కాంగ్రెస్ ఎమ్మెల్సీ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ విమర్శలు.. అందుకే గెలిచారు..!

రాజకీయాల్లో గెలిచిన పార్టీ నేతపై.. ఓడిపోయిన పార్టీ నేతలు విమర్శలు చేయడం సహజమే. ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు కూడా అదే పని చేస్తున్నారు. తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ 12 స్థానాల్లో ఆరు ఎన్నికలు జరగకముందే టీఆర్ఎస్ పార్టీ ఆరు స్థానాలను ఎకగ్రీవంగా కైవసం చేసుకుంది. ఇక పోటీ జరిగిన ఆరు స్థానాల్లో నాలుగు స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకోగా ఊహించని విధంగా రెండు స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది రెండు స్థానాలే అయినా గెలిచిన అభ్యర్ది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపైన టీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. కోమటి రెడ్డి ఒక్కొక్క ఓటరుకు స్విఫ్ట్ కారు గిఫ్టుగా ఇచ్చారని.. మహిళ ఎంపీటీసీలు - జడ్పీటీసీలకు పది తులాల చొప్పున బంగారు గొలుసులు ఇచ్చారని విమర్శలు చేశారు. అంతేకాదు మొత్తం 12 స్థానాల్లో కాంగ్రెస్ గెలుచుకుంది రెండు సీట్లే గెలిచిందని.. రెండు సీట్లకే కాంగ్రెస్ పార్టీ విర్రవీగుతుందని ఎద్దేవ చేశారు. ఇదిలా ఉండగా మరోవైపు రాజేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారంటూ ఖండిచారు. అంతేకాదు రాజేశ్వరరెడ్డి చేసిన ఆరోపణను రుజువు చేస్తే కోమటిరెడ్డి తో తాము రాజీనామా చేయిస్తామని సవాల్ చేశారు. మరి  రాజేశ్వర్ రెడ్డి తాను చేసిన ఆరోపణను నిరూపిస్తారో లేదో చూడాలి.

కేసీఆర్ కు మోడీ లేఖ..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 23 నుండి 27 వరకు ఆయుత చండీయాగం నిర్వహించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ యాగానికి అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. అయితే ఇప్పుడు కేసీఆర్ నిర్వహించిన యాగం గురించి ప్రశంసిస్తూ ప్రధాని నరేంద్రమోడీ కేసీఆర్ కు లేఖ రాసినట్టు తెలుస్తోంది. అయుతచండీ మహాయాగం నిర్వహించడం సంతోషకరమని.. యాగం విజయవంతం కావడం పట్ల మోడీ అభినందనలు తెలిపారు. యాగం వల్ల ఆధ్యాత్మిక సంక్షేమ, లోక కల్యాణం, విశ్వశాంతి చేకూరుతుందని ఆకాంక్షించారు. విశ్వశాంతి కోసం యాగం నిర్వహించడం మంచిదని.. యాగం ఫలితాన్నిస్తుందన్నారు.

