food poison

భోజనంలో బల్లి... బాబోయ్...

  మధ్యాహ్న భోజనంలో బల్లి పడటంతో అది తిన్న 30 మంది బాలికలు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగింది. ఇటావా జిల్లాలోని జవహర్ నవోదయ పాఠశాలలో మధ్యాహ్నం భోజనంలో బల్లి పడింది. దాన్ని గమనించని విద్యా్ర్థినులు ఆ ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనంతరం బాలికలు వాంతులు అవుతున్నట్టు పాఠశాల సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే వైద్యుడిని పాఠశాలకు పిలిపించి ప్రథమ చికిత్స చేయించారు. పిల్లలను ఆస్పత్రిలో చేర్పించకుండా పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకి గురైనప్పటికీ, సరైన సమయంలో వైద్య సహాయం అందడంతో అందరూ కోలుకున్నారని పాఠశాల సిబ్బంది ప్రకటించారు.

modi

పెట్టుబడుల స్వర్గం ఇండియా

  భారతదేశం కేవలం ఒక మార్కెట్ మాత్రమే కాదని, ఒక శక్తి అని, పెట్టుబడుల స్వర్గమని భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ప్రస్తుతం ఆయన యుఎఇ పర్యటనలో వున్నారు. ఆయన సోమవారం అబుదాబిలోని మస్దర్ నగరంలోని పారిశ్రామికవేత్తలతో సమావేశమైన సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత - యుఎఇ మధ్య చాలా విమాన సర్వీసులు వున్నా, భారత ప్రధాని ఇక్కడకు రావడానికి 34 సంవత్సరాలు పట్టింది. భారతదేశంలో అభివృద్ధికి అపార అవకాశాలు వున్నాయి. వాటిని ప్రపంచ పారిశ్రామికవేత్తలు అందిపుచ్చుకోవాలి. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, మూడీస్ అంగీకరించాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం భారతదేశంలో ఒక ట్రిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయని, మౌలిక వసతుల అభివృద్ధి, స్థిరాస్తి రంగాల్లో అపార అవకాశాలు వున్నాయని మోడీ వివరించారు.

trigana airlines

పాపం... ఆ 54 మందీ....

  అయ్యో... అందరూ భయపడిందే జరిగింది... ఆ 54 మందీ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఇండోనేసియా విమానాల ప్రాణ దాహానికి మరో 54 మంది బలైపోయారు. ఇండోనేసియాలో 54 మందితో ప్రయాణిస్తు్న త్రిగానా ఎయిర్ లైన్స్‌కి చెందిన విమానం ఆచూకీ తెలియకుండా పోయిన విషయం తెలిసిందే. ఆ విమానానికి సంబంధించి సేఫ్‌గా వుందనే వార్త వింటామని ఎదురుచూస్తున్న వారందరికీ పిడుగులాంటి వార్త తెలిసింది. ఆ విమానం కూలిపోయిందని, విమానంలో ప్రయాణిస్తున్న ఎవరూ బతికి లేరని త్రిగానా ఎయిర్ వేస్ ప్రతినిధులు ప్రకటించారు. ఈశాన్య పపువా ప్రాంతంలోని ఓస్కిబీ జిల్లాలో ఒక మారుమూల ప్రదేశంలో విమాన శకలాలను గుర్తించామని తెలిపారు. ప్రయాణికులలో ఐదుగురు చిన్నారులు కూడా వున్నారు. అసలు ఇండోనేసియా విమానాలే తరచుగా ఎందుకు ప్రమాదాలకు గురవుతున్నాయన్న విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం వుంది.

