ఓటుకు నోటు కేసు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేకూ నోటీసులు!
posted on Jul 13, 2015 @ 10:47AM
ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఏసీబీ అధికారులు రెండు రోజులు కస్టడీకి తీసుకొని విచారణ చేసిన సంగతి తెలిసిందే. సండ్రను విచారణ చేసిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు మరో ఇద్దరికి నోటీసులు జారీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అందులో ఓ టిఆర్ఎస్ ఎమ్మెల్యేకు నోటీసులు ఇవ్వొచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా సండ్ర బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ రోజు విచారణకు రానుంది. మరో వైపు రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహాలు ఈ రోజు ఏసీబీ కోర్టు ముందు హాజరుకానున్నారు. ఎందుకంటే ఏసీబీ న్యాయస్థానం జూలై 13 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది కానీ... జూలై 1న హైకోర్టు ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ముగ్గురు నిందితులు ఏసీబీ కోర్టుకు హాజరుకానున్నారు.