కాల్ మనీ.. లొంగిపోయిన సత్యానందం

కాల్ మనీ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న డీఈ సత్యానందం లొంగిపోయాడు. ఈరోజు ఉదయం విజయవాడలోని న్యాయస్థానం ముందు సత్యానందం లొంగిపోయాడు. అయితే సత్యానందంకు ఇటీవలే ముందుస్తు బెయిల్ మంజూరైనట్టు తెలుస్తోంది. రూ. లక్ష రూపాయల పూచికత్తుతో కోర్టు సత్యానందంకు బెయిల్ మంజూరు చేశారు. అంతేకాదు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు మాచవరం పీఎస్ లో హాజరుకావాలని ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు యలమంచిలి రామ్మూర్తి అలియాస్ రాము, దూడల రాజేష్, భవానీ శంకర్ అరెస్టయి జైలులో ఉన్నారు. చెన్నుపాటి శ్రీను, పెండ్యాల శ్రీకాంత్, వెనిగళ్ళ శ్రీకాంత్‌ పరారీలో ఉన్నారు. కాగా ఈ కాల్ మనీ వ్యవహారంపై హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 250 కాల్ మనీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. కాల్ మనీ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కేసీఆర్,గవర్నర్.. విందులే.. విందులు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ గత వారం రోజుల నుండి విందులలో పాల్గొంటూ తెగ బిజీగా ఉన్నారు. ఒకప్పుడు విందులంటే డుమ్మా కొట్టే కేసీఆర్.. ఇప్పుడు తెగ విందులలో పాల్గొంటున్నారు. ఈ నెల 23 నుండి 27 వరకూ  నిర్వహించిన ఆయుత చండీయాగంలో గవర్నర్ నరసింహన్ కూడా హాజరయ్యారు. దాదాపు చండీయాగం పూర్యయే వరకూ గవర్నర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక కార్యక్రమంలో విందు సంగతి సరేసరి. అలా యాగం పూర్తయిందో లేదో.. తర్వాత శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ నరసింహన్ 29న రాజ్ భవన్ లో  విందును ఏర్పాటు చేశారు. గవర్నర్ ఇచ్చిన ఈ విందు కార్యక్రమానికి రాష్ట్రపతితో పాటు ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. ఇక తర్వాతి రోజు 30న రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్ ఎట్ హోం పేరిట విందును ఏర్పాటు చేశారు. ఈ విందులో కూడా మళ్లీ రాష్ట్రపతి.. గవర్నర్.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఇక రేపు కొత్త సంవత్సరం కాబట్టి ఎలాగూ ప్రముఖుల్ని కలవడం.. విందులో పాల్గొనడం ఉంటుంది. మొత్తానికి కేసీఆర్..గవర్నర్ ఇద్దరూ ఏడాది మొత్తం మీద పాల్గొనాల్సిన విందులన్నీ కలపీ.. ఏడాది చివరిలో పాల్గొన్నట్టున్నారు.

అగ్రిగోల్డ్ బాధితులకు హైకోర్టు కానుక..

అగ్రిగోల్డ్ బాధితులకు హైకోర్టు కొత్త సంవత్సరం కానుకను ఇచ్చింది. ఈ రోజు అగ్రిగోల్డ్ కుంభకోణంపై విచారణ జరిపిన హైకోర్టు అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా మూడు కంపెనీలకు అగ్రిగోల్డ్ కు సంబంధించిన ఆరు ఆస్తులను అమ్మేందుకు అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎంఎస్ పీసీ, శ్రీరామ్ ఆటోమల్స్, ఇ. ప్రొక్యూర్ లీ అను మూడు కంపెనీలు అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మనున్నాయి. అంతేకాదు ఈ మూడు కంపెనీలకు హైకోర్టు కొన్నిసూచనలు కూడా చేసినట్టు తెలుస్తోంది. ఆస్తులు వేలం వివరాలు వెబ్ సైట్ లో పొందుపరచాలని.. దీనికి సంబధించిన వెబ్ సైట్ మూడు వారాల్లోగా ఏర్పాటు చేయాలని సూచించిది. కాగా వాదన సమయంలో హైకోర్టు అగ్రిగోల్డ్ ఛైర్మన్ ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగగా.. దానికి విచారణకు సహకరిస్తున్నందున అరెస్ట్ చేయలేదని ఏపీ సీఐడీ న్యాయవాది తెలిపారు. తదుపరి విచారణను ఫిభ్రవరి 8 కి వాయిదా వేశారు.

