తెలంగాణ-ఒడిశా జాయింట్ ఆపరేషన్.. ఉగ్రవాదులు అరెస్ట్

తెలంగాణ-ఒడిశా పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో భాగంగా ఒడిశా రూర్కెరాలో సిమీ ఉగ్రవాదులు అరెస్ట్ అయ్యారు. సిమీ ఉగ్రవాదులైన అమ్జార్, జకీర్, మెహబూబ్, సాలిఖ్ అరెస్ట్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు 2013లో మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జైలు నుండి తప్పించుకున్నట్టు పోలీసులు తెలుపుతున్నారు. అనంతరం అనేక ప్రాంతాల్లో వీరు తలదాచుకోగా.. తెలంగాణ-ఒడిశా పోలీసులకు అందిన పక్కా సమాచారంతో ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. కాగా వీరికి నల్గొండలో హతమైన ఇద్దరు ఉగ్రవాదులు ఎజాజుద్దీన్, అస్లాంతో వీరికి సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన అనంతరం రహస్య ప్రాంతంలో విచారించేందుకు తరలించారు. కాగా వీరి దగ్గర నుంచి అయిదు దేశవాళీ రివార్వర్లు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అక్కాతమ్ముళ్లను కలిపిన ఫేస్ బుక్

టెక్నాలజీ వల్ల లాభాలు,నష్టాలూ రెండూ ఉంటాయి. ఉపయోగించుకునే తీరు బట్టి ఫలితం మారుతుంటుంది. తాజాగా, సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ ఇద్దరు అక్కాతమ్ముళ్లను కలిపింది. కెనడాకు చెందిన షైలో విల్సన్ తల్లి తన చిన్న కొడుకును పుట్టగానే వేరొకరికి దత్తత ఇచ్చేసింది. ఆ తర్వాత వాళ్లు వేరే ప్లేస్ కు మారిపోవడంతో మళ్లీ కలవలేకపోయారు. ఇది జరిగిన పాతికేళ్లకు, షైలో విల్సన్ తన ఫేస్ బుక్ లో తమ్ముడి గురించి పోస్ట్ పెట్టింది. మాథ్యూ హ్యాండ్ ఫోర్డ్ అనే పేరుతో పెరిగిన ఆమె తమ్ముడు కూడా,తన సొంత కుటుంబం కోసం ఆరా తీస్తున్నాడు.   అనుకోకుండా, ఎవరో షేర్ చేయడంతో, తన అక్క పెట్టిన పోస్ట్ చూశాడు. నా తమ్ముడు ఫలానా హాస్పిటల్లో పుట్టాడు. తన పేరు మాథ్యూ అని అన్ని డిటెయిల్స్ తో ఆమె పెట్టిన పోస్ట్ చూసి మాథ్యూ ఆనందానికి అవధులు లేవు. వెంటనే ఆమెకు మెసేజ్ చేసి, అడ్రస్ కనుక్కుని వాళ్ల ఇంటికి చేరుకున్నాడు. ఊహ తెలియకముందే దత్తత వెళ్లిపోయిన మాథ్యూ, తన సొంత అక్కను, కుటుంబ సభ్యులను చూసి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. టెక్నాలజీని సవ్యంగా వాడుకుంటే, ఎంత అద్భుతమో ఈ అక్కాతమ్ముళ్లే ఉదాహరణ.

