చిట్టీల చిట్టెమ్మా.. గుట్టంతా చెప్పమ్మా!

      టీవీ, సినిమా వాళ్ళ చెవుల్లో చిట్టీల పేరుతో పూలు పెట్టి, కోట్ల రూపాయలను మూటగట్టుకుని వెళ్ళిపోయిన టీవీ నటి, ఇప్పుడందరూ ముద్దుగా ‘చిట్టీల చిట్టెమ్మ’ అని పిలుచుకుంటున్న విజయరాణిని ఎట్టకేలకు పోలీసులు వెతికీ వెతికి పట్టుకున్నారు. బెంగుళూరు విద్యారణ్య కాలనీలో వున్న బంధువుల ఇంట్లో హయిగా రెస్టు తీసుకుంటున్న విజయరాణిని పట్టుకున్న పోలీసులు హైదరాబాద్‌కి తీసుకొచ్చారు. ప్రస్తుతం విజయరాణిని పోలీసులు విజయారాణి చేత అసలు గుట్టంతా బయట పట్టించడానికి వాళ్ళదైన శైలిలో ‘విచారణ’ చేస్తున్నారు. చిట్టీలు, అధిక వడ్డీల పేరుతో జనాన్ని ఎలా మోసం చేసిందీ, ఎలా బుట్టలో వేసిందీ చిట్టీల చిట్టెమ్మ వివరంగా చెబుతుంటే, ఆమె తెలివితేటలు చూసి పోలీసులే నోళ్ళు తెరుస్తున్నారట.

మోడీ హవా లేదు: జోకులేసిన ప్రియాంక

      దేశంలో మోడీ హవా లేదని సోనియాగాంధీ పుత్రికా రత్నం ప్రియాంక తనకు అంతా తెలిసినట్టు చెప్పేశారు. ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికలలో ఓటు వేయడానికి తన భర్త రాబర్ట్ వధేరాతో కలసి పోలింగ్ స్టేషన్‌కి ప్రియాంక వచ్చారు. ఓటు వేసిన అనంతరం మొగుడూ పెళ్ళాలిద్దరూ తమ చూపుడు వేళ్ళ మీద వున్న ఇంకు గుర్తులను మీడియాకు చూపించారు. ఈ సందర్భంగా మీడియా వాళ్ళు దేశంలో మోడీ గాలులు వీస్తున్నాయంటున్నారు. ఈ విషయంలో మీరేమంటారని ప్రశ్నిస్తే, ‘మోడీ గాలులు వీస్తున్నాయా? ఆ గాలులేవీ నాకు కనిపించలేదు’ అని ప్రియాంక జోకేసింది. దేశంలో ఎక్కడా మోడీ హవా లేదని ఆ తర్వాత తన జోక్‌ని విడమరచి చెప్పింది. చూడమ్మా ప్రియాంకా.. గాలి కనిపించదు.. దాని ప్రభావం మాత్రం త్వరలో నీకు కనిపిస్తుందని అక్కడున్నవాళ్ళు మనసులో అనుకోకుండా వుండి వుంటారా?

జగన్ పార్టీకి ఎన్టీఆర్ ప్రచారం?

      వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయబోతున్నట్టు తెలుస్తోంది. గుడివాడ నుంచి అసెంబ్లీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రంగంలో వున్న కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని)కి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయడానికి సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. కొడాలి నాని హరికృష్ణకి, జూనియర్‌కి సన్నిహితుడు. గతంలో నాని తెలుగుదేశంలో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశాడు. నాని వైకాపాలోకి వెళ్ళినప్పటి నుంచి వీరిమధ్య వ్యక్తిగతంగా స్నేహ సంబంధాలు కొనసాగుతున్నప్పటికీ రాజకీయంగా ఎలాంటి బంధం లేకుండా పోయింది.   చంద్రబాబు తనను, జూనియర్ ఎన్టీఆర్ని పట్టించుకోవడం లేదన్న కోపంలో వున్న హరికృష్ణ రాష్ట్ర విభజన సాకుచూపించి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. అలాగే తాజాగా హరికృష్ణ తనకు హిందూపూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయాలని వుందని నోరు తెరిచి అడిగినా, తెలుగుదేశం పార్టీలో దాన్ని పట్టించుకున్న వారే లేకుండా పోయారు. ఈసారి ఎన్నికలలో హరికృష్ణ వర్గానికి చెందిన వారికి టిక్కెట్లు వచ్చే అవకాశం లేదన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇన్ని అవమానాలు భరిస్తున్న హరికృష్ణ వైసీపీ అభ్యర్థిగా పోటీలో వున్న కొడాలి నానికి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయడమే ఆ అవమానానికి సరైన ప్రతీకారం అని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

కిరణ్ కి కలిసి వచ్చే విభజన విచారణ

  ఎన్నికల అనంతరం జూన్ 2న ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలు విడిపోయేందుకు అధికారికంగా ముహూర్తం కూడా ఖరారు అయినప్పటికీ, ఇంకా నేటికీ రాష్ట్ర విభజన వ్యవహారం సుప్రీంకోర్టులో నలుగుతూనే ఉంది. మాజీ సీయం.కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు విభజనను వ్యతిరేఖిస్తూ వేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మే 5న విచారణ చెప్పట్టనుంది. అంతకు ముందు ఈ అంశంపై సంజాయిషీ కోరుతూ సుప్రీంకోర్టు నుండి నోటీసులు అందుకొన్న కేంద్ర ప్రభుత్వం విభజనను, అది జగిరిగిన తీరుని, అందుకు తనకు గల హక్కులను గట్టిగా సమర్దించుకొంది. రాష్ట్ర విభజన వ్యతిరేఖిస్తూ పడిన అనేక పిటిషన్లను ఇదివరకు త్రోసిపుచ్చిన జస్టిస్ దత్తు బెంచే ఈ సారి కూడా విచారణ చెప్పట్టబోతోంది. కనుక ఈసారి కూడా ఈ పిటిషన్లను కొట్టివేయవచ్చును. పైగా ఇప్పుడు రాష్ట్రంలో రెండు ప్రాంతాలలో కూడా మళ్ళీ చాలా ఏళ్ల తరువాత పూర్తి ప్రశాంత వాతావరణం ఏర్పడి ఉంది. ప్రజలు, పార్టీలు అందరూ కూడా మానసికంగా విభజనకు సిద్దపడి ఉన్నారు. కనుక ఇటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు మళ్ళీ ఈ సమస్యను కెలికేందుకు అంగీకరించక పోవచ్చును.   కానీ, ఇదే సమస్యను ఆధారంగా చేసుకొని జై సమైక్యాంధ్ర పార్టీ స్థాపించి ఏటికి ఎదురీదుతున్న కిరణ్ కుమార్ రెడ్డికి మాత్రం ఈ కోర్టు, విచారణ వ్యవహారం ఎన్నికల ప్రచారానికి వాడుకొనేందుకు మాత్రం ఉపయోగపడవచ్చును. బహుశః నేడో రేపో కిరణ్ ఈ అంశాన్ని పట్టుకొని మళ్ళీ మీడియా ముందుకు వచ్చినా ఆశ్చర్యం లేదు.