హోమంత్రికే లేనిది.. కేటీఆర్ కు ఎందుకు..? కిషన్ రెడ్డి

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ విషయంలో పోలీసులు ప్రదర్శిస్తున్నతీరుపై మండిపడ్డారు. త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో మంత్రి కేటీఆర్ పలు ప్రాంతాలు పర్యటిస్తున్నారు. దీంతో ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ ను ఆపేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారమే వివాదాస్పదంగా మారుతుంది. ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్.. ముఖ్యమంత్రి.. హోంమంత్రి వరకూ ప్రయాణిస్తుంటే.. ట్రాఫిక్ ఆపేయవచ్చు కానీ మంత్రులు ప్రయాణించే సమయాల్లో ట్రాఫిక్ ఆపేయటం ఉండదు. కానీ అందుకు భిన్నంగా హైదరాబాద్ లోని పలు చోట్ల ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళుతున్న మంత్రి కేటీఆర్ వాహనాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వీలుగా పోలీసులు ట్రాఫిక్ నిలిపివేస్తున్నారట. దీంతో ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా మంత్రి కేటీఆర్ కోసం ట్రాఫిక్ ఎందుకు ఆపేస్తున్నారని.. హోంమంత్రికి లేని ప్రోటోకాల్ కేటీఆర్ కు ఎందుకని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

నా ఆశీర్వాదం వల్లే స్టార్లయ్యారు.. ములాయం

తమ ఆశీర్వాదం వల్లే బాలీవుడ్ లో కొంతమంది స్టార్లు అయ్యారని చెపుతున్నారు సమాజ్ వాదీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్. మామూలుగానే తన గురించి గొప్పలు చెప్పుకోవడంలో ములాయం సింగ్ దిట్ట. ఇప్పుడు తాజాగా ములాయిం సింగ్ యాదవ్ తన గొప్పతనం గురించి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అదేందంటే.. తాను రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు ప్రియాంకా చోప్రాను ఆమె తండ్రిని కలిశారట. అయితే అప్పుడు ములాయం ప్రియాంకా చోప్రాను పెద్ద హీరోయిన్ కావాలని ఆశీర్వదించారట.. అంతే తన ఆశీర్వాదం వల్లనే ప్రియాంక చోప్రా ఇప్పుడు పెద్ద హీరోయిన్ అయింది అని చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగకుండా. ఒక్క ప్రియాంకనే కాదు.. తన ఆశీర్వాదం వల్లనే.. మాధురీ దీక్షిత్.. అమితాబ్ బచ్చన్.. సైఫ్ ఆలీఖాన్ ఇలాంటి చాలామందిని స్టార్లుగా చేశానని తన ఆశీర్వాదం గొప్పతనం గురించి చెప్పుకున్నారు. మరి తన ఆశీర్వాదం వల్ల ఇంత మందిని స్టార్లను చేసిన ములాయం.. అదే చేత్తే తన కొడుకును కూడా ఆశీర్వదించినట్టయితే మంచి స్టార్ అయి ఉండేవాడేమో..

అయోమయంలో దానం నాగేందర్..!