ఆ ఇద్దర్నీ బెంగళూర్ కు ఇచ్చేసిన హైదరాబాద్

ఐపిఎల్ ట్రేడింగ్ విండోలో బ్యాట్స్ మేన్ కె ఎల్ రాహుల్, ఆల్ రౌండర్ పర్వేజ్ రసూల్ ఇద్దర్నీ బెంగళూరు టీం కు ట్రేడింగ్ విండోలో సన్ రైజర్స్ హైదరాబాద్ ట్రాన్స్ ఫర్ చేసింది. 2013లో బెంగళూరుకు ఆడిన రాహుల్ ఇప్పుడు తిరిగి తన సొంత గూటికి చేరుకోవడం విశేషం. జమ్ముకశ్మీర్ ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న పర్వేజ్ రసూల్ ను దక్కించుకోవడం తమకు చాలా సంతోషంగా ఉందన్నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ టీం యజమాని విజయ్ మాల్యా.   ప్లేయర్స్ ట్రాన్స్ ఫర్ ను ఐపిఎల్ కౌన్సిల్ కన్ఫామ్ చేసింది. ఇప్పటికే ఐపిఎల్ లో స్ట్రాంగెస్ట్ టీం గా రాయల్ ఛాలెంజర్స్ కు పేరున్న సంగతి తెలిసింది. విరాట్ కోహ్లీ, డివిలియర్స్, క్రిస్ గేల్, షేన్ వాట్సన్ లాంటి ప్లేయర్లతో, బెంగళూర్ టీం అభేద్యంగా కనబడుతోంది. ఏప్రిల్ 9 న మొదలయ్యే ఐపిఎల్ మే 29 వరకూ జరగనుంది.

చెన్నైపై ఇంకా మమకారం పోలేదు..ధోనీ

ఐపిఎల్ లో కొత్త టీం బాధ్యతలు స్వీకరించటం తనకు కూడా కొత్తగానే ఉందంటున్నాడు ధోనీ. ఎనిమిదేళ్ల పాటు ఒకే టీంలో ఉండి ఇప్పుడు మరో కొత్త టీం కు ఆడటం కాస్త డిఫరెంట్ గా ఉన్నా, ఇది కూడా నచ్చిందట. మరి చెన్నై సూపర్ కింగ్స్ ను మర్చిపోయారా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ధోనీ ఎమోషనల్ అయ్యాడు. " మర్చిపోయాను అని చెప్తే అబద్ధమవుతుంది. అన్ని సంవత్సరాల పాటు ఆడిన కారణంగా, ఆ టీం తో ఎంతో కొంత మమకారం ఉంటుంది. ఐపిఎల్ ఆరంభమైనప్పటినుంచీ నేను అడుతున్న జట్టు చెన్నై. ఒక ప్రొఫెషనల్ ఆటగాడు వీటన్నిటికీ అతీతంగా ఉండాలి. నా మీద నమ్మకముంచినందుకు కొత్త జట్టు రైజింగ్ పుణే సూపర్ గెయింట్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు. " అన్నాడు.   పుణే జట్టుకు జెర్సీ ఆవిష్కరణ సమయంలో ఇలా తన మనసులోని మాటల్ని పంచుకున్నాడు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో, ఐపిఎల్ నుంచి చెన్నై, రాజస్థాన్ జట్లను రెండేళ్ల పాటు సస్పెండ్ అవడంతో వాటి స్థానంలో రైనా కెప్టెన్ గా గుజరాత్ లయన్స్, ధోనీ కెప్టెన్ గా రైజింగ్ పుణే సూపర్ గెయింట్స్ వచ్చిన సంగతి తెలిసిందే..ఏప్రిల్ 9 నుంచి మే 29 వరకూ ఐపిఎల్, క్రికెట్ అభిమానుల్ని అలరించనుంది.

మళ్లీ బుక్కైన కేజ్రీవాల్

  కేజ్రీవాల్ టైం బాగున్నట్లు లేదు. ఆయనేం చేసినా విమర్శలపాలవుతున్నాడు. తాజాగా కేజ్రీవాల్ తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఒక కార్టూన్ ఆయన్ను విమర్శల పాలు చేసింది. ఈ కార్టూన్ ద్వారా మోడీని టార్గెట్ చేద్దామనుకున్న కేజ్రీ, తానే టార్గెట్ గా మారాడు. జే.ఎన్.యు క్యాంపస్ లో జరిగిన పరిణామాలపై మోడీని ఫోకస్ చేస్తూ, యూనివర్సిటీలో గొడవలు సృష్టించి తన మీద నుంచి టాపిక్ ను డైవర్ట్ చేశాడు అనే అర్ధంలో కార్టూన్ ఉంది.   అయితే అందుల్లో మోడీ అనుచరుడిగా హనుమంతుడు వెళ్లి యూనివర్సిటీలో తగలబెట్టి వస్తున్నట్లు ఉండటంతో కేజ్రీవాల్ నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ' కేజ్రీవాల్ ఇనసల్ట్స్ హనుమాన్ ' పేరుతో ట్విట్టర్ హ్యాండిల్ ట్రెండ్ అయింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా పోస్ట్ పెట్టిన కేజ్రీవాల్ పై కేసు నమోదు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