Salma Hayek

కప్పలను తిన్న హీరోయిన్

  హీరోయిన్ సల్మా హయక్ ఎంచక్కా కప్పలను భోంచేసింది. కప్పలను మాత్రమేనా.. పట్టు పురుగులను కూడా మరమరాలు తిన్నట్టుగా తినేసింది ‘విల్ సల్మా ఈట్ ఇట్’ అనే టీవీ ప్రోగ్రాంలో పాల్గొన్న సల్మా హయేక్ బాగా దోరగా వేయించిన కప్పలను, అప్పుడే నూనెలో వేయించి తీసిన పట్టు పురుగులను తినేసింది. టీవీ ప్రోగ్రాం కోసం కాబట్టి తిన్నానుగానీ, నిజానికి వాటిని తింటున్నప్పుడు తనకు చాలా ఇబ్బందిగా అనిపించిందని సల్మా హయేక్ తర్వాత చెప్పింది. తాను మరోసారి ఇలాంటి వాటిని పొరపాటున కూడా తినబోనని చెప్పింది. అయితే సల్మా భర్త, ఫ్రెంచ్ వ్యాపారవేత్త ఫ్రాంకోయిస్ హెన్రీ మాత్రం తానయితే చికెన్‌ ఎంత ఇష్టంగా తింటానో కప్పలను కూడా అంతే ఇష్టంగా తింటానని చెప్పుకొస్తున్నాడు. ఇంకో రెండు మూడుసార్లు సల్మా కూడా కప్పల్ని తింటే వాటిలో వున్న రుచి తెలుసుకుంటుందని అంటున్నాడు.

mla vehicle accident

ఎమ్మెల్యే కారు ఢీకొని....

  ఎమ్మెల్యే కారు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వరంగల్ జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. వరంగల్ జిల్లా కాజీపేట సమీపంలోని బోడగుట్టకు చెందిన రైల్వే విశ్రాంత ఉద్యోగి మహ్మద్ సర్వర్ కుమారుడు ఖాజా సహేర్ అలీ (26) తన స్నేహితుడు గౌస్ పాషాతో కలసి బైక్‌పై ప్రయాణిస్తు్న్నాడు. హన్మకొండలో జరిగిన ఒక వివాహానికి హాజరై వీరు తిరిగి వెళ్తున్నారు. జూబ్లీ మార్కెట్ సమీపంలో వీరి వాహనం రోడ్డు దాటుతూ వుండగా హైదరాబాద్ నుంచి హన్మకొండ వైపు వెళ్తున్న నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం వీరి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో సాహెర్ అలీకి తీవ్ర గాయాలై, హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. గౌస్ పాషా పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది.

ragging

మరో ర్యాగింగ్ కలకలం

  ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో ర్యాగింగ్ కలకలం తరచుగా జరుగుతోంది. నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న తర్వాత విద్యా సంస్థల యాజమాన్యాలు ర్యాగింగ్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తు్న్నాయి. అయినప్పటికీ ర్యాగింగ్ ఆగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ర్యాగింగ్‌కి పాల్పడిన ఒక యువతి ప్రిన్సిపాల్ మందలించడంతో ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం కూడా జరిగింది. ఏపీ విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌ని ఉక్కుపాదంతో అణచివేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరో ర్యాగింగ్ ఉదంతం కలకలం రేపింది. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో ర్యాగింగ్ ఉదంతం జరిగింది. ఎంసీఏ మొదటి సంవత్సరం విద్యార్థుల మీద సీనియర్లు ర్యాగింగ్‌కి పాల్పడినట్టు తెలుస్తోంది. ర్యాగింగ్‌కి పాల్పడిన విద్యార్థుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రకటించారు.