చంద్రబాబు మాట వినని బాలకృష్ణ

      నందమూరి బాలకృష్ణ ఈ ఎన్నికలలో పోటీ చేయాలని ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నాడు. ‘లెజెండ్’ హిట్ కావడంతో బాలకృష్ణ ఆత్మవిశ్వాసం బాగా పెరిగిపోయింది. ఈసారి ఎన్నికలలో తప్పనిసరిగా పోటీ చేయాల్సిందేనని బాలకృష్ణ గట్టి పట్టుదల మీద వున్నాడు. రాయలసీమ టూర్‌కి వెళ్ళినప్పుడు హిందూపూర్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించేశాడు. అక్కడి తెలుగుదేశం కార్యకర్తలకు తన నామినేషన్ వ్యవహారాల గురించి చర్చించినట్టు సమాచారం. అయితే హైదరాబాద్ తిరిగొచ్చాక బాలకృష్ణ ఉత్సాహం మీద చంద్రబాబు నీళ్ళు కుమ్మరించాడు.   బాలకృష్ణ అసెంబ్లీకి నిలబడి గెలిస్తే సీమాంధ్ర ముఖ్యమంత్రి పదవికి తనకు పోటీ అవుతాడని భయపడ్డాడో లేక మరే కారణం వుందో గానీ, బాలకృష్ణ పోటీ చేసే విషయంలో చంద్రబాబు  సుముఖంగా కనిపిచండం లేదు. ఆ విషయాన్నే ఆయన విలేకరులకు చెప్పారు. బాలకృష్ణ హిందూపూర్ నుంచి పోటీ చేస్తాడట కదా అంటే, ఆ విషయాన్ని ఇంకా ఆలోచించలేదు బాలకృష్ణతో మాట్లాడి  చెబుతానని అనడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత చంద్రబాబు, బాలకృష్ణ మధ్య హాట్ హాట్ చర్చ జరిగినట్టు తెలుస్తోంది. నువ్వు పోటీ చేయొద్దు బావా.. నువ్వు రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తే అదిరిపోతుందని చంద్రబాబు బాలకృష్ణని ఉబ్బేసినా బాలకృష్ణ బుట్టలో పడనట్టు తెలుస్తోంది. ఈసారి ఆరు నూరైనా తాను పోటీ చేయడం ఖాయమని చంద్రబాబుకు స్పష్టం చేసినట్టు సమాచారం. చంద్రబాబు బాలకృష్ణని ఎంత వెనక్కి లాగాలని ప్రయత్నించినా బాలకృష్ణ తన పట్టు విడవనట్టు తెలుస్తోంది.  

ఎన్నికల ప్రచారం: భ్రమల్లో ప్రియాంక!

      ఇంతవరకూ తెలియలేదుగానీ, సోనియాగాంధీ కూతురు ప్రియాంకకి తన గురించి తానే ఎక్కువగా ఊహించుకునే సమస్యేదో ఉన్నట్టుంది. తాను ఎన్నికల బరిలో దిగి ప్రచారం మొదలెడితే కాంగ్రెస్ పార్టీ సూపర్‌గా గెలిచేస్తుందనే భ్రమల్లో ఉన్నట్టుంది. ఆ భ్రమలు ఆమెకి సోనియా, రాహులే కల్పించినట్టున్నారు. ఈ ఎన్నికలలో సోనియా, రాహుల్ గెలుపే ప్రశ్నార్థకంగా వుంది. ఈ భయంతోనే రాయబరేలి, అమేథి నియోజకవర్గాలలో ప్రియాంక చేత కూడా ప్రచారం చేయించాలని అనుకుంటున్నారు.   అమ్మకోసం, సోదరుడి కోసం ప్రచారం చేయడానికి ఒప్పుకున్న ప్రియాంక కేవలం ఆ రెండు నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం చేస్తానని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది. సోనియా, రాహుల్‌ని గెలిపించుకోవడం తన బాధ్యత అన్నట్టుగా ప్రియాంక భారీ సెంటిమెంట్ డైలాగ్స్ కొడుతోంది. తనచేత ప్రచారం చేయించుకోవాలని చాలామంది కాంగ్రెస్ అభ్యర్థులు ఉవ్విళ్ళూరుతున్నానని, తాను మాత్రం కేవలం తన కుటుంబ సభ్యులు ఇద్దరికి మాత్రమే ప్రచారం చేస్తానని అంటోంది. ప్రియాంక మాటలు వింటుంటే తాను ప్రచారం చేస్తే ఎవరైనా గెలిచేస్తారన్న అతి విశ్వాసం కనిపిస్తోంది.