రవాణా మంత్రే తాగి కారు నడిపితే!

  తాగి వాహనం నడపవద్దంటూ ప్రతి రాష్ట్రంలోని రవాణా శాఖా జనాలని మొత్తుకుంటూ ఉంటుంది. కానీ సాక్షాత్తూ రవాణా మంత్రే తాగి కారు నడిపిన కేసులో ఇరుక్కుంటే. గోవాలో అదే జరిగింది! మత్తుకి రాజధానిగా పేరుగాంచిన గోవా ఇప్పుడు మరోసారి వార్తలలో నిలిచింది. ‘నానీ డిసౌజా’ అనే మహిళ చేస్తున్న అభియోగం ప్రకారం ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి ‘కార్లోస్‌ ఆల్మెడా’ తాగి ఆమె వాహనాన్ని ఢీకొనేందుకు ప్రయత్నించాడు. డిసౌజా మాటల ప్రకారం ‘ఈ సోమవారం అర్ధరాత్రి సినిమా చూసి తిరిగి వస్తున్న తమ కారుని మంత్రిగారి కారు గుద్దుకుంది. దాంతో ఆగ్రహానికి గురైన మంత్రివర్యులు ఆమెను దూషిస్తూ, వారి కారుని పదేపదే ఢీకొట్టే ప్రయత్నం చేశాడు.   అయితే డిసౌజా చేస్తున్న ఆరోపణలను మంత్రిగారు కొట్టిపారేశారు. ఆ రోజు తమ ఇద్దరికీ మధ్య గొడవ జరిగిన మాట వాస్తవమేననీ, అయితే తాను తాగి ఆమె కారుని ఢీకొట్టలేదనీ సర్దిచెబుతున్నారు. చవకబారు ప్రచారం కోసమే ఆమె ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంతాచేసి డిసౌజా కూడా ఒక మాజీ మంత్రిగారి భార్య కావడం గమనార్హం!  

ప్రేమించలేదని గొంతుకోసి హత్య

  ప్రేమకు రోజురోజుకూ అర్ధం మారిపోతోంది. ప్రేమించిన వారి కోసం ప్రాణమివ్వడం పక్కన పెట్టి, తనకు దక్కకపోతే ప్రేమించిన అమ్మాయిని చంపే స్థాయికి నేటి ప్రేమ దిగజారింది. నాకు దక్కనిది ఇంకెవరికీ దక్కకూడదు అనే దుర్బుద్ధి, దుర్మార్గపు స్వభావం రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా తమిళనాడులో ఇలాంటి ఘోరమే జరిగింది. తన సమీప బంధువుల అమ్మాయిని ప్రేమించిన ఓ ప్రబుద్ధుడు, ఆమెను తనకిచ్చి వివాహం చేయనన్నారని, ఆ అమ్మాయిని బలి తీసుకున్నాడు. ఆమె పీక కోసి హత్య చేసి, పోలీసులకు లొంగిపోయాడు. వివరాల్లోకెళితే..   తమిళనాడులోని పుదుపట్టి కాలనీలో జౌళి వ్యాపారం చేసుకునే చంద్రశేఖరన్ కుటుంబం నివాసం ఉంటోంది. చంద్రశేఖరన్ కుమార్తె అభిరామి(18), స్థానికంగా ఉండే టిటీఈ ట్రైనింగ్ సెంటర్ లో మూడో సంవత్సరం చదువుతోంది. ఈ కుటుంబానికి సమీప బంధువైన తమిళ్ కుమరన్ (16) వారి ఇంటికి రోజూ వస్తుండేవాడు. ఈ క్రమంలో అతనికి అభిరామిపై ఇష్టం కలిగింది. తన కంటే రెండేళ్లు పెద్దదైన ఆమె అతని ప్రేమకు అంగీకరించలేదు. పెద్దలు కూడా అతని ప్రేమను ఒప్పుకోలేదు. కొంత కాలానికి అభిరామికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. అది తట్టుకోలేని కుమరన్, అభిరామి ఇంటికి వెళ్లి ఆమెపై కత్తితో దాడి చేసి, గొంతుకోసి హత్య చేశాడు. అదే కత్తితో, దగ్గర్లోని కోర్టుకెళ్లి లొంగిపోయాడు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