ilayaraja ill health

ఇళయరాజాకు అస్వస్థత

  ప్రముఖ సంగీత దర్శకుడు, 72 సంవత్సరాల వయసున్న ఇళయరాజా అస్వస్థతకు గురయ్యారు. రెండు సంవత్సరాల క్రితం స్వల్పంగా గుండెపోటుకు గురైన ఆయన ఆ తర్వాత కోలుకుని సంగీత దర్శకుడిగా ఉత్సాహంగానే పనిచేస్తున్నారు. ఆగస్టు 15వ తేదీన ఆయన తనకు కడుపులో నొప్పిగా వుందని చెప్పడంతో ఆయనను బంధువులు చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆయన గ్యాస్టిక్ సమస్యతోపాటు, పేగులోకి రక్తం చేరిన సమస్యతో బాధపడుతున్నారని తెలుస్తోంది. అయితే ఇది స్వల్ప అస్వస్థతేనని, ఆయనను రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రివర్గాలు ప్రకటించాయి. ఇళయరాజా మూడు దశాబ్దాలకు పైగా అనేక భారతీయ భాషల్లో ఐదు వేల పాటలకు పైగా సంగీతాన్ని సమకూర్చడంతోపాటు జాతీయ అవార్డును కూడా అందుకున్న విషయం తెలిసిందే.

flight accident

రెండు విమానాలు ఢీ

  అమెరికాలో రెండు విమానాలు ఢీకొన్నాయి. అమెరికాలోని శాండియాగో కౌంటీలో ఈ ప్రమాదం జరిగింది. రెండు చిన్న విమానాలు ఢీకొన్న ఈ ప్రమాదంలో నలుగురు మరణించినట్టు తెలుస్తోంది. రెండు ఇంజన్లు వుండే సాబ్రిలైనర్జెట్, ఒకే ఇంజన్ వుండే సెస్‌న్నా 172 విమానాలు బ్రౌన్‌ఫీల్డ్ ప్రాంతానికి సమీపంలో ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయి. రెండు విమానాల శకలాలూ పొలాల్లో ఒకేచోట పడిపోయాయి. ఇటీవలి కాలంలో అమెరికాలో ఇలాంటి చిన్న విమానాల ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. ఇదిలా వుండగా, ఇండోనేసియాలో ఆదివారం నాడు 54 మంది ప్రయాణికులతో అదృశ్యమైన విమానం కూలిపోయినట్టుగా భావిస్తున్నారు. విమానంలో ప్రయాణిస్తున్న అందరూ చనిపోయి వుంటారని అనుమానిస్తున్నారు.

Indonesia

కూలిన ఇండోనేషియా విమానం, 54మంది గల్లంతు

  ఇండోనేషియాలో త్రిగానా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఆదివారం కూలిపోయింది. దానిలో విమాన సిబ్బందితో సహా మొత్తం 54 మంది ఉన్నారు. ఆదివారం ఉదయం పపువా ప్రావిన్స్ రాజధాని జయాపురలోని సెంటాని విమానాశ్రయం నుంచి భారత కాలమాన ప్రకారం ఉదయం 11.30 గంటలకు ఒక్సిబిల్ కి బయలుదేరింది. కానీ కొద్ది సేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయి. ఓకేబెవ్ అనే జిల్లాలో తాంగాక్ పర్వతం వద్ద కూలిపోయినట్లు స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో తక్షణమే సహాయ సిబ్బందిని అక్కడికి పంపడానికి ప్రయత్నించారు. కానీ దట్టమయిన అడవులు, కొండలతో నిండిన ఆ ప్రాంతానికి ఇంతవరకు ఎవరూ చేరుకోలేకపోయారు. కనుక విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల, సిబ్బంది ఆచూకి ఇంకా తెలియలేదు. కొద్ది సేపటి క్రితమే అక్కడికి సహాయ సిబ్బంది చేరుకొని ప్రయానికుల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.   ప్రతికూల వాతావరణం కారణంగానే ఈ విమాన ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. గత ఏడాది కాలంలో ఆ దేశానికి చెందిన రెండు విమాన ప్రమాదాలు జరిగాయి. ఇది మూడవది. త్రిగానా ఎయిర్ లైన్స్ సంస్థ చరిత్రలో ఇంతవరకు 14 విమాన ప్రమాదాలు జరిగాయి. విమాన భద్రతా ప్రమాణాలు లేని కారణంగా ఆ సంస్థను ఐరోపా యూనియన్ చాలా కలం క్రితమే బ్లాక్ లిస్టులో పెట్టింది. కానీ నేటికీ ఆ విమాన సంస్థ తన విమానాలను నడుపుతూనే ఉంది. ఇలాగ అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రయానికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతూనే ఉన్నాయి.

