తెలంగాణా ముఖ్యమంత్రిపై కర్నాటక ముఖ్యమంత్రి విమర్శలు

  ఇటీవల తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన ఆయుత చండీయాగానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలనే ఈ యాగం చేసామని కేసీఆర్ చెప్పుకొంటున్నారు. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అటువంటి యాగాలు, పూజల కోసం ప్రజా ధనాన్ని వృధా చేయడాన్ని ప్రతిపక్షాలు తప్పు పట్టాయి. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య కూడా కేసీఆర్ పై విమర్శలు గుప్పించడం విశేషం.   బెంగళూరులోని విధానసౌదలో ప్రముఖ కన్నడ కవి కువెంపు జయంతి సభలో ఆయన పాల్గొన్నప్పుడు, మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకు బదులిస్తూ, “యజ్ఞాలు, యాగాలు చేస్తే వానలు పడి దేశం సుబిక్షంగా మారుతుందంటే అందరం అదే పని చేసే వాళ్లము కదా? హోమాలతో దేశంలో పరిస్థితులు మార్చే అవకాశం ఉంటే అదే చేసే వాళ్ళం కదా? అటువంటి హోమాలకు, యాగాలకు ఎటువంటి శాస్త్రీయత లేదు అని తెలిసినా ఉన్నత విద్యావంతులు కూడా వాటిని గుడ్డిగా నమ్మడం దురదృష్టకరం,” అని ముఖ్యమంత్రి సిద్ద రామయ్య అన్నారు.

నా గెలుపు రాజకీయాల్లో కొత్త మలుపు.. కోమటిరెడ్డి

  నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 193 కోట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని.. నా గెలుపు తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు అని అన్నారు. ఈ విజయం రాబోయే ఎన్నికలకు శుభ సూచికమని.. టీఆర్ఎస్ ఎన్ని ప్రలోభాలు పెట్టినా అభిమానంతోనే నన్ను గెలిపించారు అని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో వందకు వంద శాతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తామని వెల్లడించారు. నల్గొండ జిల్లా అభివృద్దే మా లక్ష్యమని అన్నారు.

జగన్ పై జేసీ ఫైర్.. జగన్ కు అదే పని..

జేసీ దివాకర్ రెడ్డి.. ఆయన మాట్లాడేవిధానం గురించి అందరికి తెలిసిందే. ఏది మాట్లాడినా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం ఆయన నైజం. ఎవరినైనా తిట్టాడానికి అస్సలు భయపడేతత్వం కాదు దివాకర్ రెడ్డి. అలాంటి జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు ఏకంగా ప్రతిపక్షనేత.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. జగన్ ప్రతిపక్ష నాయకుడిగా విఫలమయ్యాడని విమర్శిస్తూ....ఆయన ఎప్పుడూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తిట్టడమే అని ఎద్దేవా చేశారు. ఎప్పుడూ చంద్రబాబునే విమర్శిస్తూ.. చంద్రబాబు విమర్శించడమే ప్రతిపక్షనేత తన పనిగా ఫీలవుతున్నారని అన్నారు. అంతేకాదు ఎప్పుడూ సీఎం పదవి గురించే ఆలోచించే జగన్ మంచి పనులు చేసి తద్వారా ఆ పదవిని పొందలే కాని ఇలా విమర్శలు చేయడం తగదని విమర్శించారు. మరోవైపు జగన్ ను తిడుతూనే.. జేసీ చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్నిప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు పాటుపడుతున్నారని.. సీమను సస్యశ్యామలం చేసేందుకు చంద్రబాబు క్రియాశీలంగా అడుగులు వేస్తున్నారని కీర్తించారు. అలాంటి ముఖ్యమంత్రి ఉన్నందుకు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ సంతోపడాలి తప్పులు ఏమైనా చేస్తే సర్దిచెప్పాలే తప్ప ఊరికే విమర్శలు చేయవద్దన్నారు.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు..

  తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాగంగా ఆరు ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఇప్పుడు మిగిలిన ఆరు స్థానాలకు గాను జరిగిన ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు ఫలితాలు విడుదలకానున్నాయి. దీనిలో ఖమ్మం ఎమ్మెల్సీ టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 31 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్ధి బాలసాని విజయం సాధించాడు. నల్గొండలో కాంగ్రెస్ విజయం సాధించింది. రంగారెడ్డి జిల్లాల్లో రెండు స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మరోస్థానం కోసం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

కేరళలో మద్యనిషేదానికి సుప్రీం ఒకే

  కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరికొత్త మద్యం పాలసీ దెబ్బకి ఆ రాష్ట్రంలో మద్యం వ్యాపారులు, సంస్థలు అన్నీ దెబ్బతిన్నాయి. ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఉన్న బార్లలో తప్ప బయట మద్యం బార్లలో ఎక్కడా మద్యం అమ్మరాదని ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్రంలోని మద్యం వ్యాపారులు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మొదట రాష్ట్ర హైకోర్టుకి వెళ్ళారు. అక్కడ వారి పిటిషన్ తిరస్కరించబడటంతో సుప్రీం కోర్టు వెళ్ళారు. ఈసారి వారి తరపున అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ముకుల్ రోహాత్గీతో సహా పలువురు ఉద్దండులయిన న్యాయవాదులు వాదించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. జస్టిస్ విక్రంజిత్ సేన్, జస్టిస్ శివ కీర్తి సింగ్ లతో కూడిన ధర్మాసనం కూడా మద్యనిషేధం అమలుచేయాలనే కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్దిస్తూ వారి పిటిషన్ కొట్టివేసింది. మద్యనిషేధం కారణంగా నష్టపోయే మద్యం వ్యాపారులకు నష్టపరిహారం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలనీ సుప్రీం కోర్టు కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది.   సుప్రీం కోర్టు తీర్పు ప్రభావం వివిధ మద్యం ఉత్పత్తి సంస్థల షేర్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఎంపీ డిస్టిలరీస్ షేర్లు-3.20 శాతం, పింకాన్ స్పిరిట్-3.05 శాతం, తిలక్ నగర్ ఇండస్ట్రీస్-2.75 శాతం, యునైటడ్ స్పిరిట్స్-2.69 శాతం, యునైటడ్ బ్రూవరీస్-0.71 శాతం నష్టపోయాయి.   దేశ వ్యాప్తంగా చూసినట్లయితే మద్యపానంలో కేరళ వాటా 14.9 శాతంగా ఉంటోంది. గత మూడు దశాబ్దాలలో కేరళ రాష్ట్రంలో మద్యం విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. 1985 ఆర్ధిక సం.లో రూ.55.46 కోట్లు మాత్రమే ఉన్న మద్యం అమ్మకాలు 2013-14సం. ఆర్ధిక సంవత్సరానికి ఏకంగా రూ. 9353.74 కోట్లకి చేరుకొన్నాయి. కేరళ రాష్ట్రంలో రోజుకి రూ.30 కోట్లు విలువయిన మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంతో ఆ ఆదాయం తగ్గిపోయింది. రాష్ట్రంలో మద్యనిషేధం అమలుచేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకొన్న తరువాత మద్యపానం 20.27 శాతం పడిపోయింది. తత్ఫలితంగా రూ.4,000 కోట్ల ఆదాయం కోల్పోయింది. రాష్ట్రంలో 700 బార్లు మూతపడ్డాయి. వాటిపైనే ఆధారపడిన అనేక వందల మంది రోడ్డున పడ్డారు. మద్యం వ్యాపారులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు.   కేరళ రాష్ట్రం ప్రధానంగా పర్యాటక రంగం మీద ఆధారపడి ఉంది. అక్కడికి దేశ విదేశాల నుండి పర్యాటకులు బారీ సంఖ్యలో వస్తుంటారు. ఆ కారణంగానే అక్కడ మద్యం వ్యాపారం క్రమంగా పెరుగుతూ వస్తోంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయం వలన పర్యాటక రంగంపై కూడా ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం ఉండవచ్చును.

