హైదరాబాద్ లో పాక్ ఉగ్రవాది కుటుంబ సమేతంగా మకాం
పాక్ ఉగ్రవాదులు చాప క్రింద నీరులా దేశంలో అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నారు. ఆ సంగతి ఇదివరకే నిఘావర్ఘాలు గుర్తించినా కొందరు స్థానికులు వారికిస్ సహాయ సహకారాలు అందిస్తుండటంతో వారిని పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. పాకిస్తాన్ కి చెందిన మహమ్మద్ నాసిర్ అనే ఉగ్రవాది గత నాలుగు నెలలుగా తన కుటుంబంతో సహా హైదరాబాద్ లోనే ఉంటూ తన కార్యకలాపాలు సాగిస్తున్నా ఇంతవరకు ఎవరికీ తెలియకపోవడం, అనుమానం కలగకపోవడం విచిత్రమే. పహాడీ షరీఫ్ వద్ద గల జల్ పల్లి యునానీ ఆసుపత్రిలో అతని భార్య ఉద్యోగం కూడా సంపాదించడంతో అదే ఆసుపత్రి సెల్లార్ లో గల ఒక గదిలో నాసిర్ కుటుంబం ఉంటోంది. బహుశః అతనికి అంతకంటే సురక్షితమయిన ప్రదేశం మరొకటి ఉండదేమో? అందుకే అతనిపై ఎవరికీ అనుమానం కలుగలేదని భావించాల్సి ఉంటుంది.
హైదరాబాద్ కంటే ముందు వారు హర్యానాలో పానిపట్ అనే పట్టణంలో చాలా ఏళ్ళు నివసించారని అతని భార్య తెలిపింది. ఏడేళ్ళ క్రితమే తాము భారత్ లోకి ప్రవేశించామని ఆమె తెలిపింది. దిల్ శుక నగర్ బాంబు దాడుల కేసులో ప్రధాన నిందితుడు జియా ఉర్ రెహ్మాన్ పారిపోవడానికి మొహమ్మద్ నాసిర్ సహకరించినట్లు పోలీసులు కనుగొన్నారు. పోలీసులు మహమ్మద్ నాసిర్ తో బాటు మరో తొమ్మిది మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సెల్ ఫోన్లు, సిం కార్డులు, నకిలీ గుర్తింపు కార్డులు స్వాధీనం చేసుకొన్నారు. వారి ద్వారా పాక్ ఉగ్రవాదుల కుట్రల గురించి మరిన్ని వివరాలు, వారికిస్ సహకరిస్తున్న వారిని పట్టుకొనే అవకాశం ఏర్పడింది.