డైలాగ్స్ రచయిత పొన్నాల!

      ఈ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్దగా బెంగ పెట్టేసుకోకుండా చక్కగా తెలంగాణ సినిమాలకు మాటల రచయితగా సెటిలైపోవచ్చు. పొన్నాల తన రాజకీయ ప్రత్యర్థుల మీద సంధించే మాటలను వింటుంటే పొన్నాల రాజకీయాల కంటే సినిమా మాటల రచయిగా బాగా షైన్ అవుతాడన్న అభిప్రాయం కలుగుతూ వుంటుంది.   లేటెస్ట్ గా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద అడపాదడపా పొన్నాల విసురుతున్న డైలాగ్స్ అదిరిపోతున్నాయి. మొన్నామధ్య కేసీఆర్ని పొన్నాల బుడబుక్కల వాళ్ళతో, పిట్టలదొరతో పోలుస్తూ డైలాగ్స్ కొట్టాడు. అలాగే నిన్నగాక మొన్న సన్నాసుల బాష మాట్లాడే కేసీఆరే అందరికన్నా పెద్ద సన్నాసి అని ఘాటు డైలాగ్ కొట్టాడు. లేటెస్ట్ గా రావణుడికి రంగు వేస్తే రాముడు అవుతాడా అని కేసీఆర్‌ని ఉద్దేశించి సూపర్ డైలాగ్ కొట్టాడు. పొన్నాల డైలాగ్స్ కి కేసీఆర్ తరఫు నుంచి పెద్దగా స్పందన రాకపోయినా, తెలంగాణ సినిమా వర్గాలు మాత్రం పొన్నాలలోని డైలాగ్ రచయితని ఆశగా చూస్తున్నాయి.

టీఆర్ఎస్ ప్రచారం: అల్లు అర్జున్‌కి కేసీఆర్ నో?

      టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్‌కి పిల్లనిచ్చిన మామ శేఖర్‌రెడ్డి టీఆర్ఎస్ కండువా కప్పుకుని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అల్లు వారి వియ్యంకుడు టీఆర్ఎస్‌లో చేరినప్పటి నుంచీ అల్లు అర్జున్ మామగారికి ప్రచారం చేస్తాడా చేయడా... అల్లు అర్జున్ ముగ్గురు మామయ్యలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, శేఖర్‌రెడ్డి మధ్యలో ఇరుక్కుపోయాడు.   ఇప్పుడేం చేస్తాడో అనే చర్చలు, ఊహాగానాలు గత రెండు రోజులుగా జరుగుతున్నాయి. అల్లు అర్జున్ కూడా ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేయాలా వద్దా అనే డైలమాలో వున్నట్టు తెలుస్తోంది. అయితే అల్లు అర్జున్‌కి అంత శ్రమ అవసరం లేకుండా, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అల్లు అర్జున్ ప్రచారం అవసరం లేదని శేఖర్‌రెడ్డికి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. సీమాంధ్రుడి చేత ప్రచారం చేయించుకుని ఇబ్రహీంపట్నం సీటు గెలవాల్సినంత ఖర్మ టీఆర్ఎస్‌కి పట్టలేదని కేసీఆర్ చెప్పినట్టు సమాచారం. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు అల్లు అర్జున్ ప్రచారం డైలమాని కేసీఆరే తీర్చేశాడు.

చేసిన మేలు మరచే చంద్రబాబు: జయప్రద కామెంట్!

      తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనకు మేలు చేసిన వారిని మరచిపోయే వ్యక్తి అని ప్రముఖ సినీ నటి, లోక్‌సభ సభ్యురాలు జయప్రద వ్యాఖ్యానించారు. ఒక టీవీ ఛానెల్‌కి ఇచ్చి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చంద్రబాబు మీద విమర్శలు కురిపించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు తాను ఎన్నో త్యాగాలు చేసి ఎన్టీఆర్ వెంట నడిచానని, పార్టీ చంద్రబాబు చేతుల్లోకి వచ్చిన తర్వాత తాను చేసిన త్యాగాలన్నిటికీ గుర్తింపు లేకుండా పోయిందని ఆమె బాధపడ్డారు. చంద్రబాబు రెండోసారి అధికారంలోకి వచ్చాక తనకు సాయం చేసిన వారిని మరచిపోవడం అలవాటుగా పెట్టుకున్నారని ఆమె విమర్శించారు. ఎన్టీఆర్ హయాంలో టీడీపీలో వున్న విలువలు ఇప్పుడు లేవని జయప్రద అన్నారు.

అమెరికాలో దారుణం: ఉన్మాది @ విద్యార్థి!

      అమెరికాలోని విద్యావిధానం కారణంగా విద్యార్థులు స్ట్రెస్‌కి గురై దారుణాలకు ఒడిగడుతున్నారో లేక అక్కడి పెంపకమే దారుణంగా వుందో గానీ, విద్యాలయాల్లో దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తోటి విద్యార్థుల మీద దాడులు, దారుణ హత్యలు చేస్తున్న సైకోల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ఇప్పుడు మరో సైకో ఉదంతం వెలుగులోకి వచ్చింది. పెన్సిల్వేనియా రాస్ట్రంలోని మరీస్ విల్లే ప్రాంతంలోని ఓ విద్యాలయంలో ఒక విద్యార్థి దారుణంగా బిహేవ్ చేశాడు. చేతిలో కత్తి పట్టుకుని విద్యాలయంలో వీరవిహారం చేశాడు. తమలో ఒకడిగా వున్న విద్యార్థి సడెన్‌గా ఉన్మాదిలా మారి కత్తితో దాడి చేయడంతో విద్యార్థులందరూ చెల్లాచెదురైపోయారు. పారిపోతున్నవారిని కూడా వదలకుండా సదరు ఉన్మాది వాళ్ళని కసితీరా పొడిచి గాయపరిచాడు. మొత్తం ఇరవై మందిని దారుణంగా పొడిచిన ఉన్మాదిని ఆ తర్వాత పోలీసులు అరెస్టు చేశారు. టైమ్ బాగుండి ఉన్మాద విద్యార్థి చేతిలో గాయపడిన వారెవరికీ ప్రాణాపాయం లేదు.

తప్పులెన్ను వారు..

  కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిన్నఒక ఎన్నికల ప్రచార సభలో బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ తను అధికారంలోకి రావడానికి దేశాన్ని చీల్చేందుకు కూడా వెనుకాడడని తీవ్రంగా విమర్శించారు. రాహుల్ అన్నట్లు మోడీ అటువంటి ప్రయత్నాలు ఇంత వరకు చేయకపోయినా, తన తల్లి సోనియా గాంధీ తనను ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చీల్చిన సంగతి ఆయనకు బాగానే తెలుసు. తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు అన్నట్లు ఆ సంగతి మరిచి, మోడీని విమర్శించడం చూస్తే, నిత్యం నీతి సూక్తులు వల్లించే యువరాజావారికి కూడా కాంగ్రెస్ నీళ్ళు బాగానే ఒంటబట్టాయని అర్ధమవుతోంది.

3వ దశ ఎన్నికలు షురూ

  ఈరోజు 11 రాష్ర్టాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలలో మూడో విడత సార్వత్రిక ఎన్నికలకు ఓటింగ్ మొదలయింది. మొత్తం 92 నియోజకవర్గాల్లో 11 కోట్ల మందికి పైగా ఓటర్లు ఈరోజు తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు.   మధ్యప్రదేశ్‌లో-9, ఛత్తీస్‌గఢ్‌-1, మహారాష్ట్ర-10, హర్యానా-10, లక్షద్వీప్‌-1, కేరళ- 20, అండమాన్ నికోబార్ దీవులు-1, జమ్ముకాశ్మీర్‌-1, ఢిల్లీ-7, ఉత్తరప్రదేశ్‌-10, బీహార్‌-6, జార్ఖండ్‌-5, ఒడిశా-10 నియోజక వర్గాలలో పోటీ చేస్తున్న మొత్తం 1419 మంది అభ్యర్థుల భవితవ్యం ఈ రోజు తేలనుంది.   మళ్ళీ ఈనెల 12న జరిగే నాలుగవ దశ ఎన్నికలలో మూడు రాష్ట్రాలలో 5 నియోజక వర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈనెల 17,24, మరియు 30తేదీలలో జరిగే 5,6,7 దశ ఎన్నికలలో 13 రాష్ట్రాలలో మొత్తం 338 నియోజక వర్గాలలో ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ 30వ తేదీన తెలంగాణాలో, మే7న ఆంధ్రలో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల ఫలితాలు మే16న వెలువడుతాయి.

ప్రజాసేవ కోసం తపిస్తున్న రాజకీయ కోటీశ్వరులు

  మన రాజకీయ నేతలలో చాలా మందికి వ్యాపారాలు, కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలున్నాయని అనడరికీ తెలుసు. అందువల్ల వారు ప్రజలకి సేవ చేయడం మాటెలా ఉన్నా, వారి రాజకీయాలు, అధికారం, పరపతి అన్నీ కూడా తమ వ్యాపారాలను కాపాడుకొంటూ వాటిని మరింత వృద్ధి చేసుకోవడానికి మాత్రం తప్పక సద్వినియోగం చేసుకొంటారని అందరికీ తెలుసు. ఒక మధ్య తరగతి గృహస్తు తన పిల్లల చదువులకో, పెళ్ళిళ్ళకోసం డబ్బు పోగేసేందుకు ఒక జీవిత కాలం శ్రమించవలసి వస్తే, మన రాజకీయ నాయకుల ఆస్తులు మాత్రం పది తరాలు కూర్చొని తిన్నా కూడా తరగనంతగా ప్రతీ ఐదేళ్ళకీ రెండు మూడింతలుగా పెరిగి వందల కోట్లకు చేరుకొంటోంది. ఈ గొప్ప సౌలభ్యం ఉన్నందునే వారందరూ ‘ప్రజాసేవ’ చేసేందుకు ఇంతగా పోటీలు పడుతున్నారు.   ఇక తెరాస అధ్యక్షుడు కేసీఆర్ తన ఫారం హౌస్ లో సాగు చేస్తున్నవ్యవసాయం ద్వారా ఏడాదికి ఒక్కో ఎకరానికి కోటి రూపాయలు సంపాదిస్తున్నాని స్వయంగా చెప్పినప్పటికీ, ఆయన తన నామినేషన్ ఫారంలో మాత్రం తన మొత్తం ఆస్తి కేవలం రూ.14.94 కోట్లు మాత్రమే చూపారు. తన భార్య పేరిట రూ. 21 లక్షలు విలువైన చరాస్తులతో బాటు మొత్తం రూ.7,87,53,620 అప్పులు కూడా ఉన్నాయని తెలిపారు. 2012-13లో తన ఆదాయం రూ. 6,59,684లుగా చూపిన కేసీఆర్ 2013-14లో రూ. 8,67,830 ఆర్జించినట్లు ఆదాయ పన్నుల రిటర్న్‌లో పేర్కొన్నారు. కారు గుర్తు గల తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కి, ఆయన భార్యకి కూడా తిరిగేందుకు స్వంత కారు కూడా లేదుట!   ఇక ఆయన కొడుకు కేటీఆర్ తండ్రి కంటే రెండాకులు ఎక్కువే చదివారు. తన పేరిట, తన భార్యా పిల్లల పేరిట మొత్తం రూ.5.09 కోట్ల చరాస్తులు, రూ.2.86 కోట్ల స్థిరాస్తులున్నట్లు చెపుతూనే తండ్రి వద్దనుండి రూ.40 లక్షల అప్పు తీసుకున్నట్లు పేర్కొన్నారు. గత ఎన్నికలకీ, ఈసారి ఎన్నికలకీ మధ్య తమ ఆస్తి కేవలం రూ.80లక్షల చిల్లర మాత్రమే పెరిగిందని, అదేవిధంగా రూ. 2 కోట్ల అప్పులు కూడా ఉన్నాయని ఎఫిడవిట్లో పేర్కొన్నారు.   ఇక దళితులకి రాజ్యాధికారం కావాలని కోరుకొంటున్న దళిత కాంగ్రెస్ నేత-వివేక్ తనకు, తన భార్యకు కలిపి మొత్తం రూ. 205.27కోట్ల స్థిరాస్తులు, రూ. 60.28 కోట్ల చరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. అంటే వారి స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.292.98 కోట్లు మాత్రమేనన్నమాట. అయితే అంత ఆస్తి ఉన్నప్పటికీ వారికీ అప్పులు తీసుకోక తప్పలేదుట. తమ దంపతులు ఇద్దరికీ కలిపి రూ.12.31 కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో దళితకోటాలో టికెట్ సంపాదించుకొన్న ఈయన కరీంనగర్ జిల్లా పెద్దపల్లి లోకస్‌భ స్థానానికి పోటీ చేస్తున్నారు.   ఇక తెలుగుదేశం పార్టీకి చెందిన (ప్రముఖ కాంట్రాక్టరు) నామా నాగేశ్వరరావు ఖమ్మం లోక్‌సభకు అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన తమ కుటుంబ సభ్యులందరి స్థిర, చరాస్తులు కలిపి మొత్తం రూ. 338 కోట్ల ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆయనకీ కూడా అప్పుల బాధ తప్పలేదు. తమకు రూ.21కోట్ల అప్పులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.   మానవసేవే మాధవ సేవ అన్నారు పెద్దలు. మరి ప్రజాసేవలో తరిస్తున్న ఈ రాజకీయ నేతలందరికీ ఆ పుణ్యం ఊరకే పోదు. అందువల్లనే ధనలక్ష్మి వారి ఇళ్ళనే అంటిపెట్టుకొని ఉండిపోయింది. ఆ సంగతి తెలియని వెర్రి జనాలు ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి గుళ్ళు గోపురాలు తిరుగుతూ పోగేసుకొన్న పదిరూపాయలు పెట్టి ఆమెకు కొబ్బరి కాయలు కొట్టి, చివరికి ఆ చిప్పలు మాత్రమే మిగుల్చుకొంటున్నారు.

అక్కడ 23 శాతం మంది నేరచరితులే!

   రాజకీయాల్లో నేరగాళ్ళు పోటీ చేయడం మామూలు విషయమైపోయింది. జార్ఖండ్ స్టేట్‌లో అయితే అది సర్వ సాధారణం. ఎందుకంటే, ఈ ఎన్నికలలో జార్ఖండ్ ఎన్నికల బరిలో వున్నవాళ్ళలో 16 శాతం మంది అభ్యర్థుల మీద కేసులు వున్నాయట. అలాగే మొత్తం అభ్యర్థులలో 23 శాతం మందికి నేర చరిత్ర వుందట. నేషనల్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థలు జరిపిన పరిశీలన, పరిశోధనలో ఈ విషయాలు బయటపడ్డాయి. సదరు అభ్యర్థుల మీద వున్న కేసులు చిన్నా చితకా కేసులు కావు. హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలు, అత్యాచార యత్నాల్లాంటి గట్టి కేసులో వీళ్ళ మీద వున్నాయట. నేర చరిత్ర, కేసులు వున్నవారి లిస్టు పరిశీలిస్తే నేర చరిత్రలో కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు ఒకరితో ఒకరు పోటీపడేలా క్రిమినల్ కేసులలో వున్నారు. నేర చరిత్రుల విషయంలో జార్ఖండ్ తర్వాతి స్థానాల్లో బీహార్, మహారాష్ట్ర నిలిచాయి. జమ్మూ కాశ్మీర్, మణిపూర్‌లలో పోటీ చేస్తున్న అభ్యర్థులలో ఒక్కరు కూడా నేరచరితులు లేకపోవడం విశేషం.

షోయబ్ మాలిక్‌తో సుఖసంసారం: సానియా

      పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ని పెళ్ళి చేసుకున్న ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా ఆ తర్వాత అతనితో విభేదాలు రావడంతో ఇద్దరూ విడిపోయారన్న వార్తలు వచ్చాయి. చాలాకాలంగా సానియా మిర్జా పుట్టింట్లోనే సెటిలవ్వడంతో ఇద్దరి సంసారం చట్టుబండలు అయిపోయినట్టే అని అందరూ డిసైడ్ అయ్యారు. అయితే అలాంటిదేమీ జరగలేదని సానియా మిర్జా వివరణ ఇచ్చింది. భర్తతో కలసి సరదాగా గడపటానికి సానియా సియల్‌కోట్‌కి వచ్చిన సోనియా అక్కడ వివరణ ఇచ్చింది. మేమిద్దరం అన్యోన్యంగా సంసారం చేసుకుంటున్నామని, క్రీడాకారులుగా ఇద్దరం కెరీర్‌లో బిజీగా వుండటం వల్లే తాను హైదరాబాద్‌లో కొంతకాలంగా వుంటున్నానని సానియా వివరణ ఇచ్చింది. తమది ఎంతో అన్యోన్యంగా వుండే దాంపత్యమని చెప్పింది.

సహారా సుబ్రతోరాయ్: చిప్పకూడే గతి!

      జనాల చెవ్లులో క్యాలీఫ్లవర్లు పెట్టి లక్షల కోట్ల రూపాయలు మింగేసిన సహారా సంస్థ అధినేత సుబ్రతోరాయ్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో వున్నాడు. ఆయన్ని తీహార్ జైల్ నుంచి గృహ నిర్బంధంలోకి మార్చాలని ఆయన లాయర్ రామ్ జెఠ్మలానీ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. సహారా సంస్థకి వున్న అప్పులు తీర్చాలంటే ఆస్తులు అమ్మాలి. ఆస్తులు అమ్మాలంటే వాటిని కొనుగోలు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి చూపిస్తున్న వారితో చర్చలు జరపాలి. ఆ చర్చలు తీహార్ జైల్లో జరిపే అవకాశం లేదు. వాటిని సుబ్రతోరాయ్ తన ఇంట్లో జరపాల్సి వుంటుంది. అందువల్ల సుబ్రతోరాయ్‌ని తీహార్ జైల్లోంచి గృహ నిర్బంధంలోకి పంపించాలని రామ్ జెఠ్మలానీ కోర్టుకు విన్నవించారు. అయితే న్యాయస్థానం అందుకు అంగీకరిచంలేదు. తాము సుబ్రతోరాయ్‌కి శిక్ష విధించలేదని, జ్యుడీషియల్ కస్టడీలో మాత్రమే ఉంచాం కాబట్టి గృహ నిర్బంధం చేసే అవకాశం లేదని కోర్టు చెప్పింది. దాంతో సుబ్రతోరాయ్‌కి తీహార్ జైల్లో చిప్పకూడే గతి అని డిసైడ్ అయిపోయింది.