ఎమ్మెల్సీ ఫలితాలు నేడే

  తెలంగాణాలో 6 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఫలితాలు బుదవారం వెలువడనున్నాయి. మొత్తం 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలలో 6 స్థానాలకు తెరాస అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికవడంతో మిగిలిన ఆరు స్థానాలకు ఎన్నికలు నిర్వహించబడ్డాయి. వాటిలో మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలలో చెరో 2 స్థానాలకు, నల్లగొండ, ఖమ్మం జిల్లాలలో చెరో ఒక్క స్థానానికి ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. ఎప్పటిలాగే అబ్యర్ధులకు పడిన ఓట్లను ప్రాధాన్యత క్రమంలో లెక్కించి విజేతల పేర్లను ప్రకటిస్తారు. ఉదయం 11 గంటలలోపే తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.   మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలలో ఉన్న నాలుగు స్థానాల కోసం తెరాస, కాంగ్రెస్ పార్టీ, తెదేపాలు పోటీ పడ్డాయి. నల్లగొండ తెరాస-కాంగ్రెస్, ఖమ్మం జిల్లాలో తెరాస-సిపిఐ పోటీ పడ్డాయి. ఈ ఆరు స్థానాలకు మొత్తం 19 మంది అభ్యర్ధులూ పోటీ పడ్డారు. అందరూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

న్యూ ఇయర్ వేడుకలకు షాకింగ్ న్యూస్...

  నూతన సంవత్సర వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవాలని అనుకునేవారికి ఒక షాకింగ్ న్యూస్... నూతన సంవత్సర సందర్భంగా దేశంలో లష్కర్ ఎ తొయిబా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం వుందని కేంద్ర నిఘావర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశాయి. దేశంలో పలుచోట్ల ఉగ్రవాద దాడులు జరిగే అవకాశాలు వున్నాయని, ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకలు జరిగే ప్రాంతాల్లో దాడులు జరపడానికి ఉగ్రవాదులు పథక రచన చేశారని సమాచారం అందిందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాలూ అప్రమత్తంగా వుండాలని, అనుమానిత వ్యక్తుల మీద నిఘా పెట్టాలని సూచించాయి. పాకిస్థాన్ నుంచి దాదాపు 20 మంది సభ్యులున్న ఉగ్రవాదుల బృందం దేశంలోకి చొరబడిందని, ముంబై తరహా దాడులకు పాల్పడే ప్రమాదం వుందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ప్రధాని, ముఖ్యమంత్రుల నివాసాలతోపాటు సైనిక, అణు సంబంధిత ప్రాంతాలపై దాడులు జరిపే అవకాశం వుందని భద్రత అధికారులు అనుమానిస్తున్నారు.

బిడ్డకు పాలిచ్చిందని చంపేశారు

  ఐసీస్ ఉగ్రవాద సంస్థ ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ ఉగ్రవాద సంస్థను సాధ్యమైనంత త్వరగా నాశనం చేయాల్సిన అవసరం వుందనే విషయాన్ని ప్రపంచానికి గుర్తు చేసే ఘటన అల్‌రకా నగరంలో జరిగింది. అల్‌రకా నగరంలో బిడ్డకు పాలిచ్చిందనే నేరం మీద ఐసీస్ ఉగ్రవాదులు ఒక మహిళను దారుణంగా హింసించి, ఆ తర్వాత బహిరంగంగా కాల్చి చంపారు. సరుకుల కొనుగోలు కోసం నెలల శిశువుతో కలసి బయటకి వచ్చిన ఒక మహిళ మధ్యలో తన బిడ్డ ఆకలితో ఏడవటంతో ఒక చెట్టు పక్కకి వెళ్ళి పాలిచ్చింది. దీనిని ఐసీస్ అనుబంధ మహిళా ఉగ్రవాద సంస్థ అయిన అల్‌ఖన్సా సభ్యులు గమనించారు. ఐసీస్ ఉగ్రవాదుల నిబంధనల ప్రకారం బహిరంగ ప్రదేశాలలో తల్లులు బిడ్డలకు పాలు ఇవ్వడం నేరం. ఈ నేరం మీద సదరు మహిళ నుంచి బిడ్డను లాక్కున్నారు. ఆమెను దారుణంగా హింసించిన అనంతరం బహిరంగంగా కాల్చి చంపారు.