ప్రస్తుతం కాంగ్రెస్ నేత దానం నాగేందర్ పరిస్థితి ఏం చేయలేని అయోమయ పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ పట్టు సడలడంతో ఆపార్టీలోకి చాలామంది నేతలు టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే దానం కూడా పార్టీ మారాలని అనుకున్నారు. అయితే అందరిలా కాకుండా దానం నాగేందర్ పార్టీ మార్పుపై చాలా హై డ్రామానే కొనసాగింది. కొంత మంది పార్టీ మారుతున్నారు అంటే.. కొంత మంది మారట్లేదు అని.. కానీ దానం మాత్రం టీఆర్ఎస్ నేతలతో మంతనాలు జరపడం.. కానీ దానం కండీషన్స్ అప్లయ్ అన్న చందాన వ్యవహరించడం..దానికి తోడు  పీజేఆర్ కుమార్తె విజ‌యారెడ్డి దానం కనుక పార్టీలోకి వ‌స్తే.. తాను బ‌య‌ట‌కు వెళ్తానంటూ అల్టిమేటం జారీచేయ‌టం..దాంతో టీఆర్ఎస్ నేతలు వెనక్కి తగ్గడం జరిగాయి. ఇక ఆ కారణంగా చేసేది ఏం లేక దానం తాను పార్టీ మారడంలేదని.. కాంగ్రెస్ లోనే ఉంటున్నానని చెప్పడం.. ఇవన్నీ దానం పై ఉన్న నమ్మకాన్ని తగ్గించాయని స్పష్టంగా అర్ధమవుతోంది. అయితే ఈ విషయంలో హైకమాండ్ అప్పుడే దానంకు హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా మళ్లీ ఇప్పుడు దానంకు అధిష్టానం నుండి హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రేస్ పార్టీ సమాయత్తమవుతోంది. అయితే ఈ గ్రేటర్ ఎన్నికలకు గాను దానం తన సత్తా చూపడానికి సిద్దమయ్యి.. ఆ పార్టీ నేతల చేతిలోనే ఘోర అనుభ‌వాన్ని చ‌విచూడాల్సి వచ్చింది. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా దానం కూక‌ట్‌ప‌ల్లి, ఉప్ప‌ల్‌లో ప్ర‌చారానికి సిద్ధ‌మ‌వగా..రంగారెడ్డి జిల్లాలో రాజ‌కీయం చేస్తే ఊరుకోమంటూ అక్క‌డి నేత‌లు సుధీర్‌రెడ్డి, మ‌ల్లేష్ వ‌ర్గాలు తెగేసి చెప్పాయి. అంతేకాదు ఇంకా పలు కాంగ్రెస్ నేతలు కూడా దానంపై సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే దానం తను ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నాడంటూ సీనియ‌ర్ నేత మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డి దానంపై ఫిర్యాదు చేశాడు. ఇక దానంపై ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి కూడా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశార‌ట‌. దీంతో పై నుంచి దానంకు మ‌రోసారి హెచ్చ‌రిక జారీచేశారు. పార్ట‌లో ఉండాలా! లేదా! తేల్చుకోమంటూ స్ప‌ష్టం చేసిన‌ట్లు పార్టీ వ‌ర్గాల స‌మాచారం. దీంతో ఇప్పుడు దానంకు ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నట్టు చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. మరో వైపు దానం కాంగ్రెస్ పార్టీ తనను నమ్ముతుందా? లేదా? అనే సందిగ్ధంలో పడిపోయారంట.

తెలంగాణ నేతలు చేసేది ఫారిన్ స్టడీ టూర్లా..? లేక విహారయాత్రలా..?

