీని ఉనికిని ప్రజల్లోకి తీసుకురావడానికి ఈ పనులన్నీ చేయడం తప్ప దీని వల్ల వారికి విమర్శలు తప్పితే ఒరిగేదేమీ లేదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎన్ని చేసినా ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది కల్ల అంటున్నారు రాజకీయపెద్దలు.

ప్రముఖ నాస్తికవాది లవణం మృతి

  ప్రముఖ నాస్తికవాది, సంఘసేవకుడు గోపరాజు లవణం ఈరోజు తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన విజయవాడలోని రమేష్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందారు. ఆయన వయస్సు 86 యేళ్లు.   లవణం హేతువాదం, నాస్తికవాదంపై అనేక గ్రంథాలను రచించారు. సంఘం, ది ఎథిస్ట్‌, నాస్తిక మార్గం పత్రికలు లవణం సంపాదకీయంలో వెలువడ్డాయి. చిన్నతనంలోనే స్వాతంత్ర్యం ఉద్యమంలో పాల్గొని.. 1973లో విజయవాడ హేతువాద సంఘ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అస్పృశ్యత, కుల నిర్మూలన కోసం తీవ్రంగా కృషి చేశారు. ప్రముఖ రచయిత గుర్రం జాషువా కుమార్తె హేమలతను లవణం వివాహం చేసుకున్నారు.   కాగా లవణం మృతికి సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు లవణం మృతదేహాన్ని బెంచిసర్కిల్‌లోని నాస్తిక్‌ కేంద్రానికి తరలించి ఈ రోజు సాయంత్రం వరకు ప్రజల సందర్శనార్ధం భౌతికకాయాన్ని అక్కడే ఉంచనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

కేసీఆర్ పై పోరాడుతూనే ఉంటా.. రేవంత్ రెడ్డి

  తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్ పై ధ్వజమెత్తారు. ఈ రోజు నోటుకు ఓటు కేసు విచారణలో ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం కుట్రపూరితంగానే తనను ఈ కేసులో ఇరికించిందని.. తనను ఈ కేసులో ఇరికించిన వారిని వదిలిపెట్టనని అన్నారు. గద్దె దిగే వరకూ కేసీఆర్ పై పోరాడుతూనే ఉంటానని.. మరో 25 ఏళ్లైనా కొడంగల్‌ నియోజకవర్గం నుంచి గెలుస్తానని రేవంత్‌ ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఈకేసులో నిందితులైన సెబాస్టియన్‌, ఉదయ్‌సింమాలు కూడా కోర్టుకు హాజరయ్యారు. అయితే ఏసీబీ అధికారులు సప్లమెంటరీ సమన్లను కోర్టులో దాఖలు చేసిన నేపథ్యంలో ఏసీబీ చార్జిషీటును పరిగణలోకి తీసుకున్న తర్వాత సమన్లు పంపించనున్నట్లు కోర్టు తెలియజేసింది. ఈ నేపథ్యంలో సమన్లు జారీ అయిన అనంతరం మరోసారి ఏసీబీ ఎదుట రేవంత్‌ అయ్యే అవకాశం ఉంది.