పాక్‌లో ఆత్మాహుతి దాడి... 22 మంది మృతి

  పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. పాకిస్థాన్ వాయవ్య ప్రాంతంలోని ఒక ప్రభుత్వ కార్యాలయంలోకి మోటర్ సైకిల్ మీద వచ్చిన దుండగుడు తనను తాను పేల్చేసుకోవడంతో భారీ విధ్వంసం జరిగింది. ఈ ఘటనలో 22 మంది మరణించారు. వాయవ్య పాకిస్థాన్‌లోని మార్దన్ ప్రాంతంలో నేషనల్ డేటాబేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ కార్యాలయం గేటును తోసుకుంటూ రద్దీగా వుండే కార్యాలయంలోకి మోటర్ సైకిల్‌తో దూసుకెళ్ళి ఆత్మాహుతి చేసుకోవడంతో 22 మరణించడంతోపాటు 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కార్యాలయం గేటు దగ్గర వున్న సిబ్బంది దూసుకొస్తున్న మోటార్ సైకిల్‌ని ఆపడానికి ప్రయత్నించినా విఫలమయ్యారు. పేలుడు ధాటికి కార్యాలయ భవనం తలుపులు, కిటికీలు ధ్వంసమైపోయాయి. క్షతగాత్రుల్లో చాలామంది పరిస్థితి విషమంగా వున్నట్టు సమాచారం.

మరో 20 మంది విద్యార్ధులు అమెరికా నుంచి వెనక్కి!

  అమెరికాలో సిలికాన్‌ వ్యాలీ యూనివర్సిటీ, నార్త్‌వెస్టర్న్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలలో చేరేందుకు వెళ్ళిన 14 మంది భారతీయ విద్యార్థులను శాన్‌ఫ్రాన్సిస్కోలో అమెరికా అధికారులు నిర్బంధించి ఉగ్రవాదులను ప్రశ్నించినట్లు ప్రశ్నించి, తరువాత వారినందరినీ వెనక్కి తిప్పి పంపేసారు. అందుకు భారత్ లోని అమెరికన్ ఎంబసీ క్షమాపణలు కూడా చెప్పింది. ఆ సంఘటన జరిగి వారం రోజులు కూడా కాలేదు. మళ్ళీ మరో 20 మంది తెలుగు విద్యార్థులకు అటువంటి చేదు అనుభవమే షికాగో విమానాశ్రయంలో ఎదురయింది. వారు కూడా అదే యూనివర్సిటీలలో చేరేందుకు ఆదివారం షికాగో విమానాశ్రయం చేరుకొన్నప్పుడు, వారిని అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు అక్కడే ప్రశ్నించి వెనక్కి తిప్పి పంపేసారు. వారందరూ ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు.   ఇదివరకు 14 మంది విద్యార్ధులను వెనక్కి తిప్పి పంపేసిన తరువాత,  అవే విశ్వవిద్యాలయాలలో చేరేందుకు  బయలుదేరుతున్న మరి కొందరు విద్యార్ధులను ఎయిర్ ఇండియా విమాన సంస్థ అధికారులు వారించారు. వారికి అక్కడి పరిస్థితుల గురించి వివరించి తమ ప్రయాణాలను కొంత కాలం పాటు వాయిదా వేసుకోమని కోరారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా వారికి అదే సలహా ఇచ్చేరు. కానీ వారి మాటలను పెడచెవిన పెట్టి వెళ్లిన 20 మంది తెలుగు విద్యార్థులకు మళ్ళీ అటువంటి చేదు అనుభవమే ఎదుర్కోవలసి వచ్చింది.   ఆ రెండు విశ్వవిద్యాలయాలు తాము నిషేధిత జాబితాలో లేమని చెపుతున్నాయి. అయినా అమెరికా అధికారులు వాటిలో చేరేందుకు వెళుతున్న విద్యార్ధులను అడ్డుకొని వెనక్కి తిప్పి పంపేస్తున్నారు. మధ్యలో విద్యార్ధులు, వారి తల్లి తండ్రులు నలిగిపోతున్నారు.  ఆ రెండు విశ్వవిద్యాలయాల అధికారులు అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించుకోకపోతే మధ్యలో విద్యార్ధులు తీవ్రంగా నష్టపోతారు.భారత్ విదేశాంగ శాఖ అధికారులు చొరవ తీసుకొని తక్షణమే ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంటుంది. అలాగే వాటిలో చేరేందుకు అమెరికా అధికారులు అనుమతించడం లేదని తెలిసి కూడా విద్యార్ధులు అమెరికా ప్రయాణం అవడం పొరపాటే. విద్యార్ధుల తల్లి తండ్రులు కూడా తమ పిల్లలు ఆ రెండు విశ్వవిద్యాలయాలలో అడ్మిషన్లు పొందినప్పటికీ, భారత విదేశాంగ శాఖా నుంచి క్లియరెన్స్ వచ్చే వరకు అమెరికా పంపకుండా కొంతకాలం ఆగితే నష్టపోకుండా ఉంటారు.