  Governor

గవర్నర్ విందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు డుమ్మా?

  స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా గవర్నర్ నరసింహన్ని నిన్న రాజ్ భవన్ లో ఇచ్చిన తేనీటి విందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరవలేదు. అందుకు గవర్నర్ నొచ్చుకొన్నప్పటికీ ఈ విషయం గురించి అనవసరంగా రాద్ధాంతం చేయవద్దని మీడియాని కోరారు. చంద్రబాబు నాయుడు పట్టిసీమ ప్రాజెక్టు ప్రారంభోత్సవం, కేసీఆర్ కృష్ణా జలాలపై సమీక్షా సమావేశాలతో తీరిక లేనందునే రాలేకపోయారని ఆయన తెలిపారు. ఇద్దరు ముఖ్యమంత్రులకి తను ఆమోదయోగ్యుడినేనని, హైదరాబాద్ లో ఉన్నంత వరకు అందరూ తనను ఆదరిస్తారనే నమ్మకం ఉందని తెలిపారు. తను చాలా ఆశవాదినని సమస్యలన్నీ క్రమంగా సర్దుకొంటాయని ఆశిస్తున్నానని తెలిపారు. తను గవర్నర్ పదవిలో చివరి రోజు వరకు కూడా సంతోషంగా ఉంటానని అన్నారు. ఈ సమావేశానికి తెలంగాణా ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, కేంద్రమంత్రులు సుజనా చౌదరి, బండారు దత్తాత్రేయ, తెలంగాణా మంత్రులు, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోస్లే తదితరులు హాజరయ్యారు.

Anushka

అనుష్క లుక్ పై సమంత ట్వీట్

  అందాల నటి అనుష్క, ఆర్య జంటగా కలిసి సైజ్ జీరో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో సైజ్ జీరో అంటే అనుష్క కూడా అదే సైజులో ఉంటుందని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో అనుష్క భారీకాయం లుక్‌తో ఫోటో చూసి ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిజంగానే అనుష్క లుక్ డిఫరెంటుగా... సైజ్ జీరోకు వ్యతిరేకంగా చాలా బొద్దుగా ఉంది. దీనిలో భాగంగాన్ ఆర్యతో కలిసి ఇచ్చిన ఫోటో ఫోజుతో ఇప్పుడు సినిమాపై ఆసక్తి నెలకొంది. వెయిట్ లాస్ కాన్సెప్ట్ తో తీస్తున్న ఈసినిమాలో ఈపాత్ర కోసం అనుష్క 20 కేజీల బరువు పెరిగిందట. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న వరల్డ్ వైడ్‌గా 1500 థియేటర్స్‌లో ‘సైజ్ జీరో’ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.   ఇదిలా ఉండగా ఈ సైజ్ జీరోలో అనుష్క లుక్ పై మరో అందాల చిన్నది సమంత అనుష్క అక్కా... సైజ్ జీరో లుక్ అదిరిపోయిందక్కా అంటూ ట్వీట్ చేసింది.

president pranab mukherjee

ఆ ప్రశ్న ప్రతిఒక్కరూ వేసుకోవాలి.. ప్రణబ్

  గత నెలలో ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీయే కారణమని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ విషయంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పందించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 69వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు చర్చలకు వేదికగా కాకుండా యుద్ధభూమిగా మారుతుందని అన్నారు. పార్లమెంట్ లో రాజకీయ పార్టీలు చేసే వైఖరి సరైనది కాదని.. ఒకసారి పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. ప్రజాస్వామ్యం ఒత్తిడికి లోనవుతోందని.. ప్రజాస్వామ్యమనే అతి పెద్ద వృక్షానికి వేళ్లు బలంగా ఉన్నా దాని ఆకులు వాడిపోతున్నాయని ఆరోపించారు. మనం పునఃపరిశీలన చేసుకోవాల్సిన తరుణమిదే’’ అని స్పష్టం చేశారు. ఇప్పుడు మనం మన స్వాతంత్ర్య సమర యోధులకు ఇస్తున్న గౌరవ మర్యాదలు మన తరువాతి తరాలు మనకు ఇస్తాయా? అంటే దీనికి సరైన సమాధానం రాకపోవచ్చుకాని ప్రతి ఒక్కరు ఈ ప్రశ్న వేసుకోవాలని అన్నారు.