సామాన్య వ్యక్తులుగా ఉన్నప్పుడు టూర్లకు వెళతారో లేదో కానీ.. రాజకీయాల్లో ఒక పదవిలో ఉన్నప్పుడు మాత్రం నాయకులు టూర్ల మీద టూర్ల వెళుతుంటారు. అయితే దానికి స్టడీ టూర్లు అనే ముసుగు తగిలించి వెళుతుంటారు. సాధారణంగా రాజకీయ నేతలు కానీ..అధికారులు కానీ స్టీడీ టూర్లు పేరిట విదేశాలు వెళుతుంటారు. ఎందుకంటే అక్కడి దేశాల్లో ఉపయోగించే వినూత్న పద్దతులను తెలుసుకొని ఇక్కడ మన ప్రాంతంలో వాటిని అమలుపరచి రాష్ట్రాన్ని అభివృద్ధి పంథాలో నడిపించడానికి చూస్తారు. కానీ మన రాజకీయ నేతలు..అందునా తెలంగాణ రాజకీయ నేతలు, అధికారులు చేసే స్టడీ టూర్లలో ఎంత మాత్రం మేటర్ లేదనిపిస్తుంది. ఎందుకంటే వారు చేసే టూర్లలో.. స్టడీ సంగతేమో కానీ.. విహార యాత్రలను మాత్రం తలపిస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  ప్రభుత్వం కోట్లకు కోట్లు ఈ స్టడీ టూర్ల పేరుతో ఖర్చుపెడుతున్నా.. వాటి వల్ల వచ్చే ఫలితమేదైనా ఉందా అంటే.. అది ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఎందుకంటే వారు స్టడీ టూర్లు పేరిట విదేశాలు వెళ్లడమే కాని అక్కడ వారు పాల్గొన్న వర్క్ షాపులకు సంబంధించి కానీ.. విదేశీ అధికారులతో వారి జరిపిన మంతనాలు గురించి కానీ ఎలాంటి రిపోర్టు ఉండదు. గతంలో రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ.. అంతేకాదు మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్ గా ఉన్న ఒక నేత తన సర్వీసులో దాదాపు 90 దేశాలు తిరిగొచ్చినా.. దానికి సంబంధించిన ఒక రిపోర్టు కూడా లేకపోవడమే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా అదే పరిస్థితి.. ఎంతో మంది అధికారులు, తెలంగాణ మంత్రులు విదేశీపర్యటనలు చేసినవారే. కేటీఆర్ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గాను అనేక విదేశాలు తిరిగారు.. ఇక తెలంగాణ ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్‌ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో  ఆర్ధికసంస్కరణలు, పన్నుల వ్యవస్థను ఆయన అధ్యయనం చేయడం కోసం వెళ్లారు. ఇంక పోచారం శ్రీనివాస్ రెడ్డి అగ్రి కల్చరల్ ఎగ్జిబిషన్ కోసంకు గాను ఇశ్రాయేల్.. జూపల్లి కృష్ణారావు.. బయో ఇంటర్ నేషనల్ కన్వెన్షన్ వంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి కాను ఫిలథెల్పియా, యుఎస్ .. ఎస్ కే జోషి అస్ట్రేలియా, స్పెయిన్, జీహెచ్ ఎంసీ కమిషనర్ బి.జనార్ధన్ రెడ్డి ఫ్రాన్స్ వంటి విదేశాలు చుట్టినా.. వీరందరిలో ఏ ఒక్కరూ వారు చేసిన అధ్యయనానికి సంబంధించిన నివేదికను సమర్పించిన వారు లేరు. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ టూర్ల విషయంలో కాస్త ఆలోచించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఓ తెలంగాణ అధికారి తెలిపినట్టు తెలుస్తోంది. అంతేకాదు దీనిక సంబంధించిన నివేదికలు ఏం అందిచాల్సిన అవసరం లేదని కొంత మంది నేతలు కొట్టిపారేసేవారు కూడా ఉన్నారు. అయితే ఎక్కడో ఎప్పుడో.. ఇద్దరు ముగ్గురు అధికారులు వారు చేసిన టూర్లకు సంబంధించి నివేదికలు సమర్పించినా అవి మాత్రం స్టోర్ రూంలో భద్రంగా ఉన్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ అధికారి వి నరేందర్ రావు సింగపూర్, హాంగ్ కాంగ్ వెళ్లి అర్బన్ ట్రాన్స్ పోర్ట్ ప్లానింగ్ గురించి అద్యయనం చేసి దానికి సంబంధించిన నివేదికను ఈ ఏడాది ఫిభ్రవరి నెలలో అందించినా దానిని స్టడీ చేయడానికి మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి ఇంత వరకూ తీరిక దొరకలేదు. మరోవైపు మంత్రులు, అధికారుల విదేశీ పర్యటనలపై ప్రతిపక్షాలు కూడా అనేక విమర్శలు చేస్తున్నాయి. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న తరుణంలో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ విదేశీ పర్యటనలు చేయడం అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా నాయకులు మాత్రం ఎంచక్కా స్టడీ టూర్లు పేరిట విహారయాత్రలు చేస్తూనే ఉన్నారు. అన్నింటిలో చాలా నిఖ్చచ్చిగా ఉండే కేసీఆర్ మరి ఈ యాత్రల విషయంలో ఎందుకు ఆలోచించట్లేదో.. లేక ఉమ్మడి రాష్ట్రంలో మా నేతలకు వెళ్లే ఛాన్స్ రాలేదు.. ఇప్పుడు వెళ్తున్నారు.. పోనిలే అని ఊరుకుంటున్నారా అని అనుకుంటున్నారు. మరి ఈ యాత్రలకు బ్రేక్ పడేదెప్పుడో చూడాలి.