జపాన్‌లో వింత జీవి

  జపాన్ సముద్ర తీరంలో అరుదైన వింత జీవి కనిపించి ప్రజలను ఆశ్చర్యచకితులను చేసింది. సెంట్రల్ జపాన్‌లోని టొయామా బే తీరంలో వెండి రంగు మచ్చలతో ఎర్రగా వున్న చాలా పెద్ద వింత జీవి చేపలు పట్టేవారి పడవల కిందుగ ఈదుకుంటూ వచ్చి కొద్దిసేపు నీటి ఉపరితలంలో కనిపించింది. దీనిని సముద్రం లోపలి దృశ్యాలను వీడియో చిత్రీకరించే కెమెరా చిత్రీకరించింది. కొన్ని గంటలపాటు నీటి ఉపరితంపైనే ఈదుతూ కనిపించిన ఈ వింత జీవిని మత్స్యకారులు, ప్రజలు ఆసక్తిగా తిలకించారు. దాదాపు 13 అడుగుల పొడవున్న ఈ జీవి ఆ తర్వాత సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఈ తరహా వింత జీవిని గతంలో కూడా ఒకసారి చూశామని, అప్పుడు చూసిన జీవి దాదాపు 43 అడుగుల పొడవు వుందని కొంతమంది సీనియర్ మత్స్యకారులు చెబుతున్నారు.

20 ఎకరాల్లో ఏపీ సచివాలయం

  అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం నిర్మాణానికి సీఆర్‌డీఏ చర్యలు చేపట్టడానికి అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 20 ఎకరాల్లో 6 లక్షల చదరపు అడుగుల కార్యాలయ భవన నిర్మాణం చేపట్టడానికి టెండర్లు పిలవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు 180 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని ప్రభుత్వ అంచనా. ఇందులో వడ్డీలేని 90 కోట్ల రుణాన్ని ప్రభుత్వం సీఆర్‌డీఏ‌కి ఇస్తుంది. మిగిలిన 90 కోట్లు హడ్కో నుంచి రుణం పొందాల్సిందిగా నిర్దేశించింది. వివిధ విభాగాలకు కేటాయించిన వసతి ఆధారంగా వారి సాధారణ బడ్జెట్ నుంచి అద్దెను చెల్లించాల్సి వుంటుందని ప్రభుత్వం వివరించింది.

రాజకీయాలలోకి అప్పుడే రాను: మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి

  మళ్ళీ చాలా కాలం తరువాత మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిన్న రాజమండ్రిలో మీడియా కంటపడ్డారు. మాజీ కాంగ్రెస్ ఎంపి హర్షకుమార్ కి చెందిన రాజీవ్ గాంధి విద్యాసంస్థల సిల్వర్ జుబ్లీ వేడుకలలో పాల్గొనేందుకు ఆయన నిన్న రాజమండ్రి వచ్చేరు.   ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన వలన రెండు తెలుగు రాష్ట్రాలు నష్టపోతాయని తాను చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయని అన్నారు. రెండు ప్రభుత్వాల మధ్య సయోధ్య లేకపోతే ప్రజలు, రైతులు తాగునీరు, సాగునీరుకి ఇబ్బందులు పడవలసి వస్తుందని కనుక ఇరువురు ముఖ్యమంత్రులు గొడవలు పడకుండా పరస్పరం సహకరించుకొంటూ రెండు రాష్ట్రాలకు రావలసిన వాటి గురించి కేంద్రంతో పోరాడాలని సూచించారు. అమరావతి నిర్మాణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి పారదర్శకత పాటించాలని సూచించారు. రుణమాఫీల విషయంలో రెండు ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు సరిగా లేదని అభిప్రాయం వ్యక్తం చేసారు.   రైతుల పంట రుణాలను ఒక పరిమిత కాలంలో పూర్తిగా మాఫీ చేయకపోవడం వలన రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇదివరకు తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులు బ్యాంకుల నుండి లక్ష రూపాయలు ఋణం తీసుకొని దానిని తిరిగి ఏడాదిలోగా చెల్లించినట్లయితే బ్యాంకులు వారి నుండి ఎటువంటి వడ్డీ వసూలు చేసేవి కావు. కానీ ఇప్పుడు రైతులు దాదాపు 14 శాతం వడ్డీ చెల్లించవలసి వస్తోందని అన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఆరు లక్షల ఇళ్ళ నిర్మాణానికి తన ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని కానీ కొత్త ప్రభుత్వాలు ఇంతవరకు వాటిలో ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదు. ఆ పధకంలో భాగంగా ఇళ్ళు కట్టుకొన్నవారికి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని విమర్శించారు. తన రాజకీయ భవిష్యత్ గురించి నిర్ణయం తీసుకోవడానికి తొందర ఏమీ లేదని అన్నారు.

గ్యాంగ్ రేప్ చేసిన సైనికులు

  సైనికులు దేశ సరిహద్దుల్లో దేశాన్ని కాపాడే సంగతి ఏమోగానీ, అప్పుడప్పుడు కొంతమంది సైనికులు అత్యాచారాలకు పాల్పడుతూ కళంకం తెస్తున్నారు. ఇంట్లోంచి పారిపోయి రైలెక్కిన ఓ యువతిని ఆ రైల్లో ఉన్న సైనికులు గ్యాంగ్ రేప్ చేశారు. హౌరా- అమృతసర్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ దారుణం జరిగింది. తమ కుమార్తె రైలు ఎక్కి పారిపోతోందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆమె అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కినట్టు పోలీసులు గుర్తించారు. రాంచీ సమీపంలోని మధుపూర్ రైల్వే స్టేషన్లో రైలును ఆపి ఆ అమ్మాయి కోసం గాలించారు. ఇందులో భాగంగా సైనికుల బోగీలోకి రైల్వే పోలీసులు వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు సైనికులు తీవ్రంగా వ్యతిరేకించారు. బలవంతంగా లోపలకు వెళ్ళిన పోలీసులకు సైనికుల బోగీలో రేప్‌కి గురై వున్న ఆ యువతి కనిపించింది. ఆ తర్వాత ఆ యువతి ముగ్గురు జవాన్లు తనతో బలవంతంగా మద్యం తాగించి రేప్ చేశారని తెలిపింది. సీసీటీవీ ఫుటేజిలో ఆ ఇద్దరినీ ఆమె గుర్తించింది. ఈ కేసులో నిందితులుగా వున్న సైనికులు ముగ్గురూ ప్రస్తుతం పరారీలో వున్నారు.