UP సీఎం ఇంటి పక్కనే శవం!

  ఉత్తర్‌ప్రదేశ్‌లో శాంతిభద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పే మరో ఉదంతం ఇది. ఈ నెల 10వ తేదీ నుంచి లక్నోలో ఒక అమ్మాయి కనిపించకుండా పోయింది. ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బాధితురాలి కోసం ఊరంతా గాలించడం మొదలుపెట్టారు. దాదాపు అయిదు రోజుల ముమ్మర గాలింపు తరువాత ఆమె మృతదేహం గౌతంపల్లి అనే ప్రాంతంలో కనిపించింది. 12వ తరగతి చదువుతున్న ఆమె బడి నుంచి తిరిగి వస్తుండగా, ఎవరో దుండగులు అపహరించి, అత్యాచారం చేసి చంపేశారని పోలీసులు భావిస్తున్నారు.   ఈ హత్యతో సంబంధం ఉందని భావిస్తున్న ఒక ఇద్దరిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అధికార నివాసానికి కూతవేటు దూరంలోనే బాధితురాలి మృతదేహం కనిపించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కట్టుదిట్టమైన భద్రత ఉండే ముఖ్యమంత్రి నివాసం వద్దే ఇలాంటి ఘటనలు జరిగితే, ఇక మారుమూల ప్రాంతాలలో ఉండేవారి పరిస్థితి ఏమిటో ఆ రాష్ట్ర ప్రజలకే తెలిసి ఉంటుంది.

ఆ కిడ్నాప్‌లో మా తప్పు లేదు- జూహీ చావ్లా!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఇటీవల ఒక కిడ్నాప్ సంచలనాన్ని సృష్టించింది. దేవేందర్‌ అనే వ్యక్తి, దీప్తి అనే అమ్మాయిని రహస్యంగా ప్రేమిస్తూ, ఆమె ప్రేమని ఎలాగైనా పొందేందుకు కిడ్నాప్ మార్గాన్ని ఎంచుకున్నాడు. 1993లో షారూఖ, జూహీచావ్లా జంటగా వచ్చిన ‘డర్‌’ అనే చిత్రమే ఈ ఘాతకానికి ప్రేరణ అని తెలుస్తోంది. కాకపోతే అదృష్టం బాగుండి దీప్తి ప్రమాదంలో ఉన్న విషయం బయటకి పొక్కడంతో ఘజియాబాద్‌ జిల్లా యంత్రాంగం అంతా అప్పమత్తమైపోయింది. దాంతో దేవేందర్‌కు ఏం చేయాలో తోచక దీప్తి చేతిలో తిరుగు ప్రయాణానికి డబ్బులు పెట్టి మరీ పరారయ్యాడు. ఈ సంఘటనతో సమాజం మీద సినిమాల ప్రభావం గురించి చర్చ మరోసారి వార్తల్లోకి వచ్చింది.   ఒక నేరాన్ని ఎలా చేయాలో, చేసిన నేరాన్ని ఎలా కప్పిపుచ్చుకోవాలో అన్న చిట్కాలు సినిమాల నుండే లభిస్తున్నాయని ఆరోపణలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా తమ మీద వస్తున్న ఆరోపణలను డర్‌ కథానాయిక జూహీ చావ్లా ఖండించారు. సినిమాల్లో ఎప్పుడూ కూడా అంతిమంగా న్యాయమే గెలిచినట్లు చూపిస్తామనీ, అలాంటి సందేశం ఇవ్వకుండా సినిమాలను మధ్యలోనే వదిలేయమనీ చెప్పుకొచ్చారు. ఈ సినిమా దర్శకుడు మహేష్‌భట్‌ కూడా డర్‌ మీద వస్తున్న విమర్శలను కొట్టపారేశారు. ‘సినిమాలే కనుక నిజ జీవితం మీద ప్రభావం చూపగలిగితే, ఈ ప్రపంచం ఒక స్వర్గంగా మారిపోతుంది కదా!’ అంటూ ఎదురు ప్రశ్నించారు. మరి ఈ విషయంలో దేవేందర్‌ అభిప్రాయమేమిటో?

