నేటి నుండే మహా పుష్కరాలు

 

నేటి నుండి గోదావరి మహా పుష్కరాలు మొదలవుతాయి. సాధారణంగా 12సం.లకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. అటువంటి 12 పుష్కరాలు అంటే 144 సం.లకి ఒకసారి వచ్చేవె మహా పుష్కరాలు. అంటే మనిషి జీవితంలో ఈ మహాపుష్కరాలను కేవలం ఒక్కసారి మాత్రమే చూడగలిగే అవకాశం ఉంటుందన్న మాట. కనుక ఎంతో అదృష్టం ఉన్నవాళ్లకే ఈ మహా పుష్కరాలను చూసే భాగ్యం కలుగుతుంది. అందుకే దేశ విదేశాల నుండి కూడా ప్రజలు రెండు తెలుగు రాష్ట్రాలలో మొదలయ్యే ఈ గోదావరి పుష్కరాల కోసం తరలి వస్తున్నారు. రేపు ఉదయం సరిగ్గా 6.26నిమిషాలకి ఈ మహా పుష్కరాలు మొదలవుతాయని వేద పండితులు చెపుతున్నారు.

 

ఆంధ్రా, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా వీటి కోసం చాలా భారీ ఏర్పాట్లు చేసాయి. ఈ మహాపుష్కరాలను నిర్వహించే మహాభాగ్యం తనకు దక్కినందుకు చాలా సంతోషిస్తున్నానని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకే ఎన్ని ఇబ్బందులు ఎదురయినా ఈ పుష్కరాలలో ఎటువంటి లోటు రానీయకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈరోజు ఉదయం ఆయన కుటుంబ సమేతంగా పుష్కర ముహూర్త సమయానికి రాజమండ్రి వద్ద గోదావరి నదిలో పుణ్య స్నానం చేస్తారు.

Teluguone gnews banner