నామా మధుకాన్ కంపెనీ పై చీటింగ్ కేసు..

మాజీ ఎంపీ, టీడీపీ నేత నామా నాగేశ్వరారవుకు చెందిన మధుకాన్ కంపెనీపై చీటింగ్ కేసు నమోదైనట్టు తెలుస్తోంది. జూబ్లిహిల్స్ పోలీసులు ఈ కంపెనీ పై చీటింగ్ కేసు నమోదు చేశారు. అసలు సంగతేంటంటే.. ఈపీఎఫ్ ఎఎన్ ఫోర్స్మెంట్ ఆఫీసర్ జేవీఎస్ఎస్ కుమార్ అనే ఉద్యోగి.. మధుకాన్ కంపెనీ తమ నుండి సేకరించిన ప్రావిడెంట్ ఫండ్ డబ్బును తమ అకౌంట్‌లో జమ చేయడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జూబ్లిహిల్స్ లోని రోడ్డు నెం 36 లో ఉన్న మధుకాన్ కంపెనీపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. 2009 నుంచి ఉద్యోగుల నుంచి సేకరించిన ప్రావిడెంట్ ఫండ్ డబ్బును మధుకాన్ ప్రాజెక్ట్స్ ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ చేయడం లేదని.. సుమారు రూ. 8.5 లక్షల వరకు అవకవతకలు జరిగాయనే ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని జేవీఎస్ఎస్ కుమార్ తెలిపారు.

గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు మాదే.. ఉత్తమ్

తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 12 స్థానాలకు గాను.. కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలను కైవసం చేసుకున్న సంగతి తెలిసింది. నల్గొంగ, మహబూబ్ నగర్ రెండో స్థానం సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ సందర్బంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలు గెలవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల ఓటమికి గల కారణాలను సమీక్షించుకుంటామని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు జీహెచ్ఎంసీ ఎన్నికల గురించి మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏకాభిప్రాయం మేరకే టికెట్ల పంపిణీ జరుగుతుందని..జీహెచ్ఎంసీ ఎన్నికలకు కార్యకర్తలు సిద్దం కావాలని పిలువునిచ్చారు.  డివిజన్‌, బూత్‌ స్థాయి నాయకులకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు మా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు నాంది అని.. త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికల్లో కూడా గెలుపు మాదేనని ధీమా వ్యక్తం చేశారు.

పొగడ్తలతో చంద్రబాబును కట్టిపడేసిన పనగరియా..

రాజకీయాల్లో ఉండే నేతలకు ఎవరిని ఎప్పుడు ఎలాగ కంట్రోల్ చేయాలన్న విషయం ఇచ్చే పట్టేస్తారు. ప్రతి ఒక్కరికి ఒక బలహీనమైన అంశం ఉంటుంది. అలా చంద్రబాబు బలహీనత మీద కొట్టారు నీతి ఆయోగ్ ఛైర్మన్ అరవింద్ పనగరియా. అదేంటంటే మామూలుగానే చంద్రబాబుకు కాస్తంత పొగడ్తలంటే ఇష్టమని అందరికి తెలిసిన విషయమే. అయితే పనగరియా అది కనిపెట్టినట్టునట్టున్నారు.. అందుకే ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు తనను ప్రశ్నించకుండా ఉండేదుంకు ముందు జాగ్రత్తగా ఆయపై ప్రశంసల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. ఈ రోజు విజయవాడకు వచ్చిన పనగరియా ఏపీలో చంద్రబాబు చేపట్టిన పలు అభివృధ్ది కార్యక్రమాల పట్ల ఆయనను తెగ పొగిడేశారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ఏపీ ఆర్ధిక లోటులో ఉన్నా కానీ చంద్రబాబు ఏపీ అభివృద్దికి కృషిచేస్తున్నారని.. సీఎం చంద్రబాబు డైనమిక్ లీడరని ఆకాశానికి ఎత్తేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ను అద్భుతంగా నడిపిస్తున్నారని కొనియాడారు. అంతేకాదు ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధానాన్ని ప్రస్తావిస్తూ.. గోదావరి - కృష్ణా నదులు అనుసంధానం గొప్ప విషయమని చెప్పారు. అయితే ఇంతా పొగిడిన పనగరియా మాత్రం ఏపీ ప్రత్యేక హోదా గురించి మాత్రం ఏం చెప్పకపోవడం గమనార్హం. మొత్తానికి నీతి అయోగ్ పర్యవేక్షణలో ఏపీ ప్రత్యేక హోదా అంశం ఉన్న నేపథ్యంలో తనపై చంద్రబాబు ఒత్తిడి తేకుండా ఉండేదుకు పనగరియా ముందుగానే చంద్రబాబుని పొగిడినట్టు రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.

ఓటర్లను ఆకర్షించడానికి మోడీ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అంతర్జాతీయంగా దేశం అభివృద్ధి చెందడంలో ఎంతగా కృషి చేస్తున్న అవేమి దేశ ప్రజలు పెద్దగా పట్టించుకోనట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఓటర్లను ఆకర్షించడంలో అవేమి పెద్దగా ఉపయోగపడవు కాబట్టి.. ప్రజలు కూడా వాటిని పట్టించుకోవడంలేదు. ప్రజాదరణ పొందాలంటే ప్రజలకు ప్రత్యక్ష లబ్ధి కలిగే పథకాలు అమలు చేయాల్సిందే. ఇప్పుడు మోడీ కూడా ఈ రూటులోకే వచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే కేంద్రంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన కూడా ఆతరువాత ఎన్నికల్లో ఎన్టీఏ ఘోర పరాజయం పొందిన దాఖలాలు ఉన్నాయి..దీంతో మోడీ ఇప్పుడు తన రూటు మార్చి..ప్రజలను ఆకర్షించే విధంగా పనులు చేపట్టాలని చూస్తున్నారంట. దీనిలో భాగంగానే మోడీ ఈ కొత్త సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగ నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేసేందుకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ విధానం ద్వారా ఎంతో మంది ప్రజలకు లాభం చేకూరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి మోడీ ప్లాన్ కనుక పక్కాగా వర్కవుట్ అయితే మోడీకి మంచి ప్రజాదారణ లభిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్ధులు వీరే..

తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాగంగా ఆరు ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఇప్పుడు మిగిలిన ఆరు స్థానాలకు గాను జరిగిన ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో కూడా టీఆర్ఎస్ దే హవా సాగింది. ఈ ఆరు స్థానాల్లో నాలుగు స్థానాలు టీఆర్ఎస్.. రెండు స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాల్లో నల్గొండ - కాంగ్రెస్ - కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖమ్మం - టీఆర్ఎస్ - బాలసాని లక్ష్మీ నారాయణ మహబూబ్ నగర్ మొదటి సీటుకు - టీఆర్ఎస్ - కసిరెడ్డి నారాయణరెడ్డి మహబూబ్ నగర్ రెండో సీటులో- కాంగ్రెస్ - దామోదర్ రెడ్డి రంగారెడ్డి మొదటి సీటుకు - టీఆర్ఎస్ - శంభీపూర్ రాజు రంగారెడ్డి - టీఆర్ఎస్- పట్నం నరేందర్ రెడ్డి కాగా నిజామాబాద్ నుండి డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి, కరీంనగర్ లో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నారదాసు లక్ష్మణ రావు, భాను ప్రసాద రావులు, వరంగల్ జిల్లా నుండి కొండా మురళి.. ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు పురాణం సతీశ్, వీ భూపాల్‌రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే.

హైకోర్టులో ఎంఎస్‌వోలకు ఊరట.. సెట్‌టాప్‌ బాక్సులపై రెండు నెలలు గడువు

హైకోర్టులో ఎంఎస్‌వోలకు ఊరట లభించింది. రేపటితో సెట్‌టాప్‌ బాక్సుల ఏర్పాటుకు గడువు ముగుస్తుండటంతో కేంద్రం సరిపడా సెట్‌టాప్‌ బాక్సులు ఏర్పాటు చేయలేదని.. ఎంఎస్‌వోలు సెట్‌టాప్‌ బాక్సుల ఏర్పాటుకు గడువు పెంచాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై హైకోర్టు ఈరోజు విచారణ జరిపినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఎంఎస్‌వోలు  సెట్‌టాప్‌ బాక్సుల కొరత ఉన్నందున గడువు పొడిగించాలని.. 85 శాతం మందికి సెట్‌టాప్‌ బాక్సులు అందుబాటులో లేవని తమ వాదనను వినిపించారు. దీంతో కేబుల్‌ టీవీ డిజిటలైజేషన్‌కు గాను సెట్‌టాప్‌ బాక్సుల ఏర్పాటుకు గడువును మరో రెండు నెలల పాటు పొడిగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

రెండో ఎమ్మెల్సీ స్థానం కైవసం చేసుకున్న కాంగ్రెస్..

తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నల్గొండ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుంది. 193 కోట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపొందారు. ఇప్పుడు మహబూబ్ నగర్ రెండో స్థానాన్ని కూడా కాంగ్రెస్ అభ్యర్ధి దామోదర్ రెడ్డి దక్కించుకున్నారు. మొత్తానికి 12 ఎమ్మెల్సీ స్థానాలకు గాను మొదటనే ఆరు స్ఠానాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోగా.. ఈరోజు మిగిలిన ఆరు స్థానాలకు గాను ఫలితాలు వెలువడిన నేపథ్యంలో నల్గొండ, మహబూబ్ నగర్  ఎమ్మెల్సీ స్ఠానాలు కాంగ్రెస్, ఖమ్మం టీఆర్ఎస్, రంగారెడ్డిలో కూడా మరో రెండు స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.

కేసీఆర్ యాగంపై కర్నాటక సీఎం కామెంట్స్..

కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఏదో ఒక విషయంపై కామెంట్లు చేస్తూ వార్తల్లోకి ఎక్కుతూనే ఉంటారు. ఇప్పుడు తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహించిన ఆయుత చండీయాగంపై కూడా విమర్శలు చేసినట్టు తెలుస్తోంది. కర్నాటక విధాన సౌధలో జరిగిన కవి కువెంపు జయంతి వేడుకల సందర్భంగా హాజరైన సిద్ద రామయ్య కేసీఆర్ యాగం గురించి ప్రస్తావిస్తూ..  తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటూ కేసీఆర్ చండీయాగం చేశారని, హోమాలు చేసినంత మాత్రాన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? ఈ విషయంలో శాస్త్రీయత ఉందా? అని సిద్ధరామయ్య ప్రశ్నించారు. యాగాలు చేస్తే వర్షాలు కురుస్తాయా? అదే నిజమైతే దేశంలో కరవు ఛాయలే కనిపించేవి కావని, యావత్తు దేశాన్నే సుభిక్షం చేసేవాళ్లమని ఆయన అన్నారు. కాగా సిద్ద రామయ్య మూఢ నమ్మక వ్యతిరేక బిల్లు పైన కృషి చేస్తున్నారు. తన విషయంలో జ్యోతిష్యులు చెప్పింది ఏదీ నిజం కాలేదని.. టీవీ కార్యక్రమాల్లో జ్యోతిష్య శాస్త్రం తదితరాలను నిషేధించడానికి తానే ఓ నిదర్శనం అని సిద్ధరామయ్య అంటున్నారు. మరి సిద్ద రామయ్య చేసిన కామెంట్స్ కు కేసీఆర్ ఎలా సమాధానం చెబుతారో చూడాలి.