ఢిల్లీ ప్రొఫెసరు గిలానీ అరెస్టు!

    ఢిల్లీ విశ్వవిద్యాలయపు మాజీ ప్రొఫెసరు గిలానీని ఇవాళ తెల్లవారుజామున అరెస్టు చేశారు. దేశవ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించినందుకుగాను ఆయన మీద తీవ్రమైన కేసులను నమోదు చేశారు. ఈ నెల 10వ తేదీన దిల్లీలోని ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన ఒక సమావేశాన్ని గిలానీ పేరు మీద ఏర్పాటు చేశారు. ఒక సాధారణ సమావేశం అంటూ మొదలైన ఈ కార్యక్రమంలో అఫ్జల్‌గురుకి అనుకూలంగా, ఇండియాకు వ్యతిరేకంగా ప్రసంగాలు సాగాయి. ఇదంతా కూడా గిలానీ కుట్రే అని పోలీసులు భావిస్తున్నారు. ఉన్నత విద్యావంతుడైన గిలానీకి ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు. 2001లో పార్లెమంటు మీద జరిగిన దాడిలో గిలానీ చాలా ప్రముఖమైన పాత్రను పోషించారని ఆరోపణలు వచ్చాయి. అయితే సరైన సాక్ష్యధారాలు లేకపోవడంతో ఆయనను విడుదల చేయడం జరిగింది. గిలానీ మొదటి నుంచీ కూడా తన విద్యార్థులలోనూ, తోటివారిలోనూ భారతదేశానికి వ్యతిరేకమైన భావాలను ప్రోత్సహించేవారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే గిలానీ ఈ ఆరోపణలను ఎన్నడూ పట్టించుకోలేదు. స్వేచ్చగా మాట్లాడటం తన హక్కు అనీ, బూటకపు ఎన్‌కౌంటర్లు చేస్తున్నవారంతా హాయిగా తిరుగుతుంటే... తమలాంటి వారిని వేధించడం సమంజసం కాదు అని ప్రతివిమర్శ చేసేవారు.

ఐదుగురు పిల్లలు పోయారు... ఆరో పాపనన్నా కాపాడండి!

    జార్ఖండ్‌కి చెందిన మహమ్మద్‌ సయీద్‌, ఇస్రత్‌ పర్వీన్‌కి 11మంది సంతానం. కానీ విధి పగపట్టినట్లుగా వారిలో ఒకరి తరువాత ఒకరు మృత్యువాత పడటం మొదలుపెట్టారు. 5వ ఏడు రావడం ఆలస్యం, వారిలో గుండెజబ్బుకి సంబంధించిన లక్షణాలు బయటపడటం, దానికి వైద్యం చేయించలేకపోవడంతో చనిపోవడం! ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు... వరుసగా అయిదుగురు పిల్లలు చనిపోయారు. ఇప్పుడు ఆరో పాపలో కూడా ఈ లక్షణాలు కనిపించడంతో ఆ తల్లిదండ్రుల మనోవేదనకి అంతులేకుండా పోయింది. సయీద్‌, పర్వీన్‌ ఇద్దరూ రక్త సంబంధీకులు కావడం వల్ల వారి పిల్లలకి ఈ వ్యాధి వస్తోందని చెబుతున్నారు వైద్యులు. కార్డియోమయోపతి అనే ఈ జన్యు పరమైన వ్యాధి సోకడం వల్ల గుండె రక్తప్రసారం చేసే శక్తిని కోల్పోతుంది. అదే వ్యాధి ఇప్పుడు వారి ఆరో సంతానం అయిన ఆమిన్‌కు కూడా సోకడంతో ఏం చేయాలో వారికి పాలుపోలేదు. దాంతో వారిద్దరూ ఇప్పుడు ప్రధానమంత్రికీ, జార్ఖండ్‌ ముఖ్యమంత్రికీ తమకు సాయాన్ని అందించమని కోరుతూ లేఖలు రాశారు. దేశంలోని పెద్ద ఆసుపత్రులలో మాత్రమే సాధ్యమయ్యే గుండెమార్పడితో తమ బిడ్డకు ప్రాణదానం కల్పించమని వారు వేడుకుంటున్నారు. మరి మోదీ ఈ అభ్యర్థనకు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాలి!

సిరియా ఆసుపత్రుల మీద రష్యా దాడి?

ఉత్తర సిరియాలోని పలు బడులు, ఆసుపత్రుల మీద నిన్న జరిగిన వైమానిక దాడులలో 50మంది మృతి చెందారు. మృతులలో ఎక్కువ మంది పిల్లలు, రోగులే ఉన్నారు. ఈ దాడులకు బాధ్యను ఎవరూ తీసుకోనప్పటికీ, అంతర్జాతీయ సంస్థలన్నీ ఇదంతా రష్యా ఘనకార్యమేనంటున్నాయి. సిరియాలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగానే రష్యా ఈ దాడులను కొనసగిస్తోందని ఆరోపిస్తున్నారు. దేశం దాడులతో చిన్నాభిన్నం అయిపోయి, పౌరులకు సరైన వసతులు దొరక్కుండా పోతే... ప్రస్తుత ప్రభుత్వానికి తిరుగు ఉండదన్నది ఓ ఆలోచన. అందులో భాగంగానే తరచూ సిరియాలోని ఆసుపత్రుల మీదే దాడులు జరుగుతున్నాయని అంటున్నారు. ఆసుపత్రుల మీద జరిగిన దాడులకి సంబంధించిన గణాంకాలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. సిరియాలో ఇప్పటి వరకూ దాదాపు 700 మంది ఆసుపత్రి సిబ్బంది మృతి చెందారు. 200కి పైగా ఆసుపత్రులు ధ్వంసమయ్యాయి. రష్యా మాత్రం ఈ వాదనలను కొట్టిపారేస్తోంది. తాము ISIS తీవ్రవాదులకు వ్యతిరేకంగానే పోరాడుతున్నామనీ, అందులో భాగంగానే అప్పుడప్పుడూ ఎవరన్నా అమాయకులు చనిపోవడం సహజమనీ చెబుతోంది. కానీ నిన్న జరిగిన దాడిలో... ఒకే ఆసుపత్రి మీద వెంటవెంటనే నాలుగు క్షిపణులను ప్రయోగించడం చూస్తుంటే, వాస్తవాలు వేరేవిధంగా తోస్తున్నాయి.

విద్యార్థులను చితకబాదిన న్యాయవాదులు

  ఢిల్లీలోని జెఎన్‌యూ వివాదం ఇప్పడు న్యాయస్థానాలని కూడా తాకినట్లు ఉంది. ఇవాళ మధ్యాహ్నం జెఎన్‌యూకి సంబంధించిన విద్యార్థులు కొందరు న్యాయస్థానంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించగా ఈ సంఘటన జరిగింది. జేఎన్‌యూ ప్రాంగణంలో తీవ్రవాది అఫ్జల్ గురుని కీర్తిస్తూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, కన్నయాకుమార్‌ అనే విద్యార్థి నాయకుడిని అరెస్ట్‌ చేశారు. అతడిని ఇవాళ దిల్లీలోని పటియాలా కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కన్నాయాకుమార్‌ని వెంటనే విడుదల చేయాలంటూ అతనికి మద్దతుగా వచ్చిన విద్యార్థులు నినాదాలు చేయడం మొదలుపెట్టారు. దీంతో కోర్టులో ఉన్న దాదాపు 40 మంది న్యాయవాదులు- విద్యార్థులను, ఉపాధ్యాయులను, విలేకరులను... వాళ్లూ వీళ్లు అని చూడకుండా భౌతికదాడులకు దిగారు. ‘భారత్‌మాతాకీ జై’ అంటూ నినాదాలు చేస్తూనే, చేతికందినవారి మీదా పిడిగుద్దులు కురిపించారు. ఈ దాడిలో దిల్లీ బీజేపీ ఎమ్మెల్యే ఓ.పీ.శర్మ కూడా పాలుపంచుకోవడంతో... పోలీసులు సైతం చేష్టలుడిగి చూస్తుండిపోయారు.

షారుఖ్‌ సినిమా స్ఫూర్తితో కిడ్నాప్!

1993లో షారుఖ్‌, జూహీచావ్లా, సన్నీడియోల్ నటీనటులుగా వచ్చిన ‘డర్‌’ సినిమా చాలామందికే గుర్తుండే ఉంటుంది. ఇందులో షారుఖ్‌ కథానాయికను రహస్యంగా ఆరాధిస్తుంటాడు. ఆమె తన ప్రేమని ఒప్పుకునే పరిస్థితులలో లేకపోవడంతో, ఆమెను కిడ్నాప్‌ చేసి తనని పెళ్లి చేసుకోవాలని బలవంతపెడతాడు. గతవారం దేశంలోనే సంచలనం సృష్టించిన ఒక కిడ్నాప్‌ వెనుక ఇదే డర్‌ సినిమా ప్రేరణ ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ పట్టణంలో జరిగిన ఈ సంఘటనలో దేవేందర్‌ కుమార్‌ అనే అల్లరిచిల్లరి కుర్రవాడు దీప్తి శర్మ అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమెకు తెలియకుండానే గత ఏడాది కాలంగా దీప్తిని వెంబడించేవాడట దేవేందర్‌. ఆఖరికి ఆమెకు ఇష్టమైన ఆహారం ఏమిటో కూడా దేవేందర్‌ తెలుసుకున్నాడు. చివరికి ఆమెను ఎలాగైనా కిడ్నాప్‌ చేసి తనతో ప్రేమలోకి దింపాలనుకున్నాడు దేవేందర్‌. దీప్తి రోజూ షేర్‌ ఆటోలో తిరుగుతుందని తెలిసి, ఒక రెండు షేర్‌ ఆటోలని కూడా కొనుగోలు చేశాడు. దీప్తి ఒక గొప్పింటి కూతురనీ, ఆమెను కిడ్నాప్‌ చేస్తే బోలెడు డబ్బు దొరుకుతుందని ప్రలోభ పెట్టి మరో ముగ్గురిని కూడా ఈ పథకంలోకి ఇరికించాడు. ఒక రోజు తన పథకం ప్రకారం దీప్తిని షేర్ ఆటోలో కిడ్నాప్‌ చేయనే చేశాడు. కానీ దీప్తిని ఎవరో అపహరించారన్న విషయం బయటకి పొక్కడంతో ఘజియాబాద్ పోలీస్ యంత్రాంగం అంతా అప్పమత్తమైంది. రెండు రోజుల పాటు దీప్తిని అటూ ఇటూ తిప్పుతూ.... ఎక్కడికి వెళ్లినా కూడా పోలీసులే పోలీసులు కనిపించడంతో ఆమెను వదిలిపెట్టక తప్పలేదు దేవేందర్‌కు. దీప్తిని ఎత్తుకుపోయిన తరువాత భారీగా డబ్బులు కావాలంటూ ఫోన్లు చేయడం కానీ, ఆమెను హింసించడం కానీ చేయకపోవడంతో... పోలీసులకు ఈ కిడ్నాప్‌ ఎందుకు జరిగిందో అర్థం కాలేదు. కానీ నిందితులు దొరికిన తరువాత వాళ్లు చెప్పిన మాటలతో అంతా అవాక్కవక తప్పలేదు! దేవేందర్‌ ఒక సైకో అని తేలడంతో, ఎలాంటి ప్రమాదం జరగకుండానే దీప్తి బయటపడినందుకు అంతా ఊపిరి పీల్చుకున్నారు. మనకి తెలియకుండానే మనల్ని వెంటాడే కళ్లు కూడా ఉంటాయని దీప్తి ఘటనతో రుజువైంది. తస్మాత్‌ జాగ్రత్త!

ఆరేళ్లుగా ఆఫీసుకి రాలేదు- అయినా ఎవరూ పట్టించుకోలేదు!

ఉద్యోగానికి రాకుండా నెలనెలా జీతం తీసుకునే వార్తలు మన దేశంలో కొత్తేమీ కాదు. కానీ ఇలాంటి సంఘటనలు మన దేశంలోనే జరుగుతాయని బాధపడే పౌరులకు ఒక సంతోషకరమైన వార్త ఇది. స్పెయిన్‌లోని కాడిజ్‌ అనే నగరపురపాలక విభాగంలో పనిచేసే జాక్విన్‌ ఆరు సంవత్సరాలుగా పనికే వెళ్లకుండా జీతం తీసుకున్నాడట. 2004లో ఉన్నతాధికారులు సదరు జాక్విన్‌ను నీటిని శుద్ధి చేసే ఒక ప్లాంట్‌కి వెళ్లి విధులను నిర్వర్తించమని చెప్పారట. అయితే అక్కడ తను చేయాల్సిన పనేమీ పెద్దగా లేదని జాక్విన్‌కి తోచడంతో నేరుగా ఇంటికి వెళ్లి గుర్రుపెట్టాడు. ఆ మర్నాడు నుంచి అసలు ప్లాంట్‌ మొహమే చూడలేదు! జాక్విన్‌ తిరిగి నగరపాలక విభాగంలోకి వెళ్లిపోయాడని ప్లాంట్‌ అధికారులూ.... ప్లాంట్‌లో బుద్ధిగా పనిచేసుకుంటున్నాడని నగరపాలక అధికారులూ ఏళ్లతరబడి భావించారు. చివరికి 2010లో జాక్విన్‌కు 60 ఏళ్లు నిండటంతో అతణ్ని ప్రభుత్వం తరఫున సుదీర్ఘకాలం పనిచేసినందుకు సన్మానం చేయాలనుకున్నారు. కానీ తీరా అందుకోసం పతకాన్ని తీసుకువచ్చి జాక్విన్‌ కోసం వెతికితే ఏముంది... విషయం కాస్తా బయటపడింది. జాక్విన్‌ చేసిన తప్పుకి మొన్న శుక్రవారం స్థానిక కోర్టు దాదాపు 30 వేల డాలర్ల జరిమానాని విధించింది. చిత్రమేమిటంటే ఇన్నాళ్లూ పనికి వెళ్లనందుకు జాక్విన్‌ చింతించలేదు సరికదా ‘అక్కడ నాకు పని లేనప్పుడు వెళ్లి మాత్రం ఏంటి ఉపయోగం?’ అంటూ ఎదురు తిరిగాడు. పైగా ‘పనికి నేను రోజూ వస్తున్నానో లేదో నాపై అధికారి గమనించుకోనవసరం లేదా!’ అని చిరాకుపడిపోయాడు.

స్వచ్ఛ సర్వేక్షణ్‌.. విశాఖకు రెండు అవార్డులు

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 నాటికి స్వచ్ఛ భారత్ సాధించాలన్నదే మోడీ లక్ష్యమని.. నగరాల మధ్య పోటీ తత్వం పెరిగేందుకే ఈ అవార్డులు ఏర్పాటు చేసినట్టు వెంకయ్యనాయుడు చెప్పారు. ఇందులో విశాఖకు  రెండు అవార్డులు లభించాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ టాప్ 10 నగరాల్లో మైసూర్ కు మొదటి స్థానం.. లభించగా  విశాఖకు ఐదోస్థానం,  హైదరాబాద్, వరంగల్ 34 వ స్థానం లభించాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో టాప్‌ టెన్‌ నగరాలు * మైసూరు * ఛండీగఢ్‌ * తిరుచిరాపల్లి * న్యూదిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌ * విశాఖ * సూరత్‌ * రాజ్‌కోట్‌ * గ్యాంగ్‌టక్‌ * పింప్రి చించ్వాడ్‌ * గ్రేటర్‌ ముంబయి

రోజా నోటిని అదుపులో పెట్టుకో..

వైసీపీ ఎమ్మెల్యే రోజా రెండు రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబుపై  విమర్శనాస్త్రాలు విసిరిన సంగిత తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై టీడీపీ శాసన మండలి సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందిస్తూ రోజాపై మండిపడ్డారు. రోజా నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడాలని.. తన ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సరికాదని అన్నారు. చంద్రబాబుకు లక్ష కోట్లు సంపాదించుకునే సామర్థ్యం లేదని.. ప్రజాభిమానం, రెండంకెల వృద్ధి రేటు చంద్రబాబు లక్ష్యమని చెప్పారు. మీ నేతలా ప్రతి వారం నాంపల్లి టు సుప్రీం కోర్టుకు తిరిగే చరిత్ర కాదు చంద్రబాబుది అని అన్నారు. అంతేకాదు జగన్ లక్ష్యం సీఎం కావడమే అని.. జగన్ సీఎం అవ్వడానికి ఎంతకైనా తెగిస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

వ్యభిచారం తప్పేం కాదు.. సుప్రీం

సుప్రీంకోర్టు అప్పుడప్పుడు కొన్ని సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా అలాంటి ఒక నిర్ణయమే తీసుకుంసుప్రీంకోర్టు అప్పుడప్పుడు కొన్ని సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా అలాంటి ఒక నిర్ణయమే తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అదేంటంటే.. వ్యభిచారం తప్పుకాదని, సెక్స్ వర్కర్లను అరెస్ట్ చేయవద్దంటూ సుప్రీం కోర్టు నియమించిన కమిటీ సంచలన సిఫార్సులను చేయనుంది. అంతేకాదు పొట్ట కూటి కోసం వ్యభిచార వృత్తిని ఎంచుకోవడం తప్పేమి కాదని.. కానీ వ్యభిచార గృహం నిర్వహించడం మాత్రం తప్పేనని సిఫార్సుల్లో తెలుపుతుంది. వ్యభిచార వృత్తిలో ఉన్న వారిని పోలీసులు కూడా వేధించరాదని,,ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేసిన పక్షంలో, ఆ వృత్తిలో ఉన్న వారిని అరెస్ట్ చేయరాదని, వారిపై జరిమానాలు వద్దని కూడా కమిటీ సూచించనున్నట్టు తెలుస్తోంది.

నేడు కర్నూలుకి వీర జవాను మృతదేహం!

భారతదేశ సరిహద్దుల్లోని సియాచిన్‌లో ప్రాణాలను కోల్పోయిన ‘ముస్తాక్‌ అహ్మద్‌’ భౌతికకాయాన్ని నేడు ఆయన స్వస్థలమైన కర్నూలుకి చేర్చనున్నారు. ముస్తాక్‌ ఈ నెల 3వ తేదీన సియాచిన్‌లో దేశరక్షణ బాధ్యతలను నిర్వర్తిస్తుండగా, హిమపాతంలో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ముస్తాక్‌తో పాటు మరో 8 మంది సైనికులు కూడా దుర్మరణం పాలయ్యారు. కర్ణాటకకు చెందిన హనుమంతప్ప అనే సైనికుడు మాత్రం వారం రోజులకు పైగా పోరాడి చివరికి తుదిశ్వాసను విడిచారు. కర్నూలుజిల్లాలోని పార్నపల్లెకు చెందిన ముస్తాక్‌ మద్రాస్ రెజిమెంట్‌ తరఫున సియాచిన్‌లో విధులను నిర్వహిస్తున్నారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ముస్తాక్ చదువు పూర్తికాగానే 20 ఏళ్ల పిన్న వయసులోనే ఆర్మీలో చేరి ఇప్పటికి దాదాపు 12 ఏళ్లుగా బాధ్యతాయుతంగా తన విధులను నిర్వర్తిస్తున్నారు. దేశ ప్రధాన నరేంద్ర మోదీ మొదల్కొని, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు వరకూ ఎందరో ప్రముఖులు ముస్తాక్‌ మృతికి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. నేడు కర్నూలుకి చేరుకునే ముస్తాక్‌ పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.

రైల్వే ఛార్జీలు పెరగనట్లే!

ఏటా ఫిబ్రవరి వస్తోందంటే రైల్వే బడ్జెట్‌లో ఎలాంటి వడ్డింపులు ఉంటాయా అని మధ్యతరగతి వర్గాలు ఆందోళన చెందుతూ ఉంటాయి. సగటు భారతీయుడి ప్రయాణ సాధనమైన రైల్వేలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది దేశ ప్రజల మీద భారీ ప్రభావాన్నే చూపుతుంది. అలాంటిది ఈసారి ఫిబ్రవరి 25న ప్రవేశపెట్టబోయే రైల్వే బడ్జెట్‌లో టికెట్‌ ధరల పెద్దగా ఉండబోదన్న సూచనలందించారు రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు. ధరలు పెంచేదానికన్నా ఇతరత్రా వనరులని పెంచుకునేందుకు, ఖర్చులను తగ్గించుకునేందుకే ఈసారి బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత లభించబోతున్నట్లు సమాచారం. ఈ చర్యలలో భాగంగా ఇంధనాన్ని పొదుపుగా వాడటం, సీట్లను పెంచడం, రవాణాను పెంచడం, రాయితీల మీద నియంత్రణ సాధించడం వంటి జాగ్రత్తలు పాటించబోతున్నారట. ఈసారి బడ్జెటులో కొత్త ప్రాజెక్టులు ప్రకటించే అవకాశాలు కూడా తక్కువేనని తెలుస్తోంది. విచ్చలవిడిగా ప్రాజెక్టులను ప్రతిపాదించేకంటే, ఉన్నవాటిని పూర్తిచేయడం మీదే రైల్వే మంత్రి తన దృష్టిని కేంద్రీకరించే అవకాశం ఉంది.

సీతారాం ఏచూరికి బెదిరింపు కాల్స్‌

సీపిఐ(ఎం) ముఖ్య నేత సీతారాం ఏచూరికి తీవ్రమైన బెదిరింపు కాల్స్‌ వచ్చినట్లు పోలీసుల వద్ద ఫిర్యాదు దాఖలైంది. ‘జేఎన్‌యూలో నడుస్తున్న వివాదంలో సీతారాం ఏచూరి ప్రవర్తన బాగోలేదనీ, జేఎన్‌యూలోని వివాదాస్పద విద్యార్థులకు కనుక సీతారం ఏచూరి మద్దతుని కొనసాగిస్తే... ఆయన అంతు చూస్తామనీ’ సదరు ఫోన్లలో పేర్కొన్నట్లు సమాచారం. గత రాత్రి దిల్లీలోని సీపీఐ ప్రధాన కార్యాలయానికి ఈ కాల్స్ రావడంతో, వెంటనే ఈ విషయాన్ని పోలీసులకి తెలియచేశారు. అంతకుముందు సీపీఐ ముఖ్య నేత డి.రాజాకి కూడా ఇలాంటి ఫోన్‌కాల్స్ వచ్చాయి. జే.ఎన్‌.యూలో చదువుతున్న డి.రాజా కుమార్తెను కాల్చిచంపుతామంటూ కొందరు వ్యక్తులు ఆయనను బెదిరించారు. ఈ విషయాన్ని హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరిగింది. తీవ్రవాది అఫ్జల్‌ గురుకు అనుకూలంగా జరిగిన ఒక సభలో డి.రాజా కూతురు కూడా పాల్గొన్నట్లు అభియోగం. ఈ సభను నిర్వహించిన కన్నయా కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయనకు మద్దతుగా ప్రతిపక్షాలు ఆందోళనలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే!

జేఎన్‌యూలో కొనసాగుతున్న ఉద్రిక్తత

దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అటు వామపక్ష విద్యార్థి సంఘాలు, ఇటు ఏబీవీపీ విద్యార్థి సంఘం పోటీపోటీగా నినాదాలు చేస్తూ విద్యాలయ కార్యాలయాల ఎదుట భారీ ప్రదర్శనలను నిర్వహిస్తున్నాయి. ఈ నెల 9వ తేదీన కొందరు విద్యార్థులు తీవ్రవాది అఫ్జల్ గురుని ఉరితీసి మూడు సంవత్సరాలు అయిన సందర్భంగా యూనివర్సిటీలో ఆయనను పొగుడుతూ ఒక ప్రదర్శనని జరిపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాకిస్తాన్‌ జిందాబాద్‌ వంటి కొన్ని వివాదాస్పద నినాదాలు సైతం వినిపించాయి. అఫ్జల్ గురుకి అనుకూలంగా ప్రదర్శన నిర్వహించిన విషయం బయటకు పొక్కడంతో దేశవ్యాప్తంగా విమర్శలు చెలరేగాయి. ముంబై దాడులలో కీలక సూత్రధారి అయిన హఫీజ్‌ సయీద్‌ ప్రోత్సహంతోనే కొందరు విద్యార్థులు పాకిస్తాన్‌కు అనుకూలంగా ప్రవర్తిస్తున్నారంటూ హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నిన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కొన్ని విద్యార్థి సంఘాలు తమ ఆందోళనను తీవ్రతరం చేశాయి. దీనికి తోడు రాజకీయ పార్టీలు కూడా ఈ వివాదంలోకి తలదూర్చడంలో యూనివర్సిటీ కాస్తా రణరంగంగా మారిపోయింది.

పోలీసుల ఎదుట లొంగిపోనున్న వల్లభనేని వంశీ..

టిడిపి నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పైన పటమట పోలీసుల కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు తన అనుచరులతో కలిసి  లొంగిపోనున్నట్టు తెలుస్తోంది. కాగా విజయవాడ రామవరప్పాడులో భూసేకరణ కింద మున్సిపల్ అధికారులు అక్కడి పేదల పూరి గుడిసెలను తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో సమాచారం అందుకున్న వంశీ వెంటనే అక్కడికి చేరుకొని  ముందస్తు నోటీసులు లేకుండా ఇళ్లను ఎలా తొలగిస్తారంటూ అధికారులను అడ్డుకొని.. బాధితుల పక్షాన మాట్లాడారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని.. గుడిసెవాసులతో కలిసి ఆయన నడిరోడ్డుపై ఆందోళనకు దిగారు. దీనిని తీవ్రంగా పరిగణించిన పటమట పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు. దీనికి వంశీ ఆగ్రహం వ్యక్తే చేస్తూ తానే స్వయంగా సరెండర్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగానే ఈరోజు పోలీసుల ఎదుట లొంగిపోనున్నట్టు సమాచారం.

మన్మోహన్ ఆర్ధిక మంత్రిగా ఓకే.. ప్రధానిగా నాట్ ఓకే..

కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పై విమర్శల బాణాలు వదిలారు. సీఎన్‌ఎన్‌ ఏషియా బిజినెస్‌ ఫోరం సమావేశంలో జైట్లీ ప్రసంగిస్తూ మన్మోహన్ గురించి మాట్లాడుతూ ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ పనితీరు అద్భుతంగా ఉండేదని.. కానీ ప్రధాన మంత్రి అయిన తరువాత ఆయన పనితీరు అధ్వాన్నంగా తయారైందని విమర్శించారు. ఆయన ఆర్ధిక మంత్రిగా ఓకే కానీ.. ప్రధాన మంత్రిగా నాట్ ఓకే అని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథాన నడపడానికి ప్రతిపక్షాలు కలిసి రావడం లేదని ఆరోపించారు.. జీఎస్టీ బిల్లును ఆమోదించకుండా కాంగ్రెస్‌ రాజకీయాలు చేస్తోందన్నారు. యూపీఏ హయాంలో విధానాలన్నీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో రూపొందేవని ఎద్దేవా చేశారు.

అమెరికా సుప్రీం కోర్టు జడ్జిగా భారత సంతతికి చెందిన శ్రీనివాసన్‌

భారత సంతతికి చెందిన పలువురు ఇప్పటికే విదేశాల్లో గౌరవ ప్రదమైన స్థానాలు పొందగలిగారు. ఇప్పుడు మరోసారి భారతదేశం గర్వించదగ్గ అరుదైన పురస్కారం లభించింది. అమెరికా సుప్రీం కోర్టు జడ్జిగా భారత సంతతికి చెందిన జడ్జి శ్రీనివాసన్‌కు అవకాశం లభించనుంది. అమెరికా సుప్రీం కోర్టు జడ్జి, సంప్రదాయవాది జస్టిస్ ఆంటోనిన్ స్కాలియా (79) మృతి చెందడంతో ఆస్ఠానంలో శ్రీనివాసన్‌కు అవకాశం లభించింది. కాగా టెక్సాస్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా జస్టిస్ స్కాలియా అనుమానాస్పదిరీతిలో మృత్యువాత పడ్డారు. అయితే ఆయన మృతికి కారణంఏమిటనేది తెలియలేదు.