హైదరాబాద్ కు స్వచ్ఛతలో 19 వ స్థానం

కేంద్ర ప్రభుత్వం చేస్తున్న స్వచ్ఛనగరాల సర్వేలో హైదరాబాద్ 19 వ స్థానం దక్కించుకుంది. జనాభా ప్రాతిపదికన తీసుకున్న 73 మహానగరాల్లో హైదరాబాద్ కు స్వచ్ఛతలో 19వ స్థానం దక్కించుకుంది. తెలంగాణా రాష్ట్రం నుంచి మరో నగరం వరంగల్ 32వ స్థానంలో నిలిచింది. మరో తెలుగు నగరం విశాఖపట్టణం ఐదో స్థానంలో నిలవడం విశేషం. ఈ లిస్ట్ లో మైసూర్ అత్యంత స్వచ్ఛమైన నగరంగా మొదటి స్థానంలో నిలిచింది. ప్రధానమంత్రి మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసికి 65వ స్థానం దక్కింది. ఈ సర్వేలో నగరంలోని జనాభా, నీటి లభ్యత, ప్రజల జీవనవిధానాన్నిలాంటి వాటిని కూడా పరిగణించారు. స్వచ్ఛభారత్ మిషన్ దేశంలో ఏ మేరకు పనిచేస్తుందో పరిశీలించడానికి ఈ సర్వేను కేంద్రం చేపట్టింది. టాప్ 10 క్లీనెస్ట్ సిటీస్ 1.మైసూర్, 2. ఛండీగఢ్, 3.తిరుచిరాపల్లి, 4. న్యూఢిల్లీ, 5. విశాఖపట్టణం, 6. సూరత్, 7. రాజ్ కోట్, 8. గ్యాంగ్ టక్, 9. పింప్రీ చించ్వాడ్(మహారాష్ట్ర) 10. గ్రేటర్ ముంబై

త్రీడీ ప్రింటింగ్ ద్వారా బాడీ పార్ట్స్..!!

త్రీడీ ప్రింటింగ్ ఇప్పటి వరకూ వస్తువులకే పరిమితమైంది. తాజాగా త్రీడీ ప్రింటింగ్ సహాయంతో, అవయవాల్ని సృష్టించి సక్సెస్ ఫుల్ గా పనిచేయించారు అమెరికన్ వైద్యులు. జంతువులపై చేసిన ప్రయోగాలు సక్సెస్ అవడంతో, త్వరలోనే మనుషులకు కూడా దీన్ని ఉపయోగించి కోల్పోయిన భాగాల్ని అద్భుతంగా పున:సృష్టించవచ్చని చెబుతున్నారు. శరీరంలోని కీలక అవయవాల్లో ఏం కోల్పోయినా, కృత్రిమ అవయవాల్ని సృష్టించి తిరిగి పనిచేసేలా చేయవచ్చు. కానీ ఇలా ప్రింట్ చేసిన టిష్యూల్లోని సెల్స్ బ్రతికి ఉండేలా చేయడం ప్రస్తుతం సైంటిస్టులకు ప్రధానమైన ఛాలెంజ్ గా మారింది. బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ ను లివింగ్ సెల్స్ ఉన్న ఒక జెల్ తో కలిపి అవసరమైన చోట అమరుస్తారు. కొన్నాళ్లకు ఆ భాగం నుంచి ప్లాస్టిక్ కరిగిపోయి, ఆకారం ఉండిపోతుంది. ఈ త్రీడీ ప్రింటింగ్ ద్వారా, అవసరమైన చోట, అవయవాల్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఆరంభ దశలోనే ఉన్నా, భవిష్యత్తులో ఇది చాలా కీలకపాత్ర పోషిస్తుందంటున్నారు సైంటిస్టులు.