ప్రముఖ హాస్య నటుడు పొట్టి రాంబాబు ఆకస్మిక మరణం

  ప్రముఖ హాస్యనటుడు పొట్టి రాంబాబు మంగళవారం తెల్లవారు జామున మరణించారు. ఆయనకు మెదడులో రక్తం గడ్డ కట్టడంతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆకస్మికంగా మృతి చెందారని తెలుస్తోంది. ఆయన ఈశ్వర్, క్లాస్ రూమ్, చంటిగాడు, ప్రేమతో నువ్వు వస్తావని వంటి 40కి పైగా సినిమాలలో నటించి మంచి హాస్య నటుడుగా గుర్తింపు తెచ్చుకొన్నారు. పులిరాజా ఐ.పి.ఎస్. అనే సినిమాలో హీరో పాత్ర కూడా ధరించారు. పొట్టి రాంబాబు మరణవార్త విని చిత్రసీమలో అందరూ దిగ్బ్రాంతి చెందుతున్నారు. 2015 సం.లో ముగుస్తున్న ఈ చివరి రోజుల్లో తెలుగు చిత్రసీమ మరో హాస్య నటుడుని కోల్పోవడం చాలా దురదృష్టకరం.

జస్ట్ కానిస్టేబుల్... కోట్లు సంపాదించాడు..

  మధ్యప్రదేశ్‌లోని ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ కోట్లకు కోట్లు సంపాదించేశాడు. అతగాడికి ఆరు ఇళ్ళు, నాలుగు కార్లు, ఎనిమిది బ్యాంకు అకౌంట్లు... మొత్తమ్మీద ఓ పాతిక కోట్ల ఆస్తి అతగాడి పేరు మీద వుంది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అరుణ్ సింగ్ ఆస్తుల మీద అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేసినప్పుడు అతగాడి ఆస్తుల వివరాలు చూసి అధికారులే నోళ్ళు తెరిచారు. ఈయన పేరు మీద 25 ఎకరాల ఫామ్ హౌస్ వుందంటే పరిస్థితి ఏ రేంజ్‌లో వుందో అర్థం చేసుకోవచ్చు. జస్ట్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇంత డబ్బు ఎలా సంపాదించాడో అర్థం కాక అధికారులు జుట్టు పీక్కుంటున్నారు.

ప్రణబ్‌కి ఒబామా గ్రీటింగ్ కార్డు

  అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రీటింగ్ కార్డు పంపించారు. ఈ గ్రీటింగ్ కార్డులో ప్రణబ్ ముఖర్జీకి ఒబామా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడంతోపాటు ఆయురారోగ్యాలతో ఆనందంగా వుండాలన్న ఆకాంక్షను వ్యక్తపరిచారు. హాలిడే సీజన్ సంతోషంగా గడపాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ గ్రీటింగ్ కార్డులో ఒబామాతోపాటు ఆయన భార్య మిషెల్ ఒబామా, కూతుళ్ళు మలియా, సాషాల సంతకాలు వున్నాయి. అలాగే వారి కుటుంబంలో భాగమైన పెంపుడు కుక్కలు బో, సన్నీల పాదముద్రలు కూడా వేశారు. గత నాలుగు సంవత్సరాలుగా ఒబామా కుటుంబం పంపుతున్న గ్రీటింగ్ కార్డులలో ఈ రెండు కుక్కల పాదముద్రలు కూడా కనిపిస్తున్నాయి.

క్షమాపణలా? నేను చెప్పనంతే!

  కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం డీడీసీఏ అవకతవకలపై జరిపిన విచారణలో జైట్లీ పేరు లేకపోవడం ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు కాదని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. తాను క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ దాదాపు బిచ్చం ఎత్తుకుంటున్న స్థాయిలో దేబిరిస్తేందని, అది జరగని పని అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. అరుణ్ జైట్లీ అధ్యక్షుడిగా వున్న సమయంలో డీడీసీఏలో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల ఆరోపించింది. దానిమీద దర్యాప్తు కమిషన్ కూడా వేసింది. కేజ్రీవాల్ ఈ విషయమై జైట్లీ మీద విమర్శలు గుప్పించడంతో జైట్లీ ఆయన మీద పరువునష్టం దావా వేశారు. అవకతవకల విషయం మీద ఢిల్లీ ప్రభుత్వం విచారణ చేయించిన అనంతరం వచ్చిన నివేదికల్లో ఎక్కడా అరుణ్ జైట్లీ పేరు లేదు. దాంతో కేజ్రీవాల్ తనకు క్షమాపణ చెప్పాలని జైట్లీ డిమాండ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు కేజ్రీవాల్ తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.