Pawan Kalyan

పవర్ స్టార్ సర్దార్ ఫస్ట్ లుక్

  స్వాతంత్య దినోత్సవం సందర్బంగా పవర్ స్టార్ అభిమానులకు ఓ మంచి కానుకను అందజేశారు. ఎప్పటినుండో అనుకుంటున్న గబ్బర్ సింగ్ సీక్వెల్ తో వస్తున్న సర్దార్ సినిమా ఫస్ట్ లుక్ ను నిన్న అర్ధరాత్రి రిలీజ్ చేశారు. గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆసినిమాలో ఉన్నట్టుగానే ఇందులోకూడా పవన్ కళ్యాణ్ చేతిలో గన్నులతో, మెడలో ఎర్రటి తువ్వాలుతో ... చొక్కా గుండీలు విప్పేసి సూపర్ మాస్ పోలీసాఫీరసర్‌గా కనిపిస్తున్నారు. గట్స్.. గన్స్.. లవ్.. అంటూ ఓ క్యాప్షన్‌తో పాటు సాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేశాడు పవర్ స్టార్. కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ను పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు.

Balakrishna Tdp

కేంద్రం మాట నిలబెట్టుకోవాలి.. బాలకృష్ణ

  హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ ప్రత్యేక హోదాపై స్పందించారు. ఈ రోజు స్వాంతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఆయన తన నియోజకవర్గమైన హిందూపురంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఎంజీఎం గ్రౌండ్ లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత ఆంధ్ర రాష్ట్రం చాలా నష్టపోయిందని.. అలాంటి ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం తను ఇచ్చిన హామీని తప్పకుండా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అంతేకాదు హిందూపురం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని.. ప్రజలంతా సోదరభావంతో మెలగాలని బాలయ్య పిలుపునిచ్చారు.

pawan kalyan

పర్వతం ఎవ్వడికి ఒంగి సలామ్ చెయ్యదు.. పవన్

  జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వాతంత్యదినోత్సవం సందర్భంగా అందరికి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆయన చేసిన ట్వీట్ లు అందరిలో ఆసక్తి రేపుతున్నాయి. ఎప్పటిలాగే పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ట్వీట్ లు చేశారు. "సముద్రం  ఒకడి  కాళ్ళ  దగ్గర  కూర్చుని మొరగదు, తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు, పర్వతంఎవ్వడికి  ఒంగి సలామ్ చెయ్యదు.. నేనింతా ఒక  పిడికెడు మట్టే కావచ్చు కాని కలమెత్తితే ఒక దేశపు జండా కున్నంత  పొగరుంది అంటూ ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ కావ్యాన్ని గుర్తుచేస్తూ ట్వీట్స్ పోస్టు చేశారు. కవి శేషేంద్ర శర్మ ఎలాగైతే చెప్పారో అలాంటి భావనే ప్రతిఒక్కరి మనసులో ఉండాలని అన్నారు.  