ఖేడ్‌లో కారు జోరు!

    నారాయణఖేడ్‌ ఉప ఎన్నికలలో ఊహించిన ఫలితమే వెల్లడైంది. ఖేడ్‌లో కాంగ్రెస్‌ సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోవడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇలాంటి సందర్భాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే తరఫు నిలబడే వారసులే గెలవడంగా వస్తున్న రివాజుని తోసిరాజని మరీ తెరాస దూసుకుపోయింది. అక్కడ తెరాస తరఫున నిలబడిన ఎం.భూపాల్‌రెడ్డి 53,625 ఓట్ల మెజారటీతో విజయదుందుభిని మోగించారు. ఖేడ్‌లో పోలైన ఓట్లలో దాదాపు 60 శాతానికి పైగా ఓట్లు తెరాస అభ్యర్థికే రావడం విశేషం. కాంగ్రెస్‌ తరఫు అభ్యర్థి సంజీవరెడ్డి కేవలం 39,451 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. మొత్తం 21 రౌండ్లలో సాగిన లెక్కింపులో ఏ ఒక్క రౌండులోనూ కాంగ్రెస్ అభ్యర్థికి ఆధిక్యం రాకపోవడం గమనార్హం. దీంతో తెరాస విజయాన్ని చేరుకోనుందన్న తొలి నిమిషం నుంచే బలపడుతూ వచ్చింది. కాకపోతే ఎంత మెజారటీతో అన్న విషయంలోనే సందేహాలు రేగాయి. చివరికి అది కూడా తేలిపోవడంతో.... తెరాస తరఫున తిరుగులేని విజేతగా భూపాల్‌రెడ్డి నిలిచారు.

‘తుపాకీ ఉంటే కాల్చిపారేసేవాడిని’ – దిల్లీ ఎమ్మెల్యే

  జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు విద్యార్థుల మీద జాతివిద్రోహ కేసులు నమోదైన విషయం తెలిసిందే! సదరు విద్యార్థులకు అనుకూలంగా దిల్లీలోని పాటియాలా కోర్టు వద్దకు వందలాది విద్యార్థులు, ప్రతిపక్ష నాయకులు చేరుకున్నారు. ఈ సందర్భంగా చెలరేగిన ఘర్షణలో విద్యార్థులకీ, న్యాయవాదులకీ మధ్య తోపులాట చోటుచేసుకుంది. దొరికినవాళ్లని దొరికినట్లు న్యాయవాదులు చావబాదారు. పనిలో పనిగా దిల్లీకి చెందిన భాజపా శాసనసభ్యుడు ఓ.పీ.శర్మ కూడా ప్రతిపక్షాల మీద దాడి చేసినట్లు వీడియోలతో సహా వార్తలు వచ్చాయి. కానీ శర్మ తన దాడిని సమర్థించుకుంటూ ‘భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు వినిపించడంతో తాను వారికి దేహశుద్ధి చేయల్సి వచ్చిందని’ చెప్పారు. అంతేకాదు! శర్మ మరో అడుగు ముందుకు వేసి ‘ఎవరైనా మన మాతృభూమిని తిడుతుంటే చూస్తూ ఊరుకుంటాం. ఆ సమయంలో నా దగ్గరే కనుక తుపాకీ ఉంటే కాల్చిపారేద్దును’ అని ఆవేశపడిపోయారు.

మందుబాబులని మార్చండి... గవర్నర్‌ పిలుపు!

  గవర్నర్‌ నరసింహన్‌ నిన్న శ్రీకాకుళంలోని శ్రీకూర్మం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. పనిలో పనిగా శ్రీకాకుళం ఏజన్సీ ప్రాంతాలను కూడా సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి గిరిజన మహిళల యోగక్షేమాలను నరసింహన్‌ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథాకాలు వారికి అందుతున్నాయో లేవో; పిల్లలకు విద్య, మధ్యాహ్న భోజనం లభిస్తోందో లేదో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మద్యపానం గురించి కూడా చర్చ వచ్చింది. బడుగుజీవులు మద్యంతో ఇల్లూ, ఒళ్లూ గుల్ల చేసుకోవడం గురించి విన్న నరసింహన్‌... గ్రామస్థులే స్వచ్ఛందంగా మద్యపానాన్ని అమలు చేయాలని పిలుపునిచ్చారు. ఇంట్లో అంతా కష్టపడి పనిచేయాలనీ, పిల్లలని బాగా చదివించాలనీ, ప్రభుత్వ పథాకాలన్నింటినీ అందిపుచ్చుకోవాలనీ గ్రామస్థులకి హితవు పలికారు.

మళ్ళి' ఆయన ' నోరు జారారు

      ప్రజా ప్రతినిధులు , అధికారుల పై నోరుపారేసు కోవటం తరుచు వింటుంటాం.  ఒకో సారి పదిమంది లో పట్టుకుని అధికారుల్ని దులిపేయటం, నోటికి వచ్చింది అనేయటం జరుగుతుంటుంది. మీడియా వుంది , కెమెరాలు వున్నాయి వారు అన్నది , అన్నట్టు  రికార్డు అవుతుంది అన్నది మర్చి పోయి ...ఆహా ..మాకే పాపం తెలియదు ..మేమేం అనలేదు అంటూ మాట మారుస్తుంటారు . ఇప్పుడు కూడా అదే జరిగింది. పబ్లిక్  గా మీటింగ్ లో ఒక ఇంజనీర్ ని పట్టుకుని ...నువ్వేం చదివావ్ ? నీ మాటలేంటి ? అంటూ బూతులు తిట్టారు ..స్వయం గా  ఓ రాష్ట్ర మంత్రి గారు . ఆ తర్వాత అబ్బే ..నేనేం అలా అనలేదు అంటూ మాట మార్చారు.. ఇప్పుడు ఆ వీడియో ఎలెక్ట్రానిక్ మీడియా లో దుమ్ము రేపుతోంది.   హర్యానా మంత్రి క్రిషన్ బేడి కి ఇది మొదటి సారి కాదు ..ఇలా పబ్లిక్ గా అధికారుల మీద నోరుపారేసు కోవటం ఇంతకు ముందు కుడా చేసారు..ఏమయినా ..అధికారులని ఏం చదివావ్ అంటూ అడిగి మరి ఎద్దేవా చేసేలా మాట్లాడే వీరిని తిరిగి ..మీరేం చదివారు అంటూ అడిగితే మొహం ఎక్కడ పెట్టుకుంటారు అంటూ జనం వీరి ప్రవర్తన మీద నిరసన తెలియ చేయటం అప్పుడే మొదలెట్టారు ..ఏమయినా ఒక పబ్లిక్ సర్వంట్ ని ఇలా పబ్లిక్ గా అవమానించటం ఎంత మాత్రం కరెక్ట్ కాదు అన్నది ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న మాట. మరి అది ఆ మంత్రి గారి చెవి దాకా వెళ్తుందా ? చూద్దాం..మన ప్రజాప్రతినిధుల ఈ నోరు జారుడు కి మందు ఏంటో ?