ప్రతిపక్షాలకు చంద్రబాబు కౌంటర్

  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ అటు పార్టీ నేతలనుండి.. ఇటు సామాన్య ప్రజల వరకూ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదా సంగతేమోకాని ఈ విషయాన్ని అడ్డుపెట్టుకొని చంద్రబాబును ఇరుకున పడేద్దామని చూస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ ప్రతిపక్షాలైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సీపీఐ పార్టీలు ఇదే అదనుగా చంద్రబాబుపై విమర్శల బాణాలు సంధిస్తూ వచ్చారు. అసలు ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా ఎప్పుడు విమర్శలు చేద్దామా అని చూసే జగన్ అయితే ఏకంగా ఢిల్లీలోనే ధర్నా చేపట్టాడు. అయితే ఇప్పుడు వీళ్లందరికి చంద్రబాబు కౌంటర్ ఇచ్చారా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే మోదీ ప్రత్యేక హోదా పై తనకు ఫోన్ చేశారని ఆగష్ట్ 15 తరువాత ఈ విషయం పై భేటీ అయి చర్చిద్దామని చెప్పినట్టు తెలిపారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబు భేటీ అయ్యేంత వరకూ ప్రతిపక్షనేతలు ఆగాల్సిందే.   మరోవైపు బీజేపీ మిత్రపక్షమైనప్పటికీ ప్రత్యేకహోదా విషయంపై ఎట్టిపరిస్థితిలోనూ రాజీ పడే ప్రసక్తి లేదని ఈ విషయంలో కూడా చంద్రబాబు వ్యూహాత్మకంగానే వ్యవహరించారని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత ప్రధానిదేనని, విభజన సమస్యలను పరిష్కరించి ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి అవసరమైన సాయమంతా కేంద్రం చేయాల్సిందేనని ఆయన స్పష్టంగా చెప్పారు. అంతేకాదు ప్రత్యేక హోదా ఒక్కటే చాలదని.. ఏపీకి కావాలసిన అన్ని ప్రయోజనాలు పొందేలా చూసుకోవాలని అని అన్నారు.   దీంతో ప్రస్తుతానికి ప్రతిపక్షాల నేతల నోటికి తాళం పడినట్టయింది. మళ్లీ వాళ్లు ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబుపై విమర్శలు చేయాలంటే మోడీ చంద్రబాబు భేటీ వరకూ ఆగాల్సిందే. అయితే చంద్రబాబు అప్పటికీ ఈ విషయంపై ఒక స్పష్టత తీసుకువస్తారని రాజకీయ నేతలు అనుకుంటున్నారు.

విశాఖలో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు సంపూర్ణం

  విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా సాగరతీరాన్న స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చాలా ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులు, చీఫ్ సెక్రెటరీ ఐ.వై.ఆర్. కృష్ణారావు, డీజీపి రాముడు తదితరులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జెండా ఎగురవేసి ఈ వేడుకలను ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర పోలీసు దళాలు, భద్రతా దళాలు, హోం గార్డులు, ఎన్.సి.సి. బృందాలు, సైనిక స్కూల్ విద్యార్ధులు తదితర బృందాలు ముఖ్యమంత్రికి గౌరవ వందనం సమర్పించాయి. విశాఖలోనే మొట్టమొదటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. విశాఖనగరంలోనే అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అదే జరిగితే రాష్ట్ర విభజన తరువాత ప్రభుత్వం విశాఖలో మూడు ప్రధాన కార్యక్రమాలు నిర్వహించినట్లవుతుంది.

సానియాకు ఖేల్ రత్నఅవార్డు

  క్రీడా రంగంలో విశేష కృషి చేసిన వారికి ప్రతీఏటా ఇచ్చే ఖేల్ రత్న, అర్జున అవార్డుల పేర్లను కేంద్రప్రభుత్వం నిన్న ప్రకటించింది. దేశంలో మొత్తం 17 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు ప్రకటించింది. ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారంగా భావించబడే రాజీవ్ ఖేల్ రత్న అవార్డును ఖరారు చేసింది. ప్రముఖ క్రికెట్ ఆటగాడు రోహిత్ శర్మకు అర్జున అవార్డు ఖరారయింది. అర్జునా అవార్డులు అందుకోబోతున్న వారిలో ఇద్దరు తెలుగు వారు కూడా ఉన్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్, స్కేటింగ్ క్రీడాకారుడు అనూవ్ కుమార్ అర్జునా అవార్డులకు ఎంపిక